Showing posts with label Humanity. Show all posts
Showing posts with label Humanity. Show all posts

Saturday, February 6, 2021

కథానికః దానకర్ణుడు రచనః కర్లపాలెం హనుమంతరావు

 




స్థానికబాబు!

పేరు ఎంత చిత్రమో మనిషి అంతకన్నా విచిత్రం. ముఫ్ఫై ఏళ్ళకిందట తగిలిందీ క్యారెక్టరు నాకు.. నెల్లూరుజిల్లా ఓ మూరమూల పల్లె చెరువుపల్లెలో బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం చేసే రోజుల్లో!

పొగాకు పండిస్తుంటారా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో.  పొగాకు బోర్డు, మా బ్యాంకు, పోలీస్ స్టేషను, ఓ ఉపతపాలా కార్యాలయం, చిన్నసైజు ప్రాథమిక పాఠశాల.. ఇవీ ఆ ఊళ్లోని  ప్రభుత్వ సంబంధ సంస్థలు. పోలీస్ స్టేషనులో కానిస్టేబులుగా పనిచేయడానికి వచ్చినవాడు స్థానిక బాబు తండ్రి.

బదిలీలు ఎక్కడికి వచ్చినా అతని కుటుంబం మాత్రం చెరువుపల్లెలోనే! మంచినీళ్ళుకూడా సరిగ్గా దొరకని ఆ మారుమూల పల్లెమీద ఆ పోలీసాయనకు ఎందుకంత ప్రేమంటే.. బూబమ్మ అని సమాధానం  చెప్పాల్సుంటుంది.

బూబమ్మ మొగుడు దుబాయ్ లో పనికని వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు. వంటరి ఆడది. వయసులో ఉన్నది. ఎట్లా కుదిరిందో జత! పబ్లిగ్గా పగటిపూటే బూబమ్మ ఇంటికి వచ్చిపోతుండేవాడు పోలీసాయన. ఎన్ని ఫిర్యాదులు వెళితేనేమి.. బూబమ్మని మాత్రం వదిలింది లేదా పోలీసు బాబు. కట్టుకున్నదానిమీద మూడో రోజుకే మొహం మొత్తే  పురుషపుంగవులు దండిగా ఉన్న రోజుల్లో.. ఉంచుకున్న మనిషి మీద అంత ప్రేమ పెంచుకోవడం అంటే.. స్థానికబాబు ‘బాబు’ది విచిత్రమైన క్యారక్టరనేగా అర్థం! ఆ అబ్బ లక్షణాలే పుణికిపుచ్చుకున్నాడంటారు బిడ్డ కూడాను.

పోలీసాయనకు, బూబమ్మకు పుట్టిన బిడ్డ స్థానిక బాబన్నది బహిరంగ రహస్యమే! బూబమ్మ మొగుడు పనిమాలా దుబాయినుంచొచ్చి బూబమ్మను చంపడానికి కారణం ఈ స్థానిక బాబేనని ఊళ్ళో అనుమానం. తల్లి పోయినా బిడ్డ  పోలీసాయన పంచ పట్టుకుని వదలకపోవడంతో ఆ అనుమానం వట్టిది కాదని  తేలిపోయింది.  

పోలీసాయన బతికున్నంత కాలం స్థానిక బాబు దర్జా చూడాలి.  పాముకాటు తగిలి ఆయనగారు పోయిన తరువాత అతని కుటుంబమూ ఊరొదిలి వెళ్ళిపోయింది. స్థానిక బాబుని ఊరుకు వదిలిపోయింది. అప్పటికా యతిమతం బిడ్డకి పదిహేనేళ్ళు.  

ఏ తల్లయినా  జాలి దలచి ఇంత పెడితే తినడం.. బట్టలిస్తే కట్టుకోడం.. పోలీసాయన పోయిన పాడుబడ్డ క్వార్టర్సులో కాళ్ళు ముడుచుకు పడుకోడం.. ఇదీ స్థానిక బాబు దినచర్య. 

అమ్మా, అయ్యా లేని అనాథ పిల్లలందరి కథలాగే ఉంది కదా స్థానిక బాబు కథా! ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? అక్కడికే వస్తున్నది.

స్థానిక బాబు చేతిలో ఎవరైనా పాపమని ఓ రూపాయేస్తే.. అందులో ఓ పావలాకి బిళ్ళలు కొని బడికెళ్లే పిల్లలందరికీ పంచిపెడతాడు! పొగాకు చేలో  పని దొరికి నాలుగు రూకలు కంటబడటం పాపం.. అందులో సగం పాపల గాజులు, పూసలు, బొట్టు బిళ్ళల్లాంటి  అలంకరణలకు అర్పణం! నీళ్లబావి దగ్గరో.. చేలగట్ల మీదో  నిలబడి వచ్చే పోయే ఆడంగుల వెంటబడి మరీ పందేరాలు చేస్తాడు. ‘వద్దం’టే ఏడుస్తాడు. ఐనా మొండికేస్తే,  అమ్మలక్కల పేరుతో బూతులకి దిగుతాడు. కొట్టడానికి వస్తే తన్నులు తినటానికైనా సిద్దమేకానీ.. ఇచ్చిన సామాను ఎదుటివాళ్ళు తీసుకున్నదాకా పీకిపాకాన పెట్టడం మాత్రం ఖాయం.

అక్కడికీ ఎవరో పోలీసు స్టేషనులో కంప్లయింటుకూడా ఇచ్చారు. ఐనా ఏమని లోపలేయాలి  పోలీసులు? దొంగతనాలా? చేయడు. ఆడవాళ్ళని అల్లరి పెట్టడాలా? వేలేసి ముట్టను కూడా ముట్టడు సరికదా.. ఏడిపించేటప్పుడు కూడా ‘అక్కా! అక్కా!’ అని ఏడుస్తాడు! పోనీ.. ఎవరిమీదైనా  కాలుదువ్వే గుణమున్నదా? కోపమొచ్చినప్పుడు తన మీద తప్ప తన ప్రతాపం ఎదుటి మనిషిమీదెప్పుడూ చూపించి ఎరగడు!  కొట్లాటలంటే తగని భయం. శాంతిభద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాడని కేసు బుక్ చేసి కొట్లో వేయాలి?! అక్కడికీ ఊరి జనాలని సంతృప్తి పరచాలని ఏదో స్యూసెన్సు కేసుకింద.. వూరికే బెదిరించడానికని..  రెండు రోజులు లాకప్పులో వేసేసారు స్టేషనాఫీసరు. చెరలో ఉన్నప్పుడు హోటల్నుంచి భోజనం తెప్పించి పెడితే.. అందులోని పప్పు, కూర.. ఎస్సైగారిని తినమని ఒకటే పోరు. ఆయన తిన్నట్లు నటించిం దాకా ఏడుపులు.. పెడబొబ్బలు! రెండు తగిలించినా వెనక్కి తగ్గలేదా మొండిఘటం! ఒకసారా..  రెండుసార్లా? భోజనం, చాయ్ వచ్చినప్పుడల్లా అదే రచ్చయితే పాపం ఎస్సైగారు మాత్రం  తట్టుకొనేదెట్లా?  తలనొప్పి పడలేక  విడుదల చేసేసారు చివరికి. అప్పట్నుంచీ ఎవరైనా స్థానిక బాబుమీద కంప్లయింటు ఇవ్వడానిగ్గాని వస్తే.. ఏదో సర్ది చెప్పి పంపించడమే! వేరే యాక్షన్లు.. సెక్షన్లు  లేవు పోలీసుల వైపునుంచి.

 

చెరుకుపల్లి బాంబే హైవేమీదుంటుంది. నెల్లూరునుంచి వెళ్ళే వాహనాలన్నీ ఆ ఊరుమీదనుంచే  వెళ్ళాలి. రోడ్లు ఎప్పుడూ రద్దీనే. బస్సులు స్టాండులో ఆగినప్పుడు కొబ్బరిపుల్లల చీపురుతో బస్సు కదిలిందాకా శుభ్రం చేసేవాడు స్థానిక బాబు. ప్రయాణీకులు జాలిపడి ఇచ్చిన డబ్బుల్తో జీళ్ళు, పళ్ళులాంటివి కొనేవాడు. తరువాత వచ్చిన బస్సులో ఎక్కి కనబడ్డవాళ్లకిచ్చి తినమని బలవంతం చేసేవాడు. ముక్కూమొగం తెలీని మనిషి. అందునా గలీజుగా ఉండే శాల్తీ ఇచ్చేవి  ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? తింటారు?  ఎవరు తీసుకోకపోయినా బండి దిగడే స్థానిక బాబు! ఊరికే తీసుకోడం చాలదు. దాచుకుంటే కుదరదు.  తన కళ్లెదుటే నోట్లో వేసుకోవాలి! పారేస్తే   తిరిగి ఏరుకుని వచ్చి మరీ తినమని బలవంతం చేస్తుంటే ఏం చేయాలి?

స్థానిక బాబు సంగతి తెలిసిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు.. సాధ్యమైనంతవరకు అతను బండి ఎక్కకుండా చూసుకునేవారు. కన్నుగప్పి ఎక్కితే మాత్రం అతనిచ్చిన చెత్తను కళ్ళుమూసుకునైనా నోట్లో వేసుకోవాల్సిందే ప్రయాణికులు! లేకపోతే ఏమవుతుందో  ముందే హచ్చరించేవాళ్ళు బస్సు సిబ్బంది.

ఎలా వచ్చిందో .. స్థానిక బాబు విషయం  దినపత్రికల్లో వచ్చింది. జిల్లా ఎడిషన్లలో.. ఫొటోలతో సహా! విలేకర్లు చేసిన ఇంటర్వ్యూల్లో  ప్రయాణీకులనుంచి స్థానిక బాబును గురించి చాలా ఫిర్యాదులే వచ్చాయి. విషయం జిల్లా కలెక్టరుగారి దాకా వెళ్లడం.. స్థానిక బాబును నెల్లూరు  పిచ్చాసుపత్రికి తరలించడం జరిగాయి ఒకసారి.

నిజానికి స్థానిక బాబుకి ఏ పిచ్చీ లేదు.. ఆయాచిత దానాలతో జనాలని పూర్తి స్పృహలో ఉన్నప్పుడే వేపుకుతినడం తప్ప. పిచ్చిలేని వాళ్లను పిచ్చాసుపత్రివాళ్ళు  మాత్రం ఎంతకాలమని భరించగలరు?  పథ్యంగా ఇచ్చే మందుల్ని.. ఆహారాన్ని తోటి మానసిక రోగులకు బలవంతంగా తినబెట్టడం..  తినడానికి మొరాయిస్తే  తన్నడానిక్కూడా పస్తాయించకపోవడం! అక్కడికీ స్థానిక బాబు కాళ్లకి చేతులకి గొలుసులు వేసారు ఆసుపత్రివాళ్ళు. కానీ ఆహారం ఇవ్వడం తప్పనిసరికదా! తనకని ఇచ్చిన ప్లేటులో సగం  తెచ్చిన మనిషి తింటేనేగాని.. మిగతా సగం తను తినేవాడుకాదు స్థానిక బాబు. ఎన్నడూ లేని ఈ కొత్త అనుభవంతో బెంబేలెత్తి పోయింది ఆసుపత్రి సిబ్బంది మొత్తం. రోజూ ఈ బాధలు భరించేకన్నా అనధికారికంగా రోడ్డుమీద వదిలేసి.. తప్పించుకుని పారిపోయినట్లు రికార్డులో రాసుకోవడం మేలనుకున్నారు మెంటలాసుపత్రి అధికారులు. అదే చేసారు.

స్థానిక బాబు ఏరియా ఆఫ్ ఆపరేషన్ చెరువు పల్లే. ఎక్కడ  వదిలేసినా చెరువులో చేపలాగా చివరికి చెరువుపల్లిలోనే తేలడం అతనికి అలవాటు. స్థానికబాబు లేని రెండు నెలల్లో ఊళ్లో ఎన్నడూ లేనిది గుళ్ళో అగ్నిప్రమాదం జరగడం, ఊరు ఒక్క బావినీరూ ఉప్పులకు తిరగడం,  గుండ్రాయిలా  తిరిగే సర్పంచి చిలకలయ్య ఆరోగ్యం గుండాపరేషనుదాకా విషమించడంతో   యాంటీ- సెంటిమెంటొకటి బైలుదేరింది. పల్లెల్లో ఇది చాలా కామన్. స్థానిక బాబును  కదిలిస్తే ఊరుకు ఏదో మూడుతుందన్న భయం పెరిగి ఊడలు దిగింది జనం మనసుల్లో! మునుపటిలా  అతని జోలికెళ్ళడం పూర్తిగా తగ్గించేశారీ సారి జనం అందుకే.

ఊరి సెంటిమెంటుతో ఫ్లోటింగు పాప్యులేషనుకేం సంబంధం? బస్సులో నాలుగు రూకలు జమవగానే  స్థానిక బాబు జీళ్ళు, పళ్ళ ప్రహసనం మళ్లీ మొదలు! కథ ఇక్కడ ఉన్నప్పుడే నేను చెరువుపల్లికి బదిలీ మీద వెళ్ళింది. స్థానికబాబు సంగతులు అప్పటికి నాకూ పూర్తిగా తెలీవు.

ఆర్థిక సంవత్సరాంతం. బ్యాంకు పద్దుల్ని సమీక్షించే పనుల్లో ఉన్నాం. బ్యాంకు కాతాలను సరిచూడటమంటే ఒక్క రుణకాతాలను సమీక్షించడమే కాదు. డిపాజిట్ కాతాలనూ  సరిచూసుకోవాలి. గడువు ముగిసిన తరువాత కూడా మూడేళ్ళ వరకు ఎవరూ వచ్చి క్లెయిమ్ చేయని డిపాజిట్లని హెడ్డాఫీసు పద్దుకి బదిలీ చేయాలని అప్పట్లో రిజర్వు బ్యాంకు రూలు. కాతా ఒకసారి బదిలీ అయిన తరువాత హక్కుదారులు వచ్చి క్లెయిమ్ చేసినా .. వాటిని తిరిగి చెల్లించడానికి బోలెడంత తతంగం నడిపించాలి. కాతాలను పైకి పంపించే ముందు ఒకటికి రెండుసార్లు తరచి చూసుకునేది అందుకే.

ఆ పనిలో ఉన్నపుడే బైటపడిందా డిపాజిట్! చనిపోవడానికి మూడేళ్ళ ముందు పోలీసాయన చేసిన డిపాజిట్ అది. స్థానిక బాబు పేరున పాతిక వేలు. డిపాజిటరు మేజరయిన తరువాత వడ్డీతో సహా మొత్తం  నేరుగా అతనికే చెందే నిబంధనతో ఉందది. జత చేసిన స్కూలు సర్టిఫికేట్ ప్రకారం స్థానిక బాబుకి  ఏ ఎనిమిదేళ్లో ఉన్నప్పుడు చేసిన  పదేళ్ల  డిపాజిట్! మెచూరయి కూడా మూడేళ్ళు దాటిపోయి ఉంది. వడ్డీతో కలిసి గడువు తేదీనాటికే  దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ మూడేళ్లకు అదనంగా మరో పాతిక వేలు!

రికార్డుల ప్రకారం స్థానిక బాబు   మూడేళ్లకిందట మేజరే.  అయినా  ఆ సొమ్ము ఎందుకు చెల్లించలేదో?! స్థానిక బాబుకి బహుశా ఈ డిపాజిట్ సంగతి తెలిసుండదు. తెలిసుంటే తీసుకుని  ఈ పాటికి ఎప్పుడో అవగొట్టేసుండేవాడే! అప్పటి బ్యాంకు మేనేజరుగారు ఎందుకు ఈ విషయంలో చొరవ చూపించనట్లు? బ్యాంకు ప్రారంభంనుంచి స్వీపరు పనిచేస్తున్న ఆంజనేయులద్వారా అసలు విషయం బైటపడింది.

డిపాజిట్ మొత్తాన్ని అప్పగించాలని అప్పటి మేనేజరుగారు భావించినా .. సర్పంచి చిలకలయ్యగారొచ్చి  సైంధవుడిలా అడ్డుపడ్డారుట. ' ఆ పిచ్చాడి చేతిలో ఇంత మొత్తం పడితే .. ఊరు మొత్తాన్ని ఉచిత దానధర్మాలతో గడగడలాడించేస్తాడు సార్! అ గోలను తట్టుకోవడం నా వల్లకాదు. నేను చెప్పేదాకా  డిపాజిట్ విషయం అలాగే గుట్టుగా ఉంచ’మని చిలకలయ్యగారు  వత్తిడి చేసారుట. గ్రామ సర్పంచిగారి మాట తీసేసే ధైర్యం అప్పటి మేనేజరుగారు చూపించలేదు కాబట్టే   ఇప్పుడు వ్యవహారం మొత్తం నా నెత్తిమీదకొచ్చి పడింది!

అక్కడ డిపాజిటరు చేతిలో చిల్లిగవ్వలేక బస్టాండులో అడుక్కుతింటూ.. పాడుబడ్డ కొంపలో కాలక్షేపం చేస్తుంటే.. ఇక్కడ అతగాడికి న్యాయంగా దక్కాల్సిన సొమ్ము తొక్కిపెట్టడం న్యామమేనా? బ్యాంకువాళ్ళకు  ఆ హక్కు ఎక్కడుంది?!

ఆ రాత్రంతా నాకదే మధన. పాతమేనేజరుగారి దారిలోనే పోయి ఆ డిపాజిట్ ను హెడ్డాఫీసుకి బదిలీ చెయ్యడమా? మానవత్వపు  కోణంలో.. బ్యాంకు వృత్తిధర్మంగా ..  స్థానిక బాబును పిలిచి సొమ్ము స్వాధీన పరచడమా? రెండోదే ఉత్తమ మార్గమని మనసు పోరుతోంది. పోనీ..  సర్పంచిగారిని పిలిచి సలహా అడిగితేనో? మొదటిదానికే ఆయన మొగ్గు చూపుతారని తెలుస్తూనే ఉంది. ఎలాగూ తను ఆ సలహా పాటించదలుచుకోనప్పుడు పిలిచి ఎందుకు అదనంగా కొరివితో తల గోక్కోవడం!

మర్నాడు స్థానిక బాబును పిలిపించి డిపాజిట్  స్వాధీనపరుస్తూ 'వృథాగా ఎందుకు డబ్బు తగలేయడం? బ్యాంకులోనే ఉంచుకో! అవసరానికి సరిపడా తీసుకుని వాడుకో! మంచి బట్టలు వేసుకో! కడుపునిండా తిను! నిశ్చింతగా ఉండు! ఊరి జనాలను వేధిస్తే నీకు వచ్చే ఆనందం ఏముంది?' అంటూ మందలింపులతో కూడిన సలహా ఒకటి ఇచ్చాను  నా ధర్మంగా.

'హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వాడు ఎప్పట్లాగానే. 'మొత్తం  కావాల్సిందే!' అన్నాడు చివరికి మొండిగా!

ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసి లక్షా చిల్లర అతని సేవింగ్స్ బ్యాంక్ కాతాలో వేసి పాసుబుక్ ఇవ్వడం మినహా ఇంక నేనుమాత్రం చేయగలిగేదేముంది? ఆ పనే చేసాను.

అప్పటికప్పుడు యాభై వేలు డ్రా చేసుకుని  మా స్టాఫు చేతుల్లో తలా ఓ వెయ్యి పెట్టాడు. 'తీసుకోక పోతే ఏడుస్తాడు. బ్యాంకునొదిలిపెట్టడు సార్!' అని   ఆంజనేయులు గొడవ పెడుతుంటే  తీసుకోక తప్పింది కాదు. ' 'హిఁ.. హిఁ.. హిఁ' అనుకుంటూ అతగాడటు  వెళ్ళగానే ఇటు మళ్ళా అందరం అతని కాతాలోకే ఆ సొమ్ము జమ చేసేశాం!

స్థానికబాబు చేతిలో డబ్బు పడ్డట్లు ఉప్పందింది ఊళ్లో. సర్పించిగారొచ్చి చాలా నిష్ఠురంగా మాట్లాడారు. 'చేతిలో చిల్లికాణి లేనప్పుడే ఊరును అల్లల్లాడించేసాడు వెధవ. ఇప్పుడింత డబ్బంటే వాణ్ని పట్టడం మా తరమవుతుందా? వాడి ప్రాణాలను గురించైనా ఆలోచించుండాల్సింది సార్ మీరు!అనంగానే నివ్వెర పోవడం నా వంతయింది. నా కా కోణం తట్టనందుకు బాధేసింది. భయమేసింది.  పోలీస్ స్టేషనాఫీసరుగారితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఆయన దగ్గర ఈ విషయం కదిపితే నవ్వుతూ కొట్టిపారేసారు 'రాజుకన్నా మొండివాడు బలవంతుడంటారు. వాడంతట వాడు లొంగితే తప్ప మా తుపాకులు కూడా వాడినేం చెయ్యలేవులే సార్!' అని భరోసా ఇచ్చిన మీదట మనసు కాస్త కుదుట పడింది.

అంత డబ్బు చేతిలో పడ్డా స్థానిక బాబు వింత ప్రవర్తనలో  ఏ మార్పూ లేదు. చిరుగుల చొక్కా జేబులోనే డబ్బుకట్టలు కుక్కుకుని తిరగడం! ఇదివరకు స్కూలు పిల్లలకు ఇచ్చే పైసా బిళ్ళలకు బదులు పుల్లల ఐస్  క్రీములు కొనిస్తున్నాడిప్పుడు.  ఆడవాళ్ళను కూడా  వట్టి బొట్టుబిళ్ళలు, హెయిర్ బేండ్లతో సరిపెట్టకుండా రవిక గుడ్డలు, పౌడరు డబ్బీలతో  వెంటబడి తరుముతున్నాడు. కాకా హోటల్లో భోజనం చేసేటప్పుడు పక్క విస్తరిలో అనుపాకాలు వేసి తినమని బలవంతపెట్టడం ఇదివరకు మల్లేనే సాగుతున్నదికానీ.. ఇదివరకు మల్లే జనం చీదరించుకోవడం బాగా తగ్గించేసారు. సర్పంచిగారే చొరవ చేసి వాడు రాత్రిళ్లు పడుకునే పాడుబడ్డ పోలీసు క్వార్టర్సుని బాగు చేయించారు కూడాను.

మునపటంత ముదనష్టంగా లేదు ఇప్పుడు స్థానిక బాబు జీవితం. స్థానిక దర్జీ పుణ్యమా అని వంటి మీదకు నదురైన దుస్తులు అమిరేయి. స్థానిక బాబు జీవితంలో వచ్చిన ఈ మంచిమార్పుకు కొంతవరకు నేనూ కారణమే! ఆ ఊహ నా అహాన్ని కొంత సంతృప్తి పరిచిన మాటా నిజమే!

కొత్త ఎపిసోడ్ లో విచారించదగ్గ విషయం ఒక్కటే. స్థానిక బాబు చపలచిత్తం మాత్రం  చెక్కుచెదరకుండా అలాగే ఉండడం! రోజూ పొద్దున్నే బ్యాంకుకు రావడం.. ఓ రెండువేలు డ్రా చేసుకుపోవడం! ఆ డబ్బంతా ఏమవుతుందో! మళ్ళా మర్నాటికి వట్టి చేతులతో హాజరు! ఈ లెక్కన కాతా ఖాళీ అవడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చు!

సర్పంచిగారొక సారి బ్యాంకుకొచ్చినప్పుడు చెప్పిన విషయాలు వింటే షాక్ అవక తప్పదెవరికైనా!

'స్థానిక బాబు  దానగుణం ఇప్పుడు కొత్త ఏరియాలకు పాకింది సార్! సరిగతోటల్లోకి పోయి పేకాటరాయుళ్లకు డబ్బు పంచిపెడుతున్నాడు. సాయంకాలం అవడం పాపం..   సారాదుకాణం ముందు చేరి అడిగినాళ్లకి, అడగనాళ్లక్కూడా మందు పోయిస్తున్నాడు! ఊరు మళ్ళా పాతమంగలం అయేట్లుంది. అందుకే అన్నది.. మీరు మరీ అంత ముక్కుసూటిగా పోకుండా ఉండాల్సిందని అప్పట్లో!'

సర్పంచిగారి నిష్ఠురాలు చూస్తుంటే దీనికంతటికీ నేనే బాధ్యుణ్ణి అనేటట్లున్నారు. బ్యాంకు మేనేజరుగా నా ధర్మం నేను నిర్వర్తించడంకూడా తప్పేనా?! ఆ మాటే ఆయనతో అంటే కాస్త వెనక్కి తగ్గారు కానీ ఆయనగారి మనసులో ఇంకా ఏదో నలుగుతోంది. ఆ ముక్క చెప్పడానికే  పనిగట్టుకొని వచ్చినట్లుంది. 'సరే! అయిందేదో అయింది సార్! ఇప్పుడా పాత పంచాంగాలిప్పుకుంటూ కూర్చొంటే ఫలితమేముందికానీ..  ఇకముందైనా ఆ మిగతా సొమ్ము ఏదో వంకతో బిగబట్టేయండి సార్! వాడి తిండితప్పలు.. మంచిచెడ్డలు ఏదో విధంగా మనం చూసుకుందాంలేండి! రేపు వాడికేదన్నా నిజంగా ముంచుకొస్తే.. ఆదుకోడానికైనా అక్కరకొస్తుందా సొమ్ము. అసలా పొద్దు ఆ పోలీసాయన ఈ ఉద్దేశంతోనే వీడి పేరన ఈ డిపాజిట్టు చేసింది ' అని  వెళ్ళిపోయారు..

ఆయన అన్నమాటలోనూ  సబబుంది. కోట్లు కోట్లు దేశం సొమ్మును కొల్లగొట్టి పెద్దమనుషులుగా చెలాయిస్తున్నవాళ్ళను చూస్తున్నాం. ప్రజాహితం కోసం ఒక్క పైసా విదల్చని పరమ పీనాసి సన్నాసులు  సైతం ఆర్భాటపు వేడుకల్లో దానకర్ణులన్న పేరు కాపీనం కోసం ఒక్క పైసా ఇచ్చి వందరూపాయల కీర్తిలాభం కొట్టేయడమూ చూస్తున్నాం. అడక్కుండానే దానమిస్తానని వెంటబడి వేధించే చిత్రమైన దానకర్ణుణ్ణి మాత్రం ఈ చెరువుపల్లిలో తప్ప బహుశా ఇంకెక్కడా చూడబోమేమో! మూడేళ్ళుండి పోయే సర్కారు ఉద్యోగిని. నాకిదంతా అవసరమా? రేపు నిజంగానే ఈ స్థానిక బాబు ప్రాణానికేదైనా అయితే  జీవితాంతం ఆ అపరాధ భావనతో కుమిలి చావాల్సింది నేనే!  ఇంకీ కథ ఇక్కడితో ముగించడం మంచిదనిపించింది.

మర్నాడు డబ్బు డ్రా చేసుకోవడానికని వచ్చిన స్థానిక బాబుతో   'బ్యాకు వడ్డీలెక్కలో పొరపాటు జరిగి పెద్దమొత్తం నీ కాతాలో పడిందయ్యా! ఇప్పుడు సరిచేసాం.  ఇదే నీ చివరి మొత్తం. ఏం చేసుకుంటావో నీ ఇష్టం' అంటూ ఓ  రెండువేలు అతని చేతిలో పెట్టి పాస్ బుక్కు వెనక్కి తీసేసుకున్నాం. ఎప్పటిలాగానే 'హిఁ.. హిఁ ..హిఁ' అని నవ్వుకుంటూ డబ్బులు పుచ్చుకుని  వెళ్ళిపోయాడు. అప్పటికి నిజానికి అతగాడి కాతాలో ఇంకా యాభౖవేలకు పైగానే సొమ్ముంది.

స్థానిక బాబు తరుఫున ఏదైనా మానసిక వికలాంగుల సంస్థకు విరాళమిచ్చి అవసరమైనప్పుడు అతగాడిని ఆదుకునే బాధ్యత అప్పగించాలన్నది ఎప్పట్నుంచో సర్పంచిగారి ఆలోచన.

ఒక వారంరోజుల సెలవు మీద నేను మా ఊరుకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వ్యవహారమంతా పూర్తిగా తలకిందులయిపోయి ఉంది!

బాంకు కాతాలోని సొమ్మంతా డ్రా అయిపోయింది! ఎంతసొమ్ము చూపెట్టుకుంటూ ఊళ్లో తిరిగాడో కానీ.. బస్టాండు వెనకాల  పొదల్లో సగం శవమై తేలాట్ట స్థానిక బాబు. పొద్దున పొద్దున్నే ఏవో మూలుగులు వినబడుతుంటే అనుమానం వచ్చి వెళ్ళి చూసారుట అటువైపుకి బయలుకి వెళ్లే ఆడంగులు.  కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానిక బాబు కనిపించాట్ట! అతగానికేమైనా అయితే ఊరికే వినాశనమని గదా ఊళ్లో జనం భయం! పనులు మానుకుని మరీ  అందుకే నెల్లూరు పెద్దాసుపత్రిలో చేర్పించారుట అందరూ కలసి స్థానిక బాబుని. అన్నింటికన్నా విచిత్రం .. మొదట్నుంచి స్థానికబాబు మంచి చెడ్డలు చూసిన సర్పంచి చిలకలయ్యగారీ సందట్లో ఊళ్లోనే  లేకపోవడం!  మూడోసారి గుండెపోటొచ్చిందని చెన్నయ్ అపోలోలో చేరి అప్పటికి నాలుగో రోజు. 'ఎంత ఖర్చైనా సరే.. మళ్ళీ మనుషుల్లో పడేటట్లు చెయ్య'మని ఆయనగారి బంధుబలగమంతా పెద్దడాక్టర్లను పట్టుకుని ఒక పట్టాన వదల్లేదుట అక్కడ! 'డబ్బు పోస్తే పాడైపోయిన గుండెకాయలు  బాగవుతాయిటయ్యా?  పేషెంటుకి ఇప్పట్టున  కావాల్సింది కరెక్టుగా సెట్టయి ..  పనిచేసే గుండెకాయ. అదెక్కడుందో ముందు వెళ్ళి  పట్టుకు రండి.. పోండి' అని కూకలేసారట చికాకు తట్టుకోలేక డాక్టర్లు.

ఇన్ని వివరాలు  చెప్పిన క్యాషియర్ గుప్తా మరో అనుమానమూ అన్యాపదేశాలంకారంలో   నసుగుతూ వెళ్లగక్కాడు  ‘.. ఆ మర్నాడే స్థానిక బాబు బస్టాండు వెనకాల పొదల్లో సగం శవమై తేలడమూ!.. అదీ  సర్పంచిగారి భార్య చూడామణమ్మగారి  కంటనే పడడమూ!’

‘స్థానిక బాబుకి డబ్బిచ్చినందుకు మీతో అన్ని నిష్ఠురాలు పోయారు గదా  సర్పంచిగారు! వాళ్ళబ్బాయి  సాంబశివరావే దగ్గరుండి, మాతో దెబ్బలాడి మరీ డబ్బంతా ఆ దానకర్ణుడి చేత  డ్రా చేయించాడు సార్!’ అంటో ఇంకో స్టేటుమెంటుకూడా అంటించాడా గుప్తా!

‘అదంతా ఏమోగానీ.. స్థానికబాబు  బతకడం అసాధ్యమని  తేల్చేసిన నెల్లూరి ఆసుపత్రి డాక్టర్లకు  చెన్నయ్ లో సర్పంచిగారు ఎడ్మిటయిన ఆసుపత్రితో కూడా ఎప్పట్నుంచో లింకులున్నాయని ఊరంతా ఒకటే గుసగుసగా ఉంది సార్!’ అన్నాడీ పక్కనుండి క్లర్కు  ఏడుకొండలు మరంత రెచ్చిపోతూ.

‘ఊరికి అరిష్టం తప్పాలంటే ఎట్లాగైనా ఆ స్థానిక బాబుని ఊరి పొలిమేరలు దాటనీయద్దని కదా  ఊరిపెద్దల కట్టడి పంచాయితీలో! అందుకే.. స్థానికబాబు గుండెకాయని సర్పంచిగారికి మార్చాలని కూడా తీర్మానం చేస్తిరి!  ఇప్పుడిట్లా మళ్ళా తిరకాసుగా మాట్లాడితే  ఎట్లా?’ అంటూ కోపానికొచ్చాడు ఆంజనేయులు.

 ఆంజనేయులు మాటంటే ఊరి సెంటిమెంటుకు నిలువుటద్దమే! అదట్లా ఉండనీయండి!  బయోలాజికల్ గా స్థానికబాబు గుండెకాయ చిలకలయ్యగారికి సెట్టయింది ఎట్లాంటి ఇబ్బందుల్లేకుండానే! అదీ ఇక్కడి విశేషం!

‘ఇందులో విశేషమేముందిలే సార్! అంతా ఆ వీరభద్రస్వామి చలవ. ఊరికి మళ్ళా  చెడ్డరోజులు రావద్దని మా ఊరిదేవుడు  తలచాడు. అందుకే ఏ అడ్డంకులూ రాకుండా దయతలచాడు’ అంటో రెండు చెంపలు టపటపా వాయించుకున్నాడు తూర్పువైపున్న ఆ దేవుడి  గుడి వంక భక్తిగా  చూసుకుంటూ ఆంజనేయులు!

రోగి తాలూకు బంధువుల సమ్మతి అవసరమని ఆసుపత్రి వర్గాలు రూలు చెప్పినప్పుడు 'నా అన్న వాళ్లెవరూ లేని అనాథ సార్ వాడు! సర్పంచిగారే ఇంతకాలం వాడిని ‘తండ్రి’లా సాకింది!  స్థానికబాబే గనక స్పృహలో ఉంటే ' హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వుకుంటూ తన గుండెకాయ పీకి సర్పంచిగారికి పెట్టిందాకా  వేధించుండేవాడు. వాడు అపర దాన కర్ణుడు' అనేసిందిట  సర్పంచిగారి సహధర్మచారిణి!

ఇన్నేళ్లయినా నాకింకా  ఆ స్థానికబాబు క్యారెక్టరు మరపులో పడలేదంటే కారణం.. హృదయాన్ని కరిగించే అతగాడి  దానగుణం! దాన్నంటి పెట్టుకునుండే ‘హిఁ.. హిఁ.. హిఁ’ అనే హాసస్వరం!  

‘తండ్రి దగ్గర్నుంచి పుణికిపుచ్చుకున్నాడా రెండు గుణాలు!’ అంటాడాంజనేయులు.

‘నిజమో.. కాదో.. తెలియాలంటే ముందా తండ్రెవరో తేలాలిగా?’ అంటాడు క్లర్కు ఏడుకొండలు.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ఆవుల సాంబశివరావుగారి అభిమాన సాహిత్యం గురించి.. కొద్దిగా! - కర్లపాలెం హనుమంతరావు

 




 

పది సంవత్సరాల వయసులో బుద్ధుని చరిత్ర క్లాసు పుస్తకంలో కేవలం పాఠం లాగా మాత్రమే కనిపించినా ప్రముఖ హేతువాది ఆవుల సాంబశివరావుగారి జీవన శైలి మీద పుస్తక పఠనం ప్రభావం చూపించడానికి ఆ తరగతి పాఠమే నాందీ పలికింది. ఒకానొక పత్రికకు వ్యాసం రాస్తూ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహామహులను ఆయన ఒక వరసలో తలుచుకున్నారు. వేమన, తెలుగుభాష తీపిదనం మరిగిన తరువాత వరస పెట్టి వదలకుండా చదివిన మంచి పుస్తకాలలో మరీ మంచివి అంటూ ..పోతన భాగవతం, భారతం, ఆముక్తమాల్యద, వసుచరిత్రలను అయనే స్వయంగా ఎంచి చూపించారు. అవ్యక్తమైన మానసిక స్వేచ్ఛ కోసమై తపించే కృష్టశాస్త్రి  కృష్ణపక్షం తన భావసరళిని తీవ్రం చేసిందని చెబుతూనే.. తనలో హేతువాద బీజాలను నాటిన  మహిమాన్వితుల పుస్తకాలను తలుచుకున్నారు. త్రిపురనేని రామస్వామిగారి కురుక్షేత్రం, సూతపురాణం, పలుకుబడి గలిగిన నమ్మకాలను ఎట్లా నిలదీస్తుందో అర్థం చెసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  విషయం పురాతనమైనదైనా సరే స్వతంత్ర బుద్ధితో ఆలోచించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పే వీరేశలింగంగారి రచనలు యావత్తూ చదివినట్లు చెప్పుకొచ్చారు. దురాచారాలు మనుషులను మానసికంగా ఎంతలా బలహీనపరుస్తాయో తెలుసుకునేందుకు గాను గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం  దొహదం చేస్తుందన్న  విషయం విపులంగా  వివరించుకొచ్చారు. ఒక పక్క చలం, మరో పక్క శ్రీ శ్రీ .. ఒకరు స్త్రీని గురించి, మరొకరుఉ దేశాన్ని గురించి ఎంత నూతనంగా ఆలోచించవలసిన అగత్యం ఉన్నదో కొత్త కొత్త కోణాలలో వివరిస్తుంటే ఉత్తేజితమయిపోయేటంతగా వారి భావజాలంతో మమేకమయినట్లు సాంబశివరావుగారు వివరించారు. ఉన్నవ లక్ష్మీనారయణగారి మాలపల్లితో తన సాంఘిక దృష్టి కోణం దిశ మారిందని స్వయంగా ఒప్పుకున్నారు ఆ లోకాయుక్త. మార్క్స్  ఎంగెల్స్ తో కలసి రాసిన దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో,  ముందే చదివేసి ఉడటం వల్ల

 హెగెల్స్, కాంటు రచనలు చదివి జీర్ణించుకోవడం సులభమైందన్నది సాంబశివరావుగారి భావన. కొత్తగా అబ్బిన బావుకత వల్ల పరిణతి చెందిన మనసుతో రష్యన్ విప్లవ పాఠాల సారాంశం సరైన మోతాదులోనే వంట పట్టినట్లు చెప్పుకొన్నారు . పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇంగ్లండులో జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రజాస్వామిక విప్లవానికి ఎట్లా మార్గదర్శకం అయిందో అవగాహన చేసుకునే పాటి విశ్లేషణాత్మక బుద్ధి, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధం,   ప్రజల హక్కుల కోసం .. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం  ఫ్రెంచి విప్లవం, ఎట్లా సర్వం తెగించి పోరుకు దిగిందో తెలుసుకునే పాటి అవగాహన, థామస్ జఫర్ సన్, రూసో మొదలైన రచయితలు, భావుకులు ఆయా సంఘటనలలో ఎట్లా వైతాళిక పాత్ర పోషించారో ఆ వాతావరణం అంతా మనసుకు ఎక్కించుకునే పాటి బుర్రా బుద్ధీ పెరగడానికి ఎన్నో ఉద్గ్రంథాలు ఎట్లా ఉపకరిస్తూ వచ్చాయో..  ఒక చిరు వ్యాసంలో  స్మృతి రూపంలో వివరించారు. ఏ ఉద్యమంలోనూ ఆర్థిక సమానత్వం  ఎజండా కాకపోవడం ఆవులవారి సునిశిత దృష్టి నుంచి జారిపోకపోవడం  విశేషం.. ఆయన ఉద్దేశంలో ఆర్థిక సమానత్వం భవిష్యత్తులో రాబోయే ప్రగతిశీల ఉద్యమాలకు ఉత్ప్రేరకం మాత్రమే. ఇరవయ్యో శతాబ్ద్దంలో జరిగిన రష్యన్ విప్లవమే సాంఘిక వ్యవస్థను, అందులోని ఆర్థిక ప్రాతిపదికను సమూలంగా మార్చేందుకు ఉపయోగపడిన మొదటి ఉద్యమంగా సాంబశివరావుగారు భావిస్తారు. మార్క్స్ కు  లెనిన్ రాసిన భాష్యం ఈ క్రియానుగతమైన మానవోద్యమాలన్నిటికి  అద్దంపట్టినట్లు ఆవులవారి అభిప్రాయపడుతున్నారు. వీటిని మనసు పెట్టి చదివిన విజ్ఞుడు మానవ స్వేచ్ఛాప్రియత్వానికి, ఆ తరహా స్వేచ్ఛకు ఆర్థిక సౌలభ్యం ప్రధాన భావమవుతుందన్న మూల వాస్తవం తెలుసుకుంటాడన్నది లోకాయుక్త పదవి సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆవుల సాంబశివరావుగారు ముక్తాయింపు.

 అప్పటి వరకు సంపన్నుల, సమాజంలో ఉన్నత తరగతుల వారి వ్యవహారంగా సాగుతూ వచ్చిన భారత స్వాతంత్రోద్యమం గాంధీజీ రాకతో ఒక్కసారి దేశప్రజలందరి ఉద్యమంగా స్వరూపం మార్చుకున్న విషయం ఆవులవారి దృష్టిని దాటిపోలేదు. సామాన్య ప్రజల హృదయాలలో కూడా స్వాతంత్ర్య పిపాసను బాపూజీ ఎట్లా రేకెత్తించగలిగారో వెలూరి శివరామ శాస్త్రిగారు బాపూజీ ఆత్మకథను అతిచక్కని సరళ శైలిలో చేసిన అనువాదం చదివి తాను అర్థం చేసుకున్నట్లు సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. గాంధీజీ నిర్మలమైన వ్యక్తిత్వం  సామాన్యుడికైనా అవగాహన అయే తీరులో రాసిన పుస్తకం అది అని ఆవులవారి ఆలోచన. మహాత్ముల జీవితాల పట్ల భక్తి విశ్వాసాలు ఉండే సామాన్య ప్రజకు బాపూజీని మాహాత్మునిగా మలిచి చూపించిన అనువాదం అని ఆవులవారి ఉద్దేశపడ్డారు. ఆసేతు హిమాచల పర్యంతం జన హృదయం మీద బాపూజీ ఎట్లా పీఠం వేసుకు కూర్చున్నారో ఆ పుస్తకం చదివితే తెల్సుస్తుందని ఆయనే ఒకానొక సందర్భంలో ప్రసంగవసాత్తూ చెప్పుకొచ్చిన మాట.. వేలూరివారి పత్రికా రచనలోని పదును పాఠకుల మనసుల్లోకి సూటిగావెళ్లే విధంగా ఉంటుందంటారు ఆవులవారు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోకుండా ఉండుంటే జవహర్ లాల్ నెహ్రూ  ఒక గొప్ప ప్రపంచ స్థాయి రచయిత అయివుండేవారని ఆవులవరి ఆలోచన. అంతగా ఆయన రాసిన 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ'ని సాంబశివరావుగారు మధించారన్నమాట!

చరిత్రకు , మానవ చరిత్రకు  నూతన దృక్పథాన్ని ఎత్తి చూపెట్టిన 'ఆర్నాల్డ్ టైన్స్' చరిత్ర అంటే కేవలం ఒక పెద్ద కథ కాదని, మానవ సమాజ గమన వివరంగా తెలియపరిచే సమాచార సాహిత్యమన్న  ఆవులవారి మాట ఆలోచించదగ్గది. చరిత్రను కొత్త కోణం నుంచి చూడటం తనకు నేర్పిన ఆ పుస్తకాన్ని గురించి ఆవులవారు సందర్భం వచ్చిన ప్రత్తీసారీ ప్రశంసించకుండా ఉండలేకపోయారు.  ఏ ఏ ఘట్టాలు మనిషిని ప్రభావితం చేస్తూ వచ్చాయో, సమాజ గమనాన్ని మలుపు తిప్పుతూ వచ్చాయో  ఆ పుస్తకం చదివిన తరువాత తాను మరింత పరిణత దృష్టితో చూడడానికి అలవాటు పడ్డారో సాంబశివరావుగారు చెప్పుకొచ్చిన తీరు ప్రశంసనీయం. నెహ్రూజీ ఆత్మకథకూ  ఆయన హృదయంలో గొప్ప స్థానమే ఉంది. అది కేవలం ఒక నాయకుడి జీవిత చిత్రణ మాత్రమే కాకుండా, ఒక మధుర కావ్యం కూడా ఆవులవారి  దృష్టిలో.

సంపదల మధ్య పుట్టినా సున్నితమైన హృదయం, సునిశిత మేధో సంపద, సత్యాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతృష్ణ, నమ్మిన సత్యాన్ని ధైర్యంగా నిర్భయంగా ప్రకటించే సత్యనిష్ఠ -మనిషిని ఎట్లా మహామనీషిగా మలిచెందుకు దోహదపడతాయో తెలుసుకోవాలంటే  నిరాద్ చౌదరిగారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్నోన్ ఇండియన్', యం.సి. చాగ్లాగారి 'రోసెస్ ఇన్ డిసెంబర్', లాంటి పుస్తకాలు చదవాలంటారు  ఆవుల. నిరాద్ చౌదరిగారి కథ భారతదేశాన్ని, భారతీయ జీవితాన్ని గురించి తనలో పలు ఆలోచనలు రేకెత్తించిందని  ఆవులవారి ఉవాచ. చాగ్లాగారి ఆత్మకథయితే ఆనాటి దేశపరిస్థితులకు.. ముఖ్యంగా హిందూ ముస్లిముల మధ్య గల సహృదయతకు, న్యాయ, పరిపాలనా వ్యవస్థలకు ఒక దర్పణం వంటిదని ఆయన అభిప్రాయం. చదివినవారిని ఎవరినైనా సరే తప్ప ఆలోచనల్లో పడవేయకుండా ఉండనీయని గొప్ప స్ఫూర్తిదాయకమైన సాహిత్యంగా  ఆయన కితాబిచ్చిన పుస్తకాలు ఇంగర్ సాల్, బెర్ట్రెండ్ రస్సెల్, వంటి తాత్వికుల పెద్ద రచనల జాబితా!  విశ్వరహస్యాలను, మానవ ప్రకృతిని మౌలికంగా పరిశీలించిన గ్రంథాలు, మనిషిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన పుస్తకాలు, తన జీవితానికి తానే కర్త, భర్త అని వాదించే  రచనలు, మానవోన్నతికి భగవంతుని జోక్యం అవసరం లేదని , అసలు అడ్డుగా కూడా దైవభావనలు నిలబడకూడదని, మనిషి పురోగతికైనా, తిరోగతికైనా మనిషే పూర్తి బాధ్యుడని బోధించే రచనలు ఏవైనా సరే ఆవులవారు అమిత ఇష్టంగా చదివి వాటిలోని సారాన్ని వడగట్టి జీవితానికి అన్వయించుకుంటారని అర్థమవుతుంది. ఆ కారణం చేతనే ఆయనకు మానవేంద్ర నాధ్ రాయ్ రచనలు ప్రాణమయ్యాయి.  మౌలికమైన అంశాలనైనా విప్లవాత్మక కోణంలో భావుకత చెదరకుండా సాగిన సాహిత్య ఆవులవారి వ్యక్తిత్వం పై చూపించిన ప్రభావం ఏ కొలతలకూ అందనిది. 

ఆణిముత్యాల వంటి రచనలను జాతికి అందించిన మహామేధావి మానవేంద్రుడన్నది ఆవులవారి ఆలోచన. తాత్విక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలన్నింటినీ మునుపెన్నడూ ఎరుగని కొత్త కోణంలో తాత్వికుడు ఎం.ఎన్. రాయ్ నిర్వచించిన పుస్తకాలత గాఢమైన పరిచయం ఏర్పడిన తరువాత ఆవులవారిలోని అసలు మానవతావాదికి నూతన రూపం ఏర్పడడం ఆరంభమయిందనేది ఒక సాధారణ భావన. మానవుడు సమాజంలోని అంతర్భాగమే అయినప్పటికి.. ఆ విశిష్ట జీవి స్వేచ్ఛను, శ్రేయస్సును  కాపాడని పక్షంలో సమాజ నిర్మాణం పరిపూర్ణం కాదన్న ఎమ్.ఎన్.రాయ్ నవ్య మానవవాదం ఆవులవారికి మనసుకు హత్తుకున్నది. అటు వ్యక్తి స్వేచ్ఛకు, ఇటు సాంఘిక శ్రేయస్సుకు సమన్వయం  చేకూర్చే  మానవేంద్ర నాధ రాయ్ బావ సరళితో ఆవులవారు పుర్తిగా మమేకమైనప్పటి బట్టి తెలుగువారికి ఒక లోకాయుక్త లౌకిక పరమైన ఆస్తి కింద సమకూరినట్లయింది.

 రాయ్ రచనలు తన మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదని  సాంబశివరావుగారే  స్వయంగా అనేక సందర్భాలలో తన మనోభావాలను స్పష్టంగా బైటపెట్టిన తరువాత ఆ ఆధ్యాత్మిక  మార్గాన్ని గురించి మీమాంసలకు దిగడంలో అర్థం లేదు. తన లోని హేతువాదికి, బౌతికవాదికి  పురోగమన దృష్టిని కల్పించిందీ ఎమ్,ఎన్.రాయ్ తరహాలో 'సేన్ సొసైటీ' కర్త ఎరిక్ ఫ్రామ్ ది కూడా అని ఆవుల సాంబశివరావుగారు చెప్పుకొచ్చారు. ఎంచుకున్న అంశం ఏదైనా, స్వతంత్ర బుద్ధితో సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను సునిశితంగా పరిశీలించడం 'ఫ్రామ్' పుస్తకాల అధ్యయనం వల్ల కలిగిన లాభం అన్నది  ఆవులవారి అభిప్రాయం.

నోబెల్ పురస్కారం అందుకున్న ఆర్థిక శాస్త్రవేత్త మిరడాల్ ప్రసిద్ధ గ్రంథం 'ఏసియన్ డ్రామా' ఆసక్తితో చదివి ప్రాచ్యదేశాల లోతైన ఆలోచనలను అర్థం చేసుకున్నానన్న చెప్పిన ఆవుల సాంబశివరావు గారి అధ్యయన శైలి పరిశీలిస్తే .. ఆ మహామనవతావాది  పఠన పర్వం ప్రాచ్యుల వేదాల దగ్గరే ఆగిపోకుండా,  తాత్వికుల ఉపనిషత్తులు, అస్తిక షడ్దర్శనాల దాకా సాగినట్లు అర్థమవుతోంది.

 పురోగమనం, జీవం.. చేవ గలిగిన మనిషి  అచరించకుండా వదలించుకోకూడని సృజన వ్యాపారాలు- హేతువాదం, మానవతావాదం అన్నది ఆవుల వారి ధృఢాబిప్రాయంగా గుర్తిస్తే .. ఆ విధమైన మావవతావాదం ఆయనలో రగులకొల్పింది ఆరంభంలో వైవిధ్య భరితమైన వివిధ రంగాలకు చెందిన ప్రపంచ సాహిత్యం అన్న వాస్తవం మనకు అర్థమవుతుంది.  

- కర్లపాలెం హనుమంతరావు

21, నవంబర్, 2020.

(నవభావన -  జీవవాహిని శారద -  పుటలు 46 -  55 -ఆధారంగా)

Saturday, September 19, 2020

అంతరాత్మే అసలు శత్రువు.. ! - కర్లపాలెం హనుమంతరావు -పెన్ పవర్ దినపత్రిక ఆదివారం ప్రచురితం

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఏ అంశం మీద రాద్దామా అని ఆలోచిసున్నా. తెగడంలేదు'

'ఈ మధ్య నీ రాతల్లో కాస్త సీరియస్ నెస్ ఎక్కువయింది. బ్రేకింగ్ గా ఉంటుంది .. ఏదైనా, లైటర్ వీన్ ట్రై  చెయ్యరాదూ ?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

చిరాకు పడ్డా. 

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా మనసులుంటాయా? అక్కడికి మీ మనుషులు అవి చెప్పే మాటలే వింటున్నట్లు.. మహా! నేను జంతువులాంటి దాన్ని. నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ ఉండవు.. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి ఉండి నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది?' 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ పెట్టే నస చెవినపడగానే. 'మా పాతకాలం తెలుగు సినిమాలలో అంతరాత్మలు శుభ్రంగా ఏ టినోపాలుతో ఉతికిన  ఇట్లాగే ఏ తెల్ల వస్త్రాలో ధరించి అద్దంలో నుంచో, స్తంభంలో నుంచో అడగా పెట్టకుండా వద్దనకుండా ఊరికే తెగ నసపెడుతుండేవి. చాలా సమయాలల్లో ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం అదో సరదా వాటికి. పాత్ర  ఎస్వీ రంగారావు సైయిల్లో చేతిలో ఉన్న మందు సీసా విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలుగా మారుమోగేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యేదే కాదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని రాలేదు కదా! కరోనా రోజులు .. ఎటూ బైటికి పోయే ఛాన్సు నాకుండదీని  గాని పసిగట్టావా ఏందీ!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉంటుంది, అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పాలిటిక్సు పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకులాగే సమ హోదాతో జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు గిలికిపారెయ్ రాదూ ఈ దఫాకు! సరదాగా అందరు చదువుకుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందని మహానుభావా  కొత్తగా మన పాఠకులు చదివి ఎంజాయ్ చేసేందుకు?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు సంబధమైన సజ్జెక్టులన్నీ నీ లాంటి అంతరాత్మలు నసలు పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనక ‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు మనుషులకే పరిమితయినట్లు ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి లోపల ఏ మేకవన్నె పులి నిద్రోతుందో, ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడి చచ్చే పిల్లుంటుందో.. అంతరాత్మలకు మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఒకటి చెబుతా.. ముందు విను! ఆనక నీకు యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

  జంతువులు అసలేవీ  ఆలోచనల్లాంటి సృజనాత్మకమైన పనులు చేయలేవని కదూ  మీ మనుషుల బడాయి ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునాల్లాంటి సహజాతాలకు మాత్రమే మొగ్గుచూపే బుద్ధి వాటిదని కదూ మీ మేధావుల వెధవాలోచనలు!  జంతుజాలం భాష నువ్వు డీ-కోడ్ చెయ్యలేవు. కనక కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ బుర్రకెక్కదు.  వాటికి అసలు మాట్లాడటమే రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీకు అర్థమయితేనా! మనిషిగా పుట్టించినందుకు నువ్వా బ్రహ్మయ్య మీదనే నేరుగా దాడికి దిగిపోతావు!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు హరిద్వారం , ఋషీకేశం కూడా టచ్ చేసి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు గాని,   రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలియదు.  పక్షులూ, జంతువులతో మాట్లాడ గలగడం వాస్తవానికి ఓ గడసరి విద్య.  మేక కనపడితే గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగు!

'మే' అనకపోతే వాడి పారేసిన నీ చెప్పుల జోడు తెచ్చి  నా మెడకు వేలాడ కట్టు!’ 

'అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవే నంటావా ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు నుండిపోదు .. గ్యారంటీ ‘ అంయీ    సోది కహానీలు మొదలుపెట్టేసిందీ వెధవ సూక్ష్మగ్రాహి  అంతరాత్మ! 

గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మన తెలుగురచయితలకు మల్లే చెత్తచెత్తగా వాడే శక్తి  పద్దస్తమానం 'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుందని దాని   కోతలు! 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లో చదివే మీ బదుద్ధాయికి తెలీకపోవచ్చునేమో కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ వేసినా  'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లు చెప్పేస్తుందిట!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' నామధేయులు ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందని ఈ అంతరాత్మ ప్రబోధం!  పార్వతీదేవికున్న పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని ఆవు తెలుసును. ఆ జ్ఞానం మనిషి జన్మ మహోదాత్తమైనదని  అనుక్షణం ఉబ్బెత్తు ఛాతీలు తిప్పుకుంటూ తిరిగే మీ మనుషులకే ముందు తెలియాల్సి వుంది. ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ఏమంటారో ఏ  క్రాష్ కోర్సులో చేరకముందే ఈజీగా తెలిసిపోయింది.  చెప్పుకుంటు పోతే ఈ జంతు విజ్ఞానానికి ఆదీ.. అంతూ దొరకదు. కానీ ఆఖరుగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించకపొతే  పశుపక్ష్య జాతులకు పూర్తి న్యాయం జరిపించినట్లు కాదు. నెమలీ ! నెమలీ ! ఈ మనిషిని గురించి జంతుజాలం ఏమనుకుంటున్నదో ఒక్క ముక్కలో చెప్పి ముగించమంటే 

'క్రాక్' అంటూ ఇంచక్కా తోకూపుకుంటూ నిలబడుతుంది.' అని ముక్తాయించేసింది నా అంతరాత్మ. 

నెమలిని అడ్డమేసుకుని తన మనసులోని ముక్కని అంతరాత్మ అట్లా బైటకు నెట్టేసిందన్న గుట్టు అర్థమముతూనే  ఉంది.

మనిషికి  తొలి శత్రువు ఎక్కడో లేడు. మన  మనసులోనే ఓ మూల నక్కి  ఉండి   మనతోనే ప్రతిక్షణం దొంగ  తిళ్లు తింటూ మనం కాక్స్ లా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం  గమ్మునుండి పోతున్నాడు. దెబ్బతిని కిందపడితే మాత్రం ఇట్లా బైటికొచ్చి కుక్క మీదా నెమలి మీదా పెట్టి దెప్పుతుంటాడు. ఈ అంతరాత్మ కన్నా  ఏ శత్రువు మాత్రం మనిషికి చేసే చెరుపేముందిక? 

నిజమైన మిత్రుడే అయిఉంటే తప్పు చెయ్యక ముందే నచ్చ చెప్పి తిప్పలు తప్పించాలి కదా అంతరాత్మ! అందుకే పాలిటిక్సులో పైకి రావాలనుకునే మొండి నేతలు గుండెల్లోనే ఉండి పద్దస్తమానం ఘోష పెడుతుండే ఈ వెధవ అంతరాత్మలను అప్పోజిషన్ పార్టీ శాల్తీల కన్నా హీనంగా  లెక్క గట్టి పురుగుల్లా చీదరించుకునేది*

- కర్లపాలెం హనుమంతరావు 

( పెన్ పవర్ దినపత్రిక ప్రకాశం ఆదివారం  సంచికలో ప్రచురణ ) 

Saturday, July 25, 2020

హేతువాదమే ప్రగతి బాటకు రహదారి! -కర్లపాలెం హనుమంతరావు = సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం - కర్లపాలెం హనుమంత్తరావు



చదువుకున్నవాడికీ, చదువులేనివాడికీ మధ్య ఉండే తేడా మనకు విద్యాలయాల ద్వారా సాధించే పట్టాల రూపంలో మాత్రమే చూడడం అలవాటు. ఇప్పుడా విద్యారేఖా అడ్డుగా ఉండని గొడ్డుమోతురోజులు ముంచుకొచ్చేసాయి. ఆక్స్ ఫర్డ్ లో చదివినా అమ్మనా బూతులు కూస్తేనే తప్ప 'పప్పూ కాదురా సోదరా.. పొరపడ్డాం.. మగాడేరా'! నే మెప్పులు పొందే తప్పుడు సమాజంలో మనమిప్పుడు  అతి కష్టం మీద  ఎట్లాగో ఊపిరి పీలుస్తున్నాం.  హేతువును గురించి ఏమన్నా రెండు హితవైన ముక్కలు చెప్పాలన్నా జంకే! ఎక్కడ 'గిరీశం లెచ్చర్ల ' కోవలోకి జారిపోతామోనన్న బెంగతోనే నోళ్లు కుట్టేసుక్కూర్చునే మేధావులే మట్టంగా దర్శనమిస్తున్నా రిప్పుడు సర్వత్రా. విశ్వాసాలకు, మూఢవిశ్వాసాలకు.. జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే అడ్డుగీతలు మామూలు చేతులతో స్పర్శిస్తేనో, కళ్లతో దర్శిస్తేనో నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉండదు. వీక్షణ, ఆలోచన, విశ్లేషణ, వివేచనలతో కూడిన పని ఎవరైనా బుద్ధిశాలి కొద్దిగా ధైర్యం చేసి  కాస్త కూడబలుక్కునైనా   విడమరచి చెప్పే దుస్సాహం చేయబోతే.. ఠక్కున ఏ దిక్కు నుంచైనా పాతచెప్పులు రేకేట్లలా దూసుకొచ్చే ప్రమాదం కద్దు. 
బుద్ధి కర్మానుసారిణి, అంతా విధి చేతుల్లోనే ఉంది.. మనుషులం కేవలం నిమిత్త మాత్రులం .. లాంటి అహేతుక  భావజాలాంధకారంలో పడి విద్యలు నేర్చినవారు, రాజ్యాలు చేసేవారు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యతలు నెత్తికెత్తుకున్నవారు కూడా కొట్టుమిట్టులాడుతుంటే, పొట్ట కూటికై పాకులాడేందుకే ఎక్కడి జీవితకాలమూ చాలని బక్క మనిషి నుంచా  మనం  మంచిబుద్ధి,  సదసద్విచక్షణలు ఆశించేది?! తరతరాలుగా భావదాస్యంలో మునిగి తేలే అక్కచెల్లెళ్లు, అట్టడుగు జాతుల వంటి విస్మృతవర్గాలవారిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇంటా బైటా సవాలక్ష ఆంక్షలతో సతమతమయ్యే బక్కజీవి మతి కుదిరి, ఓ మూలను చేరి మంచిచెడులు తీరికగా తర్కించుకునే పాటి సావకాశం పాడు ఆధిక్యతాభావ  ప్రపంచం ఎక్కడ ఏకాలంలో పడనిచ్చింది గనక?! జీవికకు ఏ మాత్రం అక్కరకు రాని  దురభిమానాలు, హెచ్చుతగ్గులు, జాత్యహంకారాలు, కుల మత భేదాలు, అవినీతి, కాముకత్వం వంటి మానసిక జాడ్యాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయంటే, అందుక్కారణం  మంచేదో, చేడేదో తర్కింఛుకోవలసిన గత్యంతరం బొత్తిగా లేని అడ్డుగోలు గొడ్డుమోతుతనమే గద్దె మీద చేరి గద్దించి మరీ పనులు సానుకూలపరుచుకునే  కువిధానాల వల్ల.  నాగరికత- పేరుకే ఇరవయ్యకటో శతాబ్దానిది. సంస్కారం- ఒకటో శతాబ్ది కాలాన్నైనా దాటి రాని దుస్థితి. సంఘంలో, ఆర్థిక రంగంలో అశాంతి, అక్రమాలు అంతకంతకు తమ రికార్డులు తామే బద్దలు కొట్టుకుంటున్నాయంటే.. అన్యాయమే రాజకీయగద్దె మీద గజ్జె కట్టి హేతువనే పదానికుండే మూలార్థాన్ని మొదలంటా పెళ్ళగించేందుకు కంకణం కట్టుకోబట్టి కాదూ!
సమాజానికి, కుటుంబానికి కూడా ఎంతో కీలకమయినవి బడుగుల పాత్ర, స్త్రీ పాత్ర. విస్మృతులకు దక్కే హోదా, స్థాయిలే ఆయా సమాజాల ప్రగతి వికాసాలకు కొలమానాలు. తక్కువవర్గాలుగా బావించుకునేవారులోని తతనాన్ని తామే స్వయంగా  గ్రహింపుకు తెచ్చుకుని కలిసొచ్చే సానుకూల శక్తులని తోడు తెచ్చుకునైనా చొరవగా ఒక అడుగు ముందుకు చొచ్చుకుపోకపోని పక్షంలో ఈ సమాజానికి ఇక సమంజసత, సున్నితత్వం, సహేతుకత, సమ్యక్ దృష్టి ఏకమొత్తంగా అలవాటు తప్పిపోయే  పరిస్థితులు దాపురించినట్లే లెక్క.. నిజం చెప్పాలంటే!
సమాజమనే కాదు, వ్యక్తి జీవితంలోనూ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన  వాతావరణం వర్ధిల్లినప్పుడే సర్వే జనా సుఖినో భవన్తు అనే  సూత్రసారం ఆసాంతం సాకారమయే సావకాశం! ఉదాత్తమైన ఆశయాలు, ఉత్తేజకరమయిన ఆలోచనలకు సహేతుకతా తోడయే తప్ప మనిషి ఆలోచనల్లో మంచి మార్పు రాదు. మంచి మార్పు వస్తేనే  ప్రపంచానికి ప్రస్తుతం దాపురించిన దుస్థితుల నుంచి విముక్తయేందుకు  మార్గం దొరికేది.  చార్వాక, కపిల, కణాదుల సిద్ధాంతలతో కూడా బాల్యం నుంచే పరిచయం పెంచుకోవాల్సిన అగత్యంలో ప్రస్తుతం మన సమాజమున్నది. అట్లాగని తిరుగుబాటే మా వేదాంతం అని నినదించాలని కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణులకు ఎల్లవేళలా స్వాగతపత్రం అందించేందుకు మనసును  సిద్ధం చేసుకొనుంచుకోవాలనేదే.. హితవు.
తిరుగుబాటు వేరు.. విప్లవం వేరు. సిపాయిల తిరుగుబాటు వంటి తిరుగుబాటులకు అన్ని వేళలా సహేతుకమైన కారణాలే ప్రేరణలవుతాయన్న హామీ ఏమీ లేదు. కానీ.. భావవిప్లవం అంటే మాత్రం కణకణ మండే  అఖండ జ్వాలామాల. దానికి ఉత్తేజమనే ఇంధనమందేది మాత్రం అన్ని వేళలా అన్ని వైపులా  హేతుబద్ధమైన వికాసాలోచనల స్రవంతుల నుంచి మాత్రమే! ఆంగ్లసీమలో 1689లో హద్దులెరుగని రాచరికానికి కళ్లెమేసిన తీరులో సాగేదీ విప్లవోద్యమం. ప్రాతినిధ్య అధికారం ఉన్నవారికే పన్నులు విధించే హక్కన్న హేతుబద్ధ ఆలోచనే 1776 నాటి అమెరికన్ ప్రజాస్వామిక విప్లవానికి దారి తీసిన  ప్రేరణ.  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శవంతమైన  భావజాలం బలం పుంజుకుని 1789 ప్రాంతంలో  ఫ్రెంచి విప్లవానికి ప్రోద్బలంగా నిలచిన సందర్బం గమనించినా, 'భూమి.. తిండి.. శాంతి' వంటి వాస్తవావసరాల నిమిత్తం హోరెత్తిన 1917నాటి రష్యన్ల విప్లవం పరిశీలించినా, కార్మిక, కర్షక, మధ్యతరగతి, అణగారిన వర్గాల వంటి ఇతరేతర విస్మృత శక్తులు  ఆయా దేశాలలో  సాధించిన అన్ని విజయాల వెనకున్నదల్లా హేతుబద్ధమైన ఆలోచనాక్రమ వికాససరళి వెన్నుదన్నులు మాత్రమే అని అర్థమవుతుంది. 1947 నాటి భారత స్వాత్రంత్ర్యసమరం గాని, మరో రెండు ఏళ్ల తరువాత చైనాలో చెలరేగి విజయం సాధించిన జనచైనా విప్లవం గాని.. లోతైన సునిశిత పరిశీలనకు దిగితే చివరికి తేల్చేవి..  హేతువుతో కూడిన సమ్యక్ దృష్టి సమాజం అట్టడుగు వర్గాల వరకు చేరి ప్రభావితం  చేస్తేనే తప్ప అమానుషత్వం అణగారి సమసమాజ నిర్మాణానికి సానుకూల బాటలు పడబోవని.  
సమాజ పరివర్తనకు, భావగమనానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఆ భావాలు ఎవరి ద్వారానో ప్రతిపాదితమై ప్రభావితం చేసేవా? మన మెదడులోనే కదలడం మొదలయినప్పటి బట్టి స్వత్రంత్ర బుద్ధితో పెంపొందేవా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వవిఖ్యాత ఆలోచనావిప్లవ మేధావి ఎమ్.ఎన్. రాయ్ రెండవదే శిరోధార్యమని బల్లగుద్ది  మరీ చెప్పిన సత్యం మనమిక్కడ స్మృతికి తెచ్చుకోవడం అవసరం.
రాయ్ ఆలోచనా సరళి ప్రకారం, వ్యక్తివాదం, హేతువాదం , మానవవాదం..  అనే మూడు గుణాలతో మనిషి ఆలోచనా క్రమం ప్రభావితం అవుతుంది. తతిమ్మా అన్ని జీవులకు మల్లేనే మనిషి పుట్టుకా ప్రకృతి నుంచే. ప్రకృతి నియమం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మానవ వికాసమూ, మనిషి పెరుగుదలా నియమబద్ధంగా.. అంతే హేతుబద్ధంగా సాగుతాయనేది  రాయ్ రేడికల్ హ్యూమనిజం సూత్రం. 
మానవవాదం పురాతనకాలం నుంచి సదాలోచనా పరంపరగా సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నదే! కదిలే కాలంతో కదా మనిషి సహప్రయాణం చేస్తున్నది!   పెరుగుతున్న మానవ మేధస్సు, నాగరికతల మూలకంగా సమకాలీన భావజాలం సంధించే క్లిష్టమైన ప్రశ్నలు సహజంగానే ఎన్నో పుట్టుకువస్తాయి.  ఎప్పటికప్పుడు మొలకెత్తే కొత్త కొత్త సందిగ్ధాలకు సంబద్ధమైన బదుళ్లిచ్చే క్రమంలో నవ్యమానవవాదం అనే మరో భావధారకు పురుడుపోసిన ప్రజామేధావి ఎమ్.ఎన్.రాయ్.

స్వభావసిద్ధంగా స్వేచ్ఛాపిపాసి, సత్యాన్వేషి- మనిషి. అతను తన మనుగడ సాగించుకునే క్రమంలో అంతరాత్మ చెప్పే నీతి.. (అదే ఎక్కువ మందికి భగవంతుడు చెప్పే నీతిగా అనిపించేది), ప్రయోజనం కలిగించే నీతి అనే రెండు దోవల నుంచి ప్రేరణ పొందుతాడని, ఈ రెండు దిశలకు ప్రత్యామ్నాయంగా హేతుబద్ధమయిన నీతిమార్గంమాత్రమే మనిషి నడిచే సన్మార్గంగా ఉండాలనేది రాయ్ నవ్యమానవవాద మూల సూత్రం.

రాజకీయాలలో పార్టీలు లేని వ్యవస్థను, ఆర్థికరంగంలో సహకార సంబంధమైన ప్రణాళికా రచనలు ప్రతిపాదించే తీరులోనే,  సాంస్కృతిక రంగంలోనూ స్వతంత్ర బుద్ధితో హేతుబద్ధంగా చేసే ఆలోచనాధారను ప్రోత్సహిస్తుందీ సిద్ధాంతం. సంఘపరంగా సాగే అన్ని రకాల వివక్షలను నిర్ద్వందంగా నిరసిస్తుంది కూడా. కుల, మత, వర్గ, ప్రాంత, భాష, జాతి, దేశ విభేదాల జాబితాలో లింగ విభేదమూ ఉంది. విశ్వజనీనమైన సంస్కృతికి విలువిస్తూనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడగల సత్తా ఈ మానవవాదానికి ఉంది. ఆఖరుదే  అయినప్పటికీ అత్యంత ప్రధానమైన అంశం, విశ్వాసాలు మూఢవిశ్వాసాల కిందకు దిగజారడాన్ని నిర్మొహమాటంగా నిరసించే పదునైన ఆయుధం నవ్యమానవవాదం.


ప్రకృతికి మించిన శక్తి మరేదీ లేదు. మనిషి తన మనుగడకు, తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. తన మేలుకు, సాటి మనిషి మేలుకు మధ్య ఘర్షణ లేదని.. ఉండకూడదన్న జీవన సూత్రాలను మాత్రమే సామాజిక పరిస్థితుల మెరుగుదలకు సాధనాలుగా వాడుకునే ప్రయత్నం చేయాలని నవ్యమానవవాదం హితవు చెబుతుంది.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి సంస్కృతులే మహాచిక్కుల్లో నలుగుతున్నాయి. మత ప్రాబల్యం, ఫాసిజం తరహా ఎన్నో ఇతరేతర నియంత్రణ విధానాలు సర్వజనసంక్షేమ కాంక్ష మీద నిప్పులు కురిపిస్తున్నాయి. విజ్ఞానం సహేతుకమైన మార్గంలో అభివృద్ధిచెందడం, మేధస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చెయ్యడం, సృజనశక్తి సరికొత్త జవసత్తువలు పుంజుకునే నూతన తాత్విక చింతనలకు ప్రాతిపదికలుగా వాతావరణాన్ని మలుచుకోవడం తప్పనిసరి అయిన ఈ తరుణంలో, లోకం రోజురోజుకూ మూఢవిశ్వాసాలు, మూర్ఖాలోచనల రొంపి వైపుకు శరవేగంగా అంగలువేయడం  సామాజిక శ్రేయోకాముకులు ఎవరికైనా అమితాణ్దోళన కలిగించే అంశమే!
పదునెక్కిన నైతిక దృక్పథం మొక్కటే ముందుకు చొరబడి రాక తప్పని తరుణమిది. సమయానుకూలమైన మౌనభంగిమలనే హూందాతనంగా మేధావులు భావిస్తుండవచ్చు. పెద్దరికం ప్రదర్శంచడమంటే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లని పద్ధతిలో స్వయం వికాసమార్గాలను అన్వేషించుకునే మార్గాలు వెతికి సూచించడం. అర్థం. క్రమశిక్షణ మిషతో మనిషిని ఒక యంత్రంలా మార్చే విధానాలకు సత్వరమే తిలోదకాలు ఇవ్వడం అవసరం. యాంత్రీకరణ మానవీయ విలువలను.. క్రమంగా మానవతను కూడా ధ్వంసం చేసే మహారక్కసి. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన, సమగ్రమైన విలువలను ఫణంగా పెట్టే జీవనవిధానాలను చెత్తబుట్టలో వేసి తొక్కేస్తే తప్ప ఆ రక్కసి కర్కోటకం నుంచి నిజమైన విముక్తి అట్టడుగు జీవి వరకు  చేరే అవకాశంలేదు.
వ్యక్తి స్వేచ్ఛ ఆవశ్యకతను తక్కువ చేయలేం.. కాని సమాజశ్రేయస్సు  తరువాతనే దానికి ప్రాధాన్యత. భౌతికపరమైన అవసరాలు తీరే నిమిత్తం పరుల స్వేచ్ఛను హరాయించడం అమానుషమవుతుంది. మానసిక స్వేచ్ఛ, సామాజిక చింతన లేకుండా ప్రగతిని సాధించడం మోచేతి కింది బెల్లం నాలుకతో అందుకోవడంతో సమానం.
నిజం చెప్పాలంటే, మానవవాదంలో పిడివాదానికి, పిడిగుద్దుల సిద్ధాంతానికి  తావేలేదు.  మానవవాదం మరో పేరే వ్యక్తి స్వేచ్ఛ. మారే సమాజానికి అనుగుణంగా అభ్యుదయ పంథాలోనే విధానాల మార్పుకు సౌలభ్యం కల్పించే మౌలిక జీవనసూత్రానికి హేతువాదం కట్టుబడి ఉంటుంది. విజ్ఞాన కాంతిని ప్రపంచశాంతికి వినియోగించే సమన్వయ బుద్ధి సాధించాలన్నా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సవాలక్ష సవాళ్లకు సహేతుకైన సమాధానాలు  వెతికే మనస్తత్వం బాల్యం నుంచే అలవరచుకోవడం ఒక్కటే గతి.  
-కర్లపాలెం హనుమంతరావు
(26-07 -2020 నాటి సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురితం)


                                                

Wednesday, February 1, 2017

ఫొటో ఆల్బమ్- విపులలో నా కథ



ఆ రోజు వర్కింగ్ డే. ఇంట్లో ఎవరూ లేరు. ఆయనా, పిల్లాడూ డ్యూటీల కెళ్లారు. పనమ్మాయి పని ముగించుకొని వెళ్ళేసరికి పదకొండు గంటలు దాటింది. స్నానం చేసి రిలాక్సుడ్ గా టి.వి చూస్తూ కూర్చోనున్నాను. బైట గేటు తీసిన అలికిడి. ఒక పెద్దాయన.. సుమారు అరవై.. అరవై ఐదేళ్లుంటాయేమో.. గేటు తీసుకుని లోపలికి వచ్చి పద్ధతిగా చెప్పులు ఓ మూల విడిచి వరండాలో ఉన్న పేము కుర్చీలో కూలబడి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటున్నాడు.
ఎప్పుడూ చూసిన మొహంలా లేదు. 'ఎవరు కావాలండీ?' అనడిగాను బైటికొచ్చి.
'రామ్మోహనరావుగారు ఉన్నారామ్మా?' అనడిగాయన చేతిసంచీ ఓ పక్కకు పెట్టుకొంటూ. ఆ పేరుగల వాళ్లెవ్వరూ మా ఇంట్లోనే కాదు.. మా చుట్టుపక్కలకూడా  లేరు. ఆ మాటే చెప్పాను.
'అయ్యో! ఇది మోహనరావుగారిల్లన్నారే!' అని గొణుక్కుంటూ లేచి నిలబడ్డారాయన. 'పాపం' అనిపించింది. మా నాన్న వయసుంటుంది ఆయనకు.
చెప్పులు వేసుకుంటూ అడక్కుండానే చెప్పుకొచ్చాడాయన. 'రామ్మోహనరావంటే మా అల్లుడేనమ్మా! ఇక్కడే ఎక్కడో ఆంధ్రాబ్యాంకులో చేస్తున్నాడాయన. బ్రాంచి పేరు గుర్తుకు రావడం లేదు. ఎప్పుడూ ఒక్కడినే రాలేదు. ఎప్పుడు వచ్చినా అమ్మాయి పక్కనే ఉండేది. నారాయణాద్రికి వస్తున్నానని చెప్పానమ్మా! అల్లుడుగారిని పంపిస్తానంది. ఎందుకు రాలేదో?' అనుకుంటూ బైలుదేరాడాయన.
'పక్క బజారులో ఆంధ్రాబ్యాంకుంది బాబాయిగారూ! అదేమో చూడండి!' అన్నాను గేటుదాకా బైటికి వచ్చి దారి చూపిస్తూ. ఆయన వీధి మలుపు తిరిగిందాకా చూసి లోపలికొచ్చేసాను. పెము కుర్చీ పక్కన పెట్టిన చేతిసంచీ అలాగే ఉంది, 'అయ్యో' అనుకుంటూ సంచీ తీసుకొని మళ్లా వీధిలోకి పరుగెత్తాను. కానీ అప్పటికే పెద్దాయన వీధి దాటినట్లున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
ఇక చేసేదేం లేక ఆ సంచీని లోపలికే తెచ్చి ఓ మూల పెట్టేసాను.. మళ్లా వస్తే ఇవ్వచ్చులే అని.
ఆ పూటకి ఎవరూ రాలేదు.
మావారు సంచీని చూసి అడిగితే వివరంగా అంతా చెప్పాను. 'ఎవర్ని బడితే వాళ్లని అలా లోపలికి రానిచ్చేయడవేఁనా? అసలే రోజులు బాగో లేవు. ముందా సంచీ తీసవతల పారేయ్!' అని కూకలేసారు. ప్రద్దానికీ క్లాసు పీకటం ఆయనకో అలవాటు.
మా అబ్బాయయితే ఒహటే ఆట పట్టించడం.. 'తాతగారిచ్చిన గిఫ్టులు చెరి సహం షేర్ చేసుకొందాం మమ్మీ!' అంటూ.
రెండో రోజూ బ్యాగుకోసం ఎవరూ రాకపోయేసరికి నాకూ అనుమానం మొదలయింది. 'ఇదంతా కావాలని ఎవరో చేస్తున్న అల్లరి కాదు గదా!' అనిపించింది. వీధి చివరిదాకా వెళ్లి ఆంధ్రాబ్యాంకులో అడుగుదామని వెళ్ళాను ఆ మర్నాడు. ఇదివరకు బ్యాంకు ఉండేచోట ఇప్పుడేదో కన్ స్ట్రక్షన్ నడుస్తోంది. 'బ్యాంకు క్రాస్ రోడ్డుమీదకు షిఫ్ట్ చేశారు కదమ్మా!' అన్నాడు అక్కడే ఉన్న మేస్త్రీ. ఇంటికొచ్చి అనుమాన నివృత్తికోసం అసలు బ్యాగులో ఏముందో చూద్దామని బైటికి తీసాను.
ముసలివాళ్ల బ్యాగుల్లో ఏవుంటాయి? రెండు పంచలు.. లాల్చీలు.. కళ్లజోడు.. మందుల డబ్బా.. ప్లాస్టిక్ రేపర్లో చుట్టున పేస్టూ.. బ్రష్షూ.. సోపు.  భగవద్గీత పుస్తకం. పుస్తకం మధ్యలో ఏదో పెళ్ళి ఫొటో. కొత్త దంపతులాల్గున్నారు, చూడముచ్చటగా ఉంది జంట. ముసలాయన కూతురు.. అల్లుడు కాబోలు!
స్కూలు పిల్లల సైన్సు రికార్డు సైజులో ఒక పెళ్లి ఫొటో ఆల్బమ్ కూడా ఉంది. పెళ్లి కూతురు ఫొటోలోని అమ్మాయే కానీ.. పెళ్లికొడుకు పొటోలోని అబ్బాయి కాదు!
న్యూస్ పేపర్తో చూట్టి రబ్బరు బ్యేండ్లేసిన ఇంకో కట్టకూడా కనిపించింది. ఎందుకులే మనకీ పాడు గోల అనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడ యథాతధంగా సర్దేసి బ్యాగును స్టోర్రూం అటకమీద పెట్టించేసాను.. ఎవరన్నా వచ్చి అడిగితే ఇవ్వచ్చులే అని ఆలోచన,
ఆ రోజు ఆదివారం, మా వారికి చికెన్ కంపల్సరీగా ఉండాల్సిందే. నిద్ర లేవంగానే మహా సంబరంగా బజారుకు బైలుదేరారు.
ఆయన చెప్పులేసుకుంటుంటే.. మటన్ షాప్ పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంకు గుర్తుకొచ్చింది. 'వీలయితే ముసలాయన్ను బేగు తీసుకు వెళ్లమని చెప్పి రండి' అని హెచ్చరించానీయన్ని.
ధుమధుమలాడుతూ వెళ్లిన మనిషి తీరిగ్గా తిరిగొచ్చి 'బ్యాంకు మూసుంది. నెంబర్ తెచ్చాను చూసుకో!' అంటూ సెల్లో స్టోర్ చేసుకొచ్చిన నెంబరొకటి నా మొహాన కొట్టారు. అదీ సెల్ నెంబరే!
మధ్యాహ్నం ఆ నెంబరుకి కాల్ చేస్తే 'హలో!' అంది ఓ మగ గొంతు. 'సార్! మీరు ఆంధ్రా బ్యాంకు రామ్మోహనరావుగారేనా?' అనడిగాను.
'యెస్! వ్హాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?'
'విషయం వివరించడానికి చాలా తంటాలు పడాల్సొచ్చింది. అంతా విని చివర్లో 'మీరేమంటున్నారో నాకర్థం కావడంలేదు మ్యాడమ్! మా మామగారు పోయి రెండేళ్లయిందే!' అన్నారు. లైన్ కట్ అయింది. మళ్లో కాల్ చేసినా రెస్పాన్ లేదెంత సేపటికీ. ఇంకీ విషయం ఇంతటితో 'ది ఎండ్' అయిందని అర్థమయి పోయింది నాకు.
మూడు రోజుల తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల పాంతంలో లాండు లైనుకి ఓ ఆడమనిషి కాల్ చేసింది. 'ఆదివారం మధ్యాహ్నం మావారి సెల్ కి ఈ నెంబర్నించీ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకోవచ్చా?' వినయంగానే ఉందా గొంతు.
'ముందు మీరెవరో చెప్పండి!' అనడిగాను నేను.
'ఆంధ్రాబ్యాంక్ రామ్మోహనరావుగారి వైఫ్ నండీ! మీతో కాస్త మాట్లాడ వచ్చా మేడమ్?'
'మాట్లాడండీ!'
'ఇలా ఫోన్లో కాదు. మీకు అభ్యంతరం లేదంటే ఒకసారి మీ ఇంటికి వస్తాను'
'రండి!' అంటూ ఇంటి అడ్రసు చెప్పాను.
అరగంటలో ఆటోలో వచ్చింది. గేటు తీసుకొని లోపలికి వస్తుంటేనే గుర్తు పట్టాను.. ఆమె ఆ ఫొటోలోని అమ్మాయే! కాకపోతే కాస్త వయసు పెరిగి వళ్లు చేసింది. కూర్చోమన్నాను.
బిడియంగా కూర్చుంది. 'ఇంట్లో ఎవరూ లేరా?' అని అడిగింది చుట్టూ చూస్తూ.
'లేరు' అన్నాను.
రిలీఫ్ ఫీలయింది. స్తిమితంగా 'మీరు మావారితో మాట్లాడిందంతా విన్నాను మేడమ్! బ్యాగు ఇంకా ఇక్కడే ఉందా?' అనడిగింది.
'సంచీ తెచ్చిచ్చి 'అన్నీ  ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి!' అన్నాను. బ్యాగందుకుంది కానీ.. లోపలేమున్నాయో చూసుకోలేదు. 'చాలా థేంక్సండీ!' అంటూ బైలుదేరింది హడావుడిగా.
'మంచిదమ్మా! నాన్నగారు బాగున్నారు కదా?'అనడిగాను చెప్పులేసుకుంటున్న ఆమెను చూసి.
'ఆయన మా నాన్నగారు కాదు మ్యాడమ్. మా ఊరాయన. ఈ ఆల్బమూ, డబ్బూ ఇచ్చి వెళదామని వచ్చాడు. రావాలంటే మా ఇంటికే రావచ్చు. కావాలనే ఇవి మీ ఇంట్లో వదిలేసినట్లున్నాడు'
'అదేందీ?!'  అనరిచాను ఒక్కసారి షాకయినట్లు.  ఆ సంచీలో కేషున్నట్లు నాకిప్పటిదాకా తెలీనే తెలీదు!
వెళ్లే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చింది. 'ఇదంతా మీకు చెప్పకూడదో.. లేదో.. నాకు తెలీదు. మా అమ్మలాగా ఉన్నారు. చెప్పకబోతే బావుండదు. ఆయన మా ఊరి పెద్దబ్బాయిగారు. పెద్ద ఫొటో స్టూడియో ఉండేది వాళ్లకు. మా ఊళ్లో ఎక్కడ ఏ ఫంక్షను జరిగినా వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసేవాళ్లు. వీళ్లబ్బాయి ఇంటర్లో నా క్లాస్ మేట్. మంచివాడు కాదు. నా వెంటబడి వేధించేవాడు. ఒకసారి క్లాక్ టవర్ దగ్గర చెప్పుతో కొట్టాను కూడా. అది కడుపులో పెట్టుకున్నాడు. మా ఫ్రెండు పెళ్లికి వీళ్లే ఫొటోలు.. వీడియోలు తీసారు. దాని ప్లేసులో నా బొమ్మలు పెట్టి సి.డి.లు తయారు చేసాడు. రెండు లక్షలివ్వకపోతే బైటపెడతానని అల్లరి పెట్టేవాడు. మా నాన్నగారు మామూలు బడిపంతులు. నా పెళ్లికే నాలుగు లక్షలుదాకా ఖర్చయిందా రోజుల్లో. ఇంకో ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఆ దిగులుతోనే హార్టెటాకొచ్చి పోయారు' అని ఎడుస్తోందా అమ్మాయి.
ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. పాపం.. ఎంతకాలంనుంచీ కడుపులో దాచుకుందో!
తనే తమాయించుకొని వెళ్లడానికి లేస్తూ అంది 'అప్పట్లో మా నాన్నగారి పెన్షష్ నుంచీ ఒక లక్ష ఇచ్చి సి.డి తీసుకున్నాం ఆంటీ! కానీ ఇలాంటిదే ఇంకో ఆల్బంకూడా తయారు చేసాడని తెలీదు. తరువాత ఆ అబ్బాయి ఇలాంటివే ఏవో గొడవల్లో ఇరుక్కుని చచ్చిపోయాడు. పాపం.. పెద్దబ్బాయిగారికి ఇతనొక్కడే కొడుకు. పెద్దాయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. స్టూడియో వేరే వాళ్లకి అమ్మేశాడు. కొన్నాయనకు స్టాకు అప్పగించే టైంలో ఈ ఆల్బం బైటపడిందట. కొడుకు చేసిన నిర్వాకం అప్పటిదాకా ఆయనకూ తెలీదు. తెలిసి చాలా బాధపడ్డాడుట. ఈ ఫోటోలు.. ఇవీ ఇంకెవరైనా చూస్తే ప్రమాదమని నేరుగా నాకే ఇచ్చేద్దామని వచ్చాడు. ఇంటికొస్తే రెండు మూడు సార్లు మావారే కనిపించారుట. ఆయనకివ్వలేక మీ ఇంట్లో వదిలేసి పోయాడీ సారి'
'మధ్యలో మా ఇల్లు పిక్చర్లోకెలా వచ్చిందీ?! మా ఇంట్లో ఇవ్వాలని ఎందుకనిపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'అంకుల్ ఏవో కథలూ అవీ పత్రికలు రాస్తారుట కదా! పోయిన నెల్లో మీ ఇంటి అడ్రసు ఏదో పత్రికలో చూసారుట! మా ఇంటికి మీ ఇల్లు దగ్గరనే కావాలని ఈ బ్యేగు మీ ఇంట్లో వదిలేసి పోయాడాయన.'
'పెద్దబ్బాయిగారి భార్య నిన్న కాల్ చేసి  ఈ ఫొటోలు.. డబ్బూ ఇలా మీ ఇంట్లో ఉన్నాయి. తెచ్చుకొని ఫొటోలు కాల్చేయమ్మా!' అని చెప్పింది మేడమ్! ఈ లక్ష అప్పట్లో మేము వాళ్లబ్బాయికి ఇచ్చింది. మధ్యలో మీకు ట్రబులిచ్చాం. సారీ!' అని లేచిందామె.
'ఫర్వాలేదులేమ్మా! నా కూతురులాంటి దానివి. ఇందులో మేం చేసింది మాత్రం ఏముంది? పెద్దదాన్ని కనుక ఒక సలహా చెబుతాను. ఈ ఫొటోలను ఇక్కడే తగలేసి పోతే నీకు మంచిది' అన్నాను.
ఆ అల్బం మా ఇంట్లోనే బూడిద చేసి డబ్బుతీసుకొని పోయే ఆమెని ఇంకో ధర్మసందేహం అడిగాను. 'ఇంతకీ ఆ పెద్దాయన ఇప్పుడెలా ఉన్నాడో! ఆయన్ని చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొచ్చారు.. పాపం'
'ఇక్కడికొచ్చిన మర్నాడే ఆయన మంచం పట్టి మూడ్రోజుల కిందటే పోయాడు ఆంటీ! ఆల్రెడీ కేన్సర్ పేషెంట్. ఈ తిరుగుడికీ దానికీ జాండీస్ వచ్చిందన్నారు.' అని వెళ్లిపోయిందా అమ్మాయి. పెద్దాయన సంచీని మాత్రం ఇక్కడే వదిలేసింది.
ఆ బ్యేగుని పారెయబుద్ధి కాలేదు నాకు. అటకమీద పెట్టేసాను. ఆ సంచీని చూసినప్పుడల్లా ఫొటోలు.. డబ్బే కాదు.. ఒక మంచిమనిషి మనస్తత్వం గుర్తుకొస్తుంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(విపుల- ఏప్రియల్- 2010 సంచికలో ప్రచురితం)






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...