Sunday, December 12, 2021

మనదగ్గరే ఉన్నాయి ఆధార వనరులు కర్లపాలెం హనుమంతరావు

 వ్యంగ్యం


సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’.. ఈ నీతి ఆయోగమేంటో గోలగా ఉంది  బాబూ! భాషను గురించి కాదు నా బాధంతా! వృద్ధి, ఉద్యోగాల కల్పన, బీదరికం నిర్మూలన,  పథకాల అమలు.. అంశాలన్నీ వినసొంపే గానీ కానులు రాలేందుకు  వేరే దగ్గర దారులు ఇంకేమీ లేనే లేవా అని నా శంక. నిధులు, విజ్ఞానం లాంటి వాటినన్నింటినీ కేంద్రం ఉదారంగా పంచి  రాష్టాలకు సాధికారకత కల్పించడం .. ఏందో..  చందమామ కథలాగా ఉంది వినడానికి.

స్వచ్చ భారత్ మనకేమన్నా అచ్చివచ్చే పథకమా ఏమన్నానా? కనబడ్డ చెత్తనల్లా అలా కాలవల్లోకి వూడ్చిపారేయమని సతాయిస్తున్నారు కానీ మరీ ఈ మధ్య.. నిజానికి చెత్తనుంచి ఎన్ని కొత్త కొత్త ఆదాయ వనరులు సాధించుకోవచ్చూ!

కొత్త రాష్త్రం .. కొండలా మీ ఆండ ఉండాలని ఒకడు. పాత రాష్ట్రం.. ప్రత్యేక హోదాల్లాంటి హామీలన్నీ అమలు కావాలని మరొకడు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు  మొన్న నీతి ఆయోగులో మోదీగారి బుగ్గలు పుచ్చుకుని మరీ బతిమాలుతుంటే చూడ్డానికే చాలా సిగ్గనిపించింది.  ఎక్కడ  చూసినా తుక్కూ దూగురా కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చే మన పుణ్యభూమిలో వేరే ఆదాయ వనరులకు వెదుకులాట అవసరమా? 

తెలుగు రాష్ట్రాలు రెండూ నిండు పూర్ణగర్భలు కదా! తంగభద్రలో, తెలుగ్గంగలో రింగు వేసినా చాలు ఇసుకను బంగారంగా మార్చుకోవచ్చు. మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని ఎర్రచందనం దుంగలే ఇప్పుడు ఓ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆధాయవనరులు. మధ్యమంటే ఇహ చెప్పేదేముంది! సాంపద్రాయికంగా ప్రజా సంక్షేమ పథకాలన్నింటికీ అదే ప్రధాన చోదకశక్తి. పనికిరాని బొట్టుబిళ్లలతో సైతం మదర్ థెరిసా బొమ్మలు చేసి అమ్మేసే అమ్మళ్లు ఇక్కడే  పుష్కలంగా ఉండగా  ఢిల్లీ దాకా పోయి కేంద్రానికి దండాలు దస్కాలు పెట్టడం అవసరమా? బొగ్గు గనులు కావాలని ఒక ముఖ్యమంత్రి.. బయ్యారం ఇనప తుక్కు ఇవ్వమని మరో ముఖ్యమంత్రి దేబిరించడమే వింతగానే ఉంది మరి! 

చీపుగా చూసే చీపురు పుల్లల్ని కూడా మఫ్లరు మనిషి  ఎలా వ్యాపార సరుగ్గా మార్చిసాడో మొన్నఢిల్లీ ఎన్నికల్లో చూసాం గదా! కూచిపూడి, కొండపల్లి,  బ్రాండులతోనే కాదు పూచికపుల్లలతో సైతం గోచీపాతరాయుళ్ళు కోటీశ్వరులను చేసేయవచ్చు. మురికి నీటినైనా సరే సీసాలకు పట్టి మూతి బిగించి మంచి కంపెనీ లేబులొకటి  అందంగా అతికిస్తే సరి.  లీటరు ఇరవై రూపాయలకైనా వాటంగా చెల్లిపోతుంది. మన వంట్లోని ఒక మూత్రపిండం మనది కాదనుకుంటే చాలు.. ప్రతి ఓటరు వంటిమీదనే లక్షలు పలికే వనరులున్నట్లు! దేవుడు వృథాగా దేన్నీ ప్రదానం చేయడు కదా!   సెనెక్సుల అదుపులేదు. సెబీల గుబులు లేదు. సెక్సు సీన్లని సెన్సారు వాళ్ళస్తమానం వేసే ఏ కత్తెర్ల గోలలేవీ లేకుండా నాలుగురాళ్ళు సంపాదించుకునే అవకాశాలెన్నో  ఆకాశమంత విస్తారంగా ఉండంగా.. మన సియమ్ముల మాత్రం మోదీగారి ముందలా మోకాళ్ళు వంచి మరీ  ఆ  బీదరుపులు అరవడమేమిటి.. చీదరగా!

 నాలుగు రాళ్ళు సంపాదించుకోమని మన పెద్దలు అస్తమానం పోరుతుంటారు.  నిజం రాళ్లకు, రప్పలకు ఉన్న గిరాకీ  వాస్తవ డబ్బుకు ఎక్కడుంటుంది చెప్పండి. ఎంత పోసినా అమ్ముడవని మొండిఘటాలైనా .. ఇళ్లమీదకు నాలుగు రాళ్ళు వేయిస్తే సరి చప్పున దారిలోకొచ్చే రోజులాయ ఇవి మరి! పొరుగున ఉన్న తమిళ రచయిత పెరుమాళ్ కథ చాలదా మనకి రాళ్ల పవరేమిటో తెలుసుకోవడానికి? రాళ్ళు, రప్పలు కుప్పలుగా  అమ్మించే పథకాలేమన్నా పెట్టించండీ!

గాలిని తరంగాలుగా మార్చి ఎన్ని వేల లక్షలు వ్యాపారాలు వర్థిల్లుతున్నాయి ఇక్కడ! బొగ్గును తవ్వి పోసుకుని కోట్లకు పడగలెత్తిన విజేతల కథలకైతే దిక్కే లేదు.  పాత పాలకుల పాలన పుణ్యమా అని దేశంలో ఏదీ వ్యాపారానికి అనర్హమైనది కానే కాదని ఎన్నడో తేలిపోయింది. పశుదాణానుంచైనా బంగారు కాణులు రాబట్టుకోవచ్చని లాలూ ప్రసాదుల్లాంటి బాబులు ఎన్ని మార్లు నిరూపించారూ!  స్కాముల గురించి కాదు స్వాములూ! ప్రపంచంలో ఎక్కడ  లేవుగానీ ఆ అవినీతి భాగోతాలు.. జాతికి అవి నేర్పే పాఠాలు ఏవిటన్నది మనకు ముఖ్యం. 

తట్టెడు సిమెంటైనా తయారుకాకుండానే రెట్టింపు రేట్లకు షేర్లు అమ్మి పెట్టే తోలుపెట్టె కంపెనీలు బోలెడన్ని వర్ధిల్లిన భూమి ఇది.  ఏ కృష్ణకాలువ గట్టునో ముక్కుమూసుకుని కూర్చునే సౌకర్యాలు కల్పించినా చాలు కదా!  గదుల అద్దెకే  వేలు దండుకోవచ్చు. ఇంట్రస్టు అంటూ ఉండాలేకానీ.. ఏ ట్రస్టు పెట్టుకున్నా మూడు తరాలపాటు కాలు కదపకుండా తిని కూర్చునే సంపద సాధించుకోవచ్చు. మన జనాలకిలాంటి కిలాడి పథకాల్లోనూ తర్ఫీదిస్తే తప్పేముంది? 

అత్యధిక బిలియనీర్లున్న ప్రపంచం దేశాల్లో మనదింకా మూడో స్థానమేనా? సిగ్గుచేటు. బిల్ గేటు బాబును మించి సంపాదిస్తున్నారే.. కొద్దిమంది కరకట్ట పనులు చూసే  జాబులున్న బాబులు. ఐటి చట్టం తాలూకు తీవ్ర నేరాలకైనా సరే సర్వోన్నత న్యాయస్థానం అసలే అర్థమూ లేదు పొమ్మంటున్నదీ మధ్య. ఇక దేనికి మన జనాలను బెదురుతూ కూర్చోమనాలి?  చట్టం చూసీ చూడనట్లు పోతే చాలు.. చట్టిలో బంగారం ముద్దలు దాచుకునే స్థాయికి ఎదుగుతారు ఇక్కడి జనాలు.

’మేక్ ఇన్ ఇండియా’ అనేది మన ప్రధాని నినాదం కూడానాయ. గోడక్కొట్టుకునే మేక్కూడా ఇక్కడే తయారవ్వాలన్న ఆయన ఆకాంక్షనుంచైనా మన జనాన్ని  స్గూర్తి పొందనీయక పోతే ఎలా? దేశభక్తితో పాటు స్వయంభుక్తికీ సులభ మారర్గాలెన్నో కళ్లముందే ఇన్ని మెరిపిస్తున్నా నిద్రమత్తులోనే ఉంచి  మనం జనాలను జోకొడుతున్నామన్నది నా బాధ.

విత్తనాల వ్యాపారం కన్నా కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పూవులూ ఆరుకాయలుగా సాగుతున్న కాలం ఇది. నమ్మించి దండుకున్నవాడికే ఆనక నమ్మి మెళ్ళో దండేసి హారుతులిచ్చే జమానా ప్రస్తుతం నడుస్తున్నది.   ఇన్ని వనరులుండీ ఇప్పటికీ జనం కోట్లకొద్దీ పేదరికంలోనే మగ్గుతున్నారంటే.. ప్రభుత్వాలకు సుపరిపాలన సామర్థ్యం లేదనేగా అర్థం?

బోలెడన్ని వనరులు.. నరులు మన సహజ సంపదలు. సద్వినియోగం చేసుకునే యోగమే అవసరం.  కోళ్లక్కూడా పనికిరాని ఫారాల్లో  పాఠశాలలు పెట్టి పిల్లకాయల భవిష్యత్తునలా బుగ్గిపాలు చేసే కన్నా చక్కంగా చిన్నతనంనుంచే చిన్నతనం లేకుండా ఏ చెత్తతోనైనా సరే కొత్త కొత్త పద్దతుల్లో ఆర్జించడం నేర్పించాలి. ఆ సెట్టులనీ ఈ సెట్టులనీ పసిబిడ్డల్ని పెసరట్ల మాదిరిగా పరీక్షల పెనంమీదలా వూరికే కాల్చుకు తినకుండా వేడి వేడి పకోడిల్లాంటి మంచి రుచికరమైన పథకాలు మరన్ని  సెట్ చేసి పెట్టుంచాలి. ఏ దేవుడిసేవ వంక పెట్టుకున్నా చాలుగదా.. గదులు అద్దెకిస్తే పదులు, వేలల్లో ఆర్జించుకోవచ్చీ ఆధ్యాత్మిక దేశంలో. ప్రభుత్వ సారాయి దుకాణమైతే ఏ కొద్దిమంది తాగుబోతులకే పరిమితం. పరమాత్ముడి ప్రసాదాలకైతే సర్వే సర్వత్రా  గిరాకీ .  ఆశ్రమాలను మించిన శ్రమరహిత ఆధాయా పథకాలు ఇంకెక్కడున్నాయి స్వామీ? 

నాలుగు రాళ్ళు జమకూడినాక బోర్దు తిప్పేసే కళ  బీసి కాలం నాటిదే కావచ్చు కానీ.. ఇవాళ్టికీ అలా  బోర్డు తిరగేసిన వాడే   రాటుతేలి మొనగాడై జాతి మొత్తానికి మార్గదర్శకుడుగా మన్నలందుకుంటున్నాడు. బుర్ర పెట్టి ఓ గాడిలో పెడితే   జనాలు గుర్రాలెక్కించి  ఊరేగిస్తారు.  పెడదారిలో పెడితే గాడిదమీద ఊరేగింపు ఎలాగూ తప్పదు చివరికి. 

అంతు లేకుండా ఇన్నేసి ఆదాయవనరులు సహజ సిద్దంగా మన దగ్గరిన్ని దండిగా   ఉండీ ఒక ముఖ్య మంత్రి ప్లాస్టిక్ ఉత్పత్తులకోసం, మరో ముఖ్యమంత్రి పాత హామీల అమలుకోసం మొన్న ఆ నీతి ఆయోగ్ లో పట్టు పట్టడమే వింతగా ఉంది. విచారంగానూ ఉంది*

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...