Showing posts with label Society. Show all posts
Showing posts with label Society. Show all posts

Saturday, June 19, 2021

నవ్వు అరవై విధాల మేలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

 



 

హాసం పరమేశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' అన్న ఆదిదేవుని  సంస్తుతే ఇందుకు ఒక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయలు వెన్నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా సాగుతోంది.. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి పెదవులపై చిరుదరహాసాలు! ఎవరికి వారుగా ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం.. తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఇక్కడి ఉదహృతానికి సంబంధించిన ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసురవధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు పోతన. భామ మందహాసం అదే. హరిని, అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం  ఏ భావంతో తేరిపార చూశాడో.. నీలాపనిందల పాలయ్యాడు చవితి చంద్రుడు. హాసానికి, పరిహాసానికి మధ్య ఉండే పలుచని మేలితెర మూలకంగానే భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాలపాలయింది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటూ హాసంపై గల పరిమితులను గుర్తుచేసే శతక పద్యమూ మనకొకటుంది. 'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.

 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలపు మొరటు మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి  గౌరవ స్థానమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచి ఉచ్ఛరించినా, పదాలు అడ్డదిడ్డంగా మార్చి కూర్చినా, చేష్టితాలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా.. అనేకానేక సవాలక్ష  వంకర టింకర విన్యాసాలింకేవైనా ప్రదర్శించినా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను పువ్వుల్లా రాల్చవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు,ఆ కన్నుల్లో నిప్పురవ్వలు రాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని తతిమ్మా మరో ఎనిమిది.. మొత్తంగా ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రలు పోషించిన హాసవైవిధ్యాన్ని రసప్లావితంగా ప్రదర్శిచి 'ఆహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాలను గురించి కాళిదాసు మొదలు కృష్ణదేవరాయల దాకా, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి వరకు అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకు  మించి శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేసిన మాటా వాస్తవం. మే మొదటి వారాంతంలో వచ్చే  'ప్రపంచ నవ్వుల దినం'  ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని కరోనా తరహా పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధుల పై ఇంకెన్నో అధ్యయనాలు, మరింకెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా ఆ పరిశోధనాఫలాలలో కొన్నైనా! ఆ వెసులుబాటు లేనితనమే వీలున్నంత మేర మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత  కల్పిస్తున్నది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు. సరికదా, అందుకు విరుద్ధంగా ఆరోగ్యానికి అరవై రకాల మేలు కూడా. చాలా అధ్యయనాల్లో హాసోల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాసచికిత్సా విధానమే నవ్వుల దినోత్సవ నేపథ్యం.  కారణమేమీ లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయని కటారియా వాదం. నవ్వు రక్తవాహికలను విశాలపరుస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తిని విరోధిస్తుంది.  రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం వంటివి వందలాది లాభాల్లో ఒకటి మాతమే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు.. దానికే పది నిమిషాల పాటు వ్యాయామం చేసినంత మేలు. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటురాయిలా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపకా నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న  ప్రధాన స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీదనే సేవకు సదా సిద్ధంగా  ఉంటుంది. ఆ హాస సేవికకు పనికల్పించేందుకే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా.. పుట్టుకొచ్చింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

Saturday, April 24, 2021

గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు -కర్లపాలెం హనుమంతరావు

 


భావికాలజ్ఞానాన్ని ఇంగ్లీషులో చెబితే వీజీగా అర్థమవుతుందనుకుంటే ‘విజన్’  అనుకోండి.. సర్దుకుపోవచ్చు. ఇదివరకు  జరిగిన సంగతులను ఇప్పటికీ గుర్తుంచుకుని  వాటి అనుభవాలు పాఠాలుగా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ఇప్పటి నడత మార్చుకునే పద్ధతి. బుద్ధిమంతులు చేసే దిద్దుబాటు చర్య.

టు ఎర్ ఈజ్ హ్యూమన్– అన్నారు కదా అని పద్దాకా తప్పులు జరిగినా ఇబ్బందే. సరిదిద్ద రాని పొరపాట్లు జరిగితే చరిత్ర  చెడుగా గుర్తుంచుకుంటుంది. కాలానికి ఎవరి మీదా ప్రత్యేకంగా  గౌరవం ఉండదు.

 

జరగబోయే ఘటనల గురించి అందరికీ ఒకే తీరున సంకేతాలందడం రివాజు. అర్థమయిన బుద్ధిజీవులు పద్ధతి మార్చుకుని కాలం మీద తమ ముద్ర వేస్తారు. అర్థంకాని బుద్ధిహీనులు అట్లాగే అనామకంగా కాలగర్భంలో కలిసిపోతారు. 

 

భావికాల జ్ఞానలేమి కలిగించే నష్టం ఏ రేంజిలో ఉంటుందో చెప్పేందుకు  అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర ఓ పాఠం. తమను తాము స్థాయి మించి  ప్రేమించుకునే ఆ నియంత వంటి వాళ్లకు హితవు చెప్పేవాళ్ళు ఎంత సన్నిహితులైనా సరే  శత్రువులయిపోతారు. గిట్టనివాళ్ల మీద కక్షతో కొంతమంది దుష్ప్రర్తనకు తెగబడితే, సంభవం కాని లక్ష్యాలు పెట్టుకుని సమకాలీన పరిణామాల పట్ల శ్రద్ధ పెట్టనితనం వల్ల మరికొంత మంది అల్లరిపాలవుతారు.   ఈ రెండు రకాల పాలకులనూ మనం సమకాలీన వ్యవస్థలోనే గమనించవచ్చు.

 

హిట్లరు మనసులో నిరంతరం ఒకటే ఊహ తిరుగుతుండేది.  ప్రపంచం ఓ ముద్దయితే.. అది తన అంగిట్లో మాత్రమే పడవలసిన ఖాద్యపదార్థమని. అతగాడి భావిజ్ఞాన  లేమి ప్రపంచానికి తెచ్చిపెట్టిన మొదటి ప్రపంచ యుద్ధ వినాశనం అందరికీ తెసిసిందే. అసంభవమైన ఆ లక్ష్యం సాధించే ప్రక్రియలో సమకాలీన సమాజం ప్రదర్శించే  పరిణామాల పట్ల  అలక్ష్యమే హిట్లర్ సర్వనాశనానికి ప్రధాన కారణం. మనిషి నైజంలోని ఈ తరహా కనిపించని గుడ్డితనం (inattentional blindness)  కొత్త శతాబ్దం మొదటి ఏడాదిలో ఒకానొక అమెరికన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచానికి ప్రదర్శించి చూపించారు. 

 

ఓ బాస్కెట్ బాల్ మ్యాచ్ ను  తెరపై చూపిస్తూ బంతి ఎన్ని సార్లు చేతులు మారిందో కచ్చితమైన లెక్క చెప్పాలని విద్యార్థులకు పోటీ పెట్టి,  ఆట మధ్యలో అప్పుడప్పుడూ ఓ గొరిల్లా  కన్రెప్పపాటు సమయంలో  గుండెలు బాదుకునే దృశ్యం కూడా ప్రదర్శించారు. బంతి చేతులు మారడం మీద మాత్రమే ధ్యాస పెట్టిన చాలా మంది  విద్యార్థులకు గొరిల్లా గుండెలు బాదుకునే దృశ్యమే దృష్టిపథంలోకి రాలేదు. 

 

వాస్తవ ప్రపంచంలో ఈ తరహా పొరపాటు చేసినందు వల్లనే మోటరోలా సెల్ ఫోన్స్ కంపెనీ ఖాతాదారుల మార్కెట్ ని చేజేతులా నోకియాకు  జారవిడుచుకుంది.  ధ్యాసంతా అప్పటికి ఉన్న ఖాతాదారులను సంతృప్తి పరచడం మీద మాత్రమే  లగ్నం చేయడంతో ఖాతాదారుల్లోని 'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్ళు' గమనించే అవకాశం లేకుండాపోయింది. నోకియాదీ అదే మిస్టేక్.  సాంకేతిక నైపుణ్యాల పరంగా కూడా భావి కాలంలో జరగబోయే పెనుమార్పులను  ఊహించాలన్న జ్ఞానం లేకపోవడంతో మార్కెట్ ఆనేక చిన్న ధారాదత్తం చేసింది.

 

ఇక చరిత్రలోకి తొంగి చూస్తే ఇట్లాంటి ఉదాహరణలు  ఎన్నైనా చెప్పుకోవచ్చు. క్రీ.శ 1217 ప్రాంతంలో సమర్ఖండ్ లోని ప్రాంతాలెన్నింటినో కైవసం చేసుకున్న అల్లావుద్దీన్-2 ప్రపంచం తనని 'బాద్ షా'గా గుర్తించాలని ఆశపడ్డాడు. బాగ్దాద్ అధినేత ఖలీఫా ససేమిరా అనేసరికి అల్లావుద్దీన్ అహం దెబ్బ తినేసింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని వాణిజ్య సంబంధాల కోసం పదే పదే ప్రయత్నించిన చెంగిజ్ ఖాన్ ను ఎన్నో సార్లు అవమానించాడు అల్లావుద్దీన్. అక్కడికీ డిప్లొమసీ బాగా వంటబట్టిన  చెంగిజ్ ఖాన్ అవమానలన్నిటినీ దిగమింగుకుని రాయబేరానికో ముగ్గురు మధ్యవర్తులను పంపిస్తే, భవిష్యత్తులో ఏం జరగనుందో ఊహించలేని అల్లావుద్దీన్  ఆ ముగ్గురినీ రాజనీతికి విరుద్ధంగా ఉరితీయించాడు. సహనం కోల్పోయిన చెంగిజ్ ఖాన్ అల్లావుద్దీన్ స్వాధీనంలోని నగరాలెన్నిటినో నేల మట్టం చేసిందాకా నిద్రపోనేలేదు. 

 

పాలకుల వ్యక్తిగత అహంకారానికి లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు ఆ విధంగా బలికావడం చూసిన తరువాతా  భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఊహించకుండా పగ, ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానమనుకుంటే పాలకులకు ఏ గతి పడుతుందో పాఠాల్లా నేర్పేటందుకు బోలెడన్ని సంఘటనలు ఇట్లాంటివే చరిత్ర నిండా కనిపిస్తాయ్!

 

కనిపించని గుడ్డితనం (భావికాలజ్ఞాన లేమి)తో బాధపడే పాలకులు.. ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం పెంచుకోవడం పొరపాటు. మారిన కాలంలో ప్రజాస్వామ్యం వ్యవస్థ అధికార మార్పిడి అంతిమ శక్తి సామాన్యుడి చేతిలో పెట్టిన తరువాతా రాజరికాలలో మాదిరి ఇష్టారాజ్యంగా పాలకులు ప్రవర్తిస్తే హిట్లర్ కు,    అల్లావుద్దీన్-2 లకు పట్టిన గతే పట్టడం ఖాయం.

 

పాలకుడు అనేవాడు ప్రజలలో కనిపించకుండా నిరంతరం సాగే

'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు' తప్పకుండా వింటుండాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

-24 -04 -2021

 


Sunday, April 11, 2021

శతమానం భవతి… ( అభయ్) -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 



నిజానికి వరల్డ్ వార్స్ నుంచి స్టార్ వార్స్ వరకు  కాలంతో కలసి ఉత్సాహంగా కాలు కదిపితే  చాలు..  ఆ కాలాతీత జివిని  చిరంజీవి కింద జమకట్టేయవచ్చు! ఆయాచితంగా దక్కిన వరం మానవ జీవితం. అధిగమించలేని   ప్రకృతి  శక్తుల ప్రభావం గురించి ఎంత చింతించీ ప్రయోజనం శూన్యం. వీలైనంత కాలం ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్తమ సంస్కారంతో సాటి సమాజానికి ఆదర్శప్రాయంగా జీవిస్తే ఛాలు.. అదే   వాస్తవానికి వెయ్యేళ్లు మించి ఘనంగా జీవించినట్లు!  

 కానీ గరిష్ట  జీవితకాలం ఇంత అని ఒక మొద్దు అంకె రూపంలో స్పష్టంగా కనిపించాలి. పరిశోధనలకు, తుల్యమాన పద్ధతుల్లో జరిగే  పరిశీలనలకుఅధ్యయనాలకు అది ఒక ప్రమాణం (యూనిట్)గా స్థిరపడాలి.  ‘శతమానం’ మనిషి నిండు జీవితానికి ఒక ప్రామాణిక  కొలమానంగా భావించడానికి  అదే కారణం. హైందవ సంప్రదాయంలో తరచూ వినిపించే  ‘ ఓం శతమానం భవతి శతాయుః పురుష/ శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ!’ అనే ఆశీర్వాద మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం నిర్దేశించిన ఈ జీవితకాల లక్ష్యాన్ని నిరాటంకంగా చేర్రుకోవాలనే అభిలాష.  కానీ మీకు ఎన్నాళ్ళు జీవించాలని ఉంది? అని అడిగితే చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అంటో అలవోకగా ఏదో  బుద్ధికి తోచిన  సమాధానం ఇచ్చేస్తారు. ఏ ఒక్కరికి నిండు నూరేళ్లూ జీవితం పండువులా  గడపాలని ఉండదా?! 

భూగోళం పైన రష్యా, దాని పరిసర దేశాల కొన్ని మారుమూల ప్రాంతాలలో గుట్టుగా జీవించే మానవ సమూహాలకు - వందేళ్లు మించి  జీవించడం కూడా   చాలా సాధారణమైన విషయం. 'మీకు ఎన్నాళ్ళు బతకాలనిs ఉంది?' లాంటి ప్రశ్నలు వాళ్లకు నవ్వు తెప్పిసుంద'ని  పరిశోధన నిమిత్తమై వెళ్లిన ఓ జర్మన్ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం ‘లైవ్ సైన్స్’ -జూన్’2019 నాటి  సంచికలో ఓ వ్యాసం సందర్భంగా పేర్కొంది!  

వంద మీద మరో 13  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   జాబితా - గిన్నీస్  వరల్డ్  రికార్డు  వాళ్ళు  తయారు చేస్తే అందులో సింహభాగం సివంగులవంటి  ఆడంగులది.. అందులో అగ్రతాంబూలం అమెరికన్  దొరసానులది! బడాయిలే తప్పింఛి భారతీయుల తాలూకు ఒక్క శాల్తీ పేరూ ఆ జాబితాలో కనిపించదు! బాధాకరం. పక్క చైనా నుంచి నుంచైనా  ఒక్కరూ లేని మాట  నిజమే కావచ్చు కానీ అదీ కొంత ఉపశమనం  కలిగించే అంశంగా భావించడం  తగదు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు   వందేళ్లకు పైగా బతికున్నట్లు  కనిపిస్తున్నా కొన్ని   ప్రాంతాల ప్రభుత్వ పత్రాల సాధికారత పట్ల  గిన్నీస్ బుక్కు సంస్థకు అభ్యంతరాలు ఉన్నట్లు వినికిడి!  నిజానిజాలు నిర్ధారణ తరువాత కానీ తేలవు. 

వందేళ్ల బతుకు ఒక్కటే కాదు… 'చల్ మోహన రంగా' పంథాలో ఉత్సాహంగా బతకడం కూడా ప్రధానమే! 'పక్క దిగేందుక్కూడా ఎవరెక్కరున్నారా సాయానికని  దిక్కులు చూస్తూ దినాలు గడిపే కన్నా.. కాలు కింది బక్కెటను ఠక్కున తన్నేయడం మెరుగు' అంటాడు ఛార్లీ చాప్లిన్ ‘ది గార్డియన్’ పత్రిక పక్షాన రిచర్డ్ మేరీమ్యాన్ కు ఇచ్చిన ఆఖరు ఇష్టాగోష్టిలో. మైఖేల్ జాక్సన్ లా ఆడుతూ, లతా.. ఉషా మంగేష్కర్ల మాదిరి హుషారుగా పాడుతూ ఖతమయితేనే ఏ బతుకు ఖేల్ అయినా  గెలుపుకు కావాల్సిన గోల్స్ కొట్టి  పతకం సాధించినట్లు! సర్కారు పింఛన్లు పుచ్చుకుంటున్నా  కానీ ..అణా.. కాణీ కైనా కొరగాకుండా పడున్నాడ'ని  అయినోళ్లందరి నోటా 'ఛీఁ .. పోఁఅనిపించుకుంటూ ఎంత ఎక్కువ కాలం  తుక్కు బండి లాగించినా  వృథా.మన్నిక -కట్టే బట్టకే కాదు.. బతికే బతుక్కూ అవసరమే’ అంటారు స్వామి వివేకానంద! చిన్ననాటి పెద్దల గారాబం, పెద్దతనంలో పిల్లల గౌరవంగా తర్జుమా అయినప్పుడే తర్జన భర్జనలేవీ లేకుండా వందేళ్లకు మించైనా  దర్జాగా బతకాలనిపించేది! మధ్య ప్రాచ్య దేశాలలో  పది పదుల దాటినా నిశ్చింతగా బతికేయడం, ప్రాచ్యులంగా  గొప్పలు పోయే మనకు మాత్రం ఆరు పదులైనా నిండక మునుపే బతుకు ‘తెల్లారిపోవడం’! ఎందుకు ఈ తేడా?'

మనసుంటే మార్గం ఉంటుంద'న్నది మనమే మానుషులంగా కనిపెట్టుకున్న జీవనసూత్రం.  వందేళ్ల బతుకు మీద మరి  మన భారతీయ సంతతికి  అణు మాత్రమైనా మోజెందుకు లేనట్లో?! 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీర్వాదం గతం మాదిరి కాకుండా ఇప్పుడు ప్రతీ ఇంటా వృద్ధుల పాలిట శాపంగా మారడమెందుకు?! నేటి భారతీయ సమాజంలోని స్థితి గతులన్నీ నానాటికీ ఏళ్ళు పైబడే వృద్ధుల పాలిటి   వరద పోటుకు ఎదురీతలుగా ఎందుకు మారుతున్నట్లు?! ప్రభుత్వాల ధ్యాస పెద్దలపై ఒక్క ఓట్ల జాతర్లప్పుడు మాత్రమేనా?! నిన్నటి  దాకా దేశాన్ని బాధ్యతగా  నడిపించి భద్రంగా తాజా తరాలకు అప్పగించిన అనుభవజ్ఞులు   పెద్దలు. కృతజ్ఞత కోసమైనా ఆ మాతాపితర సమానుల గౌరవప్రద జీవన పరిస్థితుల   పట్ల ప్రజాప్రభువులు సంతాన భావనతో  ప్ర్రత్యేక శ్రద్ధ వహించవలసిన అగత్యం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. 

గతంలో ఒక్క నయం కాని రోగాలూ రొప్పులు, వేళకు అందని తగిన వైద్యసాయాలు  పెద్దల పాలిటి ముప్పులుగా ఉండే పరిస్థితి. మారుతున్న సమాజంలో ముసలితనానికి  మానసిక ఒంటరితనం కొత్త యమగండంగా మెడకు చుట్టుకుంటున్నట్లు  వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల  నివేదికల  గణాంకాలు నిలదీస్తున్నాయిప్పుడు! బతకడాన్ని మించి సుఖంగా బతకాలనే వాంచ మనిషిది. అందుకు సరిపడని సామాజిక పరిస్థితులు  కుటుంబ వ్యవస్థలలో కూడా క్రమంగా చొరబడడమూ  ముదుసలుల మరణాలను మరింత ముందుకు తోసే  ముదనష్టపు కారణమని ఓ అంచనా, సుఖమయజీవితం పైన క్రమంగా సడలుతున్న నమ్మకమే ముందుకు తోసుకొచ్చే ముదిమికీ ఓ ముఖ్య కారణమని భారత ఆహార సంస్థ 2017 నాటి తన వార్షిక నివేదికలో హెచ్చరించింది కూడా. 'మనవారు' అనుకునేవారు తరుగుతున్న కొద్ది యములాడితో  మనిషి చేసే సమరంలో దార్డ్యం, దైర్యం రెండూ సన్నగిల్లడం సహజ విపరిణామం. పొద్దు వాటారే మాట  తాత్కాలికంగా పక్కన ఉంచి, పడుచువారిని మించి  కొంత కాలం  మనస్ఫూర్తిగా జల్సాలలో ఉత్సాహంగా మునిగి తేలితేనో

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్ టన్  ఈ దిశగా గతంలో చేసిన ఓ పరిశోధన తాలూకు  ఫలితాలు పోయిన ఏడాది జులై నెల ‘అమెరికన్ సైన్స్’ జర్నల్ లో విడుదలయాయి. మనోవాంఛితం మనిషి శర్రీరం పైన ఎంతటి వింత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఆ పరిశోధనల ఆధారంగా మన దేశంలో ముసలివారి శాతం ఎందుకింత శరవేగంగా దూసుకువస్తుందో అర్థమవుతుంది. అనుక్షణం అద్భుతంగా సాగిన ఆ  యౌవ్వనోత్సాహ జీవితోత్సవ అనుభూతుల కారణానే   గ్రీష్మాంతంలో వసంతం ప్రకృతి కై కల్పించే కైపు ముదుసలుల మనసులలోనూ  చొప్పించినట్లు ఆ పరిశోధన తేల్చింది.  మూడు పదుల నాటి మునుపటి శారీరక పటిమ ముసలివారిలో తిరిగి పుంజుకొన్నట్లు ప్రయోగ ఫలితాల సారాంశం! మనసు చేత శరీరాన్ని నొప్పించడం కాక శరీరం చేత మనసును శతాయుష్షువుగా జీవించడానికి  ఒప్పించాలన్నది ప్రయోగం నేర్పించే నీతి పాఠం.. 'శతాయుష్మాన్ భవ' అన్న పెద్దల ఆశీస్సులు నిజం కావాలంటే 'నిండు నూరేళ్లూ ఆరోగ్యం గుండులా ఉండాల’నే సంకల్పం ముందుగా ఎవరికి వారు తమ మనసులకు చెప్పుకోవాలి.     

జీవిత లక్ష్యం ఏ   ‘షష్టిపూర్తి’  పూర్తికో  పరిమితమైతే  పొద్దు ఆ వేళకే వాటారే అవకాశం ఎక్కువని  మనస్తత్త్వవేత్తలూ మత్తుకునే మాట.  అస్తమానం చేసే భూతకాల జపం   భవిష్యత్తు పాలిట శాపంగా మారుతుందని మానసిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనుగడ అనే భావన కూడా చేటే. గాలివాటానికి కాస్త చలాకీతనం మందగించినా మరేదో ముందు ముందు ముంచుకురానున్నదనే బెంగ  ఆయుర్దాయం మీద కనిపించని  దెబ్బ వేసే ప్రమాదం కద్దు.  'నూరేళ్లు నేను మాత్రం మా మనవళ్ళు, మనవరాళ్లలా ఎందుకు హుషారుగా ఉండకూడదూ?' అనుకుంటే చాలు. అందుకు తగ్గట్లు తీసుకునే జాగ్రత్తలతో   మునిమనుమలతో కూడా  కలసి హాయిగా ఆడిపాడుకోవచ్చు.

అందుకు అనుగుణమైన  సగుణాత్మక  సంస్కరణల దిశగా దేశంలోని అన్ని ప్రజాప్రభుత్వాలు సత్వరమే స్పందించడమే ముసలివారి పట్ల ప్రజాసేవకులు చూపించే మంచీ.. మర్యాదా!  

'మీకు ఎన్నాళ్లు బతకాలని ఉంది?' అనడిగితే  రష్యా  పరిసర  ప్రాంతాల మనుషులకు మల్లేనే అప్పుడు  మన దేశం నడిబొడ్డులోనూ ముసలితరం  పెదాలపై   ముసి ముసి నవ్వులు వెల్లివిరిసేది!  

*** 

తాతయ్యలు, నానమ్మలు/అమ్మమ్మలు  అయితేనేం?

డేమ్ జూలియా జూలీ ఎలిజెబెత్ ఏండ్రూస్ ఎనభైలు దాటినా గాయనిగా, నటిగా, నర్తకిగా, కవయిత్రిగా, దర్శకరాలుగా అటు హాలివుడ్, ఇటు రంగస్థలం రెండింటి పైనా తన ప్రభ  అప్రతిహతంగా సాగించారు. 

జేమ్స్ ఎర్ల్ జోన్స్ తన తొంభైలకు రెండేళ్లు ముందు వరకు .. మన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ తరహాలో రకరకాల  పాత్రలతో ఆరు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా అమెరికన్ ఖండాలని అలరించారు. 53 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ కు తన తొంభై రెండో ఏట సారథ్యం వహించడమే కాదు, ఇంగ్లాండ్ చర్చ్ వ్యవస్థకు సుప్రీమ్ గా వ్యవహరించారు ఇంగ్లాండ్ రాణి ఎలిజెబెత్-2. బెట్టీ వైట్  వందేళ్లకు ఇంకా మూడేళ్లు ఉన్న వయసులో సైతం మనుమారాళ్ల వయసు నటీమణులను మించి చాలాకీగా బుల్లితెరపై కనిపిస్తూ గోల్డెన్ గర్ల్ గా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. తెలుగు చిత్రసీమలో అక్కినేనివారు తన తొంభైల వరకూ చేసిన వయసు ఇంద్రజాలం ప్రపంచ సినీ రికార్డులకు సరితూగేది.  హెన్రీ కిసెంజెర్ (96), జిమ్మీ కార్టర్ (94). బోట్సీ రేవిస్(91), బెండిక్ట్ XVI (92), సిడ్నీ పోయిట్లర్ (92).. అంతా తొంభయ్యో పడి దాటినా ప్రభ ఏమీ మసకబారని టాప్ సిక్స్ ప్రముఖ వ్యక్తులు.  యమధర్మరాజు  నియంతలా వచ్చి  ‘చప్పున రండు' అంటూ  పాశం బైటకు తీసినా.. ' శతాయుష్మాన్ భవ అని కదా మీ  దేవతల దీవెన మానవుల పైన! నిండు నూరేళ్లూ పండనివ్వండి స్వామీ!' అనేపాటి గుండె దిటవు చూపగల గండర గండళ్ళ జాబితాలో  ముందు నుంచి లోకానికి సుపరిచితులైన  గోర్బొచేవ్ (92) నుంచి ఇప్పటి దలైలామా దాకా(84), విల్లీ మేస్(88), క్లింట్ ఈస్ట్ వుడ్ (89), యోకో వోనో (86), హ్యాంక్ అరోన్(85).. వంటి ఎందరో కాలాంతకులు కాలు మీద కాలు వేసి విలాసంగా జీవితం గడిపినవారున్నారు.  ఏ వత్తిళ్లూ లేని సాధారణ ప్రాణులం మనం మాత్రమే మరి ఎందుకు ముందే ఏదో పుట్టి మునుగుతున్నట్లు పెట్టే బేడా సర్దుకుని ప్రస్థానానికి సిద్ధమవడం?!

***

చిరంజీవులు ఉండరు!

  'భారతం రామాయణాలలో కూడా సమానంగా కనిపించే ఆంజనేయుడికి చిరంజీవిగా వరమున్నట్లు మనం పురానాలలో చదువుకునివున్నాం, వానరులకు వారసులమని చెప్పుకునే మనం మరెందుకు కనీసం వందేళ్లైనా జీవించలేక ముందే చాప చుట్టేయడం?' అంటూ ఓ జిజ్ఞాసి శిష్యుడు సంధించిన ప్రశ్నకు వైజ్ఞానికానందులవారు సెలవిచ్చిన  వివరణ వింటే 'మహోన్నతమైన మానవ జన్మ  వరం   శాపంగా మారడంలో  ఎవరి లోపం ఎక్కడ ఎంత పాలో  ఇట్టే అవగాహన అయిపోతుంది.  

చలనమున్న ప్రతిదీ క్రమేణా నిశ్చలంగా మారడమన్నది   ప్రకృతి నిక్కచ్చిగా పాటించే జీవనసూత్రం. పుట్టుట గిట్టుటకే అనేది పుట్టలోని చెదల నుంచి చెట్టు మీది పిట్ట వరకు అన్ని జీవులకూ  సమానంగా వర్తించే కాలనియమం.  విశాల విశ్వంలో నిజానికి ఎక్కడా చిరంజీవుల  ఉండేందుకు బొత్తిగా ఆస్కారం లేదు.  ఒక వంక 'జాతస్య మరణం ధృవం' అంటూ మరో వంక ‘చిరంతన’ భావనపై విశ్వాసం ఉంచడం  తర్క బుద్ధిని వెక్కిరించడమే! మరణం అంటే ఏమిటో అవగాహన లేకనే మనుషులలో ఈ తడబాటు.

 

 

జీవజాతుల మరణానికి విశ్వంలోని అంతరంగిక నియమాలూ ప్రధాన ప్రేరణలే. సృష్టిలో మారనిదంటూ ఏదీ లేదంటున్నప్పుడు జీవానికి మాత్రం ఆ సూత్రం నుంచి మినహాయింపు ఎట్లా  సాధ్యం?  

జీవులని, నిర్జీవులని పదార్దానికి రెండు రూపాలు.  నిర్జీవ పదార్థాలతో తయారయే జీవపదార్థం ప్రాణం. ఊపిరితో ప్రాణం ప్రయాణం కొనసాగుతుంది. ఉసురు అండ ఉన్నంత  వరకు నిర్జీవ పదార్థాలు తమ ధర్మాలకు భిన్నంగా ప్రకృతి నియమాలను అనుసరిస్తూనే ప్రకృతి నియమాలను ధిక్కరించి నిలిచే సామర్థ్యం ప్రదర్శిస్తాయి. ఆ సామర్థ్యం శాశ్వతంగా కోల్పోయే స్థితి పేరే ‘మృతి’. చావు అంటే జీవం చేసిన దోషంలాగా భావించడమే దురవగాహన. 

ప్రతీ ప్రాణికీ  నిశ్చేష్టత ఎప్పటికైనా తప్పని అంతిమ స్థితి.  భూమికి ఆకర్షంచే శక్తి ఉంది. ఆ బలంతో అందుబాటులో ఉండే ప్రతీ పదార్థాన్నీ తన కేంద్రకం దిక్కుగా లాక్కునే ప్రయత్నం నిరంతరం చేస్తుంటుంది. ప్రకృతి నియమాలలో అదీ ఒకటి, ఆ నియమాన్ని ధిక్కరించే శక్తి అదే ప్రకృతి జీవపదార్థానికి ఇవ్వడమే సృష్టి కొనసాగింపులోని అసలు రహస్యం.  జీవులు కిందికి లాగే  భూమి  ఆకర్షణ దిశగా వ్యరిరేకంగా పైకి పైకి   ఎదగడం ప్రకృతి ఇచ్చిన అండ చూసుకునే!  జీవం అట్లా పైకి ఎదగడానికి బలం కావాలి కదా! ఆ శక్తిని జీవం ప్రకృతి తన సూత్రాలకు లోబడే వాడుకోనిస్తుంది. శరీరంలోని అవయవాలు వేటికవే ప్రకృతి ఇచ్చే శక్తి(చెట్లు, ఇతర జీవులు నుంచి వచ్చే ఆహారం)ని అందుకునే ఒక రూపం దాలుస్తాయి. ఎదుగుతాయి. ఇది జీవం ప్రకృతి సూత్రాలకు లోబడి ప్రవర్తించడంగా భావించుకోవచ్చు.  కానీ విచిత్రంగా అట్లా రూపుదిద్దుకున్న అవయవాలు(కొమ్ములురెక్కలు, తోకలు వంటివి) అన్నీ ఒక చట్రం(శరీరం)లోకి కుదురుకున్న తరువాత ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. అదే శరీరం మొత్తంగా ఊర్థ్వ దిశగా ఎదగడం.  అట్లా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పైకి ఎదగడానికి శరీరాన్ని ఎక్కబెట్టేది శరీరంలోని జెన్యు సంకేత స్మృతి. జెనెటికి కోడ్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.  ఈ జెన్యు సంకేతాలు శరీరంలోని డి.ఎన్.ఏ రచించి పెట్టుంచే పటం నుంచి వచ్చే ఆదేశాలే. ఈ డి.ఎన్.ఏ నిజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏర్పడ్డ  ఒక  క్రమబద్ధమైన తిరుగుబాటు వ్యవస్థ. 

డి.ఎన్.ఏ వ్యవస్థ అటు ప్రకృతిపై తిరగబడుతూనే  ఇటు తను ఏర్పాటు చేసిన జీవ వ్యవస్థ తనపై తిరుగుబాటు చేయకుండా తన అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం తంటాలు పడుతుంటుంది.  (తమ వృత్తి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వంతో పోరాడే ఉపాధ్యాయుడు తన అధీనంలో ఉన్న తరగతి పిల్లలను క్రమశిక్షణ తప్పకుండా అదుపులో పెట్టుకోవడానికి సరితూగే చర్యగా భావించాలి డి ఎన్ ఏ తంటాలు సులభంగా అర్థమవాలంటే). పరస్పరం వ్యతిరేకంగా సాగే ఈ సంఘర్షణలు తనలో కొనసాగుతున్నంత కాలం బౌతికంగా కనిపించే శరీరంలో డి.ఎన్.ఏ తాలూకు జీవ వ్యవస్థ చురుకుగా ఉన్నట్లు లెక్క. గతితార్కిక భౌతికవాదన ప్రకారం ఇదే 'వ్యతిరేక శక్తుల మధ్య జర్రిగే సంఘర్షణ(కాంట్రాడిక్షన్ ఆఫ్ అపోజిట్స్). ప్రత్యేకంగా  కనిపించే జీవచైతన్యం(స్పెషాలిటీ), ప్రకృతి సాధారణత (జెనరాలిటీ) నడుమ జరిగే  తగాదాలో సాధారణతది ఎప్పుడు పైచెయ్యి అయితే ఆ క్షణం నుంచే శరీరంలోని జీవం స్థిభించిపోయినట్లు. ఆ బొంది తాలూకు వ్యక్తి కీర్తి శేషుడు అయినట్లు! 

ఇంత కథా కమామిషు  ఉన్న ‘మరణం’ వివిధ జీవ జాతులలో వివిధ పరిమితులలో ఉంటే, మనిషి జీవితకాలం విశేషాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశం భారతదేశ వృద్ధుల జీవనపరిస్థితుల నేపథ్యంగా పరిశీలించడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం!***

(కర్లపాలెం హనుమంతరావు)

(సూర్య దినపత్రిక  4, నవంబర్, 2019 ప్రచురితం)


Saturday, March 13, 2021

నరక బాధలు- -కర్లపాలెం హనుమంతరావు - సరదా కథానిక

 







చరవాణి గణగణ మోగుతున్నది. చిరాగ్గా అందుకున్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు చిటపటలాడిపోతున్నాడు అవతలి వైపు నుంచి. 'వరదలా పోటెత్తిపోతున్నాయి మహాప్రభో మానవాత్మలు! వీటితో వేగడం నా వల్ల కావడం లేదు. న్యాయ, చట్టం, హక్కులంటూ ఏవేవో కొత్త వాదనలతో తల బొప్పికట్టించేస్తున్నాయి. మన రాజ్యాంగం మాంధాతల కాలం నాడు రాసిందట! మార్చి తీరాల్సిందేనని మఠం వేసుక్కూర్చున్నాయి నరకం ఎంట్రీ దగ్గర! కొన్ని స్వర్గ ద్వారాలకు అడ్డంగా పడుకున్నాయి!' చిత్రగుప్తుడి గగ్గోలు.

'చచ్చి పైకొచ్చిన ఆత్మల పాప పుణ్యాల విచారణ చకచకా సాగితేనే కదా.. అవి యధాలోకాలకు వెళ్లి నరకంలో జాగా దొరికేది!'

'నిజమే కానీ ఆ ఇంగితం ఉంటే ఇన్నిన్ని ఒకే సారి ఇక్కడి కెందుకొచ్చిపడాతాయి? లోపలి ఆత్మలు బైటికి పోలేక, బైటి ఆత్మలు లోనికొచ్చే అవకాశం లేక చెకింగ్ పాయింట్సు దగ్గర పెద్ద స్టార్ల కొత్త సినిమా మొదటాట ముందుండే సినీ థియేటర్లను మించి నరకంగా ఉన్నాయి మహాప్రభో! కిం కర్తవ్యం?'

'మన కింకరాధములంతా అక్కడ ఏంచేస్తున్నారయ్యా?' హూంకరించాడు యమధర్మరాజు.

'అంతా ఆత్మల గుంపు మధ్యలో ఇరుక్కుపోయారు మహాప్రభో! ఎవరు కింకరుడో, ఎవడు పాపాత్మగల నరుడో .. తేడా తెలీకుండా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఏం చెయ్యమని సెలవు? సలహా కోసమే తమరికిలా ఫోన్ చెయ్యడం!'

'సలహాదారుడి నువ్వే కదయ్యా! ఆలోచింఛమని నన్ను శ్రమ పెట్టొద్దు' కంగారుపడ్డాడు యమధర్మరాజు.

'పోనీ నేరవిచారణాల్లాంటివేమీ లేకుండానే నేరుగా స్వర్గంలోకి తోసేద్దామా ప్రభూ! ఇప్పుడీ మోడల్ న్యాయవ్యవస్థకే కింది లోకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందిమరి! స్వర్గంలో కూడా బొత్తిగా పనీ పాటా లేక ఇంద్రాదులంతా కొత్త కొత్త బాలీవుడ్ మూవీలతో ఎంజాయ్ చేస్తున్నారు'

'త్రిమూర్తులు ఊరుకుంటారా పిచ్చి చిత్రగుప్తా! ఇంద్రుడు, కుబేరుళ్లాంటి కొద్ది మంది మీదే సర్వేశ్వరుల కెప్పుడూ కరుణా కటాక్షాలయ్యా బాబూ! సందెక్కడ దొరుకుతుందా.. నన్నీ పీఠం మీద నుంచి కిందకు లాగి తొక్కిపడేద్దామన్న అక్కసు బోలెడంత మందికుంది. ఆ మంద నిశ్శబ్దంగా ఊరుకుంటుందా?త్రి మూర్తుల బుద్ధి మాత్రం తిన్నగా ఉంటుదన్న గ్యారంటీ ఏముంది? చేసిన పాపాలకు కిందా శిక్షలుండక, పైనా శిక్షలు పడక దుర్మార్గులు తప్పించుకుంటే సన్మార్గం మీద ఇంకెవరికయ్యా ఆసక్తి మిగిలుండేదీ?'

 మన సమస్యలు ఎప్పుడూ చచ్చేవేగా!'

'ఎప్పటి మాదిరి సమస్యలయితే ఎప్పట్లానే డీల్ చేద్దుము ప్రభూ! ముక్కుతూ మూలుగుతూనే విధులు పాత పద్ధతుల్లో చక్కబెట్టడం న్యావ్యవస్థలకేం కొత్త కాదు గానీ ఎక్కడైనా! ఇప్పుడొచ్చిపడే కేసులను నా కోటి పుటల చిట్టాలోని ఏ ఒక్క ఆర్టికలూ పరిష్కరించేది కాదు మహాప్రభో! అన్నదాతలను, ఆడబిద్డలను, బ్యాంకు మదుపుదారుల్లాంటి అమాయక జీవులను యదానపెట్టుకునే  పాపాత్ములకు ఎలాంటి శిక్షలు అమలు చెయ్యాలో .. కరతలామలకం నాకు. కానీ కన్నబిడ్డ చెప్పకుండా పెళ్లి చేసుకుందని కక్ష కట్టి ఇంటల్లుడిని  కోటిచ్చి మరీ చంపించిన త్రాష్టులు విచారణకొస్తున్నారు. విచారించి తగు సమయంలో కఠినాతి కఠినమైన శిక్షలు వేసే కొలువులు చేపట్టీ.. చట్టంలోని లోసుగుల్ని చూపెట్టి దోషుల్నికాపాడే దుష్టులూ పైకొచ్చేస్తున్నారు విచారణలకు. పండంటి ఇద్దరు బిడ్డల తల్లై ఉండీ.. కొత్త మొగుడు మరోడుంటేనే పండగలా ఉంటుందని పాత మొగుడి తలపండు రోకలిబండతో బద్దలేసే ఇల్లాళ్లూ ఇక్కడ విచారణకొచ్చేస్తున్నారు మహాప్రభో!  ఏ పుటలో ఏ క్రిమినల్ కోడ్ సరైన శిక్షలు  సూచించిందో చూద్దామన్నా కన్నీళ్ల మధ్య ఒక్కక్షరం ముక్క కనిపించి చావడంలేదు..'

చిత్రగుప్తుడి గొంతులోని వణుకు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోంది 'చాలా గడుగ్గాయి ఆత్మలు తమకు బదులు తమ ప్లీడరు ఆత్మలను పంపి వాదనలు చేయిస్తున్నాయి! చేయని పుణ్యాలను క్లయిమ్ చేసే క్లయింట్లు కొంత మందైతే, చేసిన పాపాలను తాము నేరుగా  చెయ్యలేదని బుకాయింపులకు దిగే రువాబు ఆత్మలు వాటికి డబుల్! చచ్చి వచ్చినవాళ్లంతా చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటే.. విచారణ ప్రారంభించడమే చచ్చే చావుగా ఉంది. మరి ముగింపుకు స్వస్తి పలికేదెప్పుడో ముకుందుడికైనా తెలుస్తుందో లేదో..'

'విచారణ అయిందాకా నరకలోకంలోనే పడుంటారు కదా! మధ్యలో నీ కేంటయ్యా బాధ చిత్రగుప్తయ్యా?'

'బసే' పెద్ద సమస్యగా మారిందిప్పుడు మహాప్రభో! నేర నిర్దారణ అయిందాకా  అందరం మహాత్ముల కిందే లెక్క. అందాకా పుణ్యాత్మలకే స్వర్గ సుఖాలకు హక్కులుంటాయో .. మాకూ అవి దక్కి తీరాల్సిందే' అనే బ్యాచి ఎక్కువయిపోతోంది మహాప్రభో! సంఘాలు కడుతున్నాయి ప్రేతాత్మలు. మన నరక చట్టాల మీద వాటికే మాత్రం ఖాతరీ లేదు. ఆ నాస్తికులతో కల్సిపోయి మన పిచ్చి కుంకలు కింకరులు కూడా సంకరమయిపోతున్నారు  అరివీరభయంకరా! ఏమి చెయ్యమని సెలవు?'

' సలహాదారుడంటే సమస్యలు ఏకరువు పెట్టడం వరకేనా? పరిష్కారాలు కనిపెట్టే పనిలేదా?' గయ్యిఁ మన్నాడు యమధర్మరాజు మరేం చెయ్యాలో పాలుపోక.

'అన్నమాట ఎలాగూ అన్నారు. మరో ఉన్నమాటా సెలవిచ్చుకుంటాను సమవర్తీ! స్థల, వ్యవసస్థలే కాదు ప్రస్తుత సమస్యలు, వనరులు కూడా క్రమంగా అడుగంటిపోతున్నవి మహాత్మా!' చిత్రగుప్తుల వారి ముక్కు చీదుడు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోన్నది.

'సర్దుకో.. సర్దుకో! కలహభోజనుడు ఇటే వస్తున్నాడు. ఆ మహానుభావుడి చెవిన గాని బడితే మన పరువు వైతరణిలో కలిసిపోడం ఖాయం' చరవాణి చటుక్కున కట్టేశాడు యమధర్మరాజు కంగారుగా.

'నారాయణ.. నారాయణ! నా మీదనేనా నాయనా వ్యంగ్యబాణాలు! నరక లోక వైతరణికి పుష్కరాలొచ్చినట్లున్నాయే.. జీవాత్మల తాకిడి ఎక్కువైందీ! చిత్రగుప్తుల వారితో సహా తమరంతా విచారణలెలా చెయ్యాలో దిక్కు తోచక  గుడ్లుతేలేసారని   ముల్లోకాల్లోనూ నవ్వుకుంటున్నారయ్యా! ముందా పరిహాసాల సంగతి చూసుకో యమధర్మరాజా!'

'సంక్షోభంలో ఉన్నాం. హాస్యానికి ఇదా సందర్భం నారదా!'

సంక్షోభం నుంచే సంక్షేమం రాబట్టుకోవాలయ్యా పిచ్చి యమధర్మరాజా! ఇన్ని సార్లు టాలీవుడ్డెళ్లి వాళ్ల టాకీలల్లో నటించొచ్చావే! భూలోక వాసులను చూసైనా నేర్చుకోరాదా?'

'సినిమాలు వేరు. పాలనలు వేరు. మాది వనరుల  సమస్య మహర్షి నారదా! భారీగా పెరిగిపోతోందిక్కడ పాపాత్మల జనాభా!నిభాయించుకురావడ మెలాగో తేలకే..'

'దీనికే ఇలా దిగాలుబడితే ఎలాగయ్యా పిచ్చిరాజా! ముందున్నది ముసళ్ల పండుగ! భూలోకంలో కరోనా అని ఓ కొత్త ముసలం బైలుదేరింది.  ఇంకో రెండు నరకాలు నువ్వు అద్దెకు తెచ్చుకున్నా చాలని పరిస్థితి..'

'బెదరగొట్టకపోతే.. బయటపడే దారేదో చూపించి పోరాదా నారాదా!'

'భూలోకాన్ని మించిన పాప్యులేషన్ టయ్యా నీ బోడి నరకానిది? దేశాలుపట్టి పోయిన వాళ్లు పోగా  ఇప్పటికీ ప్రపంచంలో అయిదో వంతు జనాభాకి భారద్దేశమే వసతిగృహం, విడిదిగృహం. జనాభానే నిజంగా సంక్షోభానిక్కారణమయితే పొరుగునున్న చైనాతో అది పోటీ పడ్డమెందుకు? వరదల నుంచి వడగళ్ల దాకా, హత్యల నుంచి  రాజకీయ కక్షల దాకా, ఎబోలా, కరోనా లాంటి రోగాలు రొప్పులతో మీ దగ్గరి కొచ్చి పడే శాల్తీల శాతమెంతో తెలుసా?ముష్టి ఒక్కటి. ఆ ఒక్క శాతానికే నువ్వింతలా  బిక్కమొగమేస్తున్నావే! తతిమ్మా తొంభై తొమ్మిది మందితో కింది లోకాలు ఎలా వెలుగొందిపోతున్నాయో .. ముందో సారి కళ్లకు చుట్టూ ఇదిగో ఈ అంజనం పులుముకుని మరీ బాగా పరికించి చూడూ!'

'అబ్బా! గొంది గొందికి బృందావనాలు! సందు సందుకీ మధ్యన సందు లేకుండా జనాల సందళ్లు! ఎవడి కడుపు చూసినా బాన షేపు, ఎవతె తలను చూసినా నెత్తిన గోల్డు కొప్పు, ఏ బుడ్డోడి జేబు తడిమినా స్మార్ట్ ఫోను, ముసిలోడి పక్కన చూసినా సింగపూరు సిగారు! ఏట్లా సాధ్యమయిందంటావ్ ఇంత అసాధ్యమైన లీల! ఒక్కసారి ఆ తారక మంత్రమూ నా చెవిన వేసి పోరాదయ్యా నారదా?'

'బావుంది. అట్లా మర్యాదగా అడిగావు కనక చెప్పబుద్ధవుతుంది. ఓ సారి నీ  చెవ్విటు పారేయ్'

'…………'

'ఆర్నీ! అదా సంగతి! అర్థమయింది  మహర్షీ.. కష్టం గట్టెక్కే పద్ధతి! 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!'  అని ఇప్పుటిగ్గాని మా మట్టి  బుర్రలకు తట్టింది కాదు. మా దగ్గర పేరుకుపోతోన్న నరాత్మలతో వనరుల సాధనెలాగో ఇప్పుడో దారి దొరికింది. '

'శుభం! ఎలాగూ జమిలి  ఎన్నికల గంట  ఏ క్షణంలోనైనా మోగవచ్చు.  ఈ మధ్యలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల సహకార బ్యాంకుల నుంచి.. రాష్ట్ర స్థాయిలో పురపాలక సంఘాలు వంటి వాటికి పోటీలు తప్పవంటున్నాయి. ఎన్నిక ఏదయినా ఎన్నో చేతులు అవసరం. బూతుల్లోపల.. బైటా కూడా చేతులతోనే అవసరం. ఓటు యంత్రం మీటలు నొక్కాలి. ఓట్ల ప్రచారంలో రాళ్లేయాలి.  గుర్రాల మీద ఎక్కించి వూరేగడం ఓల్డ్ ఫ్యాషన్. నేరుగా కొని తెచ్చుకున్న  కార్యకర్తల భుజాల మీదెక్కి ఊరేగినప్పుడే బోలెడంత కిక్కు. మొన్నీ మధ్య అమెరికా ట్రంపొచ్చినప్పుడు కూడా కోట్లాది మంది జమకూడక పోయుంటే మన పరువు గంగలో కలసిపోయుండేది. '

'ముందు భూలోకంలోని ఈ బ్రోకర్లతో కనెక్షన్లు పెట్తుకోవయ్యా!ఒక్క నరకమేంటి  మరో నాలుగు రకాల నరకాలకు సరిపడా వనరులు వాళ్లే సమకూర్చి పెడతారు. '

'ధన్యవాదాలు నారద మహర్షీ!'

'నారాయణ! నారాయణ! అన్నట్లు ఆ కమ్యూనిస్టు నారాయణ పుసుక్కున ఏదో అని ప్లానంతా పాడు చేసే లోపలే కార్యరంగంలోకీ దూకు'

***

 

Monday, February 22, 2021

(ఈనాడు ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రశకునం -కథానిక -కర్లపాలెం హనుమంతరావు-చురితం)

 

 



పున్నారావు చచ్చిపోయాడన్న వార్త చెవినబడగానే 
 కొంత మంది
'అయ్యో' అన్నారు. కొంతమంది 'అమ్మయ్య!' అనుకున్నారు. 'అయ్యో'.. ' కు అమ్మయ్య' కు మధ్యనే మనిషి సాధించుకునే కీర్తి ప్రతిష్ఠలంతా. 

పున్నారావు ఒక ముఖ్యమైన గవర్నమెంటు ఆఫీసులో అతి ముఖ్యమైన సీటులో చాలా ఏళ్ల బట్టి పనిచేస్తున్న ప్రజాసేవకుడు. గవర్నమెంటాఫీసంటున్నావు!.. పనిచేస్తున్నాడంటున్నావు.. ప్రజాసేవకుడంటున్నావు! .. ఇదెలా సాధ్యమయ్యా పెద్దమనిషీ! అని  గద్దిస్తారని తెలుసు. ఎంత ప్రభుత్వ కార్యాలయమైనా ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. ముత్తెమంత దస్త్రమయినా ముందుకూ వెనక్కూ కదిలించకపోతే ప్రభుత్వపాలన ఎట్లా నడిచినట్లు లెక్కా? అట్లా 'పని' చేసే వర్గం ప్రజాసేవకుడు కాబట్టే పున్నారావు పోయిన వార్త విన్న వెంటనే 'అయ్యో' అని కొంత మంది 'ప్రజలు' కంగారుపడింది. ఆఫీసు పనికి అతగాడు కుదిర్చిన రేటు అఫర్డ్ చేసుకునే శక్తిలేని దద్దమ్మలేమైనా 'అమ్మయ్య' అనుకోనుండవచ్చు. ఈ కథకు వాళ్లతో కాకుండా 'అమ్మయ్య' వర్గంతోనే ప్రసక్తం.ఆ 'అమ్మయ్య' అనుకున్న వర్గంలో ఇంకో రకం కూడా ఉన్నారు. వాళ్లను గురించే ఈ కథంతా!

***

యమధర్మరాజుగారు విగత జీవుల పాపపుణ్యాల లెక్కలను బేరీజు వేసుకుని  ఆత్మలకు స్వర్గమో, నరకమో మంజూరు చేస్తారన్న విశేషం అందరికీ తెలిసిందే! కాకపోతే ఈ మధ్యకాలంలో పాపుల సంఖ్య పగిలిన  పుట్టలోని చీమలకు మల్లే  పెరిగి పెరిగి నరకం నరకం కన్నా హీనంగా తయారైంది. పుణ్యాత్మల సంఖ్య మరీ పలచనయిపోయి వంద మంది పట్టే పుష్పక విమానం కూడా తొంభై తొమ్మిది మంది నిండేందుకే వందలొందల ఏళ్లు తీసుకుంటుంది. విమానం పూర్తిగా నిండితే తప్ప అది గాలిలోకి ఎగిరే ఏర్పాటు లేదు. ఎక్కువ మందిని ఒకే ట్రిప్పుల్లో తొక్కి స్వర్గానికి తోసేయకుండా విశ్వకర్మ చేసిన కొత్త ఏర్పాటది.  ఎంత మందెక్కినా ఇంకొకరికి అవకాశం ఉండే పాతకాలం ఏర్పాటు విమర్శల పాలవడం చేత విశ్వకర్మ కొత్త మోడల్ పుష్పకంలో త్రిమూర్తుల సలహా మీద ఈ తరహా ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడీ కొత్త పద్ధతే పుణ్యాత్మల ప్రాణానికి సంకటం మారిన పరిస్థితి! మన్వంతరాల తరబడి విమానం ఎప్పుడు నిండుతుందా? అని కళ్లు చిల్లులు పడేటట్లు.. ఎక్కి కూర్చున్న పుణ్యాత్మలు ఎదురుచూడడమంటే.. మాటలా మరి! కాళ్లు పీక్కు పోయేటట్లు విమానంలోనే పడుంటం కన్నా నరకం మరేముంటుంది! 'స్వర్గం పీడాబాయిరి! తెలీక పుణ్యం చేసి చచ్చాం!' - అంటూ తలలు మోదుకునే ఆత్మలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి చిక్కుపోయిన విమానంలో.

ఆత్మల ఘోష విని తట్టుకోలేక అక్కడికీ పాపాల చిట్టాలో నుంచి చాలా అఘాయిత్యాలను కొట్టిపారేయించారు యమధర్మరాజుగారు. ఇదివరకు పద్ధతుల్లోనే చాదస్తంగా పాపులను నిర్ధారిస్తు కూర్చుంటే  నరకం నడవడం ఎంత కష్టమో అనుభవం మీదట గానీ తెలిసిరాలేదు పాపం.. సమవర్తిగారికి. ఏదో  విధంగా అయినా వందో పుణ్యాత్మ దొరక్కపోతుందా అని ఆయన ఆశ. 

అందుకే ఇద్దరు పెళ్లాలుండటం ఇది వరకు లెక్క ప్రకారం మహానేరం. ఇప్పుడు.. ఆ ఇద్దర్నీ చక్కగా చూసుకుంటే పుణ్యాత్ముడి కిందే లెక్క. అబద్ధాలాడడం గతంలో పెద్ద శిక్షకు ప్రథమ దండన. ఇప్పుడు వంద కాదు.. అవసరమైతే అంశాల వారీగా  అవసరాన్ని బట్టి వెయ్యి వరకు హాయిగా ఎన్ని అసత్యాలైనా అలౌడ్. మరీ అవసరమయితే అసలు అసత్యమనేదే శిక్షార్హమైన నేరమేమీ కాదనే ఆలోచన చేసే ప్రతిపాదనా ఆలోచనలో ఉంది. సరుకుల్ని కల్తీ చెయ్యడం, శాల్తీలను మాయం చేసేయడంలాంటి పాపాలు చేసే కిరాతకులు గుడి కెళ్లి హూండీలో ఓ పదో పరకో  పడేసొస్తే చాలు.. పాప విముక్తులయే కొత్త శాసనం ఒకటి  జారీ అయివుంది. దొంగనోట్లు ముద్రించేవాళ్లూ, చెలామణీలో పెట్టేవాళ్లు ద్రవ్యోల్బణం  ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుతున్న పుణ్యాత్ముల కింద స్వర్గానికి వెళ్లే అర్హులలో ప్రత్యేక కోటాగా  ట్రీట్ చెయ్యబడుతున్నారీ మధ్య కాలంలో!  ప్రశ్నపత్రాలు లీక్ చేయించడం, దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలిప్పించడం, మారుపేర్లతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి విదేశాలకు తరలించేసెయ్యడం లాంటి అమానుష కార్యాలన్ని ఇప్పుడు విశ్వకళ్యాణార్థం నడుం బిగించి చేసే ప్రజాసేవ పద్దు లోకే మారిపోయాయి.

పున్నారావు పైసల కోసం కక్కుర్తి పడితే పడ్డాడు కానీ, ఒప్పుకున్న పనిని సాధ్యమైనంత నిజాయితీతో పూర్తిచేయడంలో నిబద్ధత పాటించే మనిషి. ఫేక్ స్కాలర్ షిప్పులు సృష్టించి ఎంతో మందిని ఆదుకున్నాడు. సర్కారు భూముల కూపీలు లాగి వాటిని తగు మొత్తంలో ప్రయివేట్ పార్టీలకు అప్పచెప్పాడు. చేసే ఏ పనిలో అయినా పిసరంత ప్రజాకళ్యాణం తొంగిచూస్తుండటంతో ఫోర్సులో ఉన్న రూల్సు ప్రకారం పున్నారావు కచ్చితంగా 'పుణ్యాత్మ' కేటగిరీలోకే రావడం న్యాయం. అందుకే పున్నారావు చచ్చిపోయాడన్న కబురు చెవినబడగానే పుష్పక విమానంలోని పుణ్యాత్మలన్నీ ముక్తకంఠంతో 'అమ్మయ్య' అనుకున్నాయి. మన్వంతరాల తరబడి విమానంలో  దిగబడిపోయిన పుణ్యాత్మలంతా ఇహనైనా తమకు విమాన విమోచనం ప్రాప్తించబోతున్నందుకు పరమానందంతో గంతులేశాయి.

***

పున్నారావు యమధర్మరాజుగారి ముందుకు రాగానే చిత్రగుప్తుడు చిట్టా తీశాడు. పై నుంచి కిందికి పుట నంతా భూతద్దాల కింద నుంచి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తృప్తిగా తల ఆడించి 'ప్రభూ! ఇతగాడిని నిస్సందేహంగా పుష్పక విమానం ఎక్కించేయచ్చు. చిత్తగింజండి!' అంటూ పుట నొక్క సారి ప్రభువులవారికి అందించారు.

యమధర్మరాజులూ ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. చివరాఖరుకు 'వందో పుణ్యాత్మ' లభించినందుకు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగింది. విమానంలోని పుణ్యాత్మలూ తృప్తిగా సర్దుకుని కూర్చుని ప్రయాణానికి సంసిద్ధమైపోయాయి. పున్నారావు పెట్టే బేడా సర్దుకుని (కొత్త నిబందనల ప్రకారం భూలోకంలో కూడబెట్టిన ఆస్తిపాస్తుల్లో ఒక శాతం వెంట తెచ్చుకునే కొత్త సౌకర్యం ఆత్మలకిప్పుడు దఖలు పడింది) గర్వంగా విమానం వేపుకేసి బైలుదేరేందుకు సిద్ధమయాడు. పైలెట్ కింకరుడు కాక్ పిట్ లో కూర్చుని చివరి నిమిషం ఏర్పాట్లవీ పూర్తిచేశాడు. ఇంజన్ స్టార్ట్ చేసి ఇహ యమధర్మరాజుగారి ఆఖరి మౌఖిక ఆదేశమొక్కటే తరువాయ  అన్నట్లు సన్నివేశం క్లైమాక్సు కొచ్చిన సందట్లో...

***

'మ్యావ్ఁ' మంటూ అరుస్తో ఎక్కడి నుంచొచ్చిందో.. ఓ గండు పిల్లి పున్నారావు ఆత్మ గుండు మీద  కొచ్చిపడింది అకస్మాత్తుగా. పిల్లి మీద పడగానే పున్నారావు గుండె గతుక్కుమంది. ఉద్రేకమాపుకోలేకపోయాడు. పక్కనే ఉన్న కింకరుడి చేతిలోని ఈటె లాక్కుని పిల్లి వెంటపడ్డాడు. పిల్లి అంటే పున్నారావుకు అంతలావు అసహ్యం.. జుగుప్స!

'ఎక్కడికైనా బయలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయితే ఆ పని ఇంకావేళ  దుంపనాశనమయినట్లే లెక్క' అంటూ చిన్నప్పటి బట్టి ఆయన నాయనమ్మ నూరి పోసిన ఉద్బోధ ఫలితం! పెద్దయిన తరువాత కూడా ఆ ప్రభావం జిడ్డు అతగాడిని అంబాజీపేట ఆవదంలా వదిలిపెట్టింది కాదు. చచ్చి పైకొచ్చిన తరువాతా అతగాడి ఆత్మను 'పిల్లి ఫోబియా' వదిలిపెట్టలేదనడానికి .. ఇదిగో ఇప్పుడు పున్నారావు ప్రదర్శించే విచిత్రమైన మనస్తత్వమే ప్రత్యక్ష సాక్ష్యం.

శరీరాన్ని వదిలి వేసిన ఆత్మకు ఏ వికారాలు ఉండవంటారు. మరి  పున్నారావు ప్రవర్తనకు అర్థమేంటి?

యమధర్మరాజుగారికి మతిపోయినట్లయిందీ సంఘటన చూసి. 'మధ్యలో ఈ మార్జాల పితలాటకం ఏమిటి మహాశయా?' అన్నట్లు చిత్రగుప్తుల వైపు గుడ్లురిమి చూశారు యమధర్మరాజుగారు.

చిత్రగుప్తుడూ యమ కంగారుతో గబగబా చిట్టా తిరగేశాడు. 'చిత్రం మహాప్రభో! ఈ పిల్లి కూడా చచ్చి ఇక్కడి కొచ్చిన మరో ఆత్మే! పున్నారావు తరువాత విచారించవలసిందీ ఆత్మనే. పిలవక ముందే ఎందుకు హాజరయిందో మరి.. అర్థమవడం లేదు!'అన్నాడు మిణుకు మిణుకు చూస్తూ. పిల్లి వైపు గుడ్లెర్రచేసి చూశారు యమధర్మరాజు.

'క్షమించండి మహాప్రభో! మీ సమక్షంలోనే న్యాయానికి ఘోర పరాజయం జరుగుతుంటే చూస్తూ గమ్మునండలేకపోయాను. తొందరపడక తప్పిందికాదు'  మ్యావ్( అంది పిల్లి పిల్లిభాషలో. యమధర్మరాజులవారికి అన్ని భాషలూ కరతలామలకం. కనక ఇబ్బంది లేకపోయింది. 'వివరంగా చెప్పు' అని ఉరిమిచూశారాయన.


పిల్లి తన గోడు చెప్పుకోడం మొదలుపెట్టింది. 'రోజూ లాగే ఆ రోజూ నేను పెందలాడే  నిద్ర లేచి ఎలుకల వేటకని బైలుదేరాను మహాప్రభో! వాకిట్లోనే ఈ పున్నారావు మహాశయుడు ఎదురయ్యాడు. 'చచ్చాంరా! ఇవాళేదో మూడింది నాకు.' అని భయపడ్డాను. పొద్దున్నే లేచి ఈ పున్నారావులాంటి త్రాష్టులను చూస్తే మన కారోజు అన్నీ కష్టాలే!' అని మా అమ్మ చెప్పేది నాకు. ముందు నేను నమ్మలేదు, కానీ, రెండు మూడు దృష్టాంతాల తరువాత నమ్మక తప్పింది కాదు. ఈ మహానుభావుడు ఎదురయిన రోజున నాకు సరయిన ఆహారమైనా దొరికేది కాదు. లేకపోతే కుక్కల బారినన్నా పడేదాన్ని ఖాయంగా. అందుకని వీలయినంత వరకు ఈ పెద్దమనిషి ఎదురు అవకుండా తప్పించుకుని తిరిగడం అభ్యాసం చేసుకున్నాను. కానీ, ఆ రోజు నా ఖర్మ కాలింది. ఒక పొగరుబోతు ఎలుక వెంటబడిపోతూ  పొరపాటున ఈ మనిషికి ఎదురొచ్చేశాను.

వెనక్కు తిరిగి వెళ్లిపొదామనుకునే లోపలే నా వెన్ను మీద ఇంత పెద్ద ఇనుపరాడ్ తో బాదాడు ఈ కిరాతకుడు.   అది తగలరాని చోట తగిలి చాలా రోజులు విలవిలాకొట్టుకుంటూ .. చివరకు.. ఇదిగో  ఇప్పటికి ఇక్కడ  ఇలా తేలాను.. తమ సమ్ముఖంలో విచారణ ఎదుర్కోవడానికి. చూశారుగా! తమరి  సమక్షంలోనే ఈ రాక్షసుడు ఎంత అమానుషంగా ప్రవర్తించాడో! అభం శుభం తెలియని నన్ను, నా మానాన నా పనేదో నేను చేసుకుపోయే జంతువును.. నిష్కారణంగా నిర్దయగా చంపిన పున్నారావును ఎక్కడ పుణ్యాత్మ కింద లెక్కేసి విమానం ఎక్కించేస్తారో అన్న  కంగారులో ఆవేశపడి మీ ముందుకు దూకేశాను. క్షమించండి!' అని మ్యావ్ మంది పిల్లి.

యమధర్మరాజుగారు ఆలోచనలో పడ్డారు.

పుష్పకవిమానం ఇంజన్ రొద పెడుతోందవతల. ఆపమన్నాడాయన.  ఒకసారి స్వర్గం ల్యాండ్ టచ్ చేస్తే గానీ ఈ ఇంజన్ ఇక ఆగదు మహాప్రభో! ఇదీ ఈ విమానం లేటెస్ట్ మోడల్ ప్రత్యేకత' అంటూ తన నిస్సహాయతను  వెల్లడించాడా పుష్పకం నడపాల్సిన పైలెట్ కింకరుడు. వందో సీటు నిండితే గాని వాయువాహనానికి ఎగిరే యోగం లేదు. చూస్తూ చూస్తూ పున్నారావును విమానం ఎక్కించ  బుద్ధేయడంలేదు దర్మవర్తికి. పిల్లి కథ విన్న తరువాత ఆయన మనసు పూర్తిగా మళ్లిపోయింది.

'ఇప్పుడేంటి దారి మరి?' అన్నట్లు చిత్రగుప్తుడి దిక్కు మిణుకు మిణుకు చూశారాయన.

'నిందితుడి తరుఫు వాదనా విందాం మహాప్రభో! అదే న్యాయం కదా మన రాజ్యాంగం ప్రకరాం!' అని విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు.

పున్నారావు పిల్లి చెప్పిన ఉదంతం  మననం చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ రోజూ ఎప్పటిలానే తాను ఆఫీసుకు బైలుదేరుతున్నాడు. ఈ దిక్కుమాలిన పిల్లే కాబోలు నా పనంతా సర్వనాశనం చేసేందుకు ఆ రోజు నాకు ఎదురుగా తయారైంది. బామ్మ చెప్పినట్లే ఇంటి నుంచి బైలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయిన రోజున పనులన్నీ సర్వనాశనమవడం ఖాయం. మూఢ నమ్మకం కింద కొట్టిపారేసేందుకు లేదు. ఒక సారైతే సరే.. ప్రతీ సారీ  పిల్లి శకునం నిజం కావడంతో పిల్లి భయం నుంచి బైటపడలేకపోయాడు తను.

ఆ రోజు ఆఫీసులో తనకు ఒక పెద్ద పార్టీతో ఫైనల్ డీలింగ్ ఉంది. దాదాపు లక్ష రూపాయల వ్యవహారం. సవ్యంగా సాగితే ముడుపు చెల్లిస్తానని దేవుడిక్కూడా మొక్కుకుని మంచి ముహూర్తం చూసుకుని ఇల్లు దాటి కాలు బైటపెట్టాడు తను.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గడప దాటి కాలు బైటపెట్టేవేళకు ఎక్కడ నుంచి తగలడిందో.. ఈ శనిగ్రహం పిల్లి సరిగ్గా గుమ్మం ముందు నిలబడి మిర్రి మిర్రి చూస్తోంది తన వంకే. కోపం పట్టపగ్గాలు తెంచుకోదా మరి ఎంతటి శాంతపరుడికైనా అట్లాంటి క్షణాలలో! అందుకే అందుబాటులో ఉన్న ఇనప రాడ్ తో వెనక్కి తిరిగి అది వెళ్లిపోతున్నా కసి ఆపుకోలేక దాని నడ్డి  మీద శక్తినంతా కూడదీసుకుని ఒకట్రెండు గట్టిగా వడ్డించుకున్నది.  ఆ దెబ్బలకే ఇది చచ్చి ఇక్కడకు వచ్చి విచారణ కోసమై ఎదురుచూస్తున్నదన్న విషయం తనకెలా తెలుస్తుంది? ఎప్పుడో మర్చిపోయిన సిల్లీ పిల్లీ ఇన్సిడెంట్  ఇది. సరిగ్గా విచారణ పూర్తయి  స్వర్గానికి వెళ్లే పుష్పకం ఎక్కేందుకు పర్మిషన్ వచ్చే చివరి క్షణంలో ఇట్లా వెనక నుంచి వచ్చి హఠాత్తుగా మీద తన మీద పడేసరికి యమధర్మారాజుగారి ముందే మళ్లీ తన పాత ప్రవర్తన బైటపెట్టుకున్నాడు! పిల్లి రంగ ప్రవేశంతో ఇక్కడా మళ్లీ ఎప్పటిలానే పని సర్వనాశనం!. ఇహ తనకు స్వర్గలోక ప్రాప్తి హుళక్కి- అన్న విషయం అర్థమయిపోయింది పున్నారావుకు. మాటా మమ్తీ లేకుండా నిలబడిపోయాడు దర్మరాజుగారి సమక్షంలో.

రెండు నిమిషాలు గడచినా పున్నారావు నుంచి తగిన సంజాయిషీ రాకపోయేసరికి మౌనం అర్థాంగీకారంగా తీసేసుకున్నారు యమధర్మరాజుగారు.

'చుస్తూ చూస్తూ ఒక కిరాతకుడిని స్వర్గానికి పంపించడం ఎట్లా? పైలట్ అవతల ఒహటే గత్తర పెట్టేస్తున్నాడు. ఇంజను ఆపటం దానిని పుట్టించిన విశ్వకర్మ తరమే కానప్పుడు ఇహ కేవలం ధర్మాధర్మ విచక్షణాధికారాలు మాత్రమే కలిగిన తన వల్ల ఎలా అవుతుంది? వందో పుణ్యాత్మను గాలించి పట్టుకునే దాకా ఈ రొద ఇలాగే సాగితే త్రిమూర్తులకు తను ఏమని సమాధానం చెప్పుకోవాలి? విమానంలోని ఆత్మలు పెట్టే ఘోషకు పిచ్చెత్తిపోయేటట్లుంది అంత లావు ధర్మమూర్తికి కూడా!

ఇన్ని యుగాల విధినిర్వహణలో ఇంత ధర్మసంకటం ఎన్నడూ ఎదురయింది కాదు! దిగాలుగా ఆయన సింహాసనానికి అతుక్కుపోయి కూర్చోనుండగా.. వందో పుణ్యాత్మ కోసమై చిత్రగుప్తులవారు చిట్టా మొత్తం తెగ  గాలించేస్తున్నారు మహా అయాసపడిపోతూ.

అయిదు నిమిషాల పాటు ఆ మహాగ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి ఆఖరులో 'హుర్రేఁ!'అంటూ ఓ వెర్రి కేక వేసేశారు చిత్రగుప్తులు.

నివ్వెరపోయి చూస్తున్న ప్రభువులవారి ముందు అమాంతం ఆ గ్రంథరాజాన్ని అలాగే ఎత్తి ముందు పెట్టి ఓ పుట వేలుతో చూపించారు.

అదీ పున్నారావు పాపపుణ్యాల పేజీనే!

ఒక్క క్షణం పాటు దాని వంక ఆసాంతం పరికించి చిరునవ్వుతో మార్జాలం వంక తిరిగి 'మార్జాలమా! ఎగిరివెళ్ళి వెంటనే ఆ విమానంలో కూర్చోమని మా ఆజ్ఞ!' అని ఆదేశించారు యమధర్మరాజు.

మ్యావ్ మంటూ పిల్లి విమానంలోకి గెంతటం, మరుక్షణంలోనే పుష్పకమూ గాలిలోకి లేవడమూ  జరిగిపోయాయి! పుణ్యాత్మలంతా సంతోషంతో కేరింతలు కొడుతుండగా పుష్పక విమానం స్వర్గధామం వైపు దూసుకుపోయింది.

కనుమరుగయిపోయిన విమానం వంక చూస్తూ పున్నారావు ఖిన్నుడయాడు. తనకు దక్కవలసిన స్వర్గవాసం చివరి నిముషంలో పిల్లి కొట్టేసింది. అయినా.. తన పాపపుణ్యాల పేజీ చూసి పిల్లి పుణ్యాన్ని నిర్దారించడం ఏమిటి? .. వింతగా ఉంది!

'యుగాలబట్టీ సమవర్తిగా కీర్తి గడించిన యమధర్మరాజులవారు నా విషయంలో సవ్యమైన తీర్పు చెప్పలేదనిపిస్తోంది!' అంటూ ప్రొటెస్టుకు దిగాడు పున్నారావు.

'మానవా! ఇది మీ భూలోకం కాదు. ఇక్కడ నీవు పనిచేసిన ప్రభుత్వాఫీసులలో మాదిరి అపసవ్యంగా  పనులు సాగవు. ఇది యమధర్మరాజులవారి న్యాయస్థానం. న్యాయం ఏ మూలన పిసరంతున్నా పసిగట్టి దానికి ధర్మం చేయడమే యుగాలుగా మేం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ధర్మకార్యం' అన్నాడు చిత్రగుప్తులవారు సమవర్తి తరుఫున వకాల్తా పుచ్చుకుని.

'నాకు దక్కవలసిన స్వర్గం సీటును బోడి పిల్లికి ఎందుకు ధారాదత్తం చేసినట్లు వివరం సెలవిప్పించగలరా?' తెగించి అడిగాడు పున్నారావు.

'నువ్వు నిందవేసినట్లు ఇది 'బోడి'పిల్లి కాదు పున్నారావ్! నీ మర్యాద మంట కలవకుండా ఎంతో కాలంగా నిన్ను కాపాడిన నీ ఇంటి దేవత' అన్నాడు చిత్రగుప్తుడు

'అదెలాగా?!' ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం పున్నారావు వంతయిందిప్పుడు.

'ఆ రోజు నువ్వు ఆఫీసుకు బైలుదేరిపోతున్నప్పుడు ఎదురైందన్న కోపంతో పిల్లిని చావగొట్టటం ఒక్కటే కాదు.. మరో ఘనకార్యం కూడా చేశావు. నీకు గుర్తుందా?'

'లేకేం! ఇహ ఆ రోజు పని తలపెడితే దుంపనాశనం అవుతుందన్న భయంతో ఆఫీసుకు డుమ్మా కొట్టి ఇంటి పట్టున ముసుగేసుకు పడుకుండిపోయాను. అయితే..'

 'అ రోజే  సిబిఐ వాళ్లు నీవు పని చేసే ఆఫీసు మీద దాడి చేశారు పున్నారావ్! నువ్వు గాని సీటులో ఉండుంటే ఏమయివుండేదో తెలుసుగా? నీ  పార్టీతో నువ్వు కుదుర్చుకున్న బేరసారాల భారీ మనీతో సహా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడుండేవాడివి. మీ నాయన చేసిన ఇట్లాంటి పరువుతక్కువ పనికే మీ అమ్మ నీ చిన్నతనంలో చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది. నీ భార్యకూ అలాగే ఏ గ్యాస్ సిలెండర్ గతో పట్టించకుండా  'పిల్లి మీద నీకు ఉండే పనికిమాలిన మూఢనమ్మకంనిన్ను కాపాడిందయ్యా పున్నారావ్!

 నీ పసిబిడ్డలు తల్లిలేని బిడ్దలుగా జీవితాంతం బాధలు పడకుండా కాపాడిన పిల్లి పుణ్యాత్మురాలా? ఉత్తి పుణ్యానికి ఒక జంతువును పొట్టన పెట్టుకుని ఎన్నో పిల్లిపిల్లలను తల్లిలేని పిల్లలుగా మార్చిన నువ్వు పుణ్యాత్ముడివా? .. ఇప్పుడు చెప్పు! ఎవరికి పుష్పకంలో ఎక్కే అధికారం ఎక్కువగా ఉంది?' అని ముగించాడు చిత్రగుప్తులవారు.

"శకునం వంకతో నిష్కారణంగా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నందుకుగాను నీకు నరకమే  గతి!.. నెక్స్ట్' అని హూంకరించారు యమధర్మరాజుగారు పున్నారావుకు మరో మొండి వాదన లేవదీసేందుకు అవకాశం ఇవ్వకుండా!

 

పున్నారావును కాలుతున్న ఇనుప స్తంభానికి కట్టేస్తూ 'వచ్చే జన్మలో అయినా ఈ పిచ్చి పిచ్చి  శకునాలు.. అవీ మానేస్తావనుకుంటా  జీవా!' అన్నాడు యమకింకరుడు వెటకారంగా నవ్వుతూ.

'ఎట్లా మానడం కింకరా? విమానం ఎక్కి స్వర్గానికి పోవాల్సిన రాత  దిక్కుమాలిన పిల్లి తగలడ్డం మూలానే కదా ఇట్లా కాలే కాలే ఇనప స్తంభాలని కావలించుకోనే గతికి తెచ్చిందీ!' అన్నాడు పున్నారావు కసి కసిగా!

***

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రచురితం)

 

 




 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...