Tuesday, November 14, 2017

తల్లిభాషకే తొలి తాంబూలం- ఆంధ్రప్రభ సంపాదకీయ పుట వ్యాసం




"తెనుగు బాసను జుంటి తేనియని పొగడి
పొరుగింటి పులుసుపై మరులు పెంచిన వాడు
దేశభాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలను బదులు లిల్లీలు వలచినవాడు తెలుగువాడు"
-డాక్టర్ సి. నారాయన రెడ్ది
వెయ్యేళ్లు పైబడిన చరిత్ర తెలుగు భాషది-అంటూ న్యాయస్థానాలముందు పోరాడి పాక్షికంగా గెలిచిన వాళ్లం. మంచిదే. కానీ.. పరుగులెత్తే కాలంతో సమానంగా మన తెలుగును పరుగులెత్తించడంలో మాత్రం బొత్తిగా  వెనకబడుతున్నాం!
'ఆంధ్ర కవితకు పితామహుడ'ని మనం భుజాలకెత్తుకుని మోసేన నన్నపార్యుడు తెలుగు భాషకు కావ్యగౌరవం కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన 'మహా భారతం' ప్రారంభ ప్రార్థనా పద్యం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది! అచ్చు తెనుగు అక్షరాలని ఆంధ్ర భాగవతమనే వెన్నెల్లో పిండారబోసిన తెలుగు కవి పోతన్నను మాత్రం  ఏ స్థాయిలో ఉంచాలో  తెలియక ఈ నాటికీ కుస్తీలు పడుతున్నాం!  ఆదికవి ఎవరన్నలాంటి సాహిత్య వివాదాలు అలా పక్కన  పెట్టేయండి. ఏ తెలుగు పలుకు ప్రామణికమో.. ఏ తెనుగు  పదం అప్రామాణికమో..  తేల్చుకోలేనంత అయోమయంలో ఉన్న మనం ఏ ప్రాంత జనం నోట పలికే మాటకు సాధికారత కల్పించాలో అంతుపట్టనంత దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ  నేపథ్యంలోనే కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించింది. అస్తిత్వం, ఆత్మగౌరవం నినాదాలతో పోరాడి గెల్చుకున్న తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేత శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు  అధికార పగ్గాలు చేత పట్టారు.  తెలంగాణాలో ఈ ఏడాది చివర డిసెంబరులో జరగబోయె తొలి తెలుగు ప్రపంచ మహాసభకు ఇదీ నేపథ్యం. మరి ప్రపంచ తెలుగు మహాసభల పూర్వరంగం  ఎలా ఉంది? ఒకసారి అవలోకించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలుః
మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు నేటికి 42 ఏళ్ల కిందట 1975, ఏప్రియల్ నెలలో వారం రోజుల పాటు(12నుండి 18వ తారీఖు వరకు) మహావైభవంగా జరిగాయి. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం వేదిక. అప్పటి అంచనాల ప్రకారం రోజుకు సుమారు లక్షమంది హాజరయారు. మహాసభ నగరానికి 'కాకతీయ నగరం', 16దేశాల నుండి 92మంది పరిశీలకులు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి 900 చిల్లర ప్రతినిధులు, తెలుగు రాష్ట్రం నుంచి 4500 వరకు భాషాభిమానులు ఈ పాలుపంచుకొని మహా సభల ప్రపంచ స్థాయిని అక్షరాలా నిలబెట్టారు.  సదస్సుల వేదికకు 'నాగార్జున పీఠం', ప్రాచీన వైభవాన్ని, సంస్కృతులను తెలియ చేసే ప్రదర్శనశాలకు 'శాతవాహన నగరం', తెల్లవార్లూ సాంస్కృతిక ప్రదర్శనలు సాగిన ప్రాంగణానికి 'శ్రీ కృష్ణదేవరాయ నగరం' లాంటి నామకరణాలు జరిగడం బట్టి తెలుగు నేల మీది వివిధ  ప్ర్రాంతాల మధ్య ఎంతో శ్రద్ధగా సమతౌల్యం పాటించినట్లు చెప్పకనే చెప్పినట్లు అవగతమవుతుంది. (ఈ మహా సభలకు ఆరేళ్ల ముందే ఆంధ్ర ప్రాంతంలో 'ప్రత్యెకాంధ్ర' ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన నేపథ్యం గమనార్హం) ఉదయం 9గంటల మొదలు సాయంత్రం 6గంటల వరకు.. మధ్యలో ఒక గంటపాటు భోజన విరామం మినహాయించి 5 రోజులూ రోజుకు 8 గంటల చొప్పున 40 గంటల పాటు సుమారు అరవై అంశాలమీద గోష్ఠులు సాగినట్లు రికార్డులు చెపుతున్నాయి. భాష, సాహిత్యం, చరిత్ర, వైజ్ఞానిక, సాంకేతిక అంశాలమీద సుమారు 1500 మంది మేథావులు తమ తమ ఆలోచనలను కలబోసుకున్నారీ సభల సందర్భంగా!
ఏడాది కిందట ఉగాదికి జరిగిన రాష్ట్ర స్థాయి సభల్లోని తీర్మానం ఈ ప్రపంచ స్థాయి సభలకు నాందీ కాగా.. మరో ఆరేళ్ల అనంతరం మలేసియా కౌలాలంపూరులో జరిగిన మరో తెలుగు ప్రపంచ మహా సభలకు ఈ సభలే ప్రేరణగా నిలిచాయి.
రెండవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో ఆరు సంవత్సరాల అనంతరం 1981, ఏప్రియల్ 14- 18 వరకు.. ఐదు రోజుల పాటు మలేసియా కౌలాలంపూరులో అట్టహాసంగా జరుపుకొన్నారు ప్రపంచ తెలుగు మహా సభలు.  సభాధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు. సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా సభలకు అప్పటి మలేసియా ప్రధాని డాక్టర్ మహీతీర్ బిన్ మహమ్మదీ ముఖ్య అతిధిగా విచ్చేసారు. సభలనుద్దేశించి నాటి భారత దేశాధ్యక్షులు శ్రీ నీలం సంజీవ రెడ్డి సందేశం వినిపించారు.
మూడవ తెలుగు ప్రపంచ మహా సభలుః
మరో నాలుగేళ్ల తదనంతరం 1990, డిసెంబరు 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు మారిషస్ దేశంలో ప్రపంచ స్థాయి తెలుగు మహా సభలు జరుపుకొన్నారు తెలుగువారు. మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని సర్ అనిరుధ్ జగన్నాధ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ తెలుగు మహా సభలలో. ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. నారాయణ రెడ్ది ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు విద్యావేత్తలు, కవులు, కళాకారులు, చలన చిత్ర నటులు, అధికారులు బృందాలు బృందాలుగా ఆ మహా సభలకు హాజరయ్యారు.
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలుః
నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభలు సుమారు 25 కోట్ల ఖర్చుతోనాటి ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2013 డిసెంబర్ నెలలో మూడు రోజుల (27, 28, 29) పాటు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిధ్యాలయం ప్రాంగణంలో ఆర్భాటంగా జరిగాయి. 37 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు నేల మీద జరిగిన తెలుగు మహాసభలు ఇవి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని లోపాలకు ఆస్కారం రానివ్వకుండా తెలుగు  భాషకు సంబంధించిన ముఖ్యులందరి నుంచి ముందస్తుగా తీసుకున్న సూచనలను స్వీకరించి అందుకు అనుగుణంగా,  సాధ్యమైనంత వివాద రహితంగా నిర్వహించిన చక్కని తెలుగు మహాసభలు ఇవి.
అదే ఏడాది ఐరాస్ సాంస్కృతిక శాఖ 'ప్రపంచ మాతృభాషాదినోత్సవ'  సందర్భంగా ఇచ్చిన థీమ్ 'సమగ్ర ఆధునిక విద్యా సమేతంగా మాతృభాషలో విద్యాబోధన'. మాతృభాష, దాని వినియోగం, విస్తృతి, ప్రయోజనాల పరంగా పూర్వ భావజాలానికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలు సమాజంలోని అన్ని రంగాలు, వర్గాల్లో ప్రబలమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ మహా సభల ముందు ఉన్న బాధ్యత బృహత్తరమైనది. ఈ నేపథ్యంలో చర్చోప చర్చలు, గోష్టులు తీవ్రంగానే సాగినా.. తెలుగును అధికార భాషగా అమలు చేసే విషయంలో అవకాశాలను సాధ్యమైనంత మేరా ఉపయోగించుకోవాల'న్న సాధారణ తీర్మానం చేసి సరిపెట్టడంతో ఈ సభల లక్ష్యం అరకొరగానే  ముగిసినట్లయింది.
2014 నాటికి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలి పోవడంతో నాలుగవ తెలుగు ప్రపంచ మహా సభల ఆ  తీర్మానం అమలుకూ కాలం చెల్లిపోయినట్లయింది.
తెలంగాణా తొలి తెలుగు మహా సభలుః  
తెలంగాణా ఏర్పాటయిన మూడేళ్ల తరువాత జరుగుతున్న ప్రపంచ స్థాయి మహా సభలు ఇవి.  తెలంగాణా సంస్కృతి, భాష, అస్తిత్వం, ఆత్మగౌరవం వంటి ఉద్వేగభరిత అంశాలతో ఉద్యమ మార్గంలో పోరాడి రాబట్టుకొన్న  రాష్ట్రం..  మొదటి   తెలుగు మహా సభల్లో  ఆస్థాయిలోనే ప్రపంచానికి తన ప్రాభవాన్ని చాటి చెప్పాలని ఆరాట పడటంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.
ముఖ్యమంత్రే  స్వయంగా ప్రకటించినట్లు దాదాపు 50 కోట్లు ఈ మహాసభల నిర్వహణకుగాను వెచ్చించబోతున్నారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు జరిగబోయే ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల నుంచి 500 మందిని, వివిధ రాష్ట్రాల నుంచి 1000 మందిని, రాష్ట్రంలో ఉన్న సాహితీ, భాషావేత్తలను మరి కొంతమందిని  మహాసభలకు ఆహ్వానించాలని సంకల్పం. ఈ మహా క్రతువులో భాషాభిమానులందరిని భాగస్వామ్యులను చేయాలని.     ఏడు వేదికల ద్వారా తెలంగాణా బహుముఖ పార్వాలని మహోజ్వలంగా  ప్రపంచానికి  ప్రదర్శించి చూపాలని  తెలంగాణా  ఉవ్విళ్లూరడం ..బాగుంది. కానీ
సభల నిర్వహణ మీద జరుగుతున్నంత హాడావుడి సభలో తీసుకోవాల్సిన తీర్మానాల మీద
జరుగుతున్నదా?
ప్రపంచీకర దురాక్రమణ మూలకంగా స్థానిక భాషల ఉనికికి ముప్పు ముంచు కొచ్చేస్తోంది.  అవిఛ్చన్నంగా సాగుతున్న సామాజిక, సాంకేతిక, ఆర్థిక, సాంస్కృతిక  పరమైన  అభివృద్ధుల్లో  భాషదీ కీలకమైన స్థానం. ప్రజలు తమ  జీవితాలలో కోరుకొనే మెరుగుదలలకి కూడా అదే భాష అనివార్యంగా ఉంటుంది, 
కానీ వాస్తవంలో జరుగున్నదేమిటి? పడమటి గాలి ధాటికి  తతిమ్మా జాతుల మాదిరే తెలుగువారి   జీవిత మౌలిక విలువలూ కొట్టుకు పోతున్నవి. తెలుగుదనం పరిమళాలు   మరింత వాడిపోకుండా  పాలకులుగా ప్రభుత్వం చేపట్టవలసిన సత్వర దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి.  అవి ఏమిటో.. ఏ దిశగా ఆ సంక్షేమ చర్యలు సాగవలసి ఉన్నదో క్షేత్ర స్థాయి నుంచే ప్రజావాహిని నుంచి  నేరుగా సేకరించుకొనే చక్కని అవకాశం ఈ మహా సభలు కల్పిస్తున్నాయి.
ప్రపంచీకరణ వల్ల, అంతర్జాతీయ సంబంధాల వల్ల, పరాయి దేశాల కొలువల మీద అవసరానికి మించి పెరిగే  కాంక్షల వల్ల, బతుకు తెరువుకు అతకని  ఆధునికత మీద గుడ్డి అకర్షణ వల్ల మిగతా మానవీయ విలువలతో పాటు మాతృభాషకూ  చాపకింద నీరులా చేటు కలుగుతున్న నేపథ్యంలో మునపటి మహా సభలకన్నా ఇప్పుడు జరుపుకోబోతున్న తెలుగు మహా సభల ప్రాముఖ్యం మరంత పెరిగింది.
పాఠశాల, కార్యాలయం, న్యాయస్థానం, వ్యాపార స్థలం, వినోదాల వేదిక.. అన్నింటా తెలుగు వాడి మౌలిక భాషను తోసిరాజని భ్రష్ట ఆంగ్లం  దురాక్రమిస్తున్నది.
ఆ సంకర ఆంగ్ల భాష స్థానంలో మనదైన సజీవ భాషకు వాస్తవంగా ఎంత వరకు స్థానం కల్పించే అవకాశం ఉంది? భావోద్వేగాలతో భాషా దురభిమానులు చేసే అతి సూచనలను పట్టించుకోవలసిన పని లేదు.. ఆంఫ్ల  భాషను కాదనుకుంటే అభివృద్ధిని చేజేతులా జార విడుచుకొన్నట్లే? అనే ఆధునికుల వాదనలు పూర్తిగా కొట్టి పారేయ దగినవి కాదు. కానీ..  స్వాతంత్ర్యం సాధించుకొని ఏడు దశాబ్దాలు దాటినా సామాన్యుడు తనకు పుట్టుకతో  సహజ సిద్ధంగా అబ్బిన పలుకుబడితో నిత్య జీవితావసరాలను నిశ్చింతగా ఎందుకు  గడుపుకోలేక పోతున్నట్లు? పాలన, బోధన, రంగాలలో భాష భ్రష్టు పట్టడానికి మూల కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? ఆ లోపాలను అరికట్టేటందుకు పాలకులుగా ప్రభుత్వం తీసుకొనే సత్వర చర్యలు ఏమిటి?  రాజభాషగా విరాజిల్లినప్పుడే ఏ ప్రజాభాషకైనా సాధికారత సాధ్యమయేది.
ఉద్యోగాలు, ఉపాధి కొరకు మాత్రమే కాదు భావోద్వేగాల ప్రకటనకు, సంబంధ బాంధవ్యాల పటిష్ఠతకు, అస్తిత్వానికి, ఆత్మ సన్మానానికి, ప్రపంచం ముందు తనదైన సొంత ముద్ర ప్రదర్శనకు.. మాతృభాష అవసరమవుతుంది. అమ్మ కన్నా కమ్మనైన పదం లేనట్లే అమ్మభాష కన్నా మధుర పథం ఉండబోదు. తెలుగు వారి బుర్ర కథను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఒక ఫ్రెంచి బృందానికి తెలుగు గడ్డమీద  తెలుగు నేర్పే ఉపాధ్యాయులు దొరకడం  కష్టమయిందని వాపోయింది ఈ మధ్య. తెలుగు వారికి విదేశీ భాషలు నేర్పందుకు సీఫెల్ వంటి సంస్థలు ఉన్న నేల మీద విదేశీయులకు తెలుగు భాష నేర్పే సంస్థలు కానరావు?! హైదరాబాద్ లో అమెరికన్ రాయబార కార్యాలయం ఆరంభించేందుకు ముందు  ఇక్కడ పనిచేసే అమెరికన్ అధికారులకి ప్రాంతీయ భాషతో పరిచయం అవసరమయింది. అందుకుగాను రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఎనిమిది నెలలు పటుదలతో  మన తెలుగు మీద ఆ అధికారులు పట్టు సాధించారు. మరి తెలుగు ప్రజలతో మమేకమై పాలనా వ్యవహారాలు చక్కబెట్టే ఐ ఏ ఎస్.. ఐ పి ఎస్ కేడర్ పల్లెపట్టులకు వెళ్లినప్పుడు తెలుగు పలుకు పలికేందుకు చిన్నబుచ్చుకుంటున్నారు! విదేశీ ఉద్యోగాలను ఆశించే 25 శాతం విద్యార్థులకోసం మిగతా 75 శాతం  విద్యార్థులను పుట్టినప్పటి నుంచే కాన్వెంట్ల చదువుల మిషతో  గొడ్లచావిళ్లవంటి గదుల్లో బంధింధి హింసించే అమానుషత్వం ఒక్క తెలుగు గడ్డల మీదే చూస్తున్నాం. అరకొర నైపుణ్యాలతో ఆంగ్లం నేర్చుకుంటూ మాతృభాష అబ్బవలసిన విలువైన బాల్యదశను వృథాగా చెయ్యి జార్చుకుంటున్న తెలుగు పిల్లలను చూస్తే వాస్తవానికి జాలి కలగవలసి ఉంది. మబ్బులని చూసి ముంతలోని నీళ్లను పారబోసుకొనే కన్నవారి అమాయకత్వాన్ని కార్పొరేట్ చదువుల పేర  నిలువునా దోచుకునే కుహనా విద్యాషాఢబూతుల ఆట కట్టించ వలసిన బాధ్యత ప్రబుత్వాల మీదే కదా ఉన్నది? అన్యాయానికి గురై న్యాయస్థానానికి వెళితే అక్కడా సామాన్యుడు బోనులో బొమ్మలా నిలబడి తన తరుఫున సాగే వాద ప్రరివాదాలను  గుడ్లప్పగించి చూస్తూ వినడం కన్నా అన్యాయముంటుందా ఎక్కడైనా?
అందుకే ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావుగారు తెలంగాణాలో జరగబోతున్న తొలి తెలుగు మహా సభల లక్ష్యం పాలనలో, బోధనలో, సామాజిక జీవనంలో తల్లి భాషకే ప్రథమ తాంబూలం అని తడబాటులేమీ చూపించకుండా ప్రకటించడం భాషాభిమానులు.. పురోగమనవాదులంతా రెండు చేతులా మనసారా ఆహ్వానించ దగిన గొప్ప పరిణామం.
-కర్లపాలెం హనుమంతరావు
6142283676
(15-11-2017 నాటి ఆంధ్రప్రభ దినపత్రిక- సంపాదకీయ పుటలో ప్రచురితం) 



Friday, November 10, 2017

భార్యామణికే ప్రశంస- సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్



ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ..!
'హల్లో..ఇంటి జ్యోతిగారూ! ఇవాళేంటీ ఈ రాగాల ట్యూనూ..  హుషారుగా ఈ టోనూ?!'
ఇంటాడాళ్లం..  ఇహ ఏ ట్యూనైనా ఫ్రీగా పాడేసుకోవచ్చు! ‘చ్చోయ్! చ్చోయ్!’ అంటూ మీ మగాళ్లింక  ముళ్ల కర్రలతో తోలాలని చూస్తే మాత్రం.. తోల్తీసి డోలు చేసి ఎంత సేపైనా ఇంచక్కా నచ్చిన ట్యూన్లు వాయించు కోవచ్చు! అలాగని మా ఆడోళ్లందరికీ లైసెన్సు లిచ్చేసింది సార్ మహారాజ రాజశ్రీ  మేవాడ్ జిల్లా మెజిస్ట్రేటువారి శ్రీ కోర్టు!'
'అదెప్పుడు? కట్టుకున్నోణ్ని .. నాతోనే పరాచికాలు? ఆయ్ఁ !'
'అక్కడ రాజస్థాన్ రాష్ట్ర అమ్మడెవత్తో..  పన్లోకి పోకుండా పద్దాకా గంజాయ మఠంలో  పొర్లాడే మొగుణ్ని ఇంటి గుంజక్కట్టేసి మరీ కుంటి కట్టెకు పని చెప్పిందంట స్వామీ మూడ్రోజులపాటు ఒక్క మినిటైనా రెస్టివవకుండా! పెళ్లాల పోట్లు పళ్లేని మీ లాంటి మొగుళ్లంతా వెనకుండి వేయించిన దావాలో..  ఇవాళే తీర్పొచ్చింది.   ఇంటావిడైతే చాలు.. ఇంట్లోని ఎవళ్లనైనా సరే ఎప్పుడైనా అంట్లగంటె టు అప్పడాల కర్రతో  సహా ఏ వెపన్తోనైనా సరే వీపు విమానం మోత మోగించేయచ్చంట!  ఐపిసి సెక్షన్లతో సహా  కోట్ చేసి మరీ మా గొప్ప తీర్పిచ్చేసిందంట.. శ్రీ కోర్టు ధర్మాసనం!'  
'అన్యాయం! అప్పీలు కెళతాం మగాళ్లమంతా మళ్లా.. మళ్లా! పెళ్లాల గయ్యాళితనాలకి ఝడిసి  దడ కొద్దీ ఇచ్చేసిన తీర్పులు  ధర్మబద్ధమెట్లా అవుతుందో.. అదీ చూద్దాం!'
'ఓర్పు.. ఓర్పు! ఆ బండ బూతులే వద్దు! భర్తలంటే   'డార్లింగూ!.. ఓ మై డార్లింగూ.. ' అంటూ రొమాంటిక్కు టైపు ట్యూన్లేవఁన్నా పాడుకొంటేనే ముద్దు!’ ‘బంగారి.. మామ’ పాటలెప్పుడూ వినుండ లేదా బంగారం?’
'హలో! ఈ బంగారి?.. మామ?,.  ఎవర్తల్లో మధ్యలో మళ్లీ నా ప్రాణానికీ?’
'బంగాళ వేపుళ్ళు తప్ప  బంగారాలూ.. శృంగారాలూ.. ఎలా  తెలుస్తాయిలే  తిక్క స్వాములకీ! చీఁ! బంగారంలాంటి మూడు  మూడు ముక్కలయింది! మేవాడ్ కోర్టు  తీర్పు అమలు చేయాలిక .. తప్పదు’
‘ఈదీ అమీను.. సద్దాం హుసేనూ.. హిట్లరూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇంట్లో పెళ్లాల కన్నా డిక్టేర్లట్రా?' అనక్కడికీ  చెవినిల్లు కట్టుకొని  పోరాడు మా నక్కా వెంకట్రావు! వింటేనా? పాడు శని!’
‘ఖబడ్దార్ సర్దార్! మా వైఫులంతా శివకాశీ బ్రాండులయితే.. మీ మొగుళ్లకంతా.. ఇహ కాశీ.. రామేశ్వరాలే చివరకు గతి! పెళ్లాలు టీవీ సెట్లు. మొగుళ్ళు ఓన్లీ   రిమోట్లు. అలాగుందాలి ఇళ్ళు. కుదరదంటే ప్రతి ఇల్లూ ఓ రామగుండమే’  
‘ఇదిగో.. ఇందుకే.. మాకు మఠాలు, సత్రాల మెట్లు  తటాలుమని  గుర్తుకొచ్చేది! పక్క దేశం స్వర్గాని కన్నా మిన్నని  ఎటూ ఓ టాకుంది. కోర్టు తీర్పుల మీద మరీ అంత  భరోసా వద్దు. రొహింగ్యాల మాదిరి మా మొగుళ్లూ   సరిహద్దులు దాటే దుస్థితి కద్దు! బహుభార్యాత్వం మగాడి జీవితాన్ని మరింత పొడిగిస్తుందని ఊరిస్తున్నారు బ్రిటన్ షివెల్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. తస్మాత్ జాగ్రత్త తరుణీ మణులూ!’
'తమాషానా! మరి 'నాతి చరామి' మాట సంగతేమిటి మామా? మగడు కట్టిన పసుపు తాడు  కళ్లకద్దుకుంటూతిరగితే చాలా? కుష్టు మొగుళ్లను.. భ్రష్టు మొగాళ్లని.. తట్టల్లో.. బుట్టల్లో.. రెడ్లైట్ ఏరియాల చుట్టూ తిప్పుకు రావాలా? ఆ పిచ్చి   రోజులు ముగిసి పోయాయ్!  లొట్టలొద్దు! ఈ కాలం ఇల్లాళ్లు! మరీ.. అంత మంచి గయ్యాళులమేం  కాదు! 'నా కొంప అనే   సామ్రాజ్యానికి నవ్వొక్కదానివే పట్టమహిషవ'ని అగ్నిసాక్షిగా పెళ్ళినాడిచ్చిన మాట సంగతేవిఁటిట! మీరు మెహర్బానీకే అన్నా.. ఆడాళ్లం.. పిచ్చి మొహాలం! అందుకే మీరెంత మొద్దురాచిప్పలైనా .. మాడు మీదెక్కించుకొని ఇష్టంగా  తొక్కించుకొంటున్నాం! రోజులు మారి పోయాయి మారాజా!పూర్వం మాదిరి.. పెళ్లికి ముందూ కళ్లు మూసుకొని.. పెళ్లయిన తరువాతా.. నోర్మూసుకోమంటే..నో.. వేఁ..! గృహహింస చట్టం సెక్షన్లు యాక్షన్లోకొచ్చేస్తాయ్ మిష్టర్ హబ్బీ!'
'వామ్మో! మరి.. తాను అమ్ముడు పోయి అయినా సరే దీనుడైన నాధుడి యావ తీర్చాలన్నది    సుమతీ శతకం. దాని గతి?'
'మతిలేని శతకాలు.. శృతిలేని సూక్తులు!  తలలాడించే పిచ్చితల్లులెవరూ లేరిప్పుడిక్కడ మిష్టర్ మేల్ చవనిస్ట్! ఈ కాలం ఈ- కాలం. మొగుళ్ల మెళ్లకు డోళ్లం. నో ప్రోబ్లం! మోతైనా సరే .. తిరగమోతైనా సరే.. మా  శ్రీమతుల చేతుల మీదుగానే కాపురం సాగి తీరాలి. శ్రీవార్ల ఆస్తిపస్తులు..  జీతభత్యాలు.. పింఛన్లు..  భరణాలు.. ఆభరణాలు.. అన్నింటి మీదా చట్టబద్ద్జంగా మా శ్రీమతులకే సర్వహక్కులు
'మరేఁ! 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ! .. షాదీ మాటే వద్దు గురూ!' అంటూ కోట శ్రీనివాసర్రావు చెవిలో కోట కట్టుకుని  మరీ పాటేసాడు మనీ సినిమాలో. శని   విననిస్తేనా! అనుభవిస్తున్నాం అమ్మళ్లూ  అందుకే ఈ బాండెడ్ లేబర్లూ! హ్హుఁ'
'ఒయాసిస్సును చూసా.. ఎడారని బెదిరేది వయస్యా? మొగుడు పుల్లిస్తారాకైతే పెళ్లాం అది ఎగరకుండా  మీదుండే బండరాయన్నాడు వెనకటికో కవి.   సావిత్రి పక్కనుండబట్టే సత్యవంతుడికా బోడి ప్రాణాలు తిరిగి  దక్కింది. సీతమ్మతల్లి తోడుండబట్టే రామయ్యతండ్రి వనవాసం హనీమూనును  మించి రక్తి కట్టింది!  పెళ్లాలంతా కళ్లాలే అయితే   వేలాది మందిని వెంటేసుకొని తిరిగిన వేణు గోపాలుడు సంగతేవిఁటి   వెర్రిబాలకా? ముక్కు మూసుక్కూర్చున్న  మునిముచ్చుకే   మేనకమ్మ మేని గాలి తగలంగానే  కళ్లు చెదిరాయి! ఆడపొడంటే గిట్టని   రుష్యశృంగుడు శాంతమ్మ సిస్టర్తో  సంసారమెంత ప్రశాంతంగా గడిపాడో  తెలిసీ..
'షటప్పూ..  నీ అష్టాదశ పురాణాలిక స్టాపూ! షట్కర్మచారిణి.. సహధర్మచారిణి..  అంటారు కదా తాళికట్టిన ఆడదాన్ని! ఖర్మకాకపోతే అందులో  ఏ ఒక్క గుణమైనా..'
'.. నేటి మా మహిళకు లేదంటావు! మనువాడిన ఆడది మగాడికి దాసి.. మంత్రి.. లక్ష్మి.. భూమి.. తల్లి.. రంభా!  ఓ కే.. మ్యాన్! ఒప్పుకున్నాం! ఊడిగాలు చేయడానికి మేం రడీనే! కాకుంటే ఒకటే డీల్!  ముందు మీ మగాళ్ళూ  మినిమమ్  ఓ  రాముడి పాత్రల్లో అయినా బుద్ధిగా జీవించండి బాబులూ! 'వై ఫై' ఓ సెకను లేకపోతేనే కలియుగాంతం వచ్చేసినట్లు  కంగారు పడతారే మగాళ్లు!. ఇంటి కనెక్షన్ కదా 'వైఫ్' అంటే! రోజులో ఒక్క నిమిషమైనా నవ్వుతూ కనిపించే ఛాన్సు ఎందుకివ్వరు మగాళ్లు?’
'వివాహ సంబంధాల్నుంచీ.. విడాకులు.. పిల్లల పెంపకాల వరకు.. చట్టాలన్నీ మీ ఆడాళ్లకే కదా చుట్టాలు తల్లీ! భార్యా బాధితుల గుండెలు బాదుకొంటున్నారు.  ఐ.పి.సి.సెక్షను 498(ఎ) భర్తల స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు పూర్తిగా విరుద్ధమని మొత్తుకొంటున్నారు. వినపట్టం లేదా ‘భా.బా’ల పళ్ల పట పటలు'?
‘ఇల్లొక రొమాంటిక్ జిమ్. శృంగార వ్యాయామశాల. మొగుడూ పెళ్లాలు అందులో ఒహళ్ల కొహళ్లు  'కోచ్' లు. ఒకరి పట్టులు మరొకరికి నేర్పాలి. పట్టువిడుపులుంటేనే సంసారమనే  కుస్తీ  చక్కగా సాగేది. కన్నవాళ్లందర్నీ కాదనుకొని.. కట్టుకొన్నవాడే సర్వస్వమనుకొని.. గడప దాటి   కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది ఆడది. తాళి  కట్టించుకున్న ఒప్పందానికి కట్టుబడి భర్తకు వారసలని కని మరో వంశాన్ని రక్త మాంసాలొడ్చి నిలబెడుతుంది. రోజులో సగం సమయం నిద్రకనే  ఉన్నా.. ఆ నిద్ర మగతలో సైతం  మొగుడో..  పిల్లలో అంటూ  కలవరించే   పిచ్చిది ఆడది. గీజరు ఓ రెండు నిమిషాలపాటు ఎక్కువగా వాడుకుందని గొడ్డులా బాది చంపేసిన మొగుళ్లు  మొనగాళ్లుగా బోర విరుచుకొని మరీ ఆంబోతుల్లా బైట తిరుగుతున్న కాలమండీ ఇది ! మేవాడ్ మెజిస్ట్రేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీదా మళ్లీ మళ్లీ అప్పీలుకు వెళదామనే..’
'హలో! సత్యభామాజీ! ఇహ దించేస్తే మంచిది తవఁరు కత్తి! ఈ ప్రేమ భక్తుడు లొంగిపోతున్నాడు!  అందుకుంటారా  ఇహనైనా ఈ పూల గుత్తి!
***
-కర్లపాలెం హనుమంతరావు
8142283676
(సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్- 11, నవంబర్, 2017)
 ***

Friday, November 3, 2017

‘నో’బెల్స్- ఆంధ్రప్రభలో సరదా వ్యాసం



'నోబెలు.. నోబెలు అంటా తెగ వాగుతున్నారీ  మధ్య దొరబాబులంతా!  ఆ బెల్లేంటన్నా?’
 'ఆ వివరాలన్నీ  ఏకరువు పెట్టాలంటే ఓ లోటాడు టీనో, ఓవల్టీనో తాగి రావాలి!  మూడే ముక్కల్లో ముక్కాలంటే.. ఇంత దాకా  ఎవరికీ తట్టని కొత్త వింతో.. విశేషమో  బైటపెట్టిన బుద్ధిమంతుణ్ని వెతికి పట్టుకొని  'చబాష్!' అంటూ జబ్బ మీదో చరుపు చరిచి మెళ్లో ఓ బిళ్లేయుడన్న మాట!'
'భలే! అట్లయితే ఆ నోబెలు బిళ్లలన్నీ మనోళ్ల మెళ్లలోనే కదా  ఏళ్లాడెయ్యాలా!  వింతలూ విశేషాలూ కనిపెట్టుళ్లో మనోళ్లకి  మించిన మోపుగాళ్లు పెపంచికం మొత్తంలో ఎవురున్నార్లే.. ఏడేడ ఎతుక్కొచ్చుకున్నా!’
'ఆహాఁ! అంతగా మన బాబులంతా  కనిపెట్టేసిన   ఆ  వింతలూ విశేషాలూ ఏంటో?'
'అన్నీ తెల్సిన పెద్ద బుర్రకాయవి.. ఆ ఎద్దేవాలే ఒద్దన్నా! దేశభక్తి  దెబ్బతింటది. అర్దసున్నా అన్నా ఎవుళ్లకీ ఓ పట్టాన అర్థం కాని  మొరట్రోజుల్లో నిండు గుండు సున్నా కనిపెట్టిందెవళ్ళంట? కన్నాలేయుడు, సున్నం పెట్టుడంటే..  సన్నాసోళ్లు చేసే బేవార్సు పన్లంటవు.. తెల్సును.  కానీ కన్నమేయుడు కూడా ఓ  కళే కదన్నా!  అదేందో ‘మట్టి బండి’ నాటకంలో దొంగాడెవుడో మొట్టమొదటి సారి మహా సుందరంగా గోడక్కన్నం కొట్టి మరీ లోపలికి జొరబడ్డడంట గదా!  ఆడి మెడకేసెయ్యెచ్చు కదన్నా ఈ నోబెల్లు బిళ్లోటి తెచ్చి? సుదర్శన     చక్రం కనిపెట్టుడే కాదు.. దాన్నడ్డమేసుకొని ఎట్లాంటి కథలను ఎట్లా నడిపించినాడో మన  కన్నయ్య  మహాభారతంల!  దేవుడు కదా! మరా మహానుభావుడి మెళ్లో   ఆ నోబెల్లు బిళ్లేసినా.. పురుషార్థం ప్లస్ పున్నెం కూడా దక్కుదలవుతుంది కదా అన్నా!  రామాయణంల విమానాలు?  పిట్టలకే సరిగ్గా రెక్కలు  మొలవని  కాలంలో మన కాడ మంధర గిరి పర్వతాలు గాల్లో గిరగిరా గింగిరాలు  తిరిగాయంట కదా! ఎడతెరిపి లేకుండా రోజుల్తరబడి  ఎడాపెడా ఝడివానలు కుర్సి దడ పుట్టించినా  గోవిందుడు ఆ గోవర్ధనం కొండను   అమాంతం గోటి మీదెత్తుకొని గొడుగులా నిలబెట్టిండు కదా!  గొడుగంటే    ముసుగు  దెయ్యమని గడగడలాడి చచ్చినాడు సీమ తెల్లోడు! ఆడికి పడాలా.. మరి మనోడి మెడకి పడాలా  నోబిలు బిళ్ల? తెల్లోడికి అక్షరం ముక్కంటే ఏంటో తెలీని కాలంల   మన భాగోతం  రుక్మిణమ్మ కృష్ణ పర్మాత్ముడికి ప్రేమ లేఖ  పంపించింది.. పరమ డేరింగా రుక్మిణీ దేవిది! తాటాకు బద్దతో  నాలిగ్గీసుడు  కూడా తెల్లోడి పరమ నామర్దానా! అవాకులూ చవాకులంటూ ఎవరేం పేలితే నేమిటికిలే!  అసలు రాసే కళంటూ ఓటి  తాటాకుల మీద పుట్టించిందెవుళ్లు?మనమే కదన్నా!  చీకట్లో కళ్లు కానరాక ఆఫ్రికను బండోళ్లు  కొండ తొర్రల్లో వళ్ళు దాచుకొన్న వేళ   మనోళ్ళు అలికిణ్ని బట్టి మెకాల ఎంటబడి మరీ ములుకులేసారు ఎడారోళ్లు  బట్టలు కట్టుకోడం కూడా రాక మొరటుగా తిరుగే రోజుల్ల మన దేవుళ్లు పట్టు పీతాంబరాలు, బనారస్, బద్వాల్ చీరలు.. మేచింగు బ్లౌజుల్లో కళ్లు మిరిమిట్లు గొలిపేటట్లు ఊర్లూ వాడలూ  ఊరేగినారు. ఎన్ని వింతలూ.. విశేషాలూ! అన్నీమన  వేదాల్లోనే ఉన్నాయషంటే  మళ్లీ తొండంటన్నారు ఆ పడమటి వెధవాయిలు! వెదికే ఓపిక లేకో..  ఓర్చుకొనే  గుణం  లేకో   మనల్ని వెర్రి పప్పల కింద జమ కట్టేసి ఈ నోబెల్లులు గట్రాలన్నింటికీ  ఆమడ దూరంలో అట్టే పెట్టేసే కుట్రేదో గట్టిగా నడుస్తుండాదని నా డౌటన్నా!’
'ఊహపోహల్నన్నింటినీ  ఊరికే పోగేసి   'ఊహూఁ! మన కొక్కటైనా నోబెల్ గిట్టుబాటవడం లేదం’టూ రట్టు  చేస్తున్నావ్ తమ్మీ!  నీ కతలు నీకు ముద్దేమో కానీ ఆ తాతల్నాటి స్టోరీలేవీఁ  వాళ్లకొద్దు! నీకై నువ్వుగా సొంతంగా.. తాజాగా  కనిపెట్టిన నిజమైన  వింతో.. విశేషమో ఏవఁన్నా ఉంటే.. గింటే.. బైట పెట్టబ్బీ!  బట్టబుర్రకు   జుట్టు  మొలిచిందనే కట్టు కతలు కుదరవు! తర్కంతో రుజువు కావాల. మన  సి.వి. రామన్ సర్ కి గణితంలో నోబెల్ వచ్చింది చూడు అట్లాగా?’
'అరేఁ! భలే గుర్తు చేసినావన్నా! అదే అరవదేశంలో మరో రామరయ్యరు కూడా.. నా సామి రంగా..  ఆకు పసర్నుండి గేసునూనె పిండాడన్నా! దుబాయ్.. అరబ్బు దేశాల ఎదాన బోలెడంత డబ్బు పోసి కొంటున్నాం కదా గబ్బు సరుకు! ఆ దుబారా తగ్గించే కొత్త ఐడియా  చేసిండు కదా! మరందుకైనా  ‘చబాష’ ని భుజం తట్టి ఓ నోబెల్ బిళ్ళ ఆ అయ్యరాయన మెళ్లో వేసెయ్యచ్చు కదా?  అట్లాంటి గోసాయి చిట్కాలు మరన్ని పుట్టుడుకి ఆస్కారమొచ్చుండెడిది!   నిధుల కొరతో అంటా అల్లాడతా అట్టా దేశాలట్టుకు తెగ తిరుగుతన్నాం కదా మనం! ఆ గండం నుండి గట్టెక్కించుడికి ఓ సన్యాసి.. ఆ మధ్య..  పాపం కష్టపడి కల గన్నాడు. లంకెబిందెల  జాడ ఎక్కడుందో  బైటపెట్టిండు. అయినా  ఏం చేసినం? సర్కారు సొమ్ముతో గోతులు సగం తవ్వినాక.. అందరూ నవ్వుతున్నరని ఆనక మరి కాస్త సొమ్ముతో పూడ్చేసినాం!  పెపంచకం మొత్తం ముందు అల్లరి పాలయ్ పొయ్యినామా లేదా! ఆర్థిక తత్వవేత్త.. ఆ సారు ఎవరూ.. ఆట్టే నోరు తిరిగి చావదు నాకు..  ఈ పెద్ద పెద్దోళ్ల పేర్లు.. ‘   
‘డాక్టర్ అమర్త్య సేన్ ‘
‘ఆఁ.. ఆఁ.. ఆ మర్త్యంసారు కిచ్చిన నోబిళ్ల బిళ్లే మరి మన లంకెబిందెల సన్నాసి కీ ఇచ్చుండచ్చుగా?’
‘ఆపరా బాబూ నీ ఊక దంపుళ్లు! కొత్తగా కనిపెట్టుడంటే.. ఎప్పటెప్పటి సొల్లు కతలో వప్ప చెప్పుడు కాదు!  ఆడ బడితల మొండాలకి తుఛ్చులు అప్ప చెల్లెళ్ల తలలు మార్చుతున్నరు! ఆపరేషన్ మిషతో పరేషాన్ చేసి  పేషెంటు కిడ్నీలు  చాటుగా అమ్మేసుకొంటున్నరు. అట్లాంటి దిక్కుమాలిన పన్లక్కాదబ్బీ నోబెళ్లు  ఇచ్చుడు?  పేదోడికి చవగ్గా చక్కటి  చదువు చెప్పించు! మంచి మంచి కొలువులు సర్కార్లవి ఇప్పించు! ఎప్పుడో ఏకలవ్యుడు వేలు కోసిచ్చిన పాత కహానీ లిప్పుటి నోబెళ్లకు పనికి రావబ్బీ! న్యూసెన్సు  కతలు  కాదు.. న్యూ సైన్సు స్టోరీలేమైనా నీ కాడ ఉంటే    షార్ట్ లెన్తులో వినిపించు. మెరికలు అమెరికాలోనే కాదు. మన కాడా ఉన్నారని  నిరూపించు! నిధులు రాబట్టుకొనేటందుకు.. సేద్యం, వైద్యం, విద్యలాంటి ప్రధాన సామాజికి రంగాలు సజావుగా నడిచుకునేటందుకు.. మద్యం అమ్మకాల మీదే  నిండా ఆధారపడ్డంతో మనది వట్టి  గాన్ కేసని తెలిపోయిందబ్బీ  ప్రపంచ దేశాలల్ల? అయినా మన ప్రతిభ నొహళ్లు చూసి బెల్లు కొట్టేదేందిలే?  మెచ్చి బోబెల్ బిళ్లల్తెచ్చి మెళ్లో వేసేదేందిలే?’
'ఔనన్నా1  ఆ నోబెళ్ళూ బిళ్లలిచ్చే బాబులు ఎలుకల్ని పట్టి వాటి మీద ప్రయోగాలు చేసున్నరు. మనమో? ఆ ఎలుకల్నే మౌసుల కింద మార్చేసి ప్రపంచం మొత్తం నివ్వెర పడేట్లు సాఫ్టువేర్లు పుట్టిస్తున్నం. మన కాడ కాకులక్కూడా  లెక్కలు నేర్పించేయగల కాకల్తీరిన సర్కారు నౌఖర్లు మస్తుగున్నరు. బల్ల కిందుగా  పింకు  గాంధీ బొమ్మలో  కట్టగా కనిపించకుంటే..  ఎంత బుల్లెట్ రైలు దస్త్రాన్నైనా నత్తకన్నా కుంటిగా  నడిపించగల గడుసులున్నరు. ‘కనిపెట్టుడు’ ఏ బుర్ర తక్కువ ఎదవైనా చేసే కార్యమే!. 'కనికట్టు చేయడు’లోనే  అసలైన బుధ్ధి దాగుందన్నా! ఆ గుట్టుమట్లన్నీ మన దేశంల గుట్టకీ పుట్టక్కూడా తెల్సును! అది గుర్తించకుండా ఎన్ని నోబెల్లు బిళ్లలు ఎంతమంది  సైన్సోళ్లకి, సాహిత్యాలోళ్ళకి, సంగీతాలు వాయించుకొనేటోళ్లకి, శాంతి మార్గాల వెదికి పెట్టేటోళ్లకిచ్చినా ,, నో యూజ్! ఎవళ్లూ మన మెళ్లకి ఆ నోబెల్లు బిళ్లలెయ్యక పోతేనేంటంట? మన బిళ్లలు మనమే మన మెళ్లకు ఏసేసుకుంటే పోలా!  మన బెల్లులు మనమే ఘల్లు ఘల్లుమని  మోగించేసుకొంటే దూల తీరలా!’
‘అదీ దెబ్బరా అబ్బీ! సెల్ఫ్ డబ్బా కొట్టింగులో  ప్రపంచకం మొత్తంలో మనల్ని మించిన మోపుల్లేరు.. ఇహ ముందూ పుట్టబోరు. అలాగని  మన బెల్లు మనమే కొట్టుకుంటుంటే చాలబ్బీ.. అదే వెయ్యి నోబెళ్లు మెళ్లో వేళ్ళాడే పెట్టు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా.. కాలమ్-04-11-2017)

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...