Friday, January 1, 2016

ఒక్క నిమిషం- కౌముది కథలు




ఒక్క నిమిషం ముందు పుట్టినందుకు కవలపిల్లలయినా అన్నహోదా దక్కింది రామాయణంలో రామచంద్రుడికి.
ఒక్కనిమిషం ఆలస్యమయి వుంటే పసిబిడ్డ ప్రాణాలు రక్షించడం కష్టమై ఉండేది’- ఆసుపత్రిలో వైద్యులు.
ఓన్లీ ఒన్ మినిట్!’- పరీక్ష హాల్లో పర్యవేక్షకుడి చవరి హెచ్చరిక.
 'ఒక్క నిమిషం'..  అంటూ  మాట్లాడేఫోను పక్కన పెట్టేసి బైటికి వెళ్ళినందువల్లే వీరభద్రం ప్రాణాలు నిలబడ్డయి! లేకపోతే కుటుంబసభ్యులందరికిమల్లేనే ఇంటికప్పుకింద పడినుజ్జు నుజ్జు అయిపోయుండేవాడు’. ఓ పత్రిక ప్రమాద కథనంలో భాగం.
ఒక్క నిమిషం  రావడం లేటయినా సుబ్రహ్మణ్యానికిలా రైలుకింద పడి చచ్చే కర్మ తప్పుండేది’ ఒక కన్నతండ్రి ఆక్రోశం.
'ఒక్క నిమిషం స్థిమితంగా ఆలోచించి చూడు. విషయాలన్నీ నీకే చక్కగా బోధపడతాయి' అపార్థం చేసుకొన్న గర్ల్ ఫ్రెండుతో సుబ్బారావు వేడికోలు.
'ఒక్కనిమిషమే టైముంది. నీ చివరి ప్రార్థన చేసుకో!' ఉరితీయబోయేముందు ఖైదీకి  జైలు సూపరింటెండెంటు సౌకర్యం.
ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ ఇడ్డెన్లు తింటారో వాడే ఈ ఏడాదికి విజేత. లక్షరూపాయల బహుమతి గ్రహీత!- తిండిపోతుల పోటీ ప్రకటన.
ఒక్క నిమిషం లెక్కతప్పినా ఏళ్లతరబడి కోట్లు పోసి తయారు చేసిన
సాట్ లైటు లాంచింగు ఫ్లాపయి ఉండేది’ ఇన్సాట్ ప్రయోగం విజయవంతమైన పిదప ఊపిరి పీల్చుకొంటూ బృందనాయకుడి ఉద్వేగ ప్రకటన.
'ఒక్కనిమిషం ముందుగా వచ్చుంటే చివరి చూపులు దక్కుండేవి' కడసారి తల్లిని కళ్ళారా సజీవంగా చూసుకోలేని ఓ కన్న కూతురి ఆవేదన.
ఒక్క నిమిషం అయిపోయింది. 'ఒక్కనిమిషం' కథ చదవడం అయిపోయింది.

***
-కర్లపాలెం హనుమ ంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి సంచికలో ప్రచురితం)
https://onedrive.live.com/redir?resid=4B36C8046FCB7142!84841&authkey=!AInemVE-5v_XOYo&ithint=file%2cpdf




ఆకలి మింగిన రోకలి- కౌముది కథానిక

చంద్రగ్రహణం పట్టిన రోజున  నీళ్ళు పోసి నిలబెడితే పడకుండా గ్రహణం ఉన్నంతసేపూ రోకలి అలాగే నిలబడి ఉంటుంది! రోకలికి గ్రహణంతో ఏం సంబధమో విజ్ఞానశాస్త్రమే వివరించాలి! రోలొచ్చి రోకలితో మొరపెట్టుకొందని మనకో సామెతా ఉంది.
'పిచ్చి ముదిరింది. రోకలి తలకు చుట్ట'మని మరో నానుడి. పిచ్చికి రోకలి ఎలా  మందయిందో తెలీదుగాని.. ఆకలికి మాత్రం రోకలే మంచిమందని మనవాళ్ళు మనసారా నమ్మినట్లున్నారు.
'అమ్మా! ఆకలేస్తుందే!' అని ఆ పిల్లాడు కొంగుపట్టుకొని వేళ్లాడుతుంటే ఆ వేధింపులకు తాళలేక 'ఆకలేస్తే  రోకలి మింగు!' అని ఈసడించుకొంది ఆ తల్లి.
అడక్కుండానే బిడ్డకు అన్నం పెట్టాలన్న ద్యాస ఏ తల్లికైనా ఎందుకుండదు!
ఘోరకరువులు! మూడేళ్ళుగా వరసబెట్టి వచ్చి దుంపతెంపి పోతుంటే ఊరు ఊరంతా బీడుగా మారి పోయుంది. గాదెలో దాచిన ధాన్యమూ పూర్తిగా నిండుకొని అడుగు తాటాకు బద్దల్ని గీరుకు తింటున్నాయి ఎలుకలు.
పనులుంటే ఆ ఇంటి యజమానేమైనా పాలుమాలే రకమా!
పస్తులుంచడం ఆ ఇంటి ఇల్లాలుకేమన్నా వ్రతమా!
పనిపాటలు లేక పల్లెలకు పల్లెలే పట్టణాలకు వలసబాట పట్టడం మొదలయి రెండేళ్ళు దాటింది. అదీ వల్లగాని నిర్భాగ్యులతో మాత్రమే ప్రస్తుతంపల్లె నిండి ఉంది.
పిల్లాడి ఆకలి తీర్చే మార్గంవెదుక్కుంటూ ఇల్లాలు వీధులెంట బడింది.  ఇంట్లో వంటరితనం. కడుపులో ఎలుకల రొద. ఆలకించే నాథుడు కరువై బైటికి వచ్చి నిలబడ్డాడు బుడతడు.
ఎదురింటి డాబా ఆవరణలో ఐదేళ్ళ పాప అన్నాలాట ఆడుతుంది. నాన్నకోసం వెదుకుతున్నట్లుంది. ఏడిచే బుడ్డాడిని చెయ్యిపెట్టి పిలిచింది.. ‘రా.. రమ్మ’ని.
'అన్నాలాట ఆడుకుందాం! వస్తావా!' అని ఆహ్వానం, 'నేను అమ్మను. నువ్వు నాన్నవు' అనికూడా పాత్రలు నిర్దేశించింది.
'అయితే ఆకలేస్తే అన్నం వండి పెడతావా? అట్లాగయితేనే వస్తాను' అని ఆశగా అడిగాడు మూడేళ్ళ బుడతడు.
'' అంటూ చేటలో బియ్యం పోసుకొని చెరిగి చట్టిలోని నీళ్లలో పోసి ఎసరు పెట్టి ..'రోటి పచ్చడి చేస్తాను.. ఉండండీ!' అంటూ కారం సరంజామా కోసం ఇంట్లోకి పోయింది.. పాప.. పెద్ద ఆరిందాలాగా.
పోయిన పిల్లతల్లి ఎంతకూ బైటకు రాదే!
అసలే ఆకలిమీదున్నాడేమో అమ్మమాట గుర్తుకొచ్చింది నాన్న బుడతడికి.  అక్కడే పడున్న చెక్కపేడు రోకలిని గభుక్కున మింగేశాడు!
***
ఆనక పెద్దాసుపత్రిలో సమయానికి వైద్యందొరికి ఈ లోకలోకి గనక వస్తే గిస్తే..' ‘రోకలి ఎందుకు మింగావురా వెధవా!' ని ఎవరైనా అడిగారనుకోండి..
'అమ్మ చెప్పింది' అని నిజం కక్కేస్తాడేమో!
పాడు కలికాలమా,, ఎంతకు తెగించావూ!
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి సంచికలో ప్రచురితం)


అనుబంధం- కౌముది కథానిక


రామచంద్రుడు మంచి బాలుడు.. ఒక్క పొగ విషయంలో మినహా!
కళాశాల రోజుల్లో అయిన అలవాటు. మిత్రుడు మృత్యుంజయుడు చలవ! మృత్యుంజయుడు పోయాడుగానీ.. పొగ వ్యసనంగా మిగిలిపోయింది.
నిరుద్యోగంలో, ఇంటి సభ్యులతో వచ్చిన మనస్పర్థల్లో, ఒంటరితనంలో, ప్రేమ వైఫల్యంలో పొగే తనకు ఊరటనిచ్చింది.
పెళ్ళిచూపుల్లో శారద విడిగా  పిలిచి బిడియం వదిలి అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు రామచంద్రుడు .. అందమైన పిల్లని వదులుకొనేందుకు మనసొప్పక.
మొగుడు బొంకాడని మొదటిరాత్రే గ్రహించినా సర్దుకుపోయింది శారద.
మొదటి బిడ్డ శరత్ పుట్టినప్పుడు శారద గట్టిగా షరతు పెట్టినప్పుడూ సిగరెట్టుకోసం బిడ్డముద్దులను దూరంగా ఉంచాడు. రెండో బిడ్డ సరితను దొంగతనంగానే సిగిరెట్టుపెదాలతో ముద్దులాడాడు.
కాలంతో పాటు అంతా మారి.. శరత్ అమెరికాలో .. సరిత ఆస్ట్రేలియాలో సెటిలయి.. చేసే ఉద్యోగానికి పదవీవిరమణయి.. పనిలేక ఆరోగ్యం దెబ్బతింటున్నప్పుడూ రామచంద్రుడు సిగిరెట్టును దూరం పెట్టలేక పోయాడు.
అమెరికా వెళ్లినప్పుడుగాని అసలు అగ్నిపరీక్ష మొదలవలేదు రామచంద్రుడికి.
అగ్రరాజ్యంలో తాగడానికి సిగిరెట్టు లభించడం అంత సులభం కాదు. కేవలం సిగిరెట్లకోసం పక్కింటి ఇంగ్లీషుబామ్మగారితో సిగ్గు విడిచి స్నేహం చేసాడు రామచంద్రుడు. ఇంట్లోవాళ్ళు పసిగట్టకుండా ఆమె ఇంట్లోనే నాలుగు దమ్ములు లాగించి వాసన తెలీకుండా ఏ చాక్లెట్టో చప్పరించే వాడు.
శరత్ ఆరునెల్ల చంటిబిడ్డ ఉన్నట్లుండి గుడ్లు తేలేస్తే.. ఎమర్జన్సీలో నోట్లోనుంచి సిగిరెట్టు పీక బైటికి లాగినప్పుడు రామచంద్రుడి బండారం బైటపడింది.
ఆరునెలలు ఉందామనుకొని వెళ్ళిన దంపతులు మూడు నెలలు తిరక్కుండానే ఇండియా వచ్చేయడం బంధువర్గాల నోటికి చాలినంత మేత ఇచ్చింది. సర్దిచెప్పలేక విసిగిన  శారద ఒకరోజు అవమానంతో నిద్రబిళ్లలు మోతాదుకి మించి మింగేసింది. ‘సిగిరెట్లు  తాగడం శాశ్వతంగా మానేస్తానని శారద చేతిలో  ఒట్టేసి అతికష్టంమీద భార్యప్రాణాలు కాపాడుకొన్నాడు రామచంద్రుడు. త్రేతాయుగంనాటి రామచంద్రుడిలాగే ఈసారి మాటా నిలబెట్టుకున్నాడు.
కానీ కాలం మరో విధంగా తన తీర్పు ప్రకటించడానికి సిద్దపడింది.
బైటపడేసరికే రామచంద్రుడికి సెకండ్ స్టేజీ లంగ్ కేన్సర్! ఏడాదికి మించి వైద్యులు  గ్యారంటీ ఇవ్వకున్నా.. ఆరునెలలు తిరక్కుండానే మృత్యుశయ్యమీదకు చేరిపోయాడు రామచంద్రుడు.

ఆ రోజు మరీ ముంచుకొచ్చింది. బిడ్డలకు కబురు చేయించింది శారద. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకొని వచ్చేందుకు కనీసం  రెండు రోజులు పడుతోంది. అప్పటివరకు అపోలోలో  వెంటిలేటరుమీద అందించే ప్రాణవాయువే ఆసరా!
పడకమీద అచేతనంగా పడివున్నాడు రామచంద్రుడు. భర్తను ఒక్కక్షణం వదిలి పక్కకు పోవడానికి ఇష్ట పడటంలేదు శారద.
తెల్లారడం కష్టం అని డాక్టర్లు చెప్పి పోయారు. పక్కమీద రామచంద్రుడు  అదే పనిగా కలవరిస్తున్నాడు.
'సిగిరెట్టు.. సిగిరెట్టు' అంటూ పెదాలు పదే పదే తడుపుకొంటున్నాడు.

నర్సు బైటికి వెళ్లడం చూసి  తలుపులు లోపలికి బిగించి బ్యాగులోనుంచి సిగిరెట్టు పాకెట్టు బైటికి తీసి ఒకటి భర్త పాలిపోయిన పెదాలమధ్య ఉంచి అగ్గిపుల్ల వెలిగించింది శారద!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల మాసపత్రిక జనవరి 2016లో మరీచి.క కాలమ్ లో ప్రచురితం)



అనగనగా ఓ అమ్మ- కౌముది కథ



అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు బుడిబుడి అడుగులు వేసే  ఓ పాపాయి. ఆ పాపాయి బుడిబుడి నడకలతో బైటికి పోకుండా తన కొంగు చివరకి ముడి వేసుకొని పనిపాటలు చూసుకొనేది అమ్మ.
పాపాయి ఎదుగుతున్నది. కిటికీగుండా బైట కనిపించే కొండా కోనా, చెటూ పుట్టా.. పాపాయిని రారమ్మని బులిపిస్తున్నాయి! పాపాయికేమో.. పాపం..  తల్లికొంగు బంధమాయ!
ఆ రోజు బ్రహ్మాండంగా వాన కురిసి వెలిసింది. ఆకాశంలో ఏడురంగుల ఇంద్రధనుస్సు విరిసింది. పాపాయిని అదే పనిగా అందుకొమ్మని.. ఆడుకొందాం రమ్మని.. ఆగకుండా ఆహ్వానిస్తున్నది.
తల్లి గాఢనిద్రలో ఉంది.  అదను చూసి చాకుతో చీరకొంగు కోసి.. గడప దాటి..  గబగబా కొండకొమ్ముకేసి ఎగబాకుడు మొదలుపెట్టింది పాపాయి. ఇంద్రచాపం ఎక్కి   జారుడుబండ ఆటాడాలని  పాపాయి పంతం. ఆత్రం. ఆ తొందరలో పాచిబండమీద కాలు జారింది.  భయంతో 'అమ్మా! అమ్మా!' అని అరవసాగింది పాపాయి.
లోయలోకి జారిపడే చివరి క్షణంలో ఠకాలుమని ఆడ్డుపడి ఆపేసింది.. రెండుబండలమధ్య ఇరుక్కున్న అమ్మకట్టిన లావుపాటి కొంగుముడి!
దూరంనుంచి పరుగెత్తుకొస్తున్న అమ్మను చూసి 'హమ్మయ్య' అనుకొన్నది  పాపాయి. ***
-కర్లపాలెం హనుమంతరావు





Thursday, December 31, 2015

శునక పురాణం- ఓ సరదా గల్పిక




 




కుక్కలమీద కథలు సరదాగానే ఉంటాయి. కక్కకథే చేదు. ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతులు సృష్టిలో. ఎవరికీ లేని కడగండ్లు మా కుక్కజాతికే!కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు అంటారు. మంచిమాటే. కానీ మా విశ్వాసానికి వీసమెత్తైనా విలువేదీ?

మా జంతుజాలం దృష్టిలో మనుషులంతా పాతసినిమా రాజనాలలు. సూర్యకాంతాలు. కుక్క కంటబడితే చాలు  రాళ్లతోనో, కర్రలతోనో  కొట్టాలని మీకు మహా కుతి. ఆత్మరక్షణకోసం మేం కాస్త నోరు చేసుకొన్నామా.. ‘పిచ్చికుక్క’ అని ముద్దరేసి  మరీ వేపుకుతింటారు. మున్సిపాల్టీ బండ్లకోసం పరుగులు పెడతారు!

మా కుక్కలు.. వరాహసోదరులు.. నోరు చేసుకోకుంటే మీ స్వచ్చభారతులు ఎంత కంపుకొట్టేవో! ఆ విశ్వాసమైనా లేని కృతఘ్నులు మీ మనుషులు!

కుక్కకష్టాలు  ఒక్క మనుషులతోనే కాకపోవచ్చు !  కుక్కలకే కుక్కలంటే పడి చావదన్నమాటా నిజమే కావచ్చు.  కాని .. ఆ దొబ్బుతెగుళ్ళన్నీ మీ పొలిటీషియన్లని, టీవీ సోపుల్ని  చూసే  అబ్బుంటాయని నా డౌటు.

'అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. .. సబ్బుబిళ్ల కాదేదీ కవిత కనర్హం' ఆహాహా! ఎంత గొప్పగాచెప్పాడండీ  మీ మహాకవి! ఆ మహానుభావుడికేమో మెమొంటోలు..  చప్పట్లు! మా మీదకు మాత్రం రాళ్ళూ  రప్పలు! మీ హిపోక్రసీని చూస్తే ఎంత బుద్ధిగా ఉండే కుక్కకైనా కసిగా కరవ బుద్ధేస్తుంది!

 

 

‘మీ గొడవలన్నీ మాకెందుకులే!' అని ఓ మూల దాలిగుంటలోపడి వుంటామా ! 'కరిచే కుక్క అరవదు' అని మీకు మీరే డిసైడై పోయి.. మా వెంటబడతారు. ‘చదువులన్ని చదివి చాల వివేకియై /కపట చిత్తుడైన బలునిగుణము/దాలిగుంతనెట్టి దలచిన చందమౌ /విశ్వదాభి రామ వినుర వేమ!’ అంటూ పద్యాలకు తగులుకుంటారు. విని విని పిచ్చెత్తి  కరిచేదాకా వదిలి పోరు .   కరుపుకి, అరుపుకి లింకేం పెట్టుకోరాదని మా రాజ్యాంగంలో ఏ సెక్షను కిందే క్లాజులో రాసుందో? ! అరుస్తూ కరుస్తారు. కరుస్తూనే  అరుస్తారే..మరి మీ మనుషులూ! మీకో నీతి.. మాకో రీతీనా! సిల్లీ!  కుక్కై పుట్టే కన్నా అడవిలో పిచ్చిమొక్కై పుట్టడం మేలనిపిస్తుంటుందొక్కోసారి. 'మొక్కేకదా అని పీకేస్తే .. పీక తెగ్గోస్తా!' అన్న అన్నగారి పంచ్  గుర్తుకొస్తుంది! పిచ్చిమొక్కకిచ్చేపాటి విలువైనా మా కుక్కజాతికివ్వడం లేదీ  మనిషి. మరీ టూ మచ్! ‘అందితే తోక.. అందకుంటే మూతి!’మీ  మనుషులది. ఐ హేట్యూ మ్యాన్!

అమెరికాలో పుట్టే అదృష్టం అన్ని’డాగు’లకూఉంటుందా ? ! అక్కడైతే.. డెమోక్రటిక్ ఒబామానుంచి.. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ దాకా.. పార్టీపరంగా ఎన్ని చీలికలు ఏడ్చినా.. మా పెట్ జంతువులపట్ల  ఒకటే పాలసీ! ఇంటిసభ్యులకన్నా ఎక్కువగా చూసుకుంటారు.   పెళ్లిళ్ళు, పేరంటాలు, సీమంతాలు, పురుళ్లు.. అన్నీ మనుషులకు మించి  జరిపించే గొప్పశునకప్రేమికుల దేశం అమెరికా.  భూతలంమీది కుక్కలస్వర్గం. బుద్ధభగవానుడు పుట్టిన మీ  ‘లైట్  ఆఫ్ ఏసియా’నో! శునకాలపాలిటి భూలోక  నరకం.

వానలు కురవనప్పుడే కప్పలు ఇక్కడ గుర్తుకొచ్చేది.  పోకిరీల ఊరేగింపులకే గాడిదలు అవసరం పడేది! పెట్రోలూ , డీజెలూ  గట్రా రేట్లు తగ్గించాలన్న డిమాండ్లు పుట్టినప్పుడే బండ్లీడ్చే బుల్సు పిక్చర్లో కొచ్చేది! 'అక్కరకు రాని చుట్టము.. మొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము.. గ్రక్కున విడువంగ వలయున'ని మళ్లీ నీతిశతకాలు!  సెంటిమీటరుకో సుమతి మహాశయుడితో కిక్కిరిసున్న  సమాజంరా బాబూ  మీ మనుష్యలది! ఒక్క కుక్కలకనేముందిలే! అన్ని జంతుజాలాలకూ మతులు పోతున్నాయీ  పుణ్యభూమిలో!    

దొంగల్ని పట్టే దివ్యమైన కళ మా దగ్గర ఉందని చేరదీస్తారా! దానికీ రాణింపు రానివ్వని కుళ్ళు మనుషులది! పోలీసుపటాల్లోకి పెద్ద పటాటోపంగా తీసుకున్నట్లు లెక్కలుంటాయి! కుక్కలకు వాసన పసిగట్టడంలో శిక్షణ ఇచ్చే  వంకతో లక్షల కోట్లు కొట్టేస్తారు! అదృష్టం కొద్దీ అవకాశమొచ్చి మేం ఏ దొంగవెధవనో పట్టుకొన్నా ఫలితం సున్నా. మేం పసిగట్టిన ఏ దొంగవెధవైనా మినిమమ్  మూడు రోజులన్నా  లాకప్పులో ఉంచరు.     ఎఫ్ఫైఆర్ల దగ్గర్నుంచే యవ్వారాలు మొదలు దొంగ పోలీసులకు.. దొర మార్కు దొంగలకు మధ్య! రొట్టెముక్కలు విసిరి తోకలు ఊపించుకోడానికి..  పక్కింటివాళ్ల ముందు  గొప్పలు చూపించుకోడానికే మా కుక్కలు మీ మనుషులకు! షేమ్.. షేమ్!

బేసికల్ గా భైరవజాతి అంటేనే ఎందుకో మనుషులకు చీదర.  అన్నం కరడింత పారేస్తే జన్మంతా పెరట్లో పడంటుందన్న  చులకనా!

ఆడించేందుకు కోతులు, కొండముచ్చులు, పాడించేందుకు కోకిలలు, చిలుకలు, తలాడించేందుకు గంగిరెద్దులు, గొర్రెపోతులు, కొట్టు చచ్చేటందుకు  కోళ్ళు, కొక్కిరాయిలు, ఢీడిక్కీలు కొట్టుకొనేందుకు పొట్టేళ్ళు, దున్నపోతులు! ఒక్కో దురదకి ఒక్కో జంతువు మనిషికి! మా కుక్కలతో మాత్రం ఏ అక్కరా లేదు.చీ.. ఎంత కుక్కబతుకయిపోయిందిరా గాడ్  మా డాగులది !

అసలు ! కుక్కలకి, కుక్కులకి ఏమంత పెద్ద తేడా ఉందిట! కుక్కలం మీరు తిన్న ఎంగిళ్ళు నాకితే.. కుక్కులు తిన్న ఎంగిళ్లు మీరు నాకుతారు! దొంగచాటుగా మెక్కే అ కుక్కేశ్వర్లకేమో వేలకు వేలు జీతభత్యాలు! దొరబాబుల్లా ఎంగిళ్లకు ఎగబడే మాకు మాత్రం దుడ్డుకర్రలతో ఘనసత్కారాలు!

దాలిగుంటలో నిద్రోయే సమయంలో రాయేసే రాలుగాయిని రక్తాలొచ్చేటట్లు   కరవాలా? ‘రా.. రమ్మ’ని పిలిచి ముద్దులు పెట్టుకోవాలా? ఏ కుక్కయినా  బేడ్ మూడ్ లో ఉండి   కసిబట్టలేక కాస్త కండ ఊడేటట్లు  కరించిందే అనుకోండి! ఇక కుక్క జాతి మొత్తానికి ఆయువు మూడిందే! మీ సోషల్ మీడియా నిండా  మా గురించి చెడామడా  వార్తలు! లోకమంతా మా కుక్కల దాడితోనే అల్లకల్లోలమైపోతున్నట్లు బిల్డప్పులు ప్రసార మాధ్యమాల్లో!  మాకూ ప్రత్యేకంగా పత్రికలు.. టీవీలుగాని ఉండుంటేనా! మీ మనుషులు చట్టసభల్లో చేరి  చేసే నానాయాగీని నిప్పులతో కడిగి మరీ చెరిగేసేవాళ్లం! చూస్తున్నాంగా రోజూ టీవీల్లో   మీ గౌరవనీయుల యాత్రల తీరు! మా బజారు కుక్కలుకూడా సిగ్గుతో తలలు దించుకొంటున్నాయి మీ కుక్క మొరుగుళ్లతో . ప్రజాస్వామ్యం జోలికి పోనందుకు మహా సంబరంగా ఉంది సుమా మాకిప్పుడు. 

ఆ మాటకు మామీదా సభాహక్కుల తీర్మానం  బనాయిస్తారు కాబోలు! ఫర్వానై! న్యాయస్థానాల్లోనే తేల్చేసుకుందాం తేరే..మేరే బీచ్ కీ యే  ఖిచ్.. ఖిచ్!

బర్త్ కంట్రోలుకని మా కుక్కల్ని బలవంతంగా మున్సిపాల్టీ బళ్లల్లో కుక్కేయడం     కుక్కల హక్కులకు భంగకరం.  బొద్దింకలమీద బయోలజీ విద్యార్థులు ప్రయోగాలు,   ఎలుకలపై  నెవరెండింగ్  జీవశాస్త్ర పరిశోధనలు, కోతులు గట్రా జాతులకు  కత్తికోతలూ! మనుషులమీదా  మా జంతువులు ఇదే మాదిరి బలవంతపు   పరిశోధనలకు తెగపడితే! హక్కు  ఉల్లంఘనలు  అన్ని ప్రాణులను  సమానంగానే హింసిస్తాయి బ్రదర్స్ !

ఎవర్ననుకొని ఏం లాభం ! ఆ దయామయుడికే మామీద కనికరం కరువైనప్పుడు! ఆ పెద్దాయనకూ మాకూ పెద్దతేడా ఏముందని? జి.. ఓ.. డి అయితే గాడ్!  డి.. ఓ.. జి గా రివర్సు చేస్తే డాగ్! కష్టం వస్తే ‘ఓ మై గాడ్’ అంటారే గానీ.. ‘ఓ మై డాగ్’ అనరెవరూ! సరికదా 'గాడ్'గారి ముందు పడీ పడీ పొర్లుదండాలు పెట్టే మూడీ మనుషులు డాగ్ పేరు వింటే మాత్రం  దుట్టు కర్రతో  వెంటబడతారు! మ్యాడ్.. మ్యాడ్.. మ్యాడ్ మీ  హ్యూమన్ వరల్డ్!

శునకానికి కనకంతో రైమింగున్నందుకైనా  పోనీలే అనిపించదా మీ  పెద్దమనుషులకు ! 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను' అంటూ మా పైన వెటకారాలు న్యాయమా ? ! ఇప్పుడేదో ఆ  సింహాసనాలని కరుచుక్కూర్చున్న పెద్దమనుషులంతా పెద్ద   సుపరిపాలన సాగిస్తున్నట్లు! మా జాతికి విశ్వాసమనే  అర్హతైనా  ఉంది. మీనేతల కది  ఓట్లు పడే సరుకు.  

ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది . ఆదిశంకరులకి  జ్ఞానబోధ జరిగిన  కథ మా జాగిలాల మీదే. జనమేజయుడి యజ్ఞవాటికలో    సరమ  బిడ్డ ఆడుకొన్నది నూ దేవ శునకం తోనే.   మహాప్రస్థానికని బైలుదేరిన ధర్మరాజుని  అన్నదమ్ములతో కలసి అనుసరించిన శునక జాతి వారసులం మేం.  ‘భగవద్గీత’సైతం   ప్రస్తావించే  మాజాతి  రాత ప్రస్తుతం   దయనీయం . 

‘కుక్కగా పుడితే తప్ప కుక్క కష్టాలు మీ తలకెక్కవు. అనుభవిస్తే తప్ప తెలిసిరానివి మా బాధలు. అందుకైనా .. ఓ భగవాన్.. ఈ మనుషులంతా  ఇండియాలో వీధికుక్కలు గ జన్మించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నా!



***



(కర్లపాలెం హనుమంతరావు(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)

 





 

 

 

 


కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- జనవరి 2016 సంచికలో ప్రచురితం)




Tuesday, December 29, 2015

అధిక్షేప సాహిత్యం- మిసిమి నవంబరు 2015


శబ్దరత్నాకరం ప్రకారం 'అధిక్షేపం' అంటే దూఱుట, బెదిరించుట. 'వొక్కొక్కడికీ ఎవడికి వాడికి/ నాలుగ్గోడల నడిం ప్రపంచం/ కల్చర్- కంచం, మంచం/ యెవడికి వాడికి యెవడిది వాడిది!' 'కల్చర్ అండ్ అనార్కీ' కవితలో కవిపూషా చేసిందీ అధిక్షేపాన్నే!ఇష్టంలేని ఎదుటిమనిషి లోపాల్ని ఏదోవిదంగా ఎత్తిచూపాలనుకోవడం మానవతత్వంలోని  బలహీనత. తప్పును సరిచేయాలన్న సద్బుద్ధి కావచ్చు.. దుష్ప్రచారం చేయాలన్న దుర్భుద్దీ కావచ్చు. విశ్వనాథవారు 'శ్రీ'కారాలు విరివిగా వాడతారని  దేవీప్రసాదు 'అచ్చుత్తించు శ్రీ ప్రెస్సులో శ్రీ అచ్చుల్ సరిపోయి ఏడ్చినవటోయ్ శ్రీ విశ్వనాథేశ్వరా!' అని వెటకారం చేయడం ఏ కోవకు చెందిందో ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి.


పిల్లిమీదా ఎలుకమీదా పెట్టి అన్యాపదేశంగా ఎత్తిపొడిచే వ్యంగ్యవిధానాన్ని పాశ్చాత్యులు 'సెటైర్' అంటారు. జోనాథన్ స్విఫ్ట్ తనకాలంనాటి పాలకుల లోపాలని ఈ పద్ధతిలోనే గలివర్స్ ట్రావెల్సులో ఎత్తిచూపాడు. మన ఆదికావ్యం రామాయణం పుట్టడానికీ వాల్మీకులవారి అధిక్షేపమే మూలకారణం. క్రౌంచ పక్షుల జంటను విడదీసిన నిషాదుణ్ణి 'ఆట్టే కాలం బతకవ'ని ఆ కవి తిట్టిపోయడం అధిక్షేపం కిందే లెక్క. చేతి ఉంగరం పోయిందని చెరువుమీద, రాసేందుకు పత్రాలివ్వలేదని తాటిచెట్టుమీద అలిగి కవులు తిట్టిపోసిన అధిక్షేప సాహిత్యానికి ఆంధ్రభాషలో కొదువలేదుగానీ అదంతా వైయక్తిక అధిక్షేప విభాగం. సమాజాభివృద్ధికి దోహదపడ్డ సాంఘిక అధిక్షేపాన్ని గూర్చి పరిచయం చేయడమే ఈ చిరువ్యాసం ఉద్దేశం.
జీవితం అంటే మంచి చెడుల సమ్మిశ్రితం. చెడును ప్రతిఘటించడం ఒక ఎత్తైతే.. ఆ  శక్తి లేనప్పుప్పుడు పరోక్షంగానైనా ఎత్తిపొడవడం మరో ఎత్తు. మహాభారతం విరాటపర్వంలో కీచకుడి చేత పరాభవానికి  గురైన పాంచాలి  ధర్మజునిముందు తన గోడు వెళ్లబోసుకోవాలన్న తొందరలో సభామండపంలోకి వచ్చేస్తుంది.'పలుపోకల పోవుచు వి/చ్చలవిడి నాట్యంపు సూపు చాడ్పున' పాంచాలి అలా దూసుకు  రావడాన్ని ధర్మజుడు ఆక్షేపిస్తాడు. భర్త మందలింపుకు నేరుగా బదులీయలేని దుస్థితి పాంచాలిది. బదులియ్యకుండా ఉండలేనీ మనస్థితి. అందుకే 'నాదు వల్లభుండు నటు డింత నిక్కంబు/ పెద్దవారియట్ల పిన్నవారు' అంటో  ప్రత్యధిక్షేపాన్నిఆశ్రయిస్తుందా సాథ్వి. కేవలార్థమే కాదు.. సందర్భాన్నిబట్టి మరో అర్థమూ స్ఫురింపచేసే 'ద్వని' కావ్యానందాన్ని ఇనుమడింపచేస్తుంద'ని ధ్వన్యాలోక కర్త ఆనందవర్ధనుడి వాదన. అభిధ(శబ్దవృత్తి), లక్షణ వ్యాపారాలే కాకుండా పదానికి వ్యంజకత్వం అనే మరో బాధ్యతా ఉందన్నది ఆయన సిద్దాంతం. ఎత్తిపొడుపు, వెక్కిరింత, విసురు, విరుపువంటి ప్రక్రియలెన్నోఈ బాధ్యతను విర్వర్తించే అధిక్షేప విభాగాలే. వీరేశలింగంవంటి వైతాళికుల చొరవతో తెలుగులో ఈ విభాగాలకు సాంఘికోద్ధరణ బాధ్యతా పెరిగింది.
ఆత్కూరి మొల్ల రామాయణం పీఠికలో 'మును సంస్కృతముల దేటగ/ దెనిగించెడి  చోట నేమి దలియక యుండన్/ దన విద్య మెఱయ గ్రమ్మఱ/ ఘన మగు సంస్కృతము జెప్పగా రుచి యగునే!'  అంటూ డాంబికాచారాలని తూర్పార పట్టింది. ఆ తీరులోనే వీరేశలింగం డాంబికాల డొల్లతనాన్ని బైటపెడుతూ 'అభాగ్యోపాఖ్యానం' వంటి  అధిక్షేప కావ్యాలు అల్లారు. నవ్విస్తూనే అధిక్షేపించే ఈ కావ్యాలు ప్రహసనాలుగా ప్రసిద్ధం. విమర్శలపాలైనవారికీ తీవ్రంగా ప్రతిస్పందించ బుద్దేయదు..  సరి కదా ఆత్మవిమర్శద్వారా స్వీయసంస్కరణకు ఈ రకమైన అధిక్షేపం చక్కని అవకాశమూ ప్రసాదిస్తుంది. విమర్శ విమర్శకోసమే కాకుండా సంస్కరణ అంతిమ లక్ష్యంగా సాగే అధిక్షేపాన్ని అందుకే సంఘసంస్కర్లలు ఉత్తమమైనదని నెత్తిన పెట్టుకునేది. చిలకమర్తి గణపతి, మొక్కపాటి పార్వతీశం,  పానుగంటి జంఘాలశాస్త్రి, గురజాడ గిరీశం.. మనిషిలోని, సంఘంలోని వక్రబుద్ధి, అమాయకతల పోతబోసిన అధిక్షేప పాత్రలు.  కాళ్లకూరివారు- వరవిక్రయం వంకబెట్టి వరకట్నాలను తునుమాడితే.. గురజాడగారు గిరీశం భుజంమీద అధిక్షేపంతుపాకి పెట్టి  కన్యాశుల్కంమీద యుద్ధం ప్రకటించారు. కవిరాజు సూతపురాణం పేరుతో పౌరాణికాల పాతకాలను ఎండగడితే.. చమత్కారం,  వెక్కిరింతలనే జోడుగుర్రాలమీద అధిక్షేపరథాన్ని దౌడుతీయించిన ఘనుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి. కాకపోతే అదంతా వైయక్తిక వ్యంగ్య వైభోగంలో భాగం. కుసంఘానికి ఒక స్థాయిలో చురకలు అంటించిన వైప్లవికుడు శ్రీ శ్రీ. 'జమీందారు రోల్సు కారు, మహారాజు మనీపర్శు/ మరఫిరంగి, విషవాయువు,  మాయంటావా? అంతా/ మిథ్యంటావా?' అంటూ ముద్దులవేదాంతిని సైతం వదలక తలంటు పోసిన మహాప్రస్థానం ఆధునిక యుగంలో అత్యధికుల ఆమోదం పొందిన    అతిపెద్ద అధిక్షేప విన్యాసం. 'సులభంగా సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి  ఇవ్వరని స్త్రీలమీదా, దేశనాయకులమీదా, కవులమీదా గంపెడంత అసహనం వెళ్ళగక్కిన చలం సైతం శ్రీ శ్రీ 'ఎకసెక్కాలని' ఎరక్కపోవడం క్షమించరాని విషయం'గా ఒప్పుకున్నాడు.  శ్రీరంగంవారి ధోరణిలోనే వీరంగం వేసిన మరో ఎత్తిపొడుపుల  కత్తివీరుడు ఆరుద్ర.  'ఏకపత్నీవ్రతము/ ఎలుగెత్తి మనమతము/ వేల్పు భార్యలు శతము/ ఓ కూనలమ్మ!' అంటూ కూనారిల్లుతున్న మతతత్వంమీద పూలకత్తితో దాడికి దిగాడు. కాకపోతే పూలదెబ్బలకన్నా.. కత్తివాదరల చురుకే ఎక్కువ. గజ్జెలమల్లారెడ్డి గేయాలైతే దుష్టసంఘంమీద గజ్జెకట్టిన జజ్జనక జనారేలే!
కడుపులోని బాధను కన్నీళ్ళతో కడిగేందుకూ అదిక్షేపం నిక్షేపంగా పనికొస్తుందని నిరూపించిన కారుణ్యకవి జాషువా. 'కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్/   గనుపడలేదు వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు సత్కులముకన్న మహాభారతంబునన్/గనుపడలేదు పంచమునికన్న నీచపుజంతువేదియున్' అన్న జాషువా వ్యాఖ్య నిమ్న కుల వివక్షను ప్రశిస్తున్న అధిక్షేపమే!
'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా భావించే కూపస్థమండూకత్వం కన్యాశుల్కం నాటికే తెలుగునాట వేళ్లూనుకుని విస్తరిస్తుండటం గురజాడవారిని కలిచి వేసినట్లుంది.   సమాజాన్ని సామూహికంగా కుంగదీసి వ్యక్తి చైతన్య వికాసాలను అట్టడుగు స్థాయికి అణగదొక్కేవి ఇట్లాంటి  మూఢనమ్మకాలే. సమాజ ప్రగతిరథానికి నిరోధకంగా మారే ఈ మహమ్మారులమీద గురజాడ ఎత్తిన అధిక్షేప వజ్రాయుధమే కన్యాశుల్కం నాటకం.
సామాజిక అధిక్షేపానికి వేమన సాహిత్యం మకుటాయమానం. 'విప్రులెల్ల జేరి వెర్రికూతలు కూసి/ సతిపతులను గూర్చి సమ్మతమున /మును సుముహూర్తముంచ ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలేసిన  విశ్వదాభిరామన్న మన యోగివేమన.
సహజ విద్యావికాసానికి గ్రంధఛాందసభాష పెద్ద అడ్డంకి.  వందేళ్ల కిందటే వివరాలతో సహా  గురజాడ సమర్పించిన  డిస్సెంటు పత్రమే తెలుగుభాషాచరిత్రలో ఇంతవరకు  నమోదైన అతిపెద్ద అధిక్షేప పత్రం. స్త్రీ ఆత్మ స్వాతంత్ర్యం కోల్పోతున్న తీరును ప్రత్యక్షరంలోనూ అధిక్షేపించిన చలం సాహిత్యం అరుణాచలమంత ఉన్నతం. ఉద్వేగం, ఉత్తేజం ఉండకపోవచ్చుకానీ కొకు సిరా రాసిందంతా సామాజిక హిపోక్రసీమీద వామపక్ష అధిక్షేప పూత. నేలబారు పాత్రలతో కిక్కిరుసుండే రావిశాస్త్రి కతలన్నీ మేకవన్నెపులులపైన గోవులు విసిరే కొమ్ములు. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి మార్క్సు కావాలా?/నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే నేరస్థుడు లేడు'  అంటారు గుంటూరు శేషేంద్ర. నరమ్ నరమ్ గా ఉంటేనేమి అధిక్షేపంగీర శర్మస్వరంలోనూ షడ్జమంలో మోగుతోంది. ఎన్ని రకాలుగానైనా లెక్క పెట్టి చూడండి.. అధర్మరావణంమీద అధిక్షేపబాణం ఎక్కుబెట్టని కవిరామత్వం కలియుగంలోకూడా కలికానికి కానరారు.
ఉద్యమంనుంచి ఉద్యమం రూపుమార్చుకునే ప్రతిమలుపులోనూ పాతధోరణిమీద కొత్తవాదం సంధించేది అధిక్షేపాయుదాన్నే. కొట్టొచ్చినట్లు కనిపించేది ముందుతరాన్ని తదనంతరతరం కొట్టేందుకు రావడమే! 'చచ్చిన రాజుల పుచ్చిన చరిత్ర గాధల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది మానవ పరిణామశాస్త్రం నేర్పిందేమని?'(జ్వాలామ్ముఖి- సూర్యస్నానం) అని నిలదీయడమంటే పాతచరిత్రనంతా 'ఛీ' కొట్టడమేగా!
వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలన్నింటిపైన పుట్టిన ఏవగింపుకు విరసం ఒక బాహాటమైన అధిక్షేప రూపం. వర్ణాశ్రమధర్మాలు, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ, మూర్ఖపు అలవాట్లు, మూఢనమ్మకాలు, జన్మ కర్మ భావనలపై అతర్కిక విశ్వాసాలపై ఎక్కుపెట్టిన అధిక్షేపపుతూటా ఈ శతాబ్దారంభంనుంచీ మొగ్గతొడిగిన దళిత ఉద్యమం మాట. 'చెప్పులు కుట్టేవాడు- చెప్పులు తొడుక్కుంటే చెప్పరాని కోపం/ చెరువులు తవ్వేవాడు- చెరువులో నీళ్ళు ముట్టుకుంటే సహించరాని కోపం/ పొలాలు దున్నేవాడు- కాస్తంత భూమి కావాలంటే నేరం/ కాళ్ళమీద పడేవాడు- కాస్త లేచి నిలబడితే ఈ వ్యవస్థకి ద్రోహం' అన్న స్పృహ అట్టడుగు బడుగుకి ఏర్పడటమంటే అధిక్షేపం అక్షరం అంగీ తొడుక్కున్నట్లే!
'పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళిచేస్తానని/పంతులుగారు అన్నప్పుడే భయం వేసింది/ ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమొచ్చినప్పుడు సెలవివ్వడు/అని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది/వాడికేం మగమహారాజని ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది/ పెళ్ళంటే 'పెద్దశిక్ష' అని/ మొగుడంటే స్వేచ్చాభక్షకుడని/మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని' (సావిత్రి) - స్వశరీరంమీద సంపూర్ణ హక్కులకోసం అమల్లో ఉన్న సకల సామాజిక సాంస్కృతిక విలువలను బహిరంగంగా అధిక్షేపించడం ఆరంభించిన అతివ దిక్కార స్వరం అది. మైనారిటీలూ ఈ గడ్డమీద  పుట్టినందుగ్గాను తమకు  దక్కవలసిన సహజ హక్కులకోసం ఎలుగెత్తి వివక్షను ఆక్షేపిస్తున్నఅధిక్షేపయుగం ప్రస్తుతం నడుస్తున్నది.
'తిట్టకపోతే ఖలుడే కాదు దేవుడూ దారికి రాడు'అని కొందరి విశ్వాసం. ' ఆండ్రుబిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగాని/ మొదటినుండియు నీవు దామోదరుడవే' అంటూ శ్రీకాకుళాంధ్ర దేవుణ్ణి కాసుల పురుషోత్తమ కవి పనిగట్టుకుని తిట్టిపోసింది బహుశా ఈ ఉద్దేశంతోనే కాబోలు! సున్నితమైన తిట్లు, సుతారమైన హాస్యంతోకలగలిపి వడ్డిస్తే మెక్కేవాడికైనా భుక్తాయాసం తెలియకపోవచ్చు. వట్టి తిట్లపురాణాలు పుట్లకొద్దీ పండిచినా కాలాన్ని మాయం చేసి ఆట్టేకాలం నిలవలేవు. 18వ శతాబ్దంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన   వాంచానాథుడు తదనంతర పాలనలో ప్రజాపీడనకు కినిసి రాజును నేరుగా హెచ్చరించే అవకాశం కానక మహిషాన్ని అడ్డుపెట్టుకుని ఒక అధిక్షేప శతకం చెప్పుకొచ్చాడు. రాజును దారికి తెచ్చిన  ఆ మహిష శతకం అధిక్షేపధర్మ ఉదాత్త నిర్వహణకు ఉత్తమ ఉదాహరణ.
'మెఱుగు వేయకగాని మృదువుగా దన్నము/.. సాన వెట్టక మణి చాయ మిక్కిలి కాదు/.. ముక్కు నుల్చక దీప మెక్కువ వెలుగీదు/.. ఖలుడు గుణవంతుడౌను చకార గుళ్ళ' అంటూ చేట్రాతి లక్ష్మీనరసింహంకవి చెప్పిన కోదండరామ శతకపద్యం సద్భావంతో అర్థంచేసుకొంటే అవహేళన సాహిత్యంలోని ఔషధగుణం అవగతమవుతుంది. 'ఎమితిని సెపితివి కపితము/
బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో /ఉమెతకయను తినిసెపితో /అమవసనిసి అన్నమాట' అంటూ అల్లసాని పెద్దనవంటి ఉద్దండుణ్నీ దద్దమ్మని ఎద్దేవా చేసే వికటమనస్తత్వం పొటమరించనంతవరకు నిరసన సాహిత్యమూ రసహృదయాహ్లాదకరమే!
భగవద్గీతకు ఉత్తరగీతలు రాసుకున్న ఉదాత్త జాతి మనది. పాణినీయంవంటి సూక్ష్మశాస్త్రగ్రంథాలకూ అసంగత్వ మంటని రసోద్దీప అధిక్షేపాలొస్తే అస్వాదించిన హస్యస్ఫూర్తి మనది. హాస్యరసాధిదేవతగా వినాయకుణ్ణి కొలిచే జాతికి అధిక్షేపమంటే ఏవగింపు ఉంటుందనుకోలేం. జాతి మత భావోద్వేగాలమీద మితి మీరిన వెటకారానికి పోతే ఏమవుతుందో ఇటీవలే ఫ్రెంచిపత్రిక ఛార్లో హెబ్డో వ్యంగ్యచిత్రం సృష్టించిన కలకలం హెచ్చరిస్తోంది. వ్యక్తి శ్రేయస్సు, జాతి సౌభాగ్యం ఆకాంక్షించని ఏ అధిక్షేపమైనా వ్యక్తిగత అసహనానికి, అనారోగ్య మానసానికి మాత్రమే దుష్టదృష్టాంతంగా మిగిలిపోతుంది.  పరిమితులు ఎరిగి పరభాషా సాహిత్య వరవడుల్లోనే తెలుగు అధిక్షేపమూ మునపటి దారినే భావికి సౌభాగ్యసోపానంగా శోభాయమానంగా సంఘసేవ చేస్తుందని .. చేయాలని ఆకాంక్షిద్దాం***
-కర్లపాలెం హనుమంతరావు
(మిసిమి- మాసపత్రిక- నవంబరు 2015లో ప్రచురితం)

















Thursday, December 17, 2015

కందిపోటు దొంగలు- ఓ సరదా కథ


ఎదురుగా బోనులో నిలబడ్డ ఆకారాన్ని వింతగా చూస్తూ అడిగారు యమధర్మరాజు 'ఎవర్నువ్వు?!'
'బేండీకూట్'
'సమవర్తి భృకుటి ముడిపడింది 'విధాతగారు మాకు సమాచారం లేకుండా కొత్తజీవుల సృష్టిని ఎప్పుడు ఆరంభించారు?! యెనభైనాలుగు లక్షల రకాలు. రకానికో నలభై ఎనిమిది లక్షల జీవాలు. ఏది 'హరీ'మని ఇక్కడికొచ్చినా విచారించి పాపపుణ్యాలు బేరీజు వేయలేక మాకు చారులు కారిపోవుచున్నవి.' శివాలెత్తుతూ శివయ్యకు ఫిర్యాదు చేయాలని చరవాణికోసం వెదుకులాట ఆరంభించారా మృత్యుదేవుడుగారు.
చిత్రగుప్తులవారికిక జోక్యం  తప్పింది కాదు.
'ప్రభూ! 'బేండీకూట్' కొత్తజీవి కాదు. ఆంగ్లపదం. అచ్చమైన తెలుగులో దీన్ని 'పందికొక్కు' అందురు. తెలుగు గడ్డమీది గాదెల్లోని కందిపప్పు తెగ మెక్కు కొక్కు ఇది. ఈ సారే ఎందుకో తిన్నది అరక్క  చచ్చి ఇక్కడకు వచ్చిందిగానీ
'తెలుగు కందిపప్పు మెక్కిచచ్చే కొక్కుకి మరి ఆ ఆంగ్ల కొంకరభాష ఎందులకు?’ సమవర్తి చిందులు.
'అది మెక్కి చచ్చింది ఆంగ్ల కందిపప్పు కనక మహాప్రభో!' చిత్రగుప్తులవారి సముదాయింపు.
కాలదేవుడికి ఎక్కడో కాలింది 'యేమీ.. పరాచికములా! యముండ! పశ్చిమాన కందిపప్పన్న ఏమి తెలియునుతుచ్చమైన రంగు, రుచి, వాసనున్న ముక్కసరుకే గదా వారికి దిక్కు! ఈ తెలుగు కలుగుజీవికి ఆ ఆంగ్ల సంకరపప్పు తిని చచ్చు గ్రహచారం ఏల కలిగినట్లు?’
తెలుగునాటంతా ఇప్పుడు దొరికుతున్నది ఆ నాటుసరుకే కనక మహాప్రభో!’
యముండ! తెలుగు నేలల గురించి మాకు తెలియని చదువులా! బహు సారవంతమైన భూములు గదా వారివి. వరుణదేవుడి కరుణ కరువైననూ.. ఏడాదికి రెండు  పంటలు తీయు  గండర గండళ్లుగదా తెలుగు రైతన్నలు!'
'అమరావతి ఆహ్వానపత్రం చదివి పొరబడుతున్నట్లున్నారు ప్రభువులు. తమరు వర్ణించిన తెలుగు వైభవమంతా ప్రపంచీకరణం ముందటి కథ!’
తెలుగువారి పప్పులమీద జిహ్వచాపల్యంతోనే కదయ్యా  మన విష్ణుమూర్తులవారు ఏడుకొండలమీద తిష్ఠ వేసింది! అహా! ఆ స్వామికి  సమర్పించు వడప్రసాదాల రుచికి మా వడలూ పులకించుచున్నవి'
'ఆ వడలు  పులకించు వడలు అరక్కే నా కన్నా ముందు నా అర్థాంగి ఇక్కడకు వేంచేసింది'  కిసుక్కున నవ్వింది పందికొక్కు.
'పందికొక్కులకునూ మాతో పరిహాసములా! యముండ!' గుండెలు బాదుకొన్నారు యమధర్మరాజులుగారు.
'ప్రతిదానికీ మీరలా గుండెలు మోదుకోకండి మహాప్రభోమీరింకా ఆ క్షీరసాగరమధన కాలంనుంచి బైటపడలేకున్నారు!'
'నిజమేనయ్యా చిత్రగుప్తయ్యా! కంది ఏదో కలికాలంనాటి  శాకాహారుల మాంసాహారమని భ్రమపడుతున్నదిగాని పిచ్చిమంది.. 'జీవహింస మహాపాపం' అన్న భావంతో సత్యకాలంకన్నా ఎన్నో  యుగాలముందే  ముల్లోకాలు ఈ పప్పుదినుసుమీద ఆధారపడేవని ఎరుగదు.’
‘’నిజమే ప్రభూ! దానవులతో జరిగిన  భీకరయుద్ధాల్లో ఈ పప్పు ఎప్పుడు అగాధాలలో పడిందో ఎవరికీ తెలియదని వింటిని’ 
నాటినుంచేగదయ్యా దేవతలందరికీ కడగళ్లు మొదలయినవీ!. అలవాటు పడ్డ జిహ్వలాయ!’ ‘కనకనే కదా స్వామీ.. కమ్మని ఆ కందిముద్దల రుచిని వదులుకోలేక రాక్షసాధములతో  రాజీ కుదుర్చుకొని  మరీ పాలసముద్రంమీద  చిలుకుడు మొదలుపెట్టిందీ!’
లెస్సపలికితివి.  కందిని అందించేదే కదా కల్పవృక్షం! ఆ పప్పులో కలిసిన రాళ్లూరప్పలను  ఛేదించేది వజ్రాయుధం. ఉడికేందుకు ఉపయోగించేది అక్షయపాత్ర’,
తేలిగ్గా.. రుచిగా  ఉడికేందుకు తోడుపాలు ఇచ్చేది కామధేనువుకందిమూటలను సప్తలోకాలకు   చేరవేసేందుకు  ఐరావతం. కంది అమృతం అందరికీ అందుబాటులోఉండేందుకేగదా  ధనలక్ష్మీమాత ప్రభవించిందీ!’
ఆ లక్ష్మీసోదరుడు చందమామ అకాశంలో మెరుస్తూ అందరినీ అలరించగలుగుతున్నాడంటే అందులకు కారణం  కందిగింజ  ఆకారంలో ఉండటమేగదయ్యా చిత్రగుప్తయ్యా! అహో! మన దేవతలందరికీ ఆ కంది అమృతమెంత అపురూపమైనదీ!'
'చిత్తం చిత్తం మహాప్రభో! అమృతం ఉన్నచోటే హాలాహలమూ పుడుతుందంటారు. ఆ అమృతం వెలికి తీసేటప్పుడేగదా.. హాలాహాలం బైటపడి అంతలా కోలాహలం చెలరేగిందీ! కాలశివుడు సమయానికి అక్కడుండి  ఆ కాలకూటాన్ని అలా అంగిట్లో వేసుకోబట్టి కదా సర్వలోకాలూ  ఏమీ మూడకుండా బైటపడిందీ!’
మరి అదే ధర్మకార్యంగదా  మా బేండికూటులూ నిర్వహిస్తున్నది!’ అంటూ అడ్డొచ్చింది ఇహ వినే ఓపికలేక పందికొక్కు. ధర్మరాజులవారొక్కసారిగా చిరాకు మొహం పెట్టేసారు. పట్టించుకోదలుచుకోలేదు పందికొక్కు. ‘అవును మహాప్రభో! నాటైం బావులేక  ఖర్మకాలబట్టి చచ్చి ఇలా వచ్చాను. తమరు ధర్మస్వరూపులు. పూర్వాపరాలు  క్షుణ్ణంగా  విచారిస్తే నా  నిర్దోషిత్వం సత్వరమే తేలిపోతుందని మనవి
'గణాధిపతికి దీని వంశంతాలూకు చుంచెలుకలే యుగాలబట్టీ వాహనసేవలు అందిస్తున్నాయి మహాప్రభో! ఆయన నాయన శివయ్యమాదిరి  కాలకూట విషాన్ని మించిన టాంజానియా కందిపప్పును ప్రాణాలకు తెగించి మరీ  బొక్కుతున్నాయి ఈ పందికొక్కులు. ఆ ధర్మకకోణాన్నికూడా తమరు పరిగణలోకి తీసుకోవాల్సుంది
చిత్రగుప్తులవారి వత్తాసుతో సమవర్తి ధర్మసంకటంలో పడటం చూసి పందికొక్కు మరింత  రెచ్చిపోయింది. ‘మా లోకంలోని వ్యాపారులు మీ అంత మాలోకం కాదు  మహాప్రబో! అమెరికా, చైనాలను చూసి  బాగా ముదిరిన సజ్జు. పప్పుధాన్యాలు ఎక్కువ పండితే  లాభాలెక్కడ  తగ్గుతాయోనని దుర్భుద్ధి. సుక్షేత్రమైన భూముల్లో పప్పుకు బదులు పొగాకు, గంజాయిలవంటి మాదకాలను  ప్రోత్సహించే మదపురాయుళ్లకే వారి మద్దతు. అధిక దిగుబడి ఆశ చూపెట్టి  నాసిరకం  పప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నదీ ఈ దేశద్రోహులే. కళ్లేలమీదే వీలైనంత సరుకు  తక్కువ ధరకు రాబట్టిగిడ్డంగుల్లో పూడ్చిపెట్టి  కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు. బీదబిక్కీ పప్పులకోసం అల్లాడే స్థితికి తెస్తున్నారు. గద్దెభయం అనుక్షణం వెంటాడే ప్రభుత్వపెద్దలు ఖజానాసొమ్మే కనకఎవరికీ  లెక్కలు చెప్పనక్కర్లేదు కనక ఆ నాసిరకం సరుకునే బజారుధరకన్నా ఎక్కువ పోసి కొంటున్నారు. అంతా కలసి జనం సొత్తును పంచుకొని భోంచేస్తున్నారు
ముక్కపప్పు తిని బతికే పందికొక్కుకు ఇంత పరిజ్ఞానమా!’ నోరువెళ్లబెట్టేసారు  యమధర్మజులవారు. వెంటనే ధర్మవిచారణణ బాధ్యత గుర్తుకొచ్చింది. తేరుకొని  'పప్పు లేనిదే తెలుగువాడికి ముద్ద గొంతు దిగదు. పసిబిడ్డకు తినిపించే గోరుముద్దలనుంచి.. పితృదేవతలకు సమర్పించే పిండాల వరకు,, అన్నింటా కంది కంపల్సరీ! పెళ్ళంటే తెలుగువాడికి  పప్పన్నమే. తప్పుచేసినవాడి కాలుకూడా పప్పులో వేయించే అతిమంచివాడు తెలుగువాడు. మీ కందిమల్లె యోగివేమన కందిమీద వ్యామోహం చావక   'పప్పులేని కూర పాడు కూర'ని ఈసడించాడు. పప్పు పక్కనుంటే చాలు.. పంచభక్ష్యాలనైనా పక్కకు తోసేస్తాడు మీ తెలుగువాడు. కూర, కలగూర, పులుసు, పచ్చడి.. చివరికి పొడిచేసైనా సరే  కందిని ఓ పట్టుబడితేనేగాని తృప్తితీరా త్రేన్చదు  ఏ తెలుగు కడుపైనా!  తెలుగువాడికి అంత ప్రాణపదమైనదని తెలుసుండీ గాదెల్లో దాచుకొన్న కంది అమృతాన్ని దొంగతనంగా మెక్కడం ఓ పందికొక్కుగా నీవు  చేసిన ద్రోహం కాదా! తిన్న ఇంటివాసాలు లెక్కించే నీలాంటి విశ్వాసఘాతుకులకు  శిక్షేమిటో తెలుసా! మా నరకంలో శాశ్వతనివాసం!'
చిత్రగుప్తుల వారు ఘొల్లు ఘౌల్లుమన్నారు! యమధర్మజులవారిని అసుంటా పక్కకు  తీసుకు వెళ్లి చెవుల కొరుకుడు మొదలుపెట్టారు 'భూలోకపాలకులకుమల్లే తమరూ   కంగారు పడితే కొంపలంటుకొంటాయి మహాప్రబోపందికొక్కులు చూసేందుకే చాలా అల్పజీవులు! ఇవి తెచ్చి పెట్టే  ఉపద్రవాలు  కల్పాంతానికైనా  ఆగవు. అందినంతవరకే వాటికి గాదెలో కందులు  ఆహారం. ఏవీ అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పసికందులే అహారం. కుటుంబనియంత్రణంటే బొత్తిగా గిట్టని వీటికి మన నరకలోకం వీసా దొరికితే  మనగతేమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి మహాప్రభో! దీనికిప్పుడు తోడుగా ఓ ఆడజోడూ  తయారుగా ఉందిక్కడన్నది మరిచిపోకండి!’
యమధర్మరాజుల వారికి అంతా అర్థమయింది.మాట మెత్తబడింది. ‘నిజమేగానీ చిత్రగుప్తా! తీర్పు తిరగరాయడం కుదురుతుందా! చచ్చి ఒకసారి ఇక్కడికొచ్చిన ఏ జీవీ తిరిగి వెనక్కి వెళ్లడం కుదరదని  నీకు మాత్రం తెలీదా! ముత్తెమంత పుణ్యమైనా చేయని ఈ క్షుద్రజీవిని ఏ కారణం చూపెట్టి తిరిగి భూలోకానికి తరిమేయగలం! త్రిమూర్తులతో మాట రాదా!'
'ముత్తెమంత పుణ్యమేం ఖర్మ మహాప్రభో! ఈ పందికొక్కులు చేస్తోన్న ధర్మకార్యంముందు మన మహాదేవుడి శిష్టరక్షణకూడా ఏ మూలకు! గాదెల్లో దాచిన టాంజానియా కందిపప్పు కాలం గడిచేకొద్దీ కాలకూటంకన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరం. అయినా ఆ విషాన్ని ప్రాణాలకు తెగించి మరీ భోంచేస్తున్నాయి ఈ పందికొక్కులు. తద్వారా ఎన్ని  తెల్లకార్డుజీవుల ప్రాణాలు వల్లకాడు పాలుకాకుండా కాపాడుతున్నాయో గుర్తించవద్దా ధర్మప్రభువులు!’
‘’ తలపంకించారు యమధర్మజులవారు.
నిజమే కానీ.. ధర్మాసనంమీద అధిష్ఠించి ఉన్న దేవతనుఅక్రమాలు జరుగుతున్నాయని  తెలిసీ గమ్మునుండిపోవడం ధర్మమా! దోషులను దండించడానికే గదయ్యా ఈ దండం నా చేతికొచ్చిందీ!’
చిత్తం మహాప్రభోకందిపలుకు కిలో రెండువందలు పలుకుతోంది కిందిలోకంలో ప్రస్తుతం. ఏం కొనాలో.. ఏం తినాలో తేలక తికమక పడుతున్నది సామాన్యప్రజానీకం.  ఆ కాలే కడుపులు సభల్లో చెప్పులు విసురుతున్నాయి. సచివాలయాలముందు  నిరసనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని  శాంపిల్సు మాత్రమే! అసలు ఎన్నికల మొసళ్ల పండుగలు చాలా ముందున్నాయి స్వామీ..  కందిపోటు దొంగలతో   మిలాకత్తయే  సర్కారు పెద్దలందరికీ!’

భళా! అర్థమయిందిలేవయ్యా! పదవి పోయి.. పరువు పోయి.. ప్ర్రాణాలు పోయి.. ఇక్కడికొస్తారుగా ఆ  పెద్దమనుషులుఅప్పుడు చూపిస్తా నా దండం తడాఖా!’ కసిగా  మీసాలు మెలేసుకోసుకొన్నారు అధర్మదండనాథులు.
కందిపోటుదొంగలు గాదెల్లో దాచిన కాలకూటవిషం  ఎంత మెక్కినా నీ ప్రాణాలకింక ఏ ఢోకా ఉండదు గాక!  నువ్వింక నీ లోకానికి సతీసమేతంగా సురక్షితంగా వెళ్లిపోవచ్చు! అసలు పందికొక్కుల్నిక్కడికి తొందరగా రప్పించు ధర్మకార్యంమాత్రం మర్చిపోవద్దుపందికొక్కు వైపు తిరిగి ప్రసన్నంగా ఆదేశించారు  యమధర్మజులవారు.  
ప్రభూ!.. తరువాతి విచారణ,,’ చిత్రగుప్తులవారింకో కొత్తదస్త్రం తీయబోతుంటే  'బాగా డస్సిపోయానయ్యా చిత్రగుప్తయ్యా! అత్యవసరంగా  రెండు కమ్మపొడి ముద్దలు వేడి వేడిగా  వెన్నకాచిన నేతిలో ముంచుకొని మింగితేకానీ.. మళ్లీ విచారణకు నాకు శక్తి రాదు' అంటూ లేచి నిలబడ్డారు యమధర్మజులవారు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(చిత్రకారులకు క్షమాపణలు. ధన్యవాదాలు- రచయిత)




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...