Friday, February 12, 2016

అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం

"ఈనాడు ఆదివారం సంపాదకీయాలకు సంబధించి నాకు తోచిన నాలుగు మాటలు.
ఈనాడు ఆదివారం సంపాదకీయం  ఒక రకంగా తెలుగు పాఠం. ఆదివారంనాటి  సంపాదకీయం  సాహిత్యవిశేషాలతో  పుష్టిగా ఉంటుంది.  సంపాదకీయం ఉటంకించే సంగతులు ప్రధానంగా పురావైభవానికి సంబదించినవి.  శిష్టగ్రాంధికం సజీవ ప్రదర్శనకు అక్షర  వేదిక ఆదివారం సంపాదకీయం.   ప్రాచీనసాహిత్యక్షీరం  మధించి తీసిన  వెన్నముద్దరుచి పదప్రయోగాలు.. మీగడతరకతీపి పెద్దలసూక్తులు బారులు తీరి అలరించే పద్యపాదాల.. పదాలకొలువు ఈనాడు సంపాదకీయం. భాషలో పొదుపు  ఈ రచనల ప్రత్యేకత. సాధారణ పాఠకుడికి  సాహిత్య పరిజ్ఞానం రేఖామాత్రంగానైనా అందించాలన్న ఆరాటం ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. దైనందిక వార్తావేదిక అయినందువల్లనేమో సమకాలీన స్పృహనూ  సంపాదకీయం విస్మరించ జాలదు. ఆ వారం జరిగిన ఏదైనా విశేషాన్నో.. ఆదివారానికి అటూ ఇటుగా వచ్చే ప్రత్యేకదినోత్సవాన్నో.. ఏదీ లేదంటే విశ్వవ్యాప్తంగా విజ్ఞానశాస్త్రాల్లో వికసించే  నవ్యపరిశోదనల్లోనుంచి విత్యవ్యహారానికి సంబంధించి ఉత్సుకత పెంచే ఆంశాన్నో..  సూత్రంగా మలుచుకొని  అందంగా అల్లే మూడుమూరల పదకదంబం ఆదివారం సంపాదకీయం.  'భళా!' అనే రీతిలో సాగి సానుకూల ఆలోచనలతో స్వస్తివాక్యం పలికే  ఈ తరహా సంపాదకీయాలు నాకు తెలిసి తెలుగులో నాటికీ నేటికీ ఈనాడులోనే నిరంతరాయంగా వస్తున్నాయనిపిస్తుంది. సాధారణంగా వీలున్నంత వరకూ   ఈ సంపాదకీయభ్రమరం తెలుగురుచి కుసుమం చూట్టూతానే పరిభ్రమించడమూ అభినందనీయం.
చక్కని చిక్కని శిష్టతెలుగులో కృషిచేయాలని
కోరుకొనే సాహితీ ప్రేమికులకు ఈనాడు ప్రతీ ఆదివారంనాడు ప్రచురించే సంపాదకీయం ఓ నమ్మదగిన తోడు"
***


అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం
కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు  'లాములు' అంటాడు. 'నాన్నపేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు ' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న.  అమ్మతోనే కానీ..ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు.. పాపం..ఆ బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక
తిప్పటం రాని రాముని కళ్ళలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం  ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న- పాప కనుపాప కన్న ఎక్కువ అనటం  'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను  తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత  వాత్సల్యాన్ని ప్రసిద్ద ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్  మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన  చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా  అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం

  వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడలేదు.   వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా!' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మంటే అది. హిందువులు  సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.



ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ  అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం
కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిం దల్లియు నంచు నుండుదుము..యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్థమై రేపల్లె వచ్చిన  సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన  ఈశానాం(లక్ష్మీ దేవి) ఈశిత్రి( జగత్తు)ని అమ్మలా పాలిస్తుందని పరాశరబట్టర్ ద్వయమంత్ర శ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు  చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన  గొప్ప సంపద అమ్మే' అని కదా  శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లా చల్లని దయమీదో చక్కని  అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుని మేనత్త  గోతమి, బహాయీల తాయి  తాహిరి, మహావీరుని తల్లి  త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాలని దేశకాలాలని ఎల్లలేముంటాయిగ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్‌లో తల్లులందరికీ  'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాళ్టి రోజును  మరెన్నోదేశాలూ తల్లికి నివాళులిచ్చే  ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ అవడం అబ్బురం కాదు.



కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్నిఅడిగాడు ఓ సత్యాన్వేషి  'అమ్మ' అంటే  ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!'అని దేవుడి  ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకుల'ని సమాధానం. మానవులతో పని కాదని చివరికి  పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో  ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి  తన పెదాల మీదే  సదా 'అమ్మా!'లా   దాగుండేదే అమ్మేనని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా'. తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' 'ఆపదవచ్చినవేళ నారడి బడినవేళ/పాపపు వేళల భయపడిన వేళ/వోపినంత హరినామమొక్కటే గతి..' అనే అన్నమాచార్యులవారి సంకీర్తన హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అడ్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం..తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ..పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా?బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరిదశన కాస్తింత చెట్టునీడ కరవవుతున్నది.పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి  'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్నిఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన  ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు.. అమ్మ పాదాలు కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు  నిజమైన పండుగ. ఈ 'అమ్మల పండుగ' నుండైనా చాలు..  అమ్మ మేలుకు బిడ్డలు పునరంకితమవుతే.. అదే పదివేలు.
***
(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో- కృతజ్ఞలతో)

Saturday, February 6, 2016

పాడు రాజకీయాలు- సరదా గల్పిక


ఆహారభద్రత సోనియాజీ మానస పుత్రిక. చట్టసభలో దాని గతి ఏమవుతుందోనన్న దుగ్ధతోనే  ఆతల్లి ఆరోగ్యంపాడయిందని అప్పట్లో  వార్త. రాజకీయ నేతలను వూరికే ఆడిపోసుకుంటాంగానీ రాజకీయాలంటే ఆట కాదు. ప్రాణాలతో చెలగాటం.

లక్షలకోట్ల  అక్రమార్జన కేసులో ఏడాదికిపైగా
  జైల్లో మగ్గాడు.. పాపం! పాడు రాజకీయాల జోలికి వెళ్ళకుండా వుంటే ఇంచక్కా లోటస్ పాండు ప్యాలెస్ లో కాలుమీద కాలేసుకుని  చెలాయించాల్సిన దొరబాబు కాదూ జగన్ బాబు!  ఇంటికూటిక్కూడా కొర్ట్లెంటబడి దేబిరించాల్సిన దుస్థితి. బెయిలైనా రాకుండా బెడిసికొట్టడానికి పీడాకారం పాలిటిక్సే కారణం. బ్యాడ్ పాలిటిక్స్! బెయిలుమీద వచ్చి బైట చెడతిరుగున్నా.. ఏ నిమిషంలో ఈ. డీ .. సి బి ఐ మళ్లా పిల్చి చేతులకు బేడీలేస్తారోనన్న దిగులు  ఆ మొగంలో దాచుకోడం ఎంత దయనీయమైన దుస్థితి!

పనికిమాలిన  రాజకీయాల్లోకి రాకుండా వుండుంటే ఈ పాటికి ఎంచక్కా ఏ ప్రపంచబ్యాంకు చీఫుగానో పదవీ విరమణ చేసుండాల్సిన పెద్దమనిషి చంద్రబాబు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపానికి పదేళ్ళుగా పడరాని పాట్లు పడ్డాడు! ఎప్పుడు చూసినా ఏవో యాత్రలు..జాతర్లు. పుళ్ళుపడ్డ కాళ్ళకు చెప్పులైనా లేకుండా పాపం గట్టిరోడ్డుమీద గట్టిగా నాలుగడుకుగులైనా పడని పరిస్థితి. దేశాన్ని నడిపించాల్సిన దీర్ఘదర్శి స్వయంగా నడవలేని స్థితి పాడురాజకీయాల జోళ్ళల్లో కాళ్ళు పెట్టడం వల్ల కాదూ! ఇంత చేసీ చీలికలైపోయిన పదమూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిన తరువాతైనా సుఖపడుతున్నాడా! సుఖంగా నిద్రపోతున్నాడా!

ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా    'కర్రీ-పాయింట్' పెట్టుకోమని ఎద్దేవా
చేసేవాళ్ళు! 'సభాపతిగా పదిమందిచేత 'శభాష'నిపించుకున్నానన్నతృప్తి రెండ్రోజులైనా మిగ లేదు.  పైన అక్కడ అధిష్టానానికీ గులాం.. కిందిక్కడ అడ్డమైనవాళ్ళకీ సలాం! క్రికెట్టాటను నమ్ముకున్నా ఈ పాటికి  ఏ పెద్ద స్టారుహోదాలోనో వెలుగుతుండాల్సింది మన కిరణ్    సారు. క్షణభంగురమైన రాజకీయాలనిలా నమ్ముకున్నందువల్లే కదా ఇన్నేసి భంగపాట్లు కుమార్ సారుకి!

తోటి ఆడపిల్లలు హాయిగా కాపురాలు చేసుకుంటుంటే.. షర్మిలమ్మకే పాపం యాత్రలెంట యాత్రల తిప్పట. పుట్టింటివాళ్ళు పుట్టెడు రాజకీయ దుఃఖంలో కొట్టుమిట్టాడుతుండబట్టి కాదూ అన్న విడిచిన బాణంలా అన్నేసి ఊళ్ళ సంచారం లేతవయసులో ఆ పిల్లకు! పగవాడిక్కూడా రావాలని కోరుకోరానిది బాబూ పాలిటిక్సు కుటుంబంలో ఆడపిల్ల పుట్టుక!

అన్నెం పున్నెం ఎరక్కపోయినా అటు కట్టుకున్న మనిషి .. ఇటు కన్నపేగు
పాలిటిక్సుని పట్టుకుని వేళ్ళాడబట్టేగా.. బైబిల్ చేతబట్టి కన్నీళ్ళు పెట్టుకుంటో దీక్షలు చేపట్టాల్సొ చ్చింది విజయలక్ష్మమ్మతల్లికి పెద్దవయసులో! ఐనా రాజకీయాలింకా లాభసాటి బేరమేనంటే.. ఇహ  చెప్పేందుకేముంది.. చెప్పుతో చెంపలు పగిలేట్లు కొట్టుకోడం తప్పించి!

తప్పు చేసిన వాణ్ని తన్ని ఊరుబౖటికి తరిమేసే శిక్ష అమల్లో ఉండేది ఒకానొకప్పుడు. నిండా పబ్లిక్కుని ముంచిన గూండాభాయీలుకూడా గుండీలిప్పుకుని మరీ నడిబజారులో ఊరేగే రోజుల్లో.. పాడు పాలిటిక్సులో దూరి పులిమీద స్వారీ ఏ శనిముహూర్తంలో 'తూచ్' మని తుమ్మి ఆరంభించాడో కానీ కె సి ఆర్ సార్.. సెల్ఫ్ఎగ్జైల్ మోడల్లో ఏడాదిలో సగం  ఫాం-హౌసులోనే మంత్రాంగం. వయసు ముదరక ముందే వానప్రస్థమంటే.. మరి సన్నాసి  రాజకీయాల పుణ్యఫలమా కాదా? సరే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణా అంటూ రాష్ట్రం  చేతికొచ్చినాక జనంలో కాక ఉన్నంతా కాలం రాజ్య  చెల్లుతుందనుకో! అయినా.. ఆ నడినెత్తిమీద ఎల్లకాలం ఓ పిడిబాకు వేలాడుతూనే ఉంటుంది కదా.. పాడు పాలిటిక్సు మూలకంగా ఎవర్ని ఎప్పుడు ఎంతమేర నమ్మాలో కొలుచుకుంటూ కూర్చోవాల్సిందేగదా కుర్చీమీద మమకారం పోనంతకాలం!  

డాలర్లు డ్రాచేస్తూ డాబుగా తిరిగేటి  తారకబాబుకు ఎవరు నూరిపోసారోగాని
పాపం.. రొచ్చుగుంట రాజకీయాలలోకొచ్చి పడ్డాడు చివరికి! యునైటెడ్ స్టేటులో ఎస్టేటులు కొని సెటిలయ్యే సుఖమెక్కాడా ? సెటిల్మెంటారోపణల్ని ఖండించుకుంటూ దినాం స్టేట్ మెంటులిచ్చుకోవాల్సిన దుఃఖమెక్కడా? చాయిస్సులో చెత్త రాజకీయాలకు టిక్కు పెట్టబట్టేగా ఇన్ని ఇక్కట్లు వచ్చి పడేది!

సభల రభస ఇహ చెప్పనలవి కాని అడవిగోస. ఆ కంఠసోషకు అంతే
ఉండదు. ఎప్పుడే మూలనుంచి చెప్పులొచ్చి పడతాయో తెలీదు. చప్పున వగదిగించుకు దిగిపోదామంటే  పక్కమనిషి ఎక్కడెక్కుతాడోనని అదో దిగులు. ముక్కూమొగం తెలీని వాడితో కలిసి దిగే ఫొటోలతో ఎప్పుడే చిక్కో.. అదో మిస్టరీ. ఖర్మ.. అడ్డమైనవాడి చేతులు గాట్టిగా  పట్టుకుని గాల్లోకి వూపుతూనే ఉండాలి. వూపి వూపి వేళ్ళు వాచిపోతే రెండు ముద్దలు కడుపునిండా తింటానికైనా ఉండదుఎవరెవరితోనో కావలింపులు. నెత్తిమీదకి కొమ్ముల తలపాగాలు. భుజంమీదకి నల్లమేకలు. తప్పనిసరి ఈ  తలనొప్పంతా రాజకీయాల వల్లొచ్చిన తిప్పలవల్లేనంటే కాదంటావా? అనగలవా!

వచ్చినా రాకపోయినా  పిచ్చిచిందులు. ఇంట్లో బిడ్డనుకూడా మనసారా ఎత్తుకునాడించేందుకు పెళ్లంటూ ముందొకటి ముగించుకోవాలి కదా! దానికి సమయం దొరకదు కానీ.. ఎవరెవరో కన్నబిడ్డల్ని గారాబం చేసేందుకు సమయం దొరకబుచ్చుకోవాలి. కారే ముక్కూమూతుల్ని ఆప్యాయంగా తుడవాలి. ఈ రోతంతా రోజంతా నటించే దౌర్భాగ్యం కేవలం రాజకీయాలని ఓ కెరీరు కింద తీసుకోక తప్పని కుటుంబంలో పుట్టిన ఖర్మాన కదా పాపం రాహుల్ బాబుకి!

చిత్రాల్లో చేస్తే  చచ్చే పేరొచ్చే నటనంతా చచ్చినట్లు చేసినా చివరికి మిగిలేది
  'చీ' 'చా' అనే చీదరలే రాజకీయాల్లో! మెగాస్టారు  చిరంజీవిని ఆడిగి చూడు ..ఈ రాజకీయజీవితం అంటే ఎంత వెగటో తెలుస్తుంది!

ప్రైవేట్ లైఫంతా పబ్లిక్కేనాయ. చట్టసభలో కాస్తంత  కంటిరెప్ప కిందకి వాలితే .. కుంభకర్ణుడుతో పోలిక! సరదా పడి వీడియో చూసినా దసరాబుల్లోడు తొడుగులు. పండగనాడైనా నిండాసంతోషంతో పేకాటా, పందేలని పబ్లిగ్గా కనపడేందుకు లేదు. పడగ్గదిక్కూడా ఎవడో కెమేరా అమర్చిపెట్టుంటాడని డౌటు. వంటినొప్పులకని  కంటికి నదురైన పాపచేత కాస్త కాపడం పెట్టించుకున్నా..   ఇహ చూడు.. నిన్నా పరమేశ్వరుడైనా  కాపాడలేడు. కోరి తెచ్చుకునే కొరివి కాదని ఎవరనగలరీ రాజకీయాలని!
కడుపు కాలుతున్నా దీక్షలు చేపట్టాలి. దిష్టిబొమ్మలవతారాల్లో లక్షలసార్లు  తగలబడాలి. ఇహ సిబిఐ మొగుడు.. ఉండనే ఉన్నాడు. మీడియా ఎప్పుడే కూర వండుతుందో తెలీదు. నానాయాగీ చేస్తే నాలుగు డబ్బులు కూడినా.. లెక్కలు అడిగే యముళ్ళే దిక్కునుంచొచ్చి పడునో.. యూ నో.. చెప్పడం కాదు.. ఆ ముదనష్టం లెక్కలు  ఎక్కడా దొరక్కుండా నచ్చచెప్పడంలోనే ఉంది అసలు కష్టమంతా! ఇంత గడించినా  గదిలోపల గడియేసుకుని  చూసుకుని మురుసుకోవాల్సిందే గాని  అనుభవించే యోగం నుదుట రాసున్న నేత ఎక్కడున్నాడురా ఈ కాలంలో! పైవాడి హుండీలో అజ్ఞాత దాతగా  తోయడానికి, కిందివాడి చేతిలో ఎన్నికలవేళ పోయడానికే ఇన్నేసి కోట్లు.. ఆ ముదనష్టాన్ని సంపాదించడానికి  పడరాని పాట్లు. ఏ కాస్త బుర్రా బుద్ధి వున్నా  ఈ బురదగంటలోకి చూస్తూ చూస్తూ ఎవరూ కాలెయ్యరు."
"ఇదంతా ఇప్పుడు నాకెందుకన్నా చెబుతున్నావూ?!"
"రేపొచ్చే ఎన్నికల్లో మన నియోజకవర్గాన్నుంచి పోటీ చేసే ఆలోచన నువ్విప్పుడైనా మానుకుంటావని! కాలరు మాయని పనులు సవాలక్ష రకాలున్నాయిరా నీకు.  ఈ మాయదారి రాజకీయాలు దేనిగ్గానీ నీకు..  దేనికీ పనికి రాక బేవార్సుగా తిరిగే మా పెద్దబ్బాయున్నాడు..  చూడు.. వాణ్ని నిలబెడదామా  ఈ సారికి"
-కర్లపాలెం హనుమంతరావు


***

Thursday, February 4, 2016

చేలాంచలము- చిన్నకథ- కౌముది మరీ చి.క కాలమ్ ప్రచురితం


అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు. ఇది తరుణంకాదుఅని తిరస్కరించాడు అబ్బాయి.
అబ్బాయికి యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే  ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా! అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ.. చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ ముచ్చట్లు తీర్చుకోనీయవోయి  సుందరీ!' అంటూ వచ్చినదారే చూపించాడు ఆ సుందరికి  బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి విరమణ అయిపోయింది. కాలసినంత తీరిక. బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు  కానరావడం లేదు!
స్వప్నసుందరి దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు.. అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల బలహీనతలున్న అబ్బాయిగారు  కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడదని గొణుక్కున్నాడు    మగతనిద్రలోనే అబ్బాయిగారు!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)

Wednesday, February 3, 2016

పోతన హాలివుడ్ టెక్నిక్- ఓ సాహిత్య గల్పిక


కాలం  తెలుగుపిల్లసజ్జుకి ఏ బి సి డి.. అంటూ అమ్మ కడుపునుంచి ఊడిపడ్డ మరుక్షణంనుంచి అర్థమయీ అర్థంకానీ ఆంగ్లాక్షరాలు బట్టీయం వెయ్యడం మినహా.. - అమ్మ.. - ఆవు.. - ఇల్లు.. - ఈశ్వరుడు.. అంటూ తనకు పరిచితమయిన పరిసరాలనుంచి ప్రాపంచిక జ్ఞానాన్ని అలవర్చుకొనే అవకాశం బొత్తిగా సన్నిగిల్లిపోతోంది! ప్రపంచీకరణ ప్రభావంతో పాశ్చాత్యలోకంవైపుకి, డాలర్లమీదకి, పడమటి డాబు-దర్పంమీదకి శృతిమించిన ఆకర్షణ పెంచుకొన్న తల్లిదండుల పెంపకంలో పెరిగే పిల్లలకు ప్రాథమికదశలో అందవలసిన మౌలిక జ్ఞానం అందడం లేదు!
పసితనంలో  పుష్టికరమైన ఆహారం లభించని బాలలకు ఎదిగివచ్చిన తరువాత అణిగివున్న రోగాలు అమాంతం  కమ్ముకొంటాయని ఆరోగ్యనిపుణుల అభిప్రాయం. విజ్ఞానమూ ఆహారం వంటిదే!మెదడుకు మేత! బాల్యదశలో అందవలసిన మాతృసంబంధమైన  పౌష్టికవిజ్ఞానం మేథోవ్యవస్థకు  సరైన పాళ్లలో అందని వారందరూ   ఎదిగి వచ్చిన తరువాత    ఆత్మన్యూనతనే రుగ్మత పాలవుతారు.   పరాయితనంమీద  అపరిమితమైన మోజు.. సొంతతనంమీద విపరీతమైన  చులకన ఈ రుగ్మత లక్షణాలు. వెరసి వెన్నెముక బలంగా లేని పై మెరుగుల డొల్లయువతతో తెలుగునేలలు రెండూ నిండిపోయే  ప్రమాదం ముందు పొంచి ఉంది.
ఇదంతా ఇప్పుడు అనుకోవడానికి ఒక కారణం ఉందిమా టీవీలో
చిత్రనటుడు   నాగార్జున నిర్వహిస్తున్న  'మీలో కోటీశ్వరుడు ఎవరు?' కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి సంబంధిచిన చిన్నపాటి ప్రశ్నలు ఎదురైనప్పుడు  బి.టెక్కులవంటి పెద్ద చదువులు పూర్తి చేసిన అభ్యర్థులుకూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోతున్నారు! భారతం రచించిన కవిత్రయం వరసను సరిన క్రమంలో గుర్తించింది ఏడుగురిలో కేవలం ఇద్దరుబమ్మెర ఇంటిపేరుగాగల కవి రాసిన కావ్యం  ఏమిటి?' అన్న ప్రశ్నకు 'శ్రీ మదాంధ్ర మహాభాగవతం' అన్న సమాధానం చెప్పగలవారు ఎందరుంటారో ఎవరికి వారే ఊహించుకోవాలి
తేటతెలుగులో బమ్మెర పోతన అత్యంత అద్భుతమైన ప్రతిభా వ్యుత్పత్తులతో సంస్కృత భాగవతాన్ని అనువదించిన సంగతి నేటి తరానికి ఎవరైనా చెబితేనేగదా తెలిసేది! పేరుకే   అనువాదం కానీ..  ఆ రచన  అక్షరమక్షరంలో  ఆంధ్రుల మహాభాగవతమేనని, బమ్మెర గ్రామంలో పుట్టి పెరిగిన పోతన తన సహజ ప్రతిబా సామార్థ్యాలతో దాదాపుగా ఒక  స్వతంత్ర రచనలాగా సాగించిన  ఆ భాగవతంలోని ప్రతి పద్యమూ.. దేనికదే  ఓ రసధుని మాదిరి  చదువరుల చవులూరిస్తుంటుందని పెద్దలకు తెలిస్తేనే గదా పిన్నలకు నూరిపోసేది!
పోతన భాగవతం చదివి సంబరపడేందుకు  దైవభక్తే ఉండనవసరం లేదు. భగవంతునిమీద విశ్వాసంతో నిమిత్తం లేకుండా ఆ పురాణంలోని ప్రతి పద్యాన్ని తుదికంటా ఆస్వాదించే నాస్తికులు ఎందరో ఉన్నారు.   ఉండవలసింది రసహృదయం! ఇప్పుడే ఏదో ఓ వ్యాసానికి సమాచారం సేకరించే పనిలో ఉన్నప్పుడు  అనుకోకుండా పోతన భాగవతంలోని వామనావతార ఘట్టంలోని రెండు పద్యాలు కంటబడ్డాయి! మనసు నిండింది.
'ఇంతింతై వటుడింతయై , మరియు దా నింతై , నభో వీధిపై
నంతై , తోయదమండలాగ్రమున కంతై , ప్రభారాసిపై
నంతై , చంద్రునికంతయై , ధ్రువునిపై నంతై , మహర్వాటిపై
నంతై , సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై'
ఒక పద్యమైతే
'రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై , శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్'
అనేది రెండో పద్యం.
మొదటి పద్యం ఎక్కడో ఓ చోట ఏడో ఓ సందర్భంలో  అరకొరగానైనా చెవినబడని తెలుగువాడు ఉండడనే అనుకుంటున్నాను. వాటి అర్థ తాత్పర్యాలువివరాల జోలికి  వెళ్లడం ఇప్పుడు నా ఉద్దేశం కాదునా విస్మయమంతా రెండో పద్యం టెక్నిక్కుని గురించే!

సూర్యబింబం ఆకాశంలో అక్కడే ధగధగా వెలుగుతోంది. దానికి అడ్డుగా  భూమ్మీద నిలబడి  ఉన్న వటుడు బలిముందు  క్రమంగా పెరిగే విధానం పద్యాంశం. From Bali  point  of view..  అవతారమూర్తి ఎదుగుదలను వివరించాలన్న ఆలోచన పోతనామాత్యుడికి రావడం ఆశ్చర్యం
సూర్యుడు ఓంప్రథమంగా వటుడి  నెత్తిమీది గొడుగులాగా, తరువాత నెత్తిన మెరిసే మణిలాగా.. ఆ తరువాత తళుకులీనే చెవిపోగులాగా, ఆ తరువాత మెడలో ధగధగలాడే ఆభరణంలాగా.. అదే క్రమంలో వరుసగా  చమక్కుమనే భుజకీర్తిలాగా, ముంజేతి కంకణంలాగా, నడుముకు చుట్టుకునే వస్త్రం  మెరుపంచులాగా.. అలా కాలిఅందెలా   మెరుపులీనుతూ  చివరికి  పాదపీఠం స్థాయికి సూర్యభగవానుడు దిగివచ్చే 'సాపేక్ష సిద్ధాంతంఊహించాడు  మహానుభావుడు బమ్మెర పోతనామాత్యుడు!
ఒక  కదలనివస్తువు పరంగా   దానిముందు కదిలే   మరోవస్తువు కదలికలను వర్ణించవచ్చన్న ఆలోచన ఆ పల్లెటూరి కవిరైతు బుర్రలోకి  15వ శతాబ్దంలోనే రావడం ఒక అద్భుతమైతే.. దానిని  హాలివుడ్ చిత్రాల  సాంకేతిక స్థాయితో పోల్చదగ్గ చమత్కార పంథాలో  తెలుగుదనం పరిమళం చెదిరిపోకుండా   రసజ్ఞులైన చదువరులకు  కిక్కొచ్చే విధంగా అందమైన ఛందో పదబంధాలలో బందించి మరీ అద్భుత పదచిత్ర విన్యాసం చేయడం మరో అద్భుతం!
ఇవాళ స్పీల్ బర్గ్ హాలివుడ్ చిత్రాల్లో చూపింఛే పనితనం ఆరు శతాబ్దాల కిందటే  ఆంధ్రదేశంలోని ఓ మారుమూల పల్లెలో  హాలికవృత్తి చేసుకొనే కవిపోతనకు ఎలా అబ్బిందో?!  అద్భుతం అనిపించదా ఆలోచిస్తున్న కొద్దీ!
 పోతన తెలుగువాడు అవడం.. తెలుగులో భాగవతం రాయాలన్న సంకల్పం ఆ మహానుభావుడికి  కలగడం.. తెలుగుభాష చేసుకొన్న అదృష్టంఆ అదృష్టం అందుకోలేని వాతావరణంలో నేటి బాలబాలికలు పెరగడం వారి దురదృష్టం!
-కర్లపాలెం హనుమంతరావు

Tuesday, February 2, 2016

గురక- మరీ చిన్నకథ- కౌముది


పద్మావతి అందం చూస్తుంటే  ప్రబంధకవులకు మాట పడిపోయుండేది. మహారాజులకైతే మతి తిరగబడుండేది. మామూలు మాచవరం నాగేశ్వర్రావు సంగతి ఇహ చెప్పాలా.. పెళ్ళిచూపులప్పుడే ఫ్లాటయిపోయాడని!
బి.కాం రెండుసార్లకు ముక్కి, అడ్డమైన దేవుళ్లకు అడ్డదిడ్డంగా మొక్కి.. సాధించిన బోడి ఏ.జీ ఆఫీసు ఎల్డీసిగాడు నాగేశ్వర్రావు. కాకి ముక్కుకు దొండపండులా దొరికిందని పెళ్ళికొచ్చి అక్షింతలు వేసినోళ్ళందరూ నోళ్ళు నొక్కుకొన్నారు. కుర్రకారైతే కుళ్ళుకొని చచ్చారు.
పద్మావతి నాయన బడిపంతులు కావడం.. మరో ముగ్గురు ఆడపిల్లలక్కూడా పెళ్లి పేరంటాలు చేయవలసిన తండ్రి కావడం.. నాగేశ్వర్రావుకి కలిసొచ్చింది. సరే.. ఇప్పటి మన కథ అది కాదు.
మొదటి రాత్రి మాటా మంచీ అయింతరువాత పుస్తకంలా పడి నిద్రపోతున్నప్పుడు నాగేశ్వర్రావు చెవిలో ఏదో నాగుపాము బుస వినిపించింది ఆగకుండా! చీమ చిటుక్కుమన్నా లేచిపోయే దౌర్భాగ్యం అతగాడిది. లేచి లైటు వేసీ వేయంగానే బుస ఆగి పోయింది! లైటు తీసిన రెండు నిమిషాలకే మళ్లీ మొదలయింది!రాత్రంతా ఇదే కథ!
మర్నాడా విచిత్రం కొత్తల్లుడు బైటకు చెప్పినా అత్తారింట్లో ఎవరూ కిక్కురుమననే లేదు. రెండో రాత్రి పద్మావతే మిస్టరీ విడదీసింది.  ‘చిన్నతనంనుంచి నాకు నిద్రలో గురక పెట్టే జబ్బు. ఎన్ని మందులు మింగినా లాభం లేకపోయింది. ఈ సంగతి  ముందే మీకు చెప్పమని మా వాళ్లతో శతపోరాను. చెప్పినట్లు లేరు' అని వెక్కి వెక్కి ఏడ్చింది.
కొత్తపెళ్లాం కొత్త బెల్లం. పద్మావతితోపాటు పద్మావతి గురకనూ మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానించేందుకే గుండెను రాయి చేసుకొన్నాడా క్షణంలోనే నాగేశ్వర్రావు.
కాలం గడిచి.. పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు పెరిగి.. పెద్దయి.. వేరే దేశాలకని ఎగిరి వెళ్ళిపోయినదాకా.. పద్మావతి గురక రహస్యం ఆ ఇంటి నాలుగ్గోడల మధ్య మాత్రమే మిగిలిపోయి గుట్టు. భారతీయులం కనక కుటుంబ బాంధవ్యాలు అంత బలంగా ఉంచుకొంటాంగానీ.. వేరే దేశంలోకి సీను మారంగానే  మన మనస్తత్వాలనూ అంతే వేగంగా  మార్చేసుకొంటాం.
కూతురు కాన్పుకోసమని ఆర్నెల్లకు అమెరికా వెళ్లిన పద్మావతి.. మూణ్నెల్లు తిరక్కుండానే  ఇండియా తిరిగొచ్చేసిందికొడుకు పిలిచాడని పడుతూ లేస్తూ వెళ్ళిన నాగేశ్వర్రావు దంపతులు.. మూడునెల్లు కూడా ఉండలేక మళ్లా అలాగే  తిరిగొచ్చేసారు.
కొడుకు కూతురులాగా.. అల్లుడు కోడలులాగా.. అత్తగారి గురకకు  అడ్జస్టవాలని లేదుగా!
గుట్టు చప్పుడు కాకుండా ఇండియా వచ్చి పడినా భగవంతుడి పరీక్షలు ఆగలేదు. ఉన్నట్ట్లుండి పద్మావతి గుండెనొప్పితో పెద్దాసుపత్రిలో చేరడం,, చూడ్డానికొచ్చిన బిడ్డలిద్దరి చేతుల్లో భర్తను పెట్టి కన్నుమూయడం! లఘుచిత్రం చూసేంత  సమయంకూడా పట్టలేదు కథ ముగింపుకి రావడానికి!
ఫ్లాప్ పిక్చర్ ఆడే డొక్కు థియేటరులాగా నిర్మానుష్యంగా ఉందిప్పుడు నాగేశ్వర్రావు కొంప. తమ దగ్గరికి పిలిపించుకోడానికి సమయం పట్టేట్లుందని మధ్యంతర ఏర్పాట్లంటూ ఓ కొత్త పద్ధతి కనిపెట్టి ఓల్డేజి హోముకు తండ్రి బాధ్యతలు అప్పగించిపోయారు బిడ్డలిద్దరు.
అంతా బాగానే ఉంది. వేళకు తిండి.. వ్యాయామం.. తనలాంటి ఇరుగుపొరుగుతో మాటా మంతీ! చీకటి బడటంతోనే  దిగులు మొదలవుతున్నది నాగేశ్వర్రావుకి. కంటినిండా నిద్ర పోయింది పద్మావతి పక్కలో పక్కనున్నరోజుల్లోనే.
ఎన్ని మందులు మింగించినా.. ఎన్ని కొత్త  వైద్యాలు ప్రయోగించినా నాగేశ్వర్రావుమీద ఫలితం చూపించలేక పోయేసరికి చేతులెత్తేసారు ఓల్డేజి నిర్వాహకులు.
సొంత వైద్యం ఆలోచన అప్పుడొచ్చింది నాగేశ్వర్రావుకి. భార్య ఫొటో పక్కనుంచుకొని.. ఆమె గురక రికార్డు ప్లేయర్లో ఆన్ చేసుకొంటే కంటిరెప్పలు కిందికి వాలుతున్నాయిప్పుడు!
పెళ్లయిన కొత్తల్లో పెళ్లాన్ని టపట్టించేందుకు దొంగచాటుగా రికార్డు చేసిన గురక కేసెట్ ది!

***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- ఫిబ్రవరి 2016 సంచిక 'మరీ చి.క' కాలమ్ ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...