Friday, February 8, 2019

ఆచార్యదేవోభవ!



'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే జాతికైనా మేలు జరిగేది.
-కర్లపాలెం హనుమంతరావు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనాడు,  సంపాదకౖయ పుట 05-09-2009 ప్రచురితం )
_________________________

బతకనేర్చిన వాడు- చిన్నకథ



రాంబాబు నావలో బొబ్బర్లంక చేరాడు. అల్లుడుగారిని రిసీవ్ చేసుకోడానికి వెంకయ్యగారే స్వయంగా ఒడ్డుమీద వేచివున్నారు. వెంకయ్యగారు ప్రస్తుతం ఆ పరగాణామొత్తానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి.
సామానంతా దిగింతరువాత అందరితోపాటే నావయజమాని రామలింగానికి రవాణాచార్జీలు చెల్లించబోయాడు రాంబాబు. రామలింగం చాలా నొచ్చుకొన్నాడు
'వెంకయ్యగారి అల్లుడంటే ఊరంతటికీ అల్లుడేనండీ బాబూ! అల్లుళ్లదగ్గర డబ్బులు దండుకొనే అథమస్థాయికి చేరలేదండీ ఈ రామలింగం ఇంకా!' అంటూ ఏవేవో నిష్ఠురాలాడాడు.
వెంకయ్యగారు రొయ్యమీసాలు మెలేసుకొంటూ అంతా ప్రసన్నంగా విన్నారు.
మామగారికా ఇలాకాలో ఎంత మందాన మర్యాద మన్ననలు అందుతున్నాయో స్వయంగా చూసిన అల్లుడురాంబాబు ఆనందంతో తబ్బుబ్బయిపోయాడు.
పెద్దపండుగ మూడురోజులు అదే పద్ధతిలో బ్రహ్మాండంగా గడిచిపోయింది రాంబాబుకు అత్తారూర్లో.
భార్యాపిల్లలు మరో వారం రోజులుండి వస్తామన్నారు.  ఏడాదికి సరిపడా ఊరగాయ పచ్చళ్ళు, పండుగకట్నంగా మామాగారిఛ్చిన టీవీ సెట్టులాంటి భారీసామానుతో ఒంటరిగానే తిరుగు ముఖం పట్టాడు రాంబాబు. వెంకయ్యగారే స్వయంగా లాంచిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.
నావ అవతలి ఒడ్డు చేరుకోగానే ప్రయాణీకులంతా రామలింగానికి చార్జీలు చెల్లించి సామాను దింపుకొని పోతున్నారు. వెంట తెచ్చుకొన్న సామాను దింపించుకొని పోయేందుకు రామలింగంకోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు రాంబాబు.
రామలింగం ఇటువైపు రావడంలేదు సరికదా.. రెండుమూడుసార్లు పిలిచినా విననట్లే ఎటో వెళ్ళిపోతున్నాడు! రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మామగారు ఎదురుగా లేరు కదా! ఈ ఓడమల్లయ్య ఇప్పుడు నిజసరూపం చూపిస్తున్నాడన్నమాట!
చేసేదేముంది! రాంబాబూ అందరికిమల్లేనే రవాణా చార్జీలు రామలింగం చేతిలో పోసి 'ఇహనైనా నా సామాను వడ్డున పెట్టిస్తారా?' అనడిగాడు సాధ్యమైనంత వెటకారం జోడిస్తూ!’
రామలింగం అదేమీ పట్టించుకోకుండా వెకిలిగా నవ్వుతూ 'అల్లుడుగారు వచ్చినప్పటి  చార్జీలుకూడా ఇప్పిస్తే .. ఇదిగో ఇప్పుడే సామాను వడ్డుమీదకు పట్టిస్తా..' అనేసాడు.
అవాక్కయిపోవడం రాంబాబు వంతయింది.
దక్కిస్తూ పాత చార్జీలుకూడా పైసలుతో సహా రామలింగానికి సమర్పించుకొని సామాను వడ్డుకు పట్టించుకొన్నాడు బతుకుజీవుడా అనుకొంటో!
'బతకనేర్చినవాడురా బాబూ!' అని గొణుక్కునే రాంబాబు దగ్గరికొచ్చి 'హి.. హి..హి' అన్నాడు రామలింగం 'తెలుసు బాబూ! తవరు నన్ను 'బతకనేర్చిన వాడురా బాబూ!' అని తిట్టుకొంటున్నారని తెలుసు. మరేం చెయ్యమన్నారు  చెప్పండల్లుడుగారూ! ఇదంతా మీ మాంగారిదగ్గర్నుంచి వంటబట్టించుకొన్న విద్యేనండీ బాబూ! ఎన్నికలముందు ఇంటిగుమ్మందాకా వచ్చి మరీ ఓటుకు  ఓ ఐదొందలనోటు చొప్పున  లెక్కెట్టి  ఇచ్చిపోయారండీ ధర్మప్రభువులు! అందరం ఓట్లేసినాం. ఎన్నికల్లో గెల్చినారు సారు. మేం ఎన్నుకొన్న ప్రజాప్రతినిధేకదా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు కదా అని.. మా పేదోళ్లందరికీ తలా ఓ నాటుపడవైనా ఇప్పించమని ఆడగాడానికని వెళ్ళాం బాబూ! ఏం చేసారో తెలుసా మీ మాంగారు? నావలు కొనుక్కోడానికి బ్యాంకోళ్ళు ఇచ్చే అప్పుకు సిఫార్సు చేయడానికి మడిసికి ఐదువేలు చొప్పున లెక్కెటి మరీ  వసూలు చేసేసారండీ! పెద్దోళ్లకేనా మరి బతకనేర్చిన విద్యలన్నీ? పేదోళ్ళకు మాత్రం కావద్దా? మేం నేర్చుకొంటేనే తప్పయిపోతుందాండీ? ఏం చోద్యం సాగుతోందండీ లోకంలో!’ అంటూ నావను నెట్టుకొంటో వెళ్ళిపోయాడు రామలింగం.
-కర్లపాలెం హనుమంతరావు
***


Tuesday, January 22, 2019

కొడవటిగంటి కుటుంబరావు -21 వ శతాబ్ది సంపూర్ణ మానవుడు

 ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ పుటలో  ప్రచురితం 
-కర్లపాలెం హనుమంఅరావు 
కొడవటిగంటి కుటుంబరావు 

ఇరవయ్యో శతాబ్దపు సంపూర్ణ మానవుడు
-కర్లపాలెం హనుమంతరావు
అక్టోబర్ 28, 1909 జన్మించిన తేదీ. గుంటూరు జిల్లా, తెనాలి జన్మస్థలం. 'సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శ ద్వారా సుసంపన్నం చేయడమే సరైన సాహిత్యం' అన్న కొడవటిగంటిది  మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో నల్లుల బెడద తగ్గడానికని ఆయన  చిన్నతనంలో తల్లి ‘రు’ అనే అక్షరంతో అంతమయే అరవై ఊళ్ళ పేర్లు రాయించిందిట. అంత చాదస్తపు కుటుంబంలో పుట్టి 'బుద్ధికొలత వాదం' అనే ఓ కొత్త  సిద్ధాంతాన్ని ప్రతిపాదించే స్థాయికి ఎదిగిన మనోవికాసజీవి కొ.కు.
సమాజంలో చుట్టూ ఉన్న వ్యక్తుల నడవడికల్లోని  అసమంజసమైన తడబాటుకు విరుగుడు మంత్రం చదువేనని కుటుంబరావు బాల్యం నుంచే గాఢంగా భావించారు. కొ.కు ప్రసిద్ధ నవల 'చదువు'లోని చాలా అంశాలు  కొ.కుగారి వ్యక్తిగత అభిప్రాయాలేనని చాలా మంది సాహిత్య విశ్లేషకులు భావన.   విద్య ద్వారా లభించిన వివేకమే  ఆయన జీవితాన్ని ఎప్పటికప్పుడు చీలిన దారుల్లో నిలబడి ఉన్నప్పుడు మేలైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగే విధంగా ప్రేరేపించింది. తన పదకొండో ఏటే  పెద్దమ్మ పెంపకంలోకి వెళ్లిన  వాడు కుటుంబరావు. ఆమెకి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో అన్నం వండే అలవాటు. మిగిలింది మర్నాడు పిల్లలంతా చద్దన్నంగా తినాలి. రోజూ చద్దన్నం తినేందుకు విసుగనిపించి దెబ్బలాటకు దిగేవాడుట కుటుంబరావు. ఒక రోజు కాస్త తక్కువగా వండేస్తే మర్నాటి నుంచి ఎప్పటి కప్పుడు వేడి వేడి అన్నరుచిగా తినవచ్చుగదా!' అని కుటుంబరావు ఆలోచన. ఇంత చిన్న తరుణోపాయం పెద్దమ్మకి ఎందుకు తట్టింది కాదో ఆ బాలుడికి అర్థం కాలేదు. తనే ఆమెకు చెప్పాడు చివరకి.  అయినా పెద్దావిడ 'పిల్లకాకి సలహా' కింద పెడ చెపిన పెట్టి తన పాత చాదస్తాన్నే కొనసాగించేదిట. ఇలాంటి అసంబద్ధమైన పోకడలంటే జీవితంలో చివరి వరకూ కొడవటిగంటి అసహనంగా ఉండేవార'ని వాళ్లబ్బాయి రోహిణీ ప్రసాద్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చారు.
కొ.కు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. 5వ ఏట తండ్రీ, 11వ ఏట తల్లీ మరణించడంతో మేనమామ వద్దే  పల్లె వాతావరణంలో పెంపకం.  అన్నయ్య వెంకటసుబ్బయ్య కవి, రచయిత.  కొ.కు సాహితీ రంగప్రవేశానికి ఆయనే ప్రేరణ. గిండీ ఈంజనీరింగ్ కాలేజిలో చదువుకుని ఓవర్సీరుగా పనిచేసిన సుబ్బయ్యగారికీ ఆధునిక భావాలు పుష్కలంగా ఉండేవి. ఆయన ప్రభావానికి తోడు పాశ్చాత్య సాహిత్యంతో  పరిచయం కొ.కు అదనపు ఆస్తి. తల్లావఝ్జల, గోవిందరాజులు వంటి ప్రసిద్ధులని కళ్లారా చూసిన అనుభవాలు జీవితంలో కలిసొచ్చాయి. 13వ ఏటే పద్యాలు.. పూర్తికాని ఓ థ్రిల్లరు రాసిన బాలమేథావి కొ.కు. 16వ ఏట హైస్కూలు చదువులోనే  తనకన్నా 5 ఏళ్ళ బాలికతో(పద్మావతి) వివాహం జరిగింది. (1939లో ఆమె  మరణించింది) 1825-27.. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు..  ఆ తరువాత మరో రెండేళ్లు మహారాజా కళాశాల. విజయనగరంలో బియ్యే ఫిజిక్సులో చదివాడు.  రచనా వ్యాసంగం సీరియస్ గా పట్టుబడిందీ కాలంలోనే. డిగ్రీ చదువు చివరికి వచ్చేసరికి కుంటుంబరావులో నాస్తిక భావజాలం స్థిరపడింది. 1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు.  
సైన్సు పాఠలు బోధించే ఉపాధ్యాయుడి మెడలో తాయెత్తులు కనిపిస్తుంటే.. వినే విధ్యార్థికి గురువు విషయంలో గురి ఎలా ఏర్పడుతుంది? కొడవటిగంటిది సైన్సు సబ్జెక్టులను అధ్యయనం చెయ్యడమే కాదు.. నిత్య జీవితంలో తారసపడే ప్రతి అంశాన్ని ఆ శాస్త్రజ్ఞానం ప్రసాదించిన ఇంగితంతో తార్కికంగా ఆలోచించే తత్వం. అందు చేతనే ఆయన తన రచనల్లో చెప్పే విషయాల్లో ఏది అహేతుకం అనిపించదు. అయోమయంగా కలిగించదు. సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా కనిపించే ఆయన రచనా శైలికి ఆయన జీవితానికి కడదాకా ఎక్కడా వైరుద్యం కనిపించదు. కొ.కులో కనిపించే నిజాయితి చాలా మంది రచయితలలో అరుదుగా మాత్రమే అగుపిస్తుంటుంది.
అప్పటి అంతర్జాతీయ  ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్..సి రెండో సంవత్సరంలో ఆగిపోయింది. కొంతకాలం  వరంగల్లులో పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. 1942లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. కార్మికుల వాస్తవ జీవితాన్ని కళ్లారా పరిశీలించే అవకాశం కొ.కు కి ఆ కాలంలోనే దక్కింది. 1942లో ఓ ఆరునెలలు సిమ్లా జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీ రైటరుగా పనిచేయడం అతనిలోని రచయితకు కలిసొచ్చిన మరో అబుభవం. 1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగాకూడా పనిచేసాడు కుటుంబరావు.
రచనలుః
1930లో కొ.కు తొలి రచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. మొదటికథ 'ప్రాణాధికం' గృహలక్ష్మి మాస పత్రికలో. చక్రపాణి, మరికొంతమంది మిత్రులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు.
 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసాడు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి అప్పటి సహోద్యోగే. 1
రెండో పెళ్ళి జరిగిన రెండు నెల్లకే ఆ భార్యా అనారోగ్యంతో మరణించడంతో 36వ ఏట ముచ్చటగా మూడో వివాహం చేసుకున్న విచిత్రమైన అనుభవం కుటుంబరావుది. చివరి వరకూ అతనితో జీవితం పంచుకొన్న ఆ సౌభాగ్యవతే వరూధిని. బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా 1948లో మూడు నెల్లలు పనిచేసిన తరువాత ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో ఆ సంస్థ వారపత్రికకు సంపాదకత్వం కూడా  నిర్వహించాదు కొ.కు.  ఆ క్రమంలోనే కొన్నాళ్ళు కినిమా వారపత్రిక సంపాదకత్వం.1952, జనవరి 1 నుండి..  1980 ఆగష్టు 17న తుది శ్వాస విడిచే  వరకూ 'చందమామ'కే అంకితమయిపోయారు. ఆ పత్రిక అత్యున్నత స్థితిలో కొడవటిగంటివారి  కృషి మాటల్లో వర్ణించలేనంత మహత్తరమైనది. ఆయన చనిపోయే ముందు పత్రికాఫీసుకని సిద్ధం చేసుకొని వెళ్లే బ్రీఫ్ కేసులో రాబోయే మూడు నెలలకు సరిపడినన్న కథలు రడీగా  ఉన్నాయని కొకుగారి కూతురు శాంతా సుందరి  ఓ సందర్భంలో అన్నారు.
సాహిత్య జీవితం:
శాస్త్రజ్ఞులు చెప్పే స్థలం (space), కాలం (time) అనే రెండు కొలతలకు అదనంగా జగత్తుకు బుద్ధి అనే మూడో కొలత 'బుద్ధి' కూడా ఉంటుందనే 'బుద్ధికొలత వాదం' సిద్ధాంతాన్ని మొదటి సారిగా ప్రతిపాదించి అనేక రకాల చర్చలకు పునాది రాయి వేసిన కొ.కు శాస్త్రవేత్తా? సాహిత్యవేత్తా? అంటే.. ఆ రెండూనూ అని సమాధానం చెబితే సరిపోదు. వాటికి తోడు సామాజికవేత్తా, సంస్కరణవాదీ, బౌద్ధిక జీవీ,, మార్క్సిష్టూ, మనస్తత్వవేత్తా.. అని కూడా చెప్పుకొంటేనే కొ.కు వ్యక్తిత్వాన్ని సంపూర్ణం  సందర్శించైనట్లవుతుంది.. ఒక్క కవిత్వం  మినహా కుటుంబరావు గారు కలగ జేసుకొని సాహిత్య ప్రక్రియ తెలుగులో దాదాపు  లేదనే అపిస్తోంది! 50 ఏళ్లల్లో ఆయన చేతిమీదుగా జాలువారిన పది నుంచి పన్నెండు వేళ పుటల రికార్డు ఇప్పటికీ ఏ తెలుగు రచయితా సమీపంలోకి కూడా రాలేనంత ఘనమైన  రికార్డు.
కొడవటిగంటివారి కొన్ని అభిప్రాయాలుః
"సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు. అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు".
"ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు"
"మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే"
"కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం" (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం)

ఆధునికులు అని చెప్పుకొనే వారిలో చాలా మంది చాదస్తులేనని ఆయన రూఢిగా నమ్మేవారు. చేజేతులాచిన్నపిల్లలకు పెళ్లిళ్లు జరిపించి, ఆనక భర్తహీనులైన ఆడబిడ్డలతో  ఇబ్బందులు పడే సంప్రదాయవాదులంటే మొదటినుంచి కొ.కు కు వళ్లు మంటే!  సమాజంలో పెడమార్గాలకు మూలకారణాలు వ్యక్తుల్లో కాక.. వాళ్లను సాకే వ్యవస్థలోనే ఉన్నాయని  కుటుంబరావుగారికి మార్క్సిజం సిద్ధాంతం అధ్యయనం తరువాత మర్మం అంతు పట్టింది.
 చిన్నతనంలో నేర్చుకున్న పెళ్ళి మంత్రాలూ, తద్దినం మంత్రాలూ వగైరాలన్నీ ఆయనకు చివరిదాకా గుర్తున్నాయి. సంప్రదాయకవిత్వాన్ని నేర్చుకుని రాయగలిగిన తరవాత ఆ పద్ధతిని నిరసించి, చెండాడినవాడు  శ్రీ శ్రీ. ఆయన పంథాలాగే కొ.కు కుడా తాను తరవాతి కాలంలో సహేతుకంగా, తార్కికంగా విమర్శించిన సంప్రదాయాలన్నీ మొదటినుంచీ సుపరిచితమే.  సంప్రదాయవాదులకు అదే పెద్ద  కంటగింపుగా ఉండేది. ఆయన రచయితగా మారిన తరువాత  సమీపబంధువులే అతనిని ఎలా తూలనాడేవారో  మా. గోఖలే  వివరించారు.  ఆరంభంలో  యువ వితంతువును  గురించే ఎక్కువ రాయడం జరిగింది. అప్పట్లోని  బ్రాహ్మణ కుటుంబీకులు ఆచారం  ముసుగులో సొంత లాభం చూసుకొనే గడసరితనాన్ని   గురజాడలా, చలంలా ప్రతిభావంతంగా ఎండగట్టిన కోవకు చెందిన వాడు కొ.కు. కాకుంతే పెద్దమనుషులుగా చలామణీ అయే వారి ప్రవర్తనను శాసించే సామాజిక, ఆర్థిక, రాజకీయశక్తులను  విశ్లేషించడం కొ.కు చేసిన అదనపు కృషి.
షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ కథలు నవులుతూనే చవులూరించే తెలుగు ఆధునిక సాహిత్యంలోని తొలితరం రచయితల కథలన్నీ దాదాపుగా చదివేసి ఆకళింపు చేసుకొన్న  ఇంగితం కొడవటిగంటిది. సెకండు ఫారం నుంచే  వార్తాపత్రికల కథనాల ఆధారంగా తనూ ఓ కథ అల్లేసి, చదివి, చించేయడం  ఓ నిరంతర అభ్యాసంగా లాభించింది తదనంతర కాలంలో కుటుంబరావుగారికి. రాత వల్లే విషయం సమగ్రంగా అవగాహనకు వస్తుందని కొ,కు చివరి వరకు ప్రగాఢంగా నమ్మేవారు.
తన తరం ఆలోచనలకు బింబసామానలైన తన రచనలు ముందు తరాలకి కేవలం చరిత్ర పరిశీలనకు మాత్రమే అవసరంగా ఉండాలి కాని.. ఆ పంథాలో తరువాతి రచయితల రాతలు సాగితే తను ఆశించిన అభ్యుదయం ప్రగతిమార్గాన నదవడం లేదన్న భావం వస్తుందని కొ.కు చాలా సందర్భాలల్లో చెబుతుండే వారు. జాతిని మరింత ముందుకు తీసుకు వెళ్లేదే సరైన సాహిత్య ప్రయోజనమని ఆయన విశ్వాసం.బుద్ధికి పదునుపెట్టి, పని కల్పించేలా రచన ఉండాలని ఆయన తపన..
సాహిత్యానికి అదనంగా శాస్త్రీయసంగీతం, తోట పని, వంట చేయడం.. లాంటి కార్యక్రమాలలో కొ.కు చివరి వరకు ఆసక్తి అలాగే కొనసాగిందంటారు. అన్నట్లు ఆయన సినిమాను కాక.. సినిమానే ఆయన్ను ప్రేమించింది. నాటకరంగమూ మరో ప్లటోనిక్ ప్రేమికురాలు.  వివిధరంగాల్లో పేరున్న ఎందరో  ఆయనకు ఆయాచితంగా దక్కిన  సన్నిహితులు. స్థానం నరసింహారావు, రఘురామయ్య.. వగైరా ఆ కోవకి చెందిన వారు. 
మద్రాసులో శ్రీశ్రీ లాగారాత్రి భోజనానికి బదులు ఇడ్లీ స్వల్పాహారం, బీచ్ ఒడ్డున నిద్రానుభవాలు తనకూ ఉన్నట్లు ఆయనే చెప్పుకున్నారు.  వరూధినితో వివాహం తరువాత  వ్యక్తిగతజీవితం కుదుట పడింది.  చందమామలో చేరాక  పూర్తి  మానసిక ప్రశాంతి లభించింది.
అచ్చు టెక్నాలజీ నుంచి పత్రికల సామాజిక ప్రభావం దాకా అన్నిటినీ ఆయన సమగ్రంగానే అవగాహన చేసున్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల ప్రగతి ఆయన దృష్టి కోణం నుంచి దాటి పోలేక పోయింది.  
ఇరవయ్యో శతాబ్దపు మానవుడుగా, రచయితగా, చింతకుడుగా ఆయన చివరిదాకా క్రియాశీలంగానే జీవించినట్లు లెక్క.

Wednesday, August 1, 2018

సొంత ముద్ర- పోతన- ఓ ఉదాహరణ- తెలుగు వెలుగు ప్రచురణ



 'ఏ వలరాజు భార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేవరఁ గోలుపోయి కడు దీనత నొందుచున్నదానఁ రం
డో వనవీథి నున్న ఖచరోత్తములార! దిగీంద్రులార రం
డో వనవాసులార వినరో మునులార! యనాథవాక్యముల్!'
(నేను మన్మథుడిభార్యను. విష్ణుమూర్తి కోడలును. శివుడి మూలకంగా నా భర్తను పోగొట్టుకొని మిక్కిలి దుఃఖంలో ఉన్నదానిని. అడవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్లు, మునులు .. అంతా రండి! ఈ అనాథ మాటలు వినండి!- అని ఈ పద్యానికి అర్థం.
వీరభద్ర విజయము లోని రెండో ఆశ్వాసం 124వ పద్యం)
***

కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికని భర్తను చేర్పించిందో మధ్యతరగతి గృహిణి. ఆ పరీక్షలు ఈ పరీక్షలంటూ లక్షలు మింగి చివరకు చేతులెత్తేసారు ఆ ఐదునక్షత్రాల ఆసుపత్రి దొరలు. మృతదేహాన్ని వరండాలో పడేసి ఒక అరగంటలో స్థలం ఖాళీ చేసెయ్యాలని కూడా హెచ్చరించారు. బతికుంటే బలుసాకైనా తినచ్చన్న గంపెడాశతో వంటి మీది బంగారాన్ని కూడా భర్తవైద్యానికని వెచ్చించిందా పిచ్చితల్లి. ఇల్లూ .. వాకిలీ లేవిప్పుడు. అయిన వాళ్లెవరూ లేరు ఆదుకునేందుకు.  ఎక్కడో ఏదో జరిగింది. ఆసుపత్రి వర్గాలు ఏదో చేసాయి! ఇదీ అని ఇతమిత్థంగా చెప్పలేక పోవచ్చు కానీ.. ఖచ్చితంగా మోసమయితే ఏదో జరిగింది. అంత పెద్ద ఆసుపత్రి నిర్వాహకులని నిలదీయడమెట్లా? ఎదురు తిరిగి నిలబడేందుకైనా ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా ఇలాంటి విషాదఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా! అలాంటి సందర్భాలలో బలహీనులు, దిక్కూ దివాణంలేని అభాగ్యులు ఏ విధంగా స్పందిస్తారో రోజూ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ముఖపరిచయం లేక పోయినా దారేపోయే దానయ్యలందర్నీ పేరు పేరునా పిల్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు బక్కజీవులు. ఆ పనే చేసున్నది ఇక్కడ రతీదేవి కూడా!
ఇంద్రుడు పంపించాడని బండశివయ్య గుండెల్లో బొండుమల్లెల పరిమళాలు పూయించాలని పూలబాణాలతో సహా మహా ఆర్భాటంగా ఊరేగుతూ వచ్చాడు భర్త వలరాజు(ఆహాఁ! ఎంత చల్లని తెలుగు పలుకు). దేవయ్య మీద దాడికని  బైలుదేరే ముందు అక్కడికీ ఒక ధర్మపత్ని బాధ్యతగా ముందొచ్చే ముప్పును గూర్చి హెచ్చరించింది రతీదేవి. అతివిశ్వాసంతో శివయ్య మీద ప్రణయసైన్యాన్ని వెంటేసుకొని మరీ దాడి చేసి చివరకు ఆ ముక్కంటి మూడోకంటి నిప్పురవ్వలకు కాలి బూడిదపోగయ్యాడు! శివయ్య చేసింది అన్యాయం. కానీ ఆయనేమో దేవతలకు దేవుడు. ఎవరయ్యా ధైర్యంగా ఎదురు నిలబడి అడగగలరు? అట్లాగని మనసారా ప్రేమించి పెళ్లాడి కడదాకా జీవితాన్ని పంచుకొందామన్న గంపెడంతాశతో గృహస్థధర్మం స్వీకరించిన స్త్రీమూర్తి చూస్తూ వూరుకుంటుందా? ఏదేమైనా సరే.. తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఎదురునిలబడాలనే అందరు ఇల్లాళ్ల మాదిరి రతీదేవి పంతం పట్టింది. అందుకే ఆ దుర్ఘటన జరిగిన వనంలోనే బూడిదకుప్ప ముందు  కూలబడి అక్కడి వనవాసులను, ఆకాశజీవులను, ఆఖరికి ఆ శివయ్యే సర్వస్వమనుకొనే మునిగణాలను కూడా తన మొర ఆలకించమని వేడుకొంటున్నది పరమ దయనీయంగా! మామూలు మానవులకే కాదు దివ్యశక్తులున్నాయని మనం నమ్మే దేవుళ్లు కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు మనలాగే భావోద్వేగాలకు లొంగిపోతారా? అని ప్రశ్న వేసుకొంటే కొన్ని కొత్త విషయాలు కొన్ని బైటికి వస్తాయి. అవి కావ్యరచనకు సంబంధించిన రహస్యాలు.
బమ్మెర పోతనకూ ఈ దైవికశక్తుల మీద సామాన్య పాఠకులకు  మల్లేనే విపరితమైన విశ్వాసం ఉంది. చాలా సందర్భాలలో ఆ కవే స్వయంగా శ్రీరామచంద్రుడు తన వెనక ఉండి మహాభాగవత రచన చేయించాడని చెప్పుకొన్నాడు. అయినా పోతన ఇక్కడ దివ్యజీవి రతీదేవిని అన్యాయానికి గురైన ఒక సాధారణ అనాథ స్త్రీ మూర్తిగానే ఎందుకు చిత్రించినట్లు? సృజన రహస్యమంతా అక్కడే ఉంది.
కవి కావ్యరచన చేసే సందర్బంలో తన కృతి పదిమంది చదివి తాదాత్మ్యం చెందాలని కోరుకొంటాడు. ఆ విధంగా తన్మయత్వం చెందాలంటే రచనలోని పాత్రలు దేవుళ్లైనా, దానవులైనా మానవుల మాదిరే భావోద్వేగాలు ప్రదర్శించక తప్పదు. అప్పుడే చదివే పాఠకుడు తన స్వభావంతో.. తన పరిసరాల నైజంతో ఆ పాత్రలను 'ఐడెంటిఫై' చేసుకునేది. తన రచన చదివే పాఠకులు ఎవరో ముందే నిశ్చయించుకొనే కవి/ రచయిత ఆ రచనను తన సొంత స్థాయికి కాకుండా పాఠకుడి మేధోస్థాయికి తీసుకువెళతాడు.  కథాకాలం ఏదైనప్పటికీ, కథన కాలానికి పాఠకుల భావోద్వేగస్థాయికి తగినట్లు సాగే రచనే పదికాలాల పాటు కాలానికి ఎదురీది నిలబడేది.
పై పద్య కర్త బమ్మెర పోతన అని ప్రత్యేకంగా చెప్పపనిలేదు. ఆ  అచ్చు తెలుగు పదాల పొహళింపు, ద్రాక్షాపాకరస ధార, చెవులకు ఇంపనిపించే శబ్దాలు పొదిగి  చేసే పదప్రయోగాలు, సందర్భానికి తగ్గట్లు ఛందో వృత్తాల వాడకం.. ఇత్యాదులన్నీ బమ్మెర పోతన 'ముద్ర' ను పట్టిచ్చేస్తాయ్.
రచన చదివినప్పుడే ఫలానా కవిది/రచయితది ఈ కర్తృత్వం అని పాఠకుడు గుర్తు పట్టే విధంగా రచన సాగితే.. అదే ఆ కవి ముద్ర.
ప్రతీ కవి, రచయిత, కళాకారుడు తనదైన  సొంత 'ముద్ర' స్థాపించుకున్నప్పుడే  సాహిత్యంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉండేది.
కొత్తరచయితలు పాత రచయితల నుంచి నేర్చుకొనే అనేకమైన  సృజన లక్షణాలలో 'ముద్ర' కూడా ఒక  ముఖ్యమైన సుగుణం.
-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...