ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా:- వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
- భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
- భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
- కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
- భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
- భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
- ఏదైతేనేమి భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి.
- అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
- పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
- బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు.
- వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
- నా సమీక్ష :
- ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
- ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు. నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
- ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
- ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
- కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు, వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
- -కర్లపాలెం హనుమంతరావు
- బోథెల్, యూఎస్ఎ
Sunday, December 12, 2021
సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు
ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు తరచూ ప్రశ్నలకు గురి అవుతున్నట్లు? -కర్లపాలెం హనుమంతరావు
ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు తరచూ ప్రశ్నలకు గురి అవుతున్నట్లు?
-కర్లపాలెం హనుమంతరావు
దేశంలోని న్యాయస్థానాలిప్పుడు రెండో దశ కోవిడ్ సంక్షోభానికి కేంద్ర ఎన్నికల కమీషనుకే బాధ్యత అంటగడుతున్నాయి.. కఠిన వ్యాఖ్యలూ చేస్తున్నాయి! మద్రాస్ న్యాయస్థానం ఎన్నికల అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని ఆగ్రహంతో ఊగిపోయింది. ‘ప్రాణానికి మించి మరేదీ ముఖ్యం కాదు. రాష్ట్ర ఎన్నికలు ఇప్పుడా నిర్వహించడం?’ అంటూ మరో రాష్ట్ర న్యాయస్థానం శిలవేసింది. భారీ జన సందోహం నివారించడం అసాధ్యమని తెలిసినప్పుడు చాలినన్ని నిషేధాజ్ఞలు ఎందుకు లేవు; ఉన్నవాటి అమలుకైనా చిత్తశుద్ధి ఎందుకు కరువు? కాబట్టే న్యాయవ్యవస్థ ఇప్పుడిన్నిందాలా తప్పుపట్టడం! ఇది జనావళి నిరసన స్వరమే!
ఏళ్ల కిందట కేంద్ర ఎన్నికల ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన కీ.శే టి.ఎన్. శేషన్ ప్రస్తావన ఇప్పుడు విస్తృతంగా వినవస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమీషన్ నిస్తేజమే అందుకు ప్రధాన కారణం అనుకోవాలి. శేషన్ చొరవలో పదో శాతమైనా ఇప్పటి ఎన్నికల కమీషన్ ప్రదర్శించదెందుకు? అంటూ ఓ న్యాయస్థానం తలంటు వరకు వ్యవహారం వెళ్లడం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం కృతాపరాధం.
కమీషన్ విఫలమైన పక్షంలో కోర్టులే స్వయంగా నియంత్రణ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నవంటేనే దేశంలో కరోనా మహమ్మారి సృష్టించే సంక్షోభం ఏ స్థాయిలో పెచ్చుమీరుతున్నదో అర్థంచేసుకోవచ్చు. కోర్టులు ప్రత్యక్షంగా అనవు కానీ, దేశంలోని రాజకీయ పండితుల, విశ్లేషకుల అభియోగం ప్రకారం ఎన్నికల కమీషన్ కేంద్రంలోని పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే!
2019 ఏప్రియల్ 8 తారీఖున దేశంలోని బుద్ధిజీవులు కొద్ది మంది ఉమ్మడిగా దేశాధ్యక్షుడిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో 'ఎన్నికల కమీషన్ విశ్వసనీయత ఏ స్థాయి దాకా దిగజారిందో వివరించారు. ఇప్పటి దుస్థితి అంతకు మించిన అధ్వాన్నం!
స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత భారత రాజ్యాంగం కేంద్ర ఎన్నికల కమీషనుకు ప్రసాదించింది. రాజకీయ పక్షాలను గుర్తించడం నుంచి ఏ పార్టీకి ఏ ఎన్నికల గుర్తు ఆమోదించాలన్న అంశం వరకు సర్వే సర్వత్రా సర్వస్వతంత్రంగా బాధ్యతలేవైనా నిర్వర్తించుకునే హక్కు కల్పించింది. దానర్థం అధికారానికో, మరో లౌల్యానికో లొంగి ప్రశ్నలకు అతీతంగా బాధ్యతలు నిక్షేపంగా నిర్వహించుకోవచ్చనా?! మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించడం నుంచి ఎన్నికల ఖర్చు సైతం అదుపు చేసే అధికారం వరకు సర్వాధికారాలు ధారపోసినా కమీషన్ గత కొంత కాలంగా ప్రవర్తిస్తున్న తీరు తరచూ దేశమంతటా ఎందుకు విమర్శల పాలవుతున్నది? ఒక సారైనా ఆత్మవిమర్శ చేసుకోవద్దా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల దుర్వినియాగం, ఓటరు జాబితాల సవరణలపై అవకతవకల వంటి ప్రధానాంశాలపై సైతం కమీషన్ శీతకన్ను వంటి అపవాదులు ఎప్పటి నుంచో వస్తున్నవే1 ఇప్పటికి మించిన కఠోర పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి వర్తమాన ప్రపంచానికి దర్పణప్రాయంగా నిలిచిన సందర్భాలు కేంద్ర ఎన్నికల కమిషన్ చరిత్రలో కోకొల్లలు! కానీ, గత కొంత కాలంగా షెడ్యూల్స్ ప్రకటించే తీరు మొదలు, ఫలితాల ప్రకటనలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే అంశం వరకు అడుగడుగునా విమర్శల వడగళ్ల వానంలోతడిసి ముద్దవడం..! కొత్తగా నకిలీ ఓటరు కార్డుల తయారీ ప్రత్యక్ష సాక్షాలతో సహా వివాదమవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నది ఎన్నికల కమీషన్! న్యాయవ్యవస్థ చేత సైతం మొట్టికాయలు తినడానికి ఇట్లాంటివే సవాలక్ష కారణాలు! కమీషన్ పని తీరులో సమూలన ప్రక్షాళన అందుకే తక్షణం అగత్యం అనిపించడం!
1986 -1990 కాలం నాటి ఆర్.వి.ఎస్ పేరిశాస్త్రి ఆధ్వర్యంలో ఈ.వి.యం ల విధానం, ఓటరు వయస్సు 18 ఏళ్లకు కుదించడం వంటి సంస్కరణలు ఆరంభమయిన మాటనూ కొట్టిపారవేయలేం. అస్మదీయులకు అనుకూలంగా పని తీరు లేదన్న అసహనంతో ప్రధాన ఎన్నికల కమీషనర్ కు సమాంతర అధికార వ్యవస్థను కొత్తగా చొప్పించే ప్రయత్నం మొదలవడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాము నుంచి. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి స్థానంలో అధిష్ఠించిన అనంతరం కమీషన్ స్వతంత్రను దెబ్బతీసే కొన్ని చర్యలు వెనుకంజ వేసిన మాట నిజం. ఆ ప్రజాస్యామ్య శుభ ఘడియల్లోనే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన కీ.శే టి.ఎన్. శేషన్ (1990 -96) కేంద్ర ఎన్నికల కమీషన్ శక్తి సామర్థ్యాలు ఏమిటో స్వయంగా నిర్వహించి చూపించారు.
ఎన్నికల వేళ రాజకీయ పక్షాలు అనుసరించే అప్రజాస్వామిక విధానాలను ఏ విధంగా కట్టడిచేయవచ్చో నిష్పక్షపాతంగా ప్రత్యక్షంగా శేషన్ నిర్వహించిన తీరును న్యాయస్థానాలు సైతం ఇప్పుడు స్మరించుకుంటున్నాయి.
శేషన్ కు ముందున్న ఎస్. వై. ఖురేషీ వంటి కమీషనర్లు ఎన్నికల కమీషన్ కు ఉండవలసిన మరన్ని అధికారాలకై కంఠశోష పెట్టారు. సంకల్పం ఉండటమే ప్రధానం, ధన బలం, మంద బలం, కుల మతాల వంటి రాజకీయ పక్షాలు ప్రదర్శించే అప్రజాస్వామిక విధానాలను కట్టడిచేసే అధికారాలు కేంద్ర ఎన్నికల యంత్రాంగానికి ఇప్పటికున్నవే పుష్కలం. రాజ్యాంగం కల్పించిన ఆ ప్రత్యేక అధికారాల ప్రస్తావన న్యాయస్థానాలు పదే పదే చేస్తున్న ఆంతర్యం ఎన్నికల సంఘం గ్రహించాలి.. అదే తక్షణావసరం! సంకల్ప లేమి వల్లనే ఎన్నికల కమీషన్ యంత్రాంగానికి ఇవాళ అన్ని దిక్కుల నుంచి ఇన్నిన్ని అక్షింతలు.
ఎన్నికల కమీషన్ లో అసలు సంస్కరణల ఊసే లేదని కాదూ! పనితీరులో పారదర్శకత, నిష్పక్షపాత మెరుగు పడే క్రమంలో సంఘం తరుఫు నుంచే సుమారు 50 సంస్కరణల వరకు ప్రభుత్వానికి సమర్పించిన మరపురాని అపూర్వ ఘట్టం సదా స్మరణీయం. నేరపూరిత రాజకీయాలను దూరం పెట్టడం, పార్టీ విరాళాల సేకరణ పై పారదర్శకతకు పట్టుబట్టడం, పెయిడ్ న్యూస్, లంచం వంటి విషయాలు బైటపడినప్పుడు ఏకంగా ఎన్నికలను రద్దుచేసే అధికారం కలిగి ఉండడం వంటి కొన్ని కొత్త కోరలు మొలిచిన మాట విస్మరించలేం! రాజకీయ పక్షాలకు రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగ సౌకర్యం, ఎన్నికల జాబితా కంప్యూటరీకరణ, ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు పత్రం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కచ్చితంగా పాటించవలసిన అగత్యం.. వంటి సంస్కరణలు కొన్ని ఆచరణలోకి రాకపోనూలేదు.
అయినా డబ్బు తాలూకు విచ్చలవిడితనం ఎన్నికల తాలూకు ప్రజాస్యామిక పవిత్రతను దెబ్బతీస్తున్న క్రమమే అభ్యంతరకర స్థాయికి పెరిగి పోయిందిప్పుడు. 2019 నాటి ఎన్నికల ఖర్చు సుమారు 60,000 కోట్లు. ఇది ప్రపంచంలోనే రికార్డ్! మీడియా స్టడీస్ సెంటర్ గణాంకాల ప్రకారం మునుపటి ఎన్నికల ఖర్చుకు ఇది రెట్టింపు!
. .
ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పుకుంటున్నది కదా మన దేశ ప్రజాస్వామ్యం! మరి దాని పరిరక్షణకు నాడి వంటి ఎన్నికల క్రతువు నిర్వహణకు ఉండవలసిన దీక్షాదక్షతలేవీ? ఎన్నికల క్రతువు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో లోపాలు చొరపడినప్పుడే న్యాయస్థానాల కార్యశీలత తప్పనిసరయేది!
నిజం చెప్పాలంటే నిర్వాచన్ సదన్ నిర్వహించే అధికారుల సమర్థతలో లోపం ఉండి కాదు ఈ దుస్థితి. రాజకీయపరమైన వత్తిళ్లకు ఎదురొడ్డి నిలబడవలసినంత పట్టుదల లోపిస్తున్నదనే దేశం గిలి. తాజాగా వివిధ న్యాయస్థానాలు వెలిబుచ్చుతున్న దురుసు వ్యాఖ్యానాలు అశేష భారతావని తరుఫున వినవచ్చే అసమ్మతి స్వరాలు.
-కర్లపాలెం హనుమంతరావు
05 -05 -2021
; నిర్వచనం -నిర్వహణ - కర్లపాలెం హనుమంతరావు
సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపుకు అవసరమయిన సహజచర్యలు. మానవేతర జంతుజాలం తమ వంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషికి అదనం. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలు కూడా చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికే ప్రతిభ తప్పనిసరి. ఆ ప్రతిభనే మనం 'సృజన' అని అనుకుంటున్నాం. ఆ ప్రజ్జ్ఞ గలవారిని సృజనశీలురుగా గుర్తిస్తున్నాం. స్రష్టలు అని పేరు పెట్టుకుని గౌరవించుకుంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. స్రష్టలు కన్నా ముందు మనుషులు కూడా. మనుషులందరూ కళాకారులు కారు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలో కళంటూఏదో ఒకటి దాగుండక పోదు గానీ..ఆ పిసరంత కళయినా బహిర్గతమైనప్పుడే అతనికి అంతో ఇంతో కళాకారుడిగా సమాజంలో గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఉనికి’ (Cogito ergo sum) పేరుతో ఓ సిద్ధాంత తయారుచేశాడు. దాని ప్రకారం మనిషి సృజనశీలి అయినా .. ఆ సృజనకు పొదుగు అనేది అతని 'బుద్ధి'నుంచి పుట్టుకురావాల్సిందే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం కూడా దాన్నే సమర్థిస్తున్నది.
నేను అంటూ ఒకడిని భౌతికంగా ఉండబట్టే కదా నాది అంటూ ఒక ఆలోచన ఉండే అవకాశం. ఉనికి వాదం (I exist.. therefore I think) మనిషిని బుద్ది విశిష్టుడిగా కన్నా ముందుగా సృజనశీలిగా గుర్తిస్తుంది. ఇద్ది దాదాపుగా జెన్ తత్త్వమే. మన భారతీయుల భక్తి యోగాలకు కూడా ఈ ఉనికివాదనతోనే చుట్టరికం.
హేతువు కన్నా ముందు అనుభూతికే మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకిలా? అంటే .. ఏమో ఇదో అంతుబట్టని రహస్యం అంటున్నారు ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా ఉండే వేదాంతులంతా. కానీ సృజన విషయం అట్లా కాదు. స్థూలంగా ఒక అభిప్రాయానికి రావడం కొంత సులభమే! శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండిక తరహాలో కవితాత్మకంగా చెప్పుకోవాలంటే సృజన ‘సంకుల పయోధర చ్చటా పంకిల నిబి- డాంధకార నిర్జన వీధికాంతరముల- నా చరించెడు వేళ- ప్రోన్మత్త రీతి అవశమొనరించు దివ్యతేజోనుభూతి’. ఇది స్వీయానుభూతి. ఆ అనుభూతినే ఎదుటివాళ్లకు ప్రసారం చెయ్యాలంటే?
లేనిదాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని, చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి తన్మయత్వం చెందేటట్లు చెయ్యడం, వగైరా ట్రిక్కులతో ఇది సాధ్యం. అయితే ఇక్కడ ఒక ప్రమాదం కద్దు. ‘సరసియై చల్లనై నన్ను జలకమార్చె' అంటూ మహాకవి శ్రీశ్రీ తరహాలో కొత్తగా ఏదన్న సృజనాత్మకంగా చెప్పబోతే కొంత మంది ' ఆ సరసి ఎవరు? ఎక్కడుంటుంది? చిరునామా ఏంటి?' అని విచారణలకు దిగవచ్చు. శుద్ధ లౌకికులకు అంతుపట్టని అనేక లక్షణాలు సృజనాత్మక అంశంలో దాగుంటాయి. అవి అర్థం కాక తలపట్టుకునే ఇహలోక చింతకులకు మాత్రమే సృజన ఒక పనికిమాలిన దండుగ వ్యవహారం. నిజంగా సృజన ఒక దండగ వ్యవహారమా?
ఆహర, నిద్ర, మైథునాధులే కాదు విరామం కూడా నిరంతరాయంగా అనుభవించలేడు మనిషి. వద్దంటే డబ్బు సినిమాలో ప్రారంభంలో పేదరికంతో అష్టకష్టాలు పడ్డ కథానాయకుడు ఒక దశ నుంచి దశ తిరిగి వద్దన్నా డబ్బు వచ్చి పడుతున్నప్పుడు రూపాయి బిళ్లను చూసి బెదిరిపోతాడు. మనిషి చపలచిత్తం మీద వ్యంగ్యాస్త్రాలు సంధించనట్లున్నా ఆ చలన చిత్రం మనిషిలోని కుదురులేని వైనాన్ని కళ్లకుకట్టిస్తుంది. నిశ్శబ్దం ఉండలేక విసుగెత్తినప్పుడు మనిషి అందుకే శబ్దాన్ని సృష్టించుకుంది. శబ్దంతో మనసు సంక్షుభితమయినప్పుడు సాంత్వన కోసం ముక్కూ, మూతీ మూసుకున్ని కూర్చున్నదీ అందుకే. ఆ ప్రత్యేక శబ్దాలను కవిత్వం ఈ విశిష్ట నిశ్శబ్దాన్ని యోగాసనాలని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని రాగాలాపనలోకి జారుకుంటాడు. కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ ఆవిష్కరించుకుని నృత్యం పేరుతో సొంతలోకంలో విహరిస్తాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో నూత్నప్రపంచమొకటి సృష్టించుకుని అందులో ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతం పైపై చూపులకి - ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు. మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్ర౦ నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలను నిర్లక్ష్యం చేసి ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడు ! ఎందుకు ?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడి నుంచి ముక్తి పొందటానికి ఇలా ఏదో కళారూపంలో భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా సృజనశీలులై పోగలరు? ఇంకొందరు ఎందుకు ఎంత తన్నుకులాడినా ఒక్క మంచి కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో సందేహం. ప్రశ్నంత సులభం కాదు సమాధానం.
అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో.. ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త సంజీవ్ దేవ్ జీ మతం. జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్ఛన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్ల, అనుకూల పరిస్తితుల చలవ చేత , శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు సమాజంలో మన మధ్యనే సదా సంచరిస్తుంటారు’అనేది ఆయన వాదం. కాదనలే౦ కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా.. సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది. వీరబ్రహ్మంగారి జీవితం లో వలె బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతనను ఎంత మాత్రం ప్రభావితం చేయలేవు. సందు చూసుకుని మరీ అన్నమాచార్యులవారి అంతరంగ తపన లాగా ఇంకేదో ఉత్కృష్ట రూపంలో విస్మయంగా బైటికి తన్నుకొచ్చే తీరుతుంది. చెరసాల పీడ గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేయడం ఇందుకు ఉదాహరణ.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు. రూకల బొబ్బట్లు, సన్మానపు దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు వెచ్చని చప్పట్ల కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక బోటు గల్లంతు..
‘ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అట్లాగని లోకమంతా ఆషాఢభూతుల బంధుగణంలో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు. ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చేసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో సంకీర్తించిన పదపితామహులు అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల మాటేమిటి! దుండగుల కెదురుగా నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని సొంత కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలూ .. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం- సృజన నిత్య నూతన వికాసం. సాయంగా .. సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత. కళాజ్యోతుల నిజ జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం. ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడు కూడా అయితే సమాజానికి సదా ఆదర్శప్రాయుడమతాడు.
-
చిత్తశుద్ధితో నమ్మిన జీవన ఉదాత్త సూత్రాలను ఆచరించి చూపించిన కళావైతాళికుల చరిత్రలో మనకు ఎందరో కనపడతారు. వారి అడుగుజాడల్లో నడవడానికి కళాకారులకు .. కవులకు ఎవరడ్డొస్తున్నట్లు?
‘నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’అంటూ సృజన మూర్తే కవి ,కళాకారుడి నడవడికకు తానెంతగా ప్రాధాన్యత ఇస్తుందో స్వయంగా వెల్లడించింది.
పరిసరాల ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నా స్వయంప్రతిభతో ఆ సృజనమ్మ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా చేసుకోవడం కళాకారుడి చేతుల్లోనే ఉంది. అవే చేతులతో సాటి సహోదరులకూ చేతనైనంత చేయూతనిచ్చి పైకి చేదుకోవటం కూడా సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువు .
***
- కర్లపాలెం హనుమంతరావు
నారికేళపాకం - ఆవశ్యకత -కర్లపాలెం హనుమంతరావు
కావ్యం ఒక జగత్తు.
లోకంలోని మిట్టపల్లాల మాదిరే కావ్యాలలోనూ
ఎగుడుదిగుడులుంటాయి. అనివార్యం. కావ్యజగత్తు, బౌతిక జగత్తు అన్యోన్యాశ్రయాలు. బౌతిక జగత్తు లేనిదే కావ్యజగత్తు లేదు.
కావ్యజగత్తు వినా బౌతిక జగత్తుకు వెలుగూ లేదు.
ఇహ కావ్యరసాల విషయానికి వస్తేః
గుత్తి నుంచి ద్రాక్షపండును ఇట్టే కోసి నోట్లో వేసుకోవచ్చు.
అరటిపండు ఆరగించడం అంటే గెల నుండి కోయడమే కాకుండా, తోలు వలుసుచుకొనే కొంత ప్రయాస తప్పదు. కొబ్బరికాయ దగ్గరి కొచ్చే సరికే ఆ
ప్రయత్నం మరింత అవసరం. కావ్యపాకాల తంతూ ఈ
తరహాలోనే ఉంటుందంటుంది అలంకారశాస్త్రం!
లోకంలో ద్రాక్షపండుతో మాత్రమే సర్దుకుపోతున్నామా మనమందరం! ప్రయత్న
పరిమితిని బట్టి సాఫల్య పరిమితి. ఆ సూత్రం అవగతమయిన వారితో వాదు లేదు. కానివారితోనే
లేనిపోని పేచీ. ఆనందం కోసమే కావ్య పఠన అనుకున్నప్పుడు.. ఆ ఆనంద రసానుభవానికి
బుద్ధి తాలూకు వైవిధ్యం మరంత విశిష్టత చేకూరుస్తుంది. ఆ వైశిష్ట్యంలోని అంతస్తుల అమరిక అర్థమవకో..
వద్దనుకొనే భావన వల్లనో అయోమయమంతా.
'భోజనం దేహి రాజేంద్ర! ఘృతసూపసమన్వితమ్
/మాహిషం శరచ్చంద్రచంద్రికా ధవళం దధి'అన్న శ్లోకంలోని మొదటి
భాగం ఒక్కటే కాదు.. రెండో భాగమూ సమన్వియించుకోవాలి. అదీ సాహిత్యవేత్త లక్షణం.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ఒక్క ద్రాక్షాపాకంలో మాత్రమే కవిత్వం ఉండాలనే కవిత్వానికే అన్యాయం చేయడమవుతుంది. కదళీపాకం
వరకు చదివి ఆనందించేవారితో కూడా కవిత్వానికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు కాబోదు.
నారికేళపాకం కోరుకొని ఆస్వాదించి ప్రోత్సహించినప్పుడే ఉగాది సంబర ప్రసాదం వంటి
కవిత్వం రూపుదిద్దుకొనేది. అయితే ఆ అంతస్తు చేరుకోనే చదువరికి శబ్దశక్తి పట్ల
అవగాహన మాత్రమే సరిపోదు.. రసనిష్ఠ సహకారమూ అనివార్యం.
నారికేళపాక రసాస్వాదనకు ప్రాచీన కావ్యజగత్తులో అగ్రతాంబూలం.
ఆ గౌరవం అందుకునేటందుకు చదువరికి ముందు అవసరమయేది శబ్దార్థపరిజ్ఞానమే అయినప్పటికీ,
అంతకన్నా ముఖ్యమైనది ప్రాక్తనసంస్కారం. ఇది సంపన్నమయివున్నప్పుడే నారికేళపాక
రసస్వరూపాన్ని సమగ్రంగా స్వానుభవంలోకి తెచ్చుకొనే భావాత్మ బలం పుంజుకునేది. పాండిత్య
శబ్దవాచ్యతా, రసికపదలాంఛనప్రాప్తీ కొరవడుతున్న
వాతావరణంఎ కఠినపాకం, బీరఆఆఆపీచుక్రమమనే అలంకార శాస్త్రం
ఉగ్గడించని విచిత్ర పదాలు పుట్టుకురావడానికి కారణం.
దోషం కావ్యసృజనలో లేదు. ఉన్న మెలికంతా రసాస్వాదన అసక్తత వల్ల
సంభవించిందే!
- కర్లపాలెం హనుమంతరావు
22 -05 -2021
(శ్రీపాదవారి కావ్యజగత్ భావన)
సృష్టిలో - రాచకొండ – కధ - పై నా స్పందన - కర్లపాలెం హనుమంతరావు
స్పందన: నా స్పందన చదివే దయచేసి రచయిత రావిశాస్త్రిగారి 'కథ' చదవమని ప్రార్థన🙏🙏
❤️❤️❤️'
జీవితం చాలా చిత్రమైన వ్యవహారం. బతికి తీరాల్సిందేనన్న ఇచ్ఛ పెట్టి, అట్లా బతికేందుకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులు కల్పించడం .. ఇదేదో ప్రకృతి- జీవిని ఆటపట్టించాలని చేసే చిలిపి చేష్టలా అనిపిస్తుంది.
బతకడమంటే వూరకుక్కలా ఊరకే బతకేయడం కాదుగా! కులాసాగా గడవాలి కాలం . ఈసురోమని ఏడుస్తూ రోజులు ఈడిస్తే ఆ బతుకు 'బతకడం' ఎట్లా అవుతుంది! దాని కన్నా చావు హాయి. అట్లాంటి దిలాసా జీవితం గడపాలంటే కంటికి నిండుగా నిద్దుర పోవాలి. వంటికి పట్టే తిమ్మిరి తీరడమూ అవసరమే ఒక ఈడు వచ్చి పోయేదాకా . తతిమ్మా సంగతులన్నీ ఆనక .. ముందైతే కడుపారా ఎప్పటికప్పుడు ఆహారం దొరకాలి. ఆహారం దొరకుబుచ్చుకోవాలనే కోరిక నిలబడాలి.
కోరిక ఆకలి ప్రేరకం. ఆ ఆకలి చుట్టూతానే జీవులు పడే నానాయాతనలూ! ఆకలి పెట్టే రకరకాల తికమకల కతే రావిశాస్త్రిగారు జాస్మిన్ అనే దొంగ పేరుతో సృష్టించిన ఈ 'సృష్టిలో ' ని దొంగ తిండ్ల కథా - కమామిషూ!
ఆకలి ఉంటేనే జీవం ఉన్నట్లు లెక్క౦టారు . అది వేళకు తీరడమే జీవితం సజావుగా సాగుతున్నట్లని కూడా చెబుతుంటారు . నిజమే! ఆకలి చుట్టూతానే చీమ జీవితం నుంచి సింహం బతుకు వరకు పరిభ్రమించడం .. లోకంలో నూకలు చెల్లే దాకా.ఆకలి తీరేందుకు అవసరమయ్యే ఆహారం ప్రకృతి వేరే ఎక్కడి నుంచో తెచ్చిపడేయదుగా జీవులకు! మీలో మీరే ఒకళ్లనొకళ్లు ఆరగించుకోమని చేతులు దులుపుకుని చక్కా తమాషా చూడటం దాని జబ్బు . అదిగో .. ఆ ఒకళ్ల నొకళ్ళు స్వాహా చేసుకొనేందుకు నడిచే నాటకం పేరే ' స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్' . జీవన పోరాటం - అచ్చు తెలుగులో చెప్పాలంటే " బతకడానికి కొట్టుకు చావడం "!
ఈ బతికేందుకు కొట్టుకు చచ్చేటప్పుడు జీవులు వేసుకొనే ఎత్తులు ప్రైయెత్తులు .. యుక్తులు.. కుయుక్తులు చూడాలీ ! ఏ యానిమల్ కింగ్డమ్ లాంటి ఛానెల్లో బైటి నుంచి చూడ్డానికైతే భలే గమ్మత్తుగా కూడా ఉంటాయి. అంత గమ్మత్తు మత్తు ఉంటుంది కాబట్టే అవి కథావస్తువులు అవడానికి అన్ని విధాలా అర్హత పొందినట్లు సిద్ధాంతకర్తల లెక్క !
సామాజిక స్పృహ అంటే ఈ తరహా విశేషాల పట్ల తార్కిక అవగాహన కలిగివుండటమేనంటారు. సామాజిక చైతన్యం దాని పై మెట్టు మాట. ఎదుటి జీవి దెబ్బనుంచి తప్పుకుంటూ, ఆ ఎదుటి జీవిని దెబ్బకొట్టడమనే లాఘవం పేరే జీవించే కళ అనుకుంటే .. ఆ కళ .. కళ కోసమేనని కొందరు ; కాదు.. కాదు, అది జనం కోసరంరా బాబూ ! అని ఇంకొందరు ఎడతెరిపి ఎరక్కుండా మాటా మాటా అనుకోడం పద్దాకా చూసే పితలాటకమే! ఏ పితలాటకమయినా ఈ ఆకలి నాటకం పాయింటు దగ్గరి కొచ్చేసరికి అమాంతం గప్ చిప్ .. కళకయినా, జీవికకయినా ముందు ముద్ద అవసరం కాబట్టి .
తాత్విక చింతన తరహా మంత్రతంత్రాలతో చింతలూ చింతకాయలూ రెండూ రాలగొట్టే తరహా కథలు రాసే ప్రయోగం కొత్త పద్ధతిలో కొనసాగిస్తూనే .. ఆ వంకన మధ్య మధ్యన తన వంతు మార్కు సొంత వేదాంతంతో .. కథలు కాని వాటిని కూడా కథలుగ చేసి గిలిగింతలు పెట్టడం ఓం ప్రధమంగా ఆధునిక తెలుగు కథానికకు నేర్పించిన చమత్కారి రావిశాస్త్రి .
బతకడానికి ఒకరినొకరు చంపుకునేందుకు వేసుకునే ఎత్తులు, ముఖాముఖి తటస్తపడితే తప్పక దూసుకునే కత్తులు .. గట్రా ఆయా జీవులు మనసుపడి మరీ ఏమీ చేసుకోవడం లేదనేది శాస్త్రి గారి థియరీ. భగవత్సుష్టికి అవసరం గనక వైరాగ్య౦తో మాత్రమే ఈ హింసాకాండ కొనసాగుతున్నదని శాస్త్రిగారు ఎన్నో కథల్లో చెప్పినట్లు ఇందులోనూ చెప్పుకొస్తారు. బతకడం, తమ మీద ఆధారపడ్డవాళ్లని బతికించడం కోసమే ధ్యేయంగా మొక్కుబడి యుద్ధాలు జరుగుతున్నట్లు ఆయన ఉద్దేశం!
తిండి వేటకు బయలుదేరేముందు బొరియలోంచి బైటికొచ్చిన నక్కతల్లి చేత బిక్కు బిక్కు మంటూ చూసే తన బుజ్జి మూడు పిల్లలకు లోకంలో బతకాల్సిన అగత్యం గురించి , బాధ్యత, తీరుతెన్నులను గురించి చెప్పినప్పుడు కరుణరసం ఉప్పతిల్లడానికి కారణం హింసకు బైలుదేరిన ఆ జీవిలో సంసార బాధ్యతే తప్పించి క్రౌర్యం ఏ కోశానా లేకపోవడమే! 'అయ్యో! పిచ్చి పిల్లల్లారా! బెంగ పెట్టుకోకండర్రా! అలా వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్లకపోతే ఎలా కుదురుతుందో చెప్పండి! వెళ్లి బువ్వ తెచ్చుకోవాలా? మీరు చిన్న పిల్లలు, మీకేం తెలీదు. కష్టపడకపోతే కూడు దొరకదమ్మా! నేను కష్టపడితేనే నాకు బతుకు, మీకు బతుకు. మీరూ పెద్దవాళ్లయి, కాళ్లకి పరుగొచ్చి, పళ్లకు పదునొస్తే, మీరూ లోకం మీద పడి బతికేయచ్చు కాని , అందాకా నా కోసం మీ కోసం కూడా నేను తిరక్క తప్పదు.' అంటూ తన పక్షంగా జీవించాల్సిన అవసరాన్ని ' గీత ' లా బోధిస్తుందీ కథలో తల్లినక్క . భారతంలోని బకాసురుడిని అడిగినా ఇదే పద్ధతిలో మరింకేదో గీత వినిపిస్తాడు .. సందేహం లేదు. ఆకలి అంబానీనైనా . . పనిలేని సోంబేరినైనా ఒకే విధంగా వేధిస్తుంది . మనీ లేదు, అసలు మానవ జన్మే కాదు, పాపం.. బలహీనమై శాల్తీ , బతకడం బొత్తిగా చేతరాని కుంక ' అని జాలేమీ చూపించదు గదా! ఆకలి లేకపోతే ఆరాటమే ఉండదు. ఆరాటం లేకపోతే జీవించాలనే ఇచ్ఛ పుట్టదు. బతుకు మీద ఉండే పిచ్చ తీపి వల్లనే .. ప్రమాదం అంచున ఉన్నప్పుడు శత్రువు ఎంత బలం, బలగం కలిగి భీకరంగా భీభత్సం చేస్తున్నప్పటికీ .. ఆఖరి నిశ్వాస దాకా చంపే తీరాలన్న మొండిధైర్యమే ఎంత బక్క జీవినైనా ముందుకు తోసేది . అధైర్యపడుతూ ఓ మూలన ముడుచుక్కూర్చుంటే బలహీనమైన జాతులు తరిగిపోయి బలవంతుల వర్గం సైజులో ముదిరి జీవసమతౌల్యం దెబ్బతినేస్తుంది కదా! ప్రకృతికి అంతకు మించిన ముసలం మరింకేముంది! ఎవరికోసమో కాకుండా తన ఉనికి కోసమైనా జీవులకు కడుపులు పెట్టి, వాటిలో ఆకలి చిచ్చు పెట్టి, ఎప్పటికప్పుడు దాన్ని ఆర్పుకు చావండి .. లేదంటే చావండి ! ' అంటూ ప్రకృతికి ఏదో ఓ తమాషా చేయకతప్పదు!
సృష్టిలోని జీవుల అదుపుకు ప్రకృతికి తోచిన ఇన్ - బిల్ట్ మెకానిజం ఈ ' బతకటానికి కొట్టుకు చచ్చే' ట్రిక్కు ఒక్కటే ! ఈ ఆటలోని 'చావుకు దారి తీసే ఆహారం వేట' పార్ట్ ను ప్రత్యేకంగా విడదీసి రావిశాస్త్రి గారు ఇక్కడి ' సృష్టిలో ' కథలో కిక్కిచ్చేలా చెప్పుకొచ్చారు.. ఎప్పట్లానే తన వంతు చురకలూ నడి మధ్యన వడ్డిస్తో ! కథ చివర్లో బ్రాకెట్ లో కనిపించేవి ఈ బాపతు జౌట్ ఆఫ్ బాక్స్ చురకలే అందుకు ఉదాహరణ !
"కోడి పెట్టల్ని వీరన్న ఎత్తుకుపోయేడు. వాటిలో రెండింటిని వీరన్న ఇంటి నుంచి దొంగనక్క కరుచుకుపోయింది. నూకునాయుడి పది సెంట్లనూ వీరినాయుడు తన పదెకరాలల్లో కలిపేసుకున్నాడు. అందు గురించి నూకునాయుడు దావా తీగా ప్లీడరు గుమాస్తా అతని డబ్బంతా ఎగేసేడు. ప్రతివాదైన వీరినాయుడు దగ్గర పెద్ద ప్లీడరుగారు అయిదువందలు (పది సెంట్ల భూమి ఖరీదే అంత) ఒడికేసేరు. వీరినాయుడి బంజరు భూమిని వీర్రాజుగారు ఆక్రమించేసేరు. ఆక్రమించుకున్న ఆస్తులన్నీ వారు తమ చిన్నభార్యవారి పేర్న పెట్టి ఉంచేరు. వాటి వల్ల వచ్చే రాబడంతా ఆవిడ తన తమ్ముడి ఇంటికి నడిపించేసింది . ఆ తమ్ముడు ఆ సొమ్మంతా తన ఉంపుడుకత్తెకి ఇచ్చేసేడు. ఆ ఉంపుడుకత్తె ఆ డబ్బంతా తనకు నచ్చినవాడికి ఇచ్చేసింది. ఆ నచ్చినవాడు సినిమా చిత్రం కోసం మెడ్రాస్ వెళ్తే తారలూ, డైరక్టర్లూ కొంత డబ్బు తినేసేరు; మిగతాది ఓ నాటుకోటి చెట్టియారు లాక్కున్నాడు. ఊరివారి డబ్బునీ కార్మికుల కష్టాన్నీ దోచుకున్న చెట్టియార్ గారి చేత ఈ మార్వాడి దివాలా తీయించేడు. మార్వాడీగార్ని ఓ తాబీతరావారు తమ ధృతరాష్ట్రపు కౌగిట్లో కలుపుకున్నారు. తాబీతర్లావారిని ఓ ఇంగ్లీషు కంపెనీ రాజ్యంవారు లాగుదామని చూస్తున్నారు. వీరందర్నీ ఓ అమెరికన్ సిండికేట్ సామ్రాజ్యంవారు చెరచడానికి వారి రెక్కలు పట్టుకొని గిజగిజలాడిస్తున్నారు. సిండికేట్ వారి కాలి కింద ఇసకని కొందరు జపనేయులు దొలుస్తున్నారు. వారి సీటు కింద వేరొకరు గోతులు తవ్వుతున్నారు. వార్ని మరొకరు, మరొకర్ని ఇంకొకరు, ఇంకొకణ్ని వేరొకడు, వేరొకణ్ని వీడు, వీణ్ని వాడు, వాణ్ని వీడు, వీణ్ని ఇది, దీన్ని వాడు, వాణ్ని మరొకడు మరొకణ్ని వేరొ...) " ఇట్లా సాగిన దోపిడీ ధారావాహికలోని మొదటి రెండు మూడు వాక్యాల తాలూకు ఎపిసోడే .. వీరినాయుడి కోడిపెట్టలు మూడింటిని వీరన్న దొంగిలించడం .. వాటిలో రెండింటిని కొట్టుకుపోయిన నక్క మూడో దానికోసం మళ్లీ రావడం.
ఈ తిండ్లు, దొంగ తిండ్ల వ్యవహారం చుట్టూతా మనిషి ( వీరన్న) పగ, జంతువు ( తల్లినక్క) జీవన పోరాటం, పక్షి ( కోడిపెట్ట) అంతరంగ మథనాలు ; జీవితం , దాని మంచి చెడ్డలు, జీవించక తప్పని దౌర్భాగ్య స్థితిగతులు, అందుకు అడ్డొచ్చే గడ్డు పరిస్థితులు , అందుక్కారణంగా ఊహించబడ్డ దేవుడి దౌష్ట్య౦ పై నిరసనలు ; ఇవే గాపు; చావు .. దాని బహుముఖ వికృత ముఖాల దిగ్భ్రాంతికర ప్రదర్శనల సమాహారం ఈ 'సృష్టిలో' కథా సృష్టి . నిస్సందేహంగా రావిశాస్త్రిగారి అనేకానేక ఇతర రచనల తరహాలోనే ఉత్తమ జాతికి చెందే కథానిక!
బలమైన జీవి, తెలివైన జీవి అయితే ఇబ్బంది ఉండదు .. ఆహార లభ్యతలో సౌలభ్యత ఎలాగూ తప్పదు. ఆ రెండింటి కొరవతో జన్మ తగలప్పుడే బతకాలంటే జీవికి చచ్చే చావు. అట్లాంటి దౌర్భాగ్య జీవుల పక్షం నుంచి కూడా సాపేక్షికంగా ఆలోచిస్తే పంచతంత్రం మించి ' పంచ్' లు ఉండే కథలు చెప్పొచ్చన్న గొప్ప ధీమా మొదటగా తెలుగులో కల్పించింది రావిశాస్త్రేగారే.
అధర్మాన్ని పడగొట్టి, ధర్మాన్ని నిలబెట్టే రచనలు ఎప్పుడూ వచ్చేవే. రావాలి కూడా! రామాయణం చదివే నాస్తికుడికైనా రావణుడే చావాలని ఉంటుంది. వాల్మీకిరుషి ఏకపక్షంగా రాముడి వైపుండటమే అందుక్కారణం. కానీ, ఎంత నికృష్ట పాత్రకైనా పుట్టుకతోనే నీచత్వం అంటగట్టడం రచయిత పక్షపాత బుద్ధికి నిదర్శనమవుతుంది. వెలుగు నుంచి చీకటి దిశగా ప్రస్థానించే ప్రయత్నం అనేకానేక కారణాల వల్ల సఫలమయి ఉండకపోవచ్చు; అసలు ఆరంభమే అయివుండకపోవచ్చు కూడా . అయినా సరే ..ఆ దిశగా అసలు ఏ ప్రయాసా కలుషాత్ముడి వైపు నుంచి సాగనే లేదనిపించే రాతలను నమ్మలేం. కాపురుషుడి ప్రవృత్తిలోని సానుకూల గుణo కోణం రచనకు అదనపు ఉదాత్తత ఓ అలంకరణం.
ఓ సానుభూతి వచనం రచయిత వేసినప్పుడే గదా పాఠకుడి దృష్టి దుష్టత్వం నుంచైనా ఎంతో కొంత నీతిసారం వడుగట్టుకుని లాభపడేందుకు వీలుడేది! బళ్లారి రాఘవాచారిగారు స్టేజి నాటకాల ప్రదర్శన సందర్భంలో దుష్టపాత్రల స్వభావంలో నుంచి కూడా ఓ వెలుగు కోణం రాబట్టే ప్రయోగాలు చేస్తుండేవారంటారు. మంచే కాదు 'చెడు' తాలూకు లోతులనీ నిరపేక్షంగా తర్కించవలసిన బాధ్యత మంచి రచయిత మీద తప్పకుండా ఉంటుంది. రావిశాస్త్రిగారి కథల్లో.. దుర్మార్గంగా ప్రవర్తించే పాత్రల్లో కూడా సందర్భం వచ్చినప్పుడల్లా రగిలే అంతర్జ్వాల ఒకటి దర్శనమివ్వడం సాధారణ ధర్మంగా కనిపిస్తుంది. అందుకు ఈ కథలోని వీరన్న పాత్ర వ్యవహారమే ఒక ఉదాహరణ. ఎంతో సాహసించి, ఎంతో శ్రమపడి మూడు రోజుల కిందట మూడు కోడిపెట్టల్ని దొంగిలించాడు ఈ 'వీరన్న' . టౌనుకు పోయి అమ్మి సొమ్ము చేసుకుందామనుకునే లోపలే ఇంకేదో పోలీసుకేసు లంపటంలో ఇరకడం వల్ల కుదిరింది కాదు . మూడోనాడు ఇంటికొచ్చి రెండుపెట్టలని నక్క ఎత్తుకు పోయిందని చెప్పిన పెళ్లాం వరాలమ్మమాటలను నమ్మక రెండు దంచాడు ముందు . ఆనక పిల్లలు చెప్పిన మీదట నమ్మి మూడో పెట్ట కోసం వచ్చే నక్కకు 'దేవుణ్ణి చూపిస్తాన'ని శపథం పట్టి పులికోపంతో రగులుతూ పొంచి ఉన్నాడు. ఆ సమయంలోనే వీరన్నలో అంతర్మథన ఆరంభమయింది. కష్టపడి సాధించిన కోడిపెట్ట పోయినందుకు వీరన్నకు నక్క మీద కోపంఉండనే ఉంది. రెండో పెట్టనూ అదే నక్క పొట్టన పెట్టుకున్నందుకు ఆ కోపం రెండితలయిందంటాడు రచయిత. ఆ అనడంతో ఆగిపోతే ఆయన రావిశాస్త్రి కారు . 'తన చేత వరాలమ్మను పొరపాటున కొట్టించినందుకు ఆ నక్క మీద అతనికి మూడొంతుల కోపం వచ్చింది' అని కూడా అనేశారు; కనకనే ఆయన రావిశాస్త్రిగారు అయారు . కొట్టినా సరే.. భార్య మీద ఆ భర్తకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రకటన తెలియచేస్తుంది. అదే సందర్భంలో మానవీయ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మరో ఇట్లాంటి ఉదంతాన్ని ఉదహరించడం రావిశాస్త్రిగారిలోని ఉత్తమ కథకుణ్ణి పటం కట్టి చూపిస్తుంది . సొట్టబుర్రోడు అనే ఓ కేడీ చేసిన నేరానికి గున్నమ్మ కొడుకుని కొట్లో వేసిన ఎస్సై అది పొరపాటు అని తెలిసొచ్చిన తరువాత ఊరకే ఉండలేక పోయాడు. ఆ సొట్టబుర్రోణ్ణి వెదికి పట్టుకొచ్చి మరీ మూడు రోజులు కొట్లోపెట్టి కుళ్లపొడిచాడు. కర్కోటకుడుగా కనిపించినా సరే .. ఎస్పై లోని మనిషి అపరాధభావన నుంచి తప్పించుకోలేకపోయాడని చెప్పకనే చెప్పే ఈ తరహా మానవీయ దృకృథమే ఎంత హింసాత్మక కథనానికైనా ఉదాత్తత చేకూర్చేది. గుర్తుంచుకోదగ్గ కథలకు ఉండే ఎన్నో సు సులక్షణాలు ఇట్లాగే 'సృష్టిలో ' కథలో కోకొల్లలు; స్థలా భావం వల్ల అన్నింటినీ గూర్చి చర్చించుకునే వీలు ఉండటంలేదు .. అంతే!
ఆకలితో నకనకలాడే నక్క లాంటి ఓ బక్కజీవి బుర్రలోని ఆలోచనా పరంపరను సృష్టిక్రమం వైపుకు బదులు కంటిక్కనిపించని కరుణామయుడి వైపుకు మళ్లించి కేదారగౌళ రాగంలో తిట్టాలన్నంత కోపం తెప్పిస్తాడు రచయిత ఒక సందర్భంలో . సుఖాలు, సౌకర్యాలు వరాలుగా ప్రసాదించమని దృష్టిగోచరం కాని ఏ శక్తిముందు సాగిలపడతామో .. కష్టాల మీద కష్టాలు వచ్చి పడిపోతున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక భగవంతుడిగా భావించే అదే అదృశ్య శక్తికి బాధ్యతా అంటగట్టి పడతిట్టడం పరమ భాగవతోత్తమ జాతికి చెందిన కంచెర్ల గోపన్నలో కూడా చూస్తాం! అందుకే, ఒక మామూలు బక్క నక్క ఉక్రోషం .. నక్కగా తనను పుట్టించాడని నమ్మే సృష్టికర్త మీదకు మళ్లినట్లు చూపించడం అభూత కల్పన అనిపించదు. సరికదా అధివాస్తవికత అని కూడా అనిపించదు; అంతా వాస్తవిక జీవితంలోని విషాదపార్శ్వాన్ని తడుముతున్న ట్లే గుండెను కెలుకుతుంది.
ఇంకొన్ని గంటల్లో మరో జీవికి అన్నం కాబోయే ఓ కోడిపెట్ట తన గూడుకింద చేరి చేసుకొనే అంతశ్శోధనలో కనిపించేది కూడా తిట్లకు గురయే ఆ అదృశ్య భగవానుడే! నడిరాత్రి వేళ. . భయం ఆవరించిన బ్రతుకుతో ఆ కోడిపెట్ట. . ఇష్టంలేని స్థలం మార్పు వల్ల కలిగిన బెంగ కారణంగా కళ్లు మూతలు పడక ఎంతకూ అర్ధంకాని లోకం తంతును, కోడిగా బతకడంలోని సార్థకతను గురించి వేదాంత ధోరణిలో ఆలోచించడం మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. క్విన్ టన్టెరన్ టోన్ అనే హాలివుడ్ దర్శకుడు రక్తాలు కారే యుద్ధ సన్నివేశాలకు నేపథ్య౦లో మతిపొగొట్టే సుతిమెత్తని వయోలిన్ రాగాలు వినిపించే శైలి రావిశాస్త్రి గారిది. తాను చేసే నిత్యహింస త్యాగం గురించి, తాననుక్షణం అనుభవించే హింసాభయం నుంచి విముక్తి గురించి బోధివృక్షం కింది సిద్ధార్థునికి దీటుగా ఓ తుచ్ఛ కోడిపెట్ట చేసే తాత్విక చింతనల్లాంటి చిత్రాలు రావిశాస్త్రిగారి కథల్లో అడుగడుగునా తగులుతుంటాయి! కథలు కాని వ్యవహారాలను కూడా ఇట్లా కథలుగా .. అదీ మంచి కథలుగా ఎటా మలచవచ్చో రావిశాస్త్రిగారి కథలు గురువుల్లా బోధించడం విశేషం. బుద్ధిలో విశిష్టుడైన పాఠకుణ్ణి కూడా ఒక మామూలు కోడిపెట్ట తాత్వికచింతనలోకి నెట్టేసే గొప్ప టెక్నిక్ శాస్త్రి గారిది. చదివించి, కదిలించి, ఆనక పాఠకుడిలో ఆలోచనలు రగిలించడం ఉత్తమ శ్రేణి కథల లక్షణాలలో ఒకటన్న పాశ్చాత్య లక్షణకారుల సిద్ధాంతం ఆమోదనీయమే అయితే శాస్త్రిగారి అన్ని కథల్లా ఈ కథ కూడా నిస్సందేహంగా ఉత్తమ శ్రేణి కిందకే రావాలి మరి.
అన్నిటికి మించి ఈ కథలో రచయిత గడుసుగా దాచిన మరో విశేషం. . మరణం తాలూకు బహుముఖాల ముసుగులు తొలగించే ప్రయాస. గంప కింద ముడుచుక్కూర్చుని తాత్విక చింతనలో పడ్డ కోడిపెట్టలాగానే చల్లని చావు పిలుపు చప్పుడును మనమూ ఆలకించి అదిరిపడతాం. అదే పెట్ట బతుకు చివరి మలుపుగా కూడా భావించేస్తాం . పీక నులుముడు బాధను ఎదుర్కొనేందుకు సిద్ధమై రెక్కల్లో నుంచి మెడను పాములా పైకి లేపి భగవంతుడి మీది పగతో ఎర్ర బడ్డ కళ్లను ఇటూ అటూ తిప్పి చూసినప్పుడు కోడిపెట్ట చావును అలకించేందుకు మన మనసూ ఆవేదనతో సిద్ధంగా ఉంటుందా ! ఊహించినకోడి పెట్ట చావుకు బదులుగా ఊహించని నక్క చావును మెరుపులా మన మనసు మీది కొట్టి మతి పోగొట్టేస్తాడు గడుసు రచయిత !
కోళ్లగూటిని మూతితో, కాళ్లతో పై కెత్తి పెట్టను కరచుకుపోయే చివరి ప్రాక్షన్ ఆఫ్ సెకనులో ఆ నక్క మీద పచ్చని బాణాకర్ర కత్తిలా మెరవడం, వరస మెరుపులతో నక్కచావు రూపంలో మృత్యువు మరో కోణంలో మన కళ్లకు భీభత్సంగా కొట్టేస్తుంది! ఎంతటి కఠినాత్ముడి గుండెనైనా బరువెక్కించే ఆ బాధాకర క్షణాలలో ఒక క్షణమైనా చదువరని నిలువనీయడు రచయిత.. విచిత్రంగా! అసందర్భంగా అందాల చందమామ, డాబా మీది వెన్నెలలో ప్రియురాలి సిల్కు చీర రెపరెపల చల్లగాలి, మొనలు దేలిన జోడు గుండెలతో మతిపోగొట్టే అవేవో వాటితో పోలికలు, జీబుగా పెరిగిన తుమ్మ మొక్కలను నీలి ముసుగుల మేల్వంశపు అభిసారికలతో ఉపమానాలు! పడుచు భార్యలు సరసాలకు పోతే మణుకులు పడిపోయినమొగుళ్లులా చీకట్లో బండరాళ్లు పడి ఉంటాయనడానికి నక్క అంత నిర్దాక్షిణ్యమైన చావు చచ్చిన దుర్ముహూర్తమే దొరికిందా రచయిత మహాశయుడికి ! ? తన కథ చదివే పాఠకుడి పట్ల ఇంతలా వేళాకోళమవసరమా? అని రచయితను తిట్టిపోయాలనిపించాలి నిజానికి!తమాషాగా అట్లా తిట్టుకునే వ్యవధానం కూడా ఇవ్వకుండా అంతకు మించిన మరో విషాద ఘట్టం అందుకునేస్తాడా మహానుభావుడు! నక్కపిల్లల కథ ముక్తాయింపుగా ఎత్తుకుంటాడు మహా గడుసుగా!
కనిపించని తల్లి కోసం బెంగటిల్లి తడిగా, భయంగా, ఆకలిగా ఉన్న బుజ్జిపిల్లలకు వెన్నెల తడిలోని రుచి, చల్లని గాలిలోని హాయి ఆకలి తీర్చడం లేదని చెప్పి జాలి కలిగిస్తాడు.అనాథపసికందుల మీద . తీరని ఆకలితో ఎంతకూ కనిపించని తల్లి జాడ కోసంగాను కష్టమొస్తే ముందు దేవుడిని ప్రార్ధించాలన్న కనీసం ఇంగితం కూడా బలపడని కారణంగా తల్లి కోసం మాత్రమే యేడిచి యేడిచి అలిసిపోతాయా పసికూనలు అని అనడంతో మన మనసంతా చేదయిపోతుంది ! ఎంత ఏడ్చినా కడుపు నిండదు కాబట్టి మూడు కూనల్లో ఒకటి మొండి ధైర్యం చేసి బొరియలో నుంచి కొంచెం పైకి ఎగబాకి, ముందు కాళ్లను బొరియ అంచున పెట్టి, ఆకలి తీర్చే ఏకైక జీవి తల్లి కోసరంగా కనిపించినంత మేరా భూలోకమంతా పరికించి చూసి. . చూసి .. అలా చూస్తూనే ఉండిపోయిందంటాడు రచయిత . ఏ అకలి తన చేత అపాయకరమైన ఆ దుస్సాహసం చేయించిందో అదే ఆకలి మరో జీవి .. కొండచిలువ నోట్లో నుంచి కడుపులోకి మెల్లగా లాగేసుకుందని చల్లగా రచయిత ముక్తాయించడం ఎంత విషాదం?! . ఎందుకు పుట్టినట్లోనంటూ మనసులో అంతర్మధనం ఇంకా మొదలు పెట్టక ముందే మిగతా నక్కపిల్లలు కూడా అదే దారిలో కొండచిలువ నోరు అనే మృత్యు గహ్వరం ద్వారా సృష్టిలో లయించుకు పోయినట్లు రచయిత ముక్తాయింపు! రక్తం కక్కి స్పృహ తప్పిన నక్క కొనవూపిరి కొనసాగింపు స్మృతిలోకంలో ఊపిరి ఆగి కదలిక నిలబడే తుది శ్వాస వరకూ మనోనేత్రం అవనికపై కదలాడిన చిత్రాలను రచయిత కవిగా మారిపోయి చిత్రించిన విధానం శాస్త్రిగారి కథలలో కామన్ గా కథను హృదయంగమంగ మార్చేస్తూ కథాశాస్త లక్షణాలకు ఎక్కడా అందదు! ఎండల్లో నల్లకొండనీడ , వెన్నెల్లో పైరు పచ్చగాలి, పొలాల్లో చెరకు తీపితోట , అంతకంటె ముందు అంత కంటె తల్లిపాలతీపి, మొత్తని తల్లి మూతి ముద్దు, ఆనాటి అమ్మ వెనక పరుగు, ఓనాడు మొదటి సారిగా రుచి చూసిన మొదటి కోడి ఉప్పటినెత్తురు, తియ్యటి మాంసం, మేకల్ని వేటాడిన రోజులు, తన తొలి ప్రియుడి వాడి కోరచూపులు, ప్రేమతో వాని మొత్తటి కరుపులు, కసితో అతడి వేడి కౌగలింతలు ( నక్కలు కౌగలించుకుంటాయా ? అన్న అనుమానం కూడా రానీయడీ కవి కాని కవిరచయిత ! ), తన కడుపులో మొత్తటి శిశువుల బరువులు, తన ప్రసవం, తన వేదన , తన పిల్లల అరుపులు వినిపించగానే తన చెవుల్లో పులకరించిన స్వర్గమే తన గుండెలలో నుంచి పాల ధారగా ప్రవహించిన వైనం, పిల్లలతో తన ఆటలు, వాటి కోసం తాను పడ్డ యాతనలు, దుర్మార్గులతో తన పోట్లాటలు ( నక్క దుర్మార్గమైనదని మన నిర్ధారణ అయితే- ( టక్కరిగా భావించే నక్క జాతికీ దుర్మార్గులు కొందరు తప్పలేదన్న మాట! ఎవరో ? బహుశా మన మనుషులమే అయివుండనోపు! లేకపోతే మొదటిసారి మనిషిని చూసినప్పుడు రచయిత చెప్పినట్లు దానికి ' జుగుప్స ' ఎందుకు కలుగడం ? ! తమ జాతి వారే అయినప్పటికీ మనుషులకు లొంగిపోయిన కుక్కలలో తన కాట్లాటలు, పూల వాసనలు, పాముల పడగలు , వానా జల్లులు , పందుల వికృతాలు, చల్లని గాలులు, నల్లని మబ్బుల రంగుల విల్లులు , వెండిమబ్బుల వెలుగులు, ఆకలితో తన పరుగులు ( మళ్లీ ఆకలి ! ), అలసటతో తన పడకలు, ( ఈతి బాధలు వదలడం లేదు! ), అనుక్షణం ఆనందాలు, అనునిత్యం భయాలు, ఆకలి కోసం తను చేసిన హింసాకృత్యాలు , ఎల్లప్పుడూ రక్తపాతాలు, ఓహో .. అరె.. ఏమిటిది? ఎందుకిది? ఎక్కడిది ? నన్నెందుకు పుట్టించావు? ఎందుకిలా చంపుతున్నావు? ఎన్నెన్ని ఆశలు కల్పించావు? ఎన్నెన్ని పాపాలు చేయించావు? ఎన్నెన్ని హింసలు పెట్టావు? పెట్టించావు? ఎన్ని హింసలు ఎన్ని హింసలు! నాకెందుకీ పుట్టుక? ఎందుకీ చావు ? ఏమవుతారు దిక్కుమాలిన నా పిల్లలు? ఏ హింసలు.. ఏ హింసలు.. చావు పుట్టుకల అర్థరాహిత్యాన్ని గూర్బి లక్షసార్లు నిలదీస్తే ఆ బాధ్యుడెవడో సమాధానం చెప్పకోలేక గుడ్లుతేలవేయడంలాంటి ఆలోచన లేమన్నా ఊహకొచ్చాయో ఏమో..బాధతో చచ్చి పోతూ కూడా నవ్వబోయి నవ్వు సగంలో ఉన్నప్పుడు చివరి శ్వాస కూడా పూర్తిగా పోయిందేమో .. మిగిలిన అరనవ్వు అట్లాగే చచ్చిపోయిన నక్క పెదాల మీద ముద్రలాపడి మహా ముచ్చటగా వుంది నక్క ముఖం. తనయుల పాపాలకు తండ్రులు అనుభావించాలన్న సూత్రమే నిజమైతే .. తాను చేసిన పాపాలన్నింటికీ ఆ దేవుడే శిక్షలు అనుభవించాలన్న ఆలోచనా వచ్చి చచ్చిపోయ నక్క మొకంలో ఆ చిరునవ్వు మెరిసి ఉండాలి. నక్కలో అర్థాంతరంగా ఆగిపోయిన అంతర్మధనం చదివే పాఠకుడిలో మొదలవడానికి రచయిత కవిత్వ౦ బాట పట్టి యమ జిమ్మిక్కులన్నీ చేయడం చూడొచ్చు మనమిక్కడ.
దిక్కులేని చావు చచ్చి జాతి పుట్టించిన నక్క .. అవతల దాని పిల్లలూ కంతిరి లోకం ముఖమింకా కన్రెప్పలెత్తి చూడనైనా చూడక మునుపే మెత్తంగా చావు కంతలోకెళ్లి కనుమరుగవడం చేత - మరింత జాలి పుట్టించే నక్క చావు వీరన్న పెళ్లాం బిడ్డల మొహాల్లో మాత్రం సూర్యకాంతిలో మామిడి మొక్కలంత ప్రకాశం కలిగించాయ్! వీరన్న కైతే నక్కబారిన కాకుండా కోడి తన బారిన పడ్డందుకు చచ్చే ఆనందంగా ఉంది. ఆనందంతో అతగాడా ఎర్రరంగు పులిమిన తెల్లకోడిని గుండెలకు అదుముకున్నప్పుడు ఆ చావు స్పర్మకు కోడి భగభగ ఎండలో వడవడ వణికింది ! కోడి ఓనరు వీరినాయుడును వెంట బెట్టుకొనొబ్బిన పోలీసోడుతో కలిసి తన్నెత్తుకొచ్చిన దొంగ వీరన్న పోతున్నప్పుడు రాత్రల్లా నిద్ర లేని కోడిపెట్ట ' కొత్త పరిణామం అర్ధంకాక, భగవంతుడి సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నమే పాపం' అని తీర్మానానికొబ్బి కళ్లుమూతలేసుకుని పడుకునేసింది.
ముక్తాయింపుగా శాస్త్రి గారు, రేపు ఎక్కడో ఒకప్పుడు ఎవరింట్లోనో ఒకరింట్లో చచ్చి చెడి పలావు అయిపోతుందని తేల్చేస్తాడు రచయిత.
- కర్లపాలెం హనుమంతరావు
20-08-2021
బోథెల్, యూ. ఎస్. ఎ
భావోద్వేగాలా? భాషాభివృద్ధా? -కర్లపాలెం హనుమంతరావు
భావోద్వేగాలా? భాషాభివృద్ధా?
-కర్లపాలెం హనుమంతరావు
ముందు ముందు రాబోయే సాంకేతిక అవసరాలకు అనుగుణంగా భాషను ఎప్పటికప్పుడు సరళతరం చేసుకుని సిద్ధంగా ఉండటం తక్షణమే ప్రారంభమవాల్సిన భాషా సంస్కరణ వాస్తవానికి! అవును! మన తెలుగుకు ప్రపంచభాషలలో లేని ప్రత్యేకతలు చాలా ఉన్న మాటా నిజమే! సంగీత స్వరాలలోని అన్ని సంగతులను అక్షరబద్ధం చేయగల సుస్పష్ట అజంత (అచ్చు వర్ణంతో ముగించే) సౌలభ్యం ఇటాలియన్ భాషకులా మళ్లీ మన తెలుగుకు సొంతం అంటారు. తెలుగులో ఉన్న త్యాగరాజ సంకీర్తనలను తమిళ భాషలోకి తర్జుమా చేసుకొని ప్రచారం చేసుకొనే తమిళుల ప్రయత్నం విఫలమవడానికి కారణమూ తెలుగు వర్ణానికి ఉన్న సంగీజ్ఞత తమిళ భాషకు లేకపోవడమే! అయినా సరే.. ఈ వేగయుగంలో సాటి భాషలతో పోటీకి దిగి ముందంజగా సాగాలంటే ఆలంకారికంగా ఉన్నా, అందం మరంత పెంచే అపురూప ఆభరణాల వంటి వర్ణమాలలోని కొన్ని ప్రత్యామ్నాయం ఉన్న అక్షరాలను పరిత్యజించక తప్పదు. మనసు బరువెక్కినా బరువైన అక్షరాలు కొన్నిటిని వదిలించుకొనక తప్పదు! చిన్నతనంలో మనం ఎంతో శ్రద్ధతో శ్రమించి మరీ నేర్చుకొన్న 56/53 వర్ణమాల సెట్ మీద గల మమకారం అంత తొందరగా చావదు. అయినా భాషాభివృద్ధికి పరిత్యాగం వినా మరో మార్గం లేదు. మనం ఇప్పటికే అవసరమైన చోట కొన్నిటిని వదులుకున్నాం! బండి ర ('ఱ') కు బదులు తేలిక ర, 'ఋషి' పదంలోని 'ఋ' అక్షరానికి ప్రత్యమ్నాయంగా 'రు' తరహావి. అనునాసికాలయితే దాదపుగా అన్నీ ఇప్పటి తరం వాళ్లు గుర్తుపట్టే స్థితిలో లేరు.
వర్ణమాల సౌందర్యాన్ని చెరబట్టడానికి నేనూ విముఖుణ్ణే! కానీ మనోవేగంతో పోటీకి దిగి ముందుకు ఉరకలెత్తే సాంకేతిక రంగ అభివృద్ధిని దేశీయపరంగ అందుకోనేందుకు జానపదుల నోటికి కూడా పట్టేందుకు వీలుగా పదజాలం సరళీకృతం కావాల్సివుంది. భాషాసంస్కరణలకు ప్రధాన అవరోధంగా ఉంటున్నదీ పామరజనానికి ఆమడ దూరంలో మసులుతున్న పాండిత్య పలుకుబడులే! పట్టణాలకే కాదు.. పల్లెపట్టులకూ రసపట్టుల్లా మారే పలుకుబడులు పెరిగే కొద్ది భాష వాడకం విస్తృతమవుతుంది.
గతంలో ఓల్డ్ ఇంగ్లీష్ స్థానే న్యూ ఇంగ్లీష్ వచ్చి ప్రపంచ భాషల్లోని అవసరమైన పదజాలాన్ని ఏ భేషజమేమీ లేకుండా సొంతం చేసుకునే సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఆనాటి నుంచే ఆంగ్లం విశ్వభాషగా రూపాంతరం చెందుతూ అన్ని సంస్కృతులను ప్రభావితం చేసేయడం! ఆ దిశలోమన తెలుగునూ సంస్కరించుకోకుండా భాష చచ్చిపోతున్నదో అని ఎంత భావోద్వేగాలు ప్రదర్శించీ ప్రయోజనం ఏముంది!
భావోద్వేగాలా.. భాషాభివృద్ధా? ఏది ప్రధానం అని ఆలోచించుకోవాల్సిన సంధి దశలో మనం ఇప్పుడు ఉన్నది.
-కర్లపాలెం హనుమంతరావు
24 -06 -2021
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...