Showing posts with label Drama. Show all posts
Showing posts with label Drama. Show all posts

Tuesday, December 7, 2021

యుగద్రష్ట గురజాడ - ఆధునిక తెలుగు నాటకం - కె. రవివర్మ సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 





యుగద్రష్ట గురజాడ -  ఆధునిక తెలుగు నాటకం

- కె. రవివర్మ

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


(కేరళనుంచి వెలువడుతున్న హిందీ మాసపత్రిక “సాహిత్య మండర్ పత్రిక" ప్రధాన సంపాదకులు కె. రవివర్మ. తెలుగు సాహిత్యానికి మిత్రులు. ప్రజా సాహితి “గురజాడ కన్యాశుల్కం ప్రదర్శన శతాబ్ది" సంచికను ఆగస్టు 92లో వెలువరిస్తున్నామని వారికి ప్రజాసాహితి తెలియజేస్తో, ఈ నాటకం మళయాళంలోకి అనువాదం జరిగిందా ? అయితే ఓ సరిచయ వ్యాసం హిందీలో రాసి పంపమని కోరింది. మళళంలోకి అనువాదం కాలేదని ప్రజాసాహితికి తెలియజేస్తూ, 'కన్యా శుల్కం' పై హిందీలో పరిచయ వ్యాసం రాసి పంపమని వర్మ ప్రజాసాహితిని కోరారు. 'ప్రజాసాహితి' ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ లెక్చరర్ కృష్ణ గారిచేత వ్యాసం రాయించి పంపించింది. ఆ వ్యాసాన్ని 'సాహిత్య మండల్ పత్రిక' జూలై 1992 సంచికలో ప్రచురిస్తూ, వర్మగారు ఆదే సంచికలో రాసిన సంపాదకీయం “యుగద్రష్టాః ఏక్ తెలుగు నాటక్” కోసం ఈ క్రింద ప్రచురిస్తున్నాము. తెలుగు అనువాదం ప్రజాసాహితి పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం . 


విజయనగరం (ఆంధ్ర) లోని జగన్నాధ విలాసినీ సభ అనేసాంస్కృతిక  సంఘం కేవలం సంస్కృత నాటకాలే ప్రదర్శిస్తూ వచ్చేది. అలాంటిది  అదే సంస్థ ఓ తెలుగు నాటకం ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో, రంగ స్థలంలో ఓ సంచలనం  సృష్టించింది. ఈ నాటకం యధాస్థితివాదులు, సాహిత్య సమాలోచకుల విమర్శకు గురి అయింది. నాటకం పేరు "కన్యాశుల్కం" . 


వివాహం పేరిట యుక్తవయుసు రాని కన్యల్ని, వారి తల్లిదండ్రులకి డబ్బుయిచ్చి  కొనుక్కో వడం. ఈ నాటకం ఇతివృత్తం. ఈ నాటకం ద్వారా  రచయిత గురజాడ వేంకట అప్పారావు తెలుగు త్యంలో శాశ్వత స్థానం పొందారు. 


శ్రీ గురజాడ అప్పారావు విజయనగరం యం. ఆర్. కాలేజీలో ఇంగ్లీషు, సంస్కృత అధ్యాపకులు. అయినప్పటికీ (తెలుగులో) గ్రాంథిక రచనలు చేసే పద్దతికి స్వస్తి చెప్పి, ప్రపథమంగా  తెలుగు నాటకంలో వ్యావహారిక భాషనీ, నుడికారాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల ఈనాడు వారు ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుదారి చూపినవారుగా గుర్తింప బడుతున్నారు. 


'కన్యాశుల్కం' ఆధునిక నాటక లక్షణాలని తూ.చ. తప్పకుండా అనుసరించి ఉండక పోవచ్చు. అయినా ఎక్కువ శాతం నిరక్షరాశ్యులు ఉన్న సమాజంలో భావవ్యాప్తికి మాధ్యమంగా నాటక ప్రక్రియని ఎంచుకోవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. చెప్ప దలచుకున్న విషయానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకుల ముందుంచితే అది తన

లక్ష్యాన్ని తక్షణం  సాధించుకుంటుంది . 'కన్యాశుల్కం' నాటకం రాయడంలో శ్రీ గుర జాడ ఉద్దేశం సాంఘిక దురాచారాల మూలాలను  చీల్చి చండాడటం.


కన్యాశిల్కం 1892 ఆగస్టు 13వ తేదీన తొలిసారిగా రంగస్థలం మీ ద ప్రదర్శింపబడింది. 1897 సం॥రంలో గ్రంథరూపంలో వెలువడింది. నాటకానికి రాసిన 'భూమి'క'లో శ్రీ గురజాడ యిలా అన్నారు. "విజయనగరం మహారాజు గారి ఆదేశం ప్రకారం పదేళ్ళ క్రితం నేను బ్రాహ్మణ శుల్క  వివాహాలను గురించిన కొన్ని వాస్తవాలను పోగుచేశాను. విశాఖపట్నం ప్రాంతంలో గత మూడు ఏళ్ళగా (1880–83) ఇలాంటి వివాహాలు 1034 జరిగాయి.  ఈ సంఖ్య పరిపూర్ణ మయినది కాదు. కారణం– తత్సంబంధిత వ్యక్తులు తమ కన్యల్ని కుల్కం తీసు కొని వివాహం జరిపినట్టుగా అందరూ ఎలా ఒప్పుకుంటారు ?"


“పైన ఉదహరించిన అంకెలను గురించి ఒక ఏడాదిలో సగటున కుల్క వివాహాలు 334 జరిగాయి. 99 మంది అల్ప వయసులో, 44 మంది నాలుగేళ్ళ అమ్మాయిలకీ, 36 మంది మూడేళ్ళ అమ్మాయిలకి, ఆరుగురు రెండేళ్ళ అమ్మాయిలకీ, ఏడాది వయసు ముగ్గురమ్మాయిలకి శుల్కం తీసుకొని పెళ్ళిళ్ళు జరిగాయి. అమ్మా యిలకోసం తీసుకొన్న శుల్కం  350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉంటుంది. యుక్త వయసు రాకుండానే శుల్క వివాహాలు జరిపించే ఈ దుష్ట సాంప్ర దాయం ఎంతవరమా పోయిందంటే గర్భంలో ఉన్న శిశువుకి సయితం శుల్కం తీసుకొని పెళ్ళి ఖాయం చేసుకోవటం దాకా వెళ్ళింది. ఇంతకన్నా అవమానకర మయిన విషయం సమాజానికేం ఉంటుంది ? ఇటువంటి సాంఘిక దురాచారాల

నిర్మూలనకు  సాహిత్యం నడుం కట్టాలి. ఈ నాటక రచనకి ప్రేరణ ఈ భావమే. 


" కుల్కం లేక వెలయిస్తే ముసలి వగ్గులకి సయితం ముక్కుపచ్చలారని బాలికలు లభిస్తున్నారు. కౌమార్యంలోనే వైధవ్యం ప్రాప్తించే వీరి చేత యిళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు.”


కేరళలో సంబూద్రీల (కేరళ బ్రాహ్మణులు) మధ్య సయితం బాల్య వివా హాలు పరిపాటి. అయితే అవి శుల్కం యిచ్చికాక, వరకట్నం ఇచ్చి జరిగేవి. బహు భార్యా వివాహాలు కూడా సర్వసాధారణ విషయం. డబ్బుల అవసరాన్ని బట్టి ఏకన్య తోనయినా వివాహం జరిపించేసేవారు. ఒక్కో పురుషునికి నలుగురేసి భార్యలు . వాళ్ళ మధ్య కీచులాటలు, తగవులాటలు ,అంతఃపుర సవతి  కలహాలు సాధారణం. స్త్రీ లు పరదా  పద్ధతి  పాటించేవారు. పరాయి మగవాని ఎదుటికి వచ్చేవారు కారు. నంబూద్రీ బ్రాహ్మణుల్లో  యింటి పెద్ద కొడుకు మాత్రమే నంబూద్రీ కన్యలనే వివాహం చేసుకునేవాడు. అందువల్ల కన్యాధారంనుంచి విముక్తి కోసం ఆమె తల్లిదండ్రులు ఎంత వరకట్నమయినా సమర్పించుకొని, కాటికి కాళ్ళు సాచుకొన్న నంబూద్రీ వృద్ధునికి  సయితం తమ కన్యల్ని కట్టబెట్టేవారు. 


ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా 1930వ దశకంలో నంబూద్రీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. తెలుగులో 'కన్యాశుల్కం'లా, (మళయాళంలో సయితం) నాటకాలు రాసి ప్రదర్శించేవారు. నవలలూ, కథలూ రాసే వారు. ఈ ఉద్యమం విజయవంతమయింది. సాహిత్యానికి ఉన్న శక్తి ఏమిటో, సంఘసంస్కరణకి సాహిత్యం ఎంతలా దోహద పడగలదో ఋజువయింది.


గిరిజనులలో సయితం ఓలి యిచ్చి కన్యల్ని కొనుక్కొనే ఆచారం ఉందని అంటారు. అయితే చిన్న వయసుగల బాలికల్ని కాదు. వయసు వచ్చిన యువతీ యువకులు పరస్పరం యిష్ట వడ్డ తర్వాతనే గిరిజనులలో వివాహాలు జరుగుతాయి. అంతేగాని 'కన్యాశుల్కం' నాటకంలోలాగ ముక్కుపచ్చలారని పసికందులతో క్రూరంగా చెలగాటం ఆడుకోవటంకాదు.


—అనువాదం : నిర్మలానంద

( ప్రజాసాహితి - జనవరి 1993 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


 

Sunday, February 7, 2021

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' - సందేశం

 

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకంలో నేటి కాలానికీ వర్తించే మతసామరస్య సందేశం ఉంది.

 జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా?

జి.వి.కృష్ణరావు గారి 'బొమ్మ ఏడ్చింది' నాటకం చదివారా? పోనీ విన్నారా దాన్ని గురించి?

కాశ్మీరు ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగం అధికరణ 370 ని గురించి మళ్ళీ చర్చ రేగిన ఈ సందర్బంలో ఈ నాటకానికి ఎంతో 'రెలెవెన్సు' ఏర్పడింది అనిపిస్తుంది.

ఈ నాటకంలో ఏడ్చిన బొమ్మ ఎవరో కాదు. దానం, శీలం, క్షమ, వీరం,ధ్యానం, ప్రజ్ఞ- ఈ ఆరింటికి అధిదేవతగా బౌద్ధులు ఆరాధించుకునే షట్పారమితా దేవి .

గౌతమీ పుత్ర శాతకర్ణి వైదిక మతానుయాయి. రాజ్యంలో భిక్షాటనం చేసుకుంటూ ధర్మ ప్రబోధనలతో జీవనం సాగించే భిక్షుకుల మూలకంగా వైదిక కర్మకాండలమీద ప్రజల  విముఖత్వం ప్రబలుతోందని భావిస్తాడు. పాలన చాటున అకర్మలని, అవినీతిని పెంచి పోషించే ఒక వర్గంవారి దుర్బోధనలు చెవి కెక్కించుకుని భిక్షువులను చెరసాలల పాలు చేస్తాడు. రాజుగారి తల్లి గౌతమి, కోడలు వాసిష్టి భిక్షువులకు విముక్తి కలిగిస్తారు. 'నా రాజ్యంలో నా మతం మినహా మరేదీ ఉండేందుకు నేను సహించను' అని అహంకరించే పుత్రుడిని మందలించే సందర్భంలో తల్లి గౌతమి చెప్పిన మాటలు పాలకులంతా  గుర్తుంచుకో దగినవి. 'ఇంత సువిశాలమైన భూమి మీద ఒకటే మతం, ఒకటే జాతి, ఒకటే లక్ష్యం అంటే అసలు సాధ్యమవుతుందా?శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరమత అసహనం ఏ పాలకులకూ మేలు చేయదు' . ఇప్పటి మన సమాజానికీ..ప్రభుత్వాలకీ కూడా వర్తించే మంచి మాటలు ఇవి.

మతానికి సామాహిక స్పర్శ ఉన్నంత మేరా ప్రభుత్వాలు ప్రమేయం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. అంతకుమించిన జోక్యం చేసుకుంటే మాత్రం  రాజ్యం సంక్షోభాల పాలయి.. శాంతిభద్రతలకు  విఘాతం కలిగి అవసరమైన అభివృద్ధి కుంటుబడుతుంద'న్న బాధతోనే బొమ్మ ఏడ్చించిందని రచయిత ప్రతీకాత్మకంగా(సింబాలిక్) సూచించాడనిపిస్తుంది.   హెచ్చరిక పెడచెవిన పెట్టేందుకు లేదు. 'అధికార విస్తరణ కాంక్షతో నిరపరాధుల్ని శిక్షించ బూనుకున్నా ధర్మం నశించి మనుషులకే కాదు.. రాతి బొమ్మలకూ రోగాలూ.. రొష్టులూ తప్పవ'ని రాజమాత గౌతమి చేత చెప్పించడం అతిశయోక్తి అనిపించినా.. చేదు వాస్తవం కఠినహృదయాలకు ఎక్కాలంటే ఈ మాత్రం సాహిత్య సాముగరిడీలు చేయక తప్పదు. తప్పు కాదు.హత్తుకునేటట్లు చెప్పడమే ముఖ్యం. ఒక సంభాషణ మధ్యలో ఆచార్య నాగార్జునుడి ద్వారా రచయిత చెప్పించిన సందేశం ఈ నాటకానికి ఇప్పటికీ ప్రాశస్త్యం ఉండేటట్లు చేసింది. 'ఆ బొమ్మ(ధర్మ దేవత)మనుషుల మనసుల్లో మెదిలినంత కాలం లోక కళ్యానికి లోటు రాదు' అనేదే ఆ సందేశం.

ఆర్టికల్ 370ని గూర్చి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేటి సందర్బంలో ఆ బొమ్మ 'ఏడుపు' ఎవరూ విస్మరించరానిది.




డా॥ జి.వి.కృష్ణరావు (కృష్ణారావు కాదు)  హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, కూచిపూడి (అమృతలూరు) గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.

Tuesday, February 25, 2020

మీర జాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్!





శ్రీస్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా?  అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.

"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.

మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష!  "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
(సోర్స్ః కొత్తావకాయ బ్లాగ్)
అయితే ఈ 'మీర జాలగలడా నాయానతి/వ్రతవిధానమహిమన్ సత్యాపతి' పాట పుట్టుకను గురించి ఇదిగో స్థానం నరసింహారావుగారే స్వయంగా తన 'నటస్థానం' లోచెప్పిన ఈ ముక్కలు చదవండి.. ఆసక్తికరంగా ఉంటాయ్!
(సోర్స్ః ఆదివారం ఆంధ్రజ్యోతి- అనుబంధం మొదటి పేజీ- బహుళం -17 ఏప్రిల్ 2011 సంచిక నుంచి)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
25 -02 -2020

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...