Wednesday, May 23, 2018

ప్రార్థనా స్థలాలు.. చరిత్రలో 1




పుట్టటం.. గిట్టటం తప్పవని ప్రకృతిని చూసి గ్రహించాడు ఆదిమానవుడు. విత్తు నుంచి మొలకెత్తిన పిలక పెరిగి వృక్షంగా మారి కాసే పూలు కాయలుగా పండి రాలిన తరువాత వాటి పొట్టవిప్పి చూస్తే కనిపించేవి మళ్లా ఆ విత్తులే. భర్త తన భార్య కడుపున  పుత్రుడుగా జన్మిస్తాడన్న నమ్మకం పెరగడానికి ఇలాంటి దృష్టాంతాలు  సృష్టిలో చాలా కనిపించాయి మనిషికి. కాబట్టే చనిపోయిన తన మనిషి కళేబరాన్ని భద్రం చేయడం అవసరంగా భావించాడు.
మరీ అతి ముతక కాలంలో మృత శరీరం ఏ కుక్కలు, నక్కలు తినకుండా తామే తినేసేవారు  మృతదేహం పరిశుద్ధత నిలబెట్టడం కోసం. తరువాతి దశలో పార్థివ దేహం నేల మీది చీమల, పురుగుల పాలవకుండా ఎత్తైన ఏ చెట్టు కొమ్మల మీదో వదిలేసేవాళ్లు. 'కాకులకు గద్దలకు' వేయడం అనే సామెత అట్లా పుట్టిందే! (మహాభారతం విరాటపర్వం అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మూట కట్టి జమ్మి చెట్టు మీద వదిలేసి.. దారే పోయే వాళ్ళను చనిపోయిన తమ తల్లి శరీరమని నమ్మిస్తారు). పక్షులు పీక్కు తినగా మిగిలిన బొమికలను ఏరుకొని ఏ గంగలోనో కలిపే తరువాతి సంస్కారం ఒక పద్ధతైతే.. ఆ అస్తికలను మూటగట్టి ఒక ప్రత్యేకమైన నూతిలో పారేస్తారు. (నేటికీ పార్శీలది ఇదే పద్ధతి). అసలు నేరుగానే శవాలను గంగా ప్రవాహానికి వదిలేయడం మరో విధానంగా ఉండేది. కర్మకాండలలోకెల్లా గంగలో కలపడం ఉత్తమ సంస్కారంగా ఇప్పటికీ భారతీయులు నమ్మడం వల్ల దహనం చేసిన తరువాత ఆ చితాభస్మాన్ని కాశీ వెళ్లి మరీ గంగలో కలిపి వస్తున్నారు సంప్రదాయం నమ్మేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత శవదహనం  సంస్కారంగా మారింది. ద్రవిడ సంస్కృతిలో సామాన్యంగా ఖననమే ప్రధాన సంస్కారం.
పూడ్చినా కాల్చినా ఆ కాండ జరిగిన స్థలాన్ని పవిత్రంగా భావించేవాళ్లు బంధువులు. ఆ స్థలానికి గుర్తుగా ఒక రాయి పెట్టడం.. దుష్టశక్తుల కట్టడికి గాను చుట్టూతా రాళ్లు పేర్చడం జరుగుతుండేది. ఆ ప్రదేశాన్ని 'చైత్యం'గా పిలిచేవారు. ఆ చైత్యానికి దగ్గర్లోనే ఒక చిన్న కట్టడం కట్టడం ఒక పద్ధతి. ఆ స్థలం మీదో మొక్కను  నాటడం మరో పద్ధతి. తులసి కోటలు కట్టే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. శ్మశానాలను 'పితృవనాలు' గా పిలవడానికి ఇదే కారణం.
ప్రముఖులు మరణిస్తే ఖననం చేసినా, దహనం చేసినా ఆ స్థలాన్ని స్మృతిస్థలాలుగా మార్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. జనకళ్యాణం కోసం జీవితాంతం కృషిచేసిన వైతాళికులకు, మంది కోసం ప్రాణ త్యాగం చేసిన పరిత్యాగులకు, యుద్ధాలలో వీరమరణం పొందిన యోధులకు (వీరగల్లులు), శీలరక్షణ కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ స్త్రీలకు గుర్తుగా  చిన్ని చిన్ని  కట్టడాలు, స్తూపాలు, ఆయతనాలు కట్టే ఆచారం ఉంది. ఆ తరహా  ద్రవిడ సంస్కృతి ఆచరించే ప్రాంతాలన్నింటా ఇప్పటికీ ఆ కట్టడాలు కనిపిస్తాయి.
బుద్ధుడి మహాపరినిర్యాణం క్రీస్తుకు పూర్వం 498లో. ఆ అస్తికలను భద్రపరిచిన పాత్ర మీద సమాధి నిర్మించి శాసనం వేయించారు బుద్ధుని సగోత్రీకులు శాక్యులు.
'ఇయం సలిల నిధానే బుధవ భగవతే సకియానాం
సుకుతి ఛటినాం సభగినకం సపుత దలనం'
(బుద్ధ భగవానుని ఈ శరీర నిధానం దేవుని సుపుత్ర భగనీకులు శాక్యులచే నిర్మించబడింది) అని ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రాచీన కట్టడాల మూలకంగా అప్పటి నాగరికతలను గురించి తెలుసుకొనే అవకాశం పురాతత్వశాస్త్రానికి లభిస్తుంది,
బౌద్ధం, జైనంలో చనిపోయినవారి సమాధులకు సమీపంలో చిన్న ఆరామాలు నిర్మించడం ఆనవాయితీగా ఉండేది ఒకానొకప్పుడు. ఆ ఆరామాలనే విహారాలుగా వ్యవహరించేవాళ్లు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు జనపదాలలో నివాసం ఉండేవాళ్లు కాదు. ఈ తరహా ఆరామాలలో నివాసం ఏర్పాటు చేసుకొని  భిక్షకు మాత్రం గ్రామాలలోకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఆ కారణం చేత ఆరామాలు సాధారణంగా జనపదాలకు, వ్యాపార మార్గాలకు దగ్గరగానే ఉండేవి. బౌద్ధుల, జైనుల జీవహింస నిషేధం వల్ల పశుసంపద వృద్ధి అవడం, వ్యవసాయం ఊపందుకోవడం, వ్యావసాయిక ఉత్పత్తుల లావాదేవీలకు నెలవైన వ్యాపారాలు అభివృద్ధి చెందడం జరిగింది.  బౌద్ధులకు, జైనులకు కృతజ్ఞతా పూర్వకంగా తృణమో, ఫణమో సమర్పించుకొనే అలవాటు అప్పుడే మొదలు. భూస్వామ్య వ్యవస్థ పుంజుకొని, పెత్తందార్లు, రాజులు బలమైన వర్గంగా ఏర్పడేందుకు ఈ రెండు మతాలు చాలా దోహదం చేసాయనే చెప్పుకోవాలి. అందుకే రాజులు అప్పట్లో ఆ రెండు మతాల వైపు అధికంగా మొగ్గు చూపించేవాళ్లు.
మత విశ్వాసులు ఇచ్చే కానుకలతో జైనులు, బౌద్ధులు ఆర్థికంగా బలపడ్డారు. వారు నివాసముండే ఆరామాలకు కళ పెరిగింది. మత పెద్దల మెప్పు కోసం రాజులు, వ్యాపారులు ఆరామాలను కళలకు కాణాచిగా ఎంత ఖర్చైనా వెచ్చించి మరీ తీర్చి దిద్దేవాళ్లు. ఆ అలంకరణల్లో భాగంగానే ఆరామాల గోడల మీద అందమైన ప్రకృతి దృశ్యాలు, స్త్రీల చిత్రాలు, ఆనందాన్ని ప్రేరేపించే కామకార్యాలు చిత్రీకరణలు క్రమంగా పుంజుకున్నాయ్. ఆరామాల కుడ్యాల మీద కనిపించే పోర్నోగ్రఫీ క్రమంగా దేవాలయాలకు ఎలా పాకిందో మరో సారి..!
-కర్లపాలెం హనుమంతరావు
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...