Monday, May 21, 2018

కన్యాశుల్కంలో మూఢనమ్మకాలు


నమ్మకానికి ఆధారం అవసరం. ఆధారం లేకుండా నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. మూఢవిశ్వాసాలు విశ్వవ్యాప్తంగా అన్ని జాతుల్లోనూ అనాదిగా   వస్తున్నవే. సేకరించడం మొదలుబెడితే ఆ చాదస్త విశ్వాసాల సమాచారం దస్తాల కొద్దీ బైటపడుతుంది.  
మూఢనమ్మకానికి మూలస్తభం అజ్ఞానం. ఆదిమ మానవుడికి విద్యాబుద్ధులు తక్కువ. ఆ కారణంగా విచక్షణాజ్ఞానమూ అంతంత మాత్రమే! ప్రకృతి శక్తుల విజృంభణ, మనో వైకల్యం, శారీరక రుగ్మతవంటి  ఉపద్రవాలు  ఎదురైనప్పుడు సమన్వయించుకునే మేధోసామర్థ్యంలేక ఆ ఉపద్రవాలను అదృశ్యశక్తుల ఆగ్రహాలుగా భ్రమపడ్డాడు. భయపడ్డాడు. శాంతించమని, అనుగ్రహించమని కనిపించని ఆ శక్తుల ముందు సాగిలపడ్డాడు. ఆ భయభక్తులే  మూఢనమ్మకాలకు మూలకారణమయ్యాయి క్రమక్రమంగా!
సమాజాన్ని కుంగదీసే, వ్యక్తిచైతన్యాన్ని అణగదొక్కే మహమ్మారులు ఈ మూఢనమ్మకాలు. అంటువ్యాధులకన్నా ప్రమాదకరం. ఈ తరహా ఊహపోహలను తీవ్రంగా  అపహాస్యం చేస్తుంది గురుజాడవారి ప్రగతిశీల 'కన్యాశుల్కం' నాటకం.
అవిద్య ఒక్కటే అంధవిశ్వాసాలకు కారణమా? విద్యావంతుల్లో వింతనమ్మకాలు లేవా? అని ప్రశ్నించేవారూ ఉన్నారు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు అందుకు ఉదాహరణ. ఆయన జటాంతస్వాధ్యాయి. అయినా వేదానికి అర్థం తెలీదు! 'మా మేనత్తలందర్నీ కూడా అమ్మారండీ! వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు' అంటాడు. ‘కన్యాశుల్కం’ దురాచారాన్నీ అచ్చివచ్చిన సంప్రదాయంగా నమ్మే ఆ మూఢుడు! ఆ అవివేకి దృష్టిలో  ‘దిబ్బావధాన్లు కొడుక్కి వూష్ణం వచ్చి మూద్రోజుల్లో కొట్టేయడానికి’ ఇంగ్లీషు చదువే కారణం. ఆచరించడం సంగతి ఆనక.. అసలు దురాచారమని అనుకొనేదాన్ని మనసులో తలుచుకున్నా చాలు.. ఏదో కీడు తప్పదని భయపడే బుద్ధిహీనులు తక్కువేమీలే రీ లోకంలో. బుచ్చబ్బి కొడుక్కి చచ్చినంత ఖాయిలా చెయ్యడానికి ఇంగ్లీషు చదువుదామని అనుకోవడమే కారణమని దబాయించే  అగ్నిహోత్రావధాన్లు తరహా మూర్ఖులున్నంత కాలం ‘కన్యాశుల్కం’ నాటకం నిత్యజీవితంలోని అస్తవ్యస్తతకు అపహాస్య దర్పణంగానే  వర్ధిల్లుతుంటుంది.
సనాతధర్మం మిషతో ప్రచారమయే ఆచారాలలో  అంధవిశ్వాసాల పాలు తక్కువేమీ కాదు. వాటి ప్రస్తావనలేవీ లేకుండా  అట్టడుగు జాతులు అవగాహనాలేమితో గుడ్డిగా నమ్మే విశ్వాసాలను మాత్రమే అవహేళన చేయడం.. నాగరీక సమాజంలో కనిపించే  ఒక అవలక్షణం. కన్యాశుల్కం  ఈ తరహా 'ద్వంద్వనీతి'ని అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఉతికి ఆరేసింది. 'నా పిల్లేమిటి, ఫకీరు ముండ. రేపు ఇంటికి వెళ్తూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను' అంటాడు అగ్నిహోత్రావధాన్లు లేచిపోయిందనుకున్న బుచ్చెమ్మ మీద ఆగ్రహంతో. వేదార్థం సాకల్యంగా అర్థంచేసుకొన్నవారెవరూ ఈ సందర్భంలో వాడే మాటకాదు ఘటాశ్రాధ్దం. కర్మకాండ విధానాలు అదను తప్పి ఎంత గుడ్డిగా పెద్దకులాల్లో కూడా అమలవుతున్నాయో 'ఘటాశ్రాద్ధ' చలనచిత్రం చూస్తే అర్థమవుతుంది.  
తెలుగుజాతిని పట్టి పీడించే మూఢాచారాల మీద వీలున్న అన్ని దారుల్నుంచి దాడులు చేసిన అభ్యుదయ యోధుడు కందుకూరి అయితే వీరేశలింగం వేసిన ఆ సంస్కార మార్గంలో 'కన్యాశుల్కం' బండిని మహా దూకుడుగా నడిపించిన ప్రగతికాముకుడు  గురుజాడ.  శ్రద్ధగా పరిశీలిస్తే మూఢాచారాల ప్రస్తావనలే కాదు.. వాటి అతిక్రమణలూ  కన్యాశుల్కంలో  ప్రహసన పూర్వకంగా అలరిస్తాయి. మూఢవిశ్వాసాలను సృష్టించేది, సానుకూలంగా ఉన్నప్పుడు ప్రస్తావించేది,  లేనప్పుడు వాటిని  అతిక్రమించేదీ సంఘంలోని పై తరగతులకు చెందిన పెద్దమనుషులే. ఈ వైరుధ్యానికి కన్యాశుల్కం అత్యద్భుతంగా అద్దంపట్టింది.
గిరీశం పాశ్చాత్య సంస్కృతితో బాగా ప్రభావితమైన పాత్ర. వైదికాచారాలు కొన్నింటితో పరిచయం కద్దు. కానీ వాటిని విశ్వసించడు. అయినా సందర్భం వచ్చినప్పుడు ఆ మూఢవిశ్వాసాలనే తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకోవడం మానడు!  'నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను' అని ఫొటోగ్రాఫుపంతులి బంట్రోతుని నమ్మిస్తాడు బకాయి వసూలుకు వచ్చి పీకల మీద బైఠాయించినప్పుడు. అంధవిశ్వాసాలకు ఉండే సామాజిక బలిమి గిరీశానికి బాగా ఎరికే. ఈ సమాజంలో లంచాలకి లొంగనివాడినయినా ‘విశ్వాసాల’తో మచ్చిక చేసుకోవడం సులువని వాడికి తెలుసు. ‘తమ వరకు వస్తే గాయిత్రిని, సావిత్రిని జపించక పోబట్టే ఆధునిక యుగం ఇంత అభివృద్ధి చెందింద’న్న గిరీశం థియరీలో అణులేశమైనా అతిశయోక్తిలేదు. వట్టి మంత్రాలు వల్లించడం వల్ల ఒరిగి పడేదేమీ లేదన్న స్పృహ నేటి మనిషికి మల్లే ఉండబట్టే 'తోవలో ఏటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను' అని అబద్ధమాడి మరీ 'చల్దివణ్ణం' లాగించేసాడు గిరీశం జంకూ గొంకూ లేకుండా అగ్నివోత్రావధానులు ఇంట్లో. 'కాలిస్తే కోవిల్లోనే చుట్టలు కాల్చాలోయ్' అన్న గిరీశంలో ఈ కాలపు నయవంచకుల ప్రతిరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మూఢవిశ్వాసాల సంగతి అటుంచి.. అసలు 'విశ్వాసాల’ జంజాటాలే పెట్టుకోవడం లేదు కదా నేటి మరీకొత్తతరం? 'మయిలా గియిలా మా ఇంగ్లీషువాళ్లకు జాన్తా నై' అని మధురవాణి దగ్గర గిరీశం కూసిన కూతలు ఈ నవనాగరీకుల బరితెగింపు బుద్ధిని ప్రదర్శిస్తాయి నగ్నంగా. 
గిరీశం గడుసుదనం ఎట్లా ఉన్నా గురజాడవారి గడుసుదనం కన్యాశుల్కంలో అడుగడునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మూఢవిశ్వాసాలను సృష్టించి, వ్యాప్తి చేసే ఉన్నత సామాజిక వర్గాల ద్వారానే వాటి నిష్ప్రయోజకత్వాన్నీ చెప్పించడం గురజాడ గొప్ప టెక్నిక్. గ్రహచారాల ఆధారంగానే లుభ్దావధాన్లుని ముగ్గులోకి దింపాడు రామప్పపంతులు. 'శీఘ్రమే వివాహయోగం.. ఆ యోగం వల్ల ధనయోగం'ఉందని నమ్మబలికాడు. తప్పితే 'మారకం' ఉందన్నాడు. (పెళ్లికూతుళ్ళు మారడం మీదే తరువాతి  ప్రహసనమంతా నడిచింది కదా)! అక్కడేమో అగ్నిహోత్రావధాన్లు బిడ్డ చేతిలో కూడా 'ధనరేఖ' జెర్రిగొడ్డులా కనిపించింది! ఇదంతా హస్తసాముద్రికం మీద వ్యంగంగా నడిచిన తంతు.  ‘అన్నగారూ!’ అని సంబోధిస్తూ లుబ్ధావధాన్లుకు గిరీశం 'చిన్నది బహు లక్షణంగా ఉంటుంది. గాని కొంచెం పెయ్యనాకుడు కద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువు అండ్రు' అంటూ బనాయించిన  ఉత్తరంలో కూడా 'శరీరశాస్త్రం' ప్రస్తావన వస్తుంది. తిధి, వార, నక్షత్రాల, గ్రహ స్థితుల ఆధారంగా పుట్టే జాతకాల గుట్టును రామప్పపంతులే  రట్టు చేస్తాడు మరో సందర్భంలో. 'మా బ్రాహ్మల్లో ఇది పరిపాటే. పెళ్లిళ్లలో పంపించే ఒహ జాతకవు నిజం ఉండదు' అంటూ జాతకాల బూటకాన్ని స్వయంగా బట్టబయలు చేసుకుంటాడు. జాతకాలను నమ్మేవాళ్ల గాలి తీస్తాడు వకీలు నాయుడు. అంగీరసలో పుట్టిన పిల్ల 'భావ'లో పుట్టినట్లుండటం చూసి 'బ్రాహ్మల పరువంతా తీస్తివే' అంటూ అగ్నిహోత్రావధాన్లను కలెక్టరు మందలిస్తాడు. శుభ ముహూర్తాలను సైతం అనుకూలతని బట్టి మార్చడం అప్పటిలాగా ఇప్పుడూ నడుస్తున్న 'లౌక్య ప్రజ్ఞే' లోకంలో.
దయ్యాలు, భూతవైద్యుల భాగోతం కన్యాశుల్కంలో అన్నిటికన్నా రసవత్తరమైన అభూతకల్పనలు. ఒక సన్నివేశంలో లుబ్ధావధాన్లు, మీనాక్షి, అసిరిగాడు, రామప్పపంతులు ప్రధాన పాత్రలు. తాను పెళ్లాడింది 'రెండో పెళ్ళి ముండ' అన్న లుబ్ధావధాన్లు  అనుమానం నుంచి మొదటిమొగుడు దయ్యమై పుట్టుకొచ్చాడు. మాయగుంట నూతిలో పడిందన్న మరో అనుమానం నుంచి రెండో దయ్యం పుట్టుకొచ్చింది. అక్కణ్నుంచీ గవరయ్య రంగప్రవేశం, లూటీ కార్యక్రమం మొదలవుతాయి. భయస్తుల దడుపు నుంచి ఒడుసుకోవడం చాలా సులవు. బ్రహ్మరాక్షసినీ, కామినీ పిశాచాన్నీ ఒకే సీసాలో బంధించానని గవరయ్య అన్నప్పుడు, 'ఇద్దర్నీ ఓ సీసాలో పెడితే దయ్యప్పిల్లల్ని పెడతారేమో?' అంటుంది మీనాక్షి. ఆధారంలేని విశ్వాసాల చూర్లు పట్టుకు వేలాడుతూనే ఆ పట్టు వదిలేస్తే జారిపడతామన్న తర్కం సమాంతరంగా మనిషి మెదడులో ఎలా పనిచేస్తుందో గురజాడ చక్కగా చూపిస్తాడిక్కడ. అజ్ఞానం వెలిబుచ్చే తర్కంలో  హాస్యరసం చిప్పిల్లుతుంది సహజంగానే. కానీ ఈ మాదిరి అభాసంతా సమాజ వికాసానికి సమాంతరంగా సాగే వికృతత్వానికి నిదర్శనం. ఈ తరహా మౌఢ్యాన్ని కన్యాశుల్కంలో గురజాడ అంత  తీవ్రంగా, వికటంగా బహుశా ప్రపంచ సాహిత్యంలో ఇంకెవ్వరూ ఎండగట్టి ఉండరేమో! రాసి శతాబ్ది దాటినా 'కన్యాశుల్కం' ఈ నాటికీ  తిరుగులేని ప్రహసనంగా జనాకర్షణ నిలుపుకోవడానికి కారణం సమాజాన్ని నిత్యం పీడించే అంధవిశ్వాసాలు ఇందులో ప్రతిభావంతంగా చిత్రీకరించడమే.
మూఢవిశ్వాసాలు పై తరగతులవారికి ఎంతలా  ఆటివచ్చాయో.. ఎంత అడ్దువచ్చాయో.. కింది తరగతులవారికీ ఆ మోతాదుల్లోనే అక్కరొకొచ్చాయ్.. అడ్డూ వచ్చాయ్! ఆ పార్శ్వమూ గురజాడ గురి నుంచి తప్పిపోలేదు.  రెండు రూపాయలిస్తే ముహూర్తం మార్చేస్తానంటాడు సిధ్దాంతి! ఉన్నతవర్గాలవారు స్వార్థప్రయోజనాల కోసం మూఢవిశ్వాసాలను సృష్టించి సందర్భాన్ని బట్టి వాడుకుంటే, దిగువ తరగతులవారు ఆకలి వంటి ప్రాధమిక జీవితావసరాల కోసం మాత్రమే ఆ అంధవిశ్వాసాలను వాడుకుంటారు. ఈ రెండు పార్శ్వాల మధ్య ఉండే తారతమ్యం గుర్తించనివారు ‘కన్యాశుల్కం’ నాటకం జీవసారాన్ని సక్రమంగా గ్రహించలేరు.
మోసగాడితో లాలూచీపడి మోసపోయినవాడు దుకాణదారుడు. అతగాడితో కత్తు కలిపినవాడు గవరయ్య. ఉద్యోగధర్మాన్ని అనుసరించి మాయగుంటను, కరటక శాస్త్రిని పట్టుకోవాల్సింది పోయి బైరాగి అంజనం మీద ఆధారపడే  మూర్ఖుడు హెడ్డు. కన్యాశుల్కం పాత్రలన్నింటిలో మూర్ఖత్వమో, అమాయకత్వమో ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. ఒక్క మధురవాణి, సౌజన్యారావు పంతులు మినహాయింపు. అమాయకులను, ఆశపోతులను, అదుపుతప్పినవాళ్లను, దిక్కులేనివాళ్లను, విశ్వాసాల వంకతో వంచకులు ఎట్లా ఆటలాడిస్తారో గిరీశం, బైరాగి, రామప్పపంతుళ్ళు వంటి పాత్రల ద్వారా సాటిలేని రీతిలో నిరూపించాడు కన్యాశుల్కంలో గురుజాడ. కన్యాశుల్కంలో బైరాగి  ప్రాతఃకాలంలో కాశీలో గంగను సేవించి, పవనం బంధించి, వాయువేగం మీద విశాఖపట్టణం వీధిలో విజయం చేస్తాడు! విశ్వేశ్వరుడి కోవిలలో ఆకాశం మీంచి పడ్డ బంగారపు రేకు మీద చెక్కిన లిపి బ్రాహ్మలెవరికీ బోధ అవక తనను చిత్తగింజమన్నట్లు బైరాగి చెప్పుకొస్తాడు. యోగదృష్టి, ఖేచరీగమనం, తిరస్కరణీవిద్య, వాయువేగం, వాగ్బంధం, అంజనం, రసవాదం, వాయుస్తంభన లాంటి అపరవిద్యల్ని గూర్చి హేతువుకు అంతుబట్టని కబుర్లతో పబ్బం గడుపుకొనే బైరాగి  మోసగాడని వాసన పట్టే పాఠకులే, వాస్తవ జీవితంలో మూఢవిశ్వాసల కారణంగా అదే మాదిరి మాయాజాలంలో సులభంగా పడిపోతున్నారు! లుబ్ధావధాన్లు మల్లే విలవిలలాడుతున్నారు! నాటకంలోని ఏ సన్నివేశమూ అసహజం అనిపించక పోవడానికి అదే కారణం.
భాగవత గ్రంధం తలకింద పెట్టుకు పడుకోవడం, దీపాలార్పి ప్రమాణం చెయ్యడం, పేకాట దగ్గర ముణుకు పెట్టడం, ఇనప చేతులు(ఐరన్ లెగ్) వంటి అపశకునాలు  అడుగడుగునా నిత్యజీవితంలో మాదిరి ప్రత్యక్షమవుతుంటాయి ఈ నాటకంలో. చదువుకొనే సంస్కృతకావ్యం మీద నమ్మకంలేక.. ఇంగ్లీషు పుస్తకం పైన  ప్రమాణంచేస్తే తప్ప కరటకశాస్త్రి శిష్యుడు గురువును నమ్మడు! మారే తరాలకు తగ్గట్లు వస్తువు మారినా మౌలిక ఆలోచనల్లోని మూఢత్వం చెక్కుచెదరని పరిస్థితిని గురజాడ ఎంతో గొప్పగా చిత్రీకరించాడీ నాటకంలో.
'ఆకాశంబు శూన్యంబు' అని మనవాళ్లయ్య అన్నప్పుడు.. 'తెల్లోడు యెర్రోడా? పట్టంలో గొట్టావెట్టి అదే సూస్తాడే ఆకాశం కేసి?' అని ఎదురు ప్రశ్న వేస్తాడు మునసబు. పాశ్చాత్య విజ్ఞానం వెలుగులోకి వచ్చేకొద్దీ పల్లెటూళ్లల్లో కూడా ఆలోచనా విధానం ఎట్లాంటి మార్పుకు గురయిందో గురజాడ ఇటువంటి సందర్భాలలో మర్చిపోకుండా ప్రస్తావిస్తాడు. 'ఆంజనేయస్వామికి పదిశేర్లు నెయ్యితో దీపారాధన చేస్తాన’ని కరటక శాస్త్రి అన్నప్పుడు .. ‘కడుపులోకి వెళ్లవలసిన నెయ్యి కాల్చివెయ్యడం నాకేమీ ఇష్టంలేదు. మొక్కుకోండి చాలు'అంటాడు అతగాడి శిష్యుడు.  ఈ దేశపు అజ్ఞానపు కోటలకు ఇట్లాంటి సందర్భాలలో బీటలుపడ్డమూ  కదాచిత్ లేకపోలేదు. కానీ ఆ చిట్టి దీపాలు గాఢమైన చిమ్మచీకట్లను పారదోలేటంత వెలుగులు ఎన్నడూ ప్రసరించింది లేదు. అదే విషాదం.
మూఢ విశ్వాసాలను నమ్మేవాళ్లే తోసిరాజనేవాళ్లు. తోసిరాజన్నవాళ్లే నమ్మినవాళ్ళు కన్యాశుల్కం నాటకం నిండా కనిపిస్తారు వాస్తవ లోకంలోలా. వాస్తవానికి మధురవాణి, సౌజన్యరావు పంతులు మినహాయించి  ఈ ప్రహసనంలోని ఏ పాత్రకూ దేని మీదా స్థిరమైన నమ్మకం లేదు. ఏది నమ్మాలి? ఏది నమ్మరాదు? అనే అంశానికి ఎప్పుడూ అంతగా ప్రాధాన్యతా లేదు. అవకాశవాదమే నాగరికులకు పక్కవాడిని బోల్తా కొట్టించే పక్కా చిటుకు! బైరాగి కనిపిస్తే మాయలేడిని, కరటక శాస్త్రిని అంజనం వేసి కనిపెడతాడని ఆశపడే హెడ్డుతో 'హెడ్డుగారూ! ఇదంతా ‘గ్రాండచ్చీ ఆఫ్ బాడన్' అని వాదిస్తాడు గిరీశం.  మూఢనమ్మకాల లోతుపాతులన్నీ ఆ ఒక్క ముక్కతో తేల్చిపారేసాడు గిరీశం పాత్ర  ద్వారా గురజాడ కన్యాశుల్కం నాటకంలో!
 కన్యాశుల్కంలోని మూఢపాత్రల విశ్వాసమల్లా జీవిత భద్రత మీద, డబ్బు మీద. వాటి కోసం ఏది ఎప్పుడు అవసరమనిపిస్తే  దాన్ని అప్పుడు వాడుకున్నాయి  దాదాపు అన్ని పాత్రలు. వాస్తవంగా అధికశాతం లౌకికుల  అసలు మనస్తత్వం కూడా ఇదే. ఈ విధమైన స్వీయనయవంచన జీవన సరళిగా కొనసాగుతున్నంత కాలం సమాజంలో పతనం భీభత్సంగానే కొనసాగుతుంది. ఈ భీభత్సాన్నుంచి బైటపడాలంటే  ఉదారవాదం, హేతువు ఆధారంగా వికాసం పొందే మానవవాదం అలవడాలి. కన్యాశుల్కంలోని మూఢవిశ్వాసాల చిత్రీకరణ ద్వారా గురజాడ జాతికి ఇవ్వదలుచుకున్న సందేశం కూడా ఇదే.
-కర్లపాలెం హనుమంతరావు
***
(కన్యాశుల్కం - మూఢవిశ్వాసాలు- పు.200- 205 - డా।। యు.. నరసింహమూర్తి- కన్యాశుల్కం 19 వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు- ప్రేరణతో


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...