Sunday, August 13, 2017

పుస్తక ప్రపంచం- ఈనాడు సంపాదకీయం


మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అధికం. మనువు మాట ప్రకారం, ఆతెలియనివాటిని తెలియజెప్పేవి– శ్రుతి, స్మృతి, సిద్ధులదివ్యదృష్టి, సజ్జనులసాంగత్యం. గురువ్యవస్థ, పర్యటన, పరిశీలన, స్వయంచేతన– వాటిని సాధించే మార్గాలు. గురువులు అందరికీ దొరకరు. దేశాటనా, పరిశోధనా అందరికీఅందుబాటులో ఉండేవీ  కావు. తలబోడి అయిన పిదపకాని దొరకని దువ్వెన– అనుభవం. మిగిలింది స్వయంకృషి. దానికి నెలవైనవే పుస్తకాలు.
తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం బోధిస్తాడు. ఏకకాలంలో ఈ మూడుధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే అనేవారు               డాక్టర్ 
సర్వేపల్లిరాధాకృష్ణన్. నిజం– పుస్తకాలనేస్తుడికి ఒంటరితనంఅంటు సోకదు. అక్షరచెలిమిని మించిన కలిమి సృష్టిలో మరేదీలేదని అక్బర్ బాదుషా భావన. స్వయంగా అక్షరాస్యుడు కాకపోయినా విద్వాంసులతో నిత్యసంపర్కమే ఆ బాదుషాలోని సంస్కారానికి సుగంధాలు అద్దింది. వాగ్భూషణం భూషణం అనికదా ధూర్జటికవి సువాక్కు! రాజుకు స్వదేశంలోనే గుర్తింపైతే విద్వాంసుడికి సర్వేసర్వత్రా సమ్మానమే అన్నదీ ఆ కవి సుభాషితమే. దొంగలభయం ఎరగని ఈ సొత్తు పదిమందికీ పంచిన కొద్దీ పెరిగేదే కాని తరిగేది కాదు. మనిషికి జంతువుకు మధ్యనే కాదు– మనిషికీ మనీషికీ మధ్య తేడాకు కూడా చదువే కారణం! జ్ఞానాన్ని సుగంధంతో పోల్చిన కాళిదాసు పుస్తకాన్ని ప్రసూనం అంటాడు. పూవులాగే పుస్తకమూ ఏస్వలాభాపేక్ష లేకుండా నలుదిక్కులా పరిమళాలు వెదజల్లే సద్గుణం కలిగి ఉంటుంది.
శ్రావ్యంబై రసవంతమై మధురమై సర్వాంగ సంపన్నమై/ నవ్యంబై పరిణామ రూపగతులన్  రంజిల్లుచున్   భావముల్/ సువ్యక్తం బొనరించున్ జగమున్ శోభిల్లు వాక్కు అన్న గిడుగు సీతాపతి శారదాశతకం పద్యంలోని ప్రత్యక్షరమూ పరమసత్యమే. ఆవాగ్భూషణం అమరి ఉండే మధుర మంజుల మంజూష పుస్తకం. పుస్తక ధారిణి అయిన పలుకుతల్లిని సంభావించుకునే సుదినం ప్రపంచ పుస్తకదినం.
చదువుసంధ్యల సంగతులు సృష్టి ప్రారంభంకన్నా ముందునుంచి సాగుతున్నవే!విధాత మగతావస్థలో ఉండగా జలరాసి సోమకాసుర రాకాసి చేతిలో జారిపడ్డ వేదవాజ్ఞ్మయాన్ని మీనావతారుడు ఉద్ధరించిన కథ భాగవతంలోఉంది. వేదవిజ్ఞానం సమస్తం ఏదో ఓ  గ్రంథరూపంలో నిక్షిప్తమై ఉందనే కదా దీని అర్థం! తొలిదేవుడు వినాయకుడు వ్యాసులవారి భారతానికి తొలిరాయసగాడు కూడా. చేతికి గంటము వస్తే/ కోతికి శివమెత్తినట్లు కొందరు మంత్రుల్/ నీతి ఎరుంగక బిగుతురు/ సీతారామాభిరామ సింగయరామా! అన్న చమత్కార చాటువే చెబుతుంది రాత ప్రాముఖ్యాన్ని. దశరథుడి పాలనలో నిరక్షరాస్యులనేవారు అసలు లేనేలేరని రామాయణం ఉవాచ. ఓబౌద్ధగ్రంథంలో చర్మాలపై రాయడాన్ని గురించి నప్రస్తావన ఉంది. చీకటిసిరా పూసిన ఆకాశమనే చర్మం పైని చంద్రమ అనేసుద్ద ముక్కతో విధాత చేస్తున్న గణితంలో చివరికి సర్వం తారారూపాలైన సున్నాలే ఫలితాలవుతున్నాయని సుబంధకవి వాసవదత్తలో బహుచక్కని రాతసామ్యాన్నిచెప్పుకొస్తాడు. తాటియాకును, భూర్జపత్రాన్ని జ్ఞానచిహ్నాలు భావించారు మన పూర్వీకులు. జ్ఞానదాత బ్రహ్మ హస్తాన తాళపత్రగ్రంథాలున్నట్లు చెక్కివున్న బాదామి, బహొళె శిల్పాలు ఎన్నోపరిశోధకుల తవ్వకాల్లో బయటపడ్డాయి. బుద్ధుడి జాతకకథలో కర్రపుస్తకాల ప్రస్తావన కనిపిస్తుంది. పాటీలనే ఒకరకమైన పత్రాలపై రాయడాన్ని శ్రీనాథుడూ శృంగారనైషధంలో బహు విశదంగా వర్ణించుకొస్తాడు. శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడనే కవిపండితుడు తన విశ్వకథాసంపుటి బృహత్కథకు తగిన ఆదరణ కరవైందన్న ఆవేదనతో అగ్గిపాలు చేసిన కథ అందరికీతెలిసిందే. ప్రతిపుస్తకానికీ భాగ్యాభాగ్యాలు జంటగా అంటి ఉంటాయని నానుడి. పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె/ యందు నిరుపేద కాపునై యుందుగాని/ పుస్తకములు లేనట్టి భూరిసౌధ/ మందు చక్రవర్తిగ నుండనభిలషింప అన్న విశ్వాసం ప్రస్తుతం తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. ఇది ఎంతైనా ఆనందించదగ్గ అంశమే.
నిప్పు తరవాత మానవుడు ఆవిష్కరించిన అత్యంత సమర్థమైన సాంకేతిక వింత– పుస్తకం. మార్క్ ట్వైన్ మహశయుడు అన్నట్లు– మంచిమిత్రులు, మంచిపుస్తకాలు, మంచినిద్ర వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది? పుస్తకమంటే లక్షఅక్షరాలు, కిలోకాయితాలు, చిటికెడుసిరా మాత్రమేనా? నవరసతరంగాల నురగలపై తేలియాడే కాగితం పడవ. అదిజేబులో పట్టేసే పూలతోట– కొందరు సౌందర్యారాధకుల పాలిటి తెలియని లోకాలకు ఎగరేసుకు పోయే మాయాతివాచీ.  మరికొందరు ఊహాప్రేమికులకు. తులసిదళమంత పవిత్రం. మరి కొంతమంది గ్రంథప్రియులకు. కలతలు తొలగించే తారక మంత్రం, పాపాలను పారదోలేది, మాంద్యానికి మందులా పనిచేసేది, దుఃఖం దుమ్మును దులిపేసి మనసును తేలిక చేసేదీ  పుస్తకమే.
కల్పతరువు, గురువు, భూత వర్తమాన , భవిష్యత్కాలాల అరలలో కాలం దాచుకున్న  సంపద, కరదీపిక, ఆశారేఖ పుస్తకం అంటారు మహాత్మాగాంధీ. అక్షరసత్యమైన మాట. సెర్వాంటిస్, షేక్‌స్పియర్, గార్సిలాసోడిలావేగాలాంటి విశ్వవిఖ్యాత సాహిత్యవేత్తల జన్మదినం.. ఏప్రియల 23. ఈ సుదినాన్ని అంతర్జాతీయ సంస్థ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగం ప్రపంచ పుస్తకదినంగా సంస్మరించుకోమని కోరడం అన్నివిధాలా సముచితం.

కేవలం అక్షరవేత్తలను సన్మానించుకునే ఉత్తమ సంప్రదాయం మాత్రమే కాదు కాపీ హాక్కుల రక్షణ చట్టాలను ఎక్కడికక్కడ యావత్ ప్రపంచం  పునః సమీక్షించుకునే సందర్భం నైతం ఈ పుస్తక సంస్మరణ శుభసమయానే. అక్షర ప్రియులందరికి    అభినందనలు.

(ఏప్రిల్23.  ప్రపంచపుస్తకదినం‘ సందర్భంగా - ఈనాడు ఆదివారం–సంపాదకీయం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...