Tuesday, July 25, 2017

ఆ.. అంటే ఒక్క ఆవేనా?



పశువుల్ని సొమ్ములని పిలుచుకొనేవాళ్లు మొన్న మొన్నటి వరకూ.. పల్లెపట్టుల్లో.. ఆధునిక సోకులు ముదరనంత వరకురావిశాస్త్గ్రిగారి 'సొమ్ములు పోనాయండి'లోని సొమ్ములంటే పాలిచ్చే 'పశు'సంపదే! ఇప్పుడు మనం  'ఆవుగా పిలుచుకొనే జంతువుని ప్రాచీనాంధ్ర శాసనాల్లో  'తొఱ్ఱ' అనేవారని బూదరాజుగారు తన 'మాటల మూట'లో సెలవిచ్చారు

' 'పసరం' అంటే పశువులాంటిదేదో అయుంటుందని కాస్త ఆనవాలు పట్టవచ్చేమోగానీ .. మరీ గిడ్డి(వేలుపుగిడ్డి అంటే కామధేనువు), తొడుకు, మొదవు లాంటి  పదప్రయోగాలకు పూనుకుంటే.. మనుషుల సంగతి అలా ఉంచి.. ముందు గొడ్లూ గోదానే గుడ్లు తేలేస్తాయేమో.. ఎవరిని ఎవరు ఏమని తిడుతున్నారో అర్థం కాక.. అయోమయంతో?' అని ఎద్దేవా చేసే వాళ్లెప్పుడూ ఉంటుంటారు. తెలుసు. కానీ.. మన భాషలోని పద సంపద ఎంత పుష్కలంగా ఉందో.. కనీసం తెలుసుకొనేందుకయినా   చదివే ఆసక్తి చూపిస్తే .. ఈ వ్యాసం రాసిన శ్రమ సార్థకమయినట్లే!



సంస్కృతంలో 'ఆవు'కు సురభి అనే చక్కని ప్రయోగముంది. దైవమహిమ గల ధేనువుని సురభి అంటారు.  (సురభి బాల సరస్వతి' అని గతంలో ఒక సినిమా నటీమణి ఉండేది. ఆమె మహారాష్ట్రనుంచి తెలుగునాటకు వలస వచ్చిన సురభి నాటక కంపెనీకి చెందిన కళాకారిణి. చలన చిత్రాల ప్రాథమిక దశ ఆవిర్భావానికి  'సురభి' నాటక కంపెనీ పేరు ప్రఖ్యాతులూ  ప్రేరణగా నిలిచాయ'నే  పెద్దలూ ఉన్నారు.)


'ఆవు' పదంలోని మొదటి '' వరకే ఒకానొకప్పుడు ఆవుజాతికి సూచకంగా ఉండేది. క్రమేపీ ఆ '' కి 'వు' కలిపి 'ఆవు' అని, 'పోతు' కలిపి 'ఆఁబోతు.. 'ఆబోతు'అని  లింగ విభేదం ప్రకారం పదవిభజన చేసుకున్నాం.. మనం.
వయసులో చిన్నదైన ఆవును దూడ...పెయ్య'  అంటారని తెలుసా? తొలిచూలు ఆవు/గేదెకు 'పడ్డ' సరైన పదప్రయోగమని శబ్దకోశాల వాక్కాణం. 'దూడ' అంటే  లేత వయసులో ఉన్న ఆవో గేదో.. ఎద్దో.. ఏదైనా అయినప్పుడు.. మరి.. 'లేగదూడ'లోని 'లేగ' పదప్రయోగం అదనంగా ఎందుకో?   ఆ పదం పుట్టించిన మహానుభావుడికే  తెలియాలీ మతలబు! పాలు తాగడం ఆపిన ఆవును 'పెయ్య' అనాలని జంతుశాస్త్రాలు  చెబుతున్నాయి. ఒహ పట్టాన పాలు పితకనీయని ఆవును 'అఱ్ఱ' అంటారు. ఆవులకు ఒకానొకకాలంలో 'బర్రె'లనే పదప్రయోగం ఉన్నా క్రమంగా ఆ పదం కేవలం  గేదెల జాతికి మాత్రమే వర్తిస్తున్నట్లనిపిస్తుంది. 
అప్పుడే పుట్టిన బిడ్డని 'తర్ణకం' అనాలి. దూడకు పాలు కుడిపే ఆవును 'లేగటా' ఆనాలి. బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేని ఆవుని ' గొడ్డుమోతు' అంటారని అందరికీ తెలుసు. ఈ 'గొడ్డుమోతు'(గొడ్రాలు) పదం పిల్లలు పుట్టని ఆడవాళ్లక్కూడా వర్తింప చేస్తున్నాం మనం

తెలుపు రంగులో కాకుండా   'గోరోజనం' రంగులో ఉండే ఆవును 'కపిల(సంస్కృతంలోని 'కపిల' కు వికృతా?)' అనో 'నల్లావు' అనో పిలవాలని నింఘంటువుల మతం.
'మహిషి' అన్నా ఆవే. అందులోని 'మహి' శబ్దానికి గొప్పది అనే అర్థం ఉంది. 'భూమి' అనే మరో అర్థమూ ఉంది. ఆవును భూమితో సరిపోల్చడం ఆర్యసంప్రదాయం. దేవలోకంలో ఉండే మహిషి 'కామధేనువు'గా మన్నన  పొందింది'ధేనువు' అన్నా ఆవు అనే  అర్థం. కోరిన వరాలు  వర్షించే ఆవు కాబట్టి అది 'కామధేనువు' అయింది.
 

ఆవుకి 'అర్జున' అనే మరో నామమూ కద్దు.  'అర్జున' అంటే 'తెలుపు' అని అర్థం కదా! ఆవు సాధారణంగా  తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ పదం అతికినట్లే ఉంటుందికానీ.. మరి నల్లటి రంగులో ఉండే పాండవ మధ్యముడికి అర్జునుడు అనె పేరెలా వచ్చిందన్న సందేహం ఉండనే ఉంది.. ఇప్పటికీ సమాధానం అందకుండా!('అర్జునుడు నల్లటివాడా.. కాదా?' అనే విషయంమీద  మన పండితులు 'భారతి'  మాస పత్రికలో నెలల తరబడి వాదులాడుకున్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆ వాదనలు ఎటూ తేలకుండా సమాధానం దొరకని సందేహాల పద్దులోనే ఉండిపోయాయి ఇప్పటికీ) 'అర్జున' శబ్దానికి 'కసవు' 'గడ్డి' అన్న అర్థాలూ నిఘంటువుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి.. పాండవ మధ్యముడి సంగతి ఎట్లా పోయినా.. 'ఆవు' విషయం వరకు  సమంజసంగానే ఉందని  కోదిగుడ్డుకి  ఈకలు పీకే పండితులూ ఒప్పుకున్నారు)
 

'శృంగం' అంటే కొమ్ము అని అర్థం కనక కొమ్ములున్న ఆవును 'శృంగి'  అన్నారుబాగుంది. 'రోహిణి' పదం వినేందుకు  అంతకన్నా శృతిపేయంగా ఉంది.  'రోహిణి' ఓ తెల్లచండ్ర  మొక్క పేరని తెలుగుభాషామీద సాధికారత గల  బూదరాజు రాధాకృష్ణగారో  సందర్భంలో వివరించారు. తెల్ల రంగులో ఉంటుంది కాబట్టి ఆవుకీ ఆ పేరు  పెట్టి ఉంటారు. రోహిణికి పుట్టిన దూడ 'రోహిణేయ' అయింది.. సురభికి పుట్టిన బిడ్డ 'సౌరబేయ' అయినట్లు!  

జంతువుల వరకు  హిందువులకి మాతంటే 'గోమాతేమంచి జాతి ఆవుకి 'నైతిక'.. చుక్కలున్న ఆవుకి 'శబలి' .. పొట్టి ఆవుకి 'వామని'.. తెల్లగా ఉంటుంది కనుక 'ధవల'.. పుల్లావుకి 'కపిల .. వెదలో ఉంది కనక   'నందిని' అని .. ఆయా ఆవులని సందభాన్ని బట్టి పిలుచుకోవాలని పలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.  శబ్దకోశాలు     సోదాహరణంగా  ఆయా సందర్భాలనూ వివరిస్తున్నాయి
ఆవు సాధువుగా ఉంటే 'సుకర' అవుతుంది. ఇబ్బంది పెట్టకుండా పాలిస్తుంటే 'సువ్రత' అవుతుంది..  ఏటా క్రమం తప్పకుండా  పాలిస్తుంటే 'సుమాంసమీన'గా గుర్తింపొస్తుంది.  గోవుమీద గల ప్రాచీన ప్రాచిన సాహిత్యం అంతా ఏకరువు పెట్టడం ఇంత చిన్న వ్యాసంలో అసాధ్యం. 

'ఇవన్నీ కూడా ఎక్కువగా సంస్కృత తత్సమాలో.. తద్భవ  శబ్దాలే కదా! మరి తెలుగులోనే మాట్లాడమని ఇబ్బంది పెట్టడంలో అర్థమేముంది?' అంటూ విసుగు పడేవాళ్లూ ఉంటారని తెలుసు. ఆ తరహా తెలుగు మాటలు బోలెడన్ని చెప్పుకోవచ్చు.  విస్తృతి భయం. మరో సందర్భంలో  చర్చించుకొందాం.. అవసరమైనంత మేరకు.  అచ్చు తెలుగులో ఆవును తెల్లగొడ్డు' అనాలని.. ఆవులను కట్టేసే దొడ్డిని 'కొష్టాం'అనాలని.. ఆవుల గుంపును 'మంద' అనాలని.. ఇలా చాలా  ఉంది గ్రంథం. సంక్షిప్తంగా చెప్పుకుంటేనే ఇంత రామాయణమైంది కదా..ఇంకా వివరాలలోకి గాని పోతే ఓ పట్టాన బైటికి తెమలగలమా? 
కానీ కొసమెరుపు ఏమిటంటేః

ఆవుకి ఇన్ని రకాల తెలుగు.. సంస్కృత పదాలున్నా.. ఇప్పటి వరకూ మనం సాధారణంగావ్యవహరించే 'ఆవు' అనే పదాన్నికూడా ఉఛ్చరించడం మానేసాం! మొరటయి పోయిందితెలుగు పదాలు పలకడం మన కుర్రకారు నాలుకలకు.   
ఆవు తెల్లోడి బిసలో పడి  'కౌవ్వు' అయిపోయింది! పిల్లలు సరే..  పెద్దలూ పిల్లల మాటలకు '..' అంటున్నారు! అదీ విచారించాల్సిన విషయం! తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యం ఎప్పటికి వదిలేనో?
***

-కర్లపాలెం హనుమంతరావు


Tuesday, May 2, 2017

గిరీశం గడుసు భాష

కన్యాశుల్కంలోని భాష ఉత్తర కోస్తాంధ్ర భాష. అయినా అన్ని ప్రాంతాలవారికీ ఆదరణీయమైంది. ఏముంది అందులో అంతగా అందం?! కన్యాశుల్కం నాటకం పుట్టి వందేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ చదివిస్తుంది.  తాజాగా అనిపిస్తుంది.. మళ్ళీ మళ్లీ చదివినా!  ఎక్కడిదా  తాజా సౌరభం?! కన్యాశుల్కంలో గురుజాడవారు వాడిన భాష మరే ఇతర గ్రంథాలలోగానీ.. రచనల్లోగానీ వాడిన దాఖలాల్లేవు.  ప్రసిద్ధమైన శైలి సామాన్యంగా అనుకరణకు గురవుతుంది.  అలాంటి ప్రయత్నాలేవీ కన్యాశుల్కం భాష విషయంలో సఫలమైనట్లు కనిపించవు.  గురజాడవారీ నాటకంలో చూపిన మార్గం  అనితరం సాధ్యం అనుకోవాలా?! ఎందువల్ల అలా?!
భాష.. సందర్భాన్ని బట్టి.. స్థాయిని బట్టి.. పరిసరాలను బట్టి రూపం మార్చుకుంటుందంటారు భాషాశాస్త్రావేత్తలు. 'ఒళ్ళు కొవ్వెక్కిందా?' అని  భర్త భార్యను ఇంట్లో గద్దించినట్లు గుళ్ళో గద్దించడం కుదరదు. తోటి మగవాళ్లముందైతే  'కాస్త సంబాళించుకో!' అంటూ తగ్గింపు స్వరంతో మందలించక తప్పదు. మర్యాదస్తులు కాకపోతే ఇంకాస్త ముతగ్గా 'కాస్త వళ్ళు దగ్గరుంచుకో!' అంటూ తక్కువ స్వరంలో హెచ్చరించవచ్చు. ఏకాంతంలో  సామాజికపరంగా ఏ పర్యవేక్షణాభయం  ఉండదు కాబట్టి ఒకటో రెండో 'బూతులు' కూడా జత కలిపి  చేతులు విసరవచ్చు. ఒకే తరహా మాటలను ఒకే స్థాయిలో, ఒకే భావంలో అన్ని తరగతులవారు వాడటం అసాధ్యం. 'పాత్రోచితం' అన్న మాట పుట్టేదు ఈ సందర్బంలోనే.  'పాత్రోచిత'మైన  సంభాషణలను గురజాడవారు కన్యాశుల్కం నాటకంలో అత్యద్భుతంగా పోషించారన్నది విమర్శకుల ప్రశంస. ఆయనలా
ఆ స్థాయిలో విజయవంతమైన రచయిత ఈనాటికీ  లేడనే మేథావుల అభిప్రాయం.
వేదంవారు  ప్రతాపరుద్రీయంలో.. నండూరివారు ఎంకి పాటల్లో.. కొనకళ్లవారు  బంగారి మామ పల్లెపదాల్లో.. రావిశాస్త్రిగారు తమ  వివిధ రచనల్లో.. సమకాలీన సాహిత్యంలో  నామినిగారు సాగిస్తున్న తన రచనల్లో ప్రదర్శించిన.. ప్రదర్శిస్తున్న  'పాత్రోచితమైన భాష'ను తక్కువ చేయలేం. కానీ గురుజాడవారి 'పాత్రోచితం' వాటన్నిటికన్నా  ఒక మెట్టు పైనే ఉందని ఒప్పుకోక తప్పదు. కన్యాశుల్కంలో గురజాడవారి  పోకడల్లోని వైవిధ్యం భాషాపరంగా   'విశ్వరూప ప్రదర్శనమే!

పాత్రలకి రచయితకి స్థాయిల్లో   అంతరం సర్వసాధారణం. అయినా సమంజసమయిన రచయిత పాత్రల నోట మాటలు పలికించే సందర్భంలో ఆయా పాత్రల వైయక్తిక (కులం.. ప్రాంతం.. పరిసరాలు.. లింగం.. వయసు.. ఉద్వేగాది)  స్థాయిలకు తగ్గ  పాత్రోచితమైన భాష ప్రయోగించాలన్న స్పృహతోనే ఉంటాడు. వట్టి స్పృహ పాత్రోచితాన్ని పండించలేదు. రచయిత అనుభవమూ జతకలవాలి.. రచయితలూ మామూలు మనుషులే. కాబట్టి అన్ని సందర్భాలకీ తగిన అనుభవం అందుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పరోక్షానుభాలక్కూడా  ఆస్కారం లేకపోవచ్చు. అప్పుడు ఊహమీద ఆధారపడక తప్పదు. ఆ ఊహాధార  స్వీయానుభవాలనుంచి  పుట్టిందీ  కాకుండా.. పరోక్షానుభవాలద్వారా మలుచుకున్నదీ కానప్పుడే 'పాత్రోచితం' ఉచితానుచితాలమీద చర్చ రేగుతుంది. గురజాడవారి కన్యాశుల్కం విషయంలో ఇలాంటి చర్చేదీ సాగినట్లు రికార్డుల్లో లేదు(నాకు తెలిసినంత వరకు).  'పాత్రోచితమైన భాషాప్రయోగం'లో ఆయన విజయం సాధించారనడానికి ఇదే రుజువు.  తన నాటకంలోని పాత్రలభాషమీద అంతలా  సాధికారికత సాధించేందుకు గురుజాడవారు తీసుకున్న జాగ్రత్తలు ఏమయి  ఉంటాయో? విజ్ఞులు తేల్చాల్సిన లోతైన అంశం అది. ఈ వ్యాసం ఉద్దేశం కేవలం గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  పాత్రల భాషావైవిధ్యం. అదీ.. గిరీశం  కోణంనుంచీ స్థాలీపులాకన్యాయంగా ప్రస్తావించుకోవడం మాత్రమే!

గిరీశం  రాకతో మొదలై..  గిరీశం పోకతో ముగిసే నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలోని దాదాపు అన్ని ముఖ్యపాత్రలతోనూ గిరీశం  'ఇంటర్ యాక్ట్' అయాడు. ఆయా సందర్భాల్లో గిరీశం వాడిన భాష.. అందులోని వైవిధ్యం గురించి కొంత చర్చిస్తే గురజాడవారికి 'పాత్రోచితమైన భాష' మీదున్న  సాధికారికతను గూర్చి ప్రాథమిక స్థాయి అవగాహన ఏర్పడొచ్చు.

గిరీశం పుట్టుకతో వైదీకి బ్రాహ్మణుడు. పట్నవాసం అతగాడి బాడీ లాంగ్వేజీ..  భాషల్లో మార్పు తెచ్చింది. భాషావిషయికంగా  చూస్తే  గిరీశం నోట ఇంగ్లీషు పలుకుబళ్లు ధారాళంగా దొర్లుతుంటాయి. అంత్యప్రాసాదులతో ఆంగ్లపద్యాలను  ఆశువుగా దంచేస్తుంటాడు.
ఏకాంతంలో ఉన్నప్పుడు స్వగతంలో  చెప్పుకొనే  భాష  పాత్ర నిజ నైజాన్ని పట్టిస్తుందని మనస్తత్వవేత్తల భావన. నాటకం ప్రథమాంకం ప్రథమ సన్నివేశంలోనే గిరీశం తత్వాన్ని పరిచయం చేస్తారు గురజాడ. 'పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం.  యీలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు(పూటకూళ్లమ్మ). వెంకుపంతులుగారి కోడలుకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి  మనకు దేహశుద్ధి చేస్తారు. మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా ఉంది..గిరీశం గడుసుదనం.. వంచన గుణం.. స్త్రీలౌల్యం.. మాటకారితనం పటం కట్టేది ఇలాంటి మాటలవల్లే. వెంకుపంతులుగారి కోడలు.. మధురవాణి స్మృతిపథంలోకి రాగానే గిరీశం పెదాలమీదకు 'ఇంగ్లీషు పద్యాలు' తన్నుకొస్తాయి. మధురవాణి స్మరణ చేస్తూ 'It is women that seduces all mankind' అనీ అంటాడు.   నిందను ఎదుటి పక్షంమీదకు తోసే అతగాడి నీచ నైజం ఈలాంటి ఉక్తులు వల్లే బైటపడేది. 
ఇక విజయనగరం చెక్కెయ్యాలన్న ఆలోచన రావడం తరువాయి..   శిష్యుడు వెంకటేశంతో అతగాడు పలికే    వ్యాక్యాల్లో గుప్పించేవన్నీ డాంబిక   ఆంగ్లపదాలే! ఈనాటి టీ వీ యాంకర్లను తలదన్నే భాషా భేషయం! 'డా'మిట్! .. ఇది బేస్ ఇన్గ్రా'టిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. విడో మారియేజ్ విషయమై, నాశ్చికొచ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. పూనా డక్కన్  కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఎలెవన్ కాజెస్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి  ప్రొఫెసర్లు డంగయి పోయినారు. చుట్ట నేర్పించినందుకు 'థేంక్స్' చెప్పకపోగా.. తప్పు పడుతున్నావ్.అంటూ గిరీశం ప్రదర్సించే ప్రాగల్భ్యభాషకు అంతూ పొంతూ ఉండదు. 'ఫాల్స్' వైదుష్య ప్రదర్శనలతో  ఎదుటి పాత్రల బుర్రలో గడబిడలు సృష్టించడంలో గిరీశానిది అందె వేసిన చెయ్యి. 'మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!' అని శిష్యుడు వెంకటేశం నిందలకు పూనుకున్నప్పుడు
'ఖగపతి  యమృతము తేగా/భుగ భుగమని పొంగి చుక్క భూమిన్ వ్రాలెన్/ పొగచెట్టై జన్మించెను/ పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అంటూ   బృహన్నారదీయం నాలుగో అధ్యాయం ధూమపానాన్ని సమర్థించిందని   దబాయిస్తాడు.   ఇటువంటి  మాటల గారడీవిద్య అగ్నిహోత్రావధానుల్నుంచి.. సౌజన్యారావు పంతులుగారి వరకు అందరి ముందు ప్రదర్శిస్తాడు నాటకం ఆసాంతం.  ఎదుటి మనిషికి ఆలోచించుకొనే అవకాశం ఇవ్వకుండా  స్వకార్యం సాధించుకొనే నిమిత్తం  బుకాయింపు భాష  ఎంత ఉపయుక్తంగా ఉంటుందో  గిరీశానికి తెలిసినంతగా  తెలుగు సాహిత్యంలో మరే పాత్రకీ తెలీదు.

అచ్చంగా ఆంగ్లపాండిత్యమేనాసందర్భాన్ని బట్టి భాష మార్చే ఊసరవెల్లి గుణంలోనూ   గిరీశం ఘనాపాఠి. నైజాంవారి కొలువులో ఉద్యోగం అయిందని  మధురవాణిని నమ్మించే   సందర్భంలో    ఉర్దూ పాండిత్య ప్రదర్శనకి  తెగబడే సన్నివేశం గిరీశంగారి    రంగులు మార్చే లక్షణానికి సలక్షణమైన తార్కాణం.   'ఇదిగో జేబులో నైజాంవారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా!  మా నేస్తం సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్సహన్ జింగ్ బహద్దర్ వారు సిఫార్సు చేసి వెయ్యి సిక్కా రూపాయిలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేశా బాధ్షావారి హుజూర్న ఉండటం..' అంటాడా మహాశయుడు. కోతలు ఈ స్థాయిలో సాగించినప్పుడే   విషయంలోని సారం కొంతైనా నమ్మదగినట్లుండేదని..    మధురవాణి వంటి  గడసరి ఎదుట  ఆటలు  సజావుగా సాగేదని గిరీశానికి  తెలుసు. గురజాడవారు ఇదంతా   ఊహామాత్రంగా  సృష్టించిన సంభాషణా చాతుర్యమే అయినా.. వాస్తవ సమాజంలోని 'అరచేతి వైకుంఠ రాయుళ్ళ'   జీవనశైలిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. గాఢంగా పరిశీలించకపోతే  సంభాషణల్లో ఇంత  పాత్రోచితమైన శైలిని పండించడం కుదరదు.
మకాం అగ్రహారానికి మార్చుకునే సన్నివేశంలో  గిరీశం తన భాషాసరళిని   పరిసరాలకు.. ఎదుటి పాత్రలకు అనుగుణంగా మలుచుకునే క్రమం గమనిస్తే..   గురుజాడవారి సునిశితమైన  సమాజిక పరిశీలనాశక్తి అవగతమవుతుంది.  అగ్నిహోత్రావధాన్లు ప్రథమ దర్శనంలోనే  'ఈ తురకెవడోయ్' అంటూ గిరీశాన్ని   అనుమానిస్తాడు. పల్లెల్లో కొత్తవారిని   అనుమానించడం సర్వసాధారణం. గిరీశానికి ఆ తరహా అనుభవం అప్పటికి కొత్త. కాబట్టే వెంటనే కోపం ముంచుకొస్తుంది. నిజ నైజానికి విరుద్ధంగా 'టర్క్.. డామిట్.. టెల్ మాన్' అంటూ చిందులేస్తాడు. 'మానా? మానులా ఉన్నానంఛావూ? గూబ్బగలగొడతాను' అంటూ అగ్నిహోత్రులు మళ్లీ అగ్గిరాముడు  అయినప్పటిగ్గానీ..    స్థలాన్ని బట్టి భాషలో మార్పు తెచ్చుకోవలన్న స్పృహలోకి రాడు గిరీశం.   కరటక శాస్త్రుల జోక్యంతో అప్పటికున్న యుద్ధవాతావరణం సద్దుమణుగడంతో..  ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఇట్టే పసిగట్టేస్తాడు. వెంటనే అతగాడినీ తనకు అలవాటైనా మాటకారితనంతో పడగొట్టే ప్రయత్నం చేస్తాడు! 'మీ లాంటి(కరటక శాస్త్రులు) ఛప్పన భాషలూ వచ్చిన మనిషి ఎక్కడా లేడనీ.. సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ.. తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూళ్ళేదనీ.. డిప్టీ కలెక్టరుగారు శలవిస్తుండేవారు. కవితారసం ఆయన్లా గ్రహించేవారేరీ? నా కవిత్వమంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనంకూడా నాకు చేయించారండి' అంటూ గప్పాలు  మొదలు పెడతాడు.  కరటకశాస్త్రి విదూషక లక్షణాలకు సరిగ్గా అతికే  భాష అది! కొత్త చోట ఆశ్రయం సంపాదించేందుకు    గిరీశానికి అలా  తన భాషాచాతుర్యం అక్కరకొస్తుంది.

ఇంగ్లీషు తెలియని పల్లెటూరు బుచ్చెమ్మతో మాటల కలిపే సందర్భంలో గిరీశం  వాడే మాటల్లో ఒక్క ఇంగ్లీషు ముక్కా వినిపించదు. గమనించారా! '.. నా గొప్ప నే చెప్పుకోకూడదు కదా! అదొహటి. అంతకన్నా ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వదినా!(ఆ పిలుపులోని నర్మగర్భతను గిరీశం గడుసుదనానికి మచ్చుతునక)-మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు.  ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం  చెయ్యాలయ్యా అన్నాడు.' ఇలా సాగుతుంది గిరీశం సంభాషణా ధోరణి.  ఎంత సహజమైన.. సరళమైన తెలుగు పలుకుబడి! 

'ఏ రోటి దగ్గర ఆ పాట' పాడించాలని తెలిసుండటం వేరు. ఆ పాట శృతి తప్పకుండా  పాడించడం వేరు. ఆ కళలో 'గురజాడ వారు నిష్ణాతులు' అని రుజువు చూపించడానికి  వెయ్యి ఉదాహరణలు ఇవ్వచ్చు కన్యాశుల్కం నుంచే.. గిరీశం పాత్రనుంచే!

బుచ్చెమ్మంటే మేదకురాలు. మరి  సౌజన్యారావు పంతులుగారు ఎంత లోకం చదివిన మేధావులు? వారితో మాట్లాడే సమయంలో కూడా గిరీశం మరో విధమైన భాషాచాతుర్యం ప్రదర్శిస్తాడు. మరీ డాంబికపు ఇంగ్లీషు పదాల జోలికి పోతే ఆ మేధావికి పట్టుబడిపోవచ్చన్న తెలివిడి ఉంది. అందుకే  చదువుకున్నవాళ్ళ శిష్ట వ్యవహారికం వచ్చి పడుతుంది గిరీశం భాషలో. చివరికి పంతులుగారి చేతే  'మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి యంగ్ మెన్ లావుగా  ఉంటే మన  దేశం బాగుపడును.' అని పంతులుగారినుంచి ప్రశంసలు పొందాడంటే గిరీశానికి భాషమీదున్న పట్టుకు వేరే సర్టిఫికేట్లు ఎందుకు? పంతులుగారి ప్రశంసకు దీటుగా గిరీశం బదులిచ్చిన తీరే భాషాప్రయోగంలో సందర్భం సైతం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో తెలియ చేస్తుంది. పంతులుగారి సంభాషణా శైలినే అనుకరిస్తూ 'అట్టి విచారం తాము పడనక్కర లేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీ ముందు.. ప్లెషర్ తరువాతానండీ. అందులోనూ నేను చిన్ననాటనుంచే కొంచెం కాన్ సన్ ట్రేషనూ ఇంద్రియ నిగ్రహమూ అభ్యాసం చేయడం చాతనూ వొళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండటం చేతనూ స్త్రీ సుఖముల యడల నాకు విముఖత లావండి.. బుచ్చెమ్మయొక్క హృదయ నైర్మల్యమూ.. ఆమె దురవస్థా చూచిన్నీ.. నా శిష్యుడియందు నాకుండు ప్రేమాతిశయం చేతనున్నూ.. అమె యందుకూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహము కావడమునకు ఒప్పుకున్నాను గానండి ఇంద్రియ సుఖముల నపేక్షించి కాదు. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడమునకు అంగీకరించారండి! కనుక మా  మారియేజీ అనేది ట్రూ మారియేజిగాని సాధారణపు విడోమారిఏజి కాదండీ' అంటూ నయగారాలు ప్రదర్శిస్తాడు!  సౌజన్యారావు పంతులుగారనేంటి ఆయన్ను పుట్టించిన బ్రహ్మదేవుడుకూడా గడుసుగిరీశం జేబులో పడిపోయే మాటకారితనం కాదా ఇదంతా? రామప్ప పంతులు సంపర్కం జరిగినప్పుడూ గిరీశం ఆ గుంటనక్క స్థాయికి తగ్గట్లే మాటలు విసరడంలో ఇహ వింతా.. విడ్డూరమూ ఏముంటుంది?

భాషను బట్టే భావాన్ని అంచనా వేసుకుంటాడు ప్రదర్శనల్లో ప్రేక్షకుడు.. పుస్తకాల్లో పాఠకుడు.  సందర్భోచితమైన శైలీవిన్యాసాల ప్రదర్శన అభాసుపాలు కాకుండా నడిపించాలంటే  రచయితకు భాషమీదే కాదు.. పాత్రోచితమైన పలుకుమీద,..  సామాజిక ధోరణులమీద సరైన అవగాహన ఉండి తీరాలి. పాత్రల  యాస ఎంపికలో చూపించే శ్రద్ధ.. తదనుగుణమైన  పదాల ఎంపికలోనూ  రచయితకు తప్పని సరి. పాత్ర అదే కావచ్చు. వివిధ సందర్భాలకు తగ్గట్లు భాషలో ఛాయాబేధాలుకూడా ఉంటాయి. సరైన అవగాజనతో వాటినన్నింటినీ విజయవంతంగా నిర్వహించినప్పుడే.. 'పాత్రోచితం' అనే లక్షణానికి న్యాయం జరిగినట్లు. ఈ అవగాహన తనకున్నట్లు రుజువు చేసుకున్నారు కాబట్టే 'కన్యాశుల్కం' అనే గొప్ప నాటకం సృష్టించిన ఉత్తమ సాహిత్యవేత్తగా   గురజాడ అప్పారావుగారు   లోకం దృష్టిలో  స్థిరబడిపోయారు.

'పాత్రోచితం' అంటే  సమాంతరంగా సాగే సమాజంలోని వ్యక్తుల స్వరూప స్వభావాలను.. ధోరణులను వాస్తవానికి వీలయినంత దగ్గరగా  నాటకంలోని పాత్రల్లో  ప్రతిబింబించడం. సజీవమైన రచన సాధించేందుకు రచయితకు ఈ 'పాత్రోచితం'మీద నిర్దిష్టమైన అవగాహన అవసరం. ఆ అవగాహన సాధించకుండా రచయిత పాత్రల సృష్టికి పూనుకుంటే.. వాటి  నోట పలికే మాటలు.. కేవలం  నిర్జీవ శభ్దాలు మాత్రమే!
-కర్లపాలెం హనుమంతరావు



(ఈనాడు - తెలుగు వెలుగు మాస పత్రిక ఏప్రియల్ 2017 సంచికలో 'మాటే మంత్రమో!' శీర్షికతో ప్రచురితం)

Wednesday, March 22, 2017

పెద్దమనుషులు కావలెను


ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమే కానీ.. పెద్దమనుషులకే పెద్ద కరవొచ్చి పడిందిప్పుడు మన  పెద్ద దేశంలో!
గద్దెమీదున్నంత  కాలం 'కారు' కూతలతో కాలక్షేపం చేసిన హస్తం పెద్దలు.. అధికారం దూరమై పోగానే 'కారుకూత'లకు దిగిపోతున్నారు! మొన్న పంద్రాగస్టు పండగనాడూ.. దాంతాడు తెగా..  జెండా తాడు లాగేందుక్కూడా జిల్లాకో పెద్దమనిషి కరవయ్యాడయ్యా మన  బంగారు తెలంగాణంలో!
కరవు లేందెక్కడ?.. అని దబాయించద్దు! అపరాలనుంచి..  ఆడకూతుళ్ల వరకు, బడిబుక్కుల్నుంచి.. మడిచెక్కల వరకు.. అన్నింటా కరవే! ఆ జాబితా ఏకరువు పెట్టాలంటే కాగితానిక్కరవు. సమయాని.. స్థలానికి అంతకన్నా కరవు! నిజవేఁ కానీ.. పెద్దమనుషుల కరవు కందిబద్దల కరవు పద్దులా కాదు గదా! దేశీయంగా దొరక్కపోతే ఏ అఫ్రికానుంచో దిగుబడి చేసేసుకొని పబ్బం గడిపేసుకోడానికి!
పెద్దల సభల్నిండా బెంచీలు పట్టకుండా పెద్దతలకాయలు అనున్నాయిగా?’ అనీ అడగద్దు. అటేపెళితే  ప్రజాప్రతినిధుల హక్కుల గోల! మనకొద్దు! ఇటేపు ఇలా ఊళ్ళల్లోకోసారొచ్చి తొంగి చూడండయ్యా బాబులూ! చిన్నబళ్ల పంతుళ్లే  చిన్నూళ్ళల్లో పెద్ద తలకాయలు. పంతుళ్లందర్నీ మంత్రులంతా సొంత పన్లకి ఎగరేసుకొని పోతుంటే పంచాయితీ పంచలు.. పైన కండువాలున్న దొరలెవరూ లేకుండా బోసిపోతున్నాయయ్యా!
పద్దస్తమానం ఏవేవో ఎన్నికలు జాతర్లు కదా మన ప్రజాస్వామ్య దేశంలో! అందుకే రాజకీయాల్లో నలిగే దొరబాబులెవ్వరికీ  'పెద్ద మనుషుల' పాత్ర పోషించే తీరిక దొరకడం లేదు! సుపరిపాలన స్థానంలో 'సుపారీ' పాలన వచ్చి పడ్డానికి పెద్దమనుషుల కొరతే ప్రధాన కారణం.
దేశాలకీ దేశాలకీ మధ్య ఉద్రేకాలు. రాష్ట్రాలకీ రాష్ట్రాలకీ మధ్య రచ్చరచ్చలు. రాష్ట్రాలకీ కేంద్రానికీ మధ్య కీచులాటలు. ప్రాంతాలకీ ప్రాంతాలకీ మధ్య పొరపచ్చలు. ఊళ్లమీదకి ఊళ్ళే వచ్చి పడిపోతా ఉంటే.. ఊళ్ళోని పేటలకీ పేటలకీ మధ్య పేచీలు ముదిరిపోతున్నాయ్. ఆడా.. మగా మధ్యా ఆగడాలకయితే అంతే లేదింక. అంతెందుకు.. అయ్యేయస్సులు.. ఐపీయస్సుల మధ్యా 'పీస్' పీసు పీసులై పొయ్యేదాకా యవ్వారాలు ముదిరి పాకాన పడ్డాయంటే  పెద్దతలకాయలు లేని లోటు  కొట్టొచ్చినట్లు కనబడుతున్నట్లేగా లెక్క!కాలజ్ఞానం బ్రహ్మంగారైనా ఊహించుంటారా  ఈ అకాల పెద్దమనుషుల ఉపద్రవం గోల!
న్యాయపాలకుల తీర్పుల్ని కక్షిదారులే లక్ష్య పెట్టడం లేదండీ!  అంతర్రాష్ట్ర వివాద  సంఘాల సలహాలన్నీ చెవిటివాడి  ముందూదే శంఖువులవుతున్నాయి ! పెద్దతలకాయల కరువ్వల్లే కదా సర్వే సర్వత్రా  ఈ రవ్వా.. రట్టూనూ!
అమెరికాలో, జపాన్లో కుర్రకారుకు మాత్రమే కొరతంట! మన దగ్గరో? పెద్దతలల్లేక  తల పట్టుకోవాల్సిన తంటా!
రెండు పుష్కరాలొచ్చి పోయాయి ఈ మధ్యనే! వారాంతం వచ్చి పోయిందంటే సరి .. తిరుమలగిరి నుంచి వేదాద్రి వరకు వేలాదిమంది భక్తులు పాప పంకిలంనుంచి  విముక్తులైపోతున్నారు.. తత్తరపాటుతో ఎవరొక్క మాట తూలినా.. ఉత్తర క్షణంలోనే ముక్కు రాపిళ్ళు.. కాణిపాకం గుళ్లో  దీపాలార్పుళ్లు దివ్యంగా జరిగిపోతున్నాయి! బాబాలు. అమ్మోర్లు.. స్వాములార్లు.. అవధూతలు.. అక్కడికీ అడుగడుక్కీ పీఠాలేర్పాటు చేసుకొని పాపపంకిలాలను ప్రక్షాళన  చేస్తూనే ఉంటిరి! ఏడాది తిరిగేసరికల్లే వేలాదిమంది ఖైదీలు.. తీవ్రవాదులు.. క్షమాభిక్షలు పొంది మరీ  జనజీవన స్రవంతుల్లోకొచ్చి పడిపోతున్నా.. పెద్ద తలకాయల లోటు  పూడటం లేదెందుకో.. బొత్తిగా అంతుబట్టకుండా ఉందే!
పరమాత్ముడు అక్కడికీ అన్నేసి అవతారాలెత్తి మరీ ధర్మసంస్థాపనలు గట్రా నిర్వహిస్తున్నా ఇంకా ఈ శిష్టజనుల  కొరత కొనసాగడమేంటో.. విపరీతం కాకపోతే! కాలం ఎంత కలికాలం నాలుగోపాదమీద కంటుతున్నా దొడ్డతనం లేమి మరీ ఇంత విడ్డూరంగా ఉందేవిఁటి  స్వామీ?
అట్లాసులు, ఆంజనేయుళ్లు, కుంభకర్ణుళ్లవంటి  భీకరాకారాలకు కొరతైతే.. ఏదో ఒలంపిక్సు మార్కు  డోపింగు మందుల్తో  తలకాయలు ఉబ్బించుకోవచ్చు. ఏళ్ల తరబడి న్యాయస్థానాలు  విచారణలు గట్రా చేసీ  చేసీ మరీ  నిర్ధారించిన పెద్దమనుషులమీదా   మళ్లా మళ్లా మసి పడాల్సిందేనని  అప్పీళ్ళు పడిపోతుంటే .. పెద్దమనుషుల కొరత ఇహ్క తీరేదెప్పటికి? 
కొత్త జిల్లాలు.. తొందర్లో పట్టాలమీదకు ఎక్కబోతున్నాయి. మండలాల గుమ్మాలక్కూడా రేపో ఎల్లుండో కొత్త మావిఁడి మండలు వేలాడబోతున్నాయి!   ఇప్పుడే పెద్ద తలలకింత  తలనొప్పి తంతుగా ఉందే.. ! ముందు ముందు  సమస్యెంత ముదరనుందో.. తలుచుకొంటేనే గుండెలదురుతున్నాయ్! సర్కారే సమస్యా పరిష్కారానికి పూనుకోవాల్సుందిహ.
ఉద్యోగాలు.. ఉపాధులంటూ ఎటూ ప్రణాళికలూ సాగుతూనే ఉన్నాయిగదా! పనిలో పని.. 'పెద్ద మనుషులు 'కేటగిరీ' ఒకటి కొత్తగా సృష్టిస్తే సరి! చదువు సంధ్యలబ్బక అబ్బల రెక్కల కష్టంమీద పడి మెక్కే పోరంబోకులకింత ‘ప్రత్యేకహోదా’  క్కించినట్లవుతుంది! పేకాట రాయుళ్లమీద 'పెదరాయుళ్ళ' ముద్దర్లద్దితే  పల్లెల్లో పెద్దతలలకిహ వెనక్కి తిరిగి చూసే అగత్యముండదు. కీచకుల చేతికి సర్కారు 'కీ' పోస్టులొస్తే  ఆడకూతుళ్ల హడావుళ్లతో పరువుపోయే బెడద   తగ్గిపోతుంది. పేచీకోరుగాళ్లందరికీ  పెద్ద పీటలేసేస్తే ..   గోచీపాతరాయుళ్ల గోడుకి  చుక్క పెట్టినట్లవుతుంది. 
అక్రమార్కులమీద ఉక్కుపాదం మోపి చక్కబెట్టిన ఘనకార్యమొక్కటైనా ఉందా సర్కార్ల రికార్డుల్లో  ఇప్పటి వరకూ? బుద్ధిగా గూండాల పాదాలకు గండపెండేరాలు తొడగడం.. పెద్దతలల గండం చిటికెలో  తేలిపోయే చిటుకండీ! దైవత్వాన్నైనా  దర్జాగా ప్రసాదించే రోజులు. ధైర్యంగా ఏ సన్నాసికైనా పెద్దరికాన్ని అంటకట్టేయచ్చు. ప్రశ్నించే దద్దమ్మలకు పెద్దమ్మ తెరిసాను ఉదాహరణగా చూపిస్తే సరి. 
కొత్త రక్తాన్నే  కనుక్కుంటున్న మేధావులమండీ మనం! 'పెద్దమనుషులు' అనే కొంగొత్త పదవుల్ను సృష్టించలేమా? 
'మనుషులే కాని వాళ్ళకు 'పెద్దమనుషుల' పదవులేంటనా?' సందేహం మహానుభావా?  అమెరికా అధ్యక్షపదవిని కోరుకున్న  పెద్దమనుషులిద్దరూ  మన దేశీయ  భభ్రాజమ్మలకన్నా  దేంట్లో మిన్నంటా?
పనులు చక్కబెట్టడమే పెద్దమనుషుల  ముఖ్య బాధ్యతైతే ..  నయీం ఎటూ పోయాడు..  అతగాడి  అనుచరవర్గాన్నైనా  సర్కారు అక్కున చేర్చేసుకోవాలి. అర్హతలు సడలించైనా 'పెద్దమనుషుల' పోస్టుల్లోకి సర్దుబాటు చేసేయాలి! తాత్సార చేసుకొంటూ పోతే పొరుగు దేశమే స్వర్గధామం అన్న  ప్రచారం పెరిగి పోతుంది. తస్మాత్ జాగ్రత్త! తరువాత పట్టుకుని కూర్చోడానికి పెద్దసైజుది అలా ఉంచి చిన్నతలకాయైనా దొరక్కపోవచ్చు!
-కర్లపాలెం హనుమంతరావు



Tuesday, March 7, 2017

చవలాయీల దినం- ఓ నెల ముందుగానేనా!



జనాభాకన్నా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్యం మనది. ఆరుపదులు నిండకుండానే స్వాతంత్ర్ర్ర్య యోధుల పింఛన్లందుకునే సమర యోధులూ దండిగా ఉన్న ధర్మభూమీ మనదే! ఇక్కడ 'ఇడియట్ బాక్సు'ల అమ్మకాలకు ఎంత లావు ఆర్థిక మాంద్యాలైనా అడ్డు రాలేవు! సూర్యమండలంమీదైనా సరే భూములు చవగ్గా అమ్ముతున్నారంటే కొనేదానికి కుమ్ముకు చచ్చే ఆసాములు గజానికొక అరడజనుకైనా   తక్కువ కాకుండా వర్ధిల్లే పూర్ణగర్భ కూడా ఇదే.. ఇదే! ఇంతకన్నా మన తెలివితేటలకు నిదర్శనం ఇంకేం కావాలి?!

యథా రాజా తధా ప్రజా! పాత పథకాకాలకే కొత్త కొత్త పేర్లెట్టేసి పార్లమెంటులో ప్రధాని అనుచరగణం పడా పడా చదివేసుంటే.. చేతులు నొప్పెట్టే దాకా చప్పట్లు కొట్టేస్తుంటారు మనం ఎన్నుకున్న ప్రతినిధులు! కన్యాశుల్కం నాటకంలో ఒక్కడే వెంకటేశం. మనదేశ ప్రజాస్వామ్య నాటకంలో అడుగడుక్కీ వెంకటేశాలే! వెంకటేశాలూ పిచ్చిపుల్లయ్యలూ ఒకళ్ల నొకళ్లు తిక్కశంకరయ్యలు చెసుకొంటూ సంబరపడే పండుగ పేరే… చవలాయీల దినం. ఐ మీన్ ఆల్ ఫూల్స్ డ్!

ఈ 'ఫూల్సు  పండుగ'ని కనిపెట్టిన మహానుభావుడెవరో కానీ మహా గడుసుపిండమై ఉండాలి. చవలాయీల దినం.. ఆర్థిక సంవత్సరం ఒకే సుమూహర్తంలో వచ్చేస్తుంటాయి. ఏడాది పొడుగూతా మనం గడిపిన చచ్చు జీవితాన్నోసారి సింహావలోకనం చేసుకోడానికి.. ముందు ముందు ముంచుకు రాబోయే ముప్పులకి మనల్ని మనం సంసిద్ధం చేసుకోడానికి.. ఈ చవటాయీల సంబరాన్ని మించిన ఉత్తమ సందర్భం మరోటి లేనే లేదు. హ్యాపీ ఫూల్సు డే.. ఇన్ ఎడ్వాన్స్!

'ఫూల్' అంటే తెలివితక్కువ దద్దమ్మని కదా అంతరార్థం. నా కన్నీ తెలుసనుకొన్నవాడంత దద్దమ్మీ లోకంలో మరొకడుండడు. మనం దున్నుకునే,  మనదే అనుకొనే భూమి ఏ పెద్దమనిషి కభ్జా పద్దుల్లోకి పోబోతుందో పుట్టించిన భగవంతుడికైనా తెలీదు. నీ బ్యాంకు కాతా జమా సొమ్ము  ఖాయంగా నీదేనన్న ధీమా  నీ దగ్గరే ఉంటుందా పర్మినెంటుగా? అందాకా ఎందుకయ్యా.. నీ మనీ పర్సు చిల్లర వందనోట్లు కచ్చితంగా నకిలీ.. మకిలీలేవీ కానే కావని కనీసం నీకైనా తెలుసా?  అందుకే గురజాడగారి గిర్రాయిగాడనేది అస్తమానం 'ఈ తెలివితక్కువ లోకంలో తెలివితక్కువగా బతకడం కన్నా తెలివైన కార్యం మరోటేదీ లేద'ని. తెలివి ఎక్కువై పోతే తెల్లారి లేచినప్పట్నుంచి తిప్పలే తిప్పలు!

భర్తృహరంతటి మహాకవే తన సుభాషితాల్లో ముందుగా మూర్ఖుణ్ని తలుచుకొన్నాడు. నిప్పుకు నిరు, ఎండకు గొడుగు, ఏనుగుకి అంకుశం, ఎద్దు.. గాడిదలకు ముల్లుగర్ర, రోగానికి మందు, విషానికి మంత్రం… విరుగుడుగా చెప్పిన శాస్త్రాలు సైతం చెవటాయీలకు మాత్రం ఏది నిదానమో నిర్ధారించలేక చేతులెత్తేసాయ్' అంటాడా పెద్దాయన.
పప్పుతో వజ్రాన్నైనా పరా పరా కోసేయచ్చేమో కానీ మంచి మాటలు చెప్పి మూర్ఖుణ్ని రంజింపచేయడం.. ఉప్పు సముద్రంలో తేనె బొట్టేసి తీపిదనాన్ని ఆశించడమంత తెలివితక్కువతనం అనటం .. ఎంత తెలివైన మాట!

జేబులో చిల్లి కానీ లేకపోయినా ఎన్నికల్లో నిలబడి నెగ్గేయ గలమని ఎవరైనా నమ్మగలరా.. ఈ కలికాలంలో మన ప్రజాస్వామ్యంలో? తెలుగు చిత్రాలకు ఏనాటికైనా తప్పకుండా ఆస్కారు పురస్కారాలొచ్చి తీర్తాయని ఆశపడగలరా ఎవరైనా? టీ.వీ ధారావాహికలు పదమూడు ఎపిసోడ్లతో పరిసమాప్తమవుతాయనీ, పెట్రోలు రేట్లు ఎప్పటికైనా తగ్గుముఖం పట్టక తప్పదనీ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల్లేకుండానే పిల్లకాయలకు  తెలుగు పాఠాలు చెప్పే మంచిరోజులొస్తాయనీ మీరూ నమ్ముతున్నారా? కచ్చితంగా నమ్మేవారంతా కలసి చేసుకోవాల్సిన ఘనమైన సంబరం ఈ ' చవటాయీల దినోత్సవం'.
విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే పాలచెంబులతో  పరుగులెత్తే భక్త గణాలు, పూర్వజన్మల  పాప ప్రక్షాళనార్థం  బాబాల కాళ్లతో తన్నించుకోడానికి  బ్లాకు టిక్కెట్లకోసమైనా  ఎగబడే ముక్తి కాంక్షాపరులు, బైటకళ్లకు కనిపించేదంతా అశాశ్వతమైన తోలుతిత్తి ఆత్రమేగాని, అసలైన లోపలి అంతరాత్మ ఎన్ని అంట్లపనులు చేసినా  మైలనేది అంటుకోదని దృశ్యకావ్యంలో శృంగార లీలలు ప్రబోధించే ఆనందస్వాముల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలాచరించే భక్తపరమాణువులంతా కల్సి ఓ 'చవటాయీల సంఘం' సగర్వంగా ఆరభించుకోదగ్గ సమయం.. సందర్భం ఇదే.. ఇదే!
ఎలాగూ ఏదో ఒక జనాభా లెక్కల గలభా లెప్పుడూ జరిగే గణాంకాల దేశం మనది. ఈ సారైనా మూర్ఖుల వివరాలు సమగ్రంగా సేకరించే ఏర్పాట్లు సర్కార్లు సక్రమంగా చేపట్టే దిశగా వత్తిడి తెచ్చేందుకు  ముక్కోటి మూర్ఖుల సంతకాలు సేకరించే ఉద్యమం  చిత్తశుద్ధితో ప్రారంబించాల్సిన తగిన తరుణమూ ఇదే! చవలాయీలెవరైనా  చైతన్యయాత్రలు తెచ్చుకొనేందుకు ఈ దినాన్ని మించిన సముచిత సందర్భం మరోటి లేనే లేదు.
ఫోర్బ్స్ జాబితా టాప్ టెన్లో మనవాళ్లేదో ఇద్దరు ముగురున్నందుకే మురిసి ముక్కలైపోతున్నామే! ఫోర్బ్సుగాళ్ళను ఫూల్సు జాబితా నిజాయితీగా రిలీజు చేయమనండి.. టాప్ టెన్ థౌజండ్లో ఒక్క పేరైనా పక్క దేశాలకు పోయే ఛాన్సు బొత్తిగా లేదు. నోబెల్ పురస్కారాల్లాంటివి దద్దమ్మలకూ ఇచ్చే పద్ధతీ ప్రారంభిస్తే ఏడాదికో డజను మంది మన దేశంనుంచే పోటీ పడ్డం ఖాయం.

మనలోని తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేక పోవాడాన్ని మించిన తెలివితక్కువతనం మరోటి లేదు. 'మనవాళ్లొట్టి చవటాయిలోయ్' అంటూ గురజాడగారి గిరీశం చేత గోతాలు చెప్పించుకోడం కాదు.. ఆ దిశగా మనల్ని మనం ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన ప్రణాళికలింకా ఎన్నెన్నో సర్కార్లు సిద్ధం చేయాల్సుంది! ఆందోళనలకు దిగితేగానీ ఈ మొండి సర్కారులేవీ బండిదిగిరావని అందరికీ తెల్సు. వచ్చే నెల ఏప్రియల్ ఫస్టుకే 'చవలాయీల దినం'. అందుకే ఓ నెల ముందుగానే ఇన్నేసి హెచ్చరికలు!.
కోట్లు కూడేసి విలాసవంతమైన జీవితం దిలాసాగా గడిపుతున్నా.. ఆ  పెద్దమనుషులెవ్వరినీ 'టచ్' చెయడానికైనా దడిసి.. నాలుగైదు చిరిగిన చీరలకేవో  చాటు మాటుగా మూట కట్టుకు పోయే చవటాయిని  పట్టుకుని ఏడాదిపాటు ఏ వారంటూ లేకుండా  కటకటాల వెనక కుక్కి యమదర్శనం చేయిస్తున్నదంట మన ఘనమైన తెలంగాణా రక్షక భటశాఖ!
కేకోయ్  కేక! 'మూఢుల దినం' ఇంకో ఇరవై రోజులుందనంగానే మన శాంతిభద్రతల సిబ్బంది  అప్పుడే తన వంతు  'చెవలాయీల సంబరాలు' ఆరంభించేసిందన్న మాట! శభాషో శభాష్!
***
-కర్లపాలెం హనుమంరావు 

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో  2010నాటి ఏప్రియల్ ఫూల్సు డే  సందర్భంగా ప్రచురితం) 

Saturday, March 4, 2017

'జులాయి' అంటే నిజంగా తిట్టు పదమేనా?

'జులాయి' అని ఈ మధ్య ఓ సినిమాకూడా నిర్మాణమయింది కదా తెలుగులో! ఆ 'జులాయి' అంటే మన వాళ్లకి పనీపాటా లేకుండా బేవార్సుగా తిరిగే గాలిగాడని అర్థం. అదొక రకంగా తిట్టు పదం కూడా. 'వాడా? ఒట్టి జులాయి వెధవ!' అని చీదరించుకోవడం మనం తరచూ వింటూనే ఉంటాం. నిజానికి ఈ 'జులాయి' పదం మరీ అంత నీచపదమా? అదేమీ కాదంటున్నారు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణగారు తన 'మాటల వాడుక- వాడుక మాటలు' గ్రంథంలో.
'జులాయి' అనేది హిందీ/ఉర్దూ భాషాప్రభావం నుంచి  తెలుగులో వాడుకలోకొచ్చిన  పదం. మూల రూపం 'జులాహీ'. అంటే నేతగాడని అర్థం. నేతపని చేసుకొని బతికేమనిషి మరి 'జులాయి'పనీ పాటా లేని మనిషిగా ఎలా రూపాంతరం చెందాడన్న సందేహం చాలా మందికి కలగవచ్చు. ఆ వివరణకోసం ఈ టపా!

మన ప్రాచీన భారతావని గ్రామీణ వ్యవస్థ ఆధారంగా  పటిష్ఠంగా ఉన్న రోజులు ఒకానొకప్పుడు ఉండేవి. 'పంచాగణంవారు'గా ప్రసిద్ధులైన ఐదు కులాల వారి చేతిచలవవల్ల ఆ నాటి జనం జీవితాలు చల్లంగా సాగుతుండేవి.  కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి, చాకలి.. ఈ ఐదు వృత్తులవారు. వారి సేవాధర్మంవల్ల గ్రామసీమలు ఎలాంటి ఒడుదుడుకుల్లేకుండా సాఫీగా సాగుతున్న కాలంలో తెల్లోళ్ళు ఈ గడ్డమీదకు దిగబడ్డారు. తెల్లవాళ్లది ప్రధానంగా యంత్ర ఆధారితమైన ఆర్థిక.. సామాజిక వ్యవస్థ. తమ పాలనా విధానాలను ఇక్కడి జనజీవితంమీద బలవంతంగా రుద్దేందుకు వాళ్లు చెయ్యని కుతంత్రాలు లేవు. అంతకు ముందునుంచే పాలకులుగా ఉన్నా మొగలాయీలు క్షీణదశలో ఉన్న కారణంగా తెల్లోడి ఆధిపత్యం ముందు గట్టిగా నిలబడలేక పోయారు. బ్రిటీషువారు ధ్వంసంచేసేందుకు ప్రయత్నించి సఫలమయిన ముఖ్య వృత్తుల్లో నేతపని ఒకటి. మిల్లులమీద నేసి దిగుమతి చేసిన నాజూకు బట్టముందు మన మగ్గంపనివారి ప్రజ్ఞ నిలబడలేకపోయింది. క్రమంగా మిల్లుభూతం మింగేసిన నేతజీవులు పనీపాటలకోసం పట్నం బాటలు పట్టారు. ఆ సందర్భంలో పనీ పాటా లేకుండా పొట్టచేతబట్టుకుని తిరిగే ఆ నేతపనివారిని ఉద్దేశించే 'జులాయి'  అన్న పదం పుట్టింది. క్రమంగా ఆ 'జులాయి' పద ప్రయోగం అన్ని  వర్గాలకీ సంబంధించే విధంగా స్థిరబడింది.

దేశం స్వాతంత్ర్యం సాధించి ఏడుదశాబ్దలు గడిచినా నేతపనివారి జీవన పరిస్థితుల్లో ఏ మాత్రం మెరుగుదల కనిపించక పోవడం నేటికీ మనం  గమనించవచ్చు. ఇప్పటికీ ఆకలి చావులు, ఆత్మాహుతులు.. చేనేత కుటుంబాలలో తరచూ వినిపిస్తున్న మాటలే.

ఇటీవలనే తెలంగాణా ప్రభుత్వం దృష్టి ఈ చేనేతవృత్తి పనివారి జీవనవిధానంమీద పడింది. హర్షించదగ్గ అంశమే! 'జులాయి' అనే పదాన్ని తెలుగుభాషకు ఆ విధంగా అందించిన చేనేతన్నకు ఎన్ని చేసినా తక్కువే కదా!

సందర్భం వచ్చింది కాబట్టి మరో ముచ్చట. అమెరికాలో ఉద్యోగాలకని ఎగబడే   మన భారతీయ యువతకూ  అక్కడి కొత్త ప్రభుత్వాధినేత ట్రంప్ మహాశయుడి జాతీయభావాల కారణంగా  హెచ్-1 బి వీసాలమీద వివిధ నిర్బంధాలు అమలు దిశగా ధృఢంగా అడుగులు పడుతున్నాయి కదా ఇప్పుడు. ఈ స్పీడు చూస్తుంటే  నిన్నటి వరకు మకుటం లేని మహారాజాలమనుకున్న మన ప్రవాస భారతీయులు రేపు  డొనాల్డుగారి పుణ్యమా అని  విదేశీయ 'జులాయి'ల్లాగా మారరు కదా కొంపదీసి? ఏమో చూడాలి మరి!

ఏదేమైనా తిట్టో.. దీవనో.. వాడుకలో ఉన్న పదాలమీద ఆ కాలంనాటి సామాజిక పరిస్థుల ప్రభావం తప్పకుండా ఉంటుందన్నది భాషాశాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతం. ఆ వాదాన్ని బలపరిచే 'జులాయి'లాంటి పదాలింకెన్నున్నాయో మన తెలుగు పద సంపదలో!  పరిశోధకులు తేల్చి చెపాల్సిన లోతైన అంశమిది. ఏమంటారూ?
(డాక్టర్  బూదరాజు  రాధాకృష్టగారి 'మాటల వాడుక.. వాడుక మాటలు' ఆధారంగా)


-కర్లపాలెం హనుమంతరావు

నా నచ్చిన పుస్తకం లోని నాకు నచ్చిన చిన్న కథ- కాదేదీ నా కబుర్ల కనర్హం


ఒక అడవిలో మూడు చెట్లు. మూడింటికి మూడు కోరికలు.
మొదటి దానికి ఒక అందమయిన రాకుమారిపడక గదిలో అద్దం దగ్గర ఆమె తన విలువయిన ఆభరణాలు దాచుకునే అందమయిన నగిషీలు చెక్కబడిన చెక్క పెట్టెలాగా మారి అందరి దృష్టిని ఆకర్షించాలని అభిలాష .
రెండో చెట్టుకి ఒక బ్రహ్మాండమయిన నౌకలాగా మారి రాజులూ రాణులు విహరించే లాహిరి లాహిరి ఊయలగా మారాలని కోరిక.ప్రళయం వచ్చినప్పుడు జనాల ప్రాణాలను కాపాడే అవకాశం రావాలని కూడా దాని ఆశ .
మూడో దానికి మాత్రం ఈ ప్రపంచం లో అందరికన్నా ఏపుగా ఎదిగి తన జాతికి పేరు తీసుకురావాలని ఆశయం .
కొంత కాలానికి చెట్లు కొట్టేవాళ్ళొచ్చి అన్నింటి తో పాటు వాటినీనరికి తీసుకుని పోయారు.
మొదటి చెట్టు కొయ్య జంతువులకు ఆహారం పెట్టే చెక్క పెట్టె గా చెక్కబడింది.రెండోది చేపల తొట్టి. మూడోదాన్ని మరీ అన్యాయంగా చిన్న చిన్న పేళ్ళు గా కొట్టేసారు.
మూడు చెట్లు తమ దురదృష్టానికి దుఃఖపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేక పోయింది. 
కొంత కాలానికి జంతువుల కొష్టం లోకి ఒక ఆడమనిషి ప్రసవించటానికి వచ్చింది.పుట్టిన బిడ్డను ఆ గడ్డి తొట్టెలో పడుకోబెట్టింది.ప్రపంచం లోకెల్లా అత్యంత విలువయిన నిది తనలో వున్నట్లు తెలిసి ఆ చెక్క పెట్టె మురిసిపోయింది.
చాలా ఏళ్ల తరువాత ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఒక నది వడ్డుకి వెళ్లి అక్కడి పడవలో పడుకున్నాడు.ఇంతలో పెను తుఫాను ఆరంభమయింది.పడవలోని మనిషి ప్రకృతి వైపు చూసి 'శాంతి శాంతి 'అని ఆదేశించాడు. ప్రకృతి శాంతించింది. ఆ క్షణంలో పడవకు అర్ధమయింది -తనలో పడుకున్నవాడు రాజు కాదు రాజులకు రాజు వంటి వాడని.
మరి కొంత కాలానికి అదే వ్యక్తిని శిలువ వేయటానికి కొయ్య పేళ్ళను ఏరుకుని వెళ్లారు కొంత మంది సైనికులు.
జీసస్ ను శిలువ వేసిన తన చెక్కలతో సహా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు 
ఆ మూడో చెట్టు అందరికన్నా ఎక్కువగా మురిసిపోయింది.
ఆ రకంగా మూడు వృక్షాల ఆకాంక్షలను దేవుడి బిడ్డే స్వయంగా వచ్చి తీర్చాడు.
-యండమూరి వీరేంద్రనాథ్



దేవుడు వున్నాడా లేడా?... జీసస్ దేవుడి బిడ్డ అవునా కదా ? అని చర్చల లోకి వెళ్ళటానికి కాదు ఈ కథ ఇక్కడ ప్రస్తావించింది..
కల్పించే వూహా శక్తి వుండాలే కానీ...చెయ్యి తిరిగిన రచయిత దేనినయినా ఎంత అందంగా సమన్వయం చేయగలడోనని చెప్పటానికి!

(యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఆరో మెట్టు' లో ఈ కథ కనిపించినప్పుడు ముందుగా నాకూ తట్టిన ఆలోచన ఇదే ! .ఇలాంటి చిత్రమయిన చిన్నచిన్న కథలు..ఆలోచనలను రేకెత్తించేవి ఆ పుస్తకం నిండా కోకొల్లలు. ఆసక్తి వున్న వాళ్ళు తప్పకుండ చదవదగిన వ్యక్తిత్వ వికాస సబంధంయిన మంచి ఉపయుక్తమయిన  పుస్తకం 
ఏది ఎలా వున్నా యండమూరివారి దగ్గరనుంచి మనం చాల చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చు. ఇది .చదివేవారి సమయం వృధా పోదు  నాదీ గ్యారంటీ
-కర్లపాలెం హనుమంతరావు

Friday, March 3, 2017

జ్ఞాన 'సముపార్జన' - వ్యంగ్యం

" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?""తెలీదు కనకనే కదా స్వామీ.. తమరి  దగ్గరికీ రాక!""ఆ తెలీక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా""ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా సెలవివ్వండి స్వామీ?"" 'స్వ'  అనద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది.  ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది.   రాజకీయాల్లో ఉంటే  మినహా డాంబిక పదప్రయోగాలు  హాని చేస్తాయ్. అది  తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే' ""చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడుంటుందో  కూడా వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ?"గురువుగారు గడ్డం నివురుకున్నారు.
గురువుగారి గుబురు గడ్డంలో దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు..  అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు .. సీదా సాదా జీవులు బుర్రలు గోక్కుంటుంటారు.
"గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డంటిదని అని ఎవరో  స్వాములవారా మధ్యో టీ.వీలో ప్రవచిస్తుండంగా  విన్నాను. అదెంత వరకు నిజం?"" 'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టే అబద్ధానికి 'గాడిద గుడ్డు' ఒక సంకేతంరా శిష్యా!  ఆ స్వామి వారన్న  మాట నూటికి నూటొక్కపాళ్లు  నిజమే!""మరి ఆ 'ఆజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?""'ఇంద' చిటికెడు పంచదార అప్పటికప్పుడు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చూడు' అన్నారు స్వామీజీ."తియ్యగా స్వామీ!""ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు  తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు!"ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ.. కప్పు?!తాగి "కషాయంలాగా ఉంది స్వామీ!" అని అదో రకంగా మొహం పెట్టేశాడు శిష్యుడు."'ఇంద' ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చూడ'మన్నారు  గురువుగారు."ఉప్పగా ఉంది స్వామీ!""మళ్లీ ఇందాకటి లోటాలోని కాఫీనే ఇంకో గుక్కెడు గొంతులో పోసుకో! రుచెలా ఉందో చెప్పు!" ఆదేశించారు గురువుగారు."భలే ఉంది స్వామీ!  కానీ ఏ రుచో చెప్పలేను""ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా శిష్యా!"
ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు శిష్యుడు. 'అయితే స్వామీ…"
"అర్థమయింది. వాసనను గురించే కదా నీ నెక్ట్ ప్రశ్న? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికే లేని అజ్ఞానానికి  వాసనేముంటుందిరా అజ్ఞానీ!"శిష్యుడికి మెల్ల మెల్లగా అర్థమవుతోంది అజ్ఞానసారం. అయినా అయినా ఇంకా ఏదో ఇతమిత్థంగా తేలని సందేహం. "స్వామీ! ఆఖరి క్వశ్చన్. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలుమీద  తపస్సు చేస్తుంటారు. నా వంటివారు  మీ బోటి జ్ఞానుల చెంత  చేరి తత్త్వబోధలు వింటుంటారు. ఇంకొందరు గ్రంధ పఠనం,  మరికొందరు ప్రపంచ పర్యటనం.. ఇలా ఎవరికి తోచిన పద్ధతులు   వాళ్లు ఆచరిస్తుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు.."''అవును.  మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి  కాబట్టి ఆ యాతనలేవో వాళ్లు అలా  పడుతుంటారురా బాలకా!""మరి అజ్ఞానం వల్ల ఏం లాభం ఉందని  స్వామీ.. ఇంతమంది ఈ లోకంలో జ్ఞానసముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా  ఆ వర్గంలోనే ఉండిపోడానికి కొట్టుకు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?""ఇదేరా భడవా.. అసలు సిసలు  అజ్ఞానమంటే! పొరుగువాడిని ప్రేమించు! ఎల్లప్పుడూ సత్యమునే పలుకు! ఆడవారిని తోబుట్టువుల్లాగా గౌరవించు! పెద్దలమాట చద్దిమూట. ఆడి తప్పకు. దొంగతనము చేయద్దు. అహింస పరమ ధర్మం. జంతుహింస అమానవీయం. దుర్భాషలాడబోకు! నీతి మార్గం విడవబోకు!' వంటి మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ  ఏ మంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో  గడ్డికరిస్తేనే కదరా  బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా  కూడగట్టే  పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుండా అలా గాలికొదిలేస్తే వాళ్లు అజ్ఞానంతో చేసే అల్లరి చిల్లరి పన్లతోన్ అంతా ఆగమాగమయిపోదా శిశువా?   పెద్దతనంలో మనం ఏ రోగమో రొప్పో వచ్చి   మంచంపట్టాక  పక్కగుడ్డలు మార్పించే  నాధుడు కూడా కరువవుతాడు. ఎక్కడెక్కడి వాళ్లో సహేలీలు.. స్నేహితులంటూ  సంబంధాలు కలుపుకొని కోటలో పాగా వేస్తారు.  సంపాదించుకున్న మంచి పేరుకు  తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా  కూడబెట్టుకోకుంటేనే కదా శిష్యా..  కోట్లు లక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదార్లో పడి గట్టెక్కగలిగేది?  అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని  పడగొట్టాలన్నా  చెడ్డదారి  తొక్కడం కన్నా మంచి మార్గం మరోటేమనా ఉందా మూర్ఖా!   ఇందాక నువ్వన్నావే.. ఆ  జ్ఞానార్జన గట్రాలతో  జీవితంలో  సాధించిందేముందో ఆలోచించురా శిష్యా? భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాలను దేబిరించటం కన్నా.. పదవుల్లో    పచ్చగా  ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో  పేర్రాయించుకొనే ఏర్పాట్లు చేసుకోడం మేలు. ధనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ లేదీ లోకంలో! జ్ఞానసముపార్జన ధనసముపార్జన కాళ్లకడ్డంరా శుంఠా!  అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పట్టానికి  జ్ఞానమార్గం నమ్ముకుంటే  అంతకు మించిన అజ్ఞానం మరోటేమన్నా ఉందా శిష్యా! ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?" శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోడం మొదలు పెట్టాడు."కళ్లు తెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వసంగపరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్క  ప్రశ్నకు  లక్ష చొప్పున  నిర్మొహమాటంగా ఎంత ఘనాపాటీనుంచైనా రొక్కం  గుంజేస్తున్నారు.  తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజేస్తున్నాయి. తమరి శిష్యుణ్ణి. గురువు మార్గమే కదా శిష్యుడికీ సదా శిరోధార్యం!  అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా పొలిటికిల్ సర్కిల్లో.  నా బిడ్డలకూ బారెడు  గడ్డాలూ మీసాలు పెరిగి నాలుగైదు రాజాశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు  దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించి ఉంచుకోవాలి కదా! తమరి లాగా జ్ఞాన 'సముపార్జన'కే  నా ఓటు కూడానూ!" సభక్తిపూర్వకంగా చేతులు జోడించి  నిలబడ్డాడు శిష్యుడు లేచి వెళ్లడానికి సంసిద్దుడవుతూ."అదిరిందిరా శిష్యా! అదీరా అసలైన జ్ఞానమంటే! విజయీ భవ!" ఆశీర్వదించారు గురువుగారు.*** 

-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...