Showing posts with label ancient. Show all posts
Showing posts with label ancient. Show all posts

Wednesday, November 10, 2021

గల్పిక : వానా! వానా! వల్లప్పా! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం )

 


గల్పిక : 

వానా! వానా! వల్లప్పా! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


జోరున కురిసి వాన వెలిసిన మరుసటి నిమిషాన దారంతా గోదారై  పొంగి పోర్లే వేళ మా బడి పిల్లల చంకల్లోని సంచుల్నుంచీ ఎన్ని పడవల పుట్టేవో! పసి సందేశాలను ఏ పసిడి దేశాలకు మోసుకుపోవాలనే తుళ్లుతూ తూలుతూ సాగే తన చిట్టి పడవ ఠక్కున  ఏ చెట్టు కొమ్మకో

చుట్టుకుని  చిరిగి కంటిముందే మునిగిపోతుంటే నవ్వాడని కసికొద్దీ పక్కవాడి మీద కలబడి నేన నీల్లలో పడి  తడిసి ముద్దయి వణుకుతో  ఇంటికొస్తే అమ్మ తిట్టి చూరు కింద  గోరువెచ్చని నీళ్లతో

తలంటుపోసిన తొలిదినాల తొలకరి చినుకుల పలకరింతల పులకరింతలు... ఓహ్ .. మరపురాని ఆ మధుర క్షణాలు తిరిగి వచ్చేనా! 


ఏవీ ఆ జడివానల జాడలిప్పుడు? ఏవీ ఆ కారుమబ్బుం దారుల బారులు? ఏరీ ఆ వరుణదేవుని  కరుణ కురిసే అమృత ధారలు? 


జులై నెల జలమాసం రోజులు.  జన్మభూమి జోరుగా జరుగుతున్నది. గ్రామసభలు కిక్కిరిసిన జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఏ నోట విన్నా ఒకటే మాట..  వాసకావాలి! 

మరి మన అధికారులు ఏమనుకుంటు న్నారో విందామా ? బోలెడంతా  కామెడీ అక్కడే పుడుతుంది.

***

'రుతుపవనాలేమన్నా  రుణానికిచ్చే సొమ్మా? ఒత్తిడి పెడితే వాయుగుండాలవటానికి మేమేమన్నా సముద్రాలమా?  తొంద రపడితే ఎలా? మేమందరం వానలు కురి పించే పనిలోనే ఉన్నామయ్యా!  మీడియా .. ఏదైనా ఐడియా తడితే మీరూ చెప్పచ్చుగా.. ఆలోచిస్తాం! 


'గాడిద చెవులు నులిమితే వానలుపడతాయని గార్దభశాస్త్రం చెబుతుందండీ!

ఊరికో గవర్నమెంటు గాడిదను సరఫరా

చేస్తే వానబెడద వదిలిపోతుందిగా! గాడిదలకూ కరువేనా? ...

'గాడిదలకు కరువు లేదు. చెవులకే కరువు. ఎక్కడ చూసినా నోరున్న గాడిదలే గానీ చెవులున్నవి కనిపిస్తేనా! 

కప్పల  పెళ్ళిళ్లు చేయిస్తే కచ్చితంగా వానలు పడితీరతాయని మా ముత్తాతల కాలంనుంచీ మొత్తుకుంటున్నారండీ! కప్పులకైలే  కరవుండదేమో!


మండినట్లే వుందయిడియా! ఎండలు మండిపోతున్నాయి గదా! మండూకాలెక్కడ దొరుకుతీయండి!  అయినా మీకోసమని .. చైనా నుంచైనా సరేనని కప్పల్ని తెప్పించి ఘనంగా పెళ్ళిళ్లు చేశామా...! భారీగా కురిశాయి వానలు.. . చైనాలో! 


అందుకే పొరుగున ఉన్న వాళ్ళు అతిజాగ్రత్తగా స్థానిక గాడిదలనే  చూసి మరీ పెళ్ళిళ్లు చేస్తున్నారు సార్! 

అయినా వర్షాలు  కేరళలో కురిశాయి చూశారా! వరదలొచ్చాయని కేరళ వాళ్లి ప్పుడు తమిళనాడుతో తగవుకెళ్ళారు. 


నీటి తగాదాలు ఈనాటివా గానీ... యాగాలన్నా చేయించండి సారూ!  ఆ అభిషేకాలకన్నా మేఘాలు 'షేక్' అయి వానలు పడతాయేమో చూద్దాం'


ఆ ప్రయోగమూ అయింది బాబూ! ప్రయోజనం లేకుండా పోయింది. యోగమున్నప్పుడే చినుకులు పడతాయంటే మీరంతా ఆగం చేస్తుంటిరి! సరాసరి వర్ష పాతం .. లెక్క ప్రకారం సరిగ్గానే ఉంది మరి! 


'చుక్కలు పడాల్సింది మీ బుక్కల్లో కాదండీ! దుక్కుల్లో!  దున్నలేక బక్క రైతు 

దిక్కులు చూస్తున్నాడు. తాన్సేన్ లాంటి వాళ్లు  మళ్లీ వచ్చి ఏ మేఘమల్హారమో అమృత వర్షిణో ఆలపిస్తేగాని మాన్ సూన్ తో సంబంధం లేకుండా మనకు వర్షాధారలు కురిసిపోతాయని నమ్మకమా? 


తానే అపర ' సేన్ ' అంటూ తబలా బాదుకునే ఓ పెద్దాయన చేతా ఈ మధ్యా సంగీత కచేరీ యేదా పెట్టిస్తిమిగా! వానలు పడ్డాయా ? వడగళ్లు  పడ్డాయిగానీ! 

పడే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోమని మన ప్రధాని పిలుపిచ్చాడు.  వినిపించదా?  ఆయనా సాయం చేసేవాడే గానీ పాపం, మోకాలు పీకుతుందని  వెనకాడు తున్నాడు. ఈ గొడవంతా ఎందుకని అయిదేళ్ల కిందట గాడిపొయ్యిలు పెట్టి బాగా పొగపెట్టాం గుర్తుందా? వేడికి మేమాలు కరిగి కురుస్తాయని మా ప్లాను. 


పొగపెట్టటం మీకు  బాగా అలవాటేగా! మరి మేఘాలు కురిశాయా సార్?

ఏమైంది?


విఫలమైంది. పడ్డ నాలుగు చినుకులకు పొయ్యిలు ఆరిపొయ్యాయి. 


అందుకేనా ఈసారి ఉప్పు , సుద్దపొడి కలిపి చల్లాలని చూస్తున్నారూ? సుద్దపొడి పాళ్లెక్కువయి సున్నంవానా  పడితే ఉన్న పొలాలు కూడా సున్నబ్బటీలయి కూర్చుంటాయి బాబో;  వానలు కురిపించటంలో మనమింకా ఓనామాల దశ కూడా దాటినట్లు లేదు. రష్యావాడిని  చూడండి!  రుష్యశృంగుళ్లా  ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వానలు కురిపించ గలడు.. ఆపించనూగలడు.  ఆర్టిఫిషియల్ రైన్ కురిపించే ఆ అర్టంతా  మనవేదాల్నుంచి  కొట్టేసిందేనని కొండు భట్టు ఎంతగా గుండె బాదుకుంటే  ఏం లాభం? క్లౌడ్ సీడింగే మళ్లా  మనకిప్పుడు గతి అయింది.  కా మళ్ళీ గతయింది. 


క్లౌడ్ సీడింగంటే... మేఘాల్లో విత్తనాలు చల్లే స్కీమేగా! భూమ్మీద జల్లే

విత్తనాలకే అతీగతీ లేదు. మళ్ళీ మబ్బుల్లోనా ? అవ్వలాంటివి కావులేవయ్యా! 

దుమ్మెత్తి పోస్తే వానాపడుతుందని పుణే నించు నిపుణులొచ్చి చెప్పి  పోయారు! 

మనమా పనిలోనే ఉన్నామిప్పుడ

అందుకేనా మన బాబులు బహళ్ల మీ దొహళ్లు దుమ్మెత్తి పోసుకుంటోందీ! హాచ్! హా.. ఛీ! ఎంతలా అపార్థం చేసుకున్నాం. రుతుపవనాలను పాకిస్తాన్ పట్టుకెళుతుంటే చూస్తూ ఊరుకోవడం అమెరికా తప్పని ఒక రోజూ,  వాయుగుండాలను బంగ్లా వాళ్లa దారిమళ్లించుకెళుతున్నా  నోరు మూసుక్కూర్పోవటం యూఎన్వో  తప్పని ఇంకో రోజూ, పక్కనున్న కర్ణాటక మబ్బుల్నలా  తోలుకెళుతుంటే తోల్తీయడం పోయి సోనియమ్మ  తప్పని మనోళ్లు మైకట్టుకు  అరుస్తుంటే నిజంగా నీటికోసమే అంత మధనపడుతున్నారని అర్ధం చేసుకోలేక పోయాం సుమండీ!  ఒక్క ముక్క మాత్రం నాకర్ధమవటం లేదు సారూ .. విత్తనాల్నంత కృత్రిమంగా  తయారుచేసే మన మేధావులు వల్షాలనుకురిపించటానికి ఎందుకంత యాతన పడుతున్నట్లూ ! 

పుష్కరాలొచ్చి పడుతున్నాయి గదా! పుష్కలంగా నీరు కావాలంటే ఇహా ఒక్కటే  ఉపాయం. టీవీ ఛానెల్సులో  ఏడుపు సీరియళ్ల సంఖ్య ఇంకా బాగా పెంచండి!  చూసేవాళ్ల కన్నీటికి ఆనకట్టలు గాని కట్టేస్తే బంజరు కూడా బోలెడంత సాగు చేసుకోవచ్చు! 


లాభం లేదయ్యా!  వాటి మీద ఒరిజిన ప్రొడ్యూసర్స్ వాటాకొస్తారు' అని అది కారులు అంటుండగానే భోరున వాన కురవటం మొదలు పెట్టింది.

***


- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


Friday, October 1, 2021

ఆంధ్ర శిల్ప కళ - కర్లపాలెం హనుమంతరావు

 


రాళ్ళలో చెక్కినవి, రంగులతో పూసినవి రూపకళ కిందకొస్తాయి,

ఆంధ్రుల రూపకళ ప్రపంచ వ్యాపితం; విశ్వరూపకళతో ప్రభావితమైన భారతీయ రూపకళ ద్వారా  ప్రకటితమవుతుంది కనుక.


మనషి రూపాలను కల్పన చేసే గుహకళకు సుమారు 30 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందంటారు! మధ్యప్రదేశ్ హోషంహాబాద్ గుహకళ ఈ ఊహకు కారణం. అక్కడి రూపకళ స్పెయిన్ దేశపు గుహచిత్రాల ప్రభావితం.


చూసే దానికి నకలు తయారుచేసే తపన మనిషికుండే  స్వాభావిక లక్షణం. ఆ లక్షణం నుంచి పుట్టుకొచ్చిందే రూపకళ. 


ఆదిమానవుడుకి జంతువుల కొవ్వు, రక్తం గోడరాతలకు ఊతంగా ఉపయోగించాయి. ఒక జంతువు రూపం కల్పించి దానిలో బల్లెం గుచ్చినట్లు చిత్రిస్తే అడవిలోని ఆ తరహా జంతువు సులభంగా చస్తుందనే సంకేతం ఇచ్చినట్లన్నమాట.


ఒక ప్రయోజనం కోసం ప్రారంభమైన చిత్రకళ క్రమంగా సౌందర్యకళగా మారిన క్రమం అర్థమయితే అబ్బురమనిపిస్తుంది. కాని, మొహంజొదారో నాగరికతకు ముందున్న ఈ చిత్రకళ క్రమపరిణామానికి చెందిన చారిత్రక ఆధారాలేవీ ఇప్పటి దాకా లభ్యమయ్యాయి కాదు. 


ఆర్యులకు సభ్యత మినహా మరేమీ తెలియని మొహంజొదారో నాగరికత ముందు కాలానికే ద్రవిడులలోని సభ్యత చాల ఉన్నత స్థితి అందుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. కాకపోతే ఆంధ్రులు ఆర్యులా, ద్రవిడులా అన్నది ఒక ప్రశ్న. రెండు తెగల సమ్మిశ్రితం అన్న వాదనలోనే నిజం పాలు ఎక్కువ.


ఆంధ్రులుగా భావింపబడిన శాతవాహనులు క్రీ.పూ ఒకటి, రెండు శతాబ్దాల నుండి క్రీ.శ ఒకటి రెండు శతాబ్దాల దాకా భారతదేశాన్ని పరిపాలించారు. వారి పాలన కేవలం ఆంధ్రభూమి వరకే పరిమితం కాదు. మగధ వరకు విస్తరించి ఉంది.


అజంతా గుహలలోని మొట్టమొదటి గుహ ఆంధ్రుల సృష్టే. అట్లాగే సాంచీ స్తూప ప్రాకార నిర్మాణం కూడా. అక్కడి ఆ గుహకళ ఒక దృశ్య సంగీతం. తెలుగు శిల్పుల పోగారింపుపని ప్రతిభ విమర్శకుల వేనోళ్ల పొగడ్తలకు పాత్రమయింది.


శిల్పికి చిత్రకళ ప్రావీణ్యం అవసరం. చిత్రకళకు నాట్యకళ నేర్పరితనం, నాట్యకళకు సంగీత జ్ఞాన నిష్ణాణత, సంగీత జ్ఞానానికి సాహిత్య మర్మం అవసరం. వెరసి శిల్పి కాదల్చుకున్న వ్యక్తి బహుముఖ ప్రజ్ఞ అలవరుచుకోవలసి ఉంది.

 

ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వెలసింది. ఆ కొండ నిర్మాణంలో ఆంధ్ర శిల్పులదే సింహభాగం. కొందరు అనుకున్నట్లు నాగార్జునుడు ఆంధ్రుడు కాదు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వం నిర్వహించేందుకు విచ్చేసిన బీరారు ప్రాంతీయుడు.


ఇక్ష్వాకులకు అసలు చిత్రకళ ప్రవేశమే లేదు. వీరి తదనంతరం వచ్చిన పల్లవుల చలవే రూపకళ వికాస దర్శనం. ఆంధ్ర శిల్పుల కళ్లు ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనడానికి పల్లవులు నిర్మించిన మహాబలిపురమే ఒక ఉత్కృష్ట ఉదాహరణ. తమ పరిసరాలను, పశుపక్ష్యాదులను శిలలపై చిత్రించిన ఆంధ్రుల శిల్పకళ అపూర్వం.


తదనంతరం వృద్ధిలోకి వచ్చిన ఆదర్శవాదం కాకుండా మహాబలిపుర శిల్పకళలో వాస్తవిక వాదం చోటుచేసుకోవడం విశేషం. ఆంధ్ర శిల్పుల వాస్తవిక వాద చిత్రకళ ఒక్క అజంతా కుడ్య చిత్రాల మీదనే కాకుండా పుదుక్కోట సంస్థాన పితన్న దేవాలయం గోడల మీది బొమ్మలు మీదా కనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించింది మాత్రం అజంతా కుడ్య చిత్రకళ.


స్నాయుపుష్టి(శరీర ఆంతరంగిక నిర్మాణం), దేహయష్టి రెండూ పుష్కలంగా ఉండే గ్రీకో-గాంధార కళ కొట్టొచ్చినట్లు కనిపించే ఈ గుహకళ వాస్తవానికి ఆంధ్రులది కాదు. గ్రీక్ దేశం వెళ్లి మనవాళ్లే నేర్చుకున్నారో, మనవాళ్ల దగ్గరకొచ్చి గ్రీకులే నేర్పారో.. ఆధారాలు దొరకలేదు ఇప్పటి వరకు.

 

కళింగగాంగుల కాలంలో స్థూపకళ విస్తృతంగ వర్ధిల్లింది. వీరి జమానాలో నిర్మితమయిన కోణార్క దేవాలయంలో కూడా ఆంధ్ర శిల్పుల ఉలి చప్పుళ్లే ఎక్కువ. పల్నాడులో కనిపించే గోలిశిల్పం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకు తోబుట్టువు. ఈ విలువైన శిల్పాలన్ని ఇప్పుడు విదేశీయుల అధీనంలో ఉన్నాయి. స్వాతంత్ర్య సంపాదన కాలంలో బ్రిటిష్ దొరలతో   విస్తృతమైన ఒడంబడికలు జరిగాయి. కాని వేటిలోనూ విలువైన మన శిల్పాలు తిరిగి ఇచ్చే విషయం ప్రస్తావనకైనా రాలేదు.  విచారకరం.

 

భారతీయ చిత్రకళకు జహంగీర్, షాజహాన్ పాలనా కాలం స్వర్ణయుగం. షాజహాన్ ప్రత్యేకంగా శిల్పులను రావించి పరిసరాలలోని వస్తువులను  చిత్రించే వాస్తవిక వాదాన్ని ప్రోత్సహించాడు.


చిత్రించే క్రమంలో కన్ను వస్తువును చూపే క్రమాన్ని యథాతథంగా చిత్రించడమే వాస్తవిక వాదం. పెద్ద కొండ అయినా దూరం నుంచి చిన్నదిగాను, చిన్న పూలమొక్క అయినా దగ్గర నుంచి పెద్దదిగాను కనిపిస్తుంది. మన చిత్రకారులు ఈ దృష్టి క్రమాన్ని పట్టించుకోకుండా పెద్ద కొండను ఎప్పుడూ పెద్ద పరిణామంలోనూ, చిన్ని మొక్కనూ అట్లాగే చిన్ని పరిణామంలోనూ చిత్రించే కళకు ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారతీయ చిత్రకారులకు దృష్టి క్రమం (పెర్ స్పెక్టివ్) తెలియదనే వాదు ఒకటి ఉంది. ఇది పడమటి దేశాలలో అనుసరించే యథార్థవాదానికి విభిన్నమైన ఆథ్యాత్మిక వాదం. పునరుజ్జీవ యుగానికి ముందు పశ్చిమ దేశాలలో కూడా తమ చిత్రాలలో మూడ తలాలు కాకుండా ఒకే తలం చూపించేవారు.


మన దేశంలో కొంతకాలం చిత్రకళ్ల పూర్తిగా స్థంభించిపోయింది. ఆంధ్రుల కళా అందుకు మినహాయింపు కాదు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు చిత్రకళలో కూడా ఒక ఉద్యమం అలలాగా ఎగిసిపడటంతో తిరిగి ఆంధ్రుల కళకు జీవమొచ్చింది. 


ఆంధ్రదేశంలో మూడు ప్రధాన శాఖలున్నాయి; రెండు బెంగాలీ శాఖలు, ఒకటి బొంబాయి శాఖ. అడవి బాపిరాజు వంటివారిది ఒక శాఖ, శ్రీ దేవీ ప్రసాదరాయ్ వంటివారిది రెండో శాఖ. ప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు వద్ద విద్య నభ్యసించిన శిష్యపరంపర ప్రవేశపెట్టిన  బొంబాయ్ శాఖ మూడవ రకానిది.


చిత్రకళకు ఏ కొద్దిగానో ప్రోత్సహమున్నది. కాని, మూర్తికళను పట్టించుకునే నాథుడు ఆంధ్రదేశంలో నాడూ లేడు, నేడూ లేడు. గుంటూరు జిల్లాలోని పురుషత్ గ్రామంలో ఈ మూర్తికళ మీద ఆధారపడి జీవించే ముస్లిం కుటుంబాలున్నా.. అదే ఆదరువుగా జీవితం గడిపే పరిస్థితులు  లేవు. కుడ్య చిత్రకళ  కనుమరుగవుతున్న  అమూల్య సంపదల జాబితాలోకి క్రమంగా జారిపోతోన్నది అనేదే ఆఖరి చేదు సత్యం.


(సంజీవ దేవ్ వ్యాసాలు- ఆంధ్ర శిల్పుల రూపకల్పన ఆధారంగ)

-కర్లపాలెం హనుమంతరావు

02 -10 -2021

బోథెల్;  యూ.ఎస్.ఎ

 

 

Saturday, February 13, 2021

చిన్న కథః ఉరుము కథ -కర్లపాలెం హనుమంతరావు

  



దేవుడు, మనిషిదానవుడు అని బ్రహ్మదేవుడికి ముగ్గురు కొడుకులు.

దేవుడు ఒక రోజు తండ్రి దగ్గరకు వచ్చి 'జీవితంలో ఉపయోగించే ఏదైనా మంచి మాట ఒకటి చెప్పమ'ని ప్రార్థించాడు. 

'మాట కాదు. ఒక శబ్దం చెబుతాను.. అర్థం చేసుకుని ఆచరణలో పెట్టు!’ అంటూ 'అనే శబ్దం బోధించాడు బ్రహ్మ దేవుడు. దేవుడికి పరమానందమయింది." '' అంటే దమగుణం.. అనేగా నీ భావం తండ్రీ! నాకు దమగుణం(చెడును అణిచే గుణం) లేదనేగా నీ ఫిర్యాదు! అది  అలవర్చుకోమన్న మీ సలహా అవశ్యం పాటిస్తాను!'అని వెళ్ళిపోయాడు దేవుడు

మనిషీ బ్రహ్మదేవుణ్ణి సమీపించి అదే విధంగా జీవితానికి పనికొచ్చే మంచి్ముక్క ఏదైనా  చెప్పమని ప్రార్థించాడు. 'దేవుడికి చెప్పిందే నీకూను. ‘ద’ శబ్దం అంతరార్థం అర్థంచేసుకుని ఆచరించు!అని యథాప్రకారం  సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. మనిషికీ మహాసంతోషమయింది. '' అంటే దానగుణం అనేగదా తండ్రీ మీ భావం? తప్పకుండా  దానగుణాన్ని అలవర్చుకుంటాను. తండ్రికి తగ్గ బిడ్డగా పేరు తెచ్చుకుంటానుఅని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మానవుడు. 

ఈ సారి దానవుడి వంతు వచ్చింది. 'దానవా! నీ అన్నల్లాగా నువ్వూ 'శబ్దం భావం బాగా  గ్రహించి  ఆచరణలో పెట్టు! అభివృద్ధిలోకి రా!’అని బోధించాడు బ్రహ్మదేవుడు. 'చిత్తం తండ్రీ!' మీఆజ్ఞ! 'శబ్దానికి దయాగుణం అనేగదా తమరి అర్థం? తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తానుఅని తండ్రికి వాగ్దానం చేసి నిష్క్రమించాడు దానవుడు. 

వాగ్దానాలైతే చేసారు గాని.. కాలక్రమేణా వాటిని మర్చిపోయారు బిడ్డలంతా. బ్రహ్మదేవుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ దుఃఖమే అప్పుడప్పుడూ కురిసే వర్షం. మధ్య మధ్యలో  'ద.. ద.. దఅంటూ  కన్నబిడ్డలకు వాళ్ళు మర్చిపోయిన దమదానదయా గుణాలనిగూర్చి  బ్రహ్మదేవుడు గుర్తుచేయడానికి చేసే ప్రయత్నమే ఉరుములు! ***

కర్లపాలెం హనుమంతరావు

(బృహదారణ్యకోపనిషత్తు సప్తమాధ్యాయం- ద్వితీయ బ్రాహ్మణం ఆధారంగా చెప్పిన పిట్టకథ)

 

Thursday, February 4, 2021

వేదకాలం నాటి 'సాగు' సంప్రదాయం- కర్లపాలెం హనుమంతరావు

                                                                   


నిప్పు పుట్టించే విద్య మనిషికి నేర్పించిన గురువు తరువు. ఎండు కొమ్మలు ఒకదానినొకటి రాచుకుని నిప్పు పుట్టడం చూసిన మనిషి ఆ చమత్కారం తాను కందిపుల్ల మీద గుమ్ముడు పుల్ల రాసి పడేసి నిప్పుపుట్టించడంగా మల్చుకున్నట్లు చరిత్ర చెబుతోంది. రాయీ రాయీ రాసినా నిప్పుపుడుతుంది. అయినా ఈ చెట్టు కొమ్మల రాపిడి పద్ధతే   అనువుగా మనిషికి అనిపించింది. రావికర్ర మీద జమ్మికర్ర పెట్టి మథించి నిప్పు పుట్టించే శౌత్రిక కర్మ విధానం ఇప్పటికీ అమలులో ఉంది.

అడవుల్లో, కొండల మీద వాటంతట అవే మొలిచే తృణధాన్యాలను గమనించిన మనిషి వానకారు దయన, తన భుజబలంతో కూడా  ఆ పని చేయవచ్చిన గ్రహించినప్పటి నుంచే 'సేద్యం' మొదలయింది అనుకోవాలి. సేద్యం మూలరూపం ఛేద్యం(ఛేదించబడేది) కావచ్చని పండితులు వేలూరు శివరామశాస్త్రిగారు అభిప్రాయ పడుతున్నారు. రుగ్వేదంలో 'నాగలి' ప్రస్తావన, అథర్వణవేదంలో ఎరువుల  ప్రస్తావనలు కనిపిస్తున్నాయి కాబట్టి సేద్యం భారతీయుల అతిపురాతన ప్రావృత్తిగా వ్యాఖ్యానించక తప్పదు. వేదసంహితలు, పురాణాల నిండా సందర్భం వచ్చిన ప్రతిసారీ కృషివర్ణనలు కల్పించడం ఈ వాదనకు వత్తాసు పలుకుతుంది. భారతంలో భీష్ముణి నిర్యాణకాలం, విష్ణుపురాణం తాలూకు 'మఘాదౌచ తులాదౌచ' లూ పరిశీలించాలి ఇందు కోసం.

 

పరాశర సంహిత కర్త పరాశరుడు కృషీపరాశరుడిగా ప్రసిద్ధుడు కూడా. పాశ్చాత్య చరిత్రకారులూ ప్రస్తావించిన ఈ పరాశరుడి కాలం మన లెక్కల ప్రకారం దాదాపు 3వేల సంవత్సారల గతం. భారతదేశంలో వ్యవసాయం ఎంత ప్రాచీనమైనదో వివరించేందుకే ఈ వివరాలన్నీ.

సేద్యం శ్రేష్ఠతను గురించి బహుధా ప్రశంసిస్తుందీ పరాశర సంహిత. ఎడ్లు వాటి లక్షణాలు, గోష్ఠం గోచరాలు, గోమయాన్ని ఎరువుగా మార్చే విధానాలు, నాగలి.. ఏరుకట్ట సామాను, దుక్కి దున్నే పద్ధతులు, విత్తులు కట్టి కాపాడి చల్లుకునే సూచనలు, పైరు కోసి ధాన్యం నూర్చి తూర్పార పట్టి క్రైలు చేయడాలు, పాతర్లు, గాదెలు,  నిలవున్న ధాన్యం పురుగుపట్టకుండా తగు జాగ్రత్తలు, పైరుకు నీరుపట్టే పద్ధతులు, భాద్రపదమాసంలో పంటకు తెవులు తగలకుండా నీరు పోయడాలు, తెవుళ్ల నివారణ, మళ్లల్లో నీరు నిలిపి వుంచే ఉపాయాలు.. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం చాలా విపులంగా ఈ పరాశర సంహితలో కనిపించడం విశేషం.

శునం వహా శునం నరః శునం కృషతు లాంగలం/

శునం వరత్రా బధ్యంతాం శున మష్ట్ర మ్ముదిజ్ఞ్గయ (4 -57- 4)

(ఎడ్లు సుఖంగా లాగు గాక, మనుషులు సుఖంగా పనిచేయుదురు గాక, నాగలి సుఖంగా దున్ను గాక, ములుకోలు సుఖంగా తోలు గాక అని ఈ శ్లోకానికి అర్థం). 

ఇదే నాగలిని ఒక యంత్రంగా సంబోధిస్తూ, ఐదు మూరల ఏడి, ఐదు జానల నాగలి, దున్నే ఎడ్ల చెవుల చివరకు వుండే కాడి,  ఒకటిన్నర మూర నిర్యోలం, పన్నెండంగుళాల పాశికా అడ్డ చీలలు, మూరెడు శౌలం, తొమ్మిది నుంచి పన్నెండున్నర అంగుళాల  పిడికొలతలుండే ములుకోలు-గా నాగలి ఆరు భాగాలను కొలతలతో *'ఈషాయుగోహల’ లో వివరించింది ఈ పరాశరసంహిత. (ఈషాయుగోహల స్థాణుర్నిర్యోల సస్య పాశికా/

అడ్డ చల్లశ్చ శౌలశ్చ పచ్చనీచహలాష్టకమ్/

పంచహస్తా భవేదీషాస్థాణుః పంచవిత స్తికః/

సార్దహస్తస్తు నిర్యోలోయుగః కర్ణ సమానకః/

నిర్యోలపాశికాచై వ అడ్డచల్లస్త థైవచ/

ద్వాదశాంగులమానోహి శౌలోఽరత్ని ప్రమాణకః/

సార్ద ద్వాదశ ముష్టిర్వా కార్యావానవముష్టికా/

దృఢా పచ్చనికాజ్ఞేయేలోహాగ్రా వంశసంభవా') అని శ్లోకం.

వేదకాలంనాటి  వ్యవసాయ పనిముట్లు, వాటి తీరుకూ ఇప్పటి పరికరాలు వాటి పనితీరుకూ ఆట్టే భేదం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాని ఆ కాలంలో మాదిరిగా నేడు పంటల అభివృద్ధి సమృద్ధితనంలో తప్ప ఆహారపుష్టిలో కనిపించడంలేదు! దేశీయావసరాలకే సరిపడినంతగా పండని నేపథ్యంలో ఇహ విదేశే ఎగుమతులను గురించి ఆలోచించడం పేలాలపిండి కథ సామెత అవుతుందేమో!

భారతదేశంలో సాగుకు రాని భూవిస్తీర్ణం చాల ఉన్నట్లు అథర్వణ వేదం చెబుతోంది.  ఆ  పరిస్థితే నేటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నదాత ఆర్థిక స్తోమతు  పరిగణలోకి తీసుకున్నా నిరాశాజనకమైనా దృశ్యమే కంటి ముందు కనిపించేది. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి అగ్రరాజ్యాలలో వంద ఎకరాల సాగుభూమి ఏకఖండంగా గల ఆసామీ కూడా పేదరైతుగానే పరిగణింపబడుతుంటే.. ఇక్కడ సెంటు భూమి  సొంత పేరు మీద లేకుండానే కొన్ని తరాల బట్టి కౌలుదారీ సాగు చేసుకునే దైన్యస్థితి అన్నదాతది.

పురాణాల కాలంలో 'ఖిలం'  అనే పదం తరచూ వినబడేది. ఏడాది మార్చి ఏడాది పంట వేసేందుకు వీలుగా రెండు మూడు పంటభూములున్న ఆసాములు ఒక భూమిని ఒక సంవత్సరానికి  సాగుచేయకుండా వదిలేసేవాళ్ళు. భారతదేశంలో ఔత్తరేయులు 'ఖిల్'గా పిల్చుకునే ఈ పైరు మార్పు విధానం ఇప్పుడు కనిపించడంలేదు.

'తథా వర్షేషు వర్షేషు కర్షణద్భూ గుణక్షయంః/

ఏకస్యాం గుణహీనాయాం కృషి మన్యత్ర కారయేత్' అంటూ

'యుక్తి తల్పతరు' తప్పని సరి అని చెప్పిన  పైరు మార్పు విధానం వ్యవసాయరంగం సైతం వ్యాపారమయంగా మారిన  తరుణంలో వృథా ప్రయాసగా తోచడంలో ఆశ్చర్యం లేదు.

పైరుమార్పు కోసమే కాకుండా పశువుల తిండి కోసం కూడా గాను సాగుచేయకుండా గతంలో కొన్ని భూములను అట్లాగే వదిలేసే పద్ధతి ఉండేది.

వైదిక కాలాలలో కేవలం పశువుల మేత కోసం గానూ కొన్ని బీళ్లను దున్నకుండా అలా వదిలేసే రివాజు ఉండేది. వ్రజం, గోష్ఠం, సుయవసంగా పిలిచే ఈ గోచరాల పద్ధతి ఇప్పుడు అమలులో లేదు.  పురాణాల కన్నా ముందున్న వేదసంహితలలో పలురకాల ధాన్యాల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. వాజసవేయ సంహితలోని చమకంలో ఇప్పటి మన వడ్లు, మినుములు, యవలు, నువ్వులు, సెనగలు, స్వాల్వము, పశుగ్రాసం, ప్రియంగువులు (ప్రేంఖణం), నవము, చామలు, నెవ్వగులు, గోధుమలు, మసూరాలు పేర్లు వినిపిస్తాయి. అధర్వణ వేదంలో మినుములు ప్రస్తావన ఉంది. రుగ్వేదంలో యవలు, వరులు కనిపిస్తాయి!

ఇప్పుడంటే వేరుశనగ వేస్తున్నారు, కానీ ఇటీవలి కాలం వరకు  మెరకభూముల్లో పునాస పైరులు కోసిన తరువాత  మళ్ళీ దున్ని ఉలవ వేసే ఆచారం ఉండేది. పంటలకు ఎల్లకాలం ఉండే వెల ఆధారంగా ఈ రకమైన రెండు పంటల విధానం తైత్తరీయంలో . (దీర్ఘ సంవత్సరస్య సస్యం వచ్యతే(5 -1 -7 -3) కనిపిస్తుంది.

భారతదేశంలో స్థల, కాల భేదాలను అనుసరించి పంటలు వేసే ఆచారం ప్రచులితం. హేమంతంలో యవలు గొర్తుబట్టడం, మఖ పుబ్బ కార్తెలలో మొక్కజొన్న, వానకారుకాలంలో కోసుకునేందుకు  వీలుగా ఓషదులు,  వరులు శరత్కాలంలో కోతకు వచ్చేందుకు వీలుగా  గ్రీష్మ, వర్షర్తువుల ప్రారంభ కాలంలో పైర్లు పెట్టడం సస్యసాంప్రదాయాల కింద ఆ విధంగా వస్తోవుంది. మౌర్యుల కాలంలో సస్యపరివర్తనం అమలులో ఉన్నట్లు అర్థశాస్త్రం - రెండో భాగం(మైసూరు ప్రతి)లో ఆధారాలున్నాయ్!

కేంద్రాలు, ప్రేంఖణాలు, నువులు గ్రీష్మాంతంలో, సెనగలు, మినుములు, పెసలు వానకారు నడిచే సమయంలో, యవ, గోధుమ, కుసుంబ, కుడువ,మసూరు, కలాయ, సర్షపాదులు శరదృతువుల్లో పైరుపెట్టే  నేటి ఆచారాలు వేదకాలం నుంచి సాంప్రదాయికంగా వస్తున్నవే.

ఆరు రుతువుల విధానం కూడా క్రీస్తుకు పూర్వం రెండువేల ఐదు వందల ఏళ్ల కిందటనే ఆరంభమయినట్లు అనిపిస్తుంది. చాంద్ర సంవత్సరం అయినా ఆంధ్రదేశంలో నేటి రుతువులను పట్టి ఆర్యావర్తము లాంటి ఉత్తరదేశ రుతువులను లెక్కబెట్టకూడదు. దేశ భేదాలను బట్టి మార్పులుంటాయి . కాబట్టి మాన భేదాలను గూడా ఆ పద్ధతి ప్రకారమే పరిగణనలోకి తీసుకోవాలి.


భారీ యెత్తున ట్రాక్టర్లతో దున్నుతున్న నేటి యంత్రాల వాతావరణంలోనూ  అంతర్గతంగా అణిగివున్నది వేదకాలం నాటి కృషీవలుడు నాగలి ధరించి  కార్యక్షేత్రంలోకి అడుగువేసే ముందు వినమ్రంగా చేసిన ప్రార్థన సారాంశమే!  ఆ ప్రార్థన 

'అర్వాచీ సుభగే భవ/

సీతే! వందామ హోత్వా/

యథా న స్సుభగా మసి/

యథా న స్సుఫలా మసి॥'-

ఓ సీతా!(నాగేటి చాలు) మాకు అభిముఖివి కమ్ము. నీకు నమస్కరిస్తున్నాం. మాకు నిండుగా పండుము! ' అనే అర్థంలో సాగుతుంది.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

05 -02 -2012 ***

(శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు వ్యాసావనిలో ప్రాచీన సేద్య విధానాలను గురించి విస్తారంగా చెప్పుకొచ్చిన ఓ వ్యాసంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల ఆధారంగా)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...