Tuesday, December 7, 2021

భాష - వ్యాసం అమ్మ భాష ' మమ్మీ ' పాలు! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం)

 



భాష - వ్యాసం 

అమ్మ భాష ' మమ్మీ ' పాలు! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు  సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


తొలిదశలో విద్యాబోధన మాతృభాషలోనే నిర్బంధంగా  జరగాలనే కర్ణాటక ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యల సేపథ్యంలో బోధనాభాషగా మాతృభాష పాత్ర ఏమిటనే చర్చ  ప్రారంభమయింది. 


మనరాష్ట్రంలో ప్రభుత్వమే ఆరో తరగతి నుంచి ఆంగ్లభాషను బోధనా మాధ్యమంగా ముందుకు తెచ్చినందువల్ల ఈ చర్చకు ఇక్కడ మరింత ప్రాధాన్యత  ఏర్పడింది. 


ఉనికి కోసం పోరాటం: 


కర్ణాటక ప్రభుత్వం 1994లోనే ఒకటినుంచి నాలుగు తరగతుల దాకా కన్నడ భాషను నిర్బంధంగా బోధించాలని ఆదేశాలిచ్చి అమలు జరుపుతోంది. ఇంగ్లీషు మాధ్యమంగా కొత్త పాఠశాలల్ని ప్రారంభించాలన్నా, ఉన్న పాఠశాలల్లోనే కొత్త తరగతులు తెరవాలన్నా ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. కర్ణాటక ఐక్య  పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వ ఉత్తర్వుపై 2004లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో కర్ణాటక ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థాను తలుపు తట్టింది. ఈ దశలో  ఉన్నత న్యాయస్థానం తీర్పు అమలును నిలుపుదం  చేయటానికి నిరాకరిస్తూనే  జులై 21న ప్రాథమిక పాఠ శాలలో ఆంగ్ల విద్యాబోధన సాగకపోతే విద్యార్థులు గుమస్తా ఉద్యోగాలకైనా పనికిరాకుండా  పోతారని, అరవై నుంచి యాభైవేల రూపాయల దాకా ఫీజులు  చెల్లించి తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో వేయటానికి తల్లిదండ్రులే సిద్ధ పడుతుంటే ప్రభుత్వానికేమి ఇబ్బందని అర్థం వచ్చేలా సర్వో నత న్యాయస్థానం  కొన్ని వ్యాఖ్యలు చేసింది.


కేవలం 26 అక్షరాలు రెండున్నర లక్షల పద బంధా లున్న ఆంగ్ల భాషను శ్వేతజాతి నేతలు అప్పట్లో తమ సామ్రాజ్యం విస్తరించిన అన్ని చోట్లా స్థానిక భాషలమీద పెత్తనం చేయటానికి  వాడుకున్నారు. 


రాజాదరణ దొరికిన భాష రాణిస్తుంది. ' మనభాష, మన తిండి ఒంటబట్టిన మనిషి మరో చోటికి వెళ్ళలేడు . మనకే లొంగి ఉంటాడు' అనేది మెకాలే సిద్ధాంతం. దానిమీదే భరత ఖండంలోనూ  మిగతా బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ  ఆంగ్లభాషను స్థాని కులు తమకు దాసులయ్యే మేరకే వాడుకలోకి తెచ్చారు. ఆ క్రమంలో ఆంగ్లభాష అభివృద్ధి చెందుతూ స్థానిక భాషలు, వివిధ మాతృభాషలు మరుగునపడుతూ వచ్చాయి. 


ప్రస్తుతం మన రాష్ట్రంలో తెలుగు దీనావస్థలో ఉండటం మాతృభాషాభిమానులందరికీ ఆందోళన కలిగిస్తోంది. తమిళనాట  భాష ఆధారంగా పెద్ద ఉద్యమాలు వచ్చాయి. తమ భాషను ఉపయోగించుకుంటూనే శాస్త్రాలను, ఇతర అంశా లను పరిపుష్టం చేసుకునే విధానం అక్కడ కొనసాగుతోంది.  తమిళతనం ప్రజల భాషలో సజీవంగా ఉండే విధానాన్ని ఎంత ప్రపంచీకరణలోనూ వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరు. 


ఉత్తరాదిన హిందీ భాషోద్యమం కారణంగా ఆంగ్లం కన్నా హిందీలో మాట్లాడటం గౌరవంగా భావిస్తారు. ఆంగ్ల భాష జనజీవనంలోకి అవసరానికి మించి చొచ్చుకునివచ్చి చేస్తున్న హానిని గుర్తించిన రామ్మనోహర్ లోహియా లాంటి సోషలిస్టు వాదులు ఒక దశలో ' అంగ్రేజీ హటావో'  అనే ఉద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టిన చరిత్ర ఉంది. 


మనకు మన తెలుగు పనికిరాకుండా పోతోంది. అమెరికా లాంటి దేశాలకు వలస పోవటానికే ఈ ఆంధ్రదేశంలో పుట్టామని భావించే కుర్రతరం క్రమక్రమంగా అధిక మవుతోంది. ప్రపంచం మొత్తంమీద తెలుగు మాట్లాడేవాళ్లు 15 కోట్లమంది . చాలా యూరోపియన్ భాషల కన్నా మన భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ . ఒక్క భారతదేశంలోనే హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడేది తెలుగు భాష . యాభై ఆరు అక్షరాలు, ఆరులక్షల పదబంధాలున్న మనభాష చేత ఇరవయ్యారు అక్షరాలున్న ఆంగ్లానికి ఊడిగం చేయించాలని ఉబలాట పడుతున్నాం. సొంత రాష్ట్రoలో ఉద్యోగం చేయటానిక్కూడా తెలుగు మనకు పనికి రాకుండా పొతున్న పరిస్థితి.


దాదాపు రెండు తరాల విద్యార్థుడు  తెలుగు భాష రాకుండానే .. తెలుగు భాషపై అవగాహన లేకుండానే విశ్వ  విద్యాలయాలనుంచి బైటికి వచ్చిన వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. 


ఇప్పుడు ఇళ్లల్లో తెలుగు అక్షరం కనిపించదు. తెలుగు పదం వినిపించదు . మరో రెండు తరాల పాటు ఈ నిర్లిప్తత ఇలాగే కొనసాగితే తెలుగు భాష ఏక మొత్తంగా ఉనికి లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందనే భాషాభిమానులు ఆవేదనలో అర్థం ఉంది .


మాతభాషను మించినది లేదు. ప్రజలకు  ప్రాణం పోసేది  తల్లిభాషే.  ప్రాథమికస్థాయి నుంచి  మాతృభాషలో  విద్యాభ్యాసం  చేసి అవసరాన్ని బట్టి పరభాషలను ఉపయోగించుకున్న వాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 


మనరాష్ట్రం నుంచి  ఐఐటి కి  ఎన్నికయిన  వారిలో ఎక్కువమంది పది వరకూ తెలుగులో విద్యాభ్యాసం చేసినవాళ్ళే.  బాల్యంనుంచే ఆంగ్లభాషను మప్పినంత మాత్రాన భవిష్యత్తులో ఆ భాష మీద పట్టు సాధించగలమన్న గ్యారంటీ మాత్రం ఏముం టుంది ? తెలుగులో చదువుకున్న వాళ్ళంతా నన్నయలూ, తిక్కనలూ అవుతున్నారా? నోబెల్ బహమతి గ్రహీతల్లో ఎక్కువ మంది ఇంగ్లీషు భాషలో రాసినవారు కాదు. ఆంగ్ల భాషతో పనిలేకుండానే చైనా, రష్యా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కదా! ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం  ఆంగ్లభాషల్లో కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ . ఇవన్నీ  ఆంగ్ల భాష మీద వ్యతిరేకతతో చెప్పే మాటలు కావు . తెలుగువాళ్ళకు అసలు ఇంగ్లీషు వద్దని చాదస్తంగా  చెప్పటానికి కాదు. ఏ భాషనైనా ఆవసరాన్ని  బట్టి తప్పక నేర్చుకోవాల్సిందే. అయితే ఒక దశ  వరకూ మాతృభాష  మాత్రమే  మాధ్యమంగా ఉండితీరాలని చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.


బహుశా ఈ శాస్త్రీయ దృక్పథంతోనే కర్ణాటక ప్రభుత్వం కన్నడం ప్రాథమిక స్థాయిలో తప్పని సరి  బోధనా భాషగాఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు . ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కనీసం తల్లి భాష/ స్థానిక భాషలలో ఏ ఒక్క దానిలో కూడా విద్యాబోధన అంటూ ఉండనవసరం  లేదని తాత్పర్యం చెప్పుకొనే విధంగా ఉండటమే ఆశ్చర్యకరం


ఆంగ్లంలోనే విజ్ఞానం యావత్తూ  ఉందనీ..  అంతర్జాతీయ స్థాయిలో విద్యా ఉద్యోగాలకు అవసరమైన బిడ్డకు తల్లి  గర్భంలోనుంచే ఆంగ్లం నూరిపోయాలని  వాదించేవారికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇవాళా సాష్ట్  వేర్ రంగంలో ఉద్యోగాలా చేస్తూ , విమానాలలో  విదేశాలకు ఎగిరిపోయిన వాళ్లలో అధిక భాగం అనివార్యంగా ప్రాథమిక దశలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేసిఉంటారు. 


అప్పటి విద్యావిధానం అలాంటిదే మరి . సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తిన  రెండో అభ్యంతరం ఆర్థిక సంబంధమైనది. వేలు ఖర్చుపెట్టి తమ పిల్లల్ని ఆంగ్ల పాఠశాలల్లో చేర్పించటానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్న నేపధ్యంలో  ప్రభుత్వనికి ఎందుకు నొప్పి .. అని సుప్రీంకోర్టు వ్యాఖ్య! ఈ తరహా  పరిశీలన కార్పొరేట్ మార్కెట్ వర్గాల నుంచి కాకుండా నేరుగా సమున్నత న్యాయస్థానం నుంచే రావటం ఆందోళన కలిగించే విషయం.


ఈ వ్యాఖ్య ఏ మేరకు సమంజసమో తేలాలంటే దీని నేపథ్య౦ ముందు కొంత అర్థంచేసుకోవాలి . 


ప్రపంచీకరణ విద్యను వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తుంది. ప్రపంచంలోని యువతలో 54 శాతం మనదే శంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇంటర్మీడియెట్ స్థాయినీ కలుపుకొని దాదాపు ఆరుకోట్ల మంది విద్యార్థులుంటారు. ప్రపంచ విద్యావ్యాపారంలో

అతి పెద్ద మార్కెట్ మనవేశమే.. అని పసిగట్టిన అంతర్జా తీయ పెట్టుబడిదారీ వర్గాలు  ఇక్కడి విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండటం గమనించింది.  విద్య వ్యాపారంగా సాగాలంటే ముందు ప్రభుత్వమనే అవరోధాన్ని  తప్పించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ జనరల్ అగ్రిమెంట్ ఆన్ త్రేడ్ ఇన్ సర్వీసెస్  (జి.ఎ.టి.ఎస్) చర్చల్లో విద్యను ఒక అంశంగా చేర్చటానికి  ఇదే కారణం. దీనికి మనదేశమూ అంగీకరించింది. 


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఈ బిల్లు చట్టమైతే విదేశీ డిగ్రీన్ని ఇక్కడ విరివిగా అమ్ముకోవచ్చు. అంత ర్థాలం (ఇంటర్నెట్) ద్వారా ఇక్కడ కళాశాలలు నడిపించవచ్చు.  ఉద్యోగాలకసలు విదేశీ పట్టాలే ప్రమాణంగా మారే ప్రమాదమూ ఉంది కోట్లు రాబట్టే  ఈ వ్యాపారంలో  ఇక్కడి పెట్టుబడిదారీ వర్గాలూ చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతున్నాయి . కాబట్టే   కేవలం ఆంగ్ల  మాధ్యమంలో మాత్రమే ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని దశాబ్దం కిందటి నుంచి కొత్తవాదనను ప్రచారంలోకి తెచ్చాయి.


ప్రభుత్వం అంతటి నిర్లజ్జగా బైటికి  చెప్పలేదు .  కనుక ప్రజానుకూల సంక్షేమమనే తీసిని అద్ది నమా ఉదారవాద సిద్ధాంతానికి  తెరతీసింది. మాటలో ఎంత సంపూర్ణ అక్షరాస్యత, ప్రాథమిక విద్యలో ప్రాధాన్యత, ఉన్నత విద్య , విద్యాహక్కు అంటున్నా.. చేతల్లో మాత్రం దేశీయ విద్య విదేశీ శక్తుల హస్తగతనువుతూ పోవటాన్ని పరోక్షంగా ప్రోత్సహించే ధోరణిలోనే పథకాశాలు రచిస్తోంది. 

మాతృ భాషలో విద్యాబోధన జరగాలన్న నిబంధనను విద్యాహక్కు చట్టం నుంచి  2006 లోనే  తొలగించి ప్రభుత్వం తన నిజస్వరూపం చాటుకుంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కిందటే సక్సెస్ పాఠశా లల పేరుతో ఆంగ్ల మాధ్యమాన్ని సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో సహా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అరకొరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త పాఠ్య  ప్రణాళికను  ఆంగ్ల మాధ్యమంలో బోధించలేక పాఠాలను  తెలుగు లిపిలో రాయించి బోధిస్తున్నారని చెప్పుకొంటున్నారు. కొత్త మాధ్యమాన్ని  అందుకోలేని విద్యార్థులు తిరిగి తెలుగు మాధ్యమంలోకే వెళ్ళిపోవటమో .. అదీ కుదరని పక్షంలో  ఏకంగా చదువుకే నామం పెట్టేయటమో చేస్తున్నారన్నది నిష్ఠుర సత్యం. 


ప్రాథమిక స్థాయిలో మాతృభాష మాధ్యమ విధానం నుంచి పక్కకు తొలగితే సహజంగానే ఇలాంటి దుష్పరిణా మాలు జరుగుతాయనే- పొరుగునున్న తమిళనాడులో రెండు భాషలనూ సమన్వయం చేసుకుంటూ విద్యాబోధన విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాతృభాషలో బోధన అంటే ఏమిటో, అన్ని వర్గాల పిల్లలకు దీన్ని ఒక దశ వరకూ నిర్బంధం చేయటం ఏ విధంగా అవసరమో, ఆంగ్ల మాధ్యమం ఏ దశనుంచి ప్రారంభిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో .. ఇత్యాది  ముఖ్యమైన విధానాలను  నిస్వార్ధంగా  నిజాయితీగా , నిదానంగా అన్ని వర్గాల వారికి నచ్చజెప్పటానికి ప్రభుత్వం పూనుకొనుంటే  అసలీ వివాదమే ఉత్పన్నమయ్యేది కాదు. 


ప్రాథమిక దశ తరువాత బోధనా మాధ్యమం ఐచ్ఛికంగా  ఉండాలి. ఎవరు ఏ మాధ్యమం కోరుకుంటే ఆ మాధ్యమాన్ని సమాన సౌక ర్యాలతో అందుబాటులో ఉంచటం  ప్రభుత్వాలు అనుసరిం చవలసిన  ఉత్తమ విధానం.  ధనార్జన కోసమే విద్యాసంస్థలు నడిపే వ్యాపారవేత్తలను  పరోక్షంగానైనా ఏ ప్రజా ప్రభుత్వమూ ప్రోత్సహించరాదు. 15 కోట్ల  మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నప్పటికీ  పరిపాలన అదే భాషలో సాగకపోవడానికి , పరాయితనం  మీద అవసరానికి మించిన మోజే  ప్రధాన కారణమని తెలుసుకున్నపపుడే  తెలుగు భాషకు మళ్ళీ మంచికాలం వచ్చినట్లు లెక్క. 


 మన ప్రజల డబ్బుతో చదువుకొని విదేశాలలో శాశ్వతంగా స్థిరపడిపోవటాన్ని గొప్పతనంగా కాక, సామాజిక ద్రోహంగా మనం చూడగలిగిననాడు  పరిస్థితుల్లో మార్పు క్రమంగానైనా వస్తుంది.


తొలి వెలుగు దీవం


మన కర్ణాటక వివాదం మీద వెలు వరించే మలితీస్సులో భాషా  ఆవశ్యకత ప్రాథమిక దశ వరకు ఎంత అవసరమో గుర్తించి తదనుగుణంగానే మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆశించటంలో తప్పులేదు గదా ! ఈ మధ్య పార్లమెంటు ఆమోదం పొందిన విద్యా హక్కు బిల్లు అందరికీ విద్యను అందించటం ఒక హక్కుగా పేర్కొంది. అట్టడుగు స్థాయివారూ విద్యను సక్ర మంగా అందుకునే పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వమే. అప్పుడే  బడుగు జీవికి సక్రమమైన విద్య మాత్న భాషలో  అందేది.  


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈూడు సంపాదకీయ పుట - వ్యాసం - 16 -08 - 2009 ప్రచురితం) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...