Saturday, December 11, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం ధనమంత్రం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 )


 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ధనమంత్రం

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 ) 


 ' ధన మూలం ఇదం జగత్' . కనుకనే కనకాన్ని తాను స్వీకరించాడు జగన్నాటక సూత్రధారి. ఒక్కో కొమ్ముకి ఇరవై బంగారు కణికలు చొప్పున కట్టి ఉన్న ఇరవైవేల గోవులను 'బ్రహ్మర్షి' అని నిరూపించుకున్నవారికి బహుమానంగా ఇస్తానని త్రేతాయుగంలోనే జనక మహా రాజు ప్రకటించాడు. మనిషికి మనీతో ఉన్న లంకె అంత బలమైనది .


'ఇమ్మనుజేశ్వరాధములకు తన కావ్య కన్యకను అమ్మను .. పొమ్మన్న బమ్మెర పోతన్న  లాంటివారు  నూటికో కోటికో ఒక్కరుంటారేమోగానీ... ' సహసా విదధీతిన క్రియాం' లాంటి చక్కని పద్యాన్ని కూడా అవసరానికి అమ్ముకోక తప్పని భారవిలాంటి భాగ్యహీనులే భూమ్మీద అధికం! 

హరిశ్చంద్రడంతటి చక్రవర్తి భార్యను అంగట్లో పెట్టాడు! దైవత్వం కన్నా ధనతత్వమే ప్రధానంగా మారిందన్నది సుస్పష్టం.


'డబ్బుంటే ఏనుగుకన్నా ఎలుకే బలమైనద'ని చైనా సామెత. 'చింతామణి పత్రిక' పోటీ పెట్టకుంటే 'హేమలత'  వంటి చారిత్రక నవలలు రాసుండేవారేనా !' అంటాడు చిలకమర్తి. 


నిజాం నవాబుకి డబ్బు పెట్టెలు తలగడ దగ్గర పెట్టుకొని పడుకునే అలవాటు. ఎలుకలు కొట్టేసిన ఆ నోట్ల విలువే ఈ రోజు లెక్కల ప్రకారం సుమారు ఐదువేల కోట్లన్నది నమ్మలేని నిజం.


'మనిషికి జంతువుకీ తేడా డబ్బు ఇబ్బందులే' అంటాడు మార్క్ ట్వయిన్ . 'పూర్' స్పెల్లింగులోనే రెండు గుండు సున్నాలున్నాయి. ద్వాపరంలోనైనాసరే, సొమ్ముల్లేకుండా సంసారం నడపడం కష్టం. కాబట్టే  కుచేలుడు కృష్ణుణ్ణి ఆశ్రయించడం ! .


కాణీ కిందపడ్డా వంగి తీసుకోనివాడు మనిషే కాడు. ధారంలేకుండా దండను అల్లవచ్చేమోగానీ, పైసలు లేకుండా బతుకు బండిని నడపటం కష్టం. మహాత్మా గాంధీ మేకపాలు, వేరుశనగపప్పులకే జమునాలాల్ బజాజ్ జేబులో నుంచి రోజుకు ఓ వెయ్యి ఖర్చయ్యేదని సరోజినీదేవి నాయుడు సరదాగానే అన్నా అందులో కొంత నిజం లేకపోలేదు. 


కాసులకింత కథుంది కనకనే అప్పిచ్చేవాడు  లేని ఊరుకెప్పుడూ వెళ్ళొద్దని హెచ్చరించాడు సుమతి శతకంలో. డబ్బుంటే ఇంకేమీ చేయనక్కర్లేదనే ధోరణి పెచ్చుపెరిగిపోతోంది.


డబ్బులకోసం ఇక్కడ పార్టీలు టిక్కెట్లమ్ముకుంటున్నాయి. పాఠశాలలు సీట్లమ్ముకుంటున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు  అమ్ముకుంటున్నారు. పంతుళ్ళు పోస్టల్ బ్యాలెట్లమ్ముకుంటున్నారు . పేరెంట్స్ మగపిల్లకాయల్ని కట్నానికమ్ము కుంటున్నారు. అడవి బిడ్డలు ఆడబిడ్డలను, అభాగ్యులు కిడ్నీలనూ, రక్తాన్ని అమ్ముకుంటూనే ఉన్నారు. దేవుడి విగ్ర హాలను, భూములను, దర్శనాలను, ప్రసాదాలను చివరికి హుండీలో పడిన డాలర్లను కూడా వదలకుండా పెద్దలు అమ్ముకుంటున్నారు. నకిలీ నోట్లు, వీసాలు, డిగ్రీ సర్టిఫికెట్లు తక్కెడలో పెట్టి మరీ అమ్మటానికి  తయారుగా ఉన్నారు.  


ప్రభుత్వం భూములనమ్మేసింది. కేంద్రు ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను అమ్ముకోవాలనుకుంటుంది. 


అమ్మకాలే అన్నిరకాల సంస్కరణలకూ మూలమని అందరూ బలంగా నమ్మే రోజులు ముంచుకొచ్చేస్తున్నాయి. 


ఐపియల్ వచ్చి క్రికెట్టాటని అంగడి సరుకుగా మార్చేసింది . పెళ్ళిని కూడా ఈ మధ్య ఓ బాలీవుడ్ తార ప్రాయోజిత కార్యక్రమం కింద అమ్మేసుకుం ది. పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ చావుకూడా కొన్ని వర్గాలకు కనకవర్షం కురిపించే స్కీములుగా మారిపో వటం ఈ శతాబ్దపు విచిత్ర  విషాదం.


కిలో సన్నబియ్యం యాభై, కందిపప్పు దాదాపు వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. కొందరు టీచర్లు ఎక్కడినుంచో వచ్చిన యవ్వన గుళికలను బళ్ళు మానేసి ఊళ్ళెంట తిరుగుతూ కమీషన్లకు అమ్ము కుంటున్న వైనం ఈ మధ్య నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బైటపడింది.


ధనసంస్కృతి పెచ్చుమీరితే మధ్యతర గతి బతుకులు ఎలా నలిగిపోతాయో ఇంగ్లీషు నవలా రచయిత ఆర్ధర్ మిల్లర్ అరవైఏళ్ళ కిందటే ' డెత్ ఆఫ్ ఏ సేల్స్  మాన్ ' నాటికలో చక్కగా చెప్పి హెచ్చరించారు.  నెహ్రూ జమానాలో విదే శాంగమంత్రిగా పనిచేసిన ఎమ్.సి చాగ్లా తన ' రోజెస్ ఇన్ డిసెంబర్'లో కూడా దాదాపు ఇదే ప్రమాదాన్ని కళ్లకు కట్టాడు. సరఫరాకు గిరాకీకి సంబంధంలేని వస్తువు లను ఉత్పత్తి చేసి  వాటి వినియోగ వ్యవస్థల  విస్తరణకు పెట్టుబడిదారీ వర్గాలు అల్లే ప్రచార వ్యూహంలో పడే సటు జీ వి- జీవితావసరాలు కాని వాటిని కూడా  సొంతం చేసుకునేందుకు తపించిపోతాడో స్త.. అవి పొందని పక్షంలో జీవితేచ్ఛకు  ఎలా  నీళ్లు వదులుకుంటూగా ఆ పుస్తకం సవిస్తరంగా చెప్పుకొస్తుంది. ఇప్పుడదే నిజమవుతూ ఉంది. 


ఇష్టమైన చెప్పులు కొనలేదని ఓ పాష, మంచి విశ్వవిద్యాలయంలో చేర్పించలేదని మరో అమ్మాయి తమ నిండుప్రాణాలను బుడగలో గాలి తీసినంత తేలికగా తీసుకున్నారు . వేసే భిక్షానికి కనీసం రూపాయి  తగ్లకుండా  ఉండాలని తమిళనాట ఓ అడుక్కునేవాల్లా సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుండటం దీనికి కొసమెరుపు


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18-07-2009 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...