Sunday, January 31, 2021

పరిచిత అపరిచయం- కర్లపాలెం హనుమంతరావు -



 

ఎక్కడో చూసినట్లే ఉంటుంది.. ఎక్కడో ఠక్కున గుర్తుకు రాదు. ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.. ఎప్పటికప్పుడు కొత్తే! ఏమిటి.. మనిషి మెదడులోని ఈ ద్వైదీభావాలకు భాష్యం?

కొంత మంది వ్యక్తులతో కలసిన మొదటి క్షణంలోనే ఒక ఆత్మీయత   ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. మళ్లీ కలుసుకోకపోయినా సరే ఆ కలయిక చానాళ్ల వరకు అట్లాగే తాజాగా ఆహ్లాదం కలిగిస్తుంది. కొంతమందితో బంధం కాల పరిస్థితుల కారణంగా కొనసాగించక తప్పదు. అయినా ఆ నడక సాగినంత కాలం ముళ్ల మీద ప్రయాణంలాగా ఇబ్బందికరంగా ఉంటుంది.  

చాలా సంసారాలలో భార్యాభర్తల మధ్య ఉండే బంధం ఏదో సంఘ సంప్రదాయం కోసం కొనసాగిస్తున్నట్లు కనిపించడం గమనించవచ్చు. ఇద్దరి రాశులూ జత కూడలేదని అందుకనే ఈ పొరపొచ్చలని నిరాధారమైన రుజువులు చూపించి బుకాయించే బాపతును పక్కన పెట్టేయండి. సంస్కారపరంగా ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు అయివుండాలి. అయినప్పటికిపెద్దలు కుదిర్చిన వివాహబంధంసమాజం ఎదుట సహచరులమని ప్రకటించుకున్న కారణంగా అభిప్రాయబేధాలు నాలుగ్గోడలు దాటి రాకుండా గుట్టుగా కొనసాగించే సంసారాలకు కొదవుండదు. ఒక భర్త మరో స్త్రీ పట్ల ఆకర్షితుడవడంఒక గృహిణి పరపురుషుని  దర్శనార్థం తపించిపోవడం ఉంటుంది. కానీచలంగారు తన కథల్లో మొత్తుకున్న విధంగా అది పూడ్చిపెట్టిన అనుబంధాల కిందకే వస్తాయి. ఆ రకమైన సన్నివేశాలలలో భర్త ఎదుట ఆ పరపురుషుడిని చూసినా భార్య అపరిచితుడిని చూసినట్లే ప్రవర్తిస్తుంది. తనకు అంతకు ముందు నుంచి అనుబంధం ఉన్న స్త్రీ భార్య సమక్షంలో తటస్తపడితే భర్త ప్రవర్తనా డిటో! ఏతావాతా తేలేదేమంటే పరిచితాలు.. అపరిచితాలు అనే అంశాలు శుద్ధసత్యం కేటగిరీ కిందికి వచ్చేవి కావు. 

మన చుట్టూ ఉన్న గాలిని గురించి మనకేమన్నా సమాచారం ఉంటుందాఉన్నా సమగ్రంగానిర్దిష్టంగా ఉంటుందాపంచభూతాలు గాలినీరునిప్పుఆకాశంభూమి - ఈ ఐదింటిని గురించి ఎంత తెలిసినా తెలియనట్లే ఉంటుంది. ఎంత తెలీనట్లు నటించినా ఎంతో కొంత ఎరిక ఉంటుంది. తెలియడంతెలియచెప్పడం అనే రెండు ప్రక్రియల మీదనే ప్రపంచం సర్వం ముందుకు వెనక్కు ప్రయాణం చేయడం. సర్వజ్ఞులు అన్నది ఒక భావన మాత్రమే. ఆదర్శ భావన. అన్నీ తెలిసినజ్ఞానిఏమీ తెలియని అజ్ఞానీ కంచుకాగడా వేసి గాలించినా ముల్లోకాలలో కనిపించడు. ముల్లోకాలుముక్కోటి దేవతలునాలుగు దిక్కులుఅష్టైశ్వర్యాలు,నవరత్నాలు.. లాగా కొన్నింటికి అన్నీ తెలిసిపోయినట్లు ఒక సంఖ్యకు కుదించి సంతృప్తి చెందుతాము. నవరత్నాలు తొమ్మిదేనా! నవగ్రహాలు అన్నారు నిన్న మొన్నటి వరకు రోదసీతలంలో పరిభ్రమించేవి. ఇప్పుడు కొన్ని గ్రహాలు గ్రహాలే కావు పొమ్మంటున్నారు. న్యూటన్ సిద్ధాంతమే విజ్ఞాన శాస్త్రం మొత్తానికి ఇరుసు వంటిది అని శతాబ్దాల పర్యంతం ఊదరగొట్టి ఇరవై ఒకటో శతాబ్ది వచ్చే సరికి అదంతా తప్పుల తడక అని తేల్చేస్తున్నారు. మనిషి పురోగమనం ఇహ శాశ్వత అమరత్వం వైపుకే అని కోతలు కోసిన శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఎదురైన కరోనా మహమ్మారి అంతం చూసేందుకు తలకిందులు అయిపోతున్నారు. అన్నీ పరిచయమే.. అనుకుంటాం గానీఏదీ సంపూర్ణ పరిచితం కాదు. ఏదీ పరిచితం అని నైరాశ్యం ప్రకటించేవారికీ ఇదే సూత్రం. ఎంతో కొంత తెలియకుండా మనుగడ ముందుకు సాగదు. ఆకలి తీర్చుకునేందుకు ఆహారం అవసరమనిదాహం ఆరేందుకు మంచి తీర్థం తప్పదని ఎవరు వచ్చి మనకు పాఠం నేర్పుతున్నట్లుపుట్టక ముందు ఎవరమో తెలీదు,పుట్టిన తరువాత ఎప్పుడు పోతామో ఎవరం ఇతమిత్థంగా చెప్పనూ లేం. ఇంత మాత్రం దానికి నిన్ను నీవు తెలుసుకో.. అంటూ స్వాములార్లు మఠం వేసుక్కూర్చుని బోధించే శుష్కమైన పలుకులు ఆలకించడం శుద్ధ దండుగ . ఎప్పుడు చూసినా కొత్తగా ఉండడంఎప్పుడు చూడకున్నా  చిరపరిచితు లనిపించడం ఏమిటో ముందు తెలుసుకో! అది తెలియాలంటే నిన్ను గురించి నీవు కాదునీ పక్కవాడిని గురించి నీవు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి. 

ముఖమే చూడని ఆకారాన్ని ఊహించుకుని జీవితమంతా ఆ మూర్తికి దాసోహం అయిపోతూ స్తోత్రాలుదండకాలు, వల్లించడం మించి మనిషిలోని పరిచిత అపరిచితానికి ఉదాహరణ ఏముంటుందికంటి ముందుండే ఆహారం వదిలేసి కంటికి ఎన్నడూ కనిపించని ఆకారం దర్శంచాలని భక్తి పేరుతో నిరాకారికి జీవితం ధార పోయడమేమిటో ఆ రహస్యం ముందు కనిపెట్టు!  పడుకునేందుకు ఆరడుగుల నేలకడుపు వేడి చల్లబడేందుకు  చేతికి నిండుగా కబళం ముద్దకంటి రెప్పల విరామానికి ఓ ఆరు గంటల నిద్ర,  కష్టసుఖాలు కలబోసుకుంటూ పక్క మనిషితో మసిలే నిశ్చింత.. ఈ మాత్రం భాగ్యానికి ప్రపంచయుద్ధాలు చేసుకున్న మనుషులకు ఏమి తెలుసనిఏమి తెలియదనిమళ్ళీ మళ్లీ సొదపెట్టుకునేందుకు?

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్; యూఎస్ఎ


Sunday, December 6, 2020



 

అన్నమయ్య కృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు


 


అన్నమయ్య అనగానే కళ్ల ముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూపం.  వేంకటాద్రిరాయడి కొలువు కూటమికి అంతకు ముందు నుండే కొండలు నెలవై  ఉండినా, కలియుగ అవతార పురుషునిగా  భక్తజన సందోహం గుండెల మీదకు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగులవాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభా ప్రాగల్భ్యం  అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. అయ్యతో పాటూ అమ్మకూ  స్వరార్చనాసేవలు సరిసమానంరగా అందడం అయ్యవారి ఆనాటి అభ్యుదయ భావాలకు అద్దంపడుతుంది.  ఆచార్యులవారి కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే  ఇక్కడ ముఖ్యోద్దేశం. 

తాళ్లపాకవారి రాగిరేకులు తడవని రసరహస్యం లేదనడం అతిశయోక్తి కాబోదు. అయ్యవారి కృష్ణతత్వం గురించి చేసిన గానప్రస్తావనాలను గాని గాఢంగా పరిశీలిస్తే భజగోవింద కర్త  శ్రీశంకర భగవత్పాదులు భావించిన ఆ 'ఏదో తెలియని నీలిరూప తత్వం' అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి వేధించి మరీ తన్మయత్వ అగాధంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి.  జయదేవుని అష్టపదులకు దీటైన పాదపంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుత్వంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవాలి. 

కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది  ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దుమురిపాలను  అన్నమయ్య మథించి  మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి వట్టొట్టి మాటలతో మనసుకు పట్టించడం ఒక్క నాలుక వల్ల శక్యమయే పని కానేకాదు. 'భావయామి గోపాలబాలం మన/స్సేవితం తత్పదం చింతయేహం సదా' అంటూ  చిన్నికృష్ణుని ముద్దు పాదాలను తాను తలుచుకుంటూనే తప్ప తతిమ్మా దేవుళ్ల సంకీర్తనల పర్వం సవ్యంగా సాగించలేన’ని  స్వయంగా ఆ  చెంగల్వరాయని స్వరసేవకుడే సెలవిచ్చుకున్న సందర్భం గమనీయం.

'కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘంటికా'-బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతాడును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపోతాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు. 'నిరతరకర కలితనవనీతం  బ్రహ్మాది/ సురనికర భావనా శోభిత పదం' -వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చిన్ని చేతులుండే ఆ బాలగోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని..  మిగతా దేవతలకు ప్ర్రార్థనలు.. అవీ సవ్యంగా సాగే పని కాదు!'అని అన్నమయ్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!  

'చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి' అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేలల మీద కనిపించడం చాలా అరుదు  నిన్న మొన్నటి దాక. ఆ తరహా వెన్నముద్ద వంటి  కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆలపిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జికృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం! బ్రహ్మానంద పారవశ్యం కలిగించే పదబంధాలతో వేలాది సంకీర్తనలు సృజించిపోయిన అన్నమయ్యను ఒక్క నోటితో మాత్రమే పొగిడితే చాలునా? అదే శ్లోకంలో చిట్టచివరన 'పరమపురుషం గోపాలబాలం' అని కృష్ణతత్వాన్ని పరమ క్లుప్తంగా, ఆప్తంగా  ముక్తాయించడం వెనక, స్వరూపానికి స్వల్పుడే అయినప్పటికీ  పరమపురుష తత్వం శ్రీకృష్ణపరంధామునిది    అన్న కృష్ణతత్వం వెలయించడమే అన్నమయ్యవారి పరమార్థం! ఆ వాగ్గేయకారుని ఎన్ని వేల జిహ్వలతో స్తుతిస్తే న్యాయం జరిగినట్లు?  

'చిన్ని శిశువు చిన్ని శిశువు /ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు' అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు.  అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి  మరో కవి ఇంకెవరైనా   పాలచారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జను గూర్చి కూడా భజించాలన్న బుద్ధిపుట్టిందా? ఏమో..  తెలియదు.  అదే అన్నమయ్యలోని విశిష్టత. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనంతం నుంచి చింతాకు చిగురు వరకు ఏదీ ఆ వాగ్గేయకారుని  సంకీర్తనల స్వర గాలాలకు తగలకుండా తప్పించుకోలేకపోయింది. 

ఇళ్లలోని పసిపిల్లలు తాగే తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు  చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తారు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కో మారు.  సంపూర్ణ సత్యస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని ముగ్ధమనోహరమైన ఆ బాల్యస్థాయికి దింపుకొచ్చి భగవంతుని మీది ముప్పిరిగొనే భక్తిభావాన్ని ముద్దుమురిపాల రూపంలో తీర్చుకునే అవకాశం భక్తలోకానికి అందించిన అన్నమయ్య అక్షరాలా ధన్యజీవి. 

దేవకీసుతుడు బాలకృష్ణుడి ఫాలభాగం మీద జారిపడే ముంగురులను పైకి నెట్టి మురిపెంగా సవరించే భాగ్యం యశోదమ్మ తల్లికి దక్కింది చివరకు. అదృష్టమంటే యశోదమ్మదే కదా అని కృష్ణయ్యను అమితంగా కామించే అన్నమయ్యలోని తల్లిహృదయం అసూయచెందే కీర్తనల పర్వం ఇది. 'పాయక యశోద వెంట పారాడు శిశువు' గా వేదోద్ధారకుణ్ణి భావించిన  వైరుధ్య వైదుష్యం తాళ్లపాక అన్నమయ్యలవారిది. ఆ మాటకొస్తే అండ పిండ బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు  కలగడం వాస్తవానికి తెలుగువారి వాగ్గేయసాహిత్య ప్రక్రియ చేసుకున్న అక్షరాల నోముఫలంగా చెప్పుకోవాలి. 

'ఝుమ్మని మడి శృతి గూడగను/ కమ్మని నేతులు కౌగగ చెలగే' ననే ఒకానొక కీర్తనలో 

'పాలు పితుకుచును బానల కేగుల/సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే' నేతులు కాగుతుంటే వెలికొచ్చే ధ్వనులు, గోవుల పొదుగుల కింద చేరి గోపాలురు పాలు పితికే సందర్భంలో పుట్టే సవ్వడులు.. ఇట్లా సర్వం ఝుమ్మనే నాదాల మాదిరి పొంగిపొరలుతున్నట్లు అన్నమయ్య సందు దొరికిన ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను  తాను విని ఇహలోకాలూ తన్మయమయేలా  వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేకంగా కలిసొచ్చిన  స్వరాలవిందు! 

'దది మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే/ నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః/ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్/కబళిత నవనీతః పాతు గోపాలబాలాః'- పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహేతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మంది భక్తిభావుకులు దానినో  ఓ తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా  అన్నమయ్య ఇప్పుడు! 

వాస్తవానికి లోకంలో దొంగతనం చేయని జీవి ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా మనిషి మౌలిక ప్రవృత్తే చోరబుద్ధి. తల్లి గర్భంలో చేరినప్పటి బట్టి అమ్మకు వంటబట్టిన తిండి సారాన్ని  తస్కరించడం  మరిగిన తండ్రి జీవకణమే కదా నవమాసాల అనంతరం భూమ్మీద మనిషిగా అవతరించడం! కన్నవారి ముద్దుమురిపాలను, రక్తమాంసాల ఫలసాయంతో సహా తోబుట్టువులతో కలసి మరీ దొంగిలించి తినే మనం, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అనుభవించే అన్నింటా అంతో ఇంతో ఏమిటి.. ఆసాంతం.. ప్రకృతి నుంచి, సాటి జీవజాతికి న్యాయంగా దక్కవలసిన  భాగాన్నుంచి  కాజేసి కదూ మరీ ముదురుతున్నది?  ఇదేమని  ఎదురడిగేవారిని మరేదో కట్టుకథలతో దారి మళ్లించే మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. వెన్న కాగుతుంటే తినేందుకని చెయ్యి పెట్టి చుర్రుమంటే చీమ కుట్టిందని చిన్నికృష్ణుడు బుడిబుడి రాగాలు తీసినా, తోడుదొంగలమైనందుకేనేమో మనకూ చీమ కుట్టినంతైనా  కోపం రానిది! కన్నయ్య చిన్ననాటి  కొంటె కథలన్నీ ఇట్లాగే ఉంటాయని అన్నమయ్యలోని భక్తిసాధకుని తన్మయత్వ  భావన. ఆ గోపాలుడి నిద్ర మెలుకువే పాలు చిలికే కవ్వం సవ్వళ్లతో మొదలవుతుంది. తరకలు కట్టే వెన్నముద్దలు దొంగిలించే ఆలోచనతోనే ఆ నల్లనయ్య కళ్లు నులుముకుని మరీ నిద్ర  లేచేదని లీలాశుకుని 'శ్రీకృష్ణకర్ణామృతం' కృష్ణతత్వాన్ని వర్ణించింది  గోపీజన మానస చోరుడుగా  కన్నయ్యకు మరో మనోహరమైన  బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహీనతలు అన్నిటిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా  భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య  భావనా వాగ్గేయమార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. 

'సా రోహిణి నేల మసూతరత్నం/కృతాస్పదం గోప వధూ కుచేషు' (రోహిణి కృష్ణుడనే నీలిరత్నాన్ని కన్నది. గోపికలు ఎప్పుడూ దానిని తమ వక్షస్థలంలొ ధరిస్తారు) అని లీలాశుకుడు చమత్కరిస్తే, అంతకు రెండాకులు ఎక్కువ చదివినట్లు కృష్ణతత్వం ఆసాంతం నవరత్నాలతో పోల్చదగ్గదని అన్నమయ్య  తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. 'ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు'సంకీర్తనలో అన్నమయ్య  ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం.  యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహిమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట  వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్నికృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి  పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య  గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖ చక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైడూర్యంలా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే  కమలాక్షుడు కాళింగుడనే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే   పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడలిలో మెరిసే ఇంద్రనీలం వంటి ఆ శ్రీవేంకటాద్రి పద్మనాభుడే ఆన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి  మన మధ్యనే  పారాడే  దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి పట్టిన  అపూర్వ వాగ్గేయ హారతి పళ్లెం.  

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్  ; యూ ఎస్ ఎ 

30-01. 2021


***

Thursday, January 28, 2021

'చిన్నోడి అమ్మ'- రవి వీరెల్లి పద్యం - హృద్యం

       


                     

 ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ

బావురుమంటున్న ఇంటి ముందు

 లోకంలోని ఎదురుచూపునంతా

కుప్పబోసి కూర్చుంటుందామె. 

 పసుపు పచ్చని సీతాకోక చిలుక

పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.

 పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా

విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.

  ఏళ్ళ ఎదురుచూపులు

ఆత్మల ఆలింగనంలో 

చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని

పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఊరేగిస్తున్న దేవుని పల్లకి

భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా

పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.

నాలుక రంగు చూడకుండానే

ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో

పసిగట్టే ఆమె కళ్ళు

లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.

వాడు ఏ దార్లో పాదం మోపుతాడో తెలీక

రోడ్డుకీ ఇంటికీ ఉన్న ఆ మాత్రం దూరం

లెక్కలేనన్ని దార్లుగా చీలి ఆహ్వానిస్తుంది.

ఆమె వెనకాలే వస్తూ వస్తూ

తలలెత్తి చూస్తున్న గడ్డిని ఓసారి పుణికి

చెట్టుమీని పిట్టగూట్లో గుడ్ల లెక్క సరిచూసుకుని

ముంగిట్లో కొమ్మకు అప్పుడే పుట్టిన గులాబీకి ముద్దుపేరొకటి పెట్టి

నిట్టాడి లేని దిక్కుల గోడలమీద

ఇంత మబ్బు ఎలా నుంచుందబ్బా అనుకుంటూ

అటు ఇటు చూస్తాడు. 

అంతలోనే

పొద్దున్నే వాణ్ని వెంబడించి ఓడిపోయిన

తుమ్మెదొకటి

కొత్త పూలను పరిచయం చేస్తా రమ్మని

ఝూమ్మని వానిచుట్టూ చక్కర్లు కొడుతుంది.

పసిపిల్లల చుట్టే తుమ్మెదలెందుకు తిరుగుతాయోనని

ఆమె ఎప్పట్లాగే ముక్కున మురిపెంగా వేలేసుకుని

వాణ్ని ఇంట్లోకి పిలుస్తుంది.

పొద్దున్న ఆమె అందంగా రిబ్బన్ ముడి వేసి కట్టిన లేసులు

వాడు హడావిడిగా విప్పి

చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు

అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు.

 దాగుడుమూత లాడుతూ

బీరువాలో దాక్కున్న పిల్లోనిలా

ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ

వాడి పాదాల సడి కోసం

చెవులు రిక్కించి వింటుంటాయి.

 పువ్వుమీద తుమ్మెద లాండ్ అయినంత సున్నితంగా

వాడు ఆమె వొళ్ళో వాలిపోయి

కరిగించి కళ్ళ నిండా పట్టి మోసోకోచ్చిన క్షణాల్ని

జాగ్రత్తగా

ఆమె కాళ్ళ ముందు పోసి పూసగుచ్చుతాడు.

ఆమె ఎప్పుడో నేర్చుకుని మరిచిపోయిన

కొన్ని బతుకు పాఠాల్ని

మళ్ళీ ఆమెకు నేర్పుతాడు.

 తిరిగి ప్రాణం పోసుకున్న ఇల్లుతో పాటూ

ఆమె అలా వింటూనే ఉంటుంది

తన్మయత్వంగా.

 (స్కూల్ బస్సు కోసం రోజూ ఇంటిముందు కూర్చుని ఎదురుచూసే చిన్నోడి అమ్మకు)

రుషులు లౌకిక సంబంధాలను తెంచుకున్న వారు. కవి అలా కాదు మన మద్యనే ఉంటూ..మన లాగే ఆహార విహార వ్యవహారాదుల్లో పాల్గొంటున్నట్లు  పాల్గొంటూనే.. మన కన్నా విభిన్నంగా లోకాన్ని దర్శించ గల సమర్థత కలవాడు. కవుల కళ్ళకు గుండెకాయలూ..గుండెకాయలకు కళ్లూ వేళ్లాడుతుంటాయి కాబోలు! మన రాతల్లో మామూలుగా శబ్దించే  అక్షరాలు.. వాటి అర్థాలు.. కవి చేతిల్లో సీతాకోక చిలుకలెలా అవుతాయో! 'నాన్ రుషిః కురుతే  కావ్యమ్' అన్న వాక్యం నిజమైతే కావచ్చు కానీ.. అది సంపూర్ణ సత్యమేనా? రుషి మార్గం లోకి  మనం ప్రయత్న పూర్వకంగా నడవాలి. కాస్త కనుసైగ చేస్తే చాలు  కవి ఒక స్నేహితుడికి మల్లే మన మార్గంలోకి వచ్చి  మనతో కలిసి నడిచినట్లే నడుస్తూ.. మనతో ముచ్చట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం చేరే  గమ్యం మాత్రం మనం వంటరిగా వెళితే  సొంతంగా అనుభవమయ్యేది కాదు. కవి చూపించే ఆ కొత్త లోకాన్ని చూసి ఆశ్చర్య పోతాం. మన కళ్లకు ఆ రంగులు అంతకు ముందు ఎందుకు కనిపించలేదో కదా అనిపిస్తుంది! కల్పనా?భాషా?భావమా? కవి ఏ మంత్రదండంతో మనకో కొత్త బంగారులోకాన్ని చూపించేది? కల్పన ఐతే కావచ్చు కాని.. అది మరీ చిన్నతనంలో అమ్మ చెప్పే'రాజు-రాణి' కథల్లోని స్వర్గలోకమో.. అక్కడి దాకా పాకే పూలచెట్టు తీగో కాదు. వేళ్ళు భూమిలోనే వుంటాయి.. చిగుళ్ల చివళ్ళకు మాత్రం తారా సందోహం తళతళలాడుతో వేళాడుతుంటుంది. పోనీ..భాష అందామా? సాధారణంగా మనలో మనం  మాట్లాడుకునే ముచ్చట్లే .. కొట్లాడుకునే ఆ పదాలతోనే కవి సుందరమైన ప్రేమ సుమమాలలను పరమ అందంగా అల్లేస్తాడు మరి వింతంతా భావంలో దాగుండే  భేదమేనేమో! మన కళ్ళకు మామూలుగా కనిపించే పచ్చ రంగు స్కూలు బస్సు కవి కళ్ళకు  'పసుపు పచ్చని సీతాకోక చిలుక' మల్లే కనిపిస్తుంది. బడి నుంచి తిరిగి వచ్చిన మన పిల్లవాడు మనకు 'బడి నుంచి నలిగి వచ్చిన పిల్లవాడే'. కవికో? 'పాలపుంతల నిడివి కొలుచుకుని వస్తున్న  వ్యోమగామి'. కవి ఒక సారి మనకి  చెవిలో ఆ  రసరహస్యం ఊదేసినాక  ఇహ ఎప్పుడు ఎక్కడ ఏ పచ్చ స్కూలుబస్సు కంటబడ్డా  సీతాకోక చిలుకమల్లే అనిపించడమే కాదు.. సీతాకోక చిలుక అగుపించినా.. పిల్లల పచ్చ స్కూలుబస్సే గుర్తుకొస్తుంది. నగ్నంగా.. సూటిగా.. కట్టె విరిచి పొయిలో పెట్టినట్లుగా చెబితే అది కవిత్వమెలా అవుతుంది? భావన ఒక మిఠాయి ఐతే.. ఆ మిఠాయికి  చుట్టిన రంగు రంగుల  కాగితం కవి  ఎంచుకునే పదాలు. శ్రవణానందాన్నందించే  అందమైన ఆడపిల్ల ముంజేతి కర కంకణం  నిర్మాణానికి  స్వర్ణకారుడు  కర్మాగారంలో  ఊక పొయ్యిసెగ వేడిమిని ఎంతలా సహిస్తో ఇంతింతి చిన్ని చిన్ని బంగారు రంగు రాళ్ళను, రజను పొళ్ళను గాజుల మీద లక్క మైలుతిత్త మిశ్రమాలతో కలిపి   పొదుగుతాడో! నవమాసాలు నానాఅవస్థలు పడ్డా, పండంటి బిడ్డ కంటపడి.. పదిమంది నోటా బంగారు కొండ అనిపించుకుంటే చాలు.. పురిటి నొప్పులన్నీ ఇట్టే చప్పున మాయమైపోతాయో! తల్లి మనసు. కవి మనసూ అంతే. పురాణ కవితో.. ప్రబంధ కవితో.. భావ కవితో.. అభ్యుదయ కవితో.. విప్లవ కవితో.. భావం- సందర్బాన్ననుసరిస్తో సాగిస్తున్న మహా ప్రస్థానంలో  ప్రస్తుతం  నడుస్తున్నది వైయక్తిక.. విశ్వాత్మక.. అనుభవాత్మక.. నిరలంకారిక.. నిరాడంబర పద..  అతి నూతన భావాత్మక  ..ద్వన్యాత్మక.. అన్యాపదేశ.. వ్యక్తీకరణే ఆధునికాంతర ధోరణి అనుకుంటే.. ఈ లక్షణాలన్నీ సలక్షణంగా పుణికి  పుచ్చుకున్న అక్షర కణిక రవి వీరెల్లి 'చిన్నోడి అమ్మ'

 

ఉదయం ఎనిమిదింటికేమో పిల్లాడిని ముస్తాబు చేసి బడి బస్సెక్కించిదా తల్లి. ఏళ్ళతరబడి ఎదురు చూపులు ఎలా అవుతాయో?!.. అని మనమా ఆశ్చర్య పోతుంటామా.. 'ఏళ్లేమిటి.. యుగాలవాలి కాని' అని  ఆ అమ్మ మనసనుకుంటుంది!ఆషాఢ మాస ప్రథమ దివసాన ఆకాశ మార్గాన సాగే కారు మేఘాన్ని చూసిన యక్షుడి మనసును  కాళిదాసు ఆవహించినట్లు.. ఆ తల్లి చిత్రమైన  మనసులోకి విచిత్రంగా పరకాయ ప్రవేశం చేయగలిగాడు కనకనే  రవి పుస్తకాల సంచిని ఉరేగే దేవుని పల్లకీగా మార్చేసి తల్లి బిడ్డల్ని  భుజాలు మార్చుకునే భక్తులుగా చూడ గలిగాడు. రావాల్సిన బస్సు కొసం ఎదురుతెన్నుల చూసే తల్లి ఆ నిలువు కాళ్ల ఉద్యోగం నిర్వహించే ఆ కాస్సేపూ   ఖాళీగా ఉండలేక పోవడం, ఖాళీ కేరింతల మూటలు విప్పుకుంటూ బావురుమంటున్న ఇంటి ముందు.. లోకంలోని ఎదురుచూపునంతా కుప్పబోసి కూర్చోనుండటమూ.. ఇదంతా మరేమిటి?తల్లి బిడ్డలంటే  ఒకే పేగుకి రెండు తలలు కదా! తప్పక అవి విడిపోయినా..తిరిగి కలిసినప్పుడు మాత్రం ..ఒకే ఆత్మ రెండు ముక్కలు పునరాలింగనం చేసుకున్నట్లే ఉంటాయి మరి. విడిపోయి గడియయిందా..యుగమయిందా..అన్నది  కాదు లెక్క.. అరనిమిష విరహానంతర దశా ఆత్మల ఆలింగనాలంత గాఢంగానే ఉంటుంది కాబోలు. 'ఆత్మల ఆలింగనం' అన్న పదబంధం ఎంచుకోవడంలోనే కవి ప్రతిభ కనబడుతోంది. ఒక దశ దాకా 'పిల్లవాడిని గురించి పిల్లవాడికన్నా ఎక్కువ తెలిసుండేది తల్లికే' అన్నది మానసిమశాస్త్రవేత్తలూ ఒప్పుకుంటున్న సత్యం.  'పసుపు పచ్చని సీతాకోక చిలుక..పంచప్రాణాలని మోసుకొచ్చే వేళలో పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా.. విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగే చిన్నోడిని ఆత్మాలింగనం చేసుకుంటో పలకరింతల పులకింతలతో పాటు దేవుడి పల్లకీలాంటి పుస్తకాల సంచీనీ భుజం మార్చుకుని ఇంటి దేవాలయం వేపుకి సాగివచ్చే ఆ చిన్నోడిని.. ఆ అమ్మచిన్నోడిని చూసీ చూడంగానే..రాసుకున్నవీ నాలుగు ముక్కలు. పసివాడి నాలుక రంగు చూడకుండానే ఏ ఐస్క్రీమ్ బార్ తిన్నాడో పసిగట్టే తల్లి కళ్ళలోని ఆ మెస్మరిజం లాంటిదేదో.. మంచి కవిత్వం కంటపడగానే మురిసిపోయే నా మానసునూ ఆవరించి ఉండాలి.  

రవి కవితకు ఇది విశ్లేషణ అనడం పెద్ద మాట. నా 'స్పాంటేనియస్ రియాక్షన్' అని సరిపెట్టుకుంటే సరి పోతుంది. రాసి చాలాకాలమైనా ప్రకటించక పోవడానికి నాసహజ లక్షణమైన బద్ధకం ఒక పెద్ద కారణం.  అసమగ్రమే ఐనా  ఈ రాతకీ మాత్రమైనా వెలుగు చూపించకపోతే రవి ప్రతిభకు వచ్చే లొటేమీ లేదు కానీ..నా 'పాటు' వృథా ఐపోతుందేమోనని స్వార్థం. నా సాహసానికి మన్నించి..నా తప్పుల్ని సహించమని విజ్ఞులకి విన్నపం.

'చిన్నోడి అమ్మ' అమ్మ రవి వీరెల్లికి ఆలస్యంగానైనా అభినందనలు. ఇంత మంచి కవిత చదివించినందుకు 'సారంగ'కు డిలేడ్ ధన్యవాదాలు.

-కర్లపాలెం హనుమంతరావు

2013

 

సామెతల సౌందర్యం -కర్లపాలెం హనుమంతరావు- - బోథెల్; యూ.ఎస్.ఎ

 

                                                                    



గంగ ఈతకు.. గరిక మేతకు అని సామెత. సృష్టిలోని ఏ వస్తువు మనిషికి ఏ విధంగా ప్రత్యేకమో సూటిగా తేటగా చెప్పే ఇట్లాంటి వాక్యాలే సామెతలు అవుతాయి. ఏదో సందర్భంలో ఎవరో వాడినా, అన్ని కాలాలకు అందరికీ సమానంగా వర్తించే   ధర్మసూక్ష్మం కలిగివుండటం ఈ సామెతల రమ్యమర్మం.  సాధారణంగా సామాన్య జనం మధ్య  నలిగినప్పుడే సామెతలు నానుడులుగా స్థిరపడేది. సామాజిక ప్రవర్తన, మనిషి మనస్తత్వం, లోకాన్ని అతగాడు అవలోకించే విధానం, లోకం అతగాడి లోకాన్ని అంచనా కట్టే పద్ధతి.. అన్నీ ఒక చిన్ని వాక్యంలో ఎంతో లయబద్ధంగా వినగానే ఆలోచనలో పడవేసే తీరులో పొదగడం ఏ మహాపండితుడూ పనిగట్టుకుని కూర్చుని బుర్రచించుకుని మరీ చేసిన విద్యత్ విన్యాసం కాదు.ఏ  పొలంగట్టు మీది పోరగాడో తన పనిపాటుల్లో  భాగంగా అలవోకగా అప్పటికప్పుడు అనేసే మాటలవి. వాటి లోని విషయం సమాజానికి అంతటకీ అతికినట్లు సరిపోయే విశేషమే అయితే అదే సామెతయి క్రమంగా విస్తరిస్తుంది. 'తరి మెడకు ఉరి' అనే మాట పల్లెపట్టుల వైపు ప్రచులితంగా వినిపించే సామెత. ‘తరి అంటే గ్రామీణుల భాషలో మాగాణి పంట’.  సామెతలలో ఎక్కువగా వినిపించే మాండలిక పదాలు  అర్థమయితే ఆ నానుడిలోని లోతు ఇట్టే బుర్రకెక్కుతుంది. వెయ్యిమాటలైనా చెప్పలేని టీకా తాత్పర్యాలు సామెతలు  చిన్ని చిన్ని పదాలతో మనసుకు హత్తుకునేటట్లు చెప్పేస్తాయి.. ఒక్కోసారి మొట్టినట్లు.. ఒక్కోసారి బుజ్జగించినట్లు.. ఒక్కోసారి చీదరించినట్లు! నానుడుల్లో నవరసాలేం ఖర్మ! అంతకు మించి ఎప్పటికప్పుడు అవసరమయే నవ్య రసం అప్పటికి సృష్టించుకునే శక్తి దాగివుంటుంది.

'చేసింది పోదు .. చేయంది రాదు' అంటారు పెద్దలు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకునే  డబ్బారాయుళ్ల నైజాన్ని ఉతికి ఆరేసే నానుడి ఇది. అన్ని రంగాలకు సమానంగా వర్తించే లక్షణం ఉండటం అందరి నోళ్లల్లో నానడానికి ప్రధాన కారణం. భాషలో విడిగా కాకుండా, జనవ్యవహారాలలో అసంకల్పితంగా పుట్టుకొచ్చే గుణం ఉండటం సామెత  సహజతకు ప్రధాన సౌందర్యం. జనం నోళ్లల్లో తరాల తరబడి నానే పదాల సమాహారం కాబట్టి సామెత నానుడి గా మారింది.

'రోగమంటే వచ్చింది కాని.. పాలు ఎక్కడి నుంచి వస్తాయ'న్నది ఓ నానుడి. ఎప్పుడు.. ఎవరు.. ఏ సందర్భంలో పుట్టించారో!  ఇప్పటి కరోనా మహమ్మారి వాతావరణానికి  అచ్చంగా అతికినట్లు సరిపోవడం ఆశ్చర్యంగా లేదూ! అదే సామెతలోని విలక్షణత.

'పాండవులవ సంపాదన దుర్యోధనుల పిండాకూళ్లకు సరిపోదు!' ని ఓ నానుడి. చూడ్డానికి ఇది వేలడంత వాక్యమే అయినా,  అర్థం వివరణకు దిగితే దానికదే   మహాభారతమవుతుంది. యుద్ధంలో విజయం సాధించి అధికారం పొందినా పాండవులకు సుఖం లేదన్న భావాన్ని ఎంతో చమత్కారంగా జన వ్యవహారాలకు సంబంధించిన పరిభాషలో చెపితే వినడానికి  రసరమ్యంగా ఎందుకు ఉండదు!  తామే చంపినప్పటికీ దాయాదులైన కారణంగా  ఆ సోదరులు  మరణించిన తిధి ఏటా విధాయకంగా నిర్వహించడం వంటి కర్మకాండలు ఎంతటి మహారాజుల హోదా లభించినప్పటికీ నిర్వహించక తప్పదు. పరిపాలకులు కదా! ప్రజలకు ఆదర్శంగా ఉండక తప్పని ఇరకాటం. కానీ, ఆ కర్మకాండలకు అయే ఖర్చు.. రాజ్యంలో వసూలు చేసే శిస్తులను మించి ఉంటోంద’న్న ఎత్తి పొడుపు ఈ సామెతలో సుస్పష్టం. తరహా సామెత మేము పని చెసి, రిటైరై వచ్చిన బ్యాంకులకు మా బాగా వర్తిస్తుంది. కుంగతీసే  మొండి బకాయిల మూలకంగా ఏర్పడే నష్టాలు పూడ్చుకునేందుకు మరో మేలైన మార్గం వెతుక్కోవలసింది పోయి ప్రభుత్వ బ్యాంకులు కొత్త శతాబ్దిలో  సిబ్బంది.. వారి జీత భత్యాల భారం తగ్గించుకునే నిమిత్తం హ్రస్వదృష్టితో బలవంతపు పదవీ విరమణల పథకం చేపట్టింది. పని చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ దాదాపుగా సగం మంది ఆరోగ్యవంతులైన  సిబ్బందితో అప్పటికి ఆకర్షణీయమైన చెల్లింపుల విధానం ఆశగా చూపించి   పదవీ విరమణలు దిగ్విజంగా చేయించాయి. అప్పుడు చేసుకున్న ఒప్పందాల  ప్రకారం  నెలనెలా మా పింఛనుదారులకు చెల్లించే పింఛనుకే ప్రస్తుత వ్యాపారాల నుండిస్తోన్న  లాభాలు చెల్లిపోతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులకు పై సామెత అతికినట్లు సరిపోవడమే కాదు.. ఆ సామెతలోని  తుగ్లక్ చర్యల పట్ల వెటకారం కూడా కొట్టొచ్చినట్లు  తరువాత చేసుకొనే నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది.

హాస్యం, వెటకారం సామెతల ప్రాణనాడులు. సాహిత్యంలోని తతిమ్మా విభాగాల నుంచి విదీసి సామెతలను విశిష్ట పీఠం పై అధిష్టింపచేసేవి కూడా ఈ తెనాలి రామకృష్ణకవి శైలీ విన్యాసాలే! 'ఎమి తిని సెపితివి కపితము' అని ఆయన ఆనాడు అల్లసాని పెద్దన వంటి అఖండుడినే ఒక సందర్భంలో వెటకారం చేసిన సందర్బానికి నకలు ఈ తరహా ఎత్తిపొడుపు సామెతలు. సామెతలు సామాజిక ప్రయోజనం కూడా కలిగి ఉండటం ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశం.

బిరుదరాజు రామరాజు నుంచి.. వెలగా వెంకటప్పయ్య వంటి ప్రాజ్ఞుల వరకు ఎందరో విద్వత్వరేణ్యులు ఈ సామెతల విభాగంలో ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి చెప్పుకోతగిన సమాచారం సేకరించారు. 'తినక చవి.. చొరక లోతు తెలియవు' అని సామెత.  లోతులలోకి వెళితే తప్ప నానుడుల సాగరంలోని మణి మాణిక్యాలు బయటపడవు మరి! ఇది కొండకు పట్టిన చేతి అద్దం మాత్రమే!

సామెతల పర్వత సమగ్ర సందర్శనానికి ఈ స్థలం అభావం. విందు భోజనానికని పిలవకపోయినా ఆహ్వానించి నోళ్లు తీపి చేయకుండా వీడ్కోలు చెప్పడం మన తెలుగు సత్సంప్రదాయాలకు విరుద్ధం. కాబట్టి మచ్చుక్కి ఓ డజను సరదా నానుడులు.. వీలైనంత వరకు సమకాలీన ధర్మానికి.. అదీ రాజకీయ రంగానికి  కట్టుబడినవే! చిత్తగింజండి!

 

1.పిలిచి పెద్దపులికి పేరంటం పెట్టినట్లు

[చరిత్ర చూడకుండా ఎన్నుకుంటే నేరస్తులే నెత్తికెక్కి మొత్తుతారన్న హెచ్చరిక సుస్పష్టం]

2.దోవన పోయేదొకడు.. దొబ్బులు తినేదింకొకడు!

 [.పి. పంచాయితీ ఎన్నికల జాతర్లో ఎంపాయీస్ యూనియన్లది ఇప్పుడదే గతి]

3.పక్కలోకని ఫకీరోణ్ణి పిలిస్తే, లేవదీసుకు పోయి మసీదులో కాపురం పెట్టాట్ట!

  [మంచి చేస్తారన్న ఆశతో ఓటేస్తే.. మెజారిటీ అలుసుతో దేశం మొత్తాన్ని మతం గంగలో ముంచేసే నేటి దుస్థితి]

4.పూజ కన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం

 [జనస్వామ్య మహిమలు జపం చేసే నేతలు తప్పక అనుసరించాల్సిన లౌకిక సూక్తి]

5. మాంసం తినేవాడు పోతే .. బొమికలు తినేవాడు వచ్చినట్లు                  [అవినీతి కాంగీ కూలినా.. మతనీతి భాజపా జనం నెత్తి మొత్తుతున్నట్లు]

6. మొండి చేతితో మూరలు వేసినట్లు

  [చేసేది సున్నా అయినా..  కోసేవి కోటలు దాటుతున్న నేటి నేతలు టప్పాలు]

7.సింహం కూడా చీమకు భయపడే రోజొకటి వస్తుంది.

 [అన్నదాతల ఆందోళన]

 8.మాసిన తలకు మల్లెపూల సింగారం

 [దిగనాసిల్లే దేశ ఆర్థిక స్థితి]

9. ఒయసు తప్పినా ఒయ్యారమే

   [చంద్రబాబు]

10.పిల్లి తోక ఎద్దు ముట్టితే, పిల్లి  ఎలుక దిక్కు ఎర్రగించి 

   [కేంద్రం  చిందులేసినప్పుడల్లా జగన్ చంద్రబాబు మీద నిందలేస్తున్నట్లు]

11.రాజులకు పిల్ల నిస్తే రాళ్లకిచ్చినట్లు

  [కేంద్రంలోని పార్టీకి వేసిన ఓట్లు గుళ్లలోని విగ్రహాలకు వేసినట్లు]

12.సన్నపని చెయ్యబోతే సున్నం సున్నం అయ్యిందట

  [ఏపి మూడు రాజధానుల నిర్ణయంలో.. ప్రభుత్వానికి ఎదురవుతున్న అనుభవాలు]

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,  యూ.ఎస్

28 -01 -2021

 

 

 

Wednesday, January 27, 2021

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు
న్యాయం అంటే న్యాయస్థానాలలో వినిపించే చట్ట సంబంధమైన వ్యవహారం ఒక్కటే కాదు. వ్యవహారానికి, భాషకు సంబధించిన అర్థాలలో కూడా ఈ ప్రయోగాలు కనిపిస్తాయి.
ఎక్కడైనా అన్యాయం జరిగితే 'ఇదేం న్యాయం?' అని నిలదీస్తాం కదా! అక్కడ ప్రశ్నకు గురయే న్యాయం సహజన్యాయం, సామాజిక న్యాయం, వైయక్తిక న్యాయం .. మొత్తానికి నిత్యకృత్య జనవ్యవహారానికి సంబంధించిన న్యాయం.
ఆ అర్థంలో కాకుండా ఇంకో అర్థంలో కూడా 'న్యాయం ' అనే పదం వ్యవహారంలో ఉంది. కాకపోతే అది సాధారణంగా నిత్యకృత్యాలలో కాకుండా ఏ సాహిత్యానికి సంబంధించిన అలంకారం కిందనో వాడుతూ పండితులు, కవులు, చమత్కారులు మెరుగులు పెట్టారు. ఆ తరహా సాహిత్య సంబంధమైన న్యాయం 'చందన న్యాయం'. ఆ సుందరమైన తెలుగు పదప్రయోగం గురించిన కొంత సమాచారం మిత్రులతో పంచుకుందామనే ఈ టపా!
తెలుగే అసలు పెద్దగా వాడకంలో లేని ఈ రోజుల్లో 'చందన న్యాయం' వంటివి చక్కని పదాలే అయినా మూలన పడిపోయి ఎక్కడా వాడుకలో లేనప్పుడు ఎందుకు ఈ చర్చ? అని కొద్దిమంది బుద్ధిమంతుల ఆలోచన కూడా అయివుండవచ్చు! కాని, ఇంచక్కని తెలుగు రాయాలనుకునే ఔత్సాహికులకు కొన్ని కొత్త పదప్రయోగాలు (నిజానికి ఇవి పాతవే.. వాడేవారు కరవై మనకు కొత్తగా అనిపిస్తున్నాయి గాని ఇప్పుడు) వాటి అర్థాలు, తత్సంబధిత ప్రయోగాలు, అన్వయాలు అవగాహనకు వస్తే శోభ ఉట్టిపడే తెలుగుకు మళ్లీ పురుడు పోసిన తల్లులవుతారు కవులు, రచయితలని నా క్షోభ.. ఇక చర్చ తగ్గించి చందన న్యాయం పద ప్రయోగానికి వద్దాం. దాని కన్నా ముందు 'చందనం' అనే మాటను గురించి కొద్దిగా!
చందనం ఈ మధ్య కాలంలో మనకు బాగానే పరిచయం అయిన పదం. ఎర్ర చందనం దొంగ వీరప్పన్ మహానుభావుడి చలవ వల్ల అప్పట్లో ఏ దినపత్రికలో చూసినా చందనం తాలూకు వార్తలు, చర్చలే కనిపించేవి. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయీ కాగానే (2014) తిరుపతి శేషాద్రి అడవుల్లోకి జొరబడి వచ్చేసి అక్రమంగా ఎంతో విలువైన చందనం దుంగలను మొదలంటా కొట్టుకుపోయి అమ్ముకునే ముఠా తాలూకు దొంగలను ఒక్కపెట్టున ఎన్కౌంటర్ లో ఠా అనిపించి సంచలనం చేసిన కథ గుట్టుగా సాగిందేమీ కాదు.
తెలుగు రాష్ట్రాల తాలుకు ముఖ్యమైన వనరుల్లో అత్యంత విలువైన వాటిలో ఇనుము ఖనిజాన్ని ఒక వంక గాలి జనార్దన రెడ్డి భూగర్భం నుండీ పెళ్లగించి మరీ సొమ్ముచేసుకుపోతే, మరో వంక నుంచి అంతకు మించిన ఖరీదైన చందనం దుంగలను శేషాద్రి అడవుల్లో ప్రాంతాలలో దొరికే శ్రేష్టమైన చందనం శ్రేణి దొంగదారుల్లో దారుణంగా పక్క రాష్ట్రాల గుండా విదేశాలకు తరలిపోయింది. అప్పట్లో అది మన బోటి మధ్య తరగతి చదువుకున్నజీవులకు న్యూస్ పేపర్లలో, టీ.వీలల్లో టీ కాఫీలు చప్పరిస్తూ చదువుకొనే సినిమా కబుర్లకు మల్లే వినోదం మాత్రమే కలిగించింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయం తెలుగువాడికే పట్టింది కాదు ఎప్పట్లానే! ఆ విలువైన చందనం గురించి ఒక చిన్న 'న్యాయం' ప్రబంధ కావ్యాలలో కనిపిస్తుంది. దాని పేరే 'చందన న్యాయం'.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి ప్రతీ ఆషాఢ పూర్ణిమలో వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మంగళ వాయిద్యాల మధ్యన సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని అర్చకులు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామికీ విశేషంగా అభిషేకాలు జరిపించి చందనాన్ని కిరీటంగా అలంకరించడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. చందనానికి సంబంధించి దాదాపు అన్ని దేవుళ్లకూ ఒకే రీతిలో చర్చలు, నైవేద్యాలు. ఇప్పుడు మన అంశం అది కాదు.
చందనం అనగానే 'జయదేవుని గీత గోవిందం తాలూకు అష్టపదుల్లోని 'చందన చర్చిత నీల కళేబర! పీత వసన! వనమాలీ' అనే అష్టపదుల్లోని పదం కూడా మనసులో మెదిలి తపించే మనసు ఎందు చేతనో కొంత సేదతీరుతుమ్ది. సేదతీర్చే ఔషధ గుణం బౌతికంగా కూడా చందనం ప్రత్యేక లక్షణం. మాటలోనే కాదు.. పూతలో కూడా మనసునూ, శరీరాన్ని చల్లబరిచే అరుదైన పదార్థాలలో చందనం ప్రధానమైనది!
ఇప్పుడంటే రకరకాల ఆయింట్ మెంటులు, స్నోలు, కాస్మొటిక్స్ వాడకంలోకి వచ్చాయి కాని, ఇవేవీ సామాన్య జనానికి అందుబాటులో లేని కాలంలో కాలిన గాయాలకు ముందు చందనం అరగదీసి మందులా అద్దే వారు. అందుకోసం గాను ప్రతి ఇంట్లో చందనం చక్కలు ఉండేవి. వాటి మీద కొద్దిగా నీరు పోసి బొటనవేలుతోనో , మరో చిన్న చందనం పేడుతోనో గట్టిగా పదే పదే రుద్దితే ఆ నీటిలో చందనం కలిసేది, ఆ లేపనాన్ని గాయానికి పట్టించడం ఇప్పటి మన ఫస్ట్ ఎయిడ్ చికత్సలాంటిది. చందనం పీటలు గ్రామ సంతల్లో బాగా అమ్ముడు పోయే గృహ చికిత్స పరికరాలలో ఒకటి.
చందనానికి పవిత్ర గుణం కూడా ఆపాదించడం చేత దేవుడి విగ్రహాలకు చందనం పూతలు ఒక ధార్మిక కార్యక్రమం దేశమంతటా సాగుతుంటాయి. చందన చర్చితం అంటే చందనాన్ని మెత్తని పేస్టులా వంటికి మొత్తం పట్టించడం. వాస్తవానికి మనుషులూ వంటి నిండా చందనం పట్టించుకుని కొన్ని గంటల పాటు ఆరనిస్తే వంట్లో ఉన్న వేడిమి మొత్తం దిగలాగేస్తుంది. కానీ అత్యంత ఖరీదైన చందనం మామూలు మనిషి వంటి నిండుగా ఎట్లా పట్టించుకోగలదు?
గతంలో మహారాజులకు ఆ విధమైన చికిత్సలు జరుగుతుండేవి. ఇక కావ్యాలు రాసే కవులకయితే కదిలితే మెదిలితే విరహ తాపంతో అల్లాడే నాయికల వంటికి సఖుల చేత చందనం పట్టించడమే ముందు గుర్తుకు వచ్చే గొప్ప శృంగార చర్య. ప్రబంధాల నిండా చందనం వంటి సుగంధ భరిత శృంగార పద్యాలే. వాటి ప్రస్తావన మరో సందర్భంలో చేసుకుందాం.
వంటి నిండా పట్టించక పోయినా శరీరంలో ఏ కొద్ది భాగానికి చందనం అలదితే దాని ప్రభావం శరీరం మొత్తానికి పాకి అవయవాలకు తొందరగా స్వాస్థ్యత చేకూరుతుందని ఆయుర్వేదం చెపుతుంది. ఆ విధంగానే బొటన వేలంతైనా ఉందో లేదో, అసలు ఎక్కడుందో కూడా ఉనికి తెలీని మనసు (ఆధ్యాత్మిక వాదుల పరిభాషలో ఇది అంతరాత్మ) ఆరడుగుల శరీరం మొత్తాన్ని ప్రభావితం చేయడం ప్రకృతి విచిత్రం కదూ! ఒక కాలు విరిస్తే పట్టుదల గల మొనగాడు మరో కాలు మీద నడవగలడు. ఒక చెయ్యి విరిగినా రెండో చేతితో పనులు అద్భుతంగా చేసేవారు కద్దు. అసలు చేతులే లేకపోయినా కాళ్లతో చేతులకు మించి చక్కగా పనులు చక్కబెట్టే పట్టువదలని విక్రమార్కులు మనకు అరుదుగానే అయినా కనిపిస్తారు.
శిక్షల కింద కారాగారాలలో పడవేసినా బైటికి వచ్చిన తరువాత సలక్షణంగా తమ ధ్యేయం వైపుకు సాగిపోయిన యోదులకు చరిత్రలో కొదవలేదు కదా!. మనిషిని అచేతనుడిని చేసేందుకు, చైతన్యవంతుడిగా మార్చేందుకైనా మనసు మీద ప్రయోగాలు చేసే వైద్యవిధానాలూ ఉండనే ఉండె! వ్యక్తిగత సుముఖత, విముఖతలు రెండింటికీ మనసు మీద జరిగే ప్రయోగాలు రాటుదేలిన రాజకీయాలలో 'మైండ్ గేమ్' పేరుతో విశ్వవ్యాప్తంగా పరమ ప్రసిద్ధం. ఎక్కడుందో తెలియని ఓటర్ల మైండ్ తో నేతలు గేమ్స్ ఆడటానికి కారణం ఇదిగో ఈ మైండ్ కు ఉండే ఈ ప్రత్యేక శక్తే! శత్రువర్గంలోని బంధుమిత్రులను వధించవలసిన సందర్భం ఎదుట పడేసరికి అంత మహాయోధుడు అయివుండీ పాండవ మధ్యముడు డీలా పడిపోయాడు. ఆ గాండీవుణ్ని మళ్లీ గాడిలో పెట్టడానికి పరమాత్ముడు శ్రీకృష్ణుడి బాడీ ద్వారా కేంద్రీకృతం చేసింది అర్జునుడి మనసు మీదనే అని ఆధ్యాత్మికవాదుల ప్రగాఢ విశ్వాసం. పాండవుల మీద పగ తీర్చుకునేందుకై ఎంతో పట్టుదలగా ఎన్నో విద్యలు నేర్చుకున్న కర్ణుణ్ణి సరిగ్గా యుద్ధక్షేత్రంలో నడిమధ్యలో నిర్వీర్యుదుగా మార్చిందీ అతగాడి రథంలాగే గుర్రాల పగ్గం పట్టుకుని ముందు కూర్చున్న శల్యుడి పుల్లవిరుపుడు మాటలే! రాజకీయాలలో రాటుతేలిన నేతల ధ్యాస కూడా ఎప్పుడూ పాడుచేయవలసిన ఎదుటి వాడి మనసు మీదనే!ఉంటుంది. ఆ వ్యతిరేకార్ధంలో కాకుండా సానుకూల భావంతో చూసుకుంటే చుక్కంత చందనం నుదుటికి దిద్ది శరీరం మొత్తన్ని ప్రభావితం చేసే విధానానికి నకలే ఈ మైండ్ గేమ్ ఎత్తుగడలన్నీఅనిపిస్తాయి కాదా ! గీతలో చెప్పినట్లుగా అంగుష్ఠ ప్రమాణంలో ఉండే ఆత్మ (లౌకికుల భాషలో మనసు)ను ప్రభావితం చేయడం ద్వారా మనిషి మొత్తాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే పద్ధతినే కావ్యపరిభాషలో 'చందన న్యాయం' గా చెప్పుకొచ్చారు అలంకారికులు.
సూక్ష్మ పరిణామంలో ఉండే వస్తువు మీద ప్రయోగాలు చేయడం ద్వారా స్థూల పరిణామంలో ఉండే వస్తువు మొత్తాన్ని ప్రభావితం చేసే విధానానికి 'చందన న్యాయం' అన్న పదం అందుకే వంద శాతం సరయిన అన్వయం.
-కర్లపాలెం హనుమంతరావు
27 -02 -2021
బోథెల్, యూఎస్

Monday, January 25, 2021

జల తరంగిణి -కర్లపాలెం హనుమతరావు - ఈనాడు దినపత్రిక సంపాదకీయం

 




పంచ భూతాత్మకమే కాదు.. సహ శక్తులతో భిన్నమైన అనుబంధం కలది జలం. వాయువులో నిక్షిప్తం. అగ్నితో శత్రుత్వం. భూమికి బలిమి. ఆకాశంతో చెలిమి. భూమ్యాకాశల మద్య   రాయబారి.    'సృషికర్త పుటక, సృష్టిభర్త పడక,  సృష్టిహర్త సిగ- జలమే'అని ఒక కవి చమత్కార సమన్వయం. అమృతానికైనా.. హాలాహలానికైనా..  జలనిధే జన్మస్థలి. నిప్పు మనిషి కనిపెట్టింది. నీరు మనిషిని 'కని'పెట్టింది. ఒక్క మనిషనేమిటి.. భోగరాజువారు 'కంకణం'లో సెలవిచ్చినట్లు 'సమస్త జీవరాసులకూ నీరే  జీవనాధారం'. 'స్వాదునీరము త్రావి పద్మము కనువిచ్చె/ మోదవీచికలలో మునిగెను ద్విరేఫమ్ము/ ప్రిదిలి బీటలువారు పుడమి చేడియు మేను/ పదనుతో పులకెత్తు' అని 'వర్షారమణి'లో డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు కొనియాడిందీ జీవాధారమైన సలిల ధారల గురించే.  అన్నం  లేకపోయినా కొంతకాలం బతకవచ్చు. పానీయం లేకుంటే  ప్రాణాలు నిలబడేది కొన్నిక్షణాలే.  ఉమ్మనీరు మొదలు తులసి తీర్థం వరకు మనిషికి నీటికీ మధ్య గల బంధం అంత బలమైనది. సూది మందుకి.. సూతక స్నానానికి, తల మీదకి.. గొంతులోపలకి.. నీరే కావాలి.  దేవాలయం నుంచి శౌచికాలయం దాకా నీరు తప్పనిసరి. దాహానికి, జీర్ణానికి, రుచికి, సుచికి, అందానికి, ఆరోగ్యానికి, పంటకు, వంటకు, ఇంటికి, వంటికి..నీరు అవసరం లేనిది ఎక్కడ..ఎవరికి?  పితృదేవతల పుణ్యావహనం కోసం భగీరథుడు 'శివజటాజూటాగ్ర  గళిత  హిమమణి మిళిత శీకర కిరీటి గంగ'ను భువికి  దించాడు. కురు పితామహుల కోరిక మేరకు పాండవ మధ్యముడు 'పొగలుమిసి సెగలెగసి అడుగులలబడి మడుగు  పాతాళగంగ'ను  పైకి సాధించాడు. భాగవతంలోని రంతిదేవుని ఉదంతమో?  సర్వసంపదలు దానధర్మాలు చేయడం ఒక ఎత్తు. దారా సుతులతోసహా ఎనిమిది దినాలు పస్తులుండీ  దైవవశాత్తు దొరికిన మధురాంబులను క్షుధార్తుడికి ధారాదత్తం చేయడం మరో ఎత్తు.

జీవ ప్రాదుర్భవానికి నీటి లభ్యతే మూలం.  సేకరణ, రవాణా, విసర్జన.. జీవ రసాయన ప్రక్రియలన్నిటికి నీరే మాధ్యమం. అవయవాల సక్రమ కర్మ నిర్వహణకి  క్రమం తప్పని నీటి నిలవలు తప్పని సరి. ఆరు నుంచి ఎనిమిది  లోటాల కొలతకి  మాత్రం వెలితి పడ్డా శాల్తీ అడ్డం పడటం ఖాయమని ఆరోగ్యశాస్త్ర సూత్రం. జీవవ్యవస్థలో నీటిది విశ్వవ్యాప్త ద్రావణి పాత్ర . రసాయనాలేవైనా సరే కరిగే గుణం నీటి లక్షణం. మూడింట రెండు వంతులు మంచి నీరుంటేనే శరీరానికి వాయుపీడనం నుంచి రక్షణ. 'లోటాకి రెండువేల మేలిమి రకాల ఖనిజాలుంటేనే మంచినీరు కింద లెక్క' అంటున్నారు మానవాళి భవిష్యత్తు మీద పరిశోధనలు  సాగించే ప్రజావైజ్ఞానికులు  స్టాంఫోర్డు విశ్వవిద్యాలయ ఆచార్యులు  జాన్ మెక్కార్థీ. స్వచ్ఛమైన నీటి అవసరాలను  గురించి చాలా వివరాలే సేకరించారాయన. బాలింత దశలో  స్త్రీకి కనీసం ఏడున్నర లీటర్ల నీరు అవసరం. రోజుకు మనిషికి రెండు లీటర్లకు  మించి మంచి నీరు దొరకని పరిస్థితి ప్రస్తుతం ప్రపంచానిది. ఐరాస లెక్కల ప్రకారం రెండువందల యాభై కోట్లమంది నిర్భాగ్యులు పారిశుద్ద్యవసరాలకైనా నీరు నోచుకోవటం లేదు! శిశుమరణాలకు అతి పెద్ద రెండో గండం మురికి నీరే. నీటిరోగాల వల్ల రోజుకు నాలుగున్నర కోట్ల బడి దినాలు నష్టపోతున్నామని అంతర్జాతీయ విద్యా వేదికల  ఆవేదన. ఎదిగిన  బాలికలు చదువులకు దూరమవడానికి, చదువులకు వెళ్ళే పిల్లలు వింత రోగాల పాలవడానికి  పాఠశాలల అపరిశుభ్రతే  ప్రధాన కారణమని  ప్రతి ఏటా  సర్వేలూ మొత్తుకుంటున్నాయి. భూగోళం  వేడెక్కుతున్న కారణంగా హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులు తరిగిపోతున్నాయి. నేలమీది నీరు ఆవిరైపోయి తాగునీరు అందనంత ఎత్తుకి ఎగిరిపోతున్నది. 'ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది' అని ఒక తెలుగు చిత్రం పాట. నీటికున్న ఉలికిపాటైనా మనిషికి లేకపోవడమే వింత! నగరాల్లో  బోర్ల ముందు  బిందెల బారులు.  బస్తీళ్లో నీళ్ళబళ్ళ వెనక  పరుగులు. పల్లెపట్టుల్లో ఒక్క నీటిబొట్టు కోసం కోసులు కొద్దీ ప్రయాణాలు. విశ్వవ్యాప్తంగా ఇవే వీధి భాగవతాలు.

తాగుకి, సాగుకి, పాడికి, పరిశ్రమకి..  నీరే మొదటి అవసరం. సీసాలో నింపి వ్యాపారం చేసేందుకూ నీరే ముడి సరుకయింది ప్రస్తుతం! దేశాలు , రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య వివాదాలకీ నీరే కారణం. భూతలం మీద నాల్గింట మూడు వంతులు నీరే.  ఘన, ద్రవ, వాయు స్థితుల్లో విస్తారంగా దొరుకుతున్నదీ నీరే. ఐనా నీటి జాడల కోసం వేరే గ్రహాల వెంట పడాల్సిన దుస్థితి దాపురించిందెందుకు? భావి అవసరాలకి సరితూగే నీటి నిల్వలు భూమ్మీదే  భద్రపరుచుకునే తెలివి ఉండవద్దా?కరవు ప్రకృతి పరంగా ముంచుకొస్తే  ముందస్తు అదుపు  చర్యలు తప్పవు సరే.. మరి మానవ తప్పిదాల మాటేవిటి?రోజు గడిచే లోపు ఇరవై లక్షల టన్నుల చెత్త మంచినీటిని కలుషితం  చేస్తున్నది.యుద్దాలు, రహదారి ప్రమాదాలు,  ఉగ్రవాదుల దాడులు, ప్రాణాంతక వ్యాథులన్నీ కలుపుకొన్నా కలుషిత జలాలవల్ల జరిగే చెరుపుకు సరి తూగటం లేదు. ఎరువులు, పురుగుమందులు ఎడాపెడా వాడకం, బొగ్గు విద్యుత్తుకూ మంచినీరు దుర్వినియోగం.. ఎంత వరకు సమర్థనీయం? నీరు పసిడికి మించి మిడిసి పడుతున్నప్పుడు తరచు మాంసాహార విందులతో మజాలెందుకు?వరి సాగును తగ్గించి  రాగులు, జొన్నలు పండిస్తే సాగునీరు మిగులుతుందని వ్యవసాయశాఖల సూచనలు..చెవిన పెట్టేదెవరు? ఇజ్రాయెల్ దేశ పద్దతిలో బిందుసేద్యమూ   మంచి మందే. పొదుపులన్నిటిని  మింగేసే జనాభాను అదుపు చేసుకోవాలి ముందు. నీటి సరఫరా మెరుగుపడితే ఒనగూడే లాభాలో! 'అపారం' అంటున్నాయి గణాంకాలు. ఆరోగ్యవంతుడి ఉత్పాదకశక్తి స్థాయి  అత్యుత్తమంగా ఉంటుందంటుంది వైద్యశాస్త్రం. బీమా మీద ఆదా అయే నిధులు  నిర్మాణాత్మక విధులకు మళ్ళించుకోవచ్చు.  నీటిని మనిషి  ప్రాథమిక హక్కుగా పరిగణించమనడానికి ఐరాసకి ఇంకా ఇన్ని కారణాలు. తాగునీటి వృథాకి ముంబైలో జైలు శిక్షో.. జరిమానానో ఎదుర్కొనాల్సి ఉంది!   నీటి దుర్వినియోగాన్ని   నేరంగా పరిగణించే దారుణ పరిణామాలు ప్రపంచమంతటా   దాపురించరాదనే ఐ.రా.సా  ముందస్తు జాగ్రత్త. నడుస్తున్న దశాబ్దాన్ని(2005-2015) 'జీవనం కోసం జలం' దశాబ్దంగా, ఏటి అంతర్జాతీయ  జీవవైవిధ్య దినం(మే 22) అంశాన్ని 'నీటి కోసం సహకారం'గా ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటన వెనకున్న పరమార్థం ఇదే.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం కోసం రాసినది)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...