Saturday, December 4, 2021

విభీషణుడి మొదటి పట్టాభిషేకం ( వాల్మీకం ప్రమాణంగా ) రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021 బోథెల్ ; యూ. ఎస్.ఎ

 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


విభీషణుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన) వెంటేసుకు వచ్చి  శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కున  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది.  యుద్ధ కాలం. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు.  సమీపంలో  ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి ఇక్కడ.  బుద్ధిమంతుల ముందు వ్యవహారాలు  విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం సంస్కృత భాషాసంప్రదాయం ). సుగ్రీవుడి మాట మిగతా కోతుల చెవిలో పడింది.  ఆవేశం ఆగదు . సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అని గెంతులేస్తారు . 


ఆ మాట విభీషణుడు  విన్నాడు.  ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చా' అని వివరంగా చెపుతాడు.  ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్ష్మణుడితో మాట్లాడుతూ  కూర్చోనున్న  రాముడికి వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణదోషాలు  నిర్ధారించుకునే నైజం .  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు.  రాక్షసులు నికృతిజ్ఞులు  ( కపటులు). వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు ముందు  వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్ధం ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి అడక్కుండానే సలహా ఇవ్వబోయాడు.  హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  సమర్థులు  సలహా ఇవ్వటమే  ఉత్తమం .   

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం' అన్న రాముని భరోసాతో 


  అంగదుడు ' నీకు తెలీనిదేముంది రామప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ అనుమానించడమేనాయ! ఈ రాజనీతికి మించింది  ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో కపిరాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెస్తే ?  మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడేమో  ఈ రాక్షసుడి రాక. ఎటూ చివరకు  తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రాదూ    ' అన్నాడు. 


అంగదుడు  అప్పుడు తన మనసులోని మాట బైటపెట్టాడు . 'శత్రువు అంటేనే  అనుమానించదగ్గవాడు.  గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమా .. కాదా అన్నది  గుణ దోషాలు విచారించుకున్న తరువాతే  ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు వంతు వచ్చింది.  శాస్త్ర దృష్టితో పరిశీలించినట్లు   ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వస్తే ..  వాడిని తప్పకుండా   అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. 


కేవలం శాస్త్ర దృష్టి చాలదు. తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవాలి ' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


'ఎదుటివాళ్లను  గురించి వేసుకునే అంచనాలో  జాతి, కులం, హోదాల్లాంటివి  కాదు..  మన సంస్కారం  ప్రధానం. రాజనీతో, ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్లనో  న్యాయ నిర్ణయానికి పూనుకోతగదు.  ముందసలు మన విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలని ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని కదా పెద్దల వాక్కు !  అయితే నేనిక్కడ  వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు సుగ్రీవా! ' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చాడు హనుమంతుడు . ఆనక 

 ' అర్థం.. అనర్థం అనే కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్య౦ ఎంతో ఎట్లా తెలిసేది ? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడం కూడా క్షేమం కాదనుకొండి ' అన్నాడు హనుమ. అంగదుడు, జాంబవంతుల మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. తన లంకా పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమని లెక్కలేసుకునే  నీ  దగ్గరకు వచ్చి ఉండవచ్చు . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయడమే ఉచితం అనిపిస్తుంది. ఇదీ నా మనసులో ఉన్నది  . ఆపైన నీ ఇష్టం రామా!  ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' అని పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. ఆ కృతజ్ఞత వల్ల  ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడేమో   - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ గ్రహించి వున్నాడు. ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం  అంటే . 


అంగద , సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు  పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్త హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచే ప్రశ్నే లేదు . వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సరే, సత్పురుషులు వాటిని పట్టించుకోరు . తనను చంపేందుకు వచ్చిన వాడి అరాచకాన్ని  పక్కనపెట్టి వేటగాడికి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం సర్వదా  శిరోధార్యం.  అందుచేత నేను విభీషణుడికి  అభయం  ఇవ్వకుండా వదిలి పెట్టను ' 


' సరేనయ్యా స్వామీ ! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదన్నావు  . కానీ అతగాడి  అవకాశవాదమన్నా పట్టించుకోవాలిగా ?  లంకాదహనం, పుత్రమరణం లాంటి ఉపద్రవాలు జరిగి మహా దుఃఖంలో  ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చాడే!  అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం మొదలుపెట్టాడు . అది విని  లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు రాముని వంక చూసి  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రమే మళ్లీ వల్లివేశాడు. ఆయన రాజనీతే ' ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గరయినా  చెయిచాచడని  . సుగ్రీవుడు రాజు కాబట్టి కాలాన్ని బట్టి ఆ అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ శంకలు  పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వారా  తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం  విభీషణుడికి ఉంటుందా.. లేదా?వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద ఆశ  ఉండదన్న భరోసాతోనే వాడు   సహాయం కోసం రామశరణు జొచ్చాడు. కాబట్టి విభీషణుడు అన్నిందాలా స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: ' అన్న మాట మార్చిపోతే ఎట్లా? 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. పెత్తనాల కోసం ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు కదా! విభాషణుడి వాలకంలో సోదర భీతి స్పష్టంగా కనిపిస్తోంది.  ఆ భయంతోనే వాడు  వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడంలో వచ్చి పడే ఉపద్రవమేంలేదు. అందరూ భరతుడి లాంటి  సోదరులే ఉంటారా? తండ్రి మరణానికి కారణమైన నాలాంటి  కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా సుగ్రీవా! రావణ విభీషణులు-  వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే . విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణుడు . 


సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించవయ్యా రామయ్యా!  . వచ్చింది శత్రువు  సోదరుడు. వాడి తీపి  మాటల వెనుక చేదు ఫలితం  ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లేకపోతే ఈ లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల మధ్య   సానుకూలమైన ఆలోచన తోచదు . అందుకే గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు రాముడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడయ్యా  ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా. అది నా పంతం  . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనయినా సరే  నా కొనగోటితో చంపేయగలను .. నీకు తెలుసో .. లేదో! ఒక పావురమే శరణాగత ధర్మాన్ని చక్కగా  పాటించగా లేనిది ..  నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  తన గురువు  గ్రహించి తనకు బోధించిన ఒక  గీతికను గుర్తు  చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని గదా శాస్త్రం! దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకుంటే మనకే ఆపద. అంజలి ఘటించక పోయినా సరే.. దీనంగా వేడుకున్నా అభయం ఇవ్వాల్సిందే ! ఆ రెండూ లేకపోయినా ఇంకోటి కూడా ఉంది. రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రువా?  కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువవడం చూడండి ! ఆలస్య మయినా సరే .. ఎలాగోలా కోరుకున్న ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు చూడండి! ఇవన్నీ నిజమైన ఆశ్రితుడి లక్షణాలు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి అంటుంది ధర్మశాస్త్రం. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. . మీకు తెలుసో.. లేదో! భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోలేని నిర్ణయంతోనో , కాముకత్వంతోనో, బాధ్యతారాహిత్యంతోనో , ప్రతిఫలం మీద ఆశతోనో  ఉండి సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడకపోవడం, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండా ఉండవలసిన తరుణంలో తప్పుకుపోవడమో   ప్రత్యవాయు హేతువు కిందకు వస్తుంది. పైపెచ్చు  అడిగినప్పుడు ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని  పైలోకంలో నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . దాహానికి మంచినీళ్లు దొరకవు . వాడి మొహం చూస్తే చాలు జనం అసహ్యించుకుంటారు.  ఇంతకంటే ప్రమాదం ఇంకోటుంది. నిరాశతో వెళ్లే ఆశ్రితాభిలాషి   వట్టిగా పోడు. అభయం తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోవడం కూడా   నష్టదాయకమే. ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో అభయదాత పట్ల ఉన్నట్లు ఊహించుకున్న   సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  కాబట్టి, ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి  . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉపదేశిత ఉత్తమ మార్గమే నాకు అనుసరణీయం. ఆ వచ్చినవాడు విభీషణుడే కానక్కర్లేదు , రావణాసురుడయినా సరే నిస్సంకోచంగా అభయమిస్తాను ' అన్నాడు  రాముడు . రాముడు అందుకే లోకానికి ఆదర్శప్రాయుడయింది. 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది రామా! కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి  బయలుదేరి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. )    నెమ్మదిగా దిగితే తాత్సారమవుతుందనో, రామ నిర్ణయం మారిపోతుందనో భయం. రాముడి  పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు విభీషణుడు. 


' ఆ అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి నేనే ప్రభూ! లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు  ఈ క్షణం నుంచే స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూశాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదురాముడు . మనసులో మాత్రం అభయం ఇచ్చాడు.  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . వానర ప్రముఖుల నమ్మకం కోసం కూడా. 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై అధికారం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కుబేరుడి సేనాపతి  మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరిస్తేమాత్ర౦ ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి అతగాడు  . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం పట్టుబడింది .  ఇక మహాపార్శ్వ , మహోదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగినప్పుడు సాక్షాత్ లోకపాలకులే .  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు తాగి తిని హాయిగా హరాయించుకోగలరు. ' 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చక్కగా  చెప్పావు విభీషణా! ప్రహస్తుడు, కుంభకర్ణులతో  సహా రావణుని వధించి మరీ  నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. నా ప్రతిజ్ఞ  కూడా  .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావు  నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను గాక చెయ్యను  .  


రాముడి లయకార  తీవ్ర పౌరుష వచనాలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు  నీకు సాయం చేస్తాను. ' అని తన వంతుగా మాట ఇచ్చాడు విభీషణుడు  . 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు' . దీన్నే వాల్మీకి ' సముద్రాజ్జలమానయ' అన్నాడు. 


'ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  తంతు దిగ్విజయంగా ముగిసినట్లయింది. 

( వాల్మీకం ప్రమాణంగా ) 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...