Showing posts with label carona. Show all posts
Showing posts with label carona. Show all posts

Sunday, December 12, 2021

కోవిడ్ - పంధొమ్మిది దెబ్బకు కుదేలు


వీధి పట్టున ఎంత బలంగా ఉంటేనేమంట.. ఆ కృష్టయ్యలంతా ఇంటి పట్టునే రామయ్యల్లా పడుండే పాడురోజులు వచ్చిపడ్డాయిప్పుడు. కాలజ్ఞానం మార్కు
బ్రహ్మంగారు కూడా  ఊహించినట్లులేదు ఈ తంటా. ‘గోవిందుణ్ని నమ్ముకో చాలు!
స్వర్గంలో లగ్జరీ బెడ్ ఖాయం’ అని  నమ్మబలికిన  దేవుడి స్పెషల్ ఏజెంట్లూ
ఇప్పటి ఈ కోవిడ్ - పంధొమ్మిది దెబ్బకు కుదేలయి కూర్చోడం విచిత్రం.
సర్వజగత్తునూ కాపాడే డ్యూటీ ప్రస్తుతానికి పక్కనలా పెట్టి గర్భగుడి
తలుపులు గట్టిగా బిడాయించుకోవడమే సర్వదా శుభదాయకమని భగవంతుడే
భావిస్తున్నప్పుడు.. ఆఫ్ట్రాల్ ఆయన ఏజంట్  మాత్రం చేసేదేముంది? రెండు
నిద్ర మాత్రలు మింగి ముంగిలా కొంపలోనే బబ్బోడం మించి!

విధి బలీయం. అయినా సరే! దానికి ఎదురీదడంలోనే ఉంది సరదా అంతా’ అంటూ దసరా
బుల్లోళ్లకు మల్లే కథలెన్నో చెప్పే వికాసగురువుల కత మాత్రం? ఆ విధికి
మించిన బలీయమైన కరోనా వైరస్ బారిన పడిపోతామని భయపడిపోయి ‘ప్రబోధాలు ఫ్రమ్
హోమ్’ స్కీములు మొదలెట్టేసారు కదా ఇప్పుడు!

‘ఇల్లు ఇరకటం.. ఆలి మరకటం’ అంటూ వెటకారాలు వెళ్లబెట్టిన తిరుగుబోతులకు
ఉగాది వేప్పచ్చడి. ఇంటావిడ ‘పంచాంగాల’ శిక్ష వేసి కక్ష తీర్చుకున్నది
విధి, కరోనా వైరస్ పేరు చెప్పి మరీ ఈ ఉగాది శార్వరికి!

సృష్టి సర్వం తనే ప్రకృతి వేసిన బిడ్డింగులో పాడేసుకున్నట్లు ఎంతలా
విర్రవీగాడీ  మానవుడు! ఏ పశువుదో, పక్షిదో కన్ను కుట్టినట్లుంది!
కంటికైనా కనిపించని కరోనా వైరస్ దెబ్బకిప్పుడు వెర్రిమొగం
వేయాల్సొచ్చింది! మానవసంచారం తగ్గుముఖం పట్టేకొద్దీ జంతుజాలం ఆ లోటును
మెల్లగా భర్తీ చేస్తున్నదిప్పుడు తిరుమల ఘాట్ రోడ్ల మీద పులులు తిరగాడడం,
 థాయ్ లాండ్ ప్రధాన వీధులలో కోతులు షికార్లు చేయడం ఇందుకు తాజా ఉదాహరణలు.
పశువును, పక్షిని తరిమికొట్టి కదూ మనిషి ఈ భూగోళాన్నంతా కేవలం తన
మీరాశిగా అనుభవించడం!  వాడి స్థానం భూమండలం మీద ఎక్కడో.. ఏ మేరనో  గీత
గీసి మరీ చూపెట్టే ప్రకృతి చిట్కానే ఏమో  ఈ కొత్త గత్తర కరోనా వైరస్!

'శ్రామికులారా ఏకం కండి!' అంటూ  అదే పనిగా చెండుకుతినేది చైనా. దాని
ప్రసాదం కరోనా దెబ్బకు ఆ చైనా నినాదమే పూర్తిగా మారిందిప్పుడు. 'మనిషికి
మనిషి మీటరు దూరంలో ఉండాలి. శ్రమదామాదులు మరచి కొంపలోనే పడుండాలి!'
అన్నది ఆ కొత్త నినాదం! కారల్ మార్క్సా?  కరోనా వైరస్సా?  దేని ఫోర్స్
ఎక్కువో తేలిపోలేదూ! హ్హా.. హ్హా.. హ్హా!

ప్రపంచం ప్రమాదంలో పడ్డా హాస్యానికి హాల్ట్ ఉండకూడదంటాడు ఛార్లీ
చాప్లిన్.  కరోనా వైరస్ ను కామెడీ దమ్మిడీ లెక్కచేయదు అందుకే. ప్రాణాలు
హరాయించే మహమ్మారి కరోనాకు ప్రాణాలకు తెరిపినిచ్చే థెరిపీ హ్యూమరసమే కదా!
పద్దాకా ఇంటి పట్టునే పడుంటున్నారంతా. ఎన్ని గంటలని మొగుడూ పెళ్లాల మధ్య
 కీచులాటలు? అందుకే పగటి పూట మందులా  పనిచేసే ఈ వినోదాల విందు!

అందరికీ అ కొరియా కింగు కిమ్ము మాదిరి అతితెలివితేటలు అబ్బవు కదా!
రాసుకోడం పూసుకోడం పనేదైనా సరే పుర్రచేతితో కొనసాగిస్తే కాణీ ఖర్చు
లేకుండా కరోనాని కట్టడిచెయ్యచ్చు అంటున్నాడా చిచ్చరపిడుగు. ఏ
పప్పుగుత్తితోనో మొగుడు నెత్తిన రెండు మొత్తేటప్పడు తప్ప ఆట్టే ఉపయోగపడని
పుర్రచెయ్యి, ఇంతకాలానికి ఇంత వింతగా ఉపయోగిస్తుందని సూరేకాంతమ్మత్తైనా
ఊహించి ఉండదు. బతికుండుంటే ఆ కిమ్ముగాడి పుచ్చె మీదే పుర్రచేత్తో ‘ఆరి..
అబ్బోసి’ అంటూ రెండు తగిలించుండునేమో కూడా కదా మరి!

భగవంతుడికైనా ఆర్తుల  పట్ల  ఒకింత అనురాగం, దుష్టుల పట్ల చచ్చే కోపం
కద్దేమో కానీ కరోనా వైరస్సుకు ఆ తరతమ బేధాలు బొత్తిగా లేవు.  కులం, మతం,
జాతి, రంగు, దేశం తో నిమిత్తాలుండవు. ఒక్క ఆరోగ్యం అంటేనే మహా ద్వేషం.
అనారోగ్యం ఎక్కడుంటే అక్కడే దాని స్వర్గం. పసివాళ్లు, ముసిలాళ్ల మీద  మహా
ప్రాణం దానికి. అన్ని చోట్లా తానుండి భయపెట్టడం కుదరదు కదా పాపం! కాబట్టే
ఆ లోటు తీర్చేందుకు పెనుభూతం లాంటి అనుమానానికి ప్రాణం పోసి మరీ
ఉసిగొల్పేదీ  మహమ్మారి నలు దిశలకూ ఇప్పుడు! నూట తొంభై ఆరు ప్రపంచ దేశాలలో
నూట అరవై ఐదు దేశాలు ప్రస్తుతం కరోనా దెబ్బకు విలవిలలాడడమే అందుకు
ఉదాహరణ.
‘నీ గాలి సోకిన వారు- గాలి దూరని గదిలో/నీ వార్త విన్ననాడు- భయం దూరేను
మా మదిలో’ అన్నాడు ఒక ఆధునిక కవి అర్భకుడు కరోనా సృష్టించే కలవరాన్ని
చూసి. ఏదేమైనా.. లక్షలకోట్లు జనంసొమ్ము కుమ్మేసీ  బాహాటంగా దొరతనం
వెలగబెట్టే బడాబాబులకు ఏళ్ల తరబడి న్యాయం, చట్టం వెయ్యలేని ఏకాంతవాస
శిక్షలు  ప్రస్తుతం వేస్తున్నది ఈ కరోనా మహమ్మారి ఒక్కతే! ఈ మహమ్మారి
వైరస్ వల్లనే   పిల్లల వైముఖ్యం పిజ్జాలు, పబ్బుల పైకి
మళ్లుతున్నదంటున్నారు మెల్లమెల్లగ. వెల్లుల్లి రసం కల్చర్ మళ్ళీ
వెలివిరుస్తుందని మన ఆహారవ్యవహారాలను మహా ఉత్సాహంగా ఆచరించేవాళ్ల ఉల్లాసం
కూడా.
అయినా సరే..

దగ్గద్దు. తుమ్మద్దు. ముక్కులు రుద్దద్దు. అసలు మొహం మీదకే చేతులు
పోనీయద్దు.. అంటూ ఒహటే వేపుకుతింటున్నారే ఎటు వేపు చూసినా ఇంటా బైటా
పెద్దలు! హితం కోరి చెబుతున్నాం.. ఎవరికీ సన్నిహితంగా పోవద్దని
పోరుపెడుతున్నారే ఆరోగ్యశాస్త్రవేత్తలు! నా మొహం.. ఇహ మనిషిగా పుట్టి
మాత్రం ప్రత్యేకంగా పొడిచేదేముందంట? రామాయణంలో అహల్యమ్మలా హాయిగా ఏ
శిలాఖండం మాదిరో ఓ మూల పడుంటే పోలా! అడవిలో మానుగా పుట్టడం ఒక్క ఆడదానికే
కాదబ్బీ .. మనిషన్న ప్రతీవాడికి నయమనే భయానకమైన మూడ్  ప్రపంచమంతా
ప్రస్తుతం మనోవేగంతో విస్తరిస్తున్నది. రామరాజ్యం కోరుకుంటే..  ఇదేమిటి
రామచంద్రా! కరోనా మహాసామ్రాజ్యం అవతరిస్తున్నది! ఇంకెంత కాలమోరా బాబో ఈ
కాష్మోరా  కరోనాల కింద ఆలనా పాలనా?  తల మొత్తుకుందామన్నా చేతులు తలకు
తగలనీయద్దంటున్నారే!

గంటకో సారి కనీసం ఇరవై సెకండ్లకు తగ్గకుండా చేతులు శుభ్రంచేసుకోమని
సూక్తులు!  ప్రబోధం బాగుంది! శుభం! నూట ముప్పై కోట్ల మందీ దేశం జనాభా!
కశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా నీళ్ల కోసం కొట్లాడని జాగా గజమైనా లేదు
గదా!  తాగు, సాగు నీటికే తగినంత జలవనరులు దాచుకోడం రాని  దేశంలో ఎన్ని
గంగా గోదావరులు, పెన్నా తుంగభద్రలు ఆటివచ్చేను బాబూ చేతులూ మూతుల
శుభ్రతలకు! ఇన్ని కడగళ్లకు ఉపరి ఇప్పుడు ఈ చేతులు కడుగుళ్లు కూడానా!
భగవంతుడా! నమస్కారం చేద్దామన్నా  భయమేస్తుందయ్యా దయామయా! ఎక్కడ కరోనా
వైరస్ ముక్కూ మూతుల మూలకంగా ఠక్కున అంగిట్లోకెళ్ళి తగులుకుంటుందోనని!
చేతిలోనే కరోనా భూతాన్ని పెట్టుకుని వేరే భూతాల మీద యుద్ధమంట! కామెడీ!
ఇలాంటి వింత కాలం ఒకటి రాబోతున్నదని కనీసం ఆ నోస్టర్ డ్యాం మహాశయుడు కూడా
పసిగట్టినట్లులేడు!

నలుగురు మించి ఒకే చోట గుమిగూడడం పాపం! నలుగుపెట్టి పంపించడమే ఇప్పటి
ఖాకీల కొత్త రకం ప్రతాపం! ఒకానొక పార్టీ  ఒకే ఒక అధినేతగారు కవితలల్లి
మరీ జనాలను కల్లబొల్లి కబుర్లతో కడుపు నింపేస్తారు. కానీ అదే పార్టీ
కవితమ్మగారు ఊరి బైట రిసార్టు క్యాంపు  రాజకీయం గుమ్ముగా నిర్వహిస్తారు!
ఖాన్ ఒక్కడితోనే కాదు సుమా!  కరోనాతోనూ గేమ్స్ వద్దు!  ఒలంపిక్సునే
డౌట్సులోకి నెట్టిన ఘనత కరోనా  వైరస్సుది!   కోవిడ్ పంథొమ్మిదితోనా కోతి
మార్కు జంప్ పాలిటిక్సు? కోరి ప్రమాదం తెచ్చుకోవద్దు!

అనారోగ్యంతోనే ఆ మాయదారి మహమ్మారికి శాశ్వత మిత్రత్వం! అసమ్మతి రాగంతో
దాన్ని కుదెయ్యాలంటే ఆరోగ్యంతో మినహా మరో వర్గంతో పొత్తు వద్దు. జనాభాలో
ఐదుకు ముగ్గురు, ఒకటికీ, రెంటికీ ఒక్కసారి పోవాలన్నా ఏ గోడచాటుల ఏర్పాటూ
లేని దిక్కుమాలిన దేశమిది బాబూ! ఎన్ని నెలలని ముక్కూ, మూతీ మూసేసుకొని
కొంపలోనే ఓ మూల నక్కి మూలగడం? నక్కడానికైనా నెత్తి మీద గూడు లేని
దౌర్భాగ్యుల ఎక్కడకని చావడం? రెక్కాడితే తప్ప డొక్కాడని బీదా బిక్కీ ఎంత
కాలమని సర్కారువారు ఉదారంగా విదిల్చే ముక్కిన సరుకు మెక్కుతూ బతకడం?
కరోనా వైరస్సుతో ఇప్పుడు పోయే ప్రాణాలు కొన్నే!  వాటికి ఎన్ని రెట్లు
కరువులు కాటకాలు, వానలు వంగడాలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి
ఉత్పాతాలతో రాలిపోతున్నాయో! కరోనా వైరస్ ప్రభుత్వాల పనితీరును
మారుస్తోంది. మొండికేస్తే ప్రభుత్వాలనే మార్చేస్తుంది అన్నిచోట్లా.
చూస్తున్నారా పాలకులారా! పౌరుల్లా కాదు కరోనా వైరస్! తస్మాత్ జాగ్రత్త!
మనుషులపై కరోనా దాడి! అది చాలక అదనంగా కరోనా వంకన కవులు దాడి! మేడిన్
చైనా అంటే  మహా హడావుడి కదా మన దేశంలో ప్రతి పౌరుడికి! ‘కరోనా  కూడా
మేడిన్ చైనానే! కాబట్టే ఇప్పుడింత అలజడి’ అన్నాడో అర్భక కవి.  ’నువ్వు
పుట్టిన దేశంది /వస్తువు అయితే వారెవ్వా! వైరస్ అయితే ‘ఛీఁ! పోవా!’ అన్న
పొట్టి కవితలో భావం ఎంత దిట్టంగా కూరి దంచాడో మరో గట్టికవి. ‘కరం కరం
కలిపితే మనిషికి హానికరం అన్నావు/మందు బిళ్ళ లేదని మందిలోకి
వెళ్ళద్దన్నావు/ సూది మందు లేదు సుట్టాలింటికి పోవద్దంటున్నావు!/ నువు
తొలిసారి కళ్లు తెరిచింది చైనాలో కదా! అందుకే నీ చుప్పనాతి బుద్ధిని
పోనించుకున్నావు కావు!’ అంటూ సందు దొరికిందే చాలని పక్క దేశాన్ని
నిష్కారణంగా ఆడిపోసుకున్నాడింకో ఢింబకుడు. కొత్తగా వచ్చి పడ్డ ఈ కరోనా
గండ గత్తెరను పాత కవి ‘కుక్కల, నక్కల వదలక/సందుల పందుల విడువక/రంజుగ
నంజుకు తింటివి’ అంటూ చైనావాడి తిండియావకు అంటగడితే, ‘ ‘చైనా హద్దును
దాటావు/స్విస్ ముద్దును ఆపావు/చేతులు పిసుకుట పాయే/మూతులు నాకుట పాయె/
'నమస్తే' నే శ్రేష్ఠంబను/సత్యం అవగతమాయే!’ అంటో మరో  దేశవాళీ కవి
సంస్కృతి మీదున్న తనకున్న మమకారం చాటుకున్నాడు.  ‘డ్రాగన్’కు కన్నబిడ్డవు
నీవు/సామ్రాజ్యవాదానికి ముద్దుబిడ్డవు నీవు /ప్రపంచానికి పాడు బిడ్డవు
నీవు/ స్వార్ధానికి సొంత బిడ్డవు! అయినా కరోనా నీవు వచ్చావు. కరచాలనాలకు
స్వస్తి చెప్పావు/ఇంగ్లీష్ రాజును సైతం/చేతులు జోడించి వందనం చేసేలా
చేసావు/పడమటి దేశాల వ్యవహారాలకు/పాశ్చాత్యదేశ నాగరికతలకు/గులాంగిరీ
చేసే/పద్ధతులకు స్వస్తి పలికించావు’ అంటూ తిట్టి. మెచ్చిన కవులకూ
కొదువలేదు. పబ్బులు, పిజ్జాలు, ఐస్ క్రీంలు, ఏ.సి లకు దూరం చేసినందుకు,
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారి  ముక్కూ, చెవులూ మూసేసినందుకు
కరోనా భూతం వీపు తట్టిన పెద్దమనుషులూ తక్కువలేరు. బయట తిళ్లకు
మరిగినవాళ్లను ఇంటి దారి పట్టించడం, బస్సుల్లో, రైళ్లల్లో  పైనపడి రాసుకు
పూసుకు తిరిగే పోచికోలుతనాలు మానిపించడం కరోనా వల్ల కాక మన ఖాకీల లాఠీల
వల్ల ఎన్ని యుగాలకవుతుందనీ?!

ఇప్పటికే వేలాది మందిని గుట్టు చప్పుడు కాకుండా చంపేసింది,
లక్షలాదిమందిని వ్యాధి లక్షణాలున్న అనుమానితులుగా మార్చి రచ్చచేస్తోందీ..
కరోనా రక్కసి! ఇడి, సిఐడి,  సిబిఐ తరహాలో తమాషాగా సాగదు ఈ కరోనా వైరస్సు
దాడి! పంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన మార్చి 11 కు చాలా ముందు
నుంచే  ప్రపంచాన్ని అరాచకంలో ముంచెత్తేందుకు చాపకింద నీరులా
ముంచుకొచ్చిందీ మహమ్మారి. ప్రపంచ పర్యాటక రంగం మొత్తం కరోనా వేటుకు
కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ రంగం కాళ్లు రెండూ కర్కశంగా విరిచేసింది..
కనకనే నడకలో ఎక్కడా నిలకడనేదే లేకుండ పోయింది షేర్లకు.

డైమండ్ ఒక చేత పెట్టి డైఫర్ మరో చేత పెడితే  డైఫరుకే మొగ్గు చూపే
సిగ్గుమాలిన కాలం కరోనా పుణ్యమా అని ఇప్పుడు దాపురించిందన్నది చివరి మాట.
నూట పాతిక  ఏళ్ల పిదప మొదటి సారి తిరుపతి వెంకన్న దర్శనం భక్తులకు
మూతబడింది. కరోనా వైరస్సు  సోకితే పరమాత్ముడికీ పారాసిటమాల్ వాడేసే
శుభఘడియలు ఎంత వేగిరం వచ్చేస్తే లోకానికి అంత  శ్రేయస్కరం! కరోనా- ఫాల్స్
గాడ్ పేరుతో వీడియో గేమ్ విడుదలవడం ముఖ్యమా?  కరోనా వైరస్ పీడ విరగడకు
మందు కనుగొనగొనడం ముఖ్యమా? వార్తాపత్రికలనూ  ఈ కరోనా పాతరేయేకముందే
మనిషి మేల్కొనాలి.

కూడు పెట్టని కులాలు, మనసు నింపని మతాలు, ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు..
ఇవా మనుషుల మధ్య మత్సరాలు పెరిగేందుకు కారణాలు కావడం? శుద్ధే కాదు బుద్ధీ
తరిగిన మనిషిని దారిలో పెట్టేందుకు రాలేదు కదా ఈ కరోనా వైరస్ మహమ్మారి?
కరోనా వైరస్  కు కులం అడ్డు రాలేదు. మతం అంటు సోకలేదు. ఆ వర్ణం కావాలని ఈ
వర్ణం వద్దని అనుకోలేదు. డబ్బున్న పెద్దమనిషి కదా అని దయచూపించిందిలేదు.
కళల్లో నిష్ణాతుల మీద కనికరం చూపించింది లేదు. పసిపిల్లల నుంచి, ముదుసలుల
వరకు కరోనా వైరస్ కామించని వర్గం కనిపించదు. మనిషి పశు పక్ష్యాదుల మీద
దౌర్జన్యానికి దిగిన తీరునే కరోనా ఇప్పుడు మనిషి సామర్థ్యం మీద సవాలు
విసురుతున్నది. కరోనా వైరస్ ను తప్పు పట్టే ముందైనా మనిషి  ఆత్మవిమర్శ
చేసుకోవడం అవసరం.

యే కరోనా.. వో కరోనా(ఇది చెయ్యి.. అది చెయ్యి) అంటూ  ఎవరినీ దేబిరించదు
కరోనా. కంటికి కనిపించదు కానీ.. మానవుడు చెయ్యలేని ఘనకార్యాలెన్నే
చిటికెలో చేసేస్తున్నదిప్పుడు. ఎంత కఠినసమస్యలనయినా  ఇట్టే మటుమాయం
చేసేస్తోంది. కేజ్రీవాల్ అంత కష్టపడ్డా సాధించలేని దిల్లీ కాలుష్యాన్ని
చిటికెలో తీర్చేసింది. మనకూ, పాకిస్తానుకు, చైనాకు, మధ్యన సవాలక్ష గగనతల
విమానయాన ఆంక్షలు గదా ఎప్పుడూ! ఇప్పుడు కరోనా వైరస్  దెబ్బకు చడీ చప్పుడు
లేకుండా  ఏ ఒప్పందాలతో పనిలేకుండా ఆ ఆంక్షలన్నీ రాత్రికి రాత్రే రద్దు !
 కరోనా వైరస్ రెండో దశలో భారత్ ఉందిప్పుడు. ఈ దశలో చైనా అప్రమత్తమైతే..ఈ
దశలోనే ఇటలీ, ఇరాన్ నిర్లక్ష్యం చేశాయ్. ఈ దశలో చైనా ప్రజలు ఇంట్లో
ఉంటే.. దశలోనే ఇటలీ, ఇరాన్ ప్రజలు రోడ్లపై తిరిగారు. ఈ దశలో చైనాలో
కేసులు మాత్రమే పెరిగితే.. ఈ దశలోనే ఇటలీ, ఇరాన్ లో మరణాల రేటు
రెచ్చిపోయింది. ఈ రెండు, మూడు దశలే మనకిప్పుడు  కీలకం! ప్రజలకైనా..
ప్రభువులకైనా!
లోకాలకు ఉత్పాతాలు తప్పవని దాదాపు అన్ని మతగ్రంథాలలోనూ హెచ్చరికలు
ఉన్నాయి. క్రీస్తు మతం డూమ్స్ డే అన్నదాన్నే హైందవమతం మహాప్రళయం
అంటున్నదేమో! ఎన్ని ఉపద్రవాలు ముంచుకొచ్చినా సొంత తెలివితేటలు సానబట్టి
బైటపడే గడుసుతనం మనిషిది. ఇప్పటి వరకు. ప్లేగు, కలరా వంటి మహమ్మారులు
ప్రపంచాన్ని వణికించిన రోజుల కన్నానా ఇప్పుడు ముంచుకొచ్చే కరోనా వైరస్
వైభోగం? ఆఖరికి  మనిషి ఎట్లాగో ఈ కష్టాన్నుంచి బైటపడడం ఖామయే! కాని ఈ
కష్టకాలంలో  నేర్చుకున్న జీవిత పాఠాలే కదా భావి ఉజ్వలతకు దోహదించేవి!
అవునా.. కాదా? కరోనా! ఇంతకు మించి క్యా కహోనా?!
***

వ్యాసం కోవిద్19; కోయిలమ్మ పాట -కర్లపాలెం హనుమంతరావు



మెట్రోపాలిటిన్ నగరాలలో  24 గంటలూ వాహనాల రొద. అందరి ఆందోళన గాలిలో తగ్గే నాణ్యత గురించే.  పక్షి కూజితాలను గురించీ విచారించవలసిన అగత్యం ఉంది. 


పక్షి కూతలో ఓ లోతైన సందేశం ఉంటుంది. ఉభయ  సంధ్యలలో  పశ్చిమాద్రి చాటుకు అరుణ చక్రం తరలి వచ్చి  వెళ్లే వేళ కోయిలమ్మ వంటి పక్షులు వినిపించే పంచమ స్వరాలు వింటుంటే నిర్వచించలేని ఒక మధురానుభూతి కలగడం సహజం.  కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలంగా ఆ అనుభవంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 


కోవిడ్-19 రుగ్మత వాతావరణాన్ని ఆసాంతం కలుషితం చేసి పక్షికూతల పైనా  ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమోనని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రారంభంలో భయపడ్డ మాట నిజమే!  విశిష్ట పక్షి శాస్త్రవేత్త సలీం అలీ తాను  మునపటిలా  వివిధ  పక్షుల స్వరాలు వింటూ దివ్యానుభూతికి లోనయ్యే  అవకాశం భవిష్యత్తులో ఉంటుందో ఉండదో అని ఆందోళన పడ్డారు కూడా! కానీ పక్షి కూతల విషయంలో ఈ ప్రభావం అందరం భయపడ్డటట్లు ప్రతికూలంగా కాక, అనుకూలంగా ఉండటం.. విచిత్రం. 


సాధారణంగా వాతావరణ కాలుష్యం చాలా అధిక శాతంలో ఉండే ఢిల్లీ, ముంబై, చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలలో పక్షుల కూతలు గతంలో కంటే ఇప్పుడు చాలా స్పష్టంగా, శ్రావ్యంగా వినిపిస్తున్నాయంటున్నారు.   కోవిడ్- 19 నివారణలో భాగంగా లాక్-డౌన్ చర్యలు చేపట్టడంతో వాహనాల సంచారం బాగా తగ్గడం; మానవ సంబంధమైన ఇతరేతర కార్యకలాపాలకు చెందిన  శబ్దాలూ క్రమంగా అణగారిపోవడం కారణాలు  కావచ్చు. అందుకు తోడు వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషించే విమానాల రాకపోకలు మీదా నిషేధాజ్ఞలు కఠినంగా అమలు కావడం   ధ్వని కాలుష్యంలో గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నది.  కాకపోతే  హఠాత్తుగా జరిగే పర్యావరణ మార్పులు    అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా జీవజాతులకు మేలు చేయవన్నది జీవశాస్త్రవేత్తల భావన.   


మానవ కార్యకలాపాలు మళ్లీ పుంజుకునే క్రమంలో..   మార్పులకు లోనయ్యే  శబ్దకాలుష్యం కారణంగా జంతువులకు, పక్షులకు మళ్లీ  కొత్త సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ పెట్టదం ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాల్! ప్రకృతికి సహజంగానే  సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు  'తనకు తానుగా నిలదొక్కుకునే శక్తి' ఉంటుంది.  ఆ విశిష్ట శక్తి మీద దెబ్బపడకుండా దిద్దుబాటు చర్యలు ఉండాలి’ అన్నది జీవశాస్త్రవేత్తల అభిమతం. అహ్వానించదగినది.. ఆచరించదగ్గది ఈ ఆలోచన. 


జీవితాలలో సంభవించే ఆటుపోట్లను నివారించడంలో మనం ఎట్లాగూ తరచూ విఫలమవుతున్నాం.  కనీసం అవి సృష్టించే మానసిక ఒత్తిడుల నుంచి  సాంత్వన పొందేందుకైనా  ప్రకృతి ప్రసాదించే వరాలనూ  కాలదన్నుకోవడం ఏమంత తెలివైన పని!  పక్షుల కువకువలు వింటుంటే మనసులోని మాలిన్యం తాత్కాలికంగా  మరుగునపడుతుంది. కాస్తంత ఉపశమనం కలగుతుంది. ఏడ్చే బిడ్డ చేతికి తల్లి అందించే తాయిలం వంటిది పక్షి కూజితం.

 

 కోవిద్ -19  విస్తరణ నివారణ దిశగా ప్రభుత్వాలు తీసుకునే ముందస్తు చర్యల వల్ల వాతావరణలో ప్రస్తుతానికి హర్షించదగిన తేటదనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  మనిషి ఆలోచన, ప్రవర్తన, ప్రాథాన్యతల క్రమంలో కూడ మునపటంత వత్తిడి తగ్గి   కొంత కుదురు కనిపిస్తోంది.  మంచిదే! కానీ ఈ మార్పు తాత్కాలికమన్న సంగతి మరుగునపడకూడదు. పక్షుల స్వరాలలో కూడా ప్రస్తుతం కనిపిస్తున్న స్పష్టత, శ్రావ్యత  తాత్కాలికం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ప్రకృతి ప్రేమికుని అభిలాష.   


లాక్-డౌన్ ఎత్తివేసే కొద్దీ నగర వాతావరణంలో తిరిగి వాహనాల రాకపోకలు పెరగడం ప్రారంభం అవుతుంది. ఆ కారణంగా  పెరిగే  వాతావరణ కాలుష్యం మళ్లీ  పశుపక్ష్యాదుల మీద పూర్వపు దుష్ప్రభావం చూపించకుండా ఏం చేస్తే సబబుగా ఉంటుంబో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. 

 

గాలిలో తగ్గే నాణ్యత, పక్షుల కూతలలో పెరిగే స్పష్టత, శ్రావ్యతలు రెండూ పరస్పరాధారితాలని  ఈ సరికే మనం గుర్తించాం. రెండూ కరోనా వైరస్ మహమ్మారి తెచ్చిపెట్టిన మార్పులలో అంతర్భాగమే.   వాయు కాలుష్య కారకంగా ఉనికిలోకి వచ్చిన  కరోనా మహమ్మారి అంతమయ్యే నాటికి  ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల  పై చిలుకు ప్రాణాలు   గాలిలో కలవనున్నాయన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  ప్రస్తుత అంచనా.  కోటికి కేవలం  ముఫ్ఫై లక్షలకు మాత్రమే తక్కువ! ఇంత భారీ ఎత్తున ఏ ఉత్పాతమూ ప్రపంచవ్యాప్తంగా మనిషికి మృత్యుపాశంగా మారిన దాఖలాలు గతంలో లేవు.


కోవిద్-19 సంబంధిత మరణాలన్నిటికీ శ్వాస సంబంధమైన సమస్యలే ప్రధాన కారణం. కనుక ఆ మృతుల ఉనికిలేమి కారణంగా వాతావరణంలో కలిగే అనుకూల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకొనక తప్పదు. కొంత అమానుషత్వం ధ్వనించినా..   శాస్త్రీయ వాస్తవాలకు భావోద్వేగాలతో నిమిత్తం ఉండదన్నది ప్రాథమికి  వైజ్ఞానిక సూత్రం. ఆ సూత్రం సారాంశం ఆధారంగా  దిద్దుబాటు చర్యల ప్రణాళికలు వేసుకుంటే ప్రకృతి  తన సహజ స్వభావంతో కోలుకునే సమయం తగ్గించవచ్చన్నది జీవశాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది. 


లాక్‌-డౌన్ సమయంలో మన కలతజీవితాల మధ్య చెవులలో అమృతం పోసి సాంత్వన కలిగించిన  కోయిలమ్మ కుహూఁ కుహూఁ  రావాల మధుర స్మృతులు మరుగున పడకూడదన్నదే  దానాదీనా చివరగా చెప్పుకొచ్చే ముఖ్యమైన అంశం.  ఉభయ సంధ్యలలో మధుర గాయని కోయిలమ్మ ప్రసాదించే సుస్వరాల సువర్ణావకాశాన్ని మనం ఎన్నటికి వదులుకోరాదన్నది సారాంశం.


ప్రభుత్వ వర్గాలు తరచూ గాలిలోకి వదిలే కోవిద్‍- 19  తాజా ముందస్తు జాగ్రత్తల వివరాల కన్నా కోయిలమ్మ పాటలోనే మన మనసుల్ని  మేలుకొలిపే లక్షణం స్పష్టంగా వినిపిస్తుంది. 


ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కోయిలమ్మ వెళ్లిపోతే దాని కూజితం మళ్లీ వినరాదు మరి.


- కర్లపాలెం హనుమంతరావు 

06 - 09- 2021

బోధెల్ ; యూ.ఎస్.ఎ 

***

 

 

 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...