Thursday, December 17, 2015

కందిపోటు దొంగలు- ఓ సరదా కథ


ఎదురుగా బోనులో నిలబడ్డ ఆకారాన్ని వింతగా చూస్తూ అడిగారు యమధర్మరాజు 'ఎవర్నువ్వు?!'
'బేండీకూట్'
'సమవర్తి భృకుటి ముడిపడింది 'విధాతగారు మాకు సమాచారం లేకుండా కొత్తజీవుల సృష్టిని ఎప్పుడు ఆరంభించారు?! యెనభైనాలుగు లక్షల రకాలు. రకానికో నలభై ఎనిమిది లక్షల జీవాలు. ఏది 'హరీ'మని ఇక్కడికొచ్చినా విచారించి పాపపుణ్యాలు బేరీజు వేయలేక మాకు చారులు కారిపోవుచున్నవి.' శివాలెత్తుతూ శివయ్యకు ఫిర్యాదు చేయాలని చరవాణికోసం వెదుకులాట ఆరంభించారా మృత్యుదేవుడుగారు.
చిత్రగుప్తులవారికిక జోక్యం  తప్పింది కాదు.
'ప్రభూ! 'బేండీకూట్' కొత్తజీవి కాదు. ఆంగ్లపదం. అచ్చమైన తెలుగులో దీన్ని 'పందికొక్కు' అందురు. తెలుగు గడ్డమీది గాదెల్లోని కందిపప్పు తెగ మెక్కు కొక్కు ఇది. ఈ సారే ఎందుకో తిన్నది అరక్క  చచ్చి ఇక్కడకు వచ్చిందిగానీ
'తెలుగు కందిపప్పు మెక్కిచచ్చే కొక్కుకి మరి ఆ ఆంగ్ల కొంకరభాష ఎందులకు?’ సమవర్తి చిందులు.
'అది మెక్కి చచ్చింది ఆంగ్ల కందిపప్పు కనక మహాప్రభో!' చిత్రగుప్తులవారి సముదాయింపు.
కాలదేవుడికి ఎక్కడో కాలింది 'యేమీ.. పరాచికములా! యముండ! పశ్చిమాన కందిపప్పన్న ఏమి తెలియునుతుచ్చమైన రంగు, రుచి, వాసనున్న ముక్కసరుకే గదా వారికి దిక్కు! ఈ తెలుగు కలుగుజీవికి ఆ ఆంగ్ల సంకరపప్పు తిని చచ్చు గ్రహచారం ఏల కలిగినట్లు?’
తెలుగునాటంతా ఇప్పుడు దొరికుతున్నది ఆ నాటుసరుకే కనక మహాప్రభో!’
యముండ! తెలుగు నేలల గురించి మాకు తెలియని చదువులా! బహు సారవంతమైన భూములు గదా వారివి. వరుణదేవుడి కరుణ కరువైననూ.. ఏడాదికి రెండు  పంటలు తీయు  గండర గండళ్లుగదా తెలుగు రైతన్నలు!'
'అమరావతి ఆహ్వానపత్రం చదివి పొరబడుతున్నట్లున్నారు ప్రభువులు. తమరు వర్ణించిన తెలుగు వైభవమంతా ప్రపంచీకరణం ముందటి కథ!’
తెలుగువారి పప్పులమీద జిహ్వచాపల్యంతోనే కదయ్యా  మన విష్ణుమూర్తులవారు ఏడుకొండలమీద తిష్ఠ వేసింది! అహా! ఆ స్వామికి  సమర్పించు వడప్రసాదాల రుచికి మా వడలూ పులకించుచున్నవి'
'ఆ వడలు  పులకించు వడలు అరక్కే నా కన్నా ముందు నా అర్థాంగి ఇక్కడకు వేంచేసింది'  కిసుక్కున నవ్వింది పందికొక్కు.
'పందికొక్కులకునూ మాతో పరిహాసములా! యముండ!' గుండెలు బాదుకొన్నారు యమధర్మరాజులుగారు.
'ప్రతిదానికీ మీరలా గుండెలు మోదుకోకండి మహాప్రభోమీరింకా ఆ క్షీరసాగరమధన కాలంనుంచి బైటపడలేకున్నారు!'
'నిజమేనయ్యా చిత్రగుప్తయ్యా! కంది ఏదో కలికాలంనాటి  శాకాహారుల మాంసాహారమని భ్రమపడుతున్నదిగాని పిచ్చిమంది.. 'జీవహింస మహాపాపం' అన్న భావంతో సత్యకాలంకన్నా ఎన్నో  యుగాలముందే  ముల్లోకాలు ఈ పప్పుదినుసుమీద ఆధారపడేవని ఎరుగదు.’
‘’నిజమే ప్రభూ! దానవులతో జరిగిన  భీకరయుద్ధాల్లో ఈ పప్పు ఎప్పుడు అగాధాలలో పడిందో ఎవరికీ తెలియదని వింటిని’ 
నాటినుంచేగదయ్యా దేవతలందరికీ కడగళ్లు మొదలయినవీ!. అలవాటు పడ్డ జిహ్వలాయ!’ ‘కనకనే కదా స్వామీ.. కమ్మని ఆ కందిముద్దల రుచిని వదులుకోలేక రాక్షసాధములతో  రాజీ కుదుర్చుకొని  మరీ పాలసముద్రంమీద  చిలుకుడు మొదలుపెట్టిందీ!’
లెస్సపలికితివి.  కందిని అందించేదే కదా కల్పవృక్షం! ఆ పప్పులో కలిసిన రాళ్లూరప్పలను  ఛేదించేది వజ్రాయుధం. ఉడికేందుకు ఉపయోగించేది అక్షయపాత్ర’,
తేలిగ్గా.. రుచిగా  ఉడికేందుకు తోడుపాలు ఇచ్చేది కామధేనువుకందిమూటలను సప్తలోకాలకు   చేరవేసేందుకు  ఐరావతం. కంది అమృతం అందరికీ అందుబాటులోఉండేందుకేగదా  ధనలక్ష్మీమాత ప్రభవించిందీ!’
ఆ లక్ష్మీసోదరుడు చందమామ అకాశంలో మెరుస్తూ అందరినీ అలరించగలుగుతున్నాడంటే అందులకు కారణం  కందిగింజ  ఆకారంలో ఉండటమేగదయ్యా చిత్రగుప్తయ్యా! అహో! మన దేవతలందరికీ ఆ కంది అమృతమెంత అపురూపమైనదీ!'
'చిత్తం చిత్తం మహాప్రభో! అమృతం ఉన్నచోటే హాలాహలమూ పుడుతుందంటారు. ఆ అమృతం వెలికి తీసేటప్పుడేగదా.. హాలాహాలం బైటపడి అంతలా కోలాహలం చెలరేగిందీ! కాలశివుడు సమయానికి అక్కడుండి  ఆ కాలకూటాన్ని అలా అంగిట్లో వేసుకోబట్టి కదా సర్వలోకాలూ  ఏమీ మూడకుండా బైటపడిందీ!’
మరి అదే ధర్మకార్యంగదా  మా బేండికూటులూ నిర్వహిస్తున్నది!’ అంటూ అడ్డొచ్చింది ఇహ వినే ఓపికలేక పందికొక్కు. ధర్మరాజులవారొక్కసారిగా చిరాకు మొహం పెట్టేసారు. పట్టించుకోదలుచుకోలేదు పందికొక్కు. ‘అవును మహాప్రభో! నాటైం బావులేక  ఖర్మకాలబట్టి చచ్చి ఇలా వచ్చాను. తమరు ధర్మస్వరూపులు. పూర్వాపరాలు  క్షుణ్ణంగా  విచారిస్తే నా  నిర్దోషిత్వం సత్వరమే తేలిపోతుందని మనవి
'గణాధిపతికి దీని వంశంతాలూకు చుంచెలుకలే యుగాలబట్టీ వాహనసేవలు అందిస్తున్నాయి మహాప్రభో! ఆయన నాయన శివయ్యమాదిరి  కాలకూట విషాన్ని మించిన టాంజానియా కందిపప్పును ప్రాణాలకు తెగించి మరీ  బొక్కుతున్నాయి ఈ పందికొక్కులు. ఆ ధర్మకకోణాన్నికూడా తమరు పరిగణలోకి తీసుకోవాల్సుంది
చిత్రగుప్తులవారి వత్తాసుతో సమవర్తి ధర్మసంకటంలో పడటం చూసి పందికొక్కు మరింత  రెచ్చిపోయింది. ‘మా లోకంలోని వ్యాపారులు మీ అంత మాలోకం కాదు  మహాప్రబో! అమెరికా, చైనాలను చూసి  బాగా ముదిరిన సజ్జు. పప్పుధాన్యాలు ఎక్కువ పండితే  లాభాలెక్కడ  తగ్గుతాయోనని దుర్భుద్ధి. సుక్షేత్రమైన భూముల్లో పప్పుకు బదులు పొగాకు, గంజాయిలవంటి మాదకాలను  ప్రోత్సహించే మదపురాయుళ్లకే వారి మద్దతు. అధిక దిగుబడి ఆశ చూపెట్టి  నాసిరకం  పప్పులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నదీ ఈ దేశద్రోహులే. కళ్లేలమీదే వీలైనంత సరుకు  తక్కువ ధరకు రాబట్టిగిడ్డంగుల్లో పూడ్చిపెట్టి  కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు. బీదబిక్కీ పప్పులకోసం అల్లాడే స్థితికి తెస్తున్నారు. గద్దెభయం అనుక్షణం వెంటాడే ప్రభుత్వపెద్దలు ఖజానాసొమ్మే కనకఎవరికీ  లెక్కలు చెప్పనక్కర్లేదు కనక ఆ నాసిరకం సరుకునే బజారుధరకన్నా ఎక్కువ పోసి కొంటున్నారు. అంతా కలసి జనం సొత్తును పంచుకొని భోంచేస్తున్నారు
ముక్కపప్పు తిని బతికే పందికొక్కుకు ఇంత పరిజ్ఞానమా!’ నోరువెళ్లబెట్టేసారు  యమధర్మజులవారు. వెంటనే ధర్మవిచారణణ బాధ్యత గుర్తుకొచ్చింది. తేరుకొని  'పప్పు లేనిదే తెలుగువాడికి ముద్ద గొంతు దిగదు. పసిబిడ్డకు తినిపించే గోరుముద్దలనుంచి.. పితృదేవతలకు సమర్పించే పిండాల వరకు,, అన్నింటా కంది కంపల్సరీ! పెళ్ళంటే తెలుగువాడికి  పప్పన్నమే. తప్పుచేసినవాడి కాలుకూడా పప్పులో వేయించే అతిమంచివాడు తెలుగువాడు. మీ కందిమల్లె యోగివేమన కందిమీద వ్యామోహం చావక   'పప్పులేని కూర పాడు కూర'ని ఈసడించాడు. పప్పు పక్కనుంటే చాలు.. పంచభక్ష్యాలనైనా పక్కకు తోసేస్తాడు మీ తెలుగువాడు. కూర, కలగూర, పులుసు, పచ్చడి.. చివరికి పొడిచేసైనా సరే  కందిని ఓ పట్టుబడితేనేగాని తృప్తితీరా త్రేన్చదు  ఏ తెలుగు కడుపైనా!  తెలుగువాడికి అంత ప్రాణపదమైనదని తెలుసుండీ గాదెల్లో దాచుకొన్న కంది అమృతాన్ని దొంగతనంగా మెక్కడం ఓ పందికొక్కుగా నీవు  చేసిన ద్రోహం కాదా! తిన్న ఇంటివాసాలు లెక్కించే నీలాంటి విశ్వాసఘాతుకులకు  శిక్షేమిటో తెలుసా! మా నరకంలో శాశ్వతనివాసం!'
చిత్రగుప్తుల వారు ఘొల్లు ఘౌల్లుమన్నారు! యమధర్మజులవారిని అసుంటా పక్కకు  తీసుకు వెళ్లి చెవుల కొరుకుడు మొదలుపెట్టారు 'భూలోకపాలకులకుమల్లే తమరూ   కంగారు పడితే కొంపలంటుకొంటాయి మహాప్రబోపందికొక్కులు చూసేందుకే చాలా అల్పజీవులు! ఇవి తెచ్చి పెట్టే  ఉపద్రవాలు  కల్పాంతానికైనా  ఆగవు. అందినంతవరకే వాటికి గాదెలో కందులు  ఆహారం. ఏవీ అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పసికందులే అహారం. కుటుంబనియంత్రణంటే బొత్తిగా గిట్టని వీటికి మన నరకలోకం వీసా దొరికితే  మనగతేమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి మహాప్రభో! దీనికిప్పుడు తోడుగా ఓ ఆడజోడూ  తయారుగా ఉందిక్కడన్నది మరిచిపోకండి!’
యమధర్మరాజుల వారికి అంతా అర్థమయింది.మాట మెత్తబడింది. ‘నిజమేగానీ చిత్రగుప్తా! తీర్పు తిరగరాయడం కుదురుతుందా! చచ్చి ఒకసారి ఇక్కడికొచ్చిన ఏ జీవీ తిరిగి వెనక్కి వెళ్లడం కుదరదని  నీకు మాత్రం తెలీదా! ముత్తెమంత పుణ్యమైనా చేయని ఈ క్షుద్రజీవిని ఏ కారణం చూపెట్టి తిరిగి భూలోకానికి తరిమేయగలం! త్రిమూర్తులతో మాట రాదా!'
'ముత్తెమంత పుణ్యమేం ఖర్మ మహాప్రభో! ఈ పందికొక్కులు చేస్తోన్న ధర్మకార్యంముందు మన మహాదేవుడి శిష్టరక్షణకూడా ఏ మూలకు! గాదెల్లో దాచిన టాంజానియా కందిపప్పు కాలం గడిచేకొద్దీ కాలకూటంకన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరం. అయినా ఆ విషాన్ని ప్రాణాలకు తెగించి మరీ భోంచేస్తున్నాయి ఈ పందికొక్కులు. తద్వారా ఎన్ని  తెల్లకార్డుజీవుల ప్రాణాలు వల్లకాడు పాలుకాకుండా కాపాడుతున్నాయో గుర్తించవద్దా ధర్మప్రభువులు!’
‘’ తలపంకించారు యమధర్మజులవారు.
నిజమే కానీ.. ధర్మాసనంమీద అధిష్ఠించి ఉన్న దేవతనుఅక్రమాలు జరుగుతున్నాయని  తెలిసీ గమ్మునుండిపోవడం ధర్మమా! దోషులను దండించడానికే గదయ్యా ఈ దండం నా చేతికొచ్చిందీ!’
చిత్తం మహాప్రభోకందిపలుకు కిలో రెండువందలు పలుకుతోంది కిందిలోకంలో ప్రస్తుతం. ఏం కొనాలో.. ఏం తినాలో తేలక తికమక పడుతున్నది సామాన్యప్రజానీకం.  ఆ కాలే కడుపులు సభల్లో చెప్పులు విసురుతున్నాయి. సచివాలయాలముందు  నిరసనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని  శాంపిల్సు మాత్రమే! అసలు ఎన్నికల మొసళ్ల పండుగలు చాలా ముందున్నాయి స్వామీ..  కందిపోటు దొంగలతో   మిలాకత్తయే  సర్కారు పెద్దలందరికీ!’

భళా! అర్థమయిందిలేవయ్యా! పదవి పోయి.. పరువు పోయి.. ప్ర్రాణాలు పోయి.. ఇక్కడికొస్తారుగా ఆ  పెద్దమనుషులుఅప్పుడు చూపిస్తా నా దండం తడాఖా!’ కసిగా  మీసాలు మెలేసుకోసుకొన్నారు అధర్మదండనాథులు.
కందిపోటుదొంగలు గాదెల్లో దాచిన కాలకూటవిషం  ఎంత మెక్కినా నీ ప్రాణాలకింక ఏ ఢోకా ఉండదు గాక!  నువ్వింక నీ లోకానికి సతీసమేతంగా సురక్షితంగా వెళ్లిపోవచ్చు! అసలు పందికొక్కుల్నిక్కడికి తొందరగా రప్పించు ధర్మకార్యంమాత్రం మర్చిపోవద్దుపందికొక్కు వైపు తిరిగి ప్రసన్నంగా ఆదేశించారు  యమధర్మజులవారు.  
ప్రభూ!.. తరువాతి విచారణ,,’ చిత్రగుప్తులవారింకో కొత్తదస్త్రం తీయబోతుంటే  'బాగా డస్సిపోయానయ్యా చిత్రగుప్తయ్యా! అత్యవసరంగా  రెండు కమ్మపొడి ముద్దలు వేడి వేడిగా  వెన్నకాచిన నేతిలో ముంచుకొని మింగితేకానీ.. మళ్లీ విచారణకు నాకు శక్తి రాదు' అంటూ లేచి నిలబడ్డారు యమధర్మజులవారు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(చిత్రకారులకు క్షమాపణలు. ధన్యవాదాలు- రచయిత)




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...