Tuesday, December 7, 2021

ఎమర్జెన్సీలో వచ్చిన తెలుగు లొంగుబాటు కవిత్వం

 


6:28 PM

 

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

 

పేరుకే ప్రజాస్వామ్యం. దానికి కష్ట మొచ్చినప్పుడు మన తెలుగు కవులు నిర్వహించిన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. లబ్దప్రతిష్ఠులు ఎందరో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితికి వత్తాసుగా కవిత్వం రాయడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమ్ముడుపోయిన కవులలలో శ్రీ శ్రీ గురించి అందరం చెప్పుకుంటుంటాం. ఆయనకు తోడుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినార్, ప్రభుత్వ కవి దాశరథి, జె,బాపురెడ్డి, భీమన్న, దివాకర్ల, పరిమళా సోమేశ్వర్, ముని సుందరం, పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి, గుత్తికొంద సుబ్బారావు, విహారి&శాలివాహన, జ్యోతిర్మయి, లసూరా, భద్రిరాజులు గట్రా.

జనం శ్రమ నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును సర్కారిచ్చే సంబావనల కింద పుచ్చుకుని పేదల గురించి కన్నీళ్లు పెట్టుకున్న కవులు కొందరైతే, ఇవాళుండి రేపు పోయే ప్రాణానికి భయపడి కలాన్ని కదిలించిన ఉద్యమకవులు ఇంకొందరు. అలవాటుగా ప్రభుత్వం ఏది  చేసినా తప్పెట్టలు కొట్టే  పాంప్లెట్ కవులను గురించి పెద్దగా చెప్పుకొనవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు తమ భావజాలమని సగర్వంగా ప్రకటించుకున్న ఉద్దేశాలకు పూర్తి విరుద్ధంగా ప్రసిద్ధ కవులు రాసిన కవితలే అబ్బురం కలిగిస్తాయి.

 

దేశీయులలో తనకు కలిగిన అప్రతిష్ట సంపూర్ణంగా తెలిసున్న ఇందిర కొత్త పంథాలో కొద్ది మంది మేధావులకు ఇన్ని రొట్టె ముక్కలు విసిరి పోగుచేసుకున్న ప్రగల్భాల కవిత్వాన్ని పాకెట్స్ రూపంలో విదేశాలలో పంచి ప్రపంచం దృష్టిలో తానో విప్లవ పాలకురాలిగా ముద్ర వేయించుకునే ప్రయత్నం అప్రతిహతంగా సాగింది. 'ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర' అనే భావన బలంగా ముద్రపడే దిశగా అంతఃపుర తైనాతీలు చేపట్టని నికృష్ట చర్యలు లేవు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రతిస్పందన గురించి ఇంత చిన్న వ్యాసంలో వివరంగా చర్చించుకోడం కుదరదు. కానీ తెలుగు గడ్డ వరకు కవులు ప్రజావ్యతిరేకతకు స్వార్థబుద్ధితో చేసిన కొంత లాలూచీ చీదర కవిత్వం గురించి రేఖామాత్రంగా చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

 

కొంత మంది తెలుగు కవుల  కవిత్వం ఏ విధంగా సాగిందో ఓసారి తిలకించి తరిస్తారనే ఈ చిన్న వ్యాసం.

వీర నారి మన ఇందిర

విజయ శంఖ మూదిందిరా!

ప్రజాస్వామ్యమును పడద్రోసే

వారిని అణచి వేసిందిరా!

  • అనే పదాలతో గవర్నమెంట్ కవి దాశరధి తొలి శంఖం పూరించారు. ప్రజాస్వామ్యాన్ని పడద్రోసిందెవరు? ఇందిరాగాంధీనా, జయప్రకాశ్ నారాయణా, మొరార్జీయా, అటల్ బిహారీ వాజ్ పేయీనా? నిజాం రాజు బూజు దులిపిన ఉద్యమంలో ఘనమైన పాత్ర వహించినట్లు చెప్పుకునే దాశరథి కే తెలియాల్సుంది.
  • 'ప్రగతి శక్తుల బలం పెరిగింది నేడు

విషమ శక్తుల నడుం విరిగింది నేడు'

తన పేరుకు ముందు జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత అని ట్యాగ్ లైన్ తాగిలించుకోనిదే తోచని కవి సి. నారాయణరెడ్డిగారి స్త్రోత్ర గానం ఇది.

'పూర్వదిక్కున పూర్వ పుణ్యమే దిక్కుగా

హృదయేందిరదె వెలసె, హృదయ మ!' అని బోయి భీమన్నగారు ఉద్బోధన సాగిస్తే ..

దివాకర్లవారు సైతం తన వంతు పంచరత్నాలతో నియంత  ఇందిరమ్మకు మరింత శొభను చేకూర్చే  అలంకారాలు సమకూర్చి  ధన్యులయారు.

 పెద్దలే ఈ మాదిరి తమ దద్దమ్మతనం నిర్బీతిగా ప్రకటించుకున్న సందర్భంలో అసలు సిసలు గవర్నమెంట్ పాంప్లెట్ జె. బాపురెడ్డి అధికారంలో ఉన్నవారిని అన్ని విధాలా ప్రస్తూతిస్తూ కవిత్వం రాయడంలో అబ్బురమేముంది.  

ఆయనగారి కవిత్వం ఎలా సాగిందో జస్ట్ మచ్చుక్కిః

'అరాచకత్వ వర్షం వెలిసింది

అలజడుల బురద బెడద తగ్గింది

ఇరవై రంగుల ఇంద్రధనుస్సు

ఈ దేశాన్ని పాలిస్తున్నది'

ఇందిరమ్మ ఇరవై సుత్రాల పథకం ఇరవై రంగుల ఇంద్రధనుస్సు లా తోచింది కవిగారికి.

పరీక్ష సమయం వచ్చింది

విజృభించింది ఇందిరా ప్రియదర్శిని'

అంటూ పరిమళా సోమేశ్వర్ గారు మరో తప్పెట పుచ్చుకున్నారు అప్పట్లో.

 ముని సుందరం అనే మరో కవిమహాశయులకు ఈ మాత్రం నాజూకుతనం కూడా నచ్చింది కాదు ప్రగతి శీల శక్తుల పట్ల ఆయనకున్న కక్షనంత ఆక్షరాలలో కూర్చి మరీ 'పత్రికల్ని, ప్రజా వ్యతిరేకుల్ని బుట్టలో బంధించిన యీ దినం - నీకూ నాకూ పర్వం' అంటు అత్యవసర కాలపు అఘాయిత్యాలను సూటిగా ఎదుర్కొన్న పత్రికలను, ప్రజలను తిట్టిపొసేశారు. అతనికి చరిత్ర చెప్పిందట సామాన్యులు కోరేది హక్కులు కానే కాదుట!

'బ్రేకుల్లేని బ్రెయిన్లతో జాతి జీవనాన్ని

కలుషితం చేస్తున్న కడు పెద్ద మనుషులు..

అందుకే ఈ అత్యవర పరిస్థితి '

అంటూ ఇంత 'కూడూ-గుడ్డా-గూడా' సంపాదించుకుని తరించాడు.  సరసుడు- పాపం -ఆధునికుడు.

పి.ఎస్. ఆర్. శాస్త్రి కైతే 'ఇదే ఇదే శాసనాసి - పాపం, శమించుగాక!

ఇక గుత్తికొండ సుబ్బారావు, విహారి & శాలివాహన & కో, జ్యోతిర్మయి, లసూనా, భద్రిరాజులు  ఈ దారిలో సాగిపోయిన 'బాటసారులు' .

ఇక్కడ పేర్కొన్నది కొద్ది మంది మాత్రమే. ప్రసిద్ధులు, కాస్తో, కుస్తో పది మంది దృష్టిని ఆకర్షించే ప్రబుద్ధిజీవులు కనక.

ఈ బాణీలో సాగిన కవుల కవాతు వినిపిస్తూ పోతున్న కొద్దీ  ఈ చిన్ని వ్యాసం లక్ష్యం పలచబడుతుందన్న  దిగులుతో ఇటీవలి కాలంలో ఈ తరహా లొంగుబాటు ప్రదర్శించిన మరో దివంగత  ప్రఖ్యాత ప్రజాగాయకుని వైఖరిని నిరసిస్తూ నేను  రాసుకున్న నిరసన కవిత ప్రస్తావన అసందర్భం కాదనుకుంటా!

 

 

 

"పాట రద్దయి పోదు!"

(ప్రజాకళ-జూలై-2012 సంచికలోని నా కవిత)

 

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!

ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .

భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.

 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక

కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?

కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?

కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?

నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా

బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది

కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!

మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!

దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే

నీ గురించి కాదు గాని

నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.

జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు

పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు

ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో

ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?

వేళ్ళు నరికినా తలను తెంపినా

నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!

బదులు చెప్పు!

కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !

వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి

పాట ఆగితే ఆట ఆగదు

ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!

పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా

అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.

నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.

నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా

ఎంత జీరబోయినా

పాట రద్దయి పోదు

రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !

-కర్లపాలెం హనుమంత రావు

***

(జనవిజయం పేరుతో శ్రీ సదాశివరావు వెలువరించిన చిన్ని పొత్తం లోని ("కవులంటే"- వ్యాసం ఆధారం పు. 277 -287)

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...