Thursday, July 11, 2019

ఆంధ్రౌన్నత్యం -



1
వెల్లబోయెదెవేల విశ్వేశ్వరుని గాంచి హంపీవిరూపాక్షు నరయరాదె
డంబువీడెదవేల టాజుమహల్ గాంచి యమరావతీస్తూప మరయరాదె
భ్రాంతిచెందెద వేల వారనాసిని గాంచి దక్షవాటిక గాంచి తనియరాదె
కళలువీడెద వేల కాళి ఘట్టము గాంచి వైశాఖపురి గాంచి పరగరాదె
గాంగజలముల గనుగొని కలగదేల-గౌతమీ గంగ కనులార గాంచరాదె
యఖిల సౌభాగ్యములు నీకు నమరియుండ-దెలివిమాలెద వేమోయి తెలుగుబిడ్డ!
2
ఆలించినావెందు ద్యాగరాట్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
నాలకించితివెందు నాధ్యాత్మ కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
రహివింటి వెచ్చోట రామదాస్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
మొగివింటి వెయ్యెడ బొబ్బిలిపాటల నాంధ్రభూమినిగాక యన్యభూమి
వింటి వెచ్చోట పల్నాటివీరచరిత- మాంధ్రభూమిని గాకున్న యన్యభూమి
నాంధ్రపదమెంత మధురమో యాంధ్రతనయ-తెలిసికొని, నేటికేనియు గులుకవోయి!

3
చిట్టివడాలను చేర్చిన పోపుతో గమనైన పనసకూర
అల్లముకరివేపయాకుతో దాలింపుగా నొప్పు లంకవంకాయకూర
ఘ్రాణేంద్రియముతో రసనేంద్రియము దన్ను పసమీఱు విఱిచిన పాలకూర
గరమసాలాలతో గమగమవలచెడు వసలేని లే జీడిపప్పుకూర
బుఱగుం జూచబియ్యము పూతచుట్ట- లాదిగాగల దివ్య పదార్థవితతి
యాంధ్రులకెకాని మఱియేరికైన గలదె-సేతుశీతాద్రిమధ్య విశేషభూమి!

4
కాలుసేతులును వంకరలువోవగజేసి వణకించు పెనుచలిబాధ లేక
బండఱాళులు గూడ మెండుగా బీటలు వాఱించు వాతపబాధ లేక
ఏరుళూలుగూడ  నేకమై ప్రవహించు వర్రోడుతతవర్ష బాధ లేక
బండుగనాడైన బట్టెడన్నము లేక రొట్టెలే తినియుండు రోత లేక
చూచితూచినయట్టుగా దోచుచుండు-సీతు నెండయు వానయు బూతమైన
యమలరాజాన్నమునుగల్గునాంధ్రభూమి- దలచికొనిపొంగుమెటనున్న దెలుగుబిడ్డ!

-పండిత సత్యనారాయణరాజు
రచనాకాలం:1934

Monday, July 1, 2019

గౌతమీ గంగ కాశీచయనుల మహాలక్ష్మి


గౌతమీ గంగ
 కాశీచయనుల మహాలక్ష్మి
 01/03/2013
కవ్వపుతాడును నేర్పుగా త్రిప్పుతుంటే కవ్వం పైకి, క్రిందకూ ఎగురుతూ కవ్వపు బిళ్ల చేసే మధనానికి కడవలో పెరుగులోని వెన్న పూసలు పూసలుగా పైకి తేలుతుంది. శీతాకాలం చలి వలన వెన్న తొందరగా పైకి తేలదు. అప్పుడు గృహిణి నేర్పుగా కొంచెం వేడినీటిని కడవలో పోస్తుంది. గోరువెచ్చగా అయిన చల్లలోని వెన్న కాస్సేపటికి పైకి తేలుతుంది. ఈ విధంగా చల్ల చిలికి వెన్న తీయడం ఇల్లాలి నేర్పుకి నిదర్శనం. వెన్న  ఓ చట్టిలో పెట్టి నాలుగు రోజులకోమారు నెయ్యికాస్తారు. చల్ల వేరొక కడవలోనికి మార్చేక ఈ పాలకడవలో గోరువెచ్చని నీటిని పోసి ఆల్చిప్ప అనే పరికరంతో గోకి ఎండుగడ్డితో శుభ్రంగా తోముతారు. పెద్ద సైజు నత్తగుల్లను అడుగుభాగాన రాతిపై అరగదీస్తే కొంతపదును వస్తుంది. దీనిని మట్టి పాత్రలు తోమడానికీ, మామిడికాయలపై పెచ్చు తీయడానికి నాటి స్త్రీలు ఉపయోగించేవారు. కొందరు వీటిని ఉగ్గు గిన్నెల్లా పసి పిల్లలకు, ఉగ్గు, మందులు పోయడానికి కూడా వాడేవారు. ఇల్లాలు వాడే ఈ చిప్పలు ఆల్చిప్పలు అయ్యాయి. భూదేవమ్మ గారు చల్ల చేయడం అయే వేళకు పాలేర్లు పశువుల దొడ్డి నుండి పాల బిందెలు తెచ్చి వాకిట్లో వుంచేవారు.పసిబిడ్డా`పాలకుండా’ అని సామెత. పసిపాపను సాకినంత ఓర్పుగా, నేర్పుగా పాడి పనులు నిర్వహించాలని దీని అర్థం.
                       చిన్న పాలేరు పళ్లికతో పిడకలు తెచ్చి పాల గది వద్ద వుంచుతాడు. భూదేవమ్మ గారు పాలదాలిలో పిడకలు పేర్చి, నిప్పురాజేస్తారు. ఈ పిడకలు పేర్చడానికి నేర్పుకావాలి. సెగ ఎక్కువ అయితే పాలు పొంగి నిప్పుల్లో పడిపోతాయి. సెగ తక్కువ అయితే పాలు కాగవు. పాలు కడవలో పోసి దాలిపై పెట్టి కొద్దిగా తెరచి వుండేలా మూత అమర్చి ఈవలకు వచ్చేవారామె. ఆ వేళకు పాలగది వద్ద తారాడే పిల్లలకు నిమ్మకాయంత వెన్నముద్ద అందరి చేతుల్లోనూ పెట్టేవారు. అప్పటికి ఊరిలోని పాడి ఏర్పాటు చేసుకోలేని సామాన్య గృహిణులు సత్తు తప్పాల చేత పట్టుకొని వారిల్లు చేరేవారు. సారవంంతమైన పచ్చగడ్డి, తవుడు, తెలకపిండి, ఉడకబెట్టిన ఉలవలు మేసిన పశువుల పాలు మట్టి పాత్రలలో, పిడక దాలిపై కాగిన ఆ చల్ల మంచి రుచిగా వుండేది. ఊరి వారు మాత్రం ఆ రుచి భూదేవమ్మ గారి అరచేతిలో వుంది అనుకునేవారు. వారందర్ని ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ వారి పాత్రల్లో చల్ల పోసి ఇచ్చేవారామే. ఒక రోజు ఆ వేళకు ఆమె ఆడబిడ్డ వచ్చి ఆ పాత్రలలో నిన్నటి పుల్లచల్ల పోసి ఇచ్చేవారు. ఇంటి నిండా పాడి వుండగా ఇదేం పని అని మనసులో అనుకునేవారు కాని పైకి అనలేకపోయేవారు భూదేవమ్మ గారు. చంటి పిల్లలకు, అనారోగ్య వంతులకు ప్రత్యేకంగా ఆవుపాలు ఇచ్చేవారామె.  
                       మేన అల్లుళ్లు, మేన కోడళ్లూ చల్దన్నాలు తింటూ వుంటే భూదేవమ్మ గారి ఆడబిడ్డ వారి వద్దనే కూర్చొనేవారు. కమ్మని కందిపొడిలో అప్పుడే కాచిన నెయ్యి వేసి పెట్టాక, పాలగదిలో ప్రత్యేకంగా దుత్తలో వుంచిన పెరుగు వారికి వడ్డించేవారు. రోజు కొంత మీగడ వారికి కేటాయించవలసిందే. మధ్యాహ్న భోజనాల్లో మగవారికి వెన్న చిలికిన మజ్జిగ పోసినా పిల్లలకు మాత్రం మూడుపూటలా పెరుగే. రాత్రి మగ వారి భోజనాలు ముగిసాక పెరుగు తప్పాల లోపల పెట్టి పుల్ల మజ్జిగ గిన్నె ఆడవారి వద్ద పెట్టేవారు కామమ్మ గారు. అలా పెడ్తూ ఆడ రంఢలకి పెరుగెందుకు అనేవారు తన చర్యను ఎవరూ ప్రశ్నించక పోయినా.  
                 భూదేవమ్మ గారు నాలుగడుగుల పొడవుతో, చామన చాయతో, బక్కపలచగా వుండేవారు. ఆమె ముఖంలో లక్ష్మీకళ తాండవిస్తూ వుంటుంది. అంచేత ఆ ఇల్లు సిరి సంపదలతో వర్థిల్లుతోంది అనుకునేవారు ఊరి వారు. ఆమె నిత్య సంతోషి. నిగర్వి, గృహకృత్యాలను నెరవేరుస్తూనే నిరంతరం భగవత్‌ సంకీర్తన చేసుకుంటూ వుండేది ఆ ఇల్లాలు. భర్తకు వేద గోష్ఠి, అధ్యాపన, వ్యవసాయ పర్యవేక్షణ, ఊరి తీర్పరితనంతో ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక వుండేది కాదు. భర్త ఎదుట పడి ఇది అవసరం అని చెప్పే ధైర్యం, అవకాశం ఆ గృహిణికి లేదు. ఏ సరుకు కొనాలన్నా కొట్టులో కొబ్బరికాయ ఒకటి ఇచ్చి కొనడమే. నాటి రోజుల్లో కోనసీమలో కొబ్బరికాయ ఖరీదు కాణి (రూపాయలో 64వ వంతు) పిల్లలకు బెల్లం, మిఠాయి కావలసినా( ఆ రోజుల్లో పంచదార మిఠాయి, నేటి స్వీట్లు వీరు ఎరుగరు) ఆడ పిల్లలకు కాటుక కాయకాని, అగులు (బియ్యం మాడ్చి అందులో నీరు కలిపి ఉడికించి చేసే పేస్టు ఆరోజుల్లో కన్య పిల్లలు, కొందరు  మగవారు ఆ ఆగులునే బొట్టుగా ధరించేవారు. దువ్వెన, అద్దం, జడ చివర కట్టే ఊలుతాడు ఏది కావాలసి వచ్చినా కొట్టులోంచి తలో కొబ్బరికాయ తీసి తెచ్చుకోవడమే. అమ్మాయిలకు పరికిణీ గుడ్డలు కావాలంటే వర్తకుడు బట్టల మూట భుజాన పెట్టుకొని పెరటిగుమ్మాన ఇంటిలోనికి వచ్చేవాడు. భూదేవమ్మగారు తమకు కావలసిన బట్టలు కొని వారికి పాలేర్ల చేత గాదెలోని ధాన్యం కొలిపించేవారు. నాలుగు గుడ్డలు తీసుకొని వచ్చిన అతడు బరువైన ధాన్యం మూటతో వంగి వెళ్లేవాడు. భూదేవమ్మ గారు దాల్చేవి ఏడాదికి మూడు నేత చీరలే. అవి సాలెవాడు నేసి తెచ్చేవాడు. ఆమె కాళ్లకు వెండి కడియాలు, గొలుసులు, అందెలు వుండేవి. కాలి వేళ్లకు బోటనవేలు వదిలి మిగతా నాలుగు వేళ్లకు మట్టెలు, పిల్లేళ్లూ అనే వెండి నగలు ధరించేవారు. చేతులకు వెడల్పు పాటి గట్టి మురుగులు ఒక్క జతే, మెడలో మంగళసూత్రాలు నేటి వలే బంగారు గొలుసుతో ధరించడం ఆ రోజుల్లో లేదు. పచ్చని పసుపుతాడుకు గుచ్చిన మంగళసూత్రాలు ధరించి రోజూ స్నానం చేసేటప్పుడు దానికి పసుపు పూస్తూ పచ్చగా వుంచుకునేవారు. నల్లపూసలు కూడా పసుపు దారాన్ని గుచ్చి కుత్తిగంటు అని మెడను చుట్టి కొంచెం బిగుతుగా వుండేటట్లుగా ధరించేవారు.
వివాహ వేళ వధువు కంఠాన ఈ నల్లపూసలు కడుతూ నీలకంఠుడైన శివుడు హాలాహలాన్ని కంఠంలో వుంచుకున్నట్లుగా సంసారంలోని కష్టాలు, బాధలనీ వెలికి చెప్పి వెలితి పడకుండా, కడుపులోనే పెట్టుకొని కృంగిపోకుండా ఇక్కడే అదిమి వుంచు అనే అర్థం వచ్చే మంత్రాన్ని వరుడు చదువుతాడు కదా. నల్లని పట్టుదారాన్ని గూర్చిన అరకాసుల దండ, పెద్ద సైజు పగడాల తావళం ఆవిడ మెడలో ఆభరణాలు. రెండు ముక్కులకు బంగారుకాడలు, ముక్కు కొసన ఎర్రని పొడిగల అడ్డబాస ధరిస్తారామె. చెవులకు ఎర్రని పొళ్లు గల కాణీ సైజు దుద్దులు, చెవుల చుట్టూ మరి మూడు కుట్లకు బావిలీలు, చెవి పోగులూ అనే స్వర్ణ ఆభరణాలు వుంటాయి.   
శాస్త్రి గారికి పొలాలు కొనడం, డబ్బు కూడపెట్టి ఊరి వారి అవసరాలకు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడం తప్పించి డబ్బు వలన మరో ప్రయోజనం లేదు. స్త్రీల అలంకారాలూ, అవసరాలు అనే ఉహే వారికి కలిగేది కాదు. శిష్యులకు ఎంత విద్యాప్రదానం చేసినా అది ఆర్థికంగా ఖర్చు లేనిదే. వారి ఇంట ఎందరు భుజించినా కొదువ లేదు. ఇంట్లో పాడిపంట తరుగనిది, ఎర్రని ఏగాణీ ఖర్చు లేదు.  కొంత సేపు  చూసి భోజనాల వేళ అయిపోతుంటే మరదలు రోటి ముందు కూర్చున్నాక ‘ఇదేమిటే నేను రుబ్బుతాను కదా అంతలోనే తొందరా’’ అన్నా అమెకు జవాబు చెప్పరాదు.  వీటన్నిటి వల్లా కామమ్మ గారికి మరదలు అంటే ఇష్టం లేదు అనుకుంటే అది పొరపాటే. మనసులో మరదలి పట్ల ఆమెకు ఎంతో ఆపేక్ష. ఆ పిల్లల తల్లికి అన్ని విధాల అండ ఆడబిడ్డ. బిడ్డల సంరక్షణా బాధ్యత పూర్తిగా ఆమెదే. అత్తవారి నుండి సాలీన వచ్చే మనోవర్తి డబ్బు పాతిక రూపాయలూ మేనళ్లుడూ, మేన కోడళ్ళ కొరకే ఖర్చు పెడతారు ఆమె. వాళ్లకు తలలు దువ్వడం, స్నానాలు చేయించడం ఆమె బాధ్యత. రాత్రి పూట ప్రక్కలో వేసుకొని పాడ్యమి సంవత్సరాది పాడ్యమి, విదియ భాను విదియ అంటూ తిథుల పేర్లు, చైత్రము, వైశాఖమూ అంటూ పన్నెండు నెలల పేర్లు, ప్రభవ, విభవ అంటూ అరవై సంవత్సరాల పేర్లు వారికి నేర్పుతూ వుంటారు ఆమె. ఆంధ్రదేశంలో అప్పటికి వ్యాప్తిలో వుండి ఆ తరువాత కొంత కాలానికి మధిర సుబ్బన్న దీక్షితులు అనేవారిచే గ్రంధస్థం చేయబడ్డవి కాశీ మజిలీ కథలు.
ఈ జానపద కథల్లో ఒక గురువు కాశీ యాత్రకు పయనమయ్యాడు. అతడికి పరిచర్య చేయడానికి 12 సంవత్సరాల బాలుడు వెంట వెళ్తాడు. అక్కడ దేవాలయ కుడ్యాలపైనా, సత్రపు గోడలపైన వున్న శాసనాలూ, ఊళ్లో వార్తలు సేకరించుకొని వచ్చి వాటి వివరాలు గురువుని అడుగుతాడు శిష్యుడు. గురువు సావకాశంగా భోజనాలు ముగించి వాటి వివరాలు శిష్యునికి చెప్తాడు. ఈ కథలు కొంత అద్భుత రస ప్రధానంగా వుంటాయి. ఒక్కో కథకు పరిష్కారం సూచించబడుతుంది.  కొన్నిటి పరిష్కారం శ్రోతలకే విడవబడుతుంది. ఇందులో రాజకుమారుల సాహసగాథలు, చతురులైన వారి నేర్పరితనం, యుక్తులు, స్త్రీల పాతివ్రత్యం, నాటి సంఘంలో నెలకొని వున్న వేశ్యల నెఱజాణతనం చిత్రింపబడి వుంటాయి. ఈ కథలలో బ్రహ్మాండమైన సస్పెన్స్‌ వుంటుంది. భట్టి విక్రమార్కుల కథలు అన్న పేరుతో భారత వర్షాన్ని ఏలిన విక్కమార్క చక్రవర్తి కథలుగా కొన్ని అద్భుత, సాహసగాధలు కూడా ప్రచారంలో వుండేవి. ఈ కథలను మేనత్త చెప్తుంటే వింటూ మహదానందంతో కేరింతలు కొడుతూ ఆమె చుట్టూ చేరిన పిల్లలు నిద్రపోయేవారు. పాలేర్లు వేసిన ప్రక్కలపై వారు పడుకుంటే వారి సమీపంగా ముక్కాలి పీట మీద కూర్చొని వున్న ఆమె వద్దకు మగవారి భోజనాలు ముగిసాక భూదేవమ్మ గారువచ్చి వదినగారు వేడి నీళ్లు పెట్టాను మీరు స్నానం చేస్తే ఫలహారం చేద్దురు గాని అంటారు. అప్పటికి రాత్రి మొదట జాము పూర్తి అవబోతూ వుంటుంది. ఆమెకు ఒక విస్తరిలో కొయ్య రోట్లో మినప రొట్టో వడ్డించి పచ్చళ్లు వేసి మజ్జిగ, మంచినీళ్ల చెంబు ప్రక్కన పెట్టి ఆమె భోజనం ముగుస్తుంటే భూదేవమ్మగారు వడ్డించుకుంటారు. ఫలహారం ముగించిన కామమ్మ గారు తిరిగి పిల్లల వద్దకు వచ్చి వార్ని నిద్ర లేపి తలో మినప సున్ని వుండో, ఆరిసో, చక్కిలమో పెట్టి ఇన్ని మంచినీళ్లు ఇచ్చి ఆవగింజంత నల్లమందు మాత్ర వేస్తారు. ఆ విధంగా వేస్తే పిల్లలకు కలత లేని నిద్ర పడుతుందని, ప్రక్క తడపరనీ ఆవిడ నమ్మకం. పిల్లల మధ్యలో ఒరిగి భగవన్నామ స్మరణ చేస్తూ నిద్రపోతారామె..
బాప్పా। (బాబుకు అప్ప) అంటూ పిల్లలంతా ఆమెకు ప్రాణం పెడతారు. మడీ తడితో పిల్లల్ని పట్టించుకోవడానికి కుదరని తల్లికి ఆమె పెద్ద అండ. శాస్త్రి గారికి పెద్ద దిక్కు ఆమె. ఆయన ఏ పని చేసినా ఆమె అనుమతి తీసుకోనిదే చేయరు. ఆస్తి పాస్తుల వ్యవహారాల నుండి పెళ్లి సంబంధాల వరకూ అన్నిటా ఆమె తన విశేషానుభవంతో తమ్మునికి సలహా ఇస్తూ వుంటారు.    
గ్రామ స్త్త్రీలు పొరుగూర్లకు వెళ్లాలంటే సామాన్యులకు కాలినడకే శరణ్యం. శాస్త్రిగారి ఇంట వారి అప్పగారు, కుమార్తెలు ప్రయాణం అయితే పొలం నుంచి రెండెడ్లు పూన్చిన గూడు బండి వస్తుంది. భూదేవమ్మ గారు పయనమైతే పెరట్లో శాలలో పైన వేలాడకట్టిన మేనా క్రిందకు దింపుతారు. ఇది చెక్కలతో పెట్టి ఆకారంగా తయారు చేయబడి వుంటుంది. దీనికి తలుపులు వుంటాయి. లోన మెత్తలు పరచి చలువ దుప్పటి పరుస్తారు. నలుగురు చాకలులు ఒహొం ఒహోం అని లయబద్ధంగా ధ్వని చేస్తూ భుజాలపై మోసుకొని వెడతారు దీన్ని. శాస్త్రిగారు పయనం చేయాలంటే అందలం అనే ఒక రకం పల్లకీవస్తుంది. క్షత్రియ సంప్రదాయాలు పాటించే ఆ ఊరిలో సంపన్న క్షత్రియులు ప్రయాణించే ప్రయాణ సాధనాలు ఇవి. రాచ వారితో సరితూగే శాస్త్రిగారు, భార్య మాత్రమే వాటిని వాడుతారు.
భూదేవమ్మ గారికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. ఆ ప్రాంతాల మహిమ గల తల్లిగా పేరు పొందిన మరిడే మహాలక్ష్మమ్మకు మ్రొక్కుకున్నాక ఆమె కడుపు పండి బాలిక కలిగింది. పచ్చన పసిమి చాయతో బొద్దుగా తండ్రి పోలికతో వున్న ఆ బాలిక అందరికీ అపురూపమే శాస్త్రిగారు బాలిక జాతకాన్ని పరిశీలించారు. ఆమెకు కీర్తవంతుడైన భర్త, ప్రయోజకులైన కొడుకులూ కలుగుతారు. ఆర్థిక పరిస్థితే ఒడిదుడుకుగా కనపడుతున్నాయి. తాను వుండగా దానికి లోటెలా వుంటుంది అనుకున్నారాయన. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆడపిల్ల జాతకాన్ని బట్టి పుట్టినింట, అత్తింట సౌభాగ్యం వుంటుంది. ఇంట్లో ఆ అమ్మాయిది ప్రథమ స్థానం. చిన్న పిల్ల అయినా పండుగ, పబ్బం ఏదయినా ఆమె చేతుల మీదుగానే జరగాలి. ఆమె తరువాత క్రమంగా నలుగురు ఆడపిల్లలు కలిగారు వారికి. శాస్త్రిగారికి అప్పగారికి ఈ పిల్లలందరూ ప్రేమపాత్రులే. భూదేవమ్మ గారికి గృహకృత్య నిర్వహణలో తలమునకలౌతూ వీర్ని పట్టించుకోనే తీరిక వుండదు. చాలా కాలానికి ఆమె మళ్ళీ గర్భం దాల్చారు. ఈ సారయిన మగ పిల్లవాడు కలిగితే బాగుంటుందని శాస్త్రిగారితో సహా అందరూ అనుకుంటున్నారు. ఆమె సవతి కొడుక్కి మాత్రం కంగారు బయలుదేరింది. ఇంతవరకూ వున్న వాళ్లు ఆడపిల్లలు గనుక ఏ విధంగా వారికి పెళ్ళిళ్ళు చేస్తే వారి దారిన వారు పోతారు. ఈ సారిగాని మగపిల్ల వాడు కలిగాడా, తండ్రి ఆస్తిలో సగభాగం పంచుకొని పోతాడు. అతడు తన సవతి తల్లికి మగపిల్లవాడు కలుగకుండా వుంటే గ్రామ దేవతకు మేకపిల్లని బలి ఇస్తానని మ్రొక్కుకున్నాడనుకుంటుంటే విన్నామని చుట్టు ప్రక్కల పొలాల్లో పని చేసుకొనే  రైతులు అంటూ వుంటారు.
మహాలక్ష్మమ్మ పెళ్ళి గురించి శాస్త్రిగారు ఆలోచించసాగారు. వారి ఎరికలో కొన్ని సంబంధాలు వున్నాయి. వారు ఆస్థి పరులేకాని వరులకు విద్యాగంధం లేదు. పెద్ద కుమారుడు తన పేరు నిలిపేవాడు కావాలని ఆయన ఎంతగానో ఆశించారు. అతడికి చదువు అబ్బలేదు. ‘‘పండిత పుత్రః పరమ శుంఠః’’ అన్నట్లుగా వుంది అతడి పని. ‘‘యస్య జ్ఞాన దయా సింధోః। అగాధ స్యాన ఘాః గుణాః।’’ అన్న అమరకోశపు ప్రార్థనా శ్లోకానికి ‘‘సత్యజ్ఞాన దయాసింధోః। గోడ దూకితే అదే సందు’’ అనీ అధ ప్రజానామపః ప్రభాతే॥ అన్న రఘువంశపు రెండవ సర్గలోని మొదటి శ్లోకానికి ‘‘అధప్రజానామీది కంది పప్పు।’’ అని పరిహాసంగా విపరీతార్థలు చెప్తూ సాహిత్యం పట్ల అతడు ఎగతాళి బుద్ధి కలిగి వున్నాడు. ఇంట్లో వున్న అశేష బంధు బలగాన్ని చూస్తే అతడికి ఒళ్ళు మండిపోయేది. ఇంటిలోన తండులంబు నసంతి। నేడు పొండు రేపు రండు’’ అనీ ‘‘ఇంటిలోన తండ్రులంబులు నసంతి। తిండికైతే పది మంది వసంతి’’ అని పరిహసించేవాడు. చిన్నవాడు ఏదో అంటున్నాడు అని కొందరు సరిపెట్టుకొనేవారు. కొందరైతే అది హేళనగా తలచేవారు. ఇటువంటి విషయాలు శాస్త్రిగారి చెవి వరకు  రావడానికి కొంతకాలం పట్టింది. విన్నాక వారు కొడుకును మందలించాలని చూచారు గాని అతడు సరకు చేయలేదు. తనకన్నా 3 ఏళ్లు మాత్రమే పెద్ద అయిన సవతి తల్లిపై అతడికి మాతృ గౌరవం కలగటం లేదు. తన ఆస్తి తేరగా తినడానికి వచ్చిన దానిలా తోస్తుంది.
    కొడుక్కు ఎటూ చదువు అబ్బడం లేదు. విద్వాంసుడూ, బుద్ధిమంతుడూ అయిన పిల్లవానిని అల్లుడుగా తెచ్చుకొని ఈ లోటు కొంతయినా భర్తీ చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. చాలా వాకబులు చేసాక గోదావరి ఆవల ఆత్రేయపురం గ్రామంలో వేద పండితుడూ, యజ్ఞ నిర్వహణాదక్షుడు అయిన యువకుడు వున్నట్లుగా తెలిసింది. తండ్రి గతించాడు. తాత మహా పండితుడు, వంశ వృద్ధుడు, ఆస్థిపాస్తులు పెద్దగా   ఏం లేవు. శాస్త్రి గారు తమ కుమార్తెను ఈ వరునకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.   
స్వయంగా ఆత్రేయపురం వెళ్లి ముసలి కృష్ణ సోమయాజులు గారి దర్శనం చేసారు. ఆ యజ్ఞ పురుషుని చూడగానే శాస్త్రి గారికి భక్తి ప్రతివర్తులు కలిగాయి. శాస్త్రిగారు తమ అభిప్రాయం చెప్పగానే ఆయన బాబు నీవు అభిమానంగా ఇంత దూరం వచ్చావు సంతోషం ‘‘వివాహశ్చ వివాదశ్చ సమయోరేమశోభతే’’ అని కదా పెద్దలు చెప్తారు. విద్యలో సంప్రదాయములో మనకు పొత్తు కుదురుతుంది. కాని నీవు లక్ష్మీ పుత్రుడివి. రాచ మర్యాదలతో మెలుగుతున్న వాడివి. ఈ ఇల్లు చూచావు కదా. ఇక్కడ బ్రహ్మ దేవుడూ ఆయన ఇల్లాలూ కొలువై వున్నారు కాని ఆమె అత్తగారు మాత్రం ఈ వంక కన్నెత్తి కూడా చూడదు. ఈ ఇంట అంతా కోడలిదే పెత్తనం అన్నారు లక్ష్మీ సరస్వతుల్ని వుద్ధేశించి, శాస్త్రిగారూ మామగారు మహా పురుషుడైన  శ్రీ కృష్ణుడు అష్ట ఐశ్వర్యాలు వున్నాక కౌరవుల్ని కాదని తన చెల్లెల్ని అర్జునునికి ఎందుకు ఇచ్చాడంటారు ? మీరు మరీ అడ్డు చెప్పకుండా నా సంకల్పాన్ని మన్నించి నన్ను దీవించండి. మీ అనుజ్ఞతో నేను కన్యాదానం చేసుకొని ధన్యుణ్ణి కానీయండి అని కృష్ణ సోమయాజులు  గారికి నమస్కరించారు. వంటింటి గడప దగ్గకు వెళ్లి ‘‘ అప్పా! పెళ్ళీడు వచ్చిన పిల్లను ఎన్నాళ్ళు ఇంట వుంచుకుంటావమ్మా! నీ కోడల్ని చేసుకొని సొమ్ము నువ్వు తెచ్చుకో’’ అన్నారు. నాటి రోజుల్లో పెళ్ళి బేరాలు లేవు. ఇంతటి సంపన్నులతో నేను ఎలా తూగగలను అని సోమయాజులు మధన పడుతుండగానే నడవపల్లి గ్రామం నుంచి పెళ్ళి సంబరాలన్ని బండ్ల మీద వచ్చాయి. ఆ రోజుల్లో గోదావరిలో నీరు లేని వేసవి రోజుల్లో రెండెడ్ల బండ్లను గోదావరిలో దింపి మొలబంటి నీళ్లతో ఎడ్లను తోలుతూ బండి నడిపి గోదావరి దాటేవారు. ఆ విధంగానే పెండ్లి వారు రెండెడ్ల బండ్లపై పెళ్ళికి తరలి వెళ్లారు.  
                           జమిందారీ స్తాయితో మెలగుతున్న శాస్త్రి గారు తమ గారాబు కుమార్తెకు ఎంతటి సంబంధం తెస్తారో అని ఊరి జనం, అశేష బంధుమిత్రులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ పెండ్లి వార్ని చూస్తూనే వారంతా పెదవి విరిచారు. వరపంచకం అన్నట్లుగా పెండ్లి వారి తరపున వచ్చిన వారే పదిమంది. శాస్త్రిగారు పంపిన  10 బండ్లలో 8 బండ్లు ఖాళీగానే తిరిగి వచ్చాయి. శాస్త్రిగారు ఏర్పాటు చేసిన భజంత్రీలు విడిది పందిట్లో మేళం చేసాక పెండ్లి వారు పందిరిలో విడిసారు. శాస్త్రిగారు ముసలి కృష్ణ సోమయాలుగారికి అగ్గగ్గలాడిపోతున్నారు. వారి సోదరుని కుమారులు, బావమరదులూ నలుగురు ముత్తయిదువులు మాత్రమే వచ్చిన పెళ్ళివారు వితంతువులు వివాహాది శుభకార్యాలకు వెళ్లడం  నాటి ఆచారం కాదు  కనుక సోమయాజులు గారి మరదలు, కోడలూ, కుమార్తెలూ కూడా రాలేదు. ఆడ పెళ్ళివారు ఎవరికి మర్యాదలు చేయాలో  తెలియక ముఖాముఖాలుచూసుకొని వచ్చిన బంధువుల్లో వృద్ధ ముత్తయిదువును కూర్చోబెట్టి వియ్యపు వారి మర్యాదలూ, ఆడపడుచు లాంచనాలు అన్నీ ఆమెకే జరిపారు. మహాలక్ష్మి దబ్బ పండు చాయ పండిన మామిడి పండులా మిస మిసలాడే నేవళీకం వరుడు నల్లని నలుపు, జమిలి ఎముకతో దృఢమైన శరీరం, పళ్ళు ఎత్తు కన్యావరయతే రూపం, మాతావిత్తం, పితాశృతం, భాంధవాః కులచ్చమృష్టాన్న మితరేజన్నాః। అని కదా అర్యోక్తి ఇక్కడ లోకం ఎరుగని అమాయకపు బాల మహాలక్ష్మికి వరుని అంద చందాల్ని ఎంచుకొనే ఊహ ఇంకా రాలేదు. భూదేవమ్మ గారు వరుని సిరి సంపదల్ని గణింపగల వ్యవహర్త కాదు. శాస్త్రిగారు కోరే పాండిత్యం వరునిలో సమృద్ధిగా వుంది. కులమంటే జటావల్లభుల వారంటే ఆ చుట్ట పట్ల పాండిత్యంలో సదృత్తంలో ప్రఖ్యాతి పొందిన వారు. ఊరి జనం కోరే మృష్టాన్న విందులు శాస్త్రిగారింట ప్రతినిత్యం జరుగుతూ వుంటాయి. ఇక నేడు చేప్పేదేముంది ఆ చుట్టు ప్రక్కల ఏ ఇంట్లోనూ 10 రోజుల పాటు పొయ్యి రాజేసింది లేదు. బట్రాజుల బిరుదు పఠనం వారాంగనా నృత్యాలూ, డోలు సన్నాయి మేళాలు మొదలైన  లాంఛనాలన్నీ పెళ్ళి ఐదు రోజులూ జరిగాయి. ఇంటి ఆడవారు మాత్రం గడపదాటి బైటకు వచ్చేవారు కారు. ఎంత పెద్ద ఆవరణ వున్నా కన్యా ప్రదానం ఇంటి పెద్ద సావిడిలోనే జరిగింది. స్త్రీలు తమ వేడుకలన్నియు ఇంటిలోపలే జరుపుకొన్నారు.
కాశీచయనుల వెంకటమహాలక్ష్మి
విహంగ మాసపత్రిక సౌజన్యంతో

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...