Wednesday, February 10, 2021

భార్యావిధేయత - కర్లపాలెం హనుమంతరావు- సరదావ్యాసం - తెలుగు వెలుగు ప్రచురణ

 





విధివిధేయతకన్నా గడుసుపురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు.

భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్యమీదా, భక్తి భగవంతుడిమీదా ఉంచుకొంటే బతికున్నంతకాలం భుక్తికి వెదుకులాట తప్పుతుంది.

పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచె  అంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు.   బరువు భాద్యతలు భర్తవంటారుగాని.. వట్టిదే! భర్త బరువుభాధ్యత భార్యదే! భార్య బరువుబాధ్యత భర్తకు పడకటింటివరకే పరిమితం,

 పెళ్ళికోసం పాపం మొగాడు కలర్ఫుల్ కలలు కంటాడుగానీ .. భర్తబతుకు ఉత్తరకుమారుడికి మించి ఉత్తమంగా ఉంటుందన్న భరోసా లేదు. పెళ్లయిన ఉత్తరక్షణంనుంచే పిల్లాడికి  లక్ష్మణకుమారుడి లక్షణాలు ఆవహిస్తాయి.

బైట పల్లకీమోత సంగతేమోగానీ.. ఇంట పెళ్లాన్ని తప్పించుకొనే రాత విధాత ఏ మగవాడి నుదుటా రాయలేదు.

పెళ్లాం చెబితే వినాల్సిందే!  రాముడు అదే చేసాడు. అష్టకష్టాల పాలయ్యాడు, అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్యామణి కాళ్లు పట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా  తన తరుణి గీచిన గీత  మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బైటికి చెప్పడు!

ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తి కోసం ఆడదాని జడత్వం మీదనో.. పతివ్రతా మహత్యం మీదనో కథలు కవిత్వాలు  అల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్ళు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయికి తెలీదు!

లల్లూప్రసాదు అర్థాంగి   శ్రీమతి రబ్రీదేవమ్మగారి కథల్లోనే స్త్రీశక్తి ఏమిటో  తేటతెల్లమవడంలేదా! పోనీలే పాపమని మొగుణ్ణి తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ.. వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటిపెత్తనం.. వంటిపెత్తనం.. చివరాఖరికి.. జైలుకెళ్ళిన భర్త కుర్చీమీద కూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళికట్టించుకొన్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి. న్యాయస్థానాలు కూడా అందుకు విరుద్ధంగా తీర్పులివ్వడానికి పస్తాయిస్తాయి. న్యాయాధీశుడూ ఒకింటి ఇల్లాలి అర్థాంగుడే కదా!

 

కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్లదగ్గరుంచుకున్నట్లు బైటికి వీరబిల్డప్పే  శేషప్పశయనుడిది!  భృగుమహర్షి పాదాలు  పట్టాడని అలిగి భూలోకం తారుకున్న శ్రీలక్ష్మమ్మను  ప్రసన్నం చేసుకోడానికి  ఆ ఏడుకొండలవాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీ కావు! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే  మహావిష్ణువంతటి భగవంతుడూ అన్నేసి కోట్ల ఖర్చుకు  వెనకాడకుండా పెళ్లిపిటల మీదకు తయారవుతాడు! విరాగి.. బికారి.. అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ  సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా  ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్థాంగి  అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ.   వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మయ్య!

పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ .. తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి  'శ్రీవారు' హోదా ప్రసాదిస్తుంది స్త్రీ మూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకొని  అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషువాడికదో  చాదస్తం. మనదేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన  ఇల్లాలి అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంటాడు.. ఇంట్లో!  బైటకు చెబుతారా అన్నీ!

భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా స్వంత అభిరుచి మేరకు దుస్తులు  ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో.. రీమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు స్వంత ఇంట్లో పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ 'ఎఫ్' చానల్నైనా  మనసారా చూడగలడా! 'భోజనంలోకి ఏం చేయమంటారండీ!' అంటూ భార్యలు తలుపు చాటునుంచి  బిడియపడుతూ అడిగి.. చేసి.. వడ్డించే   స్వర్ణయుగం కేవలం ప్రబంధాలలోనే!     వంటకు వంకపెట్టటం అటుంచండి మహాశయా! భార్య బజారునుంచి కొనుక్కొచ్చిన ప్రియా పచ్చడికైనా వంకపెట్టే గుండెదైర్యం ప్రపంచంలో ఏ మొగాడికైనా ఉంటుందా.. చెప్పండి! పచ్చడి పచ్చడి ఐపోదూ ఆ రోజంతా బతుకంతా!

స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్ళు ముచ్చటపడి రాసుకొనే ఉటోపియాలు!  స్త్రీ ప్రమేయంలేని.. ముఖ్యంగా భార్యామణి హస్తాలులేని సంసారాలను ఆ విధాతకూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఉరుకోదు!

'కవులేల తమ కావ్యములలో భార్యలగూర్చి వర్ణించరు?' అని వెనకటికి  తర్కం లేవదిసింది ఓ  ఎల్లేపెద్ది వెంకమ్మగారు 'విద్యానంద'మనే పాత పత్రికలో!

(విద్యానంద- 4-1928) కాళిదాసు శకుంతలను అంత కిలికించితాలుగా వర్ణించాడుగాని..  కట్టుకున్న భార్య కట్టుబొట్టులనైనా  గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు.  శూలపాణీ అంతే! ముఫ్ఫైయ్యేడు నాటకాల్లో లెక్కలేనంతమందిని ఆడవాళ్లను  అణువు వదలకుండా వర్ణించిన శృంగారపురుషుడు!   అణగిమణగి ఉందన్న చులకనభావం  కాబోలు.. అన్న వస్త్రాలు వేళకు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు పాణిగారి దృష్టికి ఆనింది కాదు!   

తల్లులను తలుచుకొన్నవారు కొందరున్నారు. అవ్వలమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కొంతమంది కద్దు.  అన్ని దేశాలకవులు తమతమ  రాజులనే కాకుండా వారి వారి దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం  వర్ణించి తరించడం కనిపిస్తున్నదే గాని.. సొంతభార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం  ఎందుచేతనో సర్వే సర్వత్రా పస్తాయింపులే!  ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచిపద్యాలైనా సమయం సందర్భం చూసుకొని  కంచిగరుడ సేవ చేసే ఇంటి ఇల్లాలును గురించి రాద్దామన్న బుద్దే ఏ కవిమన్యుడి మనసులో కలగలేదాయ

భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్ష్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మొగాడు పైకప్పులేని తాటియాకు గూడని జర్మనీలు కూడా వంతపాడారు. అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందిటగానీ.. అనుకూలమైన భార్యమాత్రం  ఈశ్వరేచ్చే'నని చివరికి పెళ్ళికాని ప్రసాదు  జాన్ పోప్ పాలు సైతం  వాక్రుచ్చారు! మరెందుకీ మగాళ్ళందరికీ తాళికట్టిన మఃహిళ మీదంటేనే అంత మత్సరం!

'నిప్పు.. నీరు..  భార్య' అందుబాటులో ఉండే అత్యంత  అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు మగమహారాజులకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ  వళ్ళు మండితే వేడి పుట్టిచ్చేస్తుంది. కన్నీళ్ళతో వణుకూ పుట్టిస్తుంది! మగాడిదే మాయదారి బుద్ధి. చనిపోయిన అర్థాంగి మీదా ఆ మగగాడిద దుఃఖం వాకిలి గడప దాటే దాకానే! 

అందరు మగాళ్ళూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి 'కేయూరుబాహు చరితం'లో మగాడి ప్రేమకు అద్దం పట్టే ఓ చిత్రమైన కథా ఉందిభార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భం దాల్చింది. ఆ  సమయంలోనే ఊరు వాళ్ళంతా  తీర్థయాత్రలకని బైలుదేరారు. 'వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరిగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను భరిస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!' అంటూ ఆలి గర్భం తనకు బదిలీచేయించుకొని మరీ ప్రసవవేదనలు పడేందుకు సిద్ధపడతాడు.   చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి  నీళ్లాడినా.. తరువాత వాతాలు తగలుకోకుండా  పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భంమోసి బిడ్డను కని.. పెంచి పోషించేందుకు ఆడది అయిదు మల్లెల   సుకుమారి అయి కూడా ఎన్ని కష్టాలనైనా   ఇష్టంగా ఓర్చుకొంటుందో మగవాడు తెలుసుకోవాలి ముందు

నాగరీకులమని బోరవిరుచుకు తిరిగే  నేటి తరాలకన్నా.. ఆనాగరికులుగా ముద్ర వేయించుకొని హీనంగా బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవవేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకొంటాడు.

ఎరుకల కులంలో  భార్య ప్రసవించే సమయానికి  మగవాడు అమె కట్టు బొట్టులను  తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కిమంచంమీద దుప్పటి ముసుగులో  దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమయితేనే  మంచం దిగడం! బాలింత తినాల్సిన గొడ్డుకారం.. ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడు.  అండమాను దీవుల్లోని మరో తెగలో అయితే   గర్భిణీ భార్య తినకూడని గొడ్డుమాంసం, తేనెవంటి పదార్థాలు తనూ ముట్టడు.  బిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమజాతుల్లో నేటికీ ఉన్నది. పార్శీసు జాతి మగాడికి ఉయ్యాల శిక్షతో పాటు వంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బైటికి రాడు కూడా ఆ జాతిలో మగవాడు. బిడ్డ బొడ్డుతాడు ఊడే వరకు ఉపవాసాలుంటాడు అతగాడు.  ఫిలిప్పీన్ దీవుల్లో   ప్రసవించే సమయంలో  భార్య గది గస్తీ బాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుటకకు తనే కారణమన్న వాస్తవం  లోకానికి చాటిచెప్పే ఇట్లాంటి తంతులు ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈ నాటికీ నిష్ఠగా ఆచరిస్తున్నాయి!  పురిటిబాధల్లో భాగం పంచుకోవాలని  ప్రసవ సమయంలో   భార్య మంచానికి తనను తాను కట్టేసుకొనే  మియాస్ తెగ మగాడికి మించి భార్యలను  ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? 

బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించవలసిన సూత్రాలు చెరి ఐదేసి  బోధించాడు. 'భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమెకు తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు  క్రమం తప్పకుండా అందించడం భర్త బాధ్యత అన్నాడు. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్ని మించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్ప ప్రశంస మరేదీ లేదని కూడా బుద్ధుడు చురకలంటించాడు.

 

రెండు పుంజులు, రెండు పిల్లులు, ఎలుకలు, ముసలివాళ్లు, పడుచుపెళ్లాం ఉంటే  ఇంట రభస తప్పదని డచ్ దేశంలో ఓ సామెత కద్దు. ‘మగవాడి జీవితానికి రెండే శుభసందర్బాలు.. పెళ్లయిన రోజు, భార్యను పూడ్చిపెట్టిన రోజు’ అని పంచ్ పత్రిక పంచ్! ఎంత అన్యాయం! ‘నీ భార్యను నువ్వు గాడిద చేసావంటే.. ఆ గాడిద నిన్ను ఎద్దును చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!- అని మాత్రమే నేటి వనిత మగవాడిని హెచ్చరిస్తోంది.

మగవాళ్ళు తమ ఎద్దు మొద్దు స్వరూపాలు గుట్టుగా ఉండాలంటే ఆ 'గాడిద' కూతల జోలికి వెళ్ళనే  కూడదు మరి. భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల  మూడో ఆదివారం నాడు  భార్యామణిని ప్రశంసించే దినం’ (Wife Apptreciation Day) జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్ళు! ప్రశంసలు అనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగ్గా గుర్తించడం   నేర్చుకోవాల్సుంది పురుష ప్రపంచం స్ర్వే సర్వత్రా!.

ప్రతి పురుషుని విజయం వెనకా ఒక  స్త్రీ ఉంటుందంటారు కదా! ఆ స్త్రీ కట్టుకున్నది కాకపోతే ఆ పురుషుడి బతుకు ఇక ఇస్త్రీనే! ఆ సంగతి  గుర్తుంచుకోవాలి మగమేస్త్రీలు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

(తెలుగు వెలుగు మాసపత్రిక ప్రచురణ)

 

 

ఉరుము - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 


వృక్ష సంపద – ప్రకృతిచ్చిన పచ్చ’ధనం’ -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం)

 









 'నేత్రపర్వంబు హర్ష సందీపకంబు/ పావనకరంబు పరమ శుభావహంబు/

నీమహత్వంబు విబుదైక విగదితంబు/ దశదిశలయందు నీచారు ధవళకీర్తి

తనరుగావుత మాచంద్ర తారకముగ!' అంటూ హారతులు పట్టించుకున్న వృక్షసంపద ప్రాణికోటికి కోటి ప్రయోజనాల దాత . వృక్ష రహిత జీవావరణం ఊహకందటం కష్ట తరమే. 'పుటకే పుటకే మధు' అని పురాణ సూక్తి. ప్రతి పత్రంలోనూ మధురసం దాచి ఉంచి, ఆది నుంచి  ప్రతి జీవి  కుక్షి నింపుతున్నది  వృక్ష మాతే. చిగురుటాకు మొదలు.. ఎండు చితుకుల వరకు మొగ్గలు, పూవులు, కాయలు, పండ్లు, బెరళ్ళు.. ప్రత్యణువూ పరహితార్థంగ బతికే ప్తత్యక్ష దైవం వృక్షం.

'భూరుహాలూ మానవుల తరహాలో సుఖదుఃఖ అనుభవాలకు అతీతులేమీ కాదు. ' అన్నది మనువు మతం. జేమ్స్ మోరిసన్, జెసి బోసు గెల్వనా మీటరు సాయంతో నిరూపించిందీ ఈ సత్యమే.  కుఠార ప్రహారానికి విలపించిన విధంగానే.. గట్టు కట్టి నీరు పోస్తే చెట్టూ చేమా సంతోషిస్తాయి.. పుష్ప భావోద్వేగాలు ప్రధానాంశంగా సాగిన కరుణశ్రీ ఖండ కావ్యం మనకు  ఉదాహణగా ఉండనే ఉంది.   కాల గతిన గతించక ముందే చేసే వృక్షచ్ఛేదనను  ఉపపాతకంగా యాజ్ఞవల్క్యం(276) పరిగణించింది. పూర్వీకులు వృక్షాలకు దైవత్వం కల్పించి.. పూజనీయం చేయడంలోని ఆంతర్యం.. విలువైన  వృక్ష సంపద అర్థాంతరంగా అంతరార్థం కారాదనే. పరీశీలించే విశాల దృక్పథం ఉండాలే గాని ప్రాచీనుల సూత్ర బద్ధ నిబందనల చాటున దాగి ఉన్నదంతా.. నేటికి గాని నిగ్గు తేలని వైజ్ఞానిక అంశాల సమాహారమేనన్న సులువుగానే బధపడుతుంది. వరాహమిహిరాచార్యులు పన్నెండు వందల ఏళ్ల కిందటే  వృక్షారోపణ లక్షణాలను.. పుష్పాదుల వికాసానికి సహకరించే దోహద  క్రియలను గూర్చి పూసగుచ్చినట్లు వివరించారు.

మొక్కా మోడులను  పెంచడం ఒక్క ఆహారానికేనా? ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాంతానికికూడా!  వైద్యునిలా, మిత్రునిలా, హితునిలా జీవితో  సన్నిహితంగా మెలిగే తల్లి ప్రవృత్తి ప్రకృతిది. కాబట్టే అడవుల నుంచి.. అధునాతన కట్టడాల వరకు హరిత పత్ర పోషణ ఒక ముఖ్య జీవితోపాసనగా మారింది. వృక్షో రక్షతి రక్షితః.

 

వృక్షాంశం ఒక  శాస్త్రంగా పఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం  నుంచే ప్రచారంలో ఉందీ దేశంలో. కౌటిల్యుడు (క్రీ. పూ 850)  అర్థ శాస్త్రంలో ఆయుర్వేద వైద్యం విధి విధానాలు విస్తృతంగా  చర్చించిన విశేశం ఎంత మందికి తెలుసు?. వేదాలు, సంహితలు మొక్కల బాహ్య స్వరూప స్వభావాలను అత్యంత మనోహరంగా వర్ణించాయి.   ఆర్యులు ఆదరించిన సాగు పద్ధతుల నుంచి, చరకుడు అనుసరించిన వైద్య విధానం వరకు అన్నింటికీ వృక్షాలు, మొక్కలు, మూలికలే ప్రధాన ఆలంబన. వాల్మీకి రామాయణం ఒక వృక్ష వైజ్ఞానిక గ్రంథం.  సుందర కాండలో లంకానగర ఉద్యాన వనాలు, కాళిదాసు మేఘసందేశంలో అలకాపురి వృక్షాలు  రుతుభేధం లేకుండా పుష్పిస్తాయి. లక్ష్మణ స్వామి మూర్చ బాధకు సుషేనుడు  సంజీవ పర్వత ఓషధులతోనే చికిత్స చేసింది. యుద్ధ కాండలో ఆయుధ ప్రహారాల నుంచి గాయపడకుండా తప్పించుకునే నిమిత్తం  మహాపార్శ్వుడు, మహోదరుడు ఓషదులను, నానావిధ సుగంధాలని దేహానికి పట్టించడం విశదంగా వర్ణించడం ఉంది. శిఖరాగ్ర వృక్షాల  బెరళ్లలోని శిలీంద్ర జాలం పొడి  వర్ష ధారలకు తడిసి శరద్రాత్రుల్లో మెరుస్తుంటుంది. అధిక మోతాదుల్లోని  భాస్వరం ఈ రసాయనిక చర్యకు ప్రేరణం. హిమవత్పర్వతం మీద ఓషధులు  వెదికే  ఆంజనేయుడి దృష్టి నుంచి  'సందీప్త సర్వౌషధ సంప్రదీప్త'మూ దాటి పోలేదు! అణ్ణామలై విశ్వవిద్యాలయం మాజీ వృక్షశాస్త్రాచార్యులు టి.సి.ఎన్. సింగ్  శబ్ద తరంగాలతో భూమి పొరల ద్వారా మొక్కల్లోని ప్రత్యుత్పత్తి కణజాలాన్ని ఉత్తేజపరిస్తే సత్వర పుష్ప వికాసం  సాధ్యమేనని నిరూపించారు.  స్రీ పాద తాడనంతో అశోకం, ఆలింగనంతో గోరింట, నమ్ర వాక్యాలతో కొండ గోగు అకాలంలోనూ పుష్పిస్తాయని కాళిదాసు, శ్రీహర్షుల కృతుల్లోనూ ఉండటం తెలిస్తే నవీన తరం ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుడుతుందేమో! కాళిదాసు శృంగార మంజరిలోని 'పూవు నుంచి పూవు పుట్టే' వింత నేడు గులాబీ, జినియా జాతి  బంతి పువ్వుల్లో  కనిపిస్తుంది. ధూర్జటి 'కాళహస్తీశ్వర మాహాత్మ్యం' లోని ఓ చెట్టు  ఆకులు తటాక జలాల్లో పడ్డవి  జలచరాలుగాను,  గాలిలో తేలేవి పక్షులుగాను, వడ్డుకు అటు ఇటుగా  పడ్డవి ఉభయచరాలుగానూ మారే విడ్డూరం వర్ణీంపబడింది. ఈజిప్టు, రోము, గ్రీసు నగరాల తవ్వకాలలో బయట పడ్డ కొన్ని చిత్రాలు ఇదే వింతను చిత్రీకరిస్తుంటే ఆ అద్భుతానిని ఏమనిపిల్చుకోవాలి?! అయినా నాటి కవుల వృక్ష పరిజ్ఞానాన్ని సాటి పాశ్చాత్యులతో కలసి  మనమూ  వెటకరిస్తున్నాము! పెరటి చెట్టంటే మరి అంత చులకన కాబోలు!

రావిలోని రాగి తేజోకారి. బావి నీటిని  సైతం ఆవిర్లెక్కించే ఉష్ణకారి.  పగలు ప్రాణ వాయువు, రాత్రి బొగ్గు పులుసు  విడిచే గుణం వేప చెట్టుది. చింత గాలి వంటిసున్నానికి బద్ధ విరోధి.  అశ్వత్ఠం వృక్ష జాతుల్లోకెల్లా అత్యుత్తమమైనదని  గీత ధృవీకరిస్తున్నది. చెట్లు విడిచే గాలి వంటికి  తగిలే చోట నివాసముంటే చాలు.. సగం ఆరోగ్యం సర్వదా వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లే నంటున్నారు  ఆరోగ్య శాస్త్రవేత్తలు. రష్యన్  వృక్ష శాస్త్ర పరిశోధకులు దక్షిణ భారతాన దొరికే అత్యంత అరుదైన ఆరువేల  రకాల మొక్కలను, వెయ్యి రకాల విత్తనాలను  పరిశోధనల నిమిత్తం పట్టుకు పోయారు. అయినా మనకు చీమ కుట్టినట్లైనా లేదు! మనకు చెట్టంటే పట్టదు! కార్తీక మాసం సంబరాల్లా  వనభోజనాల సందళ్ళు సాగే కాలం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన.. సామూహిక  భోజనాలు ఓ ఆచారం. కాలుష్య రహిత హరిత వనాల్లో పవిత్ర ఔషధ పరిమళాల మద్య చేసే విందు ఆరోగ్య కోణం  వైద్యుల  ప్రశంసలు అందుకుంటోన్నది. 'జిరుత వాయువులను దెచ్చి చెమట లార్చి/ చల్లదనమిచ్చి సుఖమిచ్చి సత్వమిచ్చి/కౌతుకము నిచ్చి బుద్ధివికాస మిచ్చి/యతిధి కభ్యాగతికి మరియాద వెలయ/నాదరము జూపు మంచి గృహస్థు'నితో పోల్చాడు వృక్షరాజ్యాన్ని వెనకటికి ఓ ప్రకృతి ప్రేమికుడు. వివిధ  విలయాలకు ఇప్పుడా వృక్షాలు లక్షలాదిగా    నేలకూలుతున్నాయి. . పచ్చదనం తగ్గి నేల తల్లి కళ తప్పివున్నది. వనాలే లేవు .. వన భోజనాలు ఎక్కడని ఇప్పుడు  జనాల బెంగ. నిరుత్సాహం చికిత్స కాదు గదా! విలయాల అనంతరమైనా చెట్టు ఘనత మనకు తెలిసి వచ్చింది కదా! సంతోషం. కూలినంత వేగంగా వృక్ష జాతుల్ని తిరిగి నాటే ఉద్యమానికి ప్రభుత్వాల చేత శ్రీకారం చుట్టించాల్సింది ఓట్లు వేసి గెలిపించుకున్న జనతే. ఆనందం, ధృఢ సంకల్పంతో చెట్లు నాటే కార్యక్రమంలో జనమూ స్వచ్చందంగా చొరబడితే కోల్పోయిన పచ్చ'ధనా'న్ని తిరిగి సాధించడం ఎంత సేపూ?

***

(ఈనాడు సంపాదకీయం)

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు- వేటూరి ప్రభాకర శాస్త్రి గారు-

 

తాటి చెట్టు ఆంధ్రుల కల్ప వృక్షం. తాటాకు చుట్టతో కట్టడాన్ని బట్టి తాళికి ఆ పేరు వచ్చిందిస్త్రీ కర్ణ భూషణాలు తాటాకు కమ్మలుతాటి తోపులు ప్రతిగ్రామంలో తప్పని సరి.యనభై తొంభై ఏళ్ళ వయసుగల వారి చేతే తాటిగింజలు నాటించేవారు ఊరి పెద్దలు.తాడి కాపు పట్టే లోపు మరణం తప్పదన్న భయం కారణం.పదిహేనేళ్ళకు గాని తాటి కాపు పట్టదు.' ముత్తాడి' అంటే మూడు తరాల తాడిని చూచిన మొనగాడని అర్థం.తను నాటిన తాటి కాపుకు పండు పడితే దాని గింజను మళ్లా నాటి మళ్లా దాని పండునూ నాటి అది కాపుకు వచ్చినదాకా నూకలు చెల్లకుండా ఉన్నాడంటే వాడు నిజంగా దీర్ఘాయుష్మవంతుడేగా! 

నేల  నాణ్యతతో  చదునుతో తాటికి నిమిత్తం లేదు.నీటి వసతి అక్కర్లేదు. విస్తీర్ణం తక్కువున్నా ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు.నాటిన మూడేళ్లకే ఆకులు మట్టలు ఉపయోగానికి వస్తాయి. కట్టుబట్ట మినహా మిగతా జీవితావశ్యక వస్తువులన్నీ తాటి చెట్టునుండి సేకర్ంచుకుని జీవయాత్ర గడుపుకున్న రోజులు ఉన్నాయి. గుడిసెకు నిట్రాడ దూలం.గోడల కొంపకైతే తనాబీలు దూలాలు, స్తంభాలు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు, అన్నింటికీ తాటిచెట్టు ఆటి వస్తుంది. కట్టడానికి తాటనార. ఇంట పడకలకి తాటియాకులుసామానుల భద్రానికి తాటి పెట్టెలు, బుట్టలు. తాటి డొక్కుతో నీరు తోడే చేద. నారతో చేంతాళ్ళు సరే సరితాటి మ్రానులు రెండుగా చీల్చి నీళ్లు పారే దోనెలుగా వాడుకోవచ్చు. తాటి ముంజెలు, తాటి పండ్లు, తాటి(నిలవ చేసిన పేసము) చాప, బుర్రగుంజు, తాటి తేగలు, తాటి బెల్లం, తాటి కల్కండ, తాటిపానకం, తాటి కల్లు వమ్టికి మేలు చేసే మంచి ఆహార పానీయాలు.

(ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు-వేటూరి ప్రభాకర శాస్త్రి గారు- భారతి- -46-6-1)

-సేకరణ; కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

10 -02 -2021

 



నమస్తేలోనే ఉంది సమస్తం

 

-కర్లపాలెం హనుమంతరావు

10 -02 -2021

 

నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.

న ‘మస్తే’ అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను  ఆడిపోసుకోవడమే అదంతా! 

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవ్వంత కార్యలాభం కలిగింది కాదు.   ఆలస్యంగా వచ్చినా  నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన పాండవ మధ్యముడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇట్లాంటివే ఏవో  దండకాలు.. స్తోత్రాలు చదివినందు వల్లనే   ఆ గాండీవుడి అర్థాంగికీ  రుక్మిణీవల్లభుడి సహోదరత్వం అండలా లభించింది. అందుకే,  ‘ఆఁ! దండాలూ దస్కాలా!’ అంటూ వెక్కిరింపుకలొద్దు! ఆ మస్కా జాతి  ట్రిక్కే ఎంత కోన్ కిస్కా గొట్టాన్నైనా ఇట్టే గుప్పెట్లో పట్టేసుకునే పట్టు!

రామాయణమే ప్రణయాంజలి ప్రభావాలకు పరమ  ప్రమాణం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అట్లా నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకు మించిన అపూర్వ గౌరవం ఆంజనీ పుత్రుడు కొట్టేసింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ సాగిలపడబట్టే కదా  ఆపదల మడుగు నుంచి గట్టెక్కగలిగింది    కరిరాజు గజేంద్రమోక్షంలో!

అదే చాయలో పోబట్టే అప్పట్లో మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వంసారూ.. అమ్మవారి అనుగ్రహం అమాంతం కొట్టేసారు. జయామ్మాళ్ ఆ రోజుల్లో  సర్కారువారి సత్కార గృహ(జైలు) యాత్రకెళ్ళినప్పుడల్లా  పన్నీరువారు ముఖ్యమంత్రి పీఠానికి ముఖ్యమైన  కాపలాదారు! ఆ తరహా ఎక్స్ట్రా లాభాలకు ఎల్ల వేళలా నమస్కార బాణాలే బ్యాగ్రౌండు నుంచి బాగా వర్కవుటయ్యేది కూడా.. బయటికి కనిపించవు కానీ!

స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలవీ  పెట్టుకోడం కూడదు. 'నమో నమః' అంటూ సాష్టాంగ ప్రమాణాలు  ఆచరించకుంటే ఆ తరువాత జరిగే చేదు అనుభవాలకు ఎవరికి వారే బాధ్యులు.. యడ్యూరప్పే అందుకు గొప్ప  ఎగ్జాంపుల్!

పది తలలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకునే  విద్య అలవడకే  అంత లావు రావణుడూ   రాముడి ముందు పిట్టలా రాలిపోయింది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ జాతి పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ  దాసోహం రాజకీయాలకు దాసోహం అనకపోవడమే!  రాక్షసులకు  తెలియని చమత్కారం మన రాజకీయ పక్షులకు మా  బాగా తెలుసు.  లేకుంటే మన ప్రజాస్వామ్యం  మరీ ఆర్ట్ మూవీకి మల్లే బోర్ కొట్టదూ!

కడుపులో ఎంత కంటయినా ఉండుగాక.. ఓ యాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  గోజుతో కరిపించినట్లు గాలిలో అట్లా ఊపుతూనే ఉండాలి.  జైలుకు వెళుతూ వస్తూ కూడా మన నేతాశ్రీలు పళ్ళికిస్తూ గాల్లోకి అలా వణక్కాలు గట్రా  వదలడం చూస్తున్నా .. ఇంకా వందనాల విలువను గూర్చి సందేహాలేనా! మీ కో నమస్కారం!

ప్రణామాలకు, వాగ్దానాల మాదిరి  కాలపరిమితి బెడద లేదు! నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి పైసల్తోనూ బొత్తిగా నిమిత్తం లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ లేకుండానే రెక్కల్లో ఓపిక ఉన్నంత కాలం వాడుకుని ఆనక వదిలేసే  సౌకర్యం ఒక్క చేతుల జోడింపులోనే కద్దు. చెప్పిందేదీ చెయ్యకుండా  చెయ్యిచ్చే నేతలు సైతం ఈ  చేవిప్పులు(నమస్కారాలు) కెప్పుడూ చెయ్యివ్వని కారణం ‘చేవిప్పు’ మీద ‘విప్’ జారీ చేసే అధికారం ఏ పార్టీ ‘వివ్’  లకూ  లేకపోవడం!

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  నరేంద్ర మోదీకి కలిసొచ్చే  అంశాల్లో  ప్రధానమైనది కుదించి పలికే ఆయనగారి పొట్టి పేరు ‘నమో’ ! ఓ వంక దెప్పుతూనే మరోవంక 'నమో.. నమో' అనక తప్పని  తలనొప్పులే  ప్రతిపక్షాల కెప్పుడూ.. పాపం పిటీ! 

పబ్లిగ్గా ఎంత పడతిట్టిపోసుకున్నా శాల్తీ కంటబడ్డప్పుడు ఏ సంకోచం లేకుండా కల్తీ లేని ‘నమస్తే’ ముద్రొకటి అభినయిస్తే చాలు.. సగం అభిప్రాయభేదాలు సాల్వ్ డ్! ప్రధాని మోదీ ఓం ప్రథమంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిప్పుడు సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి సాధించిందీ అదే!  ఎవరి బాణీలో వాళ్ళు  నమస్కార బాణాలు సంధించుకుంటూ సరికొత్త విదేశీ సంబంధాలకు బోణీ కొట్టడం!

జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డ మీద  కాలు పడ్డా.. మన ప్రధాని మోదీని ఆదుకున్నవీ మొదట్నుంచీ చేతులే! తంపులమారి ట్రంపయినా   తప్పించుకోలేని అట్రాక్షన్ ప్రణామంలో ఉంది. 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ ఆ త్యాగరాజయ్యరువారంతటి వైతాళికులు ఊగిపోయారు. ఆరోగ్యాన్నిచ్చి, బంధుకృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు అనే గదా ఆ పై నెక్కడో ఉండే  సూర్యుణ్ణి కూడా భగవానుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో రెండు పూటలా అలా పడీ పడీ సూర్యనమస్కారాలు చేసుకోడం!  

అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పదిమందిలో గుర్తింపు తెచ్చిపెట్టే  లోకబాంధవి నమస్కారం.  నిజానికి పడమటి ‘హాయ్.. హలో’ లకు మించి  ఇవ్వాలి ఈ నమస్కారానికి మనం గౌరవం. అందుకు విరుద్ధంగా లోకువ కట్టేస్తున్నాం.. అదీ విడ్డూరం! 

ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే తెలిసుండేది మన  వందనాల విలువ.  ఖర్మ కాలి ఏ ఒసామానో  కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకు చావాల్సొచ్చేదక్కడ.  రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నామధేయాలండీ నమస్కారాలకు  మన పుణ్యభూమిలో!  'నమస్తే' అంటే 'వంగటం' అన్న ఒక్క  పిచ్చర్థం  మాత్రమే తీసుకుని పెడమొహం పెట్టేస్తే ఎట్లా?  పూరా నష్టపోతాం కదరా ఉన్న ఒక్క  ప్రపంచ స్థాయి గుర్తింపు  పిచ్చిగా వద్దనుకుంటే  సోదరా!

 అమెరికా అధ్యక్షులు ఎవరు ఇండియా వచ్చినా,  వెళ్ళిన  ప్రతి చోటా అదే పనిగా 'నమస్తే'లు కుమ్మేస్తారు. బిలియన్ డాలర్లు విలువ చేసే  బిజినెస్సులతో దేశీయ మార్కెట్లను  కమ్మేస్తారు.  

మనలను ఏలి పోయిన తెల్లవాడిదే తెలివంటే. మన నమస్కారమే మన పైన గడుసుగా సంధించేసి మన రాజుల్ని, నవాబుల్ని బుట్టలో వేసేశాడు! ఇంగ్లీషు వాడి  నమస్తేకి  పదిహేను వందలేళ్ల  గ్రంథం ఉంది. అదంతా మొదలు పెడితే ముందు మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు!

తూర్పు పడమర్లు, ఉత్తర దక్షిణాలనే తేడా ఏముందిలే కాని

నమస్కారాన్ని కనిపెట్టిన మహానుభావుడికో నమస్కారమైతే.. దాన్నో ఆయుధంలా వడుపుగా వాడేసుకునే తాజా రాజకీయాలకు  వందలొందల నమస్కారాలు!


నమస్కారాన్ని నమ్ముకున్న వాడెన్నటికీ చెడే ఆస్కారం లేదు. 'దండమయా విశ్వంభర.. దండమయా పుండరీక దళనేత్ర హరీ..  దండమయా ఎపుడు నీకు.. దండము కృష్ణా!' అంటో దండక శతం ఆపకుండా గడగడ చదవ గలిగే గడుసు పిండానికి ఏ గండాలు రావు.  వచ్చినా రామచంద్రుడి ముందు   సముద్రుడంతటి వాడొచ్చి సంధించిన  బాణంలా అవి తీరం దాటి ప్రళయం సృష్టించబోవు.

గూగుల్ నుంచి ట్వట్టర్ దాకా  ‘నమస్కారం'   సృష్టిస్తోన్న  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యాల మీద సవాలక్ష సందేహాలంటే.. బాబూ .. తమకో నమస్కారం!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


Monday, February 8, 2021

ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్- కామెడీ కథ - కర్లపాలెం హనుమంతరావు

 


టీఈ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చిందిఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది

ఐదు నక్షత్రాల ఆసుపత్రిఅనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ uసోపులమీదున్న  అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది

ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు  రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయిందిదైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్ననాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ'ని

'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లుఅన్నాదు దేవుడుదేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు

'ఎలాగూ  మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదాఇంకా ఈ ముడతలుబడ్డ ముఖంబాన కడుపుముగ్గుబుట్ట జుట్టుబోసి నోరువంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలిమానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందాఅందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందాఅన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉందిఅడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం  తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.

గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్ఫ్యాట్ సక్కింగ్ప్లాస్టిక్ సర్జరీడెంటల్ రికవరింగ్హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి  టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారుపది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు  రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.

ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా  విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రొడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.

మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదుభగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికికడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ  దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎలాగయ్యాముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.

'సారీ!రాంబాయమ్మగారూలారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదుఅని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!

- కర్లపాలెం హనుమంతరావు 

( చతుర్ మాసపత్రిక ప్రచురణ ) 

***

రామాయణం- ఒకే కవి విరచితమేనా? -కర్లపాలెం హనుమంతరావు



యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మ అన్న మాట.  బ్రహ్మవాక్కు అనలేము కానీ..  రామాయణం అంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు.  ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో  తీర్చిదిద్దిన కథ ఆదికావ్యం రామాయణంలోనిది.  పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను    ఆకర్షించే గుణం రామాయణంలో ఉంది.

వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును బాలరాముడు సునాయాసంగా  విరవడంలాంటి అతిమానుష  సన్నివేశాలు రామాయణం నిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిగిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని  మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు    దండిగా ఉండబట్టే రామాయణం ఒక చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రికను మించి  చర్చనీయమయింది. 

 

శతాబ్దాల బట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు   చెయిచేసుకున్న కథ  రామాయణం. ఆ కారణంగా  భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమవడం సహజ పరిణామం.

అయితే వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథ దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి  రామాయణంలోని అన్ని భాగాలూ ఒకే కవి (వాల్మీకి) విరచితాలని కూడా గట్టిగా చెప్పేందుకు లేదు. ఒక కవి పుట్టించిన కావ్యం మరో కవి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరంతమంది కవుల  ప్రక్షిప్తాల హంగుల్ని సంతరించుకున్నదన్న వాదన ఒకటి బలంగా ప్రచారంలో ఉంది.  

‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న  బాల కాండ (2.1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో (తనను గురించి తాను)వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో వర్ణించుకోవడం కొన్ని  సందేహాలకు తావిస్తుంది, తరువాతి శ్లోకాలలో కనిపించే   భగవాన్ (బాల 2.9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2.17) వంటి స్వీయ ప్రశంసలతో ఈ సందేహం మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునేటంత తక్కువ స్థాయి సంస్కారం వాల్మీకి మహర్షి ప్రదర్శించడం ఏ వివేచనపరుడినైనా ఆలోచనలో పడవేస్తుంది కదా! 

క్రౌంచపక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ ఛందస్సులో ఉండటం, తదనంతరం అదే ఛందస్సులో రామాయణం చివరి వరకు కథనం చేయాలని కవి సంకల్పించినట్లు చెబుతారు. కానీ వాల్మీకి రామాయణ శ్లోకాలలో అనుష్టుప్ ఛందస్సుకు భిన్నమైన ఛందస్సూ కనిపిస్తుంది! అనంతర కాలంలో వేరే మరి కొంతమంది కవులు  ప్రక్షిప్తపరిచిన శ్లోకాలగా వీటిని విశ్లేషించే సాహిత్య విమర్శకులూ కద్దు!    

నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలో, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలో బాలకాండకు సంబంధించిన కథ ఏమంత విస్తారంగా ఉండదు. ఆదికావ్యం పేరున ప్రాచుర్యంలో ఉన్న రామాయణ  బాలకాండలో  అప్రస్తుతం అనిపించే కథాభాగమంతా వాల్మీకేతరుల ప్రక్షిప్త నై’పుణ్యం’గా అనుమానించే విశ్లేషకులూ లేకపోలేదు. 

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగని  భ్రమించి వధించిన బాలకుడు ఒక శూద్ర తపస్వి కన్నకొడుకు. ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూస్తే ఇతిహాసాల నిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన ఉదాహరణలు  పుష్కలంగా కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ ‘శంబూక వధ’ కథలో తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వస్తుంది. కృతయుగంలో బ్రాహ్మణులు,  త్రేతాయుగంలో  అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు,  కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులయిన్నట్లుగా ఒక విశ్వాసం ప్రచారంలో ఉంది. అందుకు విరుద్ధంగా త్రేతాయుగంలోనే  దీక్షకు దిగినందున ‘శూద్ర’ శంబూకుడు వధ్యార్హుడయినట్లు ఒక  వాదన ఒక వర్గంవారు ముందుకు తెస్తున్నారిప్పుడు. పిట్టల మీద వడిసెలరాయి ఎక్కుపెట్టినందుకే కిరాతకుడి మీద కృద్ధుడైన రుషి  వాల్మీకి. అటువంటి సామాజిక తత్త్వవేత్త వర్ణార్హతల ఆధారంగా ఒక నిర్దోషి మానవుడి వధను సమర్థించే విధంగా కథ రచించాస్తాడంటే  నమ్మబుద్ధికాదు.  తదనంతర కాలంలోనే వాల్మీకేతర కవులెవరో తాము నమ్మిన విశ్వాసాలకు ప్రామాణికత ఆపాదించుకొనే నిమిత్తం అప్పటికే సామాజికామోదం పొందిన వాల్మీకి రామాయణంలో ఈ తరహా కథలను చొప్పించినట్లు అభ్యుదయవాదులు అభియోగిస్తున్నారు.  

మొదటి రామాయణ కర్త వాల్మీకి రామునికి సమకాలీనుడని  భావన! కథ జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడా?   హేతువుకు దూరంగా లేదా ఈ ఆలోచన? కావ్యారంభంలో వాల్మీకి తయారు చేసుకున్న కథాగమన ప్రణాళికలో ఉత్తరకాండ కూడా ఉంది కదా అని వాదించ వచ్చు. కానీ ఆ సర్గలో సైతం మార్పులకు అనుగుణంగా   చేర్పులు చేయడం ఏమంత కష్టం?

లంకాధిపతి విశిష్ట వేదపాండిత్యమున్న   పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధుల మీద విశ్వాసమున్న వ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నత కోరుకుంటాడా?! పోనీ పౌలస్త్య వంశజుడు రావణుడు రాక్షసుడు. అసురుడుగా జరిగిన ప్రచారం చరిత్ర దృష్ట్యా  దోషం’ అనుకుందాం. కానీ సుందరకాండలో దానికి విరుద్ధమైన భావం (సుందర 20. 5-6) పొడగడుతుందే! మనసు దిటవు పరుచుకొనేటందుకు వీలుగా   ఎత్తుకొచ్చిన స్త్రీకి ఒక సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని ఆడదానిని భక్షించడం ఆదిమజాతుల్లో తప్పుకాదు. రాక్షసజాతికి చెందినవాడు కాబట్టే రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడు గానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనినట్లు కనిపించదు! ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి  ఆదర్శనీయమైన భావన రాక్షసుడిలో! ప్రధానపాత్రలలోనే  ఇన్ని పరస్పర వైరుధ్యాలున్న నేపథ్యంలో రామాయణ రచన ఒకే కవి చేతి మీదుగా మాత్రమే సాగిందనుకోవడానికి మనసొప్పడంలేదు.  

ఆచారాలనుబట్టి, భాషలనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారు అయివుండవచ్చని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు)  ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. రామాయణంలోని లంక, జన స్థానాలకి  ‘లంకాన్, జైతాన్’ అనే సవర పదాలు  మూలాలని రామదాసుగారు  ఊహిస్తున్నారు. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి  చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ప్రతిపాదన. దండకారణ్యంలో  విశేషంగా నీరు ఉండబట్టే  అరణ్యకాండ (11. 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అనే శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలం మీద రకరకాల పుష్పాలు, ఫలాలు,  పక్షుల రవాలు,  హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’నే వర్ణనకు  అతికినట్లు సరిపోతుంది.

చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉన్నాయి! 

చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన  భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో  పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం  వానరజాతి నాగరికలక్షణ విశేషాలు. అభివృద్ధిపరంగా  ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు  ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయినట్లు? నమ్మదగ్గ  అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేమనుకోండి.  కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా  లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ.  అదో  వింత!

రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడ్డారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా  కాలక్రమేణా అది గద్దగా  ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని  పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా? 

ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని  ఉరోవన్ అనే ఒక  శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్  తీరం ఖరమండలం అనే మూలపదం  నుంచి ఉద్భవించింది.  రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే  కావచ్చన్న రాయ్ గారి  అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది.

‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా.  ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది!  రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?

ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ  సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా  గోరంత వాస్తవికతకు  కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి  ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో  ఓ అందమైన కావ్యానికి సరిపడినంత  సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో  ఆ కావ్యంలోకొచ్చి పడ్డ  ప్రక్షిప్తాల తంతు  సరే సరి! 

అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం  ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత! 

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని  ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక  పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబు కూడా కాదు.  

సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో  చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన  విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.

కర్తృత్వం సంగతి కాసేపు పక్కన ఉంచుదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ర పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ ఎవరైనా కానీయండి ఒక కవిశ్రేష్టుడు  మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని   తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు.  పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం.  కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి.  ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం.  వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ. 

మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడులేని ఊరులేదు. రామకథ వినబడని పుణ్యస్థలం లేదు. సీతారాముల్ని చిత్రించని  కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం.   దేశదేశాలలో, పలు భాషలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధ సుమం. 

ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే  మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి   ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ 

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; యూఎస్ఎ

09 -02 -2021 


సంప్రదించిన కొన్ని రచనలుః

వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు

రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు

రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి

రామాయణమునందు వానరులు ఎవరు? - గో. రామదాసు

రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya


కర్లపాలెం హనుమంతరావు


స్త్రీ మనస్తత్వం- కర్లపాలెం హనుమంతరావు సేకరించిన చిన్న కథ



ఇప్పుడే ఒక  తమాషా బైబిలు కథ చదివాను. చిన్నదే కానీ చమత్కారం పాలు ఎక్కువ.

ఏదెను ఉద్యానవనంలో నడుస్తుండగా పాము ఒక ఆపిల్  ఇచ్చి 'తిను! నీ ప్రియుడికి నీవు మరంత అందంగా కనిపిస్తావు".అంటుంది.

ఈవ్ తల అడ్డంగా ఆడించి"ఆ అవసరం  లేదు.  నా వాడి జీవితంలో నేను ఒక్కర్తెనే మహిళనుఅంది. పాము  నవ్వి "ఆదాము జీవితంలో మరో  స్త్రీ కూడా ప్రవేశించి ఉంది. గుహలో దాచిపెట్టాడు. చూపిస్తా.. రమ్మం’టూ"ఒక నీటి గుంట దగ్గరకు తీసుకు వెళ్లి తొంగి చూడమంది. 

నీళ్లల్లో తొంగి చూసిన తరువాత ఈవ్ ఆపిల్ తినడానికి ఒప్పుకుంది. 

- సేకరణ by కర్లపాలెం హనుమంతరావు 

నాలుగు ను గురించి నాలుగు ముక్కలు - కర్లపాలెం హనుమంతరాను


 . 


నలుగురూ నాలుగు చేతులూ వెయ్యండి. నలుగురితో నారాయణ. నలుగురు పోయే దారిలో నడవాలి. నలుగురూ నవ్వుతారు... ఇవీ నిత్యం మనం వినే మాటలు. అనే కార్థంలో ‘నలుగురు’ మాటను వాడుతుంటాం. ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.

మనకు సంఖ్యాశాస్త్రం ఉంది. అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి. కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు. కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి. నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమమైనదిగా పరిగణించరు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖుడన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వేదాలు నాలుగు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగు. పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది. యుగాలు నాలుగు- కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మానవ జీవిత దశలనూ బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది. సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది. దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వమంత్రాలకు స్వాభావికమైనవని, ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి. ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు. స్వప్నానుభవకర్త సూక్ష్మశరీరధారి అయిన జీవుడు. వాడిని స్వప్నంలో ప్రేరేపించేవాడు తైజసుడు. గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు. ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ. పై మూడు స్థితులకు అతీతమైన స్థితి ‘తుర్య’. ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష- నాలుగు వాసనలు. ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి. స్నేహితులతో మైత్రి మనసు లక్షణం. ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం. పుణ్యకర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం. సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం. వాక్కుకు నాలుగు రూపాలు. పరా, పశ్యంతి, మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు; బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది. అవి సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు. సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ, మృత్యువుకు కారణమవుతాడు. వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరితిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశాలెక్కువ. శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలిదప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది. చంద్రుడు పంటలకు కారకుడు. పంటలు పండకపోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం, మెరుపు, పిడుగు, వృష్టి (వాన)- నీటికి నాలుగు రూపాలు. రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు- రథ, గజ, తురగ, పదాతి దళాలు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు. సామ, దాన, భేద, దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు. ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో... అందుకే నాలుగంకె కూడా ఘనమైనదే!

కన్నయ్యకు విన్నపం - కర్లపాలెం హనుమంతరావు - (చోరకళావారసులు - ఈనాడు సంపాదకీయ పుట ప్రచురితం)

 



రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా! మా మొరలు  ఆలకించ రారా కృష్ణయ్యా! దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుతావనే  కదా నిన్నంతా దుష్టదురిపాలకా.. శిష్టపరిపాలకా అని పిలిచేదీ.. కొలిచేదీ! బుడి బుడి అడుగులతో నువ్వలా కిలకిలలాడుతో నడిచి వచ్చినప్పుడల్లా 'మా చల్లనయ్య' వంటూ ప్రేమతో పదే పదే పొగిడేది! ఆ వల్లమాలిన ఆనందం ఇప్పుడు నీ భక్త జన సందోహంలో కంచు దివిటీ వేసినా కనిపించడం లేదు.  ఎందుకో  గమనించావా దీనజన బాంధవా?

మన్ను తిన్న నోటితో తినలేదని నువ్వు ఏ పరమార్థంతో  అమ్మ ముందు బొంకావో! భువన భాండాలని సైతం అవలీలగా  మింగేసే బకాసురులందరికీ ఇప్పుడు ఆ  బుకాయింపుల పర్వంలో నువ్వే ఆదర్శం! కిరాయి మనుషులను పెట్టి మరీ గోవర్థన గిరులను ఎత్తించేస్తున్న విఐపిలే విచారణల కమిటీల నుంచి స్వీయ రక్షణార్థం తులాభారంలో తులసీ దళానికి తూగిన నీ కన్నా ఎక్కువ అమాయకత్వం నటించేస్తుంటిరి కన్నయ్యా!. అస్మదీయులందరికీ పద్మనయనాలతో నయనానందకరంగా దర్శనమిచ్చే రాజకీయం సామాన్యుడినిప్పుడు  సహస్రాధిక క్రూర దంష్ట్రాల బలిమితో నమిలి  పిప్పిచేస్తున్నది బలరామ సోదరా!

మహాత్మా! నీవు లేకుండా మహాభారతమన్నా నడిచి ఉండునేమో కాని.. నీ వారసులమని చెప్పుకు ఊరేగే ఈ జోకరు నేతాగణ జోక్యం వినా చివరికి తిరుమల వెంకన్న దేవుడి దర్శన భాగ్యమైనా దొరికే అదృష్టం లేకుండా ఉన్నది!


దైవమంటే పెద్దలు ఎందరికో పన్ను కట్ట నవసరం లేని ఓ బడా ఖజానా! దేవాలయ అదాయాలు అనేక మందికి కడుపుకు నిండా తిన్నప్పటికీ తరగని వెన్నముద్దల వంటివి. నీ 'ధర్మ సంస్థాపనార్థాయ' థియరీ నీ  వారసులమని చెప్పుకు తిరిగే దొంగలు ఎందరికో 'ధనసంపాదనార్థాయ'గా మారిందయ్యా ముకుందా! 

నీ కాలపు రాజకీయం వర్ణం, వాసన, రుచి సంపూర్ణంగా మార్చేసుకున్నదిపుడు దేవకీ నందనా! 'గోపి' అంటే మెజారిటీకి నీవు కాదు నీరజాక్షా..  'గోడ మీద పిల్లి' మాత్రమే ముందు పటం కట్టు చిత్రం! కృపారసం పై జల్లెడివాడు పై నుంటే చాలు..   ముష్టి యములాడికని యేమిటిలే.. ఐటి,  ఇడి.. ల వంటి  యాంటీ ప్రజాహిత శాఖలెన్ని దాడిచేసినా  దడవనవసరమే లేదు కాలకేయులు తనుజ మర్దనా! చట్టసభల్లో బిల్లులు చెల్లిపోవడానికైనా, చట్టం ముందున్న కేసులు కుళ్ళిపోవడానికైనా కొత్త బాదరాయణ సంబంధాలు బోలెడు ఇప్పుడు పుట్టగొడుగులకు మించి పుట్టుకొస్తున్నాయి బదరీ నారాయణా! 

'భజగోవిందం.. '  అంటూ పదే పదే  పాడుకోడం మూఢమతం  నేడు.  సమయం బహు విలువైనది..  పాడుచేసుకునే 'మూడ్' లో లేడే ప్రజానాయకుడు.  భజనలూ, కీర్తనలూ, దండకాలూ, అష్టోత్తర నామావళులూ గట్రా ఎక్స్ట్రాలన్నీ బుల్లి బుల్లి దేవుళ్ల వరకు  మళ్లిపోయాయయ్యా యెపుడో యాదవేంద్రా! గురువాయూరుకు మించి పరమ పవిత్ర దేవాలయాలిప్పుడు హస్తినలో అమరావతిలో, భాగ్యనగరుల్లో వెలసి వర్థిల్లు రోజులు! జనార్దనా! పాదరక్షలు  బైట ఓ మూలన వినయంగా వదిలి పెట్టి మూలవిరాట్టుకో నమస్కారం కడు భయభక్తులతో కొట్టి, వీపు చూపనంత విధేయతతో వెనక్కి వెనక్కి నడిచొచ్చేస్తే చాలు.. గొప్ప వడుపు చూపినందుకు సదరు  భక్తశిఖామణులకే ముందుకు దూసుకెళ్లే  మొట్టమొదటి ఛాన్స్! 

ఆత్మకథల నిజాలనైనా తొక్కి పెట్టి తగలెట్టడమే నేటి పచ్చి పారదర్శకతకు  కచ్చితమైన నిర్వచనం. నార్కో 'అణా'లసిస్ పరీక్షల్లో కూడా నాలిక మడత  ప్డడ్న్పని మెళుకువ చూపడమే నేటి నేతకు ఉండదగ్గ మొదటి గొప్ప  లక్షణము.

సర్వ లోకాలను  ఏలే  సామర్థ్యం ఉన్నా ధర్మసంస్థాపన కోసమని   గుర్రాలను తోలే పనికి ఒప్పుకున్న వెర్రివి  నువ్వు! విదురుడంతటి ఘనుడు అరటిపండు ఒలిచి తొక్క చేతికిచ్చినా బెదరకుండా ఆరగించిన మాలోకానివీ నువ్వే! రాజసూయ యాగంలో ఎంగిలాకులు ఎత్తిన వినయ  సంపన్నుడివి. 'కుయ్యో మొర్రో' మన్నది ఓ ఆఫ్ట్రాల్  బోడి కరిరాజమయినప్పటికీ అప్పటికప్పుడు  సిరికైనా చెప్పనంత హడావుడిగా భువికి దిగివచ్చిన  ఆర్తత్రాణ పరాయణత్వం నీది! నిస్సహాయులను కాపాడే నీ ఆత్రం మరి నీ భక్తులమని చెప్పుకు ఊరేగే నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే గెలిపించే సూత్రం!   

గోవర్థన గిరిని ఎత్తడం కాదయ్యా గొప్ప ఇప్పుడు మాధవయ్యా! పెరుగుతున్న ధరవరలను మా కోసం కిందికి దింపి చూపించు! మానినీ మాన సంరక్షకుడివని  వనితల  మంగళ హారతులవీ అందుకొనుడు కాదు మగతనం! నిస్సందేహంగా నీలో ఇంకా ఆ ఇంతుల జాతి పై పిసరంత పక్షపాతం ఉందంటే.. ఏదీ! సందునో దుశ్సాసనుడు శాసిస్తున్నాడీ కలికాలంలో! ఆ కేసులకు బెదరకుండా ఆ కీచకుల  పీచమణచు!  ఒక్క పసిబిడ్డ పాలలోనే ఏం ఖర్మ పరంధామా! బక్క మనిషి తినే ప్రతి గడ్డి పరకలోనూ విషం కలిపే పూతనలే  ఎక్కువ లాభాలు గడిస్తున్నదిప్పుడు.  ఆ కల్తీ శాల్తీల   పనిపట్టగల చేవ చూపెట్టగలవా చూడామణీ? పంచ భూతాల పాలిటి పగటి భూతాలుగా మారి జగతి సర్వాన్ని సైడు కాలువ సరుకుగా చేసే కాళీయుల మాడు మీదెక్కి ముపటి మాదిరిగా మళ్లీ మా కోసం తాండవమాడి చూపించవయ్యా  తామస హర మనోహరా!  

నువ్వా ద్వాపరాన చంపింది ఏదో నీ ఒక్క మేనమామ కంసుడిని మాత్రమే కదా కన్నయ్యా! ఆ దుష్టుడి వారసులు ఈ కలియుగం ఇంకింత మంది! ప్రతి అడుగులో   అణగారిన వర్గాలను  ఇంకా  అణగదొక్కడమే వారి పని! వంద తప్పులు  వరకు సహించే ఓపిక పరమాత్ముడివి కనక నీ కుంది గాని ముకుందా! మానవ మాత్రులం మేమీ కుందులు ఇక ఏ మాత్రం  ఓర్వలేని దుస్థితికి చేరుకున్నాం! ఆత్మకు చావు లేదు. నిజమే! కానీఅది ధరించే దేహానికి ఆకలిదప్పులు తప్పవు కదా? ఎంత కట్టి విడిచే దేహమయితేనేమి! విడవక కట్టుకునేందుకైనా ఓ గోచీపాతకు నోచుకోనిది మా లేమి.   చిటికంత  చినుకు రాలినా చాలు.. ఊళ్లకు ఊళ్లు వరద గోదావరులు!  తమదంటే హాయిగా  వటపత్ర శాయి బతుకు. ఒక్క గోవులను ఉద్ధరించినంత మాత్రానే గొప్ప దేవుడి వయిపోతావా గోపాలా? ఆబాలగోపాలం లబలబలాడుతున్నదీ  భూగోళంలో! బక్క జీవులకు దిక్కైనా మొక్కైనా ఎప్పుడూ నువ్వొక్కడివే చక్రధారీ! జనం కష్టసుఖాలకు  చెక్ పెట్టు దారి ముందు చూడు మురారీ!  

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు - సంపాదకీయ పుట 01 -09 -2010 ప్రచురితం)


కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...