Showing posts with label Philosophy. Show all posts
Showing posts with label Philosophy. Show all posts

Sunday, December 15, 2019

తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు -కీర్తి ప్రతిష్ఠలు -కర్లపాలెం హనుమంతరావు




తోకచుక్కలు తృటికాలం మెరిసి కనుమరుగవుతాయి. గ్రహాల వెలుగు దూరాలు, దగ్గరల మీద ఆధారపడుంటుంది. నక్షత్రాల కాంతి నిరంతరాయం. దవ్వులతో నిమిత్తం లేని చిరంజీవి నక్షత్రం. స్థూలంగా సాహిత్య వినీలాకాశంలో మెరుపులీనే కవులనూ ఈ తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలతో పోల్చుకోవచ్చు. అసమాన ప్రతిభగల వాళ్లను నక్షత్రాలతో పోల్చడం ఉచితం. సామాన్య జనాలకు వీళ్ల ప్రతిభా పాటవాలు బేరీజు వేసేటంత సామర్థ్యం ఉండదు. సమకాలీన రచయితలు వృత్తిఅసూయల కారణంగా వారి కీర్తి ప్రతిష్టలకు అడ్డు.  అన్నిటికీ మించి అత్యంత ప్రతిభావంతులను అనామకులుగానే మిగిల్చే అతి ముఖ్య కారణం.. పూవై పరిమళాలు వెదజల్లక ముందే ఆ మొగ్గలను తుంచేయడం.  సమకాలికుల రహస్య ఆయుధం ఇదే! సాటి రాచయితలు ఎవ్వరూ తమకన్నా ఎక్కువగా కీర్తి ప్రతిష్ఠలు పొందడం గిట్టని ఈర్ష్యాపరులు వీళ్లు. ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఇష్టపడరాదు. తాము అనుకున్న భావాజాలమే తమకు అనుకూలమైన వర్గ ప్రయోజనాలకు తాము ఆమోదించిన మోతాదులో ప్రతిభను ఉపయోగించే వాళ్లనే వీళ్లు ప్రతిబావంతులైన  రచయితలుగా అంగీకరించేది. వాళ్ల దురష్టం కొద్ది ఎన్ని అవాంతరాలు సృష్టించినా కొంతమంది ప్రతిభావంతులు తాము అదుపుచేయలేనంత నైపుణ్యంతో ఊహించనంత కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. జీనియస్ ల పట్ల సెకండ్ రేట్ సమకాలికుల అకృత్యాలు ఈనాటివి కాదు.
ఎదుటివారి ఆధిక్యాన్ని మరుగుపరచడం రెండు పద్ధతుల్లో సాధ్యం. అంతకన్నా ఎక్కువ ప్రతిభను ప్రదర్శించేందుకు కృషిచేయడం. కష్టంతో కూడిన ఈ పని కన్నా అసలు ఎదుటివాడి ప్రతిభనే గుర్తించకపోవడం సులభం. చేవ తక్కువ అసూయాపరులు అందుకే ఎక్కువగా రెండో పద్ధతిలో పోతుండేది. స్వీయ సంస్కరణ కన్నా రంధ్రాన్వేషణ సులభమైన పని కూడా. కోకిల, కాకి ఒకే పక్షి జాతి. పంచమ స్వరంతో  లోకాన్ని పరవశింపచేస్తుందని కోకిలకు కీర్తి. అది సహించలేని కాకులు గుంపుగా చేరి గోలగోలగా కూయడంలా ఉంటుంది అసూయపరుల అవాకులు, చవాకులు. స్పానిష్ తత్వవేత్త  జాల్త్ జార్ చెప్పుకొచ్చిన ప్రతిభ, అసూయల మధ్యనుండే అంతరం అన్నివేళలా అన్ని స్థలాలా  దర్శనిమిచ్చేదే! ప్రతిభలేమితో బాధపడే ఆత్మన్యూనత నుంచి మనసును ఉపశమింపచేసే బ్రహ్మాస్త్రం అసూయాద్వేషాలు. ద్వేషం దాచి అసూయతో చేసే వెటకారాలు ప్రతిభావంతుల కీర్తిని మరింత పెంచుతాయి.  'ప్రతిభ లేని సందర్భంలో వినయం భూషణంగా భాసిస్తుంది' అంటాడు లిక్టెన్ బర్గ్.  అట్లా అని అతివినయం చేటు తెస్తుంది.  గోతె  'దొంగవెధవలే అతివినయం నటిస్తారు' అంటూ కుండబద్దలు కొట్టేసాడు మరి. సెర్ర్వాంటస్ కూడా తన 'జర్నీ అప్ పర్నాసస్' లో కవులను అతివినయం ధూర్తుల జాబితాలో కలిపేస్తుంది' అని చేసిన  హెచ్చరిక మర్చిపోరానిది. 'నా రాతలు కాలానికి ఎదురీతలు' అని షేక్స్పియర్ లా అతిశయాలు పోవాలంటే షేక్స్పియర్ అంతటి ప్రతిభ ఉందో లేదో బేరీజు వేసుకోవాలి ముందు. చెత్తను మాత్రమే  ఆకాశానికి ఎత్తేసే కువిమర్శకులు అసూయతో చేసే వ్యాఖ్యలు ఒక రకంగా  ప్రతిభ గల రచయితలకు ప్లస్సే! అరచేయి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్లే కుళ్లుబోతుతనంతో చేసే వ్యాఖ్యానాలు సత్తా గల సద్గ్రంథాలను సహృదయలోకం నుంచి ఆట్టే కాలం దూరంపెట్టలేవు. పనిగట్టుకుని చెత్తను ప్రోత్సహించినా కాలం గడిచే కొద్దీ ఆ కళ వెలాబోవడం ఖాయం.   కాల పరీక్షకు కూడా తట్టుకునే ప్రతిభ తటాలున కళ్లెదుట తలెత్తుకు నిలబడినప్పుడు కుళ్లుమోతులకు మతిపోతుంది ముందు. మాటా పడిపోతుందేమో కూడా!  ఆ మౌన ముద్రా ప్రమాదకరమే. సెనాకా హెచ్చరించినట్లు 'కాటేసే వాటం కోసం కాలనాగులు ఆలోచించే సమయం కూడా కావచ్చును. సాహిత్యం పరిభాషలో ఈ మౌనం పేరే 'విస్మరించడం'. అసూయాపరులతో   ఎన్నేసి  ఇడుములు పడ్డాడో కానీ పాపం..  'విదేశాల నుంచి విడుదలయితే తప్ప  స్వదేశీయుల దృష్టి మంచి పుస్తకం మీద పడదు' అని వాపోతాడు మహా తత్వవేత్త గోతె.
మనం చేసే పనే మరొకడూ చేస్తున్నప్పుడు.. మనల్ని వదిలి ఆ మరొకడిని పొగడ్డం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్లు. ప్రతిభ పరంగా రెండు పనుల్లో ఉండే తేడాను గుర్తించనీయకుండా మన మనసును శాంతింపచేసేది అసూయ. సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా మానవుల్లో సహజంగా ఉండే నైజమే అయినా కళాజగత్తుని ఈ ఈర్ష్యాద్వేషాలు మరంత ఎక్కువ పాళ్లల్లో ప్రభావితం చేయడమే ఆశ్చర్యం.
ఎన్నో అడ్డంకులని అధిగమించి ఎవరికైనా చిరస్థాయి కీర్తి లభించింది అంటే ఆ ప్రతిభ ఎంతటి ఉన్నతమైనదో అర్థంచేసుకోవాలి.
పరస్పర డబ్బా బృందాల వ్యవహారాలను పక్కన పెట్టి మరంత లోతుగా తరచి చూద్దాం. గొప్ప పని స్వయంగా చేయడంలో ఉన్న తృప్తి ఎదుటివారి గొప్ప పనిని గుర్తించి మనస్ఫూర్తిగా శ్లాఘించడంలో కూడా లభిస్తుంది.  నిజాయితీగా ఒకరిని పొగడడం.. మనల్ని మనం కించపర్చుకోవడం కిందకు రాదు. గ్రీక్ కవి హోమర్ సమకాలీనుడు హీసియడ్ మాటల్లో చెప్పాలంటే 'కొందరికి ప్రతిభ స్వయంగా పసిగట్టే ప్రజ్ఞ ఉంటుంది, మరి కొందరికి విజ్ఞులు విడమరిచి చెబితే అర్థమవుతుంది. చాలామంది స్వయంగా తెలుసుకోనూలేరు. ఎవరు చెప్పినా వినిపించుకొనే సహనమూ ఉండదు.' అందుకే మాకియవెల్లి భావించినట్లు లోకంలో జీవించి ఉన్న కాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు గడించే అవకాశం అరుదు. హీసియడ్ క్లాసిఫికేషన్ లోని రెండో తరగతికి చెందిన సమాజంలో జీవింఛడం కూడా ఒక అదృష్టమే! దొరికిన గుర్తింపు చిరస్థాయిగా నిలబడేదీ ఈ రెండో తరగతి జిజ్ఞాసుల కారణంగానే.
ఒకసారి గుర్తింపు పొందిన పనిని, వ్యక్తిని గురించి తిరిగి తిరిగి పొగిడేందుకు ఎవరూ సంకోచించరు.. సరి కదా, కాలం గడిచే కొద్దీ ప్ర్రశంసలకు పోటీ పడతారు. పదిమంది గుర్తింపు సాధించిన పనిని తామూ పొగడకపోతే తతిమ్మా బృందం కన్నా వెనుకపడతామేమోనన్న హిపోక్రసీ వీరి నోటి నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జెనోఫోన్ సూక్తి ప్రకార్రం 'జ్ఞానం ఎక్కడ ఉందో గుర్తించడం కూడా జ్ఞానం కిందే లెక్క. స్వయంగా  ప్రతిభ ప్రదర్శించలేని లోపాన్ని ప్రతిభ ప్రదర్శించిన వారిని శ్లాఘించడం ద్వారా అయినా పూరించుకోవాలన్న సామాన్యులకు ఉండే యావ కీర్తి ప్రతిష్ఠల కొనసాగింపుకు ప్రధాన కారణం. అందరూ అందరు ప్రతిభావంతులను పొగడడం అసాధ్యం.  ఏ తరగతికి చెందిన రచయితలకు ఆ తరగతికి చెందిన వందిమాగదులు. ఆ పొగడ్తరాయుళ్ల మధ్య పోటీ కూడా కద్దు. ఎథీనియన్ రాజకీయ పండితుడు ఫోసియస్  అనర్గళంగా ప్ర్రసంగించగల సామర్థ్యం గల వక్త. ఒకానొక సభలో ఆయన ఉపన్యాసం ఉధృతంగా సాగే వేళ  నిశ్శబ్దంగా ఉన్న హాలులో ముందుగా ఒక మూల నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. కొంత విరామం తరువాత ఒకరికొకరుగా ఆ తమాషాను అందిపుచ్చుకొని  సభాప్రాంగణం దద్దరిల్లేలా చప్పట్లను మారుమోగిస్తుంటే.. అర నిమిషం తరువాత ఆ హంగామానంతా అణగనిచ్చి అణుకువగా 'మరీ అంత మూర్ఖంగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి' అంటూ చేతులు జోడించాడుట. అనుకరణతో కొనసాగే ప్రశంసల వల్ల అసలైన కీర్తి ప్రతిష్ఠలేమాత్రం అబ్బవు. చిరకాలం మనగలిగే కీర్తి క్రమంగా, నిదానంగా పరిపక్వత సాధిస్తుంది. సమకాలికుల సమర్థన ఒక్కటే చాలదు . తరువాతి తరాల  గుర్తింపును కూడా సాధించి నిలుపుకోవడానికి చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించాలి. సమకాలికుల అసూయాద్వేషాలకు తట్టుకుని శతాబ్దాల పాటు ప్రాజ్ఞులుగా మన్ననపొందేది కోటికి ఒక్కరు. కొద్దిపాటి తెలివితేటలతోనే కీర్తి ప్రతిష్ఠలు మూటగట్టుకునేవాళ్లే ఎక్కువ. తమ జీవితకాలంలోనే మంచు తునకలా కరిగిపేయే పేరు ప్రఖ్యాతులు ఈ తాత్కాలిక వస్తు జాబితాలోకే వస్తాయి. యవ్వనంలో ఓ వెలుగు వెలిగి వయసు వాటారే దశలో పేరు మసకబారే ప్రముఖులు అశేషంగా కనిపిస్తారు. అందుకు విరుద్ధంగా జీవించివున్న కాలంలో ఆట్టే గుర్తింపు లేకపోయినా తరువాతి తరాల దృష్టిలో మేధావులుగా కీర్తింపబడేవాళ్లు కొందరుంటారు. వాళ్లు అచ్చమైన ప్రతిభావంతులు. రోమన్ కేథలిక్ సంప్రదాయంలో మరణానంతరమే సెయింట్స్ గా మన్నింపు దక్కడం ఇందుకు ఉదాహరణ. గొప్పపని వెంటనే సామాన్యుడి మెప్పుదల పొందదు. పజ్జెనిమిదో శతాబ్ది జర్మన్ పాత్రికేయ రచయిత సీగ్ ఫ్రీడ్ తన హెరొడెస్ ' లో ఆ మాటే చెబుతాడు. చరిత్రలోకి వెళ్లి చూస్తే హెరొడెస్ మాటల్లోని వాస్తవం తెలిసివస్తుంది. ఈనాడు గొప్ప కళాఖండాలుగా హారతులు అందుకునే ఏ చిత్రమే చిత్రకారుని జీవితకాలంలో ఆ స్థాయిలో గుర్తింపు సాధించిన దాఖలాలు కనిపించవు. అనేక తరాల పాటు అనేకమంది కళావివర్శకులు వాటి విలువను వివరించినప్పుడు గాని సామాన్యుడికి వాటి గొప్పతనం బుద్ధికెక్కదు. ఇక రచనల విషయానికి వస్తే చిరకాల కీర్తి ప్రతిష్ఠలకు రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. పండిత పామర జన రంజకంగా ఉండటం.. వస్తువు ఏ తరగతి పాఠకులకు చెందివుందనే కోణం. వీధినాటక ప్రదర్శనకారులు, సర్కస్ కళాకారులు, నాట్యకత్తెలు, గారడీ ప్రదర్శకులు, నటీనటులు, గాయకులు, సంగీత విద్వాంసులు, రచయితలు, భవన నిర్మాతలు, చిత్రకారులు, శిల్పులు, చివరగా తత్వవేత్తలు. తమాషా ప్రదర్శకులకు మాదిరి తత్వవేత్తలకు తటాలున గుర్తింపు రాదు. విషయం వినోదానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణా తక్కువే. తత్వవేత్తల ప్రబోధ సారం తమాషా ప్రదర్శనలో మాదిరి తటాలుమని తలకెక్కదు. లోతైన అంశాల స్వారస్యాన్ని ఆలస్యంగా అయినా  ఆస్వాదించే స్వల్ప వర్గాలు పరిమితంగా ఉంటాయి కనుక తత్వవేత్తలకు ఒక పట్టాన తమ జీవితకాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు దక్కే అవకాశం తక్కువ. సర్వజనామోదం పొందిన వ్యక్తి కీర్తి ఎక్కువకాలం మనలేదు, నెమ్మది నెమ్మదిగా తక్కువ మందితో మొదలయ్యే గుర్తింపు తరతరాలపాటు నిలబడుతుంది.
దాదాపు తత్వవేత్తల సరసనే చేరే వర్గం కవులు, రచయితలు. చిత్రకారులు,  సంగీతప్రాజ్ఞులు, శిల్పనిపుఉణులు. సాకారాత్మకం చెందిన కళకి చావు ఉండదు. అచ్చయిన పుస్తకంలో సరుకుంటే కాలం గడిచిపోయినా ఏదో ఓ శుభదినాన దాని వెలుగులు బైటపడడం ఖాయం. వేలాది రాగి రేకుల మీద నిక్షిప్తమయ్యాయి కనకనే అన్నమయ్య సంకీర్తనలు కాలాంతరంలో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాయి. కర్త కన్నా కావ్యం ఎక్కువ కీర్తి ప్రతిష్ఠలు సాధించడం మన్నం చూస్తున్నాం. థేల్స్, ఎంపిడాకల్స్, హెరాక్లిటస్, డెమోక్రిటస్, పార్మెనెడ్స్, ఎపిక్యూరస్  వంటి గ్రీకు తత్వవేత్తలు నక్షత్రాల మాదిరి మేథో జగత్తు మీద వెలుగులు విరజిమ్మడానికి కారణం.. తోకచుక్కలు, గ్రహాల మాదిరి కాకుండా తారల స్థాయిలో  నిదానంగానే అయినా కీర్తి ప్రతిష్ఠలు సాధించడం,
తత్వశాస్త్రం సామాన్యుడి జీవితానికి అనునిత్యం ఉపయోగించే బౌతికాంశం కాదు. దానికి కీర్తి ప్రతిష్ఠలు  తక్షణమే దక్కకున్నా సమాజానికి జరిగే నష్టం తక్కువ. సామాన్యుడి చైతన్య స్థాయిని తట్టి లేపి సుఖమయమైన జీవిత సూత్రాలకు మార్గం చూపించే సత్సాహిత్యం సమకాలీనుల ఈర్ష్యాద్వేషాల కారణంగా మరుగునే ఉండిపోవడం మాత్రం జనావళికి నష్టం కలిగించే అంశమే! వినోదమూ జీవితానికి అవసరమైన దినుసే. ఆ వంటకం తయారుచేసే వంటవాడికీ గుర్తింపు తప్పనిసరి ప్రేరణే. వంటకంలో ప్రత్యేకత ఉంటే  వంటింటి దాకా వెళ్ళి అభినంధించే సంప్రదాయం ఇంగ్లీషువారి సంస్కృతిలో ఉంది. మంచి పుస్తకం మంచి వంటలాంటిదే. కానీ పుస్తకం శ్రేష్టత పనిగట్టుకుని పరిచయం చేస్తే మినహా ప్రాచుర్యంలోకి రాదు. కృత్రిమంగా అయినా సరే కీర్తి ప్రతిష్ఠలు గడించాలని పాకులాడే పేరాశగాళ్ల సంఖ్యే సమాజంలో ఎక్కువ. మిత్రుల చేత పొగిడించుకోడం, భజన బృందాలతో కీర్తించుకోడం, దొంగ విమర్శలు రాయించుకోడం, అసందర్భ సన్మాలకు అంగలార్చడం వంటి ఎన్ని స్వీయ ప్రాయోజిత కార్యకలాపాలకి పాల్పడినా పుస్తకంలో గుజ్జంటూ లేని పక్షంలో గాలి నింపిన బంతి మాదిరి ఆకాశంలో నిలబడుతుంది. గాలి పోయి నేల కూలిన బంతుల్లాంటి నిష్ప్రయోజనమైన సాహిత్యంతో సమాజానికి ఒనగూడే ప్రయోజనం సున్నా. ప్రతిభ అనే ఇటుకలతో నిర్మితమయే  ప్రజాసాహిత్యం శుక్ల పక్షం చంద్రుని మాదిరి దినదినప్రవర్థమానమయి తీరుతుంది. కాలం గడిచే కొద్దీ గురుత్వాకర్షణ శక్తిని కూడా ధిక్కరించి సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. సత్సాహిత్యం కాలాతీతమైన కీర్తి ప్రతిష్ఠలు గడించడం సమాజానికే శ్రేయస్కరం.
(మూలంః ఆర్థర్ షోపెన్ హావర్ ప్రసంగం - కీర్తి ప్రతిష్ఠలు- మిసిమి- జమవరి- 2016)
`


Sunday, February 17, 2019

ఎన్నటికీ ఒంటరులం కాలేం - కవిత



ఒంటరులం కాలేం!

1
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
             
2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది


ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి- నువు కింద పడకుండా
నాన్న నీడ పహరాగా నిలబడి ఉంటుంది          
             
4
తోబుట్టువులనే
తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనుగా
ఎప్పుడూ సందడిగానే ఉంటుంది!

5
నీ రాలి పడే నవ్వులకు
ఒడి పట్టి వెంటబడే లోకం అంటావా
నీతోనే తన లోకం అంటుంది

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా నిన్ను!
చెక్కిలి తడి కానివ్వదు
చెలిమి హస్తం చాచే ఉంటుంది

7          
చింతల గుంతన అయినా
ఏకాంతంగా   వదలదు.
నీ వ్యథలో అర్ధం తనదే
అటుంది నీ ఆత్మ అర్థభాగం
             
 8
ఇక అమావాస్య నాటి
వెన్నెల పక పకలకు మల్లే
పిల్లా జెల్లా ఎల్లకాలమూ
నీ వెనకాలే!

9
చావుతోనే అంతా అయిపోయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
కాలేం*
హామీ పత్రంః' ఒంటరులం కాలేం' కవిత నా స్వంతం.దేనికీ అనువాదం/అనుకరణ కాదు.అముద్రితం.ఏ ఇతర పత్రికలలోనూ పరిశీలనలో లేదు అని హామీ ఇస్తున్నాను.

-కర్లపాలెం హనుమంత రావు
17-09-2012


Wednesday, May 23, 2018

ప్రార్థనా స్థలాలు.. చరిత్రలో 1




పుట్టటం.. గిట్టటం తప్పవని ప్రకృతిని చూసి గ్రహించాడు ఆదిమానవుడు. విత్తు నుంచి మొలకెత్తిన పిలక పెరిగి వృక్షంగా మారి కాసే పూలు కాయలుగా పండి రాలిన తరువాత వాటి పొట్టవిప్పి చూస్తే కనిపించేవి మళ్లా ఆ విత్తులే. భర్త తన భార్య కడుపున  పుత్రుడుగా జన్మిస్తాడన్న నమ్మకం పెరగడానికి ఇలాంటి దృష్టాంతాలు  సృష్టిలో చాలా కనిపించాయి మనిషికి. కాబట్టే చనిపోయిన తన మనిషి కళేబరాన్ని భద్రం చేయడం అవసరంగా భావించాడు.
మరీ అతి ముతక కాలంలో మృత శరీరం ఏ కుక్కలు, నక్కలు తినకుండా తామే తినేసేవారు  మృతదేహం పరిశుద్ధత నిలబెట్టడం కోసం. తరువాతి దశలో పార్థివ దేహం నేల మీది చీమల, పురుగుల పాలవకుండా ఎత్తైన ఏ చెట్టు కొమ్మల మీదో వదిలేసేవాళ్లు. 'కాకులకు గద్దలకు' వేయడం అనే సామెత అట్లా పుట్టిందే! (మహాభారతం విరాటపర్వం అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మూట కట్టి జమ్మి చెట్టు మీద వదిలేసి.. దారే పోయే వాళ్ళను చనిపోయిన తమ తల్లి శరీరమని నమ్మిస్తారు). పక్షులు పీక్కు తినగా మిగిలిన బొమికలను ఏరుకొని ఏ గంగలోనో కలిపే తరువాతి సంస్కారం ఒక పద్ధతైతే.. ఆ అస్తికలను మూటగట్టి ఒక ప్రత్యేకమైన నూతిలో పారేస్తారు. (నేటికీ పార్శీలది ఇదే పద్ధతి). అసలు నేరుగానే శవాలను గంగా ప్రవాహానికి వదిలేయడం మరో విధానంగా ఉండేది. కర్మకాండలలోకెల్లా గంగలో కలపడం ఉత్తమ సంస్కారంగా ఇప్పటికీ భారతీయులు నమ్మడం వల్ల దహనం చేసిన తరువాత ఆ చితాభస్మాన్ని కాశీ వెళ్లి మరీ గంగలో కలిపి వస్తున్నారు సంప్రదాయం నమ్మేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత శవదహనం  సంస్కారంగా మారింది. ద్రవిడ సంస్కృతిలో సామాన్యంగా ఖననమే ప్రధాన సంస్కారం.
పూడ్చినా కాల్చినా ఆ కాండ జరిగిన స్థలాన్ని పవిత్రంగా భావించేవాళ్లు బంధువులు. ఆ స్థలానికి గుర్తుగా ఒక రాయి పెట్టడం.. దుష్టశక్తుల కట్టడికి గాను చుట్టూతా రాళ్లు పేర్చడం జరుగుతుండేది. ఆ ప్రదేశాన్ని 'చైత్యం'గా పిలిచేవారు. ఆ చైత్యానికి దగ్గర్లోనే ఒక చిన్న కట్టడం కట్టడం ఒక పద్ధతి. ఆ స్థలం మీదో మొక్కను  నాటడం మరో పద్ధతి. తులసి కోటలు కట్టే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. శ్మశానాలను 'పితృవనాలు' గా పిలవడానికి ఇదే కారణం.
ప్రముఖులు మరణిస్తే ఖననం చేసినా, దహనం చేసినా ఆ స్థలాన్ని స్మృతిస్థలాలుగా మార్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. జనకళ్యాణం కోసం జీవితాంతం కృషిచేసిన వైతాళికులకు, మంది కోసం ప్రాణ త్యాగం చేసిన పరిత్యాగులకు, యుద్ధాలలో వీరమరణం పొందిన యోధులకు (వీరగల్లులు), శీలరక్షణ కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ స్త్రీలకు గుర్తుగా  చిన్ని చిన్ని  కట్టడాలు, స్తూపాలు, ఆయతనాలు కట్టే ఆచారం ఉంది. ఆ తరహా  ద్రవిడ సంస్కృతి ఆచరించే ప్రాంతాలన్నింటా ఇప్పటికీ ఆ కట్టడాలు కనిపిస్తాయి.
బుద్ధుడి మహాపరినిర్యాణం క్రీస్తుకు పూర్వం 498లో. ఆ అస్తికలను భద్రపరిచిన పాత్ర మీద సమాధి నిర్మించి శాసనం వేయించారు బుద్ధుని సగోత్రీకులు శాక్యులు.
'ఇయం సలిల నిధానే బుధవ భగవతే సకియానాం
సుకుతి ఛటినాం సభగినకం సపుత దలనం'
(బుద్ధ భగవానుని ఈ శరీర నిధానం దేవుని సుపుత్ర భగనీకులు శాక్యులచే నిర్మించబడింది) అని ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రాచీన కట్టడాల మూలకంగా అప్పటి నాగరికతలను గురించి తెలుసుకొనే అవకాశం పురాతత్వశాస్త్రానికి లభిస్తుంది,
బౌద్ధం, జైనంలో చనిపోయినవారి సమాధులకు సమీపంలో చిన్న ఆరామాలు నిర్మించడం ఆనవాయితీగా ఉండేది ఒకానొకప్పుడు. ఆ ఆరామాలనే విహారాలుగా వ్యవహరించేవాళ్లు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు జనపదాలలో నివాసం ఉండేవాళ్లు కాదు. ఈ తరహా ఆరామాలలో నివాసం ఏర్పాటు చేసుకొని  భిక్షకు మాత్రం గ్రామాలలోకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఆ కారణం చేత ఆరామాలు సాధారణంగా జనపదాలకు, వ్యాపార మార్గాలకు దగ్గరగానే ఉండేవి. బౌద్ధుల, జైనుల జీవహింస నిషేధం వల్ల పశుసంపద వృద్ధి అవడం, వ్యవసాయం ఊపందుకోవడం, వ్యావసాయిక ఉత్పత్తుల లావాదేవీలకు నెలవైన వ్యాపారాలు అభివృద్ధి చెందడం జరిగింది.  బౌద్ధులకు, జైనులకు కృతజ్ఞతా పూర్వకంగా తృణమో, ఫణమో సమర్పించుకొనే అలవాటు అప్పుడే మొదలు. భూస్వామ్య వ్యవస్థ పుంజుకొని, పెత్తందార్లు, రాజులు బలమైన వర్గంగా ఏర్పడేందుకు ఈ రెండు మతాలు చాలా దోహదం చేసాయనే చెప్పుకోవాలి. అందుకే రాజులు అప్పట్లో ఆ రెండు మతాల వైపు అధికంగా మొగ్గు చూపించేవాళ్లు.
మత విశ్వాసులు ఇచ్చే కానుకలతో జైనులు, బౌద్ధులు ఆర్థికంగా బలపడ్డారు. వారు నివాసముండే ఆరామాలకు కళ పెరిగింది. మత పెద్దల మెప్పు కోసం రాజులు, వ్యాపారులు ఆరామాలను కళలకు కాణాచిగా ఎంత ఖర్చైనా వెచ్చించి మరీ తీర్చి దిద్దేవాళ్లు. ఆ అలంకరణల్లో భాగంగానే ఆరామాల గోడల మీద అందమైన ప్రకృతి దృశ్యాలు, స్త్రీల చిత్రాలు, ఆనందాన్ని ప్రేరేపించే కామకార్యాలు చిత్రీకరణలు క్రమంగా పుంజుకున్నాయ్. ఆరామాల కుడ్యాల మీద కనిపించే పోర్నోగ్రఫీ క్రమంగా దేవాలయాలకు ఎలా పాకిందో మరో సారి..!
-కర్లపాలెం హనుమంతరావు
***

Sunday, May 20, 2018

హిందూ పదం.. మతానికి సూచిక కాదు. అది ఒక సంస్కృతికి సంకేతం - వ్యాసం




'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక భాగం భరత వర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా నివృత్తి అవుతుంది.
'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.
స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు కనిపిస్తాయి.
యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం పడింది.
రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయ్!
ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం 'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మత రూపంలో చొప్పించి పబ్బం గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.
నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.. అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు. వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక  ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ 'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.
తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం, ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.
ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద 'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం హిందూధర్మంగా గుర్తింపబడింది.
'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!
స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.
మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించాడు. రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!
ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు చేస్తున్నాయిప్పుడు!
హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో.. ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది. మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం, వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత ప్రభావం,
ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక, ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత, విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే. భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వ చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత సిద్ధాంతంతో ప్రభావితమైనవే!
కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది. రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ సమాజంలో చెల్లదు.  
హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు  ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.
టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నదిపించారు. బెదిరిన బ్రిటిష్ దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ప్రత్యేక ఇస్లాం రాజ్యం కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా  చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా  పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ. స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు  అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది. చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?
***
కర్లపాలెం హనుమంతరావు
2౦ -05 -2018
(దాశరథి రంగాచార్య అక్షర మందాకిని (8) – హిందుత్వం పై ఇస్లాం ప్రభావం –వ్యాసం – ప్రేరణతో)

Wednesday, May 9, 2018

జీవన వేదం- వై ఎస్ ఆర్ దుర్మరణం సందర్భంలో ఈనాడు ఆదివారం సంపాదకీయం





కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్క్యాడెట్కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'
నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15 వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది'వై.ఎస్‌. అమర్రహేఅని!
(
ఈనాడు,. 04 - 09 -2009



ఇదే సందర్భానికి తగిన విధంగా 06, సెప్టెంబర్, 2009.. ఆదివారం ఈనాడు రాసిన సంపాదకీయం 
"జీవన వేదం" 


మనం ఎంతగానో ప్రేమించేవారు మనకు దూరమైతే ఆ ఎడబాటుకు మందేమిటో తెలుసా? మనం ప్రేమించేవారు ప్రేమించిన వాటిని అన్నింటినీ మనమూ ప్రేమించడం.  ఆస్కార్ వైల్డ్ చెప్పిన చిటుకు అది, మహాభారతంలో యక్షుడు 'ప్రపంచంలో కెల్లా అత్యంత అబ్బురం కలిగించే విశేషం ఏమిటి?' అని అడిగినప్పుడు 'రేపు కనుమరుగయే వ్యక్తి ఈ రోజు కాలం చెల్లిన ఆప్తుడిని గురించి కన్నీళ్లు పెట్టుకోవడం' అని జవాబు ఇస్తాడు ధర్మరాజు. ఆ మాటే నిజం. 'అసలు జీవితమంటేనే ఒక నాటక రంగం. మనమందరం ఆ వేదిక మీద ఆడే జగన్నాటకంలో  వచ్చే పోయే పాత్రధారులం' అంటాడు ఆంగ్ల నాటక కర్త విలియం షేక్స్పియర్. ఆ సత్యం మనమూ వంటబట్టించుకుంటే 'పుట్టడం.. గిట్టడం ప్రకృతి చేసే ప్రకటనలు' అని ఇట్టే ఆర్థమవుతుంది. 'జీవనం ఒక వేదం. ఆ వేదసారం గ్రహింపుకొస్తే ఆవేదనకు ఆస్కారముండదు' అంటాడు హిరణ్యాక్షుడు సోదరుడి మరణానికి దురపిల్లే బంధుగణాన్ని ఓదార్చే సందర్భంలో మహాభాగవతంలో. విశ్వవిజేతగా చక్రం తిప్పాలని దురాశ పడ్డ అలెగ్జాండర్ చలిజ్వరంతో చనిపోయే ఆఖరి క్షణంలో 'హతీతో క్రతిస్తో' అంటో ఖాళీ చేతులు చూపించి వెళ్ళిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క.. ఎలా బతికి పోయారన్నది ముఖ్యం. లోకం కోసం విషం తాగిన శివుడికి ఉన్న విలువ తన కోసం అమృతం తాగిన దేవేంద్రుడుకుందా? మిన్నాగులాగా కలకాలం బతికే కన్నా మిణుగురులా వెలుగులు విరజిమ్ముతూ క్షణకాలం జీవించినా మిన్నే! అసలు మృత్యు పిశాచి ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ ఆత్మబందువులకు దక్కనివ్వదా? రెండో ప్రపంచయుద్ధ సందర్భం. ఓ జర్మను చెరసాలలో ఖైదీలు వందల కొందలు  ఒకే అరలో బందీలుగా పడివున్నారు. తొక్కిసలాటలు తగ్గించేందుకు కారాగారాధికారుల కో పథకం తట్టిందిప్రతీ బందీ చేతికి ఒక అంకె ఇవ్వడం..  రోజూ కొన్ని అంకెలను చీటీలు తీసి  ఎన్నిక చేయడం.. ఆయా అంకెగల చీటీ  చేతనున్న అభాగ్యుడిని  పైకి పంపించెయ్యడం.. అదీ 'ఆపరేషన్ క్లీన్'. ఎన్నికైన అంకెచీటి చేత పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడో ఖైదీ.  తోటి ఖైదీ 'ఇంకా ఇక్కడ నీకు బందీగానే బతకాలనుందా? మిత్రమా! నీ చీటీ నా చేతికివ్వు!' అంటూ తానే  ఆ చీటీతో సంబరంగా ముందుకెళ్లి తుపాకీ గుండుకు బలి అయ్యాడు. ఆ ప్రాణత్యాగి ఆనందం అరువు ఊపిరితో బతికే ఖైదీ కేదీ?!
'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటాడు రవీంద్ర కవీంద్రుడు 'గీతాంజలి'లో. 'జాతస్య మరణం ధృవమ్' అంటుంది గీత. కాలప్రవాహానికి ఎదురీదడం ఎవరి తరమూ కాదు'. పురాణేతిహాసాలు మృత్యువుని 'కాలధర్మం'గా వర్ణించడంలోని మర్మం మనిషి గ్రహించాలి. భూమ్మీద కలకాలం నిలిచిపోవాలన్న కాంక్ష ఎవరికుండదు! నిజంగా చిరంజీవిగా జీవించాలంటే 'తానే తుమ్మి తానే చిరంజీవ' అనుకుంటే చాలదు. చిరకాలం జనహృదయంలో సజీవంగా నిలిచిపోయే సత్కారాలేవైనా చేస్తుండాలి. మొక్కుబడిగా 'కీర్తిశేషులు' అనిపించుకోవడం కాదు.. మొక్కి.. మరీ 'కీర్తి'ని గుర్తు చేసుకొనే మంచి కర్మలు  సంకల్పించాలి. మనసుకు దగ్గరైన మనిషి దూరమైనప్పుడు ఒక పట్టాన ఒప్పుకోని పిచ్చిభ్రమలు మానవజాతి పుట్టుక నుంచే మొదలయినాయి.  వేళ్లు కోసినప్పుడు రుధిరం గడ్డకట్టినట్లు గట్టిగా రువువైతే తప్ప  రోమన్లు  ఆత్మబందువులు  మృతులైనట్లు ఒప్పుకొనేవారు కాదు. చనిపోయిన తమవారు తిరిగి వాస్తారన్న ఆశతో మూడు రోజుల వరకు పార్థివ దేహాన్ని పాడె మీదకు చేర్చనివ్వరు గ్రీకులు. 'ఎడ్గార్ ఎలెన్ పో' తన 'మెక్బరి' నవల్లో శవపేటిక లోపల మీటలుండే విధానాన్ని సూచించారు. ఖననమైన తరువాత ఒకవేళ తిరిగి ప్రాణమొస్తే మీట నొక్కి తమవాళ్ళకు  శుభవార్త చెప్పేందుకన్న మాట ఆ ఏర్పాటు! హిందూధర్మంలోని 'దింపుడు కళ్లెం' ఆచారం వెనకున్న మర్మం ఈ పునర్జీవితం మీద ఉన్నప్రగాఢ విశ్వాసమే!
శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృధ్ధి చెందిన కాలంలో కూడా  ఇలాంటి నమ్మకాలను గూర్చి వింటుంటే నవ్వురావచ్చేమో గానీ.. నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు యంత్రంలో ఇసిజి నమోదు చెయ్యవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం సైతం ఒప్పుకుంటున్న సత్యం. 'పైలోకార్పైన్' అన్న మందు కంటిలో వేస్తే వ్యక్తి చనిపోయిన మూడు గంటల వరకు కంటిపాపకు సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదం కాదు.  అదో క్రమంలో శరీరంలో జరిగే జీవపరిణామం అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ).కంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విసర్జించడంగా మతాలన్నీ మరణాన్ని నిర్వచించుకుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించేందుకు వీలైన ప్రయోగాలు విజయవంతమయే వరకు మరణం మనిషికి మనసుకు సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ పరిణామంగానే మరణాన్ని చూస్తోంది. తార్కిక శాస్త్రాలు  ఏ సూత్రాలైనా చేయనీయండి.. మనసుకు దగ్గరైన వ్యక్తి హఠాత్తుగా దూరమయ్యాడన్న విషయం ఆప్తులలో  అంతులేని విషాదాన్ని నింపితీరుతుందిఅందులోనూ పెద్దమనిషి.. పెద్ద మనసున్న మనిషి! మరణమంటే మాములు జనాలకు పత్రికల్లో నల్లరంగు అద్దుకుని వచ్చే పతాక శీర్షికో.. టీవీ ప్రసారాలలో ఆపకుండా చూపించుకుంటూ పోయే 'రియాల్టీ' ప్రదర్శనో కాదు. ఆట ముగిస్తే రాజైనా బంటైనా ఒకే పాచికల పెట్టెలోకి సర్ధుకుంటారన్న మాట నిజమే కావచ్చేమో! కానీ జనం తరుఫున ఆడే ఆట రాజకీయం. అది ముగించకుండానే  మధ్యలో హఠాత్తుగా వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరు వెళ్లిపోయినా ప్రజావళి దృష్టిలో అది 'తొండే'!  ఆగిపోయిన  ఆటను  గుండె దిటవుతో   ముందుకు కొనసాగించి విజయం సాధించడమే  ఆ 'రాజు' కు ఆయన నమ్మిన 'బంట్లు'  సమర్పించుకొనే నిజమైన నివాళి.
***

(ఈనాడు- ఆదివారం సంపాదకీయం – 6, సెప్టెంబర్, 2009)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...