Sunday, December 12, 2021

సంస్కృతి : బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ -కర్లపాలెం హనుమంతరావు

  



ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు  తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు. 


బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే  అయిదేళ్ళ వరకు ఆగి  ఆ నిక్కరు బిగించే చేతికే  పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో  ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా  చేసినా ఇద్దరు  నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని  గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతును విద్యారంభం అన్నాడు. అదే సంస్కారం, గోపీనాథభట్టు విరచిత ' సంస్కార రత్నమాల ' ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటే, మార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయం చేశాడు. ఎవరే పేరుతో  పిలుచుకున్నా  పిల్లలకు  అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యంలో తంతు  మాత్రం దాదాపు ఒకటే!


తమాషా ఏమిటంటే, వీరమిత్రోదయ, స్మృతిచంద్రిక, సంస్కార రత్నమాల, యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్ర, బృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం కేవలం  దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు. 


ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల  అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడు, ఎనిమిది శతబ్దాలకు ముందు కాలానికి మించి ముందుకు  తీసుకుపోలేం. 


ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ లెక్క ప్రకారం అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే! ఎట్లాంటి పరిస్థితుల్లోనూ  అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర.  ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో అంటారాయన.  అందరికి అందరూ పండితులే. అందరివీ శాస్త్రీయ పరిశోధనలే! కానీ ఏటి కొకరు కాటి కొకరు ! ఇహ రథం ముందుకు కదిలేదెట్లా? అందుకే ఆ గందరగోళాల జోలికి  పోకుండా ఇంచక్కా   మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి  ఏ వింతలూ విశేషాలూ  చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!


 ఏ విషయం తెలిసినా , ఎంతటి  గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందని శాస్త్రం. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందు కింద బ్రహ్మదేవుడు అక్షరమాలను   సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. 

'                                                                             షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః ।

ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే! 


కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండంలో అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 

 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత గాని పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని హెచ్చరిక. ఆడవాళ్లు చదువుకోరాదని చెయ్యి చుట్టి ముక్కు చూపించే పద్ధతి అన్న మాట. ఆ లెక్క నిజమే అయితే,  ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమీయాలి  న్యాయంగా కదా! ఏదో .. అప్పటి నమ్మకాలు  అప్పటివి అని సరిపెట్టుకునేవాళ్లలో  ఏ పేచీ ఉండదనుకోండి! 


కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినా, హిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది  ఆ మహాదేవుడే  కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదేనా అని అడిగితే  ఇప్పుడున్న   శాస్త్రవేత్తల్లో సగం మంది అవునన్నట్లే తలలాడిస్తారు.  ఇహ మన  అక్షరజ్ఞాన కాలం  గురించి ఇంతలా  కుస్తీలింకా అవసరమా? 

అని సందేహం. సమాధానం చెప్పే దెవరు? 


చౌలం అంటే ఉపనయనం ముందు జరిగే తంతు . అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి  సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. 


రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం  సంఖ్యానం చ ఉపయంజీత, వృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా  మధ్యక్షేభ్యో దండనీతిం, వక్తృ ప్రవక్తభ్యః, బ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్, అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. 


వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడం, గణితం.. ఉపనయనం అయిన తరువాత  వేదాధ్యయనం చేయడం, అన్వీక్షకి, వార్త, దండనీతులు అనే మూడు రాజవిద్యలు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు)అభ్యసించడం ! అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకున్న తరువాతనే పెళ్లి ముచ్చట. 


ఇలాంటి ఏదో నియమం ఉండబట్టే  వాల్మీకి కాలంలో కూడా ఉండబట్టే ఆ గురువు లవకుశులకు ఒక్క వేదం మినహాయించి  సమస్త విద్యలు చౌలం అయిన తరువాతనే  నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన  మాట. 


'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'

లిపి పరిజ్ఞాతుడైన తరువాతనే  రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. 


చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడో, ఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  


చదువులు నేర్చుకోవడం సరే, ఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీద కూడా కీచులాటలే మళ్లీ! విశ్వామిత్ర నీతి ప్రకారం ఐదవ ఏట నుంచి విద్యారంగ ప్రవేశం చేయాలి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధి' అనే గ్రంథంలో  పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి 

ఏడు సంవత్సరాల వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దే' సిద్ధాంతంగా ప్రసిద్ధి. 


ఉపనయనం ఆర్షధర్మం దృష్టిలో  రెండో జన్మ. ఆ సందర్భంలో విద్యాభ్యాస కార్యక్రమం కూడా శుభంగా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణ. 


మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని    చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా  విశ్వామిత్ర నీతి నిర్దేశించింది.

  

  'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిః' అని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు చేసే అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు.  


అపరార్కుడు, స్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే  ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, రిక్త తిధులైన చవితి, నవమి, చతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  


శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి.  రవి, కుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలని పెద్దలు నిర్దేశించేవాళ్లు. ఈ తరహా  జ్యోతిష సంబంధ నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనేవాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో  ఓ మార్కాపురం పలకా.. నరసాపురం  బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  


ముహూర్తం చూసుకుని గానీ, అక్షరం నేర్పించని పెద్దల  ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు  అవీ తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడు అసలే లేరు. 


ఇహ అక్షరాభ్యాసం జరిపించే  విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఓం ప్రధమంగా బిడ్డకు తలారా  స్నానం చేయించి , ఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణ చేసి , విఘ్నేశ్వరునికి పూజ, సరస్వతీదేవికి అర్చన పూర్తి చేయించేవారు ! అటు పిమ్మట వెదురు చేట నిండానో, వెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమః' అని మూడేసి సార్లు  పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయించేవాడు. విఘ్నేశ్వర, సరస్వతీ శ్లోకాలు బిడ్డుచేత ముద్దుగా చదివించేవాడు. 


ఇక్కడి ఈ ' ఓం నమశ్శివాయ' మంత్రం జైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన.  కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధ' అనే నామాంతరం ఉంది. కాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమః' అనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమః' గా మారిందనే ప్రతివాదన తెచ్చేవాళ్లూ  కద్దు.  


నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనల అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం, అజ్యాహుతులతో సరస్వతి, హరి, లక్ష్మి, విఘ్నేశ, సూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చేయడం  మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీ? ఉన్నా శ్రద్ధ ఏదీ? బిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు. అంత తలకిందులుగా ఉంది నేటి వ్యాపార చదువుల వ్యవహారం.


ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి దీటుగా   'బిస్మిల్లాఖాని' అనే శుభకార్యం ఉంది. ముసల్మాన్ సంప్రదాయవాదులూ  ఐదో ఏట, నాలుగో నెల, నాలుగో రోజు బిడ్డ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. 

'ఏసియాటిక్ బెంగాల్ ' అనే  గ్రంథంలో (శాహజహాం) మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు  ఈ తరహా అక్షరాభ్యాసం, తదనంతరం ఉత్సవం జరిపినట్లు  ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 


'శూద్ర కమలాకరం' లో సైతం రాజవిద్యలైన ధనుర్విద్య, ఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది.  పునర్వసు, పుష్యమి, భరణి, హస్త, స్వాతి, చిత్ర, కృత్తిక, మఘ, రోహిణి, ఉత్తరాత్రయం, శ్రవణ, ధనిష్ఠ, మూల, మృగశిర, పుబ్బ, రేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపిక' నిర్దేశిస్తుంది. 


'సర్వాయుధనగామాత్ర..' లాంటి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమో, ఛురకత్తో  తూర్పు దిశకు వదలడం  ఆయుధ విద్యలకు సంబంధించిన  కింద లెక్క. 


ఇప్పుడైతే బాణాలు, భురకత్తులు గట్రా  విసరడాలు లేవు కానీ .. వాటి స్థానంలో రాళ్లు విసరటం.. ఏసిడ్ బాటిళ్లు నెత్తిన పొయ్యడాలు వంటి విధ్యంసకర విద్యల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. ఆ విద్యలకు ఏ ఆరంభ ముహూర్తాలు అక్కరలేదు. గురవులతో అయితే అసలు బొత్తిగా అవసరమే లేదు. ప్రతీ ఆకతాయి విద్యార్థి  ఎవరికి వాడే ఏకలవ్యుడు ! 


-కర్లపాలెం హనుమంతరావు

09 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

 

  

 

 

 

 

 

   


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...