Sunday, February 5, 2017

పెరటి మందు- చతుర కథ




నాలుగు రోజులుగా ఒంట్లో బాగుండటం లేదు. టెంపరేచర్ చూస్తే నార్మల్ గానే ఉంది. కానీ ఆకలి మందగించింది. దాంతోపాటే చురుకుదనమూ తగ్గింది బాగా. ఇదివరకు ఇలాగే సుస్తీ చేసినప్పుడు డాక్టర్ రామనాథంగారి దగ్గర కెళ్లాను. 'అన్నీ వితిన్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం తొందర్లోనే మెజారిటీలో కలసిపోతారు' అన్నాడాయన.

'మెజారిటీ అంటే?'

'మన దేశంలో నలభై ఏళ్ళు దాటినోళ్ళందరికీ బి.పిలు, షుగర్లు తగులుకుంటున్నాయి. ఆ మెజారిటీ' అంటూ నవ్వి టానిక్కులూ అవీ రాసిచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. మళ్లా నెలరోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు.
డాక్టరుగారిచ్చిన మందులే కాదు, ఇంకా చాలా మందులు అదనంగా వాడుతున్నాను చాలా కాలం నుంచి. ఆ డాక్టర్నే కాదు.. ఇంతకుముందు ఇంకా చాలా మందిని కల్సిన కారణంగా.. తగ్గినట్లే తగ్గి మళ్లా సుస్తీ ఎందుకు తిరగ బెట్టేస్తుందో అర్థం కావడంలేదు. అందుకే ఈ అవస్తలన్నీ!

ఒంట్లో ఓపికుండంగానే వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్నాను. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలలో చేరిపోయారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి. 'బ్యాంకు ఉద్యోగం. ఎంతొచ్చినా అవసరానికి మించేం చేసుకుంటాం. బదిలీల మీద ప్రదక్షిణాలు చేయడం  తప్ప' అన్న వేడాంతంతో పదేళ్లు ముందే చేసిన అస్త్రసన్యాసం అది. పనీపాటా లేకపోవడం మొదట్లో సర్దాగానే ఉన్నా.. రాన్రానూ.. సమయం గడవక మహా విసుగు మొదలయింది.
ఎంతసేపు టీవీ చూస్తే కాలక్షేపం అయ్యేను! ఎన్ని పత్రికలు తిరగేసే పొద్దు పోయేను!

ఈ మధ్య కంటి చెకప్పుకని వెళ్లినప్పుడు ఆ డాక్టరూ చావు కబురు చల్లంగా చెప్పేసారు 'మీ ఎడమ కంటికి గ్లాకోమా ఎఫెక్టయింది' అని.

'గ్లాకోమా అంటే?'

'కంటి నరాలకి సంబంధించిన వత్తిడండీ! వంటికి బి.పి లాంటిదే అనుకోండి. చూపులో మెల్లంగా తేడా వస్తుంది. అలిగి పుట్టింటికి పోయిన పెళ్లామయితే మనసు మార్చుకొని తిరిగొస్తుందేమో గానీ.. దీందుంప తెగ!  పోయిన చూపుకు ఆ మాత్రం కూడా దయ ఉండదు. ఎన్ని మందులు వాడినా  చస్తే తిరిగి  రాదు. మానవ సంబంధాలను సరిదిద్దేందుకు ఏమైనా మందులు కనిపెట్టారేమో తెలీదు కానీ.. గ్లాకోమా కారణంగా నష్టపోయిన దృష్టిని తిరిగి తెప్పించడంలో  మాత్రం ఇంత వరకు  ఎవరూ సఫలం కాలేదు.

'డాక్టరుగారి సెన్సాఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసే స్థితిలో లేను నేను. 'మరిప్పుడెలా డాక్టర్ గారూ?' అనడిగాను ఆందోళనగా.

'డోంట్ వరీ టూ మచ్ మిష్టర్ రావ్! అందువల్ల ఒరిగేదేమీ కూడా లేదు. కొన్ని మందులు రాసిస్తాను. క్రమంగా తప్పకుండా వాడాలి. విజన్ లాస్ కట్టడి చేయడం కుదరక పోయినా.. ఆ స్పీడును కాస్త కంట్రోలు చేసుకోవచ్చు. కావాల్సింది పేషెంట్ లో మనో నిబ్బరం.. క్రమ శిక్షణ. భోజనం ఓ పూట మానేసినా సమస్య లేదు. కానీ ఈ మందులు మింగడం మాత్రం మానేయకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ!' అంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాడా కళ్ల డాక్టర్.

కాస్త ఖరీదైన మందులే అయినా క్రమం తప్పకుండా వాడుతున్నాను. అయినా మధ్య మధ్యలో ఈ సుస్తీ పరామర్శలేవిఁటో! నా ఆందోళన చూసి మా పక్కింటి రమణమూర్తిచ్చిన సలహామీద ఇదిగో.. ఈ  పంజగుట్టలో ఉన్న డాక్టర్ సహాయ్ గారిని కలవడానికని వచ్చాను.

'రమణ మూర్తి చెప్పాడు' అంటూ ఆయన క్యాజువల్ గా పరీక్షించి  మళ్లా రెండు రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు. రెంద్రోజులయ్యాక వెళ్లినప్పుడు మళ్లా జస్ట్ క్యాజువల్ గా పరీక్షించి మరో మూడ్రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు! ఆయన చెప్పిన టైముకే వెళ్లాను మూద్రోజుల తర్వాత..  పడుతూ లేస్తూ! యధాలాపంగా  ఏదో చిన్న  పరీక్షలాంటిది  చేసి ..   ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు! వెళ్ళిన ప్రతీ సారీ ఇదే తంతు!  ఏదో చెక్ చేస్తాడు. బరువు చూస్తాడు. ఆకలిని గురించి అడుగుతాడు. ఆహారం అలవాట్లను గురించి అడిగిందే అడుగుతాడు. నాకు ఎందుకో కాస్త అసహజంగా అనిపిస్తుంది. అసహనంగా కూడా ఉంది.  కొంతమంది డాక్టర్లకు పేషెంట్లను ఇలా వూరికే తిప్పుకోడం సరదా అనుకుంటా. సాడిజమా?'డబ్బు కోసవాఁ ఈ తిప్పలన్నీ! అనుకోవడానికీ లేదు ఈయన కేసులో. మొదటిసారి వెళ్ళినప్పుడు ఛార్జ్ చేసిందే! తరువాత ఇన్ని సార్లు వెళ్లినా పైసా అడగడం లేదు. మరెందుకు ఇన్నేసి సార్లు తిప్పించుకుంటున్నట్లు?!

ఈ నెలరోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా ఏవీఁ లేవే?! ఎప్పటిలాగే ఈ డాక్టర్ను కూడా మార్చేయడం ఒక్కటే మంచి మందు.' అని నిశ్చయానికొచ్చేసాను. మార్చేసే ముందు కడుపులో ఉన్న ఆలోచనను  ఆయన ముందు పెట్టడం మంచిదనిపించింది. ఆయన చెప్పిన టైముకి వెళ్లి కలిసాను.

ఎప్పట్లానే బి.పి, బరువు, ఆకలిఆహారం అలవాట్లు.. అన్నీ అడిగాడు. అనుకున్నట్లుగానే మరో మూడు రోజులాగి రమ్మన్నాడు మందూ మాకూ ఏవీ ఇవ్వకుండానే! ఇహ ఉండబట్టలేక గట్టిగానే అడిగేశాను మనసులో ఇంతకాలం బట్టీ రొళ్లుతున్న ఆ  సందేహం!

ఆయన కోపం తెచ్చుకోలేదు. సరికదా.. నవ్వుతూ అన్నాడు 'చూడండి రావుగారూ! మీరు మోతీనగర్లో ఆంజనేయస్వామివారి టెంపుల్దగ్గర కదా ఉంటారు? మా ఇల్లూ ఆ టెంపుల్కి ఆ రెండో వైపే ఉంది. నేను రోజూ అయిదు గంటల ప్రాంతంలో ఆ గుడి పక్క పార్కులో జాగింగ్ చేస్తుంటాను. నేను మిమ్మల్ని అక్కడ చూస్తుంటాను.'

'నన్నా! పార్కులోనా! ఇంపాజిబుల్ సార్! నేనసలెప్పుడూ ఆ జాగింగులూ.. గట్రా కోసం పార్కులకు  రానేఁ!

''జాగింగుకి రారు. కానీ పాల ప్యాకెట్లు పికప్ చేసుకోడానికైతే వస్తుంటారు కదా? నిజానికి మీరా పాకెట్ల వంకతో అయినా మీ ఇంటి నుంచి  నడుచుకుంటూ రావాలి ఈ వయసులో! కానీ స్కూటీ మీద వస్తుంటారు. పార్కు గేటు ముందు స్కూటీ ఆపి పార్కు అడ్డ దారి గుండా అటువైపున్న డాబ్బా నుంచి పేకట్లు తీసుకుని మళ్లా స్కూటీ మీద వెళ్లి పోతుంటారు. నడక మీకు పడదని నాకప్పుడే అర్థమైపోయింది. మీ కేస్ షీట్ చూసాను. ఈ రెండేళ్ళల్లో నలుగురు డాక్టర్లని మార్చేసారు. ఇప్పుడు నన్ను కూడా మార్చేయబోతున్నారేమో! నిజానికి మీరు మార్చాల్సింది డాక్టర్లను కాదు రావుగారూ! మీ అలవాట్లను. లైఫ్ స్టైల్ ని. ఉద్యోగం మానేశారు. అది మీ పర్సనల్. కానీ ఆరోగ్యం కోసం ఆ స్థానంలో మరేదైనా చేయాలి కదా! ముఖ్యంగా శరీరానికి అలవాటైన శ్రమనుంచి వంట్లో ఓపికున్నప్పుట్నుంచే అనవసరంగా విరామమిచ్చేస్తే.. ఇదిగో పరిణామాలిలాగే ఉంటాయి.

నేనేదో సంజాయిషీలాంటిది ఇవ్వబోతుంటే వారించి ఆయనే కొనసాగించాడు 'మీ గురించి మీ నైబర్ రమణ మూర్తి అంతా చెప్పారు. కనీసం అపార్టుమెంటు వెల్ఫేర్  పనుల్లో అయినా బిజీగా గడపేయచ్చు మీ లాంటి ఎర్లీ రిటైరీస్! ఏదో ఓ రూపంలో బాడీకి ఎక్సర్సైజెస్ చాలా అవసరమండీ ఈ రోజుల్లో! సారీ! ఇలా అన్నానని ఏమీ అనుకోకండీ.. ఔట్ పుట్ లేకుండా.. ఒన్లీ ఇన్ పుట్ మీదే ధ్యాస పెట్టేస్తే ఇదిగో.. ఇలాంటి అనారోగ్య సమస్యలే దాడి చేస్తాయ్ శరీరంమీద.  బాడీ బరువెక్కడం.. ఆకలి మందగించడం..ఆసక్తి సన్నగిల్లడం.. ప్రతికూలమైన ఆలోచనలు పెరిగిపోవడం.. ఇవన్నీ సోమరితనం వల్లనే సంభవించేవని వందేళ్ల కిందటే పరిశోధనల్లో తేలాయి. మందులు.. చికిత్సల పేరుతో నేనూ ఇంతకు ముందు మీరు చూపించుకున్న డాక్టర్ల మాదిరిగానే ఎంతైనా గుంజుకోవచ్చు. మీక్కూడా ఏదో ట్రీట్ మెంటు జరుగుతోందన్న తృప్తీ ఉండేది. ప్రిస్కిప్షన్ పేపరి వంక మీరొక్క సారైనా చూసారా?'

'చూడ్డానికి మీరసలు మందులేవైనా రాసిస్తేగదా డాక్టర్!' ఛాన్సొచ్చిందని నిష్ఠురానికి దిగబోయాను.

'మందులు రాయడం లేదా?.. ఏదీ చూపించండి?' అని ఫైల్ తెరిచి ప్రిస్కిప్షన్ పేపరు నా ముందు పరిచారు.

'రోజూ  ఉదయం..  సాయంత్రం ఏదైనా కడుపులోకి తీసుకొన్న తరువాత.. కనీసం ఓ గంటపాటు నడవాలి' అని రాసుంది.. ఇంగ్లీషులో!

నేనా సలహా చూడకపోలేదు. నడవమని సలహా ఇవ్వడం మందులు రాసినట్లెట్లా అవుతుందని నా ఆలోచన. అందులోనూ నాకు మొదట్నుంచి నడకంటే మహా చిరాక్కూడా!

ప్రిస్కిష్పన్నలా వదిలేయండి రావుగారూ! మోరొచ్చిన ప్రతీసారీ నేను నడక ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూనే ఉన్నాను. నా దగ్గర 'ఊఁ' గొడుతూ పోయారే కానీ.. కనీసం మీ ఇంటి దగ్గర పాలడబ్బాకి వెళ్లేటప్పుడైనా పార్కు అడ్డదారిని ఎంచుకోడం మానేయలేకపోయారు! మీరు పార్కు చుట్టూ కాలినడకన వెళ్లి పని ముగించుకోడం మొదలు పెట్టేవరకైనా నేను ట్రీట్ మెంటు మొదలు పెట్టకూడదనుకున్నాను. మొదల పెట్టీ ప్రయోజనం ఉండదు. ఇదివరకటి డాక్టర్లకు మల్లే మీ చేత వందలొందలు ఖర్చు పెట్టించడం.. ఆనక చేతకాని డాక్టర్నని తిట్టించుకోడం తప్ప. పెరటి చెట్టును కదా.. అందుకు చులకనయానేమో మరి.. మీకే తెలియాలి' అని నవ్వుతూ లేచాడు డాక్టర్ సహాయ్!

అప్పుడర్థమయింది.. ఇంటిముందు బంగారంలాంటి పార్కు పెట్టుకొనీ.. జాగింగ్ చేసేందుకు బద్ధకించి రోగలు కొని తెచ్చుకొన్న  నా పొరపాటు. మందులకోసం వేలకు వేలు పోసాను. పదుల కొద్దీ డాక్టర్లను తెగ మార్చేసాను.. లోపం నాలో ఉంచుకొని.

మర్నాడు పాలపాకెట్టుకు బైటకు వెళ్లేటప్పుడు స్కూటీ తీయ లేదు. ఎప్పటి కన్నా ఓ గంట ముందే లేచి బైటకు వెళ్లే నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం నేను గమనించక పోలేదు.

పార్కులో జాగింగ్ చేస్తున్న డాక్టర్ సహాయ్ నన్ను చూసి గుర్తు పట్టి 'హాయ్' అంటూ చేతులూపాడు కూడా! నెక్స్ట్ విజిట్ కి వెళ్లినప్పుడు 'పార్కు చుట్టూతా అలా నెమ్మదిగా కాకుండా ఇంకాస్త వేగంగా పరిగెడితే.. నెనిప్పుడు రాసిస్తున్న మందులు మరీ ఎక్కువ కాలం వాడాల్సిన పనుండదు' అని భుజం తట్టాడు డాక్టరు సహాయ్ గారు!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూఎస్ఎ

 

(చతుర- ఆగష్టు, 2012 నెల సంచిక ప్రచిరతం)

 

Wednesday, February 1, 2017

ఫొటో ఆల్బమ్- విపులలో నా కథ



ఆ రోజు వర్కింగ్ డే. ఇంట్లో ఎవరూ లేరు. ఆయనా, పిల్లాడూ డ్యూటీల కెళ్లారు. పనమ్మాయి పని ముగించుకొని వెళ్ళేసరికి పదకొండు గంటలు దాటింది. స్నానం చేసి రిలాక్సుడ్ గా టి.వి చూస్తూ కూర్చోనున్నాను. బైట గేటు తీసిన అలికిడి. ఒక పెద్దాయన.. సుమారు అరవై.. అరవై ఐదేళ్లుంటాయేమో.. గేటు తీసుకుని లోపలికి వచ్చి పద్ధతిగా చెప్పులు ఓ మూల విడిచి వరండాలో ఉన్న పేము కుర్చీలో కూలబడి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటున్నాడు.
ఎప్పుడూ చూసిన మొహంలా లేదు. 'ఎవరు కావాలండీ?' అనడిగాను బైటికొచ్చి.
'రామ్మోహనరావుగారు ఉన్నారామ్మా?' అనడిగాయన చేతిసంచీ ఓ పక్కకు పెట్టుకొంటూ. ఆ పేరుగల వాళ్లెవ్వరూ మా ఇంట్లోనే కాదు.. మా చుట్టుపక్కలకూడా  లేరు. ఆ మాటే చెప్పాను.
'అయ్యో! ఇది మోహనరావుగారిల్లన్నారే!' అని గొణుక్కుంటూ లేచి నిలబడ్డారాయన. 'పాపం' అనిపించింది. మా నాన్న వయసుంటుంది ఆయనకు.
చెప్పులు వేసుకుంటూ అడక్కుండానే చెప్పుకొచ్చాడాయన. 'రామ్మోహనరావంటే మా అల్లుడేనమ్మా! ఇక్కడే ఎక్కడో ఆంధ్రాబ్యాంకులో చేస్తున్నాడాయన. బ్రాంచి పేరు గుర్తుకు రావడం లేదు. ఎప్పుడూ ఒక్కడినే రాలేదు. ఎప్పుడు వచ్చినా అమ్మాయి పక్కనే ఉండేది. నారాయణాద్రికి వస్తున్నానని చెప్పానమ్మా! అల్లుడుగారిని పంపిస్తానంది. ఎందుకు రాలేదో?' అనుకుంటూ బైలుదేరాడాయన.
'పక్క బజారులో ఆంధ్రాబ్యాంకుంది బాబాయిగారూ! అదేమో చూడండి!' అన్నాను గేటుదాకా బైటికి వచ్చి దారి చూపిస్తూ. ఆయన వీధి మలుపు తిరిగిందాకా చూసి లోపలికొచ్చేసాను. పెము కుర్చీ పక్కన పెట్టిన చేతిసంచీ అలాగే ఉంది, 'అయ్యో' అనుకుంటూ సంచీ తీసుకొని మళ్లా వీధిలోకి పరుగెత్తాను. కానీ అప్పటికే పెద్దాయన వీధి దాటినట్లున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
ఇక చేసేదేం లేక ఆ సంచీని లోపలికే తెచ్చి ఓ మూల పెట్టేసాను.. మళ్లా వస్తే ఇవ్వచ్చులే అని.
ఆ పూటకి ఎవరూ రాలేదు.
మావారు సంచీని చూసి అడిగితే వివరంగా అంతా చెప్పాను. 'ఎవర్ని బడితే వాళ్లని అలా లోపలికి రానిచ్చేయడవేఁనా? అసలే రోజులు బాగో లేవు. ముందా సంచీ తీసవతల పారేయ్!' అని కూకలేసారు. ప్రద్దానికీ క్లాసు పీకటం ఆయనకో అలవాటు.
మా అబ్బాయయితే ఒహటే ఆట పట్టించడం.. 'తాతగారిచ్చిన గిఫ్టులు చెరి సహం షేర్ చేసుకొందాం మమ్మీ!' అంటూ.
రెండో రోజూ బ్యాగుకోసం ఎవరూ రాకపోయేసరికి నాకూ అనుమానం మొదలయింది. 'ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న అల్లరి కాదు గదా!' అనిపించింది. వీధి చివరిదాకా వెళ్లి ఆంధ్రాబ్యాంకులో అడుగుదామని వెళ్ళాను ఆ మర్నాడు. ఇదివరకు బ్యాంకు ఉండేచోట ఇప్పుడేదో కన్ స్ట్రక్షన్ నడుస్తోంది. 'బ్యాంకు క్రాస్ రోడ్డుమీదకు షిఫ్ట్ చేశారు కదమ్మా!' అన్నాడు అక్కడే ఉన్న మేస్త్రీ. ఇంటికొచ్చి అనుమాన నివృత్తికోసం అసలు బ్యాగులో ఏముందో చూద్దామని బైటికి తీసాను.
ముసలివాళ్ల బ్యాగుల్లో ఏవుంటాయి? రెండు పంచలు.. లాల్చీలు.. కళ్లజోడు.. మందుల డబ్బా.. ప్లాస్టిక్ రేపర్లో చుట్టున పేస్టూ.. బ్రష్షూ.. సోపు.  భగవద్గీత పుస్తకం. పుస్తకం మధ్యలో ఏదో పెళ్ళి ఫొటో. కొత్త దంపతులాల్గున్నారు, చూడముచ్చటగా ఉంది జంట. ముసలాయన కూతురు.. అల్లుడు కాబోలు!
స్కూలు పిల్లల సైన్సు రికార్డు సైజులో ఒక పెళ్లి ఫొటో ఆల్బమ్ కూడా ఉంది. పెళ్లి కూతురు ఫొటోలోని అమ్మాయే కానీ.. పెళ్లికొడుకు పొటోలోని అబ్బాయి కాదు!
న్యూస్ పేపర్తో చూట్టి రబ్బరు బ్యేండ్లేసిన ఇంకో కట్టకూడా కనిపించింది. ఎందుకులే మనకీ పాడు గోల అనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడ యథాతధంగా సర్దేసి బ్యాగును స్టోర్రూం అటకమీద పెట్టించేసాను.. ఎవరన్నా వచ్చి అడిగితే ఇవ్వచ్చులే అని ఆలోచన,
ఆ రోజు ఆదివారం, మా వారికి చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందే. నిద్ర లేవంగానే మహా సంబరంగా బజారుకు బైలుదేరారు.
ఆయన చెప్పులేసుకుంటుంటే.. మటన్ షాప్ పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంకు గుర్తుకొచ్చింది. 'వీలయితే ముసలాయన్ను బేగు తీసుకు వెళ్లమని చెప్పి రండి' అని హెచ్చరించానీయన్ని.
ధుమధుమలాడుతూ వెళ్లిన మనిషి తీరిగ్గా తిరిగొచ్చి 'బ్యాంకు మూసుంది. నెంబర్ తెచ్చాను చూసుకో!' అంటూ సెల్లో స్టోర్ చేసుకొచ్చిన నెంబరొకటి నా మొహాన కొట్టారు. అదీ సెల్ నెంబరే!
మధ్యాహ్నం ఆ నెంబరుకి కాల్ చేస్తే 'హలో!' అంది ఓ మగ గొంతు. 'సార్! మీరు ఆంధ్రా బ్యాంకు రామ్మోహనరావుగారేనా?' అనడిగాను.
'యెస్! వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?'
'విషయం వివరించడానికి చాలా తంటాలు పడాల్సొచ్చింది. అంతా విని చివర్లో 'మీరేమంటున్నారో నాకర్థం కావడంలేదు మ్యాడమ్! మా మామగారు పోయి రెండేళ్లయిందే!' అన్నారు. లైన్ కట్ అయింది. మళ్లో కాల్ చేసినా రెస్పాన్ లేదెంత సేపటికీ. ఇంకీ విషయం ఇంతటితో 'ది ఎండ్' అయిందని అర్థమయి పోయింది నాకు.
మూడు రోజుల తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల పాంతంలో లాండు లైనుకి ఓ ఆడమనిషి కాల్ చేసింది. 'ఆదివారం మధ్యాహ్నం మావారి సెల్ కి ఈ నెంబర్నించీ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకోవచ్చా?' వినయంగానే ఉందా గొంతు.
'ముందు మీరెవరో చెప్పండి!' అనడిగాను నేను.
'ఆంధ్రాబ్యాంక్ రామ్మోహనరావుగారి వైఫ్ నండీ! మీతో కాస్త మాట్లాడ వచ్చా మేడమ్?'
'మాట్లాడండీ!'
'ఇలా ఫోన్లో కాదు. మీకు అభ్యంతరం లేదంటే ఒకసారి మీ ఇంటికి వస్తాను'
'రండి!' అంటూ ఇంటి అడ్రసు చెప్పాను.
అరగంటలో ఆటోలో వచ్చింది. గేటు తీసుకొని లోపలికి వస్తుంటేనే గుర్తు పట్టాను.. ఆమె ఆ ఫొటోలోని అమ్మాయే! కాకపోతే కాస్త వయసు పెరిగి వళ్లు చేసింది. కూర్చోమన్నాను.
బిడియంగా కూర్చుంది. 'ఇంట్లో ఎవరూ లేరా?' అని అడిగింది చుట్టూ చూస్తూ.
'లేరు' అన్నాను.
రిలీఫ్ ఫీలయింది. స్తిమితంగా 'మీరు మావారితో మాట్లాడిందంతా విన్నాను మేడమ్! బ్యాగు ఇంకా ఇక్కడే ఉందా?' అనడిగింది.
'సంచీ తెచ్చిచ్చి 'అన్నీ  ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి!' అన్నాను. బ్యాగందుకుంది కానీ.. లోపలేమున్నాయో చూసుకోలేదు. 'చాలా థేంక్సండీ!' అంటూ బైలుదేరింది హడావుడిగా.
'మంచిదమ్మా! నాన్నగారు బాగున్నారు కదా?'అనడిగాను చెప్పులేసుకుంటున్న ఆమెను చూసి.
'ఆయన మా నాన్నగారు కాదు మ్యాడమ్. మా ఊరాయన. ఈ ఆల్బమూ, డబ్బూ ఇచ్చి వెళదామని వచ్చాడు. రావాలంటే మా ఇంటికే రావచ్చు. కావాలనే ఇవి మీ ఇంట్లో వదిలేసినట్లున్నాడు'
'అదేందీ?!'  అనరిచాను ఒక్కసారి షాకయినట్లు.  ఆ సంచీలో కేషున్నట్లు నాకిప్పటిదాకా తెలీనే తెలీదు!
వెళ్లే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చింది. 'ఇదంతా మీకు చెప్పకూడదో.. లేదో.. నాకు తెలీదు. మా అమ్మలాగా ఉన్నారు. చెప్పకబోతే బావుండదు. ఆయన మా ఊరి పెద్దబ్బాయిగారు. పెద్ద ఫొటో స్టూడియో ఉండేది వాళ్లకు. మా ఊళ్లో ఎక్కడ ఏ ఫంక్షను జరిగినా వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసేవాళ్లు. వీళ్లబ్బాయి ఇంటర్లో నా క్లాస్ మేట్. మంచివాడు కాదు. నా వెంటబడి వేధించేవాడు. ఒకసారి క్లాక్ టవర్ దగ్గర చెప్పుతో కొట్టాను కూడా. అది కడుపులో పెట్టుకున్నాడు. మా ఫ్రెండు పెళ్లికి వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసారు. దాని ప్లేసులో నా బొమ్మలు పెట్టి సి.డి.లు తయారు చేసాడు. రెండు లక్షలివ్వకపోతే బైటపెడతానని అల్లరి పెట్టేవాడు. మా నాన్నగారు మామూలు బడిపంతులు. నా పెళ్లికే నాలుగు లక్షలుదాకా ఖర్చయిందా రోజుల్లో. ఇంకో ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఆ దిగులుతోనే హార్టెటాకొచ్చి పోయారు' అని ఎడుస్తోందా అమ్మాయి.
ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పాపం.. ఎంతకాలంనుంచీ కడుపులో దాచుకుందో!
తనే తమాయించుకొని వెళ్లడానికి లేస్తూ అంది 'అప్పట్లో మా నాన్నగారి పెన్షష్ నుంచీ ఒక లక్ష ఇచ్చి సి.డి తీసుకున్నాం ఆంటీ! కానీ ఇలాంటిదే ఇంకో ఆల్బంకూడా తయారు చేసాడని తెలీదు. తరువాత ఆ అబ్బాయి ఇలాంటివే ఏవో గొడవల్లో ఇరుక్కుని చచ్చిపోయాడు. పాపం.. పెద్దబ్బాయిగారికి ఇతనొక్కడే కొడుకు. పెద్దాయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. స్టూడియో వేరే వాళ్లకి అమ్మేశాడు. కొన్నాయనకు స్టాకు అప్పగించే టైంలో ఈ ఆల్బం బైటపడిందట. కొడుకు చేసిన నిర్వాకం అప్పటిదాకా ఆయనకూ తెలీదు. తెలిసి చాలా బాధపడ్డాడుట. ఈ ఫోటోలు.. ఇవీ ఇంకెవరైనా చూస్తే ప్రమాదమని నేరుగా నాకే ఇచ్చేద్దామని వచ్చాడు. ఇంటికొస్తే రెండు మూడు సార్లు మావారే కనిపించారుట. ఆయనకివ్వలేక మీ ఇంట్లో వదిలేసి పోయాడీ సారి'
'మధ్యలో మా ఇల్లు పిక్చర్లోకెలా వచ్చిందీ?! మా ఇంట్లో ఇవ్వాలని ఎందుకనిపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'అంకుల్ ఏవో కథలూ అవీ పత్రికలు రాస్తారుట కదా! పోయిన నెల్లో మీ ఇంటి అడ్రసు ఏదో పత్రికలో చూసారుట! మా ఇంటికి మీ ఇల్లు దగ్గరనే కావాలని ఈ బ్యేగు మీ ఇంట్లో వదిలేసి పోయాడాయన.'
'పెద్దబ్బాయిగారి భార్య నిన్న కాల్ చేసి  ఈ ఫొటోలు.. డబ్బూ ఇలా మీ ఇంట్లో ఉన్నాయి. తెచ్చుకొని ఫొటోలు కాల్చేయమ్మా!' అని చెప్పింది మేడమ్! ఈ లక్ష అప్పట్లో మేము వాళ్లబ్బాయికి ఇచ్చింది. మధ్యలో మీకు ట్రబులిచ్చాం. సారీ!' అని లేచిందామె.
'ఫర్వాలేదులేమ్మా! నా కూతురులాంటి దానివి. ఇందులో మేం చేసింది మాత్రం ఏముంది? పెద్దదాన్ని కనుక ఒక సలహా చెబుతాను. ఈ ఫొటోలను ఇక్కడే తగలేసి పోతే నీకు మంచిది' అన్నాను.
ఆ అల్బం మా ఇంట్లోనే బూడిద చేసి డబ్బుతీసుకొని పోయే ఆమెని ఇంకో ధర్మసందేహం అడిగాను. 'ఇంతకీ ఆ పెద్దాయన ఇప్పుడెలా ఉన్నాడో! ఆయన్ని చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొచ్చారు.. పాపం'
'ఇక్కడికొచ్చిన మర్నాడే ఆయన మంచం పట్టి మూడ్రోజుల కిందటే పోయాడు ఆంటీ! ఆల్రెడీ కేన్సర్ పేషెంట్. ఈ తిరుగుడికీ దానికీ జాండీస్ వచ్చిందన్నారు.' అని వెళ్లిపోయిందా అమ్మాయి. పెద్దాయన సంచీని మాత్రం ఇక్కడే వదిలేసింది.
ఆ బ్యేగుని పారెయబుద్ధి కాలేదు నాకు. అటకమీద పెట్టేసాను. ఆ సంచీని చూసినప్పుడల్లా ఫొటోలు.. డబ్బే కాదు.. ఒక మంచిమనిషి మనస్తత్వం గుర్తుకొస్తుంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(విపుల- ఏప్రియల్- 2010 సంచికలో ప్రచురితం)






Tuesday, January 31, 2017

"నిజమే.. కానీ!"- కౌముది కథానికల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథానిక


విశ్వాసానికి తర్కానికి ఆమడ ఎడం
             *       *         *
ఆగకుండా కురుస్తోంది వర్షం. ఇవాళ్టికి మూడో రోజు.
పెనుగాలుల మూలకంగా  కరెంటు లేక.. మధ్యాహ్నం మూడింటికే సాయంత్రం ఆరుదాటినట్లుంది వాతావరణం.శలవులకని ఇంటికి వచ్చిన మూర్తికీ  హౌస్ అరెస్టు చికాకుగా ఉంది.
కాలుగాలిన పిల్లిలాగా లోపలికి, బైటికి తిరిగే కొడుకును చూసి చిన్నగా నవ్వుకుంది సుభద్రమ్మగారు. 'పట్నం కులాసాలకి అలవాటు పడ్డ ప్రాణంముసలాళ్ళకి మల్లే ఇంటి పట్టునుండాలంటే చిరాకే మరి. పొద్దుపోయే సాధనాలేవీ కొంపలో లేకపాయ. బొమ్మ్లల పెట్టున్నా ఏం లాభం..  కరెంటు లేకపోతే అది వట్టి బొమ్మపెట్టే. రేడియాలో బ్యాటరీలు లేవు. అవి కావాలన్నా ముందు పట్నందాకా పోయి రావాలి'.
" చదివిన పేపరే ఎన్ని సార్లు చదువుతారు గానీ అబ్బాయిని కూర్చోబెట్టుకుని కాస్తేదన్నా కాలక్షేపం  చెయ్యరాదూ! పొద్దు గడవక పాపం పిల్లాడెట్లా  గిలగిలలాడిపోతున్నాడో! మీకేదీ  పట్టదాయ!" అంటూ ముందు గదిలో పేపరు తిరగేస్తున్న సుందరయ్య దగ్గరికొచ్చి మొత్తుకుంది సుభద్రమ్మ
సుందరయ్య చదివే పేపరు పక్కన పారేసి "మూర్తీ!" అని లోపలికి కేకేసాడు.
మూడో పిలుపుకి గానీ మూర్తి ఊడి పడలేదు.
"చదరంగం ఆడదాముట్రా కాస్సేపు.. నీతో ఆడి చాలా కాలమైందిఅనడిగాడు సుందరయ్య.
"ఒద్దులే నాన్నా! ఓడిపోతే చాలా ఫీలైపోతావు" అన్నాడు మూర్తి అదోలా నవ్వి.
"ఓడటమా? నీతోనా? అదీ చూద్దాం.. బోర్డు సర్దరా ముందూ" అన్నాడు సుందరయ్య తెల్లటి మీసాలు దువ్వుకుంటూ.
"వట్టి ఆటైతే బోరు. ఏదైనా పందెం కాయండి.  ఇంటరెస్టుగా ఉంటుంది" అన్నాడు మూర్తి కాయలు సర్దుతూ.
" పందేలు కాస్తావుట్రా.. ఇదెప్పట్నుంచీ? అంత పెద్దాడివై పోయావేం అప్పుడే!" అంటూ మందలింపులకి దిగబోయింది సుభద్రమ్మ. సుందరయ్యే అడ్డొచ్చాడు "అందులో తప్పేముందిలేవే. ఇంట్లో మనతోనేగా ఆడేదీ! కాకపోతే అబ్బాయిగారికీ సొంత సంపాదన ఎప్పణ్నుంచో.. ఆ సంగతి కనుక్కో ముందు. నా డబ్బులతో నా మీదే పందెం కాయడం.. ఆహా.. ఇదో కొత్త తరహా  పందెం కాబోలు ఈ కాలం పిల్లలకి!"
తండ్రి వెటకారం ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పసిపిల్లాడేం కాదు మూర్తి. బెంగుళూర్లో థర్డియర్ ఎమ్.టెక్ చేస్తున్నాడు.
"డాడీ! మర్చిపోయారేమో కానీ.. మీరు నాకో బైకు బాకీ. పోయిన బర్త్ డేకే రావాల్సిన బండి.. పంటలు బాగా లేవని వాయిదా వేసాం. సుమారు ఆరవై వేలు. బెస్టాఫ్ త్రీలో నెగ్గండి.. ఆ డిమాండును స్వచ్చందంగా వదులుకుంటా.. ఓకేనా" అన్నాడు మూర్తి రోషంగా.
"సరేలేరా.. ముందు ఓడించు చూద్దాం" అని నవ్వుకుంటూ తన తెల్లబలగంలోని పావుని రెండు గడులు ముందుకు దూకించాడు సుందరయ్య.
వెంటనే మూర్తీ తన వంతు  ఎత్తువేసి తల్లి వేపు సాభిప్రాయంగా నవ్వుతూ చూసాడు.
మొదలు పెట్టడమే కష్టం. మొదలైంతరువాత ఆపడం అంతకన్నా  కష్టం.. చదరంగం తీరే అంత. స్వయంగా ఆడలేదు కానీ సుభద్రమ్మగారికి భర్త ఆటల పిచ్చితో పెళ్ళినాటినుంచీ పరిచయమే. ఆయన గవర్నమెంటు హైస్కూల్లో డ్రిల్లు టీచరు. ఈ మధ్యనే పదవీ విరమణ చేసాడు. తండ్రి తర్ఫీదులో మూర్తీ బాగానే పుంజుకున్నాడు. ప్రస్తుతం అతనే వాళ్ళ యూనివర్శిటీ చెస్ చాంపియన్.
ఐదు నిమిషాల్లోనే తండ్రీ కొడుకులిద్దరూ ఆటలో లీనమై పోయారు.
మరో మూడు గంటల దాకా ఇద్దరూ గుళ్లో విగ్రహాలే.
చీకటి చిక్కపడుతోంది.
'దీపాలు సిద్దం చెయ్యకపోతే  ఎంత రాద్దాంతమవుతుందో తెలుసు. పిల్లాడికీ, ఆయనకీ ఇలాంటి వేళ వేడి వేడి పకోడీలంటే ఎంతో ఇష్టం.'
ఆ తయారీకని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మగారు. హాల్లోనుంచీ తండ్రీ కొడుకుల మాటలు  వాన హోరు మధ్య వింటూ పనిలో పడిపోయింది.
"తోసి రాజు".. మూర్తి గొంతుసుందరయ్య గొణుగుడు.  ఏదో  కాదని గట్టిగా వాదులాడుతున్నాడు కొడుకుమీద.
మొత్తానికి అబ్బాయి చేతిలో ఆయనగారికేదో గట్టి దెబ్బే తగిలినట్లుందీ! ఆ గిజగిజలు వింటుంటే అర్థవవడంలా!
మూర్తి కొత్త బుల్లెట్ మీద తండ్రి నెక్కించుకుని ఊరి మధ్యనుంచి దర్జాగా పోతున్నట్లు ఓ ఊహ తటాలుమని బుర్రలో మెరిసింది. సుభద్రమ్మగారి పెదాల మీద చిరునవ్వు విరిసింది.
'పందెం సంగతెలా ఉన్నా ఈ ఏడాది మాత్రం మూర్తికి తప్పకుండా బండి కొనివ్వాలి. ఒక్కగా నొక్క నలుసు. ఇంటికి వెలుగు.  పంటల బాగోగులతో నిమిత్తం పెట్టుకోకూడదీసారి. అంతగా ఐతే చేతి గాజులైనా సరే..'
హాల్లోనుంచి కొత్త గొంతు వినిపించే సరికి సుభద్రమ్మ ఆలోచనల చైన్ తెగిపోయింది.
చేస్తున్న పని ఆపి బైటికి తొంగి చూసింది.

*     *     *
ఎవరో కొత్త మనిషి. ఎప్పుడూ చూడని మొహం. ఆకారం ఒకింత వింతగానే ఉంది.
భుజం చుట్టూ కాషాయం రంగు శాలువా.. కిందేమో అబ్బాయి వేసుకునే లాంటి ఇరుకు ప్యాంటుభుజానికి ఓ జోలెలాంటిది వేలాడుతున్నది. సగం సన్యాసి.. సగం సంసారి లాగుంది వేషం.
గలగలా మాట్లాడుతున్నాడు.  'ఏట్లో పోటు మహా ఉద్దృతంగా ఉంది స్వామీ. అక్కడికీ మొండికేసి సగం దూరందాకా వెళ్లా . నా వల్ల కాలా. ఊళ్లోకి వస్తుంటే  మొదటగా మీ ఇల్లే కనబడింది. వాన వెలిసిందాకా తల దాచుకోక తప్పదు కదా! ఈ వరండాలో కూర్చుంటా.. మీకెవ్వరికీ ఇబ్బంది కలిగించను' అని చెప్పుకొస్తున్నాడు.
'పాపం' అనిపించింది సుభద్రమ్మ గారికి.  తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుంటేనే చలిగాలికి వళ్ళు గజగజలాడి పోతున్నది. నడి వయసు మనిషికి.. ఎంత కష్టం.. రాత్రంతా బైట వరండాలో అంటే'
వాకిలి తలుపులు బార్లా తీసుండటం వల్ల జల్లు లోపలికి కొట్టి గదంతా రొచ్చు రొచ్చవుతున్నది.
"మూర్తీ! ముందా తలుపులు వేసేయరా.. ఆయన్నొచ్చి లోపల  కూర్చోమను" అంది సుభద్రమ్మగారు వంటింటి గుమ్మాని కవతలే నిలబడి.
మూర్తి తలుపులు మూసి వచ్చి కూర్చున్నాడు.
వేసిన తలుపులకు పక్కనే గోడకు చేరగిలబడి కూర్చుండి పోయాడా కొత్త మనిషి. సుభద్రమ్మవంట పనిలో కెళ్ళిపోయింది.
ఆటాడుతూనే  ఆ మనిషితో మాటల్లో పడ్డాడు సుందరయ్య.
ప్రసంగ వశాత్తూ చాలా కొత్త విషయాలే తెలిసాయి. ఆ సన్యాసి పూర్వ నామం భైరవయ్యట. పొద్దుటూరు నివాసి. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికని పోయి భార్యా బిడ్డలిద్దర్నీ గంగలో పోగొట్టుకున్నాట్ట. ఆ వైరాగ్యంతో చేసే బంగారం వ్యాపారం చాలించుకుని ఇట్లా దేశాలు పట్టి తిరుగుతున్నానని చెప్పాడు. 'కైలాసగిరి నుంచి కన్యాకుమారి దాకా తిరగని పుణ్యక్షేత్రం లేదు స్వామీ! మనశ్సాంతి కోసం  ఆరాటం. నీడలా వెన్నంటుండే ఇల్లాలు, బిడ్డా.. ఇద్దరూ ఒకేసారి  కనుమరుగయిపోయాక గానీ .. జీవితంలోని డొల్లతనం బైట పడలేదు." అంటూ ఓ  మెగా సీరియల్ కి సరిపడా కథాగానం చేసాడా సెమీ సన్యాసి.
ఇంట్లో వాళ్ళతోపాటే వేడి వేడి పకోడీలు  ఒక ప్లేటులో పెట్టిస్తే ఇంత వేదాంతమూ వల్లించిన సన్యాసి 'ఉల్లివి కదా వద్ద'నలేదు సరికదా.. ఒక్క పలుక్కూడా మిగలకుండా ప్లేటు మొత్తం నిమిషంలో లాగించేసాడు.
ఆరగింపుల పర్వం అలా కొనసాగిస్తూనే ఓ కంట తండ్రీ కొడుకుల ఆటమీద కన్నేసీ వుంచాడు.
ఒక రౌండు అప్పటికే మూర్తి గెలిచి ఉన్నాడు. రెండో రౌండు చివర్లోకొచ్చి అడ్వాంటేజిలో ఉన్నాడు. సుందరయ్య తన  రాజుని అన్ని రకాలా  ఇరకబెట్టుకుని తప్పించుకునే దారి తోచక తన్నుకులాడుతున్న తరుణంలో..
అమాంతం బల్ల ముందుకు దూకేసి " ఈ కుడి వైపు ఏనుగుని బలిచ్చేయండి స్వామీ.. రాజు తప్పుకొనే తోవ అదే ఏర్పడుతుంది!" అని సలహా పారేసాడు. సుందరయ్య శషభిషలు చూసి తనే చొరవగా ఏనుగుని ఎదుటి పక్షం ఏనుగు ముందు మోహరించేసాడు. 'హుమ్' అని మూలిగాడు సుందరయ్య మరో మార్గమేదీ తోచక.
'ఇదొక ఎత్తా' అనుకుంటూ అమాంతం  ఆ బలగాన్ని తన ఏనుగుతో  ఎత్తికుదేసే ఉత్సాహంలో  తన రాజు అరక్షణ గోతిలో పడిపోవడం గమనించనే లేదు  మూర్తి కూడా.
ఏనుగు ఖాళీ చేసిన ఆ స్థానంలోకి వెంటనే మంత్రిని తోసేసి 'షా' అని సుందరయ్య బిగ్గరగా అరవడం.. మూడే మూడు నిమిషాలపాటు సంపూర్ణ ధ్యానంలోకి వెళ్ళినా లాభంలేక.. మూర్తి  పూర్తిగా చేతులెత్తేయడం.. క్షణాల్లో జరిగి పోయాయి.
ఆట గెలిచిన సుందరయ్య ఆనందం అంతా ఇంతా కాదు.
 ఆశ్చర్యంగా సన్యాసి వైపు చూసి "బంటును ఏనుగని.. మంత్రిని రాజని అంటుంటే   బేసిక్సు కూడా తెలీవని పొరబడ్డా స్వామీ! మీరు ఇంతాట పెట్టుకుని.."
తలడ్డంగా ఊపాడా సన్యాసి నవ్వుతూ " నిజంగానే నాకీ ఆట 'అ ఆ' లు కూడా తెలీవు స్వామీ! మీరాడే తీరు చూసి తోచిన సూచన చేసానంతే.  ఇదంతా నా గొప్పతనమా?.. దీనిది కానీ" అంటూ మెడలో వేలాడే గొలుసు వంక చూపించాడు.
మెరుపు తగ్గిన బంగారపు గొలుసది.  లాకెట్ స్త్ఘానంలో ఏదో ఎర్రరంగు రాయి వేలాడుతున్నది.
సుందరయ్యమొహంలో అయోమయం. మూర్తి మొహంలో చిరునవ్వు. సన్యాసి మెళ్లో బంగారపు గొలుసంటే నవ్వు రాదా మరి హేతుబద్ద్ధంగా ఆలోచించే బుద్ధిమంతుల కెవరికైనా! ఎంగిలి ప్లేట్లు ఎత్తు కెళ్ళటానికని వచ్చిన సుభద్రమ్మగారు  సన్యాసి మాటలు శ్రద్దగా వింటో అక్కడే నిలబడి పోయింది.
"ఇది వంటిమీద గుండెల్ని తాకుతున్నంత సేపూ మనసులో వున్నదంతా వాస్తవమై తీరుతుంది. ఆటలో మీకు సాయం చేసేటప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే కోరిక  'ఈ అబ్బాయి ఎట్లాగైనా ఆ ఏనుగుమీద ఆశతో రాజు కాపుగడిని ఖాళీ చేసెయ్యాల'ని. మీ కళ్లతోనే  చూసారుగా.. ఏం జరిగిందో! అదీ ఈ రాయి మహత్యం. మీ ఇంటి గుమ్మం ముందు తడిబట్టలతో నిలబడున్నప్పుడు నన్ను లోపలికి రానీయాలా.. వద్దా అని మీమాంస పడ్డారు   మీ అబ్బాకొడుకులిద్దరూ. ఎక్కడో లోపల వంటింట్లో పని చేసుకునే ఈ తల్లి పనిమాలా వచ్చి మీ చేత  లోపలికి పిలిపించింది. అదీ ఈ రాయి మహిమే"
మూర్తి మొహం చూసి మళ్లీ అన్నాడా సన్యాసి మీరు నమ్మడం లేదని తెలుస్తూనే ఉంది. మీ వయసుకది సమంజసమే! దీని శక్తిని మరో సారి నిరూపిస్తా..  చూడండి. మూడు రోజుల బట్టీ ఈ ప్రాంతంలో కరెంటు నిలకడగా ఉండటం లేదు కదా! "
" కొంప తీసి ఇప్పుడుగానీ కరెంటు పుట్టిస్తానంటారేమిటి?" అన్నాడు మూర్తి. ఎంత వద్దనుకున్నా గొంతులో హేళన దాగడం లేదు. పట్టించు కోలేదా సన్యాసి.
" శ్రీ మల్లికార్జున స్వామివారి సుప్రభాతం  చదువుకుంటూ పోతుంటా స్వామీ ఒక వరసలో.  ఈ లోపలొక  ఐదారు నిమిషాలపాటైనా విద్యుద్దీపాలు వచ్చిపోతే ఈ  రంగురాయిలో శివసత్తువ ఉన్నట్లే లెక్క" అంటో  చప్పట్లు కొట్టుకుంటో శ్లోకాలు చదవడం  ఆరంభించాడు.
"ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం
సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్।
కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్।.."
ఆశ్చర్యం!
"..నమస్తే నమస్తే మహాదేవ శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ!.." అంటూండగానే తటాలుమని గదిలో దీపాలు వెలిగాయి.
ఎప్పుడు ఆన్ చేసుందో టీవీ స్పోర్ట్స్ చానెల్.. ఒన్-డే చివరి ఓవర్ లాస్త్ బట్ ఒన్ డెలివరీకని జడేజా స్టంప్స్ వైపు దూసుకొచ్చేస్తున్నాడు. చూస్తుండగానే అతగాడు విసిరిన బాలుని  గేల్ ఎదురెళ్లి బలంకొద్దీ బాదడం.. గాల్లోకి లేచిన బంతి సరిగ్గా బౌండరీ లైనుకి ఇంచికిటుగా నిలబడ్డ ఫీల్దరు పట్టిన దోసిట్లో.. పడినట్లనిపించడం! స్లిప్పయినట్లూ ఉంది.. 'సిక్సర్'అని  కామెంటేటర్ల అరుపులు వినిపించడం. గ్యాలరీ జనాల గోల మధ్య .. విన్ అయిందో విండీసో.. చాంపియనయిందో ఇండియన్సో.. క్లియరయే లోపలే.. మళ్ళా ఠప్పుమని కరెంటు పోనే పోయింది.
పూర్తిగా మతి పోయినంత పనయింది సుందరయ్య దంపతులకు.
మూర్తీ ఆలోచనలో పడ్డాడుపూర్తిగా నమ్మడానికి హేతువాదం అడ్డొస్తున్నది.
"నాకంతా అర్థమవుతూనే ఉంది. నీకింకా పూర్తివిశ్వాసం కలగనే లేదు కదా స్వామీ.. పోనీ వదిలేయండి"  అన్నాడా అర్థసన్యాసి అదో రకమైన నిర్వేదంతో.
సుభద్రమ్మగారు అప్పుడే  విస్తరి నిండా భోజనం తెచ్చి సన్యాసి ముందుంచింది.  "తల్లీ! మీరింత అభిమానం చూపిస్తున్నారు. చీకటని కూడా చూడకుండా  ఓపిగ్గా ఇన్నేసి అనుపాకాలు కమ్మంగా చేసి తెచ్చారు.  తినే ప్రాప్తం  ఈ నోటి కుండద్దూ?" అన్నాడు అదే మూడులో.
"ముందు తినండి స్వాములూ! ఇంటికొచ్చిన అతిథిని ఖాళీ కడుపుతో ఉంచి మేం మాత్రమే భోంచేయడం.. అదేమంత మంచీ మర్యాదా!"అన్నాడు సుందరయ్య. అప్పటికే అతనికా సన్యాసిమీద అపరిమితమైన గురి ఏర్పడిపోయుంది.
పెదవి విరిచాడా సన్యాసి " అభోజనం రాసిపెట్టుంది స్వాములూ ఈ పూట. ఒక్క నాకే కాదు.. ఇంటిల్లిపాదికీ. అమ్మా! ఒక్కసారి మీరా  లాంతరు వంటింటిదాకా పట్టుకెళ్లి  పొయ్యి మీది చూడండి. మీకే అర్థమవుతుంది జరిగిన అనర్దమేమిటో?"
వింత పడుతూ దీపం బుడ్డితో లోపలకి వెళ్ళింది సుభద్రమ్మగారు. అక్కడినుంచే ఒక్క గావుకేక వినబడింది. కంగారుగా లోనికి పరుగెత్తికెళ్ళిన మూర్తి.. సుందరయ్యలకు  గిన్నెలో అన్నం మెతుకులతో సహా ఉడికి ఉబ్బిన ఇంత లావు బల్లి కనబడింది. వళ్ళు జలదరించింది అందరికీ.
"ఇదీ తమరి రంగురాయి మహత్తేనంటారా మహానుభావా?"అనడిగాడు మూర్తి సాధ్యమైనంత వెటకారంగా. వెళ్ళిపోయే మూడ్ లో జోలె సర్దుకుంటున్న సన్యాసి నుంచి బదులే లేదు.
అప్పటికి వర్షం కాస్త తగ్గు ముఖం పట్టింది.
లేచి నిలబడి సుందరయ్యకు నమస్కారం చేసి అన్నాడు సన్యాసి" దారి ఖర్చులకు చేతిలో తైలం బొత్తిగా లేదు. ఈ గొలుసు తమరి దగ్గరుంచుకుని కాస్త నగదు ఇప్పిస్తారేమోనని ఆశతో వచ్చాను. అసలు మీ ఇంటి తలుపు తట్టిన కారణం కూడా  అదే స్వామీ!"
వెంటనే అందుకున్నాడు మూర్తి "అదేం.. మీ దగ్గరే మహత్తుగల  రాయుందిగా! కావాల్సినంత సొమ్ము తమరే సృష్టించుకోవచ్చు కదా?"
సన్యాసి మొహంలో చిరునవ్వు"ఈ రాయికి మహత్తుందన్నానే కానీ.. శూన్యంలోంచి శివలింగాలనీ.. గాల్లోంచీ కరెన్సీ నోట్లను రాలుస్తుందనన్నానా?   ఆ తరహా మహత్తే గనక ఈ రాయికుండుంటే ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించిన వాళ్లను గంగ్గమ్మతల్లి ఒడికి వదిలి వస్తానా? వ్యాపారం వద్దని వదిలేసుకునే నాటికి నా స్థిర చరాస్తుల విలువ సుమారు పది కోట్ల పైమాట. కొంత ఊరి అనాథ శరణాలయానికి, కొంత చెన్నకేశవస్వామివారి ఆలయానికి  రాసిచ్చేసాను. ముందే చెప్పాను.. నేనూ మీ అందరిలాంటి వాడినే అని. ఈ  రాయుండట మొక్కటే  నా ప్రత్యేకత. తాకట్టు వ్యాపారం చేసే రోజుల్లో నా చేతికొచ్చిందీ గొలుసుకుదవబెట్టిన మనిషే స్వయంగా చెప్పుకొచ్చాడు  దీని మహిమలు. నమ్మలా అప్పట్లో. విడిపించుకోడానికి అతగాడు మళ్ళీ ఎందుకు రాలేదో.. తరువాత తరువాత  గానీ తెలిసిరాలేదు. గంగపాలయినప్పుడిది నా భార్య మెడలోనే ఉంది. తన గుర్తుకోసమనే ఇంతకాలం నావెంట తిప్పుకుంది. మామూలు బంగారమని  చెప్పి  వదిలించుకోవడం తేలికే. నమ్మి కొన్నవాడిని మోసగించినట్లవుతుందది. ఉన్న విషయమేదో చెప్పి.. దృష్టాంతాలు చూపిస్తున్నదందుకే. మీ లాగానే చాలామంది  కాశీ మజిలీ కథలని కొట్టి పారేసారుఈ పెద్దయ్యలాగా  కాస్త నమ్మకం కుదిరినవాళ్ళు గ్యారంటీ అడిగారు.   దారి ఖర్చులకోసం రొక్కం అత్యవసరం పడింది. కనకే ఇంతలా మీకు చెప్పుకోవాల్సొస్తోంది. ఆ పైన మీ ఇష్టం. నా ప్రాప్తం" అంటూ సుభద్రమ్మగారికి నమస్కారం చేసి వీధి వాకిలి వైపుకి అడుగులేశాడు సన్యాసి.
మూర్తి ఏదో అనబోయాడు కానీ.. 'వద్దన్న'ట్లు వారించింది సుభద్రమ్మ గారు

వీధిలో దాకా  సన్యాసి వెనకనే వెళ్లొచ్చిన  సుందరయ్యను చూసి "పాపం.. ఆయన చేతిలో కాస్తేదన్నా పెట్టకపోయారా?" అంది సుభద్రమ్మగారు సానుభూతితో.
"ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేలేవే. పోతూ.. పోతూ..  తొందరలోనే మనకు పెద్ద మొత్తంలో ధనప్రాప్తి  కలగబోతున్నట్లు చెప్పాడోయ్" అన్నాడు సుందరయ్య  గుప్పెట్లోని గొలుసును హుషారుగా ఊపుకుంటో.
"పెద్ద మొత్తమంటే?" సుభద్రమ్మగారి ఆరా.
"సుమారు ఐదారు లక్షలు" సుందరయ్య గొంతులో ఉత్సాహం.
కనుబొమలు ముడిపడ్డాయి అప్రయత్నంగా మూర్తికి. "ఆ సన్నాసి మాటకూ నా బైకుకూ ముడిపెట్టొద్దు డాడీ" అన్నాడు  హెచ్చరికగా!
'చూద్దాం లేరా బాబూ! మూడో రౌండు వేద్దాం పట్టు.. అమ్మ మళ్లీ అన్నం వండటానికి ఎటూ టైం పడుతుంది!" అన్నాడు సుందరయ్య.
" మూడ్ పోయింది డాడీ.." అని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు  మూర్తి.
"పిల్లాడినింక  వదిలేద్దురూ!  రేపు తెల్లారగట్లే వాడి ప్రయాణం. " అంది సుభద్రమ్మ గారు వంటింట్లోకి పోతూ.
"అయ్యో.. గ్యాసూ ఇప్పుడే ఐపోవాలా!" అని  లోపల్నుంచీ ఆమె అరుపు.
సన్యాసి చెప్పిన 'అభోజనం' గుర్తుకొచ్చింది సుందరయ్యకి.

***
తెల్లారు ఝామునే వెళ్ళి పోయాడు మూర్తి.
పట్నం దాకా తండ్రి తోడొస్తానంటే " రోడ్దంతా రొచ్చుగా ఉంది.. నా తంటాలేవో నేను పడతాగానీ పెద్ద మొత్తాలొస్తే మాత్రం  కాల్ చెయ్యండి. కొనాల్సిన లిస్టు చాలా పెద్దదే ఉంది నా దగ్గర " అని  హాస్యాలు పోయాడు మూర్తి  పోతూ పోతూ.
"ముందు రానివ్వరా బాబూ.. చూద్దాం" అని వద్దు వద్దంటున్నా కొడుకు మెళ్ళో రంగురాయి గొలుసు వేసేసాడు  సుందరయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ.
మూర్తి తీసేయబోతుండే అడ్డుతగిలింది తల్లి " బోసి మెడతో తిరగడం ఫ్యాషనా ఏందిరా? ఉండనీయ్ మా తృప్తి కోసమన్నా" అంటో.
తల్లికి కష్టం కలిగించడం ఇష్టం లేక గమ్ము నూరుకుండిపోయాడు మూర్తి.

పట్నం బస్సు స్టాండు నుంచీ కాల్ చేసాడు మూర్తి " రైల్వే లైన్లు సరిగ్గా లేవంటున్నారు. అన్ని బళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అదృష్టం బాగుండి వోల్వా బస్సొకటి దొరికింది నాన్నా! దాంట్లో పోతున్నాసిగ్నల్సు సరిగ్గా లేవు.   మధ్య్లలో  రెస్పాన్సు లేకపోతే  కంగారు పడద్దు. చేరంగానే మళ్లీ కాల్ చేస్తా" అన్నాడు
అదే మూర్తి నుంచి తల్లిదండ్రులకు  వినిపించిన చివరి మాటలు.

మూర్తి ఎక్కిన వోల్వా బస్సు దారిలో ఏదో కల్వర్తు దాటుతూ కాలవ నీళ్లల్లో జారి  పడింది. అధునాతనమైన బస్సు. లోపల్నుంచీ అన్ని డోర్లు ఆటోమెటిగ్గా లాకయ్ ఉండటం.. యమర్జన్సీలో అన్ లాకవాల్సిన మెకానిజం అట్టర్ ఫ్లాపయిపోవడం వల్ల..   అంత అందమైన వాహనమూ ఎక్కిన ప్రయాణీకులందరి పాలిట సామూహిక జలసమాధిగా మారి కూర్చుంది.
రకరకాల కారణాలతో  చనిపోయిన నలభై మందిలో మూర్తీ ఒకడు. అతని మృత్యుకారణం మాత్రం చాలా ప్రత్యేకం.
మెడలోని గొలుసు సీటురాడుకు చిక్కుబడిపోయి  రంగురాయి అంగిటికి అడ్దుపడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది.
లకీగా బస్సు ఓ ప్రముఖ నేతాశ్రీ ట్రావెలింగు ఏజెన్సీది.  
'ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడే ఈ దారుణం జరగడం ఖర్మ. జరిగిన  నష్టమేదో అణాపైసల్తో సహా   ఎలక్షన్లయినాక వర్లుకోవచ్చు. ముందు.. పార్టీ టికెట్టు పోకుండా చూసుకోవడం ముఖ్యం.  మీడియా ఆర్బాటం.. మృతుల సంబంధీకుల  ఆగ్రహం చల్లబడాలంటే  ఎవరూ ఊహించని భారీ మొత్తం నష్టపరిహారం కింద అచ్చుకోవడమే ఉత్తమం' నేతాజీ వ్యూహం ఆ లైనులో సాగబట్టి సహబాధితులందరికి మల్లే కొడుకు దుర్మరణానికి నష్టపరిహారం కింద సుందరయ్య దంపతులకు అందిన మొత్తం అక్షరాలా ఐదు లక్షలు!
సన్యాసి మాటలు అక్షరాలా సత్యమయ్యాయి..నిజమే!

కానీ…!
-గుడ్లదొన సరోజినీ దేవి 
w/o కర్లపాలెం హనుమంతరావు
 ***
(కౌముది అంతర్జాల మాస పత్రిక నిర్వహించిన కథల పోటీ(2015)లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథానిక)


















మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...