Saturday, December 7, 2019

ధరల ఉగ్రవాదం -కర్లపాలెం హనుమంతరావు- ఈనాడు వ్యంగ్యం



మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి ఉల్లిపాయలు కొనేందుకని బ్యాంక్ అప్పుకోసం వెళ్లినట్లు వార్త!
మామూలు మధ్యతరగతి మహిళామణి  మరి కప్పు పంచదార  కోసం ప్రపంచ బ్యాంకు అప్పు కోశం వెంటబడి రొప్పుకుంటూ పరిగెట్టాలేమో! కిలో బియ్యం రూపాయికి ఇస్తామన్న ఎన్నికల హామీ సాకారం చెయ్యడానికి మన పాలకులు పావుకిలో ఉల్లి పాతిక రూపాయలు పైగా పెంచేశారు. ఎక్కడెక్కడో ఉగ్రవాదులు బాంబులు పెట్టేస్తున్నారన్న  వార్త విని బెంబేళ్లెత్తడం ఆనక!  ముందు మన రైతు బజారుల్లో పేలుతున్న కూరగాయ ధరలకు అప్రమత్తం అవండి బాబులూ! ఉప్పు బాంబో, మిరప బాంబో పేలిందంటే బాబోయ్.. దేశమంతటా ఒహటే భీభత్సం! శాంతిభద్రతల అంశం ప్రశాంతంగా చూద్దురు గానీ.. ముందు ఆహారభద్రత వశం తప్పుతోంది అంకుశం ఎక్కడుందో వెతుక్కు రండి సాములూ!
అరేఁ! ఉల్లి దోశ తినాలన్నా ఏ బిర్లా కడుపునో పుట్టి తీరాలా?  టాటాగారూ! ఎట్లాగూ ఆ 'కారు లక్ష'  స్కీములో తమరు ఫెయిలయిపొయ్యారు గదా! పోయిన వరువు తిరిగి పుంజుకునే స్కీము.. కరేపాకు రెబ్బ కనీసం రూపాయికి ఒకటైనా దొరికే ఉపాయమో కనిపెట్టడమే! 
అమరావతులు, ఆర్టీసీ ప్రయివేటీకరణలూ ఎట్లాగూ వట్టి గాలి కబుర్లేనని తేలిపోయాయి గదా! ఉపాధులూ, ఉపకార వేతనాలూ, ఉద్యోగాలతో ఎట్లాగూ గట్టెక్కే పరిస్థితులు లేవు గానీ.. ఉప్పుకారాలు, ఉల్లి మసాలాలు వంటి వంటింటి పచారీ  సరుకుల వైపు  నుంచైనా నరుక్కురండి సారులూ.. ఏదో వేళకు ఎప్పుడూ ఏ మూలనో ఓ ఎన్నికల మేళం మోగే మన దేశంలో ముఖ్యంగా కూరగాయ ధరవరలతో వేళాకోళాలు వద్దు  మహాప్రభో! కొత్తిమేర కట్ట కోసం  కొంప కప్పు ఎక్కి  ఇంటిల్లాలు కొప్పు బిగించిందంటే సర్కార్ల ఇమేజికే రిపేరు చేయలేని డేమేజి మరి! అరవై పెడితే తప్ప అరకిలో ఆలుగడ్డలు సంచీలో పడని గడ్డ మీద నేతగా నిలబడ్డందుకు సిగ్గుతో తలొంచుకునే ఖర్మ చేజేతులా తెచ్చుకోవద్దు పెద్దలూ! ఎన్నికలంటూ నిజాయితీగా జరిగితే ల్యాండ్- సైడ్ విజయం కాదు..     ధరల దెబ్బకు నిలబడ్డ నేతలంతా ధడేల్మంటూ నేల కూల ఖాయం! వెయ్యో రెండున్నర వెయ్యో చేతిలో వెయ్యమంటే  ఎప్పట్లా   కోయంబత్తూర్ సరుకుతో తయారైతే చాలదయ్యా సామీ! ఈసారి ఆసామి ఇంటికో తాజా కూరగాయల గంప దింపి పొమ్మంటే .. నా సామి రంగా !
తనరు కొంప గంగలో మునగడం ఖాయం. 
వంకాయ కిలో వంద లెక్కన కొనే స్తోమతు కూడక తేరగా వచ్చిన  మంచి అమెరికా సమ్మంధానికి మంగళం పాడేసుకుంది మా మంగమ్మక్కగారు తన బంగారు కూతురుకు! కాలూ చెయ్యీ చక్కంగా ఆడుతున్నా  ఆ ఆస్ట్రేలియా ఖండం దాకా పాకుతూ దేకుతూ పడిపోవాల్సొచ్చింది మా చెంగయ్యమామ తన పెద్ద మనమడి దగ్గరకు మనసారా  ఉలవచారు నీళ్లు తాగడానికి! చెప్పుకుంటూ పోతుంటే మరీ అతి అనిపించే ఇట్లాంటి కన్నీటి కహానీలు కడవలు.. బుంగలు! 
మా దోస్తు పరమేశం శాస్తురులు గాడింట్లో దొంగలు పడి.. గ్యాస్ బండతో సహా ఫ్రీజర్లో దాచుకున్న పది కిలోల వెజిటబుల్స్ మొత్తం తట్టతో సహా మాయం చేసేసాడు.. దాచుకున్న  బీరువా  బీగాలు ఆ ఫ్రిజ్జు పక్కనే  పడేసున్నా! ఆ దొంగ వెధవ ఎవడో గాని కూరగాయల మీద చూపించిన కక్కుర్తి మరి కంచి పట్టు శారీలు, శాలువల మీద కూడా చూపించించాడు కాదు! 
కాశీ దాకా పోయి తినే కంచం ఏ గంగలోనో కలిపొఛ్చే విరాగులకే తప్పించి.. రోజుకో గజం చొప్పున ఆకాశానికి ఎగబాకే ఈ కూరగాయల ధరలతో సంసారులకైతే చచ్చే చావే! 

నాలుగు చినుకులు రాలితే ధరలన్నీ వాటికవే నీరుకారిపోతాయనే స్వామి ప్రబోధానందుల మార్క్ ధర్మోపన్యాసాలు వినేటందుకేనా  పుంజాలు తెంపుకుని మరీ సామాన్యులమంతా పోలింగు నాడు వేనులూ, రైళ్లూ, బస్సులు పట్టుకొని మరీ సొంతూళ్ల దాకా వెళ్లాడుతూ వచ్చి  నచ్చిన నేతలను ఎన్నుకొనొచ్చింది! జగన్నాథ చక్రాలను ఆనక తీరిగ్గా భూ మార్గం పట్టించే మార్గం ఆలోచిద్దురు గానీ.. బాబ్బాబులూ! ముందర్జంటుగా ధరాచక్రానికి దొరక్కుండా నభోంతారాళకి దూసుకెళ్లే అపరాల ధరల స్పీడునైనా  కాస్తింత ఆపే చాతుర్యం చూపెట్టండయ్యా  సర్కారు సాములార్లూ! మీ దేశభక్తి కూలా! ధరల అదుపును మించిన దేశ భక్తి భావన జనం మనసుల్లో ప్రస్తుతం మరోటి ఎక్కడేడ్చిందీ! ఒక్క పూట వరకైనా చూరు కింది నాలుగు నోళ్లలోకి రెండు వేళ్లూ వెళ్లే సదుపాయం మించిన  ప్రజాసేవ మరోటి లేనేలేదు మహాశయా!
ఆనాడు ఆ వేములవాడ భీమయ్య కవి ఏమని తిట్టిపోసాడో గానీ… ఇప్పుడు నిజంగానే కంచంలోని అన్నమంతా సున్నంలాగానూ, అప్పాలన్నీ కప్పల కుప్పలుగానూ కనిపించి  ఏమీ నంజక ముందే కడుపులు నిండిపోతున్నాయ్! సింగిల్ ప్లేట్ మీల్స్ కోసం డబుల్ బెడ్రూం కొంపలు కూడా కుదవపెట్టుకోవాలసిన రోజులొచ్చేస్తున్నాయ్! బ్యాంక్ లాకర్లలో భద్రం చేసిన సిరి సంపద అంతా  బైటికి లాగేసి వాటి స్థానంలో ఓ నాలుగు కరివేపాకు మండలు, మూడు మునక్కాయ కాడలు దాచుకుంటే తప్ప రాబోయే రోజుల్ని ఈ మాత్రమైనా కాచుకోవడం మహా కష్టమే అని మా బెంగేస్తున్నది మిత్రమా!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకపుట-28, డిసెంబర్, 2010)


Thursday, December 5, 2019

నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం- పురిటిల్లు- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య- 29, సెప్టెంబర్ 2019 - ప్రచురణ )





బుద్ధుడి బోధనలు సాగింది  పాలీ భాషలోనో, అర్థ మాగధి భాషలోనో.. మొత్తానికి ఆ భాషలో తెలుగు పదాలు కొన్ని(సుమారు 60) కనపడుతుంటాయంటారు. మనం ఇప్పటికీ వాడుతున్న అనేక తెలుగు పదాలు బుద్ధుని కాలంలో దైనందిక జీవితంలో వ్యవహారంలో ఉండేవని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు తన 'తెలుగులో పాలీ పదాలు' పుస్తకంలో పేర్కొన్నారు.
పైశానీ భాషలో కూడా తెలుగు పదాలు ఉన్నాయని తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. బౌద్ధ కొరియా యాత్రికుడు ఒకాయాన ఆరో శతాబ్దంలో చైనా, ఆఫ్ఘనిస్తానుల మీదుగా వచ్చి ఈ దేశంలో  కైబర్ కనుమల నుంచి మన నాగార్జునకొండ వరకు పర్యటించి వెళ్లాడు. ఆయన తనకు తెలిసిన ప్రాకృతం మాట్లాడినా ఆంధ్రదేశంలో ఎక్కడా ఇబ్బంది కలుగలేదని రాసుకున్నాడు! ప్రాకృత శబ్దం మన తెలుగు భాష పూర్వ రూపానికి దగ్గరగా ఉంటుందని  తిరుమలవారి థియరీ.
సుమేరియన్ భాషలోనూ తెలుగు పదాలు ఉన్నాయన్నట్లు శ్రీ రాంభొట్ల కృష్ణమూర్తి ఏదో సందర్భంలో రాసినట్లు గుర్తు. ఆయన దగ్గర సుమేరియన్ భాషాకోశం మొదటి భాగం ఉందిట. (మొత్తం నలభై భాగాలు). తుర్కీ నుంచి గంగామైదానం వరకు ఏదో ఒక ఉమ్మడి నాగరికత ఒకానొక కాలంలో విలసిల్లినట్లు రాంభొట్ల అభిప్రాయం! భాషల మధ్య ఆదాన ప్రదానాలు సహజం. సుమేరియన్ల .. మన భాషల మధ్యా ఆ తరహా  ఇచ్చిపుచ్చుకోవడాలు  జరిగివుండవచ్చని కృష్ణమూర్తిగారి  ఆలోచన.
ఇప్పటి బోధన్.. ఒకప్పటి సోదనం. ఏదో పెద్ద విశ్వవిద్యాలయ ప్రాంతం కూడా అప్పట్లో. 'బావరీ' గోత్రానికి చెందిన పెద్దాయనెవరో దానికి అధిపతి. అది బుద్ధుడు జీవించి ఉన్న కాలం. తధాగతుణ్ణి కలుసుకొనేందుకు సుమారు ఓ వెయ్యి మంది బావరీ పెద్దాయన శిష్యులు రాజగృహం (పాటలీపుత్రం) పర్యటించారు. ఆ బృందంలో అదృష్టవశాత్తూ ఒక చిత్రకారుడూ ఉన్నాడు. బుద్ధుని బోధనలు సాగుతున్న సమయంలో తెర వెనక నుంచి అతగాడు ఆ శాంతమూర్తి బాహ్యరూపం (ఔట్ లైన్)  గీసుకున్నాడు. తరువాతి సిటింగులో కన్నూ, ముక్కూ, చెవులూ.. వంటివి గుర్తుంచుకొని తీరిగ్గా చిత్రం పూర్తిచేయాలని ఆలోచన. ఆ చిత్రకారుడు అనుకొన్నట్లే జరిగింది.. కానీ కొద్ది తేడాతో! తధాగతుడి బాహ్యాకారాన్ని యథాతధంగా ఉంచి ఏ ప్రాంతానికి చెందిన శిల్పులు ఆ ప్రాంతానికి చెందిన మనిషి ముఖకవళికలతో బుద్ధమూర్తిని చిత్రించుకొన్నారు! చైనా, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, బర్మా, ఇండోనీషియా, భారతదేశాలలోని బుధ్ధవిగ్రహాలు ఆయా దేశవాసులను పోలివున్నా.. బాహ్యరూపం మాత్రం మన  చిత్రకారుడు సమకూర్చిన విధంగా  ఉండటం తెలుగుజాతికి గర్వకారణం.
బుద్ధుని విహార(బిహార) భూమిని తెలుగునేలకు తరలించిన ఘనత తెలుగువాడిది. బుద్ధుని విచారధారను బావరీ విశ్వవిద్యాలయ విచారధారగా మార్చుకున్న మేధస్సూ మన తెలుగువాడిదే.
శ్రీ పర్వతం తూర్పునున్న ఓ కుగ్రామం నాగార్జునుడి జన్మస్థానం అని ఓ నమ్మకం. అద్వైతం, మాయావాదం, నేతివాదం, అవతారాలుగా నేడు ప్రచారంలో ఉన్న హైందవ భావజాలానికి ఆ ఆచార్యుడి  అద్వం, శూన్యం, విజ్ఞానం, బోధిసత్వం ప్రభృత భావాలే మూలాలు. బౌద్ధం మహాప్రచారంలోకి వచ్చి మహాయానంగా వృద్ధిపొందిందీ మన  ఆచార్యుడి ఆధ్వర్యంలోనే! నాగార్జునుడి కొత్త ఆలోచనలకు పురిటిగడ్డ   తెలుగుభూమి! నాగార్జునుడి 'సృహుల్లేఖ' (స్రిహిల్లేఖ అని కూడా అంటారు) శాతవాహనులతో ఆచార్యునికున్న సాన్నిహిత్యం తెలియచేసే పత్రం. బౌద్ధులు కాకున్నా శాతవాహనుల నీతిపాలనకు, నేర నిరోధక చర్యలకు  బౌద్ధధర్మమే కేంద్రబిందువయిందని పరిశోధకుల మాట. దేశంలోని అధిక భాగాన్ని ఏలిన ఈ తెలుగు ప్రభువుల పాలనలో తెలుగువారి ప్రభ సహజంగానే దేశమంతటా వెలుగులు విరజిమ్మింది. పాటలీపుత్రంలో 'ఆంధ్రభృత్యులు'గా పేరొందిన శాతవాహనులలో సిముక సాతవాహనుడు దక్షిణాపథాన స్వతంత్రంగా రాజ్యమేలిన తెలుగు చక్రవర్తి. పాటలీపుత్రపు  పండితులు రాసిన పురాణాలలో 'అంధ్రుల' వంశావళి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తదనంతరం వచ్చిన ఇక్ష్వాకులూ తెలుగు రాజులే. ఆ ప్రభువులు పాలించిన భూమి విస్తృతమైనది కాకపోవచ్చు.  కానీ సృష్టించిన శిల్పసంపద  అపారమైనది. ఇప్పటికీ తెలుగువాడలలో కనిపించే ఆ శిధిల శిల్పకళల ఆధారంగానే మాన్యులు కె.కృష్ణమూర్తి ఆనాటి ఆటపాటలు, వేషభూషణాలు, సాంఘిక పరిస్థితులను గూర్చి ఆసక్తికరమైన గ్రంథాలెన్నో ప్రచురించారు. శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలం నాటి సాహిత్యం, శాసనాలు తెలుగు ప్రాకృతంలో కనిపించడం తెలుగువారికి గర్వకారణం.
తెలుగు నడిగడ్డ మీద వెలసిన శ్రీ పర్వతానికి దేశ విదేశాల నుంచి బౌద్ధులు, పండితులు విచ్చేసేవాళ్లు. అక్కడ ఒక మహావిశ్వవిద్యాలయం విలసిల్లింది కూడా. మహాయానమే కాదు.. వజ్రయానమూ ఇక్కడి నుంచే ప్రపంచం నలుదిక్కులకూ వ్యాపించిందంటారు. ఇప్పటి  టిబెట్టులో వర్ధిల్లుతున్నది ఈ వజ్రయానమే.  టిబెట్టుకీ తెలుగు గడ్డకి బౌద్ధం ఒక ఆధ్యాత్మిక బంధం.  
ఒకానొక కాలంలో ఆంధ్రదేశానికి నౌకావ్యాపారం ప్రధాన ఆదాయ వనరు. దేశదేశాల నుంచి వ్యాపారులు వచ్చి సాగించే బేరసారాలకు  వ్యావహారిక భాష  తెలుగు ప్రాకృతమే.
ఇక్ష్వాకుల కాలంలో 'శైలీయులు' బౌద్ధంలో ఒక ప్రత్యేకశాఖ. ఇండొనేషియాలో రాజులుగా వర్ధిల్లిన శైలేంద్రులు ఈ  శైలీయశాఖా సంబంధితులే కావచ్చని ఒక విశ్వాసం.
తెలుగు  ప్రాకృత సాహిత్యాన్ని విదేశీయులు .. ముఖ్యంగా జర్మనులు  సొమ్ము చెల్లించి మరీ కొనుక్కుపోయేవారు. ఇప్పటికీ జర్మనీలో పది పన్నెండు విశ్వవిద్యాలయాలు ఈ ప్రాకృతభా ప్రాకృతభాష మీద పరిశోధనలు కొనసాగిస్తున్నాయ్.

ధర్మం, తెలుగు భాష మధ్య గల బంధం దృఢమైనది. జైనులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతీయ భాషలను క్రమబద్ధీకరించేందుకు తగుసూత్రాలను రూపొందించారు. సామాన్యులకు చదువు సాములు నేర్పించారు. గణితవిజ్ఞానం  బడుగులకు చేరువయింది జైనుల పుణ్యం వల్లే! జైనంతో సాహచర్యం వల్ల సమాజానికి ఆ ధర్మం పట్ల విశ్వాసం వృద్ధి అయింది. ఆలయాల్లో  గీతాలు పాడేవాళ్ళు జైనులు. ఆ గీతాలే ఇప్పుడు నాటి మన  తెలుగు భాషాచరిత్ర ఆనవాళ్ల పరిశీలనకు ఉపకరిస్తున్నాయి. బౌద్ధులూ ప్రజల చదువు సంధ్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన బుద్ధిజీవులే. జైనులు, బౌద్ధులు ఆంధ్రదేశంలోని శిల్పకళకు కొత్త హంగులు తీర్చిదిద్దిన  కళాకారులు, కళాపోషకులు. బౌద్ధులు బోధిసత్వుని కథలను  నిరంతరాయంగా పారాయణం చేయడం ద్వారా  ప్రజలలో  పఠనాసక్తి  పెంపొందించినట్లు పరిశోధకుల మాట.
బౌద్ధం కారణంగా ప్రపంచానికి ధర్మకేంద్రంగా వర్ధిల్లిన ఘనత మన తెలుగు గడ్డది.  సన్యాసులకు, బ్రహ్మచారులకే పరిమితం అనుకున్న బౌద్ధాన్ని  సంసారులూ ఆచరించదగ్గ ధర్మంగా ఆచార్య నాగార్జునుడు తీర్చిదిద్దాడు.  ఆంధ్రదేశంలోని జైనులూ ఆ మార్గంలోనే సాగి తమ వంతు బాధ్యతగా సామాజిక సంస్కరణలకు పూనుకున్నారు. శ్వేతాంబరులకు, దిగంబరులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన యూపనీయులు తెలుగుజాతికి చెందిన వారేనని ఒక విశ్వాసం.
బాహ్యుబలి లాంటి భారీ విగ్రహాలు బోధన్ కేంద్రంలోనూ తెలుగువాళ్లు ప్రతిష్టించుకొన్నట్లు వినికిడి. జైన, బౌద్ధ మతాలలో భారీ విగ్రహాల ప్రతిష్టాపన ఒక ఆచారం. కక్షల కారణంగా అన్యమతస్తులు ఆ అఖండ శిల్పకళా వైభవాన్ని ఖండ ఖండలు చేయడం అన్యాయం. తెలుగునేల మీద ఊళ్ల పేర్ల పరిశోధనలకు పూనుకుంటే ఆ స్థలపురాణాల చాటున బోలెడంత తెలుగువాళ్ల చరిత్ర బైటపడుతుంది.
శాతవాహనుల తరువాత కొంత భూమిని  ఏలిన విష్ణుకుండినులకు నేటి నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరం రాజధానిగా ఉండేది. విష్ణుకుండినులు తమ పేరుకి 'ఇంద్రపాల్' అనే బిరుదును చేర్చుకొనే ఆచారం పాటించేవాళ్ళు. ఆ ఇంద్రపాలనగరం ఇప్పుడు  తెలంగాణాలోని ఏ ప్రాంతంలోదో? విష్ణుకుండినుల రాజవంశానికి చెందిన శాసనం ఒకటి బి.ఎన్.శాస్త్రిగారి పరిశోధనల్లో బైటపడింది కానీ నాటి ప్రాంతాల వివరాలు, ఆ రాజుల పాలనా ప్రాముఖ్యాలు వెలుగులోకి వచ్చే తీగెలేవీ ఆ పరిశోధన డొంకలో తగిలినట్లులేవు. డాక్టర్ అజయ్ మిత్రా చేసిన కొంత కృషి మినహా.. ఆ దిశగా  మరి దృష్టి మళ్లించిన పరిశోధకులు కరువయ్యారు! ఏదేమైనా నూతన విశ్వాసాలకు తెలుగు మాగాణం పురిటిల్లుగా మారడం ప్రతీ తెలుగుబిడ్డా ఎలుగెత్తి చాటవలసిన అంశం.
ఎవరు ఈ దేశంలో ఎక్కడ  పరిశోధనలకు పూనుకున్నా తెలుగువారికి సంబంధించిన చారిత్రకాంశాల  లింకులు కొన్నైనా తప్పక   బైటపడతాయి! దేశరాజధాని దిల్లీ తుగ్లకాబాదు ప్రాంతంలో ఒక ఆంధ్ర  ప్రముఖుని గోరీ కనిపిస్తుంది.  తుగ్లకుల ప్రధాని మాలిక్ మక్బూల్ సమాధి అది. ఆ ప్రముఖుని అసలు పేరు 'గన్నయ్య'! కాకతీయుల ప్రధానిగా ఆయన చాలా ప్రయోజకుడంటారు చరిత్రకారులు.
చరిత్ర పట్టం కట్టిన కుతుబ్ షాహీలు నిజానికి సొంతంగా ఏమంత ఘనకార్యాలు చేసిందిలేదు. పదవులను వేలం వేసి అమ్ముకునే పూర్వపు వ్యాపార ధోరణిని మానిపించి, సమర్థతను బట్టి నియమించడం, వారికీ వర్తించే విధంగా నియమ నిబంధనల రూపొందించడం ఆ వంశం చివరి పాలకుడి పాలనా సంస్కరణగా చరిత్ర శ్లాఘిస్తుంది.వాస్తవానికి ఆ సలహా పాదుషాకు ఇచ్చింది అతని ప్రధాని మాదన్న. మాదన్న తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం.
సంస్కృతంలో పంచకావ్యాలకు  సుబోధకమైన  వ్యాఖ్యలు రాసిన  వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథసూరి మన మెదక్ జిల్లా కొల్చారంలో పుట్టిన  తెలుగు బిడ్డ. ‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’(మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను) అంటూ తన  రచనా సరళి గురించి  సగర్వంగా ప్రకటించుకున్న ఆ తెలుగు పండితుడి వ్యాఖ్యల సాయం  లేకుండా  సంస్కృత కావ్యాల పఠనం అంగుళమైనా ముందుకు సాగదు. దేశదేశాల సంగీత విద్వాంసులు తన్మయత్వంతో ఊగిపోతూ స్వరార్చనచేసే త్యాగరాజస్వామి అరవదేశానికి తరలి వెళ్ళిన  మన తెలుగు తల్లి ఈత!
తెలుగు పండితులకు పొత్తాలకు పొత్తాలు వివరాలు నమోదు చేసే ఓపిక బొత్తిగా లేదన్న అపవాదు కద్దు. అందుకు విరుద్ధంగా మానపల్లి రామకృష్ణకవి పరిశోధనారంగంలో తన అసమాన ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించిన విద్యావేత్త. భాండార్కర్, ఆప్టే, రనడే, సంపుర్ణానంద్, మజుందార్ వంటి ఉత్తమశ్రేణి పరిశోధకులతో పోల్చదగిన ఆ పరిశోధక విద్వాంసుడు ప్రతీ తెలుగువాడికీ గర్వకారణం.
సంస్కృతాన్ని జాతీయయభాషగా ప్రకటించాలని బెల్గాం జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పట్టుబట్టిన కావ్యకంఠ శ్రీ గణపతి ముని తన పదో ఏట నుంచే బహుళ కావ్య రచనావతంస, నిరంతర పరిశోధక జిజ్ఞాసి. భారతీయ సంకీర్తనం అయనంతగా చేసిన వేదపండితుడు దేశం మొత్తంలోనే దొరకడు. ఆ సంస్కృతాంధ్ర మహాపండితుడూ  తెలుగుతల్లి నోముల పంటే!
వేదకాలపు సంస్కృతం పరాయి భాషలకు పదాలు పంచిపెట్టింది.  లౌకికభాష పేరున ఇతర భాషల  నుంచి తానూ పదాలు స్వీకరించింది. సంస్కృతంలో చాలా తెలుగు శబ్దాలు ఈ విధంగా చేరేందుకు ఆస్కారం ఉంది. 'తెలుగులో సంస్కృత పదాలు ఎందుకు వాడాలి?' అని మొండిగా వాదించే ప్రబుద్ధులు కొందరు అచ్చు తెలుగు పేరుతో  వికార శబ్దఘోషకు తెగబడడం విచారకరం. సంస్కృతం పేరుతో చలామణీ అయ్యే పదాలు ఎన్నో  తెలుగు ప్రాకృతాల నుంచి ఎగుమతి అయిన శబ్దభవాలేనని ఎంత తొందరగా  పెద్దలు  గ్రహిస్తే తెలుగు భాషకు అంత మేలు! సంస్కృతం ఏ రాష్ట్రానికీ చెందిన  ప్రాంతీయభాష కాదు. అది అఖండ భారతావనికి  చెందిన వాఙ్మయ సంపద. అందులో తెలుగుకూ సింహభాగం అధికారముంది.
దాదాపు రెండువేల ఏళ్ల కిందటే బౌద్ధ సాహిత్యం  తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమయింది. నాటకాలూ వేసేవాళ్లు ఆయా భాషల్లో. అప్పట్లో ఎవ్వరూ 'జననీ తమిళ భాషా' అని నినాదాలు చెయ్యలేదు. 'అవునవును' అంటూ ఏ తెలుగువాడు చప్పట్లు కొట్టిందీ లేదు.
కాలప్రవాహంలో కనుమరుగయిపోవడం  ఇతిహాసం సహజ లక్షణం.  వీలున్నంత  వరకు అందుకే దార్శనికులు చరిత్రగా దొరికిన విశేషాలను నమోదు చేస్తుంటారు.  తెలుగునాట ఈ తరహా చారిత్రిక జిజ్ఞాస  మొదటి నుంచీ కాస్త తక్కువే. కాబట్టే  తమవారు నడిచిన వచ్చిన దారుల్లో వారి అడుగుజాడల ఆనవాళ్ళు పట్టేందుకు తెలుగువాడు ఈనాడు ఇంతలా ప్రయాస పడుతున్నాడు.
ఈ దేశాన్ని తెల్లవాళ్లు పాలించే రోజుల్లో బ్రిటన్ నుంచి దిగివచ్చిన దొరలకు ఇక్కడి భాష, సంస్కృతల గురించి  ప్రముఖులు అవగాహన కల్పించే పాలనావిధానం అమలులో ఉండేది.  ఆ విధంగా ఉపన్యసించేందుకని వచ్చిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్  ఒక సందర్భంలో ఆర్య.. ద్రావిడ 'జాతుల'ను గూర్చి ప్రసంగించి వెళ్లిపోయాడు. కొంత కాలం తరువాత మరోసారి ఉపన్యసించడానికని వచ్చినప్పుడు గతంలో తాను చేసిన  పొరపాటున సరిదిద్దుకొనే ప్రయత్నం చేయబోయాడు. ఆర్య.. ద్రావిడ వైరుధ్యాలని   'జాతుల' మధ్య వైరుధ్యాలుగా తాను పొరపడ్డానని.. నిజానికి అవి 'సంస్కృతుల' మధ్య సంభవించిన వైరుధ్యాలని సరిదిద్దుకొనే ప్రయత్నం అది. 'ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవడం కుదరదు' అన్నది ఇక్కడి దొరతనం. కారణం..  అప్పటికే ఇక్కడి అమాయక  భారతీయులని ఆర్య.. ద్రావిడ 'జాతులు'గా పాలకులు తమ పాలనా సౌలభ్యం కోసం  పూర్తిగా విడగొట్టేసేయడం!  విజ్ఞానశాస్త్రం కానీయండి, సంస్కృతులు కానీయండి, భాషలు కానీయండి.. రాజకీయాలకు విడగొట్టరానిదంటూ ఏదీ ఉండదు. తమకు గిట్టుబాటు వ్యవహారంగా ఉండాలి.. అదే ప్రధానం.
ఈ దేశంలోని చాలా ప్రాంతీయభాషలు ఆనాటి  విభజన రాజకీయాల మూలకంగా  ఇవాళ ఎన్నో విధాలా నష్టపోయాయి!  ఎక్కువ నష్టం దక్షిణాది భాషలదయితే.. వాటిలో  అత్యధిక నష్టం తెలుగు భాషది. ఎవరినో నిందించడం ఎందుకు? తెలుగు భాష నేటి దైన్యస్థితి తెలుగువాడి స్వయంకృతం.
తెలుగువాడు ఈ దేశం  గడ్డ మీద ఎన్నో  శతాబ్దాల బట్టి వివిధ రాజ్యాలు చలాయించిన మొనగాడు. ఘనమైన మన గతం అవగతం కాకే  భాష వాడకం మీదింతలా  సతమతం ప్రస్తుతం. తెలుగు చరిత్ర మీద చిన్నచూపు. ఇకనైనా సరిదిద్దుకుందామా.. కనీసం పదిమంది మధ్య పరువుగా నిలబెట్టే ఆత్మసమ్మానానికైనా!
***
-కర్లపాలెం హనుమంతరావు
( సూర్య - 29, సెప్టెంబర్ 2019 సంచికలో ప్రచురణ ) 



http://www.koumudi.net/

Wednesday, December 4, 2019

అంతరాత్మల కథ- వ్యంగ్యం- సూర్య దినపత్రిక ప్రచురితం






'నేతలు మనకు అండగా నిలిచిన గుట్టు నేరుగా జనంలోకి  వెళ్ళిపోతోంది' అంది మద్యం బ్రాండు అంతరాత్మ.
'మరే! ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సాముల్ని ఆదుకోవడం మన  ధర్మం!' అంది గోల్డు బ్రాండు అంతరాత్మ .
'పెదాల సానుభూతితో పనేమవుతుంది? పెడసరంగాళ్ల నోళ్ళు కుట్టించాలి ముందు. అందుకే  న్యాయదేవత అంతరాత్మకే టెండరు పెట్టానీసారి! అంది యుద్ధ విమానం మార్కు మరో అంతరాత్మ ధీమాగా.
ఆ అంతరాత్మ  మనంత గట్టిగా నిలబడదమ్మా! ఏ  తీర్పు ఏ భావోద్వేగంలో వచ్చిపడుతుందో ఊహాతీతం. గిట్టని అంతరాత్మల మధ్య పొత్తు కుదర్చడమే మెరుగు. పీ.కే అంతరాత్మను ప్రయోగిస్తేనో?
ఎంత ఖరీదయినా కొనడానికి ఓ.కే! కానీ అదీ వెళ్ళి ఆ బురద    రాజకీయాల్లో దిగబడిందే! 
రాజకీయ అంతరాత్మ బాధగా మూలిగింది. 'మా బురదలో అందరికీ భాగముందమ్మా! ఎలాగైనా సరే లాభాల్లాగాలనే లోభం తమ వ్యాపారులది! సర్కారులు ఎవరివైనా సరే మీకు సలాం కొట్టాలి.  జనంతో తంటాలు మావి! మిమ్మల్నీ వదులుకోలేం. ఓటర్లనీ వద్దనుకోలేం.’
'మా మీదేమన్నా వూరికే  కారుతోందా ప్రేమ? ఓటర్ల అంతరాత్మలను కొనిపెట్టే  సొమ్మంతా  మా  ఇనప్పెట్టెల్లోదేగదా!’  బొగ్గు మార్కు అంతరాత్మ భగ్గుమంది.
 ‘ఎంతో రిస్కుతో కుతంత్రాలు పన్ని, పన్నులు.. బ్యాంకు రుణాలు గట్రా  ఎగ్గొట్టి మా యజమానులు జమేసుకున్న సొమ్ము! మీ నేతలు కమ్మంగా అనుభవించే పదవులకిప్పుడు అదే కదమ్మా ఆధారం!’ వంత పాడింది వజ్రం మార్కు అంతరాత్మ.
'నేతలం కాదు మనం.. వాళ్ళ అంతరాత్మలం. మనలో మనకు కుమ్ములాటలొద్దు! మన ఆసాములు కష్టాల వూబిలో ఉన్నారిప్పుడు. వాళ్లని  గట్టెక్కించడం ఒక్కటే మన కర్తవ్యం కావాలి’  సర్ది చెప్పింది ఓ ముసలి అంతరాత్మ.
ఆ స్కాములప్పుడేమన్నా ఆ ఆసాములు మన మాటలు విన్నారా.. ఇప్పుడు గట్టెక్కించడానికి! గొణికింది ఓ యువ అంతరాత్మ.
అవును. అదనంగా నసగాళ్ళని  చీదర్లు కూడా ! నొసలు చిట్లించింది మరో కుర్రది.
అంతరాత్మలకి అంత ఆత్మాభిమానం చేటు! మన అసహనం, తిరుగుబాటు ఏ పంథాలో ప్రయోగిస్తే సత్ఫలితాలొస్తాయో.. ముందది ఆలోచించద్దాం! ఈ   పెద్ద అంతరాత్మలతో శిక్షణా తరగతులు  నిర్వహిస్తోంది కూడా అందుకే. బుద్ధిగా వినండి! గద్దించింది అధ్యక్ష స్థానంలో ఉన్న అంతరాత్మ.
వ్యాపార అంతరాత్మ ప్రసంగం ప్రారంభయింది మనం ఉన్నామన్న భరోసాతోనే పెద్దమనుషులు  స్కాములకు సిద్ధపడతారు. ఎంత  మొండిగా వాదించినా మన మాట వినరు. అందుకే మనమూ వాళ్ల బాట పట్టక తప్పదు. మన కుబేరులు  బేరుమంటే  మన అంతరాత్మలకే కదా నామర్దా’
'అయితే  ఏం చెయ్యాలంటా? తిట్టిపోసిన వాళ్లతోనే కూటమి కట్టాల్నా?' పెడసరంగా అడిగింది  ఇందాకటి  పిల్ల అంతరాత్మ.
సర్కారు ఎవరిదన్నది మనకు ముఖ్యం కాదు. ఎవరు గద్దె మీదుంటే వాళ్లకే మన మద్దెల దరువు. అధికారంలో ఉన్న వాళ్లే ముందు ముందు మరెన్నో  మంచి పనులు చేస్తారని టముకేస్తే సరి. వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్తలపెట్టవోయ్' అన్నాడా లేదా గిడుగు పిడుగు?’
కిసుక్కని నవ్వింది కుర్ర  అంతరాత్మ 'ఆ కొటేషన్ గురజాడది
తెలిసే అన్నాన్లే! గిడుగు నుంచి గురజాడ కాపీ కొట్టాడని మన  అంతరాత్మలన్నీ కలసి  ఘోషించాలి. అదే నిజమని జాతి అంతరాత్మకూ  నమ్మకం కలిగించాలి. అందాకా బ్రెయిన్ వాష్ చెయ్యడమే  మన పని.’
బొగ్గు అంతరాత్మ అందుకుంది ‘ఆ గోల కవుల అంతరాత్మలేవో చూసుకుంటాయిలేద్దూ! మద్యం నుంచి భూములు, మార్కెట్ బూములు, బంగారం, విమానాలు, బ్యాంకు రుణాల వరకు ఎన్నో బడావ్యాపారాలు మన అంతరాత్మలను నమ్ముకునే పెద్దెత్తున అక్రమంగా నడుస్తున్నాయిక్కడ. ముందున్నది ముసళ్ల పండుగని మనమెంతైనా ఎంతైనా మూలుగు.. ఎవరి చెవినా పడ్దంలేదు’
‘అలాంటి ఇబ్బందుల్లోనే ఈ కార్యకర్తల అంతరాత్మలేం చెయ్యాలనేది మీ సీనియర్లు నేర్పించాలిప్పుడు’ గుర్తుచేసింది అధ్యక్ష అంతరాత్మ.
'ఈ సారి ఈ అంతరాత్మల అంశాన్నే ముందుకు  తోద్దాం! సెంటిమెంటుతో చేసే ఏ  ప్రయోగం ఇంత వరకూ విఫలం కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో. అధికార పక్షం తరుఫు నుంచే ఈ తుర్ఫు ముక్క  తీయిస్తే సరి! తిరుగుబాటు వర్గాల్లోకి మన కోవర్టులను చొప్పించి అందరి  నొప్పులను  టోకున కొనిపిచేద్దాం!’
‘కొనడం అంటే మూటలతో పని. అనైతికం. ఆసాముల్నందర్నీ  సతాయించాలి?’ ముఖం చిట్లించింది మళ్ళీ మొండి అంతరాత్మ.    
‘సతాయించడానికే మనుషుల్లో మనమున్నది! వ్యాపార అంతరాత్మలుగా అది మన విధి కూడా’
మళ్లీ అడ్డుపడింది జిడ్డు అంతరాత్మ ‘అమ్ముడయేందుకు మీ రాజకీయ  అంతరాత్మలు  సిద్ధంగానే ఉంటాయమ్మా! కానీ కొనే సొమ్ము తమ  ఆసాములనుంచి  రాబట్టాలంటేనే గడసాములు చెయ్యాలిక్కడ. పాపం వ్యాపార అంతరాత్మలు!
‘ఏంటీ నస?’ అన్నట్లు మొండి అంతరాత్మకేసి గుడ్లురిమి చూసాయి మిగతా అన్ని అంతరాత్మలూ.
చూడూ! మన అంతరాత్మల  ముందు ఎంత లావు బిరుసున్నా తలవంచాల్సిందే! అనుభవంతో చెబుతున్నా.. అంతరాత్మ ప్రబోధం కన్నా ఉత్తమ చమత్కారం మరోటి లేదు. ముఖ్యంగా  రాజకీయాల్లో. మనం గానీ ఎంటరయితే ఏ నేత వంటికీ మకిలి అంటదు’ కలగచేసుకుంటూ అంది అధ్యక్ష అంతరాత్మ ‘దేవుడు, రాజ్యాంగం కన్నా మన అంతరాత్మల మీదే అమాయక జనాలకు గట్టి  నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కానివ్వద్దు’
‘మరి ప్రజాహితం?’ మొండి అంతరాత్మ లొంగదలుచుకోలేదు.
 ‘మేధావులకే పట్టని ప్రజాహితం మనకెందుకెందుకంట? ఎన్నికలు  తరుముకొస్తున్నాయ్  అవతల! ఎన్నికల కోడు పీడ  ఏ క్షణానైనా విరుచుకుపడచ్చు. ఎంత సొమ్ముకైనా సరే.. అమ్ముడవడానికి మీరంతా సై య్యేనా?’
‘సై’ అరిచాయి అన్ని కుర్ర అంతరాత్మలు.
‘ ఏం చేసైనా సరే మీ ఆసాముల్ని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారా?’
‘ఉన్నాం.. ఉన్నాం.. ఉన్నాం!’ పిల్ల అంతరాత్మల కేకలు మిన్ను ముట్టాయ్!
 ‘గుడ్! అయితే.. ఏదీ.. నీ నోట్లో ఏముందో చెప్పు.. చూద్దాం?’ ఓ పెంకి ఘటం దగ్గరికొచ్చి అడిగింది అధ్యక్ష అంతరాత్మ.
‘ప్రద్దానికీ అడ్డొచ్చి ప్రశ్నిస్తోందే.. ఈ మంకు అంతరాత్మ.. దీని చూపుడు వేలు’ అంది పెంకిది.
‘వెరీ గుడ్! ఓ సారి  ఆ వేలు కొరుకమ్మా!’
లటుక్కున కొరికి కరకరా నమిలి మింగేసింది క్షణంలో పెంకిది కసిదీరా. వేలు తెగిన మొండిది  లబోదిబమంటూ బైటికి పరుగెడుతుంటే అంతటా నవ్వులే నవ్వులు.
‘అరెఁరెఁరెఁ! కొరకమంటే నిజంగా కొరికేయడమే!’ మందలించింది అధ్యక్ష అంతరాత్మ నవ్వులు కాస్త సద్దుమణిగాక. ‘నోట్లో వేలెట్టినా కొరకలేనంత జాణతనం చూపించాలమ్మా! ఆ మాత్రం అమాయకత్వం నటిస్తేనే అంతరాత్మల సాక్షికంగా నడిచే నాటకాలన్నీ నిజాలేనని పిచ్చి జనాలకు నమ్మకం కుదిరేది. మరీ మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరుగారంత  పారదర్శకత  పనికిరాదు అంతరాత్మలకు. నవ్వింది చాలు. ఇహ ముఖ్యమైన మూడు ముక్కలతో ఈ సమావేశం ముగిద్దాం. స్వచ్ఛమైన, అవినీతికి తావులేని పారదర్శక పాలనంటూ నేతలు బల్లగుద్ది లక్ష హామీలిస్తుంటారు.  బెదిరిపోవద్దు. మీరు లేకుండానే  మ్యానిఫెస్టోలా అంటూ అలకలసలే వద్దు.! అంతరాత్మల ప్రమేయం కుంభకోణాలతోనే మొదలవుతుంది రాజకీయాలల్లో.   బొగ్గా.. బంగారమా, పెద్దనోటా, పెట్ఱోలు రేటా.. అన్నది మనకు  పెద్ద ముఖ్యం కాదు.  ఎగ్గొట్టేందుకు వీలుగా రుణవిధానాలున్నప్పుడు ఎవరికయినా ఎందుకు తప్పు చెయ్యబుద్ధేయదు?  మనం క్లవర్లం. కాబట్టే తెలివిగా మన సాముల్ని కవర్ చేసుకుంటున్నాం. ఎవరేడ్చిపోతేనేం.. వియ్ డోన్ట్ కేర్. పిల్ల అంతరాత్మలు మీరు. ఆదర్శాల ఉచ్చులో ఇరుక్కోకండి! బడుగు ఓటరొచ్చి తడితే నిద్ర లేవద్దు. మరీ అంత కునుకు పట్టకుంటే అసమ్మతి రాగాల కోర్సుంది.. సాధన చేసుకోండి.. పెద్దమనుషులతో మన బేరసారాలో కొలిక్కొచ్చిందాకా! తతిమ్మా థియరీ రేపు! ఈ పూటకీ ప్రాక్టికల్స్  చాలు‘ ప్రకటించి లేచింది అధ్యక్ష అంతరాత్మ,
‘ప్రాక్టికల్సా?!’ నోరెళ్లబెట్టాయ్  అంతరాత్మలన్నీ.
‘మరే! ఎంత చెప్పినా మొండికేసే అంతరాత్మలు  కొన్నుంటాయెప్పుడూ. నిజాయితీ, నిమ్మబద్దలంటూ  మేధావుల మెదళ్ళు తొలవడమే వాటి పని! ఎన్నికల్రోజు బక్క ఓటరు అంతరాత్మలను అవి తట్టి లేపేస్తే.. అమ్మో.. మన ఆసాముల పని గోవిందా!  అందుకే పద్దాకా ఎత్తి చూపించే  చూపుడు వేళ్లను  ఎలా కత్తిరించేయచ్చో ప్రాక్టికల్ గా చేయించి చూపించా!’ అంది అధ్యక్ష స్థానంలో ఉన్న ఆ  ముసలి అంతరాత్మ! ఇందిరమ్మ హయాంలో వి.వి.గిరి గారికి అధ్యక్షగిరి ఇప్పించిన గడుసరి ఈ అంతరాత్మే మరి!
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
***


 







రాధమ్మ పెళ్లి జరిగిపోయింది- ఆంధ్ర ప్రభ కథానిక





కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని 


ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  



ముద్దు- చతుర కథ



-కర్లపాలెం హనుమంతరావు
***
(చతుర ప్రచురితం)

ఆంధ్రౌన్నత్యం -పండిత సత్యనారాయణరాజు






1
వెల్లబోయెదెవేల విశ్వేశ్వరుని గాంచి హంపీవిరూపాక్షు నరయరాదె
డంబువీడెదవేల టాజుమహల్ గాంచి యమరావతీస్తూప మరయరాదె
భ్రాంతిచెందెద వేల వారనాసిని గాంచి దక్షవాటిక గాంచి తనియరాదె
కళలువీడెద వేల కాళి ఘట్టము గాంచి వైశాఖపురి గాంచి పరగరాదె
గాంగజలముల గనుగొని కలగదేల-గౌతమీ గంగ కనులార గాంచరాదె
యఖిల సౌభాగ్యములు నీకు నమరియుండ-దెలివిమాలెద వేమోయి తెలుగుబిడ్డ!

2
ఆలించినావెందు ద్యాగరాట్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
నాలకించితివెందు నాధ్యాత్మ కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
రహివింటి వెచ్చోట రామదాస్కీర్తన లాంధ్రభూమినిగాక యన్యభూమి
మొగివింటి వెయ్యెడ బొబ్బిలిపాటల నాంధ్రభూమినిగాక యన్యభూమి
వింటి వెచ్చోట పల్నాటివీరచరిత- మాంధ్రభూమిని గాకున్న యన్యభూమి
నాంధ్రపదమెంత మధురమో యాంధ్రతనయ-తెలిసికొని, నేటికేనియు గులుకవోయి!

3
చిట్టివడాలను చేర్చిన పోపుతో గమనైన పనసకూర
అల్లముకరివేపయాకుతో దాలింపుగా నొప్పు లంకవంకాయకూర
ఘ్రాణేంద్రియముతో రసనేంద్రియము దన్ను పసమీఱు విఱిచిన పాలకూర
గరమసాలాలతో గమగమవలచెడు వసలేని లే జీడిపప్పుకూర
బుఱగుం జూచబియ్యము పూతచుట్ట- లాదిగాగల దివ్య పదార్థవితతి
యాంధ్రులకెకాని మఱియేరికైన గలదె-సేతుశీతాద్రిమధ్య విశేషభూమి!

4
కాలుసేతులును వంకరలువోవగజేసి వణకించు పెనుచలిబాధ లేక
బండఱాళులు గూడ మెండుగా బీటలు వాఱించు వాతపబాధ లేక
ఏరుళూలుగూడ  నేకమై ప్రవహించు వర్రోడుతతవర్ష బాధ లేక
బండుగనాడైన బట్టెడన్నము లేక రొట్టెలే తినియుండు రోత లేక
చూచితూచినయట్టుగా దోచుచుండు-సీతు నెండయు వానయు బూతమైన
యమలరాజాన్నమునుగల్గునాంధ్రభూమి- దలచికొనిపొంగుమెటనున్న దెలుగుబిడ్డ!


-పండిత సత్యనారాయణరాజు
రచనాకాలం:1934




‘ధర్మా’గ్రహం -కర్లపాలెం హనుమంతరావు




బాబ్రీ మసీదు కూల్చివేత పట్టపగలు.. కొద్ది మంది  మతవాదుల  దుందుడుకు ఆగడం. రాజ్యాంగ అధికరణం 370 రద్దు ప్రజాస్వామ్య ప్రభుత్వ అర్థరాత్రి అతిరహస్య  ఎత్తుగడ. రెండు ఘటనలకు ఎన్ని సమర్థనలో.. అంతకు మించి ఖండనలు! చారిత్రిక తప్పిదాలను సరిదిద్దిన సాహసోపేత సంస్కరణలుగా సంఘ్ పరివార్, వారి తైనాతీల వాదనగా ఉంటే.. మతాతీత దేశానికి అతకని ముతక పోకడలుగా  ప్రజాస్వామ్యవాదుల నిరసన!   ఒక కూల్చివేత  ఘటన పూర్వాపరాలు పంథొమ్మిది వందల తొంభై నాటి వాతావరణానికి ప్రతీక. మరో కొట్టివేత సన్నివేశం వెనుకా ముందు నాటి పరిస్థితులు రెండువేల పంథొమ్మిది నాటి  స్థితిగతులకు నిదర్శనం. మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల కాలంలో దేశం ‘మూడ్’ ఏ విధంగా మారిందన్నది  చరిత్ర పరిశోధకులలో ఆసక్తి ర్రేకెత్తించే అంశం.  
బాబ్రీ మసీదు కూల్చివేత  నాటికి ధర్మకుమార్ దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ఎకనామిక్స్ ప్రొఫెసర్. హిందూ మితవాదం, కమ్యూనిష్టు భావజాలం.. రెండిటి పట్లా ఒకే తరహా వైఖరి ఆ స్త్రీ మేధావిది. ఒక మతానికి చెందిన ప్రార్థనాలయం మరో మతవాదుల మూకచేష్టల కారణంగా కూలడం సహజంగానే మతసామరస్యం కాంక్షించే ఆ విద్యాధికురాలి మదిలో ఆవేదన రగిలించింది.   కూల్చివేత  ఘటనపై అప్పటికప్పుడు ఒకానొక ప్రముఖ దినపత్రిక మొదటి పుటలో  ఓ సుదీర్ఘ ప్రకటన రూపంలో స్పందించారా చైతన్యశీలి. ‘మరో ప్రార్థనాలయం కూల్చివేత హిందూ స్వాభిమానాన్ని  ఏ విధంగా పునరుద్ధరిస్తుందో ముందు తేలాలి. జాతిగౌరవం ఏ మోతాదున పెరుగుతుందో, దేశ సమగ్రత ఏ తీరున పటిష్టమవుతుందో  వివరించాలి!' అంటూ  విధ్వంసకారుడిని నేరుగా నిలదీస్తూ సాగే ఆ నిరసనలో ఆద్యంతం నిండి ఉన్నది ఆనాటి సగటు భారతీయుడి మదిలో ర్రగిలే ఆందోళనే. మత ప్రాధాన్యత అధికంగా ఉండే  సున్నిత అంశాలు కొన్నింటి పట్ల  ప్రదర్శించే దురుసుతనం దేశ అస్థిరతను  మరంతగా విస్తరిస్తుందని,  ప్రపంచం ముందు ప్రజాస్వామ్య దేశానికి తలవంపులు తెస్తుందని, భావితరాల జీవితాలలో వృథా ఉద్రిక్తతలను  పెంచుతుంద’ని ఆ ప్రొఫెసర్ ఆవేదన.    నిరసనతో కలగలసిన ఆ ఆవేదన ధర్మకుమార్ ఎంతో ధైర్యసాహసాలతో బహిర్గతం చేయడం  ఆనాటి ప్రజాస్వామిక స్వేఛ్ఛాయుత వాతావరణానికి సంకేతంగా భావిస్తే తప్పేముంది?  మొదటి పుట నిండా నలుపు రంగు పులుముకొని పైన  తెల్లటి అక్షరాలతో కొట్టవచ్చినట్లుగా ఓ నిరసన ప్రముఖ దినపత్రికలో  దర్శనమివ్వడం ఈ కాలపు రాజకీయ  విలువల దృష్ట్యా నిజంగా ఓ అద్భుతమే.  
ఆ ప్రకటనకు మద్దతుగా  అప్పటి  మేధోవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, బ్యురోక్రాట్లు, పాత్రికేయులు, వివిధ రంగాలలో  పేరొందిన ప్రముఖులు ఎందరో మద్దతుగా నిలవడం,  పంథొమ్మిది మంది ప్రముఖుల సంతకాలతో  ఆ నిరసన  ప్రకటన వెలువడడం పెద్ద చర్చకు దారి తీసిందంటారు అప్పట్లో.  ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ నుంచి మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కె.సుందర్ జీ వరకు  సంతకాలు చేసినవారంతా నాటి సమాజం దృష్టిలో  ఎంతో విశ్వసనీయులు! ఖర్చులు భరించి  తానే జారీ చేసిన ప్రకటన కాబట్టి ధర్మకుమార్  విలువలకు కట్టుబడి స్వయంగా సంతకం చేసారుకాదు.  సంతకాలు చేసిన ప్రముఖులలో ఆర్.పి.గోయెంకా, రాజ్ త్యాగరాజన్, దేశ్ బంధు గుప్తా వంటి వ్యాపార దిగ్గజాలూ కనిపించడం ఏ విధంగా  సాధ్యమయింది?! ఈ కాలం తరహాలో ధర్మకుమార్  ధర్మాగ్రహం ఏ హిప్పీ కటింగ్  కమ్యూనిష్ట్ చిల్లర 'కుట్టుపని' కిందనో ఎందుకు వెక్కిరింతలకు గురికాలేదు?! గత మూడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలను నడిపించిన  పాలక పార్టీల దృక్పథాలలో క్రమంగా వస్తోన్న మార్పుల నుంచే ఈ సందేహాలకు సరైన సమాధానాలు దొరికేది.
మూడు దశాబ్దాలకు మూడేళ్లు ముందు ప్రస్తుతం నడుస్తున్న 2019, అగష్టు, 5 సోమవారం భారత  రాజ్యాంగం కశ్మీరు లోయ వాసులకని  ప్రసాదించిన  స్వయంప్రతిపత్తి సౌకర్యానికి గండి కొడుతూ  ఆర్టికల్ 370 అర్థరాత్రి నిశ్శబ్దంగా నిర్వీర్యమయింది! స్వీయపాలన ‘వద్దు.. మాక’ని స్థానికుల నుంచి కించిత్తైనా వత్తిడులు లేవు. అధికరణ కారణంగా బాధితులం అవుతున్నట్లు ఏ వర్గ సమూహపు మొత్తుకొళ్ళూ వినిపించవు! ప్రజలిచ్చిన అధికారం  ఒక్కటే పాలకపక్ష అప్రజాస్వామ్య చేష్టలకు  ఊతం! నాటి ఎకనామిక్స్ ప్రొఫెసర్ ధర్మకుమార్ దారిలోనే నేడూ ప్రజావ్యవస్థలకు రక్షణగా నిలబడ్డదలచినవారు   మీడియా  ముందుకొచ్చి   ధైర్యంగా  ప్రశ్నిస్తేనో? ప్రశ్నల పర్యవసానాల సంగతి పక్కనుంచి..   ప్రశ్నించే పరిస్థితులు  దేశంలో  అసలు ఎంత వరకు బతికున్నాయన్నదే ప్రస్తుతం ప్రధానంగా   ముందుకొస్తున్న  ప్రశ్న.
ప్రజాస్వామ్య పంథాకి పెడగా ప్రభుత్వాల అడుగులు పడుతున్న ప్రతిసార్రీ గల్లాపట్టుకు  నిలదీసే గుండె నిబ్బరం  కోటికి ఎక్కడో ఒకరికైనా ఉందా? ఉందనే మాట వరుసకు అనుకుందాం. ధర్మకుమార్  దారిలోనే వారి చేతా   నిరసన పత్రమొకటి తయారయితేనో?!  'దేశభక్తులంతా తప్పక ఆలోచించాలి. కేవలం రాజ్యాంగ అధికరణ 370 రద్దు చర్యతోనే  మన జనస్వామ్య వ్యవస్థలన్నీ సుదృఢవుతాయని నమ్ముతున్నారా? సమస్యకు  సంబంధించిన ఎరినీ విశ్వాసంలోకి తీసుకోని రద్ధుసంస్కరణ దేశ ఉద్రిక్తతలకు  తగ్గ మందుగా మీరు  భావిస్తున్నారా? అదే వాస్తవమయితే మతాతీత కులాతీత ప్రజాస్వామ్య భూమిక పై నిర్మితమైనదిగా జాతి గౌరవించే దేశ రాజ్యాంగం  నిజానికి అప్రజాస్వామికమైనదని  మీరు ఒప్పుకున్నట్లే!  దేశం ఓ మూల  భూభాగానికి మాత్రమే  ప్రత్యేక   రక్షణ కవచాలు అందించడం అంటే   అఖండ భారతావని సార్వబౌమికతను కించపరిచిందన్నట్లేగా రాజ్యాంగం మీద మీ ఆరోపణ? కశ్మీరు లోయ  స్వయంప్రతిపత్తి పట్ల  ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించడమంటే అఖిల భారతావని  ఇతర భాగాల   బాగోగులపై  ఇసుమంతైనా శ్రద్ధ  రాజ్యాంగానికి  లేదన్నట్లేగా మీ ఫిర్యాదు?' తరహాలో సాగే ఆ నిలదీత పత్రం   ప్రముఖ దినపత్రిక ప్రథమ పుటలో ప్రచురించడానికి సిద్ధమయితేనో?  ఖర్చులకని  యాచిస్తే గుప్తంగా మద్దతిచ్చే విజ్ఞులకు ఇప్పుడూ పెద్ద కొదవేమీ ఉండబోదు. కానీ సర్కారును ఇరుకున పెట్టే ఏ  ‘డిస్సెంట్ నోట్’ పైనా పెన్ను పెట్టి ‘సైన్’ కొట్టే దమ్ము ధర్మకుమార్ కాలంలో మాదిరి ఇప్పుడు ఎంతమంది బిగ్-బాసులకుంది?’ అదే బిలియన్ డాలర్స్ ప్రశ్న ప్రస్తుతం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా   విశ్వ విపణి వీధులనేలే భారతీయ కుబేరులలో ఎందరో నిజానికి  ఉదారభావాలకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్య పంథాట్లా వారికుండే  అచంచల విశ్వాసం సాధారణ పౌరుల అంచనాలకు అందేవికావు.  ఆర్టికల్ 370 వంటి పాక్షిక లాభాలు చేకూరే రాజ్యాంగ అధికరణల పట్ల ప్రముఖులందరికీ   ఒకే తరహా  అభిప్రాయం ఉండకపోవచ్చు. అందుకు తప్పు పట్టలేం.  చట్టాల పట్ల కన్నా.. ఈ తరహా  బిల్లుల ఆమోద తిరస్కారాలకై చట్టసభలు నడుస్తున్న తీరు మీదనే ఎందరో ప్రముఖులకు  బాహాటంగా చెప్పలేని బాధా.. ఆందోళన. పాలకవర్గ రాజకీయ ప్రేరిత  ప్రణాళికల కార్యాచారణ విధానాలను అంతర్గత సంభాషణలలో  ఎంతగా తూర్పారపట్టినా బహిరంగంగా  మాత్రం  తటస్థ వైఖరి తీసుకోక తప్పని దుస్థితి కొందరు పెద్దలది. పరిథి మీరి మరీ వత్తాసుకు పోక తప్పని ఒత్తిళ్లు మరి కొందరు వ్యాపారప్రముఖులవి. సంపూర్ణ మౌనమే సర్వదా శ్రేయస్కరంగా భావించి ఓ నమస్కారబాణంతో సరిపుచ్చుకునే సంపన్నుల సంఖ్యే ప్రస్తుతం దేశంలో ఎక్కువ!  కారణం;   ఆర్టికల్ 370ద్దులోనే లేదు.  గద్దె ఎక్కిన పార్టీల ప్రాయోజిత సర్దుబాట్లు సంస్కరణల ముసుగులో మరెన్నో ముందు ముందుకు తోసుకుని వచ్చే  కొత్త తరహా వాతావరణానికి   2019 నాంది కావడంలో ఉంది.    
సంతకాలకై ధర్మకుమార్  సంప్రతించిన నాడు .. కేవలం ఒక నిరసన పత్రం పైన  పొట్టిసంతకం గిలికిన కారణానే తమ అండన బతికే వేలాదిమంది రోడ్డున పడరన్న ధీమా  భరత్ రామ్, లలిత్ థాపర్ వంటి పరిశ్రమల పోషకుల గుండెల నిండుగా ఉండిన పంథొమ్మిది వందల తొంభై రెండులు…
అదే మాదిరి గుండె నిబ్బరం మాజీ ఆర్థికశాఖామాత్యులైన శ్రీమాన్ చిదంబరానికే ఉండని    రెండువేల పంథొమ్మిదులు…
దాదాపు  మూడు దశాబ్దాల మధ్యన పరుచుకున్న దేశ రాజకీయ, పాలనా వ్యవస్థల పని తీరుల్లో కనిపిస్తున్న మార్పులను గమనిస్తే  దేశం ‘మూడ్’  ‘బ్యాడ్ టు వర్స్ట్’ దిశగా ఎంత  వేగంతో దిగజారుతున్నదో తెలిసి దిగులవుతున్నది ప్రజాస్వామ్య వికాసం పట్ల ఎంతటి ఆశావహ దృక్పథం గల దేశభక్తులకైనా!
 కంటి  ముందు  జరిగే   ర్థిక దాడులు, కుంటి సాకులు ఇరికించే  అక్రమ  నేరాల కేసులు, ఊహించేందుకైనా భీతి గొలిపే ఉపద్రవాలు ఇంకెన్ని ఏ సందు గొందుల నుంచి ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నవో అంతుపట్టని ఉగ్ర వాతావరణం మధ్యన నేటి దేశం  అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నది మరి!  లోయకోని జాతులే కాదు.. దేశంలోని అన్ని తరగతులు ఒక్కో తీరున  ఒకనాటి దేశ అత్యయిక పరిస్థితులను దాటి శిక్షల గదుల్లో మగ్గుతున్నాయి.
‘ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి ప్రగాఢ విశ్వాసమున్నప్పటికీ  ఉదారవాదం ఆచరణలో సదా ఓ మిథ్య మాత్రమే’  అని భావి తరాలు సైతం ఒక   శాశ్వత నిరాశ భావన లోనికి జారక ముందే మందలు మందలుగా మరెంతో మంది ప్రొఫెసర్ ధర్మకుమార్ లు అందుకే  పుట్టుకు రావాలసుంది.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక- సంపాదకీయ పుట వ్యాసం)
***




























    

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...