Showing posts with label mythology. Show all posts
Showing posts with label mythology. Show all posts

Tuesday, December 14, 2021

ఆంధ్ర మహా భారత అవతరణ - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు ( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి )



ఆంధ్ర మహా భారత అవతరణ 

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 


చాళక్యుల కాలంలో మత, కుల విభేదాలు రాజ్య భద్రతకే విచ్ఛిన్నకరంగా తయారయాయి. సుస్థిర రాజ్యపాలన అసంభవమౌతుండేది. ఇతర రాష్ట్రాల నుండి దండెత్తి వచ్చే రాజులను ఆహ్వానించే మతస్థులు, కులస్థులు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు. కుట్రలను, అరాచకాన్ని ప్రోత్సహించేవారికి మతం ఒక ముసుగుగా ఉపయోగపడేది. ఆ సందర్భంలో అవతరించినది ఆంధ్ర మహా భారతం . 


ఆంధ్ర మహాభారత అవతరణ


విచ్ఛిన్నకర ధోరణులను కొంతవరకైనా అరికట్టి ఐక్యజాతి పరిణామాని కవసరమైన సంస్కృతిని నిర్మించిన ఘనత తెలుగు సాహిత్యానిది.  అందుకు మహాభారతం నాంది.


మత ప్రవక్త దృక్పథం సంకుచితం. తన దేవునిపై భక్తి కంటె పొరుగు దేవుడిపై ద్వేషం జాస్తి. దేవతల ద్వేషం ప్రజలలో వ్యాపించి అంతఃకలహాలకు కారణమైంది.


కవుల దృక్పథం వేరు. జీవితంలోని కుల, మత భేదాలకు అతీత మైన, సామాన్య మానవ భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించటమే కవి కర్తవ్యము. ఈ గురుతర బాధ్యతను నిర్వహించిన కావ్యాలు భారత, భాగవతాలు. అయితే ఈ కర్తవ్యం -  నాటి ప్యూడల్ సమాజ పరిధికి లోబడి జరిగింది. సామాన్య ప్రజల జీవితం ఈ సాహిత్యంలోకి ఎక్కలేదు.


మహాభారతం సర్వజన వంద్యంగా వుండవలెనని తాను రచించి

నట్లు నన్నయభట్టు ఇలా వివరించాడు.


'ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 

అధ్యాత్మ విదులు వేదాంత మనియు 

నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని 

కవి వృష  మహా కావ్య మనియు

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసికులితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ

 యంబని మహ గొనియాడుచుండ


గీ. వివిధ వేద తత్వవేది వేదవ్యాసు 

డాదిముని పరాశరాత్మజుండు 

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై 

పరగుచుండ జేసె భారతంబు.


తామెంతటి మహత్కార్యానికి పూనుకున్నారో మహాభారత కవులు

గుర్తించారు.


“నానా రుచిరార్థ సూక్తినిధి 

నన్నయభట్టు తెనుంగునన్, మహాభారత 

సంహితా రచన బంధురుడయ్యె 

జగద్ధితంబుగాన్”


"గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుంగు వారికిన్ వ్యాస ముని ప్రణీత"మైన మహాభారత గాథను వివరిస్తున్నానని నన్నయభట్టు మరొక చోట చెప్పాడు.


ఇదే విషయాన్ని భారతంలో అత్యధిక భాగాన్ని రచించిన కవి బ్రహ్మ తిక్కన యింకా స్పష్టంగా చెప్పాడు.


ఉ॥ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి, 

ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ 

సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధినొందిపద్యములగద్యములన్ రచియించెదన్కృతుల్ ——


అంతేకాదు.


తెలుగు భాషలో ప్రజాసామాన్యానికందరికీ అర్థమయ్యేటట్లు వ్రాయటంలో పురుషార్థ సాధన ఇమిడి వున్నదని కూడా తిక్కన భావించాడు.


తే॥ తెనుగుబాస వినిర్మింప దివురుటరయ

భవ్యపురుషార్థ తరు పక్వ  ఫలము గాదె ॥


ఆంధ్ర మహాభారతం నన్నయ ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకు గాని పూర్తికాలేదు. ఏ ఆశయంతో నన్నయభట్టు భారత రచన కుపక్రమించాడో, అదే ఆశయంతో క్రీ.శ. 1260 ప్రాంతంలో తిక్కన ఆ కావ్యాన్ని పూర్తిచేశాడు.


ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలోని అన్ని కులాలలోను మహా భారతం అంతటి విస్తార ప్రచారంగల గ్రంథం మరొకటి లేదు. పాండవ కౌరవ గాథలు, నాటినుండి నేటివరకు సామాన్య ప్రజలకు విజ్ఞానాన్ని లోకానుభవాన్ని అందజేస్తూనే ఉన్నాయి.


నాడు ప్రజలలో జైన, హిందూ మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. పూర్వ మీమాంసాకారుడైన కుమారిలభట్టు ఆంధ్రుడైనందు వలన, ఆంధ్రలో ఆ సిద్ధాంతానికి ఆలంబనం హెచ్చుగా ఉండేది.


నిర్జీవమైన కర్మకాండకు జైన, పూర్వ మీమాంసా ధోరణులు రెండూ విశేష ప్రాధాన్యత నిచ్చినవి. అర్థంతో నిమిత్తం లేకుండానే మంత్రోచ్చారణ ద్వారానే ఫలితాలు వస్తాయన్న మూఢ నమ్మకాలు విరివిగా ఉండేవి.


క్రీ. శ. 787 లో మలబారులో  పుట్టి అద్వైత వాదాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యుని బోధనలు దేశమంతా వ్యాపించినప్పటికీ, పాత ధోరణులింకా బలంగానే వున్నాయి. శంకరుని ఆద్వైతం జ్ఞానప్రధానం; కర్మకాండను నిరసించింది.


నన్నయ్యభట్టు మహాభారత రచన అద్వైత ధోరణికి ఎనలేని సహాయం చేసింది. శైవ, వైష్ణవ ద్వేషాలను ఖండించింది. నిర్జీవ కర్మ కాండపైనుండి ప్రజల దృష్టిని వాస్తవ జీవితంవైపు మళ్ళించింది. 


రాజ్యలోభం, ద్వేషం, కక్ష మొదలైన ఆవేశాలకు లోనైనప్పుడు మహా సామ్రాజ్యాలు పతనమైపోతాయన్న నీతిని ప్రచారం చేసింది. కర్మలు అప్రధానమని, జ్ఞానం, సమవృష్టి, అద్వైతభావం ముఖ్యమని కథా రూపంలో ' ప్రజలకు బోధ చేసింది.


ఈ ఉపకృతితోపాటు, మరొక అపకారం కూడా జరిగింది. నన్నయ భట్టుకు పూర్వమే చాలా కాలం నుండి తెలుగులో రచనలు సాగుతూ వచ్చాయని ప్రాచీన శాసనాలే తెలియజేస్తున్నాయి. కాని నాటి గ్రంథాలేవి లభించటం లేదు. అట్టి ప్రజా వాఙ్మయాన్ని, “గాసట బీసట" అని నన్నయభట్టు హేళన చేసి ప్రజావాఙ్మయం పట్ల నిరసన కలిగించాడు. 


ఈ నిరసన వైఖరిపై తిరుగుబాటుగానే, రెండు శతాబ్దాల అనంతరం వీరశైవ మతం, వీరశైవ వాఙ్మయం తలయెత్తాయి.

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

14 -11-2021 


( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 

Sunday, December 12, 2021

దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు

 దేవుడి కథ

 -కర్లపాలెం హనుమంతరావు

నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది. 

ఆయుర్వేదమంత్రం(14 -20) ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని ఓ పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసలే    శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవచ్చిందని  ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం. 

ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా సైతం  దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దైవత్వం  ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?

దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమింపచేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసివుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు  ప్రారంభమవడం.. అదో విచిత్ర గాథ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలగనంత  వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు! 

భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలలో ఎడతెరిపి లేకుండా మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.

స్వాతంత్ర్య  సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ తర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం. 

దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  భౌతికరూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోవడం ఖాయం. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పయినా  మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే.. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిషన ఎన్ని తరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  

కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకేసుకోవడమే  తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా!

'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి– వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబడుతున్నారు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూఇ మీది  నిప్పు, మబ్బులోని గాలి.. మెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!

రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే’ అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.

వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాధనలు   అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం సరికొత్త పరిణామం. 

జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతి పదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం  సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాధ్యమన్న  వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ. 

వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించిన ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి ఈ పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. 

జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖితసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాధాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా  ఉన్నట్లే, భరతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శివాజీ.. వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు. 

మతాలను  గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథాప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రమ్  మిత్రమ్ ‘  అనే  శ్లోకార్థాన్ని  బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు. 

కంటికి కనిపించని దేవుళ్ల లెక్క  కన్నా.. కంటి ముందు కదిలే  మనుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.

- కర్లపాలెం హనుమంతరావు 

- బోథెల్; యూ.ఎస్.ఎ

30 - 08-2021

***

 

 


ఆధునిక మారీచులు -కర్లపాలెం హనుమంతరావు

 

ఆధునిక మారీచులు

-కర్లపాలెం హనుమంతరావు

‘ర- కారం ముందుడే అక్షరాలన్నీ నన్ను భయకంపితుణ్ణి చేస్తున్నాయిప్పడు. రత్నాలు, రథాలు.. అయినా సరే భయమే భయం! శూర్పణఖ  కారణంగా నీకు రాముడు మీద కొత్తగా పగ  పుట్టుకొచ్చింది. తన కారణంగానే నా తోబుట్టువు ఖరుడు చచ్చినమాట గుర్తుతెచ్చుకో రాజా! రాముడు రాక్షస జాతి మొత్తానికి అంతకుడు. అందులో పిసరంతైనా అనుమానం లేదు. వాడి దెబ్బ రుచిచూసిన వాడిని కాబట్టే నిన్ను ఇంతగా హెచ్చరిండం.  అప్రమత్తంగా ఉండు. లేకపోని కక్షలతో నువ్వే కాదు నీ బంధు కోటి సర్వం భూమ్మీద లేకుండా చేసుకోకు!’ అంటూ మారీచుడు మంచి మాటలు నాలుగు చెప్పబోయినా రావణాసురుడి చెవికి ఎక్కాయి కాదు! చావు మూడినవాడు ప్రాణౌషధాన్నీ దగ్గరకు రానివ్వడు! మారీచుడీ మాటలు చెవినపెట్టకుంటే పాయ, వెటకారాలకు దిగాడు సహాయం అడుక్కోడానికి వచ్చిన రావణబ్రహ్మ.

‘ఈ అయుక్తార్థాలు ఎప్పట్నుంచి మారీచా? ఊసర క్షేత్రంలో విత్తులా నీ మాటలు నా మనసువులో నాటవు. ఇహ పండే మాట ఎక్కడ? అయినా,  పాపశీలుడు, మూర్ఖుడు పైపెచ్చు తుఛ్చ మానవ జాతికి చెందిన రాముడితో నేరుగా తలపడ్డం  నా స్థాయికి తలవంపులు. కాబట్టే నిన్నిట్లా దేబిరించడం.  అయినా ఆడదాని మాట కోసం మిత్రుల్ని, తల్లిదండ్రుల్ని గాలికొదిలి మన ఆడవుల్లొ కొచ్చి పడ్డ ఆ  ధూర్తుడి మీదనా ఈ స్తోత్రాలు, దందకాలు? నీ సోదరుడి చావుతో ఆవరించిన నైరాశ్యం వల్లనుకుంటా పిరికితనం. ఎంత హాస్యాస్పదం! స్వంత ప్రాణాలకన్నా కట్టుకున్న ఆడదాని మానం ముఖ్యం ముఖ్యమనుకునే  అనాగరికుఏమిటి.. విడ్డూరం  కాకపోతే! ఇదిగో మారీచా! ఒక మాట చెబుతున్నా.. సావధానం వినుకో! సీతాపహరణం జరిగి తీరుతుంది. అదీ నీ సమక్షంలోనే. ఇంద్రాది దేవతలు ఆడ్డొచ్చినా  ఆగే కార్యం కాదిది. మంచీ చెడూ చెప్పడానికి నీకున్న అర్హత నీకుంటే ఉండొచ్చు! నీ పని నీవు చేసేశావు. ఇహ నా పని మొదలయ్యే మార్గం మాత్రమే చర్చించడం  నీ విధి.’ అని హూంకరించాడు రావణాసురుడు. 

తెలివైన దాసుడు రాజు దగ్గర మొండికి తిరగడం చావు స్వయంగా కొనితెచ్చుకోవడమే! రాజుకు రుచించని పక్షంలో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి మాటయినా సరే తలబిరుసుగా  చెబితే మొదటికే బెడిసికొడుతుంది. మారీచుడి దుస్థితే ప్రస్తుతం ఏ.పి ప్రభుత్వంలోని అధికారుల  సంకట స్థితి.

‘పంచ రూపాణి రాజానో ధారయంతి అమిత ఓజసః | అగ్నేః ఇంద్రస్య సోమస్య యమస్య వరుణస్య చ / ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతాం |ధారయంతి మహాతామ్నో రాజానః క్షణదాచర /తస్మాత్ సర్వాసు అవస్థాసు మాన్యాః పూజ్యాః చ పార్థివాః /త్వం తు ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహం ఆశ్రితః ‘

రాజు అంటే అగ్మి, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు.. ఈ ఐదు  రూపాలు కలగలుపు. కాబట్టే అతగాడిలో ఉష్ణం, వీరత్వం, సౌమ్యత, ప్రసాద లక్షణం, దండించే గుణం- సందర్భాలను బట్టి ప్రసారమవుతాయి. రాజులు అన్ని వేళలా పూజనీయులు అవడానికి అదే కారణం. నువ్వు ఆ ధర్మం తెలిసీ అతిక్రమించి మాట్లాడావు. నీలోని మోహమే అందుకు ప్రధాన కారణం.’  అభ్యర్థించడానికి  వచ్చానన్న చులకనా?  రాజుతో పరుషంగా మాట్లాడడం తగని పని. సరే, ఈ దఫాకు మనసులో ఉంచుకోకుండా నీ తప్పును క్షమించేస్తున్నా. బంగారు లేడిగా మారు. వంటి మీద వెండి మచ్చలుండాలి. అడవిలో రామాశ్రమం చుట్టూతా తచ్చాడుతుండు. సీత కంటబడ్డం ప్రధానం. ఆడవాళ్లకు బంగారం మీదుండే కాంక్ష నార బట్టల సీతనైనా కుదురుగా ఉండనీయదు. పెళ్లాం కోరింది కాదనకూడదనే పనికిమాలిన జాతి పురుషుడు రాముడు. నీ వెంట పడకతప్పదు. నువ్వు ఆ మూర్ఖుణ్ణి  ఆశ్రమానికి చాలా దూరం తీసుకు వెళ్ళు చాలు. ఆనక సందు చూసుకుని 'హాసీతే లక్ష్మణే త్యేవం రామ వాక్యనురూపకం' అని అరుపుల్లంకించుకో మారీచా! సీత ప్రచోదనం వల్ల లక్ష్మణుడికీ రాముడు వెళ్ళిన దారి వెంటనే వెతుక్కుంటూ పోకతప్పదు. ఇంద్రుడు శచీదేవిని త్తుకొచ్చినట్లు  ఒంటరి ఆడదానిని ఎత్తుకొచ్చే ప్రతాపం అప్పుడు నేను చూపిస్తా!ఈ కార్యం చేసి పెట్టినందుకు నీ కష్టం ఊరికే ఉంచుకోల్, అర్థరాజ్యం ముట్ట చెబుతానని మాట ఇస్తున్నా. ఆ తరువాత నువ్వు దాన్ని ఏలుకుంటావో, ఏట్లో కలుపుకుంటావో .. నీ ఇష్టం' అంటూ రావణాసురుడు ఇప్పటి మన పాలకులు కొద్దిమందికి మల్లేనే ఊదరగొట్టేస్తాడు.

కైలాసగిరిని ఎత్తి కుదేసిన ఘనుడై ఉండీ రావణాసురుడు ఒక ఒంటరి మానవ స్త్రీని ఎత్తుకొచ్చేందుకు ఇంత కథ ఎందుకు నడిపించినట్లు? అంటే ఒకటే సమాధానం! పోయేకాలాన్ని మరింత ముందుకు తెచ్చుకోడం కోసమే!

పోనీ ఎత్తుకొచ్చిన సీత ఏమైనా ఆ రాక్షస రాజుకు లొంగి వచ్చిందా? తప్పు చేసిన ఆ తుచ్ఛుడు తుదకు మొదట్లో మారీచుదు చెప్పిన  చావుదెబ్బ రుచి చూడనే చూశాడు. అయ్యో పాపం అనాల్సిన అవసరమేమీ లేదు కానీ, మంచి మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉండీ చెప్పలేక చివరికి అన్యాయంగా చావు మీదకు తెచుకున్న మారీచుడి గురించే వ్యథంతా!

 ‘మారీచ వధ’ ఎన్నిసార్లు పారాయణం చేసి ఉంటారో మన ఏపిలోని  అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు! అయినా బుద్ధి రావడం లేదు. ఆధునిక మారీచులను గురించే బాధంతా!

-కర్లపాలెం హనుమంతరావు

21 -05 -2021

 

అమరకోశం - అర్థ వివరణ - కర్లపాలెం హనుమంతరావు

 అమరకోశం - అర్థ వివరణ 

- కర్లపాలెం హనుమంతరావు 



కోశం' అంటే పుస్తకం. పదానికి అర్థం చెప్పే పద్ధతి వివరించే పుస్తకం అమరకోశం. వ్యాకరణం, ఉపమానం, వ్యవహారాలు వంటి వాటిద్వారా సిద్ధించిన విషయాల అర్థ నిర్ణయాలు వగైరాఈ తరహా  కోశాలలో కనిపిస్తాయి! 

ఇప్పుడు వాడుకలో ఉన్న ‘నిఘంటువు’ అనే  పదం నిజానికి    ‘కోశం’ అనే అర్వాచీన పదానికి  ప్రాచీన రూపం. వేదాలలోని పదాలన్నిటినీ సంకలించి నిర్మించిన 'నిఘంటువులు' మన దేశంలో ఒకానొకప్పుడు  విస్తృతంగా ప్రచారంలో ఉండేవి. 

వీటికి వ్యాఖ్యాన రూపాలు 'నిరుక్తాలు'. ప్రస్తుతం  అందుబాటులో ఉన్నది యాస్కుడు రాసిన నిరుక్తం. 7వ శతాబ్దానికి చెందిన పాణిని తన వ్యాకరణంలో ఈ  నిరుక్తాలను వాడుకొన్నాడు. 

నిఘంటువులోని ఒక్కో పదం తీసుకొని దానికి సంబంధించి- ఏ ధాతువు నుంచి ఏ పదం ఉత్పన్నం ఆయిందో వివరించే ప్రయత్నం చేసాడు యాస్కుడు. వీలున్న చాలా సందర్భాలలో వేదాల నుంచే ప్రమాణాలు చూపించాడు. అ ప్రమాణాలలో కూడా అంతగా ప్రసిద్ధం కాని వాటికి  తానే అర్థ వివరణలు ఇచ్చే ప్రయత్నమూ చేశాడు. ఇంత శ్రమపడ్డాడు కాబట్టే యాస్కుడి నిరుక్తి ‘వేద-నిరుక్తి’గా వేదార్థసారం తెలుసుకొనే జిజ్ఞాసువులకు ప్రామాణిక గ్రంథంగా స్థిరపడింది.

వేద సంబంధమైన పదాలతో పాటు లౌకిక పదాలను కూడా ఇముడ్చుకొన్న వాటిని ‘కోశాలు’ అంటారు. గతంలో కవులకు సహాయపడే పద్ధతిలో ఈ కోశాలు నిర్మాణం  జరిగింది. బాణుడు (బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్ లోని బాణుడు) నుంచి బిల్హణుడు వరకు  చాలా మంది పండితులు ఈ పదకోశ నిర్మాణాల మీద దృష్టి పెట్టినవాళ్లే. ఒకానొక కాలంలో  శ్లేషకావ్యాలురాయడం ఒక ఫ్యాషన్  ( ఒక పదానికి రెండు అర్థాలు ఉంటే అది ‘శ్లేష’  అవుతుంది. ఇది అలంకారాలలో అర్థవివరణ జాతికి చెందినది). అట్లాంటి శ్లేష ప్రియుల కోసం శ్రీహర్షుడు 'శ్లేషార్థపదసంగ్రహః' అనే కోశం నిర్మంచాడు. అమరసింహుడు అనే  పండితుడు ఉన్నాడు. ఆయన    కవి కూడా. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం తన అమరకోశంలో నిక్షిప్తం చేసాడు.  కావ్యాలు రాయాలనుకొనే  కవులకు..  ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలు తీసి  పరిశీలించే శ్రమ కొంత తగ్గిందంటే ఆ  పుణ్యం ఈ అమరకోశానిదే .

కోశాలలో రెండు రకాలుంటాయి. ఒకే అర్థం ఉన్న అనేక పదాలను ఒకచోట పేర్చే పద్ధతి. దీనిని వ్యాకరణంలో  పర్యాయపదం అంటారు. ఇట్లాంటి పర్యాయపద కోశం  ఒకటైతే, ఒక పదానికి ఉండే నానార్థాలను వివరించే  నానార్థపద పద్ధతి రెండోది. 


పర్యాయపదకోశంలో ‘వర్గం’ అని ఒక తరగతి ఉంది. ఒకే  అంశానికి చెందిన  అనేక పదాలను ఒక గుంపుగా వర్గీకరించే పద్ధతి ఈ  ‘వర్గం’. వర్గం అమరసింహుడి సృష్టి. 

ఉదాహరణకి:  మనుషులకు సంబంధించిన పదాలన్నీ ఒక చోట చేరిస్తే అది  ‘మనుష్యవర్గం’. అమరకోశం ద్వితీయ కాండలో    ఆరో వర్గంగా  ఈ ‘మనుష్య వర్గం’  కనిపిస్తుంది.   'గృహనిరుద్ధపక్షిమృగప్రసంగాత్' తద్వర్తిమనుష్యాణాం నామాని వివక్షుం ఇదానీం సాంగోపాంగం మనుష్యవర్గమాహ' అని  నిర్ణయం. అంటే ఏంటి? ఇళ్లల్లో రకరకాల   పెంపుడు జంతువులు ఉంటాయి గదా! వాటి  పేర్లు చెప్పే సందర్భంలో ఆయా జంతువులను సాకే మనుషులను రకరకాల పేర్లతో పిలవడం ఒక భాషా సంప్రదాయం.  ఏ మనిషిని ఏ పేరుతో గుర్తిస్తారో వివరంగా చెప్పే   ప్రామాణిక విధానమే  ‘మనుష్యవర్గం’. ఇది అమరసింహుడు ఆరంభించిన కొత్త విధానం. 

'మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః'। మనోరపత్యాని మనుష్యాః మానుషాశ్చ॥' అని నిర్ణయం, 

1,2 .మనువు కొడుకులు కనుక మనుష్యులు, మానుషులు. ( మనుష్యా మానుషా  ) 

3 . చనిపోయేవాళ్లు కాబట్టి మర్త్యులు (మర్త్యాః) 

 4 . మనువు వలన పుట్టినవాళ్లు: కాబట్టి (‘మను’జా)  

5. మనువు సంబంధీకులు కనుక ( మానవా: ) 

6. సర్వం తమ అధీనంలోకి  తెచ్చుకొనేవాళ్ళు కనుక (నరులు)

ఇట్లా ఈ ఆరూ మనుష్యమాత్రులకు వచ్చిన పేర్లు. అమరసింహుడి వర్గవిభాజనా పదవివరణ ఇంత విస్తారంగా శాస్త్రీయంగా ఉంటుంది. కాబట్టే అమరకోశం ఈనాటికీ నిఘంటువుకు ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకొని ఉంది.  మరంత వివరణాత్మకంగా సాగే ఈ కింది పద్ధతి చూడండి! 

మనుష్యుల్లోని పురుషులకు మరో 11 పేర్లు, స్త్రీలకు మరో 11 పేర్లు! అక్కడితో ఆగలేదు అమరసింహుడు. ఆ స్త్రీలలోని గుణాలను  బట్టి ఇంకో  12 పేర్లు, మళ్లా ఆ గుణాలలో కూడా కోపం వచ్చే పద్ధతిని బట్టి మరో  2 పేర్లు, ఉత్తమ గుణాలను బట్టి మరో 4 పేర్లు.. ఇట్లా చెప్పుకుంటూ పోతే  చిలవలు పలవులుగా సాగే  పదాల ఉత్పన్నత విహారానికి దరీ దారీ దొరకదు. అంత లోతయిన పరిశీలనా జ్ఞానభాండారం కాబట్టే  అమరకోశం పామర పండిత లోకాలు రెండింటికీ శిరోధార్య వ్యాకరణమయింది. 

విధాయకానికి అందరూ భార్యలే అయినప్పటికీ.  వాళ్ల వాళ్ల  అర్హతలను బట్టి  పేర్లు ఎట్లా ఏర్పడ్డాయో వివరించాడు ఆ మహాపండితుడు అమరకోశంలో.  

'పత్నీ పాణిగృహితీ చ ద్వితీయా సహధర్మచారిణీ। భార్యా జాయాథా పుంభూమ్ని దారాః'॥ అంటూ  ఎనిమిది విధాలైన భార్యల వివరాలిచ్చాడు. భర్తతో కలసి యాగంచేసే యోగం కలది, భర్త చేత హస్తం గ్రహించబడింది, యాగఫలం పొందే సందర్భంలో భర్తతో కలసి తాను రెండో స్థానంలో ఉండదగినది, భర్త లాగానే దాన, యజ్ఞాదుల్లో  అధికారం కలది, పతిని పుత్ర రూపంలో తనయందు జనింపచేసే అధికారం కలది, ఆఖరిది(ఆశ్చర్యం కలిగిస్తుందేమో కూడా) కట్టుకున్నవాణ్ని హడలగొట్టేది(దారయంతి ఉద్వేజయంతి పతీనితి దారా:-దౄ భయే.. అని వివరణ).. ఇట్లా ఎనిమిది రకాల భార్యల పేర్లను వాళ్ల వాళ్ల  అర్హతలు, గుణాల ఆధారంగా అర్థ నిర్ణయం చేసిన గొప్ప పదకోశం అమరకోశం. 

ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపించే మరో విశేషం.. శ్లోకంలో మొదటి వరస నాలుగు పేర్లు ధార్మిక సంబంధమైనవిగా ఉంటే .. రెండో వరస నాలుగు పేర్లు లౌకిక జీవితానికి సంబంధించినవిగా ఉంటాయి!

వివరించుకుంటూ పోవాలే కానీ అమరకోశంలోని విశేషాలకు ఎప్పటికీ సశేషాలే. అమరకోశానికి అంత ప్రాచుర్యం ఉల్ఫాగా వచ్చి పడింది కాదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆకులూ, పూతా, కాయలూ, పూలూ, పళ్లూ, అవి రాల్చే గింజలూ.. సర్వం ఒక మహావృక్ష సమగ్ర స్వరూపాన్ని ఎట్లా  కళ్లకు కడతాయో.. అదే విధంగా  అర్థ విస్తరణ కొనసాగించే పద్ధతిలో అమరకోశమూ ఒక సమగ్ర శబ్దమహావృక్షాన్ని తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాబోదు. 

అమరకోశం తనకు ముందు వచ్చిన నిఘంటువులు, తరువాత వచ్చిన నిఘంటువులకు మించిన కోశరత్నం. సంస్కృత భాషా ప్రచారంలో అమరకోశానిది ప్రధాన భూమిక. అమరం మారుమోగినంత వరకు తతిమ్మా నిఘంటువులు మూగబోయాయి. అమరం వదిలేసిన పదాలను ఏరుకుని వాటికి వ్యాఖ్యానాలు రాయడం ద్వారా ఆ నిఘంటువులన్నీ తమ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవలసిన పరిస్థితి.  దేశ విదేశాల్లో దీనికి వచ్చిన అనువాదాలకు లెక్కేలేదు. ఈనాటికీ ‘ యస్య జ్ఞానా దయాసింధో: ‘ శ్లోకంతో సంస్కృత విద్యార్థి పాఠం మొదలుపెడతాడు. ఆ విధంగా అమరకోశం, అమరసింహుడు చిరంజీవులు. 

(ఆధారం:  అమరకోశం పీఠిక – చ.వేం. శేషాచార్యులు


Saturday, December 11, 2021

సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021

 సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


సుగ్రీవుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన- వాళ్ల పేర్లు ) వెంటబెట్టుకుని శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కునుంచి వచ్చి  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు. యుద్ధ కాలం. అనుమానం రావడం సహజమే.  సమీపాన ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి మహర్షి . బుద్ధిమంతుల ముందు వ్యవహారాలను విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం ఓ భాషా సంప్రదాయం ). అది మిగతా కోతుల చెవిలో పడి ఆవేశం వచ్చేస్తుంది. సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అంటారు. 


ఆ మాట విభీషణుడు  విని ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. ' ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చాన' ని వివరంగా చెపుతాడు. భార్యా బిడ్డలను, స్నేహితులను, ఆస్తిపాస్తులను అన్నీ లంకలోనే వదిలేసుకుని ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్షణసమేతుడై ఉన్న రాముడి దగ్గరకు వెళ్లి ఈ వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణాలు నిర్ధారించుకునే తత్వం.  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు. నికృతిజ్ఞులు  ( కపటులు)  అయిన రాక్షసజాతికి చెందిన వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్థకారి అయే ప్రమాదం కద్దు ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి సలహా ఇవ్వబోయాడు. అదీ రాముడు అడగక ముందే! హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి ఒక ముఖ్యమైన మాట అంటాడు. అది అన్ని కాలాలకు అందరికీ పనికిపచ్చే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠం లాంటిది . 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నపుుడు సమర్థులు  సలహా ఇవ్వటమే  మేలు ' అన్న రాముని ఉవాచ సర్వదా శిరోధార్యం. ఈ సందర్భంలో వాల్మీకి ఉటంకించిన ఈ శ్లోకం మనందరం  మననం చేసుకోదగింది. 

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం 


రాముని మాటకు  ధైర్యం తెచ్చుకున్న  అంగదుడు ' నీకు తెలీనిదేముంది ప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ శంకించడమేనాయ! అంతకుమించినది ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో తన రాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెచ్చి మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడ కావచ్చు ఈ రాక్షసుడి రాక. ఎటూ ఆఖరుకు తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రామా  ' అన్నాడు. 


అప్పుడుగాని అంగదుడు తన మనసులోని మాట బైటపెట్టలేదు. 'శత్రువు అంటే అనుమానించదగ్గవాడే.  మనం గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమైనది ముందే గుణ దోషాలు విచారించుకోవడం ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు తన వంతుగా శాస్త్ర దృష్టితో ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వచ్చిన వాడిని తప్పక  అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. కేవలం శాస్త్ర దృష్టి మాత్రమే కాకుండా తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవడం మేలు' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


' ఎదుటివాళ్లను  గురించి వచ్చే ప్రస్తావనలో జాతి, కులం, హోదాలు వంటివి కాకుండా మన సంస్కారానికి ప్రథమ స్థానం  ఉంటుంది. రాజనీతో, ఎదుటి వ్యక్తి మీద ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్నో ల న్యాయ నిర్ణయం జరగదు. పై పెచ్చు  విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలంటారు పెద్దలు.( ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని వాల్మీకి  శ్లోకం ఇక్కడ ) ' నేమ వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చి ' అర్థం.. అనర్థం కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్యం ఎంతో ఎట్లా తెలుస్తుంది? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడమూ క్షేమం కాదు. ' అంటూనే అంగదుడు, జాంబవంతుడు చెప్పిన మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. సుగ్రీవుడి పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమయిందని తెలిసి లంక మీది పెత్తనం ఆశించి నీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. నా బుద్ధికి తోచింది ఇది . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయవచ్చనిపిస్తుంది. మనసులో ఉన్నదే చెప్పాను . ఆపైన నీ ఇష్టం ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' గా పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. అందువల్లే ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడు  - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ పసిగట్టాడు. కానీ ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం . 


అంగధ, సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చుట్టూ ఉన్న పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్తా హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచను. వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సత్పురుషులు వాటిని లెక్కించరు. తనను చంపేందుకు వచ్చిన వాడి ఆవాచనను పక్కనపెట్టి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం మనకు శిరోధార్యం. విభీషణుడిని వదిలి పెట్టను ' 


' సరే! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదు . కానీ అతని అవకాశవాదమన్నా గుర్తించాలిగా! లంకాదహనం, పుత్రమరణం వంటి మహా దుఃఖాలలో ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చినాడు అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా? వదిలేసి పోడూ ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం వివి లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు గ్రహించి ఆప్రకారమే  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రాన్ని మాత్రమే వల్లెవేస్తాడు. కానీ ఆ ధర్మమే ఏం చెబుతోంది? ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గర చెయిచాపడు. సుగ్రీవుడిది   కాలాన్ని బట్టి అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ అమమానాలు పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వాలా తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం ఉంటుంది గదా! వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద కోరిక ఉండదన్న లెక్కతోనే  సహాయం కోసం రామశరణు కోసం వచ్చాడు. కాబట్టి విభీషణుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు. విభాషణుడి వాలకంలో సోదర భీతి సుస్పష్టం.  ఆ భయంతో వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడం ఉచితం. అందరూ భరతుని వంటి సోదరులే ఉండరు.  తండ్రి మరణానికి కారణమైన కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా! రావణ విభీషణులు వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే కావచ్చు. విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణస్వామి. 


అయినా సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించు . వచ్చింది. శత్రువు  సోదరుడు. వాడి తీయని మాటల వెనుక వంచన ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల వాతావరణంలో  సానుకూలమైన ఆలోచనరాదు. గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడు ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనైనా నా కొనగోటితో చంపేస్తా. ఒక పావురమే శరణాగత ధర్మాన్ని పాటించినప్పుడు నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  గురువు  గ్రహించిన గీతికను పునశ్చరణ చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని శాస్త్రం. దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకోకూడదు. అంజలి ఘటించక పోయినా దైన్యంగా ఉన్నా అంతే. ఆ రెండూ లేకపోయినా రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రు కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువగా ఉంది. ' ఆలస్య మయినా సరే ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోని సంకల్పంతోనో, కాముకత్యంతోనో, బాధ్యత తెలీకుండానో , ప్రతిఫలం ఆశించో ,  సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడి, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండానో  ఉండటాన్నే ప్రత్యవాయు హేతువు అనేది. ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . మంచినీళ్లు ముట్టవు . మొహం చూస్తే చాలు అసహ్యం కలుగుతుంది. నిరాశతో వెళ్లేవాడు వట్టిగా పోడు. తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోయినా ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో ఉన్న సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉత్తమ ఉపదేశమే నాకు అనుసరణీయం. అందువల్ల ఆ వచ్చినవాడు విభీషణుడే కాదు, రావణాసురుడయినా అభయమిస్తాను ' అంటాడు రాముడు . 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది. కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా దిగితే తాత్సారమవుతుందన్నట్లు గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. ) రాముడి పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు. 

' అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి. లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూస్తున్నాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదు. మనసులో మాత్రం అభయం ఇచ్చాడు. వానర ప్రముఖుల కోసం ఈ పరీక్ష .  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై పెత్తనం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కు చేరసేనాపతి మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరించినప్పుడు ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం.  ఇక్ మహాపార్శ్వ , మహాదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగితే లోకపాలకులు.  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు అని హరాయించుకోగలరు. 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చెప్పావు. ప్రహస్తుడు, కుంభకర్ణులతో  రావణుని చంపి నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. ప్రతిజ్ఞ .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావడం నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను .  రాముడి అయకార తీవ్ర పౌరుష వచూలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు సాయం చేస్తాను. ' 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముదాజ్జలమానయ ' ( సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు. 


' ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  దిగ్విజయంగా ముగిసింది


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



Tuesday, December 7, 2021

సాహిత్య వ్యాసం సొంత ముద్ర కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో ప్రచురితం '

 



సాహిత్య వ్యాసం 

సొంత ముద్ర 

కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో  ప్రచురితం ' 



ఏ వలరాజు భార్యను నుపేంద్రుని కోడల శంభుచేత నా 

దేవర గోలుపోయి కడు దీనత నొందుచుచున్న దానఁ రం 

డో వనవీధినున్న కచరోత్తములార దిగీంద్రులార రం 

డో వనవాసులార వినరో మునులార యనాథ వాక్యముల్


నేను మన్మథుడి భార్యను . విష్ణుమూర్తి కోడల్ని.  శివుడి మూలకంగా  నా భర్తను పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నదాన్ని. అడవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్లు, అంతా రండి! ఈ అనాధ వినండి!- అని పై పద్యానికి అర్థం. ఈ పద్యం పోతన రచించిన  ' వీరభద్ర విజయం'లోని రెండో 121వ పద్యంగా కనిపిస్తుంది, 


* *


నిస్సహాయ పరిస్థితుల్లో బలహీనులు, భాగ్యులు ఇలాగే స్పందిస్తారు. ముఖపరిచయం లేకపోయినా దారినపోయే వాళ్లందరినీ పేరు పేరునా పిలిచి తమకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ పనే చేస్తోంది ఇక్కడ రతీదేవి కూడా!


ఇంద్రుడు పంపించాడని శివయ్య గుండె బొండుమల్లెల పరిమళాలు పూయించాలని పూలబాణాలతో సహా మహా ఆర్భాటంగా ఊరేగుతూ వచ్చాడు. వలరాజు (ఆహాఁ! ఎంతచల్లని తెలుగు పలుకు). దేవయ్య మీదకి బయల్దేరే ముందు అక్కడికీ ఓ ధర్మపత్ని బాధ్యతగా ముందొచ్చే ముప్పు గురించి హెచ్చరించింది రతీదేవి. అతివిశ్వాసంతో శివయ్య మీద ప్రణయసైన్యాన్ని వెంటేసుకుని మరీ దాడి చేశాడు మన్మధుడు. చివరకు ఆ ముక్కంటి మూడోకంటి నిప్పురవ్వలకు కాలి బూడిదపోగయ్యాడు! 


శివయ్య చేసింది అన్యాయం. కానీ ఆయనేమో దేవతలకు దేవుడు. ఎవరయ్యా ధైర్యంగా ఎదురు నిలబడి అడగ్గలరు? అట్లాగని మనసారా ప్రేమించి పెళ్లాడి కడదాకా జీవితాన్ని పంచుకుందామని గంపెడంతాశతో గృహస్థ ధర్మం స్వీకరించిన స్త్రీమూర్తి చూస్తూ ఊరుకుంటుందా? ఏదేమైనా సరే... తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేం దుకు ఎదురు నిలబడాలనే సగటు ఇల్లాలి మాదిరి రతీదేవి పంతం పట్టింది. అందుకే ఆ దుర్ఘటన జరిగిన వనంలోనే బూడిదకుప్ప ముందు కూలబడింది. అక్కడి వనవాసులను, ఆకాశజీవులను, ఆఖరికి ఆ శివయ్యే సర్వస్వమనుకునే మునిగణాలను కూడా తన మొర ఆలకించమని వేడుకుంటోంది పరమ దయనీయంగా! 


మామూలు మానవులకే కాదు దివ్యశక్తులున్నాయని మనం నమ్మే దేవుళ్లు కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు మనలాగే భావోద్వేగాలకు లొంగిపోతారా? అని ప్రశ్న వేసుకుంటే కొన్ని కొత్త విషయాలు బయటికి వస్తాయి. అవి కావ్యరచనకు సంబంధించిన రహస్యాలు.


సృజన రహస్యమంతా అక్కడే ఉంది. తన కృతిని పదిమంది చదివి తాదాత్మ్యం చెందాలని కోరుకుంటాడు కవి. అలా తన్మయత్వం చెందాలంటే రచనలోని పాత్రలు దేవుళ్లయినా, దానవులైనా మనుషుల మాదిరే భావోద్వేగాలు ప్రదర్శించక తప్పదు. అప్పుడే చదివే పాఠకుడు తన స్వభావంతో.. తన పరిసరాల నైజంతో ఆ పాత్రలను సొంతం చేసుకునేది. తన రచన చదివే పారకులు ఎవరో ముందే నిశ్చయించుకునే కవి/ రచయిత ఆ రచనను తన సొంత స్థాయికి కాకుండా పాఠకుడి మేధోస్థాయికి తీసుకువెళ్తాడు.


కథాకాలం ఏదైనప్పటికీ, కథన  కాలానికి పాఠకుల భావోద్వేగ స్థాయికి తగినట్లు సాగే రచనే పదికాలాల పాటు కాలానికి ఎదురీది నిలబడేది.


పై పద్యకర్త బమ్మెర పోతన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అచ్చతెలుగు పదాల పోహళింపు, ద్రాక్షాపాక రసధార, చెవులకు ఇంపనిపించే శబ్దాల్ని పొదిగి చేసే పదప్రయోగాలు, సందర్భానికి తగ్గట్లు ఛందోవృత్తాల వాడకం... ఇవన్నీ ఆయన ‘ముద్ర’ను పట్టిచ్చేస్తాయి.


రచన చదివినప్పుడే ఫలానా కవిది/ రచయితది ఈ కర్తృత్వం అని పాఠకుడు  గుర్తుపట్టేలా రచన సాగితే.. అదే ఆ కవి 'ముద్ర'. 


ప్రతీ కవి, రచయిత, కళాకారుడు తనదైన సొంత'ముద్ర' స్థాపించుకున్నప్పుడే సాహిత్యంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. కొత్త రచయితలు పాత రచయితల నుంచి నేర్చుకోవాల్సిన అనేక సృజన లక్షణాల్లో 'ముద్ర' కూడా ఓ ముఖ్యమైన సుగుణం.


- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో  ప్రచురితం ' 

మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు - కర్లపాలెం హనుమంతరావు

 


మనువు చెప్పిన స్త్రీ ధర్మాలు 

- కర్లపాలెం హనుమంతరావు 


మనువు అనగానే నేటితరం ఒంటికాలు పై లేచి నిందలకు పూనుకుంటుంది  . ముఖ్యంగా స్త్రీలు . కారణం లేకపోలేదు. మనువు రాసినట్లుగా బాగా ప్రచారంలో ఉన్న మనుధర్మశాస్త్రం- ఐదవ అధ్యాయం( శ్లో. నెం 147 నుంచి 169 ) లో స్త్రీలకు సంబంధించి ధర్మాల పేరుతో మనువు మహిళల స్వేచ్ఛా స్వాతాంత్ర్యాల మీద కఠినంగా ఆంక్షలు నిర్దేశించాడు . 


న్యాయానికి నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విముక్తి కోసం స్త్రీలు.. స్త్రీ జానాభ్యుదయవాదులు చేసిన , చేస్తున్న ఉద్యమాల ప్రభావంతో మనువు ధర్మ శాస్త్రంలో విధించిన ఆంక్షలన్నీ దాదాపు ఔట్ డేటెడ్  అయిపోయాయి. 


మనువు సూత్రాలు పాటించడం లేకపోయినా ఆ సూత్రాలను నిర్దేశించిన మనువు మాత్రం నేటికీ నిందల పాలవుతున్నాడు . ఇది గమనించ దగిన చిత్రం. ( నేను మనువును సమర్థించినట్లుగా భావించ వద్దని మనవి ) 


అసలు మనుధర్మ శాస్త్రంలో  స్త్రీకి సంబంధించింనంత వరకు మనువు చేత చెప్పబడిననిగా ప్రచారంలో ఉన్న  ధర్మాలు ఏమిటి? 


ఆ అంశంపై పాఠకుల కోసం ఇక్కడ సంక్షిప్తంగా సంక్లిష్టంగా లేని భాషలో  ఇవ్వడం జరిగింది . . ఆసక్తి గల పాఠకులు  ఒకసారి దృష్టి పెడతారనే ఉద్దేశంతో . 

- కర్లపాలెం హనుమంతరావు 

02 - 12- 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ 


పంచమ అధ్యాయం


స్త్రీ ధర్మములు 


శ్లో . 147

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి.


బాలఅయినా, యువతిఅయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏకార్యాన్నీ చేయతగదు.


శ్లో . 148

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణి గ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్.


బాల్యంలో తండ్రి అధీనంలోను, యౌవనంలో భర్త అధీనంలోను, భర్త  మరణించిన తరువాత పుత్రుల అధీనంలోను ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.


శ్లో 149నుండి శ్లో 151 వరకు 


స్త్రీ ఎప్పుడూ  తండ్రిని, భర్తను, కొడుకులను వదలి ఉండాలని అనుకోరాదు. అలా ఎడబాసి ఉంటే మాతాపితరులవంశాలకు రెంటికీ చెడ్డపేరు తెస్తుంది. ఎల్లప్పుడు భార్య నవ్వుముఖంతో మసలుతు యింటిపనులన్నీ దక్షతతో నిర్వహిస్తూ, ఎక్కువ ధనవ్యయం లేకుండా నడచుకోవాలి. తండ్రి లేక తండ్రి అనుమతితో సోదరులు వివాహం చేసిన భర్తతో జీవితాంతం అతనికి శుశ్రూష చేస్తూ జీవించాలి. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.


శ్లో 152నుండి -శ్లో . 155 వరకు 


స్త్రీలకు వివాహ సమయంలో చెప్పే శాంతి మంత్రాలు, ప్రజాపతిహోమము మంగళార్థం చేయబడేవి. కాని మొదట వాగ్దాత్తం జరగటంలోనే భర్తకు భార్యమీద ఆధిపత్యం కలుగుతున్నది. భర్త భార్యకు ఋతుకాలంలోను, యితర సమయాలలోను యిహపర సుఖాల నిస్తాడు. సదాచార శూన్యుడైనా, పరస్త్రీలోలుడైనా, విద్యాదిసుగుణాలు లేనివాడైనా భర్తను పతివ్రత అయిన స్త్రీ నిరంతరం దేవునిలాగా పూజించాలి. పురుషుడు ఒక భార్య కాకపోతే వేరొక భార్యతో యజ్ఞం చేయవచ్చును. కాని స్త్రీకి భర్తతో కాక

వేరొక పురుషునితో యజ్ఞం లేదు. భర్త అనుమతి లేకుండా ఏవ్రతమూ లేదు . ఉపవాసమూ లేదు. ఎందువల్లనంటే భార్య భర్తృశుశ్రూషవల్లనే స్వర్గంలో పూజ్యురాలవుతుంది.


శ్లో .156 నుండి శ్లో. 160 వరకు 

వివాహిత సాథ్వి అయిన స్త్రీ భర్త ఉన్నా గతించినా భర్తకు విరుద్ధంగా ఏకార్యము చేయరాదు. గతించిన భర్త కప్రియమైన దే కొంచం చేసినా పరపురుషునితో కూడటం, శ్రాద్ధం చేయకపోవటంతో సమానమవుతుంది. భర్త మరణానంతరం పతివ్రత అయిన స్త్రీ కందమూల ఫలాలతో జీవించాలి. పరపురుషుని నామం కూడా ఉచ్ఛరించకూడదు. ఓర్పుతో నియమంతో ఏకభర్తకు విధించిన వ్రతాలను ఆచరిస్తూ ఆమరణం బ్రహ్మచర్యంతో ఉండాలి. బాల్యంలోనే బ్రహ్మచారులై వివాహం చేసుకోకుండా సంతానాన్ని పొందకుండా పుణ్యలోకాలను పొందిన బ్రాహ్మణ (సనకసనందన వాలఖిల్యాది) వంశములు వేనవేలున్నాయి. కనుక తనకు సంతానం లేదని దుఃఖించకూడదు. భర్త చనిపోయిన తరువాత పతివ్రత అయిన కాంత పుత్రులు లేనిదైనా పరపురుషసంగమం లేకుండా బ్రహ్మచర్య మవలంబిస్తే పుణ్యలోక ప్రాప్తిని పొందుతుంది.


శ్లో 161 నుంచి శ్లో 164 వరకు 


తనకు పుత్రుడు కలగాలనే కోరికతో పరపురుషసంగమాన్ని పొందే స్త్రీ యిహంలో నిందల పాలవుతుంది. పరంలో పుణ్యావాప్తిని పొందదు. పరపురుషునివల్ల కలిగిన సంతానం శాస్త్రీయసంతానం కాదు. ఇతరుని భార్యవల్ల కలిగిన సంతానం పుట్టించినవాడిది కాదు. పతివ్రతలయిన స్త్రీలకు ఎక్కడా రెండవ భర్త విధింపబడలేదు. దీనిని బట్టి వితంతువుకు పునర్వివాహం అప్రసిద్ధమని తెలుస్తుంది. నికృష్టుడైన భర్తను విడిచి గొప్పవాడైన మరొక భర్తను పొందే స్త్రీ యింతకు ముందే యింకొకడిని పెండ్లాడినది అనే లోకాపవాదుకు పాలవుతుంది. అంతే కాక మరణానంతరం నక్కగా పుడుతుంది లేక కుష్ఠు మొదలయిన నికృష్టమైన రోగాల పాలవుతుంది.


శ్లో 165 నుండి - శ్లో, 168 వరకు 


మనసా వాచా కర్మణా తన భర్తను వీడి పరపురుషుని కోరని స్త్రీ భర్త పొందిన పుణ్యలోకాలను పొందుతుంది. పతివ్రత అని పెద్దల చేత కొనియాడబడుతుంది. మనోవాక్కులచేత కూడా  వ్యభిచారం చేయరాదని దీని భావము. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సవర్ణ అయిన భార్య తనకంటే ముందుగా మృతిచెందితే భర్త అయిన ద్విజుడు శ్రాతస్మార్తాగ్నులతోను, యజ్ఞపాత్రలతోను దహనం చెయ్యాలి. అలాంటి భార్యకై అంత్యక్రియలలో దక్షిణాగ్ని, గార్హపత్యా హవనీయాగ్నులను సమర్పించి, తనకు ఆమెవల్ల పుత్రులున్నా లేకున్నా, మరొకరిని పెండ్లాడి స్మార్తాగ్నులను గాని, వైది కాగ్నులనుగాని మరల ఆధానముచే ఏర్పరచుకోవాలి.


శ్లో . 169


ఈవిధానముతో మూడవ అధ్యాయంనుంచి చెప్పిన విధంగా పంచయజ్ఞాలను విడువకుండా భార్యతో కలసి రెండవదైన గృహస్థాశ్రమాన్ని డపాలి.


ఇది భృగుమహర్షిప్రోక్తమైన మానవధర్మశాస్త్రసంహితలో పంచమాధ్యాయము.


గమనిక: 

శ్లో 147-శ్లో 148... 9వ అధ్యాయంలో ప్రసిద్ధమైన వివాదగ్రస్తమైన 2, 3, 4 శ్లోకాలలోనూ  యిదే భావం పునరుక్తమవుతున్నది..


( ఆధారం-  మనుస్మృతి కి శ్రీ కె. ఎల్. వై. నరసింహారావు గారి తెనుగు సేత)  


మహాభారతంలో ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- ( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25 )

 



మహాభారతంలో  ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం- 

( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25  ) 


త్వమాదాయాం శుభి స్తేజో నిదాఘే సర్వదేవానామ్ । సర్వేషధిరసానాం చ పునర్వరాసు ముఖ్చసి।


14


మీరు గ్రీష్మఋతువునందు మీ కిరణములచే సమస్త దేహ ధారుల యొక్క తేజమును సమస్త ఓషధుల యొక్క రసము యొక్క సారమును ఆకర్షించి తిరిగి వర్షాకాలమున దానిని వర్షిం జేయుచున్నారు


తపన్త్యన్యే దేహన్త్యన్యే గర్జన్యన్యే తథా ఘనాః ॥ 

విద్యోత స్ర్తీ ప్రవర్షన్తి తవ ప్రావృష రశ్మయః ॥


15


వర్ష ఋతువునందు మీ యొక్క కొన్ని కిరణములు తపించుచు కొన్ని మండింపజేయుచు కొన్ని మేఘములై గర్జించుచు కొన్ని మెఱుపులయి మెఱయుచు కొన్ని వర్షించుచు ఉన్నవి.


న తథా సుఖయత్యగ్నిర్న స్రావారా న కమ్బలాః | శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః ॥


10


శీతకాలపు గాలిచే పీడింపబడిన జనులకు మీ కిరణము లెంత సుఖమును కలుగ జేయునో అంత సుఖమును అగ్ని కాని కంబళ్ళు. కాని వస్త్రములుకాని కలుగ చేయజాలవు


త్రయోదశ ద్వీపవతీం గోభిర్భాస యసే మహీమ్ । త్రయాణామఎ లోకానాం హితాయైకః ప్రవర్తనే॥


17


మీరు మీ కిరణములద్వారా పదమూడు ద్వీపములతో కూడిన ఈ భూమిని ప్రకాశింపజేయుచున్నారు మఱి యు ఒంటరిగనే ముల్లోకములకును వాత మొనర్చుచున్నారు


తవ యద్యుదయో న స్యాదగ్ధం జగదిదం భవేత్ | 

న చ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్ మనీషిణః ||


18


మీరు ఉదయించనిచో ఈ జగత్తంతయు గ్రుడ్డిది యగును మఱియు విజ్ఞులు ధర్మ అర్థ కామ సంబంధ కర్మములందు ప్రవృ త్తులే కారు


ఆధానపశుబన్ధేష్ణ  మ శ్రయజ్ఞ తపః క్రియాః | త్వత్ప్రసాదాదవాప్య ర్తే బ్రహ్మక్షత్ర విశాం గణైః || 


19


అగ్ని స్థావన పశువులను కట్టుట పూజ మంత్రములు యజ్ఞానుష్ఠానము తపస్సు మున్నగు క్రియ లన్నియు మీ యొక్క కృపచేతనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులద్వారా జరుపబడు చున్నవి.


యదహర్ర్బహ్మణః ప్రోక్తం సహస్రయుగ సమ్మితమ్ | 

తస్య త్వమాదిర న్తశ్చ కాలక్షైః పరికీర్తితః ॥


20


వెయ్యి యుగములతో గూడిన బ్రహ్మ దేవునియొక్క దిన మేది చెప్పబడినదో కాలమానము నెఱిఁగిన విద్వాంసులు దాని ఆది అంతములు మీరే యని చెప్పుచున్నారు


మనూనాం మరుపుత్రాణాం జగతో మానవస్య చ | 

మన్వ స్తరాణాం సర్వేషామీశ్వరాణాం త్వమీశ్వరః ||


21


మనువు యొక్కయు మను పుత్రులయొక్కయు జగత్తు యొక్కయు అమానవునియొక్కయు మన్వంతరము లన్నిటి యొక్క యు ఈశ్వరులయొక్కయు ఈశ్వరుడు మీరే అయి యున్నారు.


సంహారకాలే సమ్ప్రా ప్తే  తవ క్రోధ వినిః సృతః | 

సంవర్తకాగ్ని స్త్రైలోక్యం భస్మీకత్యావతిష్ఠతే ॥


22 


ప్రళయకాల మేతెంచగా మీ వలన ప్రకటనగు సంవర్తక మను అగ్ని మూడు లోకములను భస్మ మొనర్చి తిరిగి మీ యందే స్థితిని పొందుచున్నది


త్వద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనాః ।

సైరావతాః సాశనయః కుర్వన్త్యాభూత సమ్లవమ్ ॥


23 


మీ యొక్క కిరణముల చేతనే ఉత్పన్నములగు ఐరావతాది రంగురంగుల మహామేఘములు మెఱపులు సమస్త ప్రాణుల యొక్క సంహారము నొనర్చుచున్నవి.


కృత్వా ద్వాదశధాత్మాZZనం  ద్వాదశాదిత్యతాం గతః | సంహృత్యై కార్జనం సర్వం త్వం శోషయసి రశ్మిభిః || 


24


పిదప  మీరే మిమ్ములను పండ్రెండు స్వరూపములుగ విభ జించుకొని పండ్రెండుగురు సూర్యుల రూపమున ఉదయించి మీ కిరణములద్వారా ముల్లోకములను సంహార మొనర్చుచు ఏకార్ణ వము యొక్క జలమునంతను శోషింప చేయుచున్నారు.


త్వామిన్ద్రమాహు స్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః | త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతమ్ ||


25 


మిమ్ములనే ఇంద్రుడని చెప్పుచున్నారు మీరే రుద్రుడు మీరే విష్ణువు మీరే ప్రజాపతి అగ్ని సూక్ష్మమనస్సు ప్రభువు సనాతన బ్రహ్మము మీరే అయి యున్నారు


- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

01 - 12 - 2021 


మాతృక : భారతరత్నాకరము 

Saturday, December 4, 2021

విభీషణుడి మొదటి పట్టాభిషేకం ( వాల్మీకం ప్రమాణంగా ) రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021 బోథెల్ ; యూ. ఎస్.ఎ

 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


విభీషణుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన) వెంటేసుకు వచ్చి  శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కున  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది.  యుద్ధ కాలం. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు.  సమీపంలో  ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి ఇక్కడ.  బుద్ధిమంతుల ముందు వ్యవహారాలు  విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం సంస్కృత భాషాసంప్రదాయం ). సుగ్రీవుడి మాట మిగతా కోతుల చెవిలో పడింది.  ఆవేశం ఆగదు . సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అని గెంతులేస్తారు . 


ఆ మాట విభీషణుడు  విన్నాడు.  ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చా' అని వివరంగా చెపుతాడు.  ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్ష్మణుడితో మాట్లాడుతూ  కూర్చోనున్న  రాముడికి వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణదోషాలు  నిర్ధారించుకునే నైజం .  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు.  రాక్షసులు నికృతిజ్ఞులు  ( కపటులు). వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు ముందు  వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్ధం ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి అడక్కుండానే సలహా ఇవ్వబోయాడు.  హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  సమర్థులు  సలహా ఇవ్వటమే  ఉత్తమం .   

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం' అన్న రాముని భరోసాతో 


  అంగదుడు ' నీకు తెలీనిదేముంది రామప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ అనుమానించడమేనాయ! ఈ రాజనీతికి మించింది  ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో కపిరాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెస్తే ?  మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడేమో  ఈ రాక్షసుడి రాక. ఎటూ చివరకు  తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రాదూ    ' అన్నాడు. 


అంగదుడు  అప్పుడు తన మనసులోని మాట బైటపెట్టాడు . 'శత్రువు అంటేనే  అనుమానించదగ్గవాడు.  గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమా .. కాదా అన్నది  గుణ దోషాలు విచారించుకున్న తరువాతే  ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు వంతు వచ్చింది.  శాస్త్ర దృష్టితో పరిశీలించినట్లు   ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వస్తే ..  వాడిని తప్పకుండా   అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. 


కేవలం శాస్త్ర దృష్టి చాలదు. తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవాలి ' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


'ఎదుటివాళ్లను  గురించి వేసుకునే అంచనాలో  జాతి, కులం, హోదాల్లాంటివి  కాదు..  మన సంస్కారం  ప్రధానం. రాజనీతో, ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్లనో  న్యాయ నిర్ణయానికి పూనుకోతగదు.  ముందసలు మన విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలని ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని కదా పెద్దల వాక్కు !  అయితే నేనిక్కడ  వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు సుగ్రీవా! ' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చాడు హనుమంతుడు . ఆనక 

 ' అర్థం.. అనర్థం అనే కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్య౦ ఎంతో ఎట్లా తెలిసేది ? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడం కూడా క్షేమం కాదనుకొండి ' అన్నాడు హనుమ. అంగదుడు, జాంబవంతుల మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. తన లంకా పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమని లెక్కలేసుకునే  నీ  దగ్గరకు వచ్చి ఉండవచ్చు . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయడమే ఉచితం అనిపిస్తుంది. ఇదీ నా మనసులో ఉన్నది  . ఆపైన నీ ఇష్టం రామా!  ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' అని పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. ఆ కృతజ్ఞత వల్ల  ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడేమో   - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ గ్రహించి వున్నాడు. ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం  అంటే . 


అంగద , సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు  పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్త హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచే ప్రశ్నే లేదు . వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సరే, సత్పురుషులు వాటిని పట్టించుకోరు . తనను చంపేందుకు వచ్చిన వాడి అరాచకాన్ని  పక్కనపెట్టి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం సర్వదా  శిరోధార్యం.  అందుచేత నేను విభీషణుడికి  అభయం  ఇవ్వకుండా వదిలి పెట్టను ' 


' సరేనయ్యా స్వామీ ! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదన్నావు  . కానీ అతగాడి  అవకాశవాదమన్నా పట్టించుకోవాలిగా ?  లంకాదహనం, పుత్రమరణం లాంటి ఉపద్రవాలు జరిగి మహా దుఃఖంలో  ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చాడే!  అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం మొదలుపెట్టాడు . అది విని  లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు రాముని వంక చూసి  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రమే మళ్లీ వల్లివేశాడు. ఆయన రాజనీతే ' ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గరయినా  చెయిచాచడని  . సుగ్రీవుడు రాజు కాబట్టి కాలాన్ని బట్టి ఆ అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ శంకలు  పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వారా  తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం  విభీషణుడికి ఉంటుందా.. లేదా?వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద ఆశ  ఉండదన్న భరోసాతోనే వాడు   సహాయం కోసం రామశరణు జొచ్చాడు. కాబట్టి విభీషణుడు అన్నిందాలా స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: ' అన్న మాట మార్చిపోతే ఎట్లా? 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. పెత్తనాల కోసం ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు కదా! విభాషణుడి వాలకంలో సోదర భీతి స్పష్టంగా కనిపిస్తోంది.  ఆ భయంతోనే వాడు  వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడంలో వచ్చి పడే ఉపద్రవమేంలేదు. అందరూ భరతుడి లాంటి  సోదరులే ఉంటారా? తండ్రి మరణానికి కారణమైన నాలాంటి  కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా సుగ్రీవా! రావణ విభీషణులు-  వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే . విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణుడు . 


సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించవయ్యా రామయ్యా!  . వచ్చింది శత్రువు  సోదరుడు. వాడి తీపి  మాటల వెనుక చేదు ఫలితం  ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లేకపోతే ఈ లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల మధ్య   సానుకూలమైన ఆలోచన తోచదు . అందుకే గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు రాముడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడయ్యా  ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా. అది నా పంతం  . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనయినా సరే  నా కొనగోటితో చంపేయగలను .. నీకు తెలుసో .. లేదో! ఒక పావురమే శరణాగత ధర్మాన్ని చక్కగా  పాటించగా లేనిది ..  నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  తన గురువు  గ్రహించి తనకు బోధించిన ఒక  గీతికను గుర్తు  చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని గదా శాస్త్రం! దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకుంటే మనకే ఆపద. అంజలి ఘటించక పోయినా సరే.. దీనంగా వేడుకున్నా అభయం ఇవ్వాల్సిందే ! ఆ రెండూ లేకపోయినా ఇంకోటి కూడా ఉంది. రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రువా?  కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువవడం చూడండి ! ఆలస్య మయినా సరే .. ఎలాగోలా కోరుకున్న ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు చూడండి! ఇవన్నీ నిజమైన ఆశ్రితుడి లక్షణాలు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి అంటుంది ధర్మశాస్త్రం. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. . మీకు తెలుసో.. లేదో! భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోలేని నిర్ణయంతోనో , కాముకత్వంతోనో, బాధ్యతారాహిత్యంతోనో , ప్రతిఫలం మీద ఆశతోనో  ఉండి సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడకపోవడం, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండా ఉండవలసిన తరుణంలో తప్పుకుపోవడమో   ప్రత్యవాయు హేతువు కిందకు వస్తుంది. పైపెచ్చు  అడిగినప్పుడు ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని  పైలోకంలో నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . దాహానికి మంచినీళ్లు దొరకవు . వాడి మొహం చూస్తే చాలు జనం అసహ్యించుకుంటారు.  ఇంతకంటే ప్రమాదం ఇంకోటుంది. నిరాశతో వెళ్లే ఆశ్రితాభిలాషి   వట్టిగా పోడు. అభయం తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోవడం కూడా   నష్టదాయకమే. ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో అభయదాత పట్ల ఉన్నట్లు ఊహించుకున్న   సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  కాబట్టి, ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి  . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉపదేశిత ఉత్తమ మార్గమే నాకు అనుసరణీయం. ఆ వచ్చినవాడు విభీషణుడే కానక్కర్లేదు , రావణాసురుడయినా సరే నిస్సంకోచంగా అభయమిస్తాను ' అన్నాడు  రాముడు . రాముడు అందుకే లోకానికి ఆదర్శప్రాయుడయింది. 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది రామా! కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి  బయలుదేరి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. )    నెమ్మదిగా దిగితే తాత్సారమవుతుందనో, రామ నిర్ణయం మారిపోతుందనో భయం. రాముడి  పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు విభీషణుడు. 


' ఆ అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి నేనే ప్రభూ! లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు  ఈ క్షణం నుంచే స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూశాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదురాముడు . మనసులో మాత్రం అభయం ఇచ్చాడు.  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . వానర ప్రముఖుల నమ్మకం కోసం కూడా. 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై అధికారం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కుబేరుడి సేనాపతి  మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరిస్తేమాత్ర౦ ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి అతగాడు  . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం పట్టుబడింది .  ఇక మహాపార్శ్వ , మహోదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగినప్పుడు సాక్షాత్ లోకపాలకులే .  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు తాగి తిని హాయిగా హరాయించుకోగలరు. ' 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చక్కగా  చెప్పావు విభీషణా! ప్రహస్తుడు, కుంభకర్ణులతో  సహా రావణుని వధించి మరీ  నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. నా ప్రతిజ్ఞ  కూడా  .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావు  నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను గాక చెయ్యను  .  


రాముడి లయకార  తీవ్ర పౌరుష వచనాలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు  నీకు సాయం చేస్తాను. ' అని తన వంతుగా మాట ఇచ్చాడు విభీషణుడు  . 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు' . దీన్నే వాల్మీకి ' సముద్రాజ్జలమానయ' అన్నాడు. 


'ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  తంతు దిగ్విజయంగా ముగిసినట్లయింది. 

( వాల్మీకం ప్రమాణంగా ) 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...