Monday, June 14, 2021

ధూమకేతువు చెప్పే నీతిపాఠం -కర్లపాలెం హనుమంతరావు



దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు  గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా  కొన్నైనా మంచి పనులు  చేస్తే ఈ  దుర్జన్మ పీడా వగదిదుతుందన్న  ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది.  ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.

పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు మాత్రం  పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే శివుడిని ఆశ్రయిస్తే, ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి పురమాయించాడు.

తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి కాని  కారణాన  మాదవుడు  భార్య సుముదను  వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం జరిగిపోతుంది.

యుద్ధానికని  బయలుదేరే  ధూమాసురుణ్ణి ఈసారి ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇట్లా  సుముదమ్మ కడుపులో జీవం పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా  చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా   'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.   అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.

అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా మంత్రులు.. దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ వికృత  ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.

ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని,   దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు ముఖ్యమైన మాట మరోటి ఉంది.  చరిత్ర ఎటూ మనకు పట్టదు.  కనీసం మనం నెత్తికెత్తుకొని నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా నీతికథలనయినా  మన సో కాల్డ్ ప్రజానేతలు  సమయ సందర్భాలను బట్టి ఖాతరు చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను.  ఇప్పుడు జరుగుతున్న 'రఘు రామరాజు  కారాగార  కఠిన దండన' కథా కమామిషు వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని బాధేస్తుంది. 

మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే పెద్దమనుషుల మతిమరుపు  రోగం బాగా ఎరిక కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా శిక్షించినా..  తన పేరులో అతగాడి   పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా  గుర్తు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

12 -06 -2021

Saturday, June 12, 2021

రాజద్రోహం – వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

24 విభాగాలుగా ఉన్న భారత రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రపంచంలోని మరే  రాజ్యాంగమూ ఇంత విస్తృతంగా ఈ తరహా హక్కులను గురించి ప్రస్తావించింది లేదు. అయినా రాజ్యాంగ  హక్కుల ఉల్లంఘన ఇక్కడే ఎక్కువగా జరగడం.. అదో విచిత్రం!

మాట్లాడే హక్కు నుంచి శాంతికి భంగం కలగకుండా సమావేశాలు జరుపుకునే హక్కు, సంఘాలు.. సంస్థలు పెట్టుకునే హక్కు, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగడం, నివాసిస్తూ శాశ్వత చిరునామా పొందడం, చట్టబద్ధమైన పని, వ్యాపారం, ఉపాధి ఏదయినా  యధేచ్ఛగా  చేసుకోవడం .. వంటి హక్కులన్నింటి మీదా 19 నుంచి ఇరవైరెండో అధికరణ దాకా రాజ్యాంగంలో ఆదేశాలున్నా.. అతి ముఖ్యమైన వ్యక్తిగత హక్కుకు మాత్రం తరచూ  తూట్లు పడడం దేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను  నవ్వులపాలు చేసే వికృత చేష్టగా  మాత్రమే చెప్పుకోక తప్పదు.

పుస్తకాలలో కాకుండా పౌరుడు వాస్తవ జీవితంలో ఎంత వరకు పౌరుడు  స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాడన్న అంశం మీదనే కదా   ప్రజాస్వామ్య స్ఫూర్తి సాఫల్యం ఆధారపడడం! అక్కదికీ ఎంత ప్రాథమికమైన హక్కైనా వ్యక్తి అనుభవించే విషయం దగ్గరికొచ్చే సరికి రాజ్యాంగమూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోలేదు. శిక్షాస్మృతి ఆర్టికల్ 124 (ఎ) స్వేచ్ఛను యధేచ్ఛగా అనుభవించేందుకు లేకుండా విధించిన ఈ తరహా జాగ్రత్తలలో ఒకటి. ఇది ఆంక్ష కాదు.   ముద్దుగా తెల్లదొరలు ‘రాజద్రోహం గా పిల్చుకున్న ఆ కట్టడి స్వాతంత్ర్యం సాధించుకున్న ఇన్నేళ్ల తరువాత కూడా మన రాజ్యాంగంలో  భద్రంగా పడివుండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇంతకూ ఈ సెక్షన్ 124 (ఎ) ‘రాజద్రోహం’ అంటే ఏమిటీ? అంటే- స్థూలంగామాటలు, సైగలు, హావభావాలు, పీడించడాలు వంటి ఇంకే రకమయిన  చేష్టల ద్వారా అయినా సరే  ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను పడగొట్టాలనిపించేలా పిచ్చి  ప్రేలాపనలకు  దిగితే సరాసరి ‘రాజద్రోహం’ నేరం కింద గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసేసుకోవచ్చు.  వలస పాలకులు అప్పట్లో తమ రాజ్యం భద్రంగా ఉండడం కోసం పెట్టుకున్న అమానుష  ఆంక్ష దేశం స్వాతంత్ర్యం సాధించుకున్న  తరువాత ఇక రాజ్యాంగంలో ఎందుకు? ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రభుత్వాలకు   గిట్టని వాళ్ళ నోళ్ళు మూయించడానికి మాత్రం  ఈ సెక్షన్ మహా వాటంగా ఉపయోగిస్తున్నది. అదే దిగులు.

 శిక్షాస్మృతిలో ఒకటిన్నర శతాబ్దాలుగా అట్లాగే పడివున్న భయంకర వ్యర్థ చట్టానికి సవరణలేమైనా వీలవుతాయేమోనన్న సంకల్పంతో సిఫార్శుల నిమిత్తమై రెండేళ్ల కిందట  కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  నిపుణుల కమిటీ నొకటి వేయడం, ఐపిసి సంస్కరణలకు సంబంధించి సూచనలేమన్నా ఉంటే చెప్పమని ప్రజల నుంచి, , ప్రజాసంఘాల నుంచి కోరడం లాంటి లాంనాలన్నీ పూర్తిచేసింది కూడా. కానీ, అంతు చిక్కని చిక్కులేవో రాజద్రోహం క్లాజు అంతిమ దహన సంస్కారాలకు అడ్డుపడుతున్నాయ్! బహుశా బెయిల్ కోసం ఏలాంటి నిబంధనలు ఇందులో పొందుపరచవలసిన అవసరం లేనందువల్లనా? ప్రభుత్వాలకు గిట్టనివాళ్లను ఎవరినైనా ఎంత కాలమైనా నిర్బంధంలో ఉంచుకొనే వెసులుబాటు ప్రభుత్వాలకు ఈ సెక్షన్ కల్పిస్తుంది కదా!   

1950లో రాజ్యాంగాన్ని రాసుకుని ఆమోదించే సందర్భంలోనే ఐపిసి తాలూకు 124 (ఎ) అధికరణం రద్దు చెయ్యాలనే ప్రతిపాదన బలంగా వినిపించింది. సర్దార్ భోవిందర్ సింగ్, ప్రొఫెసర్ యశ్వంత్ రాయ్ లాంటి రాజ్యాంగ ప్రముఖులు 1948 డిసెంబరు 2న జరిగిన రాజ్యాంగ  ముసాయిదా కమిటీ చర్చలో ఈ ‘దేశద్రోహం’ అనే దుర్మార్గ పదాన్ని చేర్చడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. రాజద్రోహం క్లాజు మౌలికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి  విరుద్ధమనేది మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం కూడా

వక్రీకరించేందుకు, వ్యతిరేకులపై ఉపయోగించేందుకు సులువుగా ఉపయోగపడేది ఈ  సెక్షన్ 124 (ఎ) లోని ‘అవిశ్వాసాన్ని’ అనే పదం. అందుకే   ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి  నూరానీ ఈ నిబంధన కింద, మేం ఎల్లవేళలా ప్రభుత్వాన్ని ప్రేమించక తప్పదన్నమాట’ అని ఎద్దేవా చేసేవారు.  న్యాయశాస్త్ర కోవిదుడు  ఫోలే ఎస్. నారిమన్ వాదన ప్రకారమయితే ప్రభుత్వాన్ని అవమానించడం లేదా విమర్శిస్తూ రాయడం, విద్వేషపూరితంగా మాట్లాడటమైనా సరే.. అసలు  దేశద్రోహం సెక్షన్ 124 (ఎ) కిందకే  రాదు!

కానీ, ఇటీవలి కాలంలో, వివిధ రాష్ట్రాలలో  పాత్రికేయుల నుంచి  అధికారుల దాకా ఎందరో తరచూ ఈ  దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఈ నేపథ్యంలోనే ఈ సెక్షనుతో పాత్రికేయుల ప్రాథమిక హక్కులు నిరాకరించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం  బాధ్యులను గట్టిగా హెచ్చరించడం.  తప్పు పట్టే  పత్రికలది ప్రజల నిరసనగా తీసుకోవాలే తప్పించి,   దేశద్రోహంలాంటి నాన్-బెయిలబుల్  అభియోగాలు మోపమేంటని జనసామాన్యంలాగానే సుప్రీం కోర్టూ అభ్యంతరపెట్టడం ప్రజాస్వామ్యవాదులందరికీ ముదావహం కలిగించే పరిణామం.  

ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరంగా, ఆరోపణలు చేసారంటూ ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాపై బీజేపీ పరువు నష్టం దావా వేసిందా మధ్యనభాజపా నేత అజయ్ శ్యామ్ దాఖలు చేసిన అభియోగం మేరకు హిమాచల్ ప్రదేశ్ లో నమోదైన రాజద్రోహం’ కేసును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు  భావప్రకటనా స్వేచ్ఛకు ఊపిరిపోసే ఔషధం.

భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా వేసిన రాజద్రోహం వ్యాజ్యం పై 1962 నాటికే  కేదార్ నాథ్ సింగ్ కేసులో    న్యాయమూర్తులు యు.యు లలిత్, వినీత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం పాత్రికేయులకు ఊరటనిచ్చింది. మళ్లీ ఇప్పుడు, కోవిడ్.. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు  వినోద్ దువా తయారు చేసిన యూ-ట్యూబ్ కార్యక్రమం బిజెపి నాయకులకు ఆగ్రహం తెప్పించిందని,  ప్రధాని పరువుకు నష్టం కలిగినట్లు ఏ   ఐపిసి  501,  ఐపిసి 505 సెక్షన్లో  పోలీసులు బనాయించడాన్ని  సుప్రీం కోర్ట్  తీవ్రంగా తప్పుపట్టింది.  

ప్రభుత్వాన్నైనా సరే  విమర్శించే హక్కు సాధారణ పౌరుడికి కూడా ఉంటుందని, హింసను ప్రజ్వరిల్లనంత కాలం ఆ విమర్శను రాజద్రోహం కింద పరగణించడం కుదరదని సుప్రీం మరోమారు తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వమూ  ప్రజావాణి వినిపించే రెండు ఛానళ్లపై కక్షపూరితంగా రాజద్రోహ నేరం ఆపాదించిన కేసును విచారించే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అసలీ ‘రాజద్రోహం’ అధికరణ 124(ఎ) మొత్తాన్నే మొదలంటా కూలంకషంగా పరీశీలించవలసిన అగత్యం ఏర్పడిందని  అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తిరిగి మంచి రోజులు వచ్చే  ఆస్కారమున్నట్లు   న్యాయవ్యవస్థలో  చోటు చేసుకుంటున్న ఈ తరహా సంస్కరణవాదమే ఆశ కలిగిస్తున్నది. 

-కర్లపాలెం హనుమంతరావు

   11 -06 -2021

Sunday, April 25, 2021

మహమ్మారి కరోనా విస్తరణకు - మన లెక్కలేనితనమే కారణమా! -కర్లపాలెం హనుమంతరావు

 

 



రష్యా అధినేత కృశ్చేవ్ ఓసారి ఇండియా వచ్చినప్పుడు స్వాగత వచనాలు పలికి తోడుకుని తెస్తున్నాడుట అప్పటి మన దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. మార్గమధ్యంలో  ఓ పౌరుడు తన ట్రేడ్ మార్క్ చెంబుతో పొదల్లో దూరడం చూసి కృశ్చేవ్ ఆసక్తి కొద్దీ అతగాడు అంత పరగడుపునే పొదల చాటుకెళ్లి చేసే మహాకార్యమేంట’ని అడిగితే, వివరాలు కనుక్కొచ్చిన మనిషి తెచ్చిన సమాచారం దేశం శుచి శుభ్రతలకు సంబంధించిందవడంతో చెప్పలేక చెప్పి చాచాజీ తలొంచుకున్నాడుట. మరి కొంతకాలం తరువాత అదే సన్నివేశం మాస్కోలో కాకతాళీయంగా జరిగటంతో  చాచాజీకీ బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. 'చెంబు చేత పట్టుకుని పొదల చాటుకు జనం పరుగెత్తే దృశ్యాలకు తమ దేశమూ కొదవేంపోలేదూ!' అన్నట్లు నవ్వితే తలతీసినట్లనిపించిందీ సారి  కృశ్చేవ్ కి. ఆ అనాగరికుడిని పట్టి తెమ్మని ఆయనిచ్చిన ఆదేశం మేరకు.. వెళ్లి వచ్చిన మనిషి 'ఆతగాడి పలుకును బట్టి ఇండియనని చెప్పడంతో చాచాజీకీ మరో మారు తలవంచుకునే పరిస్థితి తప్పింది కాదు'అని కుశ్వంత్ సింగ్ ఓ సందర్బంలో చెప్పిన పిట్టకథ ఇప్పుడు గుర్తుకొస్తోంది. భారతీయులను అవమానించే ఈ తరహా చెత్త కథలు  కట్టుకథలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కానీ.. అలవాట్ల వరకు భారతీయుల వెకిలి చేష్టలను చక్కగా వెలిబుచ్చేవని మాత్రం ఒప్పుకోక తప్పదు.

మారుతున్న కాలంలో ఇప్పుడు ఏ భారతీయుడూ విదేశీ గడ్డ మీద ఆ విధంగా ప్రవర్తించడంలేదు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్నట్లు మాతృభూమి వళ్ళు పులకరించేలా ఎంతో ఒద్దికైన ప్రవర్తనతో పదిమంది మధ్యనా ఆదర్శవంతంగా నడుచుకుంటున్నాడు. కానీ.. చిత్రంగా ఆ బుద్ధిమంతుడే కన్నభూమి పై కాలు పెట్టిన తొలిక్షణం నుంచి  మళ్లా లోపలున్న ఒరిజనల్ని బైటికి తీసేస్తున్నాడు! పాత దురలవాట్లను శాయశక్తులా పాటిస్తున్నాడు! రోడ్లను  యధా తధంగా ఉమ్ముతో పావనం  చేయడం నుంచి కుండీ ఎదుటే ఉండినా  చెత్త అందులో పడకుండా శాయశక్తులా శ్రద్ధవహించడం వగైరా.. వగైరా వరకు.. ఏది చట్టమో అంతా తెలిసినట్లే.. పంతంగా వాటిని ఉల్లంఘించే పాత అలవాట్లనే సాధన చేస్తున్నాడు! అందువల్లనే పై తరహా చిల్లర కథలకు అంత  విస్తృతమైన   ప్రచారం!

క్రమశిక్షణారాహిత్య కార్యకలాపాలలో సుశిక్షణేదో పొందినట్లు మనం మరీ అంత విపరీతంగా ప్రవర్తించడం ఎందుకు! ప్రస్తుతం దేశంలో జరిగే కరోనా విలయ తాండవంలో  ఈ అపరిశుభ్రతే కదా ముఖ్య కారణం!

మొదటి దశలో ఎంతో శ్రద్ధగా ధరించిన మొహం తొడుగులు రెండో దశలో ఎందుకు నామర్దాగా మారినట్లు! ప్రారంభంలో వైద్యులు చెప్పుకొచ్చిన సామాజిక దూరం వంటి జాగ్రత్తలన్నీ నియమబద్ధంగా పాటించిన మనమే తదనంతర దశలో  ఏం ఘనకార్యం సాధించామని  పూర్తిగా గాలికి వదిలేసినట్లు! పెళ్లిళ్లు, ఉత్సవాలు వంటి సామూహిక కార్యక్రమాలకూ సై అనేందుకు ఏ వైద్యం మనల్ని కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి చేసేసిందని! ఇంటికొకరు పిట్టల్లా రాలుతున్న కరోనా దేశంలో   హరిద్వారా కుంభమేళా, అయిదు రాష్ట్రాల ఎన్నికల మేళా చూసి ప్రపంచం నోరెళ్లబెట్టేస్తోంది. కనిపించే రోగగ్రస్తులకు ఎన్నో రెట్లు కనిపించని రోగవాహకులుగా ఉన్న  దుర్భర పరిస్థితులకు కారణాలేమిటో కనుక్కునే ప్రయత్నాలు ఏ కోశానా కనిపించడం లేదు ఇప్పటికీ! మన అపరిశుభ్రతే మనకు తీరని శాపం అని  సామాన్యుల నచ్చచెప్పేందుకు ఇంకే బ్రహ్మదేవుడు దిగిరావాలో!

పరిశుభ్రతకు సంబంధించిన చట్టాలు లేక కాదు. ఉన్నవాటినైనా కఠినంగా అమలుచేసే చింతన లేదనే ఈ చింతంతా! అపరాథ  రుసుం పైసల్లోఉండటంతో ‘ఆఁ! చెల్లించేస్తే పోలా!’ అన్న తుస్కార ధోరణే తప్ప సంస్కార కోణంలో ఆలోచించే గుణం తరతరానికి తరిగిపోతూ రావడమే కరోనా తరహా మహమ్మారులకు మన మీది ప్రేమ దినదినాభివృద్ధి చెందడం.

నిజం నిష్ఠురంగానే ఉంటుంది. ద్విచక్రవాహన చోదకులు ఎంత మంది శిరస్త్రాణాలు ధరిస్తున్నది? ధరించనివాళ్ళ మీదయినా నమోదయ్యే కేసులు ఎన్ని? ఎరుపంటే ఏదో జడుపున్నట్లు  ఆ రంగు లైట్ కంటపడగానే ఆగాల్సింది పోయి  వాయువేగంతో పారిపోయే వాహనాలే జాస్తీ మన దేశంలో ఎంత  బిజీ రోడ్ల మీదయినా! ‘ఒన్ వే’ అంటూ  నియమం ఓటి  ఉన్నా ‘జానే దేవ్’ అనే సజ్జే గజ గజానికీ ఈ దేశంలో! మూగజంతువు మీద నుంచి బండి నడుపుతూ పట్టుపడితే అపరాధ రుసుం కేవలం 50 రూపాయలా! కబేళాకు గొడ్డును అమ్మేందుకు ఆరోగ్యంగా ఉండే కాలును పుటిక్కున  విరిచేస్తున్నాడు త్రాష్టుడు! జబ్బు పడ్డ గొడ్డును పోషించడం ఖర్చుతో కూడిన వ్యవహారమయితే.. అదే కబేళాకు అమ్మేస్తే ఝంఝాటం వదలడంతో పాటు అదనంగా అంతో ఇంతో ధన లక్ష్మీదేవి సుప్రసన్నం!

సింగపూర్ లో ట్రాఫిక్ ఉల్లంఘనకు శిక్ష వెయ్యి డాలర్లు. చెల్లించలేని పక్షంలో జైలు శిక్షలు. అదే ఇండియాలోనో! గుప్పెడు రూకలతో చూపిస్తే అంతా గుప్.. చుప్! అవినీతిని గురించీ, న్యాయ విచారణల తీరును గురించి ఎంత తక్కువ చెబితే అంత మన్నన.

రోడ్డు నిబంధనలు తెలుసుకుని, నేర్చుకుని కష్టపడి  పరీక్ష ఉత్తీర్ణమవకుండానే  కొంత సొమ్ము మనది కాదనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికే బెంజి కారులో వచ్చేసే వ్యవస్థలో మనం బతుకుతున్నది. మందు కొట్టి బండి నడిపినంత మాత్రాన గ్యారంటీగా పోలీసు కేసు బుక్కవాలనుందా ఇక్కడ? కేరాఫ్ ఫుట్ పాత్ గాడి  పీకల మీద నుంచి గాడీ నడిపేసుకెళ్ళిన బేఫర్వా  హీరోగాడే సేఫ్ గా మూవీలు చేసుకునే దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఎవడికి తోచిన అర్థం చెప్పుకుంటున్నాడు మరి.  సాంకేతిక కారణాలనేవి సైంధవుడి సోదరుడికి మల్లే   అడ్డుపడకుంటే  ఈ దేశపు  చట్టసభలను నింపే శాల్తీల పడకలన్నీ నిజానికి సెంట్రల్ జైళ్లలో ఉంటాయి. పగటి కలలో అయినా ఆ మాత్రం  సంస్కరణలను ఊహించుకుంటే పిచ్చాసుపత్రిలో బెడ్ సిద్ధం చేసే దుస్థితి. తోటకూర నాటి నుంచే విచ్చలవిడితనం ఇచ్చే సుఖాలు మరిగిన సంతు ఎదిగొచ్చే కొద్దీ ఎంత అసాంఘిక జంతువుగా మారుతుందో చెప్పాలంటే మరో  థగ్గుల చరిత్ర తిరగరాసినంత తంతవుతుంది.  

'ఇచ్చట మల మూత్రములు విసర్జించ రాదు' అన్న హెచ్చరికలు ఇక్కడ దర్శనమిచ్చినన్ని బహుశా ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ కనిపించవు. నడిరోడ్డు పక్కన మగవాళ్లు ప్యాంటు జిప్పులు నిస్సిగ్గుగా తీసే జగుప్సాకరమైన సన్నివేశాలకూ ఈ పవిత్ర దేశమే ప్రథమ స్థానం.  

1936 ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషనంటూ ఓటి ఏర్పడి  గాంధీజీ అప్పటి అవసరాలకని ఇచ్చిన 'పౌరుల సహాయ నిరాకరణ' ఉద్యమానికి ఊతంగా విద్యార్థులను బళ్ల నుంచి బయటికి వచ్చేయమంది. గురువుల బోధనలను ధిక్కరించినవాడే అప్పట్లో గొప్ప దేశభక్తుడుగా గుర్తిస్తానంది! బ్రిటిష్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించేలా సమాచార, రవాణా, పాలనా సౌకర్యాలు సర్వస్వానికి ఆటంకాలు కల్పించడాలవంటివి ఏళ్ల పర్యంతం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించిన సంస్కృతి ఈ దేశానిది.  స్వాతంత్ర్యం వచ్చినా తుచ్ఛ రాజకీయాలలో అదే నీచ సహాయ నిరాకరణ ధోరణులు! పుట్టుకొస్తున్న కొత్త తరాలకు  నియమ నిబంధనల పట్ల  ఉండవలసిన స్థాయిలో బాధ్యతాయుతమైన భయభక్తుల కొదవ అందుకేనేమో అనిపిస్తున్నదిప్పుడు! రాజకీయ పక్షాలే స్వలాభాపేక్ష నిమిత్తం విద్యుత్ వగైరా బిల్లులు చల్లించవద్దని, బ్యాంకు రుణాలను నిర్భయంగా  ఎగవేయమని,  పాఠశాలలకు వెళ్లి ఫలానా విద్యలు చదవరాదని,  రాస్తాలను దిగ్బంధనం  చేసెయ్యాలని, బస్సులు పై రాళ్లు రువ్వాలని, రైలు పట్టాలు పీకెయ్యాలని, ప్ర్రభుత్వ అస్తులు ధ్వంసం చేసి మరీ ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించాలని ప్రోత్సహిస్తున్నప్పుడు సామాన్య పౌరుడికి ఏది ఎప్పుడు ఎవరి మాట ఏ మోతాదులో ఆచరించవలసిన అగత్యం ఉందో ఎట్లా అవగాహనకొచ్చేది?

భారతీయులు అమితంగా ఆరాధించే ఆరాధ్య గ్రంథం భగవద్గీత కర్మయోగమే విశిష్ఠమైన వ్యక్తులు ఏమి చేస్తారో చూసి తతిమ్మా ప్రపంచం దాన్నే అనుసరిస్తుందని   'యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే' శ్లోకంలో చెప్పింది కదా! మన నేతాశ్రీలకు గీతలు, రామాయణాలు చదివే పాటి తీరిక ఉండదు.  కాబట్టే  చట్టాలు చేసిన తమ చేతులతోనే ఆ చట్టాలను నిర్భయంగా చట్టుబండలు చేసేస్తున్నారు! భారీ సభలు రోడ్డు కడ్డంగా పెట్టి చెవులు దిబ్బళ్లుపడేలా నినాదాలు చేయించే నాయకులను నుంచి సామాన్యుడేం నేర్చుకోవచ్చు? డ్యూటీలో ఉండే ఉద్యోగులను తిట్టడం, కొట్టడం మాత్రమే నాయకత్వానికి ముఖ్య ల్క్షణంగా భావించే నేతలున్న దేశంలో  పౌరుడు మంచి మార్గాన్ని ఏ మూల నుంచి ఎంచుకోవాలి?

పర్యవసానం ఏదైనా కానీ, చివరికి ఇవాళ మొత్తంగా పడకేసింది సామాజిక ఆరోగ్యం.. దానికి ఏ ఆసుపత్రుల్లో పడక దొరకని దుస్థితి. ఊపిరాడని పరిశుభ్రత.. దానికీ ఆక్సిజన్ కరువంటున్న అస్తవ్యస్త వ్యవస్థ పరిస్థితి!  

 

-కర్లపాలెం హనుమతరావు

25 -04 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...