Sunday, December 12, 2021

ఎన్నికల వేళా కుంభమేళా - వ్యాసం

 

ఎన్నికల వేళా  కుంభమేళా -  వ్యాసం

-కర్లపాలెం హనుమంతరావు

మహమ్మారి కరోనాతో మొన్నటి దాకా మనం  పట్టుదలతో చేస్తూ వచ్చిన యుద్ధం కాస్తా కుంభమేళా మునకలతో, బెంగాల్ తాలూకు ఎన్నికలతో పుటిక్కుమని గంగలో కొట్టుకుపోయింది.

ఎంతో సంయమనంతో నియమ నిబంధనలన్నీ పాటించి అణిచివుంచాం అనుకున్న కరోనా వైరస్ కాస్తా కుంభమేళా లాంటి   భారీ ధార్మిక కార్మక్రమం సందు చూసుకుని మరింత విజృంభించేసింది. ముహూర్తం కన్నా ముందే వచ్చిపడ్డ కుంభమేళా సందర్భంగా.. ఏ శాస్త్రం లేదు.. చట్టుబండలూ లేదు.. వైద్యుల జాగ్రత్తలతో సహా సర్వానికి ‘పచ్చి’ కొట్టేసి.. రెచ్చిపోతోంది కరోనా వైరస్! 

తొందర పడి కోయిల ముందే కూసిన చందంగా అరకొర దశల్లోనే మనకు మనమే విశ్వవిజేతలమంటూ  బోరవిరుచుకొన్నాంగా! విస్తుపోవడమే చివరికిప్పుడు మిగిలిపోయింది! ఛాతీ వెడల్పు ప్రభుత్వాలిచ్చిన బేఫర్వా ప్రకటనలతో జనం మదిలో  భయమనేదే లేకుండాపోబట్టే.. ప్రస్తుత దారుణ పరిస్థితి

పాత పోరాట అనుభవాలేవీ ఇప్పుడు పైసాకు పనికిరాకుండా పోయాయి. అదనంగా ప్రాణవాయువు కరువొకటి వంటింట్లో పొగలాగా! ఊహించని రేంజిలో కశ్మీరం నుంచి.. కన్యాకుమారం వరకు అంతటా  ఉక్కిరి బిక్కిరి! ఇంత విశాలదేశం ఒక్కసారిగా నేతాలేమి అనుభవంతో అల్లాడడం ఇదే మొదటిసారి. నేతాలేమి దశలో మరి నేతలు ఏమి చేస్తున్నారయ్యా అని పరిశీలిస్తే..   ప్రపంచం విస్తుపోయే కొత్త విషయాలు చాలా బైటపడుతున్నాయ్! ఇట్లాంటి నేతలను ఎన్నుకోదానికి కోట్లు కోట్లు ప్రజాధనం పోసి మనం బోలెడంత సమయం వృథా చేసుకుంటున్నది! అన్న పశ్చాత్తాపం కలక్కపోతే  ఈ ప్రజాస్వామిక దేశాన్ని ఇహ ఏ దేవుడూ కాపాడలేడు!

పడమటి బంగాళం మీదకు పదే పదే ఎన్నికల దాడులకు ఇదా వేళ? సామాజిక దూరం అక్కర మరింత ఎక్కువైన తరుణంలో సామూహిక జన సందోహంతో ఎన్నికల జాతర్లా? నిజానికి ఇప్పుడు బంగాళంలో  జరిపించింది అర్థ కుంభమేళా! మత పార్టీ రాష్ట్ర ఎన్నికల కక్కుర్తికి అదే మహా కుంభమేళలా మారికూర్చుంది!

 

మతం పట్ల ఏ దేశంలో అయినా మామూలు మనిషికుండే మంకుపట్టు మామూలుగా ఉండదు.  ధార్మిక భావోద్వేగాలు రెచ్చగొడితే దాని ధాటికి ఏ శాస్త్రీయ సత్యమూ దీటుగా నిలబడ్డం ఉండదు. మూక మనస్తత్వం మీద మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒకానొక మితవాద రాజకీయ పక్షానిదే ప్రస్తుతం జరుగుతున్న హతకాండ పాపమంతా!

చలనచిత్ర సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ నర్మగర్భ వ్యాఖ్య ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. 17 లక్షల మంది కోవిడ్ బాధితులకు టీకా ఇప్పించేందుకు ముంబయ్ కి పట్టిన సమయం ఆరు వారాలయితే.. 35 లక్షల మంది  ధార్మిక భక్తులను గంగలో ముంచడాంకి బెంగాలుకు పట్టిన సమయం కేవలం 24 గంటలు.  మరో జన్మ ముందు ప్రస్తుతమున్న జన్మ అప్రస్తుమనుకునే  భక్తులు దండిగా ఉండే దేశం కాబట్టే ఎన్నికల వేళ ఎప్పుడొచ్చినా ఏ  కుంభమేళాలో భారీగా జరిగే దృశ్యాలు కనిపించడం!  దేశం దిశ ఏటు తిరిగిందో గమనిస్తే నిజంగా వణుకుపుడుతుంది.

పబ్లిక్ కన్నా వైరస్సే వైజర్! వ్యవస్థ లోపాలేమిటో దానికి బాగా తెలుసు! అందుకే ఐదేళ్ల కోసారి వచ్చేవే అయినా ఎన్నికల తంతుకు తన వంతు టచప్ లా ఇచ్చింది.. ప్రపంచం విస్తుపోయేలా చేసింది!

ఎన్నికలు మంకు  కుస్తీలు పట్టే గోదాలాయ! ఆ కుస్తీలలో  మోదీని మించిన వస్తాదు లేనుకునే మూఢులకు  కరోనా భూతం ఇప్పటికైనా కళ్లు తెరిపించినట్లేనా?

కరోనా మహమ్మారేమీ బెంగాల్ సి.యం మమతా బెనర్జీ కాదు. అవినీతి కేసులకు అదిరిపోడానికి కోవిడేమీ ప్రతిపక్షంలో లేదు.  లాలూచీ రాజకీయాలకు లొంగిపోడానికి వైరస్సులకేమీ అధికార కాంక్షలేదు. చీల్చి బలహీనపరచాలన్నా కరోనా కంటికెన్నడూ కనిపించేది కాదు.  అబద్ధాలను మాత్రమే  నిజమని నమ్మే  ఓటరు అమాయకత్వానికి వైరస్సులో చోటు  లేదు. జనం సొమ్ముతో ఎంత స్థాయి పెంచుకున్నా ఏ కరోనా కణమూ పట్టించుకోదు. గాలి మాటలు తరహా ఎన్ని  ఆరితేరిన వ్యూహాలతో కాలు దువ్వినా వెనక్కు తగ్గక పోగా.. అందుకే రెండో దశంటూ రెట్టించిన కొత్త ఎత్తుగడలతో చివరకు మహా వస్తాదు మోదీని ఎత్తికుదేసింది కరోనా వైరస్!  

ప్రజాస్వామిక దేశం మనది. అధికారం అప్పగించే బాధ్యత  జన సమూహానిది. అందుకు కావలసింది మంచీ చెడూ తర్కించుకునే బుద్ధి.  ఆకర్షణ తంత్ర్రాలకు లోబడితే సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హుళక్కి అయినట్లే!  భవిష్యత్తు మీద ప్రధానంగా దృష్టి పెట్టి  తాత్కాలిక స్వార్థప్రయోజనాలను పక్కన పెట్టి సమర్థుడైన నేతకు   దక్షిణ తాంబూలాలివ్వాల్సిన అరుదైన అవకాశం ఎన్నికలొచ్చినప్పుడే సామాన్యుడికైనా దక్కేది. బంగారంలాంటి ఆ అవకాశాన్నొదిలేసుకుని ఏవేవో ప్రలోభాలకు లోనయిపోయి పొరపాటు చేసినప్పుడే  ‘తాంబూలాలిచ్చేసాం.. తన్నుకు చావండ’నే సీను  నేతల చేతుల్లోకెళ్ళేది.  ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్నా తొలిగిపోని ఓటరు తెలివితక్కువతనమే ఆశ్చర్యం కలిగించేది.

1947 నాటి దేశ స్వాతంత్ర్య సముపార్జన కాలంలో పశ్చిమ బెంగాల్లో భీకరమైన మతకల్లోలాలు చెలరేగిన సంగతి ఇప్పటి తరానికి అంతగా తెలీని విషయం. అంత విపత్కర పరిస్థితుల నుంచీ గట్టెక్కి దేశ ప్రధాన జీవన స్రవంతిలో మమేకమైన చరిత్ర  బెంగాలీయులది. 71 నాటి బంగ్లాదేశ యుద్ధంలో కూడా  పొరుగు పాకిస్తాన్ లో జరిగిన మతకల్లోలాలకు బెదిరి పారిపోయి వచ్చిన  కోటి మందిని అక్కున చేర్చుకున్న గొప్ప మత సామరస్యం బెంగాలుది! మత ప్రాతిపదికన ఇప్పుడిట్లా  నిట్టనిలువునా చీలడం చూస్తుంటే నిజమైన ప్రజాస్వామికి బెంగేయకుండా ఉంటుందా!

ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకా.. మెజారిటీ మిషన అట్టడుగు వ్యక్తిని మరంత అణగదొక్కేటందుకా  ఎన్నికలు? కల్లో అయినా ఊహించి ఉండరేమో అనిపిస్తోందిప్పుడు మన  రాజ్యాంగ నిర్మాతలు కులాతీత మతాతీత వ్యవస్థపై జరుగుతున్న   ఈ స్థాయి దాడులు!

ఎన్నికలమేళా కోసమే కుంభమేళాలు జరిగిపోతున్నా కిమ్మన్నాస్తిగా ఉండిపోవడం కామనై పోయింది ఎన్నికల కమీషనుకు!  కరోనా వైరస్సేమీ  ఎన్నికల కమీషన్లా పరాధీనంలో లేదు. ఆ సంగతి అందరం మర్చిపోబట్టే ఇవాళ ఇట్లా .. ఎవరికి ఎట్లా అదుపు చెయ్యాలో తెలీనంత ఉధృతంగా రెండో దశలో మహమ్మారి ఆగడాలు!

ఎవరో అన్నట్లు.. వేలాది ముఖాలు గంగానది మురికి నీళ్లల్లో, ముఖం తొడుగూ గట్రాలేవీ లేని లక్షలాది ముఖాలు రద్దీ రాస్తాల మీద.. ఇప్పుడు ఇండియాలో కనిపించే దృశ్యాలు!  ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కరాళ నృత్యం కాలంలో లోకం లోకువ కట్టిందంటే కట్టదా మరి! ఇంత ఆపత్కాల సమయంలో కూడా నమ్మి ఓటిచ్చిన ఓటరు సంక్షేమం పట్టకుండా ఒక దేశ ప్రధాని ఏకంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టించుకుని ‘మీకు మాత్రమే టీకాలు ఫ్రీ’ అంటూ ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ఎవరైనా ఎందుకు హేళన చేయరు?

ఎందుకు హేళన చేయకూడదు? లోకం నవ్వుతున్నదని కాదు కానీ, నడుస్తున్న పాలనలోనే  లోపమేదో జొరబడిందని ఇప్పటికైనా సాధారణ పౌరుడిగా మన గ్రహింపుకు రావాలి కదా!  జరిగిన పొరపాటు ఎక్కడో తెలిస్తే సరిదిద్దుకునే సంగతి ఆనక!

-కర్లపాలెం హనుమంతరావు

26 -04 -2021

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...