Sunday, February 14, 2021

గాథా సప్తశతిలోని కొన్ని పద్యాల అంద చందాలు! -కర్లపాలెం హనుమంతరావు

 



గథా సప్తశతి రచనలో కొంత భాగం (వజ్జాలగ్గం) తెలుగు గడ్డ మీద జరిగిందా? అని ఓ సందేహం. ఈ ఉద్రంథంలోని కొన్ని తియ్యని తెలుగు పలుకుల రుచి నోటికి తగిలినప్పుడు,  ఆ రసాస్వాదన కారణంగా మదిలో ఈ సందేహం రేకెత్తడం సహజం. 

వజ్జాలగ్గం అనే మాట మనకు ఇప్పుడు కొత్తగా వినిపించే పదం. గాథా సప్తశతి దారిలోనే అదీ ఓ ముక్తకాల సమాహారం. కర్త జయవల్లభుడనే శ్వేతాంబర జైనముని. 8వ శతాబ్ది పండితుడు.  'ధర్మ, అర్థ, కోవా' లనే త్రివర్గ  సుభాషితాల సంకలన కర్త ఆయనే. స్వయంగా కవే  చెప్పుకున్న ఆ మాటకు మరో ప్రామాణికత అవసరం లెద! ఇక పజ్జాలగ్గం నుంచి కొన్ని పద్య పుష్పాలను దూసి తెచ్చుకొని ఆ పరిమళాలను ఆఘ్రాణించే  ప్రయాస కొంత చేద్దాం.

 సువ్వన్ను వయణ పంకయ

ణివాసిణిం పణమిఊణ సుయదేవిం,

ధమ్మాఇ సుహాసి అం వోచ్చం  (-1)

దీన్నే సంస్కృతంలో చెప్పాలంటే

సర్వగ్య వదన పంకజ

నివాసినీమ్ ప్రణమ్య శ్రుతదేవీమ్,

ధమ్మాది త్రివర్గ యుతం

సుజనానాం సుభాషితమ్ పక్ష్యామి- అనుకోవాలి.

'వివిధ కవుల గాథలలోని మేలిమిని గ్రహించి జయవల్లభమనే వజ్జాలగ్గం విధిపూర్వకంగా సమకూర్చాను' అంటూ సంకలనకర్త స్వయంగా ఓం ప్రథమంలో చేసుకన్న ప్రకటన ఇదిః

'వజ్జా' అంటే పద్దతి. లగ్గం అంటే 'సంకలనం'. ఒక క్రమంలో చెప్పే గాథల పద్ధతిని పజ్జా(ప్రజ్యా) అంటున్నానని ఆరంభంలోనే స్పష్టంగా చెప్పుకున్న మాట ఇది

జయవల్లభుడికి  'ప్రాకృత' భాష పైన తగని అభిమానం, ఆ వాజ్ఞ్మయాన్ని గురించి గొప్పగా చెప్పుకునే ఏ సందర్భాన్ని ఆయన ఉదారంగా వదిలివేసిందిలేదు. లాలిత్యంతో నిండి మధురమైన భావాలను ప్రోవు చేసే అక్షరాలకు ప్రాకృతంలాగా ఆలవాలమైన భాష మరోటి లేదంటాడాయన.   శృంగార రసయుతంగా సరిత్తులాగా ప్రాకృతం పక్కనే పారుతుండగా ఉప్పు నీరు నిండిన సముద్రంలో మునకలేసి తరించాలని ఏ తరుణి  కోరుకునేది? అని జయవల్లభుడి ప్రశ్న.

లలిఏ మహురక్ఖర ఏ

జువౖ జణ వల్లహే ససింగారే

సంవే(?) పా ఇఅ లవ్వే

కో సక్కై సక్కఅం పఢిఉం-  (29) - అనే పజ్జాపగ్గంలో ఓ పద్యం అర్థం.

 

పొదుగు పితికే కళ అంతుబట్టక  ఆవులను బాధకు గురిచేసే మొరటువాళ్లున్నట్లే.. పాకృత గాథల అంతరార్థం గ్రహించలేని  అరసులు అర్థం వివరించే మిషతో దాన్ని ఈకకు ఈక, తోకకు తోక లాగి రూపం వికారంగా మార్చేస్తున్నారని జయవల్లభుడి వాపోత. "ఓ గాథా! నిన్ను మోటు మనుష్యులు అడ్డదిడ్డంగా చదువుతారు. చెరుకు తినడం తెలీని మొరటులు  నమిలి ఊసినట్లు నిన్ను ఎక్కడ బడితే అక్కడ విరిచి వికారం చేస్తున్నారు' అన్న ఆనాటి కవి జయవల్లభుడి ఘోషలో ఇప్పటి మన తెలుగు భాష వికృత రూపి కావడానికి కారణంకూడా కనిపిస్తున్నది.

 

'వజ్జాలగ్గం' భర్తృహరి సుభాషిత పద్ధతిలో సంకలనం చేసినలాంటి కావ్యం. దీనిలో 96 పగ్గాలలో సుమారు వేయి గాథలున్నాయి. సామాన్యుడే  ఈ కావ్య కథానాయకుడు.. ప్రముఖంగా వ్యథార్తులను, విధి వంచితులను స్వేచ్చగా వర్ణించాడీ కావ్యంలో. నిర్భాగ్యుడు అంటే జయవల్లభుడి దృష్టిలో  సిద్దులందరిలోకి మహా సిద్ధుడు.

'దీనంతి జోయసిద్ధా

అంజణ సిద్దా వి కౌని దీసంతి,

దాంద్జ జో యసిద్దం

మం తె లోఆని పచ్చంతి  (141)

(దృశ్యంతే యోగసిద్ధాః

అంజన సిద్దా అపి కేచన దృశ్యంతే,

దారిద్ర్యయోగ సిద్ధం

మాం తే లోకా న ప్రేక్షంతే)

 -యోగ సిద్ధులు కనబడతారు. అంజన సిద్ధులూ కనబడతారు. నాబోటి దారిద్ర్య యోగసిద్ధులు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు- అని ఓ దరిద్రుడు వాపోత. దరిద్రులను సమాహం ఉన్నా లేనట్లే లెక్కలోకి తీసుకోని నిర్లక్ష్యపు ధోరణి పై ఆ నాడే ఇంత పెద్ద వెటకారం!)

 జై నామ కహని సోక్ఖం

హూఇ తులగ్గేణ సేవఅజణస్య,

తం ఖవణాఅ సగ్గారో

హణం న విగ్గో వా సఏహి   (153)

 (యది నామ కథమపి సౌఖ్యం

భవతి తులాగ్రేణ సేవకజనస్య,

తత్ క్షపణక స్వర్గారోహణ

మివ వ్యాకుల భావసతైః)

-రాజసేవకులు, డాంబికరాయళ్లు, వస్త్ర వ్యాపారులు, పల్లె గడసరులు, వడ్డెవాళ్ళు, వైద్యులు, జ్యోతిష్కులు వంటి వాళ్ల మనస్తత్వాలను ప్రత్యేకంగా చిత్రించాడీ జయవల్లభకవి. రాజ సేవకునికి ఏదైనా సౌఖ్యం కాకతాళీయంగా వస్తే, అది క్షపణకుని స్వర్గారోహణం లాగా ఎన్నో కష్టాల తర్వాత మరణానంతరం సంభవించవచ్చునంటాడు.  క్షపణకుడు( అంటే సమ్యాసి. సన్యాసికి సుఖం  మరణానంతరమే. తనువు చాలించిన తరువాత అతని ఘనతను గుర్తించి విమానం కట్టి మోసుకుపోతారు. వాయిద్యాలు మోగిస్తూ, దానాదులు అంత్య సంస్కారాల వంకన చాలా ఘనంగా నిర్వహిస్తారు.  రాజుల కొలువు చేసుకొనే సేవకుడికిది కూడా అదే  తంతు   కాకాతాళీయంగా ఏదైనా సుఖం కలిగిందంటే  అది ఏ వీర మరణం తరువాతనో!

పజ్జాలగ్గంలో ఈ తరహా విచిత్రమైన పద్యాలు జయవల్లభుడు చాలానే సేకరించి హృద్యంగా సంకలించాడు.

 ఒక సేవకుడు అనుకుంటాడుట 'మంచి పొదుగు ఉన్న మూడు ఆవులు, నాలుగు మంచి ఎడ్లు, చేతినిండా  వరికంకులు ఉంటే చాలు.. ఓ సేవా ధర్మమా, నీవు ఎక్కడన్నా సుఖం ఉండు' అని.

తంబాఉ తిన్ని సుపఓహరా ఉ

చత్తరి పక్కల ఎఇల్లా,

నిస్సన్నా రాలయ మంజరీ ఉ

సేవా సుహం కుణవు'   (160)

 (గాన స్తి సః సుపతీధరాః

చత్వారః సనర్థ బలీవర్గాః

నిష్పన్నా రాలవ మంజర్యః

సేవా సుఖం కరోతం)- అన్న పద్యానికి భావం ఇదే!

గ్రామాలలోని చతురులను గురించి కవి చాలానే మనస్తత్వ విచారణ చేసినట్లుంది. ఓ పెద్దామె వయసులో తన కన్నా చిన్నదైన మరో  అమ్మాయిని హెచ్చరిస్తూ 'పల్లెల్లోని మగవాళ్లు బహు కూట నిపుణులు. వారి చేతుల్లో పడ్డ వాళ్లకు కలలో కూడా సుఖం ఉండదు.  ఆ మాయగాళ్లకు  ఆరో జ్ఞానం(సిక్స్త్ సెన్సు) వరం. ఆ చూపుల్లో పడిన ఆడదానికి అదే శాపం' అంటుంది. పల్లెల పేరే కవి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లో కవి? ఇప్పుడైతే అన్నిచోట్లా ఆడదానికి మగవాడితో అగచాట్లే!

'మేడలు, మిద్దెలు, ప్రాకారాలు, శిఖరాలు ఒక్కటే కాదు.. మాయగాళ్లు గాని ఉంటే పల్లైనా నగరంలానే జాగ్రత్త వహించాల్సిన స్థలం! అని అర్థం వచ్చే

తహ చంపిఊణ భరి ఆ

నిహిణా లావణ్ణ ఏత తణు అంగీ,

జహ సే చిహారతరంగా

అంగుళి మగ్గ దీసంతి   (314)

(తథా నిసీడ్య భృతా

నిధినా లాణ్యేన తన్వంగీ,

యథా అస్యాః చికురతరంగా

అంగుళీమార్తా ఇవ దృశ్యంతే) అని అర్థం వచ్చే పద్యాలెన్నిటితోనో  ఈ పాకృత గాథా సప్తశతి నిండివుంటుంది.  

శారీరక సౌందర్యం, అంగ సౌష్టవం వంటి ఆహ్లాదకరమైన విశిష్టతల పైన ఈ కవికుండే భావనలు బహుచమత్కారంగా ఉంటాయి.  ఓ లావణ్యవతిని చూసిన ఈ కవికి విచిత్రంగా   ఇళ్లల్లో ధాన్యం, పత్తి వంటి వస్తువులను   సంచుల్లోకి కూరే  దృశ్యం జ్ఞప్తికి వస్తుంది. విధి ఓ తన్వంగిని లావణ్యంతో కూరి కూరి నింపినందువల్లనే పై నుంచి విధి నొక్కి నొక్కి కూరిన చేతుల గుర్తులు వంకీల జుత్తులా కనిపిస్తోందని చమత్కరిస్తాడు కవి.

జయవల్లభుడి వజ్జాలగ్గం ఆసాంతం రసపానం చేస్తే గాని, ప్రాకృత భాషలోని అందచందాలు సోదహరణంగా  చదువరిని అలరించవు. చదువకుండా , పరిచయం వినా  ఏర్పరుచుకునే అభిప్రాయాలలో ఎప్పుడూ శాస్త్రీయ కోణం ప్రశ్నార్థకమే.. కదా!

కీ.శే శ్రీ తిరుమల రామచంద్రగారు గాథా సప్తశతి పై కొంత లోతైన పరిశోధనే సాగించారుగతంలో వారు భారతిలో వజ్జాలగ్గం పై వెలువరించిన వ్యాసం ఆధారంగా కొన్ని పసందైన విశేషాలు సహృదయ తెలుగు సాహితీ మిత్రులతో పంచుకుందామన్నదే ఈ చిరువ్యాసం ఉద్దేశం.

-కర్లపాలెం హనుమంతరావు

15 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...