Wednesday, August 23, 2017

తొండపు స్వామీ... దండము నీకు!-ఈనాడు సరదా గల్పిక



గణాధిపతి హాస్య రసానికి అధిపతి. చందమామయ్యే పాపం ఎందుకో అలా నీలాపనిందలపాలయ్యాడు కానీ, ఆ బొర్ర దేవుణ్ని చూస్తే నవ్వు రానిదెవరికి? హాయిగా చవితి పండుగ ముందునాడు, వినాయకుడి ముచ్చట్లు చెప్పుకొందాం. అదే పుణ్యం పురుషార్థం కూడానూ!
జాజి, జవ్వాజి అంటూ పత్రులు ఇరవయ్యొక్క రకాల్తోనా గజాననుడికి పూజా పునస్కారాలూ? అన్నేసి రకాల ఆకులు ఈ కరవు రోజుల్లో దొరుకుతాయనే! కరివేపాకు రెబ్బ కూడా కాడ పది కాడ నిలబడి కిందికి దిగిరానంటుందబ్బా రైతు బజార్లల్లో! జనాలేవన్నా ఆ అదానీ, అంబానీలకు దగ్గరి చుట్టాలా పక్కాలా? బీదా బిక్కీ ఒక్కపూట బొక్కేందుకే ఇంత బలుసాకు రెక్క దొరక్క బిక్కచచ్చి బతకతా ఉంటే- మళ్లా ఇదేం విపరీతమయ్యా మహానుభావా!
గారెలు, బూరెలు, వడపప్పు, పాయసాలంటూ చేంతాడంత పట్టీలు పట్టుకు చందాలకని ఇల్లిల్లూ తిరిగి వేపడం, ఉండ్రాళ్ల మీదకు దండు గొలుపమంటూ ఆ బొజ్జ గణపయ్యను ­రికే రెచ్చగొట్టొద్దు బాబోయ్‌! దినం గడవడమే గండంగా ఉందిగదా ఇక్కడ మహాశయా!
ఏ దినుసుమీద ఎంత జీఎస్‌టీ వాతో... కొన్న తరవాత కానీ తేలడం లేదు రాత! ఏదో విధాయకం కనక భాద్రపద చవితికి సరదాగా వినాయకుణ్ని ఓసారి వచ్చి పొమ్మనడమే కాని- చూసీచూడనట్లు సర్దుకుపోవాలని ఆ లంబోదరుడికి మాత్రం తెలీదా?
సరే, ఎలాగో ఆ ఎలుక వాహనుడు వాలిపోతున్నాడు కాబట్టి, కొన్ని హెచ్చరికలు ముందస్తుగా మనమూ చెప్పక తప్పదు. శ్రీ గజాననా... శ్రద్ధగా విను నాయనా! గుళ్లల్లోని దేవుళ్లే నేరుగా భక్తుల ఇళ్లకు వెళ్లొచ్చే కొత్త రోజులు వచ్చి పడ్డాయిప్పుడు. కుడుముల మీద మరీ అంత యావుంటే కుదరదు. ఏ భక్తుడి బీరువాలోనో లటుక్కుమని ఇరుక్కునే ప్రమాదం కద్దు. జర భద్రం జగన్నాయకా!
పోయిన ఏడాది మాదిరే పూజలో వెయ్యి నోట్లు విసిరితే ఉబ్బి తబ్బిబ్బు కావద్దే! ఆ చెల్లని నోట్లతో నిన్ను బోల్తా కొట్టించేసి, నీ నుంచి వరాలు దండుకొనే పథకాలు దండిగా తయారవుతున్నాయ్‌ నీ పూజా పందిళ్ల వెనక వినాయకా! అమాయకంగా ఎవరి మాయలోనూ పడిపోవద్దు. ఆనక ఏ ఈడీ కేసులోనో ఇరుక్కుంటే మీ డాడీవచ్చి విడిపించాలన్నా- ఫలితం సున్నా!
కోరిన విద్యలకెల్ల ఒజ్జవని బుజ్జగించి మరీ ఏ చెత్త బడులకో అనుమతులు రాబట్టేస్తారండోయ్‌ విద్యా వ్యాపారుల దండు. ఆ అడ్డా సరకుతో జర భద్రంగా ఉండాలి జగన్మాత తనయ! అత్యున్నత న్యాయస్థానాలే నిదానంగా పోయే విధానాలతో ఉంటే, నీకు మరీ అంత అత్యుత్సాహం తగదు! ఆనక జరిగే తగాదాల్లో పార్టీ కావద్దు!
పుట్టిన రోజు వేడుకలకని అంత ఉల్లాసంగా వచ్చేస్తున్నావు. మంచిదే కానీ, ఎన్నికల వేడి నీకన్నా ముందస్తుగానే వచ్చి పడిందిప్పుడు వాడవాడలా! పాడు నేతలు నీ అభయ హస్తాన్ని ఎంతలా వాడుకుంటారోనన్నదే మా భయం. ఎచ్చులకుపోయి ఎవరి ఉచ్చులోనూ ఇరుక్కుపోకుండా ఉండటానికే ముందస్తుగా నీకీ హెచ్చరికలు!
మాదక ద్రవ్యాల వినియోగం మహజోరుగా సాగే సీజన్లోనే వచ్చి పడాలా నీ చవితి పండుగ సంబురాలు శంభు తనయా! పూజా పత్రిలో రవ్వంత గంజాయి ఆకు దొరికినా చాలు- కైలాసగిరికి నువ్వు తిరిగి వెళ్లే మాట కల్ల! జర భద్రం జగన్నాయకా!
పుస్తకాల సంచి బరువు బాధల నుంచి బడి పిల్లకాయలను కాపాడాలని రెండు తెలుగు ప్రభుత్వాలూ తెగ తంటాలు పడిపోతున్నాయి. భారీ కాయమాయె నీది! ఏ ఆకతాయితనానికో పసిపిల్లకాయల భుజంమీదకు ఎక్కుతావోనని భయం!
అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతూ చెడ తిరిగే దున్నపోతులకీ దేశం గొడ్డుపోలేదు. వాటి మీద ఎక్కి, వాళ్ల వంకర బుద్ధులనన్నా తిన్నం చెయ్యి స్వామీ- నీ చవితి పండగకు అప్పుడు ఓ చక్కని సార్థకతా ఏర్పడినట్లు ఉంటుంది.
అన్నట్లు, ఆఖరుగా నిమజ్జన దృశ్యం ఉంటుంది. ఎప్పట్లా ట్యాంకుబండ్‌ మీదే అది తప్పనిసరా స్వామీ? బోలెడంత జనం సొమ్ము ధారపోస్తేగాని ఆ మాత్రమైనా పరిశుద్ధమైంది కాదీ సాగరు జలాలు! మళ్ళీ మురికి చెయ్యడమంటే ఎవరి ముల్లెకో లాభం చేకూర్చడమన్న మాటే! నీ భక్తులకు నువ్వే నచ్చజెప్పాలి. న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించడం నువ్వే నేర్పించాలి విఘ్నేశ్వరా!
నీ మూషిక వాహనాన్నే నమ్ముకుని రావయ్యా గణనాయకా! నామోషీ ఏం లేదులే. కాకుంటే మా కొత్త పాయింట్లపద్ధతికి కాస్త నీ కొంటె మూషికం అలవాటు పడాలంతే! ఏనుగు చెవులని ఏమంత బేఫర్వా వద్దు. ఎన్నికల మధ్యలోకదా నీ చవితి పండుగ వచ్చి పడిందీ! మా బూత్‌రాజకీయాలకి ఓ బేలు దూదుండలు తప్పనిసరి. గుర్తుంచుకొని వెంట తెచ్చుకో... పండుగ తొమ్మిది రోజులూ రెండు చెవుల్లో దోపుకొందువుగాని!
ఉచిత ఫోను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంత విపులంగా నీతో ముచ్చటించడానికి వీలైంది. చివరగా చిన్న విన్నపం. నీతోపాటు సిద్ధిని, బుద్ధిని వెంట తీసుకురావయ్యా! వాళ్లిద్దరే మా పెద్దమనుషులందరికీ ఇప్పుడు అత్యంత అవసరమని మా మెజారిటీ సామాన్యుల తిరుగులేని తీర్మానం!

- కర్లపాలెం హనుమంతరావు

Sunday, August 13, 2017

పుస్తక ప్రపంచం- ఈనాడు సంపాదకీయం


మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అధికం. మనువు మాట ప్రకారం, ఆతెలియనివాటిని తెలియజెప్పేవి– శ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనులసాంగత్యం. గురువ్యవస్థ, పర్యటన, పరిశీలన, స్వయంచేతన– వాటిని సాధించే మార్గాలు. గురువులు అందరికీ దొరకరు. దేశాటనా, పరిశోధనా అందరికీఅందుబాటులో ఉండేవీ  కావు. తలబోడి అయిన పిదపకాని దొరకని దువ్వెన– అనుభవం. మిగిలింది స్వయంకృషి. దానికి నెలవైనవే పుస్తకాలు.
తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం బోధిస్తాడు. ఏకకాలంలో ఈ మూడుధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే అనేవారు               డాక్టర్ 
సర్వేపల్లిరాధాకృష్ణన్. నిజం– పుస్తకాలనేస్తుడికి ఒంటరితనంఅంటు సోకదు. అక్షరచెలిమిని మించిన కలిమి సృష్టిలో మరేదీలేదని అక్బర్ బాదుషా భావన. స్వయంగా అక్షరాస్యుడు కాకపోయినా విద్వాంసులతో నిత్యసంపర్కమే ఆ బాదుషాలోని సంస్కారానికి సుగంధాలు అద్దింది. వాగ్భూషణం భూషణం అనికదా ధూర్జటికవి సువాక్కు! రాజుకు స్వదేశంలోనే గుర్తింపైతే విద్వాంసుడికి సర్వేసర్వత్రా సమ్మానమే అన్నదీ ఆ కవి సుభాషితమే. దొంగలభయం ఎరగని ఈ సొత్తు పదిమందికీ పంచిన కొద్దీ పెరిగేదే కాని తరిగేది కాదు. మనిషికి జంతువుకు మధ్యనే కాదు– మనిషికీ మనీషికీ మధ్య తేడాకు కూడా చదువే కారణం! జ్ఞానాన్ని సుగంధంతో పోల్చిన కాళిదాసు పుస్తకాన్ని ప్రసూనం అంటాడు. పూవులాగే పుస్తకమూ ఏస్వలాభాపేక్ష లేకుండా నలుదిక్కులా పరిమళాలు వెదజల్లే సద్గుణం కలిగి ఉంటుంది.
శ్రావ్యంబై రసవంతమై మధురమై సర్వాంగ సంపన్నమై/ నవ్యంబై పరిణామ రూపగతులన్  రంజిల్లుచున్   భావముల్/ సువ్యక్తం బొనరించున్ జగమున్ శోభిల్లు వాక్కు అన్న గిడుగు సీతాపతి శారదాశతకం పద్యంలోని ప్రత్యక్షరమూ పరమసత్యమే. ఆవాగ్భూషణం అమరి ఉండే మధుర మంజుల మంజూష పుస్తకం. పుస్తక ధారిణి అయిన పలుకుతల్లిని సంభావించుకునే సుదినం ప్రపంచ పుస్తకదినం.
చదువుసంధ్యల సంగతులు సృష్టి ప్రారంభంకన్నా ముందునుంచి సాగుతున్నవే!విధాత మగతావస్థలో ఉండగా జలరాసి సోమకాసుర రాకాసి చేతిలో జారిపడ్డ వేదవాజ్ఞ్మయాన్ని మీనావతారుడు ఉద్ధరించిన కథ భాగవతంలోఉంది. వేదవిజ్ఞానం సమస్తం ఏదో ఓ  గ్రంథరూపంలో నిక్షిప్తమై ఉందనే కదా దీని అర్థం! తొలిదేవుడు వినాయకుడు వ్యాసులవారి భారతానికి తొలిరాయసగాడు కూడా. చేతికి గంటము వస్తే/ కోతికి శివమెత్తినట్లు కొందరు మంత్రుల్/ నీతి ఎరుంగక బిగుతురు/ సీతారామాభిరామ సింగయరామా! అన్న చమత్కార చాటువే చెబుతుంది రాత ప్రాముఖ్యాన్ని. దశరథుడి పాలనలో నిరక్షరాస్యులనేవారు అసలు లేనేలేరని రామాయణం ఉవాచ. ఓబౌద్ధగ్రంథంలో చర్మాలపై రాయడాన్ని గురించి నప్రస్తావన ఉంది. చీకటిసిరా పూసిన ఆకాశమనే చర్మం పైని చంద్రమ అనేసుద్ద ముక్కతో విధాత చేస్తున్న గణితంలో చివరికి సర్వం తారారూపాలైన సున్నాలే ఫలితాలవుతున్నాయని సుబంధకవి వాసవదత్తలో బహుచక్కని రాతసామ్యాన్నిచెప్పుకొస్తాడు. తాటియాకును, భూర్జపత్రాన్ని జ్ఞానచిహ్నాలు భావించారు మన పూర్వీకులు. జ్ఞానదాత బ్రహ్మ హస్తాన తాళపత్రగ్రంథాలున్నట్లు చెక్కివున్న బాదామి, బహొళె శిల్పాలు ఎన్నోపరిశోధకుల తవ్వకాల్లో బయటపడ్డాయి. బుద్ధుడి జాతకకథలో కర్రపుస్తకాల ప్రస్తావన కనిపిస్తుంది. పాటీలనే ఒకరకమైన పత్రాలపై రాయడాన్ని శ్రీనాథుడూ శృంగారనైషధంలో బహు విశదంగా వర్ణించుకొస్తాడు. శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడనే కవిపండితుడు తన విశ్వకథాసంపుటి బృహత్కథకు తగిన ఆదరణ కరవైందన్న ఆవేదనతో అగ్గిపాలు చేసిన కథ అందరికీతెలిసిందే. ప్రతిపుస్తకానికీ భాగ్యాభాగ్యాలు జంటగా అంటి ఉంటాయని నానుడి. పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె/ యందు నిరుపేద కాపునై యుందుగాని/ పుస్తకములు లేనట్టి భూరిసౌధ/ మందు చక్రవర్తిగ నుండనభిలషింప అన్న విశ్వాసం ప్రస్తుతం తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. ఇది ఎంతైనా ఆనందించదగ్గ అంశమే.
నిప్పు తరవాత మానవుడు ఆవిష్కరించిన అత్యంత సమర్థమైన సాంకేతిక వింత– పుస్తకం. మార్క్ ట్వైన్ మహశయుడు అన్నట్లు– మంచిమిత్రులు, మంచిపుస్తకాలు, మంచినిద్ర వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది? పుస్తకమంటే లక్షఅక్షరాలు, కిలోకాయితాలు, చిటికెడుసిరా మాత్రమేనా? నవరసతరంగాల నురగలపై తేలియాడే కాగితం పడవ. అదిజేబులో పట్టేసే పూలతోట– కొందరు సౌందర్యారాధకుల పాలిటి తెలియని లోకాలకు ఎగరేసుకు పోయే మాయాతివాచీ.  మరికొందరు ఊహాప్రేమికులకు. తులసిదళమంత పవిత్రం. మరి కొంతమంది గ్రంథప్రియులకు. కలతలు తొలగించే తారక మంత్రం, పాపాలను పారదోలేది, మాంద్యానికి మందులా పనిచేసేది, దుఃఖం దుమ్మును దులిపేసి మనసును తేలిక చేసేదీ  పుస్తకమే.
కల్పతరువు, గురువు, భూత వర్తమాన , భవిష్యత్కాలాల అరలలో కాలం దాచుకున్న  సంపద, కరదీపిక, ఆశారేఖ పుస్తకం అంటారు మహాత్మాగాంధీ. అక్షరసత్యమైన మాట. సెర్వాంటిస్, షేక్‌స్పియర్, గార్సిలాసోడిలావేగాలాంటి విశ్వవిఖ్యాత సాహిత్యవేత్తల జన్మదినం.. ఏప్రియల 23. ఈ సుదినాన్ని అంతర్జాతీయ సంస్థ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగం ప్రపంచ పుస్తకదినంగా సంస్మరించుకోమని కోరడం అన్నివిధాలా సముచితం.

కేవలం అక్షరవేత్తలను సన్మానించుకునే ఉత్తమ సంప్రదాయం మాత్రమే కాదు కాపీ హాక్కుల రక్షణ చట్టాలను ఎక్కడికక్కడ యావత్ ప్రపంచం  పునః సమీక్షించుకునే సందర్భం నైతం ఈ పుస్తక సంస్మరణ శుభసమయానే. అక్షర ప్రియులందరికి    అభినందనలు.

(ఏప్రిల్23.  ప్రపంచపుస్తకదినం‘ సందర్భంగా - ఈనాడు ఆదివారం–సంపాదకీయం)

కన్నయ్య నల్లనయ్య ఎలా అయ్యాడు?-బమ్మెర



నిజంగానే ఏమీ తెలియక, ఎవరైనా ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేసి చెల్లుబాటు కావచ్చు. కానీ, అన్నీ తెలిసి తెలిసే కావాలని అడుగుతుంటే ఏమనుకోవాలి? మన లోతెంతో తెలుసుకోవడానికి అలా అడిగారనుకోవాలా? ఒకవేళ తెలిసినా హఠాత్తుగా ఇప్పుడది గుర్తుకు రాక అడిగారనుకోవాలా? అయినా, ఆ ఆడిగింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడే అయితే, ఎవరికైనా ఇంక మాటలెలా వస్తాయి! కాకపోతే ఆ అడిగింది తల్లి యశోదనే కాబట్టి, లోకానికి చక్రవర్తే అయినా, తల్లికి కొడుకే కాబట్టి, ఆమేదో సమాధానం చెబుతుంది. 1978లో విడుదలైన సత్యం-శివం-సుందరం సినిమా కోసం విఠ్ఠల్‌ భాయ్‌ పటేల్‌ రాసిన ఈ పాటలో ఈ తల్లీ కొడుకుల సంభాషణల స్వారస్యమే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ స్వరరచనకు లతా మంగే ష్కర్‌ గాత్రం నిజంగా ప్రాణమే పోసింది.
యశోమతీ మైయా సే బోలే నంద్‌లాలా
రాధా క్యోఁ గోరీ.... మై క్యో కాలా?
(నందకిశోరుడే అడిగాడు యశోదమ్మని...
 రాధ ఎందుకు ఎరుపు? నేనెందుకు నలుపని?)
తనకు తెలిసిందేదో తెలిసే ఉంటుంది. తనలో కదిలే ప్రశ్నలకు తనవైన సమాధానాలు ఉండే ఉంటాయి. అయినా ఆ ప్రశ్నలకు ఎదుటి వాళ్ల నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దామనే కదా ఆ ప్రశ్నలు వేయడం! అయితే ఏ ప్రశ్నకైనా అందరి నుంచీ ఒకే సమాధానం రాదు. ఎందుకంటే ఎవరి అనుభవాలు వారివి! ఎవరి జీవితం వారిది! మొత్తంగా చూస్తే ఒక్కొక్కరికీ ఇక్కడ ఒక్కో వేరు వేరు ప్రపంచం ఉంటుంది. అందరి రక్తం ఒకటే కదా అన్నట్లు, స్థూలంగా అందరి జీవితాలూ ఒకేలా అనిపించవచ్చు. కానీ, అత్యంత సూక్ష్మమైన లోలోతుల్లోకి వెళితే హృదయానికీ, హృదయానికీ మధ్య, జీవితానికీ జీవితానికీ మధ్య అనంతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. దీనికి తోడు, అసలు సమాధానం ఒకటైతే, దాన్ని వక్రీకరించడం మరొకటి. అందుకే ఒకే ప్రశ్నను వేరు వేరు వ్యక్తులను అడగడం ద్వారా ఒక ప్రశ్నకు చెందిన వేయి సమాధానాలు దొరుకుతాయి. ఒకే సత్యానికి చెందిన వేయి ముఖాలు తెలుస్తాయి.





బోలీ ముస్కాతీ మైయా లలన్‌ కో బతాయా
కారీ అంధియారీ ఆధీ రాత్‌ మే తూ ఆయా
లాడ్‌లా కన్హయ్యా మేరా కాలీ కమ్‌లీ వాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
(ముసిముసిగా నవ్వుతూ అమ్మ ముద్దుల కొడుకుతో అంది...
నడిరాత్రి కారు చీకట్లో కదా! నువ్వు జన్మించింది.
అందుకే ఓరి కన్నా! నువ్వు నల్ల కలువవయ్యావు.. నువ్వు అందుకే నలుపు..)
నేనెందుకు నలుపని కన్నబిడ్డే నిలదీసి అడుగుతుంటే కన్నతల్లిగా సమాధానం చెప్పాలి కదా! నిజమే కానీ, ఏ పరిణామానికైనా లోకంలో ఒకే ఒక్క కారణం ఉండదు కదా! ప్రతి పరిణామం వెనుక పైకి కనిపించేవీ, కనిపించనివీ అనేకానేకమైన కారణాలు ఉంటాయి. అలా అని అన్ని కారణాల్నీ ఒకేసారి చెప్పడం కూడా అన్నిసార్లూ కుదరదు . అందుకే ఒక కారణంగా యశోద ’’నాన్నా! అర్థరాత్రి వేళ అదీ కటిక చీకట్లో నువ్వు పుట్టావు. ఆ చీకటి ప్రభావంతోనే నువ్వు నల్ల కమలానివయ్యావు.. నీ నలుపు అలా వచ్చిందే కన్నా’’ అనేసింది. ఆ సమాధానంతో సంతుష్టుడు కాని కృష్ణుడు అది కాదు సమాధానం అంటూ మారాం చేశాడు. ‘‘నా నలుపు సంగతేంటో తేల్చ’’మని తిరిగి ప్రశ్నించాడు.
 బోలీ ముస్కాతీ మైయా సున్‌ మేరే ప్యారే
 గోరీ గోరీ రాధికా కే నైన్‌ కజ్‌రారే
 కాలే నైనో వాలీ నే ఐసా జాదూ డాలా
 ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
 (ఆ తల్లి మందహాసం చేస్తూ, ఓ ముద్దుతండ్రీ!
ఎర్రనైన రాధికవి నల్లనల్లని కాటుక కళ్లు!
 ఆ నల్లకళ్ల అమ్మాయే ఆ మంత్రమేదో వేసింది.
 నువ్వు అందుకే నలుపు)
మరో సమాధానంగా యశోద ‘‘రాధ తన కాటుక కళ్లతో నిన్ను అదే పనిగా చూడటమే నువ్వు నలుపు అయిపోవడానికి అసలు కారణం’’ అనేసింది. చూసినంత మాత్రాన్నే మనుషులు నలుపెక్కుతారా? అంటే ఏమోమరి! ఆమె ఎన్నిసార్లు, ఎంత తీక్షణంగా చూసిందో ఎవరికి తెలుసు? అందులో ఏదో నిజమంటూ లేకపోతే, కన్నకొడుకుతోనే అలా ఎందుకంటుంది! అనుకుంటూ మనమేదో మన మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ, ఆ తల్లికి అలా చెప్పాల్సిన అవసరం ఏముందో ఎవరికి తెలుసు? అయినా ముందు ఒక కారణం చెప్పి ఆ తర్వాత మరో కారణం ఎందుకు చెప్పినట్లు! అంటే అసలు నిజం చెప్పడం ఆమెకు ఇష్టం లేకేనేమో ఇలా దాటేయడం? కాకపోతే, తన కొడుకు ఔన్నత్యం గురించి చెబితే లోకానికి కంటగింపుగా ఉంటుందని కూడా ఆమె అసలు నిజం చెప్పకపోవచ్చు.

ఇత్‌నే మే రాధా ప్యారీ ఆయీ ఇఠ్‌లాతీ
మైనే నా జాదూ డాలా, బోలీ బల్‌ ఖాతీ
మైయా కన్హయా తేరా జగ్‌ సే నిరాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా /
(అంతలోనే ప్రియమైన రాధ... హొయలొలుకుతూ వచ్చింది
 అలక వహిస్తూ నేను ఏ మంత్రమూ వేయలేదు
అమ్మా నీ కొడుకు లోకానికే అతీతుడు.. అందుకే నలుపు అంది)
కన్నతల్లి ఏం చెబితే నేమిటి? అసలు నిజం దాచేయాలని ఆమె ఎంత ప్రయత్నిస్తేనేమిటి? అదంతా బట్టబయలు చేసింది రాధ. కాదా మరి! కృష్ణుడి రంగు నలుపెక్కడానికి తన కాటుక కళ్లే కారణమని చెప్పేస్తుంటే తానెలా ఊరుకుంటుంది.? అందుకే అంది.... ‘‘యశోదమ్మా! నీ కొడుకు నలుపు రంగుకు నేనెలా కారణమవుతాను తల్లీ! నావి ఎంత కాటుక కళ్లు అయితే మాత్రం నా చూపులకే నీ కొడుకు నలుపెక్కుతాడా?అసలు విషయం ఏమంటే... నీ కొడుకు లోకానికే అతీతుడు అతని నలుపు రంగుకు అసలు కారణం ఇదే! కాదనగలవా అమ్మా!’’ అంటూ అటు నుంచి విసురుగా వెళ్ళిపోయింది రాఽధ. అవునూ! అతీతుడు కావడానికీ, శరీర వర్ణం నలుపు కావడానికీ ఏమిటి సంబంధం అనిపిస్తోంది కదూ! అందులో వింతేమీ లేదు. అనంతమైనవే ఎప్పుడూ అతీతంగా ఉంటాయి. అనంతమైనవే నలుపు ( నీలం) రంగులో ఉంటాయి. అనంతమైన సముద్రం నలుపు రంగులో ఉంటుంది. అనంతమైన ఆకాశం నలుపురంగులో ఉంటుంది. అలా చూస్తే అనంతమూర్తులైన రాముడూ నలుపే, కృష్ణుడూ నలుపే. అందుకే నలుపు రంగు అనంతత్వానికీ, దివ్యత్వానికీ ప్రతీకే తప్ప మరొకటి కాదు. రాధ మాటల్లోని ఆ అతీత తత్వం, పరమ సత్యమే తప్ప వేరేమీ కాదు.
- బమ్మెర

(ఆంధ్రజ్యోతి- దినపత్రిక- నవ్య- 14-08-2017)

Tuesday, July 25, 2017

ఆ.. అంటే ఒక్క ఆవేనా?



పశువుల్ని సొమ్ములని పిలుచుకొనేవాళ్లు మొన్న మొన్నటి వరకూ.. పల్లెపట్టుల్లో.. ఆధునిక సోకులు ముదరనంత వరకురావిశాస్త్గ్రిగారి 'సొమ్ములు పోనాయండి'లోని సొమ్ములంటే పాలిచ్చే 'పశు'సంపదే! ఇప్పుడు మనం  'ఆవుగా పిలుచుకొనే జంతువుని ప్రాచీనాంధ్ర శాసనాల్లో  'తొఱ్ఱ' అనేవారని బూదరాజుగారు తన 'మాటల మూట'లో సెలవిచ్చారు

' 'పసరం' అంటే పశువులాంటిదేదో అయుంటుందని కాస్త ఆనవాలు పట్టవచ్చేమోగానీ .. మరీ గిడ్డి(వేలుపుగిడ్డి అంటే కామధేనువు), తొడుకు, మొదవు లాంటి  పదప్రయోగాలకు పూనుకుంటే.. మనుషుల సంగతి అలా ఉంచి.. ముందు గొడ్లూ గోదానే గుడ్లు తేలేస్తాయేమో.. ఎవరిని ఎవరు ఏమని తిడుతున్నారో అర్థం కాక.. అయోమయంతో?' అని ఎద్దేవా చేసే వాళ్లెప్పుడూ ఉంటుంటారు. తెలుసు. కానీ.. మన భాషలోని పద సంపద ఎంత పుష్కలంగా ఉందో.. కనీసం తెలుసుకొనేందుకయినా   చదివే ఆసక్తి చూపిస్తే .. ఈ వ్యాసం రాసిన శ్రమ సార్థకమయినట్లే!



సంస్కృతంలో 'ఆవు'కు సురభి అనే చక్కని ప్రయోగముంది. దైవమహిమ గల ధేనువుని సురభి అంటారు.  (సురభి బాల సరస్వతి' అని గతంలో ఒక సినిమా నటీమణి ఉండేది. ఆమె మహారాష్ట్రనుంచి తెలుగునాటకు వలస వచ్చిన సురభి నాటక కంపెనీకి చెందిన కళాకారిణి. చలన చిత్రాల ప్రాథమిక దశ ఆవిర్భావానికి  'సురభి' నాటక కంపెనీ పేరు ప్రఖ్యాతులూ  ప్రేరణగా నిలిచాయ'నే  పెద్దలూ ఉన్నారు.)


'ఆవు' పదంలోని మొదటి '' వరకే ఒకానొకప్పుడు ఆవుజాతికి సూచకంగా ఉండేది. క్రమేపీ ఆ '' కి 'వు' కలిపి 'ఆవు' అని, 'పోతు' కలిపి 'ఆఁబోతు.. 'ఆబోతు'అని  లింగ విభేదం ప్రకారం పదవిభజన చేసుకున్నాం.. మనం.
వయసులో చిన్నదైన ఆవును దూడ...పెయ్య'  అంటారని తెలుసా? తొలిచూలు ఆవు/గేదెకు 'పడ్డ' సరైన పదప్రయోగమని శబ్దకోశాల వాక్కాణం. 'దూడ' అంటే  లేత వయసులో ఉన్న ఆవో గేదో.. ఎద్దో.. ఏదైనా అయినప్పుడు.. మరి.. 'లేగదూడ'లోని 'లేగ' పదప్రయోగం అదనంగా ఎందుకో?   ఆ పదం పుట్టించిన మహానుభావుడికే  తెలియాలీ మతలబు! పాలు తాగడం ఆపిన ఆవును 'పెయ్య' అనాలని జంతుశాస్త్రాలు  చెబుతున్నాయి. ఒహ పట్టాన పాలు పితకనీయని ఆవును 'అఱ్ఱ' అంటారు. ఆవులకు ఒకానొకకాలంలో 'బర్రె'లనే పదప్రయోగం ఉన్నా క్రమంగా ఆ పదం కేవలం  గేదెల జాతికి మాత్రమే వర్తిస్తున్నట్లనిపిస్తుంది. 
అప్పుడే పుట్టిన బిడ్డని 'తర్ణకం' అనాలి. దూడకు పాలు కుడిపే ఆవును 'లేగటా' ఆనాలి. బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేని ఆవుని ' గొడ్డుమోతు' అంటారని అందరికీ తెలుసు. ఈ 'గొడ్డుమోతు'(గొడ్రాలు) పదం పిల్లలు పుట్టని ఆడవాళ్లక్కూడా వర్తింప చేస్తున్నాం మనం

తెలుపు రంగులో కాకుండా   'గోరోజనం' రంగులో ఉండే ఆవును 'కపిల(సంస్కృతంలోని 'కపిల' కు వికృతా?)' అనో 'నల్లావు' అనో పిలవాలని నింఘంటువుల మతం.
'మహిషి' అన్నా ఆవే. అందులోని 'మహి' శబ్దానికి గొప్పది అనే అర్థం ఉంది. 'భూమి' అనే మరో అర్థమూ ఉంది. ఆవును భూమితో సరిపోల్చడం ఆర్యసంప్రదాయం. దేవలోకంలో ఉండే మహిషి 'కామధేనువు'గా మన్నన  పొందింది'ధేనువు' అన్నా ఆవు అనే  అర్థం. కోరిన వరాలు  వర్షించే ఆవు కాబట్టి అది 'కామధేనువు' అయింది.
 

ఆవుకి 'అర్జున' అనే మరో నామమూ కద్దు.  'అర్జున' అంటే 'తెలుపు' అని అర్థం కదా! ఆవు సాధారణంగా  తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ పదం అతికినట్లే ఉంటుందికానీ.. మరి నల్లటి రంగులో ఉండే పాండవ మధ్యముడికి అర్జునుడు అనె పేరెలా వచ్చిందన్న సందేహం ఉండనే ఉంది.. ఇప్పటికీ సమాధానం అందకుండా!('అర్జునుడు నల్లటివాడా.. కాదా?' అనే విషయంమీద  మన పండితులు 'భారతి'  మాస పత్రికలో నెలల తరబడి వాదులాడుకున్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆ వాదనలు ఎటూ తేలకుండా సమాధానం దొరకని సందేహాల పద్దులోనే ఉండిపోయాయి ఇప్పటికీ) 'అర్జున' శబ్దానికి 'కసవు' 'గడ్డి' అన్న అర్థాలూ నిఘంటువుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి.. పాండవ మధ్యముడి సంగతి ఎట్లా పోయినా.. 'ఆవు' విషయం వరకు  సమంజసంగానే ఉందని  కోదిగుడ్డుకి  ఈకలు పీకే పండితులూ ఒప్పుకున్నారు)
 

'శృంగం' అంటే కొమ్ము అని అర్థం కనక కొమ్ములున్న ఆవును 'శృంగి'  అన్నారుబాగుంది. 'రోహిణి' పదం వినేందుకు  అంతకన్నా శృతిపేయంగా ఉంది.  'రోహిణి' ఓ తెల్లచండ్ర  మొక్క పేరని తెలుగుభాషామీద సాధికారత గల  బూదరాజు రాధాకృష్ణగారో  సందర్భంలో వివరించారు. తెల్ల రంగులో ఉంటుంది కాబట్టి ఆవుకీ ఆ పేరు  పెట్టి ఉంటారు. రోహిణికి పుట్టిన దూడ 'రోహిణేయ' అయింది.. సురభికి పుట్టిన బిడ్డ 'సౌరబేయ' అయినట్లు!  

జంతువుల వరకు  హిందువులకి మాతంటే 'గోమాతేమంచి జాతి ఆవుకి 'నైతిక'.. చుక్కలున్న ఆవుకి 'శబలి' .. పొట్టి ఆవుకి 'వామని'.. తెల్లగా ఉంటుంది కనుక 'ధవల'.. పుల్లావుకి 'కపిల .. వెదలో ఉంది కనక   'నందిని' అని .. ఆయా ఆవులని సందభాన్ని బట్టి పిలుచుకోవాలని పలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.  శబ్దకోశాలు     సోదాహరణంగా  ఆయా సందర్భాలనూ వివరిస్తున్నాయి
ఆవు సాధువుగా ఉంటే 'సుకర' అవుతుంది. ఇబ్బంది పెట్టకుండా పాలిస్తుంటే 'సువ్రత' అవుతుంది..  ఏటా క్రమం తప్పకుండా  పాలిస్తుంటే 'సుమాంసమీన'గా గుర్తింపొస్తుంది.  గోవుమీద గల ప్రాచీన ప్రాచిన సాహిత్యం అంతా ఏకరువు పెట్టడం ఇంత చిన్న వ్యాసంలో అసాధ్యం. 

'ఇవన్నీ కూడా ఎక్కువగా సంస్కృత తత్సమాలో.. తద్భవ  శబ్దాలే కదా! మరి తెలుగులోనే మాట్లాడమని ఇబ్బంది పెట్టడంలో అర్థమేముంది?' అంటూ విసుగు పడేవాళ్లూ ఉంటారని తెలుసు. ఆ తరహా తెలుగు మాటలు బోలెడన్ని చెప్పుకోవచ్చు.  విస్తృతి భయం. మరో సందర్భంలో  చర్చించుకొందాం.. అవసరమైనంత మేరకు.  అచ్చు తెలుగులో ఆవును తెల్లగొడ్డు' అనాలని.. ఆవులను కట్టేసే దొడ్డిని 'కొష్టాం'అనాలని.. ఆవుల గుంపును 'మంద' అనాలని.. ఇలా చాలా  ఉంది గ్రంథం. సంక్షిప్తంగా చెప్పుకుంటేనే ఇంత రామాయణమైంది కదా..ఇంకా వివరాలలోకి గాని పోతే ఓ పట్టాన బైటికి తెమలగలమా? 
కానీ కొసమెరుపు ఏమిటంటేః

ఆవుకి ఇన్ని రకాల తెలుగు.. సంస్కృత పదాలున్నా.. ఇప్పటి వరకూ మనం సాధారణంగావ్యవహరించే 'ఆవు' అనే పదాన్నికూడా ఉఛ్చరించడం మానేసాం! మొరటయి పోయిందితెలుగు పదాలు పలకడం మన కుర్రకారు నాలుకలకు.   
ఆవు తెల్లోడి బిసలో పడి  'కౌవ్వు' అయిపోయింది! పిల్లలు సరే..  పెద్దలూ పిల్లల మాటలకు '..' అంటున్నారు! అదీ విచారించాల్సిన విషయం! తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యం ఎప్పటికి వదిలేనో?
***

-కర్లపాలెం హనుమంతరావు


Tuesday, May 2, 2017

గిరీశం గడుసు భాష

కన్యాశుల్కంలోని భాష ఉత్తర కోస్తాంధ్ర భాష. అయినా అన్ని ప్రాంతాలవారికీ ఆదరణీయమైంది. ఏముంది అందులో అంతగా అందం?! కన్యాశుల్కం నాటకం పుట్టి వందేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ చదివిస్తుంది.  తాజాగా అనిపిస్తుంది.. మళ్ళీ మళ్లీ చదివినా!  ఎక్కడిదా  తాజా సౌరభం?! కన్యాశుల్కంలో గురుజాడవారు వాడిన భాష మరే ఇతర గ్రంథాలలోగానీ.. రచనల్లోగానీ వాడిన దాఖలాల్లేవు.  ప్రసిద్ధమైన శైలి సామాన్యంగా అనుకరణకు గురవుతుంది.  అలాంటి ప్రయత్నాలేవీ కన్యాశుల్కం భాష విషయంలో సఫలమైనట్లు కనిపించవు.  గురజాడవారీ నాటకంలో చూపిన మార్గం  అనితరం సాధ్యం అనుకోవాలా?! ఎందువల్ల అలా?!
భాష.. సందర్భాన్ని బట్టి.. స్థాయిని బట్టి.. పరిసరాలను బట్టి రూపం మార్చుకుంటుందంటారు భాషాశాస్త్రావేత్తలు. 'ఒళ్ళు కొవ్వెక్కిందా?' అని  భర్త భార్యను ఇంట్లో గద్దించినట్లు గుళ్ళో గద్దించడం కుదరదు. తోటి మగవాళ్లముందైతే  'కాస్త సంబాళించుకో!' అంటూ తగ్గింపు స్వరంతో మందలించక తప్పదు. మర్యాదస్తులు కాకపోతే ఇంకాస్త ముతగ్గా 'కాస్త వళ్ళు దగ్గరుంచుకో!' అంటూ తక్కువ స్వరంలో హెచ్చరించవచ్చు. ఏకాంతంలో  సామాజికపరంగా ఏ పర్యవేక్షణాభయం  ఉండదు కాబట్టి ఒకటో రెండో 'బూతులు' కూడా జత కలిపి  చేతులు విసరవచ్చు. ఒకే తరహా మాటలను ఒకే స్థాయిలో, ఒకే భావంలో అన్ని తరగతులవారు వాడటం అసాధ్యం. 'పాత్రోచితం' అన్న మాట పుట్టేదు ఈ సందర్బంలోనే.  'పాత్రోచిత'మైన  సంభాషణలను గురజాడవారు కన్యాశుల్కం నాటకంలో అత్యద్భుతంగా పోషించారన్నది విమర్శకుల ప్రశంస. ఆయనలా
ఆ స్థాయిలో విజయవంతమైన రచయిత ఈనాటికీ  లేడనే మేథావుల అభిప్రాయం.
వేదంవారు  ప్రతాపరుద్రీయంలో.. నండూరివారు ఎంకి పాటల్లో.. కొనకళ్లవారు  బంగారి మామ పల్లెపదాల్లో.. రావిశాస్త్రిగారు తమ  వివిధ రచనల్లో.. సమకాలీన సాహిత్యంలో  నామినిగారు సాగిస్తున్న తన రచనల్లో ప్రదర్శించిన.. ప్రదర్శిస్తున్న  'పాత్రోచితమైన భాష'ను తక్కువ చేయలేం. కానీ గురుజాడవారి 'పాత్రోచితం' వాటన్నిటికన్నా  ఒక మెట్టు పైనే ఉందని ఒప్పుకోక తప్పదు. కన్యాశుల్కంలో గురజాడవారి  పోకడల్లోని వైవిధ్యం భాషాపరంగా   'విశ్వరూప ప్రదర్శనమే!

పాత్రలకి రచయితకి స్థాయిల్లో   అంతరం సర్వసాధారణం. అయినా సమంజసమయిన రచయిత పాత్రల నోట మాటలు పలికించే సందర్భంలో ఆయా పాత్రల వైయక్తిక (కులం.. ప్రాంతం.. పరిసరాలు.. లింగం.. వయసు.. ఉద్వేగాది)  స్థాయిలకు తగ్గ  పాత్రోచితమైన భాష ప్రయోగించాలన్న స్పృహతోనే ఉంటాడు. వట్టి స్పృహ పాత్రోచితాన్ని పండించలేదు. రచయిత అనుభవమూ జతకలవాలి.. రచయితలూ మామూలు మనుషులే. కాబట్టి అన్ని సందర్భాలకీ తగిన అనుభవం అందుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పరోక్షానుభాలక్కూడా  ఆస్కారం లేకపోవచ్చు. అప్పుడు ఊహమీద ఆధారపడక తప్పదు. ఆ ఊహాధార  స్వీయానుభవాలనుంచి  పుట్టిందీ  కాకుండా.. పరోక్షానుభవాలద్వారా మలుచుకున్నదీ కానప్పుడే 'పాత్రోచితం' ఉచితానుచితాలమీద చర్చ రేగుతుంది. గురజాడవారి కన్యాశుల్కం విషయంలో ఇలాంటి చర్చేదీ సాగినట్లు రికార్డుల్లో లేదు(నాకు తెలిసినంత వరకు).  'పాత్రోచితమైన భాషాప్రయోగం'లో ఆయన విజయం సాధించారనడానికి ఇదే రుజువు.  తన నాటకంలోని పాత్రలభాషమీద అంతలా  సాధికారికత సాధించేందుకు గురుజాడవారు తీసుకున్న జాగ్రత్తలు ఏమయి  ఉంటాయో? విజ్ఞులు తేల్చాల్సిన లోతైన అంశం అది. ఈ వ్యాసం ఉద్దేశం కేవలం గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  పాత్రల భాషావైవిధ్యం. అదీ.. గిరీశం  కోణంనుంచీ స్థాలీపులాకన్యాయంగా ప్రస్తావించుకోవడం మాత్రమే!

గిరీశం  రాకతో మొదలై..  గిరీశం పోకతో ముగిసే నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలోని దాదాపు అన్ని ముఖ్యపాత్రలతోనూ గిరీశం  'ఇంటర్ యాక్ట్' అయాడు. ఆయా సందర్భాల్లో గిరీశం వాడిన భాష.. అందులోని వైవిధ్యం గురించి కొంత చర్చిస్తే గురజాడవారికి 'పాత్రోచితమైన భాష' మీదున్న  సాధికారికతను గూర్చి ప్రాథమిక స్థాయి అవగాహన ఏర్పడొచ్చు.

గిరీశం పుట్టుకతో వైదీకి బ్రాహ్మణుడు. పట్నవాసం అతగాడి బాడీ లాంగ్వేజీ..  భాషల్లో మార్పు తెచ్చింది. భాషావిషయికంగా  చూస్తే  గిరీశం నోట ఇంగ్లీషు పలుకుబళ్లు ధారాళంగా దొర్లుతుంటాయి. అంత్యప్రాసాదులతో ఆంగ్లపద్యాలను  ఆశువుగా దంచేస్తుంటాడు.
ఏకాంతంలో ఉన్నప్పుడు స్వగతంలో  చెప్పుకొనే  భాష  పాత్ర నిజ నైజాన్ని పట్టిస్తుందని మనస్తత్వవేత్తల భావన. నాటకం ప్రథమాంకం ప్రథమ సన్నివేశంలోనే గిరీశం తత్వాన్ని పరిచయం చేస్తారు గురజాడ. 'పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం.  యీలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు(పూటకూళ్లమ్మ). వెంకుపంతులుగారి కోడలుకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి  మనకు దేహశుద్ధి చేస్తారు. మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా ఉంది..గిరీశం గడుసుదనం.. వంచన గుణం.. స్త్రీలౌల్యం.. మాటకారితనం పటం కట్టేది ఇలాంటి మాటలవల్లే. వెంకుపంతులుగారి కోడలు.. మధురవాణి స్మృతిపథంలోకి రాగానే గిరీశం పెదాలమీదకు 'ఇంగ్లీషు పద్యాలు' తన్నుకొస్తాయి. మధురవాణి స్మరణ చేస్తూ 'It is women that seduces all mankind' అనీ అంటాడు.   నిందను ఎదుటి పక్షంమీదకు తోసే అతగాడి నీచ నైజం ఈలాంటి ఉక్తులు వల్లే బైటపడేది. 
ఇక విజయనగరం చెక్కెయ్యాలన్న ఆలోచన రావడం తరువాయి..   శిష్యుడు వెంకటేశంతో అతగాడు పలికే    వ్యాక్యాల్లో గుప్పించేవన్నీ డాంబిక   ఆంగ్లపదాలే! ఈనాటి టీ వీ యాంకర్లను తలదన్నే భాషా భేషయం! 'డా'మిట్! .. ఇది బేస్ ఇన్గ్రా'టిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. విడో మారియేజ్ విషయమై, నాశ్చికొచ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. పూనా డక్కన్  కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఎలెవన్ కాజెస్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి  ప్రొఫెసర్లు డంగయి పోయినారు. చుట్ట నేర్పించినందుకు 'థేంక్స్' చెప్పకపోగా.. తప్పు పడుతున్నావ్.అంటూ గిరీశం ప్రదర్సించే ప్రాగల్భ్యభాషకు అంతూ పొంతూ ఉండదు. 'ఫాల్స్' వైదుష్య ప్రదర్శనలతో  ఎదుటి పాత్రల బుర్రలో గడబిడలు సృష్టించడంలో గిరీశానిది అందె వేసిన చెయ్యి. 'మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!' అని శిష్యుడు వెంకటేశం నిందలకు పూనుకున్నప్పుడు
'ఖగపతి  యమృతము తేగా/భుగ భుగమని పొంగి చుక్క భూమిన్ వ్రాలెన్/ పొగచెట్టై జన్మించెను/ పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అంటూ   బృహన్నారదీయం నాలుగో అధ్యాయం ధూమపానాన్ని సమర్థించిందని   దబాయిస్తాడు.   ఇటువంటి  మాటల గారడీవిద్య అగ్నిహోత్రావధానుల్నుంచి.. సౌజన్యారావు పంతులుగారి వరకు అందరి ముందు ప్రదర్శిస్తాడు నాటకం ఆసాంతం.  ఎదుటి మనిషికి ఆలోచించుకొనే అవకాశం ఇవ్వకుండా  స్వకార్యం సాధించుకొనే నిమిత్తం  బుకాయింపు భాష  ఎంత ఉపయుక్తంగా ఉంటుందో  గిరీశానికి తెలిసినంతగా  తెలుగు సాహిత్యంలో మరే పాత్రకీ తెలీదు.

అచ్చంగా ఆంగ్లపాండిత్యమేనాసందర్భాన్ని బట్టి భాష మార్చే ఊసరవెల్లి గుణంలోనూ   గిరీశం ఘనాపాఠి. నైజాంవారి కొలువులో ఉద్యోగం అయిందని  మధురవాణిని నమ్మించే   సందర్భంలో    ఉర్దూ పాండిత్య ప్రదర్శనకి  తెగబడే సన్నివేశం గిరీశంగారి    రంగులు మార్చే లక్షణానికి సలక్షణమైన తార్కాణం.   'ఇదిగో జేబులో నైజాంవారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా!  మా నేస్తం సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్సహన్ జింగ్ బహద్దర్ వారు సిఫార్సు చేసి వెయ్యి సిక్కా రూపాయిలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేశా బాధ్షావారి హుజూర్న ఉండటం..' అంటాడా మహాశయుడు. కోతలు ఈ స్థాయిలో సాగించినప్పుడే   విషయంలోని సారం కొంతైనా నమ్మదగినట్లుండేదని..    మధురవాణి వంటి  గడసరి ఎదుట  ఆటలు  సజావుగా సాగేదని గిరీశానికి  తెలుసు. గురజాడవారు ఇదంతా   ఊహామాత్రంగా  సృష్టించిన సంభాషణా చాతుర్యమే అయినా.. వాస్తవ సమాజంలోని 'అరచేతి వైకుంఠ రాయుళ్ళ'   జీవనశైలిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. గాఢంగా పరిశీలించకపోతే  సంభాషణల్లో ఇంత  పాత్రోచితమైన శైలిని పండించడం కుదరదు.
మకాం అగ్రహారానికి మార్చుకునే సన్నివేశంలో  గిరీశం తన భాషాసరళిని   పరిసరాలకు.. ఎదుటి పాత్రలకు అనుగుణంగా మలుచుకునే క్రమం గమనిస్తే..   గురుజాడవారి సునిశితమైన  సమాజిక పరిశీలనాశక్తి అవగతమవుతుంది.  అగ్నిహోత్రావధాన్లు ప్రథమ దర్శనంలోనే  'ఈ తురకెవడోయ్' అంటూ గిరీశాన్ని   అనుమానిస్తాడు. పల్లెల్లో కొత్తవారిని   అనుమానించడం సర్వసాధారణం. గిరీశానికి ఆ తరహా అనుభవం అప్పటికి కొత్త. కాబట్టే వెంటనే కోపం ముంచుకొస్తుంది. నిజ నైజానికి విరుద్ధంగా 'టర్క్.. డామిట్.. టెల్ మాన్' అంటూ చిందులేస్తాడు. 'మానా? మానులా ఉన్నానంఛావూ? గూబ్బగలగొడతాను' అంటూ అగ్నిహోత్రులు మళ్లీ అగ్గిరాముడు  అయినప్పటిగ్గానీ..    స్థలాన్ని బట్టి భాషలో మార్పు తెచ్చుకోవలన్న స్పృహలోకి రాడు గిరీశం.   కరటక శాస్త్రుల జోక్యంతో అప్పటికున్న యుద్ధవాతావరణం సద్దుమణుగడంతో..  ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఇట్టే పసిగట్టేస్తాడు. వెంటనే అతగాడినీ తనకు అలవాటైనా మాటకారితనంతో పడగొట్టే ప్రయత్నం చేస్తాడు! 'మీ లాంటి(కరటక శాస్త్రులు) ఛప్పన భాషలూ వచ్చిన మనిషి ఎక్కడా లేడనీ.. సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ.. తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూళ్ళేదనీ.. డిప్టీ కలెక్టరుగారు శలవిస్తుండేవారు. కవితారసం ఆయన్లా గ్రహించేవారేరీ? నా కవిత్వమంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనంకూడా నాకు చేయించారండి' అంటూ గప్పాలు  మొదలు పెడతాడు.  కరటకశాస్త్రి విదూషక లక్షణాలకు సరిగ్గా అతికే  భాష అది! కొత్త చోట ఆశ్రయం సంపాదించేందుకు    గిరీశానికి అలా  తన భాషాచాతుర్యం అక్కరకొస్తుంది.

ఇంగ్లీషు తెలియని పల్లెటూరు బుచ్చెమ్మతో మాటల కలిపే సందర్భంలో గిరీశం  వాడే మాటల్లో ఒక్క ఇంగ్లీషు ముక్కా వినిపించదు. గమనించారా! '.. నా గొప్ప నే చెప్పుకోకూడదు కదా! అదొహటి. అంతకన్నా ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వదినా!(ఆ పిలుపులోని నర్మగర్భతను గిరీశం గడుసుదనానికి మచ్చుతునక)-మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు.  ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం  చెయ్యాలయ్యా అన్నాడు.' ఇలా సాగుతుంది గిరీశం సంభాషణా ధోరణి.  ఎంత సహజమైన.. సరళమైన తెలుగు పలుకుబడి! 

'ఏ రోటి దగ్గర ఆ పాట' పాడించాలని తెలిసుండటం వేరు. ఆ పాట శృతి తప్పకుండా  పాడించడం వేరు. ఆ కళలో 'గురజాడ వారు నిష్ణాతులు' అని రుజువు చూపించడానికి  వెయ్యి ఉదాహరణలు ఇవ్వచ్చు కన్యాశుల్కం నుంచే.. గిరీశం పాత్రనుంచే!

బుచ్చెమ్మంటే మేదకురాలు. మరి  సౌజన్యారావు పంతులుగారు ఎంత లోకం చదివిన మేధావులు? వారితో మాట్లాడే సమయంలో కూడా గిరీశం మరో విధమైన భాషాచాతుర్యం ప్రదర్శిస్తాడు. మరీ డాంబికపు ఇంగ్లీషు పదాల జోలికి పోతే ఆ మేధావికి పట్టుబడిపోవచ్చన్న తెలివిడి ఉంది. అందుకే  చదువుకున్నవాళ్ళ శిష్ట వ్యవహారికం వచ్చి పడుతుంది గిరీశం భాషలో. చివరికి పంతులుగారి చేతే  'మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి యంగ్ మెన్ లావుగా  ఉంటే మన  దేశం బాగుపడును.' అని పంతులుగారినుంచి ప్రశంసలు పొందాడంటే గిరీశానికి భాషమీదున్న పట్టుకు వేరే సర్టిఫికేట్లు ఎందుకు? పంతులుగారి ప్రశంసకు దీటుగా గిరీశం బదులిచ్చిన తీరే భాషాప్రయోగంలో సందర్భం సైతం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో తెలియ చేస్తుంది. పంతులుగారి సంభాషణా శైలినే అనుకరిస్తూ 'అట్టి విచారం తాము పడనక్కర లేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీ ముందు.. ప్లెషర్ తరువాతానండీ. అందులోనూ నేను చిన్ననాటనుంచే కొంచెం కాన్ సన్ ట్రేషనూ ఇంద్రియ నిగ్రహమూ అభ్యాసం చేయడం చాతనూ వొళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండటం చేతనూ స్త్రీ సుఖముల యడల నాకు విముఖత లావండి.. బుచ్చెమ్మయొక్క హృదయ నైర్మల్యమూ.. ఆమె దురవస్థా చూచిన్నీ.. నా శిష్యుడియందు నాకుండు ప్రేమాతిశయం చేతనున్నూ.. అమె యందుకూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహము కావడమునకు ఒప్పుకున్నాను గానండి ఇంద్రియ సుఖముల నపేక్షించి కాదు. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడమునకు అంగీకరించారండి! కనుక మా  మారియేజీ అనేది ట్రూ మారియేజిగాని సాధారణపు విడోమారిఏజి కాదండీ' అంటూ నయగారాలు ప్రదర్శిస్తాడు!  సౌజన్యారావు పంతులుగారనేంటి ఆయన్ను పుట్టించిన బ్రహ్మదేవుడుకూడా గడుసుగిరీశం జేబులో పడిపోయే మాటకారితనం కాదా ఇదంతా? రామప్ప పంతులు సంపర్కం జరిగినప్పుడూ గిరీశం ఆ గుంటనక్క స్థాయికి తగ్గట్లే మాటలు విసరడంలో ఇహ వింతా.. విడ్డూరమూ ఏముంటుంది?

భాషను బట్టే భావాన్ని అంచనా వేసుకుంటాడు ప్రదర్శనల్లో ప్రేక్షకుడు.. పుస్తకాల్లో పాఠకుడు.  సందర్భోచితమైన శైలీవిన్యాసాల ప్రదర్శన అభాసుపాలు కాకుండా నడిపించాలంటే  రచయితకు భాషమీదే కాదు.. పాత్రోచితమైన పలుకుమీద,..  సామాజిక ధోరణులమీద సరైన అవగాహన ఉండి తీరాలి. పాత్రల  యాస ఎంపికలో చూపించే శ్రద్ధ.. తదనుగుణమైన  పదాల ఎంపికలోనూ  రచయితకు తప్పని సరి. పాత్ర అదే కావచ్చు. వివిధ సందర్భాలకు తగ్గట్లు భాషలో ఛాయాబేధాలుకూడా ఉంటాయి. సరైన అవగాజనతో వాటినన్నింటినీ విజయవంతంగా నిర్వహించినప్పుడే.. 'పాత్రోచితం' అనే లక్షణానికి న్యాయం జరిగినట్లు. ఈ అవగాహన తనకున్నట్లు రుజువు చేసుకున్నారు కాబట్టే 'కన్యాశుల్కం' అనే గొప్ప నాటకం సృష్టించిన ఉత్తమ సాహిత్యవేత్తగా   గురజాడ అప్పారావుగారు   లోకం దృష్టిలో  స్థిరబడిపోయారు.

'పాత్రోచితం' అంటే  సమాంతరంగా సాగే సమాజంలోని వ్యక్తుల స్వరూప స్వభావాలను.. ధోరణులను వాస్తవానికి వీలయినంత దగ్గరగా  నాటకంలోని పాత్రల్లో  ప్రతిబింబించడం. సజీవమైన రచన సాధించేందుకు రచయితకు ఈ 'పాత్రోచితం'మీద నిర్దిష్టమైన అవగాహన అవసరం. ఆ అవగాహన సాధించకుండా రచయిత పాత్రల సృష్టికి పూనుకుంటే.. వాటి  నోట పలికే మాటలు.. కేవలం  నిర్జీవ శభ్దాలు మాత్రమే!
-కర్లపాలెం హనుమంతరావు



(ఈనాడు - తెలుగు వెలుగు మాస పత్రిక ఏప్రియల్ 2017 సంచికలో 'మాటే మంత్రమో!' శీర్షికతో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...