Showing posts with label words. Show all posts
Showing posts with label words. Show all posts

Saturday, December 11, 2021

భాషా చరిత్ర: సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! - కర్లపాలెం హనుమంతరావు

 భాషా చరిత్ర: 

సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ ప్రయాస ఎందుకు విఫలమైందంటే! 

- కర్లపాలెం హనుమంతరావు 


తెలుగులో ఉన్న అనేక నిఘంటువులలో సూర్యరాయాంధ్ర నిఘంటువూ  ఒకటి.  ఇది  సాకారమయే దిశగా  

ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు  పడిన శైశవ ప్రయాస  వరకు ఈ వ్యాసం పరిమితం. 


తెలుగు భాషలోని శబ్దజాలం యావత్తూ    రూప, అర్థ భేదాలతో  సహా  సర్వ సమగ్రంగా, సప్రమాణికంగా  ప్రదర్శించే   ఒక బృహన్నిఘంటువు  అవసరమయిన కాలం అది.    ఆ బాధ్యతను  ఆంధ్ర సాహిత్య  పరిషత్తు స్వచ్ఛందంగా స్వీకరించడం పరిశోధకులకు, భాషాభిమానులకు ఆనందం కలిగించింది.  1939 లో అజాది పదాల సంగ్రహంగా  మొదటి భాగం వెలువడినప్పుడు  లోపభూయిష్టమైన ఆ అరకొర ప్రయత్నం   ఆశాభంగమూ  కలిగించింది. 

 ప్రథమ ప్రయత్నమే  అభాసుపాలవడంతో  తదనంతర ప్రణాళిక యావత్తూ పరిషత్తువారి అటకెక్కడానికి కారణమైన లోపాలు కొన్ని పరిశీలిద్దాం. 

  

తత్సమ, దేశ్య, వికృతి పదాలతో కలగలసిపోయిన భాష  మన తెలుగు భాష.  దాని ఆద్యంతాల అంతు తేల్చడం అనుకున్నంత  సులువుగాదన్న సత్యం పరిషత్తుకు అనుభవం మీదగాని తలకెక్కింది కాదు.     

భాష  సమగ్రరూపం పైన అవగాహన - అంటే  ఏ పదం ఎక్కడ ఏ విధంగా పుట్టి ఎట్లా కాలానుగుణంగా  మార్పుచెందుతూ .. సాటి భాషాపదాలను  ఏ విధంగా ప్రభావితం చేసిందో  అర్థం చేసుకోవడం. 


ఎంతో మంది పండితులు ఎన్నో ఏళ్లుగా శ్రమించి  అపారమైన   ధనం వెచ్చించీ .. తగిన సాధన సామాగ్రి లభ్యత కొరత  వల్ల నిఘంటు నిర్మాణ ప్రక్రియను మధ్యంతరంగా విరమించుకొన్నట్లు  పరిషత్తువారే  స్వయంగా ప్రకటించుకున్న వైనం గమనించ దగ్గది.  నిఘంటువు  ప్రథమ ప్రయత్నం తరువాతా  భాషలోని మునపటి అసమగ్రతకు  వీసమెతైనా చేటు కలగలేదు.   ఈ మొదటి ప్రయత్నం ఏ స్థాయిలో  విఫలమయినట్లో  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. 


లోపాయి  స్థాలీపులాక న్యాయంగా: 

 

నాటి కాలపు మహా పండితులుగా గుర్తింపు పొందిన కీ.శే  జయంతి రామయ్య పంతులుగారు అన్నట్లుగా  భారతంలో గల  వేలపదాలలో కనీసం వంద శాతం అయినా  ఈ నిఘంటువులో  చోటు చేసుకోలేదు.  మహాభారతంలో కనిపించే అంజలికము , అంపపెట్టు వంటి   సుమారు 500 పదాలు  అబ్బరాజా సోదరులు నిర్మించిన భారత నిఘంటువులోనివే  పరిషత్తువారి నిఘంటువులో  కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. వీలును బట్టి కొత్త శబ్దాలను కూడా పరిణనలోకి తీసుకోవలసిన అగత్యాన్ని నిఘంటువు వాటిని విస్మరించింది.  పంతులుగారి  తరహాలోనే ఇతరులు  ఎత్తి చూపిన  లోపాలలోని  ఒకటి రెండు మాత్రమే ఇక్కడ ఉదాహృతాలు.  ఇంత రసాభాసా అజాది ప్రారంభ విభాగ ప్రయాసలోనే!  


పంతులుగారే   మరో చోట అన్నట్లుగా  ఉపసర్గ  శత్రంతాది పదాలు  సైతం  తృణీకరణకు గురి అయిన సందర్భంలో దీనిని నిఘంటువుగా గుర్తించడం కుదరని పని. 


భారతమనే కాదు; చాలినన్ని కావ్యాలకు ఈ అపరిగ్రహీత దోషం అంటగట్టిన ఘనం ఈ  నిఘంటువు ది. శాస్త్రార్థం ఒకటి రెండు: 


పాండురంగ మాహాత్మ్యం ప్రస్తావించే అథ: ప్రపంచము, భీమేశ్వర పురాణంలోని అట్టహాసము, కాశీ ఖండవలు  తాలూకు  అనాక ,  హరవిలాస పాస్తావిత  అనాదల , క్రీడాభిరామం ప్రవచించిన  ఇరుచంబడు.. ఇట్లా ఎన్ని పదాలనైనా  చెప్పుకుపోవచ్చు.  


దేశ్య పదాలకూ ఇదే దుర్గతి. ఆంధ్ర పండితులకు తెలుగు భాష పట్ల చులకన.  కండగల చిక్కని తెలుగు పదాలు కాలగర్భంలో కలసిపోవడానికి ఈ తరహా పండితుల మితిమీరిన సంస్కృత భాషా మమకారమే కారణం.  'తెలుగు వాళ్లకు 'దీపము ' తెలీదు; పాపపుణ్య వివేచన లేదు.  దేవుడును ఎరుగరు- అన్న నానుడి వూరికే రాలేదు. దీపం, పాపపుణ్యాలు , దేవుడు దేశ్య పదాలు ( తెలుగు పదాలు) కావడమే  కారణం. 


అచ్చు తెలుగు పదాలను జల్లెడ  పట్టాలంటే దేశ సంచారం అవసరం. సాధారణ జనంతో సంపర్కం వినా చక్కలి తెలుగు నిఘంటువు కూర్పు అసాధ్యం. నిఘంటువు నిర్మాతలు  తాము తయారుచేసుకున్న పట్టికలను జనసామాన్యం ముందుపెట్టి అందులో లేని పదాలను నిరపేక్షంగా స్వీకరించినప్పుడే  ఆశించిన సమగ్రతకు అర్థం చేకూరేది. 


తెలుగు భాషలో లేవని తాము  భ్రమించిన పదాలకు తత్సమాల పేరిట  సంస్కృతాది పరభాషల  నుంచి బలవంతంగా ఈడ్చుకువచ్చినందు  వల్లనే  నిఘంటువు తన సహజతను కొల్పోయింది.     


అబ్బరలు  అనే తెలుగు పదానికి ఇతరములు అనే పదం దాదాపు స్థిరపడిపోయిందిప్పుడు! అతకం అనే అచ్చుతెలుగు పదానికి ప్రాత: అనే సంస్కృత విశేషణంతో  చెప్పులు అనే ఉత్తరాది భాషాపదాన్ని సంధించి ప్రయోగించడం .. ఇందుకు ఉదాహరణలు.  ఎయిర్ హోస్టెస్ కు గగన సుందరి, యూనిఫాం అనే పదానికి ఏక వస్త్రం వంటి ( వి ) కృత పదాలు పుట్టుకు రావడానికి కారణం - తెలుగును ఉద్ధరిస్తున్నట్లు  భావించే    కొన్ని ప్రముఖ మాధ్యమ సంస్థలు     సైతం ఇదే ధోరణి ప్రదర్శించడం. 


 ఏక పదాలు, కొన్ని పదాల సంయోగంతో ఏర్పడే  కొత్త పదబంధంలోని ప్రతి పదానికి  వివరణ ఇవ్వడం నిఘంటువు బాధ్యత . 


ఏనాది, ఏడాది, దక్షిణాది తరహా ఆది' తో మొదలయే  పదాలకు; ఆరుగొండ, ఆరుగొలను, ఆరుంబాక వంటి ఆరు తో ఆరంభమయే పదాలకు; కోనేరు, కొల్లేరు, పాలేరు వంటి 'ఏరు' సహిత పదాలకు నిఘంటువు నుంచి   వివరణ  ఆనించడం సామాన్యం . 


బాలచంద్రుని తల్లి అయితాంబ.  ఈ పదంలోని ' అయిత'  కు ఉన్న అర్థం వివరించి .. ఆ విధమైన పదాలతో కూడినవి  మరేవైనా పదరూపాలు ఉన్నవేమో వివరించవలసింది  నిఘంటువే.  అయితానగరం, అయితవోలు, అయితా పట్నం వంటి పదాలకు మూలమైన అయిత ను గురించి మరీ బల్లగుద్దినట్లు  కాదుగానీ .. రేఖామాత్రంగా అయినా   ప్రస్తావించని పదాల కూర్పును  నిఘంటువుగా అంగీకరించడం ఎట్లా!


మాయాబజార్ చలన చిత్రంలో ఘటోత్కచుడు అన్నట్లుగా  ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? ప్రతి పదం   పుట్టుకకు ఏదో ఓ మూలం  తప్పనిసరి ప్రాతిపదికగా ఉంటుంది కదా! దాని  గుట్టుమట్లు ఆరాతీసి గ్రంథానికి ఎక్కించినప్పుడే  భాషాచరిత్ర కండపట్టేది. 


పదం అంచు వరకు చూడలేని పక్షంలో కనీసం పస్తావించి  వదిలినా  కొంత మెరుగే! తదుపరి నిఘంటు కర్తలకు  అది మరింత  లోతులకు   వెళ్లే  పరిశ్రమకు ఊతం.  ఆ తరహా  నాందీ ప్రస్తావనలకు అయినా   నడుం బిగించక పోగా  ఎంచుకున్న  పదాల లోతుపాతులు తవ్వి తీసే ప్రయాసపైనయినా   నిఘంటు కర్తలు దృష్టిపెట్టలేదు.    


'కొందఱయ్యలు కొనియాడ నేరరు' అనే ప్రయోగం శ్రీనాధుడి శృంగార నైషధం లో కనిపిస్తుంది. 'పిల్లను ఒక అయ్య చేతిలో పెడితే గుండెబరువు తీరుతుంది' అనే నానుడి జనాబాహుళ్యం వాడుకలో ఉంది.  'అయ్య'కు  శ్రీనాథ ప్రకటితమైన 'అయ్య' కు మధ్య ఉండే అర్థభేద వివరణ బాధ్యత నిఘంటుదే. ఆ అక్కర ఈ నిఘంటువుకు పట్టింది కాదు. 


అనుప్రాసము, ఆమ్రేడితము, అద్యాహారము వంటి పదాల వాడుక  శ్రీనాధుడి  తన కావ్యాలలో విస్తృతార్థంలో కనిపిస్తుంది. 'పుండరీకారణ్యమున ధ్యాహారంబు' అని భీమేశ్వర పురాణం లో కనిపించినదానికి' అధ్యాహారమో  కాని అమృతపతికి' అని 'కాశీ ఖండము' లో కనిపించే పదానికి  . . శాస్త్ర పరిభాషలో కాకుండా లక్ష్యార్థంలో వివరణ అవసరం.  ఈ మాదిరి అనేక పదాలను ఈ గ్రంథం దాటవేసింది.  


పురుషవాచకాలకూ  చివరన 'అమ్మ' శబ్దం  వ్యవహారంలో కనిపిస్తుంది. ఆలంకారిక దృష్టితో కవి వాడిన పక్షంలో  కేవలం అర్థంతో  సరిపెట్టి.. కవిసమయాన్ని వదిలేసిన పక్షంలో  కవిహృదయానికి అన్యాయం జరిగినట్లే .   కవుల పరిశ్రమ మూగ చెవిటి ముచ్చటలుగా వృథా అయిన సందర్భాలు ఈ నిఘంటువులో అనేకం! 

 

ఈ నిఘంటువుకు పూర్వమే  శబ్దరత్నాకరం పేరుతో ఒక నిఘంటువు పండితలోకంలో  తిరుగుతోంది . కేవలం అజాది పదాల విభాగపు  భారీతనం కొన్నిరెట్లు పెంచటమే ఈ ' బృహన్ ' నిర్మాణ అంతిమ లక్ష్యం అనుకొమ్మంటే పండితామోదం సంభవమేనా ? 


సంస్కృత వ్యాకరణ గ్రంథాలను ముందేసుకుని తెలుగు భాష సహజతాకు  ఒదగని తీరులో  ఎన్ని పుటలు వండి వార్చినా  వాపు అవుతుందే  గాని గ్రంథానికి పుష్టి అవబోదు . 


మన భాషలోకి వచ్చి చేరిన పరాయి  భాషా పదాల స్వభావం, మనదే పూర్వ సారస్వతంలోనివీ,  వర్తమాన వ్యవహారంలో వాడుకలో ఉన్నవి..  ఒక్క పదమైనా తప్పి పోకుండా పట్టుకుంటేనే అదీ ప్రామాణిక నిఘంటువు.  


తెలుగులో కలగలుపుకు మూలమైన దేశ్య,  వికృతి పదాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి .. ఏ విధంగా  మారుతూ అంతిమంగా తెలుగు పదాలుగా  పరిణమించాయో,  వేటి ప్రభావానికి అవి లోనయ్యయో ..  ఏ భాషా పదాలను ఏ మేరకు ప్రభావితం చేయగలిగాయో .. ఈ ప్రయత్నమంతా  దిగ్విజయంగా సాగని పక్షంలో  కేవలం పుటల పెంపు  వల్ల కలిగే ప్రయోజనం సున్నా. 


తెలుగునామవాచకాల వివరణ కోసమై    మూలధాతువుల పరిణామ క్రమం వివరించడం  అవసరం. అదనంగా ఊళ్ల పేర్ల వివరణ  సందర్భంలో వాటి   శబ్దస్వరూపాలలో జరిగినా  మార్పులతో పాటు చరిత్ర వివరాలు సైతం నిఘంటు కర్తాలకు  తెలిసుండాలి. 


ఒక్క ముక్కలో  చెప్పాలంటే  ప్రతి మాటకూ  సంబంధించిన సమగ్ర సమాచారం ఇచ్చినప్పుడే  అది నిఘంటువు అవుతుంది. ఈ మాదిరి బృహన్నిఘంటువు సాకారం సాధారణ విషయం కాదు. 


పరిషత్తు నిఘంటువు  కర్తల సామర్థ్యాన్ని ఎత్తి చూపే ఉద్దేశంతో రాసింది కాదీ వ్యాసం . తెలుగు భాషకు సంబంధించినంత వరకు ఈ ప్రయాసకు ముందు రాని ' సమగ్ర పద సామాగ్రి సేకరణ ' ఆలోచన  దాని కదే  విశిష్టమైనది. పండితమాన్యులు   ఎందరినో ఒక చోట సమకూర్చుకుని ఏళ్ల తరబడి ధన వ్యయ ప్రయాసలకోర్చి ఒక యజ్ఞంలా బృహన్నిఘంటువును నిర్మించ తలపెట్టిన ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆంధ్ర భాషా చరిత్ర ఉన్నంత కాలం స్మృతి ప్రాయంగా చిరంజీవులే !  ప్రశంసలకు అర్హులే! 


- కర్లపాలెం హనుమంతరావు 

24-10- 2021

బోధెల్ ; యూ. ఎస్ .ఎ 

( ఆధారం : సూర్యరాయాంధ్ర నిఘంటువు - శ్రీ వడ్లమూడి వెంకటరత్నము - భారతి - జ; 1940 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...