Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

Sunday, December 12, 2021

; నిర్వచనం -నిర్వహణ - కర్లపాలెం హనుమంతరావు



సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపుకు అవసరమయిన   సహజచర్యలు. మానవేతర జంతుజాలం తమ వంటి  జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషికి అదనం. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలు కూడా చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికే ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం 'సృజన' అని అనుకుంటున్నాం. ఆ ప్రజ్జ్ఞ గలవారిని  సృజనశీలురుగా గుర్తిస్తున్నాం. స్రష్టలు అని పేరు పెట్టుకుని గౌరవించుకుంటున్నాం.

కళాకారులందరూ స్రష్టలే. స్రష్టలు కన్నా  ముందు మనుషులు కూడా. మనుషులందరూ కళాకారులు కారు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలో కళంటూఏదో  ఒకటి దాగుండక పోదు గానీ..ఆ పిసరంత  కళయినా  బహిర్గతమైనప్పుడే అతనికి అంతో ఇంతో   కళాకారుడిగా సమాజంలో   గుర్తింపొచ్చేది. 

సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఉనికి’ (Cogito ergo sum) పేరుతో ఓ సిద్ధాంత తయారుచేశాడు. దాని ప్రకారం మనిషి సృజనశీలి అయినా .. ఆ సృజనకు పొదుగు అనేది అతని 'బుద్ధి'నుంచి పుట్టుకురావాల్సిందే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం కూడా దాన్నే సమర్థిస్తున్నది.  

నేను అంటూ   ఒకడిని భౌతికంగా ఉండబట్టే కదా నాది అంటూ ఒక ఆలోచన ఉండే అవకాశం. ఉనికి వాదం (I exist.. therefore I think)  మనిషిని  బుద్ది విశిష్టుడిగా  కన్నా ముందుగా సృజనశీలిగా గుర్తిస్తుంది. ఇద్ది దాదాపుగా  జెన్ తత్త్వమే. మన  భారతీయుల భక్తి యోగాలకు కూడా ఈ ఉనికివాదనతోనే చుట్టరికం. 

హేతువు కన్నా  ముందు   అనుభూతికే మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకిలా? అంటే .. ఏమో ఇదో అంతుబట్టని రహస్యం అంటున్నారు ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా  ఉండే వేదాంతులంతా.  కానీ సృజన విషయం  అట్లా కాదు. స్థూలంగా  ఒక అభిప్రాయానికి రావడం కొంత సులభమే!  శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండిక తరహాలో  కవితాత్మకంగా చెప్పుకోవాలంటే   సృజన ‘సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి- డాంధకార నిర్జన వీధికాంతరముల- నా చరించెడు వేళ-  ప్రోన్మత్త రీతి  అవశమొనరించు దివ్యతేజోనుభూతి’. ఇది స్వీయానుభూతి. ఆ అనుభూతినే ఎదుటివాళ్లకు ప్రసారం చెయ్యాలంటే?

లేనిదాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని, చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందేటట్లు చెయ్యడం, వగైరా ట్రిక్కులతో ఇది సాధ్యం.  అయితే ఇక్కడ ఒక ప్రమాదం కద్దు. ‘సరసియై చల్లనై నన్ను జలకమార్చె' అంటూ మహాకవి శ్రీశ్రీ తరహాలో కొత్తగా ఏదన్న సృజనాత్మకంగా చెప్పబోతే కొంత మంది ' ఆ సరసి ఎవరు? ఎక్కడుంటుంది? చిరునామా ఏంటి?' అని విచారణలకు దిగవచ్చు. శుద్ధ లౌకికులకు అంతుపట్టని అనేక లక్షణాలు సృజనాత్మక అంశంలో దాగుంటాయి. అవి అర్థం కాక తలపట్టుకునే ఇహలోక చింతకులకు మాత్రమే సృజన ఒక పనికిమాలిన దండుగ వ్యవహారం. నిజంగా సృజన ఒక దండగ వ్యవహారమా? 

ఆహర, నిద్ర, మైథునాధులే కాదు విరామం కూడా నిరంతరాయంగా అనుభవించలేడు మనిషి. వద్దంటే డబ్బు సినిమాలో ప్రారంభంలో పేదరికంతో అష్టకష్టాలు పడ్డ కథానాయకుడు ఒక దశ నుంచి దశ తిరిగి వద్దన్నా డబ్బు వచ్చి పడుతున్నప్పుడు రూపాయి బిళ్లను చూసి బెదిరిపోతాడు. మనిషి చపలచిత్తం మీద వ్యంగ్యాస్త్రాలు సంధించనట్లున్నా ఆ చలన చిత్రం మనిషిలోని కుదురులేని వైనాన్ని కళ్లకుకట్టిస్తుంది. నిశ్శబ్దం ఉండలేక  విసుగెత్తినప్పుడు మనిషి అందుకే శబ్దాన్ని సృష్టించుకుంది. శబ్దంతో మనసు సంక్షుభితమయినప్పుడు  సాంత్వన కోసం  ముక్కూ, మూతీ మూసుకున్ని కూర్చున్నదీ  అందుకే.   ఆ ప్రత్యేక శబ్దాలను  కవిత్వం  ఈ విశిష్ట నిశ్శబ్దాన్ని యోగాసనాలని   ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ ఆవిష్కరించుకుని  నృత్యం పేరుతో సొంతలోకంలో విహరిస్తాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.


అస్తిత్వ సిద్దాంతం  పైపై చూపులకి -  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్,  బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్ర౦ నిర్థారించిన సత్యం.

కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలను నిర్లక్ష్యం చేసి  ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడు ! ఎందుకు ?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడి నుంచి  ముక్తి పొందటానికి ఇలా    ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.


కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరు  ఎందుకు ఎంత  తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. 


అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్ఛన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్ల, అనుకూల పరిస్తితుల చలవ చేత , శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు సమాజంలో మన మధ్యనే  సదా  సంచరిస్తుంటారు’అనేది ఆయన వాదం. కాదనలే౦ కదా!


ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా.. సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లో వలె బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతనను ఎంత   మాత్రం  ప్రభావితం చేయలేవు.  సందు చూసుకుని  మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది. చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేయడం ఇందుకు ఉదాహరణ. 


కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానపు దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చని  చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..

‘ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు

పక్షపాతపు రచనల పస నశించె

రసికులకు మీ చరిత్ర విసువు దోచె

పరువుగా నింతట బ్రబంధపురుషులార!

కదలిపొం డెటకైనను..మీకు

నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.


అట్లాగని  లోకమంతా  ఆషాఢభూతుల బంధుగణంలో  నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చేసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.


సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలూ .. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  సృజన నిత్య నూతన వికాసం.  సాయంగా  .. సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత. కళాజ్యోతుల నిజ జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడు కూడా అయితే సమాజానికి సదా ఆదర్శప్రాయుడమతాడు.

 చిత్తశుద్ధితో నమ్మిన జీవన ఉదాత్త సూత్రాలను  ఆచరించి చూపించిన కళావైతాళికుల చరిత్రలో మనకు ఎందరో కనపడతారు. వారి  అడుగుజాడల్లో నడవడానికి కళాకారులకు .. కవులకు ఎవరడ్డొస్తున్నట్లు?


‘నడవడకయ నడచివచ్చితి

నడచిన నే నడచిరాను నడచెడునటులన్

నడిపింప నడవనేరను

నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’అంటూ సృజన  మూర్తే కవి ,కళాకారుడి నడవడికకు  తానెంతగా ప్రాధాన్యత  ఇస్తుందో స్వయంగా వెల్లడించింది. 


పరిసరాల ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నా స్వయంప్రతిభతో  ఆ సృజనమ్మ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేసుకోవడం కళాకారుడి  చేతుల్లోనే ఉంది. అవే చేతులతో సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవటం కూడా సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువు . 

***


- కర్లపాలెం హనుమంతరావు 


ఉల్లాసరసం- కర్లపాలెం హనుమంతరామ


 గోచిపాత సంరక్షణార్థం సంసారమనే గోదారిలో దూకి ఈదలేక ఇడుములు పడ్డ వెర్రిబాపడి కథ చెవినబడినంతనే చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి పెదాల మీద ముందుగా  విరిసేవి మందహాస అరవిందాలే! 'పరిహాస ప్రసంగం’లేని వాక్యా'న్ని ప్రాచీనసాహిత్యమూ నిరసించింది. సంహితలనుంచి, బ్రాహ్మణకాలు. ఆరణ్యకాలవరకు వైదిక వాఙ్మయం నిండా ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. శ్రీ లలితాదేవి సౌందర్యవర్ణన సందర్భంగా పరమేశ్వరీదేవిని 'మందస్మిత  ప్రభాపూరమజ్జత్కామేశ మానస'గా అభివర్ణిస్తుంది  బ్రహ్మాండపురాణం..  హయగ్రీవాగస్త్య సంవాదం. శాస్త్రాలు, పురాణాలు ప్రసక్తానుప్రసక్తంగా చేసే ధర్మప్రబొధాలకు, నీతిప్రవచనాలకు సైతం చమత్కారం పై పూతగా గల   వృత్తాంతాలే ఉపరి బలం. హాసాన్ని హాస్యరసానికి స్థాయీభావంగా భావిస్తుంది ఆలంకారశాస్త్రం. అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో సైతం చెక్కుచెదరని ఆస్వాదయోగ్య స్థితి కలిగి ఉండటమే స్థాయీభావ లక్షణం.  నవరసాలలో శృంగార హాస్యరసాలకే ఈ స్థాయి ఉందని ‘ధ్వన్యాలోకం’ సూత్రీకరిస్తుంది. అందులో హాసరసానికి అగ్రతాంబూలమని ఆనందవర్థనుడి నొక్కిచెప్పాడు. 'రుద్రయశోభూషణం'కర్త విద్యానాథుడు  కృతక పలుకుబళ్ళకు, వేషభాషాదులకు హాసరస గౌరవం కల్పించినా.. అత్యాధునికత  ఆ తరగతిని నీచహాస్యం కింద 'ఛీ'కొడుతోంది. నేటిమనిషి తన స్వారస్య అవసరాలకు అనుగుణంగా హాసరసానికి ఎన్నో సగుణాత్మకమైన మార్పులు చేసుకొంటున్నాడు. మన తరందాకా ఎందుకు?  మద్యలో వచ్చిన ఆలంకారికుడు శారఙ దేవుడే నవ్వును 'ఆత్మీయం.. పరకీయం' అంటూ రెండుగా  విభజించాడు! లక్ష్య లక్షణాల చర్చలకు ఏముందిగానీ.. నవ్వొచ్చినప్పుడు లక్షణంగా నవ్వేసెయ్యడమే ఉత్తమ సంస్కారుల ముఖ్య లక్షణం. లక్షలు కోట్లు వెచ్చించినా దక్కని సౌభాగ్యం, ఆరోగ్యం ఉచితంగా పంచి పెట్టే హాస్యస్ఫూర్తిని ఒడిసిపడితే చాలు.. జీవితాంతం ప్రాణానికి తెరిపి.



 
మన ప్రాచీన కావ్యవాజ్ఞ్మయం సర్వస్వం ఈ దివ్యస్వారస్వ రసాధిదేవతకు  పట్టిన మంగళహారతి. శృంగార, హాస్యాలు ఆదిమకాలం నుంచి మానవజాతికి దగ్గరి బంధువులే.  హాస్యంతో చుట్టరికమయితే మరీ గట్టిది. 
ఆదికావ్యం రామాయణం నిండా ఉల్లాసభరితమైన  హాస్యోపకాండలే! 'రాముడి వద్దకు మిమ్ము నేరుగా మోసుకుపోతా'నంటూ అంగుష్ఠ రూపి ఆంజనేయుడి విన్నపం అంతశోకంలోనూ అశోకవనం సీతమ్మవారి నోట నవ్వుల పువ్వులు విరబూయిస్తుంది. 'నా యొడలు సేర్చినప్పుడు/ నీ యొడలెట్లగునొ దాని నీవెరిగెదు' వంటూ తిక్కన భాగపు భారతం నర్తనశాలఘట్టంలో సైరంద్రీవేషధారి భీముడిచ్చిన  హెచ్చరికలేవీ కీచకుడికి దుర్బుద్దికి ఆనవు కానీ..  ఆ కాముకుడికి ముందు ముందు పట్టబోయే పిడిగుద్దుల వడ్డింపులు ఊహకు తట్టి ఫెటేల్మంటూ చదువరుల పెదవులు విచ్చకుంటాయి! 
'నవ్వవు జంతువుల్' అని జాషువావంటి కవులెంతమంది అంటే ఏమిటిట! పశుపక్ష్యాదులతో, జంతుజాలంతో హాస్యప్రసంగాలు చేయించిన సరసహృదయం మనిషిది. ఓడి పాతాళంలొ పడివున్నా తనముందు దంభం ప్రదర్శించేటందుకు దేవేంద్రుడు పడ్డ పాట్లు చూసి గాడిద రూపంలో ఉండీ బలి పడీపడీ నవ్వేస్తాడు విష్ణుపురాణంలో. ఆనందరసాస్వాదన పైన గాడిదలకూ అంత  ప్రేముంటుంది మరి! 
రూపకాలలో వసంతకులు, ప్రహసనాలలో వికారులు, ఆస్థానాలలో విదూషకులు,  వినోదాలలో కేతిగాళ్ళు, ఆటపాటలలో వంతలు, జంతు ప్రదర్శనల్లో వింత   బఫూన్లు, చలనచిత్రాలల్లో హాస్యగాళ్ళు.. పప్పులో ఉప్పులు,, పాయసాన జీడిపప్పులు.  హాస్యరసం  అంతర్లీనంగా ప్రవహించని పక్షంలో  కరుణరసమే పరమ నీరసంగా ఈసడింపుల పాలవుతున్న  అభావయుగం ప్రస్తుతం నడుస్తున్నది. విరామమెరుగని వత్తిడి బతుకులకు హాస్యమే శ్రీరామ రక్ష అయిందిప్పుడు. 
వెన్నదొంగ కన్నయ్యను కన్నంలోనే పట్టేసుకుంటుంది భాగవతంలో యశోదమ్మ. 'వీరెవ్వరు శ్రీకృష్ణులు/ గారా! యెన్నడును వెన్నగానరట కదా!/చోరత్వం బించుకయును/ నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!'  అంటూ ఆ తల్లి చేత  తన  పట్టిని ఆటలు పట్తించి  మన మానసాలకు ఉల్లాసం కలిగిస్తాడు బమ్మెర పోతన! చలనచిత్ర దర్శకులు జంధ్యాల అన్నట్లు నవ్వడం ఈనాటి వత్తిళ్ల యుగంలో నిజంగా ఓ భోగమే. ఆవైభోగాన్ని ఉదారంగా జనావళికి పంచిపెట్టే  పోతన్నల వంటి అక్షరయోగులందరికీ అందుకే నిండు మనస్సుతో నమస్సుమాంజలులు అందించడం న్యాయం. 
నవ్వించడం ఓ యోగమయితే నవ్వులపాలయీ నలుగురితో కలిసి నవ్విపారేయడం మరింత ఉత్తమ యాగం!  'తమ్ము ఇతరులు పరిహసించి తమలోని తప్పులని బైటపెట్టినప్పుడు తమ తలనున్న బంగారు కిరీటం కిందపడునన్న దిగులు ఆ నాటి వారికి లేదు' అంటారు తెనాలి రామకృష్ణుని హాస్యాన్ని పరామర్శించే సందర్భంలో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. 'గ్రామము చేతనుండి, పరికల్పిత ధాన్యములింటనుండి శ్రీ /రామ కటాక్ష వీక్షణ పరంపరచె  గడతేరెగాక మా/ రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చునా/స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్'అంటూ శ్రీనాథకవి తాటికాయలంతేసి అన్నం ముద్దలు  ఆరగించే తన భోజన పరాక్రమం పైన కవిత్వం వెలగబెట్టినప్పుడు కించిత్తైనా కోపం తెచ్చుకోలేదుట  రామయమంత్రివర్య్లలు!  అంతులేని పెత్తనాలు  ప్రభుత్వ పరంగా చేతుల్లో ఉండీ  నోరారా నవ్వుకొనే హాస్యస్ఫూర్తిని మాత్రమే ప్రదర్శించారా పాలకులు.  ఆ సామరస్య సహనమే  నేటి నేతలకూ  తక్షణం నెత్తిన పెట్టుకోదగ్గ సులక్షణం.   పాలనలో లోపాలు రామరాజ్యంలోనే తప్పింది కాదు. పాలితులు నేరుగా కుపాలనను వేలెత్తి చూపలేని నిస్సహాయ స్థితుల్లో..  ప్రజాహితం కోరే బుద్ధిజీవులు ఏ కొందరో  హాస్యాన్ని.. వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ‘మహిష శతకం’ కాలంనుంచీ నడిచివస్తున్న ఈ నిరసన సంప్రదాయం. స్వీయవ్యక్తిత్వాన్ని ప్రశ్నించడంగా పాలకులు అపార్థం చేసుకోవద్దని హితవు చెప్పడమే ఈ  పాఠం ఉద్దేశమిక్కడ.  
విమర్శా  మల్లెపూల చెండుతో మోదినంత   సున్నితంగా  ఉంటేనే బావుంటుంది. శ్రీ శ్రీ సింధూరం మార్కు నవగీతం  జరుక్ శాస్త్రి 'మాగాయ, కందిపచ్చడి' కిందలాగా మారినప్పుడే పకాల్మని నవ్వొచ్చేది.  
'హాస్యమంటే చల్లని మంట' అంటాడు ఆస్కార్ వైల్డ్. గ్రీకుల నిర్వచనం ప్రకారమూ 'హ్యూమర్' పొడి తేమకు పర్యాయపదం. కళ్లను తడిపి.. గుండెను కుదిపి వత్తిళ్లనుంచి తెరిపిన పడవేసేదే ఉత్తమ హాస్య 'థెరపీ'. ఉత్తర రామాయణ నుంచి.. నేటి పత్రికల 'ఉత్తరాల కాలా'ల దాకా సర్వే సర్వత్రా సర్వమానవాళి ఆమోదం పొందుతున్నది   నిత్య జీవిత గత్తర్ల నుంచి  కనీసం ఒక్క క్షణం పాటైనా ఉపశమనమం కలిగించే  ఉల్లాసరసమే! 
-కర్లపాలెం హనుమంతరావు

Tuesday, June 15, 2021

వెలుగుదారి - ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)

 



కాలమనే కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో/ ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది. 'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింతపండు ధర హెచ్చింది/ చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది'. ఇలా, నిద్రనుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కాసేపైనా గోర్వంకల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కలగలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు?' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్త్తెన శిఖరాల్నీ వూహల్లో త్రుటిలో లేపేయగల చేవ సృష్టిమొత్తంలో ఉంది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతా గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమార్ ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! 'నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను' తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే! ఉషాకాంతుల వంటి బంగరు వూహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం- మనిషి నిత్య ఆశావాది కావడమే!

 

ఆదిమానవుణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మనిషికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవని' మనిషి కనే కల వయసు మనిషి పుట్టుకంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ వూరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుందా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి. గతానుభవాలతో నిమిత్తం లేదు- రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించే అలాంటి స్వభావమే మనిషిదీ. 'సకల యత్నముల నుత్సాహంబె మనుజు/ లకు సకలార్థ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. 'నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమిపని నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చు. రక్తి కలగాలంటే నాటకానికైనా ఆసక్తి రగిలించే అంశం అవసరమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు 'నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.

 

'వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతవడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్లకిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. భుజంతట్టి, లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత' లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. 'ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు/ పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపు ఏ తేడా లేకుండా 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొదటిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)


కాలమర్మం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సాహిత్య సంపాదకీయం .. 05:01:2014 నాటిది)


 'ఒక్కనాటి ప్రపంచము ఒక్కనాటి వలెకాదు/ ఒక్క నిమిషము వలెనొకటి గాదు-' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలవివేచన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు 'సూర్యుణ్ని ఉషాకన్యానాథుడి'గా ప్రస్తుతించాయి (రుగ్వే. 7 మం. 75 రుక్కు). బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్ధాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని. 'ద్వంద్వాన్ని సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత, తత్వవేత్త హక్స్‌లీ. మన శంకర భగవత్పాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నదీ ఇదే రహస్యం. 'అతీతాది వ్యవహార హేతుః' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు. కాలచింతనే మహా వింతైనది. భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధిస్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'ప్రారంభ సంపత్తికాధారం బెయ్యది?' అని సందేహపడితే... 'ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం?' అని ఆరుద్ర 'త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. 'మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని/ వూపిరి పోసుకున్న క్షణాన/ నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో' అనే మథన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తిరుగాడే నాటినుంచే వెంటాడుతోంది. కాలం- పదార్థం నాలుగో పరిమాణమన్న సాపేక్ష సిద్ధాంతం అర్థం కానంతకాలం కంటిముందు కాలంచేసే గారడి అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నలవరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం' మొదలు 'కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి దెప్పించడం' దాకా 'కాలమహత్తత్త్వంబు నిట్టిదనుచు వర్ణనము' చేయటం వశం కాదన్న బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ. కాలమర్మం అవగాహన కావాలంటే 'స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం' బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని, రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే. 'ఒక తరి సంతోషము, వే/రొక తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము' కూర్చే తలతిక్క కాలానిదని తూలనాడేదీ అందుకే. మనిషి కంఠశోషేగాని కాలానికేమన్నా కనికరం ఉంటుందా? 'కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ... ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా!' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా 'సౌందర్యస్పర్ధ'లో సుందరాంగుల అంగవిన్యాసమా? కాలం ఒక క్షణమైనా వెనక్కు చూడదు. ఏం సాధించాలనో ఈ నిబద్ధత?దువ్వూరివారు 'వనకుమారి'లో అన్నట్లు 'కష్టజీవి కన్నీటి కాల్వకైన గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు' కాలం. బోసిపాపల్ని నవ్వించడం, పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం... 'చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్ధులను దీర్ఘనిద్రకై దీవించడం'- కాలం ధర్మం.

అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం. నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. 'దైవరూపంబు కాలంబు దానికెపుడు/ లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి 'కల్యాణరాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ ...వృద్ధు కంట లేడిరీతి' పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పడానికి. 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌, ఐన్‌స్టీన్‌, లైబ్నిజ్‌. కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్‌.జి.వెల్స్‌ వూహ. అది వాస్తవమైతే ఎంత బాగుణ్ను! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. 'ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే' అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ' దృశ్యాన్ని కమనీయంగా పునర్వీక్షణ చేసి పులకించిపోవచ్చు. వూహకు అవధులు లేకపోవచ్చు. కాని దాన్ని భావించే బుద్ధికున్నాయిగా హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే? 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా../ అభివృద్ధీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి' అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా?' ఎక్కడ బయలుదేరిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో... ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్సరాలు. నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, గడవాల్సిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... బుద్ధిమంతులందరూ చేసే పనులు. చేయాల్సిన పనులు. కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సాహిత్య సంపాదకీయం ..05:01:2014 నాటిది)

Sunday, April 11, 2021

శతమానం భవతి… ( అభయ్) -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 



నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు  కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే  చాలు..  ఆ కాలాతీత జివిని  చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని   ప్రకృతి  శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే   వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!  

 కానీ గరిష్ట  జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి. పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే  పరిశీలనలకుఅధ్యయనాలకు అది ఒక ప్రమాణం (యూనిట్)గా స్థిరపడాలి.  ‘శతమానం’ మనిషి నిండు జీవితానికి ఒక ప్రామాణిక  కొలమానంగా భావించడానికి  అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే  ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’ అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష.  కానీ మీకు ఎన్నాళ్ళు జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో  బుద్ధికి తోచిన  సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా  గడపాలని ఉండదా?! 

భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి  జీవించడం కూడా   చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని  పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం ‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి  సంచికలో ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!  

వంద మీద మరో 13  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   జాబితా - గిన్నీస్  వరల్డ్  రికార్డు  వాళ్ళు  తయారు చేస్తే అందులో సింహభాగం సివంగులవంటి  ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్  దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా  ఒక్కరూ లేని మాట  నిజమే కావచ్చు కానీ అదీ కొంత ఉపశమనం  కలిగించే అంశంగా భావించడం  తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు   వందేళ్లకు పైగా బతికున్నట్లు  కనిపిస్తున్నా కొన్ని   ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల  గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి!  నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు. 

వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని  దిక్కులు చూస్తూ దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్ కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా.. ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా  గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి  పతకం సాధించినట్లు! సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా  కానీ ..అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని  అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁఅనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం  తుక్కు బండి లాగించినా  వృథా.మన్నిక -కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా  దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో  పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా  గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు ‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'

మనసుంటే మార్గం ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.  వందేళ్ల బతుకు మీద మరి  మన భారతీయ సంతతికి  అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి   వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి  దాకా దేశాన్ని బాధ్యతగా  నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు   పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల   పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో  ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. 

గతంలో ఒక్క నయం కాని రోగాలూ రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు  పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి  మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు  వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల  నివేదికల  గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు! బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు  కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ  ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే  ముదనష్టపు కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు' అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో  మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట  తాత్కాలికంగా పక్కన ఉంచి, పడుచువారిని మించి  కొంత కాలం  మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్  ఈ దిశగా గతంలో చేసిన ఓ పరిశోధన తాలూకు  ఫలితాలు పోయిన ఏడాది జులై నెల ‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ  యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే   గ్రీష్మాంతంలో వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ  చొప్పించినట్లు ఆ పరిశోధన తేల్చింది.  మూడు పదుల నాటి మునుపటి శారీరక పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి  ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.     

జీవిత లక్ష్యం ఏ   ‘షష్టిపూర్తి’  పూర్తికో  పరిమితమైతే  పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని  మనస్తత్త్వవేత్తలూ మత్తుకునే మాట.  అస్తమానం చేసే భూతకాల జపం   భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ  ఆయుర్దాయం మీద కనిపించని  దెబ్బ వేసే ప్రమాదం కద్దు.  'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు, మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో   మునిమనుమలతో కూడా  కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.

అందుకు అనుగుణమైన  సగుణాత్మక  సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!  

'మీకు ఎన్నాళ్లు బతకాలని ఉంది?' అనడిగితే  రష్యా  పరిసర  ప్రాంతాల మనుషులకు మల్లేనే అప్పుడు  మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం  పెదాలపై   ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!  

*** 

తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు  అయితేనేం?

డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్ ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా, దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం రెండింటి పైనా తన ప్రభ  అప్రతిహతంగా సాగించారు. 

జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల  పాత్రలతో ఆరు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి ఎలిజెబెత్-2. బెట్టీ వైట్  వందేళ్లకు ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ రికార్డులకు సరితూగేది.  హెన్రీ కిసెంజెర్ (96), జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91), బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92).. అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ వ్యక్తులు.  యమధర్మరాజు  నియంతలా వచ్చి  ‘చప్పున రండు' అంటూ  పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా మీ  దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ జాబితాలో  ముందు నుంచి లోకానికి సుపరిచితులైన  గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84), విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89), యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం గడిపినవారున్నారు.  ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని ప్రస్థానానికి సిద్ధమవడం?!

***

చిరంజీవులు ఉండరు!

  'భారతం రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు సెలవిచ్చిన  వివరణ వింటే 'మహోన్నతమైన మానవ జన్మ  వరం   శాపంగా మారడంలో  ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో  ఇట్టే అవగాహన అయిపోతుంది.  

చలనమున్న ప్రతిదీ క్రమేణా నిశ్చలంగా మారడమన్నది   ప్రకృతి నిక్కచ్చిగా పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది పిట్ట వరకు అన్ని జీవులకూ  సమానంగా వర్తించే కాలనియమం.  విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల  ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు.  ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై విశ్వాసం ఉంచడం  తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.

 

 

జీవజాతుల మరణానికి విశ్వంలోని అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా  సాధ్యం?  

జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు రూపాలు.  నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం. ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత  వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే దురవగాహన. 

ప్రతీ ప్రాణికీ  నిశ్చేష్టత ఎప్పటికైనా తప్పని అంతిమ స్థితి.  భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి కొనసాగింపులోని అసలు రహస్యం.  జీవులు కిందికి లాగే  భూమి  ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి పైకి   ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!  జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.  కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములురెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం.  అట్లా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.  ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ  ఒక  క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ. 

డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై తిరగబడుతూనే  ఇటు తను ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం తంటాలు పడుతుంటుంది.  (తమ వృత్తి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్). ప్రత్యేకంగా  కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే  తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు! 

ఇంత కథా కమామిషు  ఉన్న ‘మరణం’ వివిధ జీవ జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***

(కర్లపాలెం హనుమంతరావు)

(సూర్య దినపత్రిక  4, నవంబర్, 2019 ప్రచురితం)


Sunday, March 7, 2021

గీత ఓ అందే ద్రాక్ష పండు! -కర్లపాలెం హనుమంతరావు -

 



 కార్పణ్య దోషోప హత స్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః

యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భారతీయులు ఆరాధనాభావంతో పఠించే భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం - ఏడో శ్లోకంలో పెద్దలు ఎప్పుడూ గుర్తుంచుకుని అనుసరించదగ్గ ఓ గొప్ప  సూక్తి ఉంది

అభిమానం పరిమితులకు మించి పెరిగిపోయినప్పుడు సహజ స్వభావానికి విరుద్ధమైన ప్రవర్తన సంభవిస్తుంది. ధర్మసంబంధ విచక్షణ  పక్కనుంచి సామాజికపరంగా అయినా ఆమోదనీయం కాని సమతౌల్యతను మనసు కోల్పోవడమే ఇందుకు కారణం. సమాజంలోని  ప్రతీ వ్యక్తికీ ఈ సంకట స్థితి ఏదో ఓ సందర్భంలో తప్పదు. అయితే,  జీవితం నేర్పిన పాఠాల సారం వంటబట్టిన కొందరు గుంభనగా ఈ  స్వ స్వరూప సంభంధమైన వైవిధ్యం స్వయంగానే గ్రహింపుకు తెచ్చుకుని  ఆ  వైపరీత్యం నుంచి బయటపడే ప్రయాసలు ఆరంభిస్తారు! ఆ పైన జీవ సంస్కారాన్ని బట్టి జయాపజయాలు!


కానీ, జీవితమనే మల్ల యుద్ధం గోదాలోకి అప్పుడే  పాదం మోపిన పిన్న వయస్కులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసిన  సందర్భం తటస్తించినప్పుడు నరుడు నారాయణుణ్ణి ఉచిత మార్గ దర్శనార్థం  ఎట్లా దేబిరిస్తాడో అట్లా దేబిరించడం నామర్ధాగా భావిస్తారు.  అన్నీ తమకే తెలుసనుకుని దుందుడుకుగా ముందుకు దూసుకుపోతారు. కలసిరాని సందర్భంలో చతికిలపడే దుస్థితి దాపురించినప్పుడు బేలతనంతో ఆ పిన్నలు తమ సహాయ సహకారాలు, సముచితమైన సలహాలు యాచించే స్థితికి వచ్చే వరకు కన్నవారు ఓపికతో వేచ్చిడాలి.. అదే పెద్దరికం.. అని ఈ శ్లోకం సారాంశం.

మహాభారతంలో అర్జునుడు  యుద్ధరంగం మధ్య ప్రేమానురాగ బద్ధుడై కర్తవ్య విమూఢత్వం ఆవరించిన సందర్భం ఒకటుంది. తన వైరాగ్యానికి కారణం బంధుప్రీతి అనో, పెద్దలు.. గురువుల మీద భయభక్తులనో, విజయసాధనానంతరం అనుభవంలో కొచ్చే రాజభోగాల మీది కాంక్ష ధర్మసంబద్ధం కాదనో.. ఇలా రకరకాల కారణాలు వెతికే దుస్సాహసానికి సర్వలోకసంరక్షకుడి ముందు  దిగే దుస్సాహసానికి పూనుకుంటాడు. కానీ ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి విజయుడికి తన పరిమితులు తెలిసివచ్చాయి.  తన సహజ రాజస్వభావానికి విరుద్ధమైన కరుణ, జాలి వంటి గుణాలే ఈ సంక్లిషతకు కారణమని  అవగాహన ఏర్పడింది. ఆ భావన కలిగించింది అప్పటి వరకు తాను కేవలం మిత్రుడిగా భావించిన యదువంశ సంజాతుడు శ్రీకృష్ణుడే. ఎదుట ఉన్న ఆ వ్యక్తి తన బాంధవుడిగా మాత్రమే భావించి తన మనోభావాలని యధేచ్ఛగా పంచుకున్నావాడల్లా జగద్గురువన్న ఎరుక కలిగిన మరుక్షణమే అతనని తన మార్గదర్శుగా ఎంచుకున్నాడు. తగిన కార్యాచరణ సూచించమనే స్థాయి వరకు  దిగివచ్చాడు.  తనను శాసించే సర్వాధికారాలు సమర్పించే దాసస్థితికి ఆ నరుడు చేరువ అయినప్పుడుగాని ఆచార్యుడు కర్తవ్యబోధకు పూనుకోలేదు. 

నరుడికి ఓపిక లేకపోవచ్చును గాని.. నారాయణుడిలోని పెద్దరికనికి  ఎందుకుండదు! పెద్దలూ, పిన్నలతో గీతలోని ఆచార్యుని ర్తీలోనే  సాగాలని  ఈ శ్లోక సారం. 

పండు పిందె దశలో ఎలా వగరుగా ఉండి రుచికి హితవుగా ఉండదో.. పిల్లల ప్రవర్తనా ప్రాథమిక దశల్లో సమాజపోకడలకు విభిన్నంగా సాగుతూ సబబనిపించదు. పిందె పచనానికి పనికి రాని విధంగానే పిల్లలూ బాల్యదశలో పెద్దల మార్గానికి భిన్నమైన దారుల్లో పడిపోతూ ఇబ్బందులు కలిగిస్తారు.  తమ శక్తి సామర్థ్యాల, శక్తియుక్తుల పరిమితులు గ్రహణకొచ్చిన తరువాత తప్పక పెద్దలను ఆశ్రయిస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం భారతంలోని కృష్ణపరమాత్మునికి మల్లే సద్వినియోగం చేసుకోవడమే పెద్దల కర్తవ్యం- అని ఈ శ్లోకం ప్రబోధిస్తుంది.


గీత కేవలం భగవానుని ఉవాచ మాత్రమే కాదు. ఆ ఆధ్యాత్మిక కోణంతో పాటు అదనంగా వ్యక్తిత్వ వికాస సంబంధమైనదని కూడా ప్రపంచం క్రమంగా గుర్తిస్తున్నదిప్పుడు. నిత్య జీవితానికి అక్కరకొచ్చే సూక్తులని గ్రహించి ఆచరణలో పెట్టే వారందరికీ 'గీత' ఎప్పుడూ అందే  ద్రాక్షాపండే!

 -కర్లపాలెం హనుమంతరావు

బోథన్, యూఎస్ఎ

07 -03 -2021

Friday, February 12, 2021

ధూర్తమానవా శతకము- కీ.శే త్రిపురనేని రామస్వామి చౌదరి - కర్లపాలెం హనుమంతరావు



దేవుడి పేరు చెప్పి తోచిన పిచ్చి కూతలు కూసుకుంటూ అమాయకులైన లోకులను భక్తి భావన  వంకన భయభ్రాంతులను చేసి స్వార్థ లాభం కోసం నిలువుదోపిడీ చేసే దుష్టబుద్ధుల మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'ధూర్తమానవా శతకము'  పేరుతో కొంత పద్య రచన చేసారు. ఈ పద్యాలలోని అన్ని భావాలలో ఎక్కడా అతిశయోక్తి మచ్చుకైనా కనిపించదు. నిర్మలమైన మనసుతో తమ తమ జీవికలను నడుపుకునే లౌకికులను నిందించడమూ కనిపించదు. లేని దేవుడిని ఉన్నాడని బుకాయించే పెడసర బుద్ధిగల గడసరి మనుషులపై ఆ 'దేవుడి' చేతనే దుడ్డుకర్ర తిరగేయించిన ఈ శతకంలోని పద్యాలు సులభ శైలిలో చదవగానే అర్థమయే రీతిలోనే ధారగా సాగడం విశేషం. పద్యాలు చదువుతున్నప్పుడు కపట జీవుల పట్ల దేవుడు  విసిరే విసుర్లు భక్తిభావం మెండుగా కలవారికీ నవ్వు తెప్పిస్తాయి. కారణం.. దేవుడు ఈ పద్యాలలో గద్దించిన  దుర్మార్గపు జాతిలో వాళ్లు ఒక భాగంగా లేకపోవడం!

సచ్చీలవంతులు ఎవరినీ ఇంచుకైనా నొప్పించని విధంగా కవిరాజు ఈ పద్యాలు అల్లిన విధానం హర్షింపదగినది. ఆలోచించదగినది. అన్ని పద్యాలు విస్తరణ భీతి చేత ఇవ్వడం కుదరక.. కొన్ని పద్యాలు మాత్రమే ఉదాహరణ కింద కింద ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చెయ్యండి. నచ్చితే మిత్రులతో నిశ్చింతగా పంచుకోండి!

-కర్లపాలెం హనుమంతరావు

12 -02 -2020


 

ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్‌

హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!

మానవు లందఱున్‌ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!

మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!

***

త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్‌ పొనర్చి పై

బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా

శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా

మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!

***

మరణపు శయ్యమీఁద నొక-మారయినన్‌ నను దప్పకుండ సం

స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్‌

బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్‌

గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!

***

బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా

వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?

పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్‌;

బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!

***

బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్‌

బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్‌

గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో

వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!

***

వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్‌;

రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ

బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ

పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!

(ధూర్తమానవా శతకము- కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి)

Saturday, February 6, 2021

ఆవుల సాంబశివరావుగారి అభిమాన సాహిత్యం గురించి.. కొద్దిగా! - కర్లపాలెం హనుమంతరావు

 




 

పది సంవత్సరాల వయసులో బుద్ధుని చరిత్ర క్లాసు పుస్తకంలో కేవలం పాఠం లాగా మాత్రమే కనిపించినా ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావుగారి జీవన శైలి మీద పుస్తక పఠనం ప్రభావం చూపించడానికి ఆ తరగతి పాఠమే నాందీ పలికింది. ఒకానొక పత్రికకు వ్యాసం రాస్తూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహామహులను ఆయన ఒక వరసలో తలుచుకున్నారు. వేమన, తెలుగుభాష తీపిదనం మరిగిన తరువాత వరస పెట్టి వదలకుండా చదివిన మంచి పుస్తకాలలో మరీ మంచివి అంటూ ..పోతన భాగవతం, భారతం, ఆముక్తమాల్యద, వసుచరిత్రలను అయనే స్వయంగా ఎంచి చూపించారు. అవ్యక్తమైన మానసిక స్వేచ్ఛ కోసమై తపించే కృష్టశాస్త్రి  కృష్ణపక్షం తన భావసరళిని తీవ్రం చేసిందని చెబుతూనే.. తనలో హేతువాద బీజాలను నాటిన  మహిమాన్వితుల పుస్తకాలను తలుచుకున్నారు. త్రిపురనేని రామస్వామిగారి కురుక్షేత్రం, సూతపురాణం, పలుకుబడి గలిగిన నమ్మకాలను ఎట్లా నిలదీస్తుందో అర్థం చెసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  విషయం పురాతనమైనదైనా సరే స్వతంత్ర బుద్ధితో ఆలోచించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పే వీరేశలింగంగారి రచనలు యావత్తూ చదివినట్లు చెప్పుకొచ్చారు. దురాచారాలు మనుషులను మానసికంగా ఎంతలా బలహీనపరుస్తాయో తెలుసుకునేందుకు గాను గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం  దొహదం చేస్తుందన్న  విషయం విపులంగా  వివరించుకొచ్చారు. ఒక పక్క చలం, మరో పక్క శ్రీ శ్రీ .. ఒకరు స్త్రీని గురించి, మరొకరుఉ దేశాన్ని గురించి ఎంత నూతనంగా ఆలోచించవలసిన అగత్యం ఉన్నదో కొత్త కొత్త కోణాలలో వివరిస్తుంటే ఉత్తేజితమయిపోయేటంతగా వారి భావజాలంతో మమేకమయినట్లు సాంబశివరావుగారు వివరించారు. ఉన్నవ లక్ష్మీనారయణగారి మాలపల్లితో తన సాంఘిక దృష్టి కోణం దిశ మారిందని స్వయంగా ఒప్పుకున్నారు ఆ లోకాయుక్త. మార్క్స్  ఎంగెల్స్ తో కలసి రాసిన దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,  ముందే చదివేసి ఉడటం వల్ల

 హెగెల్స్, కాంటు రచనలు చదివి జీర్ణించుకోవడం సులభమైందన్నది సాంబశివరావుగారి భావన. కొత్తగా అబ్బిన బావుకత వల్ల పరిణతి చెందిన మనసుతో రష్యన్ విప్లవ పాఠాల సారాంశం సరైన మోతాదులోనే వంట పట్టినట్లు చెప్పుకొన్నారు . పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇంగ్లండులో జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రజాస్వామిక విప్లవానికి ఎట్లా మార్గదర్శకం అయిందో అవగాహన చేసుకునే పాటి విశ్లేషణాత్మక బుద్ధి, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం,   ప్రజల హక్కుల కోసం .. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం  ఫ్రెంచి విప్లవం, ఎట్లా సర్వం తెగించి పోరుకు దిగిందో తెలుసుకునే పాటి అవగాహన, థామస్ జఫర్ సన్, రూసో మొదలైన రచయితలు, భావుకులు ఆయా సంఘటనలలో ఎట్లా వైతాళిక పాత్ర పోషించారో ఆ వాతావరణం అంతా మనసుకు ఎక్కించుకునే పాటి బుర్రా బుద్ధీ పెరగడానికి ఎన్నో ఉద్గ్రంథాలు ఎట్లా ఉపకరిస్తూ వచ్చాయో..  ఒక చిరు వ్యాసంలో  స్మృతి రూపంలో వివరించారు. ఏ ఉద్యమంలోనూ ఆర్థిక సమానత్వం  ఎజండా కాకపోవడం ఆవులవారి సునిశిత దృష్టి నుంచి జారిపోకపోవడం  విశేషం.. ఆయన ఉద్దేశంలో ఆర్థిక సమానత్వం భవిష్యత్తులో రాబోయే ప్రగతిశీల ఉద్యమాలకు ఉత్ప్రేరకం మాత్రమే. ఇరవయ్యో శతాబ్ద్దంలో జరిగిన రష్యన్ విప్లవమే సాంఘిక వ్యవస్థను, అందులోని ఆర్థిక ప్రాతిపదికను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడిన మొదటి ఉద్యమంగా సాంబశివరావుగారు భావిస్తారు. మార్క్స్ కు  లెనిన్ రాసిన భాష్యం ఈ క్రియానుగతమైన మానవోద్యమాలన్నిటికి  అద్దంపట్టినట్లు ఆవులవారి అభిప్రాయపడుతున్నారు. వీటిని మనసు పెట్టి చదివిన విజ్ఞుడు మానవ స్వేచ్ఛాప్రియత్వానికి, ఆ తరహా స్వేచ్ఛకు ఆర్థిక సౌలభ్యం ప్రధాన భావమవుతుందన్న మూల వాస్తవం తెలుసుకుంటాడన్నది లోకాయుక్త పదవి సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆవుల సాంబశివరావుగారు ముక్తాయింపు.

 అప్పటి వరకు సంపన్నుల, సమాజంలో ఉన్నత తరగతుల వారి వ్యవహారంగా సాగుతూ వచ్చిన భారత స్వాతంత్రోద్యమం గాంధీజీ రాకతో ఒక్కసారి దేశప్రజలందరి ఉద్యమంగా స్వరూపం మార్చుకున్న విషయం ఆవులవారి దృష్టిని దాటిపోలేదు. సామాన్య ప్రజల హృదయాలలో కూడా స్వాతంత్ర్య పిపాసను బాపూజీ ఎట్లా రేకెత్తించగలిగారో వెలూరి శివరామ శాస్త్రిగారు బాపూజీ ఆత్మకథను అతిచక్కని సరళ శైలిలో చేసిన అనువాదం చదివి తాను అర్థం చేసుకున్నట్లు సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. గాంధీజీ నిర్మలమైన వ్యక్తిత్వం  సామాన్యుడికైనా అవగాహన అయే తీరులో రాసిన పుస్తకం అది అని ఆవులవారి ఆలోచన. మహాత్ముల జీవితాల పట్ల భక్తి విశ్వాసాలు ఉండే సామాన్య ప్రజకు బాపూజీని మాహాత్మునిగా మలిచి చూపించిన అనువాదం అని ఆవులవారి ఉద్దేశపడ్డారు. ఆసేతు హిమాచల పర్యంతం జన హృదయం మీద బాపూజీ ఎట్లా పీఠం వేసుకు కూర్చున్నారో ఆ పుస్తకం చదివితే తెల్సుస్తుందని ఆయనే ఒకానొక సందర్భంలో ప్రసంగవసాత్తూ చెప్పుకొచ్చిన మాట.. వేలూరివారి పత్రికా రచనలోని పదును పాఠకుల మనసుల్లోకి సూటిగావెళ్లే విధంగా ఉంటుందంటారు ఆవులవారు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా ఉండుంటే జవహర్ లాల్ నెహ్రూ  ఒక గొప్ప ప్రపంచ స్థాయి రచయిత అయివుండేవారని ఆవులవరి ఆలోచన. అంతగా ఆయన రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'ని సాంబశివరావుగారు మధించారన్నమాట!

చరిత్రకు , మానవ చరిత్రకు  నూతన దృక్పథాన్ని ఎత్తి చూపెట్టిన 'ఆర్నాల్డ్ టైన్స్' చరిత్ర అంటే కేవలం ఒక పెద్ద కథ కాదని, మానవ సమాజ గమన వివరంగా తెలియపరిచే సమాచార సాహిత్యమన్న  ఆవులవారి మాట ఆలోచించదగ్గది. చరిత్రను కొత్త కోణం నుంచి చూడటం తనకు నేర్పిన ఆ పుస్తకాన్ని గురించి ఆవులవారు సందర్భం వచ్చిన ప్రత్తీసారీ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.  ఏ ఏ ఘట్టాలు మనిషిని ప్రభావితం చేస్తూ వచ్చాయో, సమాజ గమనాన్ని మలుపు తిప్పుతూ వచ్చాయో  ఆ పుస్తకం చదివిన తరువాత తాను మరింత పరిణత దృష్టితో చూడడానికి అలవాటు పడ్డారో సాంబశివరావుగారు చెప్పుకొచ్చిన తీరు ప్రశంసనీయం. నెహ్రూజీ ఆత్మకథకూ  ఆయన హృదయంలో గొప్ప స్థానమే ఉంది. అది కేవలం ఒక నాయకుడి జీవిత చిత్రణ మాత్రమే కాకుండా, ఒక మధుర కావ్యం కూడా ఆవులవారి  దృష్టిలో.

సంపదల మధ్య పుట్టినా సున్నితమైన హృదయం, సునిశిత మేధో సంపద, సత్యాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతృష్ణ, నమ్మిన సత్యాన్ని ధైర్యంగా నిర్భయంగా ప్రకటించే సత్యనిష్ఠ -మనిషిని ఎట్లా మహామనీషిగా మలిచెందుకు దోహదపడతాయో తెలుసుకోవాలంటే  నిరాద్ చౌదరిగారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్', యం.సి. చాగ్లాగారి 'రోసెస్ ఇన్ డిసెంబర్', లాంటి పుస్తకాలు చదవాలంటారు  ఆవుల. నిరాద్ చౌదరిగారి కథ భారతదేశాన్ని, భారతీయ జీవితాన్ని గురించి తనలో పలు ఆలోచనలు రేకెత్తించిందని  ఆవులవారి ఉవాచ. చాగ్లాగారి ఆత్మకథయితే ఆనాటి దేశపరిస్థితులకు.. ముఖ్యంగా హిందూ ముస్లిముల మధ్య గల సహృదయతకు, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు ఒక దర్పణం వంటిదని ఆయన అభిప్రాయం. చదివినవారిని ఎవరినైనా సరే తప్ప ఆలోచనల్లో పడవేయకుండా ఉండనీయని గొప్ప స్ఫూర్తిదాయకమైన సాహిత్యంగా  ఆయన కితాబిచ్చిన పుస్తకాలు ఇంగర్ సాల్, బెర్ట్రెండ్ రస్సెల్, వంటి తాత్వికుల పెద్ద రచనల జాబితా!  విశ్వరహస్యాలను, మానవ ప్రకృతిని మౌలికంగా పరిశీలించిన గ్రంథాలు, మనిషిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన పుస్తకాలు, తన జీవితానికి తానే కర్త, భర్త అని వాదించే  రచనలు, మానవోన్నతికి భగవంతుని జోక్యం అవసరం లేదని , అసలు అడ్డుగా కూడా దైవభావనలు నిలబడకూడదని, మనిషి పురోగతికైనా, తిరోగతికైనా మనిషే పూర్తి బాధ్యుడని బోధించే రచనలు ఏవైనా సరే ఆవులవారు అమిత ఇష్టంగా చదివి వాటిలోని సారాన్ని వడగట్టి జీవితానికి అన్వయించుకుంటారని అర్థమవుతుంది. ఆ కారణం చేతనే ఆయనకు మానవేంద్ర నాధ్ రాయ్ రచనలు ప్రాణమయ్యాయి.  మౌలికమైన అంశాలనైనా విప్లవాత్మక కోణంలో భావుకత చెదరకుండా సాగిన సాహిత్య ఆవులవారి వ్యక్తిత్వం పై చూపించిన ప్రభావం ఏ కొలతలకూ అందనిది. 

ఆణిముత్యాల వంటి రచనలను జాతికి అందించిన మహామేధావి మానవేంద్రుడన్నది ఆవులవారి ఆలోచన. తాత్విక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలన్నింటినీ మునుపెన్నడూ ఎరుగని కొత్త కోణంలో తాత్వికుడు ఎం.ఎన్. రాయ్ నిర్వచించిన పుస్తకాలత గాఢమైన పరిచయం ఏర్పడిన తరువాత ఆవులవారిలోని అసలు మానవతావాదికి నూతన రూపం ఏర్పడడం ఆరంభమయిందనేది ఒక సాధారణ భావన. మానవుడు సమాజంలోని అంతర్భాగమే అయినప్పటికి.. ఆ విశిష్ట జీవి స్వేచ్ఛను, శ్రేయస్సును  కాపాడని పక్షంలో సమాజ నిర్మాణం పరిపూర్ణం కాదన్న ఎమ్.ఎన్.రాయ్ నవ్య మానవవాదం ఆవులవారికి మనసుకు హత్తుకున్నది. అటు వ్యక్తి స్వేచ్ఛకు, ఇటు సాంఘిక శ్రేయస్సుకు సమన్వయం  చేకూర్చే  మానవేంద్ర నాధ రాయ్ బావ సరళితో ఆవులవారు పుర్తిగా మమేకమైనప్పటి బట్టి తెలుగువారికి ఒక లోకాయుక్త లౌకిక పరమైన ఆస్తి కింద సమకూరినట్లయింది.

 రాయ్ రచనలు తన మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదని  సాంబశివరావుగారే  స్వయంగా అనేక సందర్భాలలో తన మనోభావాలను స్పష్టంగా బైటపెట్టిన తరువాత ఆ ఆధ్యాత్మిక  మార్గాన్ని గురించి మీమాంసలకు దిగడంలో అర్థం లేదు. తన లోని హేతువాదికి, బౌతికవాదికి  పురోగమన దృష్టిని కల్పించిందీ ఎమ్,ఎన్.రాయ్ తరహాలో 'సేన్ సొసైటీ' కర్త ఎరిక్ ఫ్రామ్ ది కూడా అని ఆవుల సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. ఎంచుకున్న అంశం ఏదైనా, స్వతంత్ర బుద్ధితో సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను సునిశితంగా పరిశీలించడం 'ఫ్రామ్' పుస్తకాల అధ్యయనం వల్ల కలిగిన లాభం అన్నది  ఆవులవారి అభిప్రాయం.

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థిక శాస్త్రవేత్త మిరడాల్ ప్రసిద్ధ గ్రంథం 'ఏసియన్ డ్రామా' ఆసక్తితో చదివి ప్రాచ్యదేశాల లోతైన ఆలోచనలను అర్థం చేసుకున్నానన్న చెప్పిన ఆవుల సాంబశివరావు గారి అధ్యయన శైలి పరిశీలిస్తే .. ఆ మహామనవతావాది  పఠన పర్వం ప్రాచ్యుల వేదాల దగ్గరే ఆగిపోకుండా,  తాత్వికుల ఉపనిషత్తులు, అస్తిక షడ్దర్శనాల దాకా సాగినట్లు అర్థమవుతోంది.

 పురోగమనం, జీవం.. చేవ గలిగిన మనిషి  అచరించకుండా వదలించుకోకూడని సృజన వ్యాపారాలు- హేతువాదం, మానవతావాదం అన్నది ఆవుల వారి ధృఢాబిప్రాయంగా గుర్తిస్తే .. ఆ విధమైన మావవతావాదం ఆయనలో రగులకొల్పింది ఆరంభంలో వైవిధ్య భరితమైన వివిధ రంగాలకు చెందిన ప్రపంచ సాహిత్యం అన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.  

- కర్లపాలెం హనుమంతరావు

21, నవంబర్, 2020.

(నవభావన -  జీవవాహిని శారద -  పుటలు 46 -  55 -ఆధారంగా)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...