Friday, January 26, 2018

తెలుగు రుచులు-ఆంధ్రప్రభ దినపత్రిక - సరదా గల్పిక



అన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ అన్నకర్త సాక్షాత్ విష్ణ్వావతారమే అవాలి గదాభగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో(15-14)సైతం  ఆహారవ్యవహారాల్లో భగవంతుడి  ప్రమేయం (అహం వైశ్వానరో భూత్వా..) తప్పదన్నట్లు  ధృవపడుతుంది. అర్జునుడు యుద్ధరంగంమధ్య విషాదయోగంలో పడి కొట్టుమిట్టాడే వేళా కర్తవ్యబోధ చేసేందుకు ఉద్యుక్తుడైన    భగవంతుడు  తిండిగోల మర్చిపోలేదు! వాల్మీకులవారి రామాయణంలోకూడా రావణాసురుడు అంతలావు క్రోధంలోసైతం 'ఇచ్చిన గడువులోగా శయ్యాస్వీకారం చెయ్యకపోతే  వంటవాళ్లచేత వండించుకొని తింటాన'ని సీతమ్మవారిని బెదిరించాడు! భోజనానికి ముందో శ్లోకం (బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః).. భోజనాల మధ్యలో మరో శ్లోకం (త్వదీయం వస్తు గోవింద).. భోజనానంతరం మరో శ్లోకం(అగస్త్యం  వైనతేయం) మన  ముందు తరాలకి!మన తాతలకి  భజనతో సమానమైన భోజనవ్యవహారం   ఓ  భోగకళగా మారింది మన హయాంలో!
భూగోళంలో  ఒక్కపాలు నేల. మనం భూచరాలుగానే బతుకుతున్నా  తిండికోసం  నీళ్లఅడుగునా,  ఆకాశంలోకూడా  దేవులాడటం మన తిండియావకు నిదర్శనం.  చంద్రమండలంమీదకు వెళ్ళినా   బంగాళాదుంపల్ని ఎలా పండించాలనే కదా మనం ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నదీ!
ఆకలి లేకుంటే జీవికి ఆరాటమే లేదు. ఆ మాటా నిజమేననుకోండి! ఆరాటం ఉండి.. అది తీరేందుకు  చేసేపోరాటమే  జీవితం. అందులోనే ఉంది జీవితసారమంతా!  పాతరాతియుగంనాటి  మనిషికూడా  రాయిని ఆయుధంగా నూరుకున్నది ఆహారం  సంపాదించుకోడంకోసమే!   నిప్పురవ్వను రాజేయడం నేర్చుకున్నది వేటమాసం.. కాయలు, దుంపలు గట్రా కమ్మంగా వండుకు తినేందుటందుకే! వంట ఒక కళగా ఆటవికయుగంనాటినుంచే మనిషివెంట మహాప్రస్థానం చేస్తూ వస్తోందంటారా ఎవరైనా!
సమాజస్వభావం సమ్యగ్దర్శనభాగ్యానికి నోచుకోవాలంటే, ఆచార వ్యవహారాదులతోపాటు ఆహారపద్ధతులూ తెలిసి ఉండాలి!’ అని మల్లంపల్లివారు అభిప్రాయపడ్డారు!   సామాజిక బాధ్యత గుర్తెరిగారు కాబట్టే మన ప్రాచీనకవులు సందర్భశుద్ధి ఉన్నా, లేకున్నా  సందుచూసుకుని మరీ పసందైన విందు భోజనాలు రకరకాలుగా అందించారు. మన కడుపులు నింపారు.
ఆత్మకు ఇంపైన భోజనం సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. ముంగండ అగ్రహారీకుడు పండితరాయలు తెలుగువిస్తరి  ఘుమఘుమల్ని డిల్లీదాకా విస్తరింపచేసాడు. ఆవఠేవ(ఆవకాయ)నుంచి.. ఇంగువ హంగులదాకా దేన్నీ ఓ పట్టు పట్టిందాకా వదిలిపెట్టని తిండిరంధి వేములవాడ భీమన్నకవిది. బమ్మెరవారి భాగవతంలోని 'బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో' పద్యం గోపబాలకులు లోకపాలకుడుతో  భోజనోత్సవ  పూర్ణోత్సాహాన్ని కళ్లక్కట్టించే కమ్మని నేతిబూరె! భోజనాది లౌకికాలనుకూడా మన కవులు ఎంత అలౌకికంగా ఆరాధించారో!  
వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే దోషంగా  భావించే శుద్ధశాకాహారి కదా శ్రీనాథుడు! అయినా తిరువెంగనాచనే శివభక్తురాలు సిరియాలును తరిగి  నానావిధ పాకాలుగా  వండటం వైనవైనాలుగా వర్ణించాడు మహానుభావుడు! మిరియాలపొడి చల్లినవి, సైంధవలవణం కలిపి చేసినవి, ఆవపెట్టి వండినవి, ఇంగువతో ఘుమఘుమలాడేవి,  చింతపండు.. నిమ్మరసం పిసికి చేసినవి, తాజానేతిలో ముంచి తేల్చినవి, లేతకొత్తిమీర మిళాయింపులతో  పరిమళించేవి, కూరగా వండినా  సౌష్ఠవం ఏ మాత్రం చెడనివి.. శివాలయంలో దొంగలా దూరి దాక్కున్న దుండగీడు గుణనిధి  కంటబడ్డ  భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు ఇవన్నీ! ‘’కాశీఖండంలోని ఈ చిన్నిజాబితా సైతం తిండిపుష్టి  దిట్టంగాగల శ్రీనాథ కవిసార్వభౌముడి పాకశాలనుంచి తయారైన అనుపాకాలే!
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. నిలపరా నీ జాతి నిండు గౌరవము'  అన్నారు కదా మన రాయప్రోలు సుబ్బారావుగారు కూడా! ఏ జాతికైనా దాని తిండి తిప్పల్ని  మించిన నిండు  గౌరవం మరేముంటుందిగనక! తెలుగువాడి ఆత్మగౌరవమైతే మరీ ముఖ్యంగా ఏ ఆవకాయ బద్దతోనో.. గోంగూర తొక్కుతోనో  ముడిపడి ఉంటుంది. వేటూరివారికి మాగాయవూరుని 'మహత్తరి' అని పొగిడితేగానీ తనివి తీరలేదు మరి! జిహ్వచాపల్యరంగంలో తెలుగునోటికి  పోటీకొచ్చే జాతి భూమ్మీద ఎందెందు గాలించినా మీకు దొరకదు గాక దొరకదు సుమండీ! ఓ మహాపండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వంతో  'అన్నపు రాశుల్లా'  ఉన్నాయని నోరెళ్ళ పెట్టేసాడు. బహుశా అతగాడు మన తెలుగువాడే అయివుండనోపు!
కారంతో కారం కలిపి కొత్తరుచి సృష్టించగలడు.తెలుగువాడు. పులుపులో పులుపు కలిపి పులకరింతలు పుట్టించనూ గలడు. ఆరు రుచులతో ఆరొందల అరవైఆరు రుచులు సృష్టించి ' ఆహా! ఏమి రుచి?' అనిపించి నోరూరించగల  మొనగాడు ఇంకెవడు? మన తెలుగువాడే!
'ఆంధ్ర' లోని అంధ పదం 'అన్నానికి పర్యాయ పదంట!(ఆప్టే సంస్కృత నిఘ౦టువు- పు129). జైన, బౌధ్ధ సాహిత్యాలలో తెలుగువాళ్ళు అంథ శబ్దంతోనే వ్యవహృతులు. నైలునుండి కృష్ణదాకా సాగిన ద్రావిడుల మహావ్యాప్తికి  'పెసలు' పద వ్యుత్పత్తి సాక్ష్యం  పలుకుతోంది ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు చెపుతోంది.  చైనాలాంటి తూర్పు దేశాలతో  భారతీయ బౌధ్ధులు సంబంధాలు  పంచదారతో మరింత మధురమయ్యాయని చరిత్రకారుల పరిశీలన. చెరకు తోటల నీడల్లో చేరి  వరిచేలకు పహరా  కాస్తూ ఆంధ్రమహిళలు రఘుమహారాజు జీవితగాథని పాడుకున్నారు.. ఎక్కడో పక్కమహారాష్ట్రంలో ఉన్న   కాళిదాసు రాసిన 'రఘువంశం'లోకూడా! తెలుగులు ఎక్కడ ఉంటే ఘుమఘుమలు అక్కడ ఉంటాయి కాబోలు!
'కూరదినుసుల విజేతే విశ్వవిజేత' అని యూరోపియన్ల మధ్యయుగాల్లో కనిపెట్టిన సత్యం మనం సాగు ఆరంభించిన తొలిదినాల్లోనే పసిగట్టేశాం. మనగడ్డమీద  మిరియాలు, సుగ౦థ ద్రవ్యాలు చవక.  మనదగ్గర కొనుక్కొని వేరే  దేశాలకు అమ్ముకొని వ్యాపార సంస్కృతిని విస్తరించింది మాత్రం యూరోపియన్లే.   కాయగూరలకోసం  బుడతకీచులు  ఓడలనిండా సరుకులతో మన కోస్తాతీరాలవెంట తెగ తిరుగుతుండేవాళ్ళు. మిరియాలకోసమే  కొలంబస్ ఇండియా ప్రస్థానం ప్రారంభించిందంటారు! పచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిర్చి ఘాటుని   పాండురంగడిశక్తితో పోల్చేదశకు  పురందరదాసంతటి వైదాంతికులే వెళ్ళారు కదా! ఇహ  మన ఆహార చరిత్రను 'మిరపకాయకు ముందు- తరువాత' గా విభజించిస్తేమాత్రం  తప్పేముంది!
ఒక్క మిరపకాయనే కాదు పన్నెండో శతాబ్ది 'మానసోల్లాస' గ్ర౦థ౦లో మన లడ్డూల ప్రస్తావనా ప్రశస్తంగా   వినిపిస్తుంది. రామాయణ, భారతాలు, ఆయుర్వేద గ్ర౦థాల్లోని మోదకాలు మన లడ్డూలే! తెలుగుశాతవాహన చక్రవర్తి కథలో 'మోదక' శబ్ద౦ సృష్టి౦చిన కలకలం అంతా ఇంతా కాదుగదా! బుడతకీచులతో పెంచుకొన్న  వాణిజ్యబంధాలవల్లే   బొప్పాయినుంచి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలదాకా తెలుగునాలుకలకి    కొత్తరుచులు వంటబట్టాయి.  మిరియాన్ని ఏమరచి మిర్చిని మరిగి ఆ కారాలకి తగ్గట్టుగా  ఉప్పులు, పులుపులు, తీపుల కలగలుపులతో   కొత్తతరహా వంటలకు తెరలేపిన ఘనుడు మన తెలుగువాడేనని మనం సగర్వంగా చెప్పుకోవచ్చూ! పగిలిన  కుండపెంకుమీదైనా సరే కమ్మని అట్టు పోసేయగల దిట్టతనమండీ  మన తెలుగు చేతిది!
'మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే..' అంటూ 'రాజవాహన విజయం' కావ్యంలో కాకుమాని మూర్తికవి నోరూరించాడు! ‘శుకసప్తతి' కావ్యంలో కదిరీపతి  ‘‘ఒఱపు దనరార జేపల యూర్పుగూర యిడిన..'అంటూ చేపలవూర్పు గురించి బులిపించాడు! దమయంతీ స్వయంవరానికని విచ్చేసిన అతిథులకోసం వడ్డించిన  డెబ్భైరకాల వంటకాలనూ విపులంగా వర్ణించాడు.. శిష్యసమేతంగా విచ్చేసిన వ్యాసమహర్షులవారికి  కాశీవిశాలాక్షి చేతులమీదుగా శబ్దరత్నాకరానికైనా అర్థంకాని పలు పదార్థాలు తినిపించాడు శ్రీనాథుడు! శ్రీనాథుడి భోజన రాసిక్యతను గూర్చి బోలెడన్ని చాటువులు! రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యంలో కపటబ్రహ్మచారిగా వచ్చిన పరంధాముడికి పతివ్రతా శిరోమణి సుశీల ఇచ్చిన ఆతిథ్యంలోని  ఖాద్యవిశేషాలతో అయితే ఏకంగా ఓ పరిశోధనా గ్రందమే వెలువరించేసెయ్యవచ్చు. అయ్యలరాజు నారాయణామాత్యుడు తననాటి ప్రజల జీవనస్థితిగతుల వివరాలతో రాసిన హ౦సవి౦శతి- వ్యాపారి విష్ణుదాసుడి విదేశీపర్యటనలో  వె౦టతీ సుకువెళ్ళిన  పూరీలు, కూడుపరిగెలు, తెలుపరిగెల్లాంటి  డెబ్భయిరకాల పిండివంటల జాబితాను ఏకరువు పెడుతుంది.
త్యాగరాజస్వామివారికి పుస్తికాయల ఒరుగుపులుసు  'వర్తకొలంబు' మహాప్రాణం. వస్త్రంమీద పుస్తికాయలు  ఎండబెట్టుకొనేవేళ  మనసులో  కృతులు మహా పసందుగా అల్లుకుంటాయిట! ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు! అచ్చతెలుగు అప్పచ్చులరుచి అచ్చంగా  అనుభవంలో మిగిలిపోవాలంటే అన్నమయ్య కీర్తనలొక పుడిసెడు పుక్కిలి పడితే సరిపోదా!  మధుర తిరుమలేంద్రుడు- మంచి బహుమానమొసగి/యెదుట కూర్చుండమని ఎన్నికలిమ్మనెనే/యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?/చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె?’ అని మన మొవ్వా వరదయ్య(క్షేత్రయ్య)గారి జావళీలు! జిలేబీలరుచిని  తలపించే మధురరసాలు నోట ఊరటం లేదూ!
'శనగపిండి వంటకం ప్రియురాలి సరసమైతే  అల్పాహారం ఇడ్లీ  ఇంటావిడ అనురాగం' అంటారు డాక్టర్ సినారె.  జ్ఞానపీఠగ్రహీతయితే మాత్రం  తిండిరంధి ఉండకూడదా ఏంది! శతావధానులు తిరుపతి వేంకటకవులయితే.. పకోడీ చేసేవిధానాన్ని శతవిధాల వండి చూపెట్టారు పలు అవధానప్రదర్శన పద్యాల్లో. తెలుగింటి విందులో వడ్డించిన విస్తరి మంగళగౌరీ  గళసీమ నలంకరించిన   నవరత్నఖచితహారంలా రంగులీనుతుంటుందని   ఓ సౌందర్యతుంటరి అభివర్ణన!
అరవైనాలుగు రకాల వరిధాన్యాలు తెలుగు రైతు పండించగలడు. అన్నింటినీ  వండుకుతిని హాయిగా హరాయించుకోనూ గలడు! తెలుగురుచుల్లోని  వైవిధ్యం తెలియాలంటే తెలుగు సాహిత్యమూ రవ్వంత  వంటబట్టాలన్నారు  పెద్దలు మరి! పెద్దలమాట చద్దిమూట!
'ఇప్పుడీ తిండిగోలంతా ఎదుకండీ?' అని కదూ మీ సందేహం.
ఈ ఫిబ్రవరి ఒకటికి కేంద్రం బడ్జెట్ ప్రవేశ బెట్టబోతోంది కదండీ! ఆర్థిక శాఖామాత్ర్యులు అప్పుడే 'హల్వా' వండటం  మొదలెట్టేసినట్లు వార్త. బడ్జెట్లో ఎన్ని తీపి.. చేదు కబుర్లుంటాయో ? మన తెలుగు తిండి మాత్రం నూటికి నూరు పాళ్లు  షడ్రసోపేతంగా ఉండి  గ్యారంటీగా నోరూరిస్తుంటుందండోయ్!  తమరు కడుపారా తిని తృప్తిగా త్రేన్చేస్తే వండినందుకు మాకు అదే ఓ పెద్ద 'తుత్తి'.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 27-01-2018 నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్)


Saturday, January 13, 2018

రా.. జా.. కీయాలు- సరదా గల్పిక ఆంధ్రప్రభ -సుత్తి మెత్తంగా-



‘ఈ రాజకీయాలు అంటే ఏంటో మూడు ముక్కల్లో  చెప్పన్నా.. అర్జంటు!'
'అంతర్జంటా! అయితే రెండు ముక్కల్లోనే ముగిస్తా! 'రాఁ' అంటే 'వెలకమ్'. 'జాఁ' హిందీ ముక్క. 'వెల్! గెట్ అవుట్'అని రా అర్థం. ఎప్పుడు రమ్మని పిలవాలో.. ఎప్పుడు పొమ్మని మెడ పట్టి బైటిగ్గెంటెయ్యాలో తెలిసుండటమే రాజకీయమంటే. ఎయిటీ ఫోర్ లేక్స్ జీవాలు. సిక్స్టీ ఫోర్  టైప్ ఆర్ట్స్! ఏ జీవీ కదిలించని డొంక..  ఏ ఆర్టుకీ చెందని శాఖ.. ఈ రాజకీయం. ఇదో అబ్రహ్మ పదార్థమనుకోర అబ్బిగా!’  'బ్రహ్మపదార్థం తెలుసు. అబ్రహాం పదానికీ అర్థం తెలుసు. కొత్తగా ఈ 'అ'బ్రహ్మపదార్థం’ ఏంటన్నా?’ 
'బ్రహ్మ తయారు చేయంది  అబ్రహ్మమే కదరా అయేది వెర్రి నాగన్నా! పది దినాల పాటు అలా భూమి దాక వెళ్ళి నాలుగు జీవాలతో కాస్తింత 'మనిషి'గా మెలిగి రమ్మని బ్రహ్మయ్య ఇక్కడికి పంపిస్తే మనమేం చేస్తున్నాం? సింహాలమనుకొని గర్జిస్తున్నాం. నక్కలని వెక్కిరిస్తూనే వాటిని మించి జిత్తులు ప్రదర్శిస్తున్నాం. కుక్కలు కూడా మనలా  తోకలాడించవు. ఇహ కాకిగోలంటావా? కాకులకే మా చెడ్డ చిర్రాకు పుట్టించే కూతలు కూస్తున్నాం అస్తమానం!  కప్పలు కూడా మనంత గొప్పగా తక్కెళ్లలో గెంతటం లేదు! పిల్లులకైనా ఎప్పుడైనా కాస్త సిల్లీ అనిపిస్తుందేమో ఆ గోడదూకుళ్లకూ వాటికీ. వాటం చూసి గోడ దూకడంలో పోటీలు గాని  పెడితే మనమే వాటి రికార్డులన్నీ గ్యారంటీగా బద్దలు కొట్టేస్తాం.  ఛీఁ.. ఛీఁ.. చివరికి గద్దలు, రాబందులకు  మించి  దొరికింది దొరికినట్లే పీక్కుతినేందుక్కూడా  మనం సిద్ధం. కోతీ కొండముచ్చుల్లా కొమ్మలుచ్చుకొని గంతులేసేందు క్కూడా మనలో కొందరు పెద్దలు   సిగ్గు పడ్డం లేదు! పై పెచ్చు పెద్ద ఘనకార్యాలేవో సాధించేస్తున్నట్లు 'పెద్దమనుషులు' ‘గౌరవనీయులు’ ‘ఆత్మబంధువులు’ అంటూ పేద్ద పేద్ద  బిరుదులు బ్యాడ్జీలు గుండెలకు గుచ్చేసుకుంటున్నాం. సరే! రాజకీయాలన్నాక ఇవన్నీ ఓ.కే నేలే గానీ.. నీకే ఇంత పరగడుపునే ఈశ్వరుడికైనా అంతుపట్టని ఈ  రాజకీయాల మీద ఇంత లావు  శ్రద్ధెందుకు పుట్టుకొచ్చినట్లో? ఎవరి పుట్టైనా ముంచడానిగ్గాని ముందస్తు ప్రణాళికలేవన్నా..’
‘ఛఁ..ఛఁ!  నాకంత సీనుందా? నీకు తెలవదా వెంకన్నా?  మా తింగరోడు చాలడా కొంప కొల్లేరు చేసెయ్యడానికి!  రాత్రి బట్టీ వాడు నిద్దట్లో కూడా ఒహటే పలవరింతలు! 'ఇదిగో వస్తన్నా! ఇప్పుడే వస్తన్నా!' అంటూ తెగ కలవరించి చంపేస్తున్నాడన్నా! తెల్లారి లేచి పాచి పళ్లైనా తోమకుండా అద్దం ముందు చేరి ఏంటేంటో  కూస్తున్నాడన్నా! అన్నీ అర్థమయి చస్తాయా మా మొద్దు బుర్రలకీ! ఆ దండాలేంటి.. దస్కాలేంటి? వేళ్లు, చేతులూ అట్లా గాల్లో ఊరికే ఊపేసెయ్యడాలు.. ఉండుండి ముద్దుల మీద ముద్దులు అద్దం మీదకు విసిరేయడాలు!  పండగ రోజుల్లో మాకీ పాడు బెడదేంటన్నా కొంపలో?  మా ముత్తాత  జమానా  మురికి  ఖద్దరు జుబ్బా.. పంచె.. పై కండువా బైటికి తీయించి  చలువ చేయించిండు! వంటికి తగిలించుకొని ఏడకో ఉరుకుతా వుంటే నేనే గడప కడ్డం పడ్డా! 'ఏడకిరా?’అని గట్టిగా గదమాయిస్తే 'ఇంకేడకీ? రాజకీయాల్లోకి నాయనా! అదిగో మా అధినేత ‘రా! రా! రమ్మ’ని పిలుస్తున్నాడు’ అంటా నన్నో మూలకు తొక్కేసి పోతున్నాడన్నా! వీడిగ్గానీ ఏ దిల్లీ గాలో ధూళో సోకలేదు కదా! మా ఇంటా వంటా లేవీ రాజకీయాలు. అరక తీసి పొలానికి పోవడమే మాకు తెలుసు! బుడంకాయలకి బుక్కు బండలేసుకొని బళ్లకు పోవడమే తెలుసు. ఆడంగులకట్లా  చెరువు గట్ల  దాకా  పోయి నీళ్లు చేదుకొచ్చుకోవడం తెలుసు,  పనుల్లేనప్పుడు అట్లా  పక్కోళ్ళ ఇళ్లూ.. చావిళ్లూ చుట్టబెట్టి రావడం తెలుసు కానీ..  ఈ రాజకీయాల్లోకి వెళ్లిపోవడమేంటన్నా కొత్తగా వింటన్నా!’ 
'అర్థమయిందబ్బీ! మొన్నటి  గుజరాత్ ఎన్నికల్లో ఆ ముగ్గురు కుర్రాళ్లెవరో గానీ పెద్దాయన్తోనే పేకాటాడేసుకున్నారు కదా! ఆ దుమారం దుమ్మే మీ తింగరోడి కంట్లోనూ పడ్డట్లుంది.  పోతే పోనియ్యరాదే! రాజకీయాల్లోకే కదా ఆ పొయ్యేదీ?  సన్యాసుల్లో కలిసేందుకేమన్నా పోతన్నాడా? ఎవురికైనా నాలుగు రాళ్లు గడించుకోవాలనే కదా ఉంటుందీ వంట్లో ఓపికున్నంతా కాలం?’ 
'గిట్టనోడి మీద  రాళ్లేయడమంత సులువా అన్నా రాజకీయాల్లో దూరి రాళ్లూ  రత్నాలూ గడించడం? చక్కంగా చదువుకొని..'
'.. సతికి సతికీ ఎంత బుర్రలరగ తీసినా ఏమొస్తదిలేరా నాగన్నా? ఎంత  సర్కారు  కొలువుల్లంకించుకున్నా మిగిలేది గుండుసున్నా! ఏ సదువూ సంధ్యల్లేకపోయినా మంత్రులయినోళ్ళు  ఇంత మంది. మంద బుద్ధివి. నీకా మతలబులన్నీ అందేవి కాదు కానీ.. తింగరోడంటున్నావు కదా నీ కొడుకుని? మరి తిన్నగా రాజకీయాల్లోకే దూరి పోనియ్యరాదా! కేజ్రీవాలే దిల్లీకి సియమ్మయిండు.  ఏమో.. జనం తలరాతలు బా లేక పోతే  మీ పిచ్చోడు కూడా  రేప్పొద్దున ఏ ముఖ్యమైన పదవికో ఎక్కి రావచ్చూ!’ 
'ఎక్కిరావడానికి ఇదేవన్నా దొడ్డిగోడకు చేరేసిన చెక్కనిచ్చనా అన్నా? రాజకీయం వైకుంఠపాళి అని నువ్వే ఓ పాలి అనుంటివి. ఎన్ని పాములు కనికరిస్తే ఆ  చివరి గడికి చేరేదీ! ఎవరెవరి వెనకాలో చేరి గోతులు తీస్తుండాలి! ఎకరాలు అమ్మినా నికరంగా టిక్కెట్టు దొరుకునా? సి- ఫారము దక్కినా  సిఫార్సులు గెలిపించునా? గెలుపుకి ఎవ్వరూ  గ్యారంటీ ఇవ్వరు. గెలుచుకు వచ్చినా ఐదేళ్ల  వారంట్రీ అసలే ఉండదు.  ప్రతీ రోజూ ప్రతినిధుల కతలు ఎన్ని  వింటున్నాం? నాలుగేళ్లు దాటినా నిఖార్సుగా గెలిచిండో లేడో,,  చిట్ట చివరి న్యాయస్థానం కూడా చటుక్కని తేల్చని పరిస్థితి! ఈ పాడు పాలిటిక్సులసలు  మా వంటికి పడేవి కాదు గానీ.. మా తిక్కసన్నాసిని నీ దగ్గరకే పంపిస్తా! ఆ పిచ్చోడి ధ్యాస కాస్త పని మీదకు మళ్లించన్నా! సర్కారు పోస్టులకు ..’ 
‘ఆ సర్కారు పోస్టులన్నీ శుధ్ధ వేస్టురా నాగన్నా! ఆ అరవదేశం చూసన్నా తెలివి తెచ్చుకోవేంటన్నా! ముఖ్య కార్యదర్శంటే ఎంతటి ముఖ్యమైన పదవి? అతగాడి మీదకే ఆదాయప్పన్ను పిశాచాల దాడి! అదే  చోట.. మరి   ఆ రాజా.. కనిమొళమ్మల వైభోగం చూడు! లక్షల కోట్లలో జరిగింది కుంభకోణం. అయినా రాజా.. రాణీల్లా   లక్షణంగా తిరుగుతున్నార్రా రాజకీయాలల్ల! పాలిటిక్సు పవరేంటో నీకేరా వంటపట్టటంలా! గొడ్లు తినే గడ్డి బొక్కినా  ఏళ్ల తరబడి ఎవరూ అడగరు రాజకీయాల్లో.  తలరాత తిరగబడి ఎవుడో తిరగదోడినా తప్పుకు పడే  శిక్ష  ముత్తెమంత! మానవీయకోణం అంటూ లా పాయింటు ఒకటెప్పుడూ రాజకీయాలోళ్ల  సాయానికి సిద్ధంగా ఉంటుందన్నా. ఆ లల్లూ ప్రసాదు భాయీని చూడరాదా.. పాలిటిక్సంటే భయం పోద్ది.  ఓపెన్ జైలు.. అటాచ్డ్ బాత్రూం, సింగిల్ వంటిల్లు, పెళ్లాం కూడా వచ్చి పోతుండొచ్చు బుద్ధి పుట్టినప్పుడల్లా! పిల్లాజెల్లాకీ సలహాలవీ ఇస్తుండొచ్చు. పక్కనే కూర్చో బెట్టేసుకొని ఎవురెవరి కుర్చీల కెప్పుడు ఎట్లా ముప్పందం తేవాలో ముచ్చట్లలా చెప్పుకోవచ్చు. చక్రం తిప్పే ఛాన్సు లేక  పెద్దాయనకి పొద్దు పోకపోతే.. సొంత కొష్ఠం నుంచే ఎద్దులు.. ఆవులూ.. దున్నలూ.. పోతులూ నేరుగా జైలుకే డజన్ల కొద్దీ తరలొచ్చాయన్నా! ఆ వైభోగమంతా చూసే మీ పిల్లాడికి పాలటిక్సు మీదకి గాలి మళ్లినట్లుంది. శభాషో!'
'తెలివి తక్కువ కుంక. నెగ్గుకు రాగలాడా అని శంక!'
'తెలివి బ్రహ్మపదార్థం. రాజకీయం అబ్రహ్మ పదార్థం. రెండింటికీ ముడి పెట్టి కంగారు పెట్టవాక! డొల్లు బుర్ర డొనాల్డే అమరికా దుమ్ము లేపేస్తున్నాడన్నా! కాకపోతే కాస్త మంచీ మర్యాదగా మెలిగే చాదస్తం తగ్గించుకోవాల. అవసరం పడితే కన్నీళ్లు కుండల కొద్దీ కార్చేందుకు సిద్ధపడాల! బోర విరుచుకొని నడిచే దెప్పుడో.. బొక్కబోర్లా పడ్డట్లు నటించాల్సింది ఎప్పుడో ఆ టైమింగు అదీ బాగా ప్రాక్టీసు చేసుకొనుండాల! గుండులాగా ఆరోగ్యం ఉండుగాక.. గుండెనొప్పి, హై బిపి, లో షుగరు, అబ్నార్మల్ లెవెల్లో అల్జీమర్స్, ఫిట్సూ గట్రా  నటించడం బాగా వచ్చుండాలి. ఖర్మకొద్దీ ఏ  సీసీ కెమేరాలకో బుద్ధి గడ్డి తింటూ పట్టు పడిపోవచ్చు. కేసులూ తప్పక పోవచ్చు. ధర్మాసనాలు సులువుగా బెయిళ్లిచ్చే అన్ని అడ్డదారులూ పిండి కొట్టినట్లు  ప్రాక్టీసు చేసుండమను ముందు. ఆ తరువాతే రాజకీయాల్లోకి దూకడం సేఫని నా మాటగా చెప్పన్నా! పిలగాడు  తింగరోడేనని నువ్వే అంటుంటివి.  బంగారమంటి భవిష్యత్తు  గ్యారంటీ! బెంగెట్టుకోవాకా వెర్రి నాగన్నా!  ముందు ఇంటికి లగెత్తుకెళ్లు! బిడాయించిన గది తలుపులు బేగి తీయించు. లేకుంటే మణిపూసలాంటి మరో యువనేతను లోకానికి కాకుండా చేసిన పాపం ముందు నీకే చుట్టుకుంటుందబ్బీ!’
‘!!!’
‘ఆఁ.. అన్నట్లు నీ మనవడిక్కూడా నా అడ్వాన్సు అభినందనలు చెప్పు నాగన్నా! వచ్చే తరానికి వాడేగదా మీ అబ్బాయికి దక్కబోయే కుర్చీకి చచ్చినట్లయ్యే వారసుడు!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- సుత్తి మెత్తంగా కాలమ్-13-01-2018 -ప్రచురితం)


Friday, December 15, 2017

‘కాఫీ’రాగాలు- (ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి సుత్తి.. మెత్తంగా- కాలమ్ లో ప్రచురితం




దేవతలూ రాక్షసులూ  పాలసముద్రాన్ని తెగ మధించేసారు. ముందుగా కాలకూటం.. ఆనక పీయూషం. రాక్షసులకు కాలకూటం దక్కితే.. లక్కీ దేవతలు అమృతం లంకించుకుంటిరి. ఏమీ దొరకని మన మనుషులమే మన్ను తిన్న పాముల్లా ఓ మూల పడుంటిమి.  బ్రహ్మయ్యకే పాపం.. పాపం అనిపించింది. అందుకే కాలకూటం లోంచి 'కా'.. పీయూషం లోంచి పీ.. బైటికి పీకి కాపీ అనే కొత్త కాక్ టైల్ సృష్టించేసి మన వంతుకని ప్రసాదించింది. ఆ  కాఫీతోనే మనకిప్పుడు ఇన్ని గంతులు!
అందుకే విషంలోని మాదకశక్తి..  అమృతంలో ఉండే అద్భుతమైన  రుచి.. రెండూ కాఫీలో ఉంటాయి కదా! అమృతం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్  రియాల్టీ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులు అందుబాటులో ఉంటేనేమి.. కాఫీకుండే ఆ కిక్కే వేరు స్వామీ! ఫిల్టర్ కాఫీ  స్పేసును ఫిల్లప్  చేసే  హాట్  డ్రింకు మనకింకెన్ని  జన్మలెత్తినా దొరకడం కల్ల.. నో డౌట్! రామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకని వాడే మిరియాల కషాయం, పడ్డ పడ్డప్పుడు మాత్రమే దొరికే గేదె జున్నుపాలు.. ఇవి మినహా మనకి మరేమీ తెలియని   అమాయాకపు రోజుల్లో  కాఫీలు  మప్పే  తెల్లోడు మనల్ని పర్మినెంటుగా సర్వెంట్సు  చేసుకున్నది! కాఫీనా? మజాకానా?  
ఒకానొక్కప్పుడు ఓ కప్పుడు కాఫీ దిలాసాగా ఆరుబయలు కుర్చీల్లో చేరగిలిబడి తీరిగ్గా  తాగే అదృష్టం ఒక్క  తెల్లదొరలకు మాత్రమే సొంతం! ఇప్పుడో? 'కుదిరితే కప్పు కాఫీ.. నాలుగు కబుర్లు' ఈ కాలం కుర్రకారుకి.  కాటికెళ్లే ముసలి డొక్కులక్కూడా చివరి కోరిక చికోరి తగు పాళ్లలో కలిపి మరిగించిన కమ్మని కాఫీ ఓ లోటా నిండుగా లాగించి హరీమనాలని!  ఎంత కాఫిర్ కైనా కాఫీ దగ్గర కాసుల్లెక్క ఉండకూడదు! 'కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?' అంటూ వెంటబడి మరీ చంపుకు తింటుంటారు  ఆడపెళ్లివారు పెళ్లిళ్ళలో. అమ్మాయి తండ్రేమన్నా అమీర్ బాబనా? అదో మర్యాద.. కాఫీకి దక్కే గొప్ప గౌరవం!
టర్కీలో పిల్ల చేసిన కాఫీ కమ్మంగా ఉంటేనే పిల్లడు పెళ్లికి  సై. కాఫీ రుచిలో కాస్తింత తేడా వచ్చినా ఆనక పెళ్లాం కాపురానికి  నీళ్లొదులుకోవాల్సిందే! పాడు కాఫీ! ఎన్ని కాపురాలలా కుల్చేస్తోందో ఇక్కడా టర్కీలోలా! అయినా కాఫీకున్న గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు!
కాఫీ అయ్యర్లకు వరల్డువైడుగా పేరొచ్చిందీ ఫిల్టరు కాఫీ వల్లనే సుమా! 'అయ్యరూ! నీవు లేనట్టి తావు-కలదె పరికింప నెందు భూవలయమందు!' అంటూ స్త్రోత్రమాలలందించాడో  కాఫీగత బ్యాచిలరు కవి జీవుడు. 
కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంత సులభం కాదు. పొడి వేసిం తరువాత పాలు పొయ్యాలో..   పాలు  మరిగిం తరువాత పొడి వెయ్యాలో గూగుల్లో చూస్తే గానీ  పాలు పోని జ్ఞాని ప్రతి కొంపకీ కంపల్సరీగా ఒకరుంటారు.  డికాషనుకు ఎంత   ప్రికాషను అవసరమో, పంచదార ఎంత పాళ్లలో పడితే చెక్కర రోగం ముదర పెట్టదో.. అబ్బో., కాఫీ మేకింగుల మీద ‘క్లాసులు పీకింగే’ వృత్తిగా పెట్టుకొని కింగులూ క్వీజులూ అవుతున్న వాళ్లు ఆన్లైన్లలో ఇప్పుడు బోలెడు మంది!     
మా ముసిల్ది మరీ రెచ్చి పోతోంది. కాఫీ కోటా డబుల్ చేసింది. తాను గుండ్రాయిలా తిరుగుతూనే ఉన్నా ఆ పాలూ, పంచదారా, కాఫీ పౌడర్ గట్రా జి ఎస్ టి టాక్సుతో సహా పెరిగిన ధరలకు కొని తట్టుకోలేక పాపం మా డాడీనే తల పట్టుక్కూర్చుంటున్నాడు. అన్నట్లు  తలపోటుక్కూడా డబుల్ స్ట్రాంగు బ్లాక్ కాఫీని మించిన మంచి టానిక్  లేదంటున్నారు డాక్టర్లు! మూలక్కూర్చుని మూలిగే  ముసలాళ్ళ మురిపాలే కాఫీల మిదింతలా పెరిగి పోతుంటే ..  పని పాటలు చేసుకుంటూ బతకి చావాల్సిన  సంసారులం.. ఇహ మన కాఫీ బడ్జెటు కథ స్పెషల్గా  చెప్పేదేవుంది?
 కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకుడు   కాఫీ తాగితే కేన్సర్ దూరమవుతుందంటాడా? ఆ మర్నాడే.. మరో చికాగో విశ్వవిద్యాలయ బృందం చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్  కాఫీ డ్రింకింగ్   యుట్రిసు మీద స్ట్రెస్సని ఊటా యూనివర్శిటీ వాక్రుచ్చితే.. అదేం లేదు.. పుట్టబోయే కిడ్ ‘విజార్డ్’ అవాలంటే కెఫిన్ కాన్స్టంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సార్లైనా గొంతులో దిగాల'ని గుయానా యూనివర్శిటీ గగ్గోలు పెదుతుంది.  మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి అనుకోని ప్రాణాపాయం జరిగే అవకాశం గత శతాబ్దం కన్నా  అరవై  శాతం అధికమయిందని  అదేందో అర్థం కాని టెర్మినాలజీలో  కాఫీ డ్రింకింగ్ పెరిల్సుని గురించో జర్మనీ విశ్వవిధ్యాలయం బెదిరిస్తే.. తాజా పరిశోధనల్లో- తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపనం చెంది ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ మెయింటైన్ చేసేయచ్చని మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ  అభయహస్తం ఇచ్చేస్తోంది.    ఆ అర్థం కాని పాడు లెక్కలు అవీ పట్టించుక్కూర్చుంటే ఆ తాగే గుక్కెడు కాఫీ కూడా కాలకూట విషమై రేపు పోయే ప్రాణం ఇవాళే హరీ అనడం ఖాయం. 
ఏడో శతాబ్దం నాటి మత్తు గింజలు ఈ  ఏడు కాఫీ గింజలు! ఎంతలా విశ్వరూపం దాల్చి  ఏడిపిస్తోందీ పాడు లోకాన్ని! ఎక్కడి  ఇథియోపియా.. ఎక్కడి మేరా మహాన్ ఇండియా?  
 ఇస్లామిక్ గావా వైన్- ఈ డెవిల్స్ డ్రింక్!  ఇవాళ అదే  ఇండియా గుడ్ విల్ డ్రింక్! నిషేధించాలనుకున్న క్రైస్తవమే కాఫీ  రుచికి దాసోహమంది! మక్కా యాత్రకని పోయిన బాబూ బుడాన్ సూఫీ  వట్టి చేతుల్తో రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చాడో గానీ.. దాందుంప తెగ.. కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి  నూటేడు  దేశాల నుంచి  ఇప్పుడ అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!  యూరోపు ‘గుడ్ మార్నింగ్'  మన అరకులోయ  కాఫీతోనే!  ఇండోనేసియా పిల్లి తిని ఆరగించుకొనే  పళ్ళు ఈ కాఫీ గింజలు. ‘చరిత్ర మనకెందుకయ్యా? రుచి ముఖ్యం గానీ!’ అంటూ చిరాకు పడి పోవద్దు. ఓ కప్పు కాఫీ తెప్పించుకోండన్నా! అప్పుడే  చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపిస్తుంది. దటీజ్  కాఫీస్ మ్యాజిక్!
'జొన్న అన్నమే ఆహారం.. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని  వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు శ్రీనాథుడు. ఇప్పుడతగాడే కనక బతికుండుంటే? 
దేశభక్తి కవిత్వానికి పాలుమాలిన కవులు సైతం పాలు మరగ్గాచిన  కాఫీ ద్రావకం మీద దండకాలు రాయకుండా ఉండలేక పోయారు. అభినవ సరస్వతి పత్రికలో గౌరావఝ్ఝల సీతారామయ్యగారు 'కాఫీతీర్థంతో సమానమైన తీర్థం మరోటి లేనే లేదు పొమ్మం' అంటూ తేల్చేసారు. డెబ్బై ఏళ్ల కిందటే  గృహలక్ష్మిలో పేరు తెలీని తెలివైన కవి ఒకాయన 'అమ్మవార వౌచు నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు/ నిను భరింపలేము నిను ద్రోయగా లేము' అంటూ  దండకాలు అందుకున్నాడు. 
లీటరు  రేటు వింటుంటే పాలకు బదులుగా వాటరు వాడటం  బెటరు అనిపిస్తోందిప్పుడు. కాఫీ పౌడరు ధర వింటుంటే కాఫీ తాగక ముందే బి. పి పెరిగి పోతోంది. చిటికెడు చక్కర ఇంత గుక్కెడు  నీళ్లల్లో కలుపుకు తాగుదామని ఉన్నా..  ఆ చికోరి రుచి  వలలో చిక్కుకున్న దౌర్భాగ్యానికి కాఫీ చుక్క గొంతులో దిగక పోతే పక్క కూడా దిగ బుధ్ధి కావడం లేదు!   
 తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు ఆశువుగా  కాఫీ జగన్మోహిని జన్మవృత్తాంతం గూర్చి గురజాడ గిరీశాన్ని మించిన థియరీ కూర్చి వినిపించేసారు. తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతాన్ని తెచ్చి సత్యభామకు ఇచ్చే సందర్భంలో  దారిలో దాని గింజ నేల మీద రాలి  కాఫీ చెట్టుగా మొలిచిందంట! 
'అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిథునం  చిత్రం కూడా  జై కొట్టింది.
 ‘కాఫీశ్వరీ! నెస్సుకేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా ప్రతీ యింటా ఉప్పొంగవే ఉష్ణ పానీశ్వరీ!’ అంటూ ప్రాథేయ పడ్డం తప్పనిసరి. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం కంపల్సరీ! 

-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి  సుత్తి.. మెత్తంగా-  కాలమ్ లో ప్రచురితం)


Wednesday, December 13, 2017

చలంగారి అట్లపిండి ఘుమఘుమలు- హాస్య కథ


గుడిపాటి వెంకట చలం అనంగానే మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఆ మహానుభావుడి మైదానం. ఊర్వశి లాంటి గొప్ప సంచలన నవలలు.  దైహిక, మానసిక  స్వాత్రంత్ర్యం కోసం స్త్రీ  పడే ఆరాటం మీద  తెలుగులో ధైర్యంగా, బహిరంగంగా అచ్చుకెక్కిన ఘనత గుడిపాటివారిదే. చలం అనువదించిన ఠాగోర్ 'గీతాంజలి' అందుకు విరుద్ధంగా  విశిష్టంగా ఉంటుది. చలం మీద ఒక ప్రతికూల అభిప్రాయాన్ని స్థిరపరుచుకొన్న కుహనా సామాజిక వాదులు సైతం విస్తుపోయే విధంగా సాగిన స్వతంత్ర అనువాద రచన గీతాంజలి.  స్వఛ్చమైన హృదయాన్ని కంటిక్కనిపించని విశ్వమూర్తికి అత్యంత పవిత్రంగా సంపూర్ణంగా సమర్పణ కావించుకోవాలని చలం పడే ఆరాటం ప్రతీ శబ్దంలోనూ ప్రతిధ్వనిస్తుంది. అంతటి గహ్యమైన ఇంట్రోవర్ట్ పేరున సాహితి మాస పత్రికలో కనిపించిన ఈ 'అట్లపిండి' గల్పిక నన్ను ఆశ్చర్యంలో ముచెత్తేసింది. 'అట్లపిండి' ఒక హాస్య గల్పిక. ఆ ప్రక్రియలోనూ చలం(?) ఎక్కడా  ఫెయిలవలేదు. నవ్వించే రచనలు చేస్తామని చంకలు గుద్దుకొంటూ రకరకాల బిరుదులతో చక్రాంకితాలు ముద్రించుకు తిరిగే హాస్యరచయితలంతా ఒకసారి చదివి తరించవలసిన అతి చక్కని చిక్కని రచన. అందుకే ఇక్కడ పి.డి. ఎఫ్ రూపంలో ఇస్తున్నది, చదివి బద్ధకించకండా స్పందించ గలిగితే  చలం హాస్యచతురతకూ ఓ చక్కని నివాళి అర్పించినట్లవుతుంది
-కర్లపాలెం హనుమంతరావు

14-12-2017

https://drive.google.com/file/d/1O_4_dGxhtf2XlhuzbcKJZw4A_HnKfYHN/view?usp=sharing





Tuesday, December 12, 2017

తెలుగులో తమాషా పద్యాలు- (ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)




పంచదార పద్యం
వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట నివాసులైన శ్రీమాన్ సుందర రాఘవాచార్యులవారు సహజ చమత్కార కవితాసమర్థులు. 1965 ప్రాంతంలో వారి కుమారుడి వివాహ సందర్భంగా పంచదార ఎక్కువ మోతాదులో అవసర పడింది. అప్పుడు కరువు మూలకంగా పంచదారకు కోఠా విధానం అమలులో ఉండేది. ఏదేని సందర్భాలలో అధిక మోతాదులో కావలసి వస్తే అర్జీ చేసుకున్న మీదట తహశీల్దారుగారు మంజూరు చేసుకొనే వెసులుబాటూ ఉండేది. ఆచార్యులవారు ఆ కారణంగా దొరగారికి రాసుకున్న విజ్ఞాపన పద్య రూపంలో సాగింది. పంచదార కోసం చేసుకొన్న ఆ దరఖాస్తులోని ఒక పద్యం:
శ్రీయుత తహశీల్దారూ
చేయు మనవి సుతుని పెండ్లి చేయుట కొరకై
సాయము కావలె నాకును
ఈయవలె పంచదార ఇరువది సేరుల్
అధికారి ఆచార్యులవారి పద్యానికి ముగ్ధులై  మరో ఐదు సేరులు అధికంగా మంజూరు చేసినట్లు ఓ కథనం.
***


భాస్కర శతకానికి నకలు శతకంః

ప్రతి పద్యంలోనూ ఉదాహరణల సహితంగా ప్రతిపాదనలు ఉండటం భాస్కర శతకం ప్రత్యేకత. దీనినే 'ఉదాహరణ' ప్రక్రియగా గుర్తించారు సాహిత్యంలో.
ఉదాహరణకు,
ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెగాదె శృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభ రత్నము రెండు
భాస్కరా!
ఏ పాటూ పడకుండానే  అన్నీ కలిసొస్తుంటాయి కొంతమందికి. అందుకు కారణం అదృష్టం. అది లేనప్పుడు ఎన్ని తిప్పలు పడినప్పటికీ ఫలితం సున్నా, నానాబాధలు పడి దేవతలు, రాక్షసులు  పాల సముద్రాన్ని మధిస్తే, మధ్యలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకు ఏ శ్రమ లేకుండానే అందాలరాశి మహాలక్ష్మి, అదనంగా కౌస్తుభమణి లభించాయి కదా!'- అని ఈ పద్యానికి అర్థం.
కవి ఆనుపానులు ఇతమిత్థంగా తేలక పోయినా దృష్టాంత ప్రక్రియ పరంగా సుమారు 500 ఏళ్ల పై బట్టి తెలుగువారి నోట పలుకుతున్న భాస్కర శతకంలోనిది ఈ పద్యం, పద్యాలలో కవి చూపించే ఉదాహరణలు రామాయణ, భారత, భాగవతాల వంటి  పసిద్ధ కావ్యాల నుంచి ఉదహరించినవి కాబట్టి చదువరుల మనసుల్లో అవి సూటిగా నాటుకొనేవి. అయినా  కంసాలిపల్లి ప్రౌఢకవి కంసాల సుబ్బకవిగారికి ఎందుకో భాస్కర శతకంలోని దృష్టాంతాల అన్వయం అంత  సవ్యంగా లేదనిపించింది! అంతకన్నా దివ్యమైన ఉదాహరణలతో అదే శతకాన్ని ఆసాంతం తిరగ రాసేసాడా చిఱుమఱ్ఱి నరసింహకవిగారి  శిష్యపరమాణువు. గురువుగారి చేత 'సుత్తెపోటు' కవిగా ప్రశంసలు అందుకున్న సుబ్బకవిగారు  భాసర శతకంలోని పై పద్యానికి సృష్టించిన నకలు  పద్యం: చిత్తగింజండి!
'ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసమునంద బనెమి కానలో
గోరని ఋష్యశృంగుని దగుల్కొని కాంత లయోధ్య జేర్ప నీ
రేరుహగంధి శాంత నియరే! యెసలారగ నాడు భాస్కరా!
ఆడగాలంటేనే ఎరగని ఋష్యశృంగుణ్ని ఎంతో శ్రమించి  అయోధ్యకు చేర్చిన భామినులెవరికీ అతగాడి సంపర్క సుఖం అదృష్టం లేక దక్కలేదు. ఆ అదృష్టం పుష్కలంగా ఉంది కాబట్టే శాంతకు అతగాడితో దాంపత్య  సౌభాగ్యం దక్కింద'ని కవిగారి తీర్మానం. సుబ్బకవిగారు 'సుత్తెపోటు' కవిగారు అవునో.. కాదో ఎవరికి వారుగా తేల్చుకొవాలి మరి!
***



చేతికర్ర మీద విరహం
ఒకానొకప్పుడు పెద్దమనిషి వేషధారణ సాధారణ జనుల కన్నా విభిన్నంగా ఉండేది. చేతిలో కర్ర, కిర్రు చెప్పులు, భుజం మీద పట్టు అంచు కండువా.. చూడగానే పదిమందిలోనైనా ప్రత్యేకంగా కనిపించాలని ఈ ఆహార్యం. దురదృష్టం కొద్దీ.. శ్రీ పెరంబుదురు రాఘవాచార్యులు అనే పండితులవారు  చేతికర్రను ఎక్కడో పోగొట్టుకొన్నారు. ఆ బెత్తం విరహం భరించలేక  కవులు కాబట్టి ఓ పెద్ద ఖండకావ్యమే గిలికేసారా కవి పండితుడు. ఆ ఖండకావ్యంలోని ఆరంభం ఇలా సాగుతుందిః

'సమర గర్వోద్దిష్ట శాత్రవదోర్దండ-కండూతి బోవ జక్కాడినావు

గహన సంబంధ భీకర జంతు సంహార-కారణంబయి కీర్తి గాంచినావు

కౌలేయవర్గ దుష్కరవృత్తి దూలించి-జీవముల్ నిలిపి రక్షించినావు

మార్గమధ్వాన్వీత మహిత కంటకజాల-మును జిమ్మి పాదముల్ బ్రోచినావు

నిరత మద్దేహ రక్షణోన్నిద్ర భద్ర-మూర్తివని నమ్మి, పరులచే ముట్టనీయ
నైతి నను వీడి బోవ నీకతి ముదంబె బెత్తమా! కాదు పోవ నీకుత్తమంబు
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 13, డిసెంబర్, 2017 న ప్రచురితం)


***

Friday, December 8, 2017

'తప్పు’డు మనుషులు- ఆంధ్రప్రభ దినపత్రికలోని సరదా వ్యాసం



అదృష్టం బాగుండి మనం మనుషులుగా పుట్టేసాం. ఏ దున్నపోతుగానో జన్మెత్తుంటే జీవితాంతం గడ్దీ గాదం కోసం మాత్రమే అల్లాడాల్సొచ్చేది. థేంక్ గాడ్! గాడిదగా పుట్టించలేదు మమ్మల్ని. బడిబిడ్డల  స్కూలు బ్యాగుల్ని మించిన మైల బట్టలు మోసీ మోసీ నాలుక్కాళ్ళు చచ్చుబడుండేవి. ఏ కుక్కగానో పుట్టించినా గతంలో  కొంత బెటరేమో గానీ.. ప్రెజెంట్లీ నాట్ ప్లెజెంట్ డేస్! రోజులు బా లేవు. బడా నేతల ట్విట్టరు ఎకౌంట్లు కొత్తగా నెత్తికి చుట్టుకుంటున్నయ్! కాకులుగా పుట్టినా ఓకే నే! సర్కారీ నౌఖరీల్లో దూరి  ఏ  కాకిలెక్కల్తోనో కాలక్షేపం చేసేయచ్చు కానీ  పద్దాకా లెక్కలడిగి పీడిచ్చేస్తున్నాయ్ ఈ మధ్య ప్రభుత్వాలన్నీ. మా చెడ్డ చిక్కులొచ్చి పడుతున్నయ్ వీటి చాదస్తంతో! ఆ గండం నుండి గట్టిక్కించావ్ దేవుడా! గండర గండడు మనిషి. వాడి జాతిలో పుట్టించేసావ్! ఇహ ఇప్పుడెన్ని తప్పులు చేసినా బదులు చెప్పే ఇబ్బందే లేదు. ధన్యవాదాలయ్యా దయమయా.. కోడి మాదిరిగా పుట్టించనందుక్కూడా!  తెల్లారగట్టే పర్ఫెక్టుగా లేచి కూసి కూసి చచ్చే పని తప్పించావు నాయనా! కొంగలా పుట్టిస్తావేమోనని బెంగ పడి చచ్చాను! ఇంత బుల్లి చేప్పిల్ల నోట పడాలన్నా తెల్లార్లూ ఒంటి కాలు మీద  దొంగ జపాలు చెయ్యాలయ్యా చన్నీళ్ళల్లో! ఆ పాట్లన్నీ తప్పించినందుకు వేన  వేన దండాలయ్యా ఆపద్భాంధవా! తోకల్లేక పోతేనేమిలే? తప్పులు చేయడమే ఓ గొప్ప హక్కుగా  భావించే మానవ జాతిలోకి మమ్మల్ని తోసి  తిప్పలు తప్పించావుగా తండ్రీ.. మెనీ మెనీ  థేంక్స్ దయామయా!
ఏ తప్పూ చేయడం రాని చవట జాతులు సృష్టిలో సవాలక్ష ఉన్నాయి. గద్ద గురి తప్పకుండా గంప కిందున్న కోడి పెట్టను  కొట్టుకు పోగలదు. ఎట్లాంటి అంట్లవెధవ అడిగినా పొలమారకుండా చిలక  పర్ఫెక్టుగా జోస్యం కార్డు బైటికి తీసేయగలదు.  ఎంత్తెత్తు నుంచైనా  దూకించు.. పిల్లి ముంగాళ్ల మీదనే మొగ్గ్గేసి నిలబడగలదు. కొమ్మ నుంచి కొమ్మ మీదకు గెంతే కొద్ది టైములో కూడా కోతిది పర్ఫెక్టు టైమింగు! జెమినీ సర్కసు మార్కు పర్ఫెక్టు ఫీట్సన్నీ చేసే జీవులు సృష్టిలో  లక్షా తొంభై ఉన్నాయ్! అయినా మిస్టేకుల మీద మిస్టేకులు మాత్రమే చేసి నవ్వించే   జోకర్  జాతిలోకే మమ్మల్ని  తోసి పుణ్యం కట్టుకున్నావయ్యా పరంధామా!  అడుగడుక్కీ తడబడి పోవడం.. తడవ తడవకీ గొడవలు పడిపోవడం.. భలే థ్రిల్లింగుగా ఉందిలే ఈ మానవ జన్మ. మహా ప్రసాదం స్వామీ నీ  దయా దాక్షిణ్యాలకి!
మనిషి పుట్టుక కాబట్టి మడత పేచీలుండవు. పంచపాండవులు ఎంతమందని ఏ మందమతొచ్చి అడిగినా మంచం కోళ్ల మాదిరి ముగ్గురేనని ముచ్చటగా దబాయించేయచ్చు. రెండు వేళ్లకు బదులు ఒక్క వేలు చూపించినా వేలెత్తి చూపించే హక్కు ఏ భోషడిక్కీకీ లేదు. ఏ తప్పూ చేయకుంటే లైఫు మరీ ఓల్డు లైలా మజ్నూ మూవీలా  బోర్ కొట్టి చావదా? ఆ వినోద రహస్యం తెలుసును కాబట్టే .. గెజిట్ జీ. వో లు అవీ   తప్పులేవీ లేకుండా ఛస్తే రిలీజు చెయ్యరీ సర్కారీ నౌఖర్లు. ఆ జీవులూ నీ సృష్తిలీలలే  కదా .. తప్పులెలా దొర్లకుండా ఉంటాయిలే మహానుభావా?
తప్పులున్నంత కాలమే జైళ్లుండేది. జైళ్లున్నంత కాలమే జైలధికారులుండేది. జైలధికారుల కదికారమున్నంత కాలమే తప్పులు యధేఛ్చగా జరుగుతుండేది. ఏ తప్పులూ ఎవరూ చేసి సహకరించక పోతే అసలు  ముప్పు ముందు మీడియా దొరలకే కదా..  మేత దొరక్క! 
పర్ఫెక్టుగా బతకాలనుకొనే చాదస్తపు జీవికి మానవ  జన్మ శుద్ధ వేస్ట్. నేరాలవీ భారీగా చేసేసి ఆనక కన్నీళ్ళు గట్రా  కుండల కొద్దీ కార్చినప్పుడే పబ్లిక్కులో సింపతీ ప్లస్సయ్యేది. ఏ తప్పూ చేయడం రాక తగుదునమ్మా అంటూ రాజకీయంలకి జొరబడ్డా.. ఎంత దొరసాని బిడ్డ కథయినా డ్యామిట్.. అడ్డం తిరుగడం ఖాయం! 'అయ్యో.. పాపం' అంటూ అమాయకుల చేత  కావిళ్ల కొద్దీ కన్నీళ్లు కార్పించాలి. పాప్యులారిటీ పెరగాలంటే పద్దాకా  పప్పులో తప్పకుండా కాలేస్తుండాలి. తప్పదు. మిస్టేకుల్ని మించిన ట్రిక్ పాలిటిక్సులో మరోటి  లేదు మరి!
యమర్జన్సీ తప్పు తరువాతే ఇందిర 'అమ్మ'గా ఎమర్జయింది. ‘మహానేత’గా మేక్ ఇన్ ప్రాసెస్ లో మొహమాటాల కస్సలు తావుండ కూడదన్నా! పట్టు బట్టి మిస్టేక్స్ చేసినప్పుదే  జనం మీద పట్టు దొరికేదక్కా! 
'తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు' అన్న వేమన వాస్తవానికి ఓ వెర్రినాగన్న. 'ఒపీనియన్స్ డిఫరైతే గాని పొలిటీషియన్ కానేరడ'న్నాడయ్యా గురజాడగారి గిర్రాయి! మిస్టేక్స్ మీద పొలిటీషియనుకే మిస్టర్ పర్మినెంట్ పేటెంట్ రైట్స్! 
తప్పును తప్పు అని కుండ బద్దులు కొట్టే పూర్ శరద్ యాదవ్ సిన్సియార్టీ.. తప్పే ఒప్పని దబాయించి మరీ బుర్ర బద్దలు కొట్టేసే  లల్లూ యాదవ్ పాప్యులార్టీ ముందు బలాదూర్!  జయమ్మ కుర్చీ పక్కనే కూలపడుండేది శశికళమ్మ ఎల్ల వేళలా. ఎన్ని తప్పులు చేయందే చెలికత్తె నుంచి చిన్నమ్మ స్థాయికి ఆ మహాతల్లి ఎగబాకినట్లు? కాణీకి.. ఏగాణీకి మొగంవాచి బోలెడన్ని తప్పులకు బోల్డుగా ఒడిగట్టింది.. కాబట్టే కనిమొళి ప్రభ  తమిళనాట ఇంకా  కొడిగట్టకుండా వెలిగిపోతోంది.
తప్పు చేయడం అంటే ఓ కొత్త వివాదం సృష్టించడం. కొత్త కొత్త నినాదాలకు ఉప్పందించడం. జడ్జీల నుంచి బెంచి క్లర్కుల వరకు అందరూ బాగుండాలి. అందుకే దండిగా తప్పులు జరుగుతుండాలి! పొరపాట్లు చెయ్యమని మొండికేస్తే ఎట్లా?  ఇహ పోలీసులెందుకు? జైళ్లెందుకు? దండక్కదా!. దొంగలకు, దొరలకు మధ్య ఉండే పల్చటి తెర ఈ తప్పుల తడికే నప్పా! 
తప్పుల్ని తప్పు పట్టడం పెద్ద తప్పు. 'పొరపాటయిపోయింది.. సరిదిద్దండి' అన్న రెండు ముక్కలకుండే దమ్ము కొరియా కిమ్ము  అణుబాంబుకైనా  ఉండదండీ బాబూ! మిస్టేక్సుల్లో టెస్టు పెడితే ప్రశ్నపత్రాలు సెట్ చేసే మాష్టర్సుదే ఫస్టు ర్యాంకు. పేజీకి ఈజీగా నాలుగైదైనా తప్పులుండాలి. లేకుంటే లేజీ ఫెలోసని లోకమెక్కడ  లోకువ కడుతుందోనని శంక. వివాదాలేవీ లేకుండా ఆన్సర్ 'కీ', హానర్ పోస్ట్, నంది అవార్డు, బయో పిక్కు, టీ.వి చర్చ ముగిసాయంటే..  ఎక్కడో కచ్చితంగా ఏదో తప్పు జరిగినట్లే! మానవ జన్మమీద మచ్చ పడ్డట్లే!
మనిషిగా పుట్టించి మనకు నిత్యం తప్పులు చేసే మంచి అవకాశం కల్పించాడు దేవుడు. పర్ఫెక్షనో అంటూ చాదస్తానికి పోయి  భగవంతుడి నమ్మకాన్ని వమ్ము చేయద్దు. మన వంతు తప్పులు మనం చేసుకు పోతున్నప్పుడే పై వాడికీ నాలుగు చేతుల నిండా పని. అస్తమానం బొక్కలు వెదికే జాతి కూడా భూమ్మీద ఒకటుంది కదా! సరిదిద్దే అవకాశం దేవుడు వాటికీ ప్రసాదించాడని మరవద్దు.. మరో  పెద్ద తప్పు చేయద్దు!
ఉదాత్తమైనది మానవ జన్మ. వృథా చేయద్దని కాంగీ కొత్త అధినేత ఉద్బోధ. రాహుల్ బాబు జాతికి ఈ మధ్య ట్విట్టరు ద్వారా ఓ చక్కని సందేశం అందించారు. అందరికీ ఆదర్శంగా ముందుండడమే కదా గొప్ప నేత  మంచి లక్షణం! అందుకే.. మోదీ  హయాంలో అందలాలెక్కిన ధరవరలను శాతాల్లో చూపిస్తూ శతాధికమైన దోషాలను యధేఛ్ఛగా  దొర్లించేసారు. సారుని జౌరంగజేబని తిట్టిన నోళ్లే ‘ఔరా’ అంటూ అవాక్కయి పోతున్నాయి నాయనా ఇప్పుడు! 
ఎంత లావు శివ భక్తుడైతే ఏమి? ‘మనిషి’గానే పుట్టాడు  కదా  సోనియమ్మ కడుపున? చూడాలిహ! ముందు ముందు మోదీజీ సైతం తానూ 'ఓ మహా మనీషి'ని అని నిరూపించుకొనేందుకు ఇంకెన్ని ఘోర  తప్పిదాలకు శ్రీకారం చుట్టబోతున్నారో!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ  దినపత్రిక, 09-12-2017నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్ లో ప్రచురితం)




Friday, December 1, 2017

గ్రంథచోరులు- ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్






ఆన్ లైనులో కెళ్లి  కెలుక్కుంటే చాలు. కాపీ రైట్ చట్టం పట్టింపు లేకుంటే  కామ్ గా కాపీ, పేస్టు చేసుకొని కర్త పేరు మార్చేసుకోడం మహా సులువు.  ఆకాశమంత జ్ఞానానికి ఆవిష్కర్తలం అనిపించుకోడం.. ఇవాళ్టి డిజిటల్ యుగంలో కోక్ తాగినంత సులువు. కేవలం అచ్చు బుక్కులు  మాత్రమే లభ్యమయే దిక్కుమాలిన కాలంలో గ్రంథ చోరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం!

వనితా.. విత్తం తస్కరణలక్కూడా సులువు సూత్రాలు చెప్పే శాస్త్రాలున్న  కాలంలో  పుస్తకాలు కొట్టేసే  చిట్కాల గైడ్లు మచ్చుక్కి ఒక్కటైనా దొరక్కపోవడం గ్రంథచోరులకు పెద్ద లోటు!    అరవై నాలుగు కళల్లో చౌర్యమూ ఒక విభాగమే! అయినా.. ఆ శాఖ అభివృధ్ధి ఎందికు పుంజుకోలేదో? చిత్రమే కదా?

పుస్తక చౌర్యం మరీ అంత అకార్యమైన కళేం కాదు. యమధర్మరాజులుగారు గ్రంథచౌర్యం మీదో ఉద్గ్రంథమే రాసారని వినికిడి. ఏ దొంగ వెధవ గుట్టు చప్పుడుగా  నొక్కేసాడో..   ఇప్పుడా తాళపత్రాలు ఏ  గ్రంథాలయంలోనూ కనపడ్డం లేదు!

పుస్తక  చౌర్యానికీ బోలెడంత గ్రంథముంది. ఆశించిన  పుస్తకం అందుబాటుకి రావాలి. కోరుకున్న అందులో తారసబడాలి. ఇప్పుట్లా ఏ సెల్ ఫోనో అరచేతిలో ఉంటే 'ఠప్పు'మని ఓ క్లిక్కుతో  అంశం  మన సొంతమవుతుంది. క్జిరాక్సులకే దిక్కులేని కాలంలో ముత్తెమంత సమాచారం సేకరించాలన్నా పుస్తకం మొత్తం ఎత్తేయడం ఒక్కటే ఉత్తమ మార్గంగా ఉండేది.

అరువులా అడిగి పుచ్చేసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగే మరో దారి ఉన్నా..   కొంతమంది పుస్తకదారుల జ్ఞాపకశక్తి మరీ దారుణంగా ఉంటుంది. ఏనుగు మెమరీ కూడా వాళ్ల ధారణా శక్తి ముందు చీమ తలకాయ! ఏళ్లు పూళ్లు గడిచి.. ఎన్ని యోజనాల దూరంలో  స్థిరపడినా ప్రయోజనం శూన్యం. ఆనవాళ్లేవీ  లేకుండా  ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రారబ్దం బాగోలేకుంటే ఫలితం సున్నా. ఏ దుర్ముమూర్తానో నిశ్శబ్దంగా వెనకనుంచి వచ్చి 'ఎంరోయ్! మూర్తీ.. ఎట్లా ఉన్నావ్? అంటూ వీప్మీద ఛర్రుమని విమానం మోత మోగించేయచ్చు. ఆనక  ముసి ముసి నవ్వుల్తో కసిగా నిలదీయడంతో దోష విచారణ కథ మొదలవుతుంది. కోర్టు.. బోను.. సీనొక్కటే తక్కువ.  తలపండిన వకీలుగారు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు సాగే విచారణను ఎదుర్కోవడం ఎంత అబద్ధాలకోర్సు డాక్టరేటుకైనా తలకు మించిన పని.

ఫలానా పంథొమ్మిదొందల అరవై తొమ్మిది మార్చి మూడో తారీఖు మిట్టమధ్యాహ్నం పూట ఎండన  పడి తమరు మా ఇంటి కొచ్చారూ! ఏదో మిత్రులు కదా అని ఆతిథ్య ధర్మ నిర్వహణార్థం  కాశీ చెంబెడు మజ్జిగ నీళ్ళు నిమ్మరసం పిండి మరీ తమరికి సమర్పించుకున్నాను. అప్పుడు తమరేం ఉద్ధరించారో  గుర్తుందో లేదో ఇప్పుడు?  ఎండ చల్లబడిందాకా  బైటికి వెళ్లలేనంటే పోనీలే.. టైమ్ కిల్లింగుగా ఉంటుందని నా సొంత గ్రంథాలయం నుంచి ఎప్పట్నుంచో సేకరించి దాచుకున్న చలం 'ఊర్వశి'  అరుణాచలంలో ఆయన స్వహస్తాలతో అట్టమీద పొట్టి సంతకం గిలికిచ్చిన  అపురూపమైన పుస్తకం తమరికి ధారాదత్తం  చేసాను. బుద్ధీ,  జ్ఞానం అప్పటికింకా పూర్తిగా వికసించలేదులే నాకు. ఆపుకోలేని అర్జంటు పని మీద నేనటు లోపలికి వెళ్లి తిరిగొచ్చిన ఐదు నిమిషాలలోపే తమరు  జంపు!  ఖరీదైన  వస్తువులింకేమైనా చంకనేసుకొని ఉడాయించారేమోనని అప్పుడు  మా  ఊర్మిళ  గుండెలు బాదుకొన్న చప్పుళ్లు ఇంకా ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మిత్రమా! మా ఆవిడ శోకన్నాలు నాకు నిత్య కర్ణ శ్రవణానందాలే కనక దానికి ఆట్టే ఫీలవలేదు.  కానీ నా ఊర్వశిని  నువు  చెప్పా పెట్టకుండా చంకనేసుకొనలా  చెక్కేయడమే చచ్చే బాధించిందిరా మూర్తీ! నిజమైన స్నేహం కన్నా పుస్తకమే విలువైందని నువ్వా నాడు ప్రాక్టికల్గా నా కళ్లు తెరిపించావు చూడు.. అందుకు   'థేంక్స్' చెప్పుకుందామనుకొన్నా..  ఏదీ నీ అడ్రసు? రామాయణంలో సీత దర్శనం కోసం ఆ శ్రీ రామచంద్రుడయినా  అంతలా తపించాడో లేదో ? నా ఊర్వశి కోసం, తమరి వేరెబౌట్సు కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికైనా కనిపించావు. అదే పది వేలు. ఎన్ని వేలు కావాలో అడుగన్నా.. ఇచ్చేస్తా! కానీ.. మళ్లీ నా ఊర్వశిని మాత్రం నాకు తిరిగి ఇచ్చేయ్ రా.. ఇప్పుడే!' అంటూ జబ్బ పట్టుకొని నడిరోడ్డు మీదే  నిలబెట్టి పరువు తీసే  పుస్తకాల పురుగులు ఇప్పటికీ తారస పదుతూనే ఉంటారు. అందుకే తస్కరించే ముందు పుస్తకం వివరాలతోనే కాదు.. పుస్తకం తాలూకు  ఓనరు వివరాలతోనూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

డిజిటల్ గా దేశం ఎంతలా అభివృద్ధి పథం వైపు ముందుకు దూసుకు పోతున్నా.. పోయిన పాతపుస్తకాల కోసం.. పాతకాలంనాటి పద్ధతుల్లోనే పడరాని పాట్లు పడే చాదస్తులు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట తారసపడి గ్రంథాల విలువను మర్చిపోనివ్వరు.

అవును మరి.. ఒక గ్రంథం తయారీకి అది రాసేవాడి శరీర కష్టం విఘ్నేశ్వరుడి బాధను మించి ఉంటుంది! 'భగ్నపృష్టః కటిగ్రీవ స్తబ్ధ దృష్టిః రథో ముఖః.. కష్టేన లిఖితం గ్రంథం, యత్నేన పరిపాలయేత్' అని ఊరికే అనరు కదా ఎవరైనా? అష్టాదశ పర్వాల మహాభారతాన్ని ఆ వ్యాసులవారు ఓ వ్యాసంలా గడగడా వప్పచెప్పుకు పోవచ్చు. అది వట్టి నోటి పని. కానీ.. చెప్పింది చెప్పినట్లు క్షణమైనా గంటం  ఆపకుండా  చెవులతో వింటూ.. బుద్ధితో ఆలోచిస్తూ.. చేత్తో బరా బరా  రాసుకుపోవడం?! రాత సంగతి ఎట్లా ఉన్నా ముందు వెన్నెముక గతి? ముక్కలు చెక్కలై పోదా? మెడ కండరాలైనా పట్టుకు పోవా?కంటి చూపు? చీకటి పడితే  కటిక చీకటే!  ఆపకుండా అంత లావు భారతం ఎట్లా రాసుకు పోయినట్లు! దేవుళ్లు  కాబట్టి ఏ మాయో మర్మమో  చేసి కార్యం ఇతి సమాప్తం అనిపించి ఉండవచ్చు. మానవ మాత్రుల కెట్లా సాధ్యం?'కష్టేన లిఖితం గ్రంథం' అన్నారు అందుకే! పిట్ట ఈకలతో ఎండు తాటాకుల మీద గుండ్రటి లిపి! అక్షరం ఆకారం చెడకుండా రంధ్రాలు పొడుచుకుంటూ  పోతుండాలి.  అంత  కష్టం కాబట్టే పుస్తకాలను భద్రంగా చూసుకోవాలని పెద్దలు సుద్దులు చెప్పింది.

ఏ కష్టమూ లేకుండానే సృష్టించుకొనే వీలుంటే.. వేదాలు నీళ్లలోకి  జారినప్పుడు విధాత ఎందుకంతలా బేజారవుటాడు? గ్రంథాల విలువ తెలుసు కాబట్టే సోమకాసురుడా కవిల కట్టలు కంటబడగానే లటుక్కుమని నోట కరుచుకొని  పారిపోయాడు! 'పోతే పోయాయి లేవయ్యా? మళ్లీ  రాయించుకో.. ఫో!' అని కసురుకొని వదిలేయలేదు  పరమాత్ముడు.  పనిమాలా మత్సాహారమెత్తి మరీ మొరటు రాక్షసుడితో  ప్రాణాలకు తెగించి పోరాడాడు. తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చి 'ఇహ ముందైనా జాగ్రత్తగా ఉండ' మని మందలించాడంటానే తెలియడం లేదా పుస్తకాల విలువ ఏ పాటిదో?.

విలువైన వస్తువులు ఎక్కడుంటాయో దొంగతనాలూ అక్కడ తప్పకుండా జరుగుతుంటాయి. గ్రంథాలయాల దగ్గర అందుకే పగటి దొంగలు తారట్లాడేది.  పుస్తకం చూస్తున్నట్లే చూసి.. కటిక్కున  పుటను పరా పరా చించి జేబులో కుక్కేసుకొని బైటపడే గ్రంథచోరులు గతంలో చాలా మందే  తారసపడుతుండే వాళ్లు. వెసులుబాటుంటే అసలు  ప్రతినే లేపేసేందుకు అన్ని విధాలా ప్రయత్మించే గ్రంథచోరులుండ బట్టే   తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలోని మన తెలుగు తాళపత్ర గ్రంథాలు చాలా వాటికి కాళ్లొచ్చినట్లు ఈ మధ్య ఒక తమిళనాడు సాయంకాలం దినపత్రిక వివరాలతో సహా ప్రచురించింది.

ఈ-డిజిటల్ కాలమే కాదు.. ఎన్ని డిజిట్స్  జీతమొచ్చే గొప్ప  ఉద్యోగమైనా  మనిషి గ్రంథచౌర్యబుద్ధిని అడ్డుకోలేక పోతోంది. అందుకే తెలంగాణాలోని ఒక మారుమూల పట్నంలోని గ్రంథాలయంలో పుస్తకాలు దొంగిలిచ్చవద్దని హితవు చెబుతూ
'బుక్కులు తీసుకుపోయిన
మక్కువతో చదివి మీరు మరి ఇవ్వవలెన్
చిక్కెనని యింట దాచిన
మిక్కిలి పాపంబు మీకు మితిమీరియగున్!'
అంటూ పద్యాలు కొన్ని రాయించి మరీ నోటీసు బోర్డులో పెట్టించారు నిర్వాహకులు.
గ్రంథచోరులు దృష్టి ఈ పద్యం రాసున్న బోర్డు మీదా పడబోతుందా? ఏమో.. చూడాలి మరి ముందు ముందు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్- 02, డిసెంబర్, 2017)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...