Showing posts with label discussion. Show all posts
Showing posts with label discussion. Show all posts

Friday, January 24, 2020

కళ కళ కోసమే కాదు - కళాభిమానం కళ కోసమే కర్లపాలెం హనుమంతరావు




సౌందర్యాన్ని  విజ్ఞాన శాస్త్రంలోలాగా నిర్వచనంలో బంధించలేం. ఒక్కొక్కరికి ఒక్కో  చిత్రం, ప్రకృతి దృశ్యం, జీవితం, సాహిత్యంలోని ఓ విభాగం ఒక్కో కారణం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకరి ఆకర్షణకు కారణం వాళ్లే చెప్పగలరే తప్పించి, వేరే వారు ఆ ప్రయత్నం చేసినా నూరు శాతం న్యాయం చేయలేరు. వాల్టరు అన్న ఈ మాటనే. కాళిదాసూ దుష్యంతుడి పాత్ర  ద్వారా వెలిబుచ్చడం ఆశ్చర్యం కలిగించదు. మేధావులు వేరే వేరే ప్రదేశాలలో ఉన్నప్పటికి ఒకే తీరులో ఆలోచనలు కొనసాగిస్తారన్న నానుడి ఉండనే ఉంది కదా! రమ్యమైన వస్తువులను వీక్షించడం,, మధురమైన శబ్దాన్ని ఆలకించడం పర్యుత్సకతకు దారి తీస్తుంది. జననాంతర సౌహృదాలు జ్ఞప్తికి వస్తాయని కాళిదాసు భావన.  ఓంకారనాథ ఠాకూరు నీలాంబరి’, సైగల్ 'దాబుల్ మోరా'  ఇదే తరహా భావాలను సమర్థిస్తాయి.

కాళిదాసు దృష్టిలో 'రమ్యాణి' అంటే సౌందర్యమే. ప్రతీయ మానం పునరన్య దేవ/ వస్త్వస్తి వాణీషు మహాకవీనా/యత్తత్ ప్రసిద్ధావ యవాతి రిక్తం విభాతి లావణ్య మివాంగనాసు- అంటాడు కదా ఆనందవర్థనుడు! లావణ్యాన్ని కావ్యగత సౌందర్యంగా  ప్రతిపాదించే మాట ఇది.

 అసలు లావణ్యం అనే శబ్ద స్వరూపమే విచిత్రంగా ఉంటుంది. లవణం- లావణ్యం దగ్గర దగ్గర సంబంధం కలవిగా అనిపిస్తాయి కదా! నిజానికి కూడా ఆ రెండింటి మధ్యనా సంబంధం లేకపోలేదు.  స్ఫటికం ఆకారంలో ఉంటుంది లవణం. ఆ ఆకృతిలోనే అంతర్లీనంగా కాంతులీనే లక్షణం కద్దు.  కాంతులీనే ముత్యం స్ఫటికాకారంలో కనిపిస్తుంది. కాబట్టే దానికి ఆ మెరుపులీనే విశిష్ట లక్షణం. అయితే ఆ ఆకర్షణ ఎక్కడి నుంచీ? అంటే సమాధానం కష్టమే! . పాలరాయికి ఉండే షీన్ కూడా  ఇలాంటిదే.

అంతు చిక్కని అంశాన్ని ఓవెన్ దార్ 'ఫీల్డ్' కవితలో 'ప్రికేరియస్  ఎలిమెంట్ ఇన్ పొయిట్రీ' గా సరిపెట్టుకున్నాడు. గ్రీకు భావాల బట్టి చూస్తే కళోస్ లక్షణాలు ఐక్యత, అవయవాల అబురూప్యత(రూప నిష్పత్తి) లో ఉంటుంది. లావొకూన్ రూపం, బీతోవెన్ నవమస్వర సమ్మేళనం, యూక్లిడ్ రేఖా గణితం, గ్రీకు త్రాసదరూపకాలూ సౌందర్యవంతంగా కనిపించడానికి ఈ రూప నిష్పత్తులే సమన్వయమే మూలమని గ్రీకుల భావిస్తారు.

విడి విడిగా అందంగా ఉండే వస్తువులన్నింటినీ ఒక చోట కుప్ప పోస్తే అందంగా ఉంటుందా? అంటే.. ఏమో ఉంటుందని.. ఉండదని ఏదీ చెప్పలేం.  

తలిసెట్టి వారి ప్రబంధనాయిక కార్టూనులాగా కనిపిస్తుంది. కారణం ఎవరు చెప్పగలం?  అళినీ లలాక, కమలాక్షి, చంద్రానన, పల్లవపాణి, బిసబాహు, చక్రస్తని, సింహమధ్య, పులిన జఘన, రంభోరు- లంటూ ప్రబంధకవులు పదబంధాలతో కుస్తీలు పట్టడానికి ముందే తిక్కన వస్తువులను కాకుండా వస్తువుల సౌందర్య సారాన్ని  మాత్రమే విడదీసి  నెత్తమ్మి రేకుల మెత్తదనం(పాదం), చక్రవాకాల  చందం(స్తనాలు), చందురు నునుకాంతి(ముఖం), అళికులంబుల కుప్ప(జడ)లతో  ద్రౌపదీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అందుకే అనేది.. సౌందర్యానికి సార్వత్రిక సూత్రం సాధ్యం కాని పని.. అని. ఏ కళా ఖండానికి ఉండే విశిష్టత ఆ కళాఖండ సౌందర్య పటిమను బట్టి  ఉంటుందనేది సారాంశం.

సౌందర్యం వస్తువును బట్టి ఉంటుందా? వస్తువులోని అనిర్వచనీయమైన లక్షణాన్ని బట్టి ఉంటుందా? అని ఎవరైనా ఓ సందేహం లేవదీస్తే?

 పర్షియా రాజు  'లైలా ఏమంత అందంగా ఉంటుందని ఈ పిచ్చి పోకడలు?' అని ఎద్దేవా  చేస్తే 'రాజా! నా కళ్ళతో చూస్తేగాని నా బాధ నీకు అర్థం కాదు' అని మజ్నూ బదుకిస్తాదు. 'తా వలచింది రంభలాంటి సామెతలు సౌందర్య ఆత్మాశ్రయ తత్వాన్ని తెలియ చేస్తూ పుట్టుకొచ్చినవే!  

చూసే కళ్లను బట్టి సౌందర్యం మారుతుంటుంది. సమయ సందర్భాలను అనుసరించి కూడా! ముళ్లమధ్యలో ఉన్నా రోజాపూవు  అందంగానే ఉంటుంది. ఎడారిలో కాసినా వెన్నెల వెన్నెలేసౌందర్యం చర్మదఘ్నం అన్నారు.చప్పట్లు కొట్టేందుకు రెండు చేతులూ చాలవు. ఆకర్షణ ఐనా వికర్షణ ఐనా రెండు ధృవాల మధ్య కలిగే స్పందన. ఒక వస్తువు , ఒక వ్యక్తి సౌందర్య భావనకు ఆ విధంగానే తప్పని సరి.

 

సౌందర్యం వస్తువులో ప్రతిష్టించిన పదార్థమా? మనిషి దానికి ఇచ్చే విలువ పైనా ఆధారితమా? అని మళ్లీ మరో  సందేహం రావచ్చు. అరటి పండులోని తీపిదనం వస్తు నిష్ఠం. 'మధురాధిపతే రఖిలం మధురం'   విలువను ప్రతిపాదించే సూక్తివజ్రం,, బొగ్గు- ఒకే తరగతివి అయినా వజ్రానికి బ్రిటిషు రాణి తలపై స్థానం లభించింది. ఇక్కడ బొగ్గు కన్నా వజ్రానికి మనిషి ఎక్కువ విలువ ఇవ్వబట్టే కదాఏ కారణం చేత అట్లాంటి విలువ ఇవ్వడం.. అన్న ప్రశ్న వచ్చినప్పుడు అరుదైన లభ్యత వల్ల అని కొంత మంది జవాబు చెబుతారు. సబబే అనిపించినా .. అన్ని సందర్బాలకూ  అదీ వర్తించదు. మహాత్మా గాంధీ వాడి వదిలేసి పోయిన బొడ్డు గడియారాన్ని, విరిగిన చేతికర్రను వేలానికి పెడితే విరగబడి ఎక్కువ ధరకు కొనుక్కున్న సందర్భాలు మనం చూస్తున్నాం. బాలాపూర్ వినాయకుడి లడ్డూ ప్రతీ ఏటా లక్షల ఖరీదు పెట్టి కొనుక్కునే హిందూ విశ్వాసులు కద్దు. అదే లడ్డును ముస్లిములు ఇరవై రూపాయలకు తీసుకోమన్నా తీసుకోరు కదా? 'మహాత్మ' అనే చిత్రంలో ఒక సేఠు తులసీ రామాయణాన్నిరద్దీవాలాకు రెండు కాసులకిస్తే.. ఆ  పేపరువాలా దాన్ని మిఠాయి కొట్టుకు వేయకుండా కళ్ళకద్దుకుని దేవుడి మందసంలో ఉంచుతాడు. ఒకడు పక్కా వ్యాపారి ఐతే..ఇంకొకడు భావుకత్వం ఉన్న వ్యాపారి. వస్తువుల సౌందర్యం - విలువలు కూడా సాపేక్ష లక్షణాలు కలవని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

అయితే సౌందర్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని , అనుభవించాలని, హక్కుదారులుగా ఉండాలని ఎందుకు కోరుకోవడం? సౌందర్యం అభిలషణీయమైన వస్తువుగా గుర్తింపబడటానికి మనిషి ప్రోద్బలించే లక్షణాలు ఏవి? అన్నది కూడా ఆసక్తి కలిగించే చర్చనీయాంశమే!

తిలక్ 'నా కవిత్వంలో' తన అక్షరాలను 'కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, ప్రజా శక్తుల ప్రవహించే విజయ ఐరావతాలు, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'తో ఎందుకు పోల్చుకున్నాడో కనిపెడితే సమాధానం దొరుకుతుంది.  'చీకటిలో అలమటించే వికారపు పిల్లలను ఎవరు తలుచుకుంటారు?' అని శిబితో గద్ద మొర పెట్టుకుంటుంది. అందం, ఆనందం మాత్రమే ఎందుకు కావాలి మనుషులకు? అన్నమయ కోశంతో ఆరంభమైన  ఉపనిషత్తులూ ఆనందమయ కోశం దగ్గరికొచ్చిన తరువాత ఆగిపోతున్నాయి.ఆ తరువాత ఏముంది? అని అడిగితే

'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్' అని సమాధానాలు  దాటేస్తున్నాయి. కీట్సు 'అందమైన వస్తువు సదా ఆనందదాయకం' అన లేదూ?

కావ్యం నుంచి వచ్చే ఆనందాన్నే మమ్మటుడు 'సద్యః పర నిర్ వృతయః' అన్నాడు. 'కావ్యం హ్లాదైక మయీం'. కళల్లోని ఈ ఆనందవాదం విశ్వతోభిముఖంగా వ్యాపించి ఉంది. మనిషి పుట్టుక ముందు నుంచే ప్రకృతి తన చలనానికి ఈ సౌందర్యాన్ని, ఆకర్షణ వికర్షణల్ను ఉపకరణాలుగా వాడుకుంటూనే ఉంది. పరభృతాల ఆకర్షణకై పూవులకు ప్రకృతి ఆకర్షణీయమైన రంగులు ఎందుకు అద్దుతుందో అర్థం చేసుకొంటే సృష్టి చాలనంలో సౌందర్యం పాత్ర ఎంతో బోధపడుతుంది.

రసపాక సిద్ధాంతాలు వంట యింటి నుంచి పుట్టుకొచ్చాయి. భోగలాలసత నుండి రామణీయకత,  శయ్యా వాదాలు వెలికి వచ్చాయి. అలంకారవాదం దేహాభిమానం వల్ల వచ్చింది. వక్రోక్తి, ధ్వని వాదాలకుమూలం పగటి వేషగాళ్ల ప్రలాపాలు. ఒక్క ఔచిత్య విచారం మాత్రం ఆనందాన్ని ప్రతిపాదించటం లేదు. పైపెచ్చు సంతోషాన్ని సంహరించే  గుణం దానికి ఉంది. జనం తమాషా కథలు చెప్పుకుని నవ్వుకుంటుంటే 'నాకు నచ్చలేదు' అని గుడ్లురిమి నోరుమూయించే విక్టోరియా మహారాణి పెడసరి వైఖరి ఇలాంటిదే.

'పిబరే రామ రసం' అంటే ఏమిటి? సౌందర్య రస పిపాసువులు అంటే ఏమిటి? అందాన్ని అనుభవిస్తే ఆనందం ఎందుకు కలుగుతుంది? ధర్మరాజుకి కర్ణుడు అన్న అని తెలిసిన తరువాత మాత్రమే ఆ ఏడుపులు ఎందుకు? పాట్రొకస్ మరణ వార్త విన్న అక్లీజు ఆవేదన సంగతో? తానాజీ శవాన్ని చూసి శివాజీ అంగలార్పడం ఎ బంధాన్ని సూచిస్తుంది? అ దుఃఖాలు  ఆనంద దాయకాలు ఎలా అయ్యాయి?! భవభూతి ఉత్తర రామ చరితంలో మాత్రం? సీతాపహరణం, జటాయు వధ వంటి దృశ్యాలను చూసి సీత అలా మూర్చ పోవడం ఆనందదాయకాలు ఎలా అవుతాయి? దానికీ ఒక త్రాపద సిద్ధాంతం లేవదీసాడు అరిస్టాటిల్. భయానక, కరుణ  దృశ్యాలు బాగా భయపెట్టి, ఏడిపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి కాబట్టి వత్తిడి నరాలకు ఉపశమనం కలిగి మనసులు కడిగి ఆరబోసినట్లు తేలిక పడి ఆ నిర్మలత్వం ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన సిద్దాంతం. తమాషాగా ఉంది కదూ!

పాశ్చాత్యుల్లో జార్జి సంతాయనా, వాల్టరుపాటర్ ఆనందవాదులుగా ప్రసిద్ధులు. ఆనందమనేది స్వార్థ రహితంగా, బహుజన సేవ్యంగా ఉండాలని వీళ్ల వాదం. కళాభిమానం కళ కోసమే అయి ఉండాలన్నఆ వాదనను తప్పు దారి పట్టించి 'కళ కళ కోసమే' అని ఆయన అన్నాడన్నట్లు  వక్ర భాష్యాలు వ్యాపించడమే సౌందర్యాత్మక కళారంగానికి కలిగిస్తున్న పెద్ద నష్టం. 

-కర్లపాలెం హనుమంతరావు

Wednesday, October 15, 2014

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...