Showing posts with label saradake. Show all posts
Showing posts with label saradake. Show all posts

Saturday, March 14, 2020

సరదాకేఃr ఇదో.. ఓ.. ఆదాయ మార్గం! -కర్లపాలెం హనుమంత రావు -సూర్య దిన పత్రిక



రకరకాల  ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా! ఓ మూలట్లా  మన్మోహన్ సింగులా
మూలుగుతూ కూర్చుంటే ఎట్లా? ఎంచక్కా  పోయి ఓ సారరి ఆ ముసలయ్యగారిని కలిసి

రారాదా!’ అని మా ఆవిడ  నస. వెళ్ళి కలిసాను ముసలయ్యగారిని. మనసులోని మాట
పెదాల మీదకు రానే లేదు,  పెద్దాయన చప్పట్లు కొట్టి పి.య్యేని పిలిచి
నన్నప్పగించేశాడు. ‘అయ్యగారికి ఇవాళ మౌన దీక్ష. స్పీకరు పని చెయ్యదు. మరీ
ముఖ్యమైతే తప్ప  రిసీవరూ బైటికి తియ్యరు. ఏమిటీ విషయం?’ అనడిగాడా
పి.య్యే.
‘మా వార్దు నెంబరు పదమూడుకి నిలబడదామనీ! ముసలయ్యగారి పార్టీ సహకారం

కావాలి’ అన్నా టూకీగా. ‘మరైతే వట్టి చేతులతో వచ్చారేంటండీ బాబూ! మీ జాతక
చక్రం.. సూర్యమానం ప్రకారం వేసిందొకటి, చంద్రమానంతో కలిపిందొకటి తీసుకు
రావాలి. గ్రహాలు, రాశులు.. వాటిని బట్టే అయ్యగారి అనుగ్రహం!’ అన్నాడా
పి.య్యే.
‘తమిళనాడు దివంగత జయలలితమ్మాళ్ గారికీ ఇట్లాగే జ్యోతిష్కం,
సంఖ్యాశాస్త్రాలంటే తగని పిచ్చ. జాతక యోగం ఉచ్ఛస్థితిలో
ఉందనుకున్నవాళ్ళకు మాత్రమే టిక్కెట్లిచ్చారు ఒకసారి ఎన్నికల్లో.
ముఫ్ఫైతొమ్మిది స్థానాలగ్గాను ముష్టి తొమ్మిదంటే తొమ్మిది మంది మాత్రమే
గెలిచారంతా కలిపి. గెలుపుకీ గ్రహాల వలపుకీ లింకేంటండీ బాబూ?

ప్రజాస్వామ్యంలో ఘనవిజయానికి కావాల్సింది ప్రజల అభిమానం కాదుటండీ!’
అన్నాను కసిబట్టలేక.
‘టయానికి గుర్తు చేసారు!  ఆ జయమ్మగారి కన్నా మా ముసలయ్యగారు మరో
రెండాకులు ఎక్కువ.  ఇట్లాంటి పరాశాస్త్రాల పైన విపరీతమైన నమ్మకం. మీ

ఇంటికో సారి మా వాస్తుశాస్త్రులు వస్తారు. అన్నీ సవ్యంగా ఉంటేనే మీ మొర
మా పెద్దాయన ఆలకించడం! మొన్నీ మధ్యన ఇట్లాగే ఒక బొజ్జాయన ఇంటికి
ఈశాన్యంలో పూజామందిరం పెట్టుకుని  అవకాశం చేజేతులా జారవిడుచుకున్నాడు.’
 ‘ఇంటికి ఈశాన్యంలో మందిరముంటే దోషమా!’’

‘మందిరముంటే కాదు మహాప్రభో! అందులో వినాయకుడు, ఆంజనేయుడు లాంటి
బాహుబలులుంటేనే మోసం. ఈశాన్యంలో బరువులుంటేనే కదటండీ ఊహించని

ఉత్పాతాలొచ్చిపడేదీ! ఆ మాత్రం వాస్తుజ్ఞానం కూడా లేకుండానే వార్డు
మెంబర్లై పోదామనే!’ పి.య్యే మాటల్లో వెటకారం.
ఇండియాని ఈ కరోనా తరహా మాయదారి రోగాలు  ఎందుకిలా నలిపేస్తున్నాయో ఇప్పుడు
బుర్రకెక్కింది స్వామీ! ఈశాన్యం దాకా పాకిన అంత  లావు హిమాలయాలు.. వాటి
వెనకమాల్న చైనా కొరియా గట్రా దేశాలాయ! వాటి మాయ! అవి పట్టించుకోకుండా

కుంభకోణాలనీ, ద్రవ్యోల్బణాలనీ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందికర
సంబంధాలనీ.. పాపం మనం మోదీ, షా మామయ్యలను హమేషా ఆడిపోసుకుంటున్నాం

నిష్కారణంగా'

నా ఆలోచనల్లో నేనుండగానే భుజం గోకి మరీ అడిగాడా  పి.య్యే ‘కొంపదీసి మీ
ఇంటిగ్గానీ సింహద్వారం దక్షిణం వారగా  ఉందా ఏంటీ? ముందే చెప్పండి బాబూ..
ఆనక నన్నెన్ని దెప్పీ నో యూజ్’

‘అమెరికా శ్వేత సౌధం తలవాకిలే దక్షిణానికి అభిముఖంగా ఉంటుంది తమ్ముడూ!
మరా దేశం ఇన్నేళ్ళబట్టి అగ్రరాజ్యంగా  ఎట్లా నిప్పులు చెరుగుతుందో?’

‘వాదనలొద్దిక్కడ. ఆ ముచ్చట్లన్నీ టీవీ పెట్టెల్లో! ముసలయ్యగారు
పరాశాస్త్రాలన్నీ నమ్ముతారు. ఆయన ముక్కు చూసారా? దూలం భారీ. తిన్నగా కూడా
ఉండదు. అయ్యగారి ముక్కువాస్తు ముందే తెలుసుకుని వచ్చుండాల్సుందయ్యా
తమరు!’

బిక్క మొహమేయడం నా వంతయింది. పోయిన ఏడాదే మా అడ్డగాడిదకు ఎక్కడా ముడిపడే
యోగం కుదర్డంలేదని ఇట్లాగే ఏదో దిక్కుమాలిన శాస్త్రం  ఘోషిస్తోందంటూ నా

ఘోష లెక్కచెయ్యకుండా వీధి ముఖ ద్వారాలు రెండూ సగం మూయించేసింది మా
మహాతల్లి. ఇప్పుడీ ముసలయ్యగారి వాస్తు ఇంకేం మూయిస్తుందో.. ద్యావుడా!’

 ‘ముందొక  సారిట్లా వచ్చి ఈ నీళ్ళ తొట్లో మీ కిష్టమైన రంగు ముక్క ఏదన్నా
తగలేయండి బాబూ! మీ అసలు రంగేంటో బైట పడేందుగ్గాను ఇదో చిన్న స్లిప్
టెస్ట్ అన్నమాట!’ అంటో గారపళ్ళు చూపించాడా  పియ్యేగారు.
రంగులు మారుతున్న  నామొహం వంక చూసి ‘మీ సందేహం అర్థమైందిలేండి! ఈ తొట్లో
ఉన్నది  సీదా సాదా జలగ కాదండీ బాబూ! ఆఫ్రికా ఖండం యవుండే దేశం నుండి

తెప్పించిందండీ! ప్రపంచ ఫుట్ బాల్ పోటీలల్లో ఫలితాలు ముందే చెప్పిన
ఆక్టోపస్ 'పాల్' లేదూ.. దానితో క్రాస్ చేయించి పుట్టించిందండీ ఈ
బుజ్జిముండను! తండ్రి తాలూకు జోస్యం చెప్పే లక్షణాలు ఎక్కడకండీ పొయ్యేదీ?
ఒక్క పాలిటిక్సులోనే కాదు వంశపారంపర్యాలూ గట్రా! మోదీ వద్దని దులపరిస్తే
మాత్రం  మాయమై పోడానికి ఇదేమన్నా గుడిసెకు పట్టిన ఆర్డినరీ బూజా? వాస్తు
బూజు బాబూ.. వాస్తు మోజు’
 ‘ఆటల  మీద రంధి పెంచి బెట్టింగ్ సొమ్ము  రెట్టింపు గుంజేందుకు మాస్
మీడియాతో మాఫియా ఆడించిన నాటకాల్రా బాబూ ఆ ఆక్టోపస్సుల యాక్టింగులు!
యుద్ధ రంగంలోకి దిగే ముందే శత్రువర్గం మానసికంగా కుంగేటందుకు వాడుకునే
గూఢచర్యానికి నకలు.'
నా ఊహల్లో నేనుండగానే పెడబొబ్బలు పెట్టేసాడా పి.య్యేసామి. నా చేతులు
పట్టుకు తెగ ఊపేస్తూ ‘కంగ్రాట్సండీ కామాయ్ సారో! మీరీ పరీక్షలో కూడా
నెగ్గేశారోచ్! ఇహా కోయంబట్టూరు నాడీ జోస్యం కూడా తెప్పించేసుకుని రడీగా
ఉంచుకుంటే సరి.. మీ పని ఫినిషయిపోయినట్లే! ఆఁ.. అన్నట్లు.. ఈ లోపల్నే
నామనక్షత్రం ప్రకారం తమ పేరును ఎట్లా మారిస్తే దిగ్విజయం సిద్ధిస్తుందో
డాక్టర్ దైవజ్ఞానం  కూడా ఓ  నివేదిక తయారుచేసిస్తారు. ఓ.కే నా?’
‘పేరు మార్చుకుంటే అపజయలక్ష్మి ఆనవాలు పట్టకుండా వదిలేస్తుందనా?
దేవుళ్లను కూడా తప్పుదారి పట్టించే కొత్త  రకం గుంటనక్క ట్రిక్కా!’
‘మీరున్నారు చూసారూ.. భలే చిలిపి సార్! మనసులో ఏదున్నా అస్సలు దాచుకోరు!
ఐ ఎప్రిషియేట్! ఇది వరకో చిన్నారావును.. ఇట్లాగే 'చీ..అన్నా..రావు'గా
సాగదీసిం తరువాతనేనండీ అతగాడి జాతకం మొత్తం తిరగడ్డం మొదలెట్టిందీ!

దివ్యజ్ఞానం గారి విజ్ఞానాన్ని సందేహించకండి! అరవై ఏళ్ళ అనుభవసారం.
వాజిపేయి, సోనియాజీ, కరుణానిధీ, నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, ఒబామా,

సద్దాం హుస్సేన్ లాంటి పెద్ద పెద్ద జాతీయ, అంతర్జాతీయ శాల్తీల నాడులే
పట్టి మరీ జోస్యం రాబట్టిన ఘనాపాటి ఇతగాడు! మీ డౌట్లన్నీ తీరిపోతాయ్..
ముందీ బౌండు బుక్కు  చదవండి’ కవిలకట్టొకటి నా మొహాన ఠకీమని  కొట్టి
లోపలికి తారుకున్నాడా పియ్యే.

బౌండా అది? వందలాది ఏళ్ళ కిందటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెప్పే నాడీ
జోస్యంట ఆ దిండు! నోస్ట్రస్ డేమ్ జోస్యం కన్నా డేమ్ ష్యూర్ గా డాక్టర్
దివ్యజ్ఞానం జోస్యముంటుందని డబ్బాలు! ఇరాక్ యుద్ధం, ఇందిరమ్మ మరణం, రజనీ
బాషా హిట్టూ..బాబా ఫట్టూ, బందిపోటు వీరప్పన్ చావు, వెస్ట్ బెంగాల్
లెఫ్టిస్టుల ఫేటు, దక్షిణాది సునామీలు, ఆమ్ ఆద్మీ కేజ్రీవాలు  రైజు,
పెద్దనోట్ల రద్దు, ముంబై దాడులు.. ఆఖరికి  ఆర్జీవీ మూడ్స్ తో సహా హిస్టరీ

దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనింపార్టెంట్ స్టోరీస్ ఆల్మోస్ట్
అన్నీ నేటివ్ టు ఇంటర్నేషనల్ లెవెల్లోవి సర్వం .. అవి   జరక్కముందే..
విఘడియల వివరాల్తో సహా పర్ఫెక్టుగా లెక్కగట్టి మరీ తేల్చినట్టి

రిజల్ట్సని కోతలు! ఆ దస్త్రాలన్నీ చదవడం సంగతట్లా పక్కనుంచి..
మొయ్యడానికే ముందు కోడి రామ్మూర్తిగారి  కండబలం కావాలి!
కరుణానిధిగారు శుద్ధ చార్వాకవాది. హస్తసాముద్రికాలు.. నాడీ జోస్యాల వంటి
అపరశాస్త్రాలు ఆయన వంటికి పడవు. అంత పెద్దల వ్యక్తిగత జీవితాల లోతుల్లో
కెట్లా చొచ్చుకెళ్ళగలిగాడబ్బా ఈ డాక్టర్ దైవజ్ఞానం! ఈ లెక్కన చూసుకుంటే..
కొరియా- ట్రంపుల ఒప్పందం, ఇరాన్ సులేమానీ మరణం లాంటి వాటిని గురించి
చెప్పుకునేవీ  డబ్బాలేగా!


ఇంకాస్సేపు గానీ ఇక్కడే పడుంటే.. ఈ ముసలయ్యగారి నస పి.య్యే బల్లిశాస్త్ర
పరీక్ష కూడా బలవంతంగా  చేయిస్తాడు. గ్రహణం బాలేదు. వచ్చింది గ్రహణం పూట
కాబట్టి  నైటు దాకా వెయిటింగులో పెట్టి తలవాకిట్లో పళ్ళె పెట్టి రోకలిబండ

నిలబెట్టమనే టెస్టూ తలపెట్టచ్చు.

ఎన్నికలల్లో ఎదుటి పక్షం అభ్యర్థి  నామినేషనెయ్యడానికే కురుక్షేత్ర
యుద్ధంలో తలబడ్డంత  ఘోరంగా ఉందే ఇప్పటి పరిస్థితి! గెలుపు మాట ఆనక, ముందు

మన వేలైనా ఓటు మిషను  మీట మీద పడనిస్తుందో లేదో.. పాడు రాజకీయం!
ప్రచారాలు మాత్రం?  ఓటెయ్యమని అడిగేందుకు పంచ ముందు కెళ్లడం ఆలస్యం.

పింఛన్లు పెంచు, కోకలు పంచు, పంచెలు ఇప్పించంటూ ఒహటే దంచుళ్లు! ఓటర్లతో
ఓ మంచీ చెడూ చెప్పుకోడాలిప్పుడు మరీ ఓల్డ్ ఫ్యాషన్సయిపొయ్యాయ్! ఓట్ మేటర్

అంటే ఓన్లీ మనీ మేటర్!

అసలే కరోనా రోజులు కూడా! కనబడ్డ కుంకెవరైనా కరచాలనం వంకన కక్ష కొద్దీ ఏ
మాయదారి రోగమో  వంటికి అంటించిపోతే! నిలబడ్డం మాట అటుంచి ఓటేయడానికైనా
వచ్చే ఎన్నికల దాకా శాల్తీ మిగిలే ఛాన్సుంటుందో ఉండదో.. డౌటే! ఎన్నికల్లో

నిలబట్టానికి ఎన్ని తిప్పలురా ద్యావుడా?

ముందు ముందు జరగబోయేది ముందుగానే తెలిస్తే ‘యెస్’ బ్యాంకు తుస్సు
మంటుందని ముందే ఎందుకయ్యా ఏ జ్యోతిష్కుడూ  నోరు పెగిలింది కాదూ? సి.యం
పదవి హుళక్కేనని ముందే ఏ న్యూమరాలజిస్టయినా సింధియా చెవిన చేరేసుంటే
అంత లావున ఎం.పీ లో కాంగీల గుంపు  గెలుపుకని కిందా మీదా పడుండునా? నిజంగా
జరిగేది నిఖార్సుగా చెప్పేదుంటే నిర్భయ నిందితులందరికి ఉరిశిక్షలు

ఎప్పుడో  నిర్భయంగా ఇప్పుడైనా చెప్పమనండి.. చూతాం! గీత దాటిన శాసనసభ్యుల
పైన వేటు పడే సుముహూర్తం ఎప్పుడో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆ గుట్టేదో
విప్పమనండి.. విందాం!


పండించిన పంటకు మంచి రేటు పలికేది ఎన్నడో ముందే తెలిస్తే కష్టపడైనా
సరుకును దాచుకుని నష్టపోడుగా పాపం రైతన్న! నైరుతీ రుతు పవనాల రాక ఇదీ అని

నిక్కచ్చిగా తేలితే ముందుగానే దుక్కి దున్ని విత్తులు జల్లి నెత్తికి
చేతులు తెచ్చుకునే దుస్థితి తప్పునుగా అన్నదాతకు! వాయుగుండాలు తీరం దాటే

తీరు అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాతావరణ
శాస్త్రవేత్తలు. సదరు నిపుణులందరికీ జ్యోతిషంలో గానీ  గట్టిగా
తర్ఫీదిప్పిస్తే  దేశాన్నీ, జనాన్నీ వరదల బెడద నుంచీ
తప్పించిన్నట్లవుతుంది కదా!  ఏ సర్కారీ చాకిరీ ముఖాన ఎప్పుడు రాసుందో
ముందే ముఖం మీది రాతలు చదివే పండిత ప్రకాండులెవరైనా  చదివి చెప్పగలిగితే

ఇన్నేసి సెట్లతో విద్యార్థులకు కుస్తీపట్లు తప్పును కదా! సూపర్ సక్సెస్
ఫార్ములా ముందే ఫిక్సైపోయుంటే చిన్న నిర్మాతలిలా తలలు తాకట్టు పెట్టుకుని
మరీ చెత్త చిత్రాలు పోగేసే రొష్టు తప్పును కదా? పసిడి ధర ఇదిగిదిగో

పడిపోయింది, గ్యాసు ధర అదిగదిగో అంతర్జాతీయంగా ఎక్కడికో ఎగిరిపోతోందంటో
పచ్చడి మెతుకుల కూటిక్కూడా తడుముకునే బడుగుజీవిని కంగారు
పెట్టేస్తున్నాయ్ బంగారం కొట్లు, బండి చవురు బంకులు! బంగారంలాంటి

జీవితాలు వాటి చుట్టూతా గిరిటీలు కొట్టకుండా కాపాడవచ్చు కదా కాలజ్ఞానం
పైన అంత అపారమైన అవగాహనవుండే నవీన బ్రహ్మంగారులు నోరు తెరిచి బోధించి! ఏ

అపరాల ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో.. స్టాకు బజార్లలో ఏ షేరు ధర ఏ
క్షణంలో ఎంత లోతుల్లోకెళ్లి పడిపోతుందో .. ముందే కనిపెట్టేసి ఓ ఉగాది

పంచాంగం లాంటిది రిలీజు చేసేస్తే.. కన్రెప్ప కొట్టే లోపలిట్లా లక్షలూ
కోట్లూ ఆవిరయిపోడాలు.. ఏడుపులు ఉండవు కదా! దాంతాడు తెగా.. ఒక్క నోస్టర్

డ్యామూ నోరూ అడ్వాన్సుగా పెగలదు! సరి కదా.. తీరా తాడు తెగి బక్కెట బావిలో
పడిం తరువాతనా.. ఇదిగిదిగో.. ఇలా జరుగుతుందనేగా మేం ముందే కనిపెట్టి

ఘోషెట్టింది!’ అంటూ టీవీల ముందు చిందులు!
లావు లావు ‘లా’ పుస్తకాలు.. అవీ ఇవీ.. చదివి ఐయ్యేయస్సులు ఐపీయెస్సులూ
ఐపొయ్యే సార్లు, దొరసాన్లు ఇంకాస్త మనసు పెట్టి ఆ కూస్త బల్లిశాస్త్రమో,

పాదసాముద్రికమో కూడా ఔపోసన పట్టేయరా నిఖార్సైన  ప్రభావమంటూ నిజంగా
పరాశాస్త్రలకే   ఉండుంటే!

వాస్తవేమిటంటే..
వాస్తు వసతి కోసమని ఎన్నడో ఏర్పాటైన ఓ  చిన్న నిర్మాణశాస్త్రం. గుహల
నుంచి కాంక్రీటు గృహాల దాకా ఎదిగిన మనం  ఇంకా ఆ ఆకు కుటీరం నాటి అవసరాలను
తీర్చిన పాత నియమ నిబంధల చూరులు పట్టుకు వేళ్లాడుతు ఉంటే మానవ వికాస
నిర్మాణం ముందు ముందు మరంత విస్తరించడం ఎప్పుడు?

వరాహ మిహిరుడి వాస్తు ప్రకారం  మహానగరాలల్లో కాని  నిర్మాణాలు సాగిస్తే
ఇరుగింటి మురుగు పారేది పొరుగు పడక గది కిందనే!  మయామాతా, మానసారా.. ఎవరి
వాస్తు ఘోష వాళ్లది. వాటిలో వాటికే ఏకీభావం లేని పరాశాస్త్రాలతో  నేటి
నాగరిక మానవుడు ఏకీభవించడం పరాచికం కాదా?

వీరేశలింగంపంతులుగారు అమావాస్యనాడు ఉద్యోగంలో చేరి మహోపాధ్యాయుడిగా
కీర్తి గడించారు. సురవరం సుధాకరరెడ్డిసారు  రెండువేల నాలుగు  నాటి
ఎన్నికల్లో రాహుకాలంలో నామినేషన్ వేసి  మరీ ఎం.పీగా గెలుపు సాధించారు!


నాడీ జ్యోతిషం వేదవిజ్ఞానం కాదు. నాలుగో శతాబ్దం దాకా వేదాలలో వాస్తు
ప్రస్తావనే లేదు. ఎన్ని వేద సంహితలలో భూతద్దం పెట్టి వెతికినా
సంఖ్యాశాస్త్రం కనిపించదు. మనిషి వస్త్రలాభం, వాహన యోగం గోడ మీద పాకే

బల్లా నిగ్గుతేల్చేది? సిల్లీ! కుళ్లు బుద్ధులతో మనం అనుక్షణం కొట్టుకు
చస్తూ ఆ కలహాలకి కారణాన్ని పురుగులేరుకు తినే  బల్లి మీదకా తోసెయ్యడమా..

దారుణం!

ఈ సారి ఇంకేదో మూడు కాళ్ళ కప్ప బొమ్మ పట్టుకుని నవ్వుతో బైటికొచ్చాడు
పి.య్యేసారు. చైనా వాస్తు ఫెంగ్-షూయి ప్రకారం మూడు కాళ్ల కప్ప గుమ్మం
ముందు కూర్చున్నట్లుంటేనే ఇంటి యజమానికి మనోసిద్ధి ప్రాప్తిరస్తట!
ఇట్లాగే ఇంకా ఏవేవో చాలా శాస్త్ర మర్మాలు విప్పచెప్పే ఉత్సాహంలో ఉన్నాడు
ముసలయ్యగారి పర్శనల్ సహాయకుడు! కానీ నా మానసికస్థితి అప్పటికే ఒక గట్టి

స్థితప్రజ్ఞతను సాధించింది.  మూడు కాళ్ల కప్పతో సహా గిరుక్కున వెనక్కి
తిరిగి వచ్చేసా.

‘అష్టమి, మంగళవారం, ఆ పైన గ్రహణం. బయల్దేరిందేమో రాహుకాలం. అదీ వర్జ్యం
వదలక ముందు! ఎదురుగా వచ్చిందేమో నల్ల పిల్లి! కాస్తంత సేపు ‘కూర్చుని
నెత్తి మీదిన్ని నీళ్ళు జల్లుకుని పోవయ్యా మగడా!’ అన్నా! వింటేనా?

పరగడుపున బల్లి భుజం  మీద పడ్డప్పుడే అనుకున్నాలే, ఇవాళేదో ముదనష్టం
ముహాన రాసిపెట్టుందని..’ ఇట్లా  సాగుతుంది ఇంట్లో మా ఆవిడ పురాణం. రక
రకాల శాస్త్రపరీక్షలకూ,  ఎన్నో రకాల నివేదికలకూ, ఇదిగో ఈ మూడుకాళ్ళ కప్ప

బాపతు  దిష్టిబొమ్మలు గట్రాలు మరికొన్నింటికి.. అంతా కలసి ముసలయ్యగారి
పి.య్యేమనిషి  నా మూతి పళ్లు రాలగొట్టి   రాల్చుకున్నవి   అక్షరాలా అర్థ

పదివేల నూటపదహార్లు! వాటి  గురించే ఆవిడ షష్ఠాష్టకాలు!
 ‘సొమ్ము పోతే పోయిందిలేవయ్యా! ఆ వార్డు మెంబరూ వద్దు.. పాడూ వద్దు! ఎవరం
ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇంచక్కా నువ్వూ ఆ చైనావాళ్ల వాస్తు
బొమ్మలు అమ్మే కొట్టు వెంటనే మొదలెట్టు’ అనేసింది ఆవిడే మర్నాడు

వాతావరణం చల్లబడి మెదడు మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాత!
నిజమేగా! ఎవరం ఏ పని చేసేది అయినా ఆదాయం కోసమేగా! ఇదీ ఓ ఆదాయ మార్గమేగా!
***

Saturday, March 7, 2020

సరదాకేః మగువంటే మగవాడి మర-యంత్రమా? -కర్లపాలెం హనుమంతరావు





చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూbత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి sఅదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 
పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 
నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 
వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్కుడు మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాతే మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా? అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగాడు లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహా రథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాతనే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పడుతున్నందు వల్లనే  స్త్రీలోకమంతా ఇంతలా అల్లకల్లోలంగా తయారవుతున్నది.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాదే తన పాలిట సైతానుగా మారుతున్నందుకు ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడాళ్లే.. కైకేయి, మంధర, శూర్పణఖ.. అంటూ తన బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెచ్చర్లు దంచికొడతాడు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి ఎంతలా వేపుకుతినలా? అంటూ అంటూ- సొంటూ లేని శుంథ ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 
కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్నామే వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందికాదు. ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శపాలకు గురయిన కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేస్తే పుణ్యస్త్రీ బిరుదులు వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగాళ్ల  నుంచే!
ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసేసింది ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. కాబట్టి వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్నున్నా స్త్రీలకు అన్నాయం చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయ్.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించిందేనట ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే కదా  మగాడికి ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకొనున్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛ అనేదే బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 
మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టేయంగానే తలొంచుకొని వెళ్లి అతగాడి వంశం మొత్తానికి  జీతం బత్తెం లేకుండా శాశ్వతంగా ఊడిగం చేసుకోడం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలు ఇప్పటికీ గుడ్డిగా నమ్మి కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మగజాతిని మాత్రమే!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు.. అన్ని అనుభవాలూ అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లిందెవరూ? 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితి.

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చు  మగవాడి హక్కులతో సమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యం 
- కర్లపాలెం హనుమంతరావు 
(సూర్య  దినపత్రికలో ప్రచురితం ..మార్చి 8, మహిళా దినోత్సవ సందర్భంగా )  

***


Saturday, February 15, 2020

సరtదాకేః స్వర్గం- నరకం రచనః కర్లపాలెం హనుమంతరావు


ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా
టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత
వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే
ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే..
కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే
పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.
ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి
చేంతాళ్ళు అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా  తిరుమల
శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్
రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకు ఇక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం
ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ
చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు
కుదరవు.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు
స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత
అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను కోసం, జీతం కోసం, రేషన్
కోసం, గ్యాసుబండల కోసం, అధికారుల  దర్శనం కోసం.. ఎన్నేసి రోజులు
నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు
దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో
చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని
పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.
సెల్లో ఆయనగారెవర్నో కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి
అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష
పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాత జీవితం తాలూకు  పాప
పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో
ఎన్నుకోవచ్చు..'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు
నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం'
అని దే.దదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు
రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేంతలో కంటి ముందు.. నరకం!
నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో
సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును
ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు,
మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర
ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో
మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల
అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన
చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది
కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం
మనిషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు..
ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు
తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు,
మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు,
నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా
కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ,
తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత
పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది..
తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా
కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!
అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు
తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం..
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని
రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి
తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో .. రోజుచివర్లో.. చీకట్లో
ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.
ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ
నరకాన్ని  చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం
రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని
అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వనసంగీతమంటే   ఏదో ఒక ఐదారు
నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ
తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక
వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్
బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని
హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే గదా! దప్పికతో నిమిత్తం
లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా
ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా  బెత్తెడు దూరంలోనే
ఉన్నట్లండేది!  ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’
చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి
గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు,
నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం
తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో
కండెలకు అసలు అయే పనేనా?
'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో..
జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు,
రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,.
స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.
వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే
స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.
మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా
నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు
పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న
మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి
బొత్తిగా సాపత్యమే లేదు.
మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్ భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన
అహమ్మదాబాదునగరం.
రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన మర్నాటి  అమరావతినగరం.
పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ
చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం. నిజానికి  వాళ్లంతా
మొన్నరాంభద్రయ్యగారు  సందర్శనార్థం విచ్చేసినప్పుడు-  పిలిచి
ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు
వేళ్లాడుతున్నవి  అప్పటికి మల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి,
చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ
పెద్దమనుషులంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన
వి.వి.వి.వి.ఐ.పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల
వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని  పడుతున్నాయి. ఆ కొరడాధరులంతా మొన్న ఇదే
చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని
మురిపించిన  యమకింకరులే!
నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట
పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేటంత
బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి
స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక
ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ
భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు  మా స్వర్గ నరకాల
ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న
నరకానికే కదా నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ
భూమ్మీద జనానికి మీరు చూపించే హామీలల్లోనూ మోసం.. దగా ఉన్నట్లే లెక్క!
ముందే చెప్పాం గదా!  భూమ్మీద మీలాంటి నాయకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య
విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు
కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి వీపుమీద ఝళిపిస్తూ!
'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం
దెబ్బో ఎవరికి వారుగా  జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే
అర్థంచేసుకోవాలబ్బా!
స్వస్తి!
***
- కర్లపాలెం హనుమంతరావు
(సూర్య - సరదాకే  - 15 ఫిబ్రవరి 2020 ప్రచురితం)

Saturday, February 8, 2020

సరదాకేః ఆదివారం శీర్షికకు తిట్టు!.. తిట్టించు! -కర్లపాలెం హనుమంతరావు




వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల
ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం

కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే
ప్రజల స్వాముల వాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి
ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.
ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల
బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో
గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే
సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!
తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని
మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ
ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చత్తుర’ని
బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ
ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద బొత్తిగా నమ్మకంలేదు.   తలనొప్పి
తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ‘ఓటర్లే
దేవుళ్లు’ అంటూ స్త్రోత్రాలు అప్పగించేసేది అందుకే! నిజానికి దేవుళ్లతో
పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ!
కాసుల పురుషోత్తమం అని కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులపరించాడు. 'నీ పెళ్లాం
భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద
బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో
కామితార్థుడికి మల్లే వీర పోజులు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ
కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకులతో ఆ క్రెడిటంతా నువ్వే
కొట్టేసుకుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి
ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకయ్యా పతితపావనుడువన్న   బిరుదు అసలు?
పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ
దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే.. తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడు
గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!
దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ
ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు భక్తుడికి
ఠక్కున ఆఫరయే జంపింగ్ జమానా ఇది.
 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో
ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయ మరీ పాతకాలం
నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సవానికి ఊత్సాహపడే విగ్రహం
కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి
కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు
ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి
హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే దాకా
పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు
అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా
ఎగదోసింది. మసిపూసి మారేడు చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమంట? కడుపులో మంట
రేగితే  ఓటరే  ఊరేగే నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరా పూసి, బురద
జల్లే రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా
కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడవబట్టే!
పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్
బాగ్ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే
కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్లు?
కోన్ కిస్కాగొట్టంగాళ్ల తిట్లన్నీ ఒకే దిక్కుకు మళ్ళించడం ఆ ముఠాల
టార్గెట్టు! ఎన్నికలు ఇవిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా
తిట్టే వర్గాల మీద ఏ అయోథ్యను మించి వరాల జల్లులో కురిపించేస్తే సరి!
చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం
చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు.   బోడి మల్లయ్యల
తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం
దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగా!  అయినా తిట్లక్కూడా ఉట్లు తెగే
సత్యకాలమా.. పిచ్చిగానీ?
అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని
సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ‘ఒద్దికతో
లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు
ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను
దాల్చె నీ నియమవరుడు!’ అంటూ  తిట్టిపోసినా  దేవుళ్ళు కూడా  కిమ్మనడంలేదే!
 కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి
నోరుజారారనో,  లైంగిక దృష్టిన వేధించారనో  మనిషి మధనపడ్డం.. యుద్ధకాండకు
దిగిపోడం.. హూ కేర్స్! శుక్రవారం కోర్టు బోను.. శనివారం కోర్టు తరలింపు
సీను! జనాలు ఎవర్నన్నా శాపనార్థాలు పెడుతున్నారా? దండుకునే సమయం దండగ
కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా  ఉన్నదిప్పుడు!
దూర దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు
చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు
తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల
చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ
మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..
ఆంజనేయుడికి మధ్య జరిగే గలాటాకీ నవ్వుకొనే జనాలకు నేతల తిట్లు, సిగపట్లు
ఏమంత ఎబ్బెట్తనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!
‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు
మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు
నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని
శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది
కదా అర్జునుడేమన్నా గమ్మునున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/
ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు
లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు
వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు విసురుకోడానికి ముందు
ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ
మాత్ర్రం తిట్ల వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా
ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ
జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలిచ్చేస్తున్నారిప్పుడు.
పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు ఇంకాస్త పదును
నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనతా సైతం తొక్కేసే
మూడులో లేదిప్పుడు.
 తిట్టించుకొనేవాడి మనసు చివుక్కుమంటుందంటే ఫక్కుమని నవ్వొస్తోంది.
వినేవాడి వీనులకు ముందు భాష పసందుగా ఉండాలి. చట్టసభల్లో జుట్టూ జుట్టూ
పట్టుకునే ముందు రెండు వైపులా  లాంగ్వేజ్  లవ్లీగా పండాలి! సమయానికి
ఠక్కని ప్రసారాలు కట్ అయిపోతే జనం సరదా కోసమా కోపంతో  చిందులేసేదీ?!
కారుకూతల వినోదవల్లరి కారు చవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్
పబ్లిక్ రుసరుసలు!
కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని పరమపదిస్తే
నరకంలో ఎవరూ మడతమంచాలేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని
తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ
డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన
దండంతో మరో రెండు వడ్డిస్తారు.
అయినా తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా
పిచ్చి తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే
మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా
బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే
మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు
వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని
కోట్లుంటాయో లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు ప్రసాదం పెట్టే పై
దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని
సూటిపోటీ మాటలు జనం అంటారు?
భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న
బ్రహ్మముఖం నుంచి ఆరభటీవృత్తితో రౌద్రం ఉత్పన్నమయిందా? శారదాతనయుడి
'భావప్రకాశం'లో ఆలాగని రాసుందా? ఉన్న వెకిలి పాండిత్యం మొత్తం సందర్భ
శుద్ధి లేకుండా వెళ్లగక్కే మేధావులను  కుళ్లబొడవాలి ముందు.  ఆ దక్షాధ్వర
ఘట్టంలో పోతనగారి ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరి ఇప్పటి  కొత్త నేతల
యాంటీ- హింస నచణ?  ఉత్తిత్తిగా వేలెత్తిచూపటానికా ఓటుకు అన్నేసి వేలు
దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిదను గాడ్ అంటూ కాళ్లట్టుకు
దేవులాడింది నేతలు?
భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి
అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి
బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి
దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు
కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి
కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు
పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని
రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?



'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు
.. 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్
కవితలెప్పుడూ! కానీ ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా
శిల వేయద్దంటే ఎట్లా? కొత్త తరం నేతలూ ఆ తలపోటు కవితలే ఫాలో అవ్వాలా?
అదేం ‘లా’? నో.. వే! నేటి తరాల నేతల దారి నేరుగా బూతు భాగోతాల ‘హై వే’
మీదనే!
బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం
వల్లించినా ఆ పెద్దాయనా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! ఆగ్రహం
చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోందిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం..
నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం ముద్ర పెరిగిపోతుంది రోజురోజుకూ.
‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికీ ప్రణాళిక
తయారవుతోంది!
 స్వగృహంలో పడగ్గదయినా సరే చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్
చేసుకునే బైటికి రావటం బుద్ధిమంతులకు అవసరమిప్పుడు! చక్రం మీద కుతి
ఒక్కటే చాలదు! వక్రమార్గంలో అయినా సరే పచ్చిబూతులు నోటికి నిండుగా
పుక్కిటపట్టక తప్పదు పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితిలేదు.
 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి
మహాభారతం అరణ్యపర్వంలో అర్థాంతరంగా ఆగిపోయిందంటారు.  నన్నెచోడుడూ
కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపెట్టబట్టి  యుద్ధంలో
దారుణంగా మరణించాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన
తెగిన లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా
లేకుంటే మాత్రం కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత
పడేది.



అనకూడని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే
 సామాజిక మాధ్యమాల  మాయాజాల కాలం బాబూ బాబూ ఇది! బాపూజీ బోధల మీదింకా
నమ్మకమున్నది ఆ పాతకాలం నాటి ముష్టి మూడు కోతి బొమ్మలకే!  మిగతా జాతి
తూగు మొత్తం  తూలనాడే కొత్త తరం నాయకత్వం వైపే! బూత్ పాలిటిక్స్ లో బూతు
వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనడమంత అసంబద్ధం. అనకా
తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు తిట్లు
వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టు.. అనడం పెద్ద తప్పు.
ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా?
అని ఇంకా సందిగ్ధమేనా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా
తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!
(సూర్య దినపత్రిక ఆదివారం సరదాకే శీర్షిక 9, ఫిబ్రవరి, 2020 )

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...