Thursday, July 14, 2016

కామెడీ కథః స్వర్గం- నరకం


ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారంరోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాలకోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఇలాంటి చేంతాళ్ళు అలవాటేగాని.. శనివారం తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యంలేని పెద్దాయన  రాంభద్రయ్యగారిలాంటివారికి ఈ  క్యూలు వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకిక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని వ్యవహారం. అక్కడికీ ఎవరూ చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ భూలోకం కాదయ్యా భద్రయ్యా! మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవిక్కడ.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం నీళ్ళకోసం, రేషన్ కోసం, గ్యాసుబండలకోసం, ఏడుకొండలవాడి దర్శనంకోసం.. ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువులు సాగిస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు దేదదూత (దేవుడు, దయ్యం కలగవలసిన అంశ దేదదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.
చరవాణిలో ఆయనగారు ఎవర్నో(దేవుణ్ణే అయుండాలి) కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీదేమో రాజకీయనేతల ఫాయిదా! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాతజీవితం తాలూకు  పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు!'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం విను ముందు! ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం' అని దేదదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజంమీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేటంతలో రాంభద్రయ్యగారి కంటిముందు.. నరకం!
నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. శ్రీరామనవమినాటి భద్రాచలం, ఒంటిమిట్టల సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు, మరకత.  మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో ఆవరణమంతా గానాబజానా వాతావరణంతో మత్తెక్కిపోతోంది. అదనంగా మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తిలోత్తమాదుల్ని తలతన్నే అందగత్తెల   అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం మనుషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసేసే  పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ, తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులు   కూడా చాలా    ఫ్రెండ్లీగా       కలగలిసిపోయి           వాళ్లమధ్య
కలయతిరుగటం! అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. లేట్ నైట్ జోకులేస్తూ జనాలను అదే పనిగా కవ్వించడం.. నవ్వించడం! ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. పగలంతా ఎంతానందంగా గడిచిందో .. చీకటి పడ్డాక అంతకు రెట్టింపు సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యాలు  ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.
ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ నరకసుఖాలని  చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వన సంగీతమంటే   ఏదో ఒక ఐదారు నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి సంతాపసంగీతం  తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహన్జీకయినా తిరగబడాలనిపించదా! ఒక వంక కడుపులో పేగులు కరకరామంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగిమాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు చాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా బెత్త దూరంలో జిల్లుమన్నట్లుండేది!  ఎంత అతి మధురామృతమైనా సరే ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం ’చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకలేస్తూ కూర్చోడం కంటే.. ‘ఛీ!’ అంతకన్నా ప్రతిపక్షంలో ఐదేళ్ళపాటు అవస్థలు పడ్డం మేలు! ఆకలి దప్పులు, నిద్ర నిప్పులు, మంచి చెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనే కాదు.  
'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు, చీనిచీనాంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.  వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని’.
మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన పెద్దాయనకి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న  మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు!
మొన్నటి దృశ్యం- ఒబామాజీ భారతావనికి పర్యటనకు వచ్చేముందు తీర్చిదిద్దిన సుందరనగరం!
నేటి దృశ్యం- వినాయక నిమజ్జనం మర్నాటి ట్యాంకు బండు కింది హుస్సేన్ సాగరం!
పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం.
నిజానికి  వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు నరక  సందర్శనార్థం  విచ్చేసినప్పుడు-  పిలిచి ఆతిథ్యమిచ్చిన  గేస్తులు! భూలోకం తాలూకు పురానా  నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు  వేళ్లాడుతున్న దుస్తులు  అప్పటికిమల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చినికి, చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దలంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన గౌరవనీయులు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల వీపులమీద ఇప్పుడు కొరడా దెబ్బలు ‘ఛళ్ళు’మని  పడుతున్నాయి! ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిచక్రవర్తిని,  అంబరీషుణ్ణి మించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించి మైమరిపించిన   యమకింకరాధములు!
నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలోకూడా ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో యమకింకరుడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేంత బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు సాగుతున్నది. ఆ ఎలక్షన్లన్నీ  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా నిన్నిప్పుడు తరలించింది? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ భూమ్మీద జనానికి ఎన్నికలప్పుడు  మీరు చేసే హామీల్లోనూ.. చూపించే రంగులకలల్లో కూడా మోసం.. దగా ఉన్నట్లే లెక్క!
రాంభద్రయ్యగారింకేదో వాదనకు దిగబోతుంటే ఆకాశంలోనుంచి వాణి వినిపించిందీసారి పరమ  గంభీరంగా ’ముందే చెప్పాం గదా రాంభద్రయ్యా!  భూమ్మీద మీలాంటి మహానేతలు నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ పైలోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య అని'
'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కింకరుడు కొట్టిన కొరడా దెబ్బకు రాంభద్రయ్యగారి రియాక్షన్! భూలోకంలో  ప్రజాస్వామ్యం వంకతో కుపరిపాలన సాగించే   రాంభద్రయ్యగారి సహచర గౌరవనీయులందరికీ ఆ  పెడబొబ్బలు వినిపిస్తే బాగుణ్ణు!
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రిక జూలై 2016- లాగింగ్ గ్యాస్ కాలంలో ప్రచురితం)















Tuesday, July 5, 2016

గొడుగులు- గొడవలు- ఒక సరదా గల్పిక




'ఎవరదీ?'
నేనే బాబాయ్! ఛత్రపతిని'
'వానా వంగడం ఏవీ లేదు కదట్రా! ఇప్పుడీ నడివీధిలో ఒక్కడివే గొడుగేసుకొని ఏవిట్రా  విచిత్రంగా!'
'ఇవాళ 'గొడుగుల దినం' కదా బాబాయ్.. అమెరికాలో! .. అందుకనీ..'
'మూలన పడున్న ఈ ముతక గొడుగుని బ్సిటికి తీసి ఇలా ఊరేగిస్తున్నానంటావ్!  అదేదో దేశంలో జరిగే 'దినం' పేరు చెప్పి ఇక్కడిలా వూరికే ఊరేగుతున్నావంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదురా బాబ్జీ!.. అమెరికానుంచి పట్టుకొచ్చిన పైత్యమేమో అనిపిస్తున్నది!'
'సీమదొరలకి మనలాగా గొడుగులు.. గిడుగులు జాన్తా నై బాబాయ్!  పరమ నామర్దా కూడా! వాళ్ళు  నెత్తిన పెట్టుకొనేది ‘టోపీ’ ని!. మనమే! ఎండకూ వానకూ మాడును కాచి కాపాడే గొడుగుని వాడకం  అయినాక  గోడకు వేలాడదీసేది!'
'అబ్బో! టిక్కెట్టిచ్చి గెలిపించిన పార్టీ అధికారంలోకి రాలేదని.. దాన్నో మూలన పడేసిని   ఘనుడివి! ధర్మా పన్నాలొద్దు! మన వాళ్ళు  గొడుగుల్ని పనయినాకా  అటకెక్కిస్తారని కదూ నీ వెధవ అభియోగం! చేతిలో గొడుగు లేకుండా కాలు బైటపెట్టని తరం  మా నాన్నగారిది! మా తాతల కాలంలో అయితే గొడుగు పెద్దరికానికో ముఖ్యమైన గుర్తు. పాత సినిమాలు చూస్తావో.. లేదో! రాజ్ కపూర్ .. నర్గీస్ దత్తుల ప్రేమకహానీలో గొడుగుదే పెద్ద పాత్ర! పిలగాడివి.. నీకు చరిత్ర తెలీదు.  ఛాంర్లేనుకు గౌరవం పెంచిందీ.. చార్లీ చాప్లిన్కి గుర్తింపు తెచ్చి పెట్టిందీ ఈ ఛత్రమే  ఛత్రపతీ! శివాజీ మహారాజుకి ఛత్రపతి బిరుదెలా గౌరవం పెంచిందో తెలుసా! రాయలవారికి తన వెనక గొడుగు పట్టి పరుగెట్టే  గోపాలుడంటే గొప్ప ప్రీతి. రాయసానికే కాదు ఛత్ర చామరాలు.. దైవత్వానికీ పెద్ద ఆకర్షణలే బాబూ మన సంప్రదాయంలో. రాళ్ళవాన బారినుంచి ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు బాలకృష్ణుడు గోవర్ధన్నాని గొడుగులా ఎత్తి పట్టుకొన్న వైనం నీకు తెలుసా?   బలిని పాతాళం అడుగున  తొక్కేందుకు బయలుదేరిన అవతార మూర్తి వామనుడి నెత్తిమీదా అలంకారంగా ఉండేది ఈ గొడుగే!  ఏదుకొండలవాడి కొండకి ఏటేటా అరవదేశంనుంచి తరలి వచ్చే గొడుగుల ఉత్సహం సందడి  నీకు తెలీదులాగుంది! నీకు తెలిసిందల్లా మీ మార్కు  రాజకీయాల్లో   ఏ ఎండకు పట్టే ఆ గొడుగులూ,,  ఏకఛ్చత్రాధిపత్యంకోసం పక్క పార్టీలనుంని అభ్యర్థులను గొడుగు కర్రలేసి లాక్కోవడాలు!'
'రాజకీయాల్లో ఉన్నామని కదూ మా మీద ఈ  రాళ్ల విసురుళ్లూ?! ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గాలివాటం సరుకు పుట్టాగొడుగుల్లా పుట్టుకొస్తున్న మాటా నిజమే! కానీ  కారణం ఎవరు బాబాయ్? ఎన్నికల సంఘాలే 'గొడుగు'ను గుర్తుగా అంగీకరించాక మా నేతల ఒక్కళ్లమీదే  ఇలా బురద చల్లుళ్లు.. ఏవన్నా బావుందా! చెత్త నేతల గతం తెలిసీ నెత్తికి గొడుగు పడుతున్న ఓటర్లది అసలే తప్పు లేదంటాప్ .. పాపం!'
'నీతి నిజాయితీలనేవి బొత్తిగా లేని రాజకీయనాయకులే అందరూ.. అని నేనడంలేదులేరా నాయనా! ఒహటీ అరా ఒకవేళ అలాంటి  చాదస్తులు ఇంకా ఎక్కడైనా  మిగిలున్నా .. మీ తరం వాళు వాళ్లకిస్తున్న మర్యాదల మాటేమిటీవయసుమీద పడిందనో.. వంట్లో ఓపిక సన్నిగిల్లిందనో.. ఏదో ఒహ వంక కనిపెట్టి పాతకాలంనాటి పనికిరాని గొడుగులకు మల్లే గోడలకు వేలాడదీయడంలా!.. ఎందుకురా అర్థాంరంగా ఇప్పుడంతలా నవ్వులూ!'
'గోడకు వేలాడె గొడుగు గుర్తుకొచ్చిందిలే బాబాయ్!  చూసేందుకది అచ్చంగా చెట్టుకొమ్మకు  వేలాడే గబ్బిలం మాదిరిగా ఉంటుందిగదా! నవ్వాగలేదు!'
'గోడకు వేలాడుతున్నా.. వీధిలో ఊరేగుతున్నా.. గొడుగులది ఎప్పుడూ గబ్బిలాల రూపమేరా బాబిగా! పిచ్చుకలు.. పిచ్చికాకులు అంతరించిపోతున్నాయని అంతలా  ఆక్రోశ  పెడుతున్నారే  జనాలు!  మరి ఇప్పుడీ  గొడుగులకు పడుతున్న దుర్గతులను గురించి పట్టించుకోరా ఎవ్వరూ!! ఎందుకు?'
' గొడుగు ఈ ఈ-కాలం తరానికి కి బొత్తిగా పొసిగే సరుకు కాదులే   బాబాయ్!  మూడు కాళ్ళ ముసలయ్యలక్కూడా గొడుగుతో బైట కనబడ్డం పెద్ద నామర్దా అయిపోయిందిప్పుడు.  చరవాణుల్లో సందేశాలందించేందుకే రెండు చేతులూ చాలడం లేదు సుందరాంగులకి.. మళ్లీ గొడుగొకటి నెత్తిమీదకంటే పెద్ద గొడవలయిపోతాయి! ఎన్నిరంగులు.. హంగులతో  హొయలు పోయే సరుకు సంతలోకొస్తే మాత్రం ఛత్రాన్ని  కొనే చాదస్తం ఎవరికుంటుంది .. చెప్పు! గొడుగులకన్నా.. చరవాణి తొడుగులు అమ్ముకోవడం లాభదాయకం అనుకుంటున్నారు బజారు  వ్యాపారస్తులు! రద్దీగా ఉండే బస్సుల్లోకి తోసుకొని ఎక్కడం రాక కిటికీ చువ్వలగుండా సీటుమీద  చేసుకొనేందుకు మినహా ఇప్పుడీ గొడుగు కర్రలు ఎందుకూ పనికొస్తున్నాయి చెప్పూ! ఎన్నికల సంఘమొక్కటే  దీనిమీదింకా ముచ్చట పడుతున్నది.  అభ్యర్థికి గుర్తుగా అదింకా  దీన్ని ఆమోదిస్తుండటమే ఒహ గొప్ప విషయం. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి చట్టబద్ధమైన ప్రజాస్వామిక  హక్కుగా జనం ఎందుకు ఆమోదించడం  లేదో అర్థం కాకుండా ఉంది నాకిప్పటిక్కూడా!’
'జనామోద ప్రమోదాలమీదే ఇంకా మన నేటి రాజకీయాలు  నడుస్తున్నాయనే నన్ను భ్రమ పడమంటావుట్రా సన్నాసీ! ఇప్పుడు నువ్వు ఈ గొడుగు పట్టుకు తిరగాడినికి కారణం నిజంగా అమెరికా గొడుగుల పండుగ' సందర్భం అవునో కాదో చేప్పేపాటి జ్ఞానం నాకు లేకపోవచ్చుగాని..  ఇక్కడ నడుస్తున్న రాజకీయం మాత్రం  అమెరికా తరహా జనామోద అధ్యక్ష ఎన్నికల తరాహాలోవి కాదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదేంటిరా! మాట పూర్తి కాకుండానే ఎక్కడికా పరుగులు! అరేయ్.. ఛత్రపతీ! నిన్నే!,, నిన్నే!..'

'సార్! ఇప్పుడా గొడుగు వేసుకొని ఉరకలెత్తుతున్న మనిషి ఎవరో చెప్పగలరా?'
'ఛత్రపతి! అదేనయ్యా! మొన్నటి మన  నగర పాలిక ఎన్నికల్లో మనమంతా  ఓట్లేసి గెలిపించిన వార్డు అభ్యర్థి! ఇంతకీ మీరు ఎవరు? మా ఛత్రపతితో మీకేంటి అంత గత్తర?'
'సార్! మీ  ఛత్రపతి ఎన్నికల్లో గెలిచిన తరువాత సర్కారు పార్టీలోకి గెంతాడు కదా! నగర పాలిక కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తానని నా దగ్గర ఐదు లక్షలు నొక్కేసాడు. ఇప్పటి వరకు నౌఖరీ లేదు.. కదా.. కనీసం.. నా  డబ్బులు తిరిగివ్వమని అడుగుతున్నా .. ప్రయోజనం లేదు. ఎదురు పడ్డప్పుడల్లా ఇలా ఏ గోడనో.. గొడుగునో.. చాటు చేసుకొని.. మొహం తప్పించేస్తున్నాడు..'
ఇప్పుడర్థమయింది.. ఎండా వానా  ఏవీ లేక పోయినా .. ఇలా వీధిలోకి వచ్చినప్పుడల్లా  గొడుగు ఎందుకు వాడుతున్నాడో మా ఛత్రపతి!
అమెరికా గొడుగుల పండుగా కాదు.. పాడూ కాదు! ఇది ఇండియా రాజకీయాల గొడవ!
***
కర్లపాలెం హనుమంతరావు
 (అమెరికాలో జూలై 6 గొడుగుల పండుగ- ఆ సందర్భంగా)



Monday, July 4, 2016

పప్పుచెక్కల కనకమ్మ- చిన్నకథ


వేటపాలెం అంటే బైటి వాళ్లకి జీడిపప్పు గుర్తుకు రావచ్చేమో కానీ.. అక్కడ పుట్టి పెరిగిన మాకు మాత్రం అంతకు మించిన రుచిగా ఉండే కనకమ్మ పప్పుచెక్కలు గుర్తుకొస్తాయి.
మా చిన్నప్పుడు వేటపాలెం చాలా చిన్నఊరు. మద్రాసు హైవే రోడ్డైనా కనకమ్మ కొట్టు మలుపును తప్పించుకు పోయేందుకు లేదులారీ డ్రైవర్లు.. బస్సు డ్రైవర్లు.. బాణలి పెట్టున్న సమయంలో అటుగాని వస్తుంటే బళ్ళు పుకొని మరీ  పప్పుచెక్కలు పొట్లాలు కట్టించుకొని పోతుండేవాళ్ళు. ఆలస్యమయినా ప్రయాణీకులకుకూడా  పెద్ద అభ్యతరం ఉండేది కాదు. వాళ్లకి మాత్రం కనకమ్మ పప్పుచెక్కలేమన్నా చేదా!
మొదటాట సినిమాకు పోయేందుకు మా అమ్మావాళ్లు ప్రోగ్రామ్ వేసినప్పుడల్లా.. సినిమాకన్నా ముందు కనకమ్మ పప్పుచెక్కల రుచి గుర్తుకొచ్చి నోట్లోకి నీళ్ళు వచ్చేవి మా పిల్లలకు. సినిమా చూసి తిరిగొస్తూ దారిలో ఆగి అమ్మావాళ్లు కొనిచ్చే పప్పుచెక్కలు కరకరలాడించుకొంటూ ఇంటికొస్తేగాని  మంచినిద్ర పట్టేది కాదు మాకు.
ఇష్టాన్నీ ఒక పట్టాన బైటపెట్టని మా నాన్నగారూ అమ్మ తెచ్చే పప్పుచెక్కలకోసం అప్పటివరకు భోజనం చెయ్యకుండా కూర్చొనుండేవాళ్ళు!
పపుచెక్కల కనకమ్మతో మా పిల్లకాయలకి మరో పండుగ అనుబంధంకూడా ఉంది.
వినాయకచవితి పూట తొమ్మిదిమంది వినాయకుళ్లను చూసి.. తొమ్మిది ఇళ్ల పెద్దలతో శాపనార్థాలు పెట్టించుకొంటే పిల్లల ఆయుర్దాయానికి ఢోకా ఉండదని ఓ నమ్మకంమా పిల్లల తిట్లుతినే  పెద్దలజాబితాలో  కనకమ్మస్థానం ఎప్పుడూ పదిలంగా.. ప్రథమంగానే ఉండేది.
మగదిక్కులేని ఒంటరి ఆడమనిషిని కవ్వించి తిట్లు తినడం మా పిల్లలకి సులభంగా ఉండేది. ముళ్లజిల్లేళ్ళు.. రాళ్లు..  సేకరించుకొని తెల్లారకుండానే కనకమ్మ ఇంటిముందు చల్లేవాళ్లం. మా అల్లరి బృందానికి సాంబడు నాయకుడుఆమె ఆపకుండా శాపనార్థాలు పెడుతుంటే వీనులకు విందైన సంగీతం వింటున్నంత ఆనందం కలిగేది మా పిల్లకాయలకి. 'మీ దెవసం చెయ్య!' అంటూ కొత్త కొత్త తిట్లు  కనిపెట్టి మరీ ఆమె రెచ్చిపోతుంటే పిచ్చ ఆనందంతో సాంబడు గంతులేయడం నాకిప్పటికీ బాగా గుర్తు.
కనకమ్మ దుకాణాన్ని అక్కణ్ణుంచి లేపేయించాలని పక్కనున్న హుస్సేస్ సాహెబ్ ది ఎప్పణ్నుంచో పథకం. కనకమ్మకు అత్తగారినుంచి వచ్చిన ఆస్తి  చిన్న పెంకుల వసారా. రెండు పెద్ద భవంతుల మధ్య దిష్టిపిడత మాదిరిగా ఉన్నదని హుస్సేన్ సాహెబ్ చిరాకు!.
హుస్సేన్ సాహెబ్ బీడీల వ్యాపారంతో గడించిన సొమ్ముతో కనకమ్మ అత్తగారినుంచి ఒకానొకప్పుడు ఆ భవంతులున్న స్థలం మొత్తం అధికధర పోసి కొన్నాడు. హైవేమీద ఉండటం ఒక కారణమైతే.. ఏ వ్యాపారానికైనా అచ్చివస్తుందన్న సెంటిమెంటు ఒకటి. సెంటిమెంటుకి మతంతో నిమిత్తమేముంటుంది!
కనకమ్మ కొరకరాని కొయ్యగా మారింది సాహేబుకి. ఆమెచేత దుకాణం ఖాళీ చేయించాలని చూసినప్పుడల్లా కనకమ్మ బెజవాడ కనకదుర్గమ్మే అయేది. స్థానిక ఎమ్మెల్యే ప్రాబల్యంతో హుస్సేన్ సాహెబ్  కనకమ్మమీద  వత్తిడి పెంచిన రోజుల్లో ..
ఒకరోజు మద్రాసునుంచి పొన్నూరు పోతూ తమిళనాడు గవర్నరుగారి సతీమణిగారి కార్లు కనకమ్మ దుకాణంముందు రెండుగంటలపాటు  ఆగాయి! తిరిగి వెళ్లే  కాన్వాయిలో ఉన్న వాళ్లందరి చేతుల్లో పప్పుచెక్కల పొట్లాలు చూసి ఊరు ఊరంతా  అవాక్కయింది!
తరువాత విచారణలోగాని తేలలేదు..  కనకమ్మ బంధుబలగం సామాన్యమైంది కాదని. ఆమెతో పెట్టుకొంటే 'గురువుగారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది' అని ఎమ్మెల్యే తప్పుకోవడంతో హుస్సేన్ సాహేబు ఇంకేమీ చప్పుళ్లు చెయ్యలేక చతికల పడిపోయాడు.
మనుషులు ఊరుకున్నారని కాలం రుకుంటుందా! నాలుగేళ్ళు గడిచేసరికి కనకమ్మ ఫొటోకి దండ పడింది.
ఆమె పప్పుచెక్కల దుకాణం రూపం మారింది. అది ప్పుడు దిక్కూమొక్కూలేని ఆడవాళ్లకు.. పిల్లజెల్లాకు మళ్ళీ నీడ దొరికేదాకా ఆశ్రయమిచ్చే ఉచిత మధ్యంతర ఆశ్రమం. ప్రభుత్వ ఆర్థికసాయానికి తోడు కనకమ్మ పప్పుచెక్కలు అమ్మి పీనాసితనంతో కూడేసిన ఐదు కోట్లు మదుపుతో మొదలయింది స్వచ్చంద సేవాగృహం.
వినాయక చవితి పండుగనాడు పిల్లలచేత రాళ్లేయించుకొని 'మీ దెవసం చెయ్య!' అంటూ  పడరాని తిట్లు తిట్టిపోసిన కనకమ్మ వాస్తవంలో అనాథ పిల్లలెరూ నిజంగాదెవసం సాలుకారాదన్న మంచి ఉద్దేశంతో స్థాపించిన ఆ సేవాగృహానికి ఇప్పుడు ధర్మకర్త మా సాంబడే!
ఇప్పటికీ ప్రతీ చవితినాడు ఊళ్లోని పిల్లకాయలు ఆ  వసతిగృహంమీద రాళ్లేస్తుంటారు. వసతిగృహంలోని  పెద్దలు పిల్లల్నితిట్లతో దీవిస్తుంటారు. లాగే   జరాగలన్నది చనిపోయేముందు కనకమ్మ చివరి కోరిక!
పండగ తొమ్మిది రోజులూ కనకమ్మ దుకాణం పప్పుచెక్కలు ఊరి పిలలకీ.. పెద్దలకీ ఉచితంగా  పందేరం కూడా

*** 
-కర్లపాలెం హనుమంతరావు

Thursday, June 23, 2016

యమలీల

గీతాంజలి చిత్రం గుర్తు ఉందా? త్వరలో చనిపోతానని తెలిసీ నాగార్జున.. చివరి రోజులు ఉల్లాసంగా గడిపేందుకు తల్లిదండ్రులకు దూరంగా పోయి .. అక్కడి ఆహ్లాదకర వారావరణం నేపథ్యంగా కథానాయికతో కలసి ప్రేక్షకులను చివరికంటా   రొమాంటిక్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.
మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు  నాలుగు మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ని  హిందువుల విశ్వాసం. పురాణ కాలంనాటికి సంబంధించిన ఓ కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. య‌మునానదీ తీరంలో అమృతుడు అనే   వ్యక్తికి ఒకానొక సంద‌ర్భంలో  మృత్యుభ‌యం ప‌ట్టుకుంది.   య‌ముడి గురించి ఘోర‌ త‌పస్సు చేస్తాడు.  య‌ముడు ప్ర‌త్య‌క్ష‌మై 'ఏం వ‌రం కావాలో కోరుకో!' అని అడ‌గితే గడుగ్గా  అమృతుడు  చ‌నిపోయేందుకు చాలా ముందే తనను ఒక్కసారి హెచ్చరించాలని కోరుకొంటాడు .  ముందు జాగ్రత్తలతో  త‌న  బరువు బాధ్యతలను సక్రమంగా వారసులకు అప్పగించి పోవాలని అమృతుడి ఆలోచన.  'ఒక్క సారి కాది.. నాలుగు పర్యాయాలు  సూచ‌న‌ల‌ను పంపుతాన‌' ని మాట ఇచ్చి మాయమైతాడు మృత్యుదేవుడు. కాగా చివ‌రికి ఒక రోజు య‌ముడు వ‌చ్చి 'ఆయువు తీరిందిప్రాణాల‌ను తీసుకుపోతాన‌'ని అమృతుడి ముందుకొచ్చి నిలబడతాడు.  'చావు సూచ‌న‌లు ఏవీ ఇవ్వకుండానే  ప్రాణాల‌ను తీసుకుపోతాను' అనడం వాగ్దానభంగం అవుతుందని ధర్మరాజుతో వాదనకు దిగుతాడు అమృతుడు.  'నా మాట ప్రకారం  నీకు నాలుగు సార్లూ   చావు సూచ‌న‌ల‌ను అందించాను. వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌డం, ప‌ళ్లు ఊడిపోవ‌డం, చూపు మందగించడం, శరీరం సహకరించక పోవడం..రాబోయే చావుకు ముందు నేను పంపించే సూచనలే ! గ్రహించక పోవడం నీ గ్రహచారం!' అంటాడు యమధర్మరాజు.  ముందుగా సంభవించే అనారోగ్యాలే  మ‌ర‌ణాగమనానికి సూచనలు.  వంట్లో మెరుగుపడని రుగ్మత పెట్టుకుని.. తెలిసి కొంతమంది.. తెలియక కొంతమంది ఆఖరి శ్వాసవరకూ ఆరోగ్యవంతులకు మల్లేనే ఆడుతూ.. పాడుతూ.. గడిపే ఇటువంటి   ఇతివృత్తాలతో విశ్వసాహిత్యంలో  సినిమాలు.. కథలూ వంటి కళారూపాలు చాలానే వచ్చాయి.
జీవితం ఏమిటీ?.. వెలుతురూ చీకటీ..' అంటూ కృష్ణ దేవదాసు వాపోతూ  విలపిస్తే.. ' బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలనాందమోయ్, బ్రహ్మానందమోయ్' అంటూ వేదాంతం ఒలికించాడు ఏ ఎన్నార్ దేవదాసు. 'జగమే మాయ.. బతుకే మాయ ' అంటూ వేదాలు ఎంత సారం పిండి బోధించినా.. 'తన దాకా వస్తే గాని తత్వం' తలకెక్కని పచ్చి నిజం జీవితం. 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ స్థాపనలోని ఉద్దేశం గ్రహించగలిగేవారికి జీవితంలోని నికర సారం తెలిసి వస్తుంది. కేన్సరు వంటి ప్రాణాంతక వ్యాధులు వంటిని ఆవరించి భావిని  శూన్యంగా మార్చబోతున్నాయని ఆ చిన్నారులకు  తెలియదు.. తోటి పిల్లలకు మల్లేనే తోటలో అప్పుడే అరవిరిసే పూల మాదిరి అల్లరి చేయడం మినహా!  'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని ' పసిమొగ్గలు వారు. 
కూచిమంచి రవి అనే కవి ఒక మంచిచెడ్డ జీవిత సత్యాన్ని కవిత రూపంలో  వినిపించారు ఒకసందర్భంలో.
శైశవ గీతం దాని పేరు. చనిపోయిన పసికందు- బతికున్న మూన్నాళ్ళూ అమ్మ నాన్నలతో.. బంధుమిత్రులతో గల సంబంధ బాంధవ్యాలు నిష్క్రమణ వేళ ఎటువంటి భావనాత్మకమైన రూపాంతరాలకింద మార్పు చెందుతాయో కవితాత్మకంగా చెప్పే 'శిశు జ్ఞానం' అది.
'ఆపైన ఏం జరిగిందో/నాకంతగా గుర్తు లేదు కానీ/నిద్దురలోకి జారుకునేముందు/నేననుకునే ఉంటాను/మా అమ్మ చెక్కిట కన్నీటిని తుడిచి ముద్దిడిన వ్యక్తి/మా నాన్నే అయి ఉంటాడని/ఆ రాత్రే/మా ఇంటి ఇరుగు పొరుగు వచ్చి/నేను నిద్దురలోనే కనుమూస్తానని చెప్పినప్పుడు/నాకు గుర్తు లేదు గానీ/నేను మా అమ్మను ఊరడించడానికి ప్రయత్నించే ఉంటాను/“నాకేం ఫరవాలేదమ్మా/నువ్వేం ఏడవద్దమ్మా” అని ప్రయత్నించే ఉంటానూ అంటూ సాగే  మృతశిశువు అమృత స్మృతి గీతిక అది.
చావు పుట్టుకలకు పసిమితనం.. ముదిమితనం.. అని తేడా ఏమి ఉంటుంది? కన్ను తెరవడం జీవి స్పృహలో లేకపోవచ్చు. కన్ను మూసే వేళా అపస్మారకం లోతుల్లోకి జారిపోవచ్చు. కానీ ఊహ ముదిరిన పిదప మిట్ట మధ్యాహ్నం పూటే అసుర సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయని తెలిస్తే అలమటించని ప్రాణి అరుదుగానైనా ఉంటుందా లోకంలో? అలిసెట్టి ప్రభాకర్ ఒక  పొట్టి కవితలో - ఎంతో గట్టిదిగా మనం భావించే  ఈ దేహం ప్రాణదీపం నిలిచే ఒక మట్టిప్రమిదకన్నా ఓటిది సుమా! దీపశిఖ వెండికొండలా  వెలుగడానికి .. కొండెక్కి మలగడామికి  మధ్య  ఉండే  అంతరం.. కంటిరెప్పపరంగా చెప్పాలంటే.. కేవలం తెరవడం.. మూయడమంత' సునాయాసం అని  చెపుకొచ్చాడు.
'బతుకి ఉండేందుకు .. బతకు ఏటి ఆవలవైపుకు వెళ్ళి పడేటందుకు మధ్య పట్టేది  కేవలం కంటిరెప్ప పాటు కాలం' అన్న ఆ కవి మాటా కొట్టిపార వేయలేం.
కానీ అదంతా దంతవేదాంతం. ఒక ప్రాణి కంటిముందు జీవయాత్ర విరమించుకుని.. మహాప్రస్థానానికని బైలుదేరే వేళ  'ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నమూ' అనే భావోద్వేగం ముప్పిరిగొనవచ్చు. శ్మశానంలో కపాలభాతి  జరిగే వేళ  జనించే వైరాగ్యం  నెత్తిమీద పోసుకొన్న చన్నీటితో పాటే ఆవిరవకపోతే.. క్షణభంగురం అని  మునిపుంగవులు క్షణం క్షణం సెలవిచ్చే  ఈ బతుకుని చివరివరకు  హంగు పొంగులతో.. అంగరంగ వైభోగంగా   గడిపేందుకు మనిషి అన్నేసి ఆటు పోట్లు ఎందుకు పడుతున్నట్లు?
మహాభారతంలో యక్షుడు ధర్మరాజుని అడిగే వంద సందేహాలలో  అత్యంత గహ్యమైనది మృత్యు సంబంధమైనదే! ' మానవ మనస్తత్వంలో అత్యంత వింత గొలిపే లక్షణం ఏది?' అన్న ప్రశ్నకు ధర్మరాజు ఇచ్చే జవాబు సబబైనదే. యుధిష్ఠిరుడు  అభిప్రాయ పడ్డట్లు 'రేపు  మరణించే మనిషి ఈ రోజు  మరణించిన ఆప్తులను  చూసి శొకతప్తుడు అవడం' విశదంగా పరిశీలిస్తే  విచిత్రమైన విషయమే !
కానీ..  ఎవరి ప్రాణం  వారికి తీపి.  జీవితంమీదున్న  మమకారం  మామూలుదా? ఉప్పూ కారాలు తిన్నా తినకున్నా.. సప్లిమెంటరీ విటమిన్లతో  కాలం నెట్టుకొస్తున్నా .. చప్పగా సాగే  బతుకుబండిని  కాలుడి నోటికి చటుక్కుమని అందించేందుకు సిద్ధపడేది ఎవరు?సిద్దులని చెప్పుకొనేవారు సైతం ఏ రాద్ధాంతాలూ చేయకుండా చెయ్యలేని కార్యం ప్రాణత్యాగం.
పెనురోగాల ఉనికి వంట్లో  ఉందని పెందళాడే  పసిగట్టినప్పుడు ఆ చేదునిజం  రోగి చెవిలో వేయడం మంచిదా. .కాదా? అన్నచర్చ సీమదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భం ప్రస్తుతానిది.  కాబట్టి  చావు బతుకుల ప్రస్తావనలు ఇప్పుడు ఇంత విస్తారంగా   చర్చించుకోవలసి  వస్తున్నది.
రోగి శరీరంలో జబ్బు ముదురుతోందని వైద్యులు ముందే  గుర్తించడం.. రోగికి ఆ సమాచారం అందిచడం-- రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని  కొందరు మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రుగ్మత  ముందే పసిగట్టి తెలియచేయడం  వైద్యపరంగా రోగికి అన్ని వేళలా మేలు చేసే చర్య కాకపోవచ్చన్నది ఆ మానసిక శాస్త్రవేత్తల ఆలోచన. ఈ తరహా మృత్యుజ్ఞానం చావు పుట్టుకుల మధ్య  సంఘర్షణను మరింతగా ప్రేరేపిస్తుందని.. ఆ ఘర్షణ అన్ని వేళలా మనం భావించిన రీతిలోనే రోగికి మేలు కలిగించాలని లేదన్నదీ  వైద్యుల అభిప్రాయంగా కూడా ఉన్నది. తన శరీర  క్షేత్రంలో  ప్రాణాంతకమైన రుగ్మతా బీజాలు వెదజల్లబడి ఉన్నాయని ముందే తెలుసుకొన్న రోగి మిగతా జీవితమంతా తతిమ్మా  ఆరోగ్యవంతులంత  సంతోషంగా గడుపుతాడన్న భరోసా లేదు. సరికదా  కొత్తగా బైటపడిన అనారోగ్య సమచారం రోగి మానసిక స్థైర్యంమీద  తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువని  మానస్థత్వ శాస్త్ర వేత్తలూ అభిప్రాయపడుతున్నారు. నార్వే విశ్వవిద్యాలయం - ట్రాన్ ధియమ్  విజ్ఞాన సాంకేంతిక  విభాగాల ప్రజా ఆరోగ్య   రంగంలో  పరిశోధనలు సాగించే జోర్గెన్సన్ వాదన ప్రకారం- ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన  రుగ్మత శరీరంలో బీజదశలో ఉందని తేలినప్పటికీ.. ఆ దురదృష్ట సమాచారం రోగిదాకా రాకుండా జాగ్రత్తపడడమే రోగి జీవితకాలం  మరింత కుచించుకుపోకుండా  ఉండేందుకు తీసుకొనే మంచి చర్యగా నిర్ధారిస్తున్నారు.

-కర్లపాలెం హనుమంతరావు 

Wednesday, June 1, 2016

అంత్యక్రియ- కౌముదిలోనా కథ



'నిన్నేమో మేమంతా చాలా కాలుక్యులేటేడ్ ఫెలోవని తెగ పొగుడుతుంటాం. నువ్వేమో ఈ చచ్చు పుచ్చు భూమిని ఇంత తగలేసి కొన్నావ్! అదీ ఆదరాబాదరాగా! అవతల అక్కడ హైదరాబాదులో బాబాయిని ఆసుపత్రికి వదిలేసి ఇప్పుడీ గత్తర పనులన్నీ ఎందుకో అర్థం కావడం లేదురా!' అని తగులుకొన్నాడు కుమారస్వామి అమ్మనబ్రోలు ల్యాండు రిజిస్ట్రేషనాఫీసునుంచి బైటికొచ్చీ రాగానే!
సమాధానంగా నవ్వి ఊరుకొన్నాడేగానీ.. పెదవి విప్పి ఒక్కముక్కన్నా బైటికి అనలేదు కమలాకరం. కొన్నభూమి దస్తావేజులను సేకరించుకొనే విషయం గురించి మాట్లాడుతున్నాడు అమ్మిన సుబ్బారాయుడితో ఒక పక్కకు తీసుకెళ్లి.
అమ్మనబ్రోలు భూములంటే ఎర్రమన్ను నేల. పొగాకు పండించీ పండించీ గుల్లబారిన భూమి. మరే పంటా పండేందుకు ప్రస్తుతానికైతే బొత్తిగా ఆస్కారం లేదు. గవర్నమెంటు పొగాకును అంతగా ప్రోత్సహించడం లేదుకూడా. వరస కరువు కాటకాలతో గిడసబారిని నేలను నమ్ముకోలేక అయినకాడికి అమ్మేసుకొని రైతులు తరలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కమలాకరం వాస్తయినా సరిగ్గాలేని ఎత్తుమీది ఈ భూములను.. అందులోనూ నీటివసతి బొత్తిగా లేని సుబ్బారాయుడి మూడెకరాల కొండ్ర ఎకరా మూడులక్షలు రేటుకి కొనడమెందుకో ఎవరికీ అర్థం కాలేదు. రైతులు సుబ్బారాయుడికి పట్టిన అదృష్టానికి తెగ కుళ్ళుకొన్నారుకూడాను!

కమలాకరానికి అమ్మనబ్రోలుకి ఆట్టే సంబంధంలుకూడా ఏమీ లేవు. అతగాడు అక్కడ పుట్టిందీ లేదు. చదివిందీ లేదు. ఎప్పుడో ఒకసారి వేసవిసెలవులకని ఆ ఊరొచ్చి ఒక మూడు వారాలు ఉండిపోయాడు. అదీ ముళ్లమీదున్నట్లు.
కమలాకరం తండ్రి కాంతారావు బ్యాంకులో
పనిచేసిన రోజుల్లో  ఆ ఊర్లో ఒక మూడేళ్లపాటు కావురం ఉన్నాడు. అప్పుడైనా కుటుంబం హైదరాబాదులోనే!
ఆ మాత్ర్రం సంబంధానికే ఇంత రేటు పెట్టి ఇక్కడి భూములు కొనడానికి రావాలా కమలాకరం! అందునా మిత్రుడు కుమారస్వామి మొత్తుకొన్నట్లు ఆయన తండ్రి హైదరాబాదు అపోలోలో దాదాపు ఆఖరి గడియల్లో ఉన్నాడు! న్యూజిలాండునుంచి చెల్లెలు సుభద్ర రావడానికి కనీసం రెండు రోజులు తక్కువ పట్టదు. తండ్రిని వెంటిలేటరుమీద ఉంచి.. మిగతా పనులు భార్యకు పురమాయించి మరీ ఈ వ్యవహారంకోసం ఇంతదూరం ఇప్పుడు పరుగెత్తుకు రావడానికి పెద్ద కారణమేమైనా ఉందా?
కుమారస్వామిని కుమ్మరి పురుగులా తొలిచేస్తున్న ఈ సందేహానికి సమాధానం మర్నాటికిగానీ బైటపడలేదు,
అదీ అతగాడి భార్య సుగుణ కాల్ చేసి కంగారు పెట్టబట్టి! 'సుభద్రకూడా వచ్చేసిందండీ! అందరూ మిమ్మల్ని గురించే అడుగుతున్నారు రెండు రోజులబట్టీ! మీ నాన్నగారైతే ఒహటే కలవరింతలు.. అత్తయ్యగారికి సర్ది చెప్పలేక పోతున్నాను'
'వచ్చేస్తున్నా! వచ్చిన పని పూర్తయింది. రేప్పొద్దునకల్లా అక్కడుంటా.. సరా! అందాకా ఎలాగో మేనేజ్ చేయ్.. ప్లీజ్!' అని ఫోన్ పెట్టేసి కుమారస్వామితో సహా కొన్నపొలానికి బైలుదేరాడు కమలాకరం.
పొలంచుట్టూ దిట్టంగా కంచె ఉంది. పెద్దగేటుకి వేసిన తాళం తీసి.. నేరుగా ఓ మూల ఉన్న పెంకుటింటిలోకి స్వామిని తీసుకెళ్లాడు కమలాకరంలోపలి గోడలనిండా  సీతా..సీతా..’అని రామకోటిలా ఇంగ్లీషులో రాతలు.. అడుగడుగునా! జీడిపిక్కలతో రాసిన ఆ రాతల్లో సీత పేరుతో కలిసి కాంతారావుఅనిగాని లేక పోయుంటే కమలాకరానికి ఇప్పుడింత దూరం వచ్చి ఈ చచ్చుపుచ్చుభూముల్ని ఇంత ధరపెట్టి అర్జంటుగా కొనాల్సిన అవసరం తప్పుండేది!
'నువ్వేం చేస్తావో తెలీదురా! రేపు సాయంత్రానికల్లా ఈ  గుడిసె మొత్తాన్నీ   కూలదోసెయ్యాలి. మా నాన్నకు ఇక్కడే అంత్య క్రియలు! అదే మూడు రోజుల్నుంచి ఆయన కలవరింతలు! అమ్మకు చెల్లాయికి తెలిస్తే అల్లాడిపోతారు! పరువుకోసం పాకులాట్టం మాకు నేర్పిందీ ఈ  మహానుభావుడే కదా!' అన్నాడు కమలాకరం.
సీత ఎవర్రా?’ అని అడుగుదామనుకొని కమలాకరం కంట్లో నీళ్ళుచూసి ఆగిపోయాడు కుమారస్వామి 'డోంట్ వర్రీరా! నీ లాంటి కొడుకు ఉండటం మీ నాన్న చేసుకొన్న అదృష్టం' అని మిత్రుడి భుజం తట్టాడు అనునయంగా!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది అంఅర్జాల పత్రిక జూన్ 2016 సంచికలో మరీ చి.క గా ప్రచురితం)

Monday, May 9, 2016

కవిత్వం- విమర్శకత్వం


రచనకు ఒక పార్శ్వం రచయిత ఐతే రెండో పార్శ్వం రసాస్వాదన చేసే భావుకుడు.
అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః।
యథాస్మై రోచతే విశ్వం తథైవ పరివర్తతే- అని శ్లోకం॥
కవి తన ఇఛ్చానుసారం చిత్రించడమే కాదు.. ప్రజాపతి సృష్టించిన జగత్తు
పోకడలను కూడా మార్చగలడు-అని అర్థం.
కవిలోని ఆ సృజనశక్తి సహజమైనది. కొంత మందికి అది గురుకృప  ద్వారా సంక్రమిస్తుంది. కొంతమంది నిరంతర శాస్త్రాధ్యయనంతో మెరుగులు దిద్దుకుంటారు. ఎవరు  విధంగా సాధించినా పండితరాయలు సిద్ధాంతం  ప్రకారం కవికి ‘అనాయాసంగా, అప్రయత్నంగా శబ్దార్థాలు  స్ఫురించే ప్రతిభ పట్టుబడటం’ ప్రధాన
లక్షణం.
రాజశేఖరుడు అనే మరో  ఆలంకారికుడు ఈ ప్రతిభను  రెండు రకాలుగా విభజించాడు.
కారయిత్రిః కావ్యాన్ని సృజించే ప్రతిభ
భావయిత్రిః కావ్యసౌందర్యాన్ని ఆస్వాదించగలిగే సామర్థ్యం

కారయిత్రి అధికంగా ఉంటే కవి.. భావయిత్రి అధికమైతే సద్విమర్శకుడు.
రచన పూర్తయిన తరువాత  రచయితా విమర్శకుడి అవతారం ఎత్తవచ్చు. కాని అది తన రచనకే పరిమితం. సాధారణంగా ఏ కవీ తనకు పనిపడితే తప్ప పరాయివారి రచనల జోలికి పోయే పని పెట్టుకోడు.
రచనలను చదివి తార్కికంగా ఆలోచించి సహృదయంతో విమర్శ చేయగల సత్తా ఉన్నవాడినే అసలైన విమర్శకుల లెక్కలోకి తీసుకోవాలి.
సరే.. కవి గొప్పా? విమర్సకుడు గొప్పా? ని మీమాంస.
కవి సృజన చేస్తేనే కదా.. విమర్శకు భూమిక సిద్ధమయేది! కనుక కవే గొప్ప అని ఒక వాదం. కానీ చాలా సందర్భాల్లో కవికూడా ఉహించని చమత్కారాలను విమర్సకుడు తన విస్తృత పరిశీలనాపాటవం శక్తితో వెలికి తీస్తుంటాడు!.
ఇయం సంధ్యా, దూరాదహముపగతోహన్త! మలయా
దిహైకాన్తే గేహే తరుణి! తవనేష్యామి రజనీమ్,
సమీరేణోక్తైవం నవకుసుమితా చూతలతికా
ధునానా మూర్థానంనహి నహి నహీత్యేవ వదతి”-అని ఒక కవిగారి శ్లోకం.
ఎక్కడో మలయపర్వతంనుంచీ వస్తున్నాను. కనుచీకటి పడుతున్నది. తరుణీ! నీ గృహంలో ఈరాత్రి ఏకాంతంగా గడుపుతాను” అని సమీరం అడిగితే కొత్తగావికసించిన చూతలత  ‘వద్దు వద్దు వద్దు’(బిడియంతో కాబోలు)  అని ముమ్మారు తల డ్డంగా ఊపిందిట!
శ్లోకం రసవత్తరంగానే సాగింది. కానీ చివర్లో ఆ చూతలత మూడుసార్లు అలా వద్దు వద్దు వద్దు అని సాగదీయడం  దేనికీ?’ అని తర్కానికి   విమర్శక శిఖామణి అయినా తర్కానికి దిగితే.. ముక్కు మొహం తెలీని పరాయి పురుషుడు రాత్రంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతాను అంటే.. ముగ్ధ యిన పుష్పానికి  మరి కంగారు పుట్టదా! ఆ తొట్రుపాటులో ‘వద్దు.. వద్దు’ అన్నది. తప్పేమున్నది? అని కవిగారి ఓట్రించినా  అది కవిగారి వట్టి బుకాయింపు మాత్రమే అని ఇట్టే తెలిసి పోతుంది.
బాగుందండీ.. మరి మూడోసారి కూడా వద్దుని అనడం ఎందుకో?” అని విమర్శకుడిగారు ఎదురు  సందేహం లేవదీస్తే కవిగారి దగ్గర సబబయిన సమాధానం ఉండాలి గదా!ఛందస్సుకోసం ఏదో అలా అనవలసి వచ్చింది  లేవయ్యా!” అని లోలోన గొణుక్కున్నా.. బైటికి అనలేడు గదా! ఛందస్సుల్లో ఇమడేందుకుటువంటి వ్యర్థప్రయోగాలకు పాల్పడం సాంప్రదాయిక సాహిత్యంలో సాధారణమే. కావచ్చు  కానీ అటువంటి వ్యర్థప్రయోగాలవల్ల రచన ఔన్నత్యం పల్చబడతుంది. కాలంనాటి కవులందరికీ ఈ విషయమై  మనసులో మథన న్నా  బైటికి ఒప్పుకోవడం  మేథోగౌరవానికి భంగకరమని భావించేవారు.
టువంటి సందర్భంలోనే విమర్శకుడి విశిష్టత బైటపడేది. ఇక్కడి శ్లోకం సంగతే చూసుకోండి! కవిగారిని ఇబ్బందినుంచీ విమర్శకుడు ఎంత తెలివిగా తప్పించాడో గమనించండి! ‘శ్లోకంలో కవిగారు సూచించింది వట్టి కుసుమితను కాదు.. నవ కుసుమితను. అంటే అప్పుడే పుష్పించిన కుసుమాన్ని. ఆ పూలబాలకు  పరపురుషుడితో మూడు రాత్రుల ఏకాంత వాసమంటే.. బెదురు  పుట్టదా! అందుకే అసంకల్పితంగా నవకుసుమిత నోటినుంచీ ‘  వద్దు.. వద్దు.. వద్దు’అన్న మాటలు అలా  మూడుసార్లు తన్నుకు వచ్చేసుంటాయి అంటూ విమర్శకుడు   సందర్భ సమన్వయం చేసాడనుకోండి.. కవిగారికి ఎలా ఉంటుంది? ఆనందం ఆపుకోలేక అమాంతం విమర్శకుడిని గాఢాలింగనం  చేసేసుకుని ఉంటాడేమో కూడా! అదీ సాహిత్య పరిశీలనలో విమర్శకుడి దృష్టి సామర్థ్యం. అలాగని కవిపాత్రను ఎంతమాత్రం తక్కువచేయడంగా భావించరాదు.  ఎవరి మేథోక్షేత్రంలో ప్రత్యేకత వారిదే!
గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జడధియో౭ఫ్యలమ్
కావ్యంతు జాయతే జాతు కస్య చిత్ప్రతిభావతః’- మందబుద్ధులు సైతం  గురుశుశ్రూష చలవతో కొంత శాస్త్రపాండిత్యం సాధించవచ్చు. కావ్యసృజన  కదాచిత్  కాలం కనికరించినప్పుడు మాత్రమే చేయగలియేది. అదీ వందలాది ప్రతిభావంతులలో ఏ ఒక్కరి వల్లో సాధ్యమయేది- అని  భామహుడి మతం.
కావ్యం ప్రాథమికంగా మేలిమి బంగారమైనప్పుడే .. ఏ విమర్శకుడైనా సానపెట్టగలిగేది! చేమకూర వెంకటకవి ‘విజయవిలాసమే’ దీనికి చక్కని ఉదాహరణ.
సాధారణంగా కావ్యం మొత్తంలో పది పన్నెండు చమత్కారాలు ద్యోతకమైతేనే మనం ‘ఓహో..ఆహో’ అని కవి ప్రతిభను ఆకాశానికి ఎత్తేస్తుంటాం. రాసిన ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశేషాన్ని  చొప్పించిన చేమకూర వేంకటకవి ప్రతిభను మరింకేమని పొగడగలం! తాపీ ధర్మారావుగారు ‘హృదయోల్లాసం’ పేరుతో సవివరమైన వ్యాఖ్యానం వెలువరించిందాకా.. విజయ విలాసం కావ్యంలోని అందాలు  కొన్ని వందల ఏళ్ళవరకు   బయటపడనేలేదు. అందుకే అనేది.. కారయిత్రి ప్రతిభ ఒక్కటే చాలదు.. భావయిత్రి సామర్థ్య సహకారమూ కావాలి కావ్యగౌరరవం పండితలోకంలో పడి పండాలంటే!
కన్నె నగుమోము తోడం
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్
నెన్నెదురు తోడ మార్కొని
మున్నందఱు జూడ రేకమోవక యున్నన్- (1-197) అనే పద్యమే చూడండి!
గతంలో(చిత్రాంగద నుదురుతో పోటీపడిన సందర్భంలో) అపజయం పాలై ఉండకపోతే పున్నమి చంద్రుణ్ణి ఈ కన్నె నవ్వుమొహంతో పోలిక పెట్టవచ్చు- అని కవి భావన. పున్నమి చంద్రుడిని మించిన అందమైన నవ్వుమొహం ఆ అమ్మాయిదిఅని కవి ధ్వని. నాలుగో పాదంలోని ఆ ‘రేక మోవక’ అనే పదప్రయోగంతో ఎలా సమన్వయించాలో కొమ్ములు తిరిగిన పండితులకూ, పరిష్కర్తలకూ, వ్యాఖ్యాతలకుకూడా అంతు పట్టలేదు. జూలూరు అప్పయ్య గారు ‘చిన్నదాని నొసటితో పడ్డ పోటీలో ఓడిపోయి చంద్రుడు లేఖలు మోసే పని చేయవలసి వచ్చింది’ అని ఏదో పొసగని అర్థం చెప్పే ప్రయత్నం చేసారు. శబ్దరత్నాకరం ‘రేక అనే పదానికి ‘జాబు’ అని ఒక్కర్థం మాత్రమే చెప్పి ఊరుకోవడంతో  వచ్చిన చిక్కు ఇదంతా. దాదాపు 300ఏళ్ళ పాటు  చాలామంది ఇలాంటివే ఏవో అతకని పోలికలతో అన్వయించేందుకు నానా   హైరానా పడ్డారు. నోరివారి దగ్గర్నుంచీ వేదుల, బులుసువారిదాకా ఎంరో తమకు తోచిన ఏదో ఒక అర్థంతో సమన్వయం చేయబోయారు! కానీ.. కవిగారి అంతరంగంలోని అసలు భావం ఏమిటో  తాపీవారు తేల్చిన దాకా ఎవరికీ అంతుచిక్కనేలేదు.
‘రేక’ అంటే గాయంవల్ల శరీరంమీద మిగిలిపోయిన గీత’ అని చేమకూర వెంకటకవిగారి  భావం అని విజయ విలాసంలోని మరో పద్యం ఉదాహరణగా చూపించి మరీ ఒప్పించారు తాపీవారు. మూడో అధ్యాయంలో అర్జునుడు సుభద్రను ఎత్తుకుపోయే సందర్భంలో బలరాముని సేనలతో తలబడవలసి స్తుంది. సుభద్ర యుద్ధంలో  భర్తకు సాయం చేస్తుంది. కృతజ్ఞ్తతతో భార్యను ఆలింగనం చేసుకునే సమయంలో ఆమె నుదుటనున్న కుంకుమరేఖలు చెమటకు తడిసి అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాట్లులాగా పడతాయి. అర్జునుడు చమత్కారంగా
ఒక్కంచుక రేకమోవని నా యురఃస్థలంబున/ నీ కుచకుంకుమ రేఖ లంటించి మీ వారికి సూడు తీర్చితివంటూ  పరిహాసం చేస్తాడు. ఇక్కడ  రేకమోవని’ అనే పదానికి కత్తిగాయం అని మినహా వేరే అర్థం కుదరదు కదా!
శత్రువు ఒంటిమీద ఒక్క దెబ్బైనా వేయకుండా ఓడిపోవడం యోధులకు అవమానం. తన అన్నగారిమీద ఆ అపనింద పడకుండా తన కుంకుమరేఖలతో అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాయంలా చేసి పుట్టింటివారి గౌరవాన్ని సుభద్ర కాపాడిందని కవిగారి చమత్కారం’. తాపీవారి అన్వయం ఇదే. ఇదే అర్థాన్ని మునుపటి  పద్యానిక్కూడా అన్వయించుకుంటే చేమకూరకవిగారి చమత్కారం చక్కలిగింతలు  పుట్టించదూ! ‘చిత్రాంగదతో జరిగిన స్పర్థలో ఓడి వంటికి మచ్చతెచ్చుకోకుండా ఉండి ఉంటే పున్నమిచంద్రుడుకూడా ఈ కన్నెనగుమోముతో పోల్చుకొనేందుకు అక్కరకొచ్చేవాడు కదా!’ అని కవిగారి భావం. తాపీవారి పుణ్యమా అని చేమకూర వెంకటకవిగారి  పద్యంలోని శ్లేష ఉపమాలంకారంతో సహా వెలుగులోకి వచ్చి  ఎలా  మెరుపులీనిందో గమనించారు గదా! విమర్శకుని విశిష్టత ఇలాంటి సందర్భాలలోనే కొట్టొచ్చినట్లు బైటికొచ్చేది.
దేవదాసు సినిమాలో ’కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్’ అని ఒక పాట ఉంది. రాసినవారు మల్లాదివారే అయినా పలుకారణాలవల్ల రికార్డులమీద  సీనియర్ సముద్రాలవారి పేరు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధం అయింది ఆ రోజుల్లో ఆ పాట. చిత్రవిజయోత్సవం జరిగే  ఒక సందర్భంలో వేదికమీదన ఉన్న గీతకర్తని ఎవరో గట్టిగా నిలదీశారుట ’కుడి  ఎడమ వడమేంటండీ అసలు…అర్థమేమన్నా ఉందా ఆ చరణంలో?’ ఆవటా అంటూ. ‘నిజమే కదా’ అనిపిస్తుంది  మనకు కూడా. రాసిన రచయితకి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది కదా! కవిగారు  లేచి నిలబడి సముద్రమంత గంభీర స్వరంతో   ఇచ్చిన వివరణకు శ్రోతలు ఆగకుండా కరతాళధ్వనులు చేశారని ఆరుద్ర ఏదో ఒక సందర్భంలో
రాశారు. ‘కుడి ఎడమ వడమంటే right.. left గా తిరగబడటం అని కాదు అర్థం. కుడిభుజంలాంటి వ్యక్తి దూరంగా జరిగిపోవడం(ఎడంగా వెళ్ళిపోవడం)అనిట! ఇలాంటి వివరణలు ఇవ్వాలంటే కవిలో కారయిత్రి.. భావయిత్రి పాళ్ళు రెండూ సమపాళ్లలో కలసి ఉండాలి.
ఊహ, భావన, బుద్ధి కవికి సహజంగా సిద్దించే వరాలు. కవి తోచింది రాసేసి.. పదిమందిలోకి వదిలేసిన  తరువాత.. శల్యపరీక్షకు సిద్ధపడక తప్పదు. కొలిమిలో మండితేనే కదా బంగారానికైనా మెరుగు. విమర్శక సహిష్ణుత అలవాటు చేసుకుంటేనే ఏ కవికైనా రాణింపు. 
బహుగ్రంథపఠనం వల్ల నేపథ్య విజ్ఞానం, పాఠకులతో నిరంతర సంపర్కం చేత సామాజిక ధోరణులు, సహవిమర్శకులతో నిత్యసంపర్కం వల్ల తప్పొప్పులు పసిగట్టగలిగే సామర్థ్యం  వమర్శకుడి శక్తులు.  అన్నింటికీ మించి విశ్లేషణాత్మకమైన పరిశీలనా లక్షణం విమర్శకుడి   ముఖ్య లక్షణం. మెరుగు  పసిగడితే మెచ్చుకునే సుగుణం అవసరం . విమర్శకుడి నోటినుంచి వచ్చే ఒక్క ప్రశంసావాక్యం చాలు  సృజించిన కర్తను ఏనుగెక్కించి ఊరేగించేందుకు. తపు కనిపిస్తే సున్నితంగా విప్పి చెప్పి  కవి ముందు ముందు మరింత మెరుగైన సాహిత్యం సృజించేందుకు   తనవంతు సాయం చేయవలసిన బాధ్యతా  విమర్శకుడిమీద ఉంటుంది.
అసూయాలు, అలకలు, అభాండాలు.. అలౌకికులము అనుకునే తత్వం కవులకు, విమర్శకులు ఇద్దరికీ శోభనివ్వవు.
విమర్శకుల పాత్ర ఎంత విశిష్టమైనదో కవులు, కవుల సృషితత్వం ఎంత కష్టతరమైనదో విమర్శకులు..వగాహన చేసుకుంటారనే ఇంతగా చెప్పుకొచ్చింది.
***
-కర్లపాలెం హనుమంతరావు





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...