Monday, September 14, 2020

ధర్మ మార్గమే ధ్యేయంగా నడిచిన మనుషుల కథ మట్టి మనుషులు(శ్రీమతి తాతినేని వనజ విశ్లేషణ)- పురిపండావారి అనువాద నవల


 శ్రీ పురిపండా అప్పలస్వామి అనువాద నవల 'మట్టి మనుషులు' పై ప్రముఖ రర్చయిత్రి శ్రీమతి తాతినేని వనజ చేసిన అతి చక్కని విశ్లేషణః నవల ఎంతలా ఒకే ఊపున చదివిస్తుందో వనజగారి రివ్యూ కూడా అంతే  హృద్యంగా మనసును ఆకట్టుకుంటుంది. 




దీపక రాగం - మేఘమల్లార్ రాగం - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 



దీపక రాగం ఆలపిస్తే దీపాలు వెలుగుతాయంటారు! మేఘమల్లార్ రాగం ఆలపిస్తే మేఘాలు వర్షిస్తాయని నమ్మిక!  మొదటి రాగం వేడిని రగిలిస్తే, రెండో రాగం చల్లదనం కలిగిస్తుందన్న అర్థంలో ఈ హిందూస్తానీ రాగాలను గురించి  అతిశయోక్తి అలంకారంలో జనం చెప్పుకునే మాటలు. సామాన్యులలో ఆసక్తి రేకెత్తించేందుకు సాధారణమైన విషయాలని అసాధరణ రీతిలో చెప్పడం 'కథనం' ప్రక్రియలో ప్రత్యేక విశిష్టిత. ప్రధానమైన అంశాన్ని ఒక కథగా మలచి వినిపిస్తే విన్నంత సేపూ విసుగు పుట్టదు. తరువాత మననం చేసుకునేందుకు కథా విధానం ఒక మంచి పద్ధతి. ఈ దీపకరాగం, మేఘమల్లార్ రాగాల చుట్టూ కూడా ఇలాగే ఎవరో ఒక కాల్పనిక జీవి సృజనాత్మకమైన చక్కని కథ అల్లాడుః


అక్బర్ పాదుషాను గొప్ప కళాభిమాని, కళాపోషకుడుగా చెప్పుకుంటారు కదా! ఆయన కొలువులో అన్ని రకాల కళలకు చెందిన నిష్టాతులకు గౌరవం దక్కేదని వినికిడి. తాన్ సేన్ ఆ బాపతు హిందూస్తానీ సంగీత కళాకారుడు.

అక్బర్ దగ్గర చనువుగా ఉండే బీర్బల్ ఒకరోజు దీపకరాగం గురించి పాదుషాలో కథలు కథలుగా చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. అక్బర్ తాన్ సేన్ ను నిండు సభలో తనకు ఆ దీపకరాగం ఆలపించి వినపించమని ఆదేశించాడు. అప్పటి దాకా సుఖంగా గడిచిపోయే తాన్ సేన్ సంగీత జీవితానికి ముప్పు  ఏర్పడిందన్న మాట. దీపకరాగం తాన్ సేన్ కు రాక కాదు. అది ఆలపించి ఇంచక్కా దీపాలు వెలిగించి చూపరులకు ఆనందం కలిగించవచ్చు. కానీ గానం చేసిన గాయకుడు కొద్ది రోజులలోనే అనారోగ్యం పాలవుతాడని, చికిత్సలేని రుగ్మత వల్ల దుర్మరణం సంభవిస్తుందన్న ఒక  నమ్మకం  ప్రచారంలో ఉంది. పాదుషా ఆజ్ఞాపించిన మీదట కాదనేందుకు లేదు కదా! కనక, దీపకరాగం ఆలపించి నిండుసభలో పాదుషా ప్ర్రశంసలు పొందినా, తాన్ సేన్ తొందర్లోనే అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స చేసిన రాజవైద్యులు పెదవి విరిచి 'దీపకరాగం వల్ల వచ్చిన పీడకు మేఘమల్లార్ రాగం ఒక్కటే మందు. అది పాడినా, విన్నా క్రమంగా తగ్గుముఖం పట్టాల్సిందే తప్ప ఈ గుండెల్లో మంట రోగానికి మరో  ఉపశమనం లేదు.' అని తేల్చిచెప్పారు. తాన్ సేన్ కు ఆ రాగం రాదు. అది వచ్చినవారు ఎక్కడ ఉంటారో .. ఆ వివరాలు కూడా తెలీవు.  వెదుకులాట మొదలయింది. 'పాడేవారు దొరికేదాకా  గుండెల్లో ఆరని ఆ మంటకు ఉపశమనంగా ఉండేందుకు వీలుగా తాన్ సేన్ ను ఏదైనా చల్లని నదీ తీరానికి పంపించండి' అని సలహా  ఇచ్చారు వైద్యులు.

అక్బర్ అనుమతితో  గుజరాత్ లోని శబర్మతీ నదీ తీరాన ఒక కుటీరం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు తాన్ సేన్.

రాష్టం మీద మొగలాయీల కన్ను పడిందన్న అనుమానంతో ఉన్న  గుజరాతీ సమాజంలో దానికి తగ్గ విధంగా ఆడవారు తమ నడవడికను మార్చుకున్నారు. పగలు బయట మొహాలూ చూపించడం దాదాపుగా తగ్గించేశారు. ఇంటి అవసరాలకు కావలసిన నీళ్లు తెల్లవారు ఝామున చీకట్లలోనే నదీ తీరానికి గుంపులుగా వెళ్లి తెచ్చుకునేవాళ్లు.  ఆవిధంగా నీరు తెచ్చుకునేందుకు నదీ తీరానికి వచ్చిన అక్కచెల్లెళ్ళు నది ఒడ్డున కుటీరం బైట గుండెలోని ఆవేదన ఆగక బాధపడే తాన్ సేన్ ను చూశారు. 'అక్కడెవరో దీపకరాగం ఆలపించి పాపం అనారోగ్యం పాలయినట్లున్నారే!' అంది ఒక ఆడగొంతు. రెండో గొంతు 'ష్.. ష్.. మనకెందుకు? పోదాం పద!' అంది. ఆడవాళ్ళిద్దరూ గబగబా బిందెలో నీరు నింపుకొని గట్టు ఎక్కి పైకి రాసాగారు. గట్టు మీద నిలబడి ఉన్న తాన్ సేన్ వాళ్లను చూశాడు. ఆ ఆడవాళ్లిద్దరు పడుచువయసులో, అందంగా, పొందికగా ఉన్నారు. 'నేను దీపకరాగం ఆలపించినట్లు మీకు ఎలా తెలుసు తల్లులూ?' అని అడగాలని తాన్ సేన్ ఉద్దేశం. ఆయన పెదవి విప్పి అడిగే లోపలే  ఆ ఆడవాళ్లు ఇద్దరూ ఎవరో తరుముతున్నట్లు వెళ్లిపోయారు!

మర్నాడు అదే చోట వాళ్ళ కోసం కాపు కాసి కష్టపడి ఎట్లాగైతేనేం ఆడపిల్లలు ఇద్దరిని నిలబెట్టాడు తాన్ సేన్. తన పేరు ఫలానా అని, అక్బర్ పాదుషా కొలువులో పాటలు పాడే ఉద్యోగిన'ని చెప్పుకోగానే ఇద్దరిలో పెద్దపిల్ల 'అమ్మో! అక్బరు పాదుషానే! ' అంటూ కంగారుపడుతూ చెల్లెలు చెయ్యి పట్టుకుని  లాక్కెళ్లిపోయింది. విచారణ  మీదట తాన్ సేన్ కు ఊరిలో మొగలాయీల మీద ఉన్న బెదురు అర్థమైంది

మర్నాడు తెల్లారుఝాము చీకట్లలో మళ్లీ ఆ అప్పచెల్లెళ్లను కలుసుకుని 'చెల్లెమ్మల్లారా! నన్ను చూసి భయపడనక్కర్లేదు! మీరు చూస్తే  సంగీతజ్ఞులకు మల్లే కనిపిస్తున్నారు. మేఘమల్లార్ రాగం మీకు గాని తెలిస్తే పాడి నాకు సాయం చేయండమ్మా! లేదా ఆ రాగం తెలిసినవాళ్ల వివరాలు చెప్పినా మీ పుణ్యం వృథా పోదు తల్లులూ!' అంటూ  పరిపరి విధాల ప్రాథేయపడ్డాడు


అమ్మాయిలు ఇద్దరకూ జాలి కలిగింది. చిన్నపిల్ల అన్నది' మాకూ కొద్దిగా సంగీతం వచ్చు. మేఘమల్లారం పాడి వినిపిస్తామురేపు పౌర్ణమి కదా! తెల్లారుఝామున చీకట్లు విడకముందే ఈ నదీ తీరానికి వచ్చేయండి. ఇట్లా వస్తున్నట్లు ఎవరికీ చెప్పకండి!' అన్ని వెళ్లిపోయారు

మర్నాడు అనుకున్న సమయానికే అక్కచెల్లెళ్లిద్దరూ ఆ నది తీరంలొ ఎదురుచూస్తూ కూర్చునివున్న  తాన్ సేన్ ను కలుసుకున్నారు. చిన్న అమ్మాయి కుటీరంలోకి వెళ్ళి తాన్ సేన్ సితారా తీసుకువచ్చింది. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆ పండు వెన్నెలలో ప్రశాంత వాతావరణంలో నదీ తీరాన అత్యంత మధుర స్వరాలతో మేఘమల్లార్ రాగం అలపిస్తుంటే వింటూ తన్మయుడయిపోయాడు స్వయంగా  సంగీత విద్వాంసుడు అయిన తాన్ సేన్. మేఘమల్లార్ ఆలాపన  వింటుంటే తాన్ సేన్ కంటి వెంట నీరు ఆగలేదు. గానం పూర్తవగానే 'మీరు మానవులు కాదు తల్లులూ! దివి నుంచి దిగివచ్చిన గంధర్వులు. మీ స్వరాలకు చిక్కి సంగీతలక్ష్మి స్వయంగా తానే పునీతమయింది తల్లుల్లారా' అన్నాడు  కంటి వెంట కారే బాష్పధారలను తుడుచుకోకుండానే. మరంత విచారించిన మీదత తమ పేర్లు 'తానా.. నానా' అని మాత్రం చెప్పుకొచ్చారు ఆడపిల్లలు


తానా నానాలు మూడు రాత్రులు మొదటి ఘడియల్లో అట్లా మేఘమల్లార్ రాగం ఆలపించగానే తాన్ సేన్ గుండెల్లోని జ్వాల చల్లారింది. మనుషుల్లో పడ్డ  తాన్ సేన్ తిరిగి వెళ్లిపోయే సమయంలో తానా నానాలకు బహుమానాలు ఇవ్వబోతే  తీసుకోలేదు 'మా గురించి మూడో కంటికి తెలియనీయకండి! అదే మీరు మాకు ఇచ్చే అతి పెద్ద బహుమానం అన్నయ్యగారూ!' అని మాత్రం మాట తీసుకున్నారు.

కోలుకొని తిరిగివచ్చిన తాన్ సేన్ ను చూసి అక్బర్ పాదుషా అమితంగా ఆనందించాడు.  కానీ సాటి సంగీత కళాకారులలో ఈసు రగిలింది. 'మేఘమల్లార్ రాగం పాడి వినిపించమని మీరే స్వయంగా అడిగినా  రాదని తాన్ సేన్ తమకు చెప్పాడు. ఆ మాట అబద్ధం అని ఇప్పుడు తేలింది కదా హుజూర్ఆ తప్పుకు దండన ఉండద్దా?' అన్నది వాళ్ల ప్రశ్న.

 అక్బరు కూడా  ఇదే ప్రశ్న వేసినప్పుడు  సమాధానం ఏం చెప్పాలో తెలీక బిక్కమొగమేశాడు తాన్ సేన్. అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి గురించి ఎవరికీ చెప్పకూడదు కదా! ఎంత అడిగినా మేఘమల్లార్ రాగాలాపన చెయ్యడానికి గాని, అందుకు సంబంధించిన వివారాలు చెప్పడానికి గాని మొరాయించే తాన్ సేన్ మీద అక్బర్ పాదుషాకు పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. 'వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోగా పాడి తీరాలి. లేదా ఆ పాట ఎవరి ద్వారా విన్నావో  ఆ వివరాలైనా చెప్పి తీరాలి. కాదంటే ఉరిశిక్ష ఖాయం. చక్రవర్తితో అబద్ధాలాడిన నేరానికి ఇంత కంతే మరో పెద్ద శిక్షలేదు మరి' అని  హుకూం జారీ చేశాడు అక్బర్ మహారాజు.

ప్రాణాల మీద తీపితో 'తానా నానా' ల   గురించి బైటపెట్టేశాడు తాన్ సేన్అక్కచెల్లెళ్ల నోట ఆ మేఘమల్లార్ రాగం వినాలని ఉవ్విళ్ళూరాడు అక్బర్. ఉన్నపళంగా దండు  శబర్మతీ నదీ తీరానికి తరలింది. ముదే తాన్ సేన్ తానా నానాలను కలసి తన వల్ల జరిగిన తప్పును కాయమని, 'ఒక్కసారి వచ్చి పాదుషా సమ్ముఖంలో మేఘమల్లార్ రాగం ఆలపించకపోతే తన ప్రాణాలు  పోవడం ఖామయ'ని దుఃఖిస్తూ చెప్పాడు. అక్కచెళ్లెళ్లిద్దరూ విన్నారు ఓపిగ్గా. తాన్ సేన్ స్థానం హిందూస్తానీ సంగీతంలో ఎంత ఉన్నతమైనదో వాళ్లకి తెలుసు. పాదుషా సమ్ముఖంలో రాగం ఆలపించడానికి సమ్మతించారు.

నిండు సభలో ఆ బంగారు బొమ్మలు ఎత్తైన వేదిక మీద మేలి ముసుగుల వెనుక నుంచి చెవులు రిక్కించి ఆలపించిన మేఘమల్లార్ రాగం సభ్యులను అవాక్కయేలా చేసింది. ఆగకుండా కరతాళధ్వనులు! అక్బర్ పాదుషా ఆనందానికయితే హద్దే లేదు. మెడలోని ముత్యాల సరం తెంపి తానా నానాల మీదకు విసిరిపేసాడు. అయినా ఆ అభిమానవతులు వాటి వంక తేరిపారయినా చూసింది లేదు.

తమ కోసం గాను ఏర్పాటు చేసిన సభామధ్యమం లోని ఎత్తైన ఆ వేదిక నుంచి కిందికి దిగి ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకుంటూ కౌగలించుకున్నారు. ఉత్తర క్షణంలో అలంకరించిన అందమైన పందిళ్లు హఠాత్తుగా నేలకూలినట్లు  కుప్పకూలిపోయారు. వారి డొక్కల్లోని బాకులు రక్తసిక్తమై ఆ ఘనకార్యం చేసింది తామే అన్నట్లు ఎర్రగా నవ్వుతున్నాయి!

అదే క్షణంలో సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకులు ఘొల్లుమన్నారు. వాళ్ళిద్దరు తానా నానా భర్తలు. సభకు బైలుదేరే ముందు భర్తలను క్షమించమని వేడుకుంటూ  రాసిన ఉత్తరాలు అప్పుడు గాని అందరి కంటపడ్డాయి కాదు. 'మహా సంగీత విద్వాంసుడు తాన్ సేన్ విలువైన ప్రాణాలు కాపాడవలసిన అవసరం గుర్తించాము. అందుకని నిండు సభలో అక్బర్ పాదుషా ముందు మేఘమల్లార్ రాగం ఆలపించవలసి వచ్చింది. ముందుగా భర్తలైన  మీ అనుమతి తీసుకోలేదు. మా వల్ల తప్పు జరిగింది అని తెలుసు. మన జాతి నీతి ప్రకారం భర్తల సమ్మతి లేకుండా భార్యలు పరపురుషుల కంటబడకూడదు. ఆ రివాజును తప్పినందుకు మేము నిస్సందేహంగా శిక్షకు అర్హులమే. మీకు మా మీద ఉన్న ప్రేమ తెలుసు. మీరు మమ్ములను శిక్షించలేరు. కాబట్టి మమ్మల్ని మేమే ఇలా శిక్షించుకుంటున్నాము. మిమ్ములను మనసారా ప్రేమిస్తున్న భార్యలుగా మమ్ములను క్షమించమని ఆఖరి విన్నపం'. 

ఉత్తరం బిగ్గరగా చదివి భర్తలిద్దరూ 'మా తానా నానాలను తిరిగి ఎవరైనా తెచ్చివ్వగలరా?' అని హృదయవిదారకంగా రోదిస్తుంటే అక్బర్ తన తొందరపాటుకు తలదించుకోవలసి వచ్చింది.

తాన్ సేన్ యువకులు ఇద్దరిని పైకి లేపి పరితాపంతో అన్నాడు 'చెల్లెళ్లు ఇద్దరిని నేను తిరిగి తెచ్చి ఇస్తానని హామీ ఇస్తున్నా. భౌతికంగా నాకు సాధ్యమవని ఆ పనిని కళాకారుడుగా సాధించి చూపిస్తాను. ఇక నుంచి నేను ఆలపించే సంగీత స్వరాలలో ఇప్పటి వరకు  ధ్వనించిన 'ఓం' అనే స్థానంలో 'తోమ్ తానా నానా' అంటూ ఆలపిస్తాను.  ఆ రకంగా మీ తానా నానాలను కాలానికి అతీతంగా శాశ్వతం చేస్తాను ' అని వాగ్దానం చేసాడు.

 తానా, నానాల పేరున శబర్మతీ నదీ తీరాన ఒక స్వరాలయాన్ని నిర్మించాడు తాన్ సేన్.

తరువాతి కాలంలో కాలగర్భంలో ఆ సంగీతాలయం కలిసిపోయింది. మహా పాదుషా అక్బర్ చక్రవర్తి  ఉనికీ మలిగిపోయింది. చివరికి శాశ్వతంగా మిగిలింది మాత్రం  హిందుస్తానీ మహా సంగీతవిద్వాంసుడు తాన్ సేన్ గొంతులో తారట్లాడే 'తోమ్ తానా నానాలలోని  ఆ తానా నానా' లు మాత్రమే!

***

సేకరణః

-కర్లపాలెం హనుమంతరావు

14 -09 -2020

Friday, September 11, 2020

పుష్ప వివాదము - శ్రీ యామిజాల పద్మనాభస్వామి 'పుష్ప విలాసము' నుంచి సేకరించినది.

 












(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్తవ్యం.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  'శభాష్' అనిపించు కొనవలె కాని..తమలోతాము తమ తమ ఆధిక్యతను గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగదు!

కవులతోనే లోకములు తెలవారుట లేదు. ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖములను పానపాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు మధుర ఫల రసము వంటిది మాత్రమే!  

 

 

ఇట్టి ఊహలు నాలో ప్రబలముగా  ఉన్న  వేళ   నాకు యాదృచ్ఛికముగా    యామిజాల పద్మనాభస్వామిగారి - 'పుష్ప్ప విలాసము', 1953 నాటి ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంటబడినది. నాడూ ఈనాడు వలెనె కవులు వర్గముల   మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. అందుచేతనే ఆనాటి కోకిల స్వరములోని మందలింపుల ఒక పరి ఆలకింపవలెనన్న లక్ష్యముతో  నేటి యువకవివర్యుల  సమక్షమునకు ఈ చక్కని కవితాఖండికను తెచ్చుటకు  అయినది. హితవైన పలుకులకు పాత-కొత్తల తారతమ్యములెందుకు?!

 

"పుష్ప వివాదము"

 

అదొక పూలతోట. పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నవి. ఒక్కొక్క తీగనె పరిశీలన చేసుకుంటో పోయి నేను ఒక తిన్నెపై కూర్చున్నాను. అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతో చెలరేగింది పుప్పొడి దుమారం. చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

 

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

 

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

 

గులాబి మాటపడుతుందా!

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

 అంటూ తన వత్తాసుకై మరో ప్రియపుష్ప సేహహస్తాన్ని అందుకున్నది.

 

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

అంటూ సందు చూసుకుని మరో కేతన తగువు మధ్యకు వచ్చి దూరింది.

 

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

అంటూ మందరా మల్లిక ఎత్తిపోసిన తిట్లన్నిటినీ తిరిగి  గుర్తుకు తెచ్చుకుంది.

 

చేమంతిః మూతి మూడు వంకలు తిప్పి అంది

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్ 

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద; యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

అనేసింది.

మందార వదనం మరింత ఎర్రబారింది రోషకషాయిత గళముతో

'ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?'

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము 'లిహీ' యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

అని తగులుకుంది.

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

అని రెచ్చగొట్టేసింది మరంత అనంద ప్రదర్శనయో సన్నివేశం రక్తి కట్టిస్తో!

 

మాలతి ముక్కు ఎగబీల్చి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                      *              *                *    

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

అంటూ ఏకంగా మొదటి పుష్పం మందారం మళ్లీ మాటలు అందుకోవడం౿

 

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని

కోకిలమ్మ

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతిం జెందు; మీ లోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె 'కో' యని కుగూకారమ్బు తోరంబుగన్.

అంటూ మందలింపులకు దిగిపోయింది!

 

పూలు తమ తొందరపాటుకు సిగ్గ్గుతో తలలు వంచుకున్నవి. ఒకింత సేపు గడవనిచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నవి. తిరిగి పువ్వుల తోట నవ్వుల తోటలా మారిపోయింది.

పువ్వులకన్నా  ఘనులమని కదా మనం మన కవులను  మహా గారవించెదము. ఆ అభిమానమును  నిలుపుకొనవలెను గాని.. దురభిమానము పూనగా పూతన బంధువర్గమును మించి ఈ పరస్పర యుద్ధములేమిటికోయి కవిమిత్రులారా! మరువము దండను బోలు సుగంధ పరిమళములు జల్లు మానవతా మాలికలకు చుట్టుకొను పూవులుగా అలరించుడు! చాలించుడిక ఈ ఈశు బుట్టు విసువు మాటల  రాళ్ల బుట్ట బుగ్గిలో బోర్లించుడు!

***

సేకరణః 

కర్లపాలెం హనుమంతరావు

11 -09 -2020

బాలికల కనీస వివాహ వయస్సు ఏ మేరకు ఉండాలి? -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 


 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ తన 86 నిమిషాల సుదీర్ఘ  ప్రసంగంలో భద్రత, సార్వభౌమత్వాల పైన మాత్రమే కాకుండా  దేశానికి తక్షణమే అవసరమని ప్రభుత్వం భావించే ప్రధాన ఆర్థిక, సామాజిక సంస్కరణలను కూడా ప్రస్తావించారు. సామాజిక రంగ సంస్కరణలలో భాగంగా  బాలికల వివాహ కనీస వయస్సుపై  ప్రభుత్వానికి గల పునరాలోచననూ ఆ సందర్భంలో దేశం ముందుంచారు. ఇదే ఏడాది ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పిణ సమయంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బాలికల వివాహ కనీస వయస్సు విషయమై ఒక ప్రతిపాదన చేశారు. నాటి సభలో ఆమె చేసిన ప్రసంగం ప్రకారం తల్లీబిడ్డల ఆరోగ్యం,  వారి పోషణల వంటి ప్రధానాంశాల పైన వివాహ వయస్సు చూపించే ప్రభావాల అధ్యయనం, ఆరు నెలల్లోగా  సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి పత్ర సమర్పణ సమర్పించవలసి బాధ్యత అప్పగిస్తూ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటును గురించినదా ప్రతిపాదన. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ వంటి మేధావులతో సహా  పలు శాఖల ఉన్నతాధికారులు  కార్యాచరణ సభ్యులుగా సమతాపార్టీ మాజీ చైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో   కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2న టాస్క్ ఫోర్స్  ఏర్పాటు చేయడంతో కేంద్ర మంత్రి  చేసింది ఉత్తుత్తి రాజకీయ ప్రకటన కాదని  అర్థమయింది.

 

దేశం ప్రగతిపథంలోనే సాగుతోందని, ఉన్నత విద్యతో సహా మహిళలకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు నిలకడగా పెరుగుతున్నాయన్న మంత్రిగారి ప్రసంగంలోని  పరిశీలన  అవాస్తమనేందుకు లేదు. మాతాశిశు మరణాలను మరింత తగ్గించడంతో సహా  వారి పోషకాహార స్థాయిలలో గణనీయమైన  మెరుగుదల సాధించడం స్త్రీ శిశు సంరక్షణ సంస్కరణలకు సంబంధించి   ప్రధానమైన అంశం. ఏ వయసులో ఆడపిల్ల ప్రసూతి దశలోకి ప్రవేశిస్తే తల్లీ బిడ్డలిద్దరికీ క్షేమమో ముందు లోతుగా అధ్యయనం చేయాలి.  టాస్క్ ఫోర్స్  ఏర్పాటు ప్రతిపాదనలోని అంతరార్థం కూడా అదే!

ఆడపిల్లల వివాహానికి సంబంధించిన కనీస వయస్సు  ఎంతో కాలంగా ప్రభుత్వాల ఆలోచనల్లో నలుగుతున్న మాట నిజమే! మాతా శిశువుల ఆరోగ్యానికి సంబంధించి పెళ్లి వయస్సు ఒక ప్రధానమైన అంశం అన్నది న్యాయ మంత్రిత్వశాఖ  అభిప్రాయం. కౌమార దశ పరిపక్వ స్థితికి చేరక ముందే వివాహబంధంలో ఇరుక్కున్న ఆడపిల్లలకు అవాంఛిత గర్భధారణ బాధ ఒక్కటే కాదు, లైంగిక వ్యాధుల పీడ అంతకు మించి ప్రాణాంతకంగా మారుతున్నదని వైద్యనిపుణుల ఆందోళన చెందుతున్నారు. వివాహ వయస్సుకు  మాతృత్వానికి మధ్యన ఉండే  సంబంధం  పరిశీలించడం, తల్లీ బిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గించడం, మహిళలలోని పోషకాహారస్థాయిని గురించి కచ్చితమైన అంచనాకు రావడం.. టాస్క్ ఫోర్స్ కు విధించిన లక్ష్యాలలో కొన్ని!  గర్భధారణ వయస్సు, ప్రసవించే సమయం,  తదనంతరం తల్లి, నవజాత శిశువుల పోషణ స్థాయి.. తదితర ముఖ్యమైన అంశాలలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికై మార్గాలను సుగమంచేసే తీరుతెన్నులు సూచించడమూ టాస్క్ ఫోర్స్ కు నిర్దేశించిన లక్ష్యాలే.  మాతాశిశువుల మరణాల తగ్గుదల, మొత్తంగా దేశాభివృద్ధిని ప్రభావితం చేసే సంతానోత్పత్తి రేటు, లింగ నిష్పత్తి వంటి  పరామితులను  పరిగణనలోకి తీసుకొని వయస్సులో పెళ్ళి జరిపిస్తే అటు బాలికలకు, ఇటు సమాజానికి కూడా క్షేమకరమో ఒక విస్పష్టమైన నిర్ధారణకు రావడం  టాస్క్ ఫోర్స్ అంతిమ  లక్ష్యంగా నిర్దేశించబడింది.  మగపిల్లల ప్రస్తుత వివాహ కనీస వయస్సు  21 ఏళ్లు. దానికి  సరిసమానంగా ఆడపిల్లల పెళ్లి వయస్సూ పెంచడం ద్వారా భావితరాలకు బలమైన పునాదులు వేయడం సాధ్యమవుతుందని టాస్క్ ఫోర్స్ చివరకు  నివేదిక ఖరారు చేసింది. ఆ నివేదికే ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నది.   కేంద్రం  టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు మగపిల్లలతో సరిసమానంగా ఆడపిల్లల వివాహ కనీస వయస్సును 21 ఏళ్ళకు పెంచడమే సబబన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అందుతున్నది.

 భారతదేశంలో, వివాహానికి కనీస వయస్సును  చట్టబద్ధం            చెయ్యాలన్న ఆలోచన మొట్టమొదట 1880 లో ప్రారంభమయింది. శారదాచట్టం ద్వారా  బాల్య వివాహాల నిషేధం 1929 నాటికి న్యాయవ్యవస్థ చట్రానికి చిక్కింది. ఆనాటి శాసనం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 16 సంవత్సరాలు; బాలులకయితే 18. 1978లో బాలికలకు మరో రెండు, బాలులకు మూడేళ్లు పెంచుతూ చట్టం సవరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం అదే.  కనీస వివాహ వయస్సును పెంచేందుకు వీలుగా అప్పట్లో శారదాచట్టాన్ని సవరించిన   తీరులోనే ఇప్పుడూ మరో  సవరణ రూపంలో  స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో  కొత్త మార్పుకు చట్టబద్ధత తెచ్చి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం.

మహిళలకు  మగవారితో సరిసమానంగా హక్కులు కల్పించడాన్ని రాజ్యాంగం కూడా గట్టిగా సమర్థిస్తున్నది. అబ్బాయిలకు మల్లేనే అమ్మాయిలూ 18వ ఏట  నుంచి  ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్, స్వంతంగా కంపెనీ ప్రారంభించుకునే అధికారాలు కలిగివున్నప్పుడు ఒక్క వివాహ విషయంలోనే   వివక్ష ఎందుకు? అన్న తర్కం వైజ్ఞానిక స్పృహ పెరుగుతోన్న ఈ కాలంలో సమాజాన్ని తరచూ నిలదీస్తున్న మాట నిజం. ఆడవారి పట్ల అట్లా చిన్నచూపు చూడాలని రాజ్యాంగంలో కూడా ఎక్కడా ప్రత్యేకంగా రాసిపెట్టి లేదనేదే న్యాయనిపుణులు చెబుతున్నారు. చట్టం ఆచారాలు, మత సంప్రదాయాల క్రోడీకరణగా చూడాలని వాదించే ఛాందసులు  నుంచి మాత్రమే స్త్రీల వివాహ వయస్సు పెంపుపై కొంత నసనసలు వినవస్తున్నాయి.  భార్య  భర్త కంటే వయసులో పిన్నదై ఉండాలని ప్రాచీన సంప్రదాయం స్మృతులు ప్రమాణాలుగా  చూపిస్తున్నాయన్నది వారి  వాదన. ఇటీవల ఒక లా కమిషన్ పత్రిక  కూడా అదే అంశం స్పష్టంగా పేర్కొనడం విశేషమే, కానీ అది ఒకానొక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని యధాలాపంగా   చేసిన వ్యాఖ్య మాత్రమే!

 పురాతన కాలం నుంచి ప్రపంచమంతటా వధూవరుల యుక్తవయస్సుల్లో  అంతరం కొట్టొచ్చినట్లు కనిపించడం గమనించదగ్గ విశేషం. కానీ  నాటి సామాజిక పరిస్థితులకు నేటి సామాజిక పరిస్థితులకు మధ్య హస్తిమశకాంతరం భేదం కద్దు.     లాలా లజ్ పతిరాయ్ రచించిన 'ఏ హిస్టరీ ఆఫ్ ది ఆర్య సమాజ్ ' గ్రంథంలోనూ వధూవరుల వివాహ కనీస వయస్సు 16.. 25 సంవత్సరాలుగా నిర్దేశించబడింది.  ఈ తేడా లైంగిక కోణంలో వారి వారి శారీరక నిర్మాణాల ఆధారంగా సాగిన హిందువుల ఆలోచనగా మాత్రమే భావించాలి. పురుషులతో సమానంగా ఆయుష్షు ఉన్నప్పటికీ వారి కంటే స్త్రీల శరీర నిర్మాణం మరింత పరిణతి చెందివుంటుందని మహిళా హక్కు సంఘాల ప్రగాఢ విశ్వాసం.  స్త్రీలు సాధ్యమైనంత తొందరగా పవిత్రమైన  వివాహబంధంలోకి  ప్రవేశించడాన్ని  అందుకే  ఆ హక్కుల సంఘాలు ఆట్టే తప్పుపట్టే ఆలోచన చేయనిది. కానీ, మాతా శిశువుల సంక్షేమం, సంరక్షణల విషయమై వారి ఆందోళనలో ఏ మాత్రం రాజీ లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్త్రీ, పురుషుల వివాహ కనీస వయస్సు సరిసమానంగా ఉండవలసిన అవసరాన్ని ప్రశిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జాతులు, మతాలన్నింటిలోనూ  మహిళలకు, పురుషులకు మధ్య  కనీసంగా చెల్లుబాటు అయ్యే వివాహ వయస్సు 18 సంవత్సరాలు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి.  2018 నాటి  మన ఫ్యామిలీ యాక్ట్ (కుటుంబ చట్టం)పై సాగిన సంప్రదింపుల పత్రంలోనూ ‘లా కమిషన్’.. భార్యాభర్తల మధ్య వయసు తేడాకు  సంబంధించి ఎట్లాంటి చట్టపరమైన ప్రాతిపదికా లేద’ని విస్పష్టంగా చెప్పింది.

ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారటం అంటేనే, ఆ  భాగస్వామ్యాలు సమాన హోదా కలిగివుండటం! రెండు భాగాలకు  సమాన స్థాయిలో గుర్తింపు లభించినప్పుడే  ఆ వివాహం అర్థవంతమైన సంసారానికి దారితీసేది!  స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షలను నిర్మూలించాలనే హక్కు సదస్సులు  కూడా బాలికల వివాహ కనీస వయస్సు పెంపు పట్ల ఎక్కడా పెద్దగా పట్టింపు పెట్టుకున్నట్లుగా కనిపించదు. అంతమాత్రం చేత మహిళల శారీరక, మేధో వృద్ధి రేటు పురుషులను బట్టి మారుతుందని భావించే చట్టాల రద్దు పట్ల వాటికి   పట్టుదల  లేదని కాదు అర్థం.

 

ప్రపంచంలో  140 దేశాలలో  మహిళలతో సహా  పురుషులకూ  వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలు. మన దేశంలోనూ  లా కమిషన్  మహిళకు వివాహం చేసుకునే కనీస వయస్సు 18 సంవత్సరాలుగానే  సిఫార్సు చేసివుంది గతంలో. ప్రభుత్వమూ ఆ తరహా  ఆలోచనే చేస్తున్నప్పటికీ, ఆచరణ దగ్గరే తటపటాయింపు ధోరణి తప్పడంలేదు.  ప్రస్తుతమున్న వాస్తవ గడ్డు పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. అత్యంత వేగంగా పెరిగే ‘దేశజనాభా’ చింత  ప్రధాని మునుపటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రతిఫలించడం గమనించాలి.  వివాహ వయస్సును గురించి ప్రభుత్వ పునరాలోచన కూడా.. వాస్తవంగా చెప్పాలంటే.. అంతూపొంతూ లేకుండా పెరుగుతోన్న దేశ జనాభాను కట్టడి చెయ్యాలన్న బాధ్యతాయుత భావన నుంచి పుట్టుకొచ్చినదే!

తొలి చూలు సందర్భం  మాతాశిశువుల  ఆరోగ్య పోషణల పైన అత్యధిక ప్రభావం చూపిస్తుందని వైద్యశాస్త్రం నిర్ధారిస్తోంది.  మాతా శిశు ప్రసూతి మరణాల రేటులో పెరుగుదలకు కారణం బాలికలు కౌమార దశలోనే తల్లులుగా మారడమని నివేదికలు మొత్తుకుంటున్నాయి.  ఒక  తాజా ‘నమూనా రిజిస్ట్రేషన్ విధానం’ ప్రకారం నేడు దేశంలో ప్రసూతి మరణాల రేటు లక్షకు 122. బాగా  తగ్గాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) గణాంకాలు కితాబిచ్చుకున్నప్పటికీ..  ‘బాల్యవివాహాల సమస్య’  దేశాన్నిప్పటికీ తీవ్రంగా సలుపుతోనే ఉంది.   భారతదేశంలో 18 ఏళ్ల లోపు  సుమారు ఒకటిన్నర లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు జరిగిపోతు న్నట్లు యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలో మూడోవంతు బాలికలతో కొలకొలలాడే మన దేశం బాల్యవివాహాలలో మాత్రం  మొదటి స్థానంలో ఉండడం  ఆందోళనకరమే కదా! అదీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సులోనే  వందలో 16 మంది బాలికలు వివాహితలుగా మారుతున్న నేపథ్యంలో! జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ ఆవేదన  చెందినట్లు-   పేదరికం, విద్యా స్థాయిలతో ముడిపడి ఉండటమే బాల్యవివాహాల చిక్కుముడికి ముఖ్య కారణం. కోవిడ్-19 మహమ్మారి పురులు విప్పిన తాజా నేపథ్యంలో పెరుగుతున్న బాల్యవివాహాలే అందుకు తిరుగులేని ఉదాహరణ.

 

బడులు మూతబడి ఆన్ లైన్  చదువుల సదుపాయం లేని మైనర్ బాలికల మీద పెళ్లిళ్ల కోసమై తల్లిదండ్రులు వత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి.  చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందుకున్న బాలల హక్కు సంఘాలు జోక్యం చేసుకున్న బాల్యవివాహ  సంఘటనలు ఈ ఆగష్టు చివరి నాటికి సుమారు 5,584. దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతబడి, పేదరికం జడలు విదిల్చిన తరుణంలో   మహమ్మారి పుణ్యమా అని పెళ్లిళ్లు సాధారణ దినాలలో కన్నా చవకలో అవగొట్టేయచ్చన్న కన్నవారి కాపీనమే బాల్య వివాహాల పెరుగుదలకు ప్రధాన కారణం.

విద్యకు వివాహానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. 18 ఏళ్ల లోపు వివాహితలలో దాదాపు సగం శాతం (44.7) బొత్తిగా పలక పట్టడమే రాని నిరక్షర కుక్షులని  గణాంకాలు లెక్కలు తేల్చాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’ లక్ష్యం  ఎంత ముఖ్యమో ‘బేటీ పఢావో.. బేటీ బచావో’ కూడా అంతే ప్రధానమైన స్త్రీ  సంస్కరణ.  బాలికల వివాహ కనీస వయస్సు మరంత పెంచడం ద్వారా మాతా శిశు సంక్షేమం  ఎంత వరకు సాధ్యమో నిర్ధరించలేని అంశం.  బాలికల 'చదువు సంధ్యల’ పై  మరింత ధ్యాస పెట్టవలసిన అగత్యానికి ప్రభుత్వాలు ముందు గుర్తించాల్సుంది.  బాలికా విద్య, మహిళా సాధికారతల ద్వారా సానుకూలపడే వాతావరణంలో పేదరికపు వత్తిళ్లు తగ్గితే, బాల్యవివాహాల బాదరబందీ దానంతటదే క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్న సామాజిక శాస్త్రవేత్తల వాదనలో వాస్తవముంది. 

ఒకే తరగతి చదివే ‘అమ్మాయి-అబ్బాయి’ల మధ్య ఆమోదయోగ్యంగా మారిన  సమానత్వ సూత్రం వివాహ వయస్సుకూ వర్తింపచేయాలన్న ఆలోచనకే ఆఖరుకు  ప్రభుత్వం మొగ్గుచూపిస్తున్నట్లనిపిస్తుంది.   బాల్య వివాహాలు, మైనర్ బాలికల పైన పెరుగుతున్న  లైంగిక వేధింపుల వంటి అంశాలలో ఇప్పుడున్న  చట్టాలను గట్టిగా అమలు చేసినా చాలు.. గణనీయమైన సానుకూల దృక్పథం సమాజంలో ప్రోదిగొల్పవచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తల ఆలోచన. బాలికల వివాహ కనీస వయస్సు అంతకంతకూ  పెంచుతో చట్టసవరణలు చేసినా.. చట్టాన్ని పట్టించుకోని మొరటు సమాజం ముందు అవన్నీ కోరల్లేని పాము బుసలే! ప్రభుత్వాలు ముందు దృష్టి మళ్లింఛవలసింది.. పరిధిని దాటే ముందు  సమాజం ఒకటికి రెండు సార్లు  జంకేలా ఏ విధమైన  కఠినాతి కఠిన చర్యలు సత్వరమే తీసుకోవాలా అని.  పర్యవేక్షణ యంత్రాంగాలు పరాకులు కట్టిబెట్టి కరాఖండీ  కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకుంటే తప్ప, ప్రభుత్వాలు ఎంతో  మధన పడి మరీ చట్ట పరధిలోకి తెచ్చే బాలికల వివాహ కనీస వయస్సు వంటి  సంక్షేమ సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చేది.

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రిక ఆదివారం దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...