Thursday, October 24, 2019

తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు






మన మాతృభాష తెలుగా? అబద్దం. మన మాతృదేవతలు పలికేది తెలుగేనా?!
అచ్చు తెలుగులో 'అమ్మా!' అంటే ఏ తల్లయినా  ఇస్తోందా బదులు? పుచ్చు ఆంగ్లంలో 'ఆంటీ!' అంటేనే ‘యాఁ’ అంటూ ఏ ముసలమ్మైనా కదులు! ‘అంకుల్’ అనకుంటే ఎంతటి క్లోజ్ చిన్నానైనా నెత్తికి పోస్తాడు కుంకుడు పులుసు!
సజీవ భాష అనగా నేమి?
నట్టింట్లో పద్దాకా తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మార్మోగే సెల్ జోరీగ, కంటిని ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. బారిన పడి ఏ భాష  నలుగుచుండునో  అదియే  సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఏనాడో చచ్చినట్లు లెక్కేనా? అమంగళము ప్రతిహతమగు గాక. మరి తెలుగు మృతభాషయినచో అమృతభాష యేది గురువా? ఆంగ్లాంధ్రములు కలిపి పిసికిన  సంకర బంకరా శిష్యా!  తలకట్టు  ఒక్క మన తెలుగుకి మాత్రమే సొంతమైనట్టు  ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!   తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా! 
పూజా పునస్కారం ఆంగ్లాంధ్రమునకు! బడితె పూజా, తుస్కారం అగ్లీ ఆంధ్రమునకు! గుళ్లల్లో  సుప్రభాతానికి బదులుగా  'గుడ్ మాణింగ్' అంటేనేగా  ఆ గాడ్  గారి ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్కయ్యేది సర్వదా! 
వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనేనయా.. దండాలు.. దస్కాలు. సన్మానాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లంటూ గుణుస్తూ కూర్చుంటే  అర దండాలు.. కాళ్లూ చేతులకు అరదండాలు..ఛీఁ.. ఛీఁ  అంటూ చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతానికి మన  తెలుగుతల్లి బతుకీడుస్తున్నది!  ఉద్యోగం, ఉపాధి సంగతులు ఆనకరా ఢింబకా!  మనసు పడ్డ పాపను పడేసేందుకైనా నువ్ ప్రేమలేఖ ఆంగ్లమునే గిలకవలె మొలకా!  ఇంకేం చూసి  తెలుగు మీద మోజు పడాలిరా బళ్లకెళ్లే భడవాయలు అంతా? దొంగవెధవలకు మల్లే మెడల్లో పలకలు గంగడోళ్ళలా  వేలాడేసైనా సరే  బిడ్డలని లార్డు మెకాలే వారసులుగా మార్చేసెయ్యమనే కదా   మన టెలుగు మా.డా(మామ్.. డాడీ)ల సొద! పులులు, పిచ్చుకలు, దున్నపోతులూ అంతరించిపోతున్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్ కాల్డ్ తెలుగు దుందుడుకు!
కాపాడే కంటి రెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు  అంతకు మించిన మహర్దశ సాధ్యపడుతుందా?
క్రియ తెలుగు వాక్యంలో చివరకు  రావడమే అన్ని లోకువలకు అసలు కారణం. అదే మరి  ఆంగ్లములో అయితేనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని' అంటే వెనక్కు నక్కే తెలుగు తోడుగా ఉంటే   నీ జోడవుతుందన్న వెరీ బ్యాడ్  వెర్రి సెంటిమెంటబ్బా   తెలుగబ్బికి!  ఎంత పద, లిపి సంపద తెలుగు నాలుక చివర  పలుకుతుంటేనేమి? ఆంగ్లంతో  కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని ఉలుకు తెలుగు బోడికి.
గురజాడవారి గిరీశానికి ఈనాటికీ తెలుగ్గడ్డ మీదింత గ్లామరుందంటే కారణం?  పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటల పాటు ఏక బిగిన బట్లరింగ్లీషులో  బాదేయగల గట్టిపిండం కాబట్టే! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించే లేటెస్ట్ సెంచరీ కదా ఇది! శ్రీనాథుడి చాటువులతో వేపుకు తిందామంటే  చెవులకు చేటలు కట్టెస్తారయ్యా కనక లింగం! బమ్మెర పోతనగారే..  ఆ అతి కమ్మదనం భ్రమల్లొ పడిపోయేసి అమ్మభాషలో భాగవతం  రాసి భగవంతుడికి అన్యాయం చేసేసాడు! వెరీ సాడ్! అదే ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని    ఆంధ్రాంగ్లంలోనైనా కుమ్ముంటే  భాగవతం ఈపాటికి లాటిన్ బైబిల్ తో గిన్నీస్ కు పోటీకొచ్చుండేది! 
వాడుక భాషంటే ఏమన్నా వేడుక భాషనా? వ్యవహార భాష.  ఇంద్రాసూయైనా సరే..   ఆంధ్రంలోనే యవ్వారం అని ఆనాడు చంద్రబాబు గాని   మొండికివేసుంటే   అన్ని కోట్ల పెప్సీప్లాంట్ల కేసు  పురిట్లోనే  సంధి కొట్టేసేది!  కేసీఆర్ సార్ తెలంగాణా భాషలో ఎంత మీసాలు తిప్పగల  మొనగాడవనీయి గాక ఒక్క తెలంగాణా యాసతోనే గావు గావు మంటే కెసి కెనాలు పనులు ఆగిపోయేవా?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుకు అంతలా అంకితమయిపోబట్టే  ఒక్క రాజమండ్రి బోర్డర్ భాష వరకే ట్రెండయిపోయాడు. అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు వదిలేసాడు  శ్రీరంగం శ్రీనివాసరావు. అందుకే   యుగకవిగా ఆయనకా గౌరవం .. సరే! కాసుల మాటేమిటి! ఆ గాసట బీసట తెలుగు ఘోషలు నమ్ముకోకుండా.. గామా, బీటాల్లాంటి కామన్ మ్యాన్ బుర్రకు కు బొత్తిగా ఎక్కని ఏ ల్యాటినాంగ్లంలోనో కూసుంటే! కాసులకసలు కరువుండేదా?   
అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని  తేడా పాడా లేకుండా ఏక మొత్తంగా వర్ణమాలను మొత్తం ఆంగ్లంతో కలిపి  రుబ్బి ప్రేక్షకుల మొహాన పేడకళ్లులా కొట్టేసే మన టీవీ యాంకరమ్మలకు, రేడియో జాకీ కుంకలకు, సినిమా రైటర్ బంకలకు నిండు మనసుతో గౌరవాభివందనములు! వైద్యం చేసే నారాయణులు, న్యాయం చెప్పే ధర్మ దేవతలు, బీదా బిక్కీలను సేవించుకునే సర్కారు బంట్లకు గొప్ప గౌరవం ఇవ్వక తప్పదు! డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుగారు గొప్పా? న్డీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు వర్ణమాలకే  ఏక మొత్తంగా ఓ మూల  గోడ కుర్చీ వేయించిన  ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళ కెళ్ళే మన పిడుగుల తెలుగు తొక్కు పలుకుల ముందు..  గిడుగు రామ్మూర్తి పంతులుగారి  ప్రజ్ఞాపాటవాలు లెందుకు?  నేటి బుడుగుల  బడబడ ఇంగ్లీషు వాగుళ్ల వాగులో పడితే ఎంతటి భాషాగజీతగాడు విశ్వనాథవారైనా బుడుంగుమని మునిగాల్సిందే!
కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు. కాబట్టే చెవి కంతల కంత  కర్ణకఠోరం!  ఆంగ్లవాసన సోకనందుకే నాట ఓ శోకరసం! అన్నమయ్య సంకీర్తనలంటే తెలుగు నా! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే..  ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం. ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికి ఫిదా అయి కనక గండపెండేరం కాలికి తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషై ఉంటేనే తెలుగులో ఒన్సుమోర్లు మార్మోగేది!
తుమ్ము. దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా  ఆంగ్లయాసలో ఉంటేనే ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదిక్కడ.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా  పనికివస్తుందా అన్నది పెద్ద ప్రశ్న!
పొట్టకోసినా తెలుగక్షరం ముక్క ఒక్కటైనా  కనపించనోడే తెలుగువాడికి ఇవాళ  తలమానికం! పచ్చడి లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం  లేకుండా  తెలుగుముక్కంటే చచ్చే చావే తెలుగువాడికి!  తెలుగిది కేవలం ప్రాచీన హాదానే. ఆంగ్లానిది అధునాతన  హోదా!
ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో సాగిస్తే చాలు.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి మందని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడు.  అంత కష్టం కూడా పడడానికి ఇష్టపడడు.  సొంతగడ్డమీద ఉంటూనే మాతృభాషని ఆంగ్లంలా మాట్లాడేసి ఆటోమేటిగ్గా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు  పుచ్చిపోయిందనో.. చచ్చిపోతుందనో కన్నీళ్ళు పెట్టుకునే తిక్కన్న వారసులకు చివరగా ఒక మాట! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డల మీద వర్ధిల్లాలని  ప్రార్థిస్తామంటారా! సరే మీ ఇష్టం! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకోండి. తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో కనీసం తిట్ల రూపంలోనైనా!
-కర్లపాలెం హనుమంతరావు
25 -09 -2019
***
(సూర్య దినపత్రికలో ప్రచురితం)

ఎర్ర ముక్కు జింక- కొత్తపల్లి పత్రిక సౌజన్యంతో



అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు.

డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.
ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది!

ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు
-కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మూడు ముక్కులు...ఆరు చెవులు! - సేకరణ





 రామాయణ మహాభారతాల్లో ఒక్కొక్క పాత్రకు తమది మాత్రమే అయిన ఒక్కొక్క శైలి ఉంటుంది. అది ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ! కదనరంగంలో కానీ, మదన రంగంలో కానీ! మహాభారతంలో భీముడిదో శైలి. ప్రత్యేకించి యుద్ధంలో. అది కూడా ఒక్కడితోనే పోరాడే సమయంలో (ద్వంద్వ యుద్ధంలో). అదేంటంటే యుద్ధం చేసినంతసేపూ చేసి, ఇక ఆ తర్వాత ప్రత్యర్థితో ఆడుకోవడం మొదలుపెడతాడు. ఒక చెయ్యి మెడ మీద, మరో చెయ్యి నడుమ్మీద వేసి పైకెత్తి గిరగిరా తిప్పడం- నేలకేసి కొట్టడం... ఇలా అన్న మాట! హిడింబాసురుడు, బకాసురుడు, కిమ్మీరుడు, జీమూతమల్లుడు, కీచకుడు, దుశ్శాసనుడు ఇలా అందర్నీ దాదాపు ఇదే శైలిలో చంపాడు.
ఇలాగే, వ్యవహారంలో శ్రీరామచంద్రుడిదో శైలి. వాల్మీకి మహర్షి దాని గురించి చెబుతూ ‘‘స్మిత పూర్వభాక్‌’’ అంటాడు. అంటే ఎవరైనా తనను కలవడానికి వస్తే రాముడే ముందుగా పలకరిస్తాడట, అదీ చిరునవ్వుతో!
ఇక లక్ష్మణస్వామి విషయానికి వస్తే, శిక్షించే విషయంలో ప్రత్యేకించి దుష్ట స్వభావం కలిగిన స్త్రీలను శిక్షించే విషయంలో ఈయనది ప్రపంచంలో ఎవరికీ లేని ఓ ప్రత్యేక శైలి. అదేంటంటే ఎదుటివాళ్ల ముక్కూచెవులు కోసెయ్యడం. ఈ రకంగా శూర్పణఖకు తగినశాస్తి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఇలా ముగ్గురికి ముక్కూచెవులు కోశాడు. అది కూడా పన్నెండేళ్ల వయసులో ప్రారంభించి ముప్పై ఎనిమిదేళ్ల వయసు వరకు. ఆ రకంగా లక్ష్మణ కర్ణనాసికాఖండన ప్రస్థానం ప్రారంభమైంది తాటకతో. వివరాల్లోకి వెళ్తే...!
బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగసంరక్షణార్థం రామలక్ష్మణుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. యాగానికి ఆటంకం కలిగిస్తున్న తాటకను చంపమని ఆ అన్నదమ్ముల్ని ఆదేశించాడు. కానీ స్త్రీని చంపడానికి రామలక్ష్మణులు సందేహించారు. దుష్టస్వభావం కలిగిన వారు స్త్రీలైనా సరే చంపడం ధర్మవిరుద్ధం కాదు, కాబట్టి చంపెయ్యమని విశ్వామిత్రమహర్షి మళ్లీ చెప్పాడు. అప్పుడు రాముడు జాగ్రత్తగా తాటకను పరిశీలించి ‘‘సౌమిత్రిరకరో క్రోథాత్‌ హృత కర్ణాగ్రనా సికా’’ అని లక్ష్మణుడికి చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు తాటక ముక్కూచెవులు కోసేశాడు. ఇక్కడో సందేహం రావచ్చు.. ముక్కూచెవులే ఎందుకు కోశాడని? వాస్తవానికి ఈ సందర్భం రామలక్ష్మణుల, ప్రత్యేకించి శ్రీరాముడి పరిశీలనా దృష్టికి, కారుణ్య భావనకు నిదర్శనం.
తాటకని బాగా పరిశీలించాడు రాముడు. సహజంగా రాక్షస స్త్రీ కాకపోయినా, శాపకారణంగానే రాక్షసత్వాన్ని పొందినా తాటక చర్మం బాగా మొద్దుబారిపోయి ఉంది. ఆ చర్మం మీద వెంట్రుకలు తుమ్మముళ్లలాగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ చర్మానికి స్పర్శజ్ఞానం ఉన్నట్లు కనిపించలేదు. ఇక కళ్లు చూస్తే నిరంతరం మద్యాన్ని తాగీ తాగీ బాగా ఎరుపెక్కిపోయి తను ఎటు చూస్తుందో, ఏం చూస్తుందో తనకే తెలియని స్థితిలో ఉన్నాయి. అంతేకాక పలురకాలైన పచ్చిమాంసాన్ని తినీతినీ నాలుక తాటిపట్టలా తయారైంది. ఈ విషయాలను గ్రహించాడు రాముడు.
 పంచేంద్రియాల్లో చర్మం, కళ్లు, నాలుక ఈ మూడు తాటక అధీనంలో లేవు. ఇక మిగిలింది రెండు. ‘‘నరవాసన నరవాసన’’ అంటూ ముక్కుతో వాసన పసిగడుతుంది. కళ్లు మత్తెక్కి సరిగా కనిపించకపోయినా, వీరి మాటల శబ్దాన్ని బట్టి వీళ్ల వైపు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎంతైనా స్త్రీ కదా! చంపటం ఎందుకని, తాటకలో మిగిలి ఉన్న రెండు జ్ఞానేంద్రియాలైన ముక్కూ చెవుల్ని కోసెయ్యమన్నాడు రాముడు. లక్ష్మణుడు అలాగే చేశాడు. అయినప్పటికీ తాటక తన ఆగడాలు మానకుండా గుడ్డిగా కర్మేంద్రియాల్ని ఉపయోగిస్తూ యాగానికి ఆటంకం కలిగిస్తూ, యాగరక్షణ చేస్తున్న రామలక్ష్మణుల్ని చంపే ప్రయత్నం చేసింది. తప్పని పరిస్థితుల్లో రామలక్ష్మణులు తాటకను సంహరించాల్సి వచ్చింది.
* * *

పితృవాక్య పరిపాలన కోసం రాముడు, అతనితోపాటు సీతా, వీరిద్దరితో పాటు లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నారు. పదమూడు సంవత్సరాల రెండు నెలలు హాయిగానే గడచిపోయాయి. అప్పుడు జరిగింది వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పే ఘటన శూర్పణఖ రూపంలో.
ఆశ్రమ ప్రాంతంలో సీతారామలక్ష్మణుల్ని చూసిన శూర్పణఖ, తన తొలిచూపులోనే రామచంద్రుణ్ని మోహించింది. రాముణ్ని వివరాలడిగి తన వివరాలూ చెప్పింది. ఆ వెంటనే తన ప్రేమను వ్యక్తం చేసింది. దానికి రాముడు తనకు వివాహమైందనీ, పక్కన ఉన్న ఈ సీతే తన భార్య అనీ, కావాలంటే లక్ష్మణుడి వద్దకు వెళ్లమని చెప్పాడు.
శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి దగ్గరకు వచ్చింది. తన మీద ప్రేమను వ్యక్తం చేస్తున్న శూర్పణఖతో లక్ష్మణుడు ‘సరే అలాగే! అరణ్యానికి వచ్చేటప్పుడు నా భార్యను వెంట తీసుకురాలేకపొయ్యానని అప్పుడప్పుడు నాకూ చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజూ అడవిలో తిరిగి అలసిపోయిన మా అన్నగారి పాదాల్ని ఒత్తుతూ సేవ చేస్తాన్నేను, అదే నా భార్య కూడా అరణ్యానికి వచ్చి ఉంటే మా వదినగారి పాదాలకు సేవచేసేది కదా అని! నువ్వే నా సమస్యకు పరిష్కారం. అయితే, నేను మా అన్నగారి దాసుణ్ని. నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నువ్వు కూడా దాసివవుతావు’’ (కథం దాసస్య మే భ్రాతుః దాసీ భవతుమర్హసి) అన్నాడు. దాంతో వెంటనే లక్ష్మణస్వామిని వదిలేసి మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది శూర్పణఖ. వచ్చీరాగానే సీతను చూస్తూ ‘‘ఈమె ఉండటంతోనే కదా నన్ను తిరస్కరిస్తున్నావు! ఈమెను చంపి తినేస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకో!’’ అంటూ సీత మీదకు వెళ్లబోయింది.
  ఇక్కడొక చిన్న సందేహాన్ని తీర్చుకుని ముందుకు వెళ్దాలి! మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు శూర్పణఖ కోరికను మన్నించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలాకాకుండా లక్ష్మణస్వామి దగ్గరికి పంపడమేంటి? అని. దీనికి సమాధానం ఇలా చెప్పుకోవచ్చు. రాముడు శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమన్నప్పుడు ఆమె ‘‘లేదు! నేను నిన్నే ప్రేమించాను. నిన్నే వివాహమాడతాను’’ అని అనుంటే రాముడు ఏం సమాధానం చెప్పేవాడో, ఎలా అనుగ్రహించేవాడో వేరే విషయం. ఎందుకంటే పురుష మోహనరూపుడైన రాముణ్ని స్త్రీలే కాదు, పురుషులూ మోహించారు. అలాంటి ఇలాంటి సాదాసీదా పురుషులు కాదు, సర్వసంగ పరిత్యాగులై జీవిత చరమాంకంలో ఉన్న శరభంగమహర్షి (అంటే మన్మథ శరాల్ని భంగం చేసినవాడని అర్థం) లాంటి వారూ మోహించారు. రాముడు తనను మోహించిన ఎందరినో కృష్ణావతారంలో అనుగ్రహించాడు.
 ఇక ప్రస్తుత విషయానికి వద్దాం! శూర్పణఖ రాముడు తనను లక్ష్మణుడి దగ్గరకు వెళ్లమనగానే వెళ్లిపోయింది. అలాగే, లక్ష్మణుడు ‘‘నేను దాసుణ్ని, నన్ను చేసుకుంటే నువ్వు కూడా దాసీదానివవుతావు’’ అనగానే మళ్లీ రాముడి దగ్గరకు వచ్చింది. అంటే శూర్పణఖకు రామలక్ష్మణుల పట్ల ఉన్నది కాముక భావనే కానీ ప్రేమ కాదు. ఈ విషయం నిర్ధరించుకోడానికే రాముడు శూర్పణఖను లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. ప్రేమ అంగీకారామే కానీ కాముకత కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ తనను కాదనేసరికి, తన రాక్షస ప్రవృత్తిని బయటపెడుతూ సీతను మింగబోయింది శూర్పణఖ. అప్పుడు రాముడు ఇక ఈమెను ఉపేక్షించకూడదని ‘‘లక్ష్మణా! ఊఁ!’’ అన్నాడు. అంతే! లక్ష్మణస్వామి అక్కడున్న కత్తి తీసి శూర్పణఖ ముక్కూ చెవులు కోసేశాడు.
 ఇక్కడ శూర్పణఖ ముక్కూచెవులు కొయ్యడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఆమె సీతారామలక్ష్మణుల దగ్గరికి రాక్షసరూపంతో కాకుండా సుందరి వేషంలో వచ్చింది. అంటే తన సౌందర్యంతో ఎదుటివాళ్లను వశపర్చుకోవాలని అనుకుందన్న మాట. అందువల్ల అలాంటి మోసం మరొకరి దగ్గర చెయ్యకుండా సౌందర్యానికి మూలమైన ముఖంలోని ముక్కూచెవుల్ని కోసేశాడు లక్ష్మణుడు.
 * * *
 ఇదే అరణ్యకాండ చివర్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కొన ఊపిరితో ఉన్న జటాయువు నుంచి ‘‘సీతను రావణుడు ఎత్తుకుపోయా’’డన్న వార్త విన్నారు రామలక్ష్మణులు. దుఃఖమగ్నులై ఉండి కూడా అసువులు బాసిన జటాయువుకు కృతజ్ఞతతో అంత్యక్రియలు జరిపించి క్రౌంచారణ్యంలో ప్రవేశించారు.
 విపరీతమైన దుఃఖంతో తిరుగుతున్న రామలక్ష్మణుల దగ్గరికి అయోముఖి అనే రాక్షసి వచ్చింది. లక్ష్మణుణ్ని చూసి మోహపరవశ అయ్యింది. వికృతమైన చర్మం, ఎర్రనైన కళ్లు, వేలాడే పెద్ద పొట్టతో మోహాంధకారంతో నిండిన . అసలే బాధలో ఉన్న లక్ష్మణుడు విపరీతమైన కోపంతో అయోముఖిని విదిలించుకుని, తన ఒరలో ఉన్న కత్తి తీసి ముక్కూచెవులతో పాటు మరికొన్ని శరీర భాగాల్ని కోసేశాడు. ఆ బాధ భరించలేక అయోముఖి కొండగుహల్లోకి పారిపోయింది.
ముక్కూచెవులు కొయ్యాలన్న లక్ష్మణుడి ఆలోచన కార్యరూపం దాల్చింది పన్నెండేళ్ల వయసులోనే అయినా ఆలోచన మాత్రం జన్మజాతం. యోగనిద్రలో, ధ్యానముద్రలో ఉండే నారాయణుడు లోకసంరక్షణార్థం పరివారంతో సహా భూలోకంలో అవతరించాల్సి వచ్చింది. అధికారిక విధుల మీద వచ్చిన ప్రభుత్వోద్యోగి తొందరగా పని ముగించుకొని ఇల్లు చేరాలనుకున్నట్లు నారాయణ పరివారం కూడా పని ముగించుకుని వైకుంఠం చేరాలన్న తపనతో, పుట్టిననాటి నుంచే అవతార పరమార్థం అమలు చేసే పనిలో పడ్డారట! ఈ విషయాన్ని కవిసమ్రాట్‌ విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’లో తనదైన శైలిలో చమత్కరించారు.
 రామచంద్రుండు మూర్ధంబులొత్తిచూచు
పురుషులెవరేనియును తన నెత్తికొనిన
సౌమిత్రియును ముక్కు చెవులు నొత్తి చూచు
ఎవ్వరే నంగనల్‌ తననెత్తికొనిన

 చిన్నప్పుడు రాముణ్ని ఎవరైనా స్త్రీలు ఎత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే పురుషులెత్తుకుంటే తల తడుముతూ ఉండేవాడట! అలానే లక్ష్మణుడు పురుషులెత్తుకుంటే బుద్ధిగా ఉండేవాడట! అదే స్త్రీలు ఎత్తుకుంటే మాత్రం ముక్కూచెవులు తడుముతూ ఉండేవాడట! ఎందుకంటే ఆ పదితలలవాడు దొరికితే వచ్చిన పని ముగించుకొని వైకుంఠానికి పోదామని రాముడు, తనను ఎత్తుకుంది శూర్పణఖ అయితే ముక్కూచెవులు కోసేసి అవతార పరమార్థాన్ని వేగవంతం చేద్దామని లక్ష్మణుడు ప్రవర్తించేవారని విశ్వనాథ కల్పన. వాస్తవానికి అవి బాల్యచేష్టలే అయినా చిన్నప్పటి నుంచే అవతార పరమార్థాన్ని గుర్తెరిగి ప్రవర్తించారు రామలక్ష్మణులు అని చెప్పడం విశ్వనాథవారి అంతరార్థం.
 ఇలా లక్ష్మణస్వామి వల్ల ముక్కూ చెవులు పోగొట్టుకున్న ముగ్గురు రాక్షస స్త్రీల్లో మొదటిదైన తాటక, అంతటితో బుద్ధి తెచ్చుకోక తన ఆగడాల్ని కొనసాగిస్తూ ముందుకు వచ్చి తన ప్రాణాల్ని కోల్పోయింది. లక్ష్మణుడి ఆవేశానికి భయపడ్డ అయోముఖి కొండగుహల్లోకి పారిపోయింది. కామంతోపాటు ప్రతీకార వాంఛ కూడా కలిగిన శూర్పణఖ పారిపోయి తన వారిని రెచ్చగొట్టి ఇంత రామాయణ కథకూ మూలమైంది.
-సేకరణ 
 By కర్లపాలెం హనుమంతరావు
(మూలం రాసుకోలేదు.. క్షమించాలి)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...