Wednesday, July 29, 2015

ఐ హేట్ యూ!- కవిత

కవిత 
ఐ హేట్ యూ! 
- కర్లపాలెం హనుమంతరావు 

ఓనమాలు నాతోబాటు దిద్దిన ఓ నా బాల్యమిత్రమా!
అంకెలు అక్షరాలతో నువు చేసిన చెమ్కీ హారం
నా స్మృతుల మెడలో ఇంకా వేళాడుతూనే ఉంది.

పులీ మేకల్ని గడుల్లో దాచేసి దాగుడుమూతలు ఆడుకున్నాం
అయ్యోరి పేంబెత్తం, అంబాలీసులేవీ పట్టని 
ఆ ఆటపాటలు గుర్తుకొస్తే
బడెనకాల పల్లందొరువులో 
పొర్లుగింతలు పెట్టినట్లే ఉంది  ఇప్పటికీ.

చవితిపండక్కి అణా ఇచ్చి అయ్యవారిచేత
నీకు 'ఓ బొజ్జ గణపయ్య' పద్యం ఇప్పించాను.. గుర్తుందా!
పూజ మూడురోజుల్దాకా నిన్ను ముట్టద్దంటే 
ఎంత దిగులయిందో ఆ రోజుల్లో !

పరీక్షల రోజుల్లో పసుపు పారాణితో 
అమ్మ నిన్న  ముస్తాబు చేస్తుంటే 
అబ్బ! ఎంత ముద్దొచ్చే దానివో !

చిట్టి చిలకమ్మా.. లాంటి పాటలన్నెటినో  
నా నోట బట్టీ పట్టించిన నా మట్టిగ్రంథానివి నువ్వు!
పాతరాతల్ని చెరిపేయడానికి 
నోటి ఉమ్మంతా నీకు పులిమేసి
ఆరిపోతే అరిసెముక్క 
తాయిలం పెడతానని ఆశ  పెట్టేవాణ్ని..పాపం!
ఆశకురుపులేవీ నాకు లేవలేదంటే 
అదంతా నీకు నా మీద ఉన్న ప్రేమే  సుమా!

కారునలుపైతేనేమి.. 
నా కంటికి అమ్మ తరువాత అమ్మంత 
అందమైనదానివి.
నిన్ను నా గుండెలకు అదుముకుని ఉంటే  
నేనొక జగదేకవీరుణ్ని.
నా అంతరంగ చిత్రానికి 
పికాసో రంగుల 
వింతనకలువి కదా నువ్వు!

బలపాలచేత్తో నా బతుకుని 
చదువులగుడి ఎక్కించిన మొదటి మెట్టువి.

లెక్కలు నేను  తప్పుచేస్తే 
నా వీపుదెబ్బలు తిన్న  
నిజమైన నా దోస్తువి. .

ఇచ్చిపుచ్చుకునే ఈ లోకం 
చెత్త లెక్కాపత్రాలన్నీ
ఆటగా ఎట్లా తీసుకోవాలో 
ఓర్పుగా నేర్పిన మా ముత్తాతవి.

నా ఆటలే నీవి.. నీ పాటలే నావిగా 
బతికాం ఇద్దరం.. బలేగా! 

గుర్తుందా! 
ఆ బంగారులోకంలో మనం 
బొంగరాలకుమల్లే గిరుగిర్రున తిరిగిన 
తీయటి క్షణాలు!

నా సమస్త  బాల్యప్రపంచానికి 
నిలువుటద్దం నువ్వే సుమా!
నా చిలిపి తలపులన్నింటికి 
ఓరగా తెరిచిన 
 కిటికీతలుపువి నువ్వే మిత్రమా!

నీకు ఇవాళ ఏమయిందీ?!
ఎందుకు నీ గొంతుకు    ఇలా గడియ పడిందీ  ?!

తీపి తెలుగు పలుకులు 
చప్పరించిన పాపానికి
పాలుగారే పసిపాపల 
మెడంకు  వేళ్లాడతావా.. 
ఎవరు మార్చారిలా 
నిన్నో  గుదిబండవా !

"ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు"
ఇదా.. పసిబిడ్డల నోట 
 నువు   చేయించే ప్రమాణం

ఓహో! దొరల కొలువు కాబోలు!
కాబట్టే పుట్టింది నీకీ తెగులు .. 

యూ టూ స్లేట్..!
ఐ హేట్ యూ!
***
(కాన్వెంట్ల పేరుతో నడిపే బందెలదొడ్ల బళ్ళల్లో తెలుగు మాట్లాడిన నేరానికి మెడలో పలకలతో జేబు దొంగల్లా బడి బైటనిలబడ్డ  ఇద్దరు పసిబిడ్డల  చాయాచిత్రాలు చూసినప్పుడు కలిగిన ఆవేదన నుంచి..)



Tuesday, July 28, 2015

పునాది రాళ్ల ప్రార్థన-- వ్యంగ్య కథానిక

క్రీ. శ. 3015
హాట్ జూపిటర్నుంచి అరగంట కిందట బైలుదేరిన సూపర్ సానిక్ రాంజెట్ 'గోయిండా'(గోవిందాకి.. గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదేపనిగా గిరిటీలు కొడుతోంది. చిన్నపిల్లలు ఆడుకొనే టాయ్ ఏరోప్లేన్ రీమోట్ కంట్రోలురుతో తిరుగుతున్నట్లంది ఆ దృశ్యం.
గోయిండానుంచి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్దబంతిలాగా ఉంది.
స్పేస్ సెంటర్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాంజెట్ లోని యువశాస్త్రవేత్తలిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని స్క్రామ్ జెట్ సాయంతో సూటిగా భూమివైపుకు దూసుకు రావడం మొదలుపెట్టారు.
పొట్టిగా,  బూడిదగుమ్మడికాయంత బొద్దుగా  రేలంగిలాగా ఉన్నవాడిపేరు మొగానో. పొడుగ్గా,  పొట్లకాయంత సన్నగా రమణారెడ్డిలాగా ఉన్నవాడిపేరు  తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్ యూనివర్సల్ స్పేస్ యూనివర్శిటీలో రీసెర్చి స్టూడెంట్లు.
స్క్రాంజెట్ ని రాంజెట్ ని రీమోట్ ద్వారా కంట్రోలుచేస్తూ హాట్ జూపిటర్ స్పేస్  సెంటర్లో కూర్చొని 'ఆపరేష్ డిస్కవర్ ఇండియా' సూపర్వైజ్ చేస్తున్నాయన పేరు కబిల్. అతగాడు ఆ ప్రాజెక్టుకి గైడు కూడా. సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు.
కబిల్ ముత్తాతలు కొన్నివేల ఏళ్లకిందట భూమ్మీద నివసించినవారు. ఐదువందల ఏళ్లకిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవనం మనుగడకే ముప్పు ముంచుకొచ్చినవేళ  గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకి  వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్ ముత్తాతలు సూర్యకుటుంబంలోని గురుగ్రహానికి చెందినవారే!
ప్రకృతి వికృతిగామారిన దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవజాతులన్నీ క్రమక్రమంగా నశించిపోయాయి. ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది.  అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్ కరువై  పూర్తిగా బొగ్గుపులుసు వాయువుతో నిండిపోయిన భూమ్మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!
తమ సౌరవ్యవస్థను బోలిన మరెన్నో గ్రహకుటుంబాలను వెదికి పట్టుకొని, పరిశోధించి దీసిస్ సమర్పించడం 'ఆపరేషన్ డిస్కరీ ఇండియా' లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్ గైడెన్సులో  రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించారు. గెలాక్సీలనన్నింటినీ గాలించేసె చివరి అంచెగా భూమ్మీదకు దిగుతున్నారు ఇప్పుడు.
భూతలంమీద వాతావరణంమాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే వడగాలులు ఎడాపెడా కొడుతున్నాయి. కనుచూపుమేరంతా సహారానుమించిన ఎడారి దిబ్బలే!
ఓజోన్ పొర చిరిగిపోయి సూర్యరశ్మి భూతలాన్ని నేరుగా "జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.
ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమ్మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడు యువశాస్త్రవేత్తలిద్దరికీ అంతుబట్టడంలేదు.
స్క్రామ్ జెట్ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్ కబిల్ కమాండ్స్ స్పేస్  విండోనుండి వినబడుతున్నాయి.
'కంగ్రాట్ స్! వేలాది ఏళ్లకిందట రోదసీమండలం మొత్తంలో మహానాగరికతలు వెల్లివిరిసిన పుణ్యభూమిమీద మీరు ఇప్పుడు అడుగు పెట్టారు.' కబిల్ హృదయంలో మాతృగ్రహంమీద భక్తి ఎంతలా పొంగిపొర్లుతున్నదో అతని గొంతులోని ఉద్వేగాన్నిబట్టే శిష్యులిద్దరికీ అర్థమయింది.

కబిల్ గొంతు గంభీరంగా వినపడుతోంది. 'ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్ని రంగాల్లో అదే ముందుండేది. తమ దర్పానికి దర్పణంగా వాళ్ళు నిర్మించుకొన్న 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'ని  ఫొటో తీయండి!'
కెమారాని బాస్ చెప్పిన వైపుకి ఫోకస్ చేసి చూసాడు తనాకో. అక్కడ మట్టిదిబ్బలు తప్ప ఏవీ కనిపించలేదు!
'అల్ ఖైదా వాళ్ళు ఆ అమెరికానెప్పుడో కైమాకింద కొట్టి పారేసారు. దాని నామరూపాలుకూడా మీకిప్పుడు కనిపించవు' అన్నారెవరో! ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాసుకి చేరవేసారు శిష్యబృందం.
'పోనీ సోవియట్ సోషలిస్తు రిపబ్లిక్ పేరుతో ఒకవెలుగు వెలిగి చివరకు  రష్యాలాగా మిగిలిపోయిన దేశాలగుంపువైపుకి మీ కెమేరా తిప్పండి! అట్టడుగు మానవుడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకి నిర్మాణరూపం రెడ్ స్క్వేర్. షూటిట్!' కబిల్ గాట్టి కమాండ్!
కెమేరా పొజిషన్ మారింది. అదే దృశ్యం! మటిదిబ్బలే మట్టిదిబ్బలు! 'వాళ్ల ప్రభుత్వాలను వాళ్లే కూల్చుకొన్నారు. ముక్కలు చెక్కలయినా చివరికీ ఒక ముక్కా మిగల్లేదు!' అంది ఇందాకటి గొంతే, శాల్తీ మాత్రం యథాప్రకారం కనిపించలేదు.
శిష్యులద్వారా సమాచారం విన్న కబిల్ అన్నాడీసారి 'లండబ్ టెన్ డౌన్ లో ఉద్దండ పిండాలుండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించేందుకు అంగుళం  చోటైనా ఉండేది కాదంటారు. ఆ మహాసామ్రాజ్యపు మహారాజులు, రాణులు నివాసమున్న వీధిని మీ కెమేరాల్లో బంధించండి!'
తనాకో కెమేరా అటు తిరక్కముందే అందుకొంది ఇందాకటి గొంతు 'నో యూజ్! ఆ సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యం తరువత్తరువాత అమెరికా సింహానికి తోకమాదిరిగా తయారైంది. అల్ ఖైదా దెబ్బకీ  అమెరికాతో పాటే మాడి మసయింది!'
ఓన్లీ వాయిస్ ఓవర్! నో పర్సన్ ఎట్ సైట్!
నుదుట దిద్దుకొనేటంత చిన్నదైనా అమెరికాన సైతం గడగడలాడించిన దేశం  జపాను. వారి నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినా నాటి మానవుడు సాంకేతికంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకొన్నాడో జపానువారిని చూసి తెలుసుకోవచ్చు. వాళ్ల విసనకర్ర ఈక కనబడినా చాలు ఒక్క స్నాపు తీసుకోండి!' అన్నాడు కబిల్ నిరాశను గొంతులో కనిపించనీయకుండా!
'అణుధార్మిక విధ్వసంతో దానికదే బూడిదయింది!' అంది ఆకాశవాణి ముక్తుసరిగా ఒక్క ముక్కలో.
'ప్రపంచానికి ఫ్యాషన్ ఎలాఉంటుందో నేర్పించిన ఫ్రాన్స్!' కబిల్ గొంతు.
'ఎయిడ్స్ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగారదేశాన్ని కబళించేసింది' ఆకాశవాణి గొంతు.
'క్యూబా..' కబిల్ గొంతులో వణుకు.
'ప్లేగు వ్యాధికి ఫినిష్' అశరీరవాణి తాపీగొంతు. 
'ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్.. కజికస్తాన్..' కబిల్ దేశాలపేర్లు గడగడా చదువుకుపోతున్నాడు.
'అవన్నీ తాలిబాన్లకి స్థావరాలుగా మారిన తరువాత చరిత్రలో స్థానంలేకుండా పోయాయి. ఆఫ్రికా అడవుల్ని  కార్చిచ్చు, ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లో ఫీవరు.. ఒక్కముక్కలో మీకు అర్థమయేటట్లు చెప్పాలంటే తుఫాన్లూ, భూకంపాలూ, సునామీలూ, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామరూపాల్లేకుండా సర్వనాశం చేసేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా మిగిలున్నా రాజకీయాలు వాటిని నాకేసాయి. చివరికి మిగిలింది ..ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే.. ఈ మట్టిదిబ్బలే!' అశరీరవాణి ఆపకుండాచేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్తలిద్దరికి  తెగ వళ్ళు మండిపోయింది.
గురువుగారికి ఇష్టమైనదేమన్నా పట్టుకుపోదామనుకుంటే మధ్యలో వీడెవడు? పిలవా పెట్టాకుండా కల్పించుకొని  ఏదడిగినా 'బూడిదయింది.. మసయింది.. మన్నుకొట్టుకుపోయింది.. నాశనమయింది.. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.. మురిగిపోయింది.. మునిగిపోయింది' అంటూ అపశకునాలు తప్ప వల్లించడం లేదు! రెండు వాయిద్దామంటే వాయిస్సేగాని శాల్తీ ఎదురుగా కనిపించి చావడంలేదు!
తమకు డాక్టరేట్ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది!
కడుపులోని మంటను కడుపులోనే ఉంచుకొంటే ఏం ప్రయోజనం?  కనబడ్డా కనబడకపోయినా ముందు కడిగిపారేస్తే సరి!
'ఇందాకట్నుంచీ చూస్తున్నాం. ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటావు! ప్రకృతిభీభత్సానికి సర్వం బూదిద అయిపోతే తమరెలా మిగిలున్నారు  మహాశయా?' తనాకో ఇక తమాయించుకోలేక పెద్దగొంతుతో అరిచాడు
'ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మా ముందుకురా!' సవాలు విసిరాడు మొగానో తన వంతు వంతగా.
బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. 'మీరు నిలబడ్డ చోటులోనే భూమి అడుగున ఉన్నాను.  పిల్లల్లారా!'
మొగానో గబగబా గొయ్యితీయడం మొదలు పెట్టాడు. రెండు అడుగులుకూడా తవ్వకుండానే బైటపడిందా గొంతు తాలూకు  వింత ఆకారం.
నిట్టనిలువుగా ఉంది. ధగధగా మెరిసిపోతోంది. వంటిమీదంతా ఏవో గాట్లు.. పైనుంచీ కిందదాకా!
ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతరవాసులు రోదసీమండలంలో ఇంతవరకు ఎక్కడా చూసింది లేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వజీవజాలం దుంపనాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్టనిలువుగా.. తాజాగా.. తళతళలాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడంగానే .. నిజం చెప్పద్దూ.. యువశాస్త్రవేత్తలిద్దరికీ ఒకింత గౌరవంకూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా  మనసులోని మాటను బైటపెట్టాడు తనాకో 'ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కారు సార్?'
ఆ ఆకారం చెప్పటం మొదలు పెట్టింది. 'పునాదిరాయి అంటారు నన్ను. వేల ఏళ్లకిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పాలనావిధానం  ఒకటి వర్ధిల్లింది. ప్రజలే రాజులు. ప్రజలకొరకు, ప్రజలవలన, ప్రజలచేత నడిచే పరిపాలన అది. మరీ లోతుగా వెళ్ళొద్దు! మీరొచ్చిన పని మర్చిపోయి తరిగి వెళ్లడానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా రాజకీయ వ్యవహారం! ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు.   వాళ్ళు పాలించే ప్రజలు. ఈ మాత్రం అర్థం చేసుకోండి! ప్రస్తుతానికి  చాలు.!'
'ఇహ నేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టులు కట్టిస్తామని, పాఠశాలలు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. వగైరా.. వగైరా! వాళ్ళు వాగ్దానాలు చేసినంతమాత్రాన జనం నమ్మాలని ఏముంది? నమ్మనివాళ్లని నమ్మించడానికి నాయకులు 'ఇదిగో.. ఇవాళే.. ఇక్కడే.. మీకు భవిష్యత్తులో కట్టబోయే  భారీ నిర్మాణానికి నాందీగా.. పునాదిలో ఓ రాయి వేసేస్తున్నాం!" అంటూ బ్రహ్మాండంగా  ఊరేగింపూ..  గట్రాచేసి  ఆర్భాటంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మి జనం ఓట్లేస్తే.. గెలిచేసి.. గద్దెనెక్కి..  వాళ్ళు చేయాలనుకొన్న పనులన్నీ మళ్లీ ఎన్నికలొచ్చేసే లోపల సుబ్బరంగా చేసేసుకొంటారన్నమాట'.
'ఒక్క నిమిషం పునాదిరాయీ! చిన్నసందేహం! మరి వాగ్దానం చేసినట్లు నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్మాణాలన్నీ చేసేస్తారుకదా! అయినా మీరింకా ఈ గోతుల్లో శిలావిగ్రహాల్లా పడి అల్లాడుతున్నారేంది?!'
పకపకా నవ్వింది పునాదిరాయి. 'మరదే ప్రజాస్వామ్యమంటే! సరే! ఇందాకట్నుంచీ ఏదీ కనిపించడంలేదని తెగ అల్లాడుతున్నారుగా! అమెరికా, రష్యా, చైనా, జపానంటూ ఎన్నడో అంతరించిపోయిన దేశాలను గురించి దేవులాడుకొంటున్నారుగా! వృథాగా వాటికోసం సమయం పాడుచేసుకోకుండా.. నన్నూ నా సోదరులనూ ఫోటో తీసుకుపోండి! అంతదూరంనుంచి వచ్చినందుకు ఆ మాత్రమైనా దక్కిందని సంతోషించండి!'
'నువ్వేగాక నీకు సోదరులుకూడా ఉన్నారా ఇంకా?! వాళ్ళూ నీకులాగే సజీవంగానే ఉన్నారా?!' నోరెళ్లబెట్టడం తనాకో వంతయింది.
'ఎందుకు లేరబ్బాయ్? వందలొందలు! మీ కెమేరాల మెమరీ కార్డు చాలదు! ఆన్ చేసుకోండి! వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్ వేసుకోండి! అదిగో అది బ్రాహ్మణి సిమెంటు ఫ్యాక్టరీ పునాదిరాయి. ఇప్పుడు రద్దయిపోయిందనుకోండి!  పోలవరం అనే భారీ నీటిప్రాజెక్టుకి వేసిన పునాదిరాయి! అదిగో ఆ మూల ఉన్నది! ఇదిగో.. ఇవాళో.. రేపో.. అంటో యుగాలబట్టీ కథ నడుపుతున్నారు! ఇది  హంద్రీ నీవా సుజల స్రవంతి పునాదిరాయి. ఇది సిద్దిపేట స్పోర్ట్ స్ స్టేడియం పునాది రాయి. రెండు తెలుగురాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు వేసిన పునాది రాళ్లిలాగా ఇంకా చాలా ఉన్నాయి.  అదిగో ఆ మూల వున్నదే .. అది హైదరాబాదనే అప్పటి తెలుగురాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యల నివారణకని ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు పునాదిరాయి. స్థలంమారి ఆ ప్రాజెక్టు ఇప్పుడు మరో దిశలో సాగుతున్నది. అయినా దీనికి ముక్తి కల్పించే దిక్కు కనిపించడం లేదు.  ఇది బడాయిగడ్డా లోకాజ్ వంతెన తాలూకు పునాదిరాయి. ఇదిగో..  ఇది పుణ్యవరంలో వంతెన  నిర్మాణానికని వేసిన రాయి. ఇది పటాన్ చెరువులో వెయ్యి పడకల ఆసుపత్రికని అప్పటి ముఖ్యమంత్రి వేసిన శిలాఫలకం! ఇలా మీరు ఎక్కడ చూసినా చక్కని పునాదిరాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండటాన్ని గమనించవచ్చు!  ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మా గతి మారలేదు, మా ఫొటోలు తీసుకొని మామీదగాని మీరు థీసిస్ సమర్పిస్తే  పట్టా గ్యారంటీ! ఆ విధంగానైనా మేము ఉపయోగపడ్డామని సంతోషిస్తాం.' పునాదిరాయి నిట్టూర్పు.
అందంగా తళతళలాడే ఆ పునాది రాళ్లన్నింటినీ కెమేరాలో బంధించి తృప్తిగా తిరుగుముఖం పట్టారు యువశాస్త్రవేత్తలిద్దరూ!
స్క్రామ్ జెట్ ఇంజను స్టార్టుచేస్తూ మొగానో పునాదిరాయితో కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు 'మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం!'
'ఈ జన్మలోనే సుబ్బరంగా  తీర్చుకోవచ్చబ్బాయిలూ! మమ్మల్నిలా నిలువునా పాతేసినా పెద్దమనుషులు మీకు  వెళ్లేదారిలో ఏ నరకంలోనో.. పాతాళంలోనో  తప్పకుండా తగులుతారు.  పెద్దమనసు చేసుకొని ఒక్కసారివచ్చి మాలో కనీసం కొందరికైనా విముక్తి కలిగించి పుణ్యంకట్టుకోమని మా మాటగా విన్నవించండి.. చాలు!'  అని కన్నీరు పెట్టుకొంది అ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.***
-కర్లపాలెం హనుమంతరావు
చిత్రాల సౌజన్యంః కర్లపాలెం నిరంజన్
(సారంగ- అంతర్జాల పత్రిక జూన్ సంచిక 24-07-2015లో ప్రచురితం)








Sunday, July 26, 2015

కృత(క) యుగం- ఓ సరదా గల్పిక

కార్తీకమాసం. శుక్లపక్షం. శుద్ధ నవమి. కృత యుగారంభ దినం. బ్రహ్మాజీ ఆ యమ బిజీగా ఉన్నాడు. దాదాపు అన్ని ఏర్పాట్లూ పూర్తైపోయినట్లే. ఇహ ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడమే తరువాయ.
ముందుగా ధర్మ దేవతకు ఫోను కొట్టాడు. నాలుగైదు రింగులైతేనే గానీ రంగం మీదకు రాలేదా మహా తల్లి. “సారీ! మీకు తెలీందేముంది! ఒంటి పాదం..” ధర్మ దేవత  సంజాయిషీ.
ఓకే..ఓకే! ఈ ఘడియ వరకే నీకీ కష్టం. ఈ బ్రహ్మీ ముహూర్తం నుంచి ఇహ నీ ఇష్టం.  పరుగే పరుగు! కృత యుగం ఆరంభం. కంగ్రాట్స్ ధర్మ దేవతా!”
కంగారు పడింది ధర్మ దేవతఒక్క పాదంతో తిప్పలు పడుతున్న మాట నిజమే. కానీ ఎన్నేళ్ల బట్టో ఇలా అలవాటై పోయింది.   మళ్లా నాలుగు పాదాలంటే .. బాబోయ్ నా వల్ల కాదుచతుష్పాదుల్ని మరీ పశువుల్లా చూస్తుందీ భూలోకం.  ఐనా ఇప్పుడంత  ఉరుకులు పరుగులు పెడుతూ నేను చేసే రాచకార్యాలు మాత్రం ఏమున్నాయి గనక? పెద్ద  లోగిళ్ళు.. కడుపులో చల్ల కదలకుండా పడి ఉన్నాను .. నన్నొదిలేయండి సార్ ఈ యుగానికి.. ప్లీజ్!”  ఠకాలున ఫోన్ పెట్టేసింది ధర్మ దేవత.
ఆదిలోనే హంస పాదా!కిసుక్కున నవ్వింది వాణి.
తర్కిస్తూ కూర్చోడానికి టైము లేదు. అవతల ఆరంభ డియలు ముంచుకొచ్చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న వాళ్ళందర్ని ముందు సంప్రదించాల్సిందే.
హరిశ్చంద్రుడికి ఫోన్ కొట్టాడీ సారి బ్రహ్మ గారు. విషయం వినంగానే వినయంలో తేడా వచ్చేసిందిసార్! ప్రతి సత్య యుగంలో సత్య హరిశ్చంద్ర నాటకం అంతవసరమా ! నిజం విలువ లోకాలకు తెలియ చేయాలనే కదా ఆది దంపతులు నా నాటకం ఆడించింది! తెలివి మీరిన జీవులు పెడర్థాల్లు తీస్తున్నారు సార్ ఇక్కడ. మహాత్ముడంటే  సత్యకాలం మనిషి. ఆయనొక్కడు మారాడని లోకాలన్నీ మార్తాయా ? బలిజేపల్లి వారి క్కూడా అక్కర్లేదిప్పుడు ఈ నీతులు. ఇంకెవరి కోసం సార్ మళ్లీ నేనూ.. నన్ను కట్టుకున్నందుకు చంద్రమతి.. లోహితాస్యుడు అష్ట కష్టాలు పడాలి?  ఈ సారి గానీ విశ్వామిత్రుల వారు వచ్చి దాన మడిగితే కావాలంటే కమండలం కొత్తది బంగారంతో చేయిస్తా గానీ భూ మండలం గీమండలం జాన్తా నై’  అంటూ ఫోన్ పెట్టేశాడు హరిశ్చంద్రుడు.
బ్రహ్మాజీ ఈసారి నేరుగా ఇంద్రుడికే ఫోన్ కొట్టాడు. కృతయుగారంభ వార్త ఆ దేవ రాజుకీ ఏమంత ఉత్సాహంగా అనిపిస్తున్నట్లు లేదు. క్షీరసాగర మధనం మళ్లీ సాగించడంలోని సాధక బాధకాలను ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు ”బహు భారీ పథకం బ్రహ్మగారు పాల సముద్రం చిలకడంకలికాలం సుఖాలు మరిగాక ఎవరూ దేనికీ వూరికే  లొంగడం లేదు. వేష భాషల్ను బట్టి ఇప్పుడు ఎవడు సురుడో.. ఎవడు అసురుడో కని పెట్టడం కష్టం.  వచ్చే ప్రభుత్వాలను బట్టి లెక్కలు మారి పోతున్నాయి. చిలికే అంత పెద్ద వ్వం ఇప్పుడేదీ! వాసుకి జోలి కెళితే వన్యమృగ సంరక్షణ చట్టాలు వూరుకోవు. మంధర పర్వతం ఎప్పుడో జనావాసాల  కింద మారిపోయింది! కూర్మావతారం ఆ విష జలాల అడుగున  ఒక్క గడియైనా నిలబడేలా లేదు. సత్య యుగం కాబట్టి  కామధేనువుని, కల్ప వృక్షాన్ని, ఐరావతాన్ని, పెద్ద దేవుళ్లెలా పంచుకున్నా పెద్ద గొడవలేం కాలేదు. రోజులు మారి పోయాయి బ్రహ్మాజీ! నీలకంఠుడికైనా హాలాహల సేవనం  అంగీకారమో కాదో కనుక్కోండి ముందు. సర్వమంగళ గతంలో మాదిరి భర్త విషయంలో భరోసా ఇస్తుందో లేదో.. అనుమానమే. అన్నింటికీ మించి నారాయణ స్వామి మరో దేవి పాణి గ్రహణం లక్ష్మమ్మకు సమ్మతంగా ఉంటుందనుకోను  ”
“కచ్చితంగా ఉండదు. అసలే ఆడదైనా మొగుడు మరో దానితో కులుకుతుంటే చూస్తూ ఎందుకూరుకోవాలి?  కృత యుగంలో ఎలా జరిగిందో ఏమో తెలీదు  కాని.. ప్రస్తుతం మాత్రం మహిళా సంఘాలు  చాలా బలంగా ఉన్నాయి భూలోకంలో” సరస్వతీ దేవి హూంకరింపు. సందు చూసి దేవేంద్రుడు చల్లగా ఫోన్ పెట్టేశాడు.
కృత యుగారంభానికి ఈ సారి ఇన్ని కృత్యాద్యవస్థలా?! కల్లో కూడా ఊహించినట్లు లేదు పాపం  బ్రహ్మ దేవుడు.
వేద వ్యాసుని మూలకంగా వచ్చి పడ్డాయీ తిప్పలుసత్యసంధతకు కృత యుగం.. సత్య వినాశనానికి కలి యుగమని పేర్లు కల్పించి ఇప్పుడు చంపుతున్నాడు. అవతల ముహూర్త ఘడియలు ముంచుకొచ్చేస్తున్నాయి. సత్య యుగారంభం కోసం యుగాల బట్టి కంట వత్తు లేసుకుని ఎదురు చూసే ఆశాజీవుల కిప్పుడేం సమాధానం చెప్పి తప్పించుకోవాలి.. నారాయణా?”
నారాయణ.. నారాయణనాలుగు తలలూ ఒకేసారి పట్టుకుని నేల చూపులు చూసే తండ్రి గారిని పరామర్శించడాని కన్నట్లు  ప్రత్యక్షమయాడు నారద మహర్షి
నీ నారాయణ నట్టేట్లో కూలా! నా పుట్టి మునిగేట్లుందిరా నాయనా ఇక్కడ!”  బావురు మన్నాడు బ్రహ్మ దేవుడు.
కంటి రెప్ప పడే వ్యవధానంలో పరిష్కారమయ్యే సమస్య కదా తండ్రీ  ఇది ! నడుస్తున్న కృతక యుగానికే కృత యుగమని పేరు పెడితే సరి. ప్రచారం హోరెత్తించడానికి అనుచర గణాలం మేం లేమా?” నారదులవారి ఓదార్పు.
కృత యుగమంటే సత్య యుగమని కదా  ప్రతీతి! మిథ్యావాదం, సర్వ భక్షణం, అల్పాయుష్షు, అసత్యవాదం, రస రాహిత్యం, రుచి హీనత్వం, నిత్య కామం, పర పీడనానందం, కుపరిపాలన, నాస్తికత్వం, పరాన్న భోక్తం, చౌర్యం, లౌక్యం, దంభం, మోసం ..నా నోటితో ఎందుకులే ఆ గోలంతా..అగ్ని గుండ కాసారంలా మండే ఆ భూగోళాన్నా నువ్వు సత్య యుగమని ప్రకటించ మనేది?! ” నోరు వెళ్ళబెట్టాడు బ్రహ్మ దేవుడు.
యుగాల తరబడి తమరు ఈ తామరాసనాన్ని  వదలక పోవడం  వల్ల లోకం తీరు  క్షణానికో రకంగా ఎలా మారుతున్నదో గ్రహింలేకున్నారు జనకా! ఈ మధ్యనే పుట్టుకొచ్చాయి భూమండలంలో కొన్ని కొత్త ప్రభుత్వాలు. అవి  తాజాగా సేకరించిన సర్వేల వివరాలు చాలు ..మీ సత్యయుగాని కన్నా ఎన్నో ఉత్తమ లోకాల సృష్టి అక్కడ రెప్ప పాటులో జరిగి పోతున్నదని తెలుసుకోడానికినారదుల వారు అందించిన  సర్వే నివేదికల బొత్తి వంక ఓ సారి తేరిపార చూసారు విధాత గారు.
వాస్తవానికి సత్య యుగంలో కన్నా కలి యుగంలోనే సత్యానికి పరీక్షలు ఎక్కువ. పొద్దస్తమానం పిల్లకాయలకి ఆబ్జెక్టివ్ మోడలంటూ 'ట్రూ' ఆర్ 'ఫాల్స్' బిట్ ప్రశ్నలు మప్పుతున్నారు ఇక్కడ. గిట్టని నాయకుణ్ని నడి మీడియాలో నిలబెట్టేందుకు  వెయ్యో.. వందో ప్రశ్నలు వరసగా సంధించి 'నిజమా..  కాదా' అని నిగ్గదీసే రాజకీయాలు రోజూ నడిచేవీ  ఈ కాలంలోనే. ఏ అన్నవరం బస్టాండులోనో నిలబడి 'ఏమోయ్.. సత్యనారాయణా' అనో 'ఏమ్మా.. సత్యభామా' అనో గట్టిగా గొంతెత్తి పిలవండి! 'ఆయ్' అంటో వంద గొంతులు  ఒకే సారి ఖంగు మంటాయి. కలియుగ సత్య ప్రియత్వానికి ఇదో తిరుగులేని తార్కాణం. చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు పదవీ ప్రమాణాలు స్వీకరించేటప్పుడు, న్యాయస్థానాల్లో నిందితులు బోనుల్లో నిలబడి నమ్మబలికేటప్పుడు ఓం ప్రథమంగా స్మరించుకునేది సత్య దేవతనే. గీత మీదో.. రాజ్యాంగం మీదో ప్రమాణం చేసేస్తే సరి నోట బలికేదంతా సత్యం కిందే నమోదై పోయే కాలం కలికాలం!  ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులందరికీ సత్య ధృవీకరణ పత్రాల సమర్పణ తప్పని సరి చేసింది ఎన్నికల సంఘం. సాక్షాత్ శ్రీరామ చంద్రుల వారైనా సరే..   అరణ్యవాసంలో ఆదాయానికి మించిన ఆస్తులేవీ కూడ బెట్టలేదన్న ప్రమాణ పత్రం  సమర్పిస్తేనే  పట్టాభిషేక మహోత్సవానికి  చట్టబద్ధత ఏర్పడేది ఈ కలి యుగంలో. వధూవరుల చేత అగ్ని సాక్షిగా 'నాతి చరామి' అంటూ సత్య  ప్రమాణాలు చేయిస్తేనే అది సామాజి కామోదం పొందే రిణయం. యూపీయే పాలనలో  నడిచినన్ని  నిజ నిర్దారణ కమిటీలు మిగతా మూడు యుగాల మొత్తంలో సగమైనా లేవు. ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా.. ఉపద్రవాలు ముంచుకొచ్చినా.. బాధితుల ఉపశమనార్థం  ముందుగా ఊరేగేవి నిజ నిర్దారణ బృందాలే. ఆడిన మాట అబద్ధమని రుజువైతే చివరికి రాజకీయ సన్యాసమైనా సరే స్వీకరించేందుకు వీలుగా  రాజీనామా పత్రాలు జేబుల్లోనే పెట్టుకు తిరిగే రాజకీయ సంసారులు దండిగా ఉన్నారీ కలికాలంలో. సత్య యుగమని తెగ గొప్పలే గాని.. మోహినీ అవతారమే ఓ పెద్ద అబద్దం గదా! సత్యప్రియుడని పెద్ద పేరున్నా  శత్రువు   నట్టింటనే నక్కున్న వైనం ప్రహ్లాదుడెక్కడ పొక్కనే లేదు చివరి క్షణం వరకు! కలియుగీయులకు నిజం నిప్పు. ఆ కణికను చూస్తేనే జీవులకు వణుకు. లోకాలు మాడి మసై పోరాదనే  కష్టమైనా పళ్ల బిగువున నిజాన్ని గుప్పెట్లో పెట్టుకుని తిరిగేది ప్రజా నేతలు. సత్య యుగంలో ఒక్కడే నీల కంఠుడు. కృత యుగంలో ప్రతీ ప్రజా ప్రతినిధీ ఓ నీలకంఠుడే.
నిజాలను కక్కించడానికి ఈ యుగంలో ఎన్నో కట్టు దిట్టాలు! చెరసాలలు,  విచారణలురా యంత్రాంగాలు, లై డిటెక్టర్లు, నార్కోటిక్ పరీక్షలు, కాణీ పాకం వినాయకుళ్ళు. సత్య యుగంలో నిజ నిర్థారణని  ఒక్క వ్యవస్థా  ఏర్పడినట్లు లేదు! బాపుజీ మాదిరిగా  సత్యయుగంలో సత్యంతో ఏ మహాత్ముడూ ప్రయోగాలు చేసినట్లూ  కనిపించదు. సత్యమింత  కట్టు దిట్టంగా అమలవుతున్నా కలియుగానికి వికృత యుగమని చెడ్డ పేరు రావడం అన్యాయం
ముహూర్తం ఘడియలు ముంచు కొస్తున్నాయితొందర పెట్టింది మంజువాణి.
బ్రహ్మగారు గంభీరంగా ప్రకటించారు” “ భూలోక వాసుల  కొత్త ప్రభువుల తాజా  సర్వేలు  కలియుగ సత్య సంధతను సమగ్రంగా ఆవిష్కరించాయి. ఆ నివేదికల ఆధారంగా మరో కొత్త కృతయుగ సృజన వృథా ప్రయాసేనని భావిస్తున్నాను.    ఈ కార్తీక శుక్ల పక్ష  శుద్ధ నవమి శుభ మూహూర్తంలో నడుస్తున్న కలియుగాన్నే   కొత్త కృతయుగంగా  ప్రకటిస్తున్నాను
దేవ దుందుభువులు మోగడం మొదలు పెట్టాయి. నూతన కృత యుగారంభ శుభవార్తను  ముల్లోకాలకు చేరవేసేందుకు  నారదుల వారు బైలు దేరారు. స్వస్తి.
-కర్లపాలెం హనుమంత రావు




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...