Thursday, July 23, 2015

గురుదక్షిణ- ఆటా సావనీర్ కథ


ఆటా- ప్రత్యేక సంచిక 2012లో 'ధర్మస్య త్వరితాగతిః' పేరుతో ప్రచురితం






'దాత'వ్య మితి యద్దానం దీయతేzనుపకారిణే।
దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్॥
మానవజన్మ ధరించినందుకుగాను మనకున్న దానిలో ఎంతో కొంత ఆపన్నులకుబాధా తప్తులకు         ప్రతిఫలాపేక్ష రహితంగా సాత్వికదానం చేసేవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు.

'భక్తి' టీవీలో స్వామి శివానందులవారు దానమహిమను గురించి ధర్మోపన్యాసం చేస్తున్నారు.
మహాదాత అయిన కర్ణుణ్ణి శ్రీకృష్ణపరమాత్ముడు  పరీక్షించాలని ఓ వేకువఝామున కర్ణుని ఇంటికి వెళ్ళాట్ట. కర్ణుడు ఆ సమయంలో వంటికి నూనె పట్టించుకొంటున్నాడు. అతనికి ఎడమవైపున్న వజ్రాల పాత్రను దానమడిగాడు కృష్ణుడు. మరో ఆలోచన లేకుండా ఎడంచేత్తో అమాంతం ఆ వజ్రాలపాత్రను కన్నయ్య దోసిట్లో వేశాట్ట కర్ణయ్య. 'పుర్ర చేత్తో దానమీయడం భావ్యమా?' అని కృష్ణుడు ఆక్షేపిస్తే
'క్షణం చిత్తం క్షణం విత్తం క్షణ జీవిత మావయోః।
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః॥
ఉత్తరక్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. లక్ష్మి చంచలమైనది. యముడు దయా రహితుడు. మనసు ఏ క్షణంలో ఎటు మళ్ళుతుందో తెలీదు. వస్తువు చెయిజారే లోపల ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో.. ఎవరి కెరుక?.. కాబట్టి ధర్మకార్యం అనుకొనేదాన్ని వెంటనే చేసెయ్యాలయ్యా!.. 'ధర్మస్య త్వరితా గతిః' అన్నారు గదా పెద్దలు! అన్నడుట కర్ణుడు.
అనుగ్రహ ప్రసంగం శ్రద్ధగా వింటున్న సుబ్బరాజుగారికి పొద్దున జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ముప్పై ఏళ్ల కిందటి మాట. నాకు అప్పుడు ఇరవయ్యో.. ఇరవైయ్యొకటో! చెన్నైలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటూ బతుకు పోరాటం చేస్తుండేవాణ్ణి. పురాణం వెంకటరత్నం పంతులుగారు అనే పండితుడి దగ్గర వ్రాయసగాడుగా చేర్పించాడు ఒక మిత్రుడు.
పంతులుగారు అప్పట్లో వ్యాసభగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానం రాసే పనిలో ఉన్నారు. పక్షవాతంచేత కుడిచెయ్యి సహకరించక రాసేందుకు నన్ను పెట్టుకొన్నారన్న మాట. నెలకు పాతిక రూపాయలు జీతం. పొద్దున పదినుంచి రెండింటిదాకా రాత పని. మధ్యలో ఒకసారి టీ. మధ్యాహనం ఆయన 'ప్రేమాలయం'లో భోజనం.
తిండితిప్పలకేంగాని.. పంతులుగారి సేవలో నా భాషా పరిజ్ఞానం బాగుపడింది. వ్యాఖ్యానం రాసేది గీతకే అయినా.. బైబిలు ఖురాన్ లాంటివాటినుంచి ప్రమాణాలు తీసుకొనేవారాయన. నేనొకసారి 'గురూ గారూ! మన భగవద్గీతక్కూడా వేరే మతాలనుంచీ సపోర్టు అవసరమా?' అని అడిగాను.
'గీతలో అన్ని మతాలకు, సాంప్రదాయాలకూ స్థానమున్నదనేరా నా మతం. ఈ కోణంనుంచి వ్యాఖ్యానం చెయ్యాలని నా సంకల్పం' అన్నారాయన.
పంతులుగారు వ్యాఖ్యానం చేసేటప్పుడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురానుకి ఆంగ్లానువాదంలాంటి ఆథ్యాత్మిక గ్రంథాలే కాకుండా.. హరిభక్తవిలాసం, శృంగారతిలకం లాంటి గ్రంథాలనుకూడా చుట్టూ తెరిచిపెట్టుకొని ఉండేవారు. వ్యాసగీతలోనుంచి ఒక్కో శ్లోకం పైకి చదువుకొని ,, దాన్నే మననం చేసుకొంటూ.. ఈ పుస్తకంలోనుంచీ ఒకటీ.. ఆ పుస్తకంలోనుంచీ అరా ఏరుకొంటూ సంతృప్తిచెందిన తరువాత 'ఇహ రాసుకోరా అబ్బాయ్!' అంటూ ఏకధారగా వ్యాఖ్యానం చెప్పుకుపోయేవారు. చెప్పింది చెప్పినట్లు కాగితంమీద పెట్టుకొంటూ పోవడమే నా పని.
ప్రారంభంలో నాకిదంతా ఒక పరమ దండగవ్యవహారంలాగా ఉండేది. పోను పోను స్వారస్యం గ్రహింపుకొచ్చి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. గురువుగారి దగ్గర పనిచేసిన ఆ అబుభవం తరువాత నాకు ఒక సినిమా కంపెనీలో దర్శకత్వశాఖలో పనిచేసేటప్పుడు ఉపయోగించింది. స్క్రిప్టు వర్కులో మెరుగులు సూచిస్తుండేవాణ్ని.  ఆ క్రమంలోనే నేనూ ఒక రచయితగా మారడం.. తదనంతరం సినిమాలు తీస్తూ కొంత గడించడం.. ఇదంతా పాతికేళ్లనాటి ఫ్లాష్ బ్యాకులోని ఫస్టుహాఫ్.
సెకండ్ హాఫ్ ఏమిటంటే..
ఐదేళ్ల కిందట నేను తీసిన రెండు సినిమాలూ అట్టర్ ఫ్లాప్ అవడమూ.. నా పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడమూ!
స్టేట్ స్ లో ఎంబీఏ చేసే మా పెద్దబ్బాయి సోమరాజుని ఉన్నఫళంగా వెనక్కి పిలిపించి బిజినెస్ మొత్తాన్నీ వాడికి అప్పగించేసింది నా ధర్మపత్ని. అప్పట్నుంచీ నా పాదాలు పండక్కీ పబ్బానికీ ఇంట్లోని పిల్లా పీచూ అభివందనాలు పెట్టుకోవడానికీ.. నా అనుభవాలు ఇలా నీ బోటివాళ్లదగ్గర ఉబుసుపోక చెప్పుకోవడానికీ మాత్రమే పనికివస్తున్నాయమ్మాయ్! అందుచేత నేను నీకేవిధంగానూ సాయం చేసే స్థితిలో లేనమ్మా!' అన్నారు సుబ్బరాజుగారు తాపీగా సినిమా ఫక్కీలో.
అప్పటిదాకా అంతా ఓపిగ్గా వింటూ కూర్చొన్న శారద లేచి 'సాయానిదేముందిలేండి ఆంకుల్! వీలుంటేనేగదా ఎవరైనా చేస్తారు! ఇది తాతయ్యగారి చివరి కోరిక. అందుకే ఎలాగైనా పూర్తి చేయాలని నా పట్టుదల. వస్తానండీ!' అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి శారద. సుబ్బరాజుగారు ఆలోచనలో పడ్డారు మళ్లా!
పంతులుగారు ఆ రోజుల్లో వడపళనిలో  ఓ చిన్నసైజు అనాథ శరణాలయంలాంటిది  నడుపుతుండేవారు.  ప్రేమాలయం దాని పేరు. మద్రాసు హైకోర్టులో బెంచిగుమాస్తాగా చెస్తున్న ఉద్యోగాన్ని ఆ అనాథశరణాలయంకోసం వదిలేసుకొన్నారాయన. నెలనెలా వచ్చే పించను.. డిపాజిట్`స్ మీదవచ్చే వడ్డీ చాలక, పుస్తకాలమీదొచ్చే ఆదాయాన్నికూడా దీనిమీదే వెచ్చించేవారు. తిండికిలేని పేద ముసలివారినీ, ఆధారంలేని పసిపిల్లల్నీ చేరదీసేవారాయన.
కులమతాలకు అతీతంగా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుండేది ప్రేమాలయం ఆవరణ.   ఆశ్రమంలోని వాళ్లందరికీ ఉచితంగా విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని, పెద్ద గ్రంథాలయాన్ని ప్రేమాలయానికి అనుబంధంగా నడపాలని.. ఆరాటపడుతుండేవారు ఆయన. ఆయన ఆరోగ్యం పాడైపోయిన తరువాత అక్కడి కార్యక్రమాలు పలచబడిపోయాయి. ఆయనతోనే ఆ ప్రేమాలయం వైభవమూ కనుమరుగయిపోయింది.
పంతులుగారు నెల్లూరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒకసారి చూడటానికని వేళ్లాడు తను. ఓటికుండలోని నీటికిమల్లే శరీరంలోని జీవశక్తి క్రమేపీ క్షీణించుకుపోతున్న దశ అది.
'ఎలాగుంది గురువుగారూ!' అని అడిగాడు తను.
' తగ్గుతుందిరా.. కృష్ణమూర్తీ.. తగ్గుతోంది!' అన్నారు. మనుషుల్నికూడా సక్రమంగా గుర్తుపట్టలేని స్థితికి గురువుగారు చేరుకున్నారు! ఇహ తగ్గేదేంటి?' అన్నాడు తను పక్కనే ఉన్న ఎవరో మిత్రునితో.
విన్నట్లున్నారు..  నడుందాకా కప్పివున్న దుప్పటిని తొలిగించి 'తగ్గేది..కాలురా.. పైచ్చి సన్నాసీ' అని నవ్వి కన్నీళ్ళు పెట్టుకొన్నారు.  పాదాలదగ్గరనుంచి పైకి ఆపరేషన్లు చేసుకొంటూ పోతున్నారు వైద్యులు. చూడలేక తిరిగి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచి 'ఒక పని చేసిపెట్టాలిరా! నేను పూర్తిగా తగ్గిపోయిన తరువాత మన ప్రేమాలయం పనులు మీరే చూసుకోవాలి. అదే నా అఖరి కోరిక' అన్నారు. చూడటానికి వచ్చినవాళ్లందరితోనూ అలాగే చెప్పేవారుట!
ఇప్పుడు వచ్చిన శారద అప్పట్లో ప్రేమాలయం ఒడిలో ఎదిగిన బిడ్డ. పంతులుగారి చివరి కోరిక తీర్చాలని.. ప్రేమాలయాన్ని ఎలాగైనా తిరిగి తెరిపించాలని తంటాలుపడుతున్నది.. పాపం!
అడక్కుండానే సాయం పట్టాల్సిన బాధ్యత తనమీద ఉంది. నోరు తెరిచి అడిగినా పైసా విదల్చలేని దౌర్బాగ్యస్థితిలో ఉన్నాడు తనిప్పుడు. వట్టిచేతుల్తో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన నిరాశను మర్చిలేకపోతున్నాడు సుబ్బరాజుగారు.
సెల్ఫోన్ అదే పనిగా రింగవుతుంటే ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు సుబ్బరాజుగారు.  సుకుమార్ పర్సనల్ మేనేజర్ స్వామి. 'ఆడియో ఫంక్షను మొదలయిపోయింది సార్! సుకుమార్ సార్ రిమైండ్ చేయమంటున్నారు' అన్నాడు అవతలనుంచి.
'ఏదీ! ఒకసారి మీ సారుకి లైన్ కలుపు!' అని అడిగాడు సుబ్బరాజుగారు ఒక నిశ్చయానికి వచ్చినట్లు.
***
సుకుమార్ తాజా చిత్రం 'రౌడీ' రవీంద్రభారతిలో ఆర్భాటంగా జరుగుతోంది. సుబ్బరాజుగారు ఆడిటోరియం చేరేవేళకే వేదికంతా విఐపిలతో కిక్కిరిసి ఉంది. హాలు లోపలా.. బయటా.. సుకుమార్ అభిమానుల కోలాహలం! మీడియా హడావుడికయితే ఇహ అంతే లేదు.
ముఖ్య అతిథి సాంస్కృతిక శాఖామంత్రి చలమయ్యగారు. సుకుమార్ ను గురించి సుకుమార్ కే తెలియని సుగుణాలను సుమారు ఒక అరగంటపాటు ఏకరువు పెట్టి ఆఖర్లో 'మన హీరోగారు గొప్పకథానాయకులే కాదు.. రాజకీయనాయకులుకూడా కావాలని కోరుకొంటున్నాను. ఇలాంతి పులుకడిగిన ముత్యాలు దేశానికి.. మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎంతో అవసరం'
హాలు లోపలా బైటా ఈలలతో, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ కాలం దర్శకులు, నిర్మాతలు సుకుమార్ ని స్తోత్రాలతో ముంచెత్తిన తరువాతగానీ సుబ్బరాజుగారి వంతు రాలేదు. రెండే నిమిషాలు మాట్లాడాలని నిర్వాహకులు హెచ్చరించిపోయారు.
సుబ్బరాజుగారు సాధారణంగా సభల్లో ఎక్కువగా మాట్లాడరు. మైకుముందు ఆయనకు మాటలు పెకిలవు. ఈసారి మాత్రం అదో రకమైన ఊపులో ఉన్నారు. 'పెద్దలు, ప్రముఖులు హీరోగారిని గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. నాకూ అలాగె మాట్లాడాలని ఉందిగాని.. మాల వేసుకొని ఉన్నందున అబద్ధాలు మాట్లాడలేను. నా మాటలు నిష్టూరంగా ఉంటె మన్నించమని మనవి.'
సభలో పిన్ డ్రాప్ సైలెన్సు!
'సుకుమార్ నాకు పాతికేళ్ళబట్టీ తెలుసు. డబ్బుదగ్గర తను మహా గట్టి. ఐదేళ్ల కిందట నేను తనతో తీసిన 'దేవుడు' అట్టర్ ఫ్లాపయింది. అయినా తన పారితోషికం రూపాయి తగ్గకుండా తీసుకొన్నాడు. అదే.. అంతకుముందు అతనితో కలసి నేను తీసిన ' సూపర్ కుర్రోడు' గ్రాండ్ సక్సెసయిందని.. లాభాల్లో వాటా అడిగి పుచ్చుకొన్నాడు. లాభంలో వాటా అడిగినవాడు.. మరి నష్టంలోకూడా షేర్ చేసుకోవడం న్యాయమా? కాదా?'
సభలో చిన్న కలకలం.
సుబ్బరాజుగారి ధోరణి అలాగే సాగుతూ ఉంది. 'సుకుమార్ గొప్ప ప్రజాసేవకుడు అన్నారు. ఇన్ని కోట్లు సంపాదించాడు. ఇప్పటివరకు ఏమేం సోషల్ సర్వీసులు సొంతడబ్బుతో చేసాడో చెప్పాలి! ఇవాళ్టికీ షూటింగు సమయంలో ఆయన భోజనం ఖర్చు నిర్మాతలే భరిస్తున్నారు.అంత పిసినారి ఈ హీరో..!'
సభలో ఒక్కపెట్టున రభస. వేదికమీదలు కాగితం ఉండలు.. వాటర్ బాటిల్సు.. దూసుకొస్తున్నాయి. మైక్ కట్ చేసేసారెవరో! ఐనా రాజుగారు తగ్గడంలేదు. స్వరం పెంచి అరుస్తున్నారు. 'సుకుమార్ లాంటి డబ్బుమనిషి.. సెల్ఫిష్.. తాగుబోతు,, క్రూక్.. అన్నింటికీ మించి..'
అభిమానులు రెచ్చిపోయి వేదికమీదకు దూసుకొస్తుండేసరికి సెక్యూరిటీ రంగప్రవేశం చేసింది. సభ అర్థాంతరంగా ఆగిపోయింది.
ముందు సుకుమార్ ని ఓ కారులో సురక్షితంగా బైటికి పంపించేసారు. సుబ్బరాజుగారినికూడా అతిరహస్యంగా ఓ వాహనంలో బైటికి రరలించే ప్రయత్నంలో ఉండగా.. ఆయనే బైట వేచిఉన్న మీడియాను దగ్గరకు పిలిచి మిగతాభాగం పూర్తి చేసారు. 'గాయత్రి అనే ఓ కేరళ కథానాయిక ఈ హీరో వేధింపులకు తాళలేకే కొట్టాయంలో ఆత్మహత్యకు పాల్పడింది. వీళ్ళిద్దరుకు పుట్టిన బిడ్డకు ఇప్పుడు ఐదేళ్ళు. చెన్నైలోని ఓ హాస్టల్లో సీక్రెట్ గా ఉంచి పెంచుతున్నాడు సుకుమార్. ఇవిగో వివరాలు. విచారించుకోండి!' అంటూ ఓ కాగితం వాళ్ళమీదకు వెఇసిరేసాడు పోతూ పోతూ.
నిప్పులేకుండానే పొగ పుట్టించే నైపుణ్యం ఈ కాలం మీడియాది. ఈ మాత్రం సెగ తగిలితే ఊరుకొంటుందా! ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానెళ్లలో స్క్రోలింగులు.. డిస్కషన్లు.. ఒపీనియన్ పోళ్ళు.. ఎస్ ఎమ్ ఎస్సుల ద్వారా అభిప్రాయ సేకరణలు!
ఒక ఛానలైతే ఏకంగా సుబ్బరాజుగారిని స్టూడియోలో కూర్చోబెట్టింది. 'సుకుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేనాటికి పైన చొక్కా.. కింద మాసిన ప్యాంటుతప్ప ఇంకేమీ లేవు. పాతికేళ్లలో రెండువేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలి. ఎంత ఆదాయప్పన్ను కడుతున్నాడో ప్రకటించాలి. రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడుగా! ముందు అతని నీతి నిజాయితీల్ రుజువుకావాలి!' అని సుబ్బరాజుగారి డిమాండ్లు.
'మా నాన్నగారికి మతి స్థిమితంగా ఉండటం లేదు. ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.' అంటూ పబ్లిగ్గా స్టేటుమెంట్లు ఇచ్చాడు సోమరాజు. 'రౌడీ; చిత్రం ఇంకా ఒక షెడ్యూల్ పూర్తికావాల్సి ఉంది. ఈ వివాదం వల్ల అది ఆగిపోయినా.. ఆలస్యమయినా.. పెట్టిన కోట్లన్నీ ప్రశ్నార్థకంలో పడతాయి. అదీ సోమరాజు బెదురు.
'నేను పూర్తి ఆరోగ్యంతో ఉండే మాట్లాడుతున్నాను. కావాలంటే మెడికల్ చెకప్పులు చేయించుకోవచ్చు. చెన్నైలో సుకుమార్ కి బినామీ పేర్లతో లిక్కర్ వ్యాపారాలుకూడా ఉన్నాయి. ఈ విషయాలన్నింటిమీద సిట్టింగుజడ్జితో వెంటనే విచారణ చేయించాలి. చెన్నైపాపకు, సుకుమార్ కి డి ఎన్ యే పరీక్షలు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి.' అంటూ రోజుకోరకంగా సుకుమార్ మీద దాడి తీవ్రతరం చేసుకొంటూ పోతున్నారు సుబ్బరాజుగారు.
సుకుమార్ కి అనుకూలంగా .. వ్యతిరేకంగా రాష్ట్రం రెండుగా చీలి మూడురోజులబట్టీ రచ్చ రచ్చవుతోంది. అబిమానుల అల్లరయితే లా అండ్ ఆర్డర్ లిమిట్ ఎప్పుడో దాటిపోయింది.
మొనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందనుకొన్నాడేమో.. ఒక ప్రకటన విడుదల చేసాడు సుకుమార్. 'సుబ్బరాజుగారు నాకు సినీజన్మనిచ్చిన తండ్రి. ఆయనెందుకు ఇలా చేస్తున్నారో అర్థమవడం లేదు. నా నీతి నిజాయీతీలను నిరూపించుకొనేందుకు నేను సిద్ధం. నా ఆస్తిపాస్తులమీద విచారణకు నేను రడీ! చెన్నైలో నాకు ఎక్కడో ఓ కూతురుందని అంటున్నారుగా! ఏ ఎన్ యే పరీక్షక్కూడా ఒప్పుకొంటున్నాను. ఆఓపణల్లో ఒక్కటైనా నిజమని తేలితే సినిమారంగంనుంచి శాశ్వతంగా విరమించుకొంటాను. ఉన్న  ఆస్తి పాస్తులు రాష్ట్రప్రజలకు రాసిచ్చేస్తాను. అబద్ధమని తేలితే సుబ్బరాజుగారిమీద పదికోట్లకు పరువునష్టం దావా వేస్తాను. నివేదికలు వచ్చినదాకా 'రౌడీ' చిత్రంలో నటించను.' ఇదీ ప్రకటా సారాంశం.
సుకుమార్ ఈ ప్రకటన చేసేనాతికి సుబ్బరాజుగారు అందుబాటులో లేకుండాపోయారు. శబరిమలై యాత్రలో ఉన్నారు.
పదహారో రోజున ఆయన తిరిగొచ్చేనాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
సుకుమార్ సుగుణాలనుగురించి, సచ్చీలతను గురించి రోజుకో సినిమా విఐపినో, రాజకీయ ప్రముఖుడో  ఛానెళ్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అతని ఆస్తిపాస్తులమీద విచారణకు పూనుకొన్న ఓ స్వచ్చంద సంస్థ వారంరోజులపాటు విచారించి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. సుబ్బరాజుగారు ఇచ్చిన చెన్నైపాప వివరాలు బోగస్ వని తేలాయి. సుకుమార్ సుబ్బరాజుగారిమీద పరువునష్టం దావా వేయకుండా ఉండేందుకూ.. 'రౌడీ' చితం పూర్తిచేసేందుకూ.. సోమరాజు ఇలాంటివే ఇంకా చాలా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయినా సరే.. పెద్దాయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కండిషన్ పెట్టాడు సుకుమార్!
అయ్యప్పదీక్ష ముగిసింది కనక ఏం చెప్పటానికైనా సుబ్బరాజుగారిమి ఇప్పుడు అభ్యంతరం లేదు. ప్రెస్ మీట్లో సుకుమార్ ని పక్కన కూర్చోబెట్టుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడాయన. 'సుకుమార్ పులుకడిగిన ముత్యమని నాకు ముందే తెలుసు. తను రాజకీయాల్లోకొస్తే తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కొన్ని శక్తులు నా చేత ఈ నాటకం ఆడించాయి.'
'ఎవరా శక్తులు?' అని అడిగాడో రిపోర్టర్.
'ఇంకా వివాదాల్లోకి పోవద్దు! జరిగిందానికి నేను విచారిస్తున్నాను. నా ఆరోపణలను వెనక్కి తీసుకొంటున్నాను. సుకుమార్ ని క్షమించమని కోరుతున్నాను. అగ్నిపరీక్ష జరిగిన తరువాతే సీతమ్మవారి సచ్చీలత లోకానికి రుజువయింది. మన హీరో సుకుమార్ విషయంలోనూ అంతే జరిగిందనుకోండి! ఇంతటి నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తి నేటి రాజకీయాలకు ఎంతో అవసరం. నేనీ పాడుపని చేయడానికి పుచ్చుకొన్న ముడుపుల మొత్తాన్నీ నా పాపపరిహారార్థం సుకుమార్ కి సమర్పించుకొంటున్నాను' ' అంటూ అప్పటిదాకా పక్కనే పెట్టుకొన్న సూట్ కేసునుంచి  చెక్కుబుక్కుతీసి  ఓ సంతకం గిలికిన చెక్కును సుకుమార్ కి అందించి షేక్ హ్యాండిచ్చారు సుబ్బరాజుగారు.
చెక్ అందుకొని మీడియా కెమేరాలకు చూపించి అన్నాడు సుకుమార్ చిరునవ్వుతో' సుబ్బరాజుగారు నా తండ్రిలాంటి వారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ వివాదంతో ఏ మాత్రం సంబంధంలేని  నా ఒకప్పటి సహనటి గాయత్రిగారి పేరు నలుగురు నోళ్లలో నానడమే నాకు మనస్తాపం కలిగించింది. సుబ్బరాజుగారు ఇచ్చిన ఆ మొత్తాన్ని ఆ గాయత్రిగారి పేరుమీద ఏదైనా అనాథశరణాలయానికి విరాళంగా ఇవ్వడం ద్వారా మనం ఏసిన అపచారాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చన్నది నా ఆలోచన. పెద్దవారు. నాకు పితృసమానులు. సుబ్బరాజుగారే ఏదైనా ఆర్ఫనేజ్ పేరు సూచిస్తే సబబుగా ఉంటుంది.' అన్నాడు సుకుమార్.
సుబ్బరాజుగారు సుకుమార్ చెవిలో ఏదో ఊదారు. తలూపి అక్కడికక్కడే ప్రకటన చేసాడు సుకుమార్. 'చెన్నైలోని మహా మహోపాధ్యాయ కీ॥శే॥ పురాణం వెంకట రత్నం పంతులుగారి స్మారకార్థం పునరుద్దీకరింపబడుతున్న అనాథశరణాలయం 'ప్రేమాలయా'నికి  ఈ చిన్నిమొత్తాన్ని విరాళంగా ప్రకటించడానికి గర్వపడుతున్నాను.
మీడియా కెమేరాలవెలుగుల్లో  ప్రేమాలయం తరుఫున 'శారద' సుకుమార్ ఎండార్సు చేసిచ్చిన చెక్కు  అందుకొంది.
'విరాళం ఎంత సార్?' ఓ జాతీయ ఛానెల్ ప్రతినిధి విచారణ.
చిరునవ్వుతో చెక్కును కెమారాలకి చూపించింది శారద. రెండు వేళ్ళు గాలిలో ఆడించాడు నవ్వుతో సుకుమార్! ఆనందంతో తలూపుతూ కనిపించారు సుబ్బరాజుగారు.
***
ప్రేమాలయం ప్రారంభోత్సవ సభ.
పక్కనే కూర్చోనున్న సుకుమార్ చేయి అందుకొని   చిన్నగా అన్నారు సుబ్బరాజుగారు 'మా వెధవాయి దగ్గర్నుంచి నా కష్టార్జితంలోని ముష్టి రెండు కోట్లు రాబట్టుకోవడానికి ఇన్ని ముష్టియుద్ధాలు నటించాల్సి వచ్చింది. నా కోసం ఎన్నో మాటలు పడ్డావు. సారీరా!'
నవ్వుతూ  చేతిని  కళ్లకద్దుకొని అన్నాడు సుకుమార్ 'అన్నం పెట్టిన చెయ్యి గురూజీ మీది! మరంతమంది నాలాంటి అభాగ్యులకు అన్నం పెడతానంటే ఇంకిన్ని మాటలు పడటానికైనా నేను రడీనే! అదీగాక  నటనేమన్నా నాకు కొత్తా?.. నా వృత్తే అది. మీ తిట్ల నాటకం ముందే చెప్పకపోతే మాత్రం కచ్చితంగా అప్ సెట్టయుండేవాడినే!' అని భళ్ళుమని నవ్వేశాడు సుకుమార్. సుబ్బరాజుగారూ ఆ నవ్వులో పాలుపంచుకొన్నారు.
నాలుగు వరసల అవతలగా కూర్చోనున్న సోమరాజుకి నవ్వులు వినీ.. ఎందుకో అర్థం అదోలా మొహం పెట్టేసాడు!
***
-కర్లపాలెం హనుమంతరావు





మనసు మా ఊరి ఇంటిముంగిట వాలిపోతుంది- బెజ్జ రమాదేవి పూల ముచ్చట



మల్లెపూలు ముక్కుపుటాలకు తగలగానే మనసు ఇరవై ఐదేళ్ల వెనక్కి మళ్ళింది. ఇదీ అని చెప్పలేని ఓ మధురస్మృతి.  బాల్యం కళ్ళముందు కొచ్చి నిలబడింది.
మా ఇంటిముంగిట్లో మల్లెపందిరి, జాజిపందిరి పక్కపక్కనే ఉండేవి.  ఆ పందిరికింద నల్లరాయిమీద కూర్చుని అమ్మ వండిన గోరుచిక్కుడుకాయకూర అన్నంలో కలుపుకు తింటోంటే.. కొద్దిగా మసకబారిన సందమామల్లాంటి మల్లెపూలు ఆ అన్నంపళ్లెంలో రాలుతోంటే.. అవి ఏరుకోవడం ఓ ముచ్చట! ఆ ముచ్చట్లలో సదిగాడు పేడకళ్లెల్లో కాలేసి జర్రున జారిపడ్డ సంగతులన్నీ గుర్తుకొచ్చి కిలకిలా నవులొస్తయ్యి. ఆ నవ్వులకు గొంతు పట్టుకుంటే నీళ్ళు తాగుతూ అన్నాలు  తినేవాళ్ళం ప్రమీల(ప్రేమల?),  ప్రభ, నేనూ.
ఆదివారంనాడు అదో సంబరం మాకు.
మా మల్లెపందిరి అంటే నాకే కాదు.. సీతాకోకచిలుకలకు, తుమ్మెదలకు, గొంగళి పురుగులకు, బక్కతొండలకు, ఆవులమందలకూ చాలా ఇష్టమే. బడికెళ్ళి రాగానే పలకలు, సంచి అరుగుమీద పారేసి పందిట్లో చిన్న పీటేసుకుని  చెయ్యెత్తి దగ్గరగా  కనపించే మల్లెమొగ్గల్ని అందుకొని తెంపేవాళ్లం. మాకు పోగా మిగిలినవి పేపరుపొట్లాల్లో చుట్టి తెలిసిన దోస్తులకి ఇస్తుండేది మా అమ్మ.
ఆదివారం వస్తే చాలు.. మల్లె, జాజి పందిర్లమీదనుంచి పచ్చటి ఆకుతేళ్ళు, గొంగళిపురుగులు ఏరిపారేయడం,  చెత్తా చెదారం ఎత్తి పోయడం.. ఇదీ మా పని. ముదిరిన ఆకులు గిల్లిపోయాలి. చెట్లకు నీళ్ళు పోసేందుకు వంతులు వేసుకునే వాళ్ళం ఇంట్లో వాళ్లందరం. ఏడు గోళాల ఉప్పునీళ్ళ బావి మాది. చాదబొక్కెనకు కొబ్బరితాడు. ఎంత చేదినా పైకి వచ్చేదికాదు బక్కెటు. చేదక్కట్టిన కొబ్బరినార  ఒరిపిడికి చేతులు ఎర్రగా కందిపోయేవి.
పెద్దాళ్లు బైటికొచ్చి చూసి పెద్దబొక్కెట విప్పి చిన్నబొక్కెట కట్టేవాళ్ళు. చిన్న బక్కెటతో ఎంతసేపు చేదినా కుండ నిండేదికాదు. నేను చేది పొయ్యడం.. ఇద్దరు చెల్లెళ్ళు చెరోవేవు పట్టుకుని చెట్లకు నీళ్ళు పొయ్యడం. అలుగ్గోళెంలో నీళ్ళు పోసేవాళ్లం. ఆగకుండా ఉరకడం మూలాన ఏ పలుగు రాయో తగిలి కుండ వదిలేస్తే అది కాస్తా పదహారు వక్కలయ్యేది. వాకిలినిండా నీళ్ళ మడుగు.
'బంగారమంటి కాగు ముక్కలాయె' అంటూ మా అమ్మ నాలిక మడతబెట్టి కొట్టేటందుకు ఉరికొస్తుంటే మేం దొరుకుతామా? సందుల్లో బడి, బజార్లో బడి రామేశ్వరమ్మిట్ట నేనూ.. సువర్ణమిట్ట ప్రమీల, ప్రేమలత తాఉకొనేవాళ్ళం.  ఇదంతా మల్లెచెట్టుకు నీళ్ళు పోసేటందుకు  వచ్చిన తిప్పలు!
ఇక పూల సంగతులు! మా అప్పచెల్లెళ్ళు ముగ్గ్గురికి మూడుపాళ్ళు,  మా అమ్మకో పాలు. ఎవరి పూలు వాళ్ళం మాలకట్టుకుని తెల్లటి తడిగుడ్డలో బెట్టి వాకిట్లో తీగెకు తగిలించేవాళ్లం. తెల్లారేసరికి  మొగ్గలు విచ్చి కమ్మటి మల్లెల వాసన మరోలోకానికి మోసుకుపోయేది.
ఇప్పటికీ ఎండాకాలం వచ్చి మల్లెల వాసన ముక్కుకి తగిలిందంటే మా ఇల్లు గుర్తుకొస్తుంది. మా పల్లె పందిరి గుర్తుకొస్తుంది. అందమైన ఆ గోధూళి సాయంత్రం గుర్తుకొస్తుంది. నా దోస్తులు బుజ్జి, పుశ్మి(పుష్పలత) గుర్తుకొస్తారు. అందమైన మా అమ్మ, ఆమె నవ్వు, నవ్వితే తళుక్కున మెరిసే ఆమె ముక్కుపుల్ల గుర్తుకొస్తాయి. ఆ అరుగుమీద ఆడుకున్న గచ్చకాయలు గుర్తుకొస్తాయి.
ఒక మల్లెవాసనతో ఇన్ని గుర్తుకొచ్చి.. మా ఊరు గుర్తుకొచ్చి గుండె చిత్తడి చిత్తడి అయిపోతుంది. మల్లె మొగ్గలు చూస్తే చాలు.. గతించిన ఆ స్మృతులు మదిలో మెదిలి ప్రాణం అతలాకుతలమై పోతుంది.
యాంత్రికమైన బతుకులు.. ప్రకృతిని వికృతిగా మార్చే సంస్కృతి.. ఆత్మీయపరిమళాలు ఉండవు ఆ కాగితంపూలలాంటి జీవితాలకి. అద్దాల బతుకులు. అబద్ధాల జీవితాలు. వీటన్నిటి మధ్యా మల్లెపూలను చూస్తే మనసు ఊరట చెందుతుంది. ఆత్మీయుల్లా తోచే ఆ పువ్వుల నవ్వుల్తో  మళ్లా బతుకులకు జీవకళ వచ్చినట్లుంటుంది.
నేను ఎండాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. మల్లెల సాంగత్యంలో మూడునెలలు మూడుగడియల్లా దొర్లిపోతాయి. పిల్లి నీచు వాసన పసిగట్టినట్లు.. ఎక్కణ్నుంచి మల్లెలవాసన ముక్కుపుటాలకి తగిలినా..  కళ్లు మూతలుపడతాయి. మనసు మా ఊరి ఇంటిముంగిట  వాలిపోతుంది.
ఎన్ని తెంపినా కొన్నింటిని ఇంకా తనలో దాచుకున్న మా మల్లెపందిరి గుర్తుకొస్తోంది.
తెల్లారగానే మబ్బుల్లో చుక్కల్లా కిలకిలా నవ్వే తెల్లటిమల్లెలు. గాలికి గర్వంగా తలలూపే మల్లెతీగ.. 'ఫోవే..భడవాయీ! నా పూలు నాకూ ఉన్నాయి!' అన్నటు అనిపిస్తుంది. నిండుపూలతో గాలికి ఊగే మల్లెపందిరి అందమైన  నిండుముత్తైదువంత కళగా ఉంటుంది. ఎంత వెతికి వెతికి తెంపినా .. మామూలే! తీగలమధ్య మబ్బుల్లో  చుక్కల్లా దోబూచులాడుతూ అక్కడక్కడా తళుక్కున మెరిసి.. నన్ను వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంటాయి. ఆ  పూల వేళాకోళమంటే నాకు ప్రాణం.
-బొజ్జ రమాదేవి


నా మాటః
'ఎండాకాలం యాదిల' మల్లెతల్లీ నీకు జోహార్లు! బతుకమ్మ ఆర్టికల్
'మురికికాల్వల మురికివాసనను మూడునెలలు మీ సువాసనలతో ప్రక్షాళనచేసే మల్లెమొగ్గలూ! మీకు కోటికోటి నమస్సులు!' అంటూ~బొజ్జ రమాదేవిగారు (వ్యాసకర్త హిందీ లెక్చరర్, హన్మకొండ, వరంగల్ జిల్లా) రాసిన ఒక చక్కని స్మతిగల్పికను కందుకూరి రమేష్ బాబుగారి ఫేస్ బుక్ అప్-టు-డేట్సులో చూడటం జరిగింది. మల్లెపూలంటే సహజంగానే ఆసక్తి కదా ఎవరికైనా!  ఆసాంతం చదివాను ఒకే ఊపులో.. అనడంకంటే చదివించింది అనడం సముచితం.  మల్లెల సువాసనలు    గుబాళించాయి రచనలో. రచయిత్రిగారిని అభినందించకుండా ఉండలేం. మంచి రచనవైపుకు మన దృష్టిని మళ్ళించిన రమేష్ బాబుగారినీ అభినందించాల్సిందే.
ఈ గల్పిక తెలంగాణా యాసలో రాసినదికొన్ని ప్రయోగాలు మూలతెలుగునాట అర్థమవవేమోనని నా అనుమానం.  అందుకే నాకున్న కొద్ది పరిజ్ఞానంతో  నా తృప్తికోసం దీనిని  శిష్ట భాషలోకి తిరిగిరాసింది. ఈ  ప్రయత్నం దోషరహితమన్న భ్రమ నాకు లేదు. తప్పులుంటే సరిదిద్దుకొనేందుకు సిద్ధం. మంచి అంశాన్ని మరింతమందికి పంచాలని తప్ప ఈ ప్రయత్నం వెనక మరే ఉద్దేశమూ ఊహించవద్దని మనవి.
కర్లపాలెం హనుమంతరావు


***                             

Wednesday, July 22, 2015

సినిమాప్రచారానికి కవిత్వం పాట



కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అన్నాడని కాబోలు గతంలో శోభనాచల పిక్చర్సు వారు 'దక్షయజ్ఞము' చిత్రం విడుదలకుముందు ఏకంగా చిత్రసాంకేతికగణం వివరాలతో కూడిన చక్కని చతురస్ర గతి మాత్రాచందస్సులో ఒక పాట రాయించి మరీ ప్రచారం చేయించారు.
సరదాగా ఉంటుంది.. కొన్ని చరణాలు మీరూ వినండి!

దక్షయజ్ఞమండీ- అందరు తప్పక చూడండీ
దర్మయుద్ధమండీ- భక్తులు ధన్యులగుదురండీ

ఆంధ్రకళలతో- ఆంధ్ర దీప్తితో
ఆంధ్ర శోభనాచల స్టూడియోలో
ప్రభువు మీర్జపూర్- పరిరక్షణలో  దక్ష॥

అర్జాకృష్ణుని-ఆధ్వర్యములో
శిష్టదర్శకుల- శిష్యప్రాయుడు
సిద్ధహస్తుడు- చిత్రపువీరుడు
తయారుచేసిన- దక్షయజ్ఞము    దక్ష॥

నగ్నతత్వ- నారాయణాస్త్రము
వస్తున్నది మీ- పట్టణాలకే
తేదీ వివరం- తెలుసుకొనండీ     దక్ష॥

పురాణగాథల- తరాలు దాటిన
పరాకుకూతల- ప్రతికాదండి      దక్ష॥
కృష్ణవేణి నవ- కోకిల స్వరము
గగ్గయ్య భయం- కరధిక్కారము
రామకృష్ణుని- రమ్యగానము
కుంపట్ల మనోహర- పరిహాసము దక్ష॥

బి.టి.చార్యుల- భీకర పలుకులు
మోతీబాబు- పాటల కులుకులు
శాంతారాముని- చక్కని కుంచియ
చతురుడు వాల్కే- శబ్దగ్రహణము
విబుధుడు కిన్నీ- వేషధారణము
సొలుపగు చవాను- ఫోటోగ్రాఫీ
కుండలేశుని య- ఖండస్ఫురణము
బడసిన బంగరు- ప్రతిమారాజము
వస్తున్నది మీ- పట్టణములకే
తేదీ వివరము- తెలిసికొనండీ దక్ష॥

ఇలా సాగుతుంది పాటంతా. ఎక్కడా పొల్లుమాట లేకపోవడమూ,
చక్కనైన పదజాలం వాడటమూ.. సాంకేతిక వివరాలు సమగ్రంగా
ఉండటమూ.. మనమీ పాటలో ప్రశంసించదగ్గవిశేషాలు.
సినిమా మాధ్యమంమీదే కాకుండా కవితాప్రక్రియలమీదా లోతైన అవగాహన ఉంటేనే గాని ఇంతటి చక్కని వరసలతో పాట కుదరదు.
కనిపించిన ప్రతీ దానిమీదా కవితలల్లాలని ఉవ్విళ్ళూరే ఈనాటి యువరక్తపు కవికుమారులూ/కవితాకుమారీలంతా  సునిశితంగా అధ్యయనం చేయాల్సిన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  కాబట్టే.. డెబ్బై ఏళ్ళకిందట రాసినా.. ఇప్పటికీ  తాజాగా అలరిస్తుంది. పాటకు ఇంకా 42చరణాలున్నా స్థలాభావంచేత పూర్తిపాఠం ఇవ్వడం లేదు.

శోభనాచల పిక్చర్స్ విశేషాలుః
శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941)గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రంచిత్రానికి రాజా వారు దర్శకుడి మరియు నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియో గా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పని చేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.(సోర్సు- https://te.wikipedia.org/wiki/)
- కర్లపాలెం హనుమంత రావు


Tuesday, July 21, 2015

దిగులేస్తోంది!- కవిత


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!

వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!

-కర్లపాలెం హనుమంత రావు 
01-09-2012

Monday, July 20, 2015

1950లో ఓ కచేరీకి ఓ ముఫ్ఫైఏళ్ళ మహిళని పాడమని పిలిచారు. ఆమె వర్ణంతో కచేరీ ప్రారంభించి గణేశ ప్రార్థన, ఆ తరువాత దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక చిన్న భూకంపం రావడంతో ప్రేక్షకులు భయంతో ఆ హాలు విడిచి బయటకు పారిపోయారు. జనం వెళ్ళిపోవడం చూసి పక్క వాయిద్యకారులు కంగారు పడ్డారు కానీ అలాగే భయపడుతూ వాయించారు. పక్క వాయిద్యకారుల పరిస్థితి కానీ, జనం హాహాకారాలు చేయడం, భయంతో పరుగులు తీయడం ఇవేమీ కళ్ళు మూసుకుని పాడడంలో నిమగ్నమయిపోయిన ఆవిడకి తెలియవు. భూకంపం హడావిడి తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే వుంది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడం కనిపించింది. ఆ తరువాత పక్క వాయిద్యం వాయిస్తున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పారు. ఆ కచేరీ చేసిన మహిళ డి.కె.పట్టమ్మాళ్. భూకంపం సంగతి ఆమెతో తరువాత ప్రస్తావించినప్పుడు, “భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణమ్మీద తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ట నాకు చావు లాంటిదే. నేను సంగీతానికీ కట్టుబడున్నాను. అదే నా ఊపిరి” అన్నారామె. ఈ సంఘటన చెప్పింది ఆమె భర్త ఈశ్వరన్. ఆనాటి కచేరీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ రావలసి ఉన్నా, ఎందుచేతనో రాలేకపోయారు. భూకంపం వచ్చినా కదలకుండా తన్మయత్వంతో ఆమె పాడడం గురించి తెలుసుకొని ఆ మర్నాడు ఆయనింట్లో మరో కచేరీ ఏర్పాటు చేయించుకున్నారు
సాయి బ్రహ్మానందం గొర్తి "ఈ మాట- 'కంచి పట్టు కచేరీ' నుంచి
-కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...