Thursday, October 7, 2021

అనువాద కవిత: అనేకుల కది! - రవీంద్రనాథ్ ఠాగోర్-తెనుగు సేత : శ్రీ విద్వాన్ విశ్వం సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో  


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ

Friday, October 1, 2021

పచ్చ నాకుల రాణి వాసపు కవిత కృష్ణశాస్త్రిది - కర్లపాలెం హనుమంతరావు



కృష్ణశాస్త్రి కవిత్వం పై శ్రీ శ్రీ స్పందన - 'ఆస్వాదానికి ఆహ్వనం' శీర్షికతో ' అమృత వీణ'  ముందుపుటల్లో కనిపిస్తుంది.

సముద్రం ఎక్కడ ఉందో తెలీదు. కాని కృష్ణశాస్త్రి సృజించిన ఇక్షురస సముద్రం మాత్రం పురాణాల్లో వర్ణితమయిన క్షీరసాగరానికి వెదుకులాడే అగత్యాన్ని తప్పించింది- అంటాడు అందులో శ్రీ శ్రీ . నిజమా? చూద్దాం!

'వేయ బోవని తలుపు తీయమని పిలుపు /

రాధ కెందుకొ నవ్వు గొలుపు /

నీలోన నాలోన నిదురపోయే వలపు /

మేలుకుంటే లేదు  తలుపు'

 ఇది కృష్ణశాస్త్రి 'కృష్ణాష్టమి' కవితా ఖండికలోని కొన్ని  పంక్తులు. ఖండిక మొత్తం చదివితే శ్రీ శ్రీ ఒలకపోసిన అతిశయోలంకారంలో అతిశయం ఆవగింజంతయినా లేదనే అనిపిస్తుంది. 

 కృష్ణశాస్త్రి కవిత్వంలో  కనిపించే రసం మధురంగా ఉంటుందనేది  సర్వే సర్వత్రా వెల్లడయ్యే భావనే. కాని శ్రీ శ్రీ మరో మెట్టు పైకెళ్లి   మాధుర్యం అంటేనే  అసలు  నిర్వచనం  అనిర్వచనీయమైన   కృష్ణశాస్త్రి కవిత్వం'  అనే భావన వెల్లడిస్తాడు.

'అంతరాంతము నీ అమృత వీణే యైన /

మాట కీర్తన మౌను! /

ఈ అనంత పథాన  /

ఏ చోటి కా చోటు నీ ఆలయ్యమ్మగును, నీ ఓలగ మ్మౌను '

 'అమృత వీణ' ఆలపించే ఈ పంచమరాగం కర్ణపుటాలకంత కమ్మని  విందు చేస్తుంటే అవకాశం లభించినప్పుడు  ఎవరిమైనా శ్రీ శ్రీ మాటకు  వంత పాడక ఉండగలమా! 

'తినగ తినగ వేము తియ్యగ నుండు'. కాని, ఇక్షురసానికి ఆ స్వాదు గుణం లేదు. అదే పనిగా సేవించడానికి పూనుకుంటే రెండు లోటాల పరిమితి దాటితే చెరుకు రసపు తీపైనా వెగటనిపిస్తుంది. కృష్ణశాస్త్రి తన ఇక్షురస కవిత్వానికి ఆ అతిపాన దోషం అంటకూడదు అనుకున్నాడేమో! మిరియాల పొడివంటి ఘాటు ప్రయోగాలు, కరక్కాయల కటువు  తలపించే భాషా ప్రయోగాలు అక్కడా ఇక్కడా చేసి మరీ మహాకవి మాట నిలబెట్టాడు.

'పూజ కంటే వస్తిని, ఏ/

మోజు లేని 'చిన్నవిరిని' /

ప్రభువు కొలువున దాసిని శ్రీ/

పదములకు 'తివాసిని'

'పూల జాతర' అనే కృష్ణశాస్త్రి మధుర పాతరలో  ఇక్కడ కోట్స్ రూపంలో కనిపించే పదప్రయోగాలు, భాషలో .. భావంలో  ఘాటుగానో, కటువుగానో  ఉండటం గమనించాలి. కాకపోతే శాస్త్రిగారి  కలం, గళం నుండి ఎన్నడో గాని ఈ మాదిరి వగరు కాయల వరుసలు కురిసింది లేదు. అదృష్టం. చందమామకైనా చిన్న మచ్చ ఉంటేనే కదా అందం చందం! 

శ్రీ శ్రీ మరో చోట అంటాడూ .. 19వ శతాబ్ది తొలి దశాబ్ది వరకు జిమీందారీ వ్యవస్థకు మాత్రమే ' గొడ్డు'  చాకిరీ   చేసిన  తెలుగు కవిత, కృష్ణశాస్త్రి  పూర్వీకులు రాయప్రోలు, అబ్బూరి వంటి అభ్యుదయ కవుల రాకతో  బంధ విముక్త అయింది. అనంతరం కృష్ణశాస్త్రి తరం నుంచి భావకవిత్వం పేరు మీద యువతరాన్ని ఉర్రూతలూగించిందని. ఏ రసపట్టు కనికట్టు లేకపోతే ఎంత నూత్నమైనదైనా అటు బళ్లారి  నుంచి ఇటు బరంపురం వరకు భావకవిత ఊరికే ఊరేగగలుగుతుందా ?

'ఎడబాసి పోకోయి /

 నీ దాసి నీ రేయి /

ఈ ఎదకు నిముసమే/

నెడబాటు విసమే ' అంటూ ఆ 'జులపాల జుట్టు కట్టుతో సహా భావికవికి ఓ ఆహార్యమంటూ గళసీమకు వేళాడు హార్మోనియంతో తన కంటూ  'ట్రెండు' నొకటి సృష్టించుకోగలడు కృష్ణశాస్త్రి! భావకవిగా కవిలోకాన్ని ప్రభావితం చేసిన  అతగాని ప్రతిభా పాటవాలకు జతకాని  మధుర స్వారస్య సారస్వత వచనాలు   మచ్చుకకు మాత్రమే ఎక్కడో ఒకటీ.. అరా .. అక్కడా.. ఇక్కడా!ఈనాటికీ చెక్కుచెదరని  కృష్ణపక్షం  ఒక్కటి  చాలు భావకవి వైతాళికునిగా కృష్ణశాస్త్రి సాధించిన అర్హతలన్నిటి పైనా ఆమోదా ఆముద్ర ప్రమోదపూర్వకంగా పడేటందుకు.

కాకపోతే ప్రతిభావంతులైన ఏ వైతాళికగణ విజయ యాత్రలకయినా ఆదిలో హంసపాదులా ఆరంభంలో ఆటంకాలు తప్పవు. ఆ రివాజు తప్పకూడదని కాబోలు, ఆ కాలం నాటి మహాపండితుడొకాయన  అక్కిరాజు ఉమాకాన్తమ్ కేవలం కృష్ణశాస్త్రిని వెక్కిరించటానికేనా అన్నట్లు 'నేటి కాలపు కవిత్వం' పేరున ఓ దిక్కుమాలిన గ్రంథం వెలువరించింది.   తెలుగు ఉమాకాంతాన్ని సంస్కృత ఉమాకాన్తంగా చెప్పుకునే ఆ పండితుడికి సంస్కృతంలో తప్పించి  మరెక్కడా కవిత్వం కనిపించని హ్రస్వదృష్టి కద్దు. నన్నయను సైతం కవుల పద్దు నుంచి కొట్టిపారవేయగల సమర్థుల  వక్రదృష్టికి సమకాలీన కవికోకిల కాకిలా అనిపించక మానుతుందా? 

'పలుక లేను పలుక లేను /

భయము సిగ్గు వొడము దేవ ! /

అలయని దయ నా యందే నిలిపి వదలవోయి దేవ! /

మలిన  మలిన బ్రతు కిది; పలుక లేను నీ నామము' వంటి చిలుక స్వరాలతో రాసి పాడినా నాటి  బ్రహ్మసమాజ ఉద్యమానికి ఊతమిచ్చే వందలాది రసగుళిక పద్యాలు ఎంత హృద్యమయితేనేమి, మడి కట్టుకున్న బధిరాంధ పండితుల చెవులకు దిబ్బెళ్లు  అనిపించవా? 

యువ కవి లోకమంతా ఉత్తమమైనదంటూ సంభావించిన వృక్షరాజపు కొత్త శాఖ భావకవిత. ఆ కొమ్మ నుంచి మొలకెత్తిన మరో కొత్త చివురు చూసి మండిపడే నైజముండే ఏ పండితలోకమైన చిర్రుబుర్రులాడక తప్పదు.వేదుల సత్యనారాయణ వంటి ఎన్నో కవి కోకిలలకు ఆశ్రయమిచ్చిన ఆ నూతన తరుశాఖ మీదనే మొగ్గ పూవైన చందంగా  భావకవి కృష్ణశాస్త్రి అందాల భావలోకం కనులు విప్పార్చింది .  కాబట్టే  'పచ్చ నాకుల రాణి  వాసపు /

పడతినే, సంపెంగనే / 

సరసులను, సామంతులను /

నా స్వాదు  వాసనా పిలుచునే '( పూల జాతర) అని  ఎలుగెత్తి పాడినా  చెల్లించుకోగలిగింది. రస పిపాసువుల హృదయాలకు  అదే కొత్త రాగాల  విందయింది.

'నేటి కాలపు కవిత్వ౦' పుస్తకానికి  కొనసాగింపుగా అనంతపంతుల రంగస్వామి  అనే మరో వెకిలి కవీ 'కృష్ణపక్షం'  పూర్వపక్షంగా 'శుక్లపక్షం' అనే మరో వెక్కిరింత పద్యకావ్యం వెలయించాడు. ఆ రోజుల్లోనే వేదుల  వంటి ఉద్దండ భావకవులు 'సారస్వతారిష్టం అనే శుక్ల నష్టం' గా ఛీత్కరించిన 'శుక్లపక్షం' ఉమాకాన్తమ్ గారి కావ్యం పక్కనే బూజుగూటిలో మగ్గిపోయింది.

'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?/

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?/

కలవిహంగమ పక్షముల దేలియాడి/

తారకా మణులలో తారనై మెరసి/ 

మాయ మయ్యెదను నా మధురగానమున!' అన్న కృష్ణశాస్త్రి మాటే  అతని భావకవిత సాధికారతను  అచ్చంగా నిజం చేసింది.   

నాటికే కాదు నేటికీ శాస్త్రిగారి భావకవిత్వపు బాణి తెలుగు సాహితీ రాణి పాదాల పారాణి అనడంలో  అందుకే అతిశయోక్తి రవ్వంతైనా లేదు అనేది!

-కర్లపాలెం హనుమంతరావు

01 - 10-2021

బోథెల్ ; యూ ఎస్.ఎ

ఆంధ్ర శిల్ప కళ - కర్లపాలెం హనుమంతరావు

 


రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,

ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా  ప్రకటితమవుతుంది కనుక.


మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.


చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే  స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ. 


ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం ఇచ్చినట్లన్నమాట.


ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు. 


ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.


ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు. మగధ వరకు విస్తరించి ఉంది.


అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు పాత్రమయింది.


శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం. చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత, సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.

 

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన బీరారు ప్రాంతీయుడు.


ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ అపూర్వం.


తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.


స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.

 

కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో   విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు.  విచారకరం.

 

భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి పరిసరాలలోని వస్తువులను  చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.


చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.


మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది. 


ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర ప్రవేశపెట్టిన  బొంబాయ్ శాఖ మూడవ రకానిది.


చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది. కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే పరిస్థితులు  లేవు. కుడ్య చిత్రకళ  కనుమరుగవుతున్న  అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే ఆఖరి చేదు సత్యం.


(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల రూపకల్పన ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

02 -10 -2021

బోథెల్;  యూ.ఎస్.ఎ

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...