Wednesday, February 2, 2022

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?- వ్యాసం సూర్య - 02 - 10-2019 - కర్లపాలెం హనుమంతరావు





బాపూజీనే మళ్లీ బతికిరావాలా?

-కర్లపాలెం హనుమంతరావు

తెలిసీ తిలియకుండా రాజకీయ అవసరాల కోసం ఇటీవల అమెరికన్ అధ్యక్షుడు భారతదేశ ప్రధాని మోదీజీని 'జాతిపితఅంటూ ప్రశంసించాడు. భరతీయుల నిజమైన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. శతాబ్దాల బట్టీ  స్వతంత్ర జీవనం కోసం ఆరాట పడి ఎన్నో రాకాలుగా పోరాటాలు చేసిన  భారతీయుల ఆంకాక్షలను అఖరికి  వాస్తవం చేసిన మహాయోధుడు గాంధీజీ. మొదటి సారి నోబెల్ గ్రహీత  ఠాగోర్జీ నోటి నుంచి వినిపించిన వేళా విశేషం.. 'మహాత్మాఅన్న ఆ పిలుపు బాపూజీకి పర్యాయపదంగా స్థిరపడింది! ప్రపంచ నేతల చరిత్రల పరంగా చూస్తే ఇదో అపురూపమైన విచిత్రం.  1869 అక్టోబర్ నాడు గుజరాత్  పోరుబందర్‌లో జన్మించినప్పటి నుంచి  1948 జనవరి 30న హత్యకు గురైన క్షణం వరకు గాంధీజీ జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ ఒక హాలివుడ్ చిత్రం సూపర్ హిట్ ఫార్ములాకి సరితూగే స్థాయి నాటకీయత ఉంది. కాబట్టే అటెన్ బరో 'గాంధీపేరుతో శ్రమించి తీసిన మూవీ అన్నేసి ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. 

 

'నా జీవితమే నా సందేశంఅన్న  కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన నీతి నిజాయితీలతో కూడిన  సత్య నిబద్ధ జీవితం నిజానికి దేశ ప్రజలతో మమేకమై జీవిస్తున్నట్లు  చెప్పుకునే  ప్రజానేతలందరికీ ఆదర్శం కావాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.   

సత్యాగ్రహం అనగానే ముందుగా నేటి తరానికైనా కళ్ల ముందు కదలాడే మూర్తి  కరెన్సీ నోటు పైన బోసి నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే బాపూజీ  ప్రొఫైల్.  సత్యాగ్రహాన్ని మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదని  ఓ సందర్భంలో బాపూజీ అంటారు.    ఆయుధం బాపూజీ చేతికి  అందేనాటికే ఆంగ్లంలో 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'  గా ప్రసిద్ధం. హిందూ వలస జాతులకు వత్తాసు వకీలుగా బాపూజీ వెళ్లే నాటికి దక్షిణాఫ్రికాలో   ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా.. తెల్లవాళ్లతో సమానంగా  విలాసవంతమైన బోగీలలో  ప్రయాణించడం నిషిద్ధం. రైలు బోగీ నుంచి కిందకు తోసివేసినప్పుడు సాటి వలస జీవులకు మల్లే   గాంధీజీ కూడా తలొంచుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ ఉండేదే కాదు. తల్లి దండ్రుల ద్వారా అబ్బిన ఆత్మ సమ్మాన బుద్ధి  గాంధీజీని కుదురుగా ఉండనిచ్చింది కాదు. ఈ తరహా వివక్ష రాక్షసి అంతమయ్యే వరకూ పోరాడలన్న సంకల్పం   ఆ సందర్భంలో  గాంధీజీలో పురిగొల్పిన ప్రముఖుడు   రచయిత 'టాల్ స్టాయ్'. ఆ రచయిత వ్యాసంలోని 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'   బాపూజీ చేతిలో సత్యాగ్రహ ఆయుధంగా మారి మరింత పదునెక్కింది తదనంతర కాలంలో. ఆనాటికి సూర్యుడు అస్తమించని  సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ సామ్రాజ్యంలో సైతం చీకట్లు కమ్మునేటంత దుమారం సృష్టించింది.  ఆ సత్యాగ్రహాయుధం  ధర్మ సూత్రం గురించి వివరించే సందర్భంలోనే తన పుస్తకంలో ఒక చోట బాపూజీ అంటారూ-         ప్రజాస్వామ్యం అనే అభిలాష  ఇంకెవరో వచ్చి  బలవంతాన రుద్దితే రగిలే స్ఫూర్తి కాదు.  స్వీయ వ్యక్తిత్వం  సంస్కరించుకునే అవసరం స్వయంగా గుర్తించి.. ఆ దిశగా ఆచరణాత్మకమైన కృషి కొనసాగించాలన్న సంకల్పం దృఢంగా అచరణలో పెట్టినప్పుడే కాలక్రమేణా దాని వికాస ఫలాలు అనుభవానికి వచ్చేవిఅని. ప్రస్తుతం కంటి ముందు నడిచే రాజకీయాలలో పదే పదే ప్రజాస్వామ్యం అనే పదం రామకోటికి మించి  మారుమోగుతున్నది. అయినా  ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యం నేతి బీరకాయలోని నేయి చందంలా మాత్రమే బులిపిస్తున్నది.  బాపూజీని జాతిపితగా చెప్పుకుంటో  నూట యాభై సంవత్సరాల  ఉత్సవాలు ఘనంగా జరిపించే ఉత్సాహంలో ఉన్న ప్రజా నేతలలో ఏ ఒక్కరికైనా  మరి సత్యాగ్రహ ఆయుధం ప్రయోగించాలనే  ఆలోచన రావడం లేదు! అదే విచారిచదగ్గ  విచిత్రం!

'చెడును నిర్మూలించే లక్ష్యంతో ఆయుధాలు చేపట్టడంలో తనకెప్పుడూ  వ్యతిరేకత లేదని బాపూజీనే స్వయంగా చెప్పుకొచ్చారు కదా చాలా సందర్భాలలో! అయితే ఆ చేపట్టిన ఆయుధం కారణంగా ఏ పక్షమూ రక్తం చిందించరాదు- అన్నదే జాతిపిత అభిమతం.  బొట్టు నెత్తురు నేల రాలకుండా శతాబ్దాల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులను నిశ్శబ్దంగా సరిహద్దుల కావలకు నెట్టివేసి మరీ  అహింసా పోరాటం సాగించే పద్ధతులను ప్రపంచానికి ప్రదర్శించి చూపించిన ప్రయోగశీలి మహాత్మా గాంధీ. సుందరాంగుల ముక్కులుముఖాల మీద మోజుతో యుద్ధాలకు తెగబడి వేలాది అమాయకులను బలవంతంగా యుద్ధ రంగాల రొంపిలోకి దింపి అపారమైన ప్రాణఆస్తి నష్టాలు కలిగించడమే యుద్ధాలుగా  చదువుకున్నది ప్రపంచ చరిత్ర అప్పటి వరకు. చేతి కర్రకిర్రు చెప్పులుకొల్లాయి ధోతీబొడ్డు గడియారం,  బోసి నవ్వులనే ఆయుధాలతో కూడా  ఎంతో బలవంతుడైన విరోధిని ప్రేమతో నిరోధించవచ్చు. లాలించి లొంగదీయవచ్చని బాపూజీ ప్రదర్శించిన 'అహింసా పోరాటంచాటి చెప్పే పాఠం. ప్రపంచ చరిత్రలోని ఈ కొత్త సిలబస్  వంట బట్టించుకున్న తరువాతే  మార్టిన్ లూథర్ కింగ్ వంటి పోరాట యోధులు తమ జాతి హక్కులను అహింసాయుతంగా సాధించుకోగలిగింది. ప్రపంచం ముందు తెలెత్తుకుని బాపూజీ సగర్వంగా  నిలబెట్టిన ఆ భారతీయ అహింసా యోధ మూర్తిత్వానికి   ప్రస్తుతం కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు సాగుతున్న హింస రచన   కళంకం తెచ్చెపెట్టే అంశం కాడం బాధాకరం. బతికివుండుంటే బాపూజీని సైతం ఎంతో    కలవరానికి గురిచేసే  అంశమయివుండేది ఖచ్చితంగాఇది.   సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఐక్యరాజ్య సమితి వేదిక  నుంచి అనకాపల్లి సందు వరకు బాపూజీ భజన చేయడం మరిచిపోని మన ప్రజానేతలు మరి ఈ అహింస అనే ఆయుధాన్ని ఎందుకు అశ్వత్థామ వృక్షం ఎక్కించేసినట్లో?! ఆ అయుధం కిందికి దిగడానికి ఇంకా ఎన్ని గో గ్రహణాలు జాతి అనుభవించవలసివుందో?

ఆత్మాభిమానంగౌరవం వేరెవరో వచ్చి పరిరక్షించే శీల సంపదలు కావు కదా! 'చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలన్న కాంక్ష ఉంటే  ముందుగా ఆత్మ సమ్మానాన్ని కాపాడుకోవాలిఆన్న బాపూజీ సూక్తి మీద ఆసక్తి గల ప్రజానేతలు ఎంత మంది మిగిలున్నారు ఇప్పుడు?   బి-ఫారం ఇచ్చి,  నిధులిచ్చి,  గెలించేందుకు అహర్నిశలు అంతులేని కృషి చేసిన సొంత పార్టీలకే నామాలు పెట్టేసి అధికారంవ్యాపారం వంటి వ్యక్తిగత లాభాపేక్షల నిమిత్తం గెలిచిన మరు క్షణమే పాలక పార్టీలలోకి దూకే ప్రజాప్రతినిధుల పట్లే  ఎక్కువగా ప్రజలూ ఆకర్షితులవుతున్నారిప్పుడు!అక్టోబరు రెండుకోజనవరి ముఫ్ఫైకో  బాపూజీ గుణగణాలను శ్లాఘిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తే సరి.. ఓ పనయిపోతుందనే భావనే సర్వే సర్వత్రా. బిర్లా భవన్ ప్రాంగణంలో ప్రాణాలు గాలిలో కలిసే ముందు బాపూజీ 'హే! రామ్!అని ఆక్రోశించినట్లు ఆ సమయంలో  దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఆ మహాత్ముడి ఆక్రోశానికి  కేవలం తనపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే కారణం కాదేమో భావి భారత దేశ రాజకీయ దివాళాకోరుతునం ముందే ఊహించి 'హే రామ్!అని ఆక్రోశించలేదు కదా మహాత్ముడు?

'ఆచరణ కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టరాదు. ఓర్పుతో అయినా  వాటిని పాటించాలి' అన్నది  నోటి మాటగానే కాదు.. తన జీవితం ద్వారా కూడా  ఆచరించి చూపించిన నిజాయితీ బాపూజీది. మేక పాల పానం నుంచిమద్యపాన నిషేధం  వరకూ ఏ పని పట్లా ఆయనకు నీచభావన లేదు.  నేటి నేతల నోటి మాటలకు భిన్నంగా బాపూజీ  పాయిఖానాల క్షాళన పట్లా హేళన ప్రదర్శించిందిలేదు. ఆయన అడుగు జాడలలోనే తమ నడక సాగుతున్నదని నమ్మబలికే నేతలు ఆచరణ సాధ్యం కావని తెలిసే ఎన్నికలలో ఓట్లు దండుకొనే దురుద్దేశంతో  అసాధ్యమైన హామీలు అనేకం  అమాయకులపై గుప్పిస్తున్నారు.    ప్రజాస్వామ్యం పేరిట సాగే రకరకాల రొటీన్ పేరంటాల పట్ల  ఆఖరికి ప్రజల హక్కుల కోసమని పనిచేస్తున్నామని చెప్పుకునే  స్వచ్ఛంద సంస్థలు సైతం  కిమ్మిన్నాస్తి!    మరో మారు నిజమైన సత్యాగ్రహ సమరంతో దేశం  మారుమోగాలంటే మళ్లీ మహాత్ముడు వస్తే మినహా  సాధ్యం కానంత మందగొడితనం దేశమంతటా దట్టంగా అలుముకుని ఉన్న నేపథ్యంలో బాపూజీ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భం తటస్థించింది.   తటపటాయింపులేవీ లేకుండా జాతిపిత  జీవితాన్నే పరమాదర్శంగా తీసుకోక తప్పని దుస్థితి ప్రస్తుతం సమాజం అంతటా నెలకొని ఉంది. ప్రజాక్షేత్రంలోని ప్రతీ వ్యక్తీ   ప్రతి అడుగులోనో మహాత్ముని ప్రవచనాలను  గుర్తుంచుకుని నడిస్తేనే తప్ప  ప్రస్తుతం  దేశం ఎదుర్కొనే గడ్డు సమస్యల నుండి గట్టెక్కే పరిస్థితిలేదు. 

'కంటికి కన్నుసిద్ధాంతంతో  ప్రపంచాన్ని మరంత అంధకారంలోకి నెట్టివేసేందుకు తప్ప సాధించే మరో ప్రయోజనం లేదు. సుదీర్ఘంగా సాగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల విశ్వవ్యాప్తంగా  వాతావరణం ఏమైనా చల్లబడిందాఓటుసత్యాగ్రహం- ఈ రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే  ఆయుధాలు-అంటారు బాపూజీ! వాటి వినియోగాన్ని బట్టే ప్రజల  ఆలనా పాలనా సమర్థంగా సాగేది అని  మొదటి నుంచి గాంధీజీ గట్టి నమ్మిక. ఓటును ఓ కొనుగోలు సరుకుగా మార్చి చేజిక్కించుకోడమే కాదు.. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిపెట్టిన  సత్యాగ్రహ ఆయుదాన్ని సైతం.. ప్రస్తుతం దుష్ట రాజకీయం  ఆడే నాటకంలో ఓ అంకం ప్రాపర్టీగా మార్చివేసిన మాయాజాలం నేటి రాజకీయానిది. పాలకులను అదిలించే ఆయుధాలు రెండూ వట్టి పోవడం దురదృష్టం. బాపూజీ తిరిగి వచ్చినా ఈ పరిస్థితి ఓ పట్టాన చక్కబడేనా  అన్నది అనుమానమే!

 

భారతావని  వేలాది సంవత్సరాల పాటు పరాయి పాలకులకు ఊడిగం చేయవలసి వచ్చింది. బిడ్డల అంతర్గత కుమ్ములాటలే భరతమ్మ పారతంత్ర్యానికి  మూల కారణంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. మళ్లీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనలో మనం కలహించుకుంటూ   కలసి మెలసి సాధించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తిరిగి పరాయి పంచలపాలుచేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాంఇటీవల అమెరికన్ అధ్యక్ష మహాశయుడు ట్రంప్ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమ సందర్భంగా స్వంత రాజకీయ లబ్ది కోసం చిలకరించిన కాస్తింత  లాలింపు పన్నీరు జల్లులకే మనం  పులకరించిపోవడం బతికి వుంటే బాపూజీని బాధించే అంశం అయివుండేదే!    

స్వాతంత్ర్యం సాధించుకొన్న నలభైల నాటి తరం ఇప్పుడేమంత ఉనికిలో లేదు. పుట్టుకతోనే  ఆయాచితంగా దక్కిన కారణంగా  స్వేచ్ఛాయుత జీవితం ఎంత అమూల్యమైనదో నేటి తరాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఇప్పటి కుర్రకారు దృష్టిలో బాపూజీ అంటే కేవలం అటెన్ బరో తీసిన  చిత్రంలో కిన్ బెన్స్ లే వేసిన కథానాయిక పాత్ర. అదీ తెలియని మరీ కుర్ర తరానికి ఆ బోసినవ్వుల తాతయ్యంటే రూపాయి నోట్ల మీద కనిపించే ఓ గ్రాఫిక్ బొమ్మ.

 

   మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే  కొత్త బంగారు లోకం గురించి స్వప్నించే అర్హత సిద్ధించేదని సిద్ధాంతరీకరించిన  నిత్య చైతన్యశీలి మహాత్మాగాంధీ. కుటీర పరిశ్రమలుగ్రామస్వరాజ్యంస్వదేశీ వస్తు ఉద్యమంనిరాడంబర జీవన శైలిదేశవాళీ వైద్య విధానంస్వచ్ఛంద బ్రహ్మచర్యంరామ్ రహీమ్ లిద్దరినీ సమాన దృష్టితో కొలిచే తీరుబలహీనుల పట్ల అనురాగంస్త్రీల పట్ల ప్రత్యేక గౌరవ ప్రపత్తులుసమాజంలోని అన్ని తరగతులూ సామరస్య భావనతోసహజీవనం కొనసాగించడంనిత్య జీవితానికి అక్కరకొచ్చే ఏ పని పట్లా ఉపేక్ష వహించకపోవడంవృత్తులతో నిమిత్తం లేకుండా అన్ని కులాలనుజాతులను  సోదరవర్గంలో చేర్చుకోవడంముఖ్యంగా దిగువ తరగతుల పట్ల సమాదరణ, స్త్రీల పట్ల సమ్మనభావన, సనాతన ధర్మం పట్ల నిరసన లేని విశాల దృక్పథంతో నవీన సంస్కృతలను మనసారా ఆహ్వానించడంఅన్ని భాషల పట్ల ఒకే తరహా ఆదరణప్రజల పలుకుతో ప్రత్యేక అనుభంధం ఏర్పరుచుకోవడం.. 'సత్యంతో నా ప్రయోగాలుపేరిట బాపూజీ రాసుకున్న 'ఆత్మకథనిండా ఈ తరహా  నిత్య స్వచ్ఛ జీవన శైలికి సంబంధించిన ఎన్నో అంశాలు చదువరులలో ఉత్కంఠ రేకెత్తించే తీరులో ప్రతి పుటలో  కనిపిస్తాయి. తన జీవితంలోని    ఎత్తు పల్లాలనువెలుగు నీడలను  ప్రపంచం ముందు తెరిచిన పుస్తకంలా బాపూజీ పరిచిన తీరు ప్రపంచంలోని మరే ఇతర ప్రముఖ వ్యక్తీ ఊహలో అయినా ప్రదర్శిచలేనంత సాహసపూరితమైనది. బాపూజీ వారసులుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజానేతలుగా వ్యవహరించే నేటి నాయకులలో మచ్చుకకైనా ఒక్క మహాత్ముని మంచి లక్షణం కనిపించక పోవడం దేశప్రజలు చేసుకున్న దురదృష్టం. 

రాజకీయాలే కాదు.. సామాజిక జీవన సరళీ బాపూజీ బోధించిన బాట నుంచి క్ర్రమక్రమంగా  దూరంగా జరగడం కలవరం కలిగించే అంశం. 

పాముకాటు శరీరానికి చేసే హానికి కన్నా మద్యపానం ఆత్మకు కలిగించే నష్టం ఎక్కువ-అంటారు బాపూజీ. కనీసం ఆ జాతిపిత మాట మీద గౌరవం చూపించాలన్న సంస్కారం లోపించడం వల్లే గాంధీజీ జయంతివర్ధంతుల రోజులలో కూడా మత్తు పదార్థాల వినియోగాల రేటు తగ్గడం  లేదు! పుస్తక పఠనం కాదు..  మనిషిలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని వెలికితీయడమే అసలైన విద్య  లక్ష్యం- అన్నది బాపూజీకి విద్య మీద ఉన్న అభిప్రాయం.  ఆలోచనఆచరణా క్రమబద్ధంగా లేని పక్షంలో ఎన్ని విద్యలు నేర్చినా ఆ నైపుణ్యమంతా వృథానే కదా! 'మానవతను మించిన మంచి పుస్తకం మరొకటి లేదుఅన్న బాపూజీ సూక్తి చెవిన పెడుతున్నదెవరు విద్య వ్యాపారంగా మూడు పువ్వులు, ఆరు కాయలు పూయించే ఈ కాలంలో? 

 

 

'ప్రేమ  అన్నిటి కన్నా అత్యంత శక్తివంతమైనది.    శక్తి ముందు సాక్షాత్ భగవంతుడైనా  చేతులెత్తేయవలసిందే!అని ఉవాచించే బాపూజీ భావనలో ఆధ్యాత్మికత మీద కన్నా ఆత్మీయత వైపే తూగు ఎక్కువ కనిపిస్తుంది.   పెదాలపైన చిరునవ్వులు ధరించకుండా వంటికి ఎన్ని విలువైన దుస్తులు వేలాడదీసినా ఆ అలంకరణ రాణించేది కాదు-అన్నాడు అర్థ నగ్న యోగి బాపూజీ. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 'హాఫ్ నేకెడ్ పకీర్గా హమేశా ఎద్దేవా చేసిన మహాత్మాగాంధీ ఆ కొల్లాయి ధోతీ బిగించి సబర్మతీ ఆశ్రమం నుంచి కాలు  బైట పెడితే  చాలు.. ఆసేతు హిమాచల పర్యంతం ఆనంద పరవశమై అభిమానంతో చిందులుఉ వేసే పరిస్థితి. ప్రపంచం నలుమూలలకు సుపరిచితుడైన ప్రఖ్యాత హాస్యనటుడు ఛార్లీ చాప్లిన్ సైతం ఒక సందర్భంలో 'తాను గాంధీజీ గ్లామర్ చూసి అసూయ చెందుతున్న'ట్లు ప్రకటించుకున్నాడు.   అన్ని కళల కన్నా జీవితం గొప్ప కళ. సౌజన్యంతో జీవించే వ్యక్తి కన్నా గొప్ప కళాకారుడు లేడని బాపూజీ విశ్వాసం. ఆ లెక్కన చూస్తే మహాత్మా గాంధీ తరువాతే ఎంతటి మెగా హాలివుడ్కథానాయకుడైనా!  

బాపూజీ దృష్టిలో ప్రార్థన   పరమార్థం హృదయ శోధన. అనుభూతికి తప్ప లొంగని ఏ అదృశ్య శక్తి ఆశీస్సులు లేకుండా ఎంత గొప్ప కార్యమైనా సంపూర్ణంగా విజయవంతం కాలేదన్నది గాంధీజీ భావన. ఆ కనిపించని శక్తి మహిమే వెనక ఉండి తనను ఎల్లవేళలా సన్మార్గం నుంచి తూలకుండా కాపాడుతూ వచ్చిందని బాపూజీ తన సందర్శనార్థం వచ్చిన వారితో సందర్భం తటస్థించిన ప్రతీ సారీ చెప్పుకొస్తుండేవారు. 

 

ఆయా సందర్భాలలో  స్పందించిన తీరును ఒక క్రమ పద్ధతిలో గమనించ గలిగితే బాపూజీ సంపూర్ణ వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని మనం పట్టుకోవచ్చు. కైరా సత్యాగ్రహం పాక్షికంగా మాత్రమే విజయవంతమైన సమయంలో ప్రజల సంతోష సంబరాలను చూసి గాంధీజీ   'సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం  నాకు బాధ కలిగిస్తున్నది' అని బాహాటంగానే తన అసంతృప్తిని  బైటపెడతారు. రిలే నిరాహార దీక్షల వంకతో నాలుగేసి గంటల పాటు  నిరసనల నాటకం  నడిపించేసి లక్ష్యం నేరవేరినట్లు ఆనక  విజయయాత్రలు భారీ ఎత్తున నిర్వహించే  నేటి తరం నాయకులను చూసి మరి బాపూజీ బతికుంటే ఏ విధంగా స్పందిస్తారో!

రౌలత్ చట్టం ఆచరణలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో అశాంతి నెలకొన్నది.   బాపూజీ బోధనలు ఆలకించైనా  జనం కాస్త చల్లబడతారేమో అన్న ఆశతో అక్కడి ప్రాంతీయ నేతలు గాంధీజీని ఢిల్లీ పిలిపించుకుంటారు. జాతినేతగా అప్పటికే బాపూజీకి జనంలో  గొప్ప గుర్తింపే ఉంది. సెక్యూరిటీకి విఘాతంవంకతో  రైలు దిగీ దిగగానే గాంధీజీని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బందితో  'నేనిక్కడకు వచ్చింది శాంతి భద్రతలు తిరిగి సాధించుకోవడం కోసం.  అశాంతి జ్వాలలను మరింత ఎగదోయడం  కోసం కాదుఅంటారు. అకారణంగా కక్షలు రేకెత్తించి ఆ కార్పణ్యాల మధ్య తమ పబ్బం గడుపుకునేందుకు చూసే కుళ్లు రాజకీయాలకే ప్రస్తుతం చెల్లుబాటు. 

 బాపూజీ బోసి నోటితో చేసిన వ్యాఖ్య  జనం మధ్య తిరిగే  ప్రజానేత  బాధ్యత ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతుంది. సీనియారిటీని ఓ అనర్హతగా ప్రకటించి  పక్కన పెట్టే నేటి రాజకీయాలలో  బోసి నవ్వుల తాతయ్య బోధనలు ఆకాశవాణి సంస్కృతం  వార్తలకు మించి విలువిస్తుందా నేతాగణం? ఎవరిని తమకు ప్రతినిధులుగా ఎన్నుకొనాలోనన్న విషయంలో ఏడు దశాబ్దాలు దాటినా జనావళిలో ఓ స్పష్టత రాకపోవడం రామరాజ్యం గురించి కలలు కన్న బాపూజీకి బాధ కలిగించే అంశం కాదా? 

నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభల వేదిక మీద నుంచి నియంత పోకడల వల్ల పజాస్వామ్యానికి  ఏర్పదే పెను ప్రమాదం గుర్తించమని గాంధీజీ హెచ్చరించారు. 'స్వీయాభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల   నిజమైన స్వాతంత్ర్యం సాధించుకొనే అర్హత కోల్పోతామన్న ఆ హెచ్చరికకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షం పొడే గిట్టనంత అసహనం అధికార పక్షాలలో విశ్వరూపం దాలుస్తున్నది రోజు రోజుకీమహాత్ముడే మళ్లీ ఏ వామనావతారమూర్తిగానో దిగి వచ్చి నియంత బలి మాడును పాతాళానికి అణగదొక్కితే తప్ప సాగే ప్రజాస్వామ్య క్రతువు సలక్షణంగా సంపూర్ణమయే పరిస్థితి కనిపించడంలేదిప్పుడు.  

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అచ్చెరువొందినట్లు 'ఇటువంటి ఒక వ్యక్తి భూమ్మీద నిజంగానే పుట్టి మన మధ్య సంచరించాడా?' అనే అనుమానం మరింత పెరగక తప్పదు మహాత్ముని జీవితం తరచి చూసే కొద్దీ! బాపూజీ భావనలలోని మన్నికమిగతా నేతలంతా యధాతధంగా వాటిని అనుసరించక తప్పని ఆవశ్యకతను గురించి వక్కాణించే సందర్భంలో మరో హక్కుల నేత మార్టిన లూధర్ కింగ్ చెప్పిన ఒకే ఒక్క ముక్కలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మూర్తిత్వం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. 'కోరుకొన్నదాని కోసం అహింస దారిలో పయత్నించడంఅన్యాయం అని తోచినప్పుడు సాయమందించేందుకునిరాకరించడం యేసు సూచించిన బాట. ఆ బాటలో ఎలా సాగి లక్ష్యం సాధించాలో మొదటి సారి  స్వయంగా నడిచి ప్రపంచానికి చూపించిన ఘనత మహాత్మా గాంధీది.' అన్న నీలిజాతుల హక్కుల నేత మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. 

'కొల్లాయి గట్టితేనేమి.. మా గాంధి కోమటై పుట్టితేనేమిఅని   బసవరాజు అప్పారావు అప్పారావు పాట కట్టిన తీరును తప్పు పట్టవచ్చునేమో కాని..  ఆ పాటలో బాపూ నడిచి చూపించిన బాటను ఎవరం ఈ నాటికీతప్పు పట్టలేం. ప్రపంచమంతా గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్న బాపూజీ భావజాలాన్ని.. పుట్టిన దేశంలోని పాలనాసామాజిక వ్యవస్థలు పూర్తిగా పక్కన పెట్టేయడమే బాధాకరం. పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న సామెతను నిజం చేస్తే ముందు నష్టపోయేది మనమే సుమా! గాంధీజీ జన్మించి ఈ 2019, అక్టోబర్ నాటికి  నూటయాభై ఏళ్లునిండుతున్నాయి.  ఆ మహాత్ముడి జీవన విధానంఆలోచనా ధారఆచరణ మార్గాల పరంగా పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం మునుపటి కన్నా మరింత పెరిగిందనే సత్యం మనం జీర్ణించుకోక తప్పదు.   బాపూజీ భావజాలం నేటి సాంకేతిక యుగానికి అనువుగా ఎలా మలుచుకోవాలో ఒక చర్చగా అయినా తక్షణమే ఆరంభమవడం భరతజాతికి అన్నివిధాలా  మేలు. లేని పక్షంలో  హక్కుల సాధన పట్ల తప్ప బాధ్యతల నిర్వహణ పైన బొత్తిగా శ్రద్ధ చూపని నేటి సమాజం పోకడలను చక్కదిద్దడానికైనా  బాపూజీ పుడమి పైకి తిరిగి రావడమొక్కటే చివరికి మిగిలే దారి- అనిపించక మానదు!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య- దినపత్రిక - 02 -10 - 2019 - ప్రచురితం ) 

***

 

***

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...