Wednesday, December 8, 2021

ఈనాడు - సంపాదకీయం గీతా మకరందం - కర్లపాలెం హనుమంతరావు

 ఈనాడు - సంపాదకీయం 

గీతా మకరందం 

- కర్లపాలెం హనుమంతరావు 


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలి రెండింటి మాట అటు ఉంచి గీతాసూత్రం మాత్రం ' శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడం మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్క ని ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధు లైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలో పడిన నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్య  బోధ- గీత.  'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా ఎంచుకొని అన్ని కాలాలకూ  వర్తించే నిష్కామ కర్మ యోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని మాటగా 'గీత'  ప్రకటించిందని  బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరి సమానంగా ప్రామాణికత  సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల వంటి భగవత్పాదులూ  గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వ మేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంట్ వంటి మేధావులు వ్యాఖ్యానాలు వెలువరించారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు. కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిస కాలం నుంచి , నేటి కాలం  దాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్త వ్యమని కుండ బద్దలు  కొట్టిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారింది లేదు. గీత సజీవతకు అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్య జీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాదు! 


' దేహమా కంపించుచున్నది! ద్రోహమా యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడిన  నరుడిని - మోహమడంగి తొలంగె ధర్మ సందేహములన్నియున్ అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని తెచ్చేందుకు  గీత లో నారాయణుడు ఎత్తిన అవతారాలు ఎన్నెన్నో!  'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య'' అని అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి . ' దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము? / కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్ ' అంటూ డీలాపడిపోయినప్పుడు ' త్యజింపుము బేలతనమ్ము ధైర్య మున్ జెదరనీకుము' అని తల్లిలా లాలిస్తాడు మరోసారి . కొంచెపు మాట లాడెదు. జుగుప్ప  అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి కశ్మలత  చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు ఇంకోసారి . మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయి పట్టుకొని ఎలాగైనా పైకి లేపాలన్న తాపత్రయం చూపిస్తాడు చాలాసార్లు. నరుడేకైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల  నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజే స్తాడు భగవానుడు గీతలో . ' కర్తన్ నేను సమస్త భూతములకున్ సర్వములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారము తీర్తున్ నీవు నిమిత్త మాత్ర మగు నంతే క్లైబ్యమింకేల / నీ కర్తవ్యము గుర్తెరింగి / విజయా గైకొనుము  గాండీవమున్ ' అంటూ నిలబెడతాడు . చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించే నిమిత్తం అంతా తవ మీద వేసుకునే జౌదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు. 


చెప్పడంలోని గొప్పతనమో, వ్యా సమహర్షి గడుసుతనమోగాని పరమ గంభీరమైన వేదాంతసారం గీతా పాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, అవధూతలే కాదు బుద్ధివాదులు , చివరికి చలం వంటి స్వేచ్ఛాప్రణయవాదువా గీతామకరందాన్ని సీతాకోక చిలుకల్లాగా సేవించడానికి ఉవ్విళ్ళూరుడాన్నిబట్టి సుఖజీవన అంతస్సూత్రమేదో ఆ పుష్పంలో దాగుందనేగా అర్థం!  చాలాకాలం కిందట కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీచేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నా తల్లి ఒడిలోనే తలదాచుకొనే వాడిని '  అనేవారు అహింసాయోగి మహాత్మాగాంధీ . చిత్తం పరిశుద్ధయేకొద్దీ కొత్తకొత్త అర్ధాలు తోచే  చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం  గీత ' అనేవారు ఆధునిక యోగి వివేకానంద. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు  విచక్షణ భగవత్ స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనే గదా మనిషి  పతనావస్థ నుంచి బైటపడేది! వాస ప్రొక్తమైన  గీత అష్టాదశాధ్యాయాలలోని శ్లోకాలలో  ఏదో ఒకటి ప్రపంచంలో  ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే  చీకటిని చెండాడే  దివిటీలా వెలుగు తూనే ఉంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంతా మన్నన.  గీత కేవలం వ్యాస మహాభారతంలోని భాగం మాత్రమే కాదు, మనిషి నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగిన జీవన సూత్రాలు  విరివిగా పొదిగిన మనోవికాస శాస్త్రం కూడా. నరుడికి నారాయణుడు గీతలో చేసిన తామరాకు మీది  నీటిబొట్టు తత్వం మతాలు, నమ్మకాలతో  నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం  అనుసరించదగిన సూక్తం. అనేక భాషలలో  భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడమే దురదృష్టం.  ఉత్తమ మానసిక వికాస సాహిత్యంగా, జ్ఞానామృత భాండంగా  ప్రశంసలు అందుకొనే శ్రీమద్భగవద్గీత తీవ్రవాద సాహిత్యమనే ముద్ర వేయడం, నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనం.  మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞానం తీర్చడంలో ముందున్న గీతను  ఎవరేమని అడిపోసుకున్నా-  అది అమరానందం అందించే మకరందం. 


***


- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ ; వాషింగ్టన్ రాష్ట్రం, 

యూ. ఎస్.ఎ 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...