Showing posts with label Urdu. Show all posts
Showing posts with label Urdu. Show all posts

Wednesday, September 16, 2015

ఉర్దూ గజళ్ళు- తెలుగు అనువాదం- ఎండ్లూరి సుధాకర్ 'నజరానా'కి డా॥ సదాశివ ముందుమాట

నజరానా’ పేరుతో ఎండ్లూరి సుధాకర్ అనువదించిన 237 ప్రసిద్ధ ఉర్దూ కవుల అముద్రిత కవితల పుస్తకానికి డా.సదాశివ 6.2.2009నాటికి  రాసిన అచ్చు కాని ముందుమాట ఇది.
డా॥ సదాశివ
ఉర్దూగజల్లను గానీ, షేర్లను గానీ తెలుగులో అనువదించటం అసా« ధ్యం కాకున్నా కష్టసాధ్యం. ఆ కష్టం ఇంతా అంతా కాదు. అందుకు కారణం ఉర్దూ భాష స్వభావం వేరు. ఎందుకంటే ఉర్దూ కవిత ఫారసీ సాహిత్య లక్షణాలు కలిగి వుంటుంది. తెలుగు కవిత చాలావరకు సంస్కృత లక్షణాలను, కొంతవరకు దేశి లక్షణాలను కలిగి వుంటుంది. ఒక భాష కావ్య లక్షణాలు, అలంకారాలు, ధ్వని మొదలైనవి ఇంకొక భాష కావ్య లక్షణాలు, అలంకారాలు, ధ్వనీత్యాది కావ్యాంశాలు చాలా భిన్నంగా వుంటాయి.
అందుకే ఉర్దూ గజల్లను ఇతర కావ్య రీతులను అనువదించే కవికి ఉభయ భాషల కావ్య లక్షణాలు, అలంకారాలు మొదలైనవి బాగా తెలిసి వుండాలె. అవన్నీ తెలిసి వున్నందు వలన అనువాద కవి ఉర్దూ కవి హృదయాన్ని చక్కగా గ్రహించి అతడు వెలువరించ దలచిన భావాన్ని అవగాహన చేసుకోగలడు. ఆ పైన అదంతా తెలుగులో చెప్పేటప్పుడు తెలుగు కావ్య లక్షణాలను, అలంకారాలను పాటించవలసి వుంటుంది. అక్కడే కవి కష్టాన్ని ఎదుర్కో వలసి వస్తుంది. ఉర్దూ లక్షణాలను అలంకారాలను తెలుగులో ప్రవేశపెట్టలేడు. తెలుగు లక్షణాలతో, అలంకారాలతో చెప్పిన కవిత ఉర్దూ కవిత వలె వుండదు. అందుకే అన్నాను, అనువాదం కష్టసాధ్యమైన పని అని.
ఉర్దూ షేర్లకు రదీఫ్, ఖాఫియాల నియమం వుంటుంది. తెలుగులో ఆ నియమాన్ని ప్రవేశపెట్టలేము. హిందీ కవులు కొందరు రదీఫ్, ఖాఫియాలను పాటించే ప్రయత్నం చేసినారు, కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. చేయి తిరిగిన తెలుగు కవులు ఆ ఖాఫియాలకు బదులు అంత్య ప్రాస నియమం పాటించినారు. రదీఫ్‌ను పాటించే ప్రయత్నం చాలా వరకు అసఫలమయింది.
అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయ కాదె కవి వివేకంబు” అన్నాడు పాల్కురికి సోమన. ఇది ఉర్దూ కవితకే వర్తించే మాట. కొద్ది శబ్దాల్లో గొప్ప భావాన్ని ఆవిష్కరిస్తాడు ఉర్దూ కవి. ఏ మాటా స్పష్టంగా చెప్పడు. కానీ ఉర్దూ కావ్య సంప్రదాయాన్నెరిగిన శ్రోతలకు, పాఠకులకు ఎక్కడా అస్పష్టత కనిపించదు. ఉర్దూకవి ప్రతీకలు శ్రోతలకు, పాఠకులకు చిరపరిచితాలు. కాబట్టే వేదిక మీద నిల్చున్న కవి ప్రతీకల ఊతంతో పరిమిత పదాలలో ఏమి చెప్పబోతున్నాడో ముందే గ్రహించిన శ్రోత కవి కంటే తానే ముందు చెప్పేస్తాడు.
ఖాఫియా రదీఫులను కూడా జోడిస్తాడు. తెలుగు కవి సమ్మేళనంలో కవి చదువుతాడు. శ్రోతలు బుద్ధిమంతుల్లాగా మౌనంగా వింటారు. ఉర్దూ కవి రాగంలో చదివితే తరన్నుమ్’ – వచనంలో చదివితే ‘తహత్’. కవి ఎట్లా చదివినా అందులో పస వుంటే శ్రోతలు మధ్యమధ్య వహ్వా, షాబాష్, క్యా బాత్ హై అంటూ ప్రోత్సహిస్తారు. మరీ గొప్పగా వుంటే ‘ముకర్రర్ – ఇర్షాద్’ అని రెండవసారి చదివించుకుంటారు. కొన్ని సందర్భాల్లో కవి చెప్పిన దాన్ని బట్టే ఆపైన కవి ఇంకేమి చెప్పబోతున్నాడో ఊహించిన శ్రోతలు కవి కంటే ముందే చెప్పేస్తారు. ఖాఫియా రదీఫుల సహా చెప్పేస్తారు. అనువాదంలోనూ ఆ ఊపు రావాలంటే కష్టమే మరి.
అయినా కొందరు తెలుగు కవులు ఉర్దూ గజల్ షేర్లను, రుబాయీలను తమ పద్ధతిలో అనువదించి సాహిత్య రసికుల సమావేశాల్లో షాబాషీలు పొందుతున్నారు. వహ్వా లందుకొంటున్నారు. అటువంటి కవుల్లో డా.ఎండ్లూరి సుధాకర్ గారొకరు. వారుగాక మరికొందరున్నారు. వాళ్ల గురించి తర్వాత మాట్లాడతాను. సుధాకర్ గారు ఉర్దూ భాషా సాహిత్యాల వాతావరణంలో పెరిగిన వారు. ఉర్దూ కవితా సంప్రదాయాన్నెరిగినవారు. కాబట్టి వారి అనువాదం కవి హృదయానికి దగ్గరగా వుంటుంది. రాజమండ్రిలోనే ఉంటున్న శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం గారు (టెలికామ్ ఇంజినీయర్) రెంటాల శ్రీవేంకటేశ్వరరావు గారు (లెక్చరర్) ఉర్దూ నేపథ్యం లేకున్నా మూలకవి హృదయాన్ని చక్కగా గ్రహించి అనువదించినారు.
డా.ఎండ్లూరి సుధాకర్ గారు ఉర్దూ గజల్ షేర్లను తెలుగులో అనువదించి, ఉర్దూ కవితా మధువును తెలుగు చషకాల్లో అందిస్తున్నారు. తెలుగు సాహిత్య రసికులను అందుకోండి’ అని ఆహ్వానిస్తున్నారు. కానీయండి. మధ్యలో ఇంకా నేనెందుకు? అన్నట్లు ఈ చషకాలను ప్రత్యేకంగా చిత్తగించండి.
డా॥ ఎండ్లూరి సుధాకర్

ఓ దర్ద్! ఏ సుగంధ గాత్రి
నీ హృదయంలో అధివసించింది?
నీ స్వేద బిందువుల్లోంచి కూడా
గులాబీ పరీమళం గుబాళిస్తోంది
–దర్ద్

ప్రణయ తాదాత్మ్యం ఎప్పుడంటే
ప్రేయసి సైతం ఉండాలి భగ్న హృదయంగా
ఇరువైపులా దహించాలి
ఈ అగ్ని సమానంగా….
–ఇస్మాయిల్ మీరాఠీ

నీకు దూరంగా వెళ్లిపోవాలని
అనుకున్నాను పలుమార్లు
ఏ గమ్యానికి చేరినా
నీ వైపే నడిపిస్తాయి అన్ని దార్లు
–జిగర్

చేతులెత్తి ఒళ్లు కూడా
విరుచుకోలేక పోయింది
నన్ను చూడగానే నవ్వి
అమాంతం
హస్తాలు దించేసింది
–నిజాం రాంపురి

గాలి నీ తోటలోంచి
నడిచి వెళ్లింది
ఈ ఉదయం
పరుచుకున్న పరిమళం
అది నీ దేహానిదే
అయి వుంటుంది
–ఫైజ్ అహ్మద్ ఫైజ్

ఆకులకీ గడ్డి పరకలకీ
అవగతమే నా దుస్థితి
తోటకంతా తెలుసు గానీ
తెలియని దల్లా పూలకే నా గతి
–మీర్ తకీమీర్

ఇవి నా పసందు. మీ పసందు ఇది కావచ్చు. వేరే కావచ్చు. పసంద్ అప్నీ అప్నీ” అనే మాట వుండనే వున్నది. జిందాబాద్! సుధాకర్ సాబ్! జీతే రహో, పీతే రహో – పిలాతే రహో, హమారీ దువాయేఁ లేతే రహో!
-డా॥ సదాశివ

(ఆంధ్రజ్యోతి-వివిధ-13-08-2012)
ఏండ్లూరి సుధాకర్ 'నజరానా' కొన్ని కవితలు ఇక్కడ చదువుకోవచ్చు
http://sudhakaryendluri.blogspot.in/2009/04/blog-post_22.html

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...