Friday, July 23, 2021

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

 


ఎందుకలా అని అడగద్దెవరూ!

-కర్లపాలెం హనుమంతారావు


 

పిల్లల్లారా వినండర్రా!

మీ నాయన పోయాడివాళ.

ఆయన పాత కోట్ల నుంచి

మీకు  అంగీలు, లంగాలు కుట్టించేదా?

నాయన పాత పేంట్లు చించి

మీ సైజుకు సరిపోయే  జేబులు కుట్టిస్తానర్రా!

తాళాలూ చిల్లర డబ్బులు

పొగాకు చుట్టల అడుగున

ఆ జేబుల్లోనే కదా పడివుండేదెప్పుడూ!


డుంబూకేమో తన తండ్రి ఆస్తి పైసలు

బ్యాంకుల్లో వేసుకు దాచుకునేందుకు

బుజ్జి తల్లికి  నాన్న గుర్తుగా తాళాల గుత్తులు

కాళ్ల గజ్జెలకు మల్లే ఆడించుకు తిరగచ్చు భలేగా!

..

అంతేనరా! ఎన్ని చావులొచ్చినా

బతికుండక తప్పదు మనకు

పోయినోళ్లు ఎంతటి మంచోళ్లయినా

ఎల్లకాలం గుర్తుండరు కదా ఎక్కడయినా!


బుజ్జీ, లే!

 బడికెళ్లే టైమయింది

బువ్వ తినమ్మా

డుంబూ,  నీ కాలికి గాయమయిందిగా

పోయి ముందు నువు మందేసుకో!


జీవితంతో  అదేరా గొడవ భడవాయిల్లారా!

మనసెంత నొచ్చినా తప్పించుకు తిరక్క చావదు 

ఎందుకలా అని అడగద్దెవరూ పిల్లలూ!

ఎందుకనో..   నాకూ పెద్దలెవరూ చెప్పలేదు 

ఇంతవరకు

- కర్లపాలెం హనుమంతరావు

24 -07 -2021

(ఎద్నా సైంట్ విన్సెంట్ మిలే కవిత – లేమెంట్ కు నా తెలుగు సేత) 


Lament

- Edna St. Vincent Millay 

Listen, children:

Your father is dead.

From his old coats

I’ll make you little jackets;

I’ll make you little trousers

From his old pants.

There’ll be in his pockets

Things he used to put there,

Keys and pennies

Covered with tobacco;

Dan shall have the pennies

To save in his bank;

Anne shall have the keys

To make a pretty noise with.

Life must go on,

And the dead be forgotten;

Life must go on,

Though good men die;

Anne, eat your breakfast;

Dan, take your medicine;

Life must go on;

I forget just why.

-Edna St. Vincent Millay

నా పరామర్శః

ఇంటికి పెద్ద దిక్కు అనూహ్యంగా మరణించినప్పుడు అప్పటి వరకు ఎంతో బేలగా కనిపించిన ఆ ఇంటి ఇల్లాలు  ధీరవనితగా మారిపోతుంది. ముందు ముందు ఎదిగి జీవితంలో  సొంత కాళ్లపై నిలబడవలసిన తన పసికూనల కోసం ఆ ఉగ్గబట్టుకోడం! పుట్టెడంత దుఃఖం కడుపులో తెరలుతున్నా.. అణుచుకుంటుందా ఇల్లాలు! అసలేమీ జరగనట్లే రోజూలానే పిల్లలను ఆమె పరామర్శించే తీరు ఈ కవితలోని ప్రతీ పాదానికీ ఉదాత్తత చెకూరుస్తుంది. పిల్లల పట్ల అంత అప్రమత్తతతో ఉన్నప్పటికీ  పిల్లల తండ్రిని గురించే అడుగడుగునా ప్రస్తావించడం ఈ కవిత విశిష్టత. స్త్రీకి తరలెళ్ళిపోయిన తన జీవితభాగస్వామి పైనుండే తరగనంత అనురాగాన్ని  బిడ్డల వైపుకు మళ్లించే కుటుంబ సంబంధాన్ని ఎంతో బలంగా చాటుతున్నది  కనకనే ఈ కవితకు ఇంత  గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా. 

కుటుంబంలో జరిగే పెను విషాదాలు పసికూనలపై పడకూడదని, పోయినవాళ్లను గురించి ఎంత దుఃఖం పొర్లుతున్నప్పటికీ పెద్దలు తమ బాధ్యతగా పిల్లలతో ఎప్పటిలాగానే ప్రవర్తించాలన్న గొప్ప సందేశం ఈ పద్యంలని ప్రతి పాదంలోనూ కనిపించడం విశేషం. 

ఎంత మంచివాళ్లు పోయినా జీవితం ఆగకుండా ముందుకు  కొనసాగాల్సిందేనన్న తాత్విక చింతనతో ముగిసే  ఈ పద్యనికి కొసమెరుపులా మరో లోక రీతీ 

‘లైఫ్ ముస్ట్ గో ఆన్.. అని ఊరుకోకుండా.. ‘ఐ ఫరగెట్ జస్ట్ వై’ అని కర్త అనడం కవితను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది.  చావు పుట్టుకలతో నిమిత్తం లేకుండా జీవితం కొనసాగుతూనే ఉండాలన్న నిత్యసత్యం ఊరడింపు వాక్యంగా తనకు తాను చెప్పుకోడం కోసం. ‘ఎందుకు అట్లా’ అనే తాత్విక సంశయం సహజంగానె పసి మెదళ్లలో మొలకెత్తక మానక మానదు కదా! ఆ సందేహం తలెత్తి చిన్నారులు అయోమయం పాలవకుండా ‘ ఐ ఫర్ గెట్ జస్ట్ వై’ అని ఆదిలోనే  ఫుల్ స్టాప్ పెట్టేసింది గడుసుగా తల్లి. ప్రకృతిలో జరిగే అన్ని సంఘటనలకు కారణాలు వెతకబోతే మనిషి అవగాహనకు అందనివీ ఎన్నో ఉండనే ఉన్నాయి కదా!

-     కర్లపాలెం హనుమంతరావు

   23 -07 -2021

 

 

Saturday, July 17, 2021

జీత భత్తేలు -కర్లపాలెం హనుమంతరావు

 


సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు 



 


Tuesday, July 6, 2021

యక్షులు ( పౌరాణిక సమాచారం .. సరదాగా ) - కర్లపాలెం హనుమంతరావు

  

దేవతా గణాలలో యక్షులు ఒక విభాగం  .  యక్షులు దయ్యాలు కాదు. శివ పంచాక్షరీ స్తోతంలో మహాశివుడిని ‘యక్ష స్వరూపాయ ‘ అని స్తుతించడం వింటుంటాం. దయ్యాలయితే  పూజలు ఉంటాయా? 

యక్షుల ప్రస్తావన లేని పురాణాలు కూడా అరుదే! అధోలోకాలు ఏడయితే   అతలం పిశాచాలకు, వితలం గుహ్యకులకు, సుతలం రాక్షసులకు, రసాతలం భూతాలకు మల్లే  .. తలాతలం యక్షులకు  నివాసస్థలమయిందిట. తలాతలం కింది   మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగాలు  ఉంటాయని హిందువులనమ్మకం. గోమాతలోనూ సకల దేవతలూ వారి  వారి గణాలన్నీ కొలువై ఉంటాయనీ సురభిమాత   వామభాగం ఈ యక్షుల వసతిస్థలమని ఓ నమ్మిక . ఒక్కో దేవతాగణానికీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని వక్కాణించే   వరాహపురాణంలో  యక్షగణాల బస  శతశృంగ పర్వతం. 


యక్షజాతికి కుబేరుడు  అధిపతి. మగవాళ్లు   యక్షులయితే  , స్త్రీలు  యక్షిణిలుగ ప్రసిద్ధులు . యక్షిణులు మహా సౌందర్యమూర్తులు. ఆ జాతి  వృత్తి గుప్త నిధులకు  పహారా. యక్షులను  ప్రసన్నం చేసుకుంటే  కోరుకున్న సంపదలు సిద్ధిస్తాయని  ఉత్థమారేశ్వర తంత్రం వూరిస్తుంది.  యక్షిణులు ఎంత సౌందర్యవంతులో అంతకు మించి శక్తివంతులుకూడా.వారి ఆవాహనార్థం ఎన్నో యక్షిణీ సాధనలు అపర విద్యలుగా ప్రచారంలో ఉన్నాయి. దేహంలోనికి    చెవి ద్వారం గుండా  ప్రవేశించి భక్తుల చేత సత్కార్యాలు చేయిస్తారని విశ్వాసం . రౌద్రం వస్తే వీరంత  విధ్యంసకారులు మరొకరుండరనీ అంటారు . 

యక్షులు కళాకారులు ; పోషకులు కూడా!  మహాకవి కాళిదాసు మార్కు యక్షుడు ఆషాఢమాస విరహం  ఓపలేక ప్రియురాలికి  మేఘుని ద్వారా  సందేశం పంపిన కథ మనకందరికీ తెలిసిందే! మహాభారతం వ్యాసముని   సృష్టి యక్షుడు వేసిన ప్రశ్నల లోతుల   గురించి మరి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ' ఘన నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున 'యక్షిణి'  దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు' స్తుతింతును ' అన్నాడు నవీన వచనవస్తుకవి  పరవస్తు  చిన్నయసూరి. 


రామాయణంలోని రాక్షసి  'తాటకి' తొలి దశలో  యక్షిణి. బ్రహ్మ వర ప్రసాదిత. సుకేతుడు అనే యక్షుడుకి తపశ్శక్తి ఫలితంగా పుట్టిన వెయ్యి ఏనుగుల బలం కలిగిన బాలిక ఆమె .  తాటకి ఝఝరుడనే మరో  యక్షుడి కొడుకు  సుందుడి  జీవిత భాగస్వామిగా  మారీచుడిని కన్నది ఆ తల్లి .  అగస్త్యుడితో పెట్టుకున్న గొడువల మూలకంగా  సుందుడు బూడిదకుప్పగా మారినప్పుడు     తాటకి కొడుకు  మారీచుడుతో కలిసి వెళ్లి మళ్లీ దాడి చేసి ముని శాపం మూలకంగా బిడ్డతో సహా రాక్షసిగా మారుతుంది .  వాల్మీకి    రామాయణం బాలకాండ చదివితే  ఈ యక్షిణి కథ విపులంగా  తెలుస్తుంది.


భాగవతంలో కనిపించే మరో ఇద్దరు  యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు.  ఓ మహర్షికి  ఆగ్రహం తెప్పించిన కారణాన వాళ్లిద్దరూ  మద్ది చెట్లుగా మారిపోతారు . ఆ రెండు మద్ది వృక్షాల మధ్య నుంచే అల్లరి బాలకృష్ణుడు  తల్లి యశోదమ్మ తన కటి భాగానికి కట్టిన రోటిని  తాటితో  సహా ఈడ్చి  పడతోసి  శాపవిమోచన  కలిగించేది .


యక్షులవీ దేవతా గుణాలే.  కాకపోతే, దుష్టశక్తుల దగ్గరకు చేరడం,  స్వార్థ పరులకి సాయమందించడం , వేళగాని వేళలలో యధేచ్ఛగా విహరించడాలు  వంటి అసురగుణాలు అవధులు దాటి ప్రదర్శించినప్పుడు వికటించి శిక్షకింద రాక్షసులుగా మారడం, చెరవిముక్తికై  యుగాలు తపించడం మన పౌరాణిక కథలలో పరిపాటి. 

యక్షులు వశమయితే , కామ్యకాలు  నెరవేరుతాయని  దుష్టుల పేరాశకు పోవడం పురాణ కాలంలోనే కాదు ఈ కలియుగాంతంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది.  దుర్మార్గులను దూరంగా ఉంచినంత కాలం యక్షులైనా .. మనుషులైనా  దైవగణాలకు సమానులే. మాననీయులే! 

- కర్లపాలెం హనుమంతరావు 

07-07-2021 

ƘᗩᖇᒪᗩᑭᗩᒪƐᗰ HᗩᑎᑌᗰᗩᑎƬHᗩ ᖇᗩO

Saturday, July 3, 2021

ఆంధ్ర'భాషాపదం- చరిత్ర పరంగా -కర్లపాలెం హనుమంతరావు

 



క్రీస్తుకు పూర్వం పదో శతాబ్దం దాకా 'తెలుగు' అనే పదమే కనిపించదు. ఈ పదం మొదటిసారి ప్రత్యక్షమవడం తమిళ, కన్నడ శాసనాలలో, ఆంధ్రకర్ణాటక వాజ్ఞ్మయంలో! అదీ 'తెలుంగు, తెలుంగ, తెలింగ' తరహా రూపాలలో!

జాతికా? భాషకా? ఈ ‘తెలుగు’ పదం దేనికి సూచకం? అన్న ప్రశ్నకు ‘రెండింటికీ’ అన్నది  సరిపోయే సమాధానం. ఈ రెండింటికే కాకుండా మూడోది, ముఖ్యమైనది ‘స్థాన’ సూచకంగా కూడా వాడుకలో ఉండేది ఒకానొకప్పుడు. 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అంటూ 'తెలుగుదేశంలోని 'మాధవియకెఱెయ' అనే ఊరి పేరు 'దేశ'పరంగా ప్రస్తావించిన తొలినాటి శాసనమే ఇందుకు ఆధారం.  ‘తెలుగు’ అనే పదం  భాషకు చేసే సేవనే  ఆంధ్రతిలింగ, తెలింగ అనే రెండు పదాలు అప్పటికే  చక్కబెడుతున్నాయి.

ఇట్లా దేశపరంగా 'తెలుగు'  పదం ప్రాచుర్యంలోకి రావడం క్రీ.శ పదో శతాబ్దం తరువాత. కానీ ఆ తెలుగు పదం   'తెలుంగు, తెలింగ' లాంటి రూపాలలో కనిపించేది.  పదకొండో శతాబ్ది నాటి  చాళుక్య రాజరాజు నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయభట్టు కాలం నాటికి  తెలుగుకు 'తెనుగు' అనే మరో భాషారూపం కూడా జతపడింది.  పన్నెండో శతాబ్దపు  నన్నెచోడుడి చలవతో ఆ 'తెనుగు' అనే పదం  భాషకు సంబధించిందన్న భావం గట్టిపడింది. పదమూడో శతాబ్దిలో మహమ్మదీయ చరిత్రకారులు కూడా 'తిలింగ్' అన్న పదం వాడేసి  'తిలింగ' అన్న రూపానికి సాధికారత కల్పించడం విశేషం! ఏతావాతా తేలేది ఏమిటి? తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు తరహా పదాలు కూడా అంతకు మునుపట్లా కేవలం, ప్రాంతానికి.. జాతికే  కాకుండా  'భాష'ను సూచించే పదాలుగా కూడా సామాజిక ఆమోదం పొందాయని. అప్పటికి వరకు వాడుకలో ఉన్న ‘ఆంధ్ర’  పదానికి ఈ 'తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు' తరహా పదాలు ప్రత్యామ్నాయాలు అయ్యాయన్నమాట.  బొత్తిగా శబ్ద సాజాత్యం లేకుండా ‘ఆంధ్ర’ పదానికి ఎట్లా   ప్రత్యామ్నాలయాయీ? అంటే అదే చిత్రం!

ఇక తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి పుట్టుక అంతకు మించిన విచిత్రం. వివాదాస్పదం కూడా.  క్రీ.శ 14 వ శతాబ్ది ప్రథమార్థంలో ఓరుగల్లును ఏలిన కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండే దుండిన విశ్వనాథకవి తన  ప్రసిద్ధ 'ప్రతాపరుద్రీయం' లో 'యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా/యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః/తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర/ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు' అంటూ చేసిన ప్రార్థనలో 'త్రిలింగ' అనే పదం  వాడాడు. అందుకు ఆ కవి చెప్పిన కారణం తిరుగులేనిది కావడంతో  ‘ఆంధ్ర’కు  అదే సరైన పదంగా భాషలో స్థిరపడిపోయింది.

కళింగం తప్పించి తతిమ్మా యావదాంధ్రం  కాకతి ప్రతాపరుద్రుడి స్వాధీనంలో ఉండటంతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధమైన శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాలను ఉజ్జాయింపు ఎల్లలుగా చెప్పి ఆయా క్షేత్రాలలోని శివలింగాల పట్ల భక్తితోనే  ఈ ప్రాంతాన్ని 'త్రిలింగం' అన్నాను పొమ్మన్నాడు సోమనాథుడు గడుసుగా. నిజానికి కవి ఇక్కడ చేసింది సాహిత్యపరమైన చమత్కారం. అయినా అప్పటి వరకు ఆంధ్రపథంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రాంతం కాస్తా 'త్రిలింగ' దేశంగా మారికూర్చుంది. కాకతీయులు శైవులు. వారు పాటించిన  శైవమతానికి అతికినట్లు సరిపోయే ఈ కావ్య చమత్కారానికి 'ఆంధ్ర' అనే పాత పదం పాపం, ఇంకేం బదులిస్తుంది? మొత్తానికి మహాదేవుడి  మూడు శివలింగాల చలవతో చివరకు ఆంధ్రులమంతా ‘త్రిలింగులు’గా మారిపోవడం మహాచిత్రం! 

ఓ మారు వ్యవహారంలోకంటూ వచ్చేసిన తరువాత  ఉచ్చారణలో తొణికిసలాడే గాంభీర్యం.. వ్యుత్పత్తి వివరణ- పదానికి దగ్గరగా ఉండటంతో ఈ 'త్రిలింగ' పదం జనం నాలుకల మీద సునాయాసంగా స్థిరపడిపోయింది. దేశపరంగా ‘త్రిలింగదేశం’ అట్లా స్థిరపడిందే! ఆ త్రిలింగదేశ వాసులం కనక మనం 'త్రిలుంగులు' గా మార్పుచెందాం. మనం మాట్లాడే భాష 'త్రిలింగ భాష'గా మారిపోయింది.  కాలక్రమేణా  తిలింగ భాష, తెలింగ భాష, తెలుంగు భాషగా రూపాంతరం చెందుతూ చెందుతూ  'తెలుగు భాష'గా గుర్తింపు పొందే దశలో ఉంది  ప్రస్తుతం.   

'తెలుగు' పదానికి  వ్యుత్పత్తి చెప్పటంలో విద్యానాథుడు అనుసరించిన విధానాన్నే అతని తరువాతి కాలపు తెలుగు లక్షణవేత్తలూ అనుకరించారు. ఆ తరహా లాక్షణికులలో మొట్టమొదటివాడు 15వ శతాబ్ది పూర్వార్థానికి  చెందిన  విన్నకోట పెద్దనకవి. ఆయన తన  కావ్యాలంకార చూడామణిలో 'ధర శ్రీపర్వత కాళే/శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా/కర మగుట నంధ్రదేశం/బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్' అన్నాడు.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ/దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె/వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'రని అప్పటి వరకు  వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్న తెనుగుదేశానికి సమన్వయం కూడా ఇచ్చాడు. ఎదురు బదులివ్వగలరా ఇంకెవరైనా! 17వ శతాబ్ది నాటి అప్పకవీ దీనినే అనువదించాడంటేనే ఈ వ్యుత్పత్తి పదం సత్తా ఏంటో అర్థమవటంలేదా!.  

 

ఇక, పాల్కురికి సోమనాథుడు ఈ త్రిలింగదేశాన్ని 'నవలక్ష తెలుంగు' (తొమ్మిది లక్షల గ్రామాలకు పరిమితమైన తెలుగు)గా తన ‘పండితారాధ్యచరిత్ర’లో కొత్తగా నిర్వచించాడు.  ఆనాటి మహమ్మదీయ చరిత్రకారుడు ఈసామీ సైతం ఈ మాటను పట్టుకునే 'నౌ లాఖ్ తిలింగ్' (తొమ్మిది లక్షల తిలింగ్) అని నిర్ధారించడం అదో తమాషా. 14వ శతాబ్దం పూర్వార్థం నాటి శాసనాలు ఈ ‘నవలక్ష తెలుంగు’లోని తెలుంగునే 'తిలింగ' దేశంగా మార్చేశాయి. 'తైలింగ ధరణితలం'గా వ్యవహృతమవడమే ఇందుకు ఉదాహరణ.  అదే శతాబ్దం నాటి ఒకానొక శాసనం 'తిలింగదేశం'  అనే పదాన్ని ‘పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ/ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;/అవా గుదక్పాండ్యక కాన్యకుబ్జౌ/దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా’ అంటూ నిర్వచించింది.

ఇట్లా కవులు, వైయాకరణులు,  లాక్షణికులు, చరిత్రకారులు వివిధకాలాలలో ఒకే రకంగా చేసిన ఎల్లల ప్రస్తావనల చలవ వల్ల అంతిమంగా ఆంధ్రదేశం త్రిలింగ దేశం(తెలుగుదేశం)గా స్థిరపడిందనుకోవాలి. 'తెలుగు' ఆంధ్ర’ పదానికి దేశపరంగా, జాతిపరంగా, భాషపరంగా కూడా   పర్యాయపదం అయింది.

ఇంత హంగామా జరిగినా,  ఇప్పటికీ 'తెలుగు' అనే పదానికి  శాస్త్రీయంగా వ్యుత్పత్తి అర్థం కాని, ఆ పదం ఎప్పుడు మొట్టమొదటగా వాడుకలోకి వచ్చిన వివరాలు కానీ, ఆ రావడం  దేశవాచకంగానా, జాతివాచకంగానా, భాషావాచకగానా రావడమని గానీ.. ఏవీఁ ఇతమిత్థంగా తెలీటం లేదు. జాతివాచకమో,  భాషావాచకమో అయితే ఆదిమకాలంలో అంధ్రులు, తెలుగువారు ఒక్కరే అయివుండాలి  మరి. ఏ చారిత్రిక పరిశోధనా ఈ దశగా సాగి వాదనలు వేటినీ నిర్ధారించినట్లు కనిపించదు! శబ్దపరంగా పొంతనకైనా ఆస్కారంలేని  ఈ రెండు పదాలు మధ్యనా ఎట్లా ఒకదానికి ఒకటి  పర్యాయపదాలు అనే బంధం బలపడిందో! ఇదీ ఓ  పెద్ద వింత.  భాషాపరిశోధకులు నిగ్గు తేలిస్తే తప్ప ప్రామాణీయకమైన సత్యాలుగా తేలని అనేక భాషాంశాలలో ఈ ఆంధ్ర -తెలుగు పదాల పరస్పర పర్యాయబంధ రహస్యం కూడా ఒకటి. నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం ఒకదాని కొకటి పర్యాయ పదాలయ్యాయని కేవలం నమ్మకం మీద మాత్రమే చెప్పుకోవడం!  

 

ఇవాళ ఆంధ్రులు అంటే  తెలుగువాళ్ళే కానీ, తెలుగువాళ్లంతా ఆంధ్రులు అంటే ఒప్పుకోని పరిస్థితిలు నెలకొనివున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తరువాత  సంభవించిన మరో ప్రధానమైన మార్పు నవ్యాంధ్రప్రదేశ్    నివాసులు మాత్రమే ఆంధ్రులుగా పరిగణింపబడటం! తెలంగాణా రాష్టవాసులు తమను తెలుగువారుగా చెప్పుకుంటారు కానీ 'ఆంధ్రులు'గా గుర్తింపు పొందేందుకు మాత్రం సిద్ధంగా లేరు!

-కర్లపాలెం హనుమంతరావు

03 -07 -2021

 

 

Tuesday, June 22, 2021

మన స్వాతంత్య్రం మేడిపండు! - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు సంపాదకీయం - 15 - 08- 2012

 



అసత్యం నుంచి సత్యం దిశగా, అజ్ఞానమనే అంధకారం నుంచి  జ్ఞానమనే జ్యోతి  ప్రకాశం వైపుగా, మృత్యువు నుంచి   అమృతత్వానికేసి  .. ప్రభూ, మమ్ములను నడిపించు' అంటూ  చేసే 'అసతోమా సద్గమయ'  ప్రార్థన సహస్రాబ్దాల భారతావని సాంస్కృతిక సంస్కార సారం. దశాబ్దాల కిందట  ఇదే శుభ దినాన  దేశమాత దాస్యశృంఖలాలు విచ్ఛిన్నమయి, నడిరేయిలో స్వాతంత్య్ర భానూదయమైన క్షణం ప్రతి భారతీయుడి గుండె ఆనందార్ణవమైన  మాట నిజం. 'ప్రాగ్దిశాకాశంలో వినూత్న తార'గా పండిట్ నెహ్రూ అభివర్ణించిన ఆ స్వాతంత్ర్య  దేశం సాధ్యపడిందెలా? దోపిడి, పీడనల వలస పాలనకు  వ్యతిరేకంగా యావద్దేశం ఒకే  తాటి మీద కొచ్చి   పూరించిన సత్యాగ్రహ సమర శంఖారావం   తెల్లవాడి గుండెల్లో దడపుట్టించింది.  సరిహద్దులు దాటు వరకు  తరిమికొట్టింది. 'తమసోమా జ్యోతిర్గమయ' దారిన ఆ అర్థరాత్రి ఉదయించిన  స్వాతంత్య్ర ఉషోదయ కాంతులు  కోట్లకొద్ది తాడిత పీడిత జనావళి జీవితాలలో నవ్య కాంతుల ప్రసారాలకు నాందీ ప్రస్తావనలవుతాయనే  నాటి అశేష విశాల జనావళి ఆశ్వాసించినది. మొక్కవోని విశ్వాసంతోనే భారతావని ప్రగతి ప్రస్థానం దశాబ్దాల కిందట మొదలయినది . ఇన్ని  దశాబ్దాల కాలగతిలో ఇండియా స్వీయ శక్తి సామర్థ్యాల మేరకు అభివృద్ధి నిజంగా  సాధించిందా?  అన్న ధర్మసందేహం మొన్న  ప్రధానమంత్రికే కలిగింది! అదీ అబ్బురం! అభివృద్ధికి అవినీతిని సమానార్థకం చేసేసిన  పాలకుల పాలబడి రాజ్యాంగ వ్యవస్థలే భ్రష్టుపట్టిన దురదృష్టకర వాతావరణం ఇప్పుడు దేశమంతటా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రగతి చాటున అవినీతి జగతిని  సృష్టించిన ప్రజానేతల పాలన- నాటి సుహార్తో, మార్కోసుల ‌ వంటి  మహామహుల జమానాలకు  నమూనా! దాని దుష్ప్రభావాలు రాష్ట్రాన్ని నేటికీ వెంటాడుతుండగా, సీబీఐ అభియోగపత్రంలో అయిదో నిందితుడిగా ముద్రపడి తాజాగా మంత్రి పదవి త్యజించారు ధర్మాన! 'కొడుకు వలన, కొడుకు చేత, కొడుకు కోసం'గా ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ అస్మదీయ మంత్రులు, ఐఏఎస్‌ల అండతో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి పదుల వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్‌కు నిర్మించి ఇచ్చారు. 'కోట్లు మీకు- కోర్టులు మాకా' అని ఎంత గుస్సా పడితేనేం- నాటి పాపంలో పాల్పంచుకొన్నందుకు మంత్రులూ బాధ్యత వహించక తప్పదు. రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగమే రాజకీయంగా చలామణీ అవుతోందిప్పుడు!


'గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్' అన్న భావన బలపడుతోందంటే, క్షీణ విలువలకు ఆటపట్టుగా జాతి దిగజారుతోందని అర్థం. నేడు భారతావనిని పట్టి కుదుపుతోంది అదే అనర్థం. భారత స్వాతంత్య్రోద్యమం పూర్తిగా త్యాగధనుల చరిత్ర. మందికోసం మాగాణులమ్ముకొన్న (అ)సామాన్యులు మొదలు, దేశహితం తప్ప మరేమీ పట్టని దార్శనికులు యాభయ్యేళ్ల క్రితందాకా నడయాడిందీ నేల! సొంత ఇల్లు లేని 'హోం'మంత్రిగా, దరిమిలా ప్రధానమంత్రిగా ఆయా పదవులకే వన్నె తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం నేటి నేతల్లో ఎందరికి తెలుసు?ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవిని త్యజించిన లాల్ బహదూర్ ముందు నేటి నేతలంతా పిపీలికాలే. 'ప్రయత్నలోపం లేకుండా ముందడుగేద్దాం... విజయం సాధిస్తే సంతోషం. విఫలమైతే రాజీనామా చేసి నిష్క్రమిస్తా'నని ప్రధానమంత్రిగా ఆయన చెప్పిన మాట సమున్నతాదర్శానికి కరదీపికే! అభియోగపత్రం దాఖలైతే రాజీనామా చెయ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని కుతర్కం తీసిన లాలు మహాశయుల తలదన్నే నేతలు రాష్ట్రంలోనే దాపురించారు. ఫెరా ఉల్లంఘన కేసులో జైలుశిక్షకు గురైనా నైతిక బాధ్యతను తుంగలో తొక్కి పదవిని పట్టుకు వేలాడుతున్నారు ఓ మంత్రిసత్తములు! పదవులు చేపట్టేముందు చేసిన రాజ్యాంగ ప్రమాణాలే గీటురాయి అయితే మంత్రివర్గంలో అసలు మిగిలేదెందరు? 'రాజ్యాంగాన్ని ముట్టకుండానే, కేవలం పాలన యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమే'నని 1949 అక్టోబరులోనే భారతరత్న అంబేద్కర్ హెచ్చరించారు. అక్రమాల ఏలికలు ఇప్పుడు చేస్తున్నవి అదే తరహా అవినీతి ప్రయోగాలు!


క్రమం తప్పక ఎన్నికలు జరగడమే ప్రామాణికమైతే, 'మేరా భారత్ మహాన్' అనుకోవాల్సిందే. డబ్బులు వెదజల్లి గెలవడం, మళ్ళీ అంతులేని సంపదలు పోగేసుకోవడానికి నానా గడ్డీ కరవడం- భారత ప్రజాస్వామ్య ముఖచిత్రం ఇదీ అంటే, సిగ్గుపడాల్సిందే! నేడు- నేరం, రాజకీయం అవిభాజ్యం; రాజ్యం అవినీతి భోజ్యం! 'కాగ్' లెక్కల ప్రకారం లక్షా 76వేలకోట్ల రూపాయల రాబడి నష్టానికి కారకుడైన అవినీతి 'రాజా'- సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేదాకా కేంద్రమంత్రి పదవిలో ఎలా కొనసాగగలిగాడో తెలియనిది కాదు. పద్నాలుగుమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రువ్విన అన్నా బృందమే అందుకు రుజువులు చూపాలంటున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రివర్యులు! 'ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపండి- వాస్తవాలుంటే, విచారణ జరిపిస్తాం' అన్నది వైఎస్ పెడధోరణి. అదే పంథాను కేంద్రమూ పుణికిపుచ్చుకొంటే- ఎక్కడికక్కడ దోచుకొన్నవాళ్లకు దోచుకున్నంత! అవినీతిపరులకు రక్షాకవచాలు తొడగడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరస్పరం పోటీపడుతున్నాయని చెప్పక తప్పదు. పట్టుమని అయిదేళ్లలో రాష్ట్రం పుట్టిముంచి పదుల వేలకోట్ల రూపాయల అక్రమాస్తుల్ని జగన్‌కు దోచిపెట్టేలా నీకిది నాకది(క్రిడ్ ప్రో కో) బాటలో సాగిన వైఎస్, 26 జీఓలతో చీకటి లాలూచీలకూ చట్టబద్ధత కల్పించారు. ఆ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులకు నోటీసులు జారీచేస్తే న్యాయసహాయం పేరిట- మళ్ళీ ప్రజాధనాన్నే వెచ్చించి మచ్చపడ్డవాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తోంది కిరణ్ సర్కారు! ప్రజలకోసమే ప్రభుత్వాలున్నాయని, జనశ్రేయం కోసమే అవి పనిచేస్తున్నాయని ఎవ్వరూ గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పలేని మేడిపండు ప్రజాస్వామ్యం మనది. అధికార స్థానాల్లోని అవినీతి కుళ్లును ప్రక్షాళించడానికి సత్యాగ్రహ స్ఫూర్తితో జనం మరో స్వాతంత్య్ర సమరమే సాగించాలి!

(సంపాదకీయం, ఈనాడు , 15:08:2012)

Saturday, June 19, 2021

నవ్వు అరవై విధాల మేలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

 



 

హాసం పరమేశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' అన్న ఆదిదేవుని  సంస్తుతే ఇందుకు ఒక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయలు వెన్నెలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా సాగుతోంది.. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి పెదవులపై చిరుదరహాసాలు! ఎవరికి వారుగా ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం.. తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఇక్కడి ఉదహృతానికి సంబంధించిన ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసురవధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు పోతన. భామ మందహాసం అదే. హరిని, అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం  ఏ భావంతో తేరిపార చూశాడో.. నీలాపనిందల పాలయ్యాడు చవితి చంద్రుడు. హాసానికి, పరిహాసానికి మధ్య ఉండే పలుచని మేలితెర మూలకంగానే భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాలపాలయింది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటూ హాసంపై గల పరిమితులను గుర్తుచేసే శతక పద్యమూ మనకొకటుంది. 'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.

 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలపు మొరటు మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి  గౌరవ స్థానమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచి ఉచ్ఛరించినా, పదాలు అడ్డదిడ్డంగా మార్చి కూర్చినా, చేష్టితాలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా.. అనేకానేక సవాలక్ష  వంకర టింకర విన్యాసాలింకేవైనా ప్రదర్శించినా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను పువ్వుల్లా రాల్చవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు,ఆ కన్నుల్లో నిప్పురవ్వలు రాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని తతిమ్మా మరో ఎనిమిది.. మొత్తంగా ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రలు పోషించిన హాసవైవిధ్యాన్ని రసప్లావితంగా ప్రదర్శిచి 'ఆహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాలను గురించి కాళిదాసు మొదలు కృష్ణదేవరాయల దాకా, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి వరకు అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకు  మించి శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేసిన మాటా వాస్తవం. మే మొదటి వారాంతంలో వచ్చే  'ప్రపంచ నవ్వుల దినం'  ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!

ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని కరోనా తరహా పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధుల పై ఇంకెన్నో అధ్యయనాలు, మరింకెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా ఆ పరిశోధనాఫలాలలో కొన్నైనా! ఆ వెసులుబాటు లేనితనమే వీలున్నంత మేర మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత  కల్పిస్తున్నది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు. సరికదా, అందుకు విరుద్ధంగా ఆరోగ్యానికి అరవై రకాల మేలు కూడా. చాలా అధ్యయనాల్లో హాసోల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాసచికిత్సా విధానమే నవ్వుల దినోత్సవ నేపథ్యం.  కారణమేమీ లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయని కటారియా వాదం. నవ్వు రక్తవాహికలను విశాలపరుస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తిని విరోధిస్తుంది.  రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం వంటివి వందలాది లాభాల్లో ఒకటి మాతమే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు.. దానికే పది నిమిషాల పాటు వ్యాయామం చేసినంత మేలు. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటురాయిలా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపకా నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న  ప్రధాన స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీదనే సేవకు సదా సిద్ధంగా  ఉంటుంది. ఆ హాస సేవికకు పనికల్పించేందుకే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా.. పుట్టుకొచ్చింది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)

Tuesday, June 15, 2021

వెలుగుదారి - ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)

 



కాలమనే కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో/ ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది. 'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింతపండు ధర హెచ్చింది/ చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది'. ఇలా, నిద్రనుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కాసేపైనా గోర్వంకల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కలగలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు?' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్త్తెన శిఖరాల్నీ వూహల్లో త్రుటిలో లేపేయగల చేవ సృష్టిమొత్తంలో ఉంది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతా గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమార్ ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! 'నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను' తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే! ఉషాకాంతుల వంటి బంగరు వూహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం- మనిషి నిత్య ఆశావాది కావడమే!

 

ఆదిమానవుణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మనిషికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవని' మనిషి కనే కల వయసు మనిషి పుట్టుకంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ వూరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుందా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి. గతానుభవాలతో నిమిత్తం లేదు- రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించే అలాంటి స్వభావమే మనిషిదీ. 'సకల యత్నముల నుత్సాహంబె మనుజు/ లకు సకలార్థ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. 'నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమిపని నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చు. రక్తి కలగాలంటే నాటకానికైనా ఆసక్తి రగిలించే అంశం అవసరమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు 'నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.

 

'వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతవడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్లకిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. భుజంతట్టి, లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత' లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. 'ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు/ పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపు ఏ తేడా లేకుండా 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొదటిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 01 -01 -2012)


కాలమర్మం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సాహిత్య సంపాదకీయం .. 05:01:2014 నాటిది)


 'ఒక్కనాటి ప్రపంచము ఒక్కనాటి వలెకాదు/ ఒక్క నిమిషము వలెనొకటి గాదు-' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలవివేచన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు 'సూర్యుణ్ని ఉషాకన్యానాథుడి'గా ప్రస్తుతించాయి (రుగ్వే. 7 మం. 75 రుక్కు). బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్ధాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని. 'ద్వంద్వాన్ని సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత, తత్వవేత్త హక్స్‌లీ. మన శంకర భగవత్పాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నదీ ఇదే రహస్యం. 'అతీతాది వ్యవహార హేతుః' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు. కాలచింతనే మహా వింతైనది. భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధిస్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'ప్రారంభ సంపత్తికాధారం బెయ్యది?' అని సందేహపడితే... 'ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం?' అని ఆరుద్ర 'త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. 'మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని/ వూపిరి పోసుకున్న క్షణాన/ నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో' అనే మథన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తిరుగాడే నాటినుంచే వెంటాడుతోంది. కాలం- పదార్థం నాలుగో పరిమాణమన్న సాపేక్ష సిద్ధాంతం అర్థం కానంతకాలం కంటిముందు కాలంచేసే గారడి అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నలవరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం' మొదలు 'కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి దెప్పించడం' దాకా 'కాలమహత్తత్త్వంబు నిట్టిదనుచు వర్ణనము' చేయటం వశం కాదన్న బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ. కాలమర్మం అవగాహన కావాలంటే 'స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం' బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని, రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే. 'ఒక తరి సంతోషము, వే/రొక తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము' కూర్చే తలతిక్క కాలానిదని తూలనాడేదీ అందుకే. మనిషి కంఠశోషేగాని కాలానికేమన్నా కనికరం ఉంటుందా? 'కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ... ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా!' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా 'సౌందర్యస్పర్ధ'లో సుందరాంగుల అంగవిన్యాసమా? కాలం ఒక క్షణమైనా వెనక్కు చూడదు. ఏం సాధించాలనో ఈ నిబద్ధత?దువ్వూరివారు 'వనకుమారి'లో అన్నట్లు 'కష్టజీవి కన్నీటి కాల్వకైన గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు' కాలం. బోసిపాపల్ని నవ్వించడం, పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం... 'చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్ధులను దీర్ఘనిద్రకై దీవించడం'- కాలం ధర్మం.

అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం. నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. 'దైవరూపంబు కాలంబు దానికెపుడు/ లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి 'కల్యాణరాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ ...వృద్ధు కంట లేడిరీతి' పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పడానికి. 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌, ఐన్‌స్టీన్‌, లైబ్నిజ్‌. కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్‌.జి.వెల్స్‌ వూహ. అది వాస్తవమైతే ఎంత బాగుణ్ను! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. 'ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే' అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ' దృశ్యాన్ని కమనీయంగా పునర్వీక్షణ చేసి పులకించిపోవచ్చు. వూహకు అవధులు లేకపోవచ్చు. కాని దాన్ని భావించే బుద్ధికున్నాయిగా హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే? 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా../ అభివృద్ధీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి' అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా?' ఎక్కడ బయలుదేరిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో... ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్సరాలు. నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, గడవాల్సిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... బుద్ధిమంతులందరూ చేసే పనులు. చేయాల్సిన పనులు. కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సాహిత్య సంపాదకీయం ..05:01:2014 నాటిది)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...