Showing posts with label Old age. Show all posts
Showing posts with label Old age. Show all posts

Sunday, December 12, 2021

నేరాలు - శిక్షలు- కర్లపాలెం హనుమంతరావు


 

నేరం అంటే తప్పు. అపరాధం. సంఘ ప్రయోజనానికివ్యక్తి భద్రతకు ఉమ్మడిగా కొన్ని నీతి నియమాలు ఏర్పాటు చేసుకునే పద్ధతి  అన్ని కాలాలలోనూ ఉంది. ఆ కట్టుబాట్లను కాదని ప్రవర్తిస్తే సమాజం మొత్తానికే ముందు ముందు ముప్పు ఏర్పడే అవకాశం కద్దు. ఆ ప్రమాదం నివారించడం  కోసం గాను  'శిక్ష'లు ఏర్పడ్డాయి.  తప్పు చేసినవారిని దారిలో పెట్టడమే ప్రధానంగా 'శిక్షలుముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కొన్ని  సరిదిద్దుకోలేని పెను తప్పిదాలకు పెద్ద పెద్ద శిక్షలూ కద్దు. ఈ శిక్షలు నిర్ణయించే అధికారం గతంలో రుషులకు ఉండడం గమనించవచ్చు. మహితాత్ములు నిర్ణయించిన  శిక్షలు అమలు  చేసే బాధ్యత సాధారణంగా రాజ్యం శాంతిభద్రతలను  సురక్షితంగా పర్వవేక్షించడమే ధర్మంగా గల పాలకులకు ధఖలై ఉండేది.   ఆన్నికాలాలలోనే కాకుండా అన్ని లోకాలలలో కూడా  నేరాలు చేయడంవాటికి తగ్గట్లు  శిక్షలు విధించి అమలు చేయబడడం గమనించవచ్చు. 

 

తెలుగువాళ్ళు పవిత్రంగా భావించే భాగవతంలో ఉపాఖ్యానల ద్వారా ఈ కొన్ని శిక్షలు.. అవి అమలు జరిగిన తీరు  స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.

భాగవతంలో శిక్షలు ప్రధానంగా మూడు రూపాలలో కనిపిస్తాయి. స్వయంగా విధించుకునేవివేరేవారు విధించి అమలుచేసేవిశిక్షలు పడినా ఎన్నటికీ అమలుకాకుండా నిలబడిపోయినవీ.

సతీదేవి ప్రాణత్యాగం స్వయం శిక్షకు ఉదాహరణ. తండ్రి దక్షుడు యాగం చేసే సందర్భంలో అల్లుడైన రుద్రుడికి ఆహ్వానం అందదు. అయినా అతని భార్య దాక్షాయణి, 'పిలవని పేరంటానికి వెళితే అవమానాలు ఎదురయే అవకాశం ఉంద'ని భర్త హెచ్చరించినా 'తండ్రి ఇంటిలోని సంబరాలు తనయలు చూడాలి గదా! 'సర్వదిక్కులవారు కదిలి వెళ్ళే  యాగానికి  తానూ వెళ్లితీరాల'న్న మంకుపట్టుతో సహచరుడి తోడు లేకుండానే తరలివెళ్లింది. ఫలితం తీరని అవమానం. 'జలంబు ఆచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించిజితాసనయై భూమియందాసీనయగుచు యోగమార్గంబులో' చివరికి  ఆమె చేసిన శరీర త్యాగం భర్త ఆనతి మీరిన నేరానికి స్వయంగా విధించుకున్న శిక్ష. దేవుళ్లకు ఈగోలుఅలకలుకలతలు,దుఃఖాంతమైన కథలు ఉండటం అదొక వింత.

ఇకఇతరులు విధించే శిక్షల వ్యవహారానికొస్తే దేవతలురాక్షసులుమనుషులుమునీశ్వరులు  ఎవరు విధించే శిక్షలు వాళ్లవే.  

చిత్రకేతువు అనే విద్యధరాధిపతి ధర్మ సభలో ఈశ్వరుడి కౌగిట్లో ఉన్న గౌరిని చూసి ఆడవాళ్లు సభలలో నడుచుకొనే తీరు మీద చర్చపెట్టేశాడు. శివుడు చిరునవ్వుతో పోనిచ్చినా గౌరీదేవి గొప్ప అవమానం జరిగినట్లు క్రుద్ధురాలైంది. 'ఎగ్గుపల్కిన పాపాత్ముడెల్ల భంగి/దండనార్హుండు గాకెటు తలగగలడు'(6 -496)అని భావించింది. ఫలితం 'పాపపుస్వరూపమైన రాక్షసయోనిలో పుట్ట'మని శపించింది. తన కంటే అధికులను తప్పు పడితే నేరమని గౌరమ్మ  భావం. ఇంకెవరూ ఆ పని చెయ్యకుండా భయపడేందుకు చిత్రకేతువుకు అంతలావు శిక్ష. 

విష్ణుద్వేషులైన రాక్షస జాతిలో పద్దస్తమానం హరినామ జపం పారాయణం చేసే పసికొడుకును ప్రారంభంలొ చదువు సాములకు పెట్టి దారికి తెచ్చుకోవాలని చూశాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ నుంచి బైట పడకపోగా తనకే నీతిపన్నాలు చెప్పడంలో రాటుదేలిన ప్రహ్లాదుణ్ని 'ముంచితి వార్ధులం గదల- మొత్తితి శైల తటంబులందు ద్రొ/బ్బించితి శస్త్రరాణి  పొడి- పించితి మీద విభేంద్రపంక్తిద్రొ/క్కించితి ధిక్కరించితి శ-పించితి ఘోరదవాగ్నులందు ద్రో/యించితి పెక్కు పాట్లనల-యించితి చావడిదేమి చిత్రమో!అన్న పద్యంలో రాక్షసరాజే  చెప్పుకున్నట్లు ఒకటిరెండు కాదు వరస బెట్టి శిక్షల మీద శిక్షలు విధించేశాడు. 

కంసమహారాజు బాలకృష్ణుణ్ణి వెదికి మరీ శిక్షలు విధించడం మానవమాత్రులు విధించే శిక్షలు ఎంత విచిత్రమైన పద్ధతుల్లో ఉంటాయో అర్థమవుంది. వత్సాసురబకాసుర,  అఘాసుర ధేనుకాసురల్లాంటి దుష్టరాక్షసులను  ఒకళ్ల తరువాత ఒకళ్ళను చంపమని పంపటానికి కృష్ణుడు చేసిన తప్పిదాలేమీ లేవు. తనకు ప్రాణాపాయం ఉందని కంసుడు తలపెట్టిన  దుష్కృత్యాలు ఇవన్నీ!

సనకసనందాదులు జయవిజయులకు ఇచ్చిన దండనలు మునులు ఆచరించే శిక్షల జాబితాలోకి వస్తాయి. వైకుంఠ ద్వారాలకు పహరా పనిలో ఉండే జయవిజయులు స్వామి దర్శనార్థ వచ్చేవారి వివరాల  జోలికి  పోకుండా మొండిగా అడ్డుపడుతున్నందుకు పడ్డ ఆ శిక్ష. విఐపి ల ఆఫీసులకు కాపలాలు కాసే డవాలా బంట్రోతులదే సగం పెత్తనంగా సాగుతున్న ఈ కాలంలో జయవిజయుల ఉదంతానికి సమకాలీన ప్రాధాన్యత కద్దు. గేటుకు కాపలా కాసే వాళ్లు అగంతుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో తెలియజేసే కథ. 

అరాచక పాలన ద్వారా తోటి వాళ్లందరినీ పిల్లలాట కింద హింస పెట్టే వేనుడి కథ అయితే ఇప్పటి కాలానికి ఎంతో మందికి నిజానికి గుణపాఠం కావాల్సుంది. విజ్ఞులు ఎంత చెప్పినాఎన్ని విధాల నచ్చచెప్పినా నీచబుద్ధి వదలని ఆ పాలకుడు చివరకు ఆ మునుల చేతనే శిక్షకు గురవుతాడు. 

శిక్షించే విధనాలు చాలా రకాలు. 'బావా! రమ్మని బరనగవు నగుచువీనిం బట్టి బంధించి గడ్డంబును/మీసంబునుం దలయును   గొరిగి విరూపిం '(10 -146) చేసిన రుక్మిణీవల్లభుడి రుక్మి శిక్షావిధానం కాయక విధానం. ఇప్పుడూ మళ్లా అమల్లోకి వస్తే ఎన్ని పరువు హత్యలు తగ్గి సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందో .. ఊహించదం కష్టం.

కానీ దురదృష్ణ కొద్ది.. కొన్ని సందర్భాలలో తప్పు ఒకరు చేస్తే.. శిక్ష వేరేవాళ్లకు పడడం ఇప్పట్లా భాగవత కాలంలోనూ కద్దు. చిత్రకేతువు అనే రాజు అంగిరసుడు అనే ఋషి ప్రసాదించిన సంతానఫలం కృతద్యుతి అనే భార్య ఒక్క  దానికే ఇవ్వడం సాటి సవతులలో అసూయను రగలాడినికి కారణం అవుతుంది. కృతద్యుతి  కడుపున కాసిన ఆ కాయ మీదనే మహారాజు ధ్యాసంతా. కడుపు రగిలిన సవతులు పసిబిడ్డకు విషమిచ్చి చంపేస్తారు. మహారాజు పక్షపాత నేరానికి పాపంపుణ్యం ఎరుగని పసిబిడ్డ ప్రాణాంతకైన శిక్షను అనుభవించడం ఘోరాతిఘోరం. పాలకులకు నిష్పక్షపాత బుద్ధి లేని పక్షంలో అమాయకులు అన్యాయంగా ఎట్లా శిక్షలకు గురువుతారో.. ఈ కాలంలోనూ అన్ని ప్రాంతాలలో వీపు చరిచి చెప్పేటంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయ్! 

బలి చక్రవర్తి రాజ్యభ్రష్టత్వం  ప్రహ్లాదుడి వాచా దండన ఫలితం.  రాజ్యపాలన కొచ్చిన తరువాత రాక్షసలోకంలో మంచి మార్పులు సంభవించి లక్షీదేవి తన పరివారంతో సహా బలి చక్రవర్తి రాజ్యంలో మాకాం వేయడం నచ్చని దేవతలు అదితిని ప్రార్థిస్తే ఆమె విష్ణువుని ఈ సంకటం నుంచి కాపాడమని కోరుకున్నది. బలిని పాతాళానికు పంపితే గాని రాక్షసులు తిరిగి రాక్షసులుగా మారి లక్ష్మీ పరివారం వైకుంఠం చేరదని గ్రహించిన విష్ణువు అదితి గర్భలో ప్ర్రవేశిస్తాడు. అనుమానంతో  చేసిన విచారణల  మూలకంగా జరిగింది తెలుసుకుని కర్తవ్యబోధనకు ఆశ్రయించిన మీదట జరిగిందంతా చెప్పి విష్ణువుకు లొంగిపొమని ప్రహ్లాదుడు బలికి హితవు చెపుతాడు. రాక్షసులను తిరిగి దుర్మార్గులుగా మార్చుకుంటానన్న బలి మాటలకు కోపించిన ప్రహ్లాదుడు శపించిన మీదటనే బలి  రాజ్యభ్రష్టత్వం  కథ కొనసాగింది. ప్రహ్లాదుడు బలికి విధించిన శిక్ష 'వాచా దండనఅయితే బలి చేసిన నేరం హిరణ్యకశిపుడి వంటి వారి చరిత్ర వినీ గుణపాఠాలు నేర్చుకోకపోవడం. 

ఎంతటి మహామహుమహులైనా ఎప్పుడో ఓకసారి తప్పుదారిలో నడిచి శిక్షలు అనుభవిస్తారన్న దానికి త్రిలోకాధిపతి కథే ఉదాహరణ.  తన కనుసన్నలలో ఉండే పుష్కలావర్త మేఘాలను ఎడతెరిపి లేకుండా కురిసి రేపల్లె వాడలను ముంచెత్తమని అజ్ఞాపిస్తాడో సందర్భంలొ అహంకరించి. అలకకు కారణం కృష్ణుడి పలుకులు విని తనకు ఏటేటా జరిపే వేడుకలు జరపకపోవడం. మేఘాల వర్షాలకు జడివానలు కురిసినా గోపాలబాలుడు గోవర్థన గిరిని చిటికెన వేలుతో పైకెత్తి పట్టుకొని ఆ ఛత్రఛాయల కింద లోకాలను కాపాడాడు. తన తప్పు తెలిసి వచ్చిన ఇంద్రుడు నా వంటి వెర్రివారిని/ శ్రీ వల్లభ! నీవు శాస్తి చేసితి వేనిం/గావరము మాని పెద్దల/త్రోవల జరుగుదురు బుద్ధి తోడుత నీశా!(10 -937) అని సాగిల పడ్డాడు ,  

- కర్లపాలెం హనుమంతరావు 

 

 

Saturday, September 19, 2020

వయోవృద్ధుల ఊత కర్ర- సాంకేతిక పరిజ్ఞానం -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ

 



వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. వయో వృద్ధుల జీవన ప్రమాణాలను పెరుగుతోన్న సాంకేతిక పరిజ్ఞానం  మెరుగుపరుస్తుందన్న మాట నిజం. ఆరంభంలో అలవాటు లేని అవుపాసనలా అనిపిస్తుంది; మాలిమి చేసుకున్న కొద్దీ వయసు వాటారే వృద్ధులకు  అదే ఊతకర్రకు మించి మంచి తోడు అవుతుంది.

గడచిన ఒకటిన్నర శతాబ్ద కాలంగా మానవ జీవనస్థితిగతుల్లో కనిపించే గణనీఉయమైన మెరుగుదల హర్షణీయం. అందుకు కారణం  పారిశుధ్యం పైన మునపటి కన్నా పెరిగిన శ్రద్ధ; అదనంగా నాణ్యమైన వైద్య సంరక్షణ.  మానవ  ఆయుర్దాయం  క్రమంగా పెరగడం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలలో కూడా ప్రస్ఫుటంగా కనిస్తుందిప్పుడు.

విశ్వవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలంలో  చెప్పుకోదగ్గ పెరుగుదల కొత్త శతాబ్దం నుండి ఆరంభయింది. 2016 మధ్య వరకు దొరుకుతున్న లెక్కల ప్రకారం ఈ పెరుగుదల ఐదు సంవత్సరాల ఐదు నెలలు. గత శతాబ్ది ’60 ల తరువాత నమోదైన  అత్యంత వేగవంతమైన పెరుగుదలలో ఇదే గరిష్టం. దేశ జాతీయ గణాంకాలు ఇంతకు మించి ఘనంగా మోతెక్కడం మరో విశేషం.  నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 రికార్డులు చూసుకుంటే, భారతదేశంలో ఆయుష్షు  ప్రమాణం ‘70-‘75లలో 49 సంవత్సరాల ఏడు నెలలుగా ఉంటే, అదే జీవితకాలం 2012-2016ల మధ్యలో  ఏకంగా 68.7 సంవత్సరాలకు ఎగబాకింది. ఇంత పెరుగుదల వల్ల  తేలిన పరిణామం ఏమిటంటే,    జాతీయ జనాభా మొత్తంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరగడం! ఇవాళ దేశ జనాభాలో వయోవృద్ధుల వాటా ఒక బలమైన స్వతంత్ర వర్గంగా తయారయింది.  సమాజంలోని ముఖ్యాంగాలలో ఒకటిగా లెక్కించక తప్పని పరిస్థితి కల్పించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానమూ  అనూహ్యమైన వేగంతో అభివృద్ధి పథంలో  దూసుకురావడం..  అదృష్టం.

 

ఆధునిక సాంకేతిక జ్ఞానం సాయం లేకుండా  రోజువారీ దినచర్య క్షణం ముందుకు సాగని పరిస్థితులు ఇప్పడున్నవి. అంతర్జాల పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చేసే ఉపకరణలు(యాప్స్)  ఉనికిలో లేనట్లయితే ప్రపంచానికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం కష్టమే! సాంకేతికత సాయం వినా  కోవిడ్- 19 వంటి  మహమ్మారులు ఇప్పుడు సృష్టించే  లాక్-డౌన్లు, ఐసొలేషన్  ఉపద్రవాలను  ఏ విధంగా తట్టుకోవడం?

 

ఉత్పాతాలు ఒక్కటనే కాదు, మహమ్మారులు జడలు విదల్చని ముందు కాలంలో కూడా మనిషి జీవితంలో సాంకేతిక అనివార్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం ఆధారంగా మెరుగయ్యే  జీవనశైలి పైన మారుమూల పల్లెజీవి కూడా మోజుపడే తరుణం ఒకటుంది. అయినా సాంకేతిక రంగ సంబంధిత మార్కెట్  అన్ని రిస్కులు ఎందుకు ఎందుర్కొంటున్నట్లు? క్షణక్షణం మారే ఆ సాంకేతిక పరిజ్ఞానం సృష్టించే అనిశ్చిత వాతావరణమే అందుకు ప్రధాన కారణం.  రైడ్‌-ఆన్-కాల్  సౌకర్యం అందించే ఉపకరణలు ముమ్మరం అయిన తరువాత మధ్యతరగతివారి కార్ల కొనుగోళ్ల వాటా అథఃపాతాళానికి అణగిపోవడమే అందుకు ఉదాహరణ! వంటిఆరోగ్యం నుంచి ఇంటిపనుల వరకు అన్నింటా టెక్నాలజీ నీళ్లలో పాలలా కలగలసిపోయి ఉన్న నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం వయసు మళ్లినవాళ్లకు వాస్తవంగా ఒక గొప్ప వరం కావాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అందుకు విభిన్నంగా ఉన్నాయి. అదీ విచిత్రం!

 

గడప దాటి  కాలు బైటపెట్టలేని వయోవృద్ధులకు  కుటుంబ సభ్యుల నిరంతర సేవలు ఎల్లవేళలా  లభ్యమయ్యే కాలం కాదు ఇప్పటిది.  ఇంటి పట్టున ఒంటిగా మిగిలుండే వృద్ధులకు అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ నిజానికి ఎంతో అండగా ఉండాలి.  కానీ,  పాతకాలపు ఆలోచనలు ఒక పట్టాన  వదలుకోలేని ముసలివాళ్ల సంశయాత్మక మానసిక బలహీనత సాంకేతిక పరిజ్ఞాన పరిపూర్ణ  వినియోగానికి అవరోధంగా మారుతున్నది.   మొబైల్ అంటే కేవలం టెక్స్టింగ్ మాత్రం చేసుకునే ఓ చేతిఫోన్ సౌకర్యం.. అనుకునే తాతా అవ్వలే జాస్తిగా కనిపిస్తున్న పరిస్థితి ఇప్పటికీ. యాప్ లంటే కుర్రకారు ఆడుకుందుకు తయారయ్యే ఏదో ఫోన్ సరదాలని గట్టిగా నమ్మినంత కాలం టెక్ ఆధారిత  వేదికలను నమ్మి ఆమ్మమ్మలు, తాతయ్యలు గాడ్గెట్లను నిత్యజీవితావసరాలకు ధీమాగా వాడటం  కల్ల. వయసు పైబడినవారిలో  టెక్నాలజీ మీద ఉండే అపనమ్మకం ఎట్లా తొలగించాలన్నదే ఈనాటి టెక్ మార్కెట్లను తొలిచేస్తున్న ప్రధాన సమస్య. 

 

కాలిఫోర్నియా శాన్డియాగో విశ్వవిద్యాలయం ల్యాబ్ డిజైనర్  షెంగ్జీ వాంగ్ ఇటీవల వయసు వాటారిన వాళ్ల మీద సాంకేతిక పరిజ్ఞానం చూపించే ప్రభావాన్ని గురించి ఓ పరిశోధన పత్రం వెలువరించాడు.  పదే పదే ఎదురయ్యే పలు సందేహాలకు సులభంగా సమాధానాలు రాబట్టే సౌలభ్యం తెలీకనే సీనియర్ సిటిజన్లు సాధారణంగా కొత్త టెక్ అంటే చిరాకుపడతారన్నది  షెంగ్జీ వాంగ్  థియరీ. ఇటు ఉత్సుకత ఉన్న ముసలివాళ్లనైనా  ప్రోత్సహించనీయని చిక్కుముళ్లు అనేకం  పోగుపడటమే వృద్ధజనం ఆధునిక సాంకేతికత వాడకానికి ప్రధానమైన అడ్డంకి అని కూడా అతగాడు తేల్చేశాడు.

 

తరచుగా మారిపోయే అప్ డేట్స్, తత్సంబంధమైన మార్పులు చేర్పులు పెద్దవయసువారికి ఒక పట్టాన అర్థం కావు.    ఉదాహరణకు,  ‘బటన్స్’ ఒక క్రమంలో నొక్కి కోరుకున్న సేవలు పొందటం అలవాటు పడ్డ తరువాత, అవే సేవల  కోసం ఆవిష్కరించిన మరో కొత్త ‘బటన్ లెస్’ విధానం మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం వృద్ధుల దృష్టిలో  విసుగు పుట్టించే వృథా ప్రయాస. ఒక వయసు దాటినవారి మానసిక ఏకాగ్రతలో వచ్చే సహజ మార్పులను పరిగణనలోకి తీసుకోని పక్షంలో అధునాతన  విజ్ఞానం ఎంత ఘనంగా పురులు విప్పి ఆడినా పెద్దలకు ఆ భంగిమల వల్ల ఒనగూడే లాభాలు ఒట్టిపోయిన గోవు పొదుగు పిండిన చందమే.  గొప్ప సాంకేతిక విజయంగా నేటి తరం భావిస్తున్న స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పెద్దలను ఇప్పటికీ జయించలేని ఒక మాహా మాయామృగంగానే భయపెట్టేస్తోంది. కృష్ణారామా అనుకుంటూ ప్రశాంతంగా కాలం గడపే   వయసులో మొరటు మృగాలతో పోరాటాలంటే ఏ ముసలిమనిషికైనా ఉబలాటం  ఎందుకుంటుంది?!

 

పొద్దస్తమానం కొత్త కొత్త పాస్ వర్డ్స్ ఎన్నో పరిమితులకు లోబడి నిర్మిస్తేనే తప్ప  సేవలు అందించని యాప్ లు వయసు మళ్లినవాళ్ల దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క.  జ్ఞాపకశక్తి, నిర్మించే నైపుణ్యం సహజంగానే తరిగిపోయే ముసలివగ్గులకు ఈ తరహా పాస్ వర్డ్ ‘ఇంపోజిషన్స్’ శిక్ష దాటరాని ఆడ్డంకిగా తయారవుతున్నది. లాగిన్ కాకుండా ఏ సేవా లభించని నేపథ్యంలో అన్ని వెబ్ కాతాలకు ఒకే తరహా లాగిన్ ఉంటే  వృద్ధజనాలకు ఎక్కువ సౌలభ్యంగా ఉంటుంది. ఆ తరహా వెసులుబాటుకు గూగుల్ వంటి పోర్టల్సు ఒప్పుకుంటున్నా, సెక్యూరిటీ కారణాలు అవీ ఇవీ చెప్పి   చుక్కలు చూపించే అప్రమత్తత వాటిది. దిక్కులు చూస్తూ కూర్చునే దానికా    వేలు పోసి  స్మార్ట్ ఫోనులు పెద్దలు కొని ఒళ్లో పెట్టుకొనేదీ! ఎన్నో రకాల అంతర్జాల వేదికలు(ఇంటార్నెట్ ఫ్లాట్ ఫారమ్స్)! అంతకు వంద రెట్లు అయోమయ ఉపకరణలు(యాప్స్)! ఒక్కో  అంతర్జాల కాతా కు ఒక్కో తరహా నియమ నిబంధనలు! సాంకేతిక సంక్లిష్టత   కురుక్షేత్ర యుద్ధం నాటి అభిమన్యుడి సంకట స్థితి తెచ్చిపెడుతుంటే, తాజా టెక్నాలజీ వల్ల వృద్ధజనాలకు ఒనగూడే  ప్రయోజనం ఏమిటన్నది జవాబు దొరకని ప్రశ్నయింది. 

 

కొత్త టెక్నాలజీ హంగూ ఆర్భాటంగా రంగ ప్రవేశం చేసేది  ముసలితరంగా తమను  మరంత వంటరి చేసేందుకే అని పెద్దలు భావించడం మొదలయితే  నూతన సాంకేతిక పరిజ్ఞాన వికాసం మౌలిక లక్ష్యమే సమూలంగా దెబ్బతిన్నట్లు లెక్క.  కనీసం డబ్బు చింత లేని పెద్దవారికైనా..  ఆధునిక   సాధనాలతో   ఆ దివి  సదుపాయాలన్నీ భువి మీదకు  దింపుతామనే హామీ  అత్యాధునికమని చెప్పుకునే లేటెస్ట్ టెక్ నిలుపుకుంటుందా?  మనవళ్ల, మనవరాళ్ళ తరం మాదిరి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే కదా ఏ ఆధునిక  పరిజ్ఞానం వాడకం వైపుకైనా అవ్వాతాతల ఆసక్తులు రవ్వంతైనా మళ్లేది!  అట్లాగని సైబర్ నేరాలతో  రాజీపడిపొమ్మని కాదూ.. అర్థం.

 

తప్పేమన్నా జరిగిపోతుందేమోనన్న భయం  పెద్దవయస్కుల్లో  ఎక్కువ మందిని  స్మార్ట్ ఫోన్  రిస్క్ తీసుకోనివ్వడంలేదు. ఈ కాలంలో పసిపిల్లలు సైతం అతి సులువుగా  ఆడేస్తున్న  విసిఆర్ రిమోట్..  ముందు తరాన్ని విధంగానే మహా బెదరగొట్టింది. వాస్తవానికి టచ్,  వాయిస్ వంటి సదుపాయాలతో సీనియర్ సిటిజన్లు అద్భుతమైన సేవలు అందుకునే సౌలభ్యం మెండు. హై- టెక్’ అద్భుత దీపంతో  పని చేయించుకునే సులువు సూత్రం ముందు ముసలితరం అల్లావుద్దీన్ తరహాలో స్వాధీనపరుచుకోవాలి.  మొబైళ్లూ, యాప్ ల నిర్మాతలే, టి.వి అమ్మకాల పద్ధతిలో డోర్ స్టెప్ డెమో సర్వీసులు అందించైనా అందుకు పాతతరాన్ని  సిద్ధం చేసుకోవాలి. ఒకే రకం సేవలకు పది రకాల పరికరాలతో ముసలి మనసులను మయసభలుగా మార్చకుండా సీనియర్లే  తమ  అవసరాలు, అభిరుచులకు  తగ్గట్లుగా ప్రత్యేక ఉపకరణాలు  స్వంతంగా ఎంచుకునే తీరులో ఈ శిక్షణా పరంపరలు కొనసాగాలి. పాతతరానికి  కొత్త నైపుణ్యాలు నేర్పించడంలోనే ఆధునిక టెక్నాలజీ విజయ రహస్యమంతా ఇమిడి వుందన్నముఖ్య సూత్రం మరుగున పడటం వల్లే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధుల విషయంలో పేరుకు మాత్రమే కాళ్లున్నా కదలలేని కుర్చీలా కేవలం అలంకారప్రాయంగా ఆర్భాటం చేస్తున్నది.

ఖర్చులకు రొక్కం కావాలన్నా కాళ్లు పీకేటట్లు బ్యాంకుల ముందు పడిగాపులు తప్పని కాలం ఒకప్పడిది. తపాలా కార్యాలయానికి వెళ్లి కార్డు ముక్క గిలకనిదే   అయినవాళ్ల సమాచారం అందే  పరిస్థితి లేదు అప్పట్లో! మరి ఈ తరహా  తిప్పలన్నిటినీ తప్పించేటందుకే  నెట్ బ్యాంకింగొచ్చిందన్నారు; ఈ మెయిలింగొచ్చి గొప్ప మార్పులు తెచ్చిందన్నారు!   ఇంటి  కిరాణా సరుకు నుంచి బైటకు వెళ్ల దలిస్తే  కావలసిన రవాణా సౌకర్యం వరకు,  సమస్త సర్వీసులు దబాయించి నొక్కే బటన్ కిందనే దాగి ఉండే స్మార్ట్ ఫోన్ సీజన్లో లోకం ఊగిపోతుందంటున్నారు! ఏమేమి సేవలు వచ్చాయో, ఎవరిని మెప్పించే ఏ మహా గొప్ప మార్పులు తెచ్చి ఊపేస్తున్నాయో!?  చురుకుపాలు తగ్గిన పెద్దవాళ్ల అవసరాల గొంగడి మాత్రం ఎక్కడ వేసింది అక్కదే పడి ఉందన్న అపవాదు మాత్రం తాజా టెక్నాలజీ మూటకట్టుకుంటున్న మాట  నిజం. ‘అయ్యో! ఐ-ఫోనుతో పనా ?  అయ్యేదా పొయ్యేదా నాయనా?’ అన్నముసిలివాళ్ల పాత  నసుగుడే  సర్వత్రా ఇప్పటికీ వినవస్తున్నదంటే.. లోపం ఎక్కడుందో లోతుగా తరచిచూసుకొనే తరుణం తన్నుకొచ్చిందనే అర్థం!   

వయసు మీద పడే కొద్దీ పంచేద్రియాల పటుత్వం  తగ్గడం సహజం. సౌలభ్యం ఒక్కటే  కాదు, పనిసులువూ పెద్దల దృష్టిలో అందుకే ప్రధానంగా ఉంటుంది! రవాణా, ఆరోగ్య సంరక్షణల వంటి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలలో పెద్దవయస్కులకు మద్దతు ఇచ్చే తేలికపాటి డిజైన్ల పైన దృష్టి పెట్టాలి. టచ్ బటన్ టెక్నాలజీలో గొప్ప సేవాభావం ఉంటే ఉండవచ్చు. కానీ, ముందుతరం అతి కష్టం మీద అలవాటు పడ్డబటన్సిస్టమ్  పూర్తిగా తొలగిస్తే ఎంతస్మార్ట్అయివుండీ పెద్దలకు వనగూడే ప్రయోజనం మళ్లీ ప్రశ్నార్థకమే అవుతుంది కదా! విసిగించకుండా, కంటిని, వంటిని అతిగా  శ్రమపెట్టకుండా సేవలు  అందించే ఉపకరణాలు  ఉపయోగంలోకి  తెచ్చినప్పుడే సీనియర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద మోజు మొదలయేది. వాడకం  పెరిగేది. కోరకుండానే సాయానికి రావడం, ఆపరేషన్ పరంగా తప్పు జరిగినా ఆంతర్యం గ్రహించి సేవలు చేయడం, వేళకు మందులు మాకులు, తిండి తిప్పల వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండి ఆత్మీయంగా సేవలు అందించడం వంటి సామాజిక కార్యకర్తల బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులను మించి శ్రద్ధగా నిర్వహించే  సాంకేతిక పరిజ్ఞానం సాకారమయిన రోజే  సినియర్ సిటిజన్ల మార్కెట్టూ స్మార్ట్ టెక్నాలజీ రంగం బ్యాలెన్స్ షీటులో క్రెడిట్ సైడుకు వచ్చిపడేది.    వయసు వాటారిన వారి స్మార్ట్ టెక్నాలజీ వాటా  మార్కెట్లో మరంత పుంజుకున్నప్పుడే అటు సీనియర్ సిటిజన్ల సంక్షేమం, ఇటు ఆర్థిక రంగ పునరుజ్జీవం  సమాంతరంగా ముందుకుసాగేది.

వృద్ధాప్యానికి మద్దతు ఇచ్చే బాధ్యత సమాజం మొత్తానిది. మొబైల్ కంపెనీలు ముసలివారి ప్రత్యేక అవసరాల కోసం ఉపకరణలు తయారు చేయడమే కాదు, అదనంగా ధరవరలలోనూ ప్రత్యేక రాయితీలు కల్పించాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా  నిర్దిష్ట ప్రచారాలను ముమ్మరం చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి.  సరసమైన ధరకు నాణ్యమైన వైఫై అంతరాయం లేకుండా అందుబాటులో ఉన్నప్పుడే  పెద్దవయసువారి అడుగులు ప్రధాన సాంకేతిక స్రవంతి వైపుకు నిమ్మళంగా పడే అవకాశం.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు దాదాపు విచ్ఛిన్న దశకు చేరి దశాబ్ద కాలం దాటిపోయిన మన దేశంలో పెద్దవయస్కుల  పట్ల పిన్నవారి ప్రేమానురాగాల ప్రదర్శనల్లోనూ పెనుమార్పులు తప్పటంలేదు. కాలం తెచ్చే మార్పులను మనస్ఫూర్తిగా అంగీకరించడం మినహా మరో ఐచ్ఛికం లేని నేపథ్యంలో.. సమాజం తీరును   వేలెత్తి చూపే కన్నా    వేలు కింది బటన్ నొక్కడం ద్వారా  కుటుంబానికి మించి  సమాజం అందించే సేవా సౌకర్యాలు అనుభవించడమే కుటుంబాలలోని పెద్దలకూ మేలు. వృత్తి వత్తిళ్ల మధ్యనే  వీలయినంత శ్రద్ధ తీసుకుని కన్నబిడ్డలు, దగ్గరి బంధువులే ఇంటిపెద్దలను నవీన టెక్నాలజీకి దగ్గర చేయడం తక్షణావసరం.

***

--కర్లపాలెం హనుమంతరావు






 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...