Friday, March 25, 2016

యాకూబ్ కవిత-నా పరామర్శ



సహజంగానే ఉందాం
చల్లని గాలిలా ఉందాం, ప్రేమలా ఉందాం
నిప్పుకణికలా ఉందాం
నిలువెత్తు నిజంలా ఉందాం
సహజంగా ఉందాం
అలజడిలా ఉందాం,ఎలుగెత్తే పాటలా ఉందాం
పడవలకు ఈతల్నీ, అలలకు కదలికల్ని నేర్పుదాం
అక్షరాలకు కవచాలు తొడిగి సైనికుల్ని చేద్దాం
మట్టిని మన మాతృకగా లిఖిద్దాం
కాలానికి భాషనేర్పి భవిష్యత్తును ఇద్దాం
ప్రశ్నల్లా ఉందాం,పలకరించే స్నేహితుల్లా ఉందాం
సహజంగానే ఉందాం
నకిలీ ముఖాలమీద ఉమ్మేద్దాం
నిజంలా ఉందాం, కలల్లా ఉందాం, నిర్భయంగా ఉందాం
కవిత్వంలా ఉందాం
సహజ సహజ సహజంగా ఉందాం !!!
*సరిహద్దు రేఖ ‘సంకలనం నుండి…మార్చి,2000
నా పరామర్శః
పువ్వు తాజాగా ఎందుకుంటుంది?
పిట్ట రెక్కలకా స్వేచ్చ ఎక్కడిది?
హెచ్చార్కె ఎక్కడో ఓ కవితలో అన్నట్లు గుర్తు..ఎగ్జాట్ పదాలిప్పుడు గుర్తు లేవు కాని..పాపాయి ఎవరి కోసమూ ఏడవదు..ఎవరి కోసమూ నవ్వదని.
సహజత్వమంటే అదేనేమో. ఆ తత్వం మీదే ఈ కవిత్వమంతా!
పంచదార పలుకులు పది కంట పడగానే పరుగెత్తుకొచ్చేస్తుంది చీమ. ఎలుగెత్తి చాటుతుంది తోటి చీమలకా తీపి వార్త చేరేదాకా! చీమల కన్నా ఘనమైన కమ్యూనికేటర్లమా మనం?
కొమ్మల్లో కోయిలమ్మ ‘కో’ అన్నా..తుమ్మల్లో గుడ్లగూబ ‘గీ’ అన్నా
ఒక పరమార్థమేదో తప్పకుండా అంతర్గతంగా ఉండే ఉండుంటుంది. అనంత జీవకోటి అహోరాత్ర హృదయ ఘోషేమో అది! అనువదించు కోవడం మనకు కుదరనంత మాత్రాన అది జీవభాషవకుండా పోతుందా? తాలు పదాల ఎత్తిపోతే కవిత్వమనుకునే మనం జంతుజాలం గొంతుల్లోని స్వేచ్హాస్వచ్చతలను కత్తికోతలుగా చిత్రిస్తాం. చిత్రం!
బక్క జీవాలనేముందిలే.. ప్రకృతి మాటను మాత్రం మనం పట్టించు కుంటున్నామా? పూల రుతువు విరిసినపుడు, సిరివెన్నెల కురిసినపుడు, చివురుటాకు పెదవి మీద మంచు బిందువు మెరిసినపుడు, పెను చీకటి ముసిరి వినువీధిన కారు మొయిలు ప్రళయార్భటి చేసినపుడు, జడి వానలు కురిసి కురిసి ఏళ్ళువూళ్ళు నొకటి చేసి ముంచేసి నపుడు..అయే చప్పుడు మన చెవుల కెక్కిందెప్పుడు?
అనుదినముం బ్రదోషసమయంబున బ్రొద్దున వేయిచేతులం
బనిగొని వర్ణవర్తికలు వ్యర్థముగా క్షణభిన్న రూప క
ల్పనల నలౌకికాకృతుల బంకజమిత్ర, యయాచితంబుగం
బొనరిచి నీ యపూర్వకళాపోడిమి జుల్కనసేయ బాడియే?
-అంటో కవికోకిల దువ్వూరివారెంతలా కలవర పడేం లాభం?
ప్రకృతి సంగతలా పోనీ.. పక్క మనిషి గుక్కనైనా ఒక్క క్షణమాలకిస్తున్నామా? ఆక్రోశం రగిలి, ఆవేశం పొగిలి, ఆనందం పెగిలి అవమానం తుంచినపుడు, అనుమానం ముంచినపుడు,అభిమానం పెంచినపుడు.. కోపం కట్టలు తెంచుకుని , తాపంగుట్టలు పేల్చుకుని, పరితాపం పుట్టలు చీల్చుకుని ..చెలరేగే భావాలు, కదలాడే క్రోధాలు, కలిపెట్టే భయాలు.. కన్నీళ్ళు, ఎక్కిళ్ళు, కౌగిళ్ళు .. ఆర్ద్రంగా, చోద్యంగా, హృద్యంగా ..తీవ్రంగా, హేయంగా, తీయంగా..కులం గోత్రం..మతం ప్రాంతం..చిన్నాపెద్దా..బీదా బిక్కీ..రోగీ భోగీ.. నలుపూ తెలుపూ.. ఆడామగా..తేడా లేకుండా..అందరికీ సమంగానే వస్తాయా..రావా! కలలు, కలవరాలు సమానమేగా చీమూ నెత్తురు నాళాల్లో పారే ప్రాణులెవరికైనా? ఐనా తమదాకా వస్తేగానీ కదలని రథాలం మనం.
పోయెను పాపభీతి, విడిపోయెను ముష్కుర నీతి, మాయమై
పోయెను శాంతి, వ్య్ర్థర్థమైపోయెను దేవుడు పడ్డపాట్లు, వా
పోయెను భూతధాత్రి, సరిపోయెను పొట్టకు జీవితార్థ, మై
పోయెను మానవామర మహోదయస్వప్న మహస్సమాధిగానె!’
అని ఈ దేవదానవులమిశ్రమాల కోసం ఎన్నో మార్లు మారి మారి అవతరించిన దేవుడే ఆఖరికి అలసిపోయి ఇహ మార్చడం తన తరం కాదని మార్చ లేనిదంతా హతమార్చడం తప్ప వేరే దారేదీ లేనే లేదని ఒక్క క్షణం నిస్పృహలోపడి నిరాశగా చేసుకున్న సృష్టినంతా చెరిపేసుకుని ఠక్కుమని లేచి పోతే? పోలేదుగదా!
మాదిరి దప్పి మానవు లమానుషవృత్తి జరింప, జెల్లినన్,
కాదగు పూరుషార్థ మది కాదగునే పరమార్థ మింక నీ
మేదిని లేదె, సిల్వపయి మేకు కరంగిన గుండె నెత్తురుల్
బూదయి పోయెనే, ఋషులు బుద్ధులు నూరక పుట్టిపోయిరే!’
అని చీకాకుల పాలవకుండా పాపం సహనంతో స్నేహంగా సర్దుకు పోయిన ఆ పెద్దాయనలాగే..కవిత్వం పొంగుకొచ్చి సమయానికి రాసే ఏసాధనమూ చేతలేక తాళపత్రం కోసం ‘తాళమా! తుత్తినియలై ధరపై బడుమా!’ అంటో కోపించిన నిప్పుకణికలతో నీరులా సహృదయ సంబంధాన్నే కోరుకుంటున్న ప్రేమకవిత్వం కూడా ఇది. ప్రేమంటూ వుంటే చంద్రుడిలో మచ్చను కూడా మందులా నాకేయచ్చంటాడు కదా శ్రీరంగం నారాయణ బాబు! గుబులును కెలికే అగాథన్నుంచే సుధను చిలికి పంచాలనుకోవడం మించిన గొప్పతత్త్వ మింకేముంటుందబ్బా ఏ కవిత్వానికైనా?
ఘటమంటూ లేకుండానే గట్లు దాటే ఆత్మలున్న వైతరణి కదా ప్రస్తుతం మనం పడి ఈదుతున్నది. పంచభూతాలకీ పంచేద్రియాలకీ కట్టుబానిసలమై పోయి బతకీడ్చటం దుర్బరమై పోతున్నదని వాపోతున్నది. ఐనా ‘దోమలు నల్లుల కన్నాకరువులు వరదలేం ఎక్కువరా కన్నా!’ అనేదో సరిపెట్టుకొనే కదా మనమీ కంటకాల బతుకునిలా ఏడుస్తూనన్నా ఈడుస్తున్నది! ‘బోను తెరిస్తే నోరు తెరిచే పెద్దపులిరా బాబోయ్-జీవితం’ అని తెలిసీ చొక్కా దులిపేసుకుని ఎంచక్కా ముందుకే దూకేస్తున్నామా లేదా? ‘అదృశ్య హలాలతో అవ్యక్తాలను దున్నిఅనుమానాలను చల్లి అలజడి సాగునే ఐనా ఎలాగో కొనసాగిస్తూనే ఉన్నామా కాదా? ఈ కవిత్వానిదా టైపు ఆందోళన కానే కాదు. చరిత్ర కెక్కాల్సిన బాధల్ని అశ్రుబిందువుల హిందోళంగా మలిచే కళ. మరి అవసరమేగా!
లోకమంతా మరీ ఇంతలా బురద గుంతలానే ఉందా?. బ్రహ్మజెముళ్లే గాని బోధి వృక్షాలసలే మొలవని పుంతై పోయిందా? సుష్టుగా మెక్కి మేడమీదెక్కి మెత్త పరుపులు తొక్కే నిద్ర పట్టని పెద్దయ్యల నెత్తి మొత్తుకోళ్ళకేం గానీ.. ఆవల జొన్నచేను కావలికని మంచె మీద చేరిన నాయుడుబావయ్య కన్నుమూత పడకుండా తీసే కూనిరాగాల నాలకించవయ్యా! ‘ఆ కులాసా ఊసులనే ఎంకిపిల్ల ఊహలకో దిలాసాగా చేరేసే చల్లగాలి పదాలవుదాం.. పదవమ్మా!’అంటున్నదీ కవిత్వం. సర్దాగానే కాదు సరసంగాను లేదూ ఈ తరహా వరస?
బ్రతుకేమన్నా మృత్యుగ్రంథ ముపోద్ఘాతమా? సంక్లిష్టం కావచ్చేమో కానీ.. సజీవ స్వప్నసౌజన్యం కూడా సుమా! హృదయానువాద కళన ఆరితేరుండాలే కాని మూలమూగ సైగల్నిసైతం ‘సైగల్ రాగాలు’గా మలచడం క్షణం. ‘సహజ సహజ సహజంగా ఉందాం !!!’ అని కవి అన్నేసి మార్లలా కలతనిద్ర మధ్యలో మాదిరి పలవరించడ మాత్రం మహా అసహజంగా ఉందని కదూ సందేహం? తత్వం తలకెక్కకే ఈ చిక్కుముడి. మనసు ఎక్కి జారే జారుడుబండంట చైతన్యం. రాయీ రప్పా, పశువూ పక్షీ, మనిషి- అదే క్రమంలోశుద్ధభౌతికం, ప్రాణం, మనసు లాక్రమించిన జీవస్థానాలని ‘తత్త్వప్రభ’ ప్రబోధం.’పరస్మాత్ ప్రస్థితా సేయం/భూమి కానాం పరంపరా/సోపానకల్పితాకారా/నిః శ్రేణి రివ నిర్మితా’ అంటే అర్థం ఇదేనండీ బాబూ! భూ భువ సువ ర్లోకాల పైనున్నమహర్లోకంలోని చివరి ఆనందం మన మనీ ప్రపంచంలో గుప్త రూపంతో అప్రకాశంగా అణిగి పోయింది కదా.. ఈ చిదానందాన్నా కూపంనుంచి చివరి కెలాగైనా చేదుకోవడమే ఏ కళకైనా పరమావధని లక్షణగ్రంధాల సిద్ధాంతం కూడా. తృణకంకణం కృతి సమర్పణంలో ‘శాశ్వత నవ్య స్ఫురణల/ నశ్వరలావణ్యమై పెనగ, కావ్యకళా/విశ్వమునం దానంద ర/సైశ్వర్యము లేలు’ నని రాయప్రోలువారానాడు కనిపెట్టిన రస రహస్యాన్నే యగైన్’ యే చోళీ కే పీచే యేహీ హై’ అని మళ్లీ ఈ కవిత గుర్తు చేస్తున్న్దన్న మాట. గొప్పే కదా మరి?
తొలి ఉషస్సు తూర్పును తడిపే వేళకి గుండె చేతపట్టుకుని గుమ్మంలో నిలబడుండేదే కవిత్వం. లోగిలి ఎవ్వరిదని కాదు తల్లిలా లాలించడమే కవితా ధర్మం. ఆశించిన హస్తం ఏ భూతానిదైనా కాని ప్రేమతో ముందుకు నడిపించడమే పదంలోని తండ్రి పని.’ఒరులేయని యొనరించిన/నరవర! యప్రియము తనమనంబునకు తా/నొరులకు నని చేయకునికి, / పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్’ అని కదా నీతి! ఆ నీతిని తన ధర్మంగా ప్రకటించుకున్న కవతని అభినందించి తీరాలి. ఆకాశం అనంతం అగాథం అనంతం కారుణ్యం అనంతమైతే కావచ్చు కానీ కవి అంతరంగం ముందు అవన్నీమోకాలు తడవని పిల్లకాలువలు. నిరంకుశుడైతేనేమి ఒక ధర్మాస్త్రానికి సత్యంగా కట్టుబడుండాల్సిన ఆంజనేయుడు కవి. అపారసార సంసారసాగర మధనం చేసి నవజీవన సుమధుర సుధారస సువర్ణ కలశం తీసి నిరాశ నిట్టూర్పులతో నిండి యెండి మండే కంఠాల రక్తి భక్తి ముక్తి శక్తిధారలుగ ఒలికించాలనే సంకల్పం స్వల్పమైనదా? నిప్పుకణికలా, నిలువెత్తు నిజంలా, అలల్లా, అలజడిలా,కలల్లా, కలవరంలా, అక్షరాలకు తొడిగే సైనిక రక్షాకవచాల్లా, మట్టిలా, కాలానికి భాషనేర్పే భావిలా, ప్రశ్నల్లా, పలకరించే స్నేహితుళ్ళా సహజంగా సహజంగా సహజంగా ఉంటానంటం కన్నామించిన మంచి దర్శనం ఏ కవికైనా ఇంకేముంటుంది? సహజంగా ఉంటానని అన్నేసి మార్లు సంకల్పం చెప్పుకున్నా కవిత్వంలా మాత్రం వుండడం మానబోనని ప్రకటించడమే ఈ కవి అసలు పాటవం. ఎక్కడ ప్రేమ అవ్యాజమో, ఎక్కడ సత్యమకుంఠితమో, ఎక్కడ నీతి నిశ్చలమో అక్కడ కవి పువ్వై వికసించడంలో వింతేముంది కానీ ఎడారిలో సైతం ఒయసిస్సై పిలవడం, నడిసంద్రాన కూడా గడ్డిపోచై నిలవడం అపురూపం. ‘చిగురింపగలవాడు శిశిరకాలమునైన ప్రకృతినెల్ల వసంతరాగ కాంతి/కాయింపగలవాడు కాళరాత్రినైన రమణీయ చంద్రికా సముదయముల/కురియిపగలవాడు మరుభూమిలోనైన సతతము అమృత నిష్యంద వృష్టి/మలయింపగలవాడు మండువేసవినైన మలయపర్వతశీత మారుతములు/అరయగలవాడు బాహ్యము నంతరంగమును/వ్రాయగలవాడు దైవ లీలావిలాస/చిత్రములనైన, బ్రహ్మాండసీమనైన/కవికసాధ్యంబు రవ్వంత గలదె భువిని! -అన్న తత్వం ప్రతి అక్షరంలో ప్రత్యక్షమౌతున్నందునే ఈ కవిత్వానికిలా ఉత్తమత్వం.
హంసలన్నీ శ్వేత వర్ణంలో ఉండవు కొన్ని నల్లగానూ ఉంటాయంటారు.. ‘ నల్లగా ఉన్నావేమని’ నాలాంటి నిత్య శంకితుడొకడు నిలదీస్తే ‘నీలకంఠుడు నిద్రపోతే గళమే నల్లకలు వనుకొని కొరికా. విశ్వమానవ సహస్రారం మళ్ళా అర్పిస్తేనే తెల్లబడేద’ని జవాబు.
అర్థం అయితే తత్-త్వం-అసి(నీవే అది). కాని వారికీ కవిత్వంలాగానే తత్వం- మసి.
స్వస్తి
-కర్లపాలెం హనుమంతరావు


Wednesday, March 23, 2016

పెళ్ళికి వేళాయరా! - 'అక్షర' మార్చి 2016 సంచికలో ప్రచురితం

'అవతల పెళ్ళివాళ్ళొచ్చే వేళయింది.. అమ్మాయినింకా రడీ చేయలేదేంటే! చింపిరి జుట్టు.. చిరిగిన ఓణీ.. మాసిన పరికిణీ.. నట్టింట్లో ఈ కుక్కిసోఫా.. డొక్కు టీవీనా!  ఫర్నిచరింకా మార్చలేదేంటే!'
'మీరేగదండీ! ఇంటికెవరన్నా కొత్తవాళ్లొస్తుంటే.. వరదల్లో సర్వస్వం కొట్టుకుపోయిన వాళ్లకుమల్లే దేభ్యం మొహాలేసుకు తిరగమందీ!'
'ఓసినీ..! ఆ వచ్చేవాళ్ళేమన్నా వరదనష్టం రాసుకుపోయేవాళ్ళా! పిల్లను చూడ్డానికొచ్చేవాళ్లే! ఇల్లంతా ఇట్లా దొంగలుపడి దోచుకుపోయినట్లుంటే అట్నుంచటే తారుకుంటారే తాయారూ! ముందు అమ్మాయిని కందనపు బొమ్మల్లే తయారుచేయ్! నువ్వూ తయారవ్! పనమ్మాయికూడా కంచిపట్టు చీరెలో కళ్ళు జిగేల్మనేటట్లుండాల! ముందీ దరిద్రపు ఫర్నిచరంతా అవతల పారేయించి  బెంగుళూర్నించి తెప్పించి చేయించిన ఆ సామాన్లని సర్దించూ! ఉప్మాలో జీడిపప్పు  దంచు! జిలేబీ.. లడ్డూలు.. నాలుగురకాలూ డ్రింకులూ రడీగా ఉంచు! ఇంకా..'
'అర్థమయిందండీ! ఇహ చూడండి నా ప్రతాపం! ఆ వచ్చినవాళ్ళు మన డాబుకి డంగై మూర్ఛొచ్చి పడిపోకపోతే నేను ఆగుమయ్య పెళ్లాన్నే కాదు'
'అంతొద్దు! ముందా శపథాలు మానేసి కథ నడిపించు.. ఫో!' అంటూ ఆగుమయ్య ఊడే పంచను పైకెగలాగుకొంటూ కార్లు వచ్చిన అలికిడికి హడావుడిగా బైటికి పరుగెత్తాడు!
అరడజను కార్లలో డజనుకు పైగానే ఆడా మగా డాబుగా దిగి లోపలికొచ్చి కూర్చున్నారు. అందరు కొత్త వెయ్యినోట్లులా ఫెళఫెళలాడిపోతున్నారు. అసలు పేళ్లికోడుకెవరో అంతుబట్టేటట్లు లేదు! పెళ్ళిళ్ల పేరయ్య పెళ్ళికొడుకు తండ్రిని పరిచయం చేసాడు.
పెళ్ళిచూపులు మొదలయ్యాయి.
'ఇదే మా బంగారు కొండ!' అన్నాడు అప్పుడే వచ్చి కూర్చున్న కూతుర్ని మురిపెంగా  చూపించి ఆగుమయ్య. పైనుంచి కిందిదాకా బంగారు తొడుగుల్తో ఆ ఏడుకొండలవాడికన్నా వైభోగంగా వెలిగిపోతున్న  పిల్లను చూసి 'బంగారు కొండ కాదు. కొండ బంగారం లాగా ఉంది!' అంది పెళ్ళికొడుకు తల్లి పిల్లపక్కన చేరి గాజుల చేతిని తీసుకుని బంగారం గీరి చూస్తూ.
'వదినగారూ! అన్నీ ఒరిజనలే! బంగారం రేటు కొండెక్కి కూర్చున్నా పెళ్లికి పనికొస్తాయని ఈ మధ్యే ప్రొద్దుటూరునుంచి పదికిలోలు తెప్పించి చేయించారు మీ అన్నయ్యగారు' అంది తాయారమ్మ.
'అవును చెల్లమ్మా! ఇంకా ఇన్ని బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయి. లాకర్లు ఖాళీగా లేకపోతే వూరికే పడుండటమెందుకని మా పక్కింటివాళ్లక్కూడా పెట్టుకోమని పడేస్తుంటాం. మా కుక్క మెడగొలుసుకూడా ఉమ్మిడియార్ వారి బంగారంతో చేయించిందే!'
'ఇవన్నీ..?'
'మీ అనుమానం అర్థమైందిలేండి బావగారూ! చేసేది ఇసక తవ్వుకునే  వ్యాపారం కదా! ఇవన్నీ వీడికెలా వచ్చాయనేగా డౌటు! మీకు తెలీనిదేవుంది? హ్హిఁ! హ్హిఁ! ఇవే కాదు! ఈ నట్టింట్లో పెట్టించిన హోం థియేటర్నుంచి.. స్నానాలగదిలో కట్టించిన పాలరాయి తొట్లదాకా అన్నింటికీ బిల్లులు కూడా ఉన్నాయి సారూ! చూపిస్తానుండండి!.. ఈ బిల్లు భజగోవిందం పేరుతో ఉంది. భజగోవిందమంటే మా బావమరిది. ఈ ఇంటిపేపర్లు మావూళ్లయ్య పేరుతో ఉన్నయ్!  మావూళ్లయ్యంటే మా ఊళ్లో ఓ మామూలు బడిపంతుల్లెండి! పాలేరు పేరుతో మా పల్లెల్లోనే ఓ పాతికెకరాల కొబ్బరితోట కొని పడేసాను. ఈ ప్లాట్లూ.. ఫ్లాట్లూ కాదుగానీ కొని దాచలేక నేను పడే పాట్లు ఆ దేవదేవుడికే తెలియాలి. మీకు తెలీనిదేముంది? ఈ రోజుల్లో ఇసుక వ్యాపారం అనేసరికి గిట్టనివాళ్ళేవేవో కతలు కతలు అల్లుతుంటారు! అల్లరి పెడతుంటారు. రోజూ టీవీల్లో.. పేపర్లల్లో వచ్చే భాగోతాలు చూస్తూనే ఉన్నారు గదా!'
'అన్నయ్యగారికి ఇళ్లూ వాకిళ్లూ అన్నీ వివరంగా చూపించండీ! లేకపోతే ఇదంతా  ఏదో పిట్టలదొర కబుర్లు అనుకోగలరు' అంది తాయారమ్మ.
'ఆ మాటా నిజమేనే! బావగారూ! ఏదో మీ సంబంధానికి మేమూ కాస్తో కూస్తో సరితూగగలమని చెప్పుకోడానికే ఈ సోదంతా! ఇవికాక బంజారాహిల్సులో రెండు బంగళాలుకూడా ఉన్నాయి! లోపలికి రండి! ఈ బాత్రూము కిందున్న రాయి ఎత్తితే అమ్మాయి పేరున దాచిన బ్లూషేర్లు ఒకైదుకోట్లదాకానైనా కనిపిస్తాయి. ఎకౌంటు చేయడానికి కుదరని హార్డు క్యాషైతే ఇంకో రెండు రెట్లు అదనంగానే ఉండొచ్చు!
'వచ్చి అరగంట దాటింది. పిల్లగురించి వాళ్ళింకా ఒక్కముక్కయినా అడగ లేదు. గుక్కతిప్పుకోకుండా మీ పాటికి మీరు  మీ దండకం  చదువుకుపోతున్నారు! ముందు వాళ్లనో గుక్క కాఫీనీళ్లైనా తాగనివ్వండీ!' అంది తాయారమ్మ,
అప్పటిగ్గానీనిజమేనే! అమ్మాయిచేత ఆ టిఫిన్లేవో పంపించు!' అని వెనక్కి తగ్గారుకాదు  ఆగుమయ్యగారు.
వేడి వేడి ఉల్లిగారెలు.. పొగలుకక్కే జీడిపప్పు ఉప్మా.. జాగర్లమూడి నేతిలో ముంచి తేల్చిన జిలేబీలూ లాగించి.. కాఫీ టీలు ముగించి.. వచ్చినవాళ్లు త్రేన్చుకుంటూ లేచేసరికి నడిఝాము నెత్తికెక్కింది.

పెళ్లివారిని కార్లదాకా సాగనంపుతూ చివరి నినిషంలో ఆగలేక పెళ్లికొడుకు తండ్రిని అడిగేశాడు ఆగుమయ్య 'పిల్ల నచ్చినట్లేనా? ఇంకా ఏమన్నా అనుమానలున్నాయా బావగారూ?'
'అన్నీ దగ్గరుండి సాక్ష్యాలతో సహా  వివరంగా చూపిస్తిరి. ఇంక అనుమానాలకు తావేముంటుంది ఆగుమయ్యగారూ! ఏ సంగతీ రేపే మన పేరయ్యగారిద్వారా కబురుచేస్తాంగదా! మీరు అందుబాటులో ఉండండి చాలు' అంటూ వాళ్లు చక్కా వెళ్లిపోయారు.

మర్నాడు పేరయ్య గంతులేసుకొంటూ రానే వచ్చాడు. 'కొంపముంచేశారండీ బాబూ! వాళ్లు పిల్లను చూడ్డానికని వచ్చినవాళ్లు కాదటఅవినీతి నిరోధకశాఖ వాళ్లు! మామూలుగా వచ్చి దాడిచేస్తుంటే ఎవరూ పెదవి విప్పటంలేదని .. ఇట్లా కొత్త కొత్త  ఎత్తులు  వేస్తున్నార్ట! మీరేమో ఆత్రం ఆపుకోలేక సాక్ష్యాలతో సహా సర్వం విప్పి చూపించేసారు! ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని మీమీద పక్కా కేసొకటి బుక్కయిపోయిందక్కడ!'
'గాడిద గుడ్డులేవయ్యా! పాతికేళ్లబట్టి వ్యాపారాల్లో నలిగేవాడికి ఆ మాత్రం ఫ్లాట్లూ..ప్లాట్లూ, కార్లూ.. షేర్లూ, తోటలూ.. దొడ్లూ, నగా నట్రా అమరవా ఏంటయ్యా! ఈ కుట్ర నిలబడేది కాదులే! తేలిపోయేదే చివరికి! ఎన్ని చూడ్డంలా!’
'ఎట్లా తేలిపోతుంది మహాప్రభో! అల్పారంలోనే మీరు అంత దిట్టంగా  కుమ్మేస్తిరి! జీడిపప్పు ఉప్మాలు.. నేతి జిలేబీలు  గట్రా గట్రా ఎట్లా ఏడ్చినా.. ఆ ఉల్లిగారెలున్నాయ్ చూసారూ.. అవి మిమ్మల్ని పట్టించేసాయ్ సారూ! ఉల్లి బంగారంకన్నా మిన్నగా మండిపోతోందిపప్పులు ఏరకమైనవైనా  నిప్పుల్లా కాలుతున్నాయి మార్కెట్లో! ఎంత ఇసుక వ్యాపారైనా ధర్మబద్ధంగా నడిస్తే .. కొని తిని భరాయించుకొనే  స్థితిలో ఉన్నాయా ధరవరలు! అక్కడ ఇరుక్కుపోయారు సారూ తమరు! ఇహ తప్పించుకోవడం కుదరదు. ఇదిగో ఇంకాసేపట్లో తమరికి తాంబూలాలు రాబోతున్నాయి. తన్నుకు చావడమే ఆలయమిహ!'
ఎగురుకుంటూ వెళ్లిపోయే పెళ్ళిళ్లపేరయ్య వంక నిలువుగుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయాడు ఆగుమయ్యగారు
-కర్లపాలెం హనుమంతరావు
***




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...