Showing posts with label Essays. Show all posts
Showing posts with label Essays. Show all posts

Tuesday, December 7, 2021

భాష - వ్యాసం అమ్మ భాష ' మమ్మీ ' పాలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం)

 



భాష - వ్యాసం 

అమ్మ భాష ' మమ్మీ ' పాలు! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


తొలిదశలో విద్యాబోధన మాతృభాషలోనే నిర్బంధంగా  జరగాలనే కర్ణాటక ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యల సేపథ్యంలో బోధనాభాషగా మాతృభాష పాత్ర ఏమిటనే చర్చ  ప్రారంభమయింది. 


మనరాష్ట్రంలో ప్రభుత్వమే ఆరో తరగతి నుంచి ఆంగ్లభాషను బోధనా మాధ్యమంగా ముందుకు తెచ్చినందువల్ల ఈ చర్చకు ఇక్కడ మరింత ప్రాధాన్యత  ఏర్పడింది. 


ఉనికి కోసం పోరాటం: 


కర్ణాటక ప్రభుత్వం 1994లోనే ఒకటినుంచి నాలుగు తరగతుల దాకా కన్నడ భాషను నిర్బంధంగా బోధించాలని ఆదేశాలిచ్చి అమలు జరుపుతోంది. ఇంగ్లీషు మాధ్యమంగా కొత్త పాఠశాలల్ని ప్రారంభించాలన్నా, ఉన్న పాఠశాలల్లోనే కొత్త తరగతులు తెరవాలన్నా ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. కర్ణాటక ఐక్య  పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుపై 2004లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో కర్ణాటక ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థాను తలుపు తట్టింది. ఈ దశలో  ఉన్నత న్యాయస్థానం తీర్పు అమలును నిలుపుదం  చేయటానికి నిరాకరిస్తూనే  జులై 21న ప్రాథమిక పాఠ శాలలో ఆంగ్ల విద్యాబోధన సాగకపోతే విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకైనా పనికిరాకుండా  పోతారని, అరవై నుంచి యాభైవేల రూపాయల దాకా ఫీజులు  చెల్లించి తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేయటానికి తల్లిదండ్రులే సిద్ధ పడుతుంటే ప్రభుత్వానికేమి ఇబ్బందని అర్థం వచ్చేలా సర్వో నత న్యాయస్థానం  కొన్ని వ్యాఖ్యలు చేసింది.


కేవలం 26 అక్షరాలు రెండున్నర లక్షల పద బంధా లున్న ఆంగ్ల భాషను శ్వేతజాతి నేతలు అప్పట్లో తమ సామ్రాజ్యం విస్తరించిన అన్ని చోట్లా స్థానిక భాషలమీద పెత్తనం చేయటానికి  వాడుకున్నారు. 


రాజాదరణ దొరికిన భాష రాణిస్తుంది. ' మనభాష, మన తిండి ఒంటబట్టిన మనిషి మరో చోటికి వెళ్ళలేడు . మనకే లొంగి ఉంటాడు' అనేది మెకాలే సిద్ధాంతం. దానిమీదే భరత ఖండంలోనూ  మిగతా బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ  ఆంగ్లభాషను స్థాని కులు తమకు దాసులయ్యే మేరకే వాడుకలోకి తెచ్చారు. ఆ క్రమంలో ఆంగ్లభాష అభివృద్ధి చెందుతూ స్థానిక భాషలు, వివిధ మాతృభాషలు మరుగునపడుతూ వచ్చాయి. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో తెలుగు దీనావస్థలో ఉండటం మాతృభాషాభిమానులందరికీ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాట  భాష ఆధారంగా పెద్ద ఉద్యమాలు వచ్చాయి. తమ భాషను ఉపయోగించుకుంటూనే శాస్త్రాలను, ఇతర అంశా లను పరిపుష్టం చేసుకునే విధానం అక్కడ కొనసాగుతోంది.  తమిళతనం ప్రజల భాషలో సజీవంగా ఉండే విధానాన్ని ఎంత ప్రపంచీకరణలోనూ వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. 


ఉత్తరాదిన హిందీ భాషోద్యమం కారణంగా ఆంగ్లం కన్నా హిందీలో మాట్లాడటం గౌరవంగా భావిస్తారు. ఆంగ్ల భాష జనజీవనంలోకి అవసరానికి మించి చొచ్చుకునివచ్చి చేస్తున్న హానిని గుర్తించిన రామ్మనోహర్ లోహియా లాంటి సోషలిస్టు వాదులు ఒక దశలో ' అంగ్రేజీ హటావో'  అనే ఉద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టిన చరిత్ర ఉంది. 


మనకు మన తెలుగు పనికిరాకుండా పోతోంది. అమెరికా లాంటి దేశాలకు వలస పోవటానికే ఈ ఆంధ్రదేశంలో పుట్టామని భావించే కుర్రతరం క్రమక్రమంగా అధిక మవుతోంది. ప్రపంచం మొత్తంమీద తెలుగు మాట్లాడేవాళ్లు 15 కోట్లమంది . చాలా యూరోపియన్ భాషల కన్నా మన భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ . ఒక్క భారతదేశంలోనే హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగు భాష . యాభై ఆరు అక్షరాలు, ఆరులక్షల పదబంధాలున్న మనభాష చేత ఇరవయ్యారు అక్షరాలున్న ఆంగ్లానికి ఊడిగం చేయించాలని ఉబలాట పడుతున్నాం. సొంత రాష్ట్రoలో ఉద్యోగం చేయటానిక్కూడా తెలుగు మనకు పనికి రాకుండా పొతున్న పరిస్థితి.


దాదాపు రెండు తరాల విద్యార్థుడు  తెలుగు భాష రాకుండానే .. తెలుగు భాషపై అవగాహన లేకుండానే విశ్వ  విద్యాలయాలనుంచి బైటికి వచ్చిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. 


ఇప్పుడు ఇళ్లల్లో తెలుగు అక్షరం కనిపించదు. తెలుగు పదం వినిపించదు . మరో రెండు తరాల పాటు ఈ నిర్లిప్తత ఇలాగే కొనసాగితే తెలుగు భాష ఏక మొత్తంగా ఉనికి లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందనే భాషాభిమానులు ఆవేదనలో అర్థం ఉంది .


మాతభాషను మించినది లేదు. ప్రజలకు  ప్రాణం పోసేది  తల్లిభాషే.  ప్రాథమికస్థాయి నుంచి  మాతృభాషలో  విద్యాభ్యాసం  చేసి అవసరాన్ని బట్టి పరభాషలను ఉపయోగించుకున్న వాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 


మనరాష్ట్రం నుంచి  ఐఐటి కి  ఎన్నికయిన  వారిలో ఎక్కువమంది పది వరకూ తెలుగులో విద్యాభ్యాసం చేసినవాళ్ళే.  బాల్యంనుంచే ఆంగ్లభాషను మప్పినంత మాత్రాన భవిష్యత్తులో ఆ భాష మీద పట్టు సాధించగలమన్న గ్యారంటీ మాత్రం ఏముం టుంది ? తెలుగులో చదువుకున్న వాళ్ళంతా నన్నయలూ, తిక్కనలూ అవుతున్నారా? నోబెల్ బహమతి గ్రహీతల్లో ఎక్కువ మంది ఇంగ్లీషు భాషలో రాసినవారు కాదు. ఆంగ్ల భాషతో పనిలేకుండానే చైనా, రష్యా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కదా! ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం  ఆంగ్లభాషల్లో కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ . ఇవన్నీ  ఆంగ్ల భాష మీద వ్యతిరేకతతో చెప్పే మాటలు కావు . తెలుగువాళ్ళకు అసలు ఇంగ్లీషు వద్దని చాదస్తంగా  చెప్పటానికి కాదు. ఏ భాషనైనా ఆవసరాన్ని  బట్టి తప్పక నేర్చుకోవాల్సిందే. అయితే ఒక దశ  వరకూ మాతృభాష  మాత్రమే  మాధ్యమంగా ఉండితీరాలని చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.


బహుశా ఈ శాస్త్రీయ దృక్పథంతోనే కర్ణాటక ప్రభుత్వం కన్నడం ప్రాథమిక స్థాయిలో తప్పని సరి  బోధనా భాషగాఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు . ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కనీసం తల్లి భాష/ స్థానిక భాషలలో ఏ ఒక్క దానిలో కూడా విద్యాబోధన అంటూ ఉండనవసరం  లేదని తాత్పర్యం చెప్పుకొనే విధంగా ఉండటమే ఆశ్చర్యకరం


ఆంగ్లంలోనే విజ్ఞానం యావత్తూ  ఉందనీ..  అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగాలకు అవసరమైన బిడ్డకు తల్లి  గర్భంలోనుంచే ఆంగ్లం నూరిపోయాలని  వాదించేవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇవాళా సాష్ట్  వేర్ రంగంలో ఉద్యోగాలా చేస్తూ , విమానాలలో  విదేశాలకు ఎగిరిపోయిన వాళ్లలో అధిక భాగం అనివార్యంగా ప్రాథమిక దశలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేసిఉంటారు. 


అప్పటి విద్యావిధానం అలాంటిదే మరి . సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తిన  రెండో అభ్యంతరం ఆర్థిక సంబంధమైనది. వేలు ఖర్చుపెట్టి తమ పిల్లల్ని ఆంగ్ల పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్న నేపధ్యంలో  ప్రభుత్వనికి ఎందుకు నొప్పి .. అని సుప్రీంకోర్టు వ్యాఖ్య! ఈ తరహా  పరిశీలన కార్పొరేట్ మార్కెట్ వర్గాల నుంచి కాకుండా నేరుగా సమున్నత న్యాయస్థానం నుంచే రావటం ఆందోళన కలిగించే విషయం.


ఈ వ్యాఖ్య ఏ మేరకు సమంజసమో తేలాలంటే దీని నేపథ్య౦ ముందు కొంత అర్థంచేసుకోవాలి . 


ప్రపంచీకరణ విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుంది. ప్రపంచంలోని యువతలో 54 శాతం మనదే శంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇంటర్మీడియెట్ స్థాయినీ కలుపుకొని దాదాపు ఆరుకోట్ల మంది విద్యార్థులుంటారు. ప్రపంచ విద్యావ్యాపారంలో

అతి పెద్ద మార్కెట్ మనవేశమే.. అని పసిగట్టిన అంతర్జా తీయ పెట్టుబడిదారీ వర్గాలు  ఇక్కడి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండటం గమనించింది.  విద్య వ్యాపారంగా సాగాలంటే ముందు ప్రభుత్వమనే అవరోధాన్ని  తప్పించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ త్రేడ్ ఇన్ సర్వీసెస్  (జి.ఎ.టి.ఎస్) చర్చల్లో విద్యను ఒక అంశంగా చేర్చటానికి  ఇదే కారణం. దీనికి మనదేశమూ అంగీకరించింది. 


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ బిల్లు చట్టమైతే విదేశీ డిగ్రీన్ని ఇక్కడ విరివిగా అమ్ముకోవచ్చు. అంత ర్థాలం (ఇంటర్నెట్) ద్వారా ఇక్కడ కళాశాలలు నడిపించవచ్చు.  ఉద్యోగాలకసలు విదేశీ పట్టాలే ప్రమాణంగా మారే ప్రమాదమూ ఉంది కోట్లు రాబట్టే  ఈ వ్యాపారంలో  ఇక్కడి పెట్టుబడిదారీ వర్గాలూ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నాయి . కాబట్టే   కేవలం ఆంగ్ల  మాధ్యమంలో మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని దశాబ్దం కిందటి నుంచి కొత్తవాదనను ప్రచారంలోకి తెచ్చాయి.


ప్రభుత్వం అంతటి నిర్లజ్జగా బైటికి  చెప్పలేదు .  కనుక ప్రజానుకూల సంక్షేమమనే తీసిని అద్ది నమా ఉదారవాద సిద్ధాంతానికి  తెరతీసింది. మాటలో ఎంత సంపూర్ణ అక్షరాస్యత, ప్రాథమిక విద్యలో ప్రాధాన్యత, ఉన్నత విద్య , విద్యాహక్కు అంటున్నా.. చేతల్లో మాత్రం దేశీయ విద్య విదేశీ శక్తుల హస్తగతనువుతూ పోవటాన్ని పరోక్షంగా ప్రోత్సహించే ధోరణిలోనే పథకాశాలు రచిస్తోంది. 

మాతృ భాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధనను విద్యాహక్కు చట్టం నుంచి  2006 లోనే  తొలగించి ప్రభుత్వం తన నిజస్వరూపం చాటుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందటే సక్సెస్ పాఠశా లల పేరుతో ఆంగ్ల మాధ్యమాన్ని సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో సహా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అరకొరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠ్య  ప్రణాళికను  ఆంగ్ల మాధ్యమంలో బోధించలేక పాఠాలను  తెలుగు లిపిలో రాయించి బోధిస్తున్నారని చెప్పుకొంటున్నారు. కొత్త మాధ్యమాన్ని  అందుకోలేని విద్యార్థులు తిరిగి తెలుగు మాధ్యమంలోకే వెళ్ళిపోవటమో .. అదీ కుదరని పక్షంలో  ఏకంగా చదువుకే నామం పెట్టేయటమో చేస్తున్నారన్నది నిష్ఠుర సత్యం. 


ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమ విధానం నుంచి పక్కకు తొలగితే సహజంగానే ఇలాంటి దుష్పరిణా మాలు జరుగుతాయనే- పొరుగునున్న తమిళనాడులో రెండు భాషలనూ సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాతృభాషలో బోధన అంటే ఏమిటో, అన్ని వర్గాల పిల్లలకు దీన్ని ఒక దశ వరకూ నిర్బంధం చేయటం ఏ విధంగా అవసరమో, ఆంగ్ల మాధ్యమం ఏ దశనుంచి ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో .. ఇత్యాది  ముఖ్యమైన విధానాలను  నిస్వార్ధంగా  నిజాయితీగా , నిదానంగా అన్ని వర్గాల వారికి నచ్చజెప్పటానికి ప్రభుత్వం పూనుకొనుంటే  అసలీ వివాదమే ఉత్పన్నమయ్యేది కాదు. 


ప్రాథమిక దశ తరువాత బోధనా మాధ్యమం ఐచ్ఛికంగా  ఉండాలి. ఎవరు ఏ మాధ్యమం కోరుకుంటే ఆ మాధ్యమాన్ని సమాన సౌక ర్యాలతో అందుబాటులో ఉంచటం  ప్రభుత్వాలు అనుసరిం చవలసిన  ఉత్తమ విధానం.  ధనార్జన కోసమే విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తలను  పరోక్షంగానైనా ఏ ప్రజా ప్రభుత్వమూ ప్రోత్సహించరాదు. 15 కోట్ల  మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నప్పటికీ  పరిపాలన అదే భాషలో సాగకపోవడానికి , పరాయితనం  మీద అవసరానికి మించిన మోజే  ప్రధాన కారణమని తెలుసుకున్నపపుడే  తెలుగు భాషకు మళ్ళీ మంచికాలం వచ్చినట్లు లెక్క. 


 మన ప్రజల డబ్బుతో చదువుకొని విదేశాలలో శాశ్వతంగా స్థిరపడిపోవటాన్ని గొప్పతనంగా కాక, సామాజిక ద్రోహంగా మనం చూడగలిగిననాడు  పరిస్థితుల్లో మార్పు క్రమంగానైనా వస్తుంది.


తొలి వెలుగు దీవం


మన కర్ణాటక వివాదం మీద వెలు వరించే మలితీస్సులో భాషా  ఆవశ్యకత ప్రాథమిక దశ వరకు ఎంత అవసరమో గుర్తించి తదనుగుణంగానే మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆశించటంలో తప్పులేదు గదా ! ఈ మధ్య పార్లమెంటు ఆమోదం పొందిన విద్యా హక్కు బిల్లు అందరికీ విద్యను అందించటం ఒక హక్కుగా పేర్కొంది. అట్టడుగు స్థాయివారూ విద్యను సక్ర మంగా అందుకునే పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వమే. అప్పుడే  బడుగు జీవికి సక్రమమైన విద్య మాత్న భాషలో  అందేది.  


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈూడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


Saturday, February 20, 2021

వచన కవిత- ఒక అలోచన - కర్లపాలెం హనుమంతరావు -సాహిత్య వ్యాసం

 


వచన కవిత్వం నేటి కవితాప్రక్రియ.  గణబద్ధమైన వృత్తాలు, మాత్రాబద్ధమైన గేయాల తదనంతర వికాసపరిణామం వచన కవిత.

ఈనాటి కవి తన భావాలను విస్తృతంగా జనసామన్యంలోకి తీసుకుని వెళ్ళే మార్గం వచన కవితా రూపమే. విషయం ప్రాచీన మైనదైనా సరే  సాంప్రదాయక ప్రక్రియల్లో(పద్యాలు వంటివి) చేబితే సామాన్యుడిదాకా చేరే అవకాశం తక్కువ ఈ కాలంలో.  ప్రాచుర్యమున్న పత్రికల్లో సైతం పౌరాణిక విశేషాలూ వచనకవితా రూపాల్లోనే కనిపించడానికి కారణం ఇదే.

 

వచన కవిత్వానికి ప్రాభవం ఎలా వచ్చింది? వట్టి చందోపరిణామ క్రమంగానే దీన్ని అర్థం చేసుకోవాలా? సాంఘిక, భౌతిక కారణాలూ తోడయ్యాయా? ప్రశ్నలను తరచి చూస్తే  వచనకవిత్వం మీద ఒక సదవగాహన ఏర్పడే అవకాశం ఉంది.

 

ఆంగ్లంలోని Free Verse.. ఫ్రెంచిలోని Verse Libre నుంచి ప్రభావితమైన ప్రక్రియగా తెలుగు వచనకవిత్వాన్ని భావించవచ్చు. చందోనియమ రహితంగా, సాంప్రదాయక శృంఖలాలను తెంచుకుని హృదయం ఎలా కంపిస్తే అలా వ్యక్తీకరించే సౌలభ్యాన్ని మనం వచనకవిత తత్వంగా చూడవచ్చు.ఈ ప్రక్రియలో  అక్షరగణబద్ధత, మాత్రాగణ బద్ధతలాంటి బంధాలు లేవు. భావాన్ననుసరించే పాదాలు, పదాలు. వృత్తాల కట్టడినుంచి స్వేచ్చకోరి గేయం పుట్టింది. గేయానికీ మాత్రా చందస్సు సంకెళ్ళు తప్పలేదు. వాటినుంచీ  విముక్తి కోరుకున్న కవికి వచనకవిత ఒక అందివచ్చిన అవకాశంగా కనిపిస్తుంది.  వాడుక భాష వ్యాకరణంలోనే ఒదుగుతూ ఒక రకమైన సహజ లయాసౌందర్యం(sequence musical phrase)తో సాగే రూపంగా వచన కవిత స్థిరపడింది. అత్యంత స్వేచ్చగా వ్యక్తీకరణ సాగాలనే తపన నుంచే వచన కవిత వికసించింది.  అనుభూతిని ఏ అలంకారాల తొడుగులు లేకుండా యధాతధంగా వ్యక్తీకరించాలని ఆధునిక కవుల దుగ్ధ. ప్రాచీన సంప్రదాయాలైన అలంకారాలూ, కవిసమయాలూ,కల్పనలూ కవి స్వేచ్చకు అడ్డొచ్చే ఏడువారాల నగలబరువని నవీనుల భావన. సహజసుందర శోభితంగా కవిత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలన్న ఆధునిక కవి ఆకాంక్ష "నా వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుములు విరగదంతాను…చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను"అన్నపఠాభి  ప్రకటనలో ప్రతిద్వనిస్తుంటుంది.  నవీనకవి కవిత్వ పంథా అంతా ఈ పునాదుల మీదే ప్రస్తుతం మరింత బలంగా ముందుకు సాగుతోంది .

 విశృంఖల స్వేచ్చా కాంక్ష బూర్జువా సంస్కృతి ఒక లక్షణం. ఉత్పత్తిశక్తుల ప్రాభవం పెరిగి స్వేచ్చా వ్యాపారం కోసం చేసే నిరంతర ప్రయత్నం- సమాజాన్నీ, కళలనీ, సంస్కృతీ సాహిత్యాలనీ సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావానికి లోనయ్యే వ్యక్తిగా బూర్జువాస్వేచ్చను కోరుకుంటాడు. కవిగా మునుపటి ఆంక్షలను సహించలేడు. ఈ పరిణామక్రమం నేపథ్యంలోనే కవిత్వం వచనరూపం సంతరించుకుంది. "The final movement towards 'free verse' reflects the final anarchic bourgeois attempt to abandon all social relations in a blind negation of them, because man has completely lost control of his social relationship" అనికదా అంటాడు కాడ్వెల్ Illusion and Reality లో.

  చందస్సులను, ఆలంకారిక మర్యాదలను మన్నించక పోయినావచనకవిత ఏక మొత్తంగా భాషా నియమాలనే కాలదన్నేటంత చొరవ చూపించటానికీ ఇష్టపడదు.  సహజసుందరమైన ఆలంకారికనియమాలమీది మోజును వదిలించుకోవడం మౌలికంగా సౌందర్యప్రియుడైన కవికి అంత సులభమైన పని కాదు. వచన కవిత్వం అంటేనే 'contradiction in terms' అని కదా అంటాడు శ్రీశ్రీ! వచనం మీరితే కవిత్వం పల్చబడుతుంది.స్థాయి దాటితే కవిత్వం  వచనం చేయి దాటిపోతుంది. free verse అన్న పదాన్నే ఏకమొత్తంగా ఇలియట్ తప్పుబట్టింది ఇందుకే.

నియమరహితంగా ఉండాలనే కోరిక తప్పించి రూపరహితంగా, శబ్దమాధుర్య రహితంగా ఉండాలని వచనకవీ కోరుకోవడం లేదు.బూర్జువా సమాజంలో ఉండే వైరుధ్యాలని  వచన కవితా ప్రతిబింబిస్తుంది.  సాంఘిక పరిణామ లక్షణాలకు  వైయక్తికంగా ఎదురీదడం ఎంత శక్తివంతుడికీ సాధ్యమయే పని కాదు.

సాంఘిక పురోగమనంలో భాగంగా విలసిల్లే సంస్కృతిలో ఆర్థిక సాంఘిక కారణాల మిశ్రమ ప్రభావంతో కొన్ని కొన్ని సాహిత్య, కళాప్రక్రియలు ఆధిపత్యం వహించడం చారిత్రక సత్యం. ప్రజాసామాన్యం అభిరుచులకన్నా అధికంగా కళాకారుల వ్యక్తిగత ప్రతిభావ్యుత్పత్తులు  కళారూపాల ఆధిపత్యాన్ని ప్రభావితం చేయలేవు. విశ్వనాథ వారు అన్నేళ్ళు శ్రమించి రామాయణ కల్పవృక్షం రాసినానాడు ప్రాచుర్యంలో ఉన్న నవలా ప్రక్రియ వల్లే జనసామాన్యంలో గుర్తింపు సాధించారని గమనించాలి.   శ్రీశ్రీని యుగకర్తగా చేసింది ఆ మహాకవి కాలానికనుగుణమైన కవిత్వపంథాను అభ్యుదయపంథాలో ముందుకు తీసుకువెళ్ళడం వల్లే.

సాంప్రదాయక కవితారీతులలో ఎన్ని గొప్ప విశేషాలున్నా

సమకాలీన సాంఘికావసరాలను సంపూర్ణంగా సంతృప్తి పరచలేవు.ఆ ప్రక్రియల్లో అత్యంత ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించినా ప్రజాబాహుళ్యానికి అవి చేరవు. తన సృజన వీలయినంతమందికి చేరాలనుకుంటాడు కళాకారుడు. ఈ కారణాలవల్లే ఈనాటి కవికి  తప్పక అనుసరించాల్సిన మార్గం వచన కవితాప్రక్రియ ఐకూర్చుంది.

  వచనకవితలో కుడా ఎన్నో గుణాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. కె.శ్రీనివాస్  అనుసరించే మార్గం కుందుర్తివారి శైలినుంచీ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినది. అఫ్సర్ తాజాగా వాడుతున్న వ్యక్తీకరణలు  తనే ఒకనాడు వాడినవాటినుంచీ అభివృద్ధి పరిచినవి. ఒకనాడు పద్యం రాసిన వాళ్ళందరూ ప్రతిభావంతులు కానట్లే.. ఇప్పుడు వచనకవిత రాస్తున్నవాళ్ళందరూ ఆకవిత్వరహస్యాన్ని వంటబట్టించుకున్నారని చెప్పలేం. ఏ నిబంధనలూ లేని వచనకవిత్వం రాయడం బహుసులువు అని చాలామంది భ్రమ. నిజానికి వచనకవితలో కవిత్వాన్ని పండించి మెప్పించడమే కత్తిమీద సాము. బ్రేకులు, ఏక్సిలేటరు ఉన్న బండిని నడపడం కన్నా అవేవీ లేని వాహనాన్ని అదుపుచేయడం కష్టం. చందస్సునీ, అలంకారాలనీ, శబ్దలయనీ, కల్పనా చాతుర్యాన్నీ ఆశ్రయించుకున్న సాంప్రదాయక ప్రక్రియల్లో  కవిత్వం తెరమరుగునే దోబూచులాడుతుంటుంది కనక పెద్ద ఇబ్బంది లేదు.  కేవలం కవిత్వమే కొట్టొచ్చినట్లు కనిపించి తీరాల్సిన వచనకవితల్లో కవిత్వం ప్రవహించక పొతే కవి ఎడారితనం బైటపడిపొతుంది.  వచనకవితారచన నూలుపోగుమీది నడక. ఏ మాత్రం తూలినా వట్టి వచనమయి పొతుంది.ఏ మాత్రం పొంగినా కృతకమైపోతుంది. వచనానికీ, కవిత్వానికీ మధ్య  ఉండే అతిపల్చని గీతమీదే కవితాత్మను చివరివరకూ నడిపిండానికి కవి చేయాల్సిన రసకసరత్తు సామాన్యమైనది కాదు.

వచనం కచ్చితమైన అర్థాలను ప్రతిపాదించేది.కవిత్వం అస్పష్టమైన భావోద్వేగాల  అనుభూతి వాహిక. పరస్పర విరుద్ధమైన రెండుదినుసులను సమపాళ్ళలో మేళవించి రుచికరమైన కవితాపానీయం తయారుచేసే రసవిద్య- కేవలం పాండిత్యప్రకాండత్వం  ఉన్నంతమాత్రాన పట్టుబడేది కాదు. వట్టి సంగీత జ్ఞానమే  గాయకుడి రాణింపు కానట్లే కేవల భాషాధిపత్యం వచనకవిగా మలచలేదు. వచన కవిత రాయడానికి కూర్చున్న కవికి ఎక్కడ ఎంత మోతాదులొ వచనానికి  కవిత్వం తొడగాలో అర్థమవాలి. సౌందర్యవంతమైన విగ్రహానికి చేసే ఆకర్షణీయమైన అలంకరణే వచనకవిత్వరచన చేసి మెప్పించడం.  ఒకరు నేర్పిస్తే వంటబట్టేది  కాకపోవచ్చు కాని..సాధన మీద సాధించదగిన రసవిద్యే ఇది. విస్తృతాధ్యయనం, పరిశీలన, అనుభవం అవగాహను సానబట్టే సాధనాలు. 

  వచనంలో ఉండే వాక్య విన్యాస సౌలభ్యాన్ని కవిత్వావిష్కరణకు మలుచుకునే విద్య  సాధనద్వారా సాధించవచ్చు. అవ్యవహారిక పదబంధాలు,కృతక ప్రయోగాలు, తెచ్చిపెట్టుకున్న లయ ప్రయాసలు కవితాత్మను దెబ్బతీస్తాయి.

వచనం ప్రాచీన సాహిత్యంలో కూడా లేకపోలేదు.  పోతనామాత్య్డుడు  భాగవతం గజేంద్రమోక్షం ఘట్టంలో వనసౌందర్యవర్ణనకు వాడింది వచనమే.కానీ కాడ్ వెల్ భాషలో చెప్పాలంటే అదంతా ఒక heightened form of language. ఇవాళ  కవిత్వంగా మనం నిర్వచించుకునే  వచనంఆత్మను ప్రబంధపద్యాల మధ్య అతుకుగావచ్చే వచనంఆత్మతో సరిపోల్చలేము.

-కర్లపాలెం హనుమంతరావు

24 -11 -2012

Friday, February 12, 2021

సారస్వతం ఓ మహాసముద్రం రచన : కర్లపాలెం హనుమంతరావు -

 


సారస్వతం ఒక మహా సముద్రం. అట్టడుగుదాకా వెళ్ళి  మంచిముత్యాలనేరి తెచ్చేవాడొకడు.  పై పైని ఈదులాటలతో తృప్తిచెందే వాడింకొకడు.  ఉప్పునొదిలేసి మంచినీటిని ఆవిరిరూపంలో గ్రహించి మొయిళ్ళద్వారా లోకానికి చల్లని వాన చినుకులు పంచే సూర్యకిరణంలాంటి ఘనుడు  మూడోవాడు. సాహిత్యంలోని విశేషార్థాన్ని స్వయంగా ఆకళించుకుని ప్రపంచానికి ప్రచుర పరిచే అతగాడే ఉత్తముడు.

 

సారస్వతం మహాసముద్రం అనాది ప్రసిద్ధం. అనంత శోభావిలసితం. కవిగణాలు నదీనదాల్లాగా విచ్చలవిడిగా దానికి పోషణ కల్పిస్తుంటారు. తత్సాంగత్య,  సాన్నిహిత్యాలతో తామూ పునీతు లవుతుంటారు. మహాసముద్రాన్నుంచి  ఉపసముద్రాలు బయలుదేరి  ప్రత్యేక నామాలతో శాఖో పశాఖలుగా ఎలా వర్థిల్లుతున్నాయో.. సారస్వతంనుంచి ఆంధ్రసారస్వతమని, సంస్కృత సారస్వతమని, ఆంగ్లసారస్వతమని విభేదాలు అలాగే వర్ధిల్లుతున్నాయి.

 

విపులమైన అనుభవం, విచిత్రమైన రసజ్ఞత, విమల భావనాశక్తి, విశేషమైన ఆశయోన్నతి, రహస్యస్ఫురణ మనిషి ప్రత్యేక లక్షణాలు.  అన్నిటికి మించి పలుకుబడి వల్ల కదా తతిమ్మా జంతుసంతుపైన అంతులేని ఆధిక్యత!  అనుభవానికి ఉద్రేకం, రసానికి ఉద్దీపన, భావానికి చైతన్యం, సంభవించినప్పుడు తన పలుకుబడితో తత్సమ్మేళనానికిగాని,   తరువాతి కాలంలో తదానందస్ఫురణకిగాని ఓ   బాహ్యప్రకటన కల్పించే ప్రయత్నంలో ఉప్పతిల్లేదే సారస్వతం.

 

అనుభవోద్రేకం పంచేంద్రియ సబంధి. చుట్టూతాగల  జడ అజడ రూపాత్మకమైన ప్రపంచంలో మనుష్యులు  అన్యోన్య సుప్రతిష్ఠులయ్యేదీ దీని వల్లే. సంకల్పం వల్ల  ప్రబలేది ఈ అనుభవం. ఈ అనుభవం నిసర్గమని, విరుద్ధమని రెండు రకాలు. నిసర్గానుభవం లోకికం. విరుధ్ధానుభవం అలౌకికం. మనుచరిత్ర నుంచే ఉదాహరణలివ్వవచ్చు రెండింటికి. ప్రవరాఖ్యుడి హిమాలయ సందర్శనం, అచ్చో రమ్యకాంతారవీధిన నారీదర్శనాదులన్నీ నిసర్గానుభవాలు. అకలంకౌషధ సత్త్వం, మరున్నారీరత్నం స్వాహావధూవల్లభుని సన్నిహితత్వంల్లాంటివన్నీ విరుద్ధానుభవాలకు ఉదాహరణలు.

 

రసోద్దీపనమూ హృదయసంబంధే. సామరస్యం దీని అంతిమ ఫలం. ఉత్కంఠవల్ల ఇది ఉత్ప్రేరితం. సభ్య, అసభ్యాలని రెండు రకాలు. పింగళి సూరనార్యుని ప్రభావతీప్రద్యుమ్నం లోని "కలకల నవ్వినట్ల తెలిగన్నుల నిక్కరు చూచినట్ల తో/బలుక గడంగినట్ల కడు భావగభీరత అబ్బినట్ల పెం/పొలయ రచించి జీవకళ యుట్టిపడన్ శివ వ్రాసినట్టి యా/చెలువున శాభిముఖ్యము భజింప దలంకెను దాను బోటియున్" లాంటి కమ్మని రసాలూరు పద్యం సభ్యరసానికి ఉదాహరణ.

ఆ కవిదే కళాపూర్ణోదయంలోని సీస పద్యం అసభ్యరసానికి ఉదాహరణ.

"బెరుకెరుగని గాఢ పరిరంభమున నల్లి/బిల్లి గొంచు బెనంగు పెనకువలను/బెరిగెడి పేరాస పేర్మి ననర్గళ/లీల బర్వెడు కుచాస్ఫాలనముల/నడ్డమాకలు లేక  యబ్బినయ ట్లెల్ల/నమరించు నఖర రేఖాంకములను/గొదగొన్న లొదగొన్న తమి గొంకు కొసరు లే కొనరించు/ వివిధ దంతక్షత విభ్రమములు/మన్మథావేశవిలసనమహిమ నెఱపు/తపసి గని సాదు రేగిన దల పొలాన/నిలువ దను మాట నిజమయ్యె నే డటంచు/మగువ నవ్వుచు జేతకు మాఱు నేనె" దృశ్యరసం అసభ్యం.

భావోదయం మానసికం. ఐకమత్యం దాని అంతిమఫలం. ఉద్బోధాప్రేరితం. పాఠ్యం, స్మర్యం అని రెండు విధాలు. చదివేటప్పుడు మాత్రమే మేల్కొని ఉండేది పాఠ్యం. మనసును విడిచిపెట్టకుండా మళ్లీమళ్ళీ స్మృతిలోకki వస్తుండేది స్మర్యం. "మాయమ్మా నను నీవే/రాయలవై కావ రావరావే జేజే/మాయాతుమ లానినయది/పాయక సంతోష మున్నఫల మిల సామీ" పాఠ్యరసానికి ఉధాహరణ అయితే "కొందల మందె డెందము శకుంతల తా నిపు డేగు నం చయో!/క్రందుగ బాష్పరోధమున గంఠమునుం జెడె బుద్ధిమాంద్యమున్/బొందె; నొకింత తపోనిధులే యిటు గుంద, నెంతగా/గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!" లోని భావం ప్రపంచహృదయ సంస్తవనీయమై స్మృతిగొల్పుతున్నది. ఇదీ స్మర్యం. మొదటిది కళాపుర్ణోదయనుంచి.. రెండోది అభిజ్ఞాన శాకుంతలం నుంచి.

 

ఆశయోద్ధరణం సంశయాత్మక సంబంధమైనది. సాఫల్యం దీని అంతిమ ఫలం.లౌకికం, ప్రాకృతం, పారమార్హికం- అని మూడు రకాలు. పోతనామాత్యుని భాగవతంనుంచే మూడింటికి ఉదాహరణలు ఇవ్వవచ్చు. "ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో/విని కృష్ణుం డది తప్పుగా దలచెనో విచ్చేసెనో యీశ్వరుం/డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్/నను రక్షింప నెఱుగునో నెఱుగదో నా భాగ్య మెట్లున్నదో?"- లౌకికం.

'ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రీ రేలా బిలంబింప గా/రం డో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడీ/దండన్ లేగలు నీరు ద్రావి యిరుపొంతన్ బచ్చిక ల్మేయుచున్/దండంబై విహరించు చుండగ నమందప్రీతి బోనేతమే"- ఆశయం ప్రాకృతం. కనక ప్రాకృతరసానికి ఉదాహరణ. "కల డందురు దీనుల యెడ/గల డందురు పరమయోగిగణముల్ పాలన్/గల డందు రన్ని దిశలను/గలడు కలం డనెడువాడు కలడో లేడో?"- ఈ పద్యంలోని ఆశయం పారమార్హికం.

 

పలుకుబడి భాషాసంబంధమైనది. అర్థజ్ఞత అంతిమ ఫలం. కృషి ప్రబలితం. స్వతస్సిద్ధం,   అనుశ్రుతం అని రెండు రకాలు. చిలవలు పలవలుగా విస్తరించేది అనుశ్రుతం. ఆ లక్షణం లేకపోతే స్వతస్సిధ్ధం. నందితిమ్మన పారిజాతాపహరణం ప్రథమాశ్వాసం స్వతస్సిధ్ధమైన పలుకుబడికి తార్కాణం. "కనకపంజర కారికలకు జక్కెర వెట్టి/చదివింప రెలొకో సరియ లిపుడు?కరతాళముల మందిరమయూరంబుల/నాడింప లేరకో యతివ లిపుడు?/క్రోవ్వాడిగోళ్ళదంత్రులు మీటి  వీణియ/లవలికింప రేలకో భా లిపుడు?/ఇన్ని దినముల వలె నుండదేమి నేడు/ చిన్న వోయిన దీ మేడ చెన్ను దఱిగి/పద్మముఖితోడ నెవ్వరే బారిజాత/పుశ్పవృత్తాంత మెఱిగింప బోలునొక్కొ?"

శృంగారనైషధంనుండిఅనుశ్రుత రసానికి ఉదాహరణ "జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన/రతిమన్మథుల విండ్లు రమణి బొమలు/కాంతినిర్ఝర మీదు కామయౌవనముల/ కుంభప్లవము లింతి కుచయుగంబు/నడు మింత యని కేల దొడికి పట్టిన ధాత/యంగుళిరేఖ లబ్జాస్యవళులు/యువమనో మృగ రాజి దవిలింప దీర్చిన/మదనవాగుర లిందువదన కురులు/వాల్య తారుణ్య సీమావిభాగమునకు/నజుడు వ్రాసిన రేఖ తన్వంగియారు/భానువరమున బడాసిన పంకజముల/యపరజన్మంబు పూబోది యడుగు లధిప."

స్థాయీస్ఫురణ తన్మాత్ర సంబంధమైనది. తన్మయత్వం అంతిమ ఫలం. అవ్యక్తస్థాయిలో ఆనందం, వ్యక్తిస్థాయిలో విజ్ఞానం లాభాలు. అవ్యక్తస్థాయీసంబంధాలలో నాలుగు రకాల ఆనంద స్ఫురణలు. సౌందర్య వికారాలు, సంయోగ వియోగాలు, విచార సంతోషాలు, విషాద వినోదాలు. వ్యక్తిస్థాయీ సంబంధమైన విజ్ఞానస్ఫురణలూ నాలుగు రకాలు. నిర్దేశం, నియుక్తం, నిరూఢం, నిబద్ధం.

'జగన్మోహినీవేషం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పే సౌందర్యం. బాహుకరూపం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వికారం. అశోకవృక్షం కింద సోకించే సీతావియోగం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వియోగం. మాయరంభ, మాయనలకూబరుల సంయోగమ వ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పు సంయోగం. వ్రేపల్లెలొ శ్రీకృష్ణుడు గోపబాలకులతో గడిపిన ఘట్టాలు అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ గొల్పే వినోదాలు. అజ్ఞానవాసంలో పాండవుల ఇడుములు అవ్యక్తస్థాయి అనందస్ఫురణ విషాదానికి ఉదాహరణ. వ్యక్తిస్థాయిని నిర్దేశించేవి ప్రకృతిశాస్త్రాలు, నిరూఢాలు, నియుక్తాలు,  సంగీత శాస్త్రాదులు. వేమన పద్యాల్లాంటివి నిరూఢాలు. వేదాంతాదులులు నిబద్దాలు.

సారస్వతంలో అనుభవం రూపంలాంటిది. రసం కళవంటిది. భావం జీవాత్మ. ఆశయం పరమాత్మ. పలుకబడి జీవం. స్థాయీస్ఫురణం జీవపదార్థం. సారస్వత విభేదాలు రెండు రకాలు. సాధ్య సారస్వతం. సిద్ధ సారస్వతం. అనుభవ రస భావ ఆశయాలలో ఒకటి రెండు కొరవడి.. పలుకుబడి సాయంతో వ్యక్తిస్థాయికి విజ్ఞానస్ఫురణ  కలిగించేది సిద్ధ సారస్వతం. మనం సర్వసాధారణంగా సారస్వతం అనేది ఇలాంటి సిద్ధ సారస్వతాన్నే.

కేవలం అనుభవాన్ని మాత్రమే బోధించే ప్రకృతి శాస్త్రాలు, కేవలం రసాన్ని మాత్రమే బోధించే సంగీతాది శాస్త్రాలు, కేవలం బావ బోధకాలైన నీతిశాస్త్రాలు, మతగ్రంథాలు, రసాన్ని, ఆశయాన్ని మాత్రమే బోధించే భజన కీర్తనాదులు సాధ్య సారస్వతాలు.

అనుభవ రస భావ ఆశయాలు  నాలుగు సమ్మిశ్రితమై వాటి వాటి ప్రాముఖ్యాన్ని బట్టి ఉచితానుచితాలను వహించే ప్రబంధాలు, శతకాలు, నాటకాలు, నవలలు కొన్ని సిద్ధ సారస్వతాల కిందకే వస్తాయి.

చివరగా ఓ విన్నపం!

సాహిత్యాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేస్తేనే గానీ సాహిత్య సృజన సాధ్యం కాదని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. సాహిత్యాన్ని లోతుగా పరిశీలన చేయవలసిన విశ్లేషకులకు ఓ చిరు కరదీపికగానైనా  ఉపయోగ పడాలనే సదుద్దేశంతో చేసిన సమాచార సేకరణ ప్రయత్నంగా అర్థం చేసుకోమని మనవి. మాన్యులు కీర్తి శేషులు కవికొండల వెంకటరావువంటి వారినుంచి పొందిన ప్రేరణగా ఈ ప్రయత్నాన్ని చూడమని వినయపూర్వకమైన వినతి*

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

14 -02 -2021

 

 

కవిత్వం-కవుల బడాయి - రామకృష్ణ కవులు - రచన ః కర్లపాలెం హనుమంతరావు

 


వినాయకచవిత పండుగ పూట పూజాదికాలైన పిదప సాయంకాలం ఇష్టులైన వారి ఇళ్ళమీదకు పిల్లలు చిన్న చిన్న రాళ్ళు, బెడ్డలు విసిరి పెద్దలచేత షష్టాష్టకాలు పెట్టించుకోవడం హిందువుల సంస్కృతిలో ఓ ఆచారం. ఆ పండుగ పూట   పెద్దలు వడ్డించే  తిట్లు పిన్నలకు   దీవెనలతో సమానమని ఓ నమ్మకం. శతావధాన పండితులు రామకృష్ణ కవులు బహుశా ఇలాంటి ఏదో విశ్వాసంతోనే  నన్నయాదులవంటి అఖండ ప్రజ్ఞావంతులందరిని ఒక వరసలో తిట్టి పోసారు. 1918నాటి ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలోని ముచ్చట ఇదిసరదాగా ఏరిన అందులోని కొన్ని పద్యాలు ఇవి.  పూర్వకవులమీద తనకుండే అపారమైన  భక్తిశ్రద్ధలను  రామకృష్ణకవులే స్వయంగా ప్రకటించుకున్నారు కనక ఇక  పేచీ లేదు.

కేవలం  సరదాగా మాత్రమే తీసుకోమని సహృదయ సాహిత్యాభిమానులకు మనవి.

 

ఆంధ్ర లోకోపకారము నాచరింప/

భారతమ్మును నన్నయభట్టు తెలుగు/

జేయుచున్నాడు సరియె; బడాయి గాక/

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుఁడి!

 

గురుకులక్లిష్టుడయి విద్య గఱవబోక/

సహజపాండిత్యుడ నటంచు సంబరపడు/

పోతనామాత్యు నే రాజు పూజ సేయు?/

దేవరల దయ్యములను గీర్తింప కేమీ?

 

ఆంధ్ర కవిచక్రవర్తుల కందఱకును/

నీ పలుకు చాలు మేలుబంతి యగుగాక!/

తెలుగు సేతయె కా? స్వతంత్రించి నీవు/

చేసినది యేది? శ్రీనాథ! చెప్పుకోగ.

 

తన మాట తనకె తెలియక/

చని యొక సాలీని వాక్యసందర్భంబున్/

విని యర్థ మెఱింగిన తి/

క్కన పాండిత్యంబె వేఱ యడుగగ నేలా!

 

మన యెర్రన హరివంశము/

దెనిగించినవాడు మంచిదే నాచన సో/

మన యుత్తరహరివంశము/

గనుడీ! యది యెంత చక్కగా నున్నదియో!

 

మధ్యవళ్లు పెట్టి మంజరిద్విపద బ/

ల్నాటి వీరచరిత నా బెనచితి/

వది స్వతంత్రకావ్య మని యేరు మెచ్చుకొ/

నంగవలెనొ? కమలనాభ పౌత్ర!

 

ప్రాలుమాలికచే దాళపత్ర పుస్త/

కాటవుల నర్థపుందెరువాట్లు గొట్టి/

కొఱతబడు నని కుకవిని కొసరి తిట్టి/

పెద్దన యొనర్చినట్టి తప్పిదము నదియె.

 

కృష్ణరాయడు చేసిన విష్ణుచిత్త/

కావ్యమందలి భావము శ్రావ్యమె యగు;/

నెన్ని మార్లు పఠించిన నెఱుకపడని/

వట్టి పాషాణపాక మెవ్వండు సదువు?

 

కవనధోరణి కల్పనాగౌరవంబు/

శబ్దసౌష్ఠవమును లెస్స సంబరంబె;/

బోగపుబడంతులా కళాపూర్ణ కథకు/

నెత్తిన ప్రధాననాయిక? లెంత తప్పు!

 

తగని గర్వంబు జేసి తన్ను దానె/

పొగడుకొనువాడటంచు జెప్పుదురుగాక,/

నాలి పలుకులు రావు తెనాలిరామ/

కృష్హ్ణకవి నోట బంగారు గిలకదీట.

 

కవులందరికీ కలిపి చేసిన  వడ్డనలుః

 

ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప/

నెల్లవారలకు గలలె తెల్లవార్లు/

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని/

పేరుకొన నేమిటికి నట్టి బీద కవుల?

 

దేవతాప్రార్థనంబును దేశనగర/

రాజవర్ణనములు కథారచన యంత/

త్రొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/

కవనముం  జెప్పదిగిన ప్రజ్ఞానిధులకు.

 

ఈ కాలం కవులకూ ఆశీర్వచనాలు తప్పలేదుః

 

గాసటబీసట వేలుపు/

బాసం బఠియించి యాంధ్రభాషాగ్రంథా/

భ్యాసము లేకయె తెలుగుల/

జేసెద మనుచుండ్రు బుధులు సిగ్గెఱుగరొకో?

 

పూర్వకవి రాజులకు నిది భూషణంబొ/

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు;/

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి/

గలుగువారలు లేరు జగమ్మునందు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

ఫిబ్రవరి, 9 2013


 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sunday, August 30, 2020

రక్తదానం- కర్లపాలెం హనుమంతరావు-




తారతమ్యాలు లేకుండా దానం ఇవ్వగలిగింది రక్తం. ఆ దానానికి మనుషులందరిని మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్. 14 వ తేదీని రక్తదాన దినోత్సవంగా నిర్దేశిస్తే, ఆ విధంగా రక్తం ఉదారంగా దానం చేసే కర్ణులను గుర్తించి గౌరవించేందుకు 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్' అనే అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య స్థాపించబడింది. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే దాతలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమాజంలో రక్తదాన స్ఫూర్తిని మరింత పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది.
రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉంది. అయినప్పటికీ ఒక పరిమిత కాలం వరకు దానిని నిలువచేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందింది. ఆ తరువాతనే 'బ్లడ్ బ్యాంకులు' స్థాపన అభివృద్ధి చెందింది. బ్యాకులు దేశ దేశ ఆర్థికరంగ పరిపుష్టికి ఎంత అవసరమో, బ్లడ్ బ్యాంకులు దేశ ఆరోగ్య రంగ పరిపుష్టికి అంతే అవసరం. కొన్ని కొన్ని ప్రదేశాలలో, రహదారుల వెంట ప్రమాదాలు తరచూ జరిగే అవకాశాలు కద్దు. ఆ తరహా ప్రాంతాలను గుర్తించి ఆ దారి పొడుగూతా రక్త బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచితం. అందుకోసమైన ప్రజలలో రక్తాన్ని ఉచితంగా దానం చేసే అలవాటు అభివృద్ధి చెందవవలసిన అవసరం ఉంది.
శరీరం ఉత్పత్తి చేసే రక్తాన్ని గురించి చాలా మందికి సరి అయిన అవగాహన ఉండదు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒంట్లోని రక్తాన్ని తోడేయడంగా భావించరాదు. ఎంత రక్తం బైటికి పోతుందో అంతే మోతాదులో రక్తం కొత్తగా శరీరం ఉత్పత్తి  చేస్తుంది. కొత్త రక్తం వంటికి పట్టిన తరువాత మనిషిలోని పూర్వపు మందగొడితనం కొంత తగ్గి,  నూతనోత్సాహం అనుభవంలోకి వస్తుంది కూడా.  వంటి రక్తంలోని చిన్నిపాటి కొవ్వు, మాంస కృత్తుల అసమతౌల్యత  దానికదే సర్దుకుని రక్తదాత ఆరోగ్యంలో మెరుగుదల శాతం పెరుగుతుంది కూడా
అట్లాగని అందరి శరీరాలు రక్తదానానికి అనువుకావు. 17 - 18 సంవత్సరాల వయసు దాటిన వారి దగ్గర నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. దీర్ఘరోగ పీడితులు, పసిపిల్లలు, పెద్ద వయస్సువారు, మెన్సుయేషన దశ దాటిన స్త్రీల వంటి వారి రక్తం దానానికి స్వీకరించడం శ్రేయస్కరం కాదని ఆరోగ్యశాస్త్రం హితవుచెబుతోంది.
రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. దాత ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అర్హుడు అని నిర్ధారణ అయితే స్వచ్ఛంద దాతగా పేరు నమోదు చేసుకుంటారు. అవసరమైన సందర్భంలో రక్తదానం చెయ్యడానికి పిలుపు వస్తుంది. రాకపోయినా ఏ పుట్టినరోజు వంటి సందర్భాన్ని మనమే  కల్పించుకుని రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయనూవచ్చు. తమ అభిమాన సినీకథానాయకుడు జన్మదినోత్సవమనో, తమ రాజకీయ అధినేత పిలువు ఇచ్చాడనో సామూహికంగా రక్తదానం చేసే సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. స్వఛ్ఛదంగా రక్తం దానం చెయ్యడం కూడా ఒక రకమైన సామాజిక సేవా కార్యక్రమం కిందే లెక్క
రక్తదాతల కరవు వల్ల రక్తాన్ని అమ్ముకునే దురాచారం ఒక వృత్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది
 'రక్తం ప్రాణులను కాపాడుతుంది. ఆ రక్తదానం నాతో మొదలవుతుంది. స్వచ్ఛమైన రక్తం అందిస్తాను' అన్న నినాదంతో తొలి రక్తదాన దినోత్సవం ప్రారంభమయింది. ఆ నినాదాలు మానవజాతిని శాశ్వతంగా నిలబెట్టే విలువైన నినాదాలు. 'మోర్ బ్లడ్.. మోర్ లైఫ్' లాంటి నినాదాలు ఒక్కో ఏడు ఒక్కొక్కటి తీసుకుని  రక్తదాన దినోత్సవాలు సంరంభంగా జరపడం రివాజుగా వస్తోంది 2004 నుండిమొదటి రక్తదాన దినోత్సవం దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ నగరం నుంచి నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచమంతటా ఈ రక్తదాన దినోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
రక్తానికి ఉన్న విలువను గుర్తించడం ముఖ్యం. అయినవారు ఆపదలో ఉన్నప్పుడు, బంధువులు రోగికి సరిపడా రక్తం కోసం వెదుకులాడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు రక్తం విలువ మనకు అర్థమవుతుంది. రైలు, రోడ్డు ప్రమాదాలు వంటివి పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో రకరకాల రక్తం అవసరమవుతుంది. రక్తం ముందే సేకరించి భద్రపరిచి ఉంచిన సందర్భాలలో అధిక మోతాదులో జరగబోయే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. స్త్రీల ప్రసవాల సందర్భంలోనూ, కేన్సర్ వంటి రోగులకు.. దీర్ఘకాలిక రోగాల నుంచి కోలుకునేవారికి చికిత్సలు అందించే సందర్భంలోనూ రక్తం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
మనిషి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధితుడిని కాపాడే దేవుడు వైద్యుడు అయితే, ఆ దేవుడికైనా సమయానికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన సాధనాలలో రోగికి సరిపడే  రక్తం చాలినంత ఒకటి. సరయిన గ్రూపు రక్తం, సరిపడా సమయానికి  దొరికినప్పుడే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం.  అంత గొప్ప విలువైన సాధనం ప్రతి మనిషి వంట్లోనూ నిరంతరం రక్తం రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని పరిమితులకు లోబడి దానం చేసినందువల్ల నష్టం ఏమీ ఉండకపోగా లాభాలే అదనం. ఆ విశేషం ప్రతీ వ్యక్తీ గుర్తించాలి. ఆ విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలుగాని, ఆరోగ్య సంఘాలు గాని స్వచ్ఛంద అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలి.  
రక్తదానంతో మరో ప్రాణి జీవితాన్ని కాపాడవచ్చన్న సత్యం ఆరోగ్యశాస్త్రం పసిగట్టినప్పటి నుంచి రక్తదానానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. రక్తంలోని కణాల నిర్మాణం గ్రూపుల ద్వారా నిర్దారించబడుతుంది. ఓ పాజిటివ్ గ్రూప్ గల మనుషులు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటారు. రక్తానికి సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య శాస్త్రం 'హెమటాలజీ' రక్తానికి ఉన్న భిన్నమైన గ్రూపులు, ఆర్ హెచ్ లక్షణం గుర్తించి, వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోనికి రక్తాన్ని ఎక్కించే సాంకేతిక ప్ర్రరిజ్ఞానాన్ని మరింత  అభివృధ్ధి పరిచింది, అప్పటి నుంచే 'రక్తదానం' ఆలోచన ఒక ముఖ్యమైన ఆదర్శ సామాజిక అంశంగా రూపుదిద్దుకొన్నది. దానిని మరింత ప్రచారంలో పెట్టడం అంటే పరోక్షంగా అయినా మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లే లెక్క. మన శరీరంలో పారే ఒక్కక్క రక్తపు చుక్క మన ఒక్కళ్లకే కాదు.. అవసరమైనప్పుడు లక్షలాది మంది ఇతరుల ప్రాణాలను రక్షించే క్రతువులో సమిధ కింద కూడా సమర్పించవచ్చు. ఈ దిశగా ఒక సదాలోచన ప్రతీ వ్యక్తిలో కలిగించడం, స్వయంగా స్వచ్ఛందంగా ఆ తరహా రక్త దానం చెయ్యడం= రెండూ మనిషిగా పుట్టినందుకు మానవజాతికి ఇతోధికంగా మనం చేసుకునే ఉత్తమ సేవాకార్యక్రమాలే!
-కర్లపాలెం హనుమంతరావు
(జూన్. 14 వ తేదీ రక్తదాన దినోత్సవం)
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...